English | Telugu
దాసరి అవార్డ్స్ అందుకున్న శ్రీకాంత్, బ్రహ్మానందం!
Updated : May 2, 2023
దివంగత దర్శకరత్నం డాక్టర్ దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో దాసరి ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ సభ పలువురు సినీ దిగ్గజాల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ, ముత్యాల సుబ్బయ్య, వి.వి.వినాయక్, సి.కల్యాణ్, అలీ, ధవళ సత్యం, రేలంగి నరసింహారావు తదితరులు ముఖ్య అతిధులుగా హాజరైన ఈ వేడుకలో.. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ, శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్, డాక్టర్ బ్రహ్మానందం, బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి, వంశీ రామరాజు, కళా జనార్దన్, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ గౌరీ శంకర్, దివాకర్, పబ్లిసిటీ డిజైనర్ రాంబాబు, వి.ఎఫ్.ఎక్స్ చందు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ ప్రభు, ధీరజ అప్పాజీ, కవిరత్న చింతల శ్రీనివాస్ తదితరులు దాసరి ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ వేడుకలో ఆంధ్ర, తెలంగాణలో పలు రంగాల్లో విశేష కృషి చేస్తున్న ప్రతిభావంతులకు కూడా ఈ పురస్కారాలు ప్రదానం చేశారు.
అలీ మాట్లాడుతూ "ఉత్తమ హీరోకి తన వంతుగా 50,000 పారితోషకం ఇస్తాను" అని అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ "దాసరి గారి పేరు మీద జరిగే ప్రతి కార్యక్రమంలో నేను ఉంటాను" అన్నారు. వి వి వినాయక్ మాట్లాడుతూ "రామ సత్యనారాయణ దాసరి గారి మీద ఉండే అభిమానంతో ప్రతి ఏటా ఇలా చేయటం అభినందనీయం" అన్నారు. సి కళ్యాణ్ మాట్లాడుతూ "మా తమ్ముడు రామ సత్యనారాయణ దాసరి గారిని గుర్తుంచుకుని ప్రతిభావంతులకి అవార్డ్స్ ఇవ్వటం చాలా ఆనందకరం" అన్నారు.