జూబ్లీలో ఉప ఎన్నికలో.. కూటమి పోటీ?

  సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో, ఉప ఎన్నిక అనివార్యమైన జూబ్లీహిల్స్, నియోజక వర్గంలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. నిజానికి, ఉప ఎన్నిక  ఎప్పుడు అనేది ఇంకా తేలలేదు. కానీ, నియోజక వర్గంలో ఎన్నికల సందడి మాత్రం అప్పుడే మొదలైంది. ప్రధానంగా, ఆధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌తో పాటుగా బీజేపీ కూడా  బరిలో దిగేందుకు రెడీ అవుతున్న నేపధ్యంలో సహజంగానే నియోజక వర్గం, అందరి దృష్టిని, మరీ ముఖ్యంగా మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. ఆదాల ఉంటే. జూబ్లీహిల్స్’ అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను కొత్త మలుపు తిప్పునుందా? రాజకీయ సమీకరణలను మార్చివేస్తుందా, కొత్త పొత్తులకు తెర తీస్తుందా,? రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తుందా? ఇలా అనేక కోణాల్లో, అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  దీన్ని బట్టి చూస్తే ఏమి జరిగిన ఏమి జరగక పోయినా,జూబ్లీ ఉప ఎన్నికరాజకీయ ఊహాలకు,వ్యూహాగానాలకు వేదిక అవుతుందనిపిస్తోందని అంటున్నారు.  నిజానికి ఇప్పటికే, అనేక ఉహాలు, వ్యూహాగానాలు సోషల్  మీడియా మొదలు మెయిన్’ స్ట్రీమ్’ మీడియా వరకు కథలు కథలుగా చక్కర్లు కొడుతన్నాయి. అయితే, ఈ ఉహాలను, వ్యూహాగానాలను పూర్తిగా కొట్టివేయడం కుదరదని,, రాజకీయ పండితులు అంటున్నారు. అవును,ఉప ఎన్నిక జరుగుతున్నది, జూబ్లీ హిల్స్’ నియోజక వర్గం కాకుండా మరో నియోజక వర్గం అయితే, ఆ లెక్క వేరుగా ఉండేది. కానీ, జూబ్లీ హిల్స్’  నియోజక వర్గానికి ఉన్న ప్రత్యేక ప్రాధాన్యత  దృష్టా, తెలంగాణలోనే కాకుండా,ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లోనూ జూబ్లీ ఉప ఎన్నిక గురించిన చర్చ జరుగుతోంది. ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ నియోజక వర్గంలో 4 లక్షల మంది ఓటర్లు ఉంటే,అందులో ఒకొంతు ఓటర్లకు కొంచెం అటూ ఇటుగా, ఆంధ్రా మూలాలున్న, సెట్ల్లెర్స్’ ఉన్నారు.అఫ్కోర్స్,అంతకంటే ఎక్కువగా, ఒక లక్షా 20 వేల వరకు ముస్లిం, మైనారిటీ ఓట్లు ఉన్నాయి. అయినా జూబ్లీ నియోజక వర్గంలో గెలుపు ఓటములను నిర్ణయించేది, సెట్లర్’ ఓటర్లే అంటారు.   అదొకటి అయితే, రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన, తెలంగాణ తొలి శాసన సభ ఎన్నికల్లోనూ జూబ్లీ నియోజక వర్గం నుంచి తెలుగు దేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన  మాగంటి గోపీనాథ్’ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్’లో చేరినా, వరసగా 2018, 2023 ఎన్నికల్లో ఆయన్ని గెలిపించింది మాత్రం సెట్లర్స్’ ఓట్లే అంటారు. ఈ నేపథ్యంలో, తెలంగాణలో రీ-ఎంట్రీకి ప్రయత్నిస్తునట్లు చెపుతున్న,తెలుగు దేశం పార్టీ, జూబ్లీ ఉప ఎన్నికను లాంచింగ్ ప్యాడ్’ చేసుకుంటుందని, పరిశీలకులు అంటున్నారు. నిజానికి, రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి ఇప్పటికీ గట్టి పట్టుంది. రాష్ట్ర విభజన నేపధ్యంగా జరిగిన 2014 ఎన్నికల్లో,జనసేన మద్దతుతో పోటీచేసిన బీజేపీ, టీడీపీ కూటమి,20 అసెంబ్లీ స్థానాలు( టీడీపీ 15, బీజేపీ 5) గెలుచు కుంది. 2018లో కాంగ్రెస్’ జట్టుకట్టి పోటీచేసినా టీడీపీ 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. 2023 ఎన్నికల్లో మాత్రం టీడీపీ తెలంగాణలో పోటీచేయలేదు. అయితే,ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాల నేపధ్యంలో, టీడీపీ తెలంగాణలో తిరిగి కాలు మోపేందుకు సిద్డమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఆంధ్ర ప్రదేశ్’ లో సక్సెస్ అయిన, టీడీపీ. జనసేన, బీజేపీ కూటమి ఫార్ములాను తెలంగాణాలో కొనసాగించాలని కూటమి నాయకులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా జూబ్లీ ఉప ఎన్ని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీ చేస్తుందని అంటున్నారు. అయితే, కూటమి తరపున, ఏపార్టీ పోటీ చేయాలి, అభ్యర్థి ఎవరు అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు.

చిన్న జీయర్ స్వామి తొలిసారి స్కాట్లాండ్ సందర్శన

  భువన విజయం సంస్థ, జెట్ యుకే మద్దతుతో నిర్వహించిన చారిత్రాత్మక కార్యక్రమంలో భాగంగా, మహా ఆచార్య శ్రీ చిన్న జీయార్ స్వామికి  ఘన సంప్రదాయ స్వాగతం పలికింది. 29 జూన్ బో’నెస్ టౌన్ హాల్‌లో ఆయన తొలి స్కాట్లాండ్ ఉపన్యాసాన్ని 500 మందికి పైగా భక్తుల సమక్షంలో నిర్వహించారు. స్వాగత ఊరేగింపు కార్యక్రమంలో  సంస్థ  వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ రాజు పర్రి స్వామీజీకి తాజా పూలమాల సమర్పించగా, అద్వితీయ్ అర్జున్ రాజు పర్రి (విజయ్ కుమార్ రాజు పర్రి కుమారుడు) స్కాటిష్ కళ ఐనటువంటి బ్యాగ్‌పైప్ ప్రదర్శనను స్థానిక కళాకారులతో కలిసి ఆకట్టుకునేలా ప్రర్శించారు తరువాత ప్రసాద్ మంగళంపల్లి మరియు ముఖ్య అతిథి డా. శ్రీహరి వల్లభజౌస్యుల సంయుక్తంగా పూర్ణకుంభ స్వాగతం నిర్వహించారు. సాయి దొడ్డ వారి సమూహం సాంప్రదాయబద్దంగా కోలాటం ప్రదర్శించారు. పిల్లలు సంయుక్త నృత్యం పుష్పమాల సమర్పణ. శైలజ గంటి, హిమబిందు జయంతి, మమత వుసికల నిర్వహించిన మంగళ ఆరతి వరకు అన్ని క్షణాలు ఉత్సాహభరితంగా సాగాయి. రంజిత్ నాగుబండి సమన్వయం చేయగా, మిథిలేష్ వద్దిపర్తి కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం నిజరూపం దాల్చడంలో రాజశేఖర్ జాల JET UK వారితో సమన్వయం చేస్తూ ముఖ్యభూమికను పోషించారు.వేదికపై ప్రదర్శింపబడిన కుచిపూడి నృత్యం, ఆరాధనామయ రామ సంకీర్తనం, వీణా వాయిద్య ప్రదర్శన, శ్రీ విష్ణు సహస్రనామ పఠనం, ప్రజ్ఞ పిల్లల శ్లోక పఠన  కార్య‌క్రమాలు ఆహూతులను అలరిస్తూ సాగాయి. ఆ పిదప స్వామీజీ “Ego, Equality & Eternity — A Journey from Self to Supreme” అనే ఉపన్యాసంలో నిత్యవేదాంతసారాన్ని ఆధునిక జ్ఞానంతో మేళవిస్తూ, “అహంకారాన్ని అధిగమించిన ప్రతి హృదయంలో సమానత్వాన్ని, ప్రతి శ్వాసలో శాశ్వతత్వాన్ని కనుగొంటాం” అని ఉత్సాహపూరితంగా పేర్కొన్నారు. ఆయన "భువన విజయం" అనే పేరు వింటే రోమాలు నిక్కబొడుస్తున్నట్లు అనిపిస్తోందన్నారు, ఐదున్నర శతాబ్దాల తరువాత భువన విజయం సభ ప్రాభవాన్ని పునరుజ్జీవింపజేసినందుకు సంస్థను అద్భుతంగా భావించారు. కోర్ బృందం పర్యవేక్షణలో, 30 మంది వాలంటీర్లు అవిశ్రాంతంగా పనిచేశారు మరియు ఈ కార్యక్రమం విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. "పుష్ప స్వాగతం నుండి ప్రసాదం యొక్క చివరి పంపిణీ వరకు, ఈ కార్యక్రమం స్కాటిష్-తెలుగు సంప్రదాయాలను భక్తి మరియు ఐక్యతతో మిళితం చేసింది" అని వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ రాజు ప్యారీ అభిప్రాయపడ్డారు.జీయర్ స్వామి మీద కోదండరావు అయ్యగారి వ్రాసిన పద్యాలను ప్రశంశా పత్రరూపంలో భువన విజయం సభ్యులు స్వామి వారికి బహూకరించారు. "ఏడు కొండల (తిరుపతి) నుండి ఏడు కొండల (ఎడింబర్గ్) వరకు" అని భువన విజయం వారు అందులో పోల్చుతూ ప్రచురించిన తీరు అద్భుతం.“ఇది స్కాట్లాండ్ మరియు బో’నెస్‌ను రంగులతో నింపిన అద్భుత సంప్రదాయ వేడుక” అని ఒక వీక్షకుడు పలికిన మాట ఈ ఘనతను మరింత విస్మయపరుస్తోంది.   

జ‌ర్న‌లిస్టుల‌కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

  జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన జ‌ర్న‌లిస్ట్‌లకు ఇళ్ల‌స్థ‌లాలు ఇవ్వాల‌ని అధికారులకు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నిర్ణయించారు. దీనిపై మంత్రులు అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్, కొలుసు పార్ధ సార‌ధి, నారాయ‌ణ‌ల‌తో ఉప సంఘం ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థలాలపై విధివిధానలను రూపోందించనుంది. వాటిని సమర్పంచనుంది. ఆ తర్వాత ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  రెవెన్యూ శాఖకు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వారసత్వ భూములకు సచివాలయంలోనే సక్సెషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించారు. రూ.10 లక్షల లోపు విలువైన భూములకు రూ.100 రుసుముతో సర్టిఫికెట్లు పొందవచ్చు. క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఆగస్టు 2లోగా, రెవెన్యూ సమస్యలు అక్టోబర్ 2 నాటికి పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.   

నిర్మలమ్మకు.. కమలం పార్టీ పగ్గాలు ?

  ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా, చాలావరకు రాష్ట్రాల్లో, పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలను పూర్తి చేసుకున్న బీజేపీ, పార్టీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసేందుకు సమాయత్తమవుతోంది. ఈనెల 21 న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే, బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని, బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో వచ్చే వారం పది రోజుల్లో, ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వారసుడు ఎవరో తేలిపోతుందని, బీజేపీ వర్గాల విశ్వసనీయ సమాచారం.  అయితే, ఈసారి బీజేపీ జతేఅయ్ అధ్యక్షుని ఎన్నికలో బిగ్ ట్విస్ట్’ ఉంటుందని అంటున్నారు.  బీజేపే జాతీయ అధ్యక్ష పదవి దక్షణాది రాష్ట్రాలకు, అందునా  మహిళా నాయకురాలికి  దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారంగా,మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే, అధ్యక్ష రేసులో, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్’తో పాటుగా,ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి,తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్‌ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.  అయితే దక్షణాది మహిళకు అధ్యక్ష పీఠం అప్పగించాలనే నిర్ణయంలో మార్పు లేకుంటే నిర్మలా సీతారామన్’కు బీజేపీ తొలి మహిళా అధ్యక్షురాలు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి, గత ఏప్రిల్’లోనే నిర్మలా సీతారామన్ పేరు తెరపైకొచ్చింది. కాగా ఇప్పడు తాజాగా, కొద్దిరోజుల క్రితం జేపీ నడ్డా, బీఎల్ సంతోష్‌తో నిర్మలా సీతారామన్ భేటీ అయిన నేపధ్యంలో ఆమె పేరు మరో మారు తెరపైకి వచ్చింది.అదలా ఉంటే, ఇంచుమించుగా 45 ఏళ్ల పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, పార్టీ అధ్యక్ష బాధ్యతలు మహిళ అప్పగించాలని బీజేపీ తీసుకున్న నిర్ణయం, ‘వ్యూహాత్మక’ ముందడుగుగా పరిశీలకులు పేర్కొంటున్నారు. రానున్న 2029 సార్వత్రిక ఎన్నికల నాటికకి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వస్తున్నందున, బీజేపే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అలాగే, దక్షణాది రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసేందుకు, దక్షణాది మహిళకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడ  ఉభయ తారకంగా ఉంటుందని  అంటున్నారు.  అలాగే, ఇంతవరకు, బీజేపీలో ముఖ్య మంత్రులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అయిన మహిళలు ఉన్నారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత, లోక్  సభ స్పీకర్, రాష్ట్రాల గవర్నర్లు వంటి రాజ్యాంగ పదవులను అందుకున్న మహిళలు ఉన్నారు.కానీ, పార్టీ జాతీయ అధ్యక్ష పీఠం మాత్రం మహిళా నేతకు ఇంతవరకు దక్కలేదు. అందుకే ఈ సారి తొలిసారిగా, మహిళానేతకు పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచన పార్టీ పెద్దలు ఉన్నారని అంటున్నారు.  అదే జరిగితే, నిర్మల సీతరామన్’కు పదవి దక్కితే, అది పార్టీ చరిత్రలోనే కాదు, ‘ఫస్ట్’ విమెన్ డిఫెన్స్’ మినిస్టర్, (ప్రప్రధమ మహిళా రక్షణ మంత్రి ) ‘ఫస్ట్’  ఫుల్ టైమ్’  ఫైనాన్సు మినిస్టర్’తో  పాటుగా వరసగా ఎనిమిది సార్లు వార్షిక బడ్జెట్’ ప్రవేశ పెట్టిన తొలి’ అర్హిక మంత్రిగా రికార్డులు సొంతం చేసుకున్న నిర్మలా సీరామన్’ రాజకీయ జీవితంలో మరో మెయిలు రాయిగా నిలిచి పోతుందని అంటున్నారు. అలాగే,ఆమె ఖాతాలో బీజేపీ తొలి మహిళా ప్రెసిడెంట్ మకుటం కూడా చేరుతుందని అంటున్నారు. అనేకాకుండా, దక్షణాది  కోణంలో చూసినప్పుడు ఆమెకు డబుల్ అర్హతలున్నాయని అంటున్నారు. ఆమె తమిళనాడు ఆడ బిడ్డ, ఆంధ్రా/తెలంగాణ కోడలు, ఏపీ, కర్నాటక రాష్ట్రాల నుంచి రాజ్య సభకు ఎన్నికయ్యారు. సో.. ఒక్క కేరళ మినహా  మిగిలిన అన్ని దక్షణాది రాష్ట్రాలతో ఆమెకు వ్యక్తిగత, రాజకీయ సంబంధాలున్నాయి. హిందీ అంతగా రాక పోయినా, తమిళ్, తెలుగు భాషలతోపాటు ఇంగ్లీష్’లోనూ మాట్లాడ గలరు. సో .. బీజేపీ నాయకత్వం నిజంగా దక్షిణాదికి పార్టీ పగ్గాలు అప్పగించాలని, మహిళా నేతకు అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నదే, నిజం అయితే, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు రెండు అర్హతలున్న  నిర్మలమ్మకు అధ్యక్ష పదవి ఖాయం అంటున్నారు. అయితే, ఫైనల్’గా పేరు బయటకు వచ్చే వరకు సస్పెన్స్’ తప్పదు..   అలాగే, ఆమె ప్రధానంగా రాజకీయ నాయకురాలు కాదు.ఎకడమిక్’ పర్సన్’. ఎకనమిక్ లేడీ.  ఒక విధంగా ఆమె లేడీ మనోహన్’ సింగ్ అనుకోవచ్చును. ఇద్దరి మధ్య ఒకటే తేడా, ఇద్దరి దారులు వేరు, పార్టీలు వేరు. అదీ గాక ఆమె ప్రత్యక్ష ఎన్నికలలో ఇంతవరకు పోటీ చేసి గెలవలేదు.అంతేకాదు, 2024ఎన్నికలకు ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే స్థోమత, సామర్ధ్యం తనకు లేదని, పోటీ చేసేందుకు విముఖత చూపారు. అదొకటి అయితే, ఆర్ఎస్ఎస్’ గ్రీన్ సిగ్నల్ విషయంలోనూ అనుమానాలు ఉన్నాయి.సో.. చివరాకు ఏమి జరుగుతుంది అనేది ..వేచి చూడవలసిందే అంటున్నారు.

ఆసుపత్రి నుంచి కేసీఆర్ పార్టీ నేతలతో సమీక్ష

  సాధారణ వైద్యల పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. ప‌రామ‌ర్శించేందుకు పార్టీ నేతలు ప‌లువురు వచ్చారు. ఈ సందర్భంలో వారితో గులాబీ బాస్ ఇష్టాగోష్టి నిర్వహించారు.  రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, తదితర ప్రజా సమస్యలు.. వర్తమాన అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి కేసీఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. బనకచర్ల విషయంలో రేవంత్ సర్కార్ వైఖరి వంటి అంశాలను పార్టీ నేతలు అధినేత దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.  

ఎర్రచందనం స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష..రూ.6లక్షల జరిమానా

  ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి  నరసింహమూర్తి  తీర్పునిచ్చారు. ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ హెడ్  ఎల్. సుబ్బారాయుడు  రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ పర్యవేక్షణలో గతంలో నమోదయ్యి, కోర్టులో విచారణ దశలో ఉన్న కేసుల గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. పగడ్బందీగా సాక్ష్యాధారాలను నిరూపించి ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా క్రైమ్ నెంబరు 23/2019 కేసులో ఈ  ముద్దాయి అరెస్టయ్యారు. ఈ వ్యక్తి తమిళనాడుకు చెందిన వెల్లియన్ కాగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ నాగపట్ల బీట్, చామల రేంజి ప్రాంతంలో పట్టుబడ్డాడు.  వీరి నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష తో పాటు రూ. 6లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. తదుపరి కోర్టు ఆదేశాలు మేరకు వీరిని నెల్లూరు సెంట్రల్ జైలులో అప్పగించడం జరిగింది.  ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం రిజర్వు ఫారెస్టులో అతి విలువైన సహజ సంపద అయిన ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేయడం, అడవిలోకి అక్రమ ప్రవేశించే నేరస్తులకు ఇది ఒక హెచ్చరికగా పరిగణించబడుతుందని టాస్క్ ఫోర్సు అధికారులు తెలిపారు. ముద్దాయిలకు శిక్షలు పడేలా సహకరిస్తున్న కోర్టు సిబ్బందిని  అభినందించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మల్లికార్జున ఖర్గే సీరియస్

  గాంధీ భవన్‌లో జరిగిన తెలంగాణ ప్రదేశ్ కమిటీ సమావేశంలో కొందరి ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురైదుగురు ఎమ్మెల్యేలు కలిసి గ్రూపులు కడితే భయపడతారనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే నేతలను రాహుల్ గాంధీ, నేను పట్టించుకోమని ఖర్గే తెలిపారు. కొత్త పాత అనే తేడా లేకుండా అందరినీ కలుపుకుని ముందుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసినవారికే పదవులు అని ఆయన స్పష్టం చేశారు. అందరు నిబంధనలను పాటించాలని అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారం రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌ గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, దాంతోనే ప్రజల మద్దతు తమకు లభిస్తుందని ఆయన అన్నారు. తమ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని చెప్పడానికి పదవుల పంపణీనే నిదర్శనమని అన్నారు. అగ్రవర్ణ నేతకు ముఖ్యమంత్రి పదవి, బీసీ వర్గానికి చెందిన తనకు పీసీసీ అధ్యక్ష పదవి, నలుగురు దళితులకు మంత్రివర్గంలో స్థానం, మరో దళిత నేతకు స్పీకర్ పదవి ఇవ్వడమే దీనికి నిదర్శనమని ఆయన వివరించారు.

సీఎం అభ్యర్థిగా దళపతి విజయ్

  వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్‌ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకుంటూ కార్యనిర్వాహక మండలి తీర్మానించింది. ఎన్నికల్లో ఏ పార్టీలోనూ పోత్తు పెట్టుకోబోమని ఒంటరిగా పోటీ చేస్తామని పేర్కొన్నాది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. తమిళనాడు ఎన్నికల్లో వేర్పాటువాదులతో పొత్తు ఉండదన్న టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ తెలిపారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని, తమిళనాడులో ఆ పార్టీ విష రాజకీయాలు చెల్లవని విజయ్ తెలిపారు. అలాగే, వచ్చే నెలలో భారీ ఎత్తున రాష్ట్ర మహాసభలు నిర్వహించాలని పార్టీ ప్రతిపాదించింది. తమ పార్టీ సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. 

ప్యాంటు జేబులో పేలిన ఫోన్ ...యువకుడికి గాయాలు

  ప్యాంటు జేబులో పెట్టుకున్న స్మార్ట్ ఫోన్ పేలిన ఘటన హైదరాబాద్, అత్తాపూర్‌‌లో జరిగింది. ఈ ఘటనలో యువకుడి తొడకు గాయాలయ్యాయి. రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. రోజూలాగే తన వివో స్మార్ట్‌ఫోన్‌ను ప్యాంటు జేబులో పెట్టుకుని పనికి వెళుతుండగా, ఫోన్ ఒక్కసారిగా తీవ్రంగా వేడెక్కింది. క్షణాల్లోనే దాని నుంచి మంటలు వ్యాపించి బట్టలకు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన శ్రీనివాస్ మొబైల్ జేబులోంచి బయటకు తీసినప్పటికీ, అప్పటికే అతని తొడకు మంటలు తగిలి చర్మం కాలిపోయింది. స్థానికులు అతడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తొడపై చర్మం కాలిపోయిందని, శ్రీనివాస్ వెంటనే స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని డాక్టర్లు వెల్లడించారు.  

మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌ రెడ్డి పై దాడి

    నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ  పాలన కేంద్రం ఆత్మకూరులో  మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు ఏరాసు ప్రతాపరెడ్డి పై స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేశారు. ఆత్మకూరులో నంద్యాల ఎంపీ  శబరి  దివ్యాంగులకు పరికరాల పంపిణీ కార్యక్రమానికి హాజరు కానున్న క్రమంలో ఏరాసు  కూడా ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి ఏరాసు ఇంటికి చేరుకున్నారు. మాజీ మంత్రి ఏరాసు ఇంటి నుంచి  వెళ్లిన  మరుక్షణమే ఆత్మకూరులోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ముకుమ్మడి దాడి చేశారు. ఏరాసు గో బ్యాక్ అంటూ తెలుగు తమ్ముళ్లు   ఇంటి అద్దాలను  ధ్వంసం  చేశారు.  దీంతో ఆత్మ రక్షణకు  ప్రతాప రెడ్డిని ఆయన అనుచరులు ఇంటిలోకి తీసుకువెళ్లి తలుపులు మూసి వేశారు. కానీ  తెదేపా నాయకులు కార్యకర్తలు ఇంటిని చుట్టుముట్టి రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు  దారి తీయడంతో   పోలీసులు తాపీగా ఏరాసు ఇంటికి చేరుకున్నారు. అయితే పోలీసుల హెచ్చరికలను  ఖాతరు చేయక తెలుగు తమ్ముళ్లు  రెచ్చిపోయారు.  ఏరాసు గో బ్యాక్, ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో చిచ్చు  పెడుతున్నాడని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తూ  ఏరాసు ఇంటిని  చుట్టూ ముట్టారు. ఏరాసు  ప్రతాపరెడ్డిని తమ చేతికి అప్పగించాలని తెలుగు తమ్ముళ్లు పోలీసులపై వాగ్వాదానికి దిగారు.  పరిస్థితి విషమించడంతో  పోలీస్ అధికారులు ఏరాసూ ఇంటికి చేరుకొని ఆయనను ఆయన కారులోనే మరో మార్గంలో ఆత్మకూరు నుంచి  తరలించారు. ఇదిలా ఉంటే  ఇంటి నుంచి బయటకు వచ్చిన ఏరాసు తనపై జరిగిన దాడిని దాడికి  కారకులు  శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి కారణమని చెప్పే క్రమంలో, ఏరాసు ప్రతాపరెడ్డిని మీడియాతో మాట్లాడానీయకుండా ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్ కారును అతివేగంగా తీసుకువెళ్లారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఏకగ్రీవానికి బీఆర్ఎస్ బేరసారాలు?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ లో గుబులు పుట్టిస్తోందా? ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్థి విజయంపై ఆ పార్టీ నమ్మకంగా లేదా? అంటే జరుగుతున్న పరిణామాలు, పరిశీలకులు విశ్లేషణలు గమనిస్తే ఔననే సమాధానమే వస్తుంది. 2023 అసెంబ్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన  మాగంటి గోపినాథ్  అనారోగ్యంతో ఇటీవల మరణించారు. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ లు పోటీకి రెడీ అవుతున్నాయి. అభ్య ర్థుల ఎంపికపై కసరత్తులు ప్రారంభించేశాయి.  అయితే బీఆర్ఎస్ మాత్రం సిట్టింగ్ సీటు కావడంతో ఈ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. త్రిముఖ పోటీలో విజయంపై అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో సెంటిమెంట్ ను తెరపైకి తీసుకు వచ్చి ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న వ్యూహంతో ముందుకు సాగుతోంది.  అయితే కాంగ్రెస్ ఇప్పటికే కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో  విజయం సాధించి బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ జూబ్లీహిల్స్ లోనూ అదే రిపీట్ చేయడానికి పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ తన అభ్యర్థిగా మాగంటి కుటుంబంలోని వ్యక్తినే నిలబెట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. మాగంటీ గోపీనాథ్   సతీమణి పోటీకి సుముఖంగా లేకపోవడంతో మాగంటి గోపీనాథ్  సోదరుడు వజ్రనాథ్ లేదా మాగంటి గోపీనాథ్ కుమారుడిని రంగంలోకి దింపాలని ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. అయినా త్రిముఖ పోటీలో విజయం నల్లేరు మీద బండి నడక కాదన్న ఉద్దేశంతో ‘ఏకగ్రీవం’ అంశాన్ని తెరమీదకు తీసుకువస్తున్నది. గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిస్టింగ్ ఎమ్మెల్యే మరణించి ఉప ఎన్నిక వచ్చిన సందర్భంలో  ఆ దివంగత  ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయం ఉండేది. దీనిని అప్పట్లో అన్ని రాజకీయ పార్టీలూ పాటించాయి.  అయితే రాష్ట్ర విభజన తరువాత ఆ సంప్రదాయానికి బ్రేక్ పడింది. వాస్తవానికి దానిని పక్కన పెట్టేసింది బీఆర్ఎస్ పార్టీయే అని చెప్పాలి.  అయితే ఇప్పుడు మళ్లీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడానికి ఆ పాత సంప్రదాయాన్ని తెరపైకి తీసుకురావడానికి బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఈ దిశగా బీఆర్ఎస్ ఎంఐఎం, బీజేపీలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ తానే గండి కొట్టిన సంప్రదాయాన్ని ఇప్పుడు మళ్లీ తీసుకువచ్చి లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతమౌతాయన్నది తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడక తప్పదు. అయితే మాగంట గోపీనాథ్ కు అన్ని రాజకీయపార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన కుటుంబం పట్ల సానుభూతి ఉంది. దీనినే బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోందని పరిశీలకులు అంటున్నారు.  

కేసీఆర్ ను ఆస్పత్రిలో పరామర్శించిన కల్వకుంట్ల కవిత

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్వస్థతకు గురై సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో గురువారం (జులై3 ) చేరిన సంగతి తెలిసిందే. ఆయన కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు శుక్రవారం హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందనీ, అయితు రక్తంలో సుగర్ స్థాయిలు ఎక్కువగానూ, సోడియం లెవెల్స్ తక్కువగానూ ఉన్నాయని పేర్కొన్నారు. అవి సాధారణ స్థాయికి వచ్చేంత వరకూ మరో రెండు మూడు రోజులు ఆస్పత్రిలోనే ఉంటారని ఈ హెల్త్ బులిటిన్ లో పేర్కొన్నారు. ఆ తరువాత కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో కూడా హెల్త్ బులిటిన్ లో డాక్టర్లు పేర్కొన్న అంశాలనే పేర్కొన్నారు. అలాగే కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతూ... ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.  అదలా ఉంటే కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం (జులై 4) యశోదా ఆస్పత్రికి వచ్చి తండ్రిని పరామర్శించారు. ఇటీవలి కాలంలో కవిత పార్టీ లైన్ ను ధిక్కరించి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ.. జాగృతి బ్యానర్ కింద కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. ముఖ్యంగా ఆమె తండ్రికి రాసిన లేఖ లీక్ అయిన తరువాత నుంచీ కేసీఆర్ ఆమె పట్ల ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరౌతున్న సమయంలో ఆయనను కలవడానికి ఫామ్ హౌస్ కు వెళ్లిన కవితను కనీసం పలకరించను కూడా పలకరించలేదని వార్తలు వినవచ్చిన సంగతి విదితమే.  ఈ నేపథ్యంలోనే కవిత యశోదా ఆస్పత్రికి వెళ్లి తండ్రిని పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

సింగయ్య భార్యతో జగన్ భేటీపై పోలీసులు సీరియస్

మాజీ సీఎం జగన్  రెంటపాళ్ల  పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న కారు కింద పడి సింగయ్య అనే స్థానికుడి ప్రాణం పోయింది. ఆ వివాదం ముదిరింది. దానిపై రాజకీయ రచ్చ తీవ్రస్థాయికి చేరింది. ఇష్యూ చల్లారిపోయిందనుకున్న ప్రతిసారీ.. మళ్లీ రాజుకుంటోంది. మొదటికొస్తోంది. ఈ కేసు విచారణలో ఉండగానే..  కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సీఎం జగన్ స్వయంగా సింగయ్య భార్యతో భేటీ అవడం వివాదాస్పదమైంది. పోలీసులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు సింగయ్య భార్య లూర్ద్ మేరీతో జగన్ భేటీ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన భర్త ప్రమాదం తర్వాత బతికే ఉన్నాడనీ, మాట్లాడాడనీ..  కానీ అంబులెన్స్‌లోనే ఏదో జరిగిందనే అనుమానం వ్యక్తం చేసింది. అంతే కాదు టీడీపీకి చెందిన కొందరు తమ ఇంటికి వచ్చి లోకేశ్ పేరు చెప్పి తమకు అనుకూలంగా మాట్లాడాలంటూ బెదిరించారని కూడా ఆరోపించింది. పోలీసులు కూడా తమపై ఒత్తిడి తెచ్చారంటోంది.  వాస్తవానికి జగన్ ప్రయాణిస్తున్న కారు ముందు చక్రాల కింద సింగయ్య పడిన దృశ్యాల వీడియో ఫుటేజ్ ఇప్పటికే వైరల్ అవుతోంది. అది మార్ఫింగ్ వీడియో అని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు. ఆ వీడియోను అన్ని రకాల టెక్నికల్ పరీక్షలు చేయించామని, ఎలాంటి మార్ఫింగ్ జరగలేదని చెప్తున్నారు. సింగయ్య భార్యని జగన్ కలవడం, ఆమె మీడియాతో మాట్లాడటంపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓ కేసు విచారణలో ఉండగా.. నిందితుడిగా ఉన్న వ్యక్తి.. బాధితుల కుటుంబ సభ్యులను కలవడం, వారి ద్వారా తమకు అనుకూలంగా ప్రకటనలు చేయించడం చట్టవిరుద్ధమని అంటున్నారు. వైఎస్ జగన్ చర్యలు చట్టప్రకారం ఎంతవరకు సమంజసం అనే దానిపై న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.  కేసు నుంచి తప్పించుకునేందుకే  సింగయ్య భార్యని మేనేజ్ చేసి, తమకు అనుకూలంగా మాట్లాడిస్తున్నారని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు. సీఎం చంద్రబాబు సైతం తప్పుడు ప్రచారాలతో ఎప్పటికీ రాజకీయాలు చేయలేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారు కింద పడిన వ్యక్తిని.. కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేసి వెళ్తారా?  కంపచెట్లలో పడేసి వెళ్లారంటే, మానవత్వం ఉందా? అని ప్రశ్నించారు. ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. మరోవైపు.. ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ని కొట్టేయాలని జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తదుపరి చర్యలు, అరెస్ట్‌పై రెండు వారాల పాటు స్టే విధించింది న్యాయస్థానం. ఇది.. జగన్‌కి తాత్కాలికంగా ఊరటనిచ్చినప్పటికీ.. రాజకీయ రచ్చ మాత్రం కొనసాగుతోంది.

బంగారం ధరలు ఢ‌మాల్?.. కారణం ఏంటో తెలుసా?

ల‌క్ష క్రాస్ అయిన‌ట్టు క‌నిపించిన బంగారం ధ‌ర‌లు అనూహ్యంగా యాభై నుంచి డెబ్బై వేల‌కు ప‌డిపోనున్నాయా? అన్న‌ది డిబేట్ గా మారిందిప్పుడు. కొన్ని సంస్థ‌లు కూడా బంగారం ధ‌ర‌లు త‌గ్గు ముఖం ప‌ట్టే ఛాన్సుంద‌ని చెబుతున్నాయి. కార‌ణాలేంట‌ని చూస్తే..   ర‌ష్యా- ఉక్రెయిన్ త‌ప్ప పెద్ద గొప్ప‌గా.. యుద్ధాలేవీ లేవు. ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, హ‌మాస్ వంటి ఘ‌ర్ష‌ణ‌లు త‌గ్గు ముఖం పట్టాయి. అంతే  కాదు భార‌త్- పాక్ మ‌ధ్య గొడ‌వ కూడా స‌ద్దు మ‌ణిగింది. కాబ‌ట్టి యుద్ధ వాతావ‌ర‌ణం లేన‌పుడు ఆటోమేటిగ్గా బంగారం  ధ‌ర‌లు దిగి వ‌స్తాయి.    ఆప‌రేష‌న్ సిందూర్ టైంలో.. బీజేపీ  నేత అన్నామ‌లై ఒక మాట అన్నారు గుర్తుందా? దేశం సుర‌క్షితంగా ఉంటేనే మ‌న‌మూ మ‌న ఇళ్లూ వాకిళ్లూ ఇత‌ర ఆస్తులు నిలిచి ఉంటాయి. అదే దేశం నిత్యం యుద్ధాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటే.. ఆటోమేటిగ్గా మ‌న ఆస్తులు అంత‌స్తులు అన్నీ నాశ‌న‌మై పోయి.. మ‌నం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చేస్తానని అన్నారాయ‌న‌. ఈ మాట‌ల్లో ఎంతో అర్ధం ఉంద‌ని అంటారు నిపుణులు. అప్ప‌ట్లో ఇరాన్ ఇజ్రాయెల్లో ఇంట‌ర్నెట్ లేక చాలా వీడియోల‌ను మ‌నం చూడ‌లేక పోయాం కానీ ఇప్పుడిప్పుడే ఈ రెండు దేశాల్లో ఎంత‌టి విధ్వంసం జ‌రిగిందో తెలిపేలాంటి వీడియోలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కొస్తున్నాయి. ఇపుడీ ఆస్తుల‌న్నీ నిర‌ర్ధ‌క ఆస్తుల‌య్యాయి.  స‌రిగ్గా యుద్ధాల‌పుడు ఇన్వెస్టర్లు.. ఇలాంటి స్థిరాస్తుల మీద , షేర్ల మీద‌గానీ పెట్టుబ‌డులు పెట్ట‌డానికి బ‌దులు బంగారం మీద మ‌దుపు చేస్తే అది శాశ్వతంగా ఉంటుంద‌ని భావిస్తారు. దీంతో బంగారం డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుంది. త‌ద్వారా.. బంగారం ధ‌ర‌లు అమాంతం పెరుగుతాయి. యుద్ధాల‌కూ స్టాక్ మార్కెట్ల‌కు కూడా అంతే లింకు ఉంటుంది. మీరు కావాలంటే చూడండి.. భార‌త్ పాక్ మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ స‌మ‌యంలో పాక్ స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఏకంగా 80 వేల కోట్ల మేర సంప‌ద ఆవిరైంది. దీంతో ఆ దేశం దివాలా తీసి.. ఐఎంఎఫ్ ని అడుక్కోవ‌ల్సి వ‌చ్చింది. ఇలా యుద్ధాలు, రాజ‌కీయ అనిశ్చితి, ద్ర‌వ్యోల్బ‌ణ స‌మ‌యాల్లో బంగారానికి గిరాకీ ఎక్కువ అవుతుంది. త‌ద్వారా.. వీటి రేట్లు పెరుగుతుంటాయి. ఒక్కోసారి ఇన్వెస్ట‌ర్లు చౌక‌గా ఉన్న బంగారాన్ని విప‌రీతంగా కొనేసి.. కృత్రిమ  కొర‌త  సృష్టిస్తారు. ఆపై ధ‌ర‌లు ఒక్క‌సారిగా ఆకాశాన్ని అంటుతాయి. దీంతో త‌మ ద‌గ్గ‌రున్న బంగారం అధిక ధ‌ర‌ల‌కు అమ్మేస్తుంటారు. ఇలా బంగారం చుట్టూ ఎంతో మార్కెట్ మాయాజాలం న‌డుస్తూ ఉంటుంది. అందులో భాగంగా చూస్తే ప్ర‌స్తుతం ప్రపంచ‌మంతా ప్ర‌శాంతంగా ఉంది  కాబ‌ట్టి బంగారం ధ‌ర‌లు నేల‌మీద‌కు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని అంచ‌నా వేస్తున్నాయి కొన్ని గోల్డ్ రేటింగ్ కంపెనీలు.  దానికి తోడు భార‌త్ లో ఆషాడమాసంలో డిమాండ్ బాగా త‌క్కువ ఉంటుంది. ఈ జూలైలో బంగారం ధ‌ర 70 వేల‌ రూపాయలకు ప‌డిపోయినా  ఆశ్చ‌ర్యం లేదంటున్నారు. ఇప్ప‌టికే 18 కేరెట్ల బంగారం 73 వేల ప‌లుకుతోంది. ఇక 22 కేరెట్లు సుమారు 89  వేలు, 24 కేరెట్ల బంగారం 97 వేల రూపాయల పై చిలుకు ప‌లుకుతోంది. జూన్ 28 నుంచి జూలై 1 మ‌ధ్య కాలంలో బంగారం ధ‌ర ప‌డిపోయింది. దీంతో ఇది ల‌క్ష లోపున‌కు వ‌చ్చేసింది. అందుకే అంటోంది.. ఈ డిమాండ్ స‌స్లై  చైన్ లో బంగారం ధ‌ర‌లు ఇలా హెచ్చు త‌గ్గుల‌కు లోన‌వుతున్నాయ‌ని.  అంతే కాదు  బ్యాంకుల వ‌డ్డీలు, అమెరికా ఫైనాన్షియ‌ల్ డేటాలు, యూఎస్- చైనా మ‌ధ్య ఒప్పందాలు, ఆపై గ‌నుల్లో త‌వ్వ‌కాల త‌గ్గుద‌ల వంటివి కూడా బంగారం ధ‌ర‌ల హెచ్చు తగ్గుల‌ను శాసిస్తుంటాయ‌ని అంటారు మార్కెట్ నిపుణులు. కాబ‌ట్టి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసే ముందు.. ఎవ‌రైనా నిపుణుల‌ను అడిగి  పెట్టుబ‌డులు పెడుతుండాలి. సో బీ అవేర్ ఆఫ్ ఇట్ అంటారు గోల్డ్ మార్కెట్ ఎక్స్ ప‌ర్ట్స్.

పైర‌సీని అరిక‌ట్టడం ఎలా?

శత కోటి ద‌రిద్రాల‌కు అనంత కోటి ఉపాయాలున్నాయి. కానీ పైర‌సీకి మాత్రం ఒక్క‌టంటే ఒక్క ఉపాయం కూడా క‌నుగొన‌లేక పోవ‌డం విచార‌క‌రం. పైరసీని అరికట్టడం ఎలా ఉన్నదే  ప్ర‌స్తుతం టాలీవుడ్ జ‌నాల‌ను వేధిస్తోన్న ప్ర‌శ్న‌.  ఒకే ఒక్క‌డు..  చిన్న‌పాటి సెల్ ఫోన్ కెమెరా వాడి హెచ్ డీ ప్రింట్ త‌ల‌ద‌న్నేలా సినిమాల‌కు సినిమాల‌ను పైర‌సీ చేస్తుంటే.. టాలీవుడ్ ఇంత టెక్నాల‌జీ సాయం ఉండి కూడా ఏమీ చేయ‌లేక పోవ‌డం విడ్డూరం. విచార‌క‌రం. విచిత్ర‌మేంటంటే సినిమాను బ‌ట్టి న‌ల‌భై నుంచి ఎన‌భై వేల మ‌ధ్య వ‌ర‌కూ ఇత‌డు వ‌సూలు చేయ‌డ‌మే కాకుండా ఇప్ప‌టి  వ‌ర‌కూ సుమారు 65 సినిమాల‌ను మూవీ  రూల్స్, ఐ బొమ్మ వంటి సైట్స్ కి అమ్మి సొమ్ము చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోవ‌డ‌ం తప్ప మరే చేయలేకపోవడం ఏమిటి? ఈ పైర‌సీ మూవీ సైట్స్ ని ఎందుకు ఆప‌లేక పోతున్నాం.. ఒక సాధార‌ణ  టెక్నీషియ‌న్ కి తెలిసినంత కూడా ఇక్క‌డి సినీ జ‌నానికి తెలియకపోవడం ఏమిటి? పైరసీకి విరుగుడు ఎందుకు క‌నిపెట్ట‌లేక పోతున్నారు?  019 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ టాలీవుడ్ కి ఈ ఒక్క‌ పైరసీకారుడి ద్వారా ఏర్ప‌డ్డ న‌ష్టం ఏకంగా 3500 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.  ఒకే ఒక్క‌డు ఎంద‌రో 24 క్రాప్ట్స్ కి చెందిన  క‌ళాకారుల క‌ళారూపాల‌ను వారి ఆశ‌లూ ఆశ‌యాల‌ను ఛిద్రం చేస్తుంటే చోద్యం చూస్తూ ఊరుకోవడమేంటన్నది అంతుపట్టని, సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోతోంది.   త‌మపై వ్య‌క్తిగ‌తంగా త‌ప్పుడు క‌థ‌నాలు వ‌చ్చిన‌పుడు సినిమా స్టార్లు సైబ‌ర్ క్రైమ్ కి కంప్ల‌యింట్ చేస్తుంటారు. అదే త‌మ సినిమాల‌కు సంబంధించి ఎలాంటి  కంప్ల‌యింట్లు చేయ‌రు. అదీ తొలి రోజు తొలి ఆట పడీ ప‌డ‌క ముందే మూవీ రూల్స్ వంటి సైట్ల‌లో ఆయా సినిమాలు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంటే.. ఆ సినిమాకు ప‌ని చేసిన వారు కూడా థియేట‌ర్ కి వెళ్ల‌కుండా ఈ పైరేట్ సైట్ల‌లో చూస్తుంటారు.  సినీ జ‌నాల్లో అత్య‌ధికులు త‌మ ప్ర‌త్య‌ర్ధి హీరోల, ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ సినిమాలు ఎలా ఉంటాయో చూసేది ఈ విధానం ద్వారానే అంటారు. ఆ మాట‌కొస్తే పైర‌సీ అనేది వెలుగు చూసిందే వీరి వ‌ల్లనంటారు. అద‌లా పాకి పాకి.. నేడు ఇండ‌స్ట్రీకే అతి పెద్ద న‌ష్ట‌దాయ‌కంగా మారిందని చెప్పుకొస్తారు కొంద‌రు. సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఎన్నో సినిమాలు.. నేడిలా న‌ష్టాల బారిన  ప‌డుతున్నాయంటే అందుకు కార‌ణం ఈ పైర‌సీ  సైట్లే కాబ‌ట్టి.. వీటి నుంచి విముక్తి కోసం మార్గాల‌ను అన్వేషించాలి. ఉదాహ‌ర‌ణ‌కు ఈ సైట్లలో సినిమా చూస్తే వాటి ద్వారా ఒక వైర‌స్ పాకి.. ఆయా ఫోన్లు, టీవీ సెట్లు చెడిపోయేలాంటి కొన్ని ఏర్పాట్లు  చేయ‌వ‌చ్చు. ఈ మ‌ధ్య కాలంలో  టెక్నాల‌జీ  బాగా పెరిగింది. ఎథిక‌ల్ హ్యాకింగ్ వంటి కార్య‌క‌లాపాలు పెరిగాయి.. వీటి ద్వారా కూడా  క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చు. ఇలాంటి ఎన్నో అవ‌కాశాలున్నా.. సినిమా వాళ్లు ఇవేవీ వాడుకోవాల‌నుకోకపోవడానికి కారణమేంటి? ఇప్ప‌టికైనా మించి పోయింది లేదు.. యాంటీ పైర‌సీ సెల్ కి చెందిన మ‌ణీంద్ర అనే ఇత‌డు చేసిన ఈ ప్ర‌య‌త్నం వ‌ల్ల కిర‌ణ్ అనే ఒక పైరసీగాడు దొరికాడు. ఇత‌డి ద్వారా ఆ మొత్తం పైర‌సీ వ్య‌వ‌హారం గుట్టు అయ్యింది. వీళ్లు క్రిఫ్టో క‌రెన్సీ రూపంలో ఎలాంటి న‌గ‌దు లావాదేవీలు జ‌రుపుతారో గుర్తించి.. త‌ద్వారా ఈ మొత్తం పైర‌సీ ముఠా గుట్టు ర‌ట్టు చేయాల‌ని కోరుకుందాం. సేవ్ టాలీవుడ్- సే నోటు పైర‌సీ అని నిన‌దిద్దాం.

