English | Telugu
పవర్ స్టార్ 'జల్సా'కి 15 ఏళ్ళు!
Updated : Apr 2, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా 'జల్సా'. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం 2008, ఏప్రిల్ 2న విడుదలైంది. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలోని సాంగ్స్, డైలాగ్స్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 'ఖుషి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుస పరాజయాలు ఎదుర్కొన్న పవన్.. 'జల్సా'తోనే మళ్ళీ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం విడుదలై నేటికి 15 ఏళ్ళు పూర్తయింది.
కథలో నక్సలిజం నేపథ్యం ఉన్నప్పటికీ దానిని ఇంత వినోదభరితంగా చెప్పడం త్రివిక్రమ్ కే సాధ్యమవుతుందేమో. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో ఎమోషనల్ సన్నివేశాలు కూడా అదే స్థాయిలో మెప్పించాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో "కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా" అంటూ పవన్ చెప్పే డైలాగ్ కట్టిపడేసింది. పవన్ నక్సలైట్ గా మారడానికి దారితీసిన పరిస్థితులు కంటతడి పెట్టించాయి. ఇక పవన్-ఇలియానా మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే పవన్-బ్రహ్మానందం, ఇలియానా-సునీల్ నడుమ కామెడీ సన్నివేశాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పటికీ ఆ సన్నివేశాలు అలరిస్తాయి. "యుద్ధంలో గెలవడమంటే శత్రువును చంపటం కాదు శత్రువును ఓడించటం" అంటూ మాటల తూటాలు పేల్చిన త్రివిక్రమ్ ఈ చిత్రంతో మరోసారి తన కలం బలం చూపించారు. ఇక ఈ సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
'జల్సా' విజయంలో దేవిశ్రీప్రసాద్ సంగీతం కీలక పాత్ర పోషించింది. 'జల్సా టైటిల్ సాంగ్', 'మై హార్ట్ ఈజ్ బీటింగ్', 'ఛలోరే ఛలోరే చల్', 'గాల్లో తేలినట్టుందే' ఇలా ఈ చిత్రంలోని పాటలన్నీ అప్పట్లో ఒక ఊపు ఊపాయి. ఈ చిత్రంలో కమలినీ ముఖర్జీ, పార్వతీ మెల్టన్, ముకేష్ రిషి, ప్రకాశ్ రాజ్, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, సునీల్, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, శివాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకి డీఓపీలుగా కే.వి. గుహన్, రసూల్ ఎల్లోర్, ఎడిటర్ గా ఎ.శ్రీకర్ ప్రసాద్ వ్యవహరించారు.