English | Telugu

సుప్రీం కోర్ట్‌‌లో ప్రభాస్ టీమ్‌కు ఉపశమనం!

ప్రభాస్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపురుష్’ ఈ ఏడాదిలోనే విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో వచ్చిన ఈ చిత్రం ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. రామాయ‌ణ ఇతిహాసం ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాలో కృతి స‌న‌న్ సీత‌గా న‌టించింది. అయితే ఈ సినిమా రిలీజ్ స‌మ‌యంలో ప‌లు వివాదాల‌కు కేంద్ర బిందువుగానూ మారింది. హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ తీసేలా ఆదిపురుష్ సినిమాను తెర‌కెక్కించార‌ని, పాత్ర‌ల‌ను వ‌క్రీక‌రించార‌ని ప‌లువురు ఈ చిత్రంపై కేసులు పెట్టారు. అయితే ఈ కేసుల‌న్నింటినీ సుప్రీం కోర్టు కొట్టివేసింది. సెన్సార్ బోర్డు సినిమాను చూసి స‌ర్టిఫికేట్ ఇచ్చిన త‌ర్వాత ఇక కేసులు అన‌వ‌స‌రం అని సుప్రీం కోర్టు తేల్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ఉన్న వివాదాల‌పై సుప్రీం కోర్టు జ‌స్టిస్ సంజ‌య్ కిష‌న్ కౌల్ స్పందిస్తూ అవ‌న్నీ ఇక అన‌వ‌స‌రం అని పేర్కొన్నారు.

బాలీవుడ్ దర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో టి సిరీస్ బ్యాన‌ర్‌పై భూష‌ణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో తెర‌కెక్కించారు. ఎప్పుడో విడుద‌ల కావాల్సిన ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ త‌ర్వాత కాంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్‌గా మారింది. దీంతో చిత్ర యూనిట్ రిలీజ్ డేట్‌ను వాయిదా వేసి గ్రాఫిక్స్ కోసం ఆరు నెల‌లు స‌మ‌యం తీసుకుని సినిమాపై మ‌ళ్లీ రీ వ‌ర్క్ చేశారు. అయితే సినిమా రిలీజ్ త‌ర్వాత కూడా రామాయ‌ణం ఆధారంగా సినిమా అన్నారు కానీ.. అస‌లు రామాయ‌ణ క‌థ‌కు, ఆదిపురుష్ సినిమాకు సంబంధ‌మే లేదు అంటూ విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి.

ఇక ప్ర‌భాస్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఈ ఏడాది డిసెంబ‌ర్ 22న ఈయ‌న హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన స‌లార్ రిలీజ్ అవుతుంది. ఈ పాన్ ఇండియా మూవీపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి.