పొరుగు రాష్ట్రాలకు తెదేపా విస్తరణ అంత వీజీ కాదేమో

  జాతీయహోదా సాధించే ప్రయత్నంలో తెదేపా ఈనెల 10వ తేదీన పొరుగునున్న తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించాలని నిశ్చయించుకొంది. ఆ రెండు రాష్ట్రాలలో చాలా మంది తెలుగువారు స్థిరపడి ఉన్నందున అక్కడికి పార్టీని వ్యాపింపజేయడానికి తెదేపా పెద్దగా శ్రమ పడనవసరం లేదు. కానీ పొరుగు రాష్ట్రాలలో బలంగా నిలద్రోక్కుకొని ఉన్న ప్రాంతీయ పార్టీలు తమకు పోటీగా వస్తున్న తెదేపాను స్వాగతించబోవు కనుక మొట్ట మొదట వాటి నుండి కొంత వ్యతిరేఖత ఎదుర్కోవలసి రావచ్చును. ఇక మరో సమస్య ఏమిటంటే కర్నాటకలో ముఖ్యంగా బెంగళూరులో ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల నుండి వెళ్లి స్థిరపడినవారు చాలా మందే ఉన్నారు. కనుక వారిలో తెలంగాణాకు చెందినవారిని తెదేపా ఆకర్షించగలుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.   ఇక బళ్లారిలో పూర్తిగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే స్థిరపడినప్పటికీ వారు తెదేపా, వైకాపాల మధ్య చీలిపోయున్నారు. ప్రస్తుతం వైకాపా ఇంకా అక్కడికి విస్తరించలేదు. కానీ త్వరలో విస్తరిస్తే వారు వైకాపా వైపు మ్రోగ్గు చూపే అవకాశం ఉంది. కానీ వైకాపా కంటే ముందుగానే తెదేపా పొరుగు రాష్ట్రాలలో ప్రవేశిస్తునందున అక్కడ తెదేపా త్వరగా స్థిరపడే అవకాశం ఉంటుంది.   ఇటీవల శేషాచలం అడవులలో ఎర్ర చందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ పై చెన్నైలో అన్ని రాజకీయ పార్టీలు స్వచ్చంద సంస్థలు ధర్నాలు, ర్యాలీలు చేసి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం జేసాయి. ఆ వేడి ఇంకా పూర్తిగా చల్లారక మునుపే తెదేపా పార్టీ ఈనెల 10న చెన్నైలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించాలనుకోవడం వలన ఊహించని కొత్త సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చును. కనుక చెన్నైలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరికొన్ని నెలలు వాయిదా వేసుకొనే ఆలోచన చేస్తే మేలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   అండమాన్ నికోబార్ దీవులలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే అత్యధికంగా స్థిరపడి ఉన్నారు. పైగావారు రాష్ట్ర రాజకీయల పట్ల చాలా ఆసక్తి ఉన్నప్పటికీ, దూరాభారం కారణంగా ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా అక్కడికి వెళ్లి వారిని పార్టీలో చేర్చుకొనే ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు తెదేపా ముందుగా అక్కడికి వెళుతోంది కనుక ఆ పార్టీకి పూర్తి ప్రయోజనం దక్కవచ్చును.

అంధత్వం అడ్డుకాలేదు

  మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. పట్టుదల, కృషి ఉంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్న, ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడు 11 ఏళ్లు బాలుడు. తమిళనాడుకు చెందిన శ్రీరామానుజన్ అనే బాలుడు ఏ తమిళ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా చేసి అందరిని ఆశ్ఛర్యపరిచాడు. అందులో ఆశ్చర్య ఏముంది అంటారా... 11 ఏళ్ల శ్రీరామానుజన్ పుట్టుకతోనే చూపును కోల్పోయాడు. ఏదైనా సాధించాలనే తపనతో, తన లాంటి వారికి స్ఫూర్తి దాయకంగా నిలవాలని మీడియాను వారధిగా ఎంచుకున్నాడు. 22 నిమిషాల బులిటెన్ ను బ్రెయిన్ లిపి ద్వారా చదివి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ సందర్భంగా ఛానల్ ఛైర్మన్ మాట్లాడుతూ ప్రస్తుతం వారానికి ఒక బులిటిన్ మాత్రమే శ్రీరామానుజానికి ఇస్తున్నామని.. తరువాత రెగ్యులర్గా వార్తలు చదివే అవకాశాన్ని కల్పిస్తామని తెలిపారు.

పొరుగు రాష్ట్రాలలోకి విస్తరించనున్న తెదేపా

  తెదేపాను జాతీయపార్టీగా మలిచే ప్రయత్నాలలో భాగంగా పొరుగు రాష్ట్రాలయిన తమిళనాడు, కర్నాటక, ఒడిషా, మహారాష్ట్రాలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించాలని తెదేపా నిశ్చయించుకొంది. వాటితో బాటు తెలుగువారు అధికంగా ఉండే అండమాన్ ,నికోబార్ దీవులలో కూడా పార్టీని వ్యాపింపజేయాలని నిశ్చయించుకొంది. పార్టీకి జాతీయ పార్టీ హోదా లభించాలంటే కనీసం నాలుగు రాష్ట్రాలలో ఆరు శాతం ఓట్లు సంపాదించవలసి ఉంటుంది. కనుక ఇప్పటి నుండే ఇరుగు పొరుగు రాష్ట్రాలలో పార్టీని విస్తరించుకోవాలని పార్టీ నిర్ణయించుకొంది. ముందుగా ఈ నెల 10వ తేదీన చెన్నై, బెంగళూరు నగరాలలో, 14వ తేదీన అండమాన్ ,నికోబార్ దీవులలో కూడా తెదేపా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ మూడు ప్రాంతాలలో నెలరోజుల పాటు సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో 3 లక్షల మందిని, అండమాన్, నికోబార్ దీవులలో లక్షమంది సభ్యులను చేర్చుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకొంది. ఇంతకు ముందు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో కలిపి 50 లక్షల మందిని పార్టీలో సభ్యులుగా చేర్చిన నారా లోకేష్, ఇప్పుడు పొరుగు రాష్ట్రాలలో నిర్వహించబోయే ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియను కూడా స్వయంగా పర్యవేక్షిస్తారు. అందుకోసం ఆయన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో, ఆయా రాష్ట్రాలలో తెదేపా అభిమానులతో నిన్న సమావేశమయ్యి తగిన ప్రణాళికలు సిద్దం చేసుకొన్నారు. కర్నాటకలో సభ్యత్వ నమోదు ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలను అనంతపూర్ జిల్లాకు చెందిన తెదేపా నేతలు పరిటాల సునీత, పార్ధసారధి, కాల్వ శ్రీనివాసులు తదితరులకు అప్పగించారు. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో సభ్యత్వ నమోదు ప్రక్రియకు చిత్తూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావు, యం. సుగుణమ్మ తదితరులు చూస్తారు. అండమాన్ నికోబార్ దీవులలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు ఎక్కువగా స్థిరపడి ఉన్నందున శ్రీకాకుళానికి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడు పర్యవేక్షిస్తారు.

నేటి నుండి సాగర్ లో తెరాస శిక్షణా తరగతులు

  ఈరోజు నుండి మూడు రోజుల పాటు నాగార్జున సాగర్ జలవిహార్ భవన్ లో తెరాస శిక్షణా తరగతులు నిర్వహించ బడతాయి. వీటికి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తో సహా పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు హాజరయి పార్టీ శ్రేణులకు వివిధ అంశాలలో శిక్షణ ఇస్తారు. ప్రభుత్వం ప్రారంభించిన అనేక సంక్షేమ పధకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి పార్టీ ద్వితీయ శ్రేణి నేతలకు, కార్యకర్తలకు ఈ సమావేశాలలో వివరించి, వారి ద్వారా వాటి గురించి ప్రజలలో విస్తృతంగా ప్రజలలో ప్రచారం చేసుకొని ప్రజలకు మరింత చేరువ కావాలని తెరాస భావిస్తోంది.   గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రజలలో తెలంగాణా సెంటిమెంటు ఎంత బలంగా ఉన్నప్పటికీ, పార్టీని గెలిపించుకోవడానికి కేసీఆర్ తో సహా పార్టీ నేతలందరూ చాలా తీవ్రంగా శ్రమించవలసి వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి ఏ సెంటిమెంటు పనిచేసే అవకాశం ఉండకపోవచ్చును. తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఎన్నికలలో ప్రధానాంశాలుగా మారవచ్చును. రాష్ట్రంలో తెదేపా, బీజేపీలు కూడా బలపడేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. కనుక వాటి నుండి మళ్ళీ గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పటి నుండే తెరాస పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.   నిన్న మొన్నటి వరకు జి.హెచ్.యం.సి. ఎన్నికలు తెరాస పీక మీద కత్తిలా వ్రేలాడాయి. హైకోర్టు పుణ్యమాని అవి డిశంబర్ కి వాయిదా పడ్డాయి. అయితే డిశంబర్ కూడా ఎంతో దూరం లేదనే సంగతి తెరాసకు కూడా తెలుసు. ఈలోగానే పార్టీ శ్రేణులను ఆ ఎన్నికలకు కూడా సమాయత్తం చేయవలసి ఉంటుంది. కనుక ఇటువంటి శిక్షణా తరగతులు నిర్వహణ తెరాసకు అత్యావశ్యకమేనని భావించవచ్చును.

హైకోర్టు ఉమ్మడిగానే కొనసాగుతుంది...

  ఏపీ, తెలంగాణ హైకోర్టు తనకు సంబంధించిన వివాదం మీద తానే కీలకమైన తీర్పును వెల్లడించింది. హైకోర్టును విభజించాలని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టును త్వరగా ఏర్పాటు చేయాలని తెలంగాణ న్యాయవాదులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పడే వరకు హైదరాబాద్‌లోని హైకోర్టు ఉమ్మడి హైకోర్టుగానే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుకు కేంద్రమే నిధులు మంజూరు చేయాలని హైకోర్టు పేర్కొంది. విభజన చట్టం ప్రకారం ఇప్పుడున్న హైకోర్టు తెలంగాణకే చెందుతుందని, తెలంగాణ భూభాగంలో ఏపీ హైకోర్టు ఏర్పాటుకు వీలు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఏపీ రైతులు హ్యాపీ

  ఆంధ్రప్రదేశ్ రైతులకు హైకోర్టు ఊరట కలిగించింది. ఆంధ్రరాష్ట్ర నూతన రాజధాని కోసం తీసుకుంటున్న భూముల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. రైతులు వ్యవసాయం చేసుకొనే భూముల జోలికి ప్రభుత్వం వెళ్ళొద్దంటూ, రైతులు వారి పొలాలలో వ్యవసాయం చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైతులకు కొంత ఊరట లభించింది. తమ భూములను నూతన రాజధాని కట్టడానికి ఇవ్వడం ఇష్టం లేదని సుమారు 300 మంది రైతులను హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కొంతమంది రైతులు తమ వద్ద బలవంతంగా అంగీకార పత్రాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అంగీకార పత్రాలు ఇచ్చినవారు కూడా తమ భూములలో వ్యవసాయం చేసుకోవచ్చని హైకోర్టు తేల్చి చెప్పేసింది.

టీఆర్ఎస్ కు హైకోర్టు ఝలక్

  ఉమ్మడి హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. టీఆర్ఎస్ సర్కారు పార్లమెంటరీ సెక్రటరీ పోస్టుల నియామకాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి టీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదని, వెంటనే సెక్రటరీల పోస్టులను రద్దు చేయాలని ఆదేశించింది. తదుపరి నియామకాలు హైకోర్టు అనుమతితో జరపాలని ఆదేశించింది. దీంతో పార్లమెంటరీ సెక్రటరీలుగా బాధ్యతలు చేపట్టిన వినయ్ భాస్కర్, జలగం వెంకట్రావు, గాదరి కిశోర్ కుమార్, సతీశ్ కుమార్, కోవాల లక్ష్మి పదవులు కోల్పోనున్నారు.

కేసీఆర్ మేడే కానుక

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన మేడే కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల శ్రమను పరిశ్రమలు దోపిడీ చేయకూడదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోలకు రవాణా పన్ను లేకుండా చేశాం, గతంలో ఉన్న రవాణా పన్నుబాకాయిలను కూడా మాఫీ చేశామన్నారు. బీడీ కార్మికులుకు ప్రత్యేక బృతి కల్పించిన ఘనత టీఆర్ఎస్ దే అన్నారు. తెలంగాణలో హోంగార్డులకు డ్రైవర్లకు, జర్నలిస్టులకు రూ 5. లక్షల ఉచిత ప్రత్యేక ప్రమాద భీమా సౌకర్యం కల్పిస్తామని అన్నారు. అలాగే తెలంగాణలో ఇక నుండి విద్యుత్ కోతలు ఉండవని అన్నారు. వేలాది పరిశ్రమలు తెలంగాణకు రాబోతున్నాయని, యువతలో స్కిల్స్ డెవలప్ చేయడానికి ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు.

