English | Telugu

2025 ఆస్కార్‌కు ‘లాపతా లేడీస్‌’.. డైరెక్టర్‌ చెప్పినట్టే జరిగింది!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమిర్‌ ఖాన్‌ మాజీ భార్య కిరణ్‌రావు దర్శకత్వంలో రూపొందిన ‘లాపతా లేడీస్‌’ చిత్రం ఆస్కార్‌కు అర్హత సాధించింది. గత ఏడాది టొరెంటో ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ బాలీవుడ్‌ మూవీ కమర్షియల్‌గా మంచి సక్సెస్‌ సాధించి రూ.20 కోట్లకుపైగా కలెక్ట్‌ చేసింది. ఈ చిత్రానికి కిరణ్‌రావు మాజీ భర్త ఆమిర్‌ కూడా ఒక నిర్మాత కావడం విశేషం. ఈ సినిమా ఖచ్చితంగా ఆస్కార్‌కు అర్హత సాధిస్తుందని డైరెక్టర్‌ కిరణ్‌రావు ఎంతో కాన్ఫిడెన్స్‌తో చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఇది జరిగిన రెండు రోజులకే ‘లాపతా లేడీస్‌’ చిత్రాన్ని ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో అర్హత సాధించింది. 2024-25 సంవత్సరానికిగాను ఈ చిత్రాన్ని ఆస్కార్‌కి నామినేట్‌ చేశారు. సోమవారం జరిగిన సమావేశంలో ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ విషయాన్ని ప్రకటించింది.

2001 నాటి కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. దీపక్‌ అనే రైతు తన నూతన వధువు ఫూల్‌తో గ్రామానికి బయల్దేరతాడు. వారు ఎక్కిన రైల్లో కొత్తగా పెళ్ళయిన మరికొన్ని జంటలు కూడా ఉంటాయి. ఆ వధువులంతా తమ సంప్రదాయాన్ని అనుసరించి ఒకే రంగు దుస్తులను ధరిస్తారు. వారి ముఖాలు మేలి ముసుగుతో ఉంటాయి. అందరూ నిద్రలోకి జారుకుంటారు. ఆ సమయంలో తన స్టేషన్‌ రావడంతో దీపక్‌ హడావిడిగా సామాన్లతో పూల్‌ని వెంట రమ్మని దిగిపోతాడు. పూల్‌ ధరించిన దుస్తుల వంటి దుస్తులే కలిగి ఉన్న జయ అతనితో వెళుతుంది. దీపక్‌ భార్య పూల్‌ ట్రైన్‌లోనే ఉండిపోతుంది. గ్రామానికి చేరిన తర్వాత తను వచ్చింది భర్తతో కాదని గ్రహిస్తుంది జయ. కానీ, ఈ విషయాన్ని బయట పెట్టదు. దీపక్‌ కుటుంబం ఈ విషయం గురించి తెలుసుకుంటారు. కానీ, వారికి తన గురించి తప్పుడు సమాచారం ఇస్తుంది.

ట్రైన్‌లో ఉన్న జయ భర్త మరో స్టేషన్‌లో దిగాల్సి ఉండగా, తన భార్య అనుకొని పూల్‌ని దిగమని చెబుతాడు. పరిస్థితి అర్థం చేసుకున్న పూల్‌ అతనితో వెళ్ళకుండా స్టేషన్‌లోనే దాక్కుంటుంది. తన భర్త దీపక్‌ ఏ గ్రామానికి చెందినవాడో పూల్‌కి తెలీదు. ఈ విషయంలో స్టేషన్‌ మాస్టర్‌ సహాయం తీసుకుంటుంది. భర్త వస్తే చూడొచ్చని స్టేషన్‌లోనే ఉంటుంది. అక్కడ టీ దుకాణం నడుపుతున్న మంజు ఆమెకు సహాయం చేస్తుంది. పూల్‌ కూడా ఆమెకు పనిలో సాయపడుతుంది. ఆమె క్రమంగా స్వతంత్రంగా ఉండడం నేర్చుకుంటుంది. స్వంతంగా గౌరవాన్ని, గుర్తింపుని పొందుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, తప్పిపోయిన ఈ ఇద్దరు యువతుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, చివరికి వారి గమ్యస్థానాలకు చేరుకున్నారా లేదా అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఆస్కార్‌కు అర్హత సాధించడం విశేషంగానే చెప్పొచ్చు.