ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సరే.. తెలంగాణ మాటేమిటి?

రాష్ట్ర విభజన తరువాత నుంచీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి?  అన్న ప్రశ్న ఉత్పన్నమౌతూనే వస్తోంది. రాష్ట్ర విభజన కు ముందు ఒకసారి బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్)తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగింది. ఆ తరువాత అంటే రాష్ట్ర విభజన తరువాత 2018 అసెంబ్లీ ఎన్నికలలో  కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకుని పోటీలో నిలిచింది. రెండు సార్లూ నిరాశాజనకమైన ఫలితాలే వచ్చాయి. అంత మాత్రాన తెలంగాణలో తెలుగుదేశం కనుమరుగైపోయిందని భావించొచ్చా అంటే.. ఆ రాష్ట్రంలో క్యాడర్ మాత్రం లేదు గాక లేదని ముక్తకంఠంతో చెబుతోంది. మరి లోపం ఏమిటి? ఎక్కడ ఉంది?  అన్న ప్రశ్నకు మళ్లీ తెలుగుదేశం క్యాడరే.. రాష్ట్రంలో పార్టీ క్యాడర్ చెక్కుచెదరకుండా అలా ఉండటమే కాదు, మరింత బలపడింది కూడా అని చెబుతోంది. అయితే రాష్ట్రంలో పార్టీని ముందుండి నడిపించి, క్యాడర్ లో సమరోత్సాహాన్ని రగిల్చి ఎన్నికల కదనరంగంలోకి దూకేలా చేయడంలో మాత్రం పార్టీ అగ్రనాయకత్వం విఫలమైందంటోంది. తెలంగాణలో  తెలుగుదేశం పార్టీకి ప్రాణం పెట్టి బతికించుకునే కార్యకర్తలు ఉన్నారు కానీ నాయకులు లేరన్నది నిష్ఠుర సత్యం.  ఆ విషయం ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సందేహాలకు అతీతంగా రుజువైంది.  తెలంగాణ ఎన్నికల బరిలో తెలుగుదేశం నిలవకపోయినా, అన్ని పార్టీలూ తెలంగాణ జెండాను మోయడానికి తహతహలాడాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తెలుగుదేశం క్యాడర్ చాలా వరకూ గత ఎన్నికలలో కాంగ్రెస్ జెండా మోసి ఆ పార్టీ విజయంలో అత్యంత కీలక భూమిక పోషించింది. ఈ విషయాన్ని అందరూ అంగీకరించి తీరాల్సిందే. సరే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఏమిటి? ఇక్కడి క్యాడర్ కు పార్టీ నాయకత్వం చేసే దిశా నిర్దేశం ఏమిటి? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొకరడం లేదు. అయితే తెలంగాణలోని తెలుగుదేశం క్యాడర్ మాత్రం.. ఏపీలో బీజేపీతో కలిసి నడుస్తున్న తెలుగుదేశం ఇక్కడ మాత్రం ఎందుకు దూరంగా ఉండాలని ప్రశ్నిస్తున్నారు. ఆ పొత్తు పొడుపును తెలంగాణలో కూడా కొనసాగించి, ఇక్కడా తెలుగుదేశం ఒకటి రెండు స్థానాల్లో పోటీకి నిలబడాలని డిమాండ్ చేస్తున్నారు. అలా పార్టీ నిలబెట్టే అభ్యర్థులను గెలిపించుకుంటామని ప్రతిజ్ణ చేస్తున్నారు.    

దానం నాగేందర్ చూపు కాంగ్రెస్ వైపు 

గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో  హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ కంటే బిఆర్ఎస్ ఎక్కువస్థానాల్లో గెలుపొందింది. మూడునెలలు పూర్తికాకమునుపు ఈ నగరం నుంచి బిఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరూ కాంగ్రెస్ బాట  పడుతున్నారు. కెటీఆర్ ప్రధాన అనుచరుడైన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లో పార్టీలో చేరి సంచలనం సృష్టించారు. హైదరాబాద్ మేయర్ గా బొంతు రామ్మోహన్ చక్రం తిప్పారు. అధికారం మారడంతో ఆయన కూడా మారిపోయారు.రామ్మోహన్ మేయర్ గా ఉన్నప్పుడు రాజధానిలో విలువైన భూములు కబ్జా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కబ్జాల భాగోతం బయటపడకుండా కాంగ్రెస్ లో గప్ చుప్ గా చేరిపోయినట్లు తెలుస్తోంది.  తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శుక్రవారం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. అధికారికంగా శనివారం చేరవచ్చని సమాచారం. నాగేందర్ పై కూడా కబ్జా ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ హాయంలో మంత్రిగా పని చేసిన దానం నాగేందర్ బిఆర్ఎస్ అధికారంలో రాగానే కాంగ్రెస్ కు రాజీనామా చేసి కారు పార్టీలో చేరారు. ఇప్పుడు కారుపార్టీకి రాజీనామా చేసి మళ్లీ హస్తం పార్టీలో చేరే అవకాశం ఉంది. తన నియోజకవర్గంలో ఇస్కాన్ టెంపుల్ ను నాగేందర్ కబ్జా చేసినట్లు కెసీఆర్ ప్రభుత్వానికి ఆధారాలు లభించడంతో అప్పట్లో నాగేందర్ బిఆర్ఎస్ లో చేరారు. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత మూట గట్టుకుంది. దీంతో ఆ పార్టీ ఓటమి చవి చూసింది. గత ఎన్నికలలో తన రాజకీయ గురువైన పిజెఆర్ తనయ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ  పోటీ చేసినప్పటికీ బిఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అయినప్పటికీ దానం మనసు కాంగ్రెస్ వైపే ఉంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలని అనుకున్నారేమో తిరిగి  ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. నాగేందర్ పై కూడా భూ కబ్జా ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి బిఆర్ ఎస్ నేతలు, అధికారులపై సీరియస్ గానే ఉన్నారు . కాబట్టి దానం అడుగులు కాంగ్రెస్ వైపే పడుతున్నాయి. మరో బిఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి ఏకంగా రేవంత్ రెడ్డికి తొడగట్టి సవాల్ చేశారు.  అరేయ్ రేవంత్ దమ్మనదారా అంటూ సవాల్ చేశాడు . నిన్న కర్ణాటక డిప్యూటి సీఎం డి. శివకుమార్ ను కలిసారు.ఒకటి రెండు రోజుల్లో అతను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లారెడ్డిని రానీయకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటికే మల్లారెడ్డి అల్లుడు, మల్లారెడ్డి విద్యాసంస్థలు ఆక్రమంగా భూ కబ్జాలు చేసి చర్యలకు రేవంత్ సర్కారు ఉపక్రమించింది

కవిత నివాసంలో ఈడీ సోదాలు.. ఏం జరుగుతోంది?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిక్కులు మరింత చిక్కబడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆమె నివాసంలో సోదాలు నిర్వహించింది. నందినగర్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు శుక్రవారం (మార్చి 15)న సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. తొలుత కవిత నివాసంపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు అంతా భావించారు. అయితే ఆ తరువాత ఐటీ, ఈడీ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్నట్లు క్లారిటీ వచ్చింది. అలాగే కేవలం మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మాత్రమే కాకుండా కవిత భర్త వ్యాపార లావీదావీలపై కూడా కూపీ లాగుతున్నట్లు చెబుతున్నారు. మొత్తం నాలుగు బృందాలు ఈ సోదాలలో పాల్గొన్నాయని చెబుతున్నారు.  ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయమేమిటంటే.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీం కోర్టు ముందకు విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ విచారణ ఇలా వాయిదా పడిందో లేదా అలా కవిత నివాసంపై ఈడీ సోదాలు మొదలవ్వడంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది.  కవిత పిటిషన్ పై సుప్రీం కోర్టులో     జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు శుక్రవారం (మార్చి 15)న విచారణకు వచ్చింది.  వాదనల అనంతరం ఈ నెల 19కు వాయిదా పడింది. ఇటువంటి తరుణంలో  ఈడీ   ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చి కవిత నివాసంలో తనిఖీలు చేపట్టడం, అదీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒక రోజు ముందు ఈ సోదాలు జరగడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  

ప్రణీత్ కుమార్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు

మాజీ డిఎస్పీ ప్రణీత్ కుమార్ రిమాండ్ రిపోర్ట్ సంచలన విషయాలు వెల్లడి చేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలముందు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందన్న సమాచారంతో ప్రణీత్ కుమార్ సడెన్ గా తన డిసీషన్ మార్చుకున్నాడు. తను ఉప యోగించిన హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేసే పనిలో పడ్డాడని తెలంగాణ ప్రభుత్వం     గుర్తించింది. మొత్తం మూడు రకాల నేరాలకు  ప్రణీత్ కుమార్ పాల్నడినట్లు   తెలుస్తోంది. ఒకటి ఫోన్ ట్యాపింగ్ రెండు సాక్ష్యాలను చెరిపి వేయడం, మూడు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం వంటి నేరాలకు ప్రణీత్ కుమార్ పాల్పడినట్లు ఆధారాలు లభించాయి. 17 సిస్టమ్ ల ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నేరాలకు పాల్పడ్డాడు.  ఈ కేసును    జూబ్లిహిల్స్ ఎసిపి వెంకటగిరి దర్యాప్తు అధికారిగా ప్రభుత్వం నియమించింది.                         ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతి రోజున అంటే డిసెంబర్ 4న రాత్రి కట్టర్లు ఉపయోగించి పాత హార్డ్‌డిస్క్‌లో ఉన్న డేటా మొత్తాన్ని చెరిపేసి వాటిని ధ్వంసం చేశాడు. ఏళ్ల తరబడి రహస్యంగా సేకరించిన డేటాను ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా రాగానే చెరిపేశాడు. ధ్వంసం చేసిన పాత హార్డ్‌డిస్క్‌ల స్థానంలో కొత్త వాటిని అమర్చినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అరెస్ట్ సందర్భంగా ప్రణీత్‌రావు నుంచి మూడు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సాక్ష్యాల చెరిపివేత, ప్రభుత్వ ఆస్తి ధ్వంసం, ఎలక్ట్రానిక్ సాక్ష్యాల ట్యాంపరింగ్ వంటి నేరాలకు పాల్పడినట్టు తేలింది. 17 కంప్యూటర్ల ద్వారా ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ చేశాడని, అందుకోసం ప్రత్యేకంగా ఇంటర్నెట్ కనెక్షన్‌ కూడా ప్రణీత్‌కు కేటాయించారని తెలిసింది. ప్రముఖ కాల్స్‌ను రహస్యంగా రికార్డు చేసి దానిని తన పర్సనల్ పెన్ డ్రైవ్‌లోకి కాపీచేసుకునే వాడని తేలింది. ఆయనతోపాటు మరికొందరు కూడా ఈ అక్రమాల్లో పాలుపంచుకున్నట్టు తేలింది. ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ వివరాలు తమకు చిక్కినట్టు పేర్కొన్న ఒక టీవీ చానెల్  మరెన్నో సంచలన విషయాలను బయటపెట్టింది. బీఆర్ఎస్ ముఖ్యనేత ఇచ్చిన ఆదేశాలతోనే ప్రణీత్‌ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని, ఆయన ఇచ్చిన వంద నంబర్లపై ప్రణీత్ కన్నేశారని పేర్కొంది. రేవంత్‌రెడ్డి ఎవరెవరిని కలుస్తున్నారు? అన్నదానిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపింది. రేవంత్‌రెడ్డిని ఎవరు? ఎక్కడ కలుస్తున్నారు? అన్న సమాచారాన్ని ప్రణీత్‌రావు బీఆర్ఎస్ పెద్దలకు అందించారని, డబ్బులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయన చేరవేశారన్న విషయాలు వెలుగులోకి వచ్చాయని వివరించింది. రేవంత్‌రెడ్డి అనుచరులతోపాటు చుట్టుపక్కల ఉన్న వారి ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. రేవంత్‌రెడ్డి సోదరుల ఫోన్ నంబర్లను కూడా ప్రణీత్ ట్యాప్ చేశారు. అక్కడితో ఆగకుండా కొందరు మీడియా పెద్దల ఫోన్లను సైతం ఆయన ట్యాప్ చేసిన విషయం చాటింగ్ ద్వారా బయటపడిందని, దీని ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారని ఒ  కథనంలో పేర్కొంది.

మార్చి 16 నుంచి అమలులోకి ఎన్నికల కోడ్.. షెడ్యూల్ ప్రకటించనున్నఈసీ

2024  సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ శనివారం (మార్చి 16) విడుదల కానున్నది. కేంద్ర ఎన్నికల కమిషన్ లో ఖాళీగా ఉన్న ఇద్దరు కమిషనర్ల భర్తీ పూర్తి కావడంతో ఇక ఎన్నికల నిర్వహణపై సీఈసీ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం 3 గంటలకు మీడియా సమావేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలిసింది. కాగా విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిథి ఎక్స్ వేదికగా తెలిపారు. శనివరాం (మార్చి 15) సాయంత్రం 3 గంటలకు హస్తినలోని జ్ణాన్ భవన్ లో   మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నిల ప్రకటనతోనే  ఎన్నికల నియమావళి అమలులోనికి వస్తుందని వివరించారు. కోడ్ అమలులోకి రావడం అంటే కేంద్రంలో , రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎటువటి విధానపరమైన నిర్ణయాలూ తీసుకునే అవకాశం ఉండదు.  ఇక విషయానికి వస్తే ప్రస్తుత లోక్ సభ పదవీ కాలం జూన్ 16తో ముగుస్తుంది.ఆ గడువుకు ముందే కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఎన్నికల షెడ్యూల్ విషయానికి వస్తు 2019 ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 10న నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ సారి ఆరు రోజుల ఆలస్యంగా ప్రకటించనుంది.  

రేవంత్ రెడ్డిపై మండలి చైర్మన్ ప్రశంసల వర్షం

బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగం భోట్లు అన్నట్లుగా తయారౌతోంది. తాజాగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి పాలన భేషుగ్గా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. శుక్రవారం (మార్చి 15) మీడియాతో మాట్లాడిన గుత్తా సుఖేందర్ రెడ్డి, తన కుమారుడు అమిత్ కు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా ఆ పార్టీ నేతల నుంచి ఆహ్వానం వచ్చిందని చెప్పారు. అంత వరకూ వాస్తవమే కానీ.. ఆ దిశగా ఎటువంటి చర్చలూ జరగలేదని ముక్తాయించారు. అయితే బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి అమిత్ సుముఖంగా లేరని గుత్తా చెప్పారు. ఇప్పుడు కాదు రెండు నెలల ముందు అమిత్ ను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇక తాను పార్టీ మారనున్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని చెప్పిన ఆయన రాజకీయ పార్టీలకు సంబంధం లేని రాజ్యాంగ పదవిలో ఉన్న తనకు ఏ పార్టీ కండువా కప్పుకోవలసిన అవసరం లేదని చెప్పారు.  తెలంగాణ ప్రజలు రేవంత్ ప్రభుత్వ పని తీరును మెచ్చుకుంటున్నారనీ, ఆయన పాలన బేషుగ్గా ఉందనీ కితాబిచ్చారు. రేవంత్ తనకు బంధువని చెప్పుకున్నారు. అయినా అసెంబ్లీ సమావేశాల్లో తప్ప మరెక్కడా, ఎన్నడూ రేవంత్ తో భేటీ అయిన సందర్భం లేదని స్పష్టం చేశారు.  మొత్తం మీద సుఖేందర్ రెడ్డి మాటలను బట్టి చూస్తే ఆయన బీఆర్ఎస్ కు దూరం జరగాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ కు ఇంత కాలం కీలకంగా ఉన్న నేతలు ఒక్కరొక్కరుగా ఆ పార్టీకి దూరం అవుతున్నారు. స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ బుజ్జగించినా ఎవరూ ఆగడం లేదన్నట్లుగా పరిస్థితి ఉంది. తాజాగా దానం నాగేందర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ తో భేటీ అయ్యారు. ఆయన కూడా నేడో రేపో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.  ఒకప్పుడు మాటే శాసనంగా, కనుసైగతో పార్టీని నియంత్రించిన కేసీఆర్ ఇప్పుడు కాళ్లా వేళ్లాపడి బతిమలాడుతున్నా బీఆర్ఎస్ లో కొనసాగేందుకు ఇష్టపడటం లేదని పరిశీలకులు అంటున్నారు. ఆరూరి ఉదంతాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. 

జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న ముద్రగడ పద్మనాభం

కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం అనే లాంఛనం పూర్తి చేశారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.   వైసీపీ అధినేత జగన్ పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. అయితే భారీ ర్యాలీతో తాడేపల్లి చేరుకుని అట్టహాసంగా వైసీపీలో చేరిక కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆశించిన ముద్రగడ తరువాత ఏవో కుంటి సాకులు చెబుతూ, సీఎం భద్రత అంటూ అతి నిరాడంబరంగా పార్టీ చేరిక లాంఛనాన్ని మమ అనిపించేశారు. కాగా ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా ఈ సందర్భంగా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వైసీపీ  రీజనల్‌ కోఆర్డినేటర్‌   మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు. ముద్రగడ పద్మనాభం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన కాంగ్రెస్, తెలుగుదేశం హయాంలలో మంత్రిగా కూడా పని చేశారు.  

తెలుగుదేశం కూటమి అఖండ విజయం ఖాయం.. తేల్చేసిన ఏబీపీ సర్వే

ఏపీలో తెలుగుదేశం కూటమి అఖండ విజయం ఖాయమని మరో సర్వే తేల్చేసింది. ఈ సారి ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కోబోతోందని ఆ సర్వే పేర్కొంది.  తెలుగుదేశం, జనసేన కలవకుండా జగన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. సరే ఆ రెండు పార్టీల కూటమితో బీజేపీ కలవకుండా ఉండాలనీ, అదే జరిగితే తన పరాజయం ఖాయమని భావించిన జగన్  తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ పొత్తు పెట్టుకోకుండా ఉండేందుకు తన శక్తికి మించి ప్రయత్నించారు. ఏపీ బీజేపీలోని తన అనుకూలురతో లాబీయించ్ చేయించారు. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో తాను స్వయంగా రంగంలోకి దిగి నేరుగా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. అయినా బీజేపీ తెలుగుదేశం, జనసేన కూటమితో కలవడం ఖాయమని తేలిపోవడంతో మరోసారి మోడీతో భేటీ కోసం అప్పాయింట్ మెంట్ కోరి రోజుల తరబడి వేచి చూసినా ఫలితం లేకపోయింది.  ఇప్పుడు ఏపీబీ- సీవోట్ తాజా సర్వేలో ఆ మూడు పార్టీలూ కలిస్తే వైసీపీ కథ కంచికి చేరినట్లేనన్న జగన్ రెడ్డి భయాలు నిజమేనని తెలింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలలో 20 స్థానాలలో విజయ దుందుభి మోగించనుందనీ, వైసీపీ మాత్రం ఐదు స్థానాలకే పరిమితం కానుందని ఏపీబీ- సీ ఓటర్ సర్వే పేర్కొంది.  ఏపీలో 20 లోక్ సభ స్థానాలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుచుకోవడమంటే.. 2014 ఎన్నికలలో  తెలుగుదేశం కూటమి సాధించిన స్థానాల కంటే అధికం.ఏబీపీ- సీ ఓటర్ సర్వే ప్రకారం తెలుగుదేశం కూటమి 20 స్థానాలలో విజయం సాధిస్తుంది. ఆ సర్వే ఆధారంగా ఈ కూటమి అసెంబ్లీ  స్థానాలలో ఎన్ని స్థానాలలో విజయం సాధిస్తుందన్నది లెక్కిస్తే తెలుగుదేశం కూటమి సంచలన విజయాన్ని నమోదు చేయడం ఖాయమని తేలుతుంది.  ఇదే ఏబీపీ-  సీ ఓటర్ సర్వే గత నెలలో అంటే ఫిబ్రవరి నెలలో వెలువరించిన సర్వే ఫలితాలలో వైసీపీ రాష్ట్రంలో ఎనిమిది లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తుందని పేర్కొంది. అంతే  కేవలం ఒక్క నెల వ్యవధిలో వైసీపీ మూడు పార్లమెంటు స్థానాలను కోల్పోయిందని చెప్పవచ్చు.  అయితే ఒక సారి నోటిఫికేషన్ వెలువడిన తరువాత వైసీపీ డౌన్ ఫాల్ ఇంకా దారుణంగా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ పరాజయం పాలు అయ్యే పరిస్థితులు ఉంటే, ఓటర్లు నోటిఫికేషన్ వెలువడిన తరువాత మరింత పెద్ద సంఖ్యలో అధకార పార్టీకి వ్యతిరేకంగా ఓటింగ్ లో పాల్గొంటారని అంటున్నారు. అందునా కక్ష పూరిత రాజకీయాలకు పెట్టింది పేరైనా వైసీపీ విషయంలో ప్రజలు మరింత స్పష్టంగా తమ తీర్పు వెలువరించేందుకు ముందుకు వస్తారని అంటున్నారు.  ఇక మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్ కాంగ్రెస్ అత్యధిక లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తుందని ఏబీపీ- సీఓటర్ సర్వే పేర్కొంది. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలకు గాను కాంగ్రెస్ పది స్థానాలలో విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. ఇక బీజేపీ, బీఆర్ఎస్ లు రెండేసి స్థానాలతో సరిపెట్టుకోవలసి ఉంటుందని పేర్కొంది. ఎంఐఎం ఒక స్థానంలోనూ, ఇతరులు రెండు స్థానాలలోనూ గెలిచే అవకాశాలున్నాయని ఏబీపీ- సీఓటర్ సర్వే పేర్కొంది.  

