హమ్మయ్య.. ఎట్టకేలకు చిరుత చిక్కింది!

గత మూడు నెలలుగా ఫారెస్టు అధికారులకు, ఎస్వీ వర్సిటీ భద్రతా సిబ్బందికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది.తిరుపతిలో గత మూడు నెలలుగా  ఎస్వీయూ, వేదిక్ యూనివర్సిటీ, వెటర్నరీ, ఆగ్రి కల్చర్ యూనివర్సిటీ, జూపార్కు రోడ్డు, అలిపిరి వద్ద చిరుత కుక్కలు, దుప్పులు, జింకలను వేటాడి ఆరగించి అక్కడే విడిచి పెడుతూ వస్తుంది. ఈ తరుణంలో జూపార్కు రోడ్డులో ఓ టూవీలర్ పై వెళ్తున్న వ్యక్తిపై కూడా దాడికి పాల్పడింది. అతడు తృటిలో తప్పించుకున్నాడనుకోండి అది వేరే విషయం. చిరుత దాడి దృశ్యం వెనుక వస్తున్న కారు కెమెరాలో రికార్డు అయ్యింది.  ఇది వైరల్ కావడంతో తిరుపతి వాసులు కూడా తీవ్ర భయాందోళనలతో నిద్రలేని రాత్రులు గడుపుతూ వస్తున్నారు. చిరుతను బంధించేందుకు  ఫారెస్ట్ అధికారులు పలు చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. బోన్లు ఏర్పాటు చేసినపేపటీ నుంచి ఫలితం లేకుండా పోయింది. చిరుత ఆచూకీ చిక్కలేదు. జనం భయం తొలగలేదు. కాగా రెండు రోజుల క్రితం ఒక దుప్పిని నోటా కరచి ఎస్వీ వర్సిటీలోని ఓ ప్రధాన డిపార్ట్మెంట్ వద్ద ఆరగించి సగం దుప్పిని అక్కడే విడిచి వెళ్లిపోయింది. దీంతో ఫారెస్ట్ అధికారులు అటు వైపు బోన్లు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు చిరుత ఫారెస్ట్ అధికారులకు ఏర్పాటు చేసిన  ఆ బోనులో చిక్కింది. చిక్కిన చిరుతను తిరుపతి జూ పార్క్ కు తరలించారు. గతంలో వేదిక్ యూనివర్సిటీ పరిసరాల్లో పట్టుబడిన చిరుతను బంధించిన ఫారెస్టు అధికారులు నలమల అడవులకు తరలించారు. అయితే ఈ ప్రాంతంలో మరికొన్ని చిరుతలు కూడా సంచరిస్తున్నట్లు  అనుమా నిస్తున్నారు.  

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం ( ఆగస్టు 18) నాటికి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో  ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనా మేరకు ఈ వాయుగుండం మంగళవారం (ఆగస్టు 19) తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం (ఆగస్టు 18) ఉదయం నుంచీ ఉత్తరాంధ్ర జిల్లాలలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.  విశాఖ, అనకాపల్లి,కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్  జారీ చేశారు. విశాఖను భారీ వర్షం అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.  జ్ఞానాపురం, ఇసుక తోట, కేఆర్ఎమ్ కాలనీ, వన్ టౌన్  ప్రాంతాలలో భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. ఇలా ఉండగా  వాయుగుండం ప్రభావంతో మరో 72 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.   భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు ,కృష్ణ, బాపట్ల, పల్నాడ,  ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరులో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.  కాగా వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్ర తీరంలో సముద్రం పోటెత్తుతోంది. కెరటాలు ఉధృతంగా ఎగసిపడుతున్నాయి. తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు విస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు సముద్రంపై చేపలవేటకు వళ్లవద్దన్న హెచ్చరికలు జారీ అయ్యాయి.  ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని పోర్టులలోనూ మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 

శ్రీకృష్ణ శోభాయాత్రలో విషాదం.. విద్యుదాఘాతంలో ఐదుగురు మృతి

ఉత్సాహంగా సాగుతున్న శ్రీకృష్ణ శోభాయాత్రలో ఘోర విషాదం సంభవించింది. ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ గోకులే నగర్ లో శ్రీకృష్ణ శోభాయాత్ర జరుగుతుండగా విద్యత్ షాక్ కు గురై ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా  ఆదివారం (ఆగస్టు 17) శ్రీకృష్ణ శోభాయాత్ర నిర్వహించారు. ఊరేగింపు సమయంలో రథాన్ని తీసుకెళ్లే వాహనం సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. దీంతో  పది మంది రథాన్ని నెడుతున్న క్రమంలో   విద్యుత్ తీగలు రథానికి తాకడంతో ఈ ఘోరం జరిగింది.  విద్యుదాఘాతంలో మరణించిన వారిని  కృష్ణ అలియాస్ డైమండ్ యాదవ్ శ్రీకాంత్ రెడ్డి(35), సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డిలుగా గుర్తించారు.

ఏపీలో మహిళా శక్తి పథకం.. ఉచిత బస్సు ప్రయాణానికి నో కండీషన్స్!

గ‌త ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు ఇచ్చిన ఉచిత‌ బ‌స్సు హామీ మేర‌కు తోలుగుదేశం ప్రభుత్వం  స్త్రీ శ‌క్తి  పేరుతో రాష్ట్రంలో ఉచిత బ‌స్సును ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం (ఆగస్టు15) సాయంత్రం ముఖ్యమంత్రి చంద్ర‌బాబు  ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. అయితే. అయితే మహిళల ఉచిత బస్సు ప్రయాణం ఈ ప‌థ‌కానికి సంబంధించి కొన్ని ష‌ర‌తులు విధించారు. వీటి ప్ర‌కారం  ఘాట్ రోడ్ల‌లో ప్ర‌యాణించే ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత స‌ర్వీసులు ఉండ‌బోవ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యాన్ని సీఎం చంద్ర‌బాబు కూడా చెప్పారు. ఇక‌, బ‌స్సులో ప్ర‌యాణించే స‌మ‌యంలో మ‌హిళ‌లు ఆధార్ స‌హా.. ఇత‌ర గుర్తింపు కార్డుల‌ను ఒరిజిన‌ల్‌వే చూపించాల‌ని కూడా పేర్కొన్నారు. వాస్తవానికి ఈ నిబంధనలతోనే స్త్రీ శక్తి పథకం శుక్రవారం (ఆగస్టు15) సాయంత్రం ప్రారంభమైంది. అ యితే శనివారం  శ‌నివారం ఉద‌యం నుంచి ఈ పథకాన్ని వినియోగించుకుని పెద్ద సంఖ్యలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయడానకి ఉత్సాహం చూపారు. కానీ ఆ స‌మ‌యంలో చాలా మంది ఒరిజిన‌ల్ గుర్తింపు కార్డులు లేకుండానే బ‌స్సులు ఎక్కారు. కేవ‌లం జిరాక్సులు, లేదా ఫోన్ల‌లో ఉన్న డిజిట‌ల్ గుర్తింపు కార్డుల‌ను చూపించారు. నిబంధనల అనుమతించవంటూ.. వీటిని కండెక్ట‌ర్లు అంగీకరించలేదు. దీనితో  ఒరిజినల్ గుర్తింపు కార్డు నిబంధనను తొలగించాలని మహిళలు ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. ఇదే విషయాన్ని అధికారులకు తెలియజేశారు.   అలాగే ఘాట్ రోడ్ల‌లో ప్ర‌యాణించే బ‌స్సుల్లో ఉచితం లేద‌న్న విష‌యం తెలియ‌క‌.. మ‌న్యం,   పార్వ‌తీపురం, లోతుగ‌డ్డ, లంబ‌సింగి త‌దిత‌ర ప్రాంతాల్లో గిరిజ‌న మహిళలు ఉచిత బస్సు ప్రయాణంలో ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాలన్నీ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఐదు రకాల బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి విధించిన నిబంధనలన్నీ దాదాపుగా తొలగించేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిబంధనలను తొలగిస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా ఆదివారం ఉదయానికి ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇక నుంచీ ఘాట్ రోడ్లలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఉంటుంది. అయితే తిరుమల, అన్నవరం ఘాట్ రోడ్ల విషయంలో మాత్రం ఆయా ఆల యాల బోర్డులు నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఇక  గుర్తింపు కార్డులు ఒరిజిన‌ల్‌ కండీషన్ ను కూడా ఎత్తివేశారు.  జిరాక్స్ కాపీల‌ను అనుమ‌తించాలని ఆదేశించారు.   దీంతో మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న నిబంధ‌న‌ల‌ను దాదాపు తీసేసిన‌ట్లైంది.

ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న సస్పెన్స్ కు తెరపడింది. ఇన్ని రోజులుగా మోడీ, షా ల ఛాయిస్ ఎవరు అన్న విషయంలో నెలకొన్న ఆసక్తి, సస్పెన్స్ కు ఫుల్ స్టాప్ పడింది. ఎన్డీయే కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఖరారయ్యారు. ఆదివారం (ఆగస్టు 17) జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశం రాధాకృష్ణన్ ను ఎన్డీయే కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రకటించారు. మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న   రాధాకృష్ణన్  గతంలో జార్ఖండ్, పాండిచ్చేరి గవర్నర్ గా కూడా పని చేశారు. కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ కోయంబత్తూర్ నుంచి రెండు సార్లు లోకసభకు ప్రాతినిధ్యం వహించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. వెంకయ్యనాయుడు తరువాత దక్షిణాదికి నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే తరఫున ఎంపికైన రెండో వ్యక్తి రాధాకృష్ణన్.

ఎడారి దేశంలో ఏడేళ్ల నరకం.. సీఎం ప్రవాసి ప్రజావాణి చొరవతో స్వదేశానికి

ఏడేళ్ల ఎడారి జీవితం... నరకయాతన నుంచి ఎట్టకేలకు విముక్తి చెందిన తెలంగాణ వ్యక్తి ఉదంతమింది. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ 2017లో సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు. ఏడేళ్ళుగా అక్కడ ఒక ఖర్జూర తోటలో చిక్కుకుపోయాడు.  నీ వొడిలోకి వస్తాను తల్లీ... నన్ను సల్లంగ దీవించు తల్లీ... అంటూ మాతృభూమిని తలుచుకుంటూ  సొంతగడ్డకు రావాలని తహతహలాడాడు.     మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో... ఎడారిలో అతను పడ్డ ఏడేళ్ల నరకయాతనకు తెర పడింది. సౌదీ అరేబియాలో తీయని ఖర్జూరాలను పండించిన ఆ తెలంగాణ వలస జీవి, మాతృభూమికి రావడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. సౌదీ నుంచి హైదరాబాద్ కు ఆదివారం (ఆగస్టు 17) చేరుకున్నారు.  గ్లోబల్ తెలంగాణ ఫోరం అధ్యక్షుడు, సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో నివశించే, కరీంనగర్ కు చెందిన సామాజిక సేవకుడు మహ్మద్ జబ్బార్ ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేసి ఈశ్వర్ సౌదీ నుంచి సొంతగడ్డకు రావడానికి  మార్గం సుగమం చేశారు. సౌదీ నుంచి స్వగ్రామానికి వెళ్లే ఆనందంలో,  భావొద్వేగంతో గల్ఫ్ కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ స్వయంగా గొంతెత్తి పాడిన పాటను ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్ కు అంకితం చేశారు.   ఏడున్నవే నా పల్లే... నువ్వు ఏడున్నవే నా తల్లీ!  బతుకు దెరువు కోసం బాట పట్టినా...  పొట్ట తిప్పల కోసం సౌదీ కొచ్చినా!  నెలలు గడిచిపాయే, ఏండ్లు గడిచిపాయే, ఏడేండ్ల పొద్దాయే...  ఎండిపోయిన రొట్టె నేను తినుకుంటా...  నాచుగట్టిన నీళ్లు నేను తాగుకుంటా...  కారండ అడవిలో గొర్ల కాసుకుంటా...  నేను కాలమెల్లదీత్తి తల్లీ..  నేను కడుపు గట్టుకుంటి తల్లీ!   నీ వొడిలోకి వస్తాను తల్లీ... నన్ను సల్లంగ దీవించు తల్లీ!  అంటూ సౌదీలోని తన ఏడేళ్ల కష్టాన్నీ, కన్నీళ్లనూ అక్షరాలుగా మార్చి రాసి, పాడిన పాటను తనను సొంతగడ్డకు తీసుకురావడానికి సహకరించిన అధికారిణికి అంకితం ఇచ్చాడు.  అసలు ఈశ్వర్ సౌదీ యానం.. అక్కడి కష్టాలు.. ఏడేళ్ల నరకయాతన ఎలా మొదలైందంటే..  2017 ప్రారంభంలో హౌస్ డ్రైవర్‌గా పని చేసిన ఈశ్వర్, కొద్ది నెలలకే ఉద్యోగం కోల్పోయాడు. తర్వాత ఖర్జూర తోటలో వ్యవసాయ కూలీగా పని చేస్తూ ఏడేళ్లు గడిపాడు.  ఈశ్వర్ భార్య తాళ్లపల్లి లత, తన ఇద్దరు కుమార్తెలతో కలిసి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సీఎం ప్రవాసీ ప్రజావాణి  కౌంటర్ లో  ముఖ్యమంత్రి  వంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ల పేరిట 2025 జూన్ 27న వినతిపత్రం అందజేశారు. ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి స్వయంగా వెంట ఉండి వారికి మార్గనిర్దేశనం చేశారు. సీఎం ప్రజావాణి  నోడల్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి దివ్యా దేవరాజన్, ఈశ్వర్ ను స్వదేశానికి రప్పించే విషయంలో ప్రత్యేక చొరవ చూపారు.   ఈమేరకు తెలంగాణ ప్రభుత్వ జిఏడి ఎన్నారై విభాగం ద్వారా రియాద్‌లోని ఇండియన్ ఎంబసీకి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాయించారు. ఈ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. వీరందరి కృషీ ఫలించింది. ఈశ్వర్ కు సౌదీలో కష్టాలకు ఫుల్ స్టాప్ పడింది. సొంత గడ్డకు చేరే అవకాశం లభించింది.

ప్రధానిగా మోడీ కొనసాగుతారా? ఆర్ఎస్ఎస్ కరుణ చూపుతుందా?

మోడీ రిటైర్మెంట్ పై సాగుతున్న చర్చకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష కూటమి చేపట్టిన ఓటు చోరీ ఆందోళన నేపథ్యంలో మరో సారి మరింత బలంగా మోడీ రిటైర్మెంట్ చర్చ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మోడీ రిటైర్మెంట్  అంశాన్ని వార్తలో నిలిచేలా పదే పదే ప్రస్తావిస్తూ సవాళ్లు విసురుతోంది. మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ, బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషీల విషయంలో  మోడీ, షా వ్యవహరించిన తీరును ఎత్తి చూపుతూ.. 75 ఏళ్ల నిబంధన నుంచి మోడీకి మినహాయింపు ఏమైనా ఉందా? అంటూ ఎద్దేవా చేస్తోంది.  వచ్చే నెలతో అంటే సెప్టెంబర్ తో సెప్టెంబర్‌తో మోదీకి 75 ఏళ్లు పూర్తి అవుతాయి. దీంతో బీజేపీ తనంతట తానుగా విధించుకున్ననిబంధన ప్రకారం మోడీ రిటైర్ కావలసి ఉంటుంది.  బీజేపీ పొలిటికల్ మెంటార్ లాంటి ఆర్ఎస్ఎస్ కూడా అదే చెబుతోంది. అయితే పార్టీలోనే మోడీ రిటైర్మెంట్ నుంచి మినహాయింపు కోసం ఆర్ఎస్ఎస్ ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ చర్చను తెరపైకి తెస్తున్నవారిలో  మోడీ ప్రధానిగా కొనసాగాలనుకుంటున్న వారితో పాటు ఆయన వైదొలగాలని కోరుకుంటున్నవారు కూడా ఉన్నారు. అదే సమయంలో విపక్ష కాంగ్రెస్ కూడా మోడీ ఆర్ఎస్ఎస్ కరుణాకటాక్షాల కోసం పాకులాడుతున్నారన్న విమర్శలు చేస్తున్నది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత  జైరాం రమేశ్‌   మోదీ పదవీకాలం సెప్టెంబర్‌ తర్వాత కొనసాగడం అన్నది ఆర్ఎస్ఎస్ పైనే ఆధారపడి ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.     బీజేపీ విధాన నిర్ణయాలలో ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకమన్నది బహిరంగ రహస్యమే అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు.ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు లేకుండా మోదీ 75 ఏళ్ల నిబంధన నుంచి మినహాయింపు పొందే అవకాశం ఇసుమంతైనా లేదన్నది పరిశీలకుల విశ్లేషణ.   ఈ నేపథ్యంలోనే మోడీ ఆర్ఎస్ఎస్ ను ప్రసన్నం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గుడ్ లుక్స్ లో పడేందుకు మోడీ శతధా ప్రయత్నిస్తున్నారనడానికి ఆయన ఇటీవలి ప్రసంగాలలో ఆర్ఎస్ఎస్ ను ఆకాశానికి ఎత్తేసేలా పొగుడుతున్న విధానమే తార్కనంగా పరిశీలకులు చెబుతున్నారు.    గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి సొంతంగా మెజారిటీ స్థానాలను సాధించడంలో  ఆ ఎన్నికల ప్రచారాన్నంతా భుజాలపై వేసుకుని మోసిన మోడీ వైఫల్యం ఆయనను బీజేపీలో బలహీన నేతగా మార్చిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని పదవిలో 75 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత కూడా కొనసాగాలంటే ఆర్ఎస్ఎస్ ను ప్రసన్నం చేసుకోవడం వినా మరో మార్గం లేదనీ, అందుకే మోడీ ఆ ప్రయత్నాలలో మునిగిపోయారని చెబుతున్నారు.  గత దశాబ్ద కాలంగా బీజేపీని బలమైన నాయకత్వంతో ముందుకు నడిపించిన ప్రధాని మోడీ.. ఇప్పుడు బలాన్ని కోల్పోయారనీ, గత ఎన్నికలలో పార్టీకి మెజారిటీ సీట్లు సాదించడంలో ఆయన వైఫల్యం ఇప్పుడు ఆయన ముందరి కాళ్లకు బంధంగా మారిందనీ చెబుతున్నారు. ఇక ఆయన సెప్టెంబర్ తరువాత ప్రధానిగా కొనసాగడమన్నది ఆర్ఎస్ఎస్ కరుణాకటాక్షాలపైనే ఆధారపడి ఉందని అంటున్నారు. చూడాలి మరి ఆర్ఎస్ఎస్ ఏ నిర్ణయం తీసుకుంటుందో? 

ఓట్ల చోరీ.. భారత ఎన్నికల సంఘం తీరుపై అనుమానాలు?

భారత ఎన్నికల సంఘం తీరుపై అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఓట్ల చోరీ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన, ఆరోపణలకు బలం చేకూరుతోంది.  బీహార్ ఓటర్ల జాబితాలో అవకతవకలు  భారత ఎన్నికల కమిషన్ పనితీరుపై సందేహాలను లేవనెత్తుతోంది. బీహార్ ఓటర్ల జాబితా లో 65 లక్షల మందిని తొలగించారని,ఎన్నికల సంఘంతో ప్రభుత్వం కుమ్మక్కైందని పార్లమెంటులో 15 రోజులుగా విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనిపై రెండు రోజుల కిందట సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలగించినట్లు ఆరోపిస్తున్న 65 లక్షల ఓటర్ల పేర్లు, వివరాలను 48 గంటల్లో అధికారిక వెబ్ సైట్లో పెట్టాలని ఆదేశించింది. తొలగించడానికి కారణాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని పేర్కొంది. సుప్రీంకోర్టు  ఆదేశాలు ఎన్నికల కమిషన్ ను షాక్  అనే చెప్పాలి. ఓటర్ల సవరణ పేరుతో తొలగించడం అక్రమమని కాంగ్రెస్ సహా  ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి.   సుప్రీంకోర్టు జోక్యం తో ఓట్ల చోరీ కేసులో నిజాలు బయటకు వస్తాయా, ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవాలు తేలతాయా అంటే ఇతమిథ్ధంగా చెప్పలేమన్నది విశ్లేషకుల మాట.  త్వరలో బీహార్ ఎన్నికలు  జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఎన్నికల కమిషన్ తో కుమ్మక్కై ఇలాంటి అక్రమానికి పాల్పడిందన్నది కాంగ్రెస్, ఇండియా కూటమి ఆరోపణ.  ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను ఆగస్టు 1న విడుదల చేసింది. దాని ప్రకారం 65.6 లక్షల ఓటర్ల పేరు తొలగించారు. సవరణ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఉన్న ఓటర్లలో తొలగించింది 9 శాతం. ఈ సంఖ్య చిన్నదేమీ కాదు. అలాగే గత (2020 ఎన్నికలు), 2024 సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే ఈసారి కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందన్న ఆరోపణలున్నాయి. 1977 తరువాత ఇలాంటి పరిస్థితి రావడం ఇదే ప్రథమం. సగటున ఇదే 9 శాతం దేశవ్యాప్తంగా పరిగణలో తీసుకుంటే 9 కోట్ల మంది ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి గల్లంతయ్యాయి.   ఈ సంఖ్య బ్రిటన్ లోని ఓటర్ల సంఖ్యకు ఒకటిన్నరెట్లు అధికం.  బీహార్లో 30 లక్షల ఓటర్లు అర్హత ఉండి కూడా ఓటర్ల జాబితాలో చోటు దక్రించుకోలేకపోయారన్నది వాస్తవం.   ఓటర్ల జాబితా లో మృతిచెందారని పేర్కొన్న వారితో ఫోటోలు దిగి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించడంతో ఈ వివాదం మరింత రాజుకుంది.   మృతులతో ఫోటోలు దిగే భాగ్యం కల్పించినందుకు కృతజ్ణతలు అంటూ ఆయన వ్యంగ్యంగా చేసిన పోస్టు హాట్ ను మరింత పెంచేసింది.  మరణించారంటూ ఓటరు జాబితా నుంచి తొలగించిన వారితో ఆయన చాయ్ తాగుతూ దిగిన ఫొటోను సామాజిక మాధ్యమలో పోస్టు చేశారు.  ఎన్నికల కమిషన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇండియా కూటమి ఎంపీలు 300 మంది పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకూ ఓట్ల చోరీ నినాదంతో భారీ ప్రదర్శన చేసారు. ఈ ప్రదర్శనలో ఏఐసీపీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే,  రాహూల్, ప్రియాంకగాంధీ సహా   పలువురి అరెస్టు చేశారు.  తమది రాజ్యాంగాన్ని కాపాడే పోరాటమని, ఓటర్ల చోరీ ఉద్యమం మహోద్యమం గా మారుతుందనడంలో సందేహంలేదని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఓట్ల చోరీ అంటూ రాహుల్ ఆరోపణలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఓట్ల చోరీ జరిగిందని ప్రామాణిక పత్రంపై సంతకం చేసి ఇస్తే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. అలా చేయకపోతే  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే రాహుల్ ఆరోపణలపై కర్ణాటక,హర్యానా ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేసారు. రాహుల్ లేవనెత్తిన అంశానికి  ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వకుండా ప్రమాణాలు చేయ్యాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఏది ఏమైనా కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు మోడీ హయాంలో సందేహాలకు తావిచ్చేదిలా ఉందనడంలోసందేహం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలు  మోదీ హయాంలో ఎన్నికల కమిష న్ ను  నిర్వీర్యం చేసారన్న ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. శేషన్ హయాంలో ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా ఎలా ఉండవచ్చో చూపించారు. అయితే ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్  వెన్నెముక లేని సంస్థగా మారిపోయిందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను సామాన్యులు సైతం సమర్ధిస్తున్నారు.  బీహార్ లో ఓటర్ల తొలగింపు అంశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పోరాటంతో భారత ఎన్నికల సంఘం, కేంద్రంలోని మోడీ సర్కార్ డిఫెన్స్ లో పడ్డాయనడంలో ఇసుమంతైనా సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు.  ఇక తాజాగా తొలగించిన ఓటర్ల వివరాలను పబ్లిక్ డొమైన్ లో ఉంచాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రతిపక్షాల వాదన సరైనదేన్న భావన సర్వత్రా కలిగేలా చేశాయి.   

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి విషాద దృశ్యాలు ఇంకా మరపునకు రాలేదు. అంతలోనే మరో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. వరుసగా విమానాలలో సాంకేతిక సమస్యలు, ఎమర్జెన్సీ ల్యాండింగులతో విమానయానమంటేనే ప్రయాణీకులు భయాందోళనలకు గురౌతున్న వేళ ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ముప్పు తప్పింది. వివరాల్లోకి వెడితే ముంబై విమానాశ్రయంలో ఓ ఇండిగో విమానం ల్యాండ్ అడుతుండగా విమానం వెనుక భాగం రన్ వేను బలంగా ఢీ కొంది. అయితే పైలట్ల చాకచక్యం వల్ల ఘోర ప్రమాదం తృటిలో తప్పి విమాన ప్రయాణీకులు సురక్షింగా ఉన్నారు.  ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తునకు ఆదేశించింది.  బ్యాంకాక్ నుంచి 6ఇ 1060 నంబర్ గల ఇండిగో ఎయిర్‌బస్ ఏ321 నియో విమానం శనివారం  ముంబై చేరుకుంది. ఆ సమయంలో  భారీ వర్షం కురుస్తున్నది.  ఉదయం 3:06 గంటలకు రన్‌వే 27పై విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ కు అవకాశం లేదని భావించిన పైలట్లు విమానాన్ని  తిరిగి పైకి లేపే ప్రయత్నంలో విమానం తోక భాగం  రన్‌వేకు తగిలింది. దీంతో పైలట్లు అప్రమత్తమై వెంటనే విమానాన్ని ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.  కాగా ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తునకు ఆదేశించింది.  ప్రతికూల వాతావరణం కారణంగా గో-అరౌండ్ చేస్తున్నప్పుడు విమానం తోక రన్‌వేను తాకింది. ఆ తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రామాణిక నిబంధనల ప్రకారం, విమానానికి అవసరమైన తనిఖీలు, మరమ్మతులు నిర్వహించి, రెగ్యులేటరీ అనుమతులు పొందాకే తిరిగి సేవలు ప్రారంభిస్తామని ఇండిగో సంస్థ ప్రకటించింది.  

రేపటి నుంచి రాహుల్‌ గాంధీ ఓటు అధికార్‌ యాత్ర

  లోక్ సభ విపక్షనేత రాహుల్ గాంధీ  ఓటర్ అధికార్ యాత్ర చేయనున్నారు.  ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను వ్యతిరేకిస్తూ  బీహార్‌లోని ససారాంలో యాత్రను రాహుల్ ప్రారంభించనున్నారు. 16 రోజుల్లో 25 జిల్లాల్లో 1300 కిలోమీటర్లు యాత్ర రూట్ మ్యాప్‌ను ఇవాళ విడుదల చేశారు. ఇందులో భాగంగా ర్యాలీలు, సభలు, కార్యక్రమాలతో ప్రజల మధ్యకు ప్రతిపక్ష నాయకుడు  రానున్నారు. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ ర్యాలీతో ఓటర్ అధికార్ యాత్ర ముగియనుంది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ తో సహా యాత్రలో ఇండియా కూటమి నేతలు, కీలక వ్యక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. త్వరలో బీహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకు యాత్రను చేపట్టారు.  దేశవ్యాప్తంగా పారదర్శక ఓటర్ల జాబితా లక్ష్యంగా తమ యాత్ర కొనసాగుతుందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలిపారు. కాగా, గత కొద్ది రోజులుగా దేశంలో అనేక రాష్ట్రాల్లో  ఓట్ల దొంగతనం జరిగిందంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఓటర్లను బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ ఓటర్ల హక్కుల యాత్రను చేపడుతున్నారు. ఆయన ప్రజా కోర్టుకు చేరుకుని, భారత రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలంటే, ఇక్కడి ఓటర్లను బలోపేతం చేయాలని ప్రజలకు చెబుతారు. బీహార్‌లో ఓటర్ల జాబితాలో సవరణకు వ్యతిరేకంగా, ఓటర్ల చోరీకి వ్యతిరేకంగా పోరాటం ఒక ప్రజా ఉద్యమంగా మార్చడానికి యాత్ర జరుగుతోందని కాంగ్రెస్ ఇన్‌చార్జి కృష్ణ తెలిపారు  

భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటి ఉద్ధృతి

  తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి  వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇవాళ సాయంత్రానికి గోదావరి నీటి మట్టం 29.6 అడుగులు దాటి ప్రవహిస్తోంది. రెండు రోజుల క్రితం 16 అడుగుల మేర ఉన్న గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ 29 అడుగులు దాటింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం వద్ద నదిలో స్నానమాచరించే భక్తులు నది లోపలకి వెళ్లకుండా ఒడ్డునే ఉండి స్నానమాచరించాలని ఆదేశాలు జారీ చేశారు. నది వద్ద లాంచీలు, పడవలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.  

ఆధార్ కార్డు చూపించినా..కండక్టర్‌ల అత్యుత్సాహం

  ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే కొన్ని ప్రాంతాల్లో కండక్టర్‌లు  అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఒరిజినల్  కార్డునే చూపించాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిరాక్స్ ఆధార్ కార్డు చెల్లుబాటు కాదు అంటున్నారు. దీంతో కండక్టర్‌ల తీరు మహిళల అసహనం వ్యక్తం చేస్తున్నారు .మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలను చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చుని ప్రభుత్వం చెబుతుంటే కండక్టర్ తీరుపై సర్వత్ర విమర్శలు వెలువెత్తున్నాయి. ఏలూరు ఏజెన్సీ ప్రాంతం తెలంగాణ సరిహద్దుల్లో ఉండడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. బోర్డర్ కొంచెం ఏపీలో, కొంచెం తెలంగాణలో ఉండడంతో అవి అంత ర్రాష్ట్ర సర్వీసులుగా గుర్తించారు. దాంతో వాటిలో ఉచితం లేదని అధికారులు చెబుతున్నారు. జంగారెడ్డిగూడెం డిపో నుంచి వేలేరుపాడు కుక్కునూరు, మండలాలకు వెళ్లే సర్వీసులన్నీ.. తెలంగాణ నుంచే వెళ్లడంతో స్థానికల్లో అయోమయం ఏర్పడింది. జంగారెడ్డి గూడెం నుంచి భద్రాచలం వెళ్లే బస్సుకి ఫ్రీ టికెట్ లేదని జంగారెడ్డిగూడెం బస్ డిపో డీఎం తెలిపారు.అదే విధంగా అశ్వరావుపేట షటిల్ సర్వీస్‌ ఫ్రీ టికెట్ వర్తించదని డీఎం చెబుతున్నారు. దాంతో జంగారెడ్డిగూడెం నుంచి  వేగవరం, తాడువాయి, దర్భ గూడెం జీలుగుమిల్లి వెళ్లే ప్రయాణికులకు స్త్రీ శక్తి ఎలా ఉపయోగపడుతుందనే అనుమానం నెలకొంది.  

ధర్మవరం వాసిపై దేశద్రోహం కేసు నమోదు.. జైషే మహ్మద్‌తో లింకులు

  శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్‌పై  పోలీసులు దేశద్రోహం కేసునమోదు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఈ ఉదయం అతడిని అదుపులోకి తీసుకున్నారు. 29 ఉగ్ర సంస్థలతో మహమ్మద్‌కు సంబంధాలు ఉన్నట్లు విచారణలో ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. మరోవైపు ధర్మవరం టెన్ పోలీసు స్టేషన్‌లో పరిధిలోని ఎర్రగుంట్లు వాసి రియాజ్ నో ఇండియా ఐ లవ్ పాకిస్థాన్ అని వాట్సాప్ స్టేటస్ పెట్టగా అతడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.  కాగా నూర్ మహమ్మద్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఐబీ అధికారులు గుర్తించారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నూర్ మహమ్మద్ క్రియాశీల వ్యక్తిగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఓ హోటల్ లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్.. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొన్నాది.నూర్ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. జైషే మహ్మద్‌ సంస్థకు చెందిన వాట్సాప్‌ గ్రూపుల్లో నూర్‌ మెంబర్‌గా ఉన్నాడని, అందులోని నెంబర్లకు ఇతని నుంచి వాట్సాప్‌ కాల్స్‌ వెళ్లాయని.. ముస్లిం యువతను ఉగ్ర సంస్థ వైపు మళ్లించేలా అందులో వ్యాఖ్యలు సైతం చేశాడని నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ క్రమంలో.. అతని వ్యక్తిగత వివరాల గురించి ఐబీ, ఎన్‌ఐఏ వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే..  నూర్‌ వ్యవహారంపై డీఎస్పీ నరసింగప్పకు మీడియాకు కొన్ని విషయాలు తెలియజేశారు. ‘‘నూర్‌ను లోకల్‌ పోలీసులే మొదట అరెస్ట్‌ చేశారు. నిషేధిత ఉగ్రసంస్థలకు చెందిన గ్రూపుల్లో అతను సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించాం. కొన్ని సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నాం. అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నాం’’ అని అన్నారాయన.  ధర్మవరంలో ఉగ్రకదలికలు వెలుగు చూడడంతో స్థానికంగా కలకలం రేగింది. కోట ఏరియాలో ఉంటున్న నూర్‌ నివాసంలో ఎన్‌ఐఏ సోదాలతో అంతా ఉలిక్కిపడ్డారు. ఓ హోటల్‌లో అతను వంట మనిషిగా పని చేస్తున్నట్లు సమాచారం. నూర్‌ నివాసంలోనూ సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ అధికారులు.. 16 సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతన్ని రహస్య ప్రదేశంలో విచారణ జరుపుతున్నారు.

