హైదరాబాద్ పబ్ లో అశ్లీల నృత్యాలు.. 22 మంది యువతులు అరెస్ట్!

పబ్బులో గబ్బు పనులు చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు కొందరు యువత. మందు కిక్ లో ఉన్న యువకులకు మగువను ఎరగావేసి అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్న పబ్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని టాట్ పబ్ లో ఆదివారం రాత్రి పోలీసులు చేసిన రైడ్ లో 22 మంది యువతులని అరెస్ట్ చేశారు. పబ్ లో అశ్లీల నృత్యాలు చేసినట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి 22 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పలువురు యువతీ, యువకులు పబ్ లో ఏర్పాటు చేసుకున్న పార్టీలో భాగంగా కొందరు యువతులను రప్పించి అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.  బంజారాహిల్స్ ఏసీపీ ఆదేశాలతో అక్కడికి చేరుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 22 మంది యువతులను అదుపులో తీసుకుని ప్రైవేట్ బస్ లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.  అయితే పోలీసులకు పట్టుబడిన యువతులు అర్థరాత్రి హల్ చల్ చేశారు. తాము పార్టీ చేసుకోవడానికి వచ్చామని.. తమను ఎందుకు వీడియోలు తీస్తున్నారని.. మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ లను లాక్కొని క్రింద పడేశారు. కాగా సీడ్స్ కంపెనీకి చెందిన ఒక వ్యక్తి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అయితే మొన్నటికి మొన్న నగరంలోని లిస్బన్ పబ్ వ్యవహారం కూడా బయటపెట్టారు పోలీసులు. పబ్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో రైడ్ చేసి పలువురు యువతీ యువకులను అరెస్ట్ చేశారు. అయితే ముఖ్యంగా పబ్ కి వచ్చే యువకులకు అమ్మాయిలను ఎరగా చూపించి వారి నుంచి భారీగా డబ్బులు తీసుకోని.. గర్ల్ ఫ్రెండ్ లేకుండా వచ్చే యువకులకు మందు మగువని చూపుతూ క్యాష్ చేసుకుంటున్నారు పబ్ నిర్వాహకులు.

హై పవర్ కమిటీ మూడవ సమావేశం.. తుది నిర్ణయం!

మూడు రాజధానుల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో హైపవర్ కమిటీ నేడు మూడో సారి సమావేశం కానుంది. ఇప్పటికే జీఎన్ రావు, బోస్టన్ కమిటీలపై చర్చించిన హైపవర్ కమిటీ సీఎం జగన్ తో సమావేశమై కీలక అంశాలపై మంతనాలు జరిపింది. నేటి మీటింగ్ లో చాలా అంశాల పై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. జనవరి చివరి నాటికి మూడు రాజధానుల ప్రక్రియను ఓ కొలిక్కి తెచ్చే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతుంది.అమరావతి రాజధాని మార్పుపై ఇప్పటికే హైపవర్ కమిటి రెండుసార్లు భేటి అయ్యింది. జనవరి 20 వ తేదీన ప్రభుత్వానికి నివేదిక అందించబోతున్నారు. ఆ తరువాత కేబినెట్ భేటీ, అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఏపి రాజధానిపై తేల్చేసేందుకు సర్కారు రెడీ అవుతుంది.  ఈ సమయంలో ఒక వైపు అమరావతిలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు..మరో వైపు చంద్రబాబు జోలిపట్టి ఉద్యమము సాగిస్తున్నారు. ఇటువంటి పరిణామాలు ఏపీలో వేడి పెంచుతున్నాయి. ఈ తరుణంలో రాజధానిపై త్వరగా ఓ క్లారిటీ ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఏపి అసెంబ్లీలో జనవరి 20న ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సందర్భంగా హైపవర్ కమిటీ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాజధానితో సహా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణపై సభలో చర్చించే అవకాశముంది.  జనవరి 18 న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరుగుతుంది.  ఇప్పటికే జియన్ రావు కమిటి, బోస్టన్ గ్రూప్ నివేదికలు అందజేశాయి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సమగ్రాభివృద్ధిపై అధ్యయనం చేసిన జీఎన్ రావు కమిటి వికేంద్రీకరణకే మొగ్గు చూపింది. ఒకేచోట అభివృద్ధి కేంద్రీకృతం అవ్వకూడదని అభిప్రాయ పడిన కమిటి రాష్ట్రాన్ని నాలుగు రీజియన్లుగా విభజించాలని సూచించింది. అసెంబ్లీ, హై కోర్టు, సచివాలయం ఏర్పాటుపై కీలక సూచనలు చేసింది. ఇటు మూడు రాజధానుల ప్రతిపాదనకు అనుకూలంగానే బోస్టన్ గ్రూప్ రిపోర్టు అందజేసింది. జియన్ రావు కమిటి , బీసీజీ రిపోర్ట్ లను అధ్యయనం చేసేందుకు కేబినెట్ మంత్రులతో నియమించిన హైపవర్ కమిటీ ఇవాళ మూడోసారి సమావేశం కానుంది. తొలి సమావేశంలో జియన్ రావు కమిటి , బీసీజీ ప్రతినిధులతో భేటీ అయిన హైపవర్ కమిటీ రెండో సమావేశంలో ఉద్యోగులకు కల్పించాల్సిన వసతులపై ప్రధానంగా చర్చించింది. కేబినెట్ భేటీలో నివేదిక అందజేసే దిశగా చర్యలు తీసుకుంటుంది. ఇక నేటి సమావేశంతో చాలా అంశాల పై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

రాష్ట్రాలు, రాజకీయాల గురించి కీలక చర్చలు... కేసీఆర్ తో జగన్ భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ నేడు భేటీ కానున్నారు. ఆ భేటీలో నీళ్ల పంపకాల అంశాలపైనే ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నా.. రాజకీయ అంశాలపై కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశముందని అంటున్నారు. మూడున్నర నెలల తరవాత జరుగుతున్న ఈ సమావేశంపై ఇరు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మూడున్నర నెలల క్రితం కృష్ణా ,గోదావరి నదుల అనుసంధానంపై జగన్ , కేసీఆర్ చర్చించారు, అధికారుల స్థాయిలోనే సంప్రదింపులు జరిగాయి. రెండు రాష్ట్రాల నుంచి ప్రణాళికలు రూపొందించారు. ఒక దానికి ఆమోద ముద్ర వేసి రెండు రాష్ట్రాల సమన్వయంతో ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. నదుల అనుసంధానంపై ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని గత సమావేశాల్లో అనుకున్నా.. అడుగు కూడా పడలేదు. ప్రతిపాదనలు దాదాపుగా అయిపోయినట్టేనని ప్రచారం జరిగింది. ఏపీ ప్రభుత్వం సొంతంగా నిర్మాణం కోసం ప్రతిపాదనలను సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మరోసారి సమావేశం అవుతున్న సీఎంలు ఈ ప్రతిపాదనలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.  గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. మరో వైపు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని 80,000 క్యూసెక్కులకు పెంచుతామని సీఎం జగన్ ప్రకటించారు. ఇవన్నీ కూడా భేటీలో చర్చిస్తారని సమాచారం. ఆయా రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లేలా పరస్పర అంగీకారానికి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు విభజన చట్టంలోని అంశాలను.. షెడ్యూల్ 9 - 10 సంస్థల విభజన, ఉద్యోగుల విభజన, కార్పొరేషన్ లో ఉమ్మడి ఆస్తుల అంశాల పై జగన్ కేసీఆర్ చర్చించే అవకాశముంది. అటు కేంద్రం పట్ల అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు ముఖ్యమంత్రులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ద్రవ్యోల్బణం ఆర్థిక సంక్షోభం కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నాయి. ఇవి సంక్షేమ పథకాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అటు సీఏఏ బిల్లుకు వైసీపీ మద్దతు తెలపగా..టీఆర్ఎస్ వ్యతిరేకించింది. అయితే ఎన్ఆర్సీ విషయాల్లో ఇరువురు వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని సీఏఏ , ఎన్ఆర్సీల పై తమ విధానం ప్రకటించే అవకాశముంది. ఇటీవల కేటీఆర్ తిరుమల పర్యటన తర్వాతే ఇరువురు ముఖ్యమంత్రుల సమావేశం ఖరారైనట్లుగా తెలుసింది. తిరుమలలో సీఎం జగన్ సన్నిహితులు మిథున్ రెడ్డితో కేటీఆర్ సమావేశమయ్యారు. ఇక ఈరోజు జరగబోయే భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.

ప్రమాదమా? ప్లాన్ చేశారా?.. యాక్సిడెంట్ లో నయీమ్ మేనకోడలు మృతి 

ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్ స్టర్ నయీమ్ మేనకోడలు సాజీదా షాహీనా (35) మృతి చెందారు. అయితే ఆ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి అద్దంకి జాతీయ రహదారిపై ఈ యాక్సిడెంట్ జరిగింది. ముందుగా వెళ్తున్న ఓ లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో యాక్సిడెంట్ జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. సన్నిహితుల గృహ ప్రవేశానికి వెళ్లి.. అక్కడి నుండి మిర్యాలగూడకు వెళుతుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో కారు దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్లు గుర్తించారు అధికారులు.  ఈ ప్రమాదం నిజంగా లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో జరిగిందా..? లేక ఎవరైనా కావాలనే చేసిన ప్రమాదమా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నయీమ్ ఎన్ కౌంటర్ అనంతరం పలు కేసుల్లో నిందితురాలిగా షాహీనా జైలుకు కూడా వెళ్లింది. షాహీనా పేరు మీద ఉన్న ఆస్తులు అన్ని నయీమ్  దందాలో భాగంగా షాహీనాను బినామీగా పెట్టినవేనని తెలుస్తుంది. ఈ ఆస్తుల పరంగా ఎన్నో వివాదాలు  ఉన్నాయి. ఆ వివాదాల్లో ఎవరైనా షాహీనాను హతమార్చాలనే ఉద్దేశంతో ఈ ప్రమాదానికి ప్లాన్ చేశారా..? అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.

తెలంగాణ రైతుపై ఏపీ మంత్రి దౌర్జన్యం.. బూతులు తిడుతూ దాడి!!