ఏపీ ఎన్నికల్లో ఈ నాలుగు వర్గాల ఓట్లే కీలకం అంటున్న ఓవైసీ

ఏపీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా తెలుగుదేశం- జనసేన- బీజేపీ మహా కూటమి కట్ట‌డాన్ని ఓవైసీ తప్పు పట్టారు.  ఏపీలో ఉన్న మైనారిటీలు,  ఆదివాసీలు,  దళితులు,  క్రిస్టియన్లు..  టీడీపీ- జనసేన- బీజేపీ కూటమికి ఓటు వేయరని ఒవైసీ చెబుతున్నారు. అయితే ఓవైసీ చెబుతున్న‌ట్లు ముస్లిం ఓటు బ్యాంక్ వైసీపీ వైపే వుందా? లేక టీడీపీ కూట‌మికి ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుందా? ఏపీ ముస్లింలు ఏమ‌నుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు ఘనంగా ఉన్న నియోజకవర్గాలు. 63 నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు ఓట‌మిని ప్ర‌భావితం చేసేలా ముస్లిం ఓట్లు ఉన్నాయి. ముస్లిం ఓటు రేపు జ‌రుగ‌బోయే ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి ప‌డుతోంది.  గ‌త ఎన్నిక‌ల్లో ముస్లింలు టోట‌ల్‌గా వైసీపీకే వేశారు. అయితే ఈ సారి ముస్లిం ఓటు బ్యాక్ వైసీపీకి మ‌ళ్ళుతుందా? లేదా?  ముస్లింలు వైసీపీ ప‌ట్ల ఎలాంటి ఆలోచ‌న ధోర‌ణితో ఉన్నారు? ఓ సారి చూద్దాం. 1 విజయవాడ వెస్ట్ - 60000  2 గుంటూరు ఈస్ట్ - 70000 3 నెల్లూరు సిటీ - 60000 4 కర్నూలు - 90000 5 కడప - 80000 6 అనంతపురం అర్బన్ - 55000 7 నంద్యాల - 60000 8 ఆదోని - 70000 9 మదనపల్లి - 50000 10 ప్రొద్దుటూరు - 50000 11 చిత్తూరు - 25000 12 తెనాలి - 25000 13 మచిలీపట్నం - 20000 14 ఒంగోలు - 30000 15 హిందూపురం - 50000 16 గుంతకల్లు - 40000 17 కదిరి - 40000 18 రాయచోటి - 65000 19 తాడిపత్రి - 30000 20 చిలకలూరిపేట - 35000 21 నరసరావుపేట - 30000 22 నెల్లూరు రూరల్ - 30000 23 కావలి - 20000 24 ఉదయగిరి - 32000 25 ఆత్మకూరు - 31000 26 కోవూరు - 22000 27 బద్వేలు - 24000 28 పులివెందుల - 31000 29 కమలాపురం - 30000 30 జమ్మలమడుగు - 25000  31 మైదుకూరు - 27000 32 నందిగామ - 22000 33 జగ్గయ్యపేట - 21000 34 తాడికొండ - 23000 35 మంగళగిరి - 25000 36 పొన్నూరు - 26000 37 ప్రత్తిపాడు - 21000 38 గుంటూరు వెస్ట్ - 30000 39 పెనమలూరు - 25000 40 పెదకూరపాడు - 22000 41 సత్తెనపల్లి - 31000 42 వినుకొండ - 20000 43 గురజాల - 37000 44 మాచర్ల - 20000 45 బాపట్ల -20000 46 పర్చూరు -20000 47 మార్కాపురం - 20000 48 గిద్దలూరు - 27000 49 ఆళ్లగడ్డ - 40000 50 శ్రీశైలం - 42000 51 నందికొట్కూరు - 38000 52 పాణ్యం - 35000 53 బనగానపల్లె - 30000 54 డోన్ - 20000 55 ఎమ్మిగనూరు -27000 56 ధర్మవరం - 20000 57 రాజంపేట - 25000 58 తంబళ్లపల్లె - 25000 59 పీలేరు - 45000 60 మదనపల్లి - 45000 61 పుంగనూరు - 35000 62 చిత్తూరు - 22000 63 పలమనేరు - 38000 1. జగన్ పాలనలో “ ఉర్దూ ” భాషా కు అధోగతి ప‌ట్టింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యం అవుతుంద‌ని న‌మ్మిన చంద్ర‌బాబు  రాష్ట్ర విభజన అనంతరం రాయలసీమలో  ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతం కర్నూలు కేంద్రంగా  2015 లో 145 ఎకరాల విస్తీర్ణంలో అబ్దుల్ హాఖ్ విశ్వవిద్యాలయ నిర్మాణాన్ని చేపట్టారు.  2019 తరువాత అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయ నిర్మాణ విషయంపై,  నిధుల కేటాయింపుపై నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింది. అస‌లు ప‌ట్టించుకోలేదు. పైగా అబ్దుల్ హఖ్ ఉర్దూ విశ్వవిద్యాలయ  భూములపై నేత‌ల‌ కన్ను ప‌డింది. 2. 22 వేల కోట్లు మైనార్టీల కోసం ఖ‌ర్చు పెట్టామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.  కానీ బ‌డ్జెట్ లెక్క‌లు చూస్తే 2019 నుంచి ఇప్ప‌ట్టి వ‌ర‌కు కేవ‌లం 4 వేల 542. 49 కోట్లు  3. దుల్హ‌న్ ప‌థ‌కం ద్వారా టీడీపీ హ‌యాంలో 48 వేల 693 మంది లాభ‌ప‌డ్డారు. కానీ ఈ ఐదేళ్ళ‌ల్లో కేవ‌లం ఈ ప‌థ‌కం 2 వేల మందికి మాత్ర‌మే అందింది. 4. మ‌సీదుల మ‌ర‌మ్మ‌త్తుల‌కు 35 కోట్లు ఖ‌ర్చు చేస్తే వైసీపీ హ‌యాంలో కేవ‌లం కోటి రూపాయ‌లే ఖ‌ర్చు పెట్టారు 5. రంజాన్ తోఫా 20 కోట్లు ఖ‌ర్చు చేస్తే వైసీపీ 2 కోట్లు ఇచ్చింది 6. విదేశీ విద్య ప‌థ‌కం ద్వారా 577 మంది ల‌బ్ది వైసీపీ 50 మంది 7. మైనార్టీ కార్పొరేష‌న్‌ల‌కు 443 కోట్లు కేటాయించి స‌బ్సిడీపై రుణాలు అందించింది టీడీపీ వైసీపీ మైనార్టీ కార్పొరేష‌న్లు పెంచింది కానీ బ‌డ్జెట్ అస్స‌లు ఇవ్వ‌లేదు. 8. 8-11-2020 నంద్యాల వన్ టౌన్ సీఐ సోమశేఖర్ రెడ్డి  వేధింపుల కార‌ణంగా  ఆటో డ్రైవ‌ర్ అబ్దుల్‌ సలాం కుటుంబమంతా ఆత్మహత్యకు పూనుకుంది.  షేక్ అబ్దుల్ సలాం, అతని భార్య నూర్జహన్ పాటుగా 14 ఏళ్ల కూతురు సల్మా, 12 ఏళ్ల కుమారుడు దాదా కలందర్ వీరంతా గూడ్స్ రైలు కింద పడి బలవన్మరణాలకు పూనుకున్నారు.   9.   17-8-2023 కర్నూల్ జిల్లా, గొనేగండ్ల మండలం, ఎర్రబాడు గ్రామానికి చెందిన హజిరా అనే అభాగ్యురాలికి అన్యాయం జరిగి, ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు న్యాయం జ‌ర‌గ‌లేదు. 10.   26-3-2022 చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరులో నిరుపేద టెన్త్ విద్యార్ధిని మిస్బా ఆత్మ‌హ‌త్య‌ ఘటన.   తన కూతురే స్కూల్ టాపర్ గా ఉండేందుకు మిస్బా అనే విద్యార్థినిని స్కూల్ మాన్పించేలా స్థానిక‌ వైసీపీ నేత సునీల్ వ్య‌వ‌హ‌రించాడు. మిస్బాను స్కూల్ నుంచి వెళ్ల‌గొడితే త‌ప్ప తన కూతురు పూజిత టాప‌ర్‌గా నిల‌వ‌ద‌ని సునీల్ ఫిక్సయ్యారు. అందుకే మిస్బా కుటుంబ పేద‌రికాన్ని తూల‌నాడుతూ ఆమెను పాఠ‌శాల నుంచి వెళ్ల‌గొట్టాలని బ్రహ్మర్షి స్కూల్ ప్రిన్సిపల్ కు నూరిపోశారు. దీంతో, మిస్బాను అవమానిస్తూ వేరే స్కూల్ చేరేలా ప్రిన్సిపాల్ ఒత్తిడి చేశారు.  సునీల్ తో తలపడలేని ఆ నిస్సహాయ తల్లిదండ్రులు ఆమెను వేరే పాఠశాలలో చేర్పించారు. ఫ‌లితం పాపం ఆ బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకుంది. 11. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ  శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ అహ్మ‌ద్ ష‌రీఫ్‌ను  నువ్వు ముస్లింకే పుట్టావా అంటూ మాట్లాడ‌డం ఈ అంశాల‌పై ముస్లిం క‌మ్యూనిటీలో చ‌ర్చ అయితే సీరియ‌స్‌గా జ‌రుగుతోంది. తెలంగాణాలో బీజేపీని బూచిగా చూసిన‌ట్లు ఆంధ్ర ముస్లింలు చూడ‌రు. గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో ముస్లింలు లాభ‌ప‌డిన‌ట్లు చెబుతున్నారు. జ‌గ‌న్ పాల‌న‌లో చంద్ర‌బాబు ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల్ని అమ‌లు చేయ‌లేద‌నే అసంతృప్తి బాగా వున్న నేప‌థ్యంలో ముస్లిం ఓట్లు టీడీపీ కూట‌మికి మ‌ళ్ళ‌డం ప‌క్కా అంటున్నారు ముస్లిం నేత‌లు.

కర్నాటక మాజీ సీఎం యెడ్యూరప్పపై పోక్సో కేసు

సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముంగిట బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ ఎడ్యూరప్పపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తన సహాయం కోరి వచ్చిన ఓ 17 ఏళ్ల బాలికపై యోడ్యూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బెంగళూరు పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో నేరం రుజువైతే యెడ్యూరప్పకు మూడేళ్లకు పైనే జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.  ఎన్నికల ముంగిట యెడ్యూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం సంచలనం సృష్టించింది. కర్నాటకలో బీజేపీ బలోపేతం అవ్వడం వెనుక యెడ్యూరప్ప కృషి ఉందనడంలో సందేహం లేదు. ఎలా చూసినా దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రం కర్నాటక మాత్రమే. యెడ్యూరప్ప 2008-11 మధ్య కాలంలో కర్నాటక సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై పలు అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా 2018లో ఆయన కొద్ది కాలం కర్నాటక సీఎంగా పని చేశారు. తరువాత 2019లో మరోసారి యెడ్యూరప్ప సీఎంగా పని చేశారు. అయితే 2021లో బీజేపీ హై కమాండ్ యెడ్యూరప్పను తొలగించి ఆయన స్థానంలో బసవరాజ్ బొమ్మైని సీఎంగా చేసింది. ఇక గత ఏడాది జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో  బీజేపీ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలోనే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కర్నాటక బలంగా పుంజుకుని అత్యధిక స్థానాలు సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఇటువంటి తరుణంలో యెడ్యూరప్పపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.   యెడ్యూరప్పపై నమోదైన ఎఫ్ఐఆర్ మేరకు ఒక చీటింగ్ కేసులో  యెడ్యూరప్ప సహాయం కోరుతూ ఒక మహిళ తన 17 ఏళ్ల కుమార్తెతో ఆయన వద్దకు వెళ్లింది. ఆ సందర్భంగా యెడ్యూరప్ప ఆ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఇలా ఉండగా తనపై పోక్సో కేసు నమోదుపై యెడ్యూరప్ప ఇప్పటి వరకూ స్పందించలేదు. బీజేపీ వర్గాలు మాత్రం దీనిని పొలిటికల్లీ మోటివేటెడ్ మూవ్ గా ఆరోపిస్తున్నారు.  రానున్న లోక్ సభ ఎన్నికలలో ఈ కేసు ప్రభావం కచ్చితంగా కమలం పార్టీమీద పడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

నాదెండ్ల వ్యూహం.. చంద్ర‌బాబు చాణ‌క్యం..  తెనాలిలో గెలుపు ఖాయ‌మే!

ఆంధ్రా ప్యారీస్ తెనాలి లో రాజకీయం రసవత్తరంగా మారింది. నిన్న మొన్నటి వరకు తెనాలి రాజకీయాలు తెలుగుదేశం - వైసిపి మధ్యే నడిచేవి. ఐతే   టీడీపీ కూట‌మి త‌ర‌ఫున జ‌న‌సేన అభ్య‌ర్థిగా    నాదెండ్ల మనోహర్ పోటీకి దిగారు. ఇక్క‌డ వైసీపీ - జ‌న‌సేన మ‌ధ్య ముఖాముఖి పోరు జ‌రుగ‌బోతోంది. అయితే విజ‌యం ఎవ‌ర్ని వ‌రించ‌బోతోంది? రాష్ట్ర రాజకీయాలలో తెనాలి ది ప్రత్యేక మైన స్థానం. ఇక్కడి ప్రజలకు రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. అభ్య‌ర్థ‌ల్ని చూస్తే ముగ్గురు కూడా రాజ‌కీయ వార‌సులే. నాదండ్ల భాస్క‌ర్‌రావు ముఖ్య‌మంత్రిగా, అన్న‌బ‌త్తుని స‌త్య‌నారాయ‌ణ మంత్రిగా,  ఆలపాటి వెంకట్రామయ్య చౌదరి మంత్రిగా ప‌నిచేశారు. వారి వార‌సుల ఆధిప‌త్య‌మే తెనాలిలో న‌డుస్తోంది.  జ‌న‌సేన అభ్య‌ర్థి  నాదెండ్ల మనోహర్ కు స్థానికంగా పట్టుంది.   గ‌తంలో అసెంబ్లీ స్పీకర్‌గా   గుర్తింపు పొందారు. వివాద ర‌హితుడిగా..  మంచి పేరే తెచ్చుకున్నారు. అయితే తండ్రి భాస్క‌ర‌రావు మాదిరిగా దూకుడు  వ్య‌వ‌హ‌రించ‌రు. ప్ర‌స్తుతం జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల చైర్మ‌న్‌గా ఉన్నారు. ఎలాంటి దూకుడుకు ప్ర‌ద‌ర్శించ‌కుండా కేవ‌లం  ప్రెస్‌నోట్లు విడుద‌ల చేయ‌డానికే ప‌రిమితం అయ్యార‌ని పార్టీలో చెప్పుకుంటారు. నాదెండ్ల మ‌నోహ‌ర్‌కు ఉన్న ప్ల‌స్‌పాయింట్‌లు ఏమిటంటే గ్రామీణ తెనాలిలో కాపు ఓట్లు ఎక్కువ‌గానే వున్నాయి.  ఆ ఓట్లు అన్నీ జ‌న‌సేన ఖాతాలో ప‌డుతాయ‌నే అంచ‌నా వుంది.  అలాగే  బిజెపితో పొత్తు వుండ‌టం వ‌ల్ల వైశ్యాస్‌, బ్రాహ్మ‌ణుల ఓట్లు ముకుమ్ముడిగా ట్రాన్స‌ఫ‌ర్ అయ్యే అవ‌కాశం వుంది.  తెనాలి సిటీలో వైశ్యాస్ ఓట్లు ఎక్కువ‌.  సిట్టింగ్ ఎమ్మెల్యే శివ‌ను మార్చి వేరే క‌మ్యూనిటీకి ఇస్తే  క‌మ్మ ఓట్లు అన్నీ గంప‌గుత్త‌గా నాదెండ్ల మ‌నోహ‌ర్‌కే ప‌డుతాయి.  సిట్టింగ్‌ను మార్చ‌కుండా శివ‌కే టికెట్ ల‌భిస్తే క‌మ్మ ఓట్లు కొంత చీలుతాయి.  అభివృద్ధి ప‌నులు కానీ, రోడ్లు వేయ‌డం కానీ నాదెండ్ల మ‌నోహ‌ర్ టైం లోనే జ‌రిగింది.  వాస్త‌వానికి చూస్తే గ‌త 10 ఏళ్ళుగా తెనాలిలో ఎలాంటి అభివృద్ధి కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌లేద‌నే ఫీలింగ్ ప్ర‌జ‌ల్లో వుంది.  ఇక ఆల‌పాటి అనుచ‌రుల స‌హ‌కారం వుంది కాబ‌ట్టి ఈజీగా గెలుపు సాధ్యం అవుతుంది. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థికి వ‌చ్చిన ఓట్లు 76,846  +  జ‌న‌సేన‌కు వ‌చ్చిన ఓట్లు 29,905 = 1.06,751 ఓట్లు అవుతాయి. ఇదే రిపీట్ అవుతుంద‌నే ధీమా నాదెండ్ల మ‌నోహ‌ర్‌లో క‌నిపిస్తోంది.  సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబ‌త్తుని శివ‌కు ఉన్న ప్ల‌స్ పాయింట్స్ ఏమిటంటే... త‌న సామాజిక వ‌ర్గం ఓట్ల‌తో పాటు ముస్లింలు, ఎస్సీ ఎస్టీ ఓట్ల‌పైన ఆయ‌న ఆశ‌లు పెట్టుకున్నారు. 1800 కోట్ల సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేశాను. అవి ఓట్ల రూపంలో మారుతాయ‌నే ధీమాతో ఉన్నారు.  ఏపీని కుదిపేస్తున్న గీతాంజలి ఆత్మహత్య కేసును త‌న‌కు అనుకూలంగా వుంది. అభివృధి, కొత్త‌గా రోడ్లు వేయ‌డం ఎక్క‌డా క‌నిపించ‌దు.  అయితే సంక్షేమ ప‌థ‌కాలే గెలుపిస్తాయ‌నే ధీమాతో ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో శివ‌కు వ‌చ్చిన ఓట్లు = 94,495 ఓట్లు గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి ప‌డిన ఓట్లు మ‌ళ్ళీ ఈ ఎన్నిక‌ల్లో ప‌డినా గెల‌వ‌డం క‌ష్ట‌మే.  టీడీపీ కూట‌మి దెబ్బ‌కు శివ అవుట్ అవుతారా అనే చ‌ర్చ అయితే స్థానికంగా జ‌రుగుతోంది. మొత్తం  పోలింగ్ బూత్‌లు 266 2019 ఎన్నికల్లో పోల్ అయిన ఓట్లుః 78.24% ఆ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో వైసీపీకి 45.92%. తెలుగుదేశం పార్టీకి 37.35% ఓట్లు వ‌చ్చాయి.  ప్ర‌స్తుతం గ్రౌండ్ రిపోర్ట్ ఇలా వుంది. అన్నాబత్తుని శివకుమార్  2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  టీడీపీ అభ్యర్థి అలపాటి రాజేంద్రప్రసాద్ పై 17649 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్  ముప్పై వేల స్థాయి ఓట్ల‌ను పొందారు.   2014లో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా నాదెండ్ల మ‌నోహ‌ర్ 15 వేల ఓట్ల‌ను సాధించారు. అప్పుడు టీడీపీ తరఫున ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలిచారు. ఇప్పుడు కూట‌మి అభ్య‌ర్థిగా జ‌న‌సేన నుంచి పోటీ చేస్తున్నారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి నాదెండ్ల మనోహర్ గెలిచి డిప్యూటీ స్పీకర్ గా, స్పీకర్ గా పనిచేశారు.  1989లో మనోహర్ తండ్రి, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి నెగ్గారు.  ప్రస్తుత ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తండ్రి సత్యనారాయణ రెండు పర్యాయాలు అంటే  1983లో స్వతంత్ర అభ్యర్థిగా,  1985లో టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దొడ్డపనేని ఇందిరపై విజయం సాధించారు. బీజేపీ మూడ‌వ సారి గెలుపు దిశ‌గా ప‌య‌నిస్తున్న నేప‌థ్యంలో టీడీపీ కూట‌మికి బీజేపీ వేవ్ కూడా క‌లిసి రానుంది.

 ఏ క్షణంలో అయినా ఎన్నికల నోటిఫికేషన్ ... మొదటి విడత రెండు  తెలుగు రాష్ట్రాల్లో 

లోకసభ ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణాన అయిన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఇద్దరు కమిషనర్ల నియామకం ఖరారు కావడంతో మరికొన్నిగంటల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఒకవేళ నేడు షెడ్యూల్ విడుదల కాని పక్షంలో 16 వతేదీన విడుదల కానుంది. మొదటి విడత ఎన్నికల్లో తెలంగాణ, ఎపిలో జరగనున్నాయి. పలు రాష్ట్రాల్లో లోకసభ ఎన్నికలతో బాటు ఎపిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  జమ్ముకాశ్మీర్‌లో ఎన్నికల సన్నద్ధతపై ఎన్నికల సంఘం బృందం పరిశీలన అనంతరం నోటిఫికేషన్ వెలువడాల్సి ఉందని, అయితే ఎన్నికల సంఘం బుధవారం జమ్ముకాశ్మీర్‌లో పర్యటించడంతో ఇక నోటిఫికేషన్ వెలువడడమే తరువాయి అని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా సెప్టెంబర్ 30, 2024లోగా జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి, రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు గతేడాది కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు ఎన్నికల సంఘం బృందం బుధవారం అక్కడ పర్యటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. భద్రతా పరిస్థితిని సమీక్షించిన అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలా? లేక వేర్వేరుగా నిర్వహించాలా? అనే దానిపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.  

తెలుగుదేశం కోట ఉమ్మడి అనంతపురం జిల్లా!

