English | Telugu
పెద్ద హీరోలంతా దాక్కున్నారు.. 'తలైవి'తో బాలీవుడ్ను రక్షించబోతున్నా!
Updated : Mar 31, 2021
ఇతర చిత్ర నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ డేట్లను వాయిదా వేయాలని ఆలోచిస్తుంటే, కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేసిన 'తలైవి' నిర్మాతలు మాత్రం ఏప్రిల్ 23 రిలీజ్ డేట్కే ఫిక్సయ్యారు. చాలామంది నిర్మాతలు ఈ ఏడాది మొదట్లో ధైర్యంగా తమ సినిమాల కొత్త రిలీజ్ డేట్లను ప్రకటించారు. కానీ దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ ఊపేస్తుండటంతో ఇప్పుడు మరోసారి వారు పునరాలోచనలో పడ్డారు.
అయితే 'తలైవి' మూవీ ప్రొడ్యూసర్లు మాత్రం తమ ఒరిజినల్ రిలీజ్ డేట్ నుంచి తప్పుకోలేదు. తన సినిమా ఆడియెన్స్ను ఎలా థియేటర్లకు మళ్లీ రప్పిస్తుందో తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా చెప్పుకొచ్చింది కంగనా రనౌత్. ఈ సందర్భంగా కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా లాంటి ఘనాపాఠీ నిర్మాతల పేర్లను బయటకు లాగిందామె.
"వాళ్లు నన్ను ఇండస్ట్రీ నుంచి తరిమెయ్యడానికి చెయ్యాల్సినవన్నీ చేశారు. ముఠా కట్టారు, వేధించారు. ఇవాళ బాలీవుడ్ ఠేకేదార్లు (కాంట్రాక్టర్లు) కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా దాక్కున్నారు. బిగ్ హీరోలందరూ దాక్కున్నారు. కానీ కంగనా రనౌత్, ఆమె టీమ్ రూ. 100 కోట్ల బడ్జెట్ ఫిల్మ్తో బాలీవుడ్ను కాపాడేందుకు వస్తోంది. బయటి సవతి బిడ్డ అయిన ఆ స్త్రీ వాళ్ల రక్షకురాలిగా నిర్ణయింపబడిందని చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. మనల్ని రంజింపజేయడానికి జీవితానికి అనేక మార్గాలున్నాయని మీకెప్పటికీ తెలీదు. ఇది జరిగినట్లయితే, బుల్లీవుడ్ చిల్లర్ పార్టీ ఎప్పటికీ మీ తల్లిపై ముఠాకట్టదని గుర్తుంచుకోండి. ఎందుకంటే తల్లితో మీరు తలపడలేరు." అని ఆమె రాసుకొచ్చింది.
ఏప్రిల్ 2న 'తలైవి'లోని ఫస్ట్ సాంగ్ విడుదలవుతోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్గా ఈ సినిమా రూపొందింది. ఎం.జి. రామచంద్రన్గా అరవింద్ స్వామి నటించిన ఈ మూవీకి ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహించాడు.