జూలై 5న జపాన్ ను ముంచెత్తనున్న సునామీ? .. న్యూ బాబా వంగా జోస్యం నిజ‌మ‌వుతుందా?

జ‌పాన్ మాంగా క‌ళాకారిణి రియో టాట్సుకీ.. జూలై ఐదున జ‌పాన్ కి భారీ సునామీ రానుంద‌ని చెప్ప‌డంతో.. ఎంద‌రో త‌మ జ‌పాన్ టూర్ వాయిదా వేసుకున్నారు. ఒక్క‌సారిగా  జ‌పాన్ టూరిజం ప‌డ‌కేసింది. జూన్ చివ‌రి వారం నుంచి జూలై ఫ‌స్ట్ వీక్ వ‌ర‌కూ త‌మ త‌మ ప‌ర్య‌ట‌న‌లు పోస్ట్ పోన్ చేసుకున్నారు.  కార‌ణం.. న్యూ బాబా వంగాగా  పేరున్న టాట్సుకీ.. 2011 జ‌పాన్ సునామీని కూడా స‌రిగ్గా ఇలాగే అంచ‌నా వేశారు. దీంతో జ‌పాన్ ప్ర‌జ‌లు గుండెలు అర‌చేత ప‌ట్టుకుని తిరుగుతున్నారు. టాట్సుకి తన పుస్తకం "ది ఫ్యూచర్ ఐ సా"లో 2025 జూలై 5న జపాన్ లో భారీ సునామీ వస్తుందని అంచనా వేయ‌డంతో జ‌నం బెంబేలెత్తి పోతున్నారు. ఇక్క‌డ మ‌రో వింత ఏంటంటే జ‌పాన్ ప్ర‌జ‌ల‌క‌న్నా జ‌పాన్ రావాల‌నుకుంటున్న వారు ఈ వార్త తెలిసి హ‌డ‌లెత్తిపోతున్నారు. బేసిగ్గా ఇక్క‌డ ఈ సీజ‌న్లోని ప్ర‌కృతి అందాలు చూడ్డానికి పెద్ద ఎత్తున జులై నెల‌లో టూర్ గా వ‌స్తుంటారు జ‌పాన్ చుట్టుప‌క్క‌ల దేశాల వారు.  ఇంత‌టి ప్ర‌కృతి వినాశ‌నం  జ‌ర‌గబోతుంద‌ని న్యూ బాబా వంగా చెప్ప‌డంతో.. ఆ ప్ర‌కృతి ప్ర‌కోపంలో ప‌డి మ‌నం ఎందుకు ప్రాణాలు కోల్పోవ‌డం అంటూ స‌గానికి స‌గంపైగా టూరిస్టులు జ‌పాన్ టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో ఎన్నో విమానాలు ర‌ద్ద‌య్యాయి. హోట‌ళ్ల బుకింగ్ కూడా భారీగా  ప‌డిపోయింది.   దీనంత‌టికీ కార‌ణం ఇలాంటి జోతిష్యులు చెప్పిన‌వి జరుగుతుండటమే. గ‌తంలో బెల్జియంకి చెందిన  బాబా వంగా కూడా స‌రిగ్గా ఇలాగే ముందే విప‌త్తుల‌ను ఊహించి చెప్పేవారు. ఆమె త‌ర్వాత జ‌పాన్ కి చెందిన టాట్సుకీ సైతం ఇలాంటి ముంద‌స్తు జోస్యాలు చెప్ప‌డం మొద‌లెట్టారు. గ‌తంలో ఇలాంటిదొక‌టి నిజం  కావ‌డంతో.. ఇప్పుడంద‌రూ అదే నిజ‌మ‌వుతుంద‌ని భావిస్తున్నారు. జులై ఐదున జ‌పాన్ లో ఏదో ఒక విప‌త్తు జ‌ర‌గ‌బోతుంద‌ని గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. అయితే ఇక్క‌డ జ‌పాన్ ప్ర‌భుత్వం ఏం చెబుతోందంటే.. మీరు భ‌య  ప‌డుతున్నారు గానీ మా జ‌ప‌నీయులు భ‌య ప‌డ్డం లేదు.  అస‌లేం జ‌ర‌గ‌ద‌ని తెగేసి చెబుతున్నారు. ఒక వేళ జూలై ఐదున ఏదైన విప‌త్తు జ‌ర‌గుతుంద‌ని మా వాళ్లు న‌మ్మే ప‌నైతే ఈ పాటికే దేశం విడిచి పారిపోయేవాళ్లు క‌దా? ఇక్క‌డెవ‌రూ అలాంటి హ‌డావిడిలో లేరు కావాలంటే చూసుకోండ‌ని అంటున్నారు. సునామీ అంటే ఏమిటి? స‌ముద్ర గ‌ర్భంలో ఏర్ప‌డే భూకంపం.. తీర ప్రాంతాల్లోకి భారీ అల‌లు వ‌చ్చి ప‌డ‌తాయి. ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉంటే అదే స‌ర్దుకుంటుంది. ఒక వేళ భూకంపం త‌మ‌ను ప్ర‌భావితం చేస్తే.. ఎలా అన్న‌ది వారు ఇప్ప‌టికే ఒక అవ‌గాహ‌న‌లోకి వ‌చ్చేశారు. త‌మ టెక్నాల‌జీ సాయంతో భూకంపాల‌ను త‌ట్టుకోవ‌డం ఎలాగో నేర్చేసుకున్నారు. కాబ‌ట్టి.. డోంట్ ఫియ‌ర్ పాల‌సీ  మెయిన్ టైన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ

హైదరాబాద్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  శుక్రవారం (జులై 4) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  కులగణన, బీసీ రిజర్వేషన్లు తదితర అంశాలపై వీరిరువురి మధ్యా చర్చ జరిగినట్లు సమాచారం. అంతకు ముందు గురువారం (జులై 3) హైదరాబాద్ చేరుకున్న మల్లికార్జున ఖర్గే  కు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఖర్గేకు స్వాగతం పలికిన వారిలో  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు ఉన్నారు. అదలా ఉంచితే  గాంధీ భవన్ లో జరిగే పీఏసీ భేటీలో మల్లిఖార్జున్ ఖర్గే పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం పార్టీ అధ్యక్షుడు ఖర్గే పార్టీ ఆఫీస్‌ బేరర్స్‌తో సమావేశమౌతారు. అంతే కాకుండా మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఖర్గేతో భేటీ అయ్యారు.  ఇక   స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై పార్టీ కీలక నేతలతో ఖర్గే చర్చిస్తారు. 

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడిన సీఎం రేవంత్

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన   సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్ తో కేసీఆర్ బాధపడుతున్నారు. రోజుల తరబడి టెంపరేచర్ కంట్రోల్ లోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను యశోదా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. యశోదా ఆస్పత్రిలో   వైద్యులు  కేసీఆర్ కు పరీక్షలు నిర్వహించారు.  ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, జ్వరం తగ్గి,  వైద్య పరీక్షలకు సంబంధించి రిపోర్టులను చూసిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. ఇలా ఉండగా అస్వస్థతతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోదా ఆస్పత్రిలో  అడ్మిట్ అయిన విషయంపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యశోదా ఆస్పత్రి వైద్యులు, అధికారులతో ఫోన్ లో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కేసీఆర్ కు అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కేసీఆర్ త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు.  

హస్తినకు చేరిన ఓరుగల్లు వివాదం!

వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిందా? అంటే..  విశ్లేషకులు అవుననే అంటున్నారు. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ ఒక జట్టుగా, మిగిలిన ఎమ్మెల్యేలు మరో జట్టుగా  హస్తం పార్టీ  రెండుగా చీలి పోయిందని  మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.  నిజానికి, ఒక్క వరంగల్ జిల్లా అనే కాదు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కాంగ్రెస్ పరిస్థితి కొంచెం అటూ ఇటూగా  ఇలాగే ఉందనీ ఏ ఒక్క జిల్లాల్లోనూ హస్తం పార్టీ ఒకటిగా లేదని, గాంధీ భవన్  సాక్షిగా గుసగుసలు వినిపిస్తున్నాయి.   అదలా ఉంచి  వరంగల్ విషయానికి వస్తే..  వరంగల్ జిల్లాలో పరిస్థితి  రోజు రోజుకు శృతి మించి రాగాన పడుతోందని, అంటున్నారు. ఇప్పటికే..  జిల్లా సరిహద్దులు దాటి గాంధీ భవన్ కు  చేరిన  వరంగల్ పచాయతీ తాజా సమచారాన్ని బట్టి ఢిల్లీకి చేరిందని అంటున్నారు. ఓ వంక హస్తం పార్టీ అధికారంలో ఉన్న పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య సాగుతున్న  కిస్సా కుర్సీకా  వివాదం ఇంకా ఒక  కొలిక్కి రాలేదు. ప్రస్తుతానికి సర్డుమణిగినట్లు కనిపిస్తున్నా.. మళ్ళీఎప్పుడైనా భగ్గుమనే ప్రమాదం ఉందని భావిస్తునారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజుకున్న వివాదాన్ని ఉపేక్షిస్తే ముందు ముందు మరంత ప్రమాదంగా పరిణమించే ప్రమాదం లేక పోలేదని..  అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చిందని  గాంధీ భవన్ వర్గాల సమాచారం.  అదలా ఉంటే.. అధికారంలోకి వచ్చేందుకు, వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు   కాంగ్రెస్ పార్టీ  ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర పార్టీల నాయకులకు పదవులు  ఎరగా వేయడం వలన తలెత్తిన సమస్యలు, చిలికిచిలికి గాలివానగా మారి పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కొండా సురేఖ ఫ్యామిలీ విషయంలోనూ అదే జరిగిందని అంటున్నారు. ఎన్నికలకు ముందు  కొండా ఫ్యామిలీకి రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామన్నారు.. కానీ ఇవ్వలేదు. ఒకే టికెట్ తో సరిపెట్టారు. కొండా మురళీకి ఎమ్మెల్సీ ప్రామిస్  చేశారు. కానీ.. అదీ నెరవేర్చలేదు. కొండా సురేఖకు మంత్రి పదవి అయితే ఇచ్చారు కానీ, గిట్టుబాటయ్యే శాఖలు ఇవ్వలేదన్న అసంతృప్తిని కొండా మురళీ  దాచుకోలేదు. మంత్రి సురేఖ శాఖల్లో ఎక్కడా పైసలు రాలడం లేదని..  ఇప్పటికీ  ఆమె నెల వారీ ఖర్చులకు తానే పైసలు పంపుతున్నాని మీడియా ఎదుటనే ప్రకటించారు. అంతేకాకుండా.. ఇప్పుడేమో ఇచ్చిన సురేఖ కుర్చీకి ఎసరు పెడుతున్నారు. అందుకే..  మంత్రి కొండా సురేఖ కుటుంబంలో అసంతృప్తి భగ్గుమంటోంది. వరంగల్ రాజకీయాల్లో రగులుతున్న వర్గ పోరుకు ఇదే ప్రధాన కారణంగా పరిశీలకులు పేర్కొం టున్నారు. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే ఒరలో రెండు కాదు.. అంతకంటే ఎక్కువ కత్తులు ఇమిడ్చే ప్రయత్నం చేయడం వల్లనే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి  మీనాక్షి నటరాజన్  ద్వారా సమాచారం తెప్పించుకున్న కాంగ్రెస్ అధిష్టానం  వరంగల్ వివాదాన్ని మొగ్గలోనే తుంచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదలా ఉంటే.. తాజాగా కొండా దంపతుల కుమార్తె, కొండా సుష్మిత పటేల్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తానే పోటీచేస్తున్నానని సోషల్ మీడియా అకౌంట్‌  లో మార్పులు ద్వారా సంకేతాలు ఇవ్వడంతో వరంగల్ వివాదం మరో మలుపు తీసుకుందని అంటున్నారు. అదొకటి అయితే.. కొండా దంపతులు గురువారం (జులై  3) కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిశారు.  ఉమ్మడి వరంగల్‌లో జరుగుతున్న అంశాలపై ఆమెకు 16 పేజీల నివేదికను నివేదిక ఇచ్చారు. అలాగే.. తమ పై వచ్చి ఆరోపణలపై కొండా దంపతులు  మీనాక్షి నటరాజన్ కు సమాధానంలాంటి వివరణ ఇచ్చారు.   రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని చెప్పిన కొండా దంపతులు.. నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరిది తప్పుంటే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో..  వరంగల్ వివాదం తీవ్ర రూపం దాలుస్తున్నట్లు గుర్తించిన మీనాక్షి నటరాజన్ అధిష్టానం జోక్యం చేసుకోవాలని కోరినట్లు చెపుతున్నారు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, శుక్రవారం (జులై 4) రాష్ట్రానికి వస్తున్న  నేపద్యంలో.. విషయాన్ని  అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. అధిష్టానం ఎలా స్పందిస్తుంది? ఏమి చేస్తుంది? చూడవలసి వుందని అంటున్నారు.

కేసీఆర్ భోళా శంక‌రుడు.. కవిత కామెంట్లపై నెటిజన్ల సెటైర్లు

ఈ శ‌తాబ్దానికే ఇది జోక్ కావ‌చ్చు. ఈ భూమ్యాకాశాల మ‌ధ్య కేసీఆర్ కి తెలియ‌ని రాజ‌నీతి లేదు. రెడ్డి, క‌మ్మ‌గా విడిపోయి కొట్టుకు ఛ‌స్తున్న ఉమ్మ‌డి ఆంధ్ర రాజ‌కీయాల్లో వెల‌మ‌ల పాత్ర‌ను తిరిగి తీసుకురావ‌డంలో అప‌ర చాణ‌క్యుడ‌న్న పేరు సాధించారాయ‌న‌. అంతేనా  కేసీఆర్ అన్నీ తెలిసే కావాల‌నే చేశారని అంటారు. అలాగ‌ని కులాభిమానం అయినా ఉందా? అంటే అదీ లేద‌ని చెబుతారు. అంత‌టి స్వార్ధ‌ప‌రుడు కేసీఆర్ అన్న పేరు ఈనాటిది కాద‌ని అంటారు. సాటి వెల‌మ‌కు మంత్రిత్వం ఇచ్చార‌ని కూడా చూడ‌కుండా.. ఏకంగా టీడీపీ బ‌య‌ట‌కొచ్చి... అప్పుడెప్పుడో ముగిసిపోయిన అధ్యాయం లాంటి తెలంగాణ ఉద్య‌మాన్ని తిరిగి నిద్ర‌లేపి.. దాన్ని అంచ‌లంచెలుగా.. ముహుర్తాలు చూసుకుని మ‌రీ.. ఉద్య‌మాలు చేయ‌డంలో భోళాత‌నం ఎక్క‌డో ఎవ‌రికీ అర్ధం కాదని అంటారు. ముహుర్తాలంటే గుర్తుకొచ్చింది.. తాను డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి చేయ‌లేన‌ని అలిగి ఇంట్లో కూర్చున్న‌పుడు ఒక గోదారి జిల్లాల‌కు చెందిన బ్రాహ్మ‌డు కేసీఆర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చార‌నీ.. ఆయ‌న వ‌చ్చే పుష్క‌ర‌కాలం త‌ర్వాత మీకు అఖండ రాజ‌యోగం ప‌ట్ట‌నుంద‌ని.. స్పీక‌రేం క‌ర్మ‌.. ఏకంగా సీఎం అయ్యే ఛాన్సులు పుష్క‌లంగా ఉన్నాయ‌నీ.. పెద్ద పెద్ద రాజ‌నీతిజ్ఞులే మీ ముందు బ‌లాదూర్ అయిపోతార‌నీ.. చెప్పారనీ.. ఆ వెంట‌నే ఈయ‌న తెలంగాణ వాదాన్ని వెలికి తీసి ప్రొఫెసర్ జ‌య‌శంక‌ర్ లాంటి వారి చేత తెలంగాణ పాఠాలు వ‌ల్లె వేయించుకున్న‌ట్టు ఒక స‌మాచారం. ఆపై కావాల‌నే ఉన్న ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌డం, అన‌వ‌స‌రంగా ఉప ఎన్నిక‌లొచ్చేలా చేయ‌డం.. అటు పిమ్మ‌ట అమాయ‌క పిల్ల‌ల ప్రాణాలు పోయేలా రెచ్చ‌గొట్ట‌డం. అందుకు అంద‌మైన బ‌లిదానం అంటూ పేర్లు పెట్ట‌డం వంటివి కూడా భోళా శంక‌రుడి లీల‌లేనా?. అక్కా అన్న‌ది కొంద‌రి ప్ర‌శ్న‌. ఎట్ట‌కేల‌కు తెలంగాణ వ‌చ్చీరావ‌డంతో ద‌ళితుల‌ను ముఖ్య‌మంత్రి చేస్తాన‌ని అన్న మాట‌ను కాస్తా తీసి హుస్సేన్ సాగ‌ర్ గ‌ట్టు మీద పెట్టి.. ఉద్య‌మ‌కారుడు ఉద్యోగి అయ్యాడ‌ని చెప్పుకోవ‌డంలోనూ భోళాత‌న‌ముందా?  కవితక్కా..! కాళేశ్వ‌రం క‌థ‌ల నుంచి మొద‌లు పెడితే.. ప్ర‌తి దాన్లో రాజ‌కీయం. ఆఖ‌ర్న ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్యమంత్రికి ఇక్క‌డ ప‌దేళ్ల పాటు ఎక్క‌డ రాజ‌ధాని హోదా ఇవ్వాల్సి వ‌స్తుందోన‌ని ఆయ‌న్ను కాస్తా ఓటుకు నోటు కేసులో త‌న టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇరికించి మ‌రీ త‌ర‌మ‌గొట్ట‌డంలోనూ భోళాత‌న‌మేనా అక్కా.. అని నిల‌దీస్తున్నారు కొంద‌రు. కేసీఆర్ క‌థ‌లు.. చెబితే చారెడు.. వింటే మూరెడు అన్న‌ట్టు... లెక్క‌లేన‌న్ని లీల‌లు. పేప‌రు లీకేజీల ద‌గ్గ‌ర్నించి.. పేప‌రోళ్ల‌ను పాతాళంలో పాతి పెడ‌తా! అనే వ‌ర‌కూ ఎన్నో.. ఎన్నెన్నో..  అదేమంటే మాపై ఇంత నెగిటివ్ గా రాస్తున్న వారికి ఉచితాలు, వ‌రాలివ్వాలా? అంటూ నేరుగానే అన‌డ‌మొక‌టి. ఇదంతా కూడా భోళాత‌న‌మేనా అక్కా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్ర- తెలంగాణ తేడా లేకుండా  ఆయ‌న కోసం రాసినోళ్లు, క‌థ‌నాలు వండి వార్చినోళ్లు, అందులో భాగంగా ఉద్యోగాలు పోగొట్టుకున్నోళ్లూ.. వీరంతా క‌ల‌సి మ‌ట్టి కొట్టుకు పోగా.. ఎక్క‌డో మీకోసం యాగాలు చేసిన స్వామీజీల‌కు రూపాయ లెక్క‌న స్థ‌లాలూ పొలాలూ ఇవ్వ‌డంలోనూ భోళా మ‌నిషినే చూసుకోవాలా అక్కా మేము.. మా ఖ‌ర్మ కాకుంటే అంటూ  కొంద‌రు ఆనాటి పాత జ్ఞాప‌కాల‌ను తిర‌గ‌దోడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో కేసీఆర్ స్పంద‌న ఎలాంటిద‌ని విలేఖ‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు.. క‌విత‌క్క చెప్పిన స‌మాధానం.. కేసీఆర్ ఒక భోళా శంక‌రుడు, ఆయ‌న కింది వారు ఇలాంటి ప‌నులు చేసి ఉంటారేమో అంటూ ఆమె చెప్పిన ఈ కొటేష‌న్ పై ఒక్కొక్క‌రు.. పై విధంగా కామెంట్లు చేస్తున్నారు.