రాయ‌ల‌సీమ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి గ‌ట్టిప‌ట్టున్న జిల్లా ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా. మొద‌టి నుంచి ఈ జిల్లాలో తెలుగుదేశం హ‌వా కొన‌సాగుతూనే ఉంది.  2019లో మాత్రం ఉమ్మ‌డి జిల్లా ప్ర‌జ‌లు వైసీపీవైపు మొగ్గుచూపారు. కానీ, ప్ర‌స్తుతం ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  ఐదేళ్ల అస్తవ్యస్త పాల‌న‌,  క‌క్ష‌పూరిత రాజ‌కీయాలు,  క‌నీస అభివృద్ధి కూడా లేకపోవడంతో విసిగిపోయిన జిల్లా ప్ర‌జ‌లు మ‌ళ్లీ తెలుగుదేశం వైపు మొగ్గుచూపుతున్నారు. చంద్ర‌బాబు సీఎంగా ఉంటేనే ఉమ్మ‌డి జిల్లాలో అభివృద్ధి జ‌రుగుతుంద‌ని ప్ర‌జ‌లు గట్టిగా చెబుతున్నారు. జగన్ పాలనపై ప్రజా వ్యతిరేకతకు తోడు ఈసారి జ‌న‌సేన‌, బీజేపీకూడా తెలుగుదేశం క‌లిసివ‌స్తుండ‌టం క‌లిసొచ్చే అంశంగా మారింది. దీంతో ఉమ్మ‌డి జిల్లాలో ఈసారి తెలుగుదేశం క్లీన్ స్వీప్ ఖాయ‌మ‌ని పరిశీలకులే కాదు, పలు సర్వేలు కూడా చెబుతున్నాయి.  ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మిగా పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ జిల్లాలో మెజార్టీ స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తున్నది. ఇప్ప‌టికే రెండు విడ‌త‌ల్లో ప‌ద‌కొండు నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులను చంద్ర‌బాబు నాయుడు   ప్ర‌క‌టించారు. వాటిలో హిందూపురం పార్ల‌మెంట్  నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని  రాప్తాడు (ప‌రిటాల సునీత‌), హిందూపురం ( నంద‌మూరి బాల‌క్రిష్ణ), పెనుకొండ (స‌విత‌మ్మ‌), పుట్ట‌ప‌ర్తి (ప‌ల్లె సింధూరా రెడ్డి), క‌దిరి (కందికుంట య‌శోదాదేవి), మ‌డ‌క‌శిర (సునీల్ కుమార్‌) నియోజకవర్గాల అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. అదే విధంగా అనంత‌పురం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని క‌ళ్యాణదుర్గం (సురేంద్ర‌బాబు),  ఉర‌వ‌కొండ (పయ్యావుల కేశ‌వ్‌), రాయ‌దుర్గం (కాల్వ శ్రీ‌నివాసులు), తాడిప‌త్రి (జేసీ అస్మిత్ రెడ్డి), శింగ‌న‌మ‌ల (బండారు శ్రావ‌ణి) నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ఇంకా.. హిందూపురం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించాల్సి ఉంది. అనంత‌పురం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో అనంత‌పురం అర్బ‌న్‌, గుంత‌క‌ల్లు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది.   ఇక నియోజకవర్గాల వారీగా పరిస్థితులను పరిశీలిస్తే... అనంతపురం అర్బ‌న్  అనంత‌పురం అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గంలో 2019 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం అభ్య‌ర్థి ప్ర‌భాక‌ర్ చౌద‌రిపై వైసీపీ అభ్య‌ర్థి అనంత వెంక‌ట‌రామిరెడ్డి విజ‌యం సాధించారు. కూట‌మిలో భాగంగా నియోజ‌క‌వ‌ర్గంలో టికెట్ ఏ పార్టీకి కేటాయిస్తార‌నే అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెలుగుదేశం  రెండు జాబితాలు విడుద‌ల చేసినా ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేదు. ప్ర‌భాక‌ర్ చౌద‌రితోపాటు ప‌లువురు తెలుగుదేశం నేత‌లు కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గం సీటు కోసం పోటీ ప‌డుతున్నారు. ఉరవకొండ నియోజ‌క‌వ‌ర్గం ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌య్యావుల కేశ‌వ్ తెలుగుదేశం అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌బోతున్నారు.  గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి వై. విశ్వేశ్వ‌ర రెడ్డిపై ప‌య్యావుల విజ‌యం సాధించాడు. మ‌రోసారి వీరిద్ద‌రి మ‌ధ్యే పోటీ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌య్యావుల కేశ‌వ్ కు  మంచి ఆద‌ర‌ణ ఉంది.  ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టికీ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి కృషి చేశారు. నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌ను అసెంబ్లీలో ప్ర‌స్తావిస్తూ వ‌చ్చారు. దీనికి తోడు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ప‌య్యావుల ముందుంటారని పేరుంది. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రోసారి ప‌య్యావుల గెలుపు ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.  కళ్యాణదుర్గం నియోజ‌క‌వ‌ర్గం 2019 ఎన్నిక‌ల్లో క‌ల్యాణ దుర్గం నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థి మాదినేని ఉమామహేశ్వర నాయుడుపై వైసీపీ అభ్య‌ర్థి ఉష‌శ్రీ విజ‌యం సాధించారు. ఆమెను జగన్  ఈసారి పెనుగొండ నియోజ‌క‌వ‌ర్గానికి మార్చేశారు. ప్ర‌స్తుతం ఇక్క‌డ తెలుగుదేశంఅభ్య‌ర్థిగా సురేంద్ర‌బాబు   పోటీ చేస్తున్నారు. ఉష‌శ్రీ  స్థానంలో వైసీపీ అధిష్టానం సమన్వయకర్త గా తలారి రంగయ్యను నియ‌మించింది. అయితే  ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఐదేళ్లుగా అబివృద్ధి కార్య‌క్ర‌మాలు పెద్ద‌గా జ‌ర‌గ‌లేదు. దీంతో ప్ర‌జ‌లు వైసీపీ పాల‌న‌పై అసంతృప్తితో ఉన్నారు. దీనికితోడు వైసీపీలోని వ‌ర్గ విబేధాలు  తెలుగుదేం అభ్య‌ర్థి విజ‌యాన్ని సునాయసం చేయనున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   గుంతకల్లు నియోజ‌క‌వ‌ర్గం 2019 ఎన్నిక‌ల్లో గుంత‌క‌ల్లు నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థిగా జితేంద్ర గౌడ్ పోటీచేసి ఓడిపోయాడు. వైసీపీ అభ్య‌ర్థి వై.వెంకటరామి రెడ్డి విజ‌యం సాధించాడు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌, ఎమ్మెల్యే వెంక‌ట‌రామిరెడ్డి బీసీల‌ను అవ‌మానిస్తున్నారని ఆ సామాజిక వ‌ర్గం   ఆగ్ర‌హంతో ఉంది. దీనికి తోడు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీలో  వ‌ర్గ‌విబేధాలు తార స్థాయికి చేరాయి. మ‌రో వైపు కూట‌మి అభ్య‌ర్థిగా ఈ నియోజ‌క‌వ‌ర్గంనుంచి ఇంకా ఎవ‌రికీ టికెట్ కేటాయించ‌లేదు. కూట‌మిలో భాగంగా ఈనియోజ‌క‌వ‌ర్గం టికెట్ బీజేపీకి కేటాయిస్తార‌ని ప్రచారం జరుగుతోంది. కూటమి తరఫున ఎవరు బరిలోకి దిగినా గెలుపు నల్లేరుమీద బండి నడకేనని అంటున్నారు.  తాడిపత్రి నియోజ‌క‌వ‌ర్గం తాడిప‌త్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి  తెలుగుదేశం అభ్య‌ర్థిగా జేసీ అస్మిత్ రెడ్డి  పోటీ చేస్తున్నారు.  2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ అస్మిత్ రెడ్డి ఓడిపోయారు. అయినా  మ‌రోసారి తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు జేసీ అస్మిత్ రెడ్డికే   అవ‌కాశం ఇచ్చారు.    కేతిరెడ్డి పెద్దారెడ్డిపై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నది. కేతిరెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి కంటే.. ఘ‌ర్ష‌ణ‌ల‌కు, ఫ్యాక్ష‌న్ త‌ర‌హా రాజ‌కీయాల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అంతే కాకుండా కేతిరెడ్డి   పెద్ద ఎత్తున అవినీతికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వ‌ర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్న‌ట్లుగా రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. ఈసారి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కూట‌మి జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని ప‌లు స‌ర్వేలు పేర్కొన్నాయి.  రాయదుర్గం నియోజ‌క‌వ‌ర్గం 2019 ఎన్నిక‌ల్లో రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థి కాల్వ శ్రీ‌నివాసులుపై వైసీపీ అభ్య‌ర్థి కాపు రామచంద్రారెడ్డి విజ‌యం సాధించాడు. అయితే, ఈ సారి రామ‌చంద్రారెడ్డికి వైసీపీ అధిష్టానం టికెట్ నిరాక‌రించ‌డంతో ఆయ‌న వైసీపీకి రాజీనామా చేశారు. ప్ర‌స్తుతం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా మెట్టు గోవిందరెడ్డి కొన‌సాగుతున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం అభ్య‌ర్థిగా కాల్వ శ్రీ‌నివాసులు మ‌రోసారి పోటీ చేయ‌నున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీలో వ‌ర్గ‌విబేధాలు తార స్థాయికి చేరాయి. దీనికితోడు ఐదేళ్ల కాలంలో నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి కుంటుప‌డ‌టంతో ప్ర‌జ‌లు వైసీపీ ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హంతో ఉన్నారు. కూట‌మి అభ్య‌ర్థి కాల్వ శ్రీ‌నివాసులుకు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ ఉంది. దీనికి తోడు  బీజేపీ, జ‌న‌సేన మ‌ద్ద‌తుకూడా తోడుకావ‌టంతో ఈసారి శ్రీ‌నివాసులు విజ‌యం న‌ల్లేరుపై బండిన‌డ‌కేన‌ని ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు.    