ఇంతకీ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు ఎప్పుడంటే?

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థి ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. అయితే ఎన్డీయే అభ్యర్థిని ఖరారు చేసే బాధ్యతను కూటమి పార్టీలు ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాలకు అప్పగించాయి. దీంతో మోదీ, షాలు ఎవరిని ఖరారు చేస్తారన్నది ఇప్పటి వరకూ ఎవరికీ అంతుచిక్కడం లేదు. రేసులో ఉన్నారంటూ పలువురి పేర్లు తెరమీదకు వస్తున్నా.. మోడీ షాల మదిలో ఎవరున్నారన్నది ప్రకటన వెలువడే వరకూ ఎవరికీ తెలియకుండా గోప్యత పాటిస్తున్నారు. ఈ సస్పెన్స్ ఒక్క కూటమి పార్టీలలోనే  కాదు కాంగ్రెస్ లో కూడా ఉంది. ఎన్డీయే అభ్యర్థి ఎవరన్నది తేలిన తరువాత కాంగ్రెస్ కూటమి అభ్యర్థిని నిలబెట్టాలా? వద్దా? ఒక వేళ నిలబెడితే ఎవరిని అన్నది తేల్చుకునే అవకాశం ఉంది.   ఈ నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 17) జరగనున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎవరన్నది తేలుతుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. అయితే పరిశీలకులు మాత్రం  బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో  అభ్యర్థిని ఖరారు అయ్యే అవకాశం ఇసుమంతైనా లేదని అంటున్నారు. సమావేశంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ జరిగుతుందనీ, అయితే అభ్యర్థి ఎంపిక బాధ్యత మాత్రం మళ్లీ మోడీ, షాలకు అప్పగిస్తుందనీ అంటున్నారు. ఇక మోడీ, షా ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును సోమవారం (ఆగస్టు 18)న ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి దన్ ఖడ్ ఉపరాష్ట్రపతి పదవిని చేసిన రాజీనామా ఆమోదం పొందిన క్షణం నుంచీ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి అంటూ పలు పేర్లు తెరమీదకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరకూ పలు పేర్లు తెరమీదకు వచ్చాయి.  అయితే ఫైనల్ గా ఎవరు ఉపరాష్ట్రపతి అభ్యర్థి అన్న ఫైనల్ డెసిషన్ మాత్రం ఇంత వరకూ జరగలేదు.  అయితే ఈ సస్పెన్స్ మరెంతో కాలం కొనసాగే అవకాశం లేదు. ఉపరాష్ట్రపదవికి నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 చివరి తేదీ కావడంతో సోమ, లేదా మంగళవారం అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఎన్ని పేర్లు తెరమీదకు వచ్చినా ఫైనల్ గా అభ్యర్థిని డిసైడ్ చేసేది మాత్రం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా మాత్రమే అనడంలో సందేహం లేదు.  

రోడ్డు ప్ర‌మాదానికి గురైన కారులో 16 కిలోల గంజాయి ల‌భ్యం

  రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో బాట‌సింగారం వ‌ద్ద ఓ కారు ప్ర‌మాదానికి గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు  ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ఇక కారును ప‌రిశీలించ‌గా, అందులో గంజాయి ప్ర‌త్య‌క్ష‌మైంది. దీంతో పోలీసులు కారును సీజ్ చేసి, డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మ‌హ‌బూబాబాద్‌కు చెందిన భూక్యా నాయ‌క్ ఒడిశా నుంచి మ‌హారాష్ట్ర‌కు గంజాయి త‌ర‌లిస్తుండ‌గా బాట‌సింగారం వ‌ద్ద‌ కారు డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. దీంతో గంజాయి బ‌య‌ట‌ప‌డింద‌న్నారు. 16 కేజీల గంజాయితో పాటు ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భూక్యానాయ‌క్‌ను పోలీసులు అరెస్టు చేశారు.  

