English | Telugu
బన్నీ, చరణ్ మధ్య మరోసారి బయటపడ్డ దూరం.. ఇది దేనికి సంకేతం?
Updated : Oct 17, 2023
సినీ సెలబ్రిటీల గురించి తరచూ ఏవో ఒక వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. వాటిలో ప్రధానంగా కుటుంబ సభ్యులైన హీరోల మధ్య విభేదాలు తలెత్తాయని ఎక్కువగా వింటుంటాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య దూరం పెరిగింది అంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి వీరి మధ్య దూరం బయటపడిందనే చర్చ నడుస్తోంది.
అల్లు అర్జున్, రామ్ చరణ్ బావ బామ్మర్దులు అవుతారు. హీరోలు అవకముందు, అయిన తర్వాత కూడా వీరిద్దరూ ఒకరంటే ఒకరు ఎంతో ప్రేమగా ఉండేవారు. అయితే ఏమైందో ఏమో కానీ కొంతకాలంగా వీరిద్దరూ డిస్టాన్స్ మైంటైన్ చేస్తున్నారనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ముఖ్యంగా బన్నీ.. చరణ్ ని దూరం పెడుతున్నాడనే అభిప్రాయం బలంగా ఉంది.
'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాట ఆస్కార్ గెలిచినప్పుడు.. అందులో తన కుటుంబానికి చెందిన రామ్ చరణ్ కూడా ఉన్నప్పటికీ, తను బావ అని పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్ ని "తెలుగు ప్రైడ్" అంటూ అల్లు అర్జున్ ప్రత్యేకంగా సంబోధించాడు. ఆ సమయంలో చరణ్ అభిమానులు ఎంతో హర్ట్ అయ్యారు.
అలాగే పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలుచుకున్న సమయంలో.. "శుభాకాంక్షలు బావ" అంటూ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ట్వీట్ చేయగా.. "నీ జెన్యూన్ విషెస్ కి థాంక్యూ బావ" అంటూ బన్నీ రిప్లై ఇచ్చాడు. అయితే చరణ్ మాత్రం బన్నీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపకుండా, మిగతా విజేతలతో కలిపి విష్ చేస్తూ ట్వీట్ చేశాడు. బన్నీ కూడా అందుకు తగ్గట్టుగానే "థాంక్యూ" అంటూ ఏదో బయటవారికి రిప్లై ఇచ్చినట్లుగా ఇచ్చాడు. దాంతో బన్నీ, చరణ్ మధ్య దూరం పెరిగిందనే వార్తలకు బలం చేకూరింది. అయితే ఆ తర్వాత బన్నీకి విషెస్ తెలుపుతూ చరణ్ ప్రత్యేకంగా బొకే పంపించడంతో ఆ వార్తలకు చెక్ పడింది. కానీ ఇప్పుడు మరోసారి బన్నీ, చరణ్ మధ్య దూరం పెరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్ళి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. దీంతో వీరికి కుటుంబ సభ్యులు వరుసగా పార్టీలు ఇస్తున్నారు. అయితే ఈ ప్రీ వెడ్డింగ్ పార్టీలలో బన్నీ, చరణ్ మాత్రం ఒకరికొకరు ఎదురు పడటం లేదు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో పార్టీ ఇవ్వగా.. మెగా ఫ్యామిలీ అంతా హాజరయ్యారు కానీ బన్నీ మాత్రం స్కిప్ చేశాడు. ఇక తాజాగా అల్లు ఫ్యామిలీ పార్టీ ఇవ్వగా.. దానిని చరణ్ స్కిప్ చేశాడు. ఈ పార్టీకి అల్లు అర్జున్, శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ తో పాటు నితిన్ వంటి వారు కూడా హాజరయ్యారు కానీ చరణ్ మాత్రం హాజరవ్వలేదు. దీంతో బన్నీ, చరణ్ కావాలనే ఒకరికొకరు ఎదురు పడటం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే మెగా, అల్లు కుటుంబాల సన్నిహితులు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. అప్పుడు 'పుష్ప-2' షూటింగ్ కారణంగా మెగా ఫ్యామిలీ పార్టీకి బన్నీ హాజరు కాలేకపోయాడని, అలాగే ఇప్పుడు 'గేమ్ ఛేంజర్' షూటింగ్ కారణంగా అల్లు ఫ్యామిలీ పార్టీకి చరణ్ హాజరు కాలేకపోయాడని చెబుతున్నారు.