గాంధీ సంకల్ప యాత్ర పేరుతో బిజెపి పన్నుతున్న అసలు వ్యూహం ఏమిటి?

    అంతా మన మంచికే అంటారు కదా అదే తీరుగా మహాత్మా గాంధీ నూట యాభైవ జయంతి వేడుకలు బిజెపికి బాగా కలిసి వస్తున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కమలం పార్టీ దేశవ్యాప్తంగా గాంధీజీ సంకల్ప యాత్ర పేరిట పాదయాత్రలు చేపట్టింది. పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీని గట్టిగనే టార్గెట్ చేస్తున్నారు ఆ  పార్టీ నేతలు.గాంధీజీ పేరును అడ్డం పెట్టుకుని రాజకీయం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాలను నెరవేర్చలేదంటూ సూటిగా విమర్శిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి మాత్రమే మహాత్మా గాంధీ కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తోందని కాబట్టి గాంధీజీ నిజమైన వారసులం తామేనని వారు ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. దేశంలో బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల సంగతి పక్కనబెడితే ఆ పార్టీ అధికారంలో లేని రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గాంధీజీ సంకల్ప యాత్ర ఎంతో కొంత పార్టీకి మేలు చేస్తుందన్న మాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఇటీవల గాంధీజీ సంకల్ప యాత్ర దిగ్విజయంగా జరిగింది ఈ యాత్రకి పలువురు జాతీయ స్థాయి నేతలు కదిలొచ్చారు పనిలో పనిగా వివిధ రాజకీయ పక్షాల వారు ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు పార్టీలో జోష్ నింపాయి.సూటిగా చెప్పాలంటే నిన్న మొన్నటి వరకు నిస్తేజంలో  ఉన్న పార్టీ క్యాడర్ ను ఈ యాత్ర ఉత్తేజపరిచిందనే చెప్పాలి. చిత్తూరు జిల్లాలో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది, ఇతర పార్టీల్లోని బలమైన నేతలను ఆకర్షించటంతో పాటు సభ్యత్వ నమోదులో మంచి ఫలితాలు రాబట్టడానికి యాత్ర ఉత్ప్రేరకంగా పని చేస్తుందని పరిశీలకులు కూడా అంటున్నారు.ఇటీవల శ్రీకాళహస్తిలో మొదలైన గాంధీజీ సంకల్ప యాత్ర పది రోజుల పాటు కొనసాగి కాణిపాకంలో ముగిసింది. శ్రీకాళహస్తిలో ఈ యాత్రని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ప్రారంభించారు. అక్కడ్నించి సత్యవేడు ,నగిరి, చంద్ర గిరి, తిరుపతి, గంగాధర, నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, నియోజక వర్గాల్లో యాత్ర కొనసాగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్య నాయకులంతా ఇందులో పాలు పంచుకుంటున్నారు. గంగాధర నెల్లూరు నియోజక వర్గాల్లో జరిగిన యాత్రకీ కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి చిత్తూరు పూతలపట్టులో జరిగిన యాత్రకి బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ హాజరయ్యారు. చిత్తూరు జిల్లాలో ఇదివరకెన్నడూ బిజెపి ఈ స్థాయిలో యాత్రను చేపట్ట లేదు అందుకే కావచ్చు ఇందులో భారీ సంఖ్యలో నేతలతో పాటు కార్యకర్తలు, అభిమానులు, విద్యార్ధులు పాల్గొని మద్దతు పలికారు. అనేక చోట్ల ఈ యాత్రని స్వాగతిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, ముఖ్యనేతలకు ఘనంగా జేజేలు పలికారు. గాంధీజీ సంకల్ప యాత్రలో బిజెపి నేతలు తమ విమర్శలకు మరింత పదును పెట్టారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీలైన తెలుగు దేశం, వైయస్సార్ కాంగ్రెస్ ల పై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. గాంధీజీ పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లు నెట్టుకొచ్చిందని ఇక పై అలాంటి రాజకీయం చెల్లుబాటు కాదని బిజెపి నేతలు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పైనా కమలం పార్టీ నేతలు ఘాటు విమర్శలు గుప్పించారు. భవిష్యత్ లో టిడిపి తో పొత్తు ఉండదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కూడా దులిపేశారు. రాష్ట్రంలో అధికారం చేపట్టి నాలుగైదు నెలలు గడవక ముందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని దుయ్యబట్టారు. ఇకనైనా వైయస్ జగన్ తన పంథాను మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా అనేక రాజకీయ అంశాల పై ప్రసంగాలు చేస్తూ గాంధీజీ సంకల్ప యాత్రని బిజెపి నేతలు కొనసాగించారు, దారిపొడవున దేశ భవిష్యత్తును చక్కదిద్దగలిగేది బిజెపియే అని పదేపదే ప్రకటించారు అందువల్ల ప్రజలంతా తమ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తానికి చిత్తూరు జిల్లాలో బిజెపి చేపట్టిన గాంధీజీ సంకల్ప యాత్ర సత్ఫలితాలిచ్చింది ,పార్టీ కేడర్ లో ఒక్కసారిగా ఉత్సాహం నిండింది. ఎపిలో అధికార పీఠంపై ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తము తీసిపోమన్నరీతిలో యాత్ర సాగిందని కొందరు చెప్పు కుంటున్నారు ఇన్నాళ్లూ బిజెపిలో చేరడానికి సంశయించిన నేతలు కూడా ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకునేలా వారికి యాత్ర స్పూర్తి నిచ్చిందని మరి కొందరు విశ్లేషిస్తున్నారు.ఇక ఈ యాత్రతో ఏమి జరగబోతోందో వేచి చూడాలి.

నెల్లూర్ ని గడగడలాడిస్తున్న 'ఇసుక మాఫియా'

  రాష్ట్రంలో వర్షాలు వరదలకు తీవ్రంగా ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లా ఇసుక రీచ్ నుంచి మాత్రం ఇసుక సరఫరా కొనసాగుతుంది. పెన్న రిచ్ లతో పాటు స్వర్ణముఖి రీచ్ ల నుంచి ఇసుక రవాణా జరిగిపోతుంది. అయినప్పటికీ నెల్లూరు జిల్లా వాసులకు ఇసుక మాత్రం అందని ద్రాక్షలా మారింది. ఇందుకు కారణం ఆన్ లైన్ లో జరుగుతున్న తంతే అన్న విమర్శలూ ఉన్నాయి. ఇసుక కావలసిన వారు ఆన్ లైన్ ద్వారా ఇసుక బుక్ చేసుకోవలసి ఉంది. అయితే ఇందు కోసం ప్రభుత్వం తయారు చేయించిన యాప్ ఉదయం పన్నెండు గంటలకు ప్రారంభమవుతుంది. అయితే రెండు నిమిషాల్లోపే నో స్టాక్ అని స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీంతో ఇసుక కావలసిన వారు ఎన్నిసార్లు మీ సేవ చుట్టూ తిరిగిన ఫలితం శూన్యం. దీని వల్ల నెల్లూరు నగరంలో చాలా వరకు నిర్మాణాలు ఆగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ క్రమంలో నిర్మాణదారులు బ్లాక్ లో ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోంది. గతం కంటే నాలుగింతలు ఎక్కువ రేటు పెట్టి ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. గతంలో ట్రాక్టర్ ఇసుక  రెండు వేల రూపాయల ఉండగా ఇప్పుడు ఆరు వేల వరకూ పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇసుక కొరత ప్రభావం ఎక్కువగా నెల్లూరు రూరల్ నియోజక వర్గ పరిధిలో కనిపిస్తోంది. ఎక్కువ నిర్మాణాలు ఈ ప్రాంతం లోనే జరుగుతున్నాయి. దీనికి తోడు భవన నిర్మాణ కూలీలు కూడా ఈ ప్రాంతం లోనే నివాసముంటున్నారు. ఈ ప్రభావం వచ్చే స్థానిక సంస్ధల ఎన్నికల్లో కనిపించే అవకాశముందని భావిస్తున్నట్లు కనిపిస్తున్నారు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి. దీంతో ఇసుక కొరత పై ప్రతిపక్షాల ఆందోళన రోజే ఈయన కూడా గళం విప్పారు. నెల్లూరు నగరం వరకు పొట్టేపాళెం రీచ్ నుంచి ఇసుకను ట్రాక్టర్ ల ద్వారా తరలించటానికి అనుమతులు ఇప్పించుకున్నప్పటికీ అది కూడా పక్కదారి పడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఆన్ లైన్ లో ఇతర జిల్లాల వారికి ఎక్కువగా పర్మిట్ లు రావడం వెనుక ఇసుక మాఫియా పని చేస్తుందని దీనిపై అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతామని అధికార పక్ష ఎమ్మెల్యే హెచ్చరించారు.మొత్తం మీద ఎమ్మెల్యే ప్రకటన తర్వాత అధికారుల్లో చలనం వచ్చినట్టు కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఇందు కోసం జిల్లా కలెక్టర్ ఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు బాధ్యతలు అప్పగించారు . దీంతో ఆమె ఆధ్వర్యంలో మైనింగ్ శాఖతో పలుమార్లు చర్చలు జరిపారు. పోలీసులు, రెవిన్యూ, మైనింగ్, విజిలెన్స్ శాఖల ఆధ్వర్యంలో జిల్లా సరిహద్దుల వద్ద ప్రత్యేకంగా ఇసుక తరలింపు అడ్డుకోవడానికి శాశ్వత చెక్ పోస్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా పది వరకు చెక్ పోస్టుల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అసలు ఇసుక పర్మిట్లు ఆన్ లైన్ ద్వారా తెచ్చుకోలేని వారి సమస్య గురించి రాష్ట్ర స్థాయిలో నిర్ణయం జరగాలి అని అంటున్నారు. ఇసుక అందరికీ అందాలంటే ముందు యాప్ ద్వారా ఇసుక కొనుగోలు సరళతరం చేయాలని ఏ ఏ ప్రాంతం వారు ఆయా ప్రాంతాల్లో కొనుగోలు చేసే విధంగా నీమా మార్చితే తప్ప సమస్య పరిష్కారం కాదని అంటున్నారు. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా కొరతపై రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి వ్యాఖ్యలు యంత్రాంగంలో ఒక్కసారిగా సంచలనంగా మారాయి.  

ఆసక్తికరంగా మారుతున్న 'మహా' రాజకీయం...

    మరాఠా రాజకీయం ఉత్కంఠ రేపుతోందిమహారాష్ట్రలో కుర్చీపై పేచీ ఇంకా కొనసాగుతోంది ముఖ్యమంత్రి పదవిని చెరి రెండున్నరేళ్లపాటు పంచుకుందామంటూ శివసేన పెట్టిన ప్రతిపాదనపై సస్పెన్స్ కొనసాగుతోంది.లిఖిత పూర్వక హామీ ఇస్తేనే ప్రభుత్వం ఏర్పాటుకు కలిసి వస్తామని సేన తేల్చి చెబుతోంది .ఈ సమయంలో రెండు పార్టీలు గవర్నర్ ను వేరు వేరుగా కలవడం ఆసక్తి రేపుతోంది . సీఎం కుర్చీని చెరి సగం పంచుకోవాలని శివసేన పట్టుబడుతోంది అటు బిజెపి మాత్రం దీనిపై నోరు మెదపడంలేదు. ఐదేళ్ల పాటు ఫడ్నవీస్ ఏ సీఎంగా ఉంటానంటూ పార్టీ శ్రేణులకు అధిష్టానం చెబుతూ వస్తోంది. బిజెపి మిత్ర పక్షాలు సైతం ఇదే మాట చెబుతున్నాయి. కానీ సేన మాత్రం లోక్ సభ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెబుతున్నారు.సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ శివసేన మధ్య సయోధ్య కుదురుతోందా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.దీనికి తోడు అక్కడ జరుగుతున్న పరిణామాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి,ఓ వైపు సంకీర్ణ సర్కార్ ఏర్పాటుపై అనుమానాలు కొనసాగుతుండగానే శివసేన బీజేపీ నేతలు మహారాష్ట్ర గవర్నర్ తో విడివిడిగా భేటీ కావడం సంచలనం రేపుతోంది.అయితే మర్యాద పూర్వకంగానే తాము గవర్నర్ ను కలిశామని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు.కొందరు కీలక నేతలతో కలిసి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ గవర్నర్ భగత్ సింగ్ కోషియారిని కలిశారు,మరోపక్క శివసేన బృందం సైతం గవర్నర్ తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. అధికారాన్ని సగం సగం పంచుకునేందుకు అంగీకరిస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపితో కలిసి వస్తామని శివసేన పట్టుపడుతోంది.రెండున్నరేళ్లు తమకే సీఎం పీఠం కేటాయిస్తూ బిజెపి లిఖిత పూర్వక హామీ ఇవ్వాల్సిందే అంటోంది లోక్ సభ ఎన్నికలకు ముందు ఇదే హామీతో పొత్తు కుదిరిందని చెబుతున్నారు.రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బిజెపి నూట ఐదు స్థానాలు గెలుచుకుంది. రెండు వేల పద్నాలుగు ఎన్నికలతో పోలిస్తే పదిహెడు సీట్లు బిజెపి తక్కువ గెలిచింది అటు శివసేనకు ఈ ఎన్నికల్లో యాభై ఆరు స్థానాలు దక్కాయి ఇందులో ఇద్దరు స్వతంత్రులు శివసేనకు మద్దతు పలికారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఈ రెండు పార్టీలకు కలిపి తగినంత బలం ఉంది.అయితే శివసేన మాత్రం తమ డిమాండ్ లు నెరవేరిస్తే తప్ప ముందుకు రామని భీష్మించుకుంది. ఇపుడిదే ప్రభుత్వ ఏర్పాటుకు ఆటంకంగా మారింది. అయితే అక్టోబర్ ముప్పైన అమిత్ షా మహారాష్ట్రకు వస్తున్నారు, దీంతో ఫడ్నవిస్ తో పాటు ఉద్దవ్ థాక్రే తో సమావేశం కానున్నారు.ఈ భేటీతో అయినా ఈ కధకు ఫుల్ స్టాప్ పడుతుందని చెబుతున్నారు.మరో పక్క బిజెపి లక్ష్యంగా శివసేన విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా మరోసారి తన పత్రిక సామ్నాలో ఆర్ధిక మందగమనానికి బిజెపియే కారణమంటూ కథనం రాసింది. కేంద్ర ఆర్ధిక విధానాల పై ప్రశ్నల వర్షం కురిపించింది.దేశంలోని రిటైల్ వ్యాపారం నానాటికీ పడిపోతోందని ఆన్ లైన్ వ్యాపారం ద్వారా విదేశాలకు లబ్ధి చేకూరుతోందని పేర్కొంది. బిజెపి ప్రభుత్వం తొలిసారి అధికారులకు వచ్చినప్పుడు తీసుకున్న నోట్ల రద్దు జీఎస్టీ ఆర్ధిక మందగమనానికి కారణమని విశ్లేషించింది.అధికారుల రిమోట్ కంట్రోల్ తమ చేతుల్లో ఉందంటూ శివసేన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.ఇప్పుడు మహరాష్ట్రాలో బీజేపీ కథనం చర్చనీయాంశమైంది.

డేటింగ్ కాల్ సెంటర్ ల ముసుగులో తీవ్రంగా నష్టపోతున్న బాధితులు...

    విశాఖలో బయటపడ్డ హనీట్రాప్ సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు అరెస్టు చేసిన ఇరవై నాలుగు మందిని ట్రాన్ సిట్ వారెంట్ పై వైజాగ్ తీసుకు వచ్చే అవకాశముంది. ఇప్పటి వరకు డేటింగ్ కోసం అమ్మాయిలను చూడటం మాట్లాడుకోవడం జరిగేది. అమ్మాయిలు ఒకే చోట ఉండటంతో పోలీసుల దాడుల కేసులు ఎక్కువయ్యాయి. దీంతో ఆన్ లైన్ అస్త్రంతో ముఠాలు వేదికను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఫేక్ డేటింగ్ సైట్ లతో యువతను మోసం చేస్తున్నాయి. ఇలాంటి గ్యాంగ్ ఆటకట్టించారు విశాఖ సైబర్ క్రైం పోలీసులు. కోల్ కత్తా కేంద్రంగా ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం నడుపుతున్నట్లు విశాఖ సైబర్ క్రైం పోలీసుల విచారణలో తేలింది. హనీట్రాప్ లో పది లక్షల రూపాయల నగదును పోగొట్టుకున్న బాధితుల కేసులో తీగ లాగితే డొంక కదిలిందని పోలీసులు వివరించారు. డేటింగ్ సైట్ ల గ్యాంగ్ నుంచి నలభై సెల్ ఫోన్లు, మూడు ల్యాప్ టాప్, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుని ఇరవై నాలుగు మంది అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. లొకెంటో షోకాజ్ టిండర్ పోర్టల్ ఇన్ స్టాల్ చేసుకున్న తరవాత అందులో ఇచ్చిన నెంబర్ కు కాల్ చేస్తే ముందుగా సంప్రదిస్తారు. వాట్సప్ కాల్ గానీ చాటింగ్ ద్వారా రమ్మని మిగతా వివరాలు మాట్లాడుకుందామని చెప్తారు. వాట్సప్ ద్వారా చాటింగ్ లోకి వెళ్తే అమ్మాయిలు కావాలా అబ్బాయిలు కావాలా, వయసు ఎంత ఉండాలో కలర్ ఎలా ఉండాలి అనే ప్రశ్నలు అడుగుతూ బాధితుడు చెప్పిన ఆధారాలకు అనుగుణంగా యువతుల ఫొటోలు వాట్సప్ లో పంపుతారు. ముందుగా రిజిస్ర్టేషన్ కు వెయ్యి రూపాయలు కట్టాలని, అమ్మాయితో మాట్లాడటానికి మూడు వేలు కట్టాలని షరతు పెడతారు. అమ్మాయిల సెల్ ఫోన్ నెంబరుకి ఛార్జ్ చేయాలంటే మరో మూడు వేలు కట్టాలని అమ్మాయినీ చూపకుండానే బాధితుల నుంచి లక్షల్లో లాగేస్తారు. బాధితుడు కూడా ఆన్ లైన్ లో చెప్పినట్టుగానే చేసెస్తాడు. కానీ మాట్లాడుతున్న వారు ఎవరూ ఎక్కడివారు అనే సందేహం కూడా రాని మైకంలోకి వెళ్లిపోతారు. అమ్మాయిలు చెప్పిన చోటికే రావాలని బాధితుడు నివాసముంటున్న లొకేషన్ దగ్గరగా ఉండే ప్రాంతాల పేర్లు చెప్పారు. దీంతో బాధితుడు నిజమని నమ్మి అమ్మాయి చెప్పిన చోటికి వెళతాడు. ఇలా వెళ్ళీ చాలా వరకు యువత మోసపోయిన సందర్భాలే ఎక్కువ. దీంతో మోసపోయామని తెలుసుకున్న తరువాత పోలీసుల దగ్గరకు వెళ్లలేక ఎవరికీ చెప్పుకోలేక బాధితులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇలా ఈ తరహాలో పదుల సంఖ్యలో బాధితులు మోసపోతున్నారు. కానీ అందులో ఓ యువకుడు పధ్ధెనిమిది లక్షలు పోగొట్టుకుని తమకు ఫిర్యాదు చేశాడని విశాఖ పోలీసులు తెలిపారు. ఈ ముఠాను పట్టుకోవడానికి పోలీసులు ఆరు నెలల్లో మూడు సార్లు ప్రయత్నించారు. కోల్ కత్తా పోలీసుల నుంచి పూర్తిస్థాయిలో సహకారం లభించకపోవడంతో ఇది సాధ్యం కాలేదు. ఇపుడు నిందితులను అరెస్టు చేయడంతో వారి నుంచి సమాచారాన్ని సేకరించి సూత్రధారులను పట్టుకునేందుకు విశాఖ పోలీసులు ప్రయత్నస్తున్నారు.

జడ్పీ ఛైర్మెన్ జనార్దన రాథోడ్ అసలు వ్యూహం ఏమిటి?

    మంచికి పోతే చెడు ఎదురైంది అంటారే అలాగే మారింది ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ పరిస్థితి. తాజాగా ఆమెనుద్దేశించి జడ్పీ ఛైర్మెన్ జనార్దన రాథోడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలో ప్రజా ప్రతినిధులకు ఎలాంటి పనులు కావడం లేదని దీనికి కలెక్టర్ దివ్య దేవరాజన్ కారణమని జడ్పీ ఛైర్మెన్ జనార్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పాలన మొత్తం కలెక్టర్ కన్నుసన్నల్లోనే నడుస్తోందని ప్రజాప్రతినిధుల అధికారాలపై కలెక్టర్ పెత్తనం చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ పై తిరుగుబాటు చేయమంటూ అని పిలుపివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి రెండేళ్ల క్రితం ఆదివాసీ లంబాడా తెగల మధ్య ఆధిపత్య పోరుతో ఆదిలాబాద్ జిల్లా అట్టుడికిపోయింది. ఆ సమయంలో కలెక్టర్ గా దివ్య బాధ్యతలు చేపట్టారు. నిత్యం జిల్లాలో పర్యటిస్తూ స్వల్ప వ్యవధిలోనే పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గోండి భాషను సైతం ఆమె నేర్చుకున్నారు. గిరిజనుల సమస్యలను వారి వద్దకే వెళ్లి తెలుసుకుని పరిష్కరించడం ద్వారా పాలనలో తనదైన ముద్ర వేశారు. అటు మైదాన ప్రాంతాల్లోనూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో శభాష్ అనిపించుకున్నారు. ప్రధానంగా ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇతర సామాజికవర్గ నేతలు ఆక్రమణలో ఉన్న ఆదివాసీల భూముల వ్యవహారంలో కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఏజెన్సీ భూముల విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవాలని నిబంధనలను పక్కాగా అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారులకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అదే విధంగా ఏజెన్సీ సర్టిఫికెట్ల జారీలో కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో సహజంగానే జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజును ఆదివాసీలు తమ ఆత్మ బంధువుగా పరిగణిస్తున్నారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ ఏజెన్సీ చట్టాల అమలులో కలెక్టర్ తీసుకుంటున్న చర్యలు సహజంగానే కొన్ని వర్గాలకు ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. ఆదివాసీల నుంచి అనధికారికంగా భూములను కొనుగోలు చేసిన నాయకులు అప్పులిచ్చి కబ్జాలు చేసుకున్న వాళ్లు వందలెకరాలలో పోడు భూములను చెరబట్టిన అనేక మంది ఆదివాసీ యాత్రలకు కష్టాలు మొదలయ్యాయి. వీళ్ళంతా కలెక్టర్ ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని బలంగా కోరుకుంటున్నారు. ఇక బోగస్ ఏజెన్సీ సర్టిఫికెట్ లతో ఆదివాసీల ఉద్యోగాలను కొల్లగొట్టిన వాళ్లల్లోనూ ఆందోళన మొదలైంది. వీళ్లంతా మునుపటిలాగే వ్యవహారం సాగాలని కోరుకుంటున్నారు. అందువల్ల అలాంటి వారు ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ కలెక్టర్ దివ్య దేవరాజన్ ను టార్గెట్ చేశారు అన్నది కొందరి అభిప్రాయం. వాస్తవానికి ప్రభుత్వ అధికారిగా పని చేసిన జనార్ధన్ కొన్నాళ్ల క్రితమే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ అరంగేట్రం తోనే టీఆర్ఎస్ లో చేరి జడ్పీ ఛైర్మన్ అయ్యారు. ఈ క్రమంలో జిల్లా పరిషత్ బాస్ గా తన మార్కు చూపాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు. తొలిరోజుల్లోనే టిఆర్ఎస్ కు చెందిన ఖానాపూర్ ఎమ్మెల్యె మధ్య భేదం ఏర్పడింది. ఎమ్మెల్యేకు తెలియకుండానే ఆ నియోజకవర్గంలో పని చేస్తున్న పలువురు అధికారులను బదిలీలు చేయించడం వివాదాస్పదమైంది. ఒక జడ్పీటీసీ సభ్యురాలితో దురుసుగా ప్రవర్తించినట్టు కూడా ఆరోపణులున్నాయి. ఇప్పుడు నేరుగా జిల్లా కలెక్టర్ పైనే ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. జడ్పీ చైర్మన్ వ్యవహార శైలిపై సొంత పార్టీ లోనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే జనార్దన్ రాథోడ్ వ్యాఖ్యల వెనుక అసలు ఎజెండా వేరే ఉందనే చర్చ సాగుతోంది. గతంలో జడ్పీ ఛైర్మన్ గా ఉన్న రమేశ్ రాథోడ్ కూడా అధికారులపై దూకుడు ప్రవర్థనతోనే రాజకీయాలలో మెరుగయ్యారట. తాను కూడా అలాగే వ్యవహరిస్తే ప్రజలలో పట్టు పెంచుకోవచ్చని జనార్దన్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పైగా ఏజెన్సీలో ఆదివాసేతరులు ఆర్థికంగా రాజకీయంగా బలంగా ఉన్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్న జనార్దన్ ఒక పథకం ప్రకారం పావులు కదుపుతున్నట్టు కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఆదివాసేతరులు మద్దతుంటే ఖానాపూర్ అసెంబ్లీ స్థానాలు సులువుగా గెలవవచ్చని ఆయన భావిస్తున్నారట. ఈ నేపధ్యంలోనే అధికారులపై దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. కలెక్టర్ ను జనార్ధన్ రాథోడ్ విమర్శించడం వెనుక ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓ జిల్లా స్థాయి అధికారి ప్రమేయం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.  కలెక్టర్ దివ్య దేవరాజన్ ను ఉద్దేశించి జడ్పీ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలపై జిల్లాలోని పలు ఉద్యోగ సంఘాల నేతలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జడ్పీ ఛైర్మన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ రెవెన్యూ టీఎన్జీవోస్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ సోయం బాపురావు ఓ అడుగు ముందుకేసి జడ్పీ చైర్మన్ జనార్ధన్ పై ఘాటైన విమర్శలు గుప్పించారు. రాజ్యాంగం తెలుసుకొని మాట్లాడాలంటూ జడ్పీ చైర్మన్ కి గట్టిగా చురకలంటించారు. దీనికి తోడు ఆదివాసీ సంఘాలు కలెక్టర్ కు అండగా నిలుస్తున్న కలెక్టర్ దివ్య దేవరాజన్ కు జడ్పీ చైర్మన్ క్షమాపణలు చెప్పాలని ఆయా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో లంబాడ సామాజికవర్గ నేతలు జడ్పీ చైర్మన్ కు మద్దతు తెలుపుతుండటం గమనార్హం. కొందరు ఉద్యోగుల అంతర్గతంగా ఆదివాసీ లంబాడ వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో ఎవరికి వారి మద్దతు తెలుపుతుండటం గమనార్హం. అయితే తన చుట్టూ ఇంత రాజకీయ దుమారం రేగుతున్న కలెక్టర్ దివ్య మాత్రం దీన్ని లైట్ గా తీసుకున్నారు. ఎప్పటిలాగే తన పంతాన్ని చేసిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

టిటిడి కార్మికుల్లో ఆనందాలు నింపిన సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి...

  చాలా మంది కార్మికులు శ్రీ వారి సేవలోనే ఉన్నారు, తిరుమల కొండల్లో పచ్చదనం పెంపొందించడంతో పాటు అటవీ సంరక్షణకు ఏళ్లుగా పాటు పడుతున్నారు. చాలీ చాలని వేతనంతో ఇబ్బంది పడుతున్న తమను ఆదుకోవాలంటూ గత ప్రభుత్వాలకు వారు ఎన్నో విజ్ఞప్తులు చేశారు కానీ, ఆ ప్రభుత్వాలు వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే సీఎం వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే ఆ కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపాయి. దశాబ్దాల వారి కలలను సాకారం చేశారు దీంతో, వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వెలసిన దివ్య క్షేత్రం తిరుమల, ఆ ఆపదమొక్కుల వాడిని దర్శించుకునేందుకు నిత్యం వేల మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. దేశం లోని వివిధ ప్రాంతాల నుండి కొండపైకి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా వారికి వివిధ  సేవలను అందించేందుకు టీటీడీలో అనేక విభాగాలున్నాయి. టీటీడీకి చెందిన వివిధ శాఖల్లో శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అనేక మంది ఉన్నారు. టీటీడీలో అలాంటి కార్మికులు పది వేలకు పైగా ఉన్నారు, వారిలో అనేక మంది పదిహేను నుండి ఇరవై ఏళ్లుగా టిటిడిలో విధులను నిర్వహిస్తున్నారు. టీటీడీకి చెందిన అటవీ శాఖలో దాదాపు  250 మంది కార్మికులు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులను క్రూరమృగాల బారి నుండి కాపాడటంతో పాటు అడవిలో కార్చిచ్చు ఏర్పడిన సందర్భాల్లో వీరే ఆ మంటలను అదుపు చేస్తుంటారు. దశాబ్ధాలుగా టీటీడీకి సేవలందిస్తున్న ఈ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని అటవీ శాఖ గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విజ్ఞప్తి చేసింది కానీ, ఫలితం లేకపోయింది. దీంతో గత ఎన్నికల ముందు వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో టిటిడి అటవీ శాఖ కార్మికులు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. అందులో భాగంగా కల్యాణ కట్టలో పని చేసే కార్మికులతో పాటు అటవీ శాఖలో పని చేస్తున్న 164 మందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించటానికి టిటిడి పాలక మండలి ఆమోదం తెలిపింది. తమకు న్యాయం చేయాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా గత పాలకులు పట్టించుకోలేదని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అయిన నాలుగు నెలల్లోనే తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటం సంతోషంగా వుందని చెబుతున్నారు పలువురు కార్మికులు. అలాగే టీటీడీ లో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయాలని వారు కోరుతున్నారు.  

గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వ్యాఖ్యలతో విస్మయానికి గురయైన టీడీపీ నేతలు.....

  అడుగు పెట్టగానే పిడుగుపడ్డట్లు అంటారే అలాగే ఉందట ఏపిలో వైఎస్ జగన్ పరిపాలన. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థులపై కక్ష సాధింపులు శృతి మించాయని మాట గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యల పై తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది నేతలు ఇటీవల రాజ్ భవన్ గడప తొక్కుతున్నారు. ప్రజలెదుర్కొంటున్న సమస్యలు అధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిళ్ల తమపై పెడుతున్న అక్రమ కేసుల గురించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని సారధ్యంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ ను కలిశారు. రాష్ట్రంలో తెలుగుదేశం నేతల పైనా చివరకు వైస్ ఛాన్సలర్ పై కూడా అక్రమ కేసులు మోపుతున్నారంటూ ఓ వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ దామోదర్ నాయుడు పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారని గవర్నర్ వద్ద వారు ప్రస్తావించారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ గా ఉండే మీకు తెలియకుండా ఆయనపై కేసు ఎలా నమోదు చేస్తారని గవర్నర్ ను అడిగారు. ఈ పరిణామాలపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ఆయనను అభ్యర్థించారు. ఈ సమయంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. వైస్ ఛాన్సెలర్ అరెస్ట్ వార్తను తాను పత్రికల్లో చూశానని చెప్పడంతో తెలుగుదేశం నేతలు ఆశ్చర్యపోయారు. వైస్ ఛాన్సలర్ పై కేసు, ఆయన అరెస్ట్ విషయాన్ని తమ దృష్టికి తెచ్చి ముందస్తు అనుమతి తీసుకోవాలి గవర్నర్ వద్ద తెలుగుదేశం నేతలు తమ మనసులో ఉన్న మాటను అడిగారు.  తెలుగుదేశం నేతలు ఇచ్చిన వినతి పత్రాన్ని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆసాంతం పరిశీలించారు.ఆయా ఘటనలపై తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. అంతేకాదు కేశినేని నాని బృందం తనను కలిసిన సంగతిని అదే రోజు సాయంత్రం గవర్నర్ తన ట్విట్టర్ ఎకౌంట్ లో పేర్కొన్నారు. టిడిపి నేతలు సమర్పించిన వినతి పత్రంలోని అంశాల పై రాజ్ భవన్ తగిన సమాచారాన్ని రప్పించుకోవడం ఈ వ్యవహారంలో కొసమెరుపు. రాజ్ భవన్ నుంచి బయటకొచ్చిన తర్వాత తెలుగుదేశం నేతలు మీడియాతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందరిపై అక్రమ కేసులు బనాయిస్తూ ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. గవర్నర్ ని కలిసి వినతి పత్రం సమర్పించిన విషయాన్ని చెప్పారు. వైస్ ఛాన్సలర్ పై కేసు నమోదైన విషయాన్ని గవర్నర్ దృష్టికి తెచ్చినప్పుడు ఆయన ఇలా స్పందించారు కూడా టిడిపి నేతలు వివరించారు. ఇదే సమయంలో గవర్నర్ చీఫ్ సెక్రటరీల ప్రమేయం లేకుండా సచివాలయంలో బిజినెస్ రూల్స్ మార్చారంటూ పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. ఈ అంశం కూడా తీవ్ర చర్చోపచర్చలకు దారి తీసింది. బిజినెస్ రూల్స్ కు మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా సీఎం కార్యాలయం నుంచి జీవో రావడం చూసి సచివాలయంలోని సీనియర్ ఐఏఎస్ లు సైతం ఆశ్చర్యపోయారు. ఈ వ్యవహారం కూడా చివరికి రాజ్ భవన్ కే చేరింది. ఈ రెండు అంశాల పై టిడిపి నేతలు మీడియా వద్ద మాట్లాడుతూ జగన్ సర్కారు ఏక పక్షంగా వ్యవహరిస్తోందని వెల్లడించారు . ఈ అంశాల పై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.  

నలుగురు స్నేహితుల మధ్య చిచ్చుపెట్టిన గన్నవరం... ఇరకాటంలో పడిన యార్లగడ్డ పొలిటికల్ కెరియర్

  కొడాలి నాని... వల్లభనేని వంశీ... వంగవీటి రాధాకృష్ణ... ఈ ముగ్గురూ మంచి స్నేహితులంటారు... ఈ ముగ్గురూ పార్టీలో ఉన్నా... పార్టీలకతీతంగా వీరి స్నేహం కొనసాగుతుందని చెప్పుకుంటారు. అయితే, ఇప్పుడో కొత్త సంగతి బయటికొచ్చింది. గన్నవరంలో వైసీపీ తరపున పోటీచేసి వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు కూడా... ఈ ముగ్గురికీ చిరకాల మిత్రుడని తెలిసింది. ఈ నలుగురూ మంచి స్నేహితులని, తరచూ కలిసికుని మాట్లాడుకుంటారని సన్నిహితులు చెబుతున్నారు. అయితే కొడాలి నాని... వల్లభనేని వంశీ... వంగవీటి రాధాకృష్ణ... స్నేహితులని అందరికీ తెలిసినా... యార్లగడ్డ సంగతే కొత్తగా ఉంది. అయితే, తన స్నేహితుడైన వల్లభనేని వంశీపై యార్లగడ్డ వెంకట్రావు పోటీకి దిగడానికి కొడాలి నానేయే కారణమనే మాట వినిపిస్తోంది. ప్రవాస భారతీయుడుగా ఉన్న యార్లగడ్డను కొడాలి నానినే... ఆంధ్రాకి రప్పించి... జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లడమే కాకుండా.... వల్లభనేని వంశీపై పోటీకి దింపారని అంటున్నారు. ఈ మాట... వల్లభనేని వంశీ కూడా చాలాసార్లు తన సన్నిహితులతో చెప్పుకొచ్చారు. రాజకీయంగా ఎవరు ఎత్తులు వాళ్లు వేసుకున్నా... వీళ్ల మధ్య మాత్రం స్నేహం... మాత్రం కంటిన్యూ అవుతోంది. అయితే, గన్నవరంలో ముఖాముఖిగా తలపడిన వంశీ, యార్లగడ్డ మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఇక, రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. సరిగ్గా ఇప్పుడదే జరిగింది.   తొలుత వల్లభనేని వంశీ, కొడాలి నాని... ఇద్దరూ తెలుగుదేశంలోనే ఉన్నా... ఆ తర్వాత కొడాలి... వైసీపీలో చేరారు. వంశీ మాత్రం టీడీపీలో కొనసాగారు. వంగవీటి రాధా కూడా కొన్నాళ్లూ వైసీపీలోనే ఉన్నారు. ఈ ముగ్గురూ వేర్వేరు పార్టీల్లోనే ఉన్నా... వీళ్ల మధ్య స్నేహం మాత్రం కొనసాగింది. అయితే, మొన్నటివరకు అమెరికాలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు సరిగ్గా ఎన్నికల ముందు ఏపీకి ఎంట్రీ ఇచ్చి... గన్నవరం నుంచి బరిలోకి దిగి ఏకంగా స్నేహితుడైన వంశీనే ఢీకొట్టారు. అయితే స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక ఎన్నికల టైమ్ లో ఈ ఇద్దరికి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. అది వ్యక్తిగత వైరంగానూ మారింది. అయితే, గెలిచిన తర్వాత కూడా వల్లభనేని వంశీని ఆర్ధిక సమస్యలు, కేసులు చుట్టుముట్టడంతో... తన స్నేహితుడైన కొడాలి నానితో పంచుకున్నట్లు తెలుస్తోంది. దాంతో కొడాలి... వల్లభనేని వంశీని జగన్ దగ్గరికి తీసుకెళ్లాడని చెప్పుకుంటున్నారు. ఇదిలాఉంటే, 2014 ఎన్నికల సందర్భంగా బెజవాడ బెంజ్ సర్కిల్ లో జగన్ ను వంశీ ఆలింగనం చేసుకోవడంతో... వీళ్లిదరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే చర్చ జరిగింది. అంతేకాదు వంశీ వైసీపీలో చేరతానే ప్రచారం కూడా జరిగింది. అయితే, ఈ నలుగురు చిరకాల స్నేహితుల్లో వంగవీటి రాధాకృష్ణ... మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండగా... కొడాలి నాని సూపర్ విక్టరీ కొట్టి జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు... ఇక వల్లభనేని వంశీ వైసీపీ గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా, ఎన్నికల ముందు స్నేహితుడినే ఢీకొట్టి వ్యక్తిగత వైరం తెచ్చుకున్న యార్లగడ్డ వెంకట్రావు పరిస్థితే ఇరకాటంలో పడిందని మాట్లాడుకుంటున్నారు. మరి, నలుగురి స్నేహితుల రాజకీయ అడుగులు ఎప్పుడు ఎటువైపు వెళ్తాయోనన్న చర్చ కృష్ణాజిల్లాలో జరుగుతోంది.  

బావిలో పడ్డ బాలుడు మృతి...

  ఎనభై గంటలుగా కొనసాగినా ప్రయత్నాలు ఫలించలేదు, ఏదో అద్భుతం జరిగి ప్రాణాలతో బాలుడు బయటపడతాడనుకున్న ఆశలు ఆవిరైపోయాయి. నాలుగు రోజుల క్రితం తమిళనాడులో బోరు బావిలో పడ్డ చిన్నారి సుజిత్ ప్రాణాలు కోల్పోయాడు. సుజిత్ విల్సన్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. బోరు బావి నుంచి దుర్గంధం రావడంతో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. నాలుగు రోజులకు పైగా బోరుబావులోనే ఉన్న చిన్నారి శ్వాస ఆడక చనిపోయినట్టు నిర్ధారించారు. శరీరం డీకంపోజింగ్ స్టేజ్ లో ఉంది చిన్నారిని కాపాడేందుకు తాము ఎంతగానో శ్రమించినప్పటికీ దురదృష్టవశాత్తు రక్షించుకోలేకపోయామంటూ బాలుడి తల్లితండ్రులు ఓదార్చే ప్రయత్నం చేశారు అధికారులు. శనివారం నుండి ఎన్.డీ.ఆర్.ఎఫ్ టీమ్ తో పాటు డాక్టర్ లు, మద్రాసు, ఐఐటీ నిపుణులు కూడా ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఓ వైపు పైపులతో ఆక్సిజన్ అందించారు బాలుడు ఎంత లోతులో ఉన్నాడో గుర్తించి దానికి సమాంతరంగా గొయ్యి తవ్వడం మొదలు పెట్టారు కానీ, రోజులు గడవడం ఆక్సిజన్ సరిగా అందకపోవడం నీరు, ఆహారం లేక పోవడంతో సుజిత్ ప్రాణాలు విడిచాడు. సుజిత్ క్షేమంగా బయటపడాలని ప్రధాని మోడీ సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఆకాంక్షించారు కానీ, చిన్నారి ప్రాణాలు మాత్రం దక్కించుకోలేకపోయాం. నిన్న సుజిత్ బోరు బావిలో ముప్పై ఆరు అడుగుల లోతులో ఉన్నట్టు మొదట గుర్తించారు అయితే, సహాయక బృందాలు బోరు బావికి సమాంతరంగా గొయ్యి తీయడం ప్రారంభించాక ముప్పై ఐదు అడుగుల దగ్గర నుంచి ఏకంగా వంద అడుగులకు జారిపోయాడు. మొత్తం ఆరు వందల అడుగుల లోతులో వేసిన బోరులో బాలుడు వంద అడుగుల దగ్గర చిక్కుకున్నట్లు గుర్తించి తీస్తున్న గొయ్యిని మరింత లోతుగా తవ్వటం ప్రారంభించారు. ఐఐటీ మద్రాస్ కు చెందిన నిపుణులు ఎన్.డీ.ఆర్.ఎఫ్, ఎస్.డీ.ఆర్.ఎఫ్ కు చెందిన ఆరు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి అయినా ఫలితం లేకపోయింది. అయితే, మున్సిపోల్స్ ముగిసిన తర్వాతే కొత్త సారధిని నియమిస్తారనే మాట గట్టిగా వినిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు పూర్తయితే... కొత్తగా వచ్చే టీపీసీసీ చీఫ్ కి ఎన్నికలను ఎదుర్కొనే అవకాశముండదని, ఈలోపు పార్టీని బలోపేతం చేయడానికి అవకాశం దొరుకుతుందని హైకమాండ్ భావిస్తోంది. మరి వరుస ఓటములతో సతమతమవుతోన్న టీకాంగ్రెస్ ను విజయాల బాట పట్టించగలిగే నాయకుడు వస్తాడో లేదో తెలియదు కానీ, కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపిక మాత్రం అధిష్టానానికి కత్తి మీద సాములా మారిందంటున్నారు.  

తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా వరుసగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు......

  ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్ల నిర్లక్ష్యంతో పలుచోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. నల్గొండ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. శెట్టిపాళెం వద్ద కరెంటు స్తంభాన్ని ఢీకొని పంట పొలాల్లోకి వెళ్లి బోల్తా పడింది ఆర్టీసీ బస్సు. ఇక పిడుగురాళ్లలో డిపో బస్ తో జరిగిన ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఇటు నల్గొండ జిల్లాలోనూ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఇలాంటి ప్రయాణం తాము చేయలేమంటూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆర్టీసీ సమ్మె కొనసాగితే మరింత ఇబ్బందుల్లో తప్పవంటూ ప్రయాణికులు వాపోతున్నారు. వరుసగా జరుగుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాదాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం శివారులో నార్కట్ పల్లి అద్దంకి రహదారి పై ఉదయం తెల్లవారుజామున ఆరు గంటల ప్రాంతంలో ఒక ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. పిడుగురాళ్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, హైదరాబాద్ నుంచి పిడుగురాళ్ల వైపుకు వెళ్తోంది. అయితే శెట్టిపాలెం శివారు లోకి రాగానే హైవే పై ఒక టర్నింగ్ వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఉన్న కరెంట్ స్థంభాన్ని ఢీ కొడుతూ ఆ తర్వాత పక్కనే ఉన్న పంట పొలాల్లోకి పల్టీ కొట్టింది. అయితే ఈ సమయంలో ఆర్టీసీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కరెంటు స్తంభానికి ఢీకొట్ట గానే ఒక్క సారిగా భారీ శబ్దం వచ్చింది. ఆ తర్వాత రోడ్డు పక్కకు బస్సు ఒరిగి పల్టీ కొట్టింది. అయితే రోడ్ పక్కన పల్టీ కొట్టిన సమయంలో బస్సు చాలా స్లో గా ఉండి పల్టీ కొట్టటం తోటి పెద్దగా ప్రమాదం ఏమి జరగలేదు.బస్సులో ఎనిమిది మంది ప్రయాణికులు ఉండగా వారిలో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే అవనిగడ్డ పోలీసులు సంఘటనా స్థాలానికి వచ్చి పరిశీలించారని సమాచారం.  

టీఆర్ఎస్ లో మున్సి-పోల్స్ రగడ... టికెట్ల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి

    ముందస్తు అసెంబ్లీ ఎన్నికలతో గతేడాది తెలంగాణలో మొదలైన ఎన్నికల హడావిడి దాదాపు ఏడాదిగా కొనసాగుతోంది. రెండు మూడు నెలల గ్యాప్ తో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు... ఆ తర్వాత సార్వత్రి ఎన్నికలు... అనంతరం జెడ్పీ, పంచాయతీ ఎన్నికలు జరగ్గా... ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ సిద్ధమవుతోంది. తెలంగాణలో మున్సిపోల్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం మున్సిపోల్స్ నిర్వహణపై సమీక్ష నిర్వహించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మున్సిపోల్స్ కు రంగంసిద్ధమవుతుండటంతో ప్రధాన పార్టీల్లో హడావిడి మొదలైంది. టికెట్ల కోసం ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నోటిఫికేషన్ కంటే ముందుగా తమ టికెట్ ను కన్ఫ్మామ్ చేసుకునేందుకు పైరవీలు మొదలుపెట్టారు. ప్రతి వార్డు, డివిజన్ నుంచి కనీసం అరడజను మంది టికెట్ కోసం పోటీపడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ లో పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. వార్డు మెంబర్ నుంచి మేయర్ పీఠం వరకు టికెట్లు దక్కించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు చుట్టూ ఆశావహులు తిరుగుతున్నారు. ఎప్పట్నుంచో మీ గెలుపు కోసం పనిచేశాను... ఇఫ్పుడు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, అనుచరుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఏం చేయాలో తెలియక టీఆర్ఎస్ ముఖ్యనేతలు తలల పట్టుకుంటున్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే, టికెట్ల కేటాయింపు తమ చేతిలో ఉండదని, అధిష్టానమే నిర్ణయిస్తుందంటూ తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. దాంతో, మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.      మొత్తానికి నవంబరు నెలాఖరులోపే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో.... అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, అసెంబ్లీ, జెడ్పీ, పంచాయతీల్లో ఎన్నికల మాదిరిగానే అన్ని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో గులాబీ పార్టీ ముందుకెళ్తోంది. అయితే, టికెట్ల లొల్లి... ప్రతి వార్డు, డివిజన్ లో మూడేసి గ్రూపులు ఉండటం.... టీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని అంటున్నారు.   

సద్దాం హుస్సేన్‌కు బాగ్దాదీకి లింకేమిటి? అసలు ఐసిస్ ఛీఫ్‌ను పట్టించిందెవరు?

వేలాది మంది నరమేధం... ఆత్మాహుతి ఉగ్రదాడులు దాడులు... మహిళల అమ్మకం-విచ్చలవిడి శృంగారం... గతంలో ఏ ఉగ్ర సంస్థా చేయని విధంగా అత్యంత క్రూరత్వాన్ని చూపించిన ఐసిస్ అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీ... ఇరాక్ లోని సమర్రా ప్రాంతంలో 1971న జన్మించాడు. తండ్రి షేక్ అవాద్... ఇస్లామిక్ ధర్మ బోధకుడు. బాగ్దాద్ యూనివర్శిటీలో చేరి వైజ్ఞానిక, భాషా శాస్త్రాలు అభ్యసించాడు. అలాగే, ఇస్లామిక్‌ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ పొందాడు. అయితే, బాగ్దాదీకి సైన్యంలో చేరాలని ఆశ ఉన్నా... అతని కంటి సమస్య కారణంగా అది సాధ్యంకాలేదు. విద్యార్ధి దశలో ఒంటరితనాన్ని ఎక్కువ ఇష్టపడే బాగ్దాదీ... హింస అంటేనే ఏవగించుకునేవాడట. అయితే, ఇరాక్ పై 2003లో అమెరికా దాడి చేయడం... సద్దా హుస్సేన్ ను పదవీచ్యుతుడిని చేయడం... 2006 తర్వాత సద్దాంను ఉరితీయడం లాంటి సంఘటనలు బాగ్దాదీ ఆలోచనల్లో మార్పు తెచ్చాయని అంటారు. సద్దాం శకం ముగుస్తున్న సమయంలో బాగ్దాదీ... షరియా మండలి పెద్దగా ఉండేవాడు. అయితే, ఈ షరియా మండలి... జమాత్ జైష్ అహిల్ ఎల్ సున్నీ పేరుతో ఉగ్ర సంస్థను నడిపేది. ఈ సంస్థను 2006లో ముజాహిద్దీన్ సురా మండలిలో విలీనం చేసిన బాగ్దాదీ... ఆ తర్వాత ఆ మండలి అధ్యక్షునిగానూ... అనంతరం ఖలీఫాగానూ అవతరించి... తానే ఇస్లామ్ కు పెద్ద దిక్కు అంటూ ప్రకటించుకున్నాడు. ఇదే 2006లో పేరు మార్చుకుని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియాగా అవతరించింది. అప్పట్నుంచి బాగ్దాదీ ఐఎస్ ఐఎస్ లో చురుగ్గా వ్యవరిస్తూ వచ్చాడు. అయితే, ఐసిస్ వ్యవస్థాపకుడు అల్ ఒమర్ అల్ బాగ్దాదీ... 2010లో అమెరికా సైన్యం దాడిలో మరణించడంతో... ఐఎస్ ఐఎస్ పగ్గాలు చేపట్టి ఇరాక్, సిరియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నరమేథం సృష్టించాడు. ఆల్ ఖైదా అధినేత లాడెన్ ను మించిన క్రూరత్వంతో ప్రపంచానికే వణుకుపుట్టించాడు. ఆల్ ఖైదాను తలదన్నేలా ఉగ్ర దాడులతో రక్తపాతాన్ని సృష్టించాడు. అయితే, బాగ్దాదీ కోసం ఎప్పట్నుంచో వెదుకుతోన్న అమెరికా సైన్యం.... పక్కా సమాచారంతోనే అంతమొందించింది. సొంత అనుచరుడు ఇచ్చిన సమాచారంతోనే బాగ్దాదీని అమెరికన్ ఆర్మీ మట్టుబెట్టింది. బాగ్దాదీకి అంత్యంత సన్నిహితుడైన ఇస్మాయిల్ అల్ ఎతావి టర్కీ బలగాలకు పట్టుబడటమే... బాగ్దాదీ అంతానికి టర్నింగ్ పాయింట్‌ అయ్యింది. టర్కీ నుంచి ఇరాక్ సైన్యం ఆధీనంలోకి వచ్చిన ఇస్మాయిల్ ఎతావి ఇఛ్చిన సమాచారంతోనే బాగ్దాదీని అమెరికా సైన్యం వెంటాడింది. ఐసిస్ స్థావరాలు, బాగ్దాదీ సంచరించే ప్రాంతాలు పక్కాగా తెలియడంతో... ఈశాన్య సిరియా ఇడ్లిట్ ప్రాంతంలో అమెరికా సైన్యం విరుచుకుపడింది. ఈ సీక్రెట్ ఆపరేషన్ మొత్తం ఐదారు నెలలపాటు సాగింది. అలా బాగ్దాదీని వెంటాడి వేటాడటంతో మరో దారి లేని పరిస్థితుల్లో ఆత్మాహుతి చేసుకోవడంతో కరుడుగట్టిన ఉగ్రవాది అంతమయ్యాడు.

యార్లగడ్డకు వైసీపీ నేతల బుజ్జగింపులు... ఎమ్మెల్సీ ఇస్తామంటూ జగన్ ఆఫర్..!

వల్లభనేని వంశీ ఎపిసోడ్ తో గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం శ్రేణుల్లోనూ.... అటు వైసీపీ వర్గాల్లోనూ రగడ జరుగుతోంది. ఇరుపార్టీల్లోనూ సమాలోచనలు, బుజ్జగింపులు, ఆందోళనలు, ఆగ్రహావేశాలు చోటు చేసుకుంటున్నాయి. వల్లభనేనిని నిలుపుదల చేసేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంటే... మరోవైపు వంశీ రాకను యార్లగడ్డ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దాంతో అటు టీడీపీ... ఇటు వైసీపీ... రెండు పార్టీల్లో వంశీ వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇదిలా ఉంటే, వంశీ ఎపిసోడ్ పై కృష్ణాజిల్లా టీడీపీ నేతలతో సుదీర్ఘంగా సమావేశమైన చంద్రబాబు... వల్లభనేని రాసిన లేఖలపై చర్చించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, బచ్చలు అర్జునుడు... తదితర ముఖ్యనేతలు హాజరయ్యారు. అయితే, వివిధ కారణాలు చెబుతూ తెలివిగా లేఖలు రాసిన వంశీ.... వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారనే అభిప్రాయానికి టీడీపీ నేతలు వచ్చారు. అయితే, వంశీ కోసం కేశినేని నాని, కొనకళ్ల నారాయణను రంగంలోకి దింపినా... అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉన్న వంశీ... విజయవాడ వచ్చాక కలుస్తానని కేశినేని నానికి సమాచారం ఇచ్చారని టీడీపీ లీడర్లు చెబుతున్నారు. అయితే, వల్లభనేని వంశీపై దేవినేని ఉమా ఫైరయ్యారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయకుండా... ఏ డ్రామా ఏంటంటూ విరుచుకుపడ్డారు. టీడీపీలో పరిణామాలు ఇలాగుంటే, గన్నవరం వైసీపీలోనూ వంశీ ప్రకంపనలు రేగుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో నువ్వానేనా అంటూ తలపడి స్వల్ప తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు... వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, యార్లగడ్డ అసంతృప్తిని గమనించిన జగన్మోహన్ రెడ్డి.... మంత్రుల ద్వారా ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కానీ వంశీతో తనకున్న విభేదాల దృష్ట్యా ఎమ్మెల్సీ ఆఫర్ ను యార్లగడ్డ తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో, ఒకవేళ గన్నవరంలో ఉపఎన్నిక వస్తే... టీడీపీ నుంచి యార్లగడ్డ... వైసీపీ నుంచి వంశీ పోటీపడినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. మరి గన్నవరం రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

మూడున ముహూర్తం... లేదంటే ఈరోజే... జగన్ గూటిలోకే వల్లభనేని వంశీ.!

విమర్శలు, ప్రతి విమర్శలు లేకుండా ...లేఖలు, వాట్సప్ చాట్ లతో... మొత్తం కథ నడిపించిన గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ... మొత్తానికి వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా తనకు అవకాశమిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ఒకవైపు కృతజ్ఞతలు చెబుతూనే... నియోజకవర్గంలో తనకు ఎదురవుతోన్న సమస్యలను ఏకరవు పెట్టడం ద్వారా తెలుగుదేశం నుంచి స్మూత్ గా ఎగ్జిట్ కావాలన్నది వంశీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, జగన్ చెంతకు చేరాలనుకున్న వంశీ... ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపైనా... వైసీపీ నేతలపై... ఆరోపణలు చేయడం మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు. వైసీపీపైనే విమర్శలుచేసి... అదే పార్టీలోకి ఎలా వెళ్తారనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు, వంశీ రాకపై యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాను జగన్ ఆదేశాలతోనే గన్నవరం నుంచి బరిలోకి దిగి... 800 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాయని గుర్తుచేస్తున్నారు. అయితే, ఎన్నికల సమయంలో... వంశీ నుంచి వ్యక్తిగతంగా అనేకసార్లు బెదిరింపులను ఎదుర్కొన్నానని, అలాంటి వ్యక్తిని ఎలా పార్టీలోకి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యార్లగడ్డ... తన అసంతృప్తిని జగన్ కు తెలియజేందుకు ప్రయత్నించారు. అయితే, సీఎం క్యాంప్ ఆఫీస్ కి వచ్చినా... యార్లగడ్డకు జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దాంతో నిరాశతోనే యార్లగడ్డ వెనుదిరిగాడు. అంతేకాదు ఒకవేళ ఉపఎన్నిక వస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని యార్లగడ్డ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, వంశీ... వైసీపీలో చేరితే.... యార్లగడ్డను టీడీపీలోకి రప్పించాలని తెలుగుదేశం నేతలు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ గన్నవరంలో ఉపఎన్నిక వస్తే, టీడీపీ తరపున యార్లగడ్డను బరిలోకి దింపాలని చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

4రోజులు... 80గంటలకు పైగా ఆపరేషన్... అయినా సుజీత్ కథ విషాదాంతం

తమిళనాడు తిరుచిరాపల్లి దగ్గర బోరుబావిలో పడ్డ బాలుడు సుజీత్ కథ విషాదాంతంగా ముగిసింది. బాలుడిని సురక్షితంగా బయటికి తీసేందుకు దాదాపు నాలుగు రోజులుగా విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ, అప్పటికే సమయం మించిపోవడంతో విగత జీవిగా మారాడు. శుక్రవారం సాయంత్రం రెండేళ్ల సుజిత్ విల్సన్ ఇంటి సమీపంలో ఆడుకుంటూ వినియోగంలో లేని బోరు బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. బాలుడు 35 అడుగుల లోతులో ఉన్నట్లు మొదట కెమెరాల ద్వారా గుర్తించారు. పైపుల ద్వారా ఆక్సిజన్ అందిస్తూ, బోరు బావికి పక్కన తవ్వకం చేపట్టారు. అయితే, రాయి అడ్డు తగలడంతో రెస్క్యూ ఆపరేషన్స్ కు అంతరాయం కలిగింది. మరోవైపు అక్కడ భూమి తడిగా ఉండటంతో, 30 అడుగుల నుంచి 70 అడుగులకు, ఆ తర్వాత 90 అడుగుల కిందకి బాలుడు జారిపోయాడు. అదే సమయంలో మట్టి పేరుకుపోవడంతో బాలుడి పరిస్థితిని అధికారులు అంచనా వేయలేకపోయారు. మరోవైపు అప్పటివరకు వినిపించిన బాలుడు ఏడుపు కూడా ఆగిపోవడంతో ఏదో కీడు శంకించింది. అయినాసరే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. సుజీత్ క్షేమంగా రావాలని తమిళనాడు మొత్తం పూజలు, ప్రార్థనలు చేయడంతో ప్రాణాలతో బయటికొస్తాడని అంతా ఆశించారు. ముఖ్యమంత్రి పళిని నుంచి సూపర్ స్టార్ రజనీ వరకు అందరూ సుజీత్... సేఫ్ గా బయటికి రావాలని ఆకాంక్షించారు. ప్రధాని మోడీ సైతం సుజీత్ క్షేమంగా బయటికి రావాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నట్లు ట్విట్టర్లో మోడీ తెలిపారు. తమిళనాడు సీఎం పళనిస్వామికి ఫోన్ చేసి రెస్క్యూ ఆపరేషన్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్స్ ను దగ్గరుండి స్వయంగా పరిశీలించారు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. అయితే, అప్పటికే బాలుడు అపస్మారకస్థితిలో చలనలం లేనట్లు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. చివరికి మంగళవారం తెల్లవారుజామున సుజీత్ మృతదేహానికి బోరు బావి నుంచి బయటికి తీశారు. బాలుడి మృతదేహం కుళ్లిపోవడంతో పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, 80గంటలకు పైగా నిరంతరాయంగా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించి బోరుబావికి సమాంతరంగా 80 అడుగుల గొయ్యి తవ్వినా, బాలుడిని కాపాడలేకపోయామని, రాతి నేల కావడం, మరోవైపు వర్షం అడ్డంకిగా మారాయని అధికారులు తెలిపారు. మొత్తానికి సుజీత్ కథ విషాదాంతం కావడంతో బాలుడి తల్లిదండ్రులతోపాటు తమిళ ప్రజలు కూడా కన్నీరు మున్నీరవుతున్నారు.

నేటి కోర్టు తీర్పు పై ఆర్టీసీ జేఏసీ ఉత్కంఠ

ఆర్టీసీ జేఏసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో ఇరవై ఐదో రోజుకు చేరుకుంది. మొత్తం ఇరవై ఆరు డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేపట్టిన కార్మికులు ప్రభుత్వం పై తమదైన శైలిలో తిరుగుబాటును కొనసాగిస్తూ వస్తున్నారు. ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో సమ్మెకు దిగిన కార్మిక సంఘాల జేఏసీ తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.  రోజుకో రకంగా నిరసనలతో తమ డిమాండ్ల కోసం పోరాడుతున్న ఆర్టీసీ కార్మిక జేఏసీ ఇవాళ ఉదయం పదకొండు గంటలకు మరోసారి సమావేశం అవ్వనుంది.  హైకోర్ట్ ఇచ్చే తీర్పు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న కార్మిక సంఘాల నాయకులు తమ భవిష్యత్ కార్యాచరణపై నేడు సమావేశంలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తమ సమస్యలకు ప్రభుత్వం అంగీకరుంచకపోవటంతో పోరాటాన్ని ఎలా ముందు కు తీసుకెళ్లాలి అన్న విషయం పై చర్చించబోతున్నారు. ఆర్టీసీ జేఏసీ కార్మికులు రేపు సరూర్ నగర్ లో జరగబోయే బహిరంగ సభపై కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. నేటి మధ్యాహ్నం కోర్టు తీర్పు తర్వాత కార్యాచరణను ప్రకటించే ఆలోచనలో ఆర్టీసీ కార్మిక జేఏసీ ఉన్నట్లుగా తెలుస్తోంది . సతుపల్లి లో ఒక ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్య చేసుకుంది. దీనికి  సంబంధించి సంతాప సభలను ఆర్టీసి జెఎసి నాయకులు  అన్ని డిపోల లో ఏర్పాటు చేసి ఆమెకు సంతాపం తెలపనున్నారు. నేటి కోర్టు తీర్పు విషయం లో ఆర్టీసి జెఎసి నాయకులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠతో‌  ఎదురు చూస్తున్నారు. సమ్మె ఎప్పుడు ఆగుతుందా మళ్ళీ తిరిగి బస్సులు యధావిధంగా తిరుగుతాయా అని ప్రజలు నేడు కోర్టు ఇచ్చే తీర్పు పై ఎన్నో ఆశలతో‌ ఉన్నారు. సంతాప సభలను పదకొండు గంటల కల్లా పూర్తి చేసి, కోర్టు తీర్పు వచ్చాక రేపై సరూర్ నగర్ బహిరంగ సభపై తదుపరి ప్రణాలికని సిద్దం చేసుకోవాలని ఆర్టీసి జెఎసి నాయకులు ఆలోచిస్తున్నట్టు సమాచారం.