తిరుమల ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు

తిరుమల కొండపై  ఏనుగులు హల్‌ చల్‌ చేశాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు తిష్ట వేసి ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఘాట్ రోడ్డుకు అతి సమీపంలోనే ఏనుగుల గుంపు తిష్టవేసి ఉండటంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. యువకులు గట్టిగా కేకలు వేయడంతో ఏనుగుల గుంపు కొద్దిగా వెనక్కు వెళ్లింది. గత కొద్ది రోజులుగా శేషాచలం అడవుల నుంచి ఏనుగులు సమీప గ్రామాలలోకి ప్రవేశించి పంటపొలాలను ధ్వంసంచేసిన ఘటనలు జరిగాయి. దీంతో వాటిని తిరిగి అడవుల్లోకి తరిమేసేందుకు అధికారులు శతథా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఏనుగులు ఏకంగా తిరుమల ఘాట్ రోడ్డు పైకి రావడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.  అటవీ అధికారులు రంగ ప్రవేశం చేసి ఏనుగులను అడవిలోనికి తరిమివేయడంతో  భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. 

భారత జాతి ఆత్మగౌరవ ప్రతీక జాతీయ జెండా

జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి  నేడు. దేశ ఆత్మగౌరవ ప్రతీకగా జాతీయ పతాకాన్ని రూపొందించిన గొప్ప దేశ భక్తులు పింగళి వెంకయ్య. ఆయన వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. గొప్ప దేశ భక్తుడు పింగళి వెంకయ్య తెలుగువారు కావడం మనకందరికీ గర్వకారణమని చంద్రబాబు ట్వీట్ చేశారు. అలాగే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కూడా పింగళి వెంకయ్యకు నివాళులర్పించారు. దేశభక్తులు, రచయత అయిన పింగళి జాతీయ పతాకాన్ని రూపొందించారనీ, అలాగే భారత జాతికి ఆయన అందించిన గొప్ప సేవలను స్మరించుకుందామని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా పిలుపునిచ్చారు.   పింగళి వెంకయ్య పిన్న వయస్సులోనే దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరుబాట పట్టారు. 19ఏళ్ల వయస్సులోనే దక్షిణాఫ్రికాలో జరిగిన రెండో బోయెర్ సమరంలో పాల్గొన్నారు. అక్కడే ఆయనకు మహాత్మాగాంధీతో పరిచయం అయ్యింది. ఆ పరిచయం స్నేహానుబంధంగా దాదాపు అర్ధశతాబ్దం పాటు కొన సాగింది. ఆ సమయంలోనే స్వతంత్ర భారత పతాకం ఎలా ఉండాలన్నదానిపై వారిరువురి మధ్యా సమాలోచనలు జరిగాయని చెబుతుంటారు. జాతీయ పతాక రూపకల్పనపై అప్పటి నుంచే వెంకయ్య దృష్టి పెట్టారు. 1916లోనే దేశానికి ఒక జాతీయ జెండా అనే పుస్తకాన్ని రచించారు. 1996లో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండానే అప్పట్లో లక్నోలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆవిష్కరించారు. ఆ తరువాత మహాత్మా గాంధీ సూచించిన చిన్న చిన్న మార్పులతో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకమే జాతి చిహ్నంగా ఇప్పటికీ దేశ ఆత్మగౌరవానికి ప్రతీకగా రెపరెపలాడుతోంది.  స్వాతంత్ర్య ఉద్యమంలో పింగళి వెంకన్నది చిరస్మరణీయమైన పాత్ర. వందేమాతరం, హోమ్‌రూల్ ఉద్యమం, ఆంధ్రోద్యమం వంటి ఆందోళనలలో ఆయన అత్యంత కీలకంగా వ్యవహరించారు.  