తెలంగాణకు చెందిన ఓ రైతుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మనుషులు దాడి చేశారనే వార్త వివాదాస్పదమవుతోంది. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కంపెనీ.. తెలంగాణలో అనేక కాంట్రాక్టులు చేస్తోంది. వాటిలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బస్వాపూర్‌ రిజర్వాయర్‌ కూడా ఒకటి. అయితే తాజాగా పెద్దిరెడ్డి ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో.. ఓ రైతు తమ భూమిని తీసుకున్నందుకు పరిహారం చెల్లించాలని కోరాడు. దీంతో ఎవడ్రా నువ్వు అంటూ మంత్రి కోప్పడ్డాడు. మంత్రి గన్‌మెన్‌, కంపెనీ ఉద్యోగులు దుర్భాషలాడుతూ రైతుపై మూకుమ్మడిగా దాడి చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బస్వాపూర్‌ వద్ద 11.39 టీఎంసీల రిజర్వాయర్‌ నిర్మిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం.. భూ సేకరణలో భాగంగా.. బస్వాపూర్‌కు చెందిన ఉడుత సత్తయ్య, ఉడుత నర్సింహ, ఉడుత యాదయ్య కుటుంబాలకు చెందిన భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. కానీ, నష్టపరిహారం మాత్రం పూర్తిగా చెల్లించలేదు. మరో 21 ఎకరాల భూమికి నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంది. ఆ పరిహారం కోసం నిర్వాసితులు రెండు, మూడేళ్లుగా అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. కళ్లు కాయలు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే, అధికారుల నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు.  దీంతో.. పరిహారం చెల్లించే వరకు ప్రాజెక్ట్ పనులు చేయనివ్వకుండా అడ్డుకోవాలని నిర్వాసితులు నిర్ణయించుకొని.. ఆదివారం ఉదయం పనులు చేస్తున్న ప్రదేశానికి వెళ్లారు. అప్పుడే నిర్మాణ సంస్థకు చెందిన పెద్దిరెడ్డి అక్కడికి వచ్చారు. ఆయనను గుర్తించిన నిర్వాసిత రైతు కుమారుడు రవి.. ‘సార్‌! మాకు నష్టపరిహారం చెల్లించలేదు.. మా భూమిలో పనులు నిలిపివేయండి’ అని కోరాడు. దాంతో మంత్రి.. ‘‘ఎవడ్రా నువ్వు.. పనులు నిలిపివేయమనడానికి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మంత్రి గన్‌మెన్‌ మరియు సంస్థకు ఉద్యోగులు రైతుని పిడిగుద్దులు గుద్దుతూ.. నానా దుర్భాషలాడుతూ వంద అడుగుల దూరం ఈడ్చుకువెళ్లారు. నిస్సహాయ స్థితిలో ఆ రైతు తన చేతికి అందిన మట్టి పెడ్డను విసిరాడు. దాంతో, ప్రాజెక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న శశి అనే వ్యక్తి చెవికి గాయమైంది. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా, తమ భూమికి న్యాయంగా రావాల్సిన పరిహారం కోరితే దాడికి పాల్పడి దౌర్జన్యం చేశారని బాధిత రైతు రవి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. మంత్రికి చెందిన కంపెనీ ఉద్యోగిపై మట్టి పెడ్డతో దాడి చేసినందుకు.. నీపైనే కేసు పెడతారు అంటూ రైతుని బెదిరించినట్లు సమాచారం.

దేవుడు ఉన్నాడు అనడానికి పృథ్వీరాజ్ ఎపిసోడ్ సాక్ష్యం!!

శ్రీవెంకటేశ్వర భక్తి చానల్‌(ఎస్వీబీసీ) చైర్మన్‌ పదవికి నటుడు పృథ్వీరాజ్‌ రాజీనామా చేశారు. గత కొద్దిరోజులుగా పృథ్వీరాజ్‌ ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. రాజధాని అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులు అంటూ కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా.. రైతులు బురదలో ఉండాలి తప్ప.. ప్యాంట్లు, బంగారం వేసుకుంటారా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో సొంత పార్టీ నేత నుండే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. వైసీపీ నేత పోసాని కృష్ణమురళి.. పృథ్వీరాజ్‌ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులకు, మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా పృథ్వీరాజ్‌ క్షమాపణలు చెప్పలేదు.. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులేనంటూ..మళ్లీ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. పృథ్వీరాజ్‌ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్వీబీసీ చైర్మన్‌గా పృథ్వీరాజ్‌ను నియమించింది. అయితే ఎస్వీబీసీలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులను తొలగించి అక్రమ నియామకాలకు పాలపడినట్టు తెలుస్తోంది. ఆలా అక్రమంగా నియమించిన 36 మందిని తొలగించినట్లు టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి అంగీకరించారు.  అంతేకాదు ఓ మహిళ ఉద్యోగినితో పృథ్వీ రాజ్ మాట్లాడినట్లు చెప్తున్న శృంగార సంభాషణల ఆడియో కూడా వెలుగులోకి వచ్చింది.  ‘‘పడుకునేటప్పుడు గుర్తొచ్చానా? మార్చి వరకు మందు తాగను. నేను తాగడం మొదలుపెడితే నీతోనే మొదలుపెడతా. వెనక నుంచి పట్టుకుందామనుకున్నా. కెవ్వు మని అరుస్తావని భయపడ్డా. నువ్వు నా గుండెల్లో ఉన్నావ్‌. ఐ లవ్‌ యూ’’ అని పృథ్వీరాజ్‌ మాట్లాడినట్టు ఆ ఆడియోలో ఉంది. ఆ ఆడియో వైరల్ కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పవిత్రమైన పదవిలో ఉంటూ ఇవేం పనులంటూ నెటిజనులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఎస్వీబీసీ చైర్మన్‌ పదవి నుంచి తప్పుకోవాలని.. సుబ్బారెడ్డి సూచించగా పృథ్వీరాజ్ హైదరాబాద్‌ లో ప్రెస్‌మీట్‌ పెట్టి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.   అయితే పృథ్వీరాజ్‌ మాత్రం తనకి ఏ పాపం తెలియదు అంటున్నారు. "నా మీద లేనిపోనివి పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. అది నా గొంతుకాదు.. ఫేక్‌ ఆడియో. నేను పద్మావతి అతిథిగృహంలో మందు తాగానని, డబ్బులు తీసుకుని ఉద్యోగాలిచ్చానని వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్‌ విచారణకు సిద్ధం. రుజువైతే నన్ను చెప్పుతో కొట్టండి. అమరావతి రైతుల పట్ల నా మాటలను వక్రీకరించారు. అందరినీ క్షమాపణలు కోరుతున్నా." అని పృథ్వీ చెప్పుకొచ్చారు.   పృథ్వీ రాజ్ ఎపిసోడ్ ని చూసిన కొందరు... దేవుడు ఉన్నాడని అనడానికి ఇదే సాక్ష్యం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. రైతుల గురించి తప్పుగా మాట్లాడిన పృథ్వీ అసలు బాగోతాన్ని.. ఆ శ్రీనివాసుడు రెండు రోజుల్లోనే బయటపెట్టాడంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్!!

