English | Telugu
కాన్స్ జ్యూరీలో ఏకైక ఇండియన్ యాక్టర్ దీపిక
Updated : Apr 27, 2022
2022 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోని కాంపిటిషన్ జ్యూరీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోనే భాగమవుతుందని నిర్వాహకులు తెలిపారు. మే 28న శనివారం జరిగే ముగింపు వేడుకల సందర్భంగా 21 సినిమాల పోటీలో గెలుపొందే సినిమాకు ఇచ్చే 'పామ్ డి ఓర్' అవార్డును అందించే ఎనిమిది సభ్యుల జ్యూరీలో దీపికకు స్థానం లభించింది. మే 17 నుంచి జరుగుతున్న 75వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కాంపిటిషన్ జ్యూరీకి ఫ్రెంచ్ యాక్టర్ విన్సెంట్ లిండన్ చైర్పర్సన్గా వ్యవహరించనున్నాడు.
ప్రెస్కు వెలువరించిన ఓ ప్రకటనలో దీపిక గురించి కాన్స్ నిర్వాహకులు, "భారతీయ నటి, నిర్మాత, ఫిలాంత్రోపిస్ట్, ఎంత్రపెన్యూర్, ఆ దేశంలో అతిపెద్ద స్టార్ దీపిక పడుకోనే. 30కి పైగా సినిమాల్లో నటించిన ఆమె, విన్ డీజెల్ మెయిన్ లీడ్గా నటించిన హాలీవుడ్ ఫిల్మ్ 'ట్రిపుల్ ఎక్స్: ద రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్'లో హీరోయిన్ రోల్ చేశారు. ఆమె నటించిన సినిమాల్లో 'గెహరాయియా', 'పద్మావత్'తో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ 'పికు' కూడా ఉంది. ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతులైన వ్యక్తుల్లో ఒకరిగా ఆమెను టైమ్ మేగజైన్ ఎంపిక చేసింది" అని తెలిపారు.
జ్యూరీలో దీపికతో పాటు ఇరానీ డైరెక్టర్ అస్ఘర్ ఫరాదీ, స్వీడిష్ నటి నూమి రాపేస్, నటి రెబెక్కా హాల్, ఇటాలియన్ నటి జాస్మిన్ ట్రింకా, ఫ్రెంచ్ డైరెక్టర్ లాడ్జ్ లీ, అమెరికన్ డైరెక్టర్ జెఫ్ నికోల్స్, నార్వే డైరెక్టర్ జావోచిమ్ ట్రయర్ ఉన్నారు.
36 సంవత్సరాల దీపిక ఇదివరకు జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్కు రెండేళ్ల పాటు చైర్పర్సన్గా వ్యవహరించింది. ప్రస్తుతం ఆమె షారుఖ్ ఖాన్తో 'పఠాన్', హృతిక్ రోషన్తో 'ఫైటర్', ప్రభాస్తో 'ప్రాజెక్ట్ కె', హాలీవుడ్ ఫిల్మ్ 'ది ఇన్టర్న్' హిందీ రీమేక్లో నటిస్తోంది.