గిల్ డబుల్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్

  ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో  జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (269 ; 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఓవర్‌ నైట్ స్కోరు 41తో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (89; 137 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీ చేసే అవకాశం చేజార్చుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (42; 103 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్ 2, జోష్ టంగ్ 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

భారీ ఉగ్ర కుట్ర భగ్నం..విస్పోటక పదార్థాలు స్వాధీనం

  అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉండడంతో  అరెస్టు చేసిన ఇరువురి ఇళ్లను సోదాలు చేశామని, భారీ మొత్తంలో విస్పోటక పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు రేంజ్ డి.ఐ.జి డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు.  వీరు ఆల్ ఉమ్మా అనే తీవ్రవాద సంస్థతో అనుబంధం కలిగి వున్నారన్నారు.   అన్నమయ్య జిల్లా పోలీసుల చొరవతో ఒక పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేయడంలో విజయం సాధించారు న్నారు. గురువారం అన్నమయ్య జిల్లా రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయకుడు తో కలసి డి.ఐ.జి కోయ ప్రవీణ్ విలేకరుల సమావేశంలో  మాట్లాడారు. గత నెల 30న తమిళనాడు పోలీసులు పలు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితులపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్లను అమలు చేశారన్నారు.  ఈ నిందితులు 1999 నుండి పరారీలో ఉండగా, వారు గత 20 సం. గా రాయచోటి పట్టణంలో తప్పుడు పేర్లతో (అబూ బకర్ సిద్ధిక్ అమానుల్లా పేరుతో, మహమ్మద్ అలీ – మంసూర్ పేరుతో) నివసిస్తున్నారన్నారు.  విశ్వసనీయ సమాచారం అందిన తర్వాత, అన్నమయ్య జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్  ఆదేశాల మేరకు, అన్నమయ్య జిల్లా పోలీసులు తక్షణమే స్పందించి, రాయచోటిలోని కొత్తపల్లి మరియు మహబూబ్ బాషా వీధిలో ఉన్న నిందితుల ఇళ్లను చట్టపరమైన విధానాల ప్రకారం శోధించారని ఆయన తెలిపారు.  ఈ గృహ శోధనలో భారీ మొత్తంలో విస్ఫోటక పదార్థాలు లభించాయన్నారు., వీటిని ఉపయోగించి పేలుడు పరికరాలు (ఐఇడియస్ ) తయారు చేయవచ్చు అన్నారు. ఈ పదార్థాలు భారతదేశ పౌరుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించే స్థాయిలో ఉన్నాయన్నారు. ఈ శోధనతో దేశ స్థాయిలో ప్రమాదం నివారించబడిందన్నారు. అబూ బకర్ సిద్ధిక్ @ అమానుల్లా మరియు మహమ్మద్ అలీ  మంసూర్ అనే ఉగ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించి ఈ సామగ్రిని పోలీస్ బృందం స్వాధీనం చేసుకుందన్నారు.వీరు "అల్ ఉమ్మా" అనే తీవ్రవాద సంస్థతో అనుబంధం కలిగిన వారిగా గుర్తించబడ్డారన్నారు. నిందితుల భార్యలు మహిళ పోలీసుల పై దాడికి యత్నం.    ఈ ఇంటి శోధన సందర్భంగా, నిందితుల భార్యలు అయిన సైరా భాను (అబూ బకర్ సిద్ధిక్ భార్య) మరియు షేక్ షమీం (మహమ్మద్ అలీ భార్యలు) పోలీసులపై ప్రతిఘటన చేయడమే  కాకుండా మహిళా పోలీసులపై దాడికి యత్నించారన్నారు.   సైరా భాను మరియు షమీం లను శోధనకు అడ్డుపడినందుకు మరియు మహిళా పోలీసులపై దాడికి ప్రయత్నించినందుకు అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు రిమాండ్ కి పంపామన్నారు. వీరికి నిందితుల ఉగ్రచర్యలపై ఎంత సంబంధముందో అనే దానిపై దర్యాప్తు కొనసాగుతుందని డి.ఐ.జి పేర్కొన్నారు. పోలీసుల నిరంతర శ్రమతో ఇంటిని శోధించి పై విస్ఫోటక సామగ్రిని స్వాధీనం చేసుకున్నారని డి.ఐ.జి వివరించారు.  ఈ ఘటనపై రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదు  చేసినట్లు డి.ఐ.జి తెలిపారు. ఈ కేసులు జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగించే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించినవిగా నమోదయ్యాయి. ఎగ్మోర్ ఘటన రోజు అనేక ఇతర బాంబులు కూడా వివిధ ప్రాంతాలలో (చెన్నై, త్రిచ్చి, కోయంబత్తూరు) పగులగొట్టబడ్డాయి. 1999లో కోచిన్-కుర్లా ఎక్స్‌ప్రెస్‌లో ఈ నిందితులు పేలుడు పదార్థాలను అక్రమంగా తరలించబోతుండగా, ఆ ట్రైన్‌లో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. అవి కాసర్‌గోడ్ వద్ద స్వాధీనం చేసుకున్నారన్నారు.. ఈ ఇద్దరు నిందితులు గత 20 సంవత్సరాలుగా రాయచోటి పట్టణంలో తప్పుడు గుర్తింపులతో నివసిస్తూ, స్థానికంగా వివాహాలు చేసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారన్నారు. ఇంకా ఇతర సహచర నిందితుల వివరాలు గుర్తించే పనిలో ఉన్నామన్నారు.  మరిన్ని వివరాలు తర్వాత అడ్వైజరీలో తెలియజేయబడతాయని డి.ఐ.జి తెలిపారు.

ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులు నిర్వీర్యం

  అన్నమయ్య జిల్లా  రాయచోటిలో ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేశారు. 30 ఏళ్లుగా పట్టణంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాదులు అబూ బకర్ సిద్ధిక్ అమానుల్లా పేరుతో, మహమ్మద్ అలీనీ ఐబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద దొరికిన సుట్ కేసు బాంబు బకెట్ బాంబులను  రాయచోటి కార్యాలయం పక్కన ఆక్టోపస్ పోలీసులు పేల్చేశారు.  తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉండడంతో  అరెస్టు చేసిన ఇరువురి ఇళ్లను సోదాలు చేశామని, భారీ మొత్తంలో విస్పోటక పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు రేంజ్ డి.ఐ.జి డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు.  వీరు ఆల్ ఉమ్మా అనే తీవ్రవాద సంస్థతో అనుబంధం కలిగి వున్నారన్నారు.  అన్నమయ్య జిల్లా పోలీసుల చొరవతో ఒక పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేయడంలో విజయం సాధించామన్నారు.  