రాజధానిని అమరావతి నుండి తరలించవద్దని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి టీడీపీ, జనసేన వంటి పార్టీలు అండగా నిలుస్తున్నాయి. ఇదిలా ఉంటే అధికార పార్టీ వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే మాత్రం రాజధానిగా అమరావతి వద్దంటూ ఆందోళన చేపట్టారు.   రాజధానిగా అమరావతి వద్దని, అధికార వికేంద్రీకరణ జరిగి, సమగ్ర అభివృద్ధి జరిగితేనే ఏపీ అన్ని రంగాల్లో ముందంజ వేస్తుందని చెబుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా పెనుమాక నుంచి తాడేపల్లి భరతమాత విగ్రహం వరకు భారీ ర్యాలీ తలపెట్టారు. అయితే ఆయనను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. భారీ సంఖ్యలో మద్దతుదారులతో ఆయన బయలుదేరగా.. ఈ ప్రాంతంలో ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తొలుత హెచ్చరించారు. అయినా వినకపోవడంతో... నిషేధాజ్ఞలను ఉల్లంఘించారంటూ ఆర్కేను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌ కు తరలించారు. ఆయనకు మద్దతుగా వచ్చిన స్థానిక వైసీపీ నాయకులను కూడా పోలీసులు స్టేషన్ కు తరలించారు.

ద్వారంపూడి... నీకెందుకంత బలుపు? నీకున్న ప్రజాబలమెంత?

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... కాకికాడ సిటీ ఎమ్మెల్యే... రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు... రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి ప్రజానాయకుడు అనుకునేరు... కానే కాదంటున్నారు ప్రత్యర్ధులు... ఎందుకంటే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ప్రజల్లో మంచి పేరూ లేదు... కనీసం గుర్తింపూ లేదని చెబుతున్నారు... రెండుసార్లూ కూడా కేవలం ఆయా పార్టీల గాలి... అధినేతల అండదండలతో మాత్రమే గెలిచాడని... ద్వారంపూడి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడున్న పరిస్థితులను గమనిస్తే ఎవరికైనా ఈజీగా అర్ధమవుతుందంటున్నారు... 2009లో మొదటిసారి కాకినాడ సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ద్వారంపూడికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గాలి కలిసొచ్చిందని చెబుతున్నారు. వైఎస్ జగన్ అండదండలతో ...అప్పటివరకు కాకినాడ సిటీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముత్తా గోపాలకృష్ణను కాదని టిక్కెట్ దక్కించుకున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... బ్రహ్మాండమైన వైఎస్ గాలిలో సైతం కేవలం 9వేల మెజారిటీ మాత్రమే తెచ్చుకోగలిగాడని అంటున్నారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరపున పోటీచేసి ఘోర ఓటమి చవిచూసిన ద్వారంపూడి... 2009లో మూడో స్థానానికి పరిమితమైన టీడీపీ అభ్యర్ధి చేతిలో ఏకంగా 24వేల భారీ తేడాతో పరాజయం పాలయ్యాడు. ఇక, ఇప్పుడు అంటే, 2019లో మరోసారి వైసీపీ నుంచి పోటీచేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... వైఎస్ జగన్ ప్రభంజనంలో సైతం కేవలం 14వేల మెజారిటీ మాత్రమే తెచ్చుకోగలిగాడు. 2009లోను, 2019లోనూ ద్వారంపూడికి వచ్చిన మెజారిటీ మంచి మెజారిటీగానే పైకి కనిపిస్తున్నా.... అది కేవలం సాధారణ గెలుపుగానే పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే, మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి... అనామకులను నిలబెట్టినా కనీసం  పాతికవేలు మెజారిటీ వచ్చింది. వైఎస్ జగన్ ను చూసే ఓట్లు గుద్దేశారు ప్రజలు. కానీ, కాకినాడ సిటీ వరకు వచ్చేసరికి తేడా స్పష్టంగా కనిపించింది. జగన్ సునామీలో సైతం 14వేల మెజారిటీ మాత్రమే తెచ్చుకోగలిగాడు. అంటే, ద్వారంపూడి ప్రజాబలమున్న నాయకుడు కానే కాదని... కేవలం ఆయా పార్టీల గాల్లో గెలుస్తూ రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాడని అంటున్నారు. అలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... ప్రజాబలమున్న నాయకుడు, దేశంలోనే సీనియర్ పొలిటీషన్, పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసి, ప్రస్తుతం ఏపీ అపోజిషన్ లీడర్ గా కొనసాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై నోటికొచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పార్టీలకతీతంగా ప్రజలు మండిపడుతున్నారు. ద్వారంపూడికి నోరా? లేక పెంటకుప్పా అంటూ విరుచుకుపడుతున్నారు.

