English | Telugu
రావణుడే రాముడైతే.. రణబీర్ కపూర్ కొత్త రూపం!
Updated : Dec 13, 2023
నటుడు అనేవాడు నవరసాల్ని పండిరచగలగాలి. అప్పుడే అతను పరిపూర్ణమైన నటుడు అనిపించుకుంటాడు. అలా అన్ని రసాలను తమ నటనతో చూపించగల నటులు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే కొందరు ఫెరోషియస్గా ఉండే క్యారెకర్లు తప్ప శాంత స్వభావం ఉన్న క్యారెక్టర్లు చెయ్యలేరు. ప్రేక్షకులు కూడా వారిని అలాంటి క్యారెక్టర్లో చూసి జీర్ణించుకోలేరు. కానీ, కొందరు అలా కాదు.. వారు ఏ క్యారెక్టర్ చేసినా అందులో ఇమిడిపోతారు. ఆ క్యారెక్టర్కి పూర్తి న్యాయం చేస్తారు.
విషయంలోకి వెళితే. ఈరోజు వరకు ‘యానిమల్’తో బీభత్సం సృష్టిస్తున్న రణబీర్ కపూర్ రేపు రామరాజ్యాన్ని నెలకొల్పే శ్రీరాముడిగా అవతరించబోతున్నాడు. ‘యానిమల్’ చిత్రంలో అతను చేసిన నరమేధం కళ్ళముందు కదలాడుతుండగానే మరో ఆధ్యాత్మిక పాత్రలోకి ప్రవేశించేందుకు రణబీర్ సిద్ధపడుతున్నాడన్న వార్తలు వస్తున్నాయి. ‘దంగల్’ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందబోయే భారీ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాబోతున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాను సెట్స్పైకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వార్తలు గతంలోనే వచ్చినప్పటికీ ఎవ్వరూ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు హీరో రణబీర్కపూర్ స్వయంగా తాను శ్రీరాముడిగా నితీష్ తివారి దర్శకత్వంలో నటించబోతున్నానని ప్రకటించాడు. ఈ సినిమా రెండు లేదా మూడు భాగాలుగా ఉంటుందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
రామాయణం చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ గత మూడేళ్ళుగా జరుగుతోంది. ప్రభాస్ ‘ఆదిపురుష్’ ఫలితం చూసిన తర్వాత ఆ సినిమాలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు తివారి. ఈ సినిమాలో సీతగా సాయిపల్లవి, రావణాసురుడిగా యశ్ నటిస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ క్యారెక్టర్లలో నటించే వారికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. నిన్నటి వరకు ‘యానిమల్’ చిత్రంలో ఓ రాక్షసుడిగా రణబీర్ కపూర్ను చూశారు. మరి రామాయణం చిత్రంలో రాముడిగా అతన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.