గిల్ ద డబుల్

  ఐదు మంది సెంచురీలు చేసినా ఫస్ట్ టెస్ట్ లో ఓటమి భారత్ కి అత్యంత చెత్త రికార్డును తీసుకొచ్చి పెట్టింది. గిల్ కెప్టెన్సీలోని టీమిండియా. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సీరీస్ లో రెండో టెస్ట్ లో ఎలాగైనా సరే విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఆడుతున్నాడు యంగ్ కెప్టెన్ శుభ్ మన్ గిల్. తొలి టెస్టులో సెంచురీ చేసిన గిల్. రెండో టెస్టులో డబుల్ సెంచురీ ,అది కూడా ఆట ముగిసే సమయానికి నాట్ అవుట్ గా ఉన్నాడు. ఇప్పటికే  ఎన్నో రికార్డులను మోత మోగించాడు. ఇంగ్లండ్ లో ఒక కెప్టెన్ గా 179 పరుగుల హయ్యస్ట్ స్కోర్ రికార్డు అజర్ పేరిట ఉండేది. 1990 ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్టులో ఈ రికార్డు నమోదు చేశాడు అజర్. ఇపుడా రికార్డు క్రాస్ చేశాడు గిల్. అంతేనా విరాట్ కోహ్లీ తర్వాత విదేశీ గడ్డపై డబుల్ బాదిన రెండో కెప్టెన్ కూడా గిల్లే. SENA దేశాల్లో శతకం చేసిన ఆరో ఏషియన్ కెప్టెన్ గానూ నిలిచాడు. టెస్టుల్లో డబుల్ చేసిన ఆరో కెప్టెన్ గా మరో రికార్డు సృష్టించాడు. 2003 తర్వాత ఇంగ్లండ్ పై ద్విశతం చేసిన తొలి విదేశీ ఆటగాడు కూడా గిల్లే. మొత్తం మీద ఇంగ్లండ్ బౌలర్లను తన దైన బ్యాటింగ్ పెర్ఫామెన్స్ తో ఒక ఊపు ఊపేస్తున్నాడు కెప్టెన్ గిల్. త్రిశతం(300) కూడా బాదేసి సెహ్వాగ్ పేరిట ఉన్న టెస్ట్ హయ్యస్ట్ ఇండియన్ ప్లేయర్ రికార్డు కూడా తిరగరాసే అవకాశం ఉంది.

హైదరాబాద్‌కు చేరుకున్న ఖర్గేకు సీఎం రేవంత్‌ ఘన స్వాగతం

  ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్టులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో ఖర్గే పాల్గొననున్నారు. రేపు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనం, బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు తరలిరావాలని సక్సెస్​చేయాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. గ్రామ శాఖ అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నేరుగా మండల అధ్యక్షులతో మాట్లాడున్నారు.  

హస్తినకు చేరిన..ఓరుగల్లు వివాదం

  వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ, రెండుగా చీలిపోయిందా? అంటే, విశ్లేషకులు అవుననే అంటున్నారు. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ ఒక జట్టుగా, మిగిలిన ఎమ్మెల్యేలు మరో జట్టు హస్తం పార్టీ  రెండుగా చీలి పోయిందని, మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి, ఒక్క వరంగల్ జిల్లా అనే కాదు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఇంచుమించుగా ఇదే పరిస్థితి ఉందని ఏ ఒక్క జిల్లాల్లోనూ హస్తం పార్టీ ఒకటిగా లేదని, గాంధీ భవన్  సాక్షిగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సరే, అదలా ఉంచి  వరంగల్ విషయానికి వస్తే, వరంగల్ జిల్లాలో పరిస్థితి, రోజు రోజుకు శృతి మించి రాగాన పడుతోందని, అంటున్నారు. ఇప్పటికే, జిల్లా సరిహద్దులు దాటి గాంధీ భవన్’కు  చేరిన, వరంగల్ పచాయతీ తాజా సమచారాన్ని బట్టి ఢిల్లీకి చేరిందని అంటున్నారు.ఓ వంక హస్తం పార్టీ అధికారంలో ఉన్న పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్’మధ్య, సాగుతున్న ‘కిస్సా కుర్సీకా’ వివాదం ఇంకా ఒక  కొలిక్కి రాలేదు. ప్రస్తుతానికి సర్డుమణిగినట్లు కనిపిస్తున్నా,మళ్ళీఎప్పుడైనా భగ్గుమనే ప్రమాదం ఉందని భావిస్తునారు.ఈ నేపద్యంలో తెలంగాణలో రాజుకున్న వివాదం ఉపేక్షిస్తే ముందు ముందు మరంత ప్రమాదంగా పరిణమించే ప్రమాదం లేక పోలేదని, అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చిందని, గాంధీ భవన్ వర్గాల సమాచారంగా చెపుతున్నారు.  అదలా ఉంటే,అధికారంలోకి వచ్చేందుకు, వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు   కాంగ్రెస్ పార్టీ’ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర పార్టీల నాయకులకు పదవులు  ఎరగా వేయడం వలన తలెత్తిన సమస్యలు, చిలికిచిలికి గాలివానగా మారి పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. కొండా సురేఖ ఫ్యామిలీ విషయంలోనూ అదే జరిగిందని అంటున్నారు. ఎన్నికలకు ముందు, కొండా ఫ్యామిలీకి రెండు ఎమ్మెల్యే టికెట్లు,ఇస్తామన్నారు,ఇవ్వలేదు. ఒకే టికెట్’తో సరిపెట్టారు.కొండా మురళీకి ఎమ్మెల్సీ ప్రామిస్’ చేశారు.కానీ,అదీ లేదు.కొండా సురేఖకు మంత్రి పదవి అయితే ఇచ్చారు,కానీ, గిట్టుబాటయ్యే శాఖలు ఇవ్వలేదన్న అసంతృప్తిని కొండా మురళీ  దాచుకోలేదు.మంత్రి సురేఖ శాఖల్లో ఎక్కడ పైసలు రాలడం లేదని, ఇప్పటికీ, ఆమె నెల వారీ ఖర్చులకు తానే పైసలు పంపుతున్నాని మీడియా ఎదుటనే ప్రకటించారు. అంతేకాకుండా,ఇప్పుడేమో,ఇచ్చిన సురేఖ కుర్చీకి ఎసరు పెడుతున్నారు, అందుకే, మంత్రి కొండా సురేఖ’కుటుంబంలో అసంతృప్తి భగ్గుమంటోంది,వరంగల్ రాజకీయాల్లో రగులుతున్న వర్గ పోరుకు ఇదే ప్రధాన కారణంగా పరిశీలకులు పేర్కొంటున్నారు. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే ఒరలో రెండు కాదు, అంతకంటే ఎక్కువ కత్తులు ఇమిడ్చే ప్రయత్నం చేయడం వల్లనే ఈరోజు,ఈ పరిస్థితి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపధ్యంలో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, మీనాక్షి నటరాజన్’ ద్వారా సమాచారం తెప్పించుకున్న కాంగ్రెస్ అధిష్టానం, వరంగల్’ వివాదాన్ని మొగ్గలోనే తున్చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదలా ఉంటే, తాజాగా కొండా దంపతుల కుమార్తె, కొండా సుష్మిత పటేల్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తానే పోటీచేస్తున్నానని సోషల్ మీడియా అకౌంట్‌’ లో మార్పులు ద్వారా సంకేతాలు ఇవ్వడంతో వరంగల్’ వివాదం మరో మలుపు తీసుకుందని అంటున్నారు. అదొకటి అయితే, కొండా దంపతులు ఈరోజు (జులై 3) కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసి, ఉమ్మడి వరంగల్‌లో జరుగుతున్న అంశాలపై ఆమెకు 16 పేజీల నివేదికను నివేదిక ఇచ్చారు. అలాగే, తమ పై వచ్చి ఆరోపణలపై కొందాడంపతులు, మీనాక్షి నటరాజన్’కు సమాధానం చెప్పారు. రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని చెప్పిన కొండా దంపతులు.. నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరిది తప్పుంటే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరారు.దీంతో, వరంగల్, వివాదం తీవ్ర రూపం దాలుస్తున్నట్లు గుర్తించినమీనాక్షి నటరాజన్’ అధిష్టానం జోక్యం చేసుకోవాలని కోరినట్లు చెపుతున్నారు. ముఖ్యమంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జూలై 4న రాష్ట్రానికి వస్తున్న  నేపద్యంలో.. విషయాన్ని  అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. అధిష్టానం ఎలా స్పందిస్తుంది, ఏమి చూస్తుంది చూడవలసి వుందని అంటున్నారు.  

