మంగళగిరిలో నారా బ్రహ్మణి పర్యటన.. రెస్పాన్స్ మామూలుగా లేదుగా?

మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న స‌తీమ‌ణి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కుమార్తె  నారా బ్రాహ్మ‌ణి బుధవారం (ఆగస్టు 13) పర్యటించారు. ఆ సందర్భంగా ఆమె నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. తన భర్త ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంపై మమకారంతో ఆమె ఇప్పటికే అక్కడ తన స్వంత ఖర్చుతో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో ముఖ్యంగా  మహిళల కోసం స్త్రీ శక్తి  కుట్టు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే, స్థానిక పార్కులో పిల్లలకు ఆటసామగ్రిని తన స్వంత ఖర్చుతో ఏర్పాటు చేశారు.  వీటన్నిటినీ ఆమె ఈ పర్యటనలో సందర్శించారు.  అలాగే చేనేత కార్మికులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప‌రిశీలించారు. నూత‌నంగా తీసుకువ‌చ్చిన డిజైన్ల‌ను ప‌రిశీలించారు.  ‘స్త్రీ శ‌క్తి’ కుట్టు శిక్ష‌ణా కేంద్రాల‌ను ప‌రిశీలించి, శిక్షణ సాగుతున్న తీరును ఆరా తీశారు.  ఇప్ప‌టి వ‌ర‌కు మూడు బ్యాచ్‌లుగా శిక్ష‌ణ పొందిన వారు సొంత‌గానే కుట్టు కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా స్థిరత్వం పొందుతున్న తీరు పట్ల సంతోషం వ్యక్తం చేశారు.  పార్కులో స్వ‌యంగా తాను సొంత ఖ‌ర్చుతో ఏర్పాటు చేయించిన పిల్ల‌లు ఆడుకునే ప‌రిక‌రాలు.. వ‌స్తువుల‌ను నారా బ్రాహ్మ‌ణి ప‌రిశీలించారు. అలాగే మంగళగిరిలోని ప్ర‌సిద్ధ‌ పాన‌కాల‌స్వామి ఆల‌యాన్ని  నారా బ్రాహ్మ‌ణి సంద‌ర్శించారు.  నారా లోకేష్ సొంత ఖ‌ర్చుతో కొనుగోలు చేసి ఇచ్చిన ఉచిత బ‌స్సులో కొద్ది సేపు ప్రయాణించి, తోటి ప్రయాణీకులతో సంభాషించారు.  నారా బ్రహ్మణి పర్యటనకు జనం నుంచి అద్భుత స్పందన వచ్చింది. కాగా నారా బ్రహ్మణి మంగళగిరిలో పర్యటించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అమె పలుమార్లు నియోజకవర్గంలో పర్యటించిన సంగతి తెలిసిందే.  

రాహుల్ పై జగన్ వ్యాఖ్యలు.. షర్మిల రియాక్షన్ తట్టుకోలేమంటూ వైసీపీ బెంబేలు

పులివెందుల ఓటమి జగన్ ప్రతిష్టను పాతాళానికి పడిపోయేలా చేసిందన్న మాటలు వైసీపీ వర్గాల నుంచే వినపిస్తున్నాయి. అయితే ఆ పాతాళం కంటే ఆయన ప్రతిష్ఠ దిగజారిపోయే పరిస్థితి ముందుందని అంటున్నారు. పులివెందుల ఓటమిని ముందుగానే అంచనా వేసిన జగన్.. ఆ ఓటమికి అధికార తెలుగుదేశం అధికార దుర్వినియోగమే కారణమని ఆరోపణలు కౌంటింగ్ కు ముందు రోజే గుప్పించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగి ఉంటే పాపం కొంచం ఆబోరైనా దక్కేదేమో.. కానీ జగన్ ఈ వ్యవహారంలోకి రాహుల్ గాంధీని లాగారు. ఓట్ చోరీ అంటూ హంగామా చేస్తున్న ఆయనకు ఏపీలో జరిగిన ఎన్నికల అక్రమాలు కనిపించలేదా? అని ప్రశ్నించడమే కాకుండా, ఏపీ వ్యవహారంపై ఆయన మాట్లాడకపోవడానికి చంద్రబాబుతో నిత్యం హాట్ లైన్ లో టచ్ లో ఉండటమే అందుకు కారణమని ఆరోపించారు.  జగన్ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వైసీపీయులను గాభరా పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ కు సొంత చెల్లి అయిన షర్మిల జగన్ వ్యాఖ్యలకు రియార్ట్ అయితే తమ పరిస్థితి, జగన్ పరిస్థితి ఏమిటని బెంబేలెత్తిపోతున్నారు.  జగన్ వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ మామూలుగా ఉండదనీ, ఆమె సంధించే ప్రశ్నలు, చేసే విమర్శలతో జగన్ కు దిమ్మతిరిగి బొమ్మకనబడటం ఖాయమన్న మాటలు వైసీపీ నుంచే వినవస్తున్నాయి.  ఇటు బీజేపీ ఎన్డీయే లో భాగంగా ఉంటూ మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో బాబు హాట్ లైన్ లో ఉన్నారు అంటూ పులివెందుల పంచాయితీలోకి రాహుల్ లాగడం ద్వారా జగన్ తన చెల్లి షర్మిలను రెచ్చగొట్టారని అంటున్నారు.   ఇక ఇప్పుడు షర్మిల నోరు విప్పితే..పులివెందుల ఓటమితో బీటలు మాత్రమే వారిన జగన్ కోట బద్దలైపోవడం ఖాయమని అంటున్నారు. పులివెందుల పంచాయతీలోకి రాహుల్ ను లాగి జగన్ కొరివితో తలగోక్కున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  