ఓటు ఎవరికి వేసినా గెలిచేది బీజేపీనే..ఎంపీ అరవింద్ వీడియో వైరల్

  దేశంలో ఓట్ చోరీ తీవ్ర దుమారం రేపుతున్న వేళ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గతం చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మీరు ఎవరికి ఓటు వేసిన గెలిచేది బీజేపీనే అంటూ గతంలో అరవింద్ చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు నోటాకు ఓటు వేసినా తానే గెలుస్తానని..మీరు కారు గుర్తుకు ఓటు వేసినా తానే గెలుస్తానని అప్పుట్లో అరవింద్ వెల్లడించారు. మీరు ఎవరికి ఓటు వేసినా రాబోయేది మోదీనే అంటూ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు ఆందోళన రేపుతోంది.జాతీయ ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీ కుమ్మక్కై భారీ ఎత్తున ఓటు చోరీకి పాల్పడుతున్నదంటూ లోక్ సభ విపక్షనేత రాహుల్ గాంధీ సహా విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తుంటే ఈ ఆరోపణలను ఈసీ తీవ్రంగా తప్పుపడుతోంది.  ఈ విషయంలో కాంగ్రెస్ ఇక యుద్ధమేనని ప్రకటించింది. ప్రచారానికి వెబ్‌పోర్టల్‌ను సైతం ప్రారంభించి అందులో రిజిస్టర్‌ చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది.  నిజానికి అర్వింద్ మాట్లాడిన ఈ వీడియో 2023 ఆగస్టుకు సంబంధించినది అని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ఓటర్ల జాబితా, ఈవీఎంల కాంట్రవర్సీ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో అర్వింద్ పాత వీడియోను వైరల్ చేస్తున్నారు. ఎన్నికల్లో బీజేపీ తప్పుడు మార్గాల్లో గెలిచిందనడానికి అర్వింద్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అంటూ కామెంట్ చేస్తున్నాయి.  

ఉప రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇండియా కూటమి?

ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. మరో నాలుగైదు రోజుల్లో అంటే  ఆగష్టు 21తో నామినేషన్ల గడువు, ముగుస్తుంది. అయినా.. అధికార విపక్ష  కూటమి అభ్యర్ధులు ఎవరన్నది ఇంకా  తేలలేదు. అధికార ఎన్డీయే కూటమిలో అభ్యర్ధి ఎవరన్నది మాత్రమే తేలవలసి వుంది. కానీ.. విపక్ష ఇండియా కూటమి అయితే..  అసలు పోటీ చేస్తుందా? లేక ఎటూ ఓటమి తప్పదు కాబట్టి పోటీకి దూరంగా ఉంటుందా? అన్న విషయంలో ఇంత వరకూ స్పష్టత లేదు. అయితే..  కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ  అయితే..  గెలుపు ఓటములతో సంబంధం లేకుండా  ఇడియా కూటమి అభ్యర్ధిని బరిలో దించాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.   నిజానికి ఇటీవల రాహుల్ గాంధీ నూతన అధికార నివాసం బంగ్లా నెంబర్ 5 , సునేహ్రీ బాగ్ లో  ఇండియా కూటమీ నాయకులకు విందు ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు  మల్లికార్జన ఖర్గే, కూటమి కీలక నేతలు   శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, ఉద్దవ్ థాకరే, కనిమొళి సహా ఇంచుమించుగా   40 మంది వివిధ పార్టీల ముఖ్యనాయకులు  హజరైన ఈ విందు సమావేశంలో..   ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఇండియా కూటమి పోటీ చేసే విషయంపైనే  ప్రధానంగా  చర్చించినట్లు తెలుస్తోంది.  కూటమి ఐక్యతను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్ధిని నిలబెట్టాలనే విషయంలో సూత్రప్రాయంగా ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే.. కూటమి అభ్యర్ధి విషయంలో మాత్రం ఎలాంటి చర్చ జరగలేదనీ.. అధికార ఎన్డీఎ కూటమి అభ్యర్ధి ఎవరన్నది తేలిన తర్వాత, మరోమారు అభ్యర్ధి విషయం చర్చిద్దామని ఇండియా కూటమి నేతలు  నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.   అదలా ఉండగా..  అధికార  ఎన్డీఎ కూటమి అభ్యర్ధి ఎంపిక బాధ్యతను, కూటమి భాగస్వామ్య పక్షాలు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు  అప్పగించిన నేపధ్యంలో   ఆదివారం (ఆగస్టు 17) న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో  ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. కాగా.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ జూలై 21న రాజీనామా చేయగా,  కేంద్ర ఎన్నికల సంఘం  నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఆగష్టు 8 న ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించింది. ఒకవేళ ఎన్నికకు పోటీ జరిగితే..  సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య పార్లమెంట్ హౌస్ మొదటి అంతస్తులో పోలింగ్ జరుగుతుంది.  కాగా..  ఇండియా కూటమి సీరియస్ గా ఉప రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగడం ఇంచుమించుగా ఖారారు అయిన నేపధ్యంలో  ఉపరాష్ట్రతి ఎన్నిక రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకేత్తిస్తోంది. అయితే  ఎలా చూసిన కూడా  ఎన్డీఎదే పైచేయి అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.  ప్రస్తుత లెక్కల ప్రకారం ఉపరాష్ట్రపతి ఎలెక్టోరల్ కాలేజీలో(నామినేటెడ్ సహా పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు) మొత్తం 788 ఓట్లున్నాయి. వాటిలో  5 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఒక లోక్ సభ  సీటు ఖాళీగా ఉంది. మిగిలిన 782 ఓట్లలో ఎన్డీఎకి 427  (293 లోక్ సభ. 134 రాజ్యసభ) ఓట్లున్నాయి. ఇండియా కూటమికి లోక్ సభలో 236, రాజ్యసభలో 87  మొత్తం కలిపి 323 ఓట్లున్నాయి. అలాగే..  ఉభయ సభల్లో కలిపి ఏ కూటమిలోనూ లేని తటస్థ సభ్యుల సఖ్య  సుమారు 30 వరకు ఉంటుంది.  సో.. ఈ లెక్క తప్పకుండా ఎవరి ఓట్లు వారికి పోలైనా..  ఎన్డీఎ కూటమి గెలుపు నల్లేరుపై బండి అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.