గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు

ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టు అడవిలో ఉండే గూడెం అనే గ్రామం అది. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. గూడెం గ్రామ ప్రజల ఇళ్ళలో నేటి వరకూ విద్యుత్ వెలుగులు లేవు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలైనా వారు పడుతున్న వెతలు బాహ్య ప్రపంచానికి తెలియవు. అలాంటి గిరిపుత్రుల సమస్యను ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  మనసుతో అర్థం చేసుకున్నారు. ఐదు నెలల్లోనే ఆ గిరిజన గ్రామంలో వెలుగులు నింపారు. గిరిపుత్రుల ముఖాల్లో ఆనంద కాంతులు వెల్లివిరిసేలా చేశారు. బుధవారం ఆ గ్రామంలో ఉన్న 17 ఇళ్ళకీ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. కార్తీక పౌర్ణమి రోజున బయట వెన్నెల కాంతులు... గూడెం ప్రజల ఇళ్ళలో విద్యుత్ కాంతులు విరుస్తున్నాయి.       ఉప ముఖ్యమంత్రివర్యులకు వినతులు అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గూడెం గ్రామం ఉంది. మండల కేంద్రానికి  50 కిలోమీటర్ల దూరంలో 17 ఆవాసాలతో ఉంది ఆ గ్రామం. గూడెంలో నివసించే గిరిపుత్రులకు రోడ్లు, రక్షిత తాగునీరు, విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు అందటం లేదు. బాహ్య ప్రపంచంతో వీరి సంబంధాలు అంతంత మాత్రమే. పగటి వేళల్లో ఉపాధి కోసం బయటకు వచ్చే గూడెం గ్రామస్తులు, రాత్రిళ్లు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీసేవారు. అడవి జంతువులు వచ్చి తమ ఊరి మీద పడతాయేమోనని భయంతో బతికేవారు. గతంలో ఎన్నోమార్లు అధికారులకు తమ సమస్యను చెప్పుకొన్నా పరిష్కారం లభించలేదు.  అయిదు నెలల కిందట రాష్ట్ర డిప్యూటీ సీఎం దృష్టికి తమ సమస్యను తీసుకువచ్చారు. అడవితల్లి బాటతో గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మీరు మా గ్రామంలో విద్యుత్ కాంతులు నింపమంటూ కోరారు. తన ముందుకు వచ్చిన సమస్యను పరిష్కరించి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని అల్లూరి జిల్లా కలెక్టర్ కి స్పష్టం చేశారు. 17 ఆవాసాల కోసం 9.6 కిలోమీటర్ల పొడవునా అడవులు, కొండల్లో విద్యుత్ లైన్లు వేయాలి. సుమారు రూ. 80 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.  దీంతో వారికో దారి చూపేందుకు ముందున్న దారులను పవన్ కళ్యాణ్ వెతికారు. ఈ సమస్యను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి  గొట్టిపాటి రవి కుమార్‌కి, ఏపీ జెన్కో సీఎండీలకు తెలియచేశారు. అవసరం అయితే కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకుని తక్షణం సమస్య పరిష్కరించాలని కోరారు. ఉపముఖ్యమంత్రిగారి సూచనతో భారత ఇంధన మంత్రిత్వశాఖ పరిధిలోని నాన్ పీవీజీటీ పథకం ద్వారా ఆ గిరిజన గ్రామంలో విద్యుత్ శాఖ వెలుగులు నింపింది.  9.6 కి.మీ... 217 స్తంభాలు  రూ. 80 లక్షల పైగా అంచనా వ్యయంతో సుమారు 9.6 కిలోమీటర్ల మేర, 217 విద్యుత్ స్తంభాలు వేసుకుంటూ వెళ్లి 17 ఆవాసాలకు విద్యుత్ సరఫరా ఇచ్చారు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా సోలార్ ప్యానళ్లు కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ కి అనుసంధానించారు. గూడెం గ్రామానికి విద్యుత్ లైను వేసేందుకు విద్యుత్ శాఖ ఒక యజ్ఞమే చేసింది. విద్యుత్ స్తంభాల రవాణా, పాతడం వంటి పనులు అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య పూర్తి చేశారు. మానవ వనరులను ఉపయోగించి స్తంభాలు రవాణా చేయడం, రాతి కొండలను తవ్వేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మొదలు పెట్టిన 15 రోజుల్లోనే పనులు విజయవంతంగా పూర్తి చేశారు.  పీఎం జన్మన్ పథకం కింద రూ.10.22 లక్షలతో సోలార్, పవన విద్యుత్ తో కూడిన హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గిరిజన గ్రామాల్లో మొట్టమొదటిసారి ఈ తరహా గ్రిడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఒక్కో ఇంటికీ ఐదు బల్బులు, ఒక ఫ్యాన్ కూడా అందించారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రజలు నివసించే శిఖర ప్రాంతంలో విద్యుత్ వెలుగులను నింపేలా నిధులు కేటాయించిందని ఉప ముఖ్యమంత్రి  పవన్  తెలియచేశారు.  సీఎం చంద్రబాబు  నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుందని చెప్పడానికి గూడెం గ్రామంలోని ఇళ్లకు విద్యుత్ సరఫరా చేయడమే నిదర్శనం అన్నారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని గూడెం గ్రామంలో విద్యుత్ వెలుగులు నింపడానికి సహకరించిన విద్యుత్ శాఖ గొట్టిపాటి రవికుమార్ కీ, ఏపీసీపీఎల్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్  పృథ్వి తేజకీ, విద్యుత్ శాఖ సిబ్బందికి ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్  అభినందనలు తెలిపారు. •     గూడెం గ్రామంలో హర్షాతిరేకాలు కనీసం సౌకర్యాలు లేని, విద్యుత్ కాంతులు లేని గూడెం గ్రామ గిరిజనులు బుధవారం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ వేడుకగా ఉన్నారు. తమ గ్రామంలో మొట్టమొదటిసారి విద్యుత్ వెలుగులు చూసిన గూడెం ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమ గ్రామానికి విద్యుత్ లైను వేయించి, తమ ఇళ్ళలో విద్యుత్ కాంతులు నింపిన  పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ గ్రామాన్ని యలమంచిలి శాసన సభ్యులు  సుందరపు విజయ్ కుమార్ , అరకు నియోజక వర్గం జనసేన నాయకులు, జన సైనికులు సందర్శించారు. కనీసం రహదారి సౌకర్యం లేని ఆ గిరి శిఖర గ్రామానికి ట్రాక్టర్ సాయంతో ప్రయాణించి మరీ చేరుకున్నారు.  ఆ గ్రామస్తుల ఆనందోత్సాహాల్లో భాగమయ్యారు.  

హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు నోటిఫికేషన్

  హైదరాబాద్-విజయవాడ మధ్య 65వ జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రహదారిలో 40 నుంచి 269 కిలోమీటరు వరకు మొత్తం 229 కి. మీ. పొడవున నాలుగు నుంచి ఆరు వరుసలకు విస్తరించడానికి అవసరమైన భూసేకరణ కోసం తెలంగాణ, ఏపీల్లో అధికారులను నియమిస్తూ కేంద్ర రహదారి, రవాణాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భూసేకరణ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని పలు జిల్లాల్లో భూసేకరణ బాధ్యతలను పలువురు అధికారులకు అప్పగించారు. తెలంగాణ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ మండలంలో 9 గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో భూసేకరణ పనులను జాయింట్‌ కలెక్టర్లకు అప్పగించారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని నందిగామ మండలంలో 4 గ్రామాలు భూసేకరణ చేయనున్నారు. 

అయ్య బాబోయ్ ఇన్ని మద్యం బాటిల్స్

  మందుబాబులకు మన సరుకు కంటే విదేశీ సరుకు మీద మక్కువ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఆ సరుకు తక్కువ దొరుకు దొరుకుతుంటే... ఇక ఊరుకుంటారా... కొందరైతే దాన్నే వ్యాపారంగా సాగి స్తున్నారు. కొంతమంది వివిధ మార్గాల ద్వారా ఇతర రాష్ట్రాల నుండి గుట్టు చప్పుడు కాకుండా  మద్యం బాటిల్స్ లను హైదరాబాద్‌కు రవాణా చేసి యదేచ్ఛగా అమ్మకాలు జరుపుతున్నారు.  ఈ క్రమంలోనే రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీం కు గోవా, ఢిల్లీ, పాండిచ్చేరి ప్రాంతాల నుండి మద్యం తీసుకువచ్చి తెలంగాణలో అమ్మకాలు జరిపేందుకు ప్రయత్నం చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ టీం షరీఫ్ పహాడ్ వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు.. ఈ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన కార్లను తనిఖీ చేశారు.  నిబంధనలకు విరుద్ధంగా ఓ 20 మంది వద్ద అత్యధికంగా మద్యం బాటిల్స్ ఉండడం గమనించారు. దీంతో ఎన్ఫోర్స్మెంట్ టీం వారందరికీ నోటీసులు ఇచ్చి పంపించారు. అనంతరం వారి వద్ద ఉన్న 192 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసు కున్నట్లుగా ఏఈ ఎస్ జీవన్ కిరణ్ తెలిపారు. పట్టుకున్న మద్యం విలువ 5.76 లక్షల విలువ ఉంటుందని తెలిపారు.  

దక్షిణాఫ్రికాతో సిరీస్‌‌కు భారత్ జట్టు ప్రకటన

  దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను బీసీసీఐ జట్టును ప్రకటించింది. జట్టులోకి రిషబ్ పంత్, అక్షర్ పటేల్‌ను తీసుకున్నారు.  సౌత్‌ప్రికాతో టీమ్ఇండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. నవంబర్ 14 నుంచి కోల్‌కతా, 22 నుంచి గువాహటి వేదికగా టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. పేసర్ ఆకాశ్‌ దీప్ కూడా జట్టులో మళ్లీ చోటు దక్కించుకున్నాడు.  టీమిండియా జట్టు  శుభ్‌మన్‌ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్-వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్  

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ ముగ్గురు మవోలు మృతి

  తెలంగాణ- చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లా మరికల్ అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు ఘటన స్థలం నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.. ప్రస్తుతం సెర్చ్‌ ఆపరేషన్ కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. ముగ్గురు నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇటీవల గరియాబంద్‌లో రూ.కోటి రూపాయల రివార్డు ఉన్న మావోయిస్టు మరణించిన సంగతి తెలిసిందే. గరియాబంద్ జిల్లాలోని మెయిన్‌పూర్ అడవుల్లో భద్రతా దళాల కాల్పుల్లో కీలక మావోయిస్టులు హతమయ్యారు. మెయిన్‌పూర్ ప్రాంత అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు  సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.  

ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలపై పోలీసుల హెచ్చరిక

  హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్‌లు విపరీతంగా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. సోషల్ మీడియా, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా అధిక లాభాలు లేదా గ్యారంటీ ప్రాఫిట్లు ఇస్తామని చెప్పి మోసగాళ్లు ప్రజలను ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. నకిలీ వెబ్‌సైట్లు, ట్రేడింగ్ యాప్స్, డాష్‌ బోర్డులు సృష్టించి బాధితులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.  మొదట చిన్న మొత్తంతో పెట్టుబడి చేయమని ప్రోత్సహించి, తర్వాత నకిలీ లాభాలు చూపించి మరిన్ని డబ్బులు పెట్టమని ఒత్తిడి పెడతారని. లాభాలను విత్డ్రా చేయాలనగానే టాక్స్‌లు, ఫీజులు, కరెన్సీ కన్వర్షన్ ఛార్జీల పేరుతో మరిన్ని డబ్బులు అడుగుతారు. చివరికి బాధితులు తమ డబ్బు కోల్పోతారని పోలీసులు తెలిపారు.సైబర్ క్రైమ్ అధికారులు ప్రజలను జాగ్రత్తగా ఉండమని సూచించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఆఫర్లను నమ్మవద్దని పోలీసులు సూచించారు.  సేబీ లైసెన్స్ ఉన్న సంస్థలలో మాత్రమే పెట్టుబడులు పెట్టాలని పోలీసులు పేర్కొన్నారు. బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, పాస్వర్డ్లు, యూపీఐ పిన్‌లు ఎప్పటికీ ఎవరికీ చెప్పవద్దని వారు తెలిపారు. ఎవరైనా లీగల్ యాక్షన్ లేదా అకౌంట్ ఫ్రీజ్ చేస్తామని భయపెడితే డబ్బులు చెల్లించకండని పేర్కొన్నారు. మోసపోయిన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్ కి కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

రుషికొండ ప్యాలెస్ లో గూగుల్ !?

వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వ్యయం చేసి మరీ రుషికొండపై జగన్ హయాంలో నిర్మించిన విలాసవంతమైన ప్యాలస్ ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. జగన్ తన సొంతం కోసం ప్రజాధనంతో నిర్మించిన ఈ అత్యాధునిక విలాసవంతమైన భవనాన్ని ఎలా ఉపయోగించాలన్న దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.   ఈ నేపథ్యంలోనే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రాబోతోంది. దేశంలో ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో గూగుల్ ఇక్కడ డేటా సర్వేను ఏర్పాటు చేస్తున్నది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇప్పుడు రుషికొండ ప్యాలెస్ ను గూగుల్ కంపెనీకి అప్పగిస్తే.. ఆ కంపెనీ తన డేటా సెంటర్ కు శాశ్వత నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకునే వరకూ రుషికొండ ప్యాలెస్ ను గూగుల్ కార్యాలయంగా ఉపయోగించుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం మేధావులు, విద్యావేత్తల నుంచి వస్తున్నది.    ప్రపంచ ప్రఖ్యాత పొందిన గూగుల్ కి ఇస్తే డేటా సెంటర్ కార్యకలాపాలు జాప్యం లేకుండా ప్రారం భమయ్యే అవకాశం ఉంటుందంటున్నారు.  ఈ అంశాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సీరియస్ గా పరిశీలించాలంటున్నారు. డేటా సెంటర్ ఏర్పాటుకు  ప్రభుత్వం భూమి కేటాయింపు, ఆ కేటాయించిన భూమిలో కంపెనీ నిర్మాణాలు చేపట్టడం వంటివన్నీ పూర్తి కావడానికి ఎంత లేదన్నా రెండు సంవత్సరాలు పడుతుంది. అంత వరకూ రుషికొండ ప్యాలెస్ ను గూగుల్ కు అప్పగిస్తే.. ప్రభుత్వానికి ఆ ప్యాలెస్ మెయిన్ టెయినెన్స్ ఖర్చు కలిసిరావడమే కాకుండా ఆదాయం కూడా వస్తుందని అంటున్నారు.  అమెరికా తరువాత ఆ స్థాయిలో.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. అమెరికా వెలుపల ఇంత భారీ పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావడానికి మంత్రి లోకేష్ చోరవే కారణమనడంలో సందేహం లేదు.విశాఖ ఐటీ  హబ్ గా మారడానికి ఇది తొలి అడుగు అని చెప్పాల్సి ఉంటుంది.  జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో కొత్త సంస్థలు రావడం మాట అటుంచి.. ఉన్నవి తరలిపోయే పరిస్థితి ఉండేది. అభివృద్ధి ఆనవాలే కనిపించని పరిస్థితి. అరకొర సంక్షేమం అమలు చేయడమే పాలన అనుకున్న జగన్ హయంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలోనూ వెనుకబడిపోయింది. మళ్లీ రాష్ట్రంలో అభివృద్ధి సుమాలు విరియడం మొదలైంది.. 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి భారీ ఆధిక్యతతో విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టిన తరువాతే. జగన్ హయాంలో  రాష్ట్రం రాజధాని అనేదే లేకుండా అనాథగా మారింది. జగన్ మూడు రాజధానులంటూ.. అసలు రాజధానే లేని పరిస్థితిని తీసుకువచ్చారు. ఆర్థిక రాజధానిగా విశాఖ అన్న జగన్.. విశాఖలో ప్రజాధనంతో ప్రజలను ఉపయోగం లేని రుషికొండ ప్యాలెస్ నిర్మించడం తప్ప చేసినదేమీ లేదు.  ఇప్పుడు ఆ ప్యాలెస్ నిర్వహణే ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారింది. అందుకే  రుషికొండ ప్యాలెస్ ను  గూగుల్ డేటా సెంటర్ కు అప్పగిస్తే సద్వినియోగం అవుతుందని అంటున్నారు.  

ట్రంప్ వార్నింగ్‌లు... లెక్క చేయని అమెరికా ఓటర్లు

  భారత్ మూలాలు ఉన్న నేతలు అమెరికా ఎన్నికల్లో విజయం సాధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు షాక్ ఇచ్చారు. భారత సంతతికి చెందిన డెమాక్రెటిక్ నేత జొహ్రాన్ మమ్దానీ చరిత్ర సృష్టించారు. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మరోవైపు వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా డెమోక్రాట్‌ నాయకురాలు గజాల హష్మీ విజయం సాధించారు. అమెరికా రాష్ట్రాల్లో ఈ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. ఈమె హైదరాబాద్‌ మూలాలున్న మహిళ కావడం విశేషం.   ఆ క్రమంలో అమెరికాలో మరో చరిత్ర ఆవిష్కృతమైంది. న్యూయార్క్ నగర మేయర్‌గా డెమాక్రెటిక్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన జొహ్రాన్ మమ్దానీ ఎన్నికయ్యారు. జొహ్రాన్ ఎన్నికైతే నిధులు నిలిపివేస్తామన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను ఖాతరు చేయని న్యూయార్క్ ప్రజలు మమ్దానీకే పట్టం కట్టారు. నగర మేయర్‌గా ఎన్నికైన తొలి ముస్లింగా, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా మమ్దానీ చరిత్ర సృష్టించారు. ఆఫ్రికాలో జన్మించిన మమ్దానీకి ప్రజలు నగర పగ్గాలు అందించడం ఈ ఎన్నికల్లో ఆవిష్కృతమైన మరో విశేషం. కేవలం 34 ఏళ్ల వయసులోనే జొహ్రాన్ మమ్దానీని మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్నారు. గత వందేళ్లల్లో అత్యంత పిన్న వయస్కుడైన మేయర్‌గా అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. ఆయన తల్లిదండ్రులిద్దరూ భారత మూలాలున్న వ్యక్తులే. తల్లి మీరా నాయర్‌ పంజాబీ హిందూ మహిళ. భారత దిగ్గజ దర్శకుల్లో ఆమె ఒకరు. ‘సలామ్‌ బాంబే’, ‘మాన్‌సూడ్‌ వెడ్డింగ్‌’ వంటి ప్రముఖ చిత్రాలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. తండ్రి మహ్మద్‌ మమ్‌దానీ గుజరాతీ ముస్లిం. బాంబేలో జన్మించిన మహ్మద్‌ మమ్‌దానీ ఆ తర్వాత ఉగాండాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.  మరోవైపు వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా డెమోక్రాట్‌ నాయకురాలిగా ఎన్నికైన  గజాల హష్మీ  హైదరాబాద్‌ మూలాలున్న మహిళ కావడం విశేషం. గజాలా హష్మీ 1964లో హైదరాబాద్‌లో జన్మించారు. బాల్యంలో మలక్‌పేటలోని తన అమ్మమ్మ ఇంట్లో కొంతకాలం నివసించారు. ఆమె తాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆర్థిక విభాగంలో పనిచేశారు. నాలుగేళ్ల ప్రాయంలో తన తల్లి, సోదరుడితో కలిసి గజాలా అమెరికాలోని జార్జియాకు వెళ్లారు. ఆ తర్వాత అక్కడే స్థిరపడ్డారు. చదువుల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అనేక స్కాలర్‌షిప్పులు ప్రోత్సాహకాలు అందుకున్న గజాలా.. జార్జియా సదరన్‌ విశ్వవిద్యాలయంలో బీఏ ఆనర్స్‌ చదివారు.

మహా పడిపూజలో మంత్రి లోకేష్

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో  మంగళవారం (అక్టోబర్ 4)నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మహా పడిపూజ కార్యక్రమాన్ని మంత్రి ఆసక్తిగా వీక్షించారు. స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ మధు నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, భవానీలతో పాటు పెద్దఎత్తున భక్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ అయ్యప్ప దీక్షలో ఉన్న ఒక బాలుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అతడితో ముచ్చటించడం ఆకట్టుకుంది.  

శ్రీశైలం ఘాట్ లోవిరిగిపడిన కొండ చరియలు!

శ్రీశైలం పాతాళగంగలో రోప్ వే వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. అయితే ఆ సమయంలో అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవలి కాలంలో ఎడతెరిపి లేకుండా కురినిస భారీ వ ర్షాల కారణంగా ఇక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ కారణంగా ఆ దారిలో వచ్చే భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  తాజాగా బుధవారం (నవంబర్ 5) తెల్లవారు జామున ఈ మార్గం గుండా హైదరాబాద్ వెళ్లే రహదారిపై లింగాలగట్టు వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. అసలే కార్తీక మాసం, అందులోనూ కార్తీకపౌర్ణమి కావడంతో శ్రీశైలం క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కొండ చరియలు విరిగిపడిన ఘటన తెల్లవారు జామున జరగడంతో పెను ప్రమాదం తప్పిందనీ, అదే కొద్ది సమయం తరువాత ఈ ఘటన జరిగి ఉంటే.. ఊహించడానికే భయం వేసేంత విపత్తు సంభవించి ఉండేదని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం ఆ  మార్గం గుండా రాకపోకలను నిలిపివేసి, కొండ చరియలు తొలగిస్తున్నారు.  

సమస్యల పరిష్కారానికి టెక్నాలజీయే దిక్సూచి.. చంద్రబాబు

రేపటి తరం భవిష్యత్ కోసం  పాలకులు,  పారిశ్రామిక వేత్తలు సరైన సరైన వేదికలను సిద్దం చేయాలనీ, అది బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు.  ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని రెండు పురస్కారాలతో సత్కరించిన సంగతి తెలిసిందే. లండన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబు తన ప్రసంగంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ కార్పొరేట్ ప్రపంచానికి 35 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నందుకుఅభినందించారు.  ప్రతిష్టాత్మక సంస్థగా ఐవోడీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందనీ, అటువంటి సంస్థ తన సతీమణి నారా భువనేశ్వరి సేవలను గుర్తించి అవార్డు ప్రదానం చేయడం సంతోషంగానూ, గర్వంగానూ ఉందని చంద్రబాబు అన్నారు.     ప్రపంచంలో  వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వాలు, సంస్థలు  తమ తమ ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాలన్న చంద్రబాబు. భౌగోళిక, రాజకీయ మార్పులతోపాటు వాతావరణ సంక్షోభాలను అధిగమించాలనీ, ఇందుకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 1990లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భవిష్యత్తుపై సందేహాలు ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను బిల్ గేట్స్ ను ఆహ్వానించి హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ను స్థాపించేందుకు చొరవ తీసుకున్నానని గుర్తు చేశారు. ఇప్పుడు, భారతీయులు, ప్రత్యేకించి తెలుగు వారు గ్లోబల్ ఐటీ రంగంలో  కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఇందుకు నాడు తాను వేసిన పునాదే దోహదం చేసిందని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు  ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  వేగంగా విస్తరిస్తోందన్న ఆయన భవిష్యత్ అంతా ఏఐ చుట్టూ తిరిగే సూచనలే కనిపిస్తున్నాయన్నారు. అందుకు అనుగుణంగా  ఆలోచనలు చేయాలనీ, ఏపీలో తాము ఆ దిశగానే విధానాలను... ప్రణాళికలను రూపొందించుకుంటున్నామని చెప్పారు. గూగుల్ తన అతిపెద్ద ఏఐసెంటర్ ను అమెరికా వెలుపల విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తోందన్న ఆయన ఇది ఏపీలో ఇన్నోవేషన్స్, రీసెర్చ్, స్కిల్ డెవలప్‌మెంట్ వంటి అంశాల అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు.   టెక్నాలజీతో ప్రజలకు  మెరుగైన సేవలు అందించేలా ప్రభుత్వాలు ముందుకు సాగాలనీ, ఏపీలో తాము అదే చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ను బెంబేలెత్తించిన మొంథా తుపానును సాంకేతికత సహకారంతోనే దీటుగా ఎదుర్కొని, నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించగలిగామని వివరించారు.  పాలనను ప్రజలకు మరింత దగ్గర చేసేలా 700కు పైగా పౌర సేవలను నేరుగా వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చిచనట్లు చెప్పారు.  ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ క్లైమేట్ ఛేంజ్ అన్న చంద్రబాబు దీనిని సమష్టిగా ఎదుర్కొవాలన్నారు.  