పులివెందులలో డిపాజిట్ కోల్పోయిన వైసీపీ

అంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను సంచలనం నమోదైంది. నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందుల కోట బద్దలైంది. జగన్ సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఘనంగా ఎగిరింది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది.  డిపాజిట్ కూడా కోల్పోయి కుదేలైంది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఈ నెల 12న ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. పులివెందుల చరిత్రలోనే తొలిసారిగా ప్రజాస్వామ్యయుతంగా జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఏకగ్రీవమే తప్ప ఎన్నిక ఎరుగని పులివెందుల ఓటర్లు ఈ పరిణామంలో ఓటువేసేందుకు ఉత్సాహంతో పోటెత్తారు. పోలింగ్ సమయంలో ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయడానికి వీలులేని పరిస్థితులు కల్పించేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలను పోలీసులు సమర్ధంగా అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరగేలా చూశారు. దీంతో ఎన్నిక సజావుగా సాగింది.  మొత్తం పోలైన ఓట్లలో తెలుగుదేశం అభ్యర్థికి  6716ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. జగన్ అడ్డాలో ఆయన పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. 

పులివెందులలో తెలుగుదేశం ఘన విజయం

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి ఘన విజయం సాధించారు. తెలుగుదేశం అభ్యర్థి  6 వేల 52 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పులివెందుల తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి సతీమణి  లతారెడ్డి ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.   ఓట్ల లెక్కింపు ప్రారంభమైన క్షణం నుంచీ తెలుగుదేశం కు ఇక్కడ స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. ఏ దశలోనూ వైసీపీ అభ్యర్థి పుంజుకునే పరిస్థితి కనిపించలేదు. తెలుగుదేశం అభ్యర్థికి  6735 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 683 ఓట్లు వచ్చాయి. పరాభవాన్ని, పరాజయాన్ని ముందుగానే అంచనా వేసిన వైసీపీ బహిష్కరణ  అంటూ పలాయనం చిత్తగించింది.  

శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. భారీగా వస్తున్న వరద నీటి కారణంగా అధికారులు జలాశయం 7 గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  గేట్ల ఎత్తి లక్షా 87 వేల 208 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ఇక ప్రాజెక్టుకు జూరాల నుంచి 70 వేల 802 క్యూసెక్కుల నీరు, సుంకేసుల నుంచి 42 వేల 669,  హంద్రీ నుంచి 3,750 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది.   శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.10 అడుగులుగా ఉంది.  పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199.2737 టీఎంసీలుగా నమోదైంది.  శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది.

వచ్చే ఎన్నికల్లో జగన్ పోటీ అనుమానమే అంటున్న పయ్యావుల

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలు లేవనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ కు శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అనుమానం వ్యక్తంచేశారు.  అది వాస్తవ రూపం దాల్చే అవకాశం బలంగా కనిపిస్తోంది.  రాష్ట్ర ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ మాటలు దీని బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై విలేకరుల సమావేశంలో చంద్రబాబు పై మాట్లాడిన జగన్మోహనరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన కేశవ్ వచ్చే ఎన్నికల్లో జగన్ పోటీకి అర్హత ఉంటుందా అనే బాంబు పేల్చారు.  ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం గతంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలపై పక్కా ఆధారాలతో కేసులు నమోదు చేస్తోంది. ప్రధానంగా లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ ను అరెస్ట్ చేయడానికి పెద్ద ప్లాన్ వేసినట్లుగా సమాచారం. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై విలేకరులతో మాట్లాడిన జగన్, చంద్రబాబుకు జీవితంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయనీ,  చనిపోయాక నరకానికి పోతారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేశవ్ చంద్రబాబు మరో పదేళ్లు రాజకీయాల్లో కీలకంగా, క్రియాశీలంగా  ఉంటారని చెప్పారు. ఇదే సమయంలో జగన్ వచ్చే ఎన్నికల్లో పోటీచేయడానికి అర్హత ఉంటుందా అంటూ వ్యాఖ్యానించారు. అంటే త్వరలోనే జగన్ ను అరెస్టు  చేసి శిక్ష పడేవిధంగా చర్యలు ఉంటాయని నర్మగర్భంగా చెప్పారు. దీంతో జగన్ పట్ల కూటమి ప్రభుత్వం పెద్ద ప్లాన్ తోనే ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతల  విషయంలో ప్రభుత్వం కేసుల నమోదుకు ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొందరు నేతలు అరెస్ట్ ల భయంతో కొంతకాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమను ఎప్పడు అరెస్టు చేస్తారోనని భయంతో వణికిపోతున్నారు.

మూసీ వరద ముప్పు.. అధికారులు అప్రమత్తం

ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీకి వరద పోటెత్తుతోంది.  అలాగే హిమాయత్ సాగర్ కు అన్ని గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  దీంతో మూసీ నది ప్రవాహం ఉధృతంగా ఉంది.  అధికారులు అప్రమత్తమై మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు.   మూసీనదికి ఆనుకొని ఉన్న కాలనీ వాసులందరూ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు చేశారు. లోతట్టు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.  వరద పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరో 24 గంటల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే స్కూళ్లకు హాఫ్ డే సెలవు ప్రకటించారు.  

దోమ, పాలేపల్లి రహదారిపై రాకపోకలు బంద్

భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలలో రోడ్డు చెరువులను తలపిస్తున్నాయి. వాగులూ, వంకలూ పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలు స్తంభించిపోయాయి. వికారాబాద్ జిల్లా దోమ మండలంలో   గొడుగనిపల్లి పెద్దవాగు ,బడెంపల్లి పెద్దవాగులు  , దోమ పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో దోమ, పాలేపల్లి రహదారిపై రాకపోకలు బంద్ అయ్యాయి. అలాగే పగిరి, మహబూబ్ నగర్ గడి సింగాపూర్ రామిరెడ్డిపల్లి గ్రామాలకు రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. రెండు వాగులూ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ రహదారులపై పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు.  

రీపోలింగే కాదు.. కౌంటింగూ బహిష్కరణే.. పాపం వైసీపీ

కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 12న జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ఆరంభమైంది. గురువారం (ఆగస్టు 14) ఉదయం ఎనిమిది గంటలకు కడపలోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ  పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.  జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, జేసీ అదితిసింగ్, డిఆర్వో విశ్వేశ్వర నాయుడు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ,  జెడ్పి సీఈవో ఓబులమ్మ, ఏఆర్వోలు రంగస్వామి, వెంకటపతి, ఆర్డీవోలు జాన్ ఇర్విన్, చిన్నయ్య లు పర్యవేక్షిస్తున్నారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పులివెందులకు  సంబంధించి 10 టేబుళ్లలో  ఒక రౌండ్,  ఒంటిమిట్టకు సంబంధించి పది టేబుళ్లలో మూడు  రౌండ్లు ప్రకారం ఓట్ల లెక్కింపు చేపట్టారు . ఒక్కో టేబుల్ కు ఒక్కో సూపర్వైజర్ ,ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లను ఏర్పాటు చేశారు.మొత్తం వంద మందితో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించగా ఇందులో 30 మంది,సూపర్వైజర్లు 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, ముగ్గురు స్టాటస్టికల్ అధికారులు ఉన్నారు  ఇలా ఉండగా వైసీపీ ఈ కౌంటింగ్ ను బహిష్కరించింది. వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఆదేశాల మేరకు కౌంటింగ్ ను బహిష్కరించినట్లు పార్టీ నేతలు చెప్పారు. కాగా పులివెందుల జడ్పీటీసీ లోని రెండు పోలింగ్ కేంద్రాలలో బుధవారం ( ఆగస్టు 13) జరిగిన రీపోలింగ్ ను కూడా వైసీపీ బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ బహిష్కరణలపై తెలుగుదేశం వైసీపీని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నది. ఓటమిని ముందే అంగీకరించేసి తప్పుకుంది పాపం అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో భక్తుల రర్దీ అధికాంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. గురువారం (ఆగస్టు 14) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 28 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. టైమ్ స్లాట్ భక్తులకు శ్రీవారి దర్శనానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతుండగా,  300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతోంది.  ఇక బుధవారం (ఆగస్టు 13) శ్రీవారిని మొత్తం 75 వేల 859 మంది దర్శించుకున్నారు. వారిలో  33 వేల 344 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 31 లక్షల రూపాయలు వచ్చింది. 

