Read more!

English | Telugu

'బడ్డీ'.. సందీప్ కిషన్ కాదు, అల్లు శిరీష్!

గతేడాది 'ఊర్వశివో రాక్షసివో' చిత్రంతో ఆకట్టుకున్న అల్లు శిరీష్ ఈ ఏడాది 'బడ్డీ' అనే చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. స్టూడియో గ్రీన్ ఫిలిమ్స్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకుడు. నేడు(మే 30) శిరీష్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ ని విడుదల చేశారు.

నిజానికి 'బడ్డీ' చిత్రాన్ని గతంలో సందీప్ కిషన్ హీరోగా ప్రకటించి, ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి సందీప్ ప్లేస్ లోకి శిరీష్ ఎంట్రీ ఇచ్చాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న సినిమాలు చేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు శిరీష్. తాజాగా విడుదలైన 'బడ్డీ' ఫస్ట్ లుక్ కూడా మరో విభిన్న చిత్రమనే అభిప్రాయాన్ని కలిగించేలా ఉంది. ఇక ఈ మూవీ గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకుంటోంది. 'బడ్డీ'ని చంపడానికి ఒకతను కోట్ల రూపాయలు ఆఫర్ చేయడం, రౌడీ గ్యాంగ్ నుంచి దానిని రక్షించడానికి శిరీష్ రంగంలోకి దిగడం వంటి సన్నివేశాలతో.. శిరీష్, బడ్డీ పాత్రలను పరిచయం చేసిన తీరు మెప్పించింది. ఇక గ్లింప్స్ చివరిలో 'కేజీఎఫ్', 'విక్రమ్' సినిమాల రేంజ్ లో బడ్డీ మిషన్ గన్ తో షూట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కాగా, స్టూడియో గ్రీన్ బ్యానర్ తమిళ్ లో ఆర్య హీరోగా 'టెడ్డీ' అనే చిత్రాన్ని రూపొందించింది. 2021 లో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులోనూ ఈ చిత్రం అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు శిరీష్ నటిస్తున్న ఈ 'బడ్డీ' సినిమా, ఆ 'టెడ్డీ'కి సీక్వెల్ అని తెలుస్తోంది.