వైభవంగా బెజవాడ కనకదుర్గమ్మ గిరి ప్రదక్షిణ

ఇంద్రకీలాదిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ గిరి ప్రదక్షిణ బుధవారం (నవంబర్ 5) తెల్లవారు జామును అత్యంత వైభవంగా జరిగింది. కార్తీకపౌర్ణమి సందర్భంగా జరిగిన ఈ గిరి ప్రదక్షిణకు ముందు ఆలయ ఈవో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ  కళా ప్రదర్శనలతో ఆధ్యాత్మిక వాతావరణంలో వేలాది మంది భక్తులతో గిరిప్రదక్షిణ జరిగింది. ఈ గిరి ప్రదక్షిణలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.  తెల్లవారు జామునే వేలాది మంది భక్తులు అమ్మవారి గిరిప్రదక్షిణలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.  కార్తీక పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరికలు నెరవేరి, సుఖసంతోషాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం.  

నారా భువనేశ్వరికి రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడి  సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నారు. లండన్ లోని మే ఫెయిర్ హాలు వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమానికి నారా చంద్రబాబు హాజరయ్యారు.  ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో భువనేశ్వరి డిస్టింగ్విష్ డ్ ఫఎలోషిప్ అవార్డును అందుకున్నారు.  సామాజిక ప్రభావం, ప్రజాసేవ అంశాలలో విశిష్ఠ సేవలు అందించినందుకుగాను  అత్యంత ప్రతిష్ఠాత్మక  సామాజిక సాధికారత కోసం ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది.  అలాగే హెరిటేజ్ ఫుడ్స్ కు ఎక్స్ లెన్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంగా గోల్డెన్ పీకాక్ అవార్డును హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ హోదాలో అందుకున్నారు. జాతీయ స్థాయిలో ఎఫ్ఎంసీజీ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ ను ఎక్స్ లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్సు గోల్డెన్ పీకాక్ అవార్డుకు ఐఓడి సంస్థ. ఎంపిక చేసింది. నారా భువనేశ్వరి ప్రజాసేవ, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.  ఆమె సేవలకు దక్కిన గొప్ప గుర్తింపుగా ఈ పురస్కారాలు లభించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు భారతీయ సంస్థలు ప్రపంచ స్థాయిలో  అగ్రగామిగా నిలుస్తున్న తీరు పట్ల గర్వంగా ఉందని అన్నారు. అలాగే   ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న తన సతీమణి నారా భువనేశ్వరిని చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. 

కాల్పులు జరగలేదు...పోలీసుల క్లారిటీ

  హైదరాబాద్‌లో ఎటువంటి  కాల్పులు జరగలేదని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. కాల్పుల ఘటనపై డీజీపీ కార్యాలయం వివరణ ఇచ్చింది.  ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఆయన అల్లుడు అభిషేక్ గౌడ్ మధ్య ఆస్తి పంచాయితి జరగిందని పేర్కొన్నారు. స్థలం విషయంలో  కేఈ ప్రభాకర్, ఆయన అల్లుడు అభిషేక్ గౌడ్ మధ్య మంగళవారం మణికొండలోని పంచవటి కాలనీలో ఘర్షణ జరిగింది.  తనపై గన్‌ పెట్టి అల్లుడు అభిషేక్ గౌడ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే అల్లుడు అభిషేక్‌పై అక్టోబర్ 25వ తేదీన రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు. పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందేశ్వర్ గౌడ్ కుమారుడే ఈ అభిషేక్ గౌడ్ కావడం విశేషం.  ప్రస్తుతం ఈ కాల్పులపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. కేఈ ప్రభాకర్  కూతురుతో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడుతో14 ఏళ్ల క్రితం పెళ్లయింది, వ్యక్తిగత సమస్యల కారణంగా ఈ జంట ఒక సంవత్సరం నుండి విడివిడిగా నివసిస్తున్నారు. ఓ ఇంటి అగ్రిమెంట్ విషయంలో విభేదాలు వచ్చాయి ఈ ఘటన చోటుచేసుకుంది.  

సోలార్ ప్రాజెక్ట్ మోసం కేసులో ఈడీ చార్జిషీట్

  ఎస్‌బీఐ బ్యాంకును మోసం చేసిన పృధ్వి సోలార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కీలక చర్యలు చేపట్టింది. సంస్థతో పాటు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బైర్రాజు శ్రీనివాస రాజుపై ఈడీ తాజాగా చార్జిషీట్‌ దాఖలు చేసింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో పృధ్వి సోలార్ ప్రాజెక్ట్స్ సంస్థ 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో ఎస్‌బీఐ నుంచి ₹4.5 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం పొందింది. ఇందుకోసం కంపెనీ అకౌంట్లలో ₹30.5 కోట్ల తప్పుడు లాభాలు ఉన్నట్లుగా చూపించి వివరాలను తారుమారు చేశారు.  ఈ తప్పుడు వివరాల ఆధారంగా ఎస్‌బీఐ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం మంజూరు చేసింది.అయితే, ఆ నిధులను ఉద్దేశించిన పనులకు వినియోగించకుండా శ్రీనివాస రాజు తన సోదరి ఖాతాలకు మళ్లించి... అనంతరం ఆ నగదును విత్‌డ్రా చేసుకు న్నట్లుగా ఈడీ విచారణలో తేలింది.  ఎస్బిఐ ఇచ్చే ఓవర్ డ్రాప్ట్ సౌకర్యాన్ని పొందేం దుకు తప్పుడు లాభాలు చూపారని గతంలో  ఎసీబీ, సీబీఐ కేసులు నమోదు చేసుకొని విచారణ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులను ఆధారంగా చేసుకుని మనీలాండరింగ్ కోణంలో ఈడి మరో కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. గతంలోనే ఈడీ శ్రీనివాస రాజుకు చెందిన ₹3.81 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసింది. ఇప్పుడుతాజాగా దర్యాప్తు పూర్తి చేసిన ఈడీ, పృధ్వి సోలార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు సంస్థ ఎండీ బైర్రాజు శ్రీనివాస రాజుపై చార్జిషీట్ దాఖలు చేసింది.  

సిగాచీ బాధితులకు పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు : హైకోర్టు

  పటాన్‌చెరులోని సిగాచీ కంపెనీ ఎండీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 54 మంది మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో ఆలస్యంపై విచారణ జరుగింది. కంపెనీపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. బాధితులకు ఇస్తామన్న కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారని ఏఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే ఇప్పటి వరకు రూ. 25 లక్షలు మాత్రమే చెల్లించారని తెలిపింది.  మిగతా పరిహారం ఎప్పుడు అందిస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఫ్యాక్టరీ ఎండీకి నోటీసులు జారీ చేసింది. పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఇండస్ట్రీస్‌ పేలుడు ఘటనలో 54 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.  

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : జగన్‌

  కృష్ణా జిల్లా రామరాజుపాలెం ప్రాంతంలో మొంథా తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన పంటలను మాజీ సీఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. 18 నెలల కూటమి పాలనలో 16 విపత్తులు వచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదని జగన్ విమర్శించారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిందన్నారు.15లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. మోంథా తుపాను 25జిల్లాల్లో ప్రతీకూల ప్రభావం చూపిందని జగన్ అన్నారు.ఇన్‌పుట్‌ సబ్సీడీ 18 నెలలుగా రాలేదని వాపోయారు. ఉచిత భీమా అడిగితే ధాన్యం కొనరట. సాయం చేయకపోగా రైతులను బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. అధికారులు పొలంలోకి అడుగు పెట్టకుండానే ఎన్యూమరేషన్ అయిపోయిందంటున్నారు అంటు మండిపడ్డారు.  అనంతరం రైతులతో జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. జగన్‌ కాన్వాయ్‌ కారణంగా పెనమలూరులో భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయింది. బందరు రోడ్డులో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉయ్యూరులోనూ పలుచోట్ల ట్రాఫిక్‌‌లో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు  

ఛత్తీస్ గఢ్ లో రైలు ప్రమాదం.. ఆరుగురు మృతి

ఛత్తీస్ గఢ్ లో రైలు ప్రమాదం జరిగింది.  బిలాస్పూర్ స్టేషన్ సమీపంలో  ప్యాసింజర్ రైలు గూడ్స్ ట్రెయిన్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి సహాయకార్యక్రమాలను చేపట్టారు.  పలుబోగీలు పట్టాలు తప్పాయి. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. అత్యంత బిజీగా ఉండే బిలాస్ పూర్ -హౌరా మార్గంలో ఈ ప్రమాదం జరగడంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.