English | Telugu

కోర్టులో గెలుపు.. ఇక మనల్ని ఎవడ్రా ఆపేది!

సెప్టెంబర్ 15న విడుదల కావాల్సిన 'స్కంద', 'చంద్రముఖి-2' సినిమాలు సెప్టెంబర్ 28 కి వాయిదా పడ్డాయి. దీంతో సెప్టెంబర్ 15న విడుదల కానున్న 'మార్క్ ఆంటోని' పైనే అందరి దృష్టి పడింది. కానీ కోర్టు కేసు కారణంగా ఈ సినిమా విడుదలపై కూడా అనుమానాలు వ్యక్తమవ్వడంతో.. ఇక ఈ వినాయక చవితికి చెప్పుకోదగ్గ సినిమాలు లేనట్టే అని భావించారంతా. అయితే ఎట్టకేలకు 'మార్క్ ఆంటోని'కి రూట్ క్లియర్ అయింది.

హీరో విశాల్‌ తమ దగ్గర తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదంటూ లైకా ప్రొడక్షన్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. మార్క్ ఆంటోని విడుదలపై మద్రాస్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విశాల్‌కు కోర్టు నుంచి ఉపశమనం లభించింది. మార్క్ ఆంటోని విడుదల చేసేందుకు కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా విడుదలకు మార్గం సుగమనం అయింది. ముందుగా ప్రకటించినట్టుగానే సెప్టెంబర్ 15న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

సెప్టెంబర్ 15న మార్క్ ఆంటోని చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది అంటూ విశాల్ ట్వీట్ వేశారు. దీంతో విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయని అందరికీ అర్థమైపోయింది.

అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మార్క్ ఆంటోని మూవీని ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో ఎస్ జే సూర్య ముఖ్య పాత్రలో నటించగా.. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. సునిల్, సెల్వ రాఘవన్, అభినయ, కింగ్ స్లే, వై జి మహేంద్రన్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు.