పులివెందులలో వైపీపీది బలం కాదు వాపేనా?

కంచుకోట అనుకున్న పులివెందుల పేకమేడ అని తేలిపోయిందా? వైసీపీ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఫలితాల వెల్లడికి ముందు.. కాదు కాదు పోలింగ్ కు ముందే కాడి వదిలేసిందా? అడలేక మద్దెలు ఓడు అన్న చందంగా పులివెందులలో తమ పరిస్థితికి పోలీసులే కారణం అంటోందా? అంటే వైసీపీ నేతల వ్యాఖ్యలు, హెచ్చరికలు చూస్తుంటే ఔనన్న సమాధానమే వస్తోంది.   పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో  పోలీసులు వ్యవహరించిన తీరుపై వైసీపీ నేత, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు ఇష్టారీతిగా నోరు పారేసుకున్నారు. మూడు దశాబ్బాలకు పైగా జడ్పీటీ స్థానానికి ఎన్నిక అంటే ఏమిటో తెలియని పులివెందుల జనాలకు ఇప్పుడు తోలిసారిగా ఓటు వేస్తున్నామన్న ఆనందం కలిగింది. అదే సమయంలో పటిష్ట బందోబస్తుమధ్య ఎన్నికల నిర్వహణతో వైసీపీయులకు రిగ్గింగ్ కు అవకాశం లేకుండా పోయింది. ఇదే వారి ఆగ్రహానికి కారణమైంది. మా అడ్డాలో ప్రజాస్వామ్యం ఏమిటి? అంటూ బందోబస్తు ఏర్పాట్లు చేసిన పోలీసులపై నిప్పులు చెరుగుతున్నారు. మా పార్టీ అధికారంలోకి వచ్చాకీ మీ ఉద్యోగాలు తీసేస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు.  మళ్లీ మేం అధికారంలోకి వస్తాం.. అప్పుడు మీ ఉద్యోగాలు ఊడపీకుతాం..అంటూ  ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. అయితే వాస్తవంలో పోలీసులు తెలుగుదేశం, వైసీపీ నేతల పట్ల సమంగానే వ్యవహరించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరు పార్టీలకు చెందిన నేతలను ముందుగానే హౌస్ అరెస్టు చేశారు. అయినా వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వందల మందితో ప్రదర్శనలు నిర్వహించారు. పోలింగ్ బూతులలోకి చొచ్చుకుపోయే ప్రయత్నాలు చేశారు. అయితే వాటన్నిటినీ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్యోగా లుండవు జాగ్రత్త అంటూ హెచ్చరికలకు దిగుతున్నారు. మొత్తం మీద పులివెందులలో వైసీపీది బలం కాదు, వాపు మాత్రమేనని పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక రుజువు చేసిందని పరిశీలకులు అంటున్నారు.  

రీపోలింగ్ ను బహిష్కరించిన వైసీపీ

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ లో అవకతవకలు జరిగాయంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి గగ్గొలు పెట్టారు. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఫిర్యాదును పరిగణనలోనికి తీసుకున్న ఎన్నికల సంఘం ఆయన ఆరోపించిన రెండు పోలింగ్ కేంద్రాలలోనూ ఈ బుధవారం ( ఆగస్టు 13) రీపోలింగ్ కు ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు రీపోలింగ్ ప్రారంభమైంది. అయితే వైసీపీ మాత్రం ఈ రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి మూడు దశాబ్దాలపై పైగా పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరిగిన చరిత్రలేదు. ఎప్పుడూ ఇక్కడ ఏకగ్రీవమే. తొలి సారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుగుతోంది. బరిలో 11 మంది అభ్యర్థులు నిలిచారు. ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు వచ్చారు. అయితే వైసీపీ మాత్రం పోలింగ్ ప్రారంభానికి ముందే చేతులెత్తేసి నియోజకవర్గంలో గలాభా సృష్టించి, పోలింగ్ ప్రక్రియను అడ్డుకోవడానికి శతధా ప్రయత్నించింది. అయితే పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో వైసీపీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. సరే అదలా ఉంచితే.. వైసీపీ ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు రెండు కేంద్రాలలో రీపోలింగ్ జరుగుతుంటే.. ఆ రీపోలింగ్ ను కూడా బహిష్కరిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుని ఓటమిని ముందే అంగీకరించేసింది. ఇలా ఉండగా రీపోలింగ్ జరుగుతున్న కేంద్రాలలో భారీ బందోబస్తు నడుమ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నాది.  

పులివెందులలో నేడు రీ-పోలింగ్

పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మంగళవారం (ఆగస్టు 12)న జరిగిన ఉప ఎన్నికలో రెండు పోలింగ్ కేంద్రాలలో అక్రమాలు, రిగ్గింగ్ జరిగాయన్న ఆరోపణలతో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఆ రెండు పోలింగ్ కేంద్రాలలో బుధవారం (ఆగస్టు 13) రీపోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటలకు పులివెందులలోని రెండు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకూ సాగుతుంది. రీపోలింగ్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు గురువారం (ఆగస్టు 14) కడపలో జరగనుంది. 

కన్నకొడుకుతో పాటే అతడికి ఇష్టమైన బైక్ సమాధి

ఈ బాధ మరే పేరెంట్స్ కు రావద్దు.. కంటికి రెప్పలా పెంచుకున్న పిల్లలు కళ్ల ముందే చనిపోతే, తట్టుకోవడం ఏ తల్లిదండ్రులకూ సాధ్యం కాదు. వారి బాధకు అంతే ఉండదు.ఆ కడుపుకోత భరించడం ఎంతటి వారికైనా కష్టమే.  తాజాగా కన్నకొడుకును రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన తండ్రి.. తన కుమారుడికి ఎంతో ఇష్టమైన బైక్ ను కూడా అతడితో పాటే సమాధి చేయడం కంటనీరు తెప్పించింది. వివరాల్లోకి వెడితే.. గుజరాత్ జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 ఏళ్ల క్రిష్ పర్మార్ మరణించాడు. ఇటీవలే 12 స్టాండర్డ్ పాస్ అయిన ఆ యువకుడు బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) ప్రోగ్రామ్‌లో చేరాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే తను జాయిన్ కావాలనుకున్న కాలేజీకి వెళ్లాడు. వెళ్లి తన సర్టిఫికేట్స్ చూపించాడు. చేరాలనుకున్న కోర్సు గురించి వివరాలు తెలుసుకున్నాడు. అన్ని ఓకే అనుకున్నాక ఆడ్మిషన్ తీసుకుని జాయిన్ అయ్యాడు.  హ్యాపీగా తన బైక్ మీద ఇంటికి బయల్దేరాడు. కాలేజీ నుంచి కొద్ది దూరంలో ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. 12 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే కన్నుమూశాడు.  కన్నకొడుకు మరణించడంతో అతని తల్లిదండ్రుల దుఖానికి అంతే లేకుండా పోయింది.   చివరకు తమ కొడుకు మృతదేహాకి అంత్యక్రియలు చేసే సమయంలో అతడికి ఎంతో ఇష్టమైన అతడి బైక్ ను కూడా అతడితోనే సమాధి చేశారు.  క్రిష్ కు మోటార్ సైకిల్ అంటే ఎంతో ఇష్టం.   కారు ఉన్నప్పటికీ, అతడు బైక్ మీదే ప్రయాణించే వాడు. ఈ నేపథ్యంలో అతడికి ఎంతో ఇష్టమైన బైక్ ను కూడా అతడితో పాటే సమాధి చేశారు.   ఈ దృశ్యం   వారందరినీ ఎంతో కదలించివేసింది. 

పాఠశాలలకు సెలవు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బుధవారం (ఆగస్టు 13)  నుంచి మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో  సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులకు తీసుకోవలసిన చర్యలపై సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వోద్యోగుల సెలవులను రద్దు చేశారు. కాగా భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.  కుండపోత వర్షాల సూచనతో ముందు జాగ్రత్తగా స్కూళ్లకు హాలిడేస్ ప్రకటించారు. హనుమకొండ, వరంగల్, జనగామ, యదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు 13, 14 తేదీల్లో సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. ఇక హైదరాబాద్ నగరంలో రేవు, ఎల్లుండి ఒంటిపూట బడులు ఉంటాయని పేర్కొంది. 

చికాగోలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థిని మృతి

చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన విద్యార్థిని మరణించింది.  మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం  దుందిగల్  బాలాజీ నగర్ లో నివాసం ఉంటున్న శ్రీనురావు పెద్ద కుమార్తె 23 ఏళ్ల శ్రీజ వర్మ  ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళింది. చికాగోలో ఉంటూ పీజీ చేస్తున్నది.  సోమవారం (ఆగస్టు 11)  రాత్రి సమయంలో డిన్నర్ చేయడం కోసం అపార్ట్ మెంట్ పక్కన ఉన్న రెస్టారెంట్ కు నడుచుకుంటూ వెడుతున్న శ్రీజవర్మను వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్ ఢీకొంది. ఈ ఘటనలో శ్రీజ అక్కడికక్కడే మరణించింది. అయితే యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ ట్రక్ ను ఆపకుండా వెళ్లిపోయాడు. సమాచారం అందుకుని సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తె  మరణవార్తతో శ్రీజ తల్లిదండ్రులు దుఖసాగరంలో మునిగిపోయారు.  

గట్టు వామనరావు దంపతుల హత్య కేసు సీబీఐకి.. సుప్రీం ఆదేశం

తెలంగాణకు చెందిన ప్రముఖ న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్య కేసును సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగిస్తూ మంగళవారం (ఆగస్టు 12) ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ దర్యాప్తు నివేదికను తనకే అందజేయాలని కూడా సుప్రీం కోర్టు విస్పష్టంగా ఆదేశించింది ఈ హత్య కేసులో దోషులు ఎవరినీ వదిలిపెట్టరాదని, రాజకీయ ఒత్తిళ్లు,  పలుకుబడులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు సుప్రీం కోర్టు సీబీఐకి విస్పష్ట ఆదేశాలిచ్చింది.  ఇక గట్టువామనరావు దంపతుల హత్య 2021 ఫిబ్రవరిలో జరిగింది. దంపతులిద్దరూ హైకోర్టు న్యాయవాదులు. పెద్దపల్లికి చెందిన వీరు హైదరాబాద్ లో స్థిరపడ్డారు.  భూములకు సంబంధించిన వివాదంపై ఓ కేసులో ప్రత్యర్థులకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో వారు తమపై పగబట్టారని వామనరావు తన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నారు.   పుట్ట మధు సోదరులు తమపై కత్తి కట్టారని, వారే తమ హత్యకు కారకులనీ వామనరావు ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు.  2021 ఫిబ్రవరిలో పెద్దపల్లి జిల్లాకు వెళ్లి వస్తున్న సమయంలో కల్వచర్ల వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును కొందరు అడ్డుకుని, నడిరోడ్డుపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అప్పట్లో హైకోర్టు న్యాయవాదులు వారం రోజుల పాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన అప్పటి ప్రభుత్వం విచారణను పూర్తి చేసింది. అయితే, అసలు నిందితులను తప్పించారని ఆరోపిస్తూ వామనరావు తండ్రి కిషన్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆయన సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటి షన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు,  తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వ అభిప్రాయం కోరింది. గట్టు వామనరావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రేవంత్ సర్కార్ సుప్రీంకు తెలిపింది.  అలాగే వామనరావు మరణవాంగ్మూలం సరైనదేనని  ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక స్పష్టం చేయడంతో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.  

మూసీ ప్రక్షాళనకు శ్రీకారం.. రియాల్టీలోకి రానున్న రేవంత్ అభీష్టం

వీకెండ్ లో మూసీ క్లీన్ వాటర్ లో బోటింగ్ కు వెళ్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. చుట్టూ గ్రీనరీ.. ఐకానిక్ టవర్లు.. సరికొత్తగా బ్రిడ్జిలు.. మధ్యలో బోటింగ్.. మన హైదరాబాద్ లో ఈ సీన్ ఊహించుకోవడానికే అద్భుతంగా ఉంది కదా.. మరి ఇది నిజమైతే ఎలా ఉంటుంది? మూసీ మురుగు, దుర్గంధం, ఇంకో వైపు పొల్యూషన్ ఇలా రకరకాల సమస్యల్లో ఉండే సగటు హైదరాబాదీకి ఫుల్ రిలాక్సేషన్ ఇవ్వడం పక్కా. అయితే అసాధ్యం అనుకున్న ఈ పనిని సుసాధ్యం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఇన్నాళ్లూ పేపర్ వర్క్ గా జరిగింది.. ఇప్పుడు రియాల్టీ కాబోతోంది.  హైదరాబాద్ సిటీ నడి మధ్యలోనుంచి మూసీ వెళ్తుంది. గండిపేట్ వరకు ఓకే.. ఆ తర్వాతే మూసీ దుర్గంధభరితంగా మారుతుంది. సిటీలోకి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు మొత్తం 55 కిలోమీటర్లు మూసీ రివర్ ఉంటుంది. ఇదంతా బాగు పడితే ఒక అద్భుతమే అవుతుంది. భవిష్యత్ తరాలకు చాలా మేలు జరుగుతుంది. మూసీ నది ఓ సబర్మతిగా మారాలి. లండన్ థేమ్స్ మాదిరి వెలిగిపోవాలి. ఇలా జరగాలంటే మాటలు కాదు. పెద్ద ఎత్తున నిధులూ అవసరమే. వచ్చే నిధులతో మూసీకి అటు ఇటు బ్యూటిఫికేషన్ చేసి వదిలేస్తే సరిపోదు. అందులో ప్రవహించే నీళ్లు కూడా అద్భుతంగా ఉండాలి. అదే ఇప్పుడు వాస్తవంలోకి రాబోతోంది. ఇన్నాళ్లూ జరిగిన పేపర్ వర్క్ ముగిసింది. ఇప్పుడు అసలు వర్క్ మొదలు కాబోతోంది. మూసీ రివర్‌ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కోసం ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ 4,100 కోట్ల రూపాయల రుణాన్ని అందించబోతోంది. ఈ రుణంతో హైదరాబాద్ సిటీలో 55 కిలోమీటర్లు ప్రవహించే మూసీ నది పునరుజ్జీవనానికి ఉపయోగపడబోతోంది. ఈ ప్రాజెక్టు ఉద్దేశం సిటీని వరదలు లేని నగరంగా మార్చడం, మూసీ ఒడ్డున పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడం, నీటి కాలుష్యాన్ని తగ్గించడం వంటివి ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ లో 2,050 కోట్లను ఏడీబీ ఇవ్వబోతోంది. ఇక రెండో విడతలో మిగిలిన 2,050 కోట్లు ఇస్తారు. వీటితో నది శుద్ధి, కొత్త సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణం, ఆక్రమణల తొలగింపు, రివర్‌ఫ్రంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్  చేపడతారు.  లండన్ థేమ్స్ మాదిరి, అహ్మదాబాద్ సబర్మతి మాదిరి హైదరాబాద్ మూసీని ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడో సంకల్పించుకున్నారు. లండన్, సౌత్ కొరియా, జపాన్ సహా చాలా చోట్ల పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి నదులు ఎలా పునరుజ్జీవం అయ్యాయో గుర్తించారు. మన అవసరాలకు తగ్గట్లు మూసీని డెవలప్ చేయాలని నిర్ణయించారు. నిజానికి మూసీని బాగు చేయాలని గతంలో ఆలోచనలు చేసినా అవేవీ వర్కవుట్ కాలేదు. కేవలం అక్కడక్కడ బ్యూటిఫికేషన్ కు మాత్రమే పరిమితం అయ్యాయి.  నదిలో నీళ్లు బాగుండాలి. అంటే పరిశ్రమలు, గృహ వ్యర్థాలు అందులో కలవకూడదు. అప్పుడే మూసీ నీరు స్వచ్ఛంగా ఉంటుంది.  సో రేవంత్ రెడ్డి  అక్కడి నుంచే పనులు షురూ చేయబోతున్నారు.  మూసీ నదిలో కలిసే మురుగునీటిని శుద్ధి చేయడానికి 39 కొత్త సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మిస్తారు. నది ఒడ్డున రైతు మార్కెట్‌లు, నైట్ మార్కెట్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్లు, బోటింగ్ సౌకర్యాలు, రిలాక్సేషన్ జోన్లు ఏర్పాటు చేయడం వంటివి ఉంటాయి. నది నీటిని శుద్ధి చేసి రకరకాల అవసరాల కోసం వాడేలా ప్లాన్ చేస్తున్నారు. మొదటి దశలో ప్రాజెక్టు బాపూ ఘాట్ నుంచి  21 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి చేస్తారు. సింగపూర్‌కు చెందిన మీన్‌హార్డ్ గ్రూప్‌ను డీపీఆర్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం  నియమించింది.  మూసీ పునరుజ్జీవం పట్టాలెక్కాలంటే  రాత్రికి రాత్రి అయ్యే పని కాదు. అందుకే సీఎం రేవంత్ మొదటగా ఏమేం చేస్తే వర్కవుట్ అవుతుందో అవన్నీ అమలు చేశారు. మొదట నదీ గర్భంలో ఉన్న వారిని ఇమీడియట్ గా ఖాళీ చేయించారు. వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించారు. సామాన్లు తరలించేందుకు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేశారు. హైడ్రాతో చాదర్‌ఘాట్ బ్రిడ్జ్ నుండి ఉస్మానియా హాస్పిటల్ దాకా ఆక్రమణలను తొలగించారు. మొదటి దశలో 13ఎస్టీపీలను నిర్మించడం ద్వారా రోజుకు 970 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేస్తారు. రెండో దశలో మిగిలిన 34 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి కొనసాగుతుంది. ఇందులో పర్యాటక సౌకర్యాలు, వాణిజ్య కేంద్రాలు ఏర్పాటు అవుతాయి.  సీఎం రేవంత్ రెడ్డి హెచ్‌ఎండీ అధికారులతో చేసిన రివ్యూలో ఇటీవలే కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ వరదలకు విముక్తి జరగాలంటే అది మూసీ పునరుజ్జీవంతోనే అని క్లారిఫికేషన్ ఇచ్చారు. మూసీ అభివృద్ధికి ఐకానిక్ డిజైన్‌ను ఎంచుకోనున్నారు. రివర్‌ఫ్రంట్ అభివృద్ధి చేసే విషయంలో సబర్మతి మోడల్‌ను ఫాలో కావాలన్నారు. మూసీ పరివాహకంలో ఉన్న వారికి సరైన పరిహారం అందించి.. మొత్తం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రలక్ష్యంగా పెట్టుకున్నారు. నిజంగా అది సాకారమైతే హైదరాబాద్ వాసులకు పండుగే.

దర్శకుడు ఆర్జీవీ సెల్ ఫోన్ స్వాధీనం

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఆయన సినిమాలు సంచలనం. అద్భుత టేకింగ్ తో తనదైన మేకింగ్ స్టైల్ తో అలనాడు సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. అటువంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడూ సంచలనాలు సృష్టిస్తున్నారు. అయితే సినిమాల ద్వారా కాదు.. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, పోస్టుల ద్వారా. అటువంటి పోస్టులకు సంబంధించి ఇప్పుడు కేసులు, విచారణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వ్యూహం' సినిమా విడుదల సమయంలో  చంద్రబాబు, పవన్, నారా లోకేశ్ మార్ఫింగ్ ఫొటోలు షేర్ చేసి, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత నవంబర్ లో మద్దిపాడు పీఎస్ లో  రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ కేసులో అరెస్టు కాకుండా రామ్ గోపాల్ వర్మకు బెయిలు అయితే మంజూరైంది కానీ, పోలీసు విచా రణకు వారు పిలిచినప్పుడల్లా వెళ్లాలన్న షరతు విధిస్తూ కోర్టు బెయిలు మంజూరు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటికే ఒక సారి పోలీసు విచారణకు హాజరైన రామ్ గోపాల్ వర్మ.. పోలీసుల నోటీసుల మేరకు మంగళవారం (ఆగస్టు 12) మరోసారి ప్రకాశం జిల్లా ఓ:గోలు తాలూకా పోలీసు స్టేషన్ లో హాజరయ్యారు.  ఈ సందర్భంగా పోలీసులు రామ్ గోపాల్ వర్మ పోన్ ను సీజ్ చేశారు. వాస్తవానికి గతంలో ఆయన విచారణకు హాజరైన సందర్భంలోనే ఆయన పోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకోవలసింది. అయితే అప్పట్లో ఆయన విచారణకు ఫోన్ తీసుకురాకపోవడం వల్ల పోలీసులు ఆయన ఫోన్ ను సీజ్ చేయలేకపోయారు. అయితే ఈ సారి ఫోన్ తీసుకురావాలని నోటీసులలోనే పేర్కొన్న పోలీసులు ఆయన నుంి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అందులోని సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఉండగా జగన్  హయాంలో రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్, పవన్ సహా తెలుగుదేశం, జనసేన నేతలపై అనుచిత వ్యాఖ్యలు, మార్ఫింగ్ పొటోలతో నిత్యం వార్తలలో నిలిచారు. ఇప్పుడు ఆ పోస్టింగులకు సంబంధించిన కేసులలోనే పోలీసు విచారణను ఎదుర్కొంటున్నారు.   

చంద్రబాబు సర్కారు మరో రికార్డు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు మరో రికార్డు సృష్టించింది. సత్వర న్యాయం, పటిష్టమైన పోలీసింగ్‌లో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. ప్రజలకు న్యాయ సహాయం అందించటంలో, శాంతిభద్రతల్లో ఏపీ టాప్‌లో ఉందని ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 వెల్లడించింది. జగన్ హయాంలో రాజకీయ ప్రతీకారాలు, ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసేందుకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగంతో జస్టిస్ ఇండియా ర్యాంకింగ్‌లో ఆయన హయాంలో రాష్ట్రం దిగువకు పడిపోయింది .  2019 నుంచి 2024 వరకు ఏపీ ర్యాంకింగ్ దిగజారుతూనే వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో చట్టబద్ద పాలన తిరిగి వచ్చిందని ఇండియా జస్టిస్ రిపోర్టు వెల్లడించింది . పోలీసింగ్‌తో పాటు న్యాయ సహకారాన్ని అందించటంలో సైతం ఏపీ పనితీరు బాగా మెరుగైనట్లుగా స్పష్టం చేసింది. ఏపీలో శాంతిభద్రతలు, పోలీసింగ్, న్యాయవ్యవస్థ పనితీరు, సామాజిక, చట్టపరమైన పాలన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏపీకి ఈ ర్యాంకింగ్ కేటాయించింది. ఇండియా జస్టిస్ రిపోర్టులో 6.78 స్కోర్‌తో మొదటిస్థానంలో కర్ణాటక నిలిస్తే.. 6.32 స్కోర్‌తో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. తర్వాత స్థానాల్లో వరుసగా తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల సరైన నిర్వహణను కఠినంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నది.

ప్ర‌కాష్ రాజ్ కి ఏపీలో ఏం ప‌ని?

నటుడు ప్ర‌కాష్ రాజ్ కి ఏపీ.. సామాజిక- ఆర్ధిక- రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న అంతంత మాత్రం. ఆంధ్రప్రదేశ్ ఇన్నేళ్లుగా   రాజ‌ధాని లేని రాష్ట్రంగా అవ‌స్థ‌లు ప‌డుతోంది. స‌రే ఎట్ట‌కేల‌కు ఈ రాష్ట్రానికంటూ ఒక అవ‌కాశ‌మొచ్చింద‌ని.. అమ‌రావ‌తే ఆ రాష్ట్ర రాజ‌ధాని అని సంబ‌ర ప‌డేలోపు.. ఏ దుష్ట‌క‌న్ను ప‌డిందో.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. దీంతో కథ మ‌ళ్లీ మొద‌టికే వ‌చ్చింది. జ‌నం సొమ్ము ప‌ప్పుబెల్లాల్లా ఖ‌ర్చు చేసిన జ‌గ‌న్ త‌ర్వాత అదే జ‌నం చేత దారుణ‌మైన ప‌రాభ‌వానికి లోనై ఘోర‌మైన ఓట‌మి పాల‌య్యారు. ఒక‌ప్పుడు మీకొచ్చిన ఆ 23 సీట్ల‌లో కొంద‌ర్ని లాక్కుంటే ఆ ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేకుండా  పోతుంద‌ని బాబును భ‌య‌పెట్టిన జ‌గ‌న్ చివ‌రికి ప్ర‌తిప‌క్ష హోదాకి కూడా నోచుకో లేక పోయారు. క‌ర్మ రిట‌ర్న్స్ థియ‌రీకి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా మిగిలిపోయారు.  ఇదంతా అలా ఉంచితే.. ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం రాజ‌ధానిని  పున‌ర్నించుకోవ‌డంలో భాగంగా.. పెద్ద ఎత్తున నిధులు స‌మ‌కూర్చుకుంటూ.. వ‌చ్చే రోజుల్లో ఎవ‌రెన్ని చేసినా స‌రే.. ఇక్క‌డి నుంచి రాజ‌ధాని మార్చ‌డానికి వీల్లేని విధంగా ఒక చ‌ట్టం తేవాల‌ని నిర్ణయించింది. ఐదేళ్ల పాటు ప‌నులు ప‌డ‌కేసిన పోల‌వ‌రంతో పాటు, బ‌న‌క‌ర‌చ‌ర్ల‌ను సైతం నిర్మించే ఆలోచ‌న చేస్తోంది  చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం. ఆపై విశాఖ ఉక్కును కాపాడుకోడానికి మొన్న‌టికి మొన్న 11500 కోట్ల రూపాయ‌ల‌ను కేంద్రం నుంచి పొందింది. ఇంకా ఎన్నో ప్రాజెక్టులు. మ‌రెన్నో కంపెనీల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ బాట‌ప‌డ్డానికి ముమ్మ‌ర‌ య‌త్నాలు కొన‌సాగిస్తోంది బాబు నాయ‌క‌త్వంలోని ప్రభుత్వం. ఒక ప‌క్క రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్థితిని మెరుగు ప‌ర‌చ‌డానికి.. మ‌రో ప‌క్క‌ సుద‌ర్ఘ తీర ప్రాంత‌మైన ఏపీని అందుకు అనువుగా మార్చుకోడానికి.. చేయగలిగినంతా, చేయాల్సినంతా చేస్తున్నది. ఒక వేళ జ‌గ‌న్ తిరిగి వ‌స్తే ప‌రిస్తితేంట‌ని స్వ‌యంగా  పెట్టుబడి దారులు అడ‌గ‌టంతో ఆ భ‌యాన్ని తొల‌గించ‌డానికి తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇక్క‌డిన్ని స‌మ‌స్య‌లుంటే ఎలాంటి మంత్రిత్వం చేసిన అనుభ‌వం లేకుండా ఏకంగా ముఖ్య‌మంత్రి అయ్యి.. ఆపై త‌న ఓట్ల కోసం.. స్వార్ధంతో కొంద‌రికి ఎడా పెడా డ‌బ్బులు పంచేసి.. ఆపై వారి ద్వారా కూడా స‌రైన ఆద‌ర‌ణ‌కు నోచుకోక ఘోరంగా ఓడారు జ‌గ‌న్. ఇదంతా ప‌క్క‌న పెట్టి రాహుల్ గాంధీ ఏదో ప్రెజంటేష‌న‌న్ ఇచ్చారని చెప్పి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని అడ్డు పెట్టుకుని ప్ర‌కాష్ రాజ్ అవాకులు చ‌వాకులు పేలుతున్నారు. నిజానికి ఆయ‌న‌కున్న అభ్యంత‌రం స‌నాత‌న ధ‌ర్మం. బేసిగ్గానే ప్ర‌కాష్ రాజ్ ఒక సెక్యుల‌రిస్ట్. ఆయ‌న బ్యాగ్రౌండ్ అలాంటిది. నేడు మోడీ అన్నా, బీజేపీ అన్నా, హిందుత్వం అన్నా గిట్ట‌క జ‌స్ట్ ఆస్కింగ్ పేరిట పిచ్చి పిచ్చి ప్ర‌శ్న‌లు వేస్తూ కాల‌యాప‌న చేస్తుంటారు ప్ర‌కాష్ రాజ్. ఇవాళ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయంగా అన్ ఫిట్ అంటోన్న ప్ర‌కాష్ రాజ్ తాను పుట్టిన బెంగ‌ళూరు సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. అలాగ‌ని త‌న రాజ‌కీయాల‌ను ఆప‌క తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోనూ టాలెంట్ చూపించాల‌ని ట్రై చేశారు. మా ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడిగా పోటీ చేసి అక్క‌డా దారుణ ప‌రాభ‌వాన్ని మూట‌గ‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌కాష్ రాజ్ టార్గెట్ చేసిన ప‌వ‌న్ అన్న నాగ‌బాబు ప్రకాశ్ రాజ్ కోసం ఎంత పోరాడినా  ప్రకాశ్ రాజ్ మాత్రం మా ఎలెక్ష‌న్లో నెగ్గ‌లేక పోయారు. ఇప్పుడ‌దే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ల‌క్ష్యంగా చేస్కుని విమర్శలు గుప్పిస్తున్నారు ఈ  క‌న్న‌డ న‌టుడు. ఇలాంటి వారిని ఎంక‌రేజ్ చేయొద్ద‌ని మొన్న దివంగ‌తులైన కోట శ్రీనివాస్ ప‌దే ప‌దే చెప్పిన సంగతి ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు.  ప‌వ‌న్ ఇటీవ‌ల స‌నాత‌న ధ‌ర్మ‌సార‌ధిగా ప్ర‌చారం మొద‌లు పెట్ట‌డంతో.. ప్ర‌కాష్ రాజ్ ఇంత వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదంతా ఇలాగుంటే.. రాహుల్ గాంధీ ప్రెజంటేష‌న్ అడ్డు పెట్టుకున్న ప్ర‌కాష్ రాజ్ ఏపీలో కూట‌మి గెలిచిందంటే అందుకు కార‌ణం ఈవీఎంగా చెప్పుకొస్తున్నారు. ఒక వేళ అదే నిజ‌మైతే.. రాహుల్ గాంధీ డైరెక్ట్ గా ఏపీనే ఉద‌హ‌రించేవారు క‌దా? మ‌ర‌లా ఎందుకు చేయ‌లేదు? ఆయ‌న మాట‌ల్లో చేత‌ల్లో ఎక్క‌డా ఏపీ ప్ర‌స్తావ‌న ఎందుకు లేదు? ఇదొక ప్ర‌శ్న కాగా.. రాహుల్ గాంధీ క‌ర్ణాట‌క‌లోని మ‌హ‌దేవ్ పుర అనే నియోజ‌క‌వ‌ర్గం గురించి, ఆపై మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా అసెంబ్లీ ఎన్నిక‌ల గురించి ప్ర‌స్తావించారు. త‌ప్పితే ఎక్క‌డా ఏపీ వివ‌ర‌ణ‌ చేయ‌లేదు. అంటే దీన‌ర్ధ‌మేంటి? ఇంత రీసెర్చ్ చేశాన‌ని చెబుతున్న  రాహుల్ కి ఏపీలో ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా కూట‌మి గెలిచిన‌ట్టు ఆధారాలు ఎక్క‌డా క‌నిపించ‌లేద‌నేగా? క‌నీసం ఆయ‌న ఏపీ విష‌యంలో  ఫీల‌ర్ కూడా ఇవ్వ‌డం లేదు. దీన‌ర్ధ‌మేంటి? ఇక్క‌డ ఈవీఎంలు ట్యాంప‌రింగ్ జ‌రిగిన‌ట్టు ఆయ‌న‌కు కూడా ఆధారాలు ల‌భించ‌డం లేద‌నేగా? ఇదిలా ఉంటే.. ప్ర‌కాష్ రాజ్ కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే అస‌లు క‌డుపు మంట. ఇందాకే అనుకున్న‌ట్టు.. ఆయ‌న భుజానికెత్తుకున్న స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌. ఈ విష‌యంలో నేరుగా టార్గెట్ చేయ‌వ‌చ్చు ప్ర‌కాష్ రాజ్.. కానీ ఆయ‌న‌లా చేయ‌డం లేదు. ఇదే క‌మ‌ల్ హాస‌న్ సనాత‌న ధ‌ర్మానికి విరుగుడు విద్య అంటూ తాను క‌నీసం టెన్త్ కూడా పాస్ కాకుండానే స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇందుకు త‌మిళ సీరియ‌ల్ నటుడు ర‌విచంద్ర‌న్ వైల్డ్ గా రియాక్ట‌య్యాడు. క‌మ‌ల్ త‌ల న‌రికేస్తామంటూ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్ర‌మంలో నేరుగా స‌నాత‌న ధ‌ర్మాన్ని అటాక్ చేయ‌లేని ప్ర‌కాష్ రాజ్.. ప‌వ‌న్ కళ్యాణ్ గెలుపుపై ప‌దే ప‌దే కామెంట్ చేస్తూ రెచ్చ‌గొడుతున్నారు.