శింగనమల నియోజ‌క‌వ‌ర్గం 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి బండారు శ్రావ‌ణి  పై వైసీపీ అభ్య‌ర్థి జొన్నలగడ్డ పద్మావతి విజ‌యం సాధించారు. ఈసారి వైసీపీ అధిష్టానం ప‌ద్మావ‌తిని త‌ప్పించి ఆమె స్థానంలో నియోజకవర్గం పార్టీ సమన్వయకర్తగా వీరాంజనేయులను నియ‌మించింది. వీరాంజనేయులు   ప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలోని వైసీపీ నేత‌లు అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఆయ‌నకు స‌హ‌క‌రించేది లేద‌ని ప‌లువురు వైసీపీ నేత‌లు ఇప్ప‌టికే  బాహాటంగా చెప్పేశారు.  దీనికి తోడు వైసీపీలో వ‌ర్గ‌విబేధాలు తార స్థాయికి చేరాయి. ఇదిలా ఉంటే.. గ‌త ఐదేళ్ల‌లో నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి అభివృద్ధి జ‌ర‌గ‌క‌పోవ‌టంతో ప్ర‌జ‌లు వైసీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మ‌రోవైపు తెలుగుదేశం అభ్య‌ర్థిగా మ‌రోసారి శ్రావ‌ణి  బ‌రిలోకి దిగుతున్నారు. ఐదేళ్ల కాలంలో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు శ్రావ‌ణి అందుబాటులో ఉంటూ వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేశారు. దీంతో ఆమె ప‌ట్ల ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. దీంతో బండారు శ్రావ‌ణీ విజ‌యం ఖాయ‌మ‌ని అంటున్నారు.    కదిరి నియోజ‌క‌వ‌ర్గం 2019 ఎన్నిక‌ల్లో క‌దిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పెడబల్లి వెంకట సిద్దారెడ్డి విజ‌యం సాధించాడు. అయితే  ఈసారి వైసీపీ అధిష్టానం వెంక‌ట సిద్దారెడ్డిని ప‌క్క‌న‌పెట్టి  కదిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా మక్బూల్ అహ్మద్ ను ప్ర‌క‌టించింది. అయితే,  హైకమాండ్ నిర్ణయాన్ని ప్ర‌స్తుత ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, నియోజకవర్గ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. మంత్రి పెద్దారెడ్డి ప‌లుసార్లు అసంతృప్త నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపినా  ఫలితం కనిపించలేదు.  మ‌రోవైపు ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి  తెలుగుదేశం అభ్య‌ర్థిగా కందికుంట య‌శోదాదేవి (టీడీపీ) పోటీ చేస్తున్నారు. వైసీపీలో వ‌ర్గ‌విబేధాల‌కు తోడు.. నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఐదేళ్ల కాలంలో అభివృద్ధి జ‌ర‌గ‌క‌పోవ‌టం య‌శోదాదేవి విజ‌యానికి దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని ప‌రిశీల‌కులు  విశ్లేషిస్తున్నారు. ధర్మవరం నియోజ‌క‌వ‌ర్గం  తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థి బ‌రిలోకి దిగుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్నది. అయితే, టీడీపీ నేత ప‌రిటాల శ్రీరామ్ ఈ నియోజకవర్గం నుంచి   పోటీచేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కూట‌మి అభ్య‌ర్థిగా ఇప్పటి వరకూ ఎవ‌రినీ నియ‌మించ‌లేదు.  వైసీపీ నుంచి మ‌రోసారి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బ‌రిలోకి దిగ‌నున్నారు. అయితే కేతిరెడ్డిపై నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌రిటాల శ్రీ‌రామ్ గ‌త నాలుగేళ్లుగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు పెంచుకున్నారు. ప‌రిటాల శ్రీ‌రామ్ కు టికెట్ ఇస్తే విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌క అవుతుంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. బీజేపీ అభ్య‌ర్థికి టికెట్ ఇస్తే ప‌రిటాల శ్రీ‌రామ్ స‌హ‌కారంపై ఆయ‌న విజ‌యావ‌కాశాలు ఆధార‌ప‌డి ఉంటాయ‌న్న చ‌ర్చ నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా జరుగుతోంది.   పుట్టపర్తి నియోజ‌క‌వ‌ర్గం పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి కోడ‌లు ప‌ల్లె సంధూరారెడ్డికి  తెలుగుదేశం అధిష్టానం టికెట్ కేటాయించింది. గ‌త ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థి ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డిపై వైసీపీ అభ్య‌ర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి విజ‌యం సాధించాడు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌జ‌ల అస‌హ‌నం, మ‌రోవైపు రాష్ట్రంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌పై వ్యక్తమౌతున్న తీవ్ర ఆగ్ర‌హం కారణంగా సింధూరారెడ్డి విజ‌యానికి ఢోకాలేదని అంటున్నారు.     పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గం పెనుగొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి   తెలుగుదేశం అభ్య‌ర్థిగా స‌విత‌మ్మ పోటీ చేస్తున్నారు. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తీగ‌డ‌ప‌కు వెళ్లి ఆమె ప్ర‌చారం చేశారు.  2019లో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం అభ్య‌ర్థి బీకే  పార్థ‌సార‌ధిపై వైసీపీ అభ్య‌ర్థి మాలగుండ్ల శంకర నారాయణ విజ‌యం సాధించారు. ఈసారి వైసీపీ అధిష్టానం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా మంత్రి ఉష‌శ్రీ చ‌ర‌ణ్‌ను నియ‌మించింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి ఎదురుగాలి వీస్తున్నది. వ‌ర్గ విబేధాలు చాప‌కింద‌నీరులా విస్త‌రిస్తున్నాయి. తెలుగుదేశం అభ్య‌ర్థి స‌విత‌మ్మ విజ‌యం ఖాయ‌మ‌ని పరిశీలకులు అంటున్నారు. ఇప్ప‌టికే ప‌లు స‌ర్వే ఫ‌లితాలు కూడా స‌విత‌మ్మదే విజయమని తేల్చేశాయి.   మడకశిర నియోజ‌క‌వ‌ర్గం  మ‌డ‌కశిర నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థిగా సునీల్ కుమార్ పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ అభ్య‌ర్థి ఎం. తిప్పేస్వామి  టీడీపీ అభ్య‌ర్థి  ఈరన్నపై విజ‌యం సాధించారు. అయితే, ఈసారి వైసీపీ అధిష్టానం   ఈరలక్కప్పను స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించింది. దీంతో వైసీపీలో వ‌ర్గ‌విబేధాలు భ‌గ్గుమ‌న్నాయి. దీనికి తోడు గ‌త ఐదేళ్ల‌లో నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. తెలుగుదేశం అభ్య‌ర్థి సునీల్ కుమార్ కు ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. దీనికి తోడు జ‌న‌సేన‌, బీజేపీ ఓట్లుకూడా తోడుకానుండ‌టంతో సునీల్ కుమార్ విజ‌యం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు.  రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో కూట‌మి అభ్యర్థిగా ప‌రిటాల సునీత పోటీ చేస్తున్నారు. గ‌తంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిటాల సునీత కుమారుడు ప‌రిటాల శ్రీ‌రామ్ పోటీచేసి వైసీపీ అభ్య‌ర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. మ‌రోసారి ప్ర‌కాశ్ రెడ్డి ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగ‌బోతున్నారు. అయితే, గ‌త ఐదేళ్ల కాలంలో ప్ర‌కాశ్ రెడ్డిపై నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి జ‌ర‌గ‌క‌పోవ‌డంతోపాటు.. రాష్ట్రంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత పాల‌న ప‌ట్ల ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. దీనికితోడు ఈసారి ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌రిటాల సునీత బ‌రిలోకి దిగుతున్న నేప‌థ్యంలో కూట‌మి అభ్య‌ర్థి విజ‌యం దాదాపు ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు స‌ర్వే ఫ‌లితాల్లో ప‌రిటాల సునీత గెలుస్తార‌ని తేలింది.    హిందూపూర్ నియోజ‌క‌వ‌ర్గం హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌రోసారి నంద‌మూరి బాల‌క్రిష్ణ తెలుగుదేశం అభ్యర్థిగా బ‌రిలోకి దిగుతున్నారు.  2014, 2019   ఎన్నిక‌ల్లో బాల‌య్య ఇక్కడ నుంచి విజ‌యం సాధించారు. మూడోసారి హ్యాట్రిక్ కొట్టేదుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అధిష్టానం  కోడూరు దీపిక‌ను బరిలోకి దింపుతోంది.  అయితే ఆమె అభ్యర్థిత్వం పట్ల  ప‌లువురు వైసీపీ నేత‌లు అసంతృప్తితో ఉన్నారు. మ‌రోవైపు వైసీపీ ప్ర‌భుత్వంతో సంబంధం లేకుండా నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు వైద్య‌, విద్య అందిస్తూ బాలయ్య నియోజకవర్గ ప్రజలలో మంచి పేరు సంపాదించుకున్నారు. దీంతో బాల‌య్య‌వైపే మెజార్టీ ప్ర‌జ‌లు మొగ్గుచూపుతున్నారు. మ‌రోసారి బాల‌య్య గెలుపు ఖాయ‌మే అంటున్నారు.  