జూలై 5న జపాన్ ను ముంచెత్తనున్న సునామీ? .. న్యూ బాబా వంగా జోస్యం నిజ‌మ‌వుతుందా?

జ‌పాన్ మాంగా క‌ళాకారిణి రియో టాట్సుకీ.. జూలై ఐదున జ‌పాన్ కి భారీ సునామీ రానుంద‌ని చెప్ప‌డంతో.. ఎంద‌రో త‌మ జ‌పాన్ టూర్ వాయిదా వేసుకున్నారు. ఒక్క‌సారిగా  జ‌పాన్ టూరిజం ప‌డ‌కేసింది. జూన్ చివ‌రి వారం నుంచి జూలై ఫ‌స్ట్ వీక్ వ‌ర‌కూ త‌మ త‌మ ప‌ర్య‌ట‌న‌లు పోస్ట్ పోన్ చేసుకున్నారు.  కార‌ణం.. న్యూ బాబా వంగాగా  పేరున్న టాట్సుకీ.. 2011 జ‌పాన్ సునామీని కూడా స‌రిగ్గా ఇలాగే అంచ‌నా వేశారు. దీంతో జ‌పాన్ ప్ర‌జ‌లు గుండెలు అర‌చేత ప‌ట్టుకుని తిరుగుతున్నారు. టాట్సుకి తన పుస్తకం "ది ఫ్యూచర్ ఐ సా"లో 2025 జూలై 5న జపాన్ లో భారీ సునామీ వస్తుందని అంచనా వేయ‌డంతో జ‌నం బెంబేలెత్తి పోతున్నారు. ఇక్క‌డ మ‌రో వింత ఏంటంటే జ‌పాన్ ప్ర‌జ‌ల‌క‌న్నా జ‌పాన్ రావాల‌నుకుంటున్న వారు ఈ వార్త తెలిసి హ‌డ‌లెత్తిపోతున్నారు. బేసిగ్గా ఇక్క‌డ ఈ సీజ‌న్లోని ప్ర‌కృతి అందాలు చూడ్డానికి పెద్ద ఎత్తున జులై నెల‌లో టూర్ గా వ‌స్తుంటారు జ‌పాన్ చుట్టుప‌క్క‌ల దేశాల వారు.  ఇంత‌టి ప్ర‌కృతి వినాశ‌నం  జ‌ర‌గబోతుంద‌ని న్యూ బాబా వంగా చెప్ప‌డంతో.. ఆ ప్ర‌కృతి ప్ర‌కోపంలో ప‌డి మ‌నం ఎందుకు ప్రాణాలు కోల్పోవ‌డం అంటూ స‌గానికి స‌గంపైగా టూరిస్టులు జ‌పాన్ టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో ఎన్నో విమానాలు ర‌ద్ద‌య్యాయి. హోట‌ళ్ల బుకింగ్ కూడా భారీగా  ప‌డిపోయింది.   దీనంత‌టికీ కార‌ణం ఇలాంటి జోతిష్యులు చెప్పిన‌వి జరుగుతుండటమే. గ‌తంలో బెల్జియంకి చెందిన  బాబా వంగా కూడా స‌రిగ్గా ఇలాగే ముందే విప‌త్తుల‌ను ఊహించి చెప్పేవారు. ఆమె త‌ర్వాత జ‌పాన్ కి చెందిన టాట్సుకీ సైతం ఇలాంటి ముంద‌స్తు జోస్యాలు చెప్ప‌డం మొద‌లెట్టారు. గ‌తంలో ఇలాంటిదొక‌టి నిజం  కావ‌డంతో.. ఇప్పుడంద‌రూ అదే నిజ‌మ‌వుతుంద‌ని భావిస్తున్నారు. జులై ఐదున జ‌పాన్ లో ఏదో ఒక విప‌త్తు జ‌ర‌గ‌బోతుంద‌ని గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. అయితే ఇక్క‌డ జ‌పాన్ ప్ర‌భుత్వం ఏం చెబుతోందంటే.. మీరు భ‌య  ప‌డుతున్నారు గానీ మా జ‌ప‌నీయులు భ‌య ప‌డ్డం లేదు.  అస‌లేం జ‌ర‌గ‌ద‌ని తెగేసి చెబుతున్నారు. ఒక వేళ జూలై ఐదున ఏదైన విప‌త్తు జ‌ర‌గుతుంద‌ని మా వాళ్లు న‌మ్మే ప‌నైతే ఈ పాటికే దేశం విడిచి పారిపోయేవాళ్లు క‌దా? ఇక్క‌డెవ‌రూ అలాంటి హ‌డావిడిలో లేరు కావాలంటే చూసుకోండ‌ని అంటున్నారు. సునామీ అంటే ఏమిటి? స‌ముద్ర గ‌ర్భంలో ఏర్ప‌డే భూకంపం.. తీర ప్రాంతాల్లోకి భారీ అల‌లు వ‌చ్చి ప‌డ‌తాయి. ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉంటే అదే స‌ర్దుకుంటుంది. ఒక వేళ భూకంపం త‌మ‌ను ప్ర‌భావితం చేస్తే.. ఎలా అన్న‌ది వారు ఇప్ప‌టికే ఒక అవ‌గాహ‌న‌లోకి వ‌చ్చేశారు. త‌మ టెక్నాల‌జీ సాయంతో భూకంపాల‌ను త‌ట్టుకోవ‌డం ఎలాగో నేర్చేసుకున్నారు. కాబ‌ట్టి.. డోంట్ ఫియ‌ర్ పాల‌సీ  మెయిన్ టైన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ

హైదరాబాద్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  శుక్రవారం (జులై 4) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  కులగణన, బీసీ రిజర్వేషన్లు తదితర అంశాలపై వీరిరువురి మధ్యా చర్చ జరిగినట్లు సమాచారం. అంతకు ముందు గురువారం (జులై 3) హైదరాబాద్ చేరుకున్న మల్లికార్జున ఖర్గే  కు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఖర్గేకు స్వాగతం పలికిన వారిలో  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు ఉన్నారు. అదలా ఉంచితే  గాంధీ భవన్ లో జరిగే పీఏసీ భేటీలో మల్లిఖార్జున్ ఖర్గే పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం పార్టీ అధ్యక్షుడు ఖర్గే పార్టీ ఆఫీస్‌ బేరర్స్‌తో సమావేశమౌతారు. అంతే కాకుండా మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఖర్గేతో భేటీ అయ్యారు.  ఇక   స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై పార్టీ కీలక నేతలతో ఖర్గే చర్చిస్తారు.