English | Telugu

ఎన్టీఆర్ పిటిష‌న్ పై హైకోర్టు కీలక ఆదేశాలు!

వివిధ మాధ్య‌మాల్లో తన పేరు, ఫోటోలు, గుర్తింపును అనుమతి లేకుండా వాణిజ్య పరమైన ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని పరిశీలించిన‌ ఢిల్లీ హైకోర్టు, ఆయన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పిస్తూ కీలక ఆదేశాల‌ను జారీ చేసింది.

ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, తారక్ లాంటి పేర్లు గానీ, యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ వంటి పేర్లు గానీ, అలాగే ఆయన ఫోటోలను అనుమతి లేకుండా వాణిజ్య ప‌రంగా వాడటం చ‌ట్ట విరుద్ద‌మ‌ని కోర్టు పేర్కొంది. ఎక్కడైనా ఇలా అనధికారంగా వాడినట్టు తెలిస్తే.. చట్టం ప్రకారం చర్యలు ఉంటాయనే ఆదేశాలను కోర్టు జారీ చేసింది.

ఎన్టీఆర్‌ ఇండియాలో పెద్ద సెలబ్రిటీ అని స్ప‌ష్టం చేసిన కోర్టు.. ఎన్నో ఏళ్ల కెరీర్‌తో ఆయన ఈ మంచి పేరు సంపాదించుకున్నారని, ప్రజలకు ఆయన పేరు, ఫోటో, రూపం అంటే వెంటనే ఎన్టీఆర్ గుర్తొస్తారని చెప్పింది. అందుకే ఆయన పేరు, ఇమేజ్ మీద హక్కులు ఆయనకే ఉంటాయని కోర్టు అభిప్రాయపడింది. AI లేదా ఏదైనా టెక్నాలజీ ద్వారా ఫోటోలు మార్ఫ్ చేయడం వంటివి చేయకూడదని ఆదేశించింది.

అదేవిధంగా ఫేస్‌బుక్, యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌ కి కూడా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను 2021 ఐటీ రూల్స్ కింద అధికారిక ఫిర్యాదుగా పరిగణించి, అభ్యంతరకర లింక్‌లను తీసేయాలని కోర్టు తెలియ‌జేసింది

మొత్తానికి ఎవరైనా ఎన్టీఆర్‌ పేరు లేదా ప్రతిష్ఠకు నష్టం క‌లిగించేలా ప్ర‌వ‌రిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని కోర్టు త‌న ఆదేశాల్లో స్ప‌ష్టంగా పేర్కొంది.

Also Read: అక్కినేని బ్రదర్స్ మల్టీస్టారర్.. మరో 'మనం' అవుతుందా?