చెప్పినట్టే చేశాం... చంద్రబాబు

  తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాకినాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కాకినాడ లో టూరిజం పార్క్ కు శంకుస్థాపన చేశారు. టూరిజం వల్లే జిల్లా అభివృద్ధి సాధ్యమని అన్నారు. దేశానికి అన్నం పెట్టిన జిల్లా తూర్పుగోదావరి జిల్లా అని అన్నారు. కాకినాడపై టీడీపీకి ఎప్పుడూ ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుందని, కాకినాడలో పోర్టుల అభివృద్ధి జరగాల్సి ఉందని అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పాం... చెప్పినట్టు చేసి చూపించాం అన్నారు. అనంతరం రాజమండ్రిలో నిర్వహించనున్న మేడే కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.

ప్రపంచంలో అతిపెద్ద పార్టీ బీజేపీ

  గత ఏడాది నవంబర్ 1వ తేదీన భారత ప్రధాని నరేంద్రమోడీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం గురువారం అర్ధరాత్రితో ముగిసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవించిందని అన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది సభ్యత్వం కలిగిన పార్టీగా జీజేపీ సరికొత్త రికార్డును సృష్టించిందని ఆయన తెలిపారు. చైనా కమ్యూనిస్టు పార్టీలో 8 కోట్ల 60 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉండగా దానిని తాము అధిగమించామని, బీజేపీలో సభ్యుల సంఖ్య 10.5 కోట్లకు చేరుకున్నందుకు చాలా సంతోషనంగా ఉందని అన్నారు. ఈ క్రెడిట్ అంతా బీజేపీ కార్యకర్తలదే అని, వాళ్ల వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 1.82 కోట్ల మంది పార్టీలో చేరారని పేర్కొన్నారు.

పదేళ్ల బాలుడు పోలీస్ కమిషనర్గా

  రాజస్థాన్ లో ఓ పదేళ్ల బాలుడు పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించాడు. పదేళ్ల బాలుడేంటి పోలీస్ కమిషనర్ ఏంటీ అనుకుంటున్నారా... రాజస్థాన్ కి చెందిన గిరీశ్ శర్మ అనే బాలుడు గత కొద్ది రోజులుగా తీవ్ర కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. ఆబాలుడికి బాగా చదివి పోలీస్ కమిషనర్ కావాలనే కోరిక. దీంతో మేక్ ఏ విష్ ఫౌండేషన్ అనే సంస్థ అతని కోరికను గుర్తించి ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ జంగా శ్రీనివాసరావుకు చెప్పింది. దీంతో ఆయన గిరిశ్ శర్మకు ఒకరోజు పోలీస్ కమిషనర్ అయ్యే అవకాశం కల్పించి తన కోరికను తీర్చారు. పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గిరీశ్ శర్మ తో ప్రత్యేక ఛాంబర్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గిరీశ్ శర్మ మాట్లాడుతూ ఈ దేశానికి ద్రోహం చేసేది ఎక్కువ దొంగలేనని వారిని అరెస్టు చేయడమే తన లక్ష్యమని చెప్పాడు.

ఆంధ్రాలో 4, తెలంగాణాలో 5స్మార్ట్ సిటీలు

  కేంద్రప్రభుత్వం ఆంద్రప్రదేశ్ లో విజయవాడ,గుంటూరు, కర్నూలు, చిత్తూరు నగరాలను, తెలంగాణాలో హైదరాబాద్, వరంగల్,కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ పట్టణాలను కూడా స్మార్ట్స్ సిటీలగా అభివృద్ధి చేయబోతున్నట్లు నిన్న ప్రకటించింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నగరాలు మూడు కూడా రాజధాని పరిధిలోనే ఉన్నాయి గనుక అవి సహజంగానే స్మార్ట్ సిటీలుగా రూపాంతరం చెందవచ్చును. కనుక మిగిలిన నగరాలతో పోలిస్తే వాటిని స్మార్ట్ సిటీలుగా మార్చడానికి కేంద్రప్రభుత్వం అదనంగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. కానీ మిగిలిన నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు చాలా భారీ పెట్టుబడులు అవసరం ఉంటాయి.   ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలతో కలిపి 100స్మార్ట్ సిటీల అభివృద్ధికి, ఇంకా అనేక భారీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదే విధంగా ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, రెండు మెట్రో రైల్ ప్రాజెక్టులు, అనేక ఉన్నత విద్యా వైద్య సంస్థల ఏర్పాటు వంటి భారీ వ్యయమయ్యే అనేక కార్యక్రమాలను కూడా తలకెత్తుకొంది. కనుక ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలోగా ఎన్ని నిధులు విడుదల చేస్తుందో తెలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.   విశాఖ నగరాన్ని కూడా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని, అందుకు అమెరికా దేశ సాంకేతిక సహకారం తీసుకొంటామని ప్రధాని నరేంద్ర మోడీ ఇదివరకు ప్రకటించారు. అంటే విశాఖనగరంతో బాటు రాష్ట్రంలో మరో నాలుగు నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నట్లవుతుంది. అంటే రెండు రాష్ట్రాలలో తలో ఐదు నగరాలను స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయబోతున్నారన్నమాట.

భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు

  పెట్రోలియం సంస్థలు నిన్న అర్ధరాత్రి నుండి దేశవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ ధరలు భారీగా పెంచేశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగటంతో తప్పని సరి పరిస్థితులలోనే ధరలు పెంచవలసి వచ్చిందని చెపుతున్నాయి. పెట్రోల్ పై లీటరుకు రూ.3.96, డీజిల్ పై లీటరుకు రూ.2.37 చొప్పున ధరలు పెరిగాయి. దేశంలో మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో ఎంట్రీ టాక్సుల భారం మోస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ మరియు సరుకు రవాణా వాహనదారులకు ఇది మోయాలని భారం అవుతుంది. అంతిమంగా ఆ భారం తిరిగి సామాన్య ప్రజలపైనే పడుతుంది. గత ఆరేడు నెలలుగా అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గు ముఖం పట్టడంతో గత ఆగస్ట్ నెల నుండి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పెట్రోల్ ధర రూ. 17.11, డీజిల్ ధర రూ. 12.96 తగ్గింది. కానీ ఇప్పుడు ఒకేసారి ఏకంగా పెట్రోల్ ధర రూ.4, డీజిల్ ధర రూ.3 పెరిగిపోయింది. ఒకేసారి ఇంత భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు చూసి సామాన్య పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బస్సులో అత్యాచారయత్నం, హత్య

  పంజాబ్‌లోని మొగా పట్టణంలో కదులుతున్న బస్సులో ప్రయాణిస్తున్న 14 ఏళ్ళ బాలికను కొంతమంది దుండగులు వేధించి అత్యాచారం జరపడానికి ప్రయత్నించారు. ఆ బాలిక ప్రతిఘటించడంతో ఆమెను బస్సు నుంచి కిందకి తోసేసి చంపేశారు. తన తల్లి, తమ్ముడితో కలసి ఆ బాలిక బస్సులో ప్రయాణిస్తుండగా ఈ దారుణం జరిగింది. అత్యాచారం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్ కూడా వున్నారు. బాలికను దుండగులు వేధిస్తూ అత్యాచారానికి ప్రయత్నిస్తూ వుండగా ఆమె తల్లి వాళ్ళను నిలువరించాలని ప్రయత్నించింది. బస్సును ఆపాలని కోరినా డ్రైవర్ ఆపలేదు. చివరికి ఆ దుండగులు ఆ బాలికను, ఆమె తల్లి, తమ్ముడిని బస్సులోనుంచి కిందకి తోసేయడంతో ఆ బాలిక మరణించింది. తల్లి, తమ్ముడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ ఘోరం జరిగిన బస్సు ఆర్బిట్ అనే కంపెనీకి చెందింది. ఈ బస్సులో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌కి చెందినది. దాంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ప్రకాష్ సింగ్ బాదల్ ఈ ఘటన పట్ల తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ బస్సు తమకు చెందినదే అని, ఈ ఘటనకు కారణమైన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇకపై ‘ఎన్టీఆర్ జలప్రభ’

  ఇప్పటి వరకు ఇందిర జలప్రభ పేరుతో అమల్లో వున్న పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరు మార్చింది. ఈ పథకాన్ని ఇకపై ‘ఎన్టీఆర్ జలప్రభ’ పేరుతో పిలుస్తారు. ఈ మేరకు గురువారం నాడు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం పట్ల ఏపీ ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకున్న ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన ఎన్టీఆర్ పేరును ఈ పథకానికి పెట్టడం సముచితమని ప్రజలు, రైతులు అంటున్నారు. ఇదిలా వుండగా, ఒంటిమిట్టలోని రామాలయాన్ని తిరుపతి తిరుమల దేవస్థానానికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామనవమిని కడప జిల్లా ఒంటిమిట్టలో అధికారంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒంటిమిట్ట దేవాలయాన్ని అప్పగించడం వల్ల ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెందే అవకాశం వుంది.