ఊరంతా ఇల్లరికపు అల్లుళ్లే

  పెళ్లవగానే అమ్మాయిలు అత్తవారింటికి వెళతారు. ఎక్కడో గాని అబ్బాయిలు ఇల్లరికానికి వెళతారు. కాని ఓ ఊళ్లో అసలు అమ్మాయిలు అత్తారింటికే వెళ్లరట. అందరూ ఇల్లరికపు అల్లుళ్లే ఉన్నారట. ఎక్కడనుకుంటారా... ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి నగర పరిధిలోగల కరాయ్ టౌన్షిప్లో అందరూ ఇల్లరికపు అల్లుళ్లే. అల్లుళ్లందరూ మూటాముల్లె సర్దుకొని తమ మామగార్ల ఇళ్లకు వచ్చేస్తారు. దీంతో ఆవీధికి అల్లుళ్ల వీధి అని పేరు కూడా పెట్టారు. అక్కడే దాదాపు 60 కుటుంబాలు ఉండగా వాళ్లలో ఎక్కువ మంది ముస్లింలే. ఆ వీధి మొత్తాన్ని కూడా 'అల్లుళ్ల వీధి' అంటారు. వీరిలో చాలామంది వేరే ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారని అక్కడి స్థానికులు చెప్పారు. దాదాపు 35 సంవత్సరాలనుండి ఇక్కడ ఇలాగే కొనసాగుతోందని తెలిపారు.

చిన్నారి అవయవ దాత

  సాధారణంగా బ్రెయిన్ డెడ్ అయినవాళ్లు, చనిపోయిన వాళ్లు అవయవదానం చేస్తుంటారు. కానీ పుట్టగానే అవయవదానం చేసి చరిత్ర సృష్టించాడు ఓ చిన్నారి. బ్రిటన్ కు చెందిన జెన్ ఇవాన్స్, మైక్ హౌల్ స్టన్ దంపతులకు గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన కవల పిల్లలు జన్మించారు. అయితే వీరిద్దరిలో ఒకరి ఆరోగ్యం బాగానే ఉంది, కానీ మరోబాబు మాత్రం అరుదైన వ్యాదితో జన్మిచాడు. దీంతో వైద్యులు ఆ బాబు కొద్ది నిమిషాలు మాత్రమే బతుకుతాడని నిర్ధారించారు. ఆ పసికందు సమస్య తెలుసుకొన్న తల్లిదండ్రులు గుండె దిటవు చేసుకొని చిన్నారి కిడ్నీలు, గుండె కవాటాలు దానం చేశారు. దాంతో బ్రిటన్ లో అత్యంత చిన్నవయసులో అవయవదానం చేసినవాడిగా రికార్డు సృష్టించాడు. ఈ చిన్నారి అవయవదానం చేసి ఏడాది అయిన సందర్భంగా జస్ట్ గివింగ్ అనే సంస్ఠ చిన్నారి స్పూర్తికథనాన్ని తన వెబ్ సైట్ లో ఉంచింది.

ఏపీ ఇంటర్లో 62 శాతం ఉత్తీర్ణత

  ఆంధ్రప్రదేశ్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. విజయవాడ సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ ఫలితాలను విడుదల చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిలో మొదటిసారి విడుదల చేసిన పరీక్ష ఫలితాలివి. జనరల్‌లో 52 శాతం మందికి ‘ఎ’ గ్రేడ్ వచ్చింది. ఒకేషనల్‌లో 60 శాతం మందికి ‘ఎ’ గ్రేడ్ వచ్చింది. ఇంటర్మీడియట్ పరీక్షలకు 4,61,932 మంది విద్యార్థులు జనరల్ కేటగిరీలో హాజరవగా, 26,913 మంది ఒకేషనల్‌కి హాజరయ్యారు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్‌లో 62.09 శాతం మంది విద్యార్థులు విజయం సాధించారు. గత సంవత్సరంతో పోల్చితే ఇది నాలుగు శాతం ఎక్కువ. మొత్తం ఫలితాలలో 76 శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 59 శాతంతో కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. కాగా, జనరల్ కేటగిరీలో పరీక్ష రాసిన విద్యార్థులలో 79 మంది మీద, ఒకేషనల్ పరీక్ష రాసిన విద్యార్థులలో 12 మంది మీద.. మొత్తం 91 మంది మీద మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. పరీక్షలో ఫెయిలయిన విద్యార్థుల కోసం మే 25 నుంచి జూన్ 2 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి గంటా తెలిపారు.

ఆత్మహత్యలపై మోడీ ఆవేదన

  భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన దర్నాలో రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భారత ప్రధాన మంత్రి మోడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు ఎప్పటినుంచో కలచివేస్తున్నాయని, అలాంటి రైతుల సమస్యలను అర్ధం చేసుకొని వారి సమస్యలకు పరిష్కారాన్నికనుక్కోవాలన్నారు. మనిషి జీవితం కన్నా గొప్పది ఏదీ లేదని, రైతులు అలాంటి జీవితాన్ని కోల్పోతున్నందుకు చాలా బాధగా ఉందని అన్నారు. బాధితుల కుటుంబాలు పడే బాధను తాను అర్ధం చేసుకోగలనన్నారు. రైతుల ఆత్మహత్యలు అనాదిగా కొనసాగుతున్న దౌర్భాగ్యమైన పరిస్ధితికి నిదర్శనం అని ప్రధాని ఆవేదన తెలిపారు.

కేసీఆర్‌ది పైశాచిక ఆనందం

  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తెలుగుదేశం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ అంశం మీద టీటీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కిషన్ రెడ్డి లాంటివాళ్ళని పార్టీలో చేర్చుకుని కేసీఆర్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. టీడీపీ నుంచి ఒకరిద్దరు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టమేదీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, ఏపీ కృష్ణపట్నం విద్యుత్ యూనిట్ ఆరు రూపాయలకు ఇస్తానంటే దాన్ని తీసుకోకుండా లాంకో రాజగోపాల్ దగ్గర యూనిట్ 10 రూపాయలకు కొనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. లాంకో సంస్థకు మేలు చేయడం కోసమే కృష్ణపట్నం విద్యుత్‌ని కేసీఆర్ తిరస్కరించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలాగే యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని ‘యాదద్రి’గా మార్చడం మీద కూడా కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో సింహాద్రి, వేదాద్రి అని పిలుస్తారని, ఆ సంస్కృతిని తెలంగాణకు తేవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇది తెలంగాణ సంస్కృతిని కించపరచడమేనని అన్నారు. యాదగిరి గుట్టకు సంబంధించిన సలహాలను ఆంధ్ర ప్రాంతానికి చెందిన చిన జీయర్ స్వామిని అడిగి తీసుకోవడం ఎందుకని? కొడంగల్‌కి చెందిన వేద పండితులు సుందర వరదాచార్యులును ఎందుకు వద్దనుకున్నారని ప్రశ్నించారు.

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం బుధవారం నాడు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. * ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫిట్‌మెంట్‌తో కూడిన జీతాలను మే 1వ తేదీ నుంచి  అందుకుంటారు. * ఎస్సీ, ఎస్టీ రైతులకు వ్యవసాయ పరికరాలను 70 శాతం సబ్సిడీతో ఇవ్వాలని నిర్ణయించారు. కరువు పీడిత ప్రాంతల్లోని రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రకృతి వైపరీత్యాలకు గురైన రైతులకు నష్టపరిహారం పెంచి ఇవ్వాలని నిర్ణయించారు. వేరుశనగకు హెక్టారుకు 15,000, వరి, పత్తి, చెరకు, కూరగాయల పంటలకు 15,000, మొక్కజొన్నకు 12,500, మామిడి, జీడిమామిడి, బత్తాయి, నిమ్మ, ఆరెంజ్‌ పంటలకు 20,000 నష్టపరిహారం ఇస్తారు. పప్పు ధాన్యాలు, సోయాబీన్‌ పంటలకు 10,000, అరటికి 25,000 పరిహారం చెల్లిస్తారు. * ప్రకృతి వైపరీత్యాల కారణంగా మరణించిన వారి కుటుంబలకు  ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు చెల్లిస్తుంది. మత్స్యకారుల పడవల మరమ్మతుల కోసం 10,000, చేనేత కార్మికులకు 10,000, క్షతగాత్రులు పది రోజులకు మించి ఆస్పత్రుల్లో చికిత్స పొందితే 50,000 ఇస్తారు. * ఉద్యానపంటలకు కేటాయించిన ఇన్‌పుట్ సబ్సిడీలో 80 శాతాన్ని అనంతపురం జిల్లాకే కేటాయించారు. ఈ జిల్లాకు 856 కోట్లు కేటాయించారు. మిగిలిన మొత్తాన్ని  చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలకు కేటాయించారు. * ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరు - చెట్టు కార్యక్రమంలో భాగంగా మే 31వ తేదీ లోపల ప్రాజెక్టుల వంతుగా కాలువల వెంట పర్యటిస్తారు. * ఇసుక రీచ్‌లలో జీపీఎస్ విధానం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. * అంగన్‌వాడీ కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధుల జీతాలను పెంచడానికి కేబినెట్ ఉపసంఘాన్ని నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. * నీటి యాజమాన్య పనుల కోసం ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు 50 కోట్ల చొప్పున, తూర్పు గోదావరి జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు 20 కోట్ల రూపాయల చొప్పున ఉపాధి హామీ పథకం కింద నిధులను కేటాయించారు. ఇకపై గ్రామాల్లో పనుల ఆమోదానికి సర్పంచ్‌లతోపాటు జన్మభూమి కమిటీలకు కూడా అధికారం వుంటుంది.

చిరంజీవి సరసన శ్రీదేవి?

  మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేస్తారు? కొత్త హీరోయిన్ ను పరిచయం చేస్తాడా లేక ఇప్పుడున్న హీరోయిన్ లతోనే చేస్తాడా? అని చాలా సందేహాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తన 150వ సినిమాకు హీరోయిన్ ఖరారైనట్లు న్యూస్ వినిపిస్తోంది. ఆ లక్కీ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా... ఎవరో కాదండి చిరంజీవితో కలిసి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో దేవకన్యలాగా మెరిసి అందరిని మెప్పించిన అలనాటి అందాల తార శ్రీదేవి. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను శ్రీదేవితో ఇప్పటికే మాట్లాడినట్లు, అగ్రిమెంట్కు సంబంధించిన పనులు కూడా పూర్తి అయినట్లుగా టాక్స్ వినిపిస్తున్నాయి.

పనిపిల్ల జడ లాగిన ప్రధాని

  ఎదో సరదాగా పోనీ టెయిల్ పట్టుకొని లాగినందుకు పోనీ లే అని ఊరుకోకుండా రచ్చ చేసిందో వెయిట్రెస్. లాగింది మామూలు వ్యక్తి కూడా కాదు న్యూజిలాండ్ ప్రధానమంత్రి. ఫలితం ఆమెకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ప్రధాని జాన్ కీ ఆక్లాండ్ లో ఓ వెయిట్రస్ వేసుకున్న పోనీ టెయిల్ పట్టుకొని లాగాడు. దీంతో ఆమె దాన్ని వేధింపులుగా భావించడంతో ప్రధాని క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాధారణంగా ప్రాక్టికల్ జోక్స్ వేయడం తనకి ఇష్టమని అన్నాడు. ఆ ఉద్దేశంతోనే పోనీ టైల్ లాగానని, తను చేసిన పనికి ఆమె బాధపడినట్టు తెలిసిన వెంటనే క్షమాపణ చెప్పానని వివరించారు.

నెట్ న్యూట్రాలిటీపై లోక్‌సభలో రచ్చ

  నెట్ న్యూట్రాలిటీ అంశం మీద లోక్‌సభలో చర్చ జరుగుతున్న సందర్భంగా లోక్‌సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ అంశం మీద మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నెట్ న్యూట్రాలిటీ మీద చట్టం తీసుకురావాలని సూచించారు. కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం లొంగిపోతోందని విమర్శించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యల మీద కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. నెట్ న్యూట్రాలిటీ విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు లొంగిపోలేదని, స్పెక్ట్రమ్ వేలంలో అధికంగా బిడ్లు రాబట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. నెట్ న్యూట్రాలిటీ విషయంలో నిబంధనలను రూపొందిస్తున్నామని వివరించారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు విమర్శించారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగి, గందరగోళం ఏర్పడింది.

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు

  తెలంగాణలో ఇంటర్మీడియల్ ప్రథమ సంవత్సర ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 55.60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది కూడా బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది మొత్తం 4,31,361 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,39,954 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలికల ఉత్తీర్ణత శాతం 61.68 కాగా, బాలురు 49.60 శాతం ఉత్తీర్ణత సాధించారు. రంగారెడ్డి జిల్లా (71శాతం) మొదటి స్థానంలో నిలిచింది. నల్గొండ జిల్లా (43శాతం) చివరి స్థానంలో నిలిచింది. ఈ ఫలితాలపై మే 22వ తేదీ లోపు రీ-వెరిఫికేషన్ జరుపుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించాలి. మే 25 నుంచి అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయి.

కారా మాస్టారుకి ఎన్టీఆర్ జాతీయ అవార్డు

  ప్రముఖ తెలుగు కథా రచయిత, కారా మాస్టారుగా అందరూ పిలుచుకునే కాళీపట్నం రామారావు 2015 సంవత్సరానికి ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని మే 28న అందజేస్తారు. అవార్డుతో పాటు లక్ష రూపాయల నగదు పురస్కారం కూడా ప్రదానం చేస్తారు. కాళీపట్నం రామారావు 1924, నవంబరు 9న శ్రీకాకుళం లో జన్మించారు. కాళీపట్నం రాసిన 'యజ్ఞం' కథకు 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఈ క్రింది లింకు ద్వారా కారా మాస్టారు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.   కథా యజ్ఞం చేస్తున్న మహర్షి కారా మాస్టారు

కుక్కకి ఆధార్ కావాలన్న తింగరోడు

  తనతో పాటు తన కుక్కకి ఆధార్ కార్డ్ కావాలని ధరఖాస్తు చేసుకున్నాడు ఓ తింగరోడు. ఈ విచిత్రమైన ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని రాజాపూర్ లో మనీశ్ కుమార్ అనే వ్యక్తి ఓ ప్రైవేటు సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అతను గత మార్చి నెలలో తన కుక్క ఫోటోతో పాటు తప్పు సమాచారాన్ని నింపి ఆన్ లైన్ లో ధరఖాస్తు పెట్టాడు. అది కాస్తా ప్రభుత్వ అధికారుల కంట పడింది. మనీశ్ పెట్టిన దరఖాస్తును వారు తిరస్కరించి ఈ తిక్కలి పనికి పాల్పడినందుకు అతనిపై కేసు పెట్టారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని చూసి చివరికి తనే ఇరుకున పడ్డాడు.