ప్రియుడి మోజులో పడి కూతురిని చంపిన తల్లి.. ఇద్దరికి జీవిత ఖైదు

  ప్రియుడి మోజులో పడి ప్రియుడితో కలిసి తన సంవత్సన్నర వయస్సు గల కూతురిని చంపిన కేసులో ఇద్దరు ముద్దయిలకు జీవిత కాలం ఖైదు మరియు 5 వేల రూపాయల జరిమానా విధించారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన మొరంపల్లి గ్రామానికి చెందిన శాంత రామసముద్రం మండలానికి చెందిన శ్రీనివాసులు ఇద్దరూ గ్రామాలలో రికార్డింగ్ డ్యాన్స్ లు చేస్తూ జీవనం సాగించేవారు. ఒకే వృత్తిలో ఉండటంతో వీరిద్దరికీ అక్రమ సంబంధం ఏర్పడింది. కాగా శాంతకు పెళ్లయి కూతురు ఉండేది. వారి మధ్య కొనసాగుతున్న అక్రమ సంబంధానికి ఆమె కూతురు అడ్డుగా ఉంటుందని భావించిన ఇద్దరూ దారుణానికి ఒడిగట్టారు.  పుంగనూరు మండలంలోని పెద్దతాండ గ్రామంలో డ్యాన్స్ ప్రోగ్రాం నిమిత్తం ఒక ఆటోలో వెళ్తున్న సమయంలో, వారు ప్రయాణిస్తున్న ఆటోలోనే చిన్నారిని ఇనుపరాడుతో తలపై గుద్ది హత్య చేసి, ఆమె మృతదేహాన్ని గుడ్డలో కట్టి ఆటోలో ఉంచారు. అనంతరం అదే ఆటోలో మదనపల్లి మండలంలోని మదనపల్లె–చెంబకూర్ రోడ్డులో ఉన్న దాసరి వంకలో మృతదేహాన్ని పారవేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ ఘటనపై ఆ రోజు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ లో ఆ గ్రామ వి.ఆర్.ఓ కావలి వెంకటరమణ ఫిర్యాదు చేయగా, అప్పటి ఎస్ఐ  కె.వి.హెచ్.నాయుడు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి మదనపల్లి రూరల్ ఇన్స్పెక్టర్  ఎం. మురళి దర్యాప్తును చేపట్టి సంఘటనా స్థల పరిశీలన, పోస్ట్‌మార్టం నివేదికల ఆధారంగా ఈ హత్య శాంత మరియు ఆమె ప్రియుడు శ్రీనివాసులు కలిసి చేశారని నిర్ధారించారు.  2017 డిసెంబర్ 5న లభించిన సమాచారంతో, మదనపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ మదనపల్లి-చెంబకూర్ రోడ్డులోని లాబాల గంగమ్మ దేవాలయం వద్ద ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారు ప్రయాణించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. సదరు కేసులో ముద్దాయికి శిక్ష పడుటకు కృషి చేసిన అప్పటి పుంగనూరు ఇన్స్పెక్టర్ టి.సాయినాథ్, ఇప్పటి చిత్తూరు సబ్-డివిజన్ డి.ఎస్పీ అడిషనల్ పి.పి  జయనారాయణ రెడ్డి, కోర్టుకు సాక్షాలను సకాలంలో హాజరు పరచిన కోర్ట్ కానిస్టేబుల్ మోహన్ రెడ్డి, పుంగనూరు కోర్ట్ కానిస్టేబుల్  రవి మరియు కోర్ట్ మానిటరింగ్ సెల్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్  చంద్రశేఖర్ మరియు వారి సిబ్బందిని చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు, ప్రత్యేకంగా అభినందించారు.

మరోసారి మోసపోయిన శ్రీవారి భక్తులు

  కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని తోమాల సేవ, అభిషేక సేవలలో కూర్చుని  తనివి తీరా చూడాలని భావించిన వారి కోరిక ఫలించలేదు. తీరా కొండకు చేరుకున్న తర్వాత పది రోజుల ముందే ఒక వ్యక్తి మొబైల్ నుండి వచ్చిన  తోమాల, అభిషేక సేవా టికెట్లను తమ ఫోన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే క్రమంలో అవి నకిలీవి అని తేలడంతో విస్తు పోయారు. వెంటనే తిరుమల వన్ టౌన్ పోలీసులకు  ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా మీరు ఎక్కడ నుండి మొబైల్ ట్రాన్సాక్షన్  చేశారో ఆ పరిధి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పడంతో చేసేదేమీ లేక తమ వద్ద ఉన్న ఉచిత టైం స్లాట్ దర్శన టోకెన్లతో వెళ్లి స్వామి వారిని  దర్శించుకుని గురువారం వెనుతిరిగారు.  వివరాల్లోకెళితే తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన విజయ్ ఒక ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. తన మిత్రుడి ద్వారా బాలాజీ అనే వ్యక్తి నంబరు పొందాడు. బాలాజి మీకు కోరిన దర్శనం చేయిస్తాడని చెప్పడంతో అతనిని సంప్రదించి దపదపాలుగా బాలాజీ అకౌంట్ నెంబర్ కు రూ. 65 పంపాడు. అందుకు పది రోజుల క్రితం విజయ్ కుటుంబ సభ్యులు ఐదు మంది పేర్లతో టీటీడీ లోగో కలిగిన నకిలీ తో మాల సేవ టికెట్టును 03-07-2025 తేదికి, మరుసటి రోజు 04-07-2025 తేదీ శుక్రవారం రోజుకి 6 మందికి కలిపి ఒక నకిలీ టికెట్టును అనుమానం రాకుండా నెట్ లో తయారు చేయించి విజయ్ మొబైల్ కు పంపాడు. అలాగే ఒక సూట్ రూమ్ కు కూడా వారి పేరుతో   నకిలీ రసీదు ను పంపాడు. వారు స్వామివారు మనకు మంచి సేవలు ఇచ్చారు అనే ఆనందం లో బుధవారం  తిరుమలకు చేరుకున్నారు.  ఎందుకైనా మంచిదే అని తిరుపతిలో ఉచిత టైమ్ స్లాట్ టోకెన్లు పొందారు. తీరా  మీరు మాకు బుక్ చేసిన గదిని పొందేందుకు ఎక్కడికి వెళ్లాలని అడిగేందుకు బాలాజీకి ఫోన్ చేశారు. అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోగా మెసేజ్ లకూ స్పందించలేదు. దాంతో అనుమానం కలిగి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. రిఫరెన్స్ అనేది టికెట్ పైన లేకుండా దర్శనం టికెట్టు మంజూరు కాదు. ఎంతటి వి.వి.ఐపీ లు అయినా ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారే స్వయంగా వస్తే తోమాల సేవను  ఒకరికి లేక ఇద్దరికీ మంజూరు చేస్తారు. అలాగే పూరాభిషేకం కూడా ప్రోటోకాల్ పరిధిలో ఉన్నవారికి ఒక్కటి లేక రెండు మంజూరు చేస్తారు.  ఇలా ఎలా మోసపోయారని తిరుమల పోలీసులు బాధితుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. దళారీలు మాత్రం శ్రీవారి భక్తులను మోసం చేసేందుకు రక రకాల కొత్త మార్గాలను ఉపయోగించి దోచేస్తున్నారు. ఇటువంటి మోసాలపై ఇటు టీటీడీ, అటు పోలీసులు బయట వ్యక్తులను నమ్మకండి... టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాలని పదే పదే కోరుతున్నప్పటికీ తరచూ ఇలాంటి ఘటనలతో భక్తులు మోసపోతూనే ఉన్నారు. కాగా నకిలీ టికెట్లతో భక్తులను మోసం చేసిన బాలాజీ బ్యాంక్ అకౌంట్ కడప జిల్లా ఒంటిమిట్టలో ఉన్నట్లు బాధిత భక్తుడు విజయ్ తెలిపారు.

హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం

  హైదరాబాద్, ఏస్ఆర్‌నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రిష్ హొటల్ భవనంలో ఉన్న కాఫీడేలో మంటలు చేలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకోచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే హైదరాబాద్, పాశమైలారంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అగ్నిప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. యాజమానుల నిర్లక్ష్యం జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రమాదలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

పతంజలికి షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు

  ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద్ కంపెనీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. డాబర్ చ్యవన్‌ప్రాష్ లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. డాబర్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు, పతంజలి ప్రకటనలు నిరాధారమైనవని పేర్కొంది. డాబర్ రూ. 2 కోట్లు పరిహారం కోరింది. పతంజలి సంస్థ తమ ఉత్పత్తుల్లో ఎక్కువ ప్రజాదరణ కలిగిన ఒకదాని గురించి అవమానకరమైన ప్రకటనలను నిర్వహిస్తోందని ఆరోపిస్తూ డాబర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ మినీ పుష్కర్ణ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.  ఆయుర్వేద, శాస్త్రీయ గ్రంథాల ఆధారంగా చ్యవన్‌ప్రాష్‌ను తయారు చేసిన ఏకైక సంస్థ తమదేనని, డాబర్ వంటి ఇతర బ్రాండ్‌లకు ప్రామాణికమైన జ్ఞానం లేదని, అవెలా తయారు చేయగలవని యాడ్స్‌ను పతంజలి రూపొందించింది. దీనిపై అభ్యంతరాలు తెలిపిన డాబర్ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పతంజలి తమ ఉత్పత్తుల గురించి తప్పుడు ప్రచారం చేస్తోందని, తక్షణం వాటిని నిలిపివేయాలని ఆదేశాలివ్వాలని కోరింది. తాము మార్గదర్శకాలను అనుసరించే ఉత్పత్తులను తయారు చేస్తున్నామని, పతంజలి రూపొందించిన యాడ్స్ వినియోగదారులను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని వివరించింది.దీనిపై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు పతంజలి యాడ్స్‌ను తక్షణం నిలిపేయాలని, తదుపరి విచారణ జూలై 14కి వాయిదా వేసింది.