English | Telugu
వరల్డ్ కప్ దెబ్బకి వెనక్కి తగ్గిన మెగా హీరో!
Updated : Nov 1, 2023
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'ఆదికేశవ'. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవంబర్ 10న విడుదల కావాల్సిన ఈ మూవీ వరల్డ్ కప్ కారణంగా వాయిదా పడింది. తాజాగా చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన నిర్మాత నాగవంశీ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ వరల్డ్ కప్ లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. భారత్ విజేతగా నిలుస్తుందనే అంచనాలున్నాయి. ఈ వరల్డ్ కప్ ప్రభావం సినిమాలపై పడుతుంది. ముఖ్యంగా భారత్ మ్యాచ్ లు ఉన్న సమయంలో థియేటర్ల దగ్గర సందడి వాతావరణం కనిపించడంలేదు. అందుకే నవంబర్ 10వ తేదీన విడుదల కావాల్సిన 'ఆదికేశవ'ను నవంబర్ 24వ తేదీకి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు.
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, "ఈ వరల్డ్ కప్ ఫీవర్ చూస్తున్నారు కదా.. ఇండియా మ్యాచ్ ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో. ఇటీవల మేము 'మ్యాడ్', 'లియో' అనే రెండు సినిమాలు విడుదల చేశాం. ఇండియా మ్యాచ్ ఉన్నప్పుడు ఆ సినిమాల వసూళ్ళపై ప్రభావం పడటం మేం గమనించాం. పైగా ఇప్పుడు సెమీ ఫైనల్స్ వస్తున్నాయి. ఇండియా ఫైనల్ కి వెళ్ళి, వరల్డ్ కప్ గెలుస్తుందనే అంచనాలు అందరిలో ఉన్నాయి. అందుకే ఈ సమయంలో విడుదల చేయడం కరెక్ట్ కాదని చిత్ర బృందం, డిస్ట్రిబ్యూటర్స్ అందరితో చర్చించి నవంబర్ 24న విడుదల చేయాలని నిర్ణయించాం. సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాం. ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది" అన్నారు.
చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి కూడా ఈ చిత్రంపై ఎంతో నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ ప్రేక్షకులతో పాటు యూత్, మాస్ ఆడియన్స్ని కూడా ఈ సినిమా అలరిస్తుందని అన్నారు.