కృష్ణా నదికి వరద.. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

ఎగువ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా  కురుస్తున్నవర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది.   విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. దీంతో  ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 3,63,438 క్యూసెక్కుల నీటిని దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.     వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో  కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ   హెచ్చరికలు జారీ చేసింది. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  ఇలా ఉండగా శ్రీశైలం జలాశయానికి కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం పోటెత్తున్న కారణంగా  ఏడు గేట్లు   ఎత్తి  నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది.  

కొత్త పేట ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం

కొత్తపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం నాయకుడు బండారు సత్యానందరావు కు తృటిలో పెను ప్రమాదం తప్పింది.  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో బుధవారం (ఆగస్టు 13) ఆలమూరులో జరిగిన రైతు సంబరాలకు విచ్చేసిన ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది.   వేలాదిగా తరలివచ్చిన రైతుల మధ్యన ఆయన ఎడ్ల బండి ఎక్కి నినాదాలు చేస్తున్నారు. సరిగ్గా అదే  సమయంలో ఎడ్లబండికి బండికి కట్టిన బెలూన్లు పేలాయి. దీంతో ఎద్దులు ఒక్కసారిగా బెదిరి కదిలాయి. దీంతో ఆ బండి మీద ఉన్న ఎమ్మెల్యే సహా  రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ,  కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు తదితరులు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో చిలువూరి సతీష్ కు కాలు ఫ్యాక్చర్ అయ్యింది. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యే కూడా స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం తరువాత కూడా ఆయన  రైతు సంబరాల్లో పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.  రాగా ప్రమాద వార్త తెలుసుకున్న మంత్రులు నారా లోకేష్, అచ్చెంనాయుడు ప్రమాద వార్త తెలిసిన వెంటనే విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చంనాయుడు  ఫోన్లో ఎమ్మెల్యే బండారును పరామర్శించారు.

మధ్యాహ్నానికల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ బైపోల్ ఫలితాలు

కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు గురువారం (ఆగస్టు 14) వెలువడనున్నాయి. ఈ ఉప ఎన్నికలను తెలుగుదేశం, వైసీపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సార్వత్రిక ఎన్నికలకు మించిన ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రచారం, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఓ రేంజ్ లో సాగాయి. ముఖ్యంగా పిలివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ సందర్భంగా యుద్ధవాతావరణం కనిపించింది. అయితే పోలింగ్ రోజునే వైసీపీ చేతులెత్తేసి ఓటమిని అంగీకరించేశామంటూ పరోక్షంగా అంగీకరించేసిందని పరిశీలకులు ఆ పార్టీ నేతల ప్రకటనలు, ఆరోపణలను ఉదహరిస్తూ విశ్లేషిస్తున్నారు. ఆఖరికి వైసీపీ అధినేత జగన్ కూడా పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేయడంతోనే.. ఆ పార్టీ మానసికంగా ఓటమికి సిద్ధమైపోయిందని అవగతమైపోయందని అంటున్నారు. ఏది ఏమైనా గురువారం (ఆగస్టు 14) ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నానికి ఫలితం వెలువడుతుంది. ఈ నేపథ్యంలో  పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీస్థానాలలో గెలిచేదెవరు? ఓడేదెవరు? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా కేంద్రమైన కడపలో అన్ని ఏర్పాట్లూ చేశారు.   కడపలోని  పాలిటెక్నిక్ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరగనుంది.  పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒకే రౌండ్ లో ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుంది. పులివెందులలో మొత్తం పది వేల 601 ఓట్లకు గాను 8 వేల 103 ఓట్లు పోలయ్యాయి.  ఇక ఒంటిమిట్ట విషయానికి వస్తే.. ఈ జడ్పీటీసీ స్థానం ఓట్ల లెక్కింపునకు కూడా పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఒంటిమిట్టలో మొత్తం 24 వేల 606 ఓట్లు ఉండగా, పోలైనవి 20 వేల 681. 