భాష గురించి సుద్దులేంటి? గ‌తాన్ని మ‌ర్చిపోయారా కేసీఆర్?

బేకూబ్ గాళ్లు.. ప‌నికిమాలిన ద‌ద్ద‌మ్మ‌లు.. స‌న్నాసులు.. ముండ‌మోపులు.. నా కొడుకులు.. ఇలా చెప్పుకుంటూ పోతే బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ నోటి నుంచి జాలువారే ప‌దాలు చాలానే ఉన్నాయి.  బీఆర్ ఎస్ అధికారంలో ఉన్న‌స‌మ‌యంలో ఒకానొక ద‌శ‌లో ఇదే తెలంగాణ భాష అన్న‌ట్లుగా సీఎం హోదాలో కేసీఆర్ స‌ర్టిఫికేట్ కూడా ఇచ్చారు. గ‌త ప‌దేళ్ల కాలంలో బీఆర్ ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో కేసీఆర్ మీటింగ్ అంటే మీడియాలో రాయ‌లేనిప‌దాల‌తో సైతం ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డేవారు.  ప్ర‌తిప‌క్షాలు ఆయ‌న భాష‌పై అభ్యంత‌రం చెబితే.. చావు నోట్లో త‌ల‌కాయ‌పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాను.. నాకే ఎదురు చెబుతారా అంటూ మ‌ళ్లీ ప్ర‌తిప‌క్షాల‌పైనే  విరుచుకుప‌డేవారు. వ‌రుస‌గా రెండు సార్లు అధికారం రావ‌డంతో కేసీఆర్, బీఆర్ ఎస్ నేత‌లు తాము  ఏం మాట్లాడినా చెల్ల‌బాటు అవుతుంద‌నే స్థాయికి వెళ్లిపోయారు.  ప్ర‌స్తుతం సీన్ రివ‌ర్స్ అయింది. ప‌ దేళ్ల కేసీఆర్ పాల‌న‌లో అనేక ఇబ్బందులు ప‌డ్డ ప్ర‌జ‌లు.. ఆయ‌న్ను గ‌ద్దెదించారు. మ‌రి కొద్ది రోజుల్లో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి వ‌రుస‌గా బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలో రేవంత్ వాడుతున్న ప‌ద‌జాలంపై కేసీఆర్ గ‌గ్గోలు పెడుతున్నారు. అయితే కేసీఆర్ గ‌తాన్ని మ‌ర్చిపోయి..  రేవంత్ అలా మాట్లాడుతున్నారు.. ఇలా మాట్లాడుతున్నారు.. తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క పొల్లుమాటైనా నా నోట వచ్చిందా  అంటుండ‌టం గ‌మ‌నార్హం.  క‌త్తితో కోసిన‌ట్లుగా ఉండే మాట‌లు.. సిగ్గుతో త‌ల ఎత్తుకోలేని విధంగా ఉండేలా భాష‌.. త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నంకోసం ఎవ‌రినైనా స‌రే బండ‌కేసి బాదిన‌ట్లుగా మాట‌ల‌తో బాదేయ‌గ‌ల స‌త్తా కేసీఆర్‌ది. మోడీ స‌ర్కార్ పై కోపం వ‌స్తే క‌మ‌ల‌నాథుల‌ను క‌సిగా తిట్టేవారు.. కాంగ్రెస్ నేత‌ల‌నైతే ఇక చెప్ప‌టానికి వీళ్లేదు.. కేసీఆర్ కు ఆవేశం వ‌చ్చినా.. ఆక్రోశం వ‌చ్చినా ఆయ‌న నోటి నుంచి జాలువారే ప‌దాలు తెలంగాణ స‌మాజం త‌ల‌దించుకునేలా ఉండేవి.. అదేం భాష అని ప్ర‌శ్నించిన వారిపైకూడా ఎదురుదాడికి దిగేవారు.. మ‌రో అడుగు ముందుకేసి ఇదే తెలంగాణ భాష అంటూ స‌ర్టిఫికెట్లు సైతం ఇచ్చుకున్న ఘ‌న‌త కేసీఆర్‌ది.  తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్య‌మం చేసిన స‌మ‌యంలో కేసీఆర్ ఏం మాట్లాడినా చెల్లింది. కానీ, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత గ‌డిచిన ప‌దేళ్ల కాలంలో కేసీఆర్ భాష తీరులో మార్పు రాలేదు. దీంతో ముల్లును ముల్లుతోనే తీయాల‌న్న సామెత‌ను వంట‌బ‌ట్టించుకున్న ప్ర‌తిప‌క్ష పార్టీల్లోని ఇద్ద‌రుముగ్గురు నేత‌లు  కేసీఆర్ కు ఆయ‌న భాష‌లోనే స‌మాధానం చెప్పేవారు. దీంతో.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తనపై,  సీఎం పై తిప‌క్ష నేత‌లు ఇలా మాట్లాడ‌టం ఏమిటంటూ కేసీఆర్ మ‌ళ్లీ త‌న‌దైన రీతిలో ప‌ద‌జాలాన్ని వినియోగిస్తూ విమ‌ర్శ‌లు చేసేవారు. కేసీఆర్ అధికారంలో ఉన్న ప‌దేళ్ల కాలంలోనూ ఇదే తంతు కొన‌సాగింది. ఉన్న‌ట్లుండి కేసీఆర్ కు జ్ఞానోద‌యం అయిన‌ట్లుంది. ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చిన త‌రువాత ఆయ‌న గ‌తాన్ని మ‌ర్చిపోయిన‌ట్లుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.  ప‌దేళ్లు సీఎంగా కొన‌సాగిన కేసీఆర్ ప్ర‌తిప‌క్షాల‌పై, మీడియాపైనా ప‌రుష ప‌ద‌జాలంతో మాట్లాడిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. కేసీఆర్ భాష‌తీరు, అధికారంలో ఉన్న‌ప్పుడు తాను  ఏం చెప్పినా వినాల‌న్న కేసీఆర్ ధోర‌ణితో విసిగిపోయిన తెలంగాణ ప్ర‌జలు ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి ప‌ట్టం క‌ట్టారు. రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తున్నారు. దీంతో ప్ర‌జామ‌ద్ద‌తు పెరుగుతోంది. దీన్నిచూసి ఓర్వ‌లేని బీఆర్ ఎస్ నేత‌లు ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొడ‌తాం అంటూ ప‌దేప‌దే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. దీంతో కేసీఆర్ కు ఆయ‌న భాష‌లోనే స‌మాధానం ఇవ్వాల‌ని రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఈ క్ర‌మంలో అధికారంలో ఉన్న స‌మ‌యంలో కేసీఆర్ వాడిన భాష‌ను రేవంత్ వాడుతూ బీఆర్ ఎస్ నేత‌ల నోళ్లు మూయిస్తున్నారు. ఈ క్ర‌మంలో.. ఉన్న‌ట్లుండి కేసీఆర్ కు జ్ఞానోద‌యం అయిన‌ట్లుంది. సీఎం హోదాలోఉన్న వ్య‌క్తి ఎలా మాట్లాడాలి.. హూందాత‌నం అంటే ఏమిటి అనే విష‌యాల‌పై బ‌హిరంగ స‌భ‌ల్లో మైకులో సెల‌విస్తున్నారు.  తెలంగాణ స‌మాజానికి ఇది గౌర‌వ‌మా? ద‌య‌చేసి ప్ర‌జ‌లు గ‌మ‌నించాలి అంటూ కేసీఆర్ విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. అంటే.. కేసీఆర్ ఎలాంటి భాష‌ను మాట్లాడినా సంసార‌ప‌క్షం.. అదే ఇత‌ర పార్టీల నేత‌లు మాట్లాడితే బూతులు అన్న‌ట్లుగా కేసీఆర్ ప్ర‌వ‌ర్తిస్తుండ‌టంతో ప్ర‌జ‌లుసైతం షాక్ కు గుర‌వుతున్నారు. అధికారంలో ఉన్న స‌మ‌యంలో నువ్వు వాడిన భాష‌నే క‌దా ఇది అంటూ   గుర్తుచేస్తున్నారు.  మ‌రికొద్ది రోజుల్లో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో  కేసీఆర్ ప్ర‌జ‌ల్లో సానుభుతిని ర‌గిల్చి అత్య‌ధిక స్థానాల్లో బీఆర్ ఎస్ అభ్య‌ర్థులు విజ‌యం సాధించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన కేసీఆర్‌.. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష స‌రిగా లేదంటూ గ‌గ్గోలు పెట్టారు. తెలంగాణ‌కు ఇది గౌర‌వ‌ప్ర‌దంగా ఉంటుందా.. సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి అడ్డ‌గోలుగా మాట్లాడ‌వ‌చ్చా అంటూ ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందేలా కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేశారు. ఇక్క‌డ కేసీఆర్‌, బీఆర్ ఎస్ నేత‌లు తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. అస‌భ్య‌క‌ర భాష‌ను వాడింది ముందు కేసీఆర్‌, బీఆర్ ఎస్ నేత‌లే. స‌న్నాసులు, ద‌ద్ద‌మ్మ‌లు, పోరంబోకులు, కుక్క‌లు, గాడిద‌లు అన్న‌ది ఎవ‌రు? అంటే తెలంగాణ‌లోని ప్ర‌తి ఒక్క‌రూ కేసీఆర్ అనే చెబుతారు. ఆ త‌రువాత త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో  రేవంత్ రెడ్డి కేసీఆర్ త‌ర‌హా భాష‌ను వాడాల్సి వ‌చ్చింద‌ని ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టికైనా మ‌నం ప్ర‌తిప‌క్షంలో ఉన్నామ‌ని గుర్తుచేసుకొని కేసీఆర్‌, బీఆర్ ఎస్ నేత‌లు త‌మ భాష‌ను మార్చుకుంటే.. కాంగ్రెస్ నుంచి సైతం మంచి ప‌ద్ద‌తిలోనే స‌మాధానం వ‌స్తుంది. ఈ విష‌యాన్ని రేవంత్ రెడ్డి ప‌లు స‌భ‌ల్లోనూ ప్ర‌స్తావించారు. అవేమీ పట్టించుకోకుండా కేసీఆర్ తాజాగా రేవంత్ భాష గురించి సుద్దులు చెప్పడంతో సోషల్ మీడియాలో గతంలో కేసీఆర్ అనుచిత భాష ప్రయోగిస్తూ చేసిన వీడియోలు తెగ హల్ చ ల్ చేస్తున్నాయి.

డీకేతో మల్లారెడ్డి భేటీ రేపు ప్రియాంకా గాంధీ అప్పాయింట్ మెంట్.. కాంగ్రెస్ ఎంట్రీ ఇక లాంఛనమేనా?

పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. కాలేజీలు పెట్టా.. సక్సెస్ అయినా.   మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే   చామ‌కూర‌ మ‌ల్లారెడ్డి  ట్రేడ్ మార్క్ డైలాగ్. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన.. 2014 లో మల్కాజ్ గిరి  లోక్ సభ నియోజకవర్గొం నుంచి    తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడంతో ఆయన  2016లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) గూటికి చేరిపోయారు. అప్పటి నుంచీ బీఆర్ఎస్ లోనే కీలకంగా ఉంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుడిగా మారారు.  బీఆర్ ఎస్ అధికారంలో కొన‌సాగిన‌న్ని రోజులు మ‌ల్లారెడ్డి హ‌వాయే వేరు.  ఆయ‌న ఏం చేసినా, ఏం మాట్లాడినా వైరల్ అయ్యేది.  అదే సమయంలో  క‌బ్జాలు, భూ దందాల ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాపంకంతో మల్లారెడ్డి ఆరోపణలూ, విమర్శలకు ఖాతరు చేసేవారు కాదు.  అంతే కాదు తాను ఎవరినైనా మేనేజ్ చేయగలనంటూ ప్రకటనలు కూడా గుప్పించారు.  కానీ ఇటీవలి ఎన్నికలలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయి విపక్ష పాత్రకు పరిమితం కావడంతో ఆయనను ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి.  ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఆయన పరిస్థితి ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. ఏం చేసినా అడిగేవారు లేరన్నట్లుగా ఉండే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆయన కబ్జాలు, దందాలపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనపై మల్లారెడ్డి చేసిన సవాళ్ల ఫలితం ఇప్పుడు కనిపించడం మొదలైంది.   రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుదీరగానే మ‌ల్లారెడ్డి భూక‌బ్జాల వ్య‌వ‌హారాల‌న్నీ ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా మ‌ల్లారెడ్డి అల్లుడు, మ‌ల్కాజిగిరి బీఆర్ ఎస్ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర‌రెడ్డి  ప్ర‌భుత్వ భూమిని ఆక్ర‌మించి కాలేజీల భవనాలు నిర్మాణం చేశారని గుర్తించిన అధికారులు   వాటిని కూల్చేశారు.   గ‌తంలో మ‌ల్కాజిగిరి ఎంపీగా ఉన్న‌ప్పుడు ప్ర‌స్తుత సీఎం రేవంత్‌రెడ్డి అవి అక్ర‌మ క‌ట్ట‌డాల‌ని అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. ఆ స‌మ‌యంలో మ‌ల్లారెడ్డి మంత్రిగా ఉండ‌టంతో అధికారులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలే దు. అయితే ఇప్పుడు అప్పట్లో ఫిర్యాదు చేసిన వ్యక్తే  సీఎం కుర్చీలో కూర్చోవ‌డంతో అధికారులు అల‌ర్ట్ అయ్యారు. గ‌తంలో రేవంత్ ఇచ్చిన ఫిర్యాదుకు దుమ్ముదులిపి ప్ర‌భుత్వ భూమిలో నిర్మాణం చేసిన భ‌వ‌నాల‌ను అధికారులు ద‌గ్గ‌రుండి కూల్చేశారు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో భూ కబ్జాలకు పాల్పడ్డారని, మా భూములను లాక్కొన్నారనీ పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఫిర్యాదులపై  దృష్టిసారించింది. ఈ క్రమంలో మల్లారెడ్డిపై ముప్పేట దాడిచేసేందుకు అధికారులు  సన్నద్ధమవుతున్న తరుణంలో  మల్లారెడ్డి అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరడానికి ప్రయత్నాలు షురూ చేశారు. ముఖ్యమంత్రితో అప్పాటింట్ మెంట్ కోసం ప్రయత్నించినా లభించకపోవడంతో ఆయన నేరుగా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకుని అటునుంచి నరుక్కు వద్దామన్న ఉద్దేశంతో అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా మల్లారెడ్డి గురువారం కర్నాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. అంత కంటే ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికి పార్టీ టికెట్ ఇస్తామని పోటీ చేయాలని ప్రతిపాదించినా పోటీకి తమ కుటుంబం దూరం అంటూ బీఆర్ఎస్ తో బంధం తెంచుకోబోతున్నానన్న సంకేతాలను ఇచ్చారు.  ఇప్పుడు ఇక ఏకంగా కాంగ్రెస్ గూటికి చేరేందుకు కార్యాచరణ ప్రారంభించేశారు. డీకే శివకుమార్ తో మల్లారెడ్డి భేటీ తరువాత ఆయన కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ అప్పాయింట్ మెంట్ కోరినట్లు తెలిసింది.  శుక్రవారం మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో ప్రియాంక గాంధీతో భేటీ అయ్యే అవకాశా లున్నాయని అంటున్నారు. దీనిని బట్టి అతి త్వరలో మల్లారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమన్న భావన రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నది.  