వంశీ ఎపిసోడ్‌లో వైసీపీ రియాక్షనేంటి? యార్లగడ్డపై జగన్‌కు సానుభూతి ఉందా?

వల్లభనేని వంశీ అసలు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరతారో లేదో తెలియదు కానీ... గన్నవరం నియోజకవర్గ వైసీపీలో మాత్రం కాకరేపుతోంది. వంశీ వైసీపీలోకి వస్తున్నాడన్న ప్రచారంతో గన్నవరం ఇన్ ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు రగిలిపోతున్నాడు. ఇక యార్లగడ్డ అనుచరుల నుంచైతే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొన్నటి ఎన్నికల్లో వంశీ, యార్లగడ్డ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. వ్యక్తిగతంగా ఇద్దరూ తలపడ్డారు. అయితే, కేవలం 800 ఓట్ల స్వల్ప తేడాతో వంశీ చేతిలో యార్లగడ్డ ఓటమి పాలయ్యారు. కానీ, ఒకానొక టైమ్ లో గెలుపుపై వంశీ ఆశలు వదిలేసుకున్నారు. అందుకే, ఫలితాలకు ముందే యార్లగడ్డకు ఫోన్లు చేయడం, ఇంటికి అనుచరులను పంపడంలాంటి పనుల ద్వారా వంశీ బెదిరింపులకు సైతం పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఫలితాల తర్వాత వైసీపీ అధికారంలోకి రావడం, గన్నవరం మాత్రం అనూహ్యంగా వంశీ గెలవడంతో... ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే, స్వల్ప తేడాతో ఓడిపోయిన యార్లగడ్డపై జగన్ కు మంచి అభిప్రాయం ఉందని అంటారు. ఎందుకంటే జగన్ ఆదేశాలతోనే గన్నవరం నుంచి బరిలోకి దిగిన యార్లగడ్డ... అతితక్కువ టైమ్ లోనే వల్లభనేని వంశీకి గట్టిపోటీ ఇవ్వడమే కాకుండా ముచ్చెమటలు పట్టించాడు. దాదాపు గెలుపు అంచులదాకా వచ్చి... స్వల్ప తేడాతో ఓడిపోయారు. అందుకే, యార్లగడ్డను ఇబ్బంది పెట్టడం జగన్ కు ఇష్టం లేదనే మాట వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు వంశీ రాకకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. మొన్న జగన్ ను కలిసిన వంశీ... తాను వైసీపీలో చేరితే... గన్నవరంలో యార్లగడ్డ ఉండొద్దని ప్రతిపాదన పెట్టారట. అయితే, వంశీ కండీషన్ కు జగన్ ఒప్పుకోలేదని, వంశీ ఇష్యూ హోల్డ్ లోకి వెళ్లిందని అంటున్నారు. అయితే, వంశీపై జగన్‌కు సాఫ్ట్‌ కార్నర్‌ ఉందంటున్నారు. 2014 ఎన్నికల సమయంలో బెజవాడ నడిబొడ్డున జగన్ ను వంశీ ఆలింగనం చేసుకోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. వీళ్లిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే మాట కూడా వినిపించింది. అయితే, వల్లభనేని వంశీ... తన లేఖలో వైసీపీ మీద కూడా విమర్శలు చేయడం... ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని... అలాగే తన అనుచరులపై దాడులు పెరిగిపోయాయని... స్థానిక వైసీపీ ఇన్‌ఛార్జి కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించడం చూస్తుంటే... వైసీపీలోకి వెళ్లే ఉద్దేశం లేదనే మాట కూడా వినిపిస్తోంది. ఎందుకంటే, వైసీపీలోకి వెళ్లాలనుకుంటే, అదే పార్టీ మీద ఎందుకు విమర్శలు చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే, అదంతా వంశీ వ్యూహమనే వాళ్లూ ఉన్నారు. మరి వంశీ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.

వల్లభనేని గేమ్ ప్లానా? బాబు నమ్మకమా? రసవత్తరంగా గన్నవరం రాజకీయం

వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం తెలుగుదేశంలో కలకలం రేపుతోంది. వంశీ లేఖ రాయడం... అంతే స్పీడుగా బాబు రిప్లై ఇవ్వడం... వంశీ థ్యాంక్స్ చెప్పడం... మళ్లీ చంద్రబాబు రియాక్టవడం... ఇలా గన్నవరం రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఓవరాల్ ఎపిసోడ్ ను గమనిస్తే.... విమర్శలు, ప్రతి విమర్శలు లేకుండానే మొత్తం కథ నడుస్తోంది. అయితే, వంశీ వ్యూహాన్ని పసిగట్టిన కొందరు టీడీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు. అయితే, వంశీ వ్యూహం ఎలాగున్నప్పటికీ, చంద్రబాబు మాత్రం సానుకూల దృక్పథంతోనే స్పందిస్తూ.... వల్లభనేని పార్టీ వీడకుండా నిలువరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే, గన్నవరం ఇష్యూపై అత్యవసర సమావేశం నిర్వహించిన చంద్రబాబు... వల్లభనేని వంశీని బుజ్జగించడానికి ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను రంగంలోకి దింపారు. వంశీతో చర్చలు జరిపిన కేశినేని, కొనకళ్ల... వల్లభనేనిని వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదన్నారు. అయితే, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు వంశీ ప్రకటించినప్పటికీ, వైసీపీ నేతలు, అధికారులు వేధిస్తున్నారంటూ ఆరోపించడంతో ఎక్కడో ఒక మూల వల్లభనేనిపై బాబుకి ఇంకా నమ్మకముందంటున్నారు తెలుగుదేశం నేతలు. అందుకే వంశీని బుజ్జగించి, టీడీపీలో కొనసాగేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఒకవేళ ఇదంతా వంశీ గేమ్ ప్లాన్ అనుకున్నా... జగన్ సిద్ధాంతం ప్రకారం ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాల్సి ఉంటుందని, అలా కాకుండా వైసీపీలో చేర్చుకునే ప్రసక్తే ఉండదని టీడీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఒకవైపు వంశీని బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే, మరోవైపు వల్లభనేనికి మద్దతుగా గన్నవరం టీడీపీ కేడర్‌ రాజీనామాలకు సిద్ధమవడం తెలుగుదేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వంశీకి మద్దతుగా నాలుగు మండలాల నేతలు, కార్యకర్తలు రాజీనామాకు సిద్ధమయ్యారు. వంశీ నిర్ణయం ఏదైనా ఆయన వెంటే ఉంటామంటూ తేల్చిచెబుతున్నారు. మొత్తానికి వల్లభనేని వంశీ ఎపిసోడ్ అటు టీడీపీలోనూ... ఇటు వైసీపీలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది.

సుజీత్ కోసం తల్లడిల్లుతోన్న తమిళనాడు... క్షేమంగా బయటికి రావాలంటూ మోడీ ట్వీట్

తమిళనాడు తిరుచిరాపల్లి దగ్గర బోరుబావిలో పడ్డ బాలుడ్ని రక్షించేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు... సుజీత్‌ను సురక్షితంగా బయటికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బోరుబావికి సమాంతరంగా గుంత తవ్వి బాలుడిని కాపాడేందుకు కృషి చేస్తున్నారు. బావిలోకి ఆక్సిజన్ పంపుతూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం సుజిత్ విల్సన్ ఇంటి సమీపంలో ఆడుకుంటూ వినియోగంలో లేని బోరు బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. బాలుడు 35 అడుగుల లోతులో ఉన్నట్లు కెమెరాల ద్వారా గుర్తించారు. పైపుల ద్వారా ఆక్సిజన్ అందిస్తూ, బోరు బావికి పక్కన తవ్వకం చేపట్టారు. అయితే, రాయి అడ్డు తగలడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. మరోవైపు అక్కడ భూమి తడిగా ఉండటంతో, మొదట 30 అడుగుల నుంచి 70 అడుగులకు, ఆ తర్వాత 90 అడుగుల కిందకి బాలుడు జారిపోయాడు. అదే సమయంలో మట్టి పేరుకుపోవడంతో బాలుడి పరిస్థితిని అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. మరోవైపు అప్పటివరకు వినిపించిన బాలుడు ఏడుపు కూడా ఆగిపోయింది. దాంతో బాలుడు క్షేమంగా ఉన్నాడో లేదోనని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. అయితే, బాలుడు క్షేమంగా రావాలంటూ తమిళనాట ప్రజలు ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పళిని నుంచి సూపర్ స్టార్ రజనీ వరకు అందరూ సుజీత్... సేఫ్ గా బయటికి రావాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ సైతం సుజీత్ కోసం ఆరా తీశారు. తమిళనాడు సీఎం పళనిస్వామికి ఫోన్ చేసి రెస్క్యూ ఆపరేషన్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు సుజీత్ క్షేమంగా బయటికి రావాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నట్లు ట్విట్టర్లో మోడీ తెలిపారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్స్ ను స్వయంగా పరిశీలించిన డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం... బాలుడు అపస్మారకస్థితిలో ఉన్నట్లు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయన్నారు. అయితే, నిరంతరం ఆక్సిజన్ అందిస్తూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారని తెలిపారు.