తిరుమల గెస్ట్‌హౌస్‌ పేరిట ఫేక్ వెబ్‌సైట్లు..వాటిని నమ్మొద్దు : పోలీసులు

  తిరుమలలో  శ్రీవారి దర్శనం, వసతుల పేరిట ఇంటర్నెట్‌లో నకిలీ వెబ్‌సైట్లు పెరుగుతున్నాయి. వాటిని నివారించడానికి తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్‌రాజు ఆదేశాల మేరకు తిరుమల పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని.. ఇప్పటి వరకు 28 నకిలీ వెబ్‌సైట్లను తొలగించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా శ్రీవారి దర్శనం, తిరుమలలో వసతులు కల్పిస్తామంటూ ఇంటర్నెట్‌లో 30కిపైగా నకిలీ వెబ్‌సైట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని సెర్చ్‌ ఇంజిన్‌ నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ఇప్పటి వరకు 28 నకిలీ వెబ్‌సైట్లను తొలగించినట్లు పేర్కొన్నారు. భక్తులు ఎవరైనా తిరుమలలో వసతుల కోసం ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసినప్పుడు.. సప్తగిరి గెస్ట్‌హౌస్‌, నందకం గెస్ట్‌హౌస్‌, పద్మావతి గెస్ట్‌హౌస్‌.. ఇలా కొన్ని గెస్ట్‌హౌస్‌ల పేరుతో వెబ్‌సైట్లు కనిపిస్తే అవి నకిలీవిగా గుర్తించాలని పోలీసులు తెలిపారు.  తిరుమల శ్రీవారి దర్శనం, వసతులు, సేవల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tirumala.orgను మాత్రమే సందర్శించాలని చెప్పారు. వాట్సప్‌ కాల్‌, క్యూఆర్‌ కోడ్‌ పంపించి పేమెంట్‌ చేయాలని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దన్నారు. ఇలాంటివి అనుమానాస్పదంగా కనిపిస్తే దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌/100/టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004254141ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.  

భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

  రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో  నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, సీఎస్ విజయానంద్ తదితరులు హాజరయ్యారు. విపత్తు నిర్వహణ, వ్యవసాయం, జలవనరుల శాఖ  ఉన్నతాధికారులు కూడా ఈ అత్యవసర సమీక్షలో పాల్గొన్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రాగల రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తత చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.  కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో వాగులు వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువన ఉన్న ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం కృష్ణా నదిలో రేపటికల్లా 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి 3.09 లక్షల క్యూసెక్కుల నీరు 35 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. కాలువలకు 5 వేల క్యూసెక్కుల మేర నీరు విడిచిపెట్టినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు ఎగువన నాగార్జునసాగర్, పులిచింతల గేట్లను కూడా ఎత్తినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తక్షణం తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.  వరద నీటిని సద్వినియోగం చేయండి ఎగువ నుంచి వస్తున్న నీటిని  సద్వినియోగం చేసుకునేలా రోజుకు నాలుగు టీఎంసీల చొప్పున తరలించి సోమశిల, కండలేరు ప్రాజెక్టులను నింపాలని సీఎం ఆదేశించారు. వరద నీటిని వృధాగా సముద్రంలోకి పోనీయకుండా సద్వినియోగం చేసుకునేలా సమర్ధ నీటి నిర్వహణ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మైలవరం సహా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం బుడమేరు, వెలగలేరులకు పెద్ద ఎత్తున వస్తోందని.. ఈ నీరు కృష్ణా నదిలోకి డిశ్చార్జి చేస్తున్నట్టు తెలిపారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు వివరించారు. వరద నిర్వహణా పనుల్లో భాగంగా రూ.40 కోట్లతో బుడమేరు- వెలగలేరు యూటీ నిర్మాణాన్ని చేపట్టేందుకు ముఖ్యమంత్రి అనుమతి మంజూరు చేశారు.  గండ్లు పడకుండా గట్లు పటిష్ట పర్చాలి మరోవైపు భారీవర్షం కారణంగా కొండవీటి వాగు, పాల వాగులకు వస్తున్న నీటిని కృష్ణా నదిలోకి నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తి పోస్తున్నామని  అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వర్షకాల సీజన్ లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలువల్లో నీటి ప్రవాహాలు సక్రమంగా వెళ్లేందుకు వీలుగా గుర్రపు డెక్క, తూడును తొలగించాలని ముఖ్యమంత్రి జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.  అలాగే కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా గట్లను పటిష్టం చేయాలని సీఎం సూచించారు. జిల్లాల్లో వర్షాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండి రైతులకు తక్షణ సమాచారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో భూగర్భ జలాలను రీఛార్జి చేసేలా నిర్మాణాలను చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులు ఆయా ట్రెంచ్ లను ఎక్కడెక్కడ చేపట్టాలో ప్రణాళిక చేసుకోవాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ట్రెంచ్ లను తవ్వేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

