అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

  అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు అంగన్వాడీ సహాయకుల నుంచి టీచర్లుగా పదోన్నతి పొందాలంటే గరిష్ఠ వయసు 45 ఏళ్లుగా ఉండేది. తాజాగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఈ నిబంధనను సవరించి, వయోపరిమితిని 50 ఏళ్లకు పెంచింది. ఈ మార్పునకు సంబంధించిన ఫైలుపై ఆ శాఖ మంత్రి సీతక్క  సంతకం చేసి ఆమోదం తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తెలంగాణ వ్యాప్తంగా పని చేస్తున్న 4,322 మంది అంగన్వాడీ సహాయకులకు ప్రయోజనం కల్గునుంది. కాగా ఇటీవల అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ వయస్సు 60 నుంచి 65 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే.

పెళ్లయిన పది రోజులకే ఫుట్‌బాల్ ప్లేయర్ దుర్మరణం

  పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. స్పెయిన్ సనాబ్రియాలో సోదరుడితో కలిసి లంబోర్గిని కారులో ప్రయాణిస్తున్న సమయంలో టైరు పేలి అదుపుతప్పి బోల్తా పడింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు. 10 రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న జోటా, స్పెయిన్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. జూన్ 22న తన ప్రేయసి రూట్ కార్డోసోను జోటా వివాహం చేసుకున్నాడు. వారికి పెళ్లికి ముందే ముగ్గురు పిల్లలు ఉన్నారు.  ఈ యాక్సిడెంట్ జరగడానికి కేవలం కొన్ని గంటల ముందే, "ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేం" అనే క్యాప్షన్‌తో తన పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ కన్నీటిపర్యంతమవుతున్నారు. పోర్చుగల్ జాతీయ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించిన జోటా, 2020 సెప్టెంబర్‌లో లివర్‌పూల్ క్లబ్‌లో చేరాడు. గత మే నెలలోనే లివర్‌పూల్ జట్టుతో కలిసి ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. 

హరిహర వీరమల్లు ట్రైలర్...ద్వారా మనకేం తెలుస్తోంది?

  పవన్ కళ్యాణ్‌ అయితే పూర్తిగా హిందుత్వ భావజాలాన్ని నెత్తికి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది ఈ ట్రైలర్ ద్వారా మనకు అదే తెలుస్తోందంటారు కొందరు.. 2. 30 నిమిషాల ట్రైలర్ లోనే హిందూ శబ్ధం.. దాని ఛాయలు లెక్కలేనన్ని సార్లు కనిపించాయి. వినిపించాయి. అంతే కాదు, కోహినూర్, ఔరంగజేబ్ వంటి ఆనవాళ్లతో హర హర మహదేవ్ అనే బీజింగ్ మధ్య.. ఈ ట్రైలర్ డెడికేటెడ్ టూ హిందూస్ అన్నది స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతోంది. ఇక ధర్మానికి సంబంధించిన టెక్స్ట్ కూడా ప్లే కావడం చూస్తుంటే సనాతన ధర్మం పవన్ కేవలం తన పొలిటికల్ ఎజెండా మాత్రమే కాకుండా.. దాన్ని సినిమాల ద్వారా కూడా వ్యాప్తి చెందించే యత్నంగా భావిస్తున్నారు. గతంలో  మోడీ బాలీవుడ్ మొత్తాన్ని పిలిచి.. ఇప్పటి వరకూ చరిత్రలో మరుగున పడ్డ హిందూ అన్ సంగ్ హీరోలు, వారికి సంబంధించిన అన్ టోల్డ్ స్టోరీలు తీయమని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ కుమార్ వంటి వారు తప్ప.. మిగిలిన హీరోల్లో చాలా మంది ముస్లిములు ఉండటం వల్ల ఏమంత ఎక్కువగా ఈ తరహా  సినిమాలు రావడం లేదు. వచ్చినా అవి చావా రేంజ్ లో జనాల్లోకి వెళ్లడం లేదు.  అయితే పవన్ ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయాల్లో కూడా ఉండటం వల్ల.. అందునా బీజేపీతో టై- అప్ అయి ఉండటం వల్ల.. ఆయనకంటూ ఒక వెసలుబాటు ఏర్పడింది. ఇప్పటికే ఆయన తెరబయట కూడా సనాతన ధర్మ వారధిగా విశేషంగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు. మొన్నటికి మొన్న- తమిళనాడు మురుగన్ మానాడులో ఆయన మత ప్రసంగాలపై క్రిమినల్ కేసులు కూడా తోడయ్యాయి. ఈ క్రమంలో ఆయన తగ్గుతాడనుకుంటే.. హరి హర వీరమల్లు వంటి చిత్రాలతో మరింతగా చెలరేగేలా తెలుస్తోంది. అంతేనా ఈ పార్ట్ 1లో కత్తికి- దెయ్యానికీ మధ్య యుద్ధం అన్న అర్ధమొచ్చేలా 'స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' అన్న కలరింగ్ ఇస్తున్నారు. అంటే రెండో పార్టు కూడా అంతే స్థాయిలో హిందుత్వ భావజాల వ్యాప్తి ఉండేలా కనిపిస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్‌ పూర్తి హిందుత్వం పుణికి పుచ్చుకున్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు సినీ రాజకీయ విశ్లేషకులు!  

మైక్రోసాఫ్ట్‌లో భారీగా ఉద్యోగాల కోత..ఏఐ ప్రభావంతో లేఆఫ్స్

  ఐటీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్నమైక్రోసాఫ్ట్ సంస్థ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. వేలాది మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేయనున్నట్లు ప్రకటించడంతో టెక్ పరిశ్రమలో ఆందోళన నెలకొంది. కొద్ది నెలల వ్యవధిలోనే భారీ స్థాయిలో ఉద్యోగాల కోత విధించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్‌ మార్కెట్లలో ఒత్తిడి, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం.. వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను  తొలగిస్తున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా 2019లో మొదలైన ఈ కోతలు.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి.. మరోవైపు, దాదాపు 9 వేల మంది ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ లేఆఫ్‌లు ఇవ్వనున్నట్లు కొన్ని వార్తా సంస్థలు అంచనా వేస్తున్నాయి.  జూన్ 2024 నాటి గణాంకాల ప్రకారం, మైక్రోసాఫ్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా 2.28 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో సుమారు 6 వేల మంది ఉద్యోగులను కంపెనీ తొలగించింది. తాజా లేఆఫ్‌ల కారణంగా దాదాపు 9,100 మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. లగ్జరీ లైఫ్‌కు అలవాటున టెకీలు గొప్పలకు పోయి వృధాగా ఖర్చు పెట్టొద్దని మిడతల్లా అందుబాటు లో ఉన్నది మొత్తం తినేయడం కాదని నిపుణులు అంటున్నారు. ఇన్నాళ్లు తెలుగోళ్లు సాఫ్ట్వేర్ ఉంటారు. ఇంకా వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఉంటే బ్లూ కాలర్ పనులకోసం బీహార్, వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్, రాజస్థాన్ ఇంకా ఈశాన్య రాష్ట్రాల వారు మన రాష్ట్రాని వస్తున్నారు. బతుకు తెరువు కోసం తెలుగు వారు బ్లూ కాలర్ ఉద్యోగాలు చేయాల్సిన కాలం ఎంతో దూరంలో లేదని నిపుణులు భావిస్తున్నారు.  

పరదాలు పోయి.. పాదయాత్ర అంటున్న జగన్

మాజీ సీఎం జగన్ పాదయాత్ర జపం వినిపిస్తున్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర ఉంటుందని జగన్ ప్రకటించారు. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని.. చివర్లో పాదయాత్ర ఉంటుందని ఆయన వెల్లడించారు. సుదీర్ఘ పాదయాత్రతోనే గతంలో అధికారంలోకి వచ్చానని నమ్ముతున్న ఆయన తిరిగి  పాదయాత్రతోనే అధికారంలో రావాలని భావిస్తున్నారు. మొత్తానికి పరదాల మాటు సీఎం  అనిపించుకున్న జగన్ ఇప్పుడు పాదయాత్రం అంటుండటం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మరోసారి పాదయాత్ర చేస్తారనే చర్చ సాగుతూ వచ్చింది.. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని.. అవసరం అయితే, మరోసారి పాదయాత్ర చేస్తానని  పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ వచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తాజాగా జరిగిన యువ విభాగ సమావేశంలో పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు జగన్‌.  జగన్ పాదయాత్ర ప్రకటనతో మరోసారి ఏపీలో పాదయాత్రలపై ఆసక్తికర చర్చ మొదలైంది.  జగన్‌కు పాదయాత్ర కొత్త ఏమీ కాదు. 2019లో అధికారంలోకి వచ్చేందుకు ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్రతోనే ఏపీలో తిరుగులేని విజయాన్ని సాధించామని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. 2029 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పాదయాత్ర చేయాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. పాదయాత్ర కంటే ముందే జగన్ జిల్లాల పర్యటనలు కూడా చేస్తానంటున్నారు.  వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే జగన్ జిల్లా పర్యటనలు చేస్తానని ప్రకటించారు. ఆయా జిల్లాల్లో రెండు రోజులు నిద్ర చేస్తానని కూడా చెప్పారు. అయితే ఆ  పర్యటనల షెడ్యూల్ ఇంత వరకు ప్రకటించనే లేదు. ఈ సారి కూడా తన పర్యటనలు ఎప్పటి నుంచి ఉంటాయో అయన వెల్లడించలేదు.  అదలా ఉంటే.. అధికారంలో ఉన్నంత కాలం బయటకొస్తే పరదాల మాటున పాలన కొనసాగించిన జగన్ ఇప్పుడు పాదయాత్ర అంటుండటంపై సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రిగా జనంలోకి రావడానికి సంకోచిస్తున్నట్లు పరదాల మాటునే గడిసేసిన ఆయన పాదయాత్ర అంటుండటంతో.. పరదాలు పోయి, పాదయాత్ర వచ్చిందని నెటిజన్లు  ఎద్దేవా చేస్తున్నారు. పవర్ పోగానే ప్రజల్లోకి వస్తానంటుండటంతో అప్పుడు జనం గుర్తుకు రాలేదా అన్న విమర్శలు రీసౌండ్ ఇస్తున్నాయి.

బీసీ రిజర్వేషన్లుపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనివ్వాలి : ఎమ్మెల్సీ కవిత

  తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని  బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జులై 17న రైల్‌ రోకోకు  ఆమె  పిలుపునిచ్చారు. అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్తామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు ముందడుగు వేయలేదని విమర్శించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని కవిత స్పష్టం చేశారు. జూలై 8 లోపు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ముఖ్యమంత్రి  ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌లోని బీసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలన్నారు. బీసీ బిల్లు విషయంమై బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి లేఖ రాస్తున్నామని తెలిపారు.  బీసీ బిల్లుపై బీజేపీ చొరవ తీసుకోవాలని, ఈ విషయమై ఆ పార్టీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావుకు లేఖ రాశామని చెప్పారు. ఆయన చొరవ తీసుకోని బీజేపీ అధ్యక్ష హోదాలో తొలి విజయం నమోదు చేసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వస్తున్నారని విమర్శించారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ బీసీల కోసం పార్లమెంట్‌లో ఎన్నడూ మాట్లాడలేదని మండిపడ్డారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి కనబరుస్తున్నదని విమర్శించారు.   

శిద్దా ఫ్యామిలీ పొలిటికల్ గా ఇక తెరమరుగేనా?

మాజీ మంత్రి శిద్దారాఘవరావు ఒకప్పుడు తెలుగుదేశంలో కీలక నేత. చంద్రబాబుకి సన్నిహితుడిగా పార్టీలో పలు కీలక పదవులు కూడా అనుభవించారు. కానీ తెలుగుదేశం 2019 ఎన్నికలలో అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ గూటికి చేరారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ మాజీ మంత్రిని పెద్దగా పట్టించుకున్న దాఖలులు లేవు.  దీంతో ప్రస్తుతం ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి ఏడాదిగా ఏ పార్టీలో చేరలేకపోతున్నారు. దాంతో ఆయనతో పాటు కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ కూడా డైలమాలో పడింది. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఫొలిటికల్ ఫ్యూచర్‌పై ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా  చర్చ జరుగుతోంది. తెలుగుదేశంలో కీలక నేతగా పలు పదవులను అలంకరించిన ఈ మాజీ మంత్రి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియకుండా తయారయ్యారు. గడిచిన సంవత్సర కాలంగా రాజకీయాలకు దూరంగా ఉండాల్సి అనివార్య పరిస్థితిలో ఉన్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక నేత గా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధా రాఘవరావు రాజకీయ జీవితం  డైలమాలో పడటానికి కారణం స్వయంకృతాపరాధమే అంటున్నారు. వ్యాపార వేత్తగా ఉన్న సిద్ధా రాఘవరావు 1999లో తెలుగుదేశంలో చేరగానే ఒంగోలు అసెంబ్లీ టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. అయితే ఎన్నికల్లో శిద్దా పరాజయం పాలయ్యారు. అయినా శిద్దా రాఘవరావును శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా నియమించి చంద్రాబాబు సముచిత గౌరవం ఇచ్చారు. అనంతరం 2007లో ఎమ్మెల్సీగాను అవకాశం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ టికెట్ కేటాయించారు. అక్కడ విజయం సాధించిన రాఘవరావుకు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చి కీలక శాఖలు కేటాయించారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన శిద్దా రాఘవరావు సైకిల్ దిగి ప్యాన్ గూటికి చేరారు.  అయితే వైసీపీలో చేరిన శిద్దాకు అక్కడ కనీస ప్రాధాన్యత కూడా లభించలేదు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా అంతా తానై శాసించిన రాఘవరావుకు వైసీపీ లో ఎటువంటి గుర్తింపు ఇవ్వకపోగా..  2024 ఎన్నికల్లో ఎక్కడా సీటు కూడా కేటాయించలేదు. ఎన్నికల అనంతరం వైసీపీకి రాజీనామా చేసిన శిద్ధా రాఘవరావు గడిసిన సంవత్సర కాలంగా ఏ పార్టీలో చేరకుండా ఉండి పోయారు. అయితే ఆయన అనుచరగణం మాత్రం ఆయన టీడీపీలోకి వస్తున్నారని ప్రచారం   చేసుకుంటున్నారంట. మరో వర్గం మాత్రం కష్టకాలంలో పార్టీ వీడి పోయిన వారిని ఎవరినీ పార్టీలో చేర్చుకోవద్దని లోకేష్ చెప్పారని.. శిద్దా రాఘవరావు ను టీడీపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్తున్నారు. జిల్లాలో మాత్రం టీడీపీలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన శిద్దా వైసీపీకి వెళ్ళి రాజకీయ జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకున్నారన్న టాక్ నడుస్తోంది. రాఘవరావుతో పాటు ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రశ్నార్థకం అయ్యిందట. శిద్దా రాఘవరావు తన కుమారుడిని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు బాగానే ప్రయత్నాలు చేశారంట. టీడీపీలో మంత్రిగా శిద్దా కొనసాగుతున్న సమయంలో ఆయన పోటీచేసి విజయం సాధించిన దర్శి నియోజకవర్గంలో సిద్ధా సుధీర్  పెత్తనమే కొనసాగింది. 2019 ఎన్నికల్లో తాను ఒంగోలు ఎంపీగా పోటీచేస్తూ తన కుమారుడికి దర్శి అసెంబ్లీకి పోటీ చేయించేందుకు చివరి వరకు ప్రయత్నం చేశారట. అయితే అనూహ్యంగా 2019 ఎన్నికల తర్వాత వ్యాపార వ్యవహారాల్లో వైసీపీ ప్రభుత్వం కల్పించిన చిక్కుల నుండి బయట పడేందుకు శిద్దా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత వైసీపీకి రిజైన్ చేసి, టీడీపీలో చేరే అవకాశం లేకుండా పోయిన ఆయన ఇప్పుడు ఇంటికే పరిమితం అయ్యారు.  దీంతో ఆయనతో పాటు సిద్దా సుధీర్ రాజకీయ భవిష్యత్ కూడా డోలాయమానంలో పడింది.   2014 నుండి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి నిత్యం ప్రజల్లో ఉన్న శిద్దా కుటుంబం ఇప్పుడు ఇంటికే పరిమితం కావటంతో సుధీర్ రాజకీయ భవిష్యత్తుపై  నీలి నీడలు కమ్ముకున్నాయి. 2024 ఎన్నికల ముందు కూడా  రాఘవరావుకు తెలుగుదేశంలో చేరే అవకాశం వచ్చిందట. అయితే అప్పట్లో ఆయన అప్పట్లో ససేమిరా అన్నారంట. చేజేతులా చేసుకున్న దానికి   ఇప్పుడు అనుభవి స్తున్నారని టీడీపీ శ్రేణులు సెటైర్లు విసురుతున్నాయి.

సిగాచీ షేర్లు ఢ‌మాల్!

పటాన్ చెరు లోని పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఆ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావితం చూపింది. ప్రమాదం జరిగిన తరువాత  ఆ కంపెనీ షేర్లు దారుణంగా పతన‌మ‌య్యాయి.  3 రోజుల్లోనే  దాదాపు 24 శాతం షేర్ వాల్యూ ప‌డిపోయింది.  ఒక్కొక షేర్ పై దాదాపుగా రూ.14 నష్టం వచ్చింది. ప్రమాద తీవ్రత అధికంగా ఉండడం, ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున కార్మికులు, కంపెనీ సిబ్బంది మృత్యువాత పడటం తెలిసిందే. ఈ సంఘటన తరువాత ఆ కంపెనీ షేర్ వాల్యూ స్టాక్ మార్కెట్ లో బారీగా పతనమైంది.  దీంతో  సిగాచి ఇండస్ట్రీస్ సంస్థ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. తమ పరిశ్రమ పై తీవ్ర ప్రభావం చూపిన ప్రమాదం పై నేషనల్  స్టాక్ ఎక్స్చేంజ్ కి లేఖ రాసింది.  పాశమైలారం సిగాచీ ఇండస్ట్రీస్ లో జరిగిన ప్రమాదంలో  మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించడంతో పాటు.. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆ లేఖలో పేర్కొంది.   ప్రమాదనికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందనీ, హైదరాబాద్ ప్లాంట్ లో మూడు నెలలపాటు   కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.  దేశ వ్యాప్తంగా  సిగాచీకి  నాలుగు పరిశ్రమలున్నాయి. పాశమైలారంతో పాటు సుల్తాన్ పూర్, కర్ణాటకలోని రాయచూర్, గుజరాత్ లోని జగడియ, ధహేజ్ లలో మొత్తం 4 పరిశ్రమలు నడుస్తున్నాయి. సంస్థ‌కు వేల కోట్ల మార్కెట్ వాల్యూ ఉంది.  సిగాచి ఇండస్ట్రీస్ కంపెనీ  1989లో సిగాచి క్లోరో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ పరిశ్రమను ప్రారంభించింది.  2012లో వాణిజ్యపరంగా విస్తరించేందుకు సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ గా పేరు మార్చుకుంది. 2019లో స్టాక్ మార్కెట్ లో  లిస్ట్ కావడంతో సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది. ప్రస్తుతం  ఈ ఇండ‌స్ట్రీకి సుమారుగా రూ.1680 కోట్ల మార్కెట్ వాల్యూ ఉన్న‌ట్టు చెబుత‌న్నాయి కంపెనీ గ‌ణాంకాలు. ఈ కంపెనీ ఫార్మా రంగంలో ముడి సరుకు సహాయ పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రమాదం జరిగిన పాశమైలారం యూనిట్లో- మైక్రో క్రిస్టలిన్ సెల్యులోస్ పౌడర్ అనే ప్రొడక్ట్ ని తయారు చేస్తోంది. వీటితోపాటు యాక్టివ్ ఫార్మాస్యుటికల్ ఇంగ్రిడియంట్స్ ను  తయారు చేస్తోంది. ఇది బైండింగ్ మెటీరియల్ గా ఉపయోగపడుతుంది.  డ్రగ్ తయారీలో ఈ ఔషధాన్ని ఉపయోగించి మనం నిత్యం వినియోగించే ఔషధాలు తయారు చేస్తారు.  ఏడాదికి ఈ ఒక్క ప్లాంట్ ద్వారానే 6 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ ప్రస్తుత ఎండీ క‌మ్  సీఈవోగా అమిత్ రాజ్  సిన్హా, చైర్మన్ గా రవీంద్ర ప్రసాద్ సిన్హా, వైస్ చైర్మన్ గా చిదంబరనాథన్  ఉన్నారు.  ప్రమాదం జరిగిన పాశమైలారం సిగాచి ప్లాంటు కార్యకలాపాలన్నీ వైస్  చైర్మన్ చిదంబరనాథన్ అధ్వ‌ర్యంలో జరుగుతాయని చెబుతున్నారు.

ఎలాన్ మ‌స్క్ యూటర్న్.. సొంత పార్టీ లేనట్టేగా?

ఎంతైనా ట్రంపు ట్రంపే.. ప్ర‌పంచంలో ఉన్న ఎన్నో వివాదాలను ప‌రిష్కరించారు.  ఆయ‌న‌కా క్రెడిట్ ద‌క్కాల్సిందే... ఈ మాట అన్నది ఎలాన్ మ‌స్క్. ఇన్నాళ్లూ ఉప్పూ- నిప్పుగా ఉన్న ఈ ఇద్ద‌రూ ఇపుడు కలిసిపోయారా? ఆల్ ఆఫ్ ఏ స‌డెన్ గా ఎలాన్ మస్క్ ట్రంప్ ను పొగుడుతూ కామెంట్ చేయడమేంటి? అన్న ప్రశ్నలు జనబాహుల్యం నుంచి ఉత్పన్నమౌతున్నాయి.   నిజానికైతే బిగ్ బ్యూటిఫుల్ బిల్ పాస్ అయిన వెంట‌నే తాను ద అమెరికా పార్టీ  స్థాపించడం తథ్యమని మస్క్ తెగేసి చెప్పారు.  ఈ లోగా ట్రంప్ ఒక కామెంట్ చేశారు. అస‌లు మ‌స్క్ త‌న పెట్టేబేడా స‌ర్దుకుని సౌతాఫ్రికా వెళ్లాల్సి ఉంటుంది. మేము ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న‌కు అన్నేసి స‌బ్సిడీల‌ను ఇచ్చామ‌ని బాంబు పేల్చారు ట్రంప్. దెబ్బ‌కు జ‌డుసుకున్న మ‌స్క్ ట్రంప్ ని వెన‌కేసుకొచ్చారు. క్రెడిట్ ఇవ్వాల్సిన  చోట ఇవ్వాల్సిందే అన్నారు. ఇజ్రాయెల్ గాజాలో అర‌వై రోజుల కాల్పుల విర‌మ‌ణ‌కు ఒప్పుకుంద‌ని ట్రంప్ ప్ర‌క‌టించిన వెంట‌నే ఆయ‌నీ ట్వీట్ పోస్ట్ చేశారు. ట్రంప్- మ‌స్క్ స్నేహ బంధం 2016 నాటిది. వీరిద్ద‌రూ ఈ తొమ్మిదేళ్ల‌లో ఎన్నో సార్లు విడిపోయి, క‌లిసిపోయిన చ‌రిత్ర ఉంది. వీరిద్ద‌రి గ‌రించి ద గార్డియ‌న్ ప‌త్రిక 2024లో  ఇద్ద‌రు సంప‌న్న మిత్రుల మ‌ధ్య గాఢ ప్రేమానుబంధంగా అభివ‌ర్ణిస్తూ ఓ వ్యాసం ప్రచురించింది. మ‌స్క్ కి ట్రంప్ కి ఉన్న గాఢ స్నేహానుబంధం ఎలాంటిదంటే.. ట్రంప్ ఒక ద‌శ‌లో ట్విట్ట‌ర్ ఖాతాను కోల్పోయారు. దీంతో ఆయ‌న జోబైడెన్ చేతుల్లో ఓడి పోవ‌ల్సి వ‌చ్చిందప్ప‌ట్లో. అయితే గ‌త ఎన్నిక‌ల నాటికి అదే ట్విట్ట‌ర్ ని కొని దానికి ఎక్స్ అన్న నామ‌క‌ర‌ణం చేసి.. దానిలోని ట్రంప్ ఖాతాను రీ- జ‌న‌రేట్ చేశారు మ‌స్క్.  అంతేనా.. డెమోక్రాటిక్ అభ్యర్థి క‌మ‌లా హారిస్ మీద విరుచుకుప‌డ్డారు  కూడా.   ఆ ఎన్నికలపై ఇది తీవ్ర ప్ర‌భావం చూపించింది.   ఎట్ట‌కేల‌కు గెలిచాం కదా అనుకుంటే ట్రంప్ నుంచి మస్క్ కు ఆశించినంత  సాయం అందలేదు. ఎన్నో విష‌యాల్లో ట్రంప్ మ‌స్క్ కి మ‌స్కా కొట్టారు. ఇస్తాన‌న్న‌వేవీ ఇవ్వ‌క పోగా.. మ‌స్క్ కి ప‌బ్లిక్ లో తీవ్ర వ్య‌తిరేక‌త కొట్టొచ్చిన‌ట్ట క‌నిపించింది. డోజ్ ద్వారా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాల‌కు నిర‌స‌న‌గా.. త‌న టెస్లా షోరూములు ధ్వంసం కావ‌డం..  ఆపై షేర్ల ధ‌ర‌లు ప‌డిపోవ‌డం  అటుంచితే..  త‌న సంప‌ద వంద బిలియ‌న్ డాల‌ర్ల మేర ఆవిర‌య్యింది. అంతేనా త‌న మిత్రుడిని నాసా చీఫ్ చేస్తాన‌న్న మాట కూడా మ‌రిచారు ట్రంప్.  ప్ర‌శాంతంగా కొత్త కొత్త ఐడియాల‌తో బిజినెస్ చేసుకోకుండా.. అన‌వ‌స‌రంగా విరాళ‌మిచ్చి మ‌రీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఇలాంటి వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకోవ‌డం అవ‌స‌ర‌మా? అంటారు మస్క్ తండ్రి   ఎరోల్ మ‌స్క్.  ప్ర‌స్తుతం మావాడికేం పెద్ద వ‌య‌సు అయిపోలేద‌నీ.. న్యూరాలింక్ అనే కొత్త ప్రాజెక్టు చేస్తున్నాడ‌నీ.. అదిగానీ క్లిక్ అయితే ద‌శ తిరిగిపోతుంద‌ని అంటారాయ‌న‌. కార‌ణం మస్క్ కొత్త ప్రాజెక్టు వెన్నుముక విరిగిన వారికి సంసార జీవితం, కంటి చూపులేని వారికి చూపు ప్ర‌సాదించే దివ్య ఔష‌ధం. అలాంటి ప్రాజెక్టు వ‌ర్క‌వుట్ అయితే పోయిన సంప‌ద‌ అంతకు అంతగా మారి తిరిగి వ‌స్తుంది. ప్ర‌స్తుతం మ‌స్క్ వ‌య‌సు 53 ఏళ్లు కాగా.. సంప‌ద విలువ 300 బిలియ‌న్ డాల‌ర్లు. ట్రంప్ లా లాస్ట్ స్టేజ్ లో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వొచ్చు. కానీ నెట్ ప్రాక్టీస్ గా ప‌డి ఉంటుంది లెమ్మ‌ని.. కాస్త ఎర్లీగానే పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన మ‌స్క్.. ఆల్ ఆఫ్ ఏ స‌డెన్ గా పార్టీ పెట్టేస్తా అన‌గానే అంద‌రూ షాక‌య్యారు. ఇప్పుడు చూస్తే పార్టీ లేదూ గీర్టీ లేదు తూచ్ అంటున్నారు. మ‌రి చూడాలి. ట్రంప్ తో ఈ చెలిమి కంటిన్యూ అవుతుందా లేక ఇద్ద‌రి మ‌ధ్యా మళ్లీ వివాదం మ‌రింత ముదిరి.. కొత్త పార్టీకి దారి తీస్తుందా? తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరి

పరిశ్రమలలో వరుస ప్రమాదాలు భయాందోళనలను కలిగిస్తున్నాయి. సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన అనంతరం మేడ్చల్ లోని ఓ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. తాజాగా హైదరాబాద్ వివారు కాటేదాన్ లోని ఓ రబ్బర్ ఫ్యాక్టరీలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాటేదాన్ లోని శివం రబ్బర్ ఫ్యాక్టరీలో ఈ ఉదయం ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ కమ్ముకుని జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజిన్లతో మంటలను అదుపు చేశారు.   పరిశ్రమలో పెద్ద ఎత్తున రబ్బరు, ఇతర ముడిసరుకు ఉండటం మంటలు వేగంగా వ్యాపింపిచ దట్టమైన పొగ అలుము కోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రమాద కారణాలు, ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది.  

ములుగు బిఆర్ఎస్ లో ముఠా తగాదాలు?!

ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా తయారౌతోంది. పార్టీ  జిల్లా అధ్యక్షుడి అనాలోచిత నిర్ణయాలతో  బీఆర్ఎస్ ములుగులో పట్టు కోల్పోతోంది.  పార్టీని జిల్లాలో బలోపేతం చేయాల్సిన వ్యక్తే పార్టీ పట్టు కోల్పోయి బలహీనపడడానికి కారకుడిగా మారుతున్నారంటూ పార్టీ వర్గాలే  బాహాటంగా చెబుతున్నాయి.  పార్టీ  శ్రేణుల సమాచారం మేరకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు స్థానికంగా ఉండకుండా చుట్టపు చూపుగా వస్తుండటమే కాకుండా.. ములుగు నియోజకవర్గ ఇన్ చార్జ్ కు సహకరించవద్దంటూ పార్టీ క్యాడర్ కు హుకుం జారీ చేశారు. దీంతో  నియోజకవర్గ ఇన్చార్జి కేవలం ఒక్క మండలానికే పరిమితమైన పరిస్థితి.  దీంతో ములుగు బిఆర్ఎస్ లో ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయం లో ఉన్నారు ఆ పార్టీ కార్యకర్తలు,నాయకులు. ములుగు జిల్లా లో ఒకే నియోజకవర్గం ఉండటం అదీ ఎస్టీ   నియోజకవర్గం.  ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన జడ్పీ చైర్మన్ మాజీ  బడే నాగజ్యోతి కొనసాగుతున్నారు. జిల్లా అధ్యక్షుడు గా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి బంధువు అయిన కాకులమారి లక్ష్మీ నరసింహారావు ఉన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతమే టార్గెట్ గా కాకులమారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టింది.  గత ఎన్నికల్లో  ములుగు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా  సీతక్క బరిలో నిలవడం.. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీచడంతో ములుగు నుంచి పోటీచేసిన జడ్పీ మాజీ చైర్మన్ బడే నాగజ్యోతి పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆమే నియోజకవర్గ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు.    అయితే ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమితుడైన కాకులమారి లక్ష్మీ నరసింహారావు తీరు మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఒక దశలో ఆయనను పార్టీకి దూరంగా పెట్టడం కూడా జరిగింది.  అయితే  ఆ తరువాత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు లాబీయింగ్ తో పార్టీ ఆయనను ములుగు జిల్లా అధ్యక్షుడిగా నియమించిందని అంటారు. ములుగు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ కాకులమారి లక్ష్మీనరసింహరావు తన ఒంటెద్దు పోకడలతో  పార్టీ బలహీనం కావడానికి కారకుడౌతున్నారని అంటున్నారు. ములుగు నియోజకవర్గ ఇన్ చార్జ్  నాగజ్యోతితో విభేదాల కారణంగా  జిల్లా పార్టీ గ్రూపు రాజకీయాలకు నిలయంగా మారిందని బీఆర్ఎస్ శ్రేణులు వాపోతున్నాయి.   గత ఎన్నికలలో పార్టీ  పరాజయం పాలై అధికారం కోల్పోయి ప్రధాన ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన నేపథ్యంలో.. సమైక్యంగా ఉండి అధికార పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన పరిస్థితిలో కూడా ములుగు జిల్లాలో పార్టీ గ్రూపు రాజకీయాలతో కూనారిల్లుతోందన్న ఆవేదన పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తం అవుతోంది.  ములుగు జిల్లా అధ్యక్షుడిగా స్థానికంగా ఉండాల్సినకాకులమారి లక్ష్మీనరసింహరావు హైదరాబాద్ లో ఉంటూ అడపాదడపా అతిథిగా జిల్లాకు వస్తున్నారనీ, ఆయన అందుబాటులో లేకపోవడమే కాకుండా.. జిల్లాలో పార్టీ కార్యక్రమాలేవీ తాను లేకుండా జరగడానికి వీల్లేదని హుకుం జారీ చేస్తున్నారనీ, మరీ ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ చార్జి నాగజ్యోతికి సహకరించొద్దంటూ శ్రేణులకు హుకుం జారీ చేస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  దీంతో బడే నాగజ్యోతి పేరుకే నియోజకవర్గ ఇన్ చార్జ్ అయినా కేవలం తన సొంత మండలం తాడ్వాయికే పరిమితమైన పరిస్థితి.    కాకులమారి లక్ష్మీనరసింహరావుకు మంత్రి సీతక్కతో సత్సంబంధాలు ఉండటం,  పారిశ్రామిక వేత్తగా ప్రభుత్వంతో అవసరాల దృష్ట్యా అధికార పార్టీకి వ్యతిరేకంగా పన్నెత్తి మాట్లాడటం లేదనీ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల పై  పోరాటాలకు వెనుకంజ వేస్తున్నారనీ, మొత్తంగా ఆయన సీతక్కకు విధేయుడిగా ఉంటున్నారనీ  టీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి.  రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు ములుగు జిల్లాలో అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి కారణం జిల్లా అధ్యక్షుడి ఒంటెత్తుపోకడలేనని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.    నాగజ్యోతికి ప్రజాబలం లేదు అని అధిష్టానం దగ్గర నిరూపించి, ఆమె స్థానంలో తన అనుచరుడిని తీసుకురావాలన్న యోచనతో కాకులమారి లక్ష్మీనరసింహరావు పని చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్ఠానం ములుగు జిల్లాపై దృష్టి పెట్టి పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.  

తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా దుష్ప్రచారం.. చర్యలు తప్పవన్న టీటీడీ

తిరుమల అంటే కోట్లాది మంది హిందువులు మనోభావాలతో ముడిపడిన అంశం. టీటీడీ పై దుష్ప్రచారం పోయినంతగా మంచి బయటకు పోవడానికి కొంత ఆలస్యమవుతుంది. టీటీడీ పై దుష్ప్రచారం చేస్తే దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం పై చెడు ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో  వైసీపీ నేతలు, శ్రేణులు అదే పనిగా పెట్టుకున్నారు.  రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై ద్వేషం తప్ప మరో సిద్ధాంతం అంటూ లేనట్లుగా వైసీపీ వ్యవహారశైలి ఉంది.  టీటీడీ గోశాల వివాదం, అన్యమత ప్రార్థనలు, వేద పారాయణంపై మాజీ పాలకమండలి అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు చెబుతున్నారు. .  తాజాగా జూన్ 29  మధ్యాహ్నం తిరుమలలోని అఖిలాండం వద్ద ఎలాంటి లైసెన్స్ లేని అనాధికార ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తూ భక్తులకు ఇబ్బంది కలిగించారు. అక్కడే విధుల్లో ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ఆ ఫొటోగ్రాఫర్ ను ప్రశ్నించారు. దీంతో ఇరువురి మాట మాట పెరిగి వివాదం పెద్దది అయ్యింది. గొడవ పడుతూ ఆస్థాన మండపం లోని షాపు నెంబరు 96 వద్ద గొడవపడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ షాపులో పని చేస్తున్న ఫొటోగ్రాఫర్ ను వివరణ కోరారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు తీరు కూడా అతని విధులకు విరుద్ధంగా ఉండడంతో అతడిని తిరుపతి కి బదిలీ చేశారు. అసలు వాస్తవం ఇది కాగా..  ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా చానెళ్లు  తిరుమలలో తన్నుకున్న టీటీడీ సిబ్బం ది అంటూ ప్రసారాలు చేశాయి. దీనిని టీటీడీ తీవ్రంగా ఖండించింది.   అదే విధంగా తరచూ టీటీడీపై అసత్యవార్తలను ప్రసారం చేస్తూ, తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమనీ, కఠిన చర్యలు తీసుకుంటామనీ టీటీడీ హెచ్చరించింది.  

ఆర్మీలో రిటైర్ అయ్యి వచ్చిన సైనికుడికి గ్రామస్థులు ఘన స్వాగతం

  శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మండలం, టి.బరంపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిప్పన. పురుషోత్తం రెడ్డి గ్రామానికి విచ్చేసిన సందర్బంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.  28ఏళ్లుగా దేశ రక్షణలో విధులు నిర్వహించి, సుబేధర్ గా బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయిన సందర్బంగా  బాజా భజంత్రీలు, శ్రీ శివరామ డోలు సన్నాయి కళాకారులు, శ్రీ ఆసిరిపోలమ్మ కోలాట బృందం, శ్రీ కళ్యాణవెంకటేశ్వర కోలాట బృందం, శ్రీ దుర్గా పాండు రంగ స్వామి కోలాట బృందం కళాకారులచే కోలాట ప్రదర్శన నిర్వహించి ఘన సన్మానసభ నిర్వహించారు.  

తిరుమలలో కళాకారులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

  టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరును దుర్వినియోగం చేస్తూ, కళాకారుల నుంచి లక్షల రూపాయలు తీసుకొని మోసగించిన కేసులో కేటుగాడిని తిరుమల వన్‌ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన సూత్రపు అభిషేక్.. తిరుమలలోని ఆస్థాన మండపంలో ‘శ్రీనివాస కళార్చన’ పేరుతో రెండు రోజుల నాట్య ప్రదర్శనను నిర్వహిస్తానని చెప్పి శ్రీవారి, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ అధికారిక అనుమతి లేకుండానే తెలుగు రాష్ట్రాల్లోని 93 కళాబృందాలకు చెందిన 2,900 మంది కళాకారులను నమ్మించి మోసం చేశాడు.  వారి వద్ద నుంచి రూ.35 లక్షలు వసూలు చేశాడు. కళాకారులకు వసతి, భోజనం, శ్రీవారి దర్శనం, ప్రసాదం, మెమెంటోలు, శాలువాలు వంటి సదుపాయాలు కల్పిస్తామని వారికి హామీ ఇచ్చాడు. టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ అనుమతి లేదని, ఈ మొత్తం ప్రక్రియ ఒక మోసపూరితం అని గుర్తించి తిరుమల వన్‌ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా జులై 1న అభిషేక్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తిరుపతి కోర్టులో హాజరు పరిచారు. ఫేక్ ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పదని తిరుపతి పోలీసులు హెచ్చరిస్తున్నారు.