ఉపరాష్టపతి రేసులో ఓబీసీ మహిళా నేత?

జగదీప్ ధన్‌కఢ్ ఆకస్మిక రాజీనామాతో అనివార్యమైన భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గత శుక్రవారం  (ఆగష్టు 8) విడుదల చేసింది. అదే రోజున నామినేషన్ల ప్రక్రియ ప్రారంరంభ మైంది. నామినేషన్ల స్వీకరణ గడువు ఆగష్టు 21తో ముగుస్తుంది. సెప్టెంబర్ 9 పోలింగ్ జరుగుతుంది. అదే రోజున వోట్ల లెక్కింపు జరుగుతంది  కాగా..  ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలెక్టోరల్ కాలేజీని  కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సిద్దం చేసింది.  ఈ నేపథ్యంలో కాబోయే ఉపరాష్ట్రపతి ఎవరనే విషయంలో రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ ఆసక్తి వ్యక్త మవుతోంది. మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవంక అధికార ఎన్డీఎ కూటమి అభ్యర్ధి ఎంపిక బాధ్యతను  కూటమి భాగస్వామ్య పార్టీల నేతలు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించారు.  నేడో రేపో ఎన్డీఎ కూటమి అభ్యర్ధి పేరు ఖరారయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారంగా తెలుస్తోంది.  ఈ రెండు రోజుల్లో పేరు ప్రకటించినా ప్రకటించక పోయినా.. అంతర్గతంగా ఏకాభిప్రాయమ ఏర్పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని  విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే..  ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రుల స్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. అదే సమయంలో నూతన ఉపరాష్ట్రపతి ఎంపిక విషయంలో బీజేపీ అగ్రనాయకత్వం ఆచి తూచి అడుగులు వేస్తోందని అంటున్నారు. ఉపరాష్ట్రపతి  రాజ్యసభ చైర్మన్ బాధ్యతలను కూడా నిర్వరించవలసి ఉంటుంది కనుక.. పార్లమెంట్ వ్యవహారాల్లో తగిన అనుభవం, విధివిధానాల పట్ల సంపూర్ణ అవగాహన అవసరం కనుక, ఇటు పార్లమెంట్ అనుభవంతో పాటుగా రాజకీయ చతురతతో పెద్దల సభను సమర్ధవంతగా నడపగల సామర్ధ్యం ఉన్న వ్యక్తిని ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉందని అంటున్నారు. సమర్ధత, సామర్ధ్యంతో పాటుగా రాజకీయ జీవితంలో వివాదరహితునిగా పేరున్న   పెద్ద  మనిషిని ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అంతే కాదు.. ఇంతవరకు ఎక్కడా వినిపించని, ఎవరూ ఉహించని, అదృశ్య వ్యక్తి ఒక్కసారిగా తెరపైకొచ్చినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం  నలుగురు ప్రస్తుత గవర్నర్లతో పాటుగా, ఒకరిద్దరు మాజీ గవర్నర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఉపరాష్ట్రపతి రేసులో గుజరాత్ గవర్నర్. ఆచార్య దేవవ్రత్  అందరికంటే ముందున్నారు. అలాగే  కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గహ్లోత్, సిక్కిం గవర్నర్ ఓం ప్రకాశ్ మాథూర్  కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ గవర్నర్ మనోజ సిన్హా పేర్లు ప్రముఖగా వినిపిస్తునాయి.  అలాగే..  ఓబీసి వర్గానికి చెందిన  మహిళ అయిన మాజీ  ఎంపీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. నిజానికి..  నూతన ఉపరాష్రపతి పదవికి ప్రస్తుత లేదా మాజీ గవర్నర్ల లో ఒకరని ఎంపిక చేసే అవకా శాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అయితే.. మహిళా సాధికరితకు ఎత్తు పీట వేస్తూ గిరిజన మహిళ ద్రౌపతి ముర్మును రాష్ట్రపతిని చేసిన విధంగా.. అదే ఒరవడిలో ఉపరాష్ట్రపతి పదవిని  కూడా మహిళకు ఇవ్వలని భావిస్తే ఏమో కానీ..  లేదంటే గవర్నర్లలో ఒకరిని   ఉపరాష్ట్రపతి చేసే అవకాశాలే  ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అయితే.. కొస మెరుపుగా  చివరకు మోదీ,షా మ్యామాజిక్ బాక్స్ లోంచి ఏ పేరు బయటకు వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.

అమెరికాను తలదన్నేలా హైదరాబాద్ లో గన్ కల్చర్.. తాజాగా చందానగర్ లో కాల్పుల కలకలం

ఖజానా జువెల్లరీస్ లో దోపిడీ  భాగ్యనగరంలో గన్ కల్చర్ పెరిగిపోతున్నది. అమెరికాను తలదన్నేలా ఇటీవలి కాలంలో భాగ్యనగరంలో కాల్పులు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ చందానగర్ లో దుండగులు కాల్పులతో చెలరేగిపోయారు. గ్రేటర్ పరిధిలోనే అత్యంత రద్దీగా ఉండే చందానగర్ లో దుండగులు తుపాకులతో ఖజానా జువెల్లర్స్ లోకి ప్రవేశించి భారీ దోపిడీకి పాల్పడ్డారు. దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు కాల్పులకు తెగబడి మరీ భారీ దోపిడీకి పాల్పడ్డారు. దుండగుల కాల్పుల్లొ ఖజానా జువల్లర్స్ సిబ్బంది గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం ( ఆగస్టు 12) ఉదయం జరిగింది. షాపు తెరిచిన  షాపు తెరిచిన 5 నిమిషాల్లోనే భారీ దోపిడీకి పాల్పడి అక్కడ్నుంచి ఉడాయించారు.  షాపు సిబ్బంది, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాల్పులు జరిపి దోపిడీ జరిపిన తరువాత దుండగులు జహీరాబాద్ వైపు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు జిల్లా సరిహద్దులలో పోలీసులను అప్రమత్తం చేశారు. దుండగులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.  ముఖానికి  మాస్కులు,   చేతులకు గ్లౌజు  వేసుకొని వచ్చిన ఆరుగురు దుండగులు, ముందుగా తుపాకులతో బెదరించి లాకర్ కీస్ ఇవ్వాలని కోరారు. అయితే అందుకు ఖజానా జువెల్లరీస్ మేనేజర్ నిరాకరించి, వారిని ప్రతిఘటించాడు. దీంతో  మేనేజర్ పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.  ఆ దశలో ఖజానా జువెల్లర్స్ లో పనిచేస్తున్న సిబ్బంది మొత్తం  దుండగులపై తిరగబడ్డారు..దీంతో దుండగులు పారిపోయారు.  

రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చకు తెరలేపిన ఆలోచనాపరుల సంఘం సూచనలు

ప్రాజెక్టులు ప్రజల కోసం నిర్మించాలన్న  నినాదంతో ఆలోచనపరుల వేదిక ఆధ్యర్యంలో ఈ నెల 4 నుంచి 6 వరకు శ్రీశైలం జలాశయం ఆధారంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ఇప్పటికే నిర్మితమైన ప్రాజెక్టులపై అధ్యాయనం జరిగింది. అలా అధ్యయనానికి వెళ్లి వచ్చిన ఆలోచనాపరుల సంఘం ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. సూచనలు అనడం కంటే ఆ మేధావుల సంఘం పలు డిమాండ్లు  వినిపించింది. అదేమంత ఆషామాషీ కమిటీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపధ్యంలో వారి సూచనలపై పెద్ద చర్చే జరుగుతోంది. ఆ ప్రతినిధి బ‌ృందంలో రిటైర్ట్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, రైతు సేవా సమితి అధ్యక్షుడు అక్కినేని భవానీ ప్రసాద్, నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల రంగం విశ్లేషకులు టి. లక్షినారాయణ, నల్లబోతు చక్రవర్తి, జొన్నలగడ్డ రామారావు, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు క‌ృష్ణమూర్తినాయుడు వంటి మేథావులు ఉన్నారు. దీంతో తమ అధ్యయనం తరువాత వారు ఇచ్చిన  సూచనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఆలోచనపరుల వేదిక పలు సూచనలు చేసింది.  ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ అలాగే  నీటి వినియోగంలో మెరుగైన పద్ధతులను సూచిస్తూ..  రైతుల అవసరాలు తీర్చడానికి  నీటి వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడానికి ఈ సూచనలు ఎంతగానో దోహదపడతాయంటున్నారు.  ముఖ్యంగా, ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ,  నీటి వినియోగంలో మెరుగైన పద్ధతులను సూచిస్తూ, రైతుల అవసరాలు తీర్చడానికి, నీటి వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడానికి ఆ సూచనలు మేలు చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో పర్యావరణానికి హాని కలగకుండా చూడాలని,  తక్కువ ఖర్చుతో కూడిన, సమర్ధవంతమైన నీటిపారుదల పద్ధతులను ఉపయోగించాలని,  స్థానికుల అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులను నిర్మించాలని ఆలోచనపరుల సంఘం సూచింది. ప్రతి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఒక స్పష్టమైన సమయపాలన ఉండాలంది. ఆ క్రమంలో ప్రాజెక్టుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని,  నీటిపారుదల వ్యవస్థలను ఎప్పటికప్పుడు పరిశీలించి, మరమ్మతులు చేయాలని డిమాండ్ చేసింది. నీటి వనరులను సమర్ధవంతంగా నిర్వహించడానికి సాంకేతికతను ఉపయోగించాల్సి అవసరాన్ని గుర్తు చేసింది.  రైతులకు శిక్షణ ఇస్తే..  వారు నీటిని పొదుపుగా ఉపయోగించుకుంటారనీ, నీటిని వృధా చేయకుండా, పొదుపుగా ఉపయోగించాలని పేర్కొంది. బిందు సేద్యం, స్ప్రింక్లర్ సేద్యం వంటి ఆధునిక నీటిపారుదల పద్ధతులను ఉపయోగించాలని గైడ్ చేసింది.  పంటల ఎంపికలో నీటి అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని,నీటిపారుదల వ్యవస్థలను పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఆలోచనపరుల సంఘం మేధావులు అంటున్నారు.  ఇక రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఒక సంప్రదింపుల వేదికను ఏర్పాటు చేయడం అత్యవసరమని  పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రజలకు అవగాహన కల్పించి..  ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రాజెక్టులను చేపట్టాలని సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతిని అరికట్టాలంటూ  ఈ సూచనలను పాటించడం ద్వారా, సాగునీటి ప్రాజెక్టులను మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకోవచ్చని ఆలోచనపరుల సంఘం సూచిస్తోంది.  ఇంకా పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండేళ్లలో యుద్దప్రాతిపకన పూర్తి చేయడానికి అవసరమైన రూ.5000 కోట్ల నిధులను వ్యయం చేస్తే ఈ ప్రాజెక్టుపై ఇప్పటిదాకా పెట్టిన ఖర్చుకు ఫలితం ఉంటుందని పేర్కొంది. శ్రీశైలం ఆధారంగా నంద్యాల జిల్లా పరిధిలో నిర్మించిన , నిర్మాణంలో ఉన్న ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు - నగరి సుజల స్రవంతి, కేసీ కెనాల్, చెన్నైకి తాగు నీరు తరలించే, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బసకచెర్ల క్రాస్ రెగ్యులేటర్, వెలుగోడు రిజర్వాయర్, హంద్రీ - నీవా స్రవంతికి నీటిని తరలించే మాల్యాల, మచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలను సందర్భించిన ఆలోచనపరుల సంఘం వివిధ సూచనలు చేసింది. ఎస్పార్బీసీని పూర్తి చేయడానికి రూ.250 కోట్లు ఖర్చు చేయలేరా అని ప్రశ్నించింది.  ఆ క్రమంలో పోలవరం - బనకచెర్ల , రాయలసీ ఎత్తిపోతల పథకాలను విరుమించుకోవాలని కాస్త గట్టిగానే సూచించింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాజెక్టులను కూడా సందర్శించి, అధ్యయనం చేసి ప్రజలకు వివరాలు తెలియచేస్తామని వెల్లడించింది. మొత్తానికి ఏబీ వెంకటేశ్వరరావు, ఇతర మేధావులు వెల్లడించిన అంశాలు అందరిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఢిల్లీ శున‌క పురాణం

ఢిల్లీలో ఒక్క కుక్క కూడా రోడ్లపై క‌నిపించ‌కూడ‌దు. ఎనిమిది వారాల్లోగా వాటిని షెల్ట‌ర్ల‌కు చేర్చండి అంటూ సుప్రీం కోర్టు ఆదేశాల జారీ వెన‌క అస‌లు స్టోరీ ఏంటి? ఎందుక‌ని సుప్రీం కోర్టు అంత క‌ఠిన‌మైన ఆదేశాలు జారీ చేసింది? అని చూస్తే ఢిల్లీలో నానాటికీ కుక్క‌ల బెడద తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్న దృశ్యం క‌నిపిస్తోంది.  దేశ రాజధాని  ఢిల్లీ అంతటా, కుక్క కాటు కేసులు పెరుగుతూనే ఉండటం, ఆసుపత్రులు కిక్కిరిసిపోవడం తరచూ వార్తలకెక్కుతూనే వస్తోంది. కొందరు కుక్కే కదా కరిచిందని లైట్ తీస్కోవడం వల్ల.. ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. రానురాను కుక్కల బెడద పెను ప్రమాదంగా పరిణమిస్తున్న పరిస్థితి నెలకొంది.  ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ డేటా ప్రకారం ఢిల్లీలో కుక్క కాటు కేసులు 2022లో 6,691 నుంచి.. 2023లో 17,874కి, 2024లో 25,210కి పెరిగాయి. అంటే కేవలం రెండేళ్లలోనే కుక్కకాటు బాధితుల సంక్య  277% పెరిగింది. దీంతో ఢిల్లీ వాసుల గుండెలదరిపోతున్నాయ్.   ఈ ఏడాది ఒక్క జనవరిలోనే కుక్కకాటుకు గురైన వారి సంఖ్య 3,196 అంటే పరిస్థితి ఊహించుకోవచ్చు ప్రభుత్వం నిర్వహించే అతిపెద్దదైన సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ డేటా ప్రకారం, 2021 లో 63,361 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. జూలై 2025 నాటికి, ఈ సంఖ్య  91,009కి పెరిగింది, ఇది గతేడాది వార్షిక గణాంకాలను బట్టీ చూస్తే 43.6 శాతం అధికం.  అంటే ప్రతిరోజూ 430 మందికి పైగా కుక్కకాటుకు గురౌతున్నారన్నమాట.  రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఏప్రిల్ 2022- మార్చి 2023 మధ్య 39,216 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 2023- మార్చి 2025 మధ్య ఈ కేసుల సంఖ్య  45,432కి పెరిగింది. అంటే పదమూడు శాతం పెరుగుదల నమోదైందన్న మాట. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ డిల్లీ అధ్వర్యంలో నడిచే బారా హిందూరావు ఆస్పత్రిలో ఈ ఏడాది జూలై వరకు చూస్తే.. 4,861 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి, గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 3,468 కేసులతో పోలిస్తే ఇది 40% ఎక్కువ. ఢిల్లీ సరిహద్దుల బయట కూడా సమస్య తీవ్రంగానే ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో..  ఈ ఏడాది జనవరి- మే మధ్య కాలంలో 74,550 కుక్క  కాటు ఘటనలు నమోదయ్యాయి.  కుక్క కాటు రెండు ప్రధాన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. కేవలం గాయంతో పోయేది కాదిది. ఇన్ ఫెక్షన్  సోకుతుంది. వెంటనే చికిత్స చేయకపోతే చిన్న కాటు వల్ల నరాలు దెబ్బతినడం, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. అసలైన సమస్య ఏంటంటే మెదడు నాడీ వ్యవస్థపై ఈ ఇన్ ఫెక్షన్  దాడి చేస్తుంది. దీంతో ఇది ప్రాణాంతకంగా మారుతుంది. కాటు ద్వారా కుక్క లాలాజనం మనిషి నరనరాల్లోకి పాకుతుంది. తద్వారా రేబిస్ వస్తుంది. ఈ వ్యాధికి వెంటనే పోస్ట్ ఎక్స్ పోజర్ టీకాలు ఇవ్వడం అత్యంసరం.   చిన్న కాటే కదాని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు. చికిత్స చేయక పోతే అది ప్రాణాల మీదకువ స్తుంది. యూపీకి చెందిన రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్ సోలంకి గత జూలైలో రేబిస్ సోకి మరణించారు. సుమారు మూడు నెలల క్రితం బ్రిజేష్ సోలంకీ ని తన పెంపుడు కుక్క పిల్ల కరిచింది. దాన్ని చిన్న గాయంగా పరిగణించిన బ్రిజేష్.. రేబిస్ ఇంజక్షన్ తీసుకోలేదు. దీంతో ఆయన చనిపోయారు. ది లాన్సెట్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, 2022–23లోనే భారత్ లో రేబిస్ వ్యాధి సుమారు 5,700 మందిని పొట్టనపెట్టుకుంది. దీన్ని బట్టీ రేబిస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇదంతా దశాబ్దాల తరబడి నిర్లక్ష్యం కారణంగా జరుగుతూ వస్తోంది. ఎనిమల్ బర్త్ కంట్రోల్ కింద స్టెరిలైజేషన్, టీకా డ్రైవ్ లు చేస్తున్నట్టు ఎన్జీవోలు ఇతర పౌర సంస్థలు చెప్పుకుంటున్నాయి. కానీ, గ్రౌండ్ లెవల్లో ఇదంతా జరగలేదని నానాటికీ పెరిగిపోతున్న కుక్కల బెడదను బట్టి అర్ధం అవుతోంది. 2022- 24 మధ్య కాలంలో ఢిల్లీలో లక్షకు పైగా స్టెరిలైజేషన్స్ జరిగినట్టు చెబుతాయి గణాంకాలు. అయితే కుక్కల బెడద మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు.  వీధి కుక్కల బెడద ఎదుర్కునే వారు..  ఎంసీడీ-311 యాప్ లేదా హెల్ప్‌లైన్ నంబర్ 155305 ద్వారా తాము ఎదుర్కుంటున్న సమస్యలను రిపోర్ట్ చేయవచ్చు. అంతే కాదు స్టెరిలైజేషన్ వంటి డీటైల్స్ కూడా వీటిలో నమోదు చేయవచ్చు. అయితే దీని ద్వారా ఢిల్లీలోని వీధి కుక్కల సమస్య ఎంత మేర అధిగమించగలం అన్నది ప్రశ్నార్ధకంగానే మిగిలింది. ఎందుకంటే ఇలాంటి ఫెసిలిటీ ఒకటి ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలీదు.  2023లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశానికి ముందు మున్సిపల్ అధికారులు వీధి కుక్కలను బంధించి ఎలాగోలా కట్టడి చేశారు. ఎప్పుడైతే ఈ సమావేశం ముగిసిందో తిరిగి వీధి కుక్కలను వదిలేశారు. దీంతో గూండా రాజ్ లా ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో డాగ్ రాజ్ రాజ్యం చేస్తోంది. వీటికి స్టెరిలైజేషన్ లేదు, షెల్టర్ల ఏర్పాటు అంతకన్నా లేదు. శాశ్వత పరిష్కారం చూపించడమూ లేదు. ఇక పోతే విశ్వనగరం అయిన మన హైదరాబాద్ పరిధిలో ఈ మధ్య వీధి కుక్కల వల్ల తలెత్తుతున్న సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్నారుల పై వీధి శునకాలు మూకుమ్మడిగా దాడి చేస్తున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే..  పసి పిల్లలు కుక్కల దాడిలో మరణించారు కూడా.  దీంతో  ప్రజలు తమ పిల్లలను రోడ్లపై ఆటలకు పంపేందుకు కూడా భయపడుతున్నారు. ఏ వైపు నుంచి ఏ వీధి కుక్క వచ్చి దాడి చేస్తుందో అన్న భయంతోనే ఆడుకోవల్సిన పిల్లల్ని ఇంటికే పరిమితం చేస్తున్నారు. మీ ఏరియాలో కుక్కల బెడద ఉందా? అయితే, టోల్ ఫ్రీ నంబర్లు 040-21111111, 040-23225397కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. మా డాగ్ క్యాచింగ్ టీంలు నేరుగా వచ్చి వీధి శునకాలను సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్ చేస్తాయని జీహెచ్ఎంసీ ఓ ప్రకటన ద్వారా తెలియ చేసింది. విదేశాల్లో అలాక్కాదు. ఇక్కడి వారికి  ఒకింత జంతు ప్రేమ ఎక్కువే. ఆ మాటకొస్తే మానవ హక్కులకన్నా జంతు హక్కులు ఒకింత కఠినంగానే ఉంటాయిక్కడ. వదిలేసిన పెంపుడు జంతువులు కూడా ఇక్కడ వివిధ షెల్టర్లలో హాయిగాసేద తీరుతుంటాయి. వీటికి స్టెరిలైజేషన్ చేసి మైక్రో చిప్ జత చేసి.. దత్తత తీసుకోవడానికి వీలుగా వీటిని మెయిన్ టైన్ చేస్తారు. ఒక వేళ ఎవరూ ముందుకు రాకుంటే ప్రభుత్వాలే.. వాటిని సకల సౌకర్యాలతో సంరక్షిస్తాయి. ఎందుకంటే ఈ ప్రపంచం సమస్త జంతు జాలానిది. ఈ భూమిపై నివసించడానికి మనకెంత హక్కుందో- వాటికీ అంతే హక్కుందని విశ్వసిస్తారక్కడ.

ఎస్ఎల్ బీసీ కూల‌డానికి క్షుద్ర పూజ‌లు.. కోమ‌టిరెడ్డికి పూజ‌ల పిచ్చి ప‌ట్టిందా?