సబితా ఇంద్రారెడ్డికి బిగ్ షాక్..ఎందుకంటే?

  మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి  సీబీఐ అధికారులు షాక్ ఇచ్చారు.. ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు  నిర్దోషిగా ప్రకటించింది. సిబిఐ కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ.. సీబీఐ అధికారులు హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది..  సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఆమెపై విచారణకు ఆదేశించాలని హైకోర్టుని కోరింది.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది..ఓఎంసీ కేసులో సబితను నిర్దోషిగా ప్రకటించడాన్ని   హైకోర్టు లో సీబీఐ సవాల్ చేసింది.. సబితతోపాటు మాజీ ఐఎస్ఐ అధికారి కృపానందంపైనా కూడా సీబీఐ పిటిషన్‌ వేసింది.  సిబిఐ వేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.. కేసు విచారణ వాయిదా వేసింది..ఓఎంసీ కేసులో సబిత, కృపానందంలను గతంలో నిర్దోషులు గా ప్రకటించిన సీబీఐ కోర్టు..గాలి జనార్దన్‌రెడ్డి సహా ఇతర నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ సీబీఐ కోర్టు గతంలోనే తీర్పించింది..  ఇప్పటికే ఐఏఎస్ శ్రీలక్ష్మి పాత్రపై మళ్లీ విచారణ జరపాలని గతంలో హైకోర్టు ఆదేశం జారీ చేసింది.. ఇప్పుడు సబిత, కృపానందం ల కేసు పైన హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.  

స్నాతకోత్సవంలో తమిళనాడు గవర్నర్‌కు అవమానం

  తమిళనాడులోని ఎంఎస్‌యూ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్ ఆర్.ఎన్. రవి చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టా స్వీకరించేందుకు ఓ విద్యార్థిని నిరాకరించారు. గవర్నర్‌ను దాటుకుని నేరుగా వైస్-ఛాన్సలర్ వద్దకు వెళ్లి ఆమె డిగ్రీని స్వీకరించారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది.  తిరునల్వేలిలోని మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయం 32వ స్నాతకోత్సవం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి 650 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వేదికపై ఉన్న గవర్నర్ ఆర్.ఎన్. రవి నుంచి విద్యార్థులు ఒక్కొక్కరిగా పట్టాలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో నాగర్‌కోయిల్‌కు చెందిన పరిశోధక విద్యార్థిని జీన్ జోసెఫ్ వంతు వచ్చింది. ఆమె వేదికపైకి వెళ్లి గవర్నర్‌ను పట్టించుకోకుండా దాటి వెళ్లిపోయారు.  నేరుగా వైస్-ఛాన్సలర్ ఎన్. చంద్రశేఖర్ వద్దకు వెళ్లి ఆయన చేతుల మీదుగా తన పీహెచ్‌డీ పట్టాను స్వీకరించారు.తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి మధ్య పెండింగ్‌ బిల్లులతోపాటు పలు అంశాలపై విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే నాగర్‌కోయిల్ డిప్యూటీ సెక్రటరీ ఎం రాజన్ భార్య అయిన పీహెచ్డీ విద్యార్థిని జీన్ జోసెఫ్ ఇలా వ్యవహరించింది. గవర్నర్‌ చేతుల మీదుగా డిగ్రీ పట్టా అందుకునేందుకు ఆమె తిరస్కరించింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పలు విమానాలు దారి మళ్లింపు