ద్వారంపూడీ... నీది నోరా? పంది బురదా?

పక్కనే మహిళా ఎంపీ ఉన్నారనే స్పృహ లేదు. కనీసం తానొక ఎమ్మెల్యేనన్న సంగతి కూడా మర్చిపోయాడు. పబ్లిక్ లో మాట్లాడుతున్నాను... ప్రజలందరూ వింటున్నారనేదీ విస్మరించాడు. పంది బురద మాదిరిగా ఇంకితం కూడా లేకుండా చెలరేగిపోయాడు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. రౌడీలు, పోకిరీలు, ఆవారాగాళ్లు, తాగుబోతులు, చిల్లరగాళ్లు సైతం సిగ్గుపడేలా నోటికి హద్దూ అదుపూ లేకుండా పచ్చి బూతులతో రెచ్చిపోయాడు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసి, తెలుగు రాష్ట్ర రాజకీయాలతోపాటు ఇండియన్ పాలిటిక్స్ లోనే కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై నోటికొచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రిలాంటివాడు... 70ఏళ్లు వయసున్న పెద్దమనిషనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా బూతులతో చెలరేగిపోయాడు. రాయలేని భాషలో... అసలేమన్నాడో చెప్పలేనివిధంగా చంద్రబాబుపై నోరు పారేసుకున్నాడు ద్వారంపూడి. (ల-జ-కొడకా, ఎధవా, దొంగనా కొడకా-అంటూ) పందులు సైతం సిగ్గుపడేలా నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ముసలోడు మళ్లీ లెగకూడదు... ఆ ఎదవను కొట్టాలని ఉందంటూ తాగుబోతు మాదిరిగా రెచ్చిపోయాడు. ద్వారంపూడి మాటలకు పక్కనే ఉన్న మహిళా ఎంపీ వంగా గీత సైతం అవాక్కై... నోటిపై చేయి అడ్డుపెట్టుకున్నారంటే... ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏ స్థాయిలో రెచ్చిపోయాడో అర్థంచేసుకోవచ్చు.  ఒక్క చంద్రబాబుపైనే కాదు... ఆయన కుమారుడు.... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైనా అనుచిత వ్యాఖ్యలు చేశాడు ద్వారంపూడి. వాడు పప్పు లోకేష్... వాడికి కొవ్వు కరిగేలా కొట్లాలి... బుద్ధి చెప్పాలంటూ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ఇక, జనసేనాని పవన్ కల్యాణ్ పైనా చెలరేగిపోయాడు. ఇష్టానుసారంగా తిడుతూ ఏదిపడితే పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. పవన్ కల్యాణ్ ఒక దొంగనా కొడుకంటూ రెచ్చిపోయాడు. అంతేకాదు లంజ చేసే పనులన్నీ పవన్ చేస్తున్నాడంటూ అసభ్య పదజాలంతో సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడాడు.    పందులు, కుక్కలు సైతం సిగ్గుపడేలా సభ్యత సంస్కారం వదిలేసి, తానొక ఎమ్మెల్యేనన్న సంగతి కూడా మర్చిపోయి, అధికార పార్టీలో ఉన్నాననే అహంకారంతో... దేశంలోనే సీనియర్ పొలిటీషియన్, పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుపై నోటికొచ్చినట్లు పచ్చి బూతులు తిట్టడంపై పార్టీలకతీతంగా తప్పుబడుతున్నారు. ద్వారంపూడి అసలు మనిషేనా అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి వాళ్లను ముఖ్యమంత్రి జగన్ కూడా ఉపేక్షించకూడదని సూచిస్తున్నారు. ఒకవేళ ద్వారంపూడి లాంటి లీడర్లను జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తే.... తగిన మూల్యం తప్పక చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

బాలకృష్ణ భయపడుతున్నారా? రాజధానిపై ఎందుకు మాట్లాడటం లేదు?