పిఠాపురం నుంచి బరిలోకి పవన్ కల్యాణ్.. స్వయంగా ప్రకటించిన జనసేనాని

జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ ఎక్కడ నుంచి అన్న సస్పెన్స్ కు ఆయనే స్వయంగా తెరదించేశారు. తాను పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు పవన్ కల్యాణ్ గురువారం (మార్చి 14) స్వయంగా వెల్లడించారు. తనకు ఎంపీగా పోటీ చేసే ఆలోచనే లేదని ఈ సందర్బంగా క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా కొన్ని స్థానాలలో త్యాగం చేయాల్సి వచ్చిన మాట వాస్తవమేననీ చెబుతూ, ఈ త్యాగం తమ పార్టీ గౌరవాన్ని ఇనుమడింప చేస్తుందే తప్ప తగ్గించదని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనను అంతం చేయాలంటూ భావసారూప్యత ఉన్న వారితో కలిసి ముందుకు నడవక తప్పదన్నారు.   

బీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య మైత్రి.. నిజమేనా?

రానున్న లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక బీఆర్ఎస్, బీజేపీ రహస్య మైత్రి నిజమేనా అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది.  చాలా కాలంగా తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్, బీజేపీల రహస్య మైత్రిపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.  ఆ రెండు పార్టీల నేతలూ ఎన్ని రకాలుగా ఖండించినా ఆ అనుమానాలు మాత్రం పూర్తిగా నివృత్తి కాలేదు. ఒక విధంగా చెప్పాలంటే.. బీజేపీ, బీఆర్ఎస్ రహస్య మైత్రి అన్న వార్తలు ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రెండు పార్టీలకూ భారీ నష్టం చేకూరడానికి కారణమయ్యాయి. ఇక ఎన్నికల తరువాత కూడా ఇరు పార్టీల మధ్యా రహస్య సంబంధం కొనసాగుతూనే ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే ఇరు పార్టీలూ కూడా రానున్న లోక్ సభ ఎన్నికలకు ఆ పార్టీల అభ్యర్థుల ఎంపిక ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ బీజేపీ వచ్చే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి 15 మంది అభ్యర్థులను ప్రకటించింది. వారిలో అత్యధికులు బీఆర్ఎస్ నుంచి దిగుమతి అయిన వారే. అలాగే బీజేపీ తరఫున లోక్ సభ ఎన్నికల బరిలో దిగుతున్న బలమైన అభ్యర్థులకు ప్రత్యర్థులుగా బీఆర్ఎస్ అత్యంత బలహీనమైన అభ్యర్థులను పోటీకి దింపుతోంది. ఇందుకు ఉదాహరణగా మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలో నిలబడ్డారు. ఇక బీఆర్ఎస్ తన పార్టీ అభ్యర్థిగా మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును రంగంలోకి దింపుతోంది. ఆయన ఏ విధంగా చూసినా ఈటలకు పోటీ ఇచ్చే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అదే విధంగా నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి శ్రీనివాస్ రంగంలోకి దిగుతున్నారు. ఆయనకు ప్రత్యర్ధిగా సహజంగా ఎవరైనా సరే కల్వకుంట్ల కవిత నిలబడతారని అనుకుంటారు. అయితే కేసీఆర్ మాత్రం మల్కాజ్ గిరి  బాజిరెడ్డి గోవర్ధన్ ను టికెట్ ఇచ్చారు. ఏ విధంగా చూసినా బాజిరెడ్డి ధర్మపురి శ్రీనివాస్ కు పోటీ ఇవ్వలేని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక చేవెళ్ల విషయానికి వస్తే అక్కడి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. కాగా ఆ స్థానం నుంచి బీజేపీ ఇప్పటికే  మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది. కాంగ్రెస్ తరఫున ఎటూ కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి రంగంలోకి దిగే అవకాశాలలే మెండుగా ఉన్నాయి.  దీంతో ఇదర్దు బలమైన అభ్యర్థులను చేవెళ్లలో ఎదుర్కొవాలంటూ బీఆర్ఎస్ కూడా గట్టి అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉంటుంది. అయితే ఆశ్చర్యకరంగా బీఆర్ఎస్  చేవెళ్ల నుంచి మాజీ ఎంపీ కాసాని జ్ణానేశ్వర్ కు పార్టీ టికెట్ ఇచ్చింది.  ఇక జహీరాబాద్ విషయానికి వస్తే అక్కడ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఇప్పటికే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ నుంచి టికెట్ దక్కించుకున్నారు. ఆయనపై పోటీకి బీఆర్ఎస్  ఇప్పటి వరకూ ఏ ప్రత్యక్ష ఎన్నికలోనూ విజయం సాధించిన చరిత్ర లేని గాలి అరుణ్ కుమార్ కు కేటాయించారు.   రానున్న ఎన్నికలలో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను చూస్తే  ఆ పార్టీ ఉాద్దేశపూర్వకంగానే బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలలో ఉద్దేశపూర్వకంగా బలహీన అభ్యర్తులను నిలబెడుతోందన్ విమర్శకులు, పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద వచ్చే లోక్ సభ ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ తీరు చూసిన పరిశీలకులు బీజేపీతో రహభస్య మైత్రి వైపునకే కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని  విశ్షేషకులు.

తెలుగుదేశం అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసిన బాబు

రానున్న ఎన్నికలలో పోటీ చేయనున్న తెలుగుదేశం అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గురువారం (మార్చి 14) విడుదల చేశారు. ఈ సారి ఆయన 34 నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలో 94 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగుదేశం జనసేన, బీజేపీలతో పొత్తులో భాగంగా రాష్ట్రంలో పోటీ చేయనున్న 144 అసెంబ్లీ స్థానాలలో  128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది. ఇక 31 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు ప్రకటించిన రెండో జాబితాలో ముఖ్యంగా చెప్పుకోవలసింది చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న విషయాన్ని ప్రకటించలేదు. ఆ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా  గంటా శ్రీనివాసరావును చంద్రబాబు కోరినప్పటికీ ఆయన విశాఖ జిల్లా నుంచి పోటీ చేస్తానని కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఆ నియోజకవర్గాన్ని పెండింగ్ లో పెట్టారు. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయనున్నారు. అలాగే తొలి జాబితాలో స్థానం దక్కని సీనియర్ నాయకులు ఆనం రామనారాయణరెడ్డి, యరపతనేని, చితమనేని ప్రభాకర్ తదితరులకు చంద్రబాబు  రెండో జాబితాలో టికెట్లు ఖరారు చేశారు. అదే విధంగా గత ఎన్నికలలో గాజువాక నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి జనసేనాని పవన్ కల్యాణ్ చేతిలో పరాజయం పాలైన పల్లా శ్రీనివాసరావుకు ఈ సారి కూడా గాజువాక స్థానాన్ని కేటాయించారు.  ఇలా ఉండగా అధికార వైసీపీ తన అభ్యర్థులను ఈ నెల 16న ప్రకటించనుంది. ఆలోగా తెలుగుదేశం, జనసేన, బీజేపీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. చంద్రబాబు ప్రకటించిన రెండో జాబితా ఇలా ఉంది.  నరసన్నపేట - బగ్గు రమణ మూర్తి గాజువాక - పల్లా శ్రీనివాసరావు చోడవరం - కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు మాడుగుల - పైలా ప్రసాద్‌ ప్రత్తిపాడు - వరుపుల సత్యప్రభ రామచంద్రాపురం - వాసంశెట్టి సుభాష్‌ రాజమండ్రి రూరల్‌ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి రంపచోడవరం - మిర్యాల శిరీష కొవ్వూరు - ముప్పిడి వెంకటేశ్వరరావు దెందులూరు - చింతమనేని ప్రభాకర్‌ గోపాలపురం - మద్దిపాటి వెంకటరాజు పెదకూరపాడు - భాష్యం ప్రవీణ్‌ గుంటూరు వెస్ట్‌ - పిడుగురాళ్ల మాధవి గుంటూరు ఈస్ట్‌ - మహ్మద్‌ నజీర్‌ గురజాల - యరపతినేని శ్రీనివాసరావు కందుకూరు - ఇంటూరి నాగేశ్వరరావు మార్కాపురం - కందుల నారాయణ రెడ్డి గిద్దలూరు - అశోక్‌ రెడ్డి ఆత్మకూరు - ఆనం రాంనారాయణ రెడ్డి కోవూరు (నెల్లూరు)- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వెంకటగిరి - కురుగొండ్ల లక్ష్మీప్రియ కమలాపురం - పుత్తా చైతన్య రెడ్డి ప్రొద్దుటూరు - వరదరాజుల రెడ్డి నందికొట్కూరు (ఎస్సీ) - గిత్తా జయసూర్య  ఎమ్మిగనూరు - జయనాగేశ్వర రెడ్డి మంత్రాలయం- రాఘవేంద్ర రెడ్డి పుట్టపర్తి- పల్లె సింధూరా రెడ్డి కదిరి- కందికుంట యశోదా దేవి మదనపల్లె- షాజహాన్ బాషా పుంగనూరు- చల్లా రామచంద్రా రెడ్డి (బాబు) చంద్రగిరి- పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని) శ్రీకాళహస్తి- బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సత్యవేడు- కోనేటి ఆదిమూలం (ఎస్సీ) పూతలపట్టు- డాక్టర్ కలికిరి మురళీ మోహన్