ఒక‌ప్ప‌టి కోమ‌టిరెడ్డికి ఇప్ప‌టి కోమ‌టిరెడ్డికి చాలానే తేడా ఉన్న‌ట్టుంది చూస్తుంటే. ఆయ‌నకు ఇచ్చిన శాఖ‌ల్లో సినిమాటోగ్ర‌ఫీ శాఖ కూడా ఉంది. ఒక ప‌క్క అక్క‌డ సినీ  కార్మిక లోకం వ‌ర్సెస్ నిర్మాత‌లుగా బీభ‌త్సమైన యుద్ధం జ‌రుగుతోంది. ఒక‌రిపై మ‌రొక‌రు తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు సంధించు కుంటున్నారు.  మూడేళ్ల‌య్యింది మాకు జీతం పెంచి  అని కార్మికులు అంటుంటే, మీక‌స‌లు టాలెంటే లేదు. మేం ఐటీ  ఎంప్లాయిస్ క‌న్నా ఎక్కువ వేత‌నాలిస్తున్నాం అని నిర్మాత‌లంటున్నారు. తొలి నుంచి సినీ ప‌రిశ్ర‌మ అవినీతి అడ్డా, అక్ర‌మాల పుట్ట అంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ కి  చెంద‌ని నిర్మాత విశ్వ ప్ర‌సాద్ డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు .  ఒక వేళ కోమ‌టిరెడ్డి ఏదైనా స‌మ‌స్య తీస్కుని పోరాడాల్సి ఉంటే..  సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన అంశం ఏదైనా తీస్కుని దాన్ని సాల్వ్ చేయాలిగానీ.. ఎస్ఎల్ బీసీ కూల‌డానికి క్షుద్ర పూజ‌లు చేశారంటూ ఆరోపణలేంటో అర్ధం కావ‌డం లేదంటారు కొంద‌రు. ఒక వేళ కేసీఆర్ అండ్ కో కోరుకున్నారన్నదే ఆ ఆరోపణల అయితే అందులో హేతువు కనిపించదు. ఎందుకంటే కేసీఆర్ అండ్ కో కూలాలని కోరుకోవడం అంటూ జరిగితే ఎస్ ఎల్ బీసీ కాదు.. ఏకంగా రేవంత్ సర్కారే ప్ర‌భుత్వ‌మే కూలాల‌ని కోరుకుంటారు కానీ ఎక్క‌డో ఉన్న ఎస్ఎల్బీసీ కూలితే వారికేమి వ‌స్తుంది? అర్ధం కావ‌డం లేదని అంటారు కొంద‌రు.  మొన్న కూడా ఇలాగే రేవంతే సీఎంగా ప‌దికాలాల పాటు ఉండాల‌ని గ‌ణ‌ప‌తి పూజ చేయించానంటారు కోమ‌టిరెడ్డి. కంటి ముందున్న ప‌ని ప‌క్క‌న పెట్టి.. ఈ పూజ‌ల పిచ్చేంద‌ని పరిశీలకులు సైతం బుర్రలు గొక్కుంటున్నారు.  ఒక ప‌క్క త‌మ్ముడు చూస్తే మంత్రి ప‌ద‌వి కావాలంటూ మారాం చేస్తున్న చిన్న పిల్లాడిలా క‌నిపిస్తుంటే. మ‌రో ప‌క్క అన్న చూస్తే ప్ర‌తిదానికీ పూజ‌ల‌కు లింకుబెట్టి మాట్లాడ్డం క‌నిపిస్తోంది.. ఏంటిదంతా? ఎందుకిలా  జ‌రుగుతోంది. ఉన్న స‌మ‌స్య‌ను ప‌క్క‌న బెట్టి ఈ టాపిక్ డైవ‌ర్ష‌నేంట‌న్న వాద‌న వినిపిస్తోంది. ఆ ఎస్ఎల్బీసీకి చెందిన ఇరిగేష‌న్ శాఖ కూడా ఆయ‌న‌ది కాదు. ప్ర‌స్తుతం త‌న శాఖ‌కు సంబంధించిన శాఖ సినిమాటోగ్రఫి. సినీ పరిశ్రమలో ఇంత లొల్లి జ‌రుగుతుంటే అది పట్టకుండా  కోమ‌టిరెడ్డి ధోర‌ణి ఇలా ఉందేమిటన్నది  ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు.

టి కాంగ్రెస్ లో కోమటి రెడ్డి సెగ.. రోజుకో ట్వీట్ తో అధిష్టానానికి తలనొప్పి!

 రేవంత్ కు పొగ పెడుతున్నారా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెగ పుట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా   రోజుకో ట్వీట్ పెడుతూ కాకరేపుతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఇస్తాని ఇప్పడు మోసం చేశారని రగిలిపోతున్నారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని ఆయనపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాలను తప్పుబడుతూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ పై అసంతృప్తితో ఉన్న నాయకులంతా ఆయనకు అంతర్గతంగా మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిన తరువాత తాజాగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా రాజగోపాలరెడ్డి కి మంత్రి పదవి హామీ ఇచ్చినట్లు  తెలిపారు. ఇంతకాలం మౌనంగా ఉన్న భట్టి తాజాగా రాజగోపాల్ కు అనుకూలంగా మాట్లాడటం కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ లో తొలి నుంచి ఉన్న తమను కాదని రేవంత్ కు పీసీసీ పగ్గాలు అప్పగించడం,  ఆ తరువాత ఏకంగా ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం  సీనియర్లు జీర్ణించుకోలేక పోతున్నారు. దీనిని వివిధ సందర్భాల్లో  పరోక్షంగా తమ విముఖతను, వ్యతిరేకతనూ వ్యక్తం చేస్తూ వస్తున్నారు.  ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డి ఏకంగా ఒకడుగు ముందుకేసి నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. వరంగల్ జిల్లాకు చెందిన  కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ కమిటీ వెంటనే స్పందించింది. అటువంటిది నేరుగా ముఖ్యమంత్రి పై ఆరోపణలు చేసినా కనీసం క్రమశిక్షణ కమిటీ నుంచి చర్యలు లేకపోవడం చూస్తే రేవంత్ కు పొగ పెడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతి కాంగ్రెస్ లో తొలి నుంచీ ఉన్నదే.. అయితే సోనియా గాంధీ ఎఐసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతికి దాదాపు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇప్పుడు తెలంగాణ విషయంలో పాత సంస్కృతిని మళ్లీ తీసుకువస్తారా అనే అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. 

ఓట‌ర్లు మీకే ఓటేస్తామ‌ని చెప్పారా?: వైసీపీకి హైకోర్టు షాక్

వైసీపీకి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలలో పోలింగ్ బూత్ ల మార్పుపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ మార్పు వల్ల ఓటర్లు సమీపంలోని బూత్ లలో కాకుండా నాలుగు కిలోమీటర్ల దూరంలోని బూత్ కు వెళ్లి ఓటు వేయాల్సి వస్తున్నదని పేర్కొంటూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి  హైకోర్టులో సోమవారం అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.   ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు.. ఎన్నికల అధికారుల, వైసీపీ తరఫు న్యాయవాదుల వాదనలు నమోదు చేసింది. ఇరు పక్షాల వాదనలూ విన్న అనంతరం ఈ దశలో ఈ విషయంలో జోక్యం చేసుకోలేమంటూ తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.  ఓటర్లు అంతా మీకు అనుకూలమనీ, మీకే ఓట్లు వేస్తారనీ ఎలా నిర్ధారిస్తారని వైసీపీని నిలదీసింది. దీనిపై   వైసీపీ తరఫున న్యాయవాదులు ఆయా కుటుంబాలు ఎప్పటి నుంచో వైఎస్ కుటుంబానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. తెల్లవారితే పోలింగ్ ప్రారంభం అవుతున్న ఈ దశలో పోలింగ్ బూత్ ల మార్పుపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు తేల్చి చెబుతూ వైసీపీ పిటిషన్ ను తోసిపుచ్చింది.