  శంషాబాద్ ఎయిర్‌ఫోర్టులో పలు విమానలు అధికారులు దారి మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఎనిమిది విమానాలను దారి మళ్లించినట్లు తెలిపారు. హైదరాబాద్‌కు రావాల్సిన విమానాలను విజయవాడ, బెంగళూరు, తిరుపతికి మళ్లించినట్లు పేర్కొన్నారు. విజయవాడకు ఐదుకు, బెంగళూరుకు మూడు, తిరుపతికి ఒక విమానాన్ని మళ్లించినట్లు తెలిపారు.  హైదరాబాద్‌ నుంచి బయలుదేరాల్సిన విమానాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ వ్యాప్తం పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నగరాన్ని మొత్తం కారు మేఘాలు కమ్మేశాయి. ఈ క్రమంలోనే విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే.  

ముగిసిన మంచు లక్ష్మి ఈడీ విచారణ

  దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్ కేసులో ఈడి విచారణ కొనసాగుతున్నది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసిన ప్రముఖులందరికీ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండ , ప్రకాష్ రాజ్ లను ఈడి విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈరోజు సినీనటి మంచు లక్ష్మి ని కూడా ఈడి విచారణ చేస్తు న్నారు. మంచు లక్ష్మి గేమింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లుగా అధికా రులు గుర్తించారు. ఈజీగా డబ్బు సంపాదించుకో వచ్చు అంటూ సోషల్ మీడియాలో మంచు లక్ష్మి ప్రమో షన్లు చేసినట్టుగా గుర్తించిన ఈ డి ఆమెకు నోటీసులు జారీ చేశారు.  ఈ క్రమంలోనే మంచు లక్ష్మి ఈరోజు ఉదయం 11:30 గంటల ప్రాంతం లో ఈడి కార్యాల యానికి చేరుకు న్నారు. ఇంకా విచారణ కొనసా గుతున్నది. మంచు లక్ష్మి yolo 247 బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసిన ట్లుగా ఆరోపణలు నేపథ్యంలో అధికారులు వాటి ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీల వివ రాలు సేకరిస్తు న్నారు.. మంచు లక్ష్మిపై పలు ప్రశ్నల వర్షం కురిపిస్తు న్నారు. ఇదిలా ఉండగా మరోవైపు దేశ వ్యాప్తంగా ఉన్న పలు బెట్టింగ్ యాప్ సంస్థల కార్యాల యాల్లో ఈడి సోదాలు చేసింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, జైపూర్, మదురై తదితర 15 ప్రాంతాల్లో సోదాలు చేసి....అంతర్జాతీయ స్పోర్ట్స్, బెట్టింగ్ సంస్థ పరిమ్యాచ్ పేరుట అక్రమంగా బెట్టింగ్ నిర్వహిస్తు న్నట్లుగా ఈడి గుర్తించింది.  దాదాపు 2000 కోట్ల లావాదేవీలు చోటు చేసుకున్నట్లుగా ఈడి ప్రాథమిక దర్యాప్తులో వెల్ల డైంది.దీంతో ఈడి దేశవ్యాప్తంగా బెట్టింగ్ ఆప్ కేసులో పలువురిని  విచారణ చేస్తుంది..  ఈ క్రమంలోనే 1XBET యాప్ ప్రమోట్ చేసినం దుకు క్రికెటర్ సురేష్ రైనాను అధికారులు ఢిల్లీలో విచారిస్తు న్నారు. ఇప్పటికీ రణధీర కపూర్, కపిల్ వర్మ, హుమా ఖురేషి, హీనా ఖాన్ లతోపాటు పలు వురు సెలబ్రిటీలకు సమన్లు జారీ చేసింది. అధికారులు క్రికెటర్ యువరాజ్ సింగ్,  హర్భజన్ సింగ్ , సినీ నటుడు సోను సూద్ లను త్వరలో విచారించనున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రకటనలో అనుమతించినందుకు ఫేస్బుక్ (మెటా) గూగుల్ సంస్థలకు కూడా ఈడి సమన్లు జారీ చేసింది.