నవ్యాంధ్ర రాజధాని అమరావతి రణరంగంగా మారింది. రాజధాని రైతులు, మహిళలు దాదాపు నెల రోజులుగా పెద్దఎత్తున ఉద్యమిస్తున్నారు. మహిళలైతే పిల్లలతో సహా రోడ్లపైకి వచ్చి తమ ఆవేదనను తెలుపుతున్నారు. తిండీతిప్పలు మానేసి పెద్దఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. పోలీస్ ఆంక్షలను సైతం లెక్కచేయకుండా, లాఠీ దెబ్బలను తట్టుకుంటూ అమరావతి కోసం పోరాడుతున్నారు. పోలీసుల యాక్షన్ తో వందలాది మంది మహిళలు తీవ్రంగా గాయపడుతున్నారు. మొత్తంగా అమరావతి గ్రామాల్లో నెల రోజులుగా ఒక యుద్ధమే జరుగుతోంది. అయితే, ఇంత జరుగుతున్నా, నందమూరి బాలకృష్ణ కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం చర్చనీయాంశమైంది. అమరావతి కోసం రైతులు, మహిళలు, పిల్లలూ అందరూ రోడ్లపైకి వచ్చి పోరాడుతుంటే నందమూరి నట రాజకీయ వారసుడు మాత్రం ఒక్క మాటా మాట్లాడకపోవడం సంచలనంగా మారింది.  ఒకవైపు బావ చంద్రబాబు... మరోవైపు అల్లుడు నారా లోకేష్... అమరావతి రైతులకు అండగా పెద్దఎత్తున పోరాడుతున్నారు. అక్క భువనేశ్వరి సైతం రాజధాని ప్రజలకు మద్దతుగా ఒకరోజు ధర్నాలో పాల్గొని తన ప్లాటినం గాజులను ఉద్యమానికి విరాళం ఇచ్చారు. ఇలా కుటుంబం మొత్తం రాజధాని రైతులకు అండగా ఉద్యమిస్తుంటే... యాంగ్రీ మ్యాన్ బాలకృష్ణ ఎక్కడా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక, చంద్రబాబు అయితే, ఎన్నడూలేనివిధంగా ఏఖంగా జోలె పట్టి ఉద్యమం కోసం విరాళాలు సేకరిస్తూ ఊరూరా తిరుగుతూ రాజధాని ఉద్యమాన్ని ఒక ఆయుధంగా మలుచుకోవాలని చూస్తుంటే, బాలయ్య మాత్రం ఇప్పటివరకూ ఒక్క మాటా మాట్లాడకపోవడం అమరావతి రైతులనే కాదు, తెలుగుదేశం శ్రేణులనే విస్మయానికి గురిచేస్తోంది. అయితే, బాలయ్య మౌనానికి కారణాలున్నాయంటున్నారు. మూడు రాజధానులపై ఏది మాట్లాడినా తనకు ఇబ్బందేనని భావిస్తున్నారట. అమరావతిలోనే రాజధాని ఉండాలంటే, రాయలసీమలో బాలయ్యకు ఇబ్బందులు తప్పవంటున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న బాలకృష్ణకు, రాజధాని వ్యవహారం నిజంగా తలనొప్పిలా మారిందంటున్నారు. టీడీపీలో బాలయ్య కీలక నాయకుడైనా, తాను ప్రాతినిధ్యం వహిస్తున్నది రాయలసీమ నుంచి కావడంతో, ఇక్కడ తన పట్ల ప్రజల్లో వ్యతిరేకభావం ఏర్పడుతుందని ఆలోచిస్తున్నారట. అందులోనూ సీమలోనే బాలయ్యకు ఫ్యాన్స్‌ ఎక్కువ. సీమ నేపథ్యంలో వచ్చిన సమరసింహారెడ్డి వంటి చిత్రాలు బాక్సాఫీసు రికార్డులు తిరగరాశాయి. అందుకే మూడు రాజధానుల టాపిక్‌లో తలదూర్చితే, అటు నియోజకవర్గంలోనూ, ఇటు సీమలో ఫ్యాన్స్‌పరంగానూ ఇబ్బందేనని నందమూరి హీరో లెక్కలేస్తున్నారట. ఇక ఉత్తరాంధ్రలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇక్కడా నందమూరి అభిమానులకు లెక్కేలేదు. పార్టీ విధానం ప్రకారం, విశాఖను పరిపాలనా రాజధానిగా వ్యతిరేకిస్తే, ఇక్కడా బాలయ్యకు ఇబ్బందే. రాజకీయంగా, సినిమాలపరంగా కూడా చిక్కులు తప్పవు. ఎందుకంటే, తన చిన్నల్లుడు భరత్‌ ...విశాఖ నుంచే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తాను అమరావతిని సమర్థిస్తూ, విశాఖను వద్దంటే చిన్నల్లుడి పొలిటికల్‌ కెరియర్ కి ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారట. అందుకే అటు రాయలసీమ, ఉత్తరాంధ్రను హర్ట్‌ చెయ్యకుండా, మౌనమే మేలనుకుంటున్నారట బాలకృష్ణ. ఒకవేళ మూడు రాజధానులకు బాలయ్య ఓకే అంటే, ఇటు కృష్ణా, గుంటూరులో మరింత ఇబ్బంది. కృష్ణా తమ కుటుంబానికి సొంత జిల్లా కావడం, తమ సామాజికవర్గం బలంగా వుండటంతో, అమరావతిని వ్యతిరేకించలేని పరిస్థితి బాలయ్యది. మూడు ప్రాంతాలూ తనకెంతో కీలకమైనవిగా భావిస్తున్న  నందమూరి హీరోకి, ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది మూడు రాజధానుల వ్యవహారం. అందుకే అన్నింటికీ మౌనమే మేలనుకుంటున్నారని తెలుస్తోంది.

జగన్ ను జైలు భయం వెంటాడుతోందా? సీబీఐ జేడీని మార్చమని లేఖ ఎందుకు రాశారు?

వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి లేఖపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. హైదరాబాద్‌ సీబీఐ జేడీగా తెలుగు రాష్ట్రాలకు, రాజకీయాలకు సంబంధంలేని అధికారిని నియమించాలన్న విజయసాయిరెడ్డి వినతిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖను అమిత్‌షా ఆదేశించారు. అయితే, చంద్రబాబు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టార్గెట్ గా అమిత్ షాకి లేఖ రాసిన విజయసాయిరెడ్డి... ఇద్దరి మధ్య సంబంధాలను ఎత్తిచూపారు.  గతంలో సీబీఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణకు, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, దాంతో ఇద్దరూ కలిసి... వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఇబ్బందులు సృష్టించారని అమిత్‌షాకి రాసిన లేఖలో విజయసాయి ప్రస్తావించారు. చంద్రబాబు కనుసన్నల్లో ఆనాటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ పనిచేస్తూ జగన్ ను ఇబ్బంది పెట్టారని అన్నారు. చంద్రబాబుతో లక్ష్మీనారాయణకు సంబంధాలు ఉన్నాయనడానికి... ఇద్దరూ ఆనాడు అనేకసార్లు ల్యాండ్ లైన్లో మాట్లాడుకున్నారని తెలిపారు. లక్ష్మీనారాయణ తప్పుడు ప్రవర్తన, రాజకీయ ప్రమేయంపై సీబీఐలో అంతర్గత విచారణ సైతం జరిగిందని విజయసాయి గుర్తుచేశారు. ఇక, మొన్నటి ఎన్నికల్లో లక్ష్మీనారాయణ మొదట తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారని.... కానీ, చివరి నిమిషంలో టీడీపీతో వ్యూహాత్మక భాగస్వామైన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీచేశారని అమిత్‌షా రాసిన లేఖలో విజయసాయి పేర్కొన్నారు.  ప్రస్తుత హైదరాబాద్ సీబీఐ జేడీగా ఉన్న కృష్ణ కూడా తెలుగు వ్యక్తేనని, అలాగే, రాజకీయాలతో ముడిపడి ఉన్న అధికారని అన్నారు. అంతేకాదు, కృష్ణ సైతం మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయాలతో ప్రభావితమై నిర్ణయాలు తీసుకుంటున్నారని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు లక్ష్మీనారాయణ సన్నిహితులైన మరో అధికారి హెచ్.వెంకటేష్... సీబీఐ జేడీగా రావడానికి ప్రయత్నిస్తున్నారని.... అయితే, తనది ఆంధ్రప్రదేశ్ కాదని, కర్ణాటక అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని... కానీ ఆయన తల్లిదండ్రులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారేనని విజయసాయి తన లేఖలో అమిత్‌షాకి వివరించారు. హెచ్.వెంకటేష్... మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయని, అలాగే లక్ష్మీనారాయణతో ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయని అన్నారు. అదేవిధంగా లక్ష్మీనారాయణ సీబీఐ జేడీగా ఉండగా హెచ్.వెంకటేష్... ఎస్పీగా పని చేశారని గుర్తుచేశారు. అయితే, చంద్రబాబు తన మనుషులను సీబీఐలో పెట్టుకుని చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారని విజయసాయి ఆరోపించారు. అలాగే, తన హయాంలో జరిగిన భారీ అవినీతి నేపథ్యంలో కేసుల నుంచి రక్షణ కోసం తన అధికారులను సీబీఐ హైదరాబాద్‌లో నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ సీబీఐ జేడీగా నియామకాలు దురుద్దేశ పూర్వకంగా, రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్నాయని, అందుకే ఆంధ్రప్రదేశ్‌కు చెందని, రాజకీయాలతో సంబంధం లేని అధికారిని హైదరాబాద్లో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా నియమించాలని కోరారు. అయితే, విజయసాయి లేఖకు రిప్లై ఇఛ్చిన అమిత్ షా..... తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖను అమిత్‌షా ఆదేశించారు.

పోసాని మాటల వెనుక వైసీపీ ఉందా? పృథ్వీపై జగన్ కి కోపమెందుకొచ్చింది?

ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీకి ఇంటాబయటా కష్టాలు చుట్టుముట్టాయి. సినీ ఇండస్ర్టీలో ఎంతో మంది ఉన్నా ... ముఖ్యమంత్రి జగన్ దృష్టిలో పడి.... ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని దక్కించుకున్న పృథ్వీ... అంతే వేగంగా అపఖ్యాతిని మూటగట్టుకున్నారన్న మాటలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. దాంతో, పృథ్వీపై వైసీపీ అధిష్టానమే గుర్రుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఎస్వీబీసీలో పృథ్వీ ఒంటెద్దు పోకడలకు అధికారులు, సిబ్బంది నలిగిపోయినట్లు చర్చ జరుగుతోంది. దాంతో, రంగంలోకి దిగిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పృథ్వీకి కళ్లెంవేసే ప్రయత్నం చేశారన్న మాటలు వినబడుతున్నాయి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎస్వీబీసీకి తానే సర్వాధికారిలా పృథ్వీ వ్యవహరిస్తున్న తీరు జగన్ వరకు చేరిందంటున్నారు. దాంతో, వైవీ సుబ్బారెడ్డి నేరుగానే పృథ్వీకి వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. తాజాగా పోసాని చేసిన కామెంట్స్ పృథ్వీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేశాయన్న చర్చ జరుగుతోంది. అసలు, ఎస్వీబీసీలో పృథ్వీ చేపట్టిన నియామకాలు పెద్ద రగడకు దారి తీసిందంటున్నారు. ఏకంగా ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో అభిప్రాయభేదాలు తలెత్తాయని అంటున్నారు. దాంతో పృథ్వీ అధికారాలకు కత్తెర వేసిన వైవీ... అతను చేపట్టిన నియామకాలను రద్దు చేసి ఓ రేంజ్ లో షాకిచ్చారని చెబుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన నియామకాలను గుట్టుచప్పుడు కాకుండానే తొలగించినట్లు తెలుస్తోంది. పృథ్వీ ఛైర్మన్ అయిన తర్వాత, 35మందిని ఎస్వీబీసీలో వివిధ పదవుల్లో నియమించారు. ఈ నియామకాల్లో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయనే విమర్శలు వచ్చాయి. ఇది సీఎం జగన్ కార్యాలయం వరకు వెళ్లడంతో.... టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కల్పించుకుని 32మందిని ఒకేసారి తొలగించినట్లు తెలుస్తోంది. దాంతో, వైవీకి పృథ్వీకి మధ్య విభేదాలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.... సీఎం జగన్మోహన్ రెడ్డికి స్వయానా చిన్నాన్న కావడంతో, పృథ్వీ సర్డుకుని పోతున్నాడని అంటున్నారు. మరోవైపు, పృథ్వీ చేపట్టిన నియామకాలను రద్దు చేసిన వైవీ సుబ్బారెడ్డి... ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు మెంబర్ల సిఫార్సులతో నియమితులైన ఐదుగురిని మాత్రం మినహాయించడాన్ని తట్టుకోలేకపోతున్నాడట. అదే సమయంలో తాను నియమించినవారందరినీ తీసేయడంతో వాళ్లకి ఏం సమాధానం చెప్పాలో తెలియక పృథ్వీ తల పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక, పృథ్వీ టార్గెట్ గా పోసాని పేల్చిన డైలాగులు వెనుక కూడా వైసీపీ పెద్దలు ఉన్నారనే మాట వినిపిస్తోంది. పృథ్వీని కంట్రోల్ చేయడానికి, అదే సినీ పరిశ్రమకు చెందిన పోసానిని వైసీపీ సీనియర్లు రంగంలోకి దించారన్న చర్చ జరుగుతోంది. లేదంటే పోసాని ఈ రేంజ్‌లో పృథ్వీపై ఫైర్‌ అయ్యేవారు కాదన్న మాటలు వినపడుతున్నాయి. మొత్తానికి, అటు పార్టీపరంగా, పదవిపరంగా, వ్యక్తిగతంగా ఎదురవున్న సవాళ్లు, విమర్శలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు పృథ్వీ. ముఖ్యంగా పోసాని ఘాటు కామెంట్స్ పృథ్వీని బాగా ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు. అయితే, పోసానికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చానని పృథ్వీ భావిస్తున్నా, పోసాని మాటల వెనుక అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయన్న ప్రచారమే మింగుడు పడటం లేదంటున్నారు.  

చిరుకి ఆ మాత్రం తెలియదా?.. వాళ్ల సినిమాలు చూడకండి: అశ్వనీదత్

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనను సినీ హీరో చిరంజీవి స్వాగతించడాన్ని నిర్మాత అశ్వనీదత్ తప్పుబట్టారు. చిరంజీవికి ఏం తెలుసని మూడు రాజధానులు బాగుంటుందని చెప్పారని ఫైర్ అయ్యారు. ప్రపంచంలో బహుళ రాజధాని వ్యవస్థ ఫెయిలైన విషయం చిరంజీవికి తెలియదా అని ప్రశ్నించారు. పవన్‌ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే కోట్లలో సంపాదిస్తారని.. అయినా సినిమాలు వదిలేసి రైతుల కోసం ఎందుకు పోరాడుతున్నాడో చిరంజీవికి తెలియదా అని అశ్వనీదత్ చురకలంటించారు. రాజధాని ప్రాంతంలో పుట్టిన వాళ్లు సూపర్ స్టార్లుగా ఉన్నారని.. నటుడిగా కాకున్నా, సగటు మనిషిగా స్పందించాల్సిన అవసరం లేదా అని ఒక స్టార్ హీరోని ఉద్దేశించి అశ్వనీదత్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వాళ్ల సినిమాలు చూడటం మానేయండని, వాళ్లే దిగివస్తారని రాజధాని రైతులకు అశ్వనీదత్ పిలుపునిచ్చారు.

బాబు, పవన్ లపై వైసీపీ ఎమ్మెల్యే బూతు పురాణం

రాజధాని అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతులపై అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. పెయిడ్ ఆర్టిస్టులు అని.. రైతులైతే బురదలో దిగి పని చేసుకోవాలి కానీ ఇలా రోడ్ల మీద ప్యాంటులు వేసుకొని తిరగరు అని.. మెడలో బంగారం ఉన్న మహిళలు రైతులు ఎలా అవుతారని.. ఇలా రకరకాల వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ నేతల వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా వైసీపీ నేతల తీరు మారట్లేదు. రైతులపైనా, రైతులకు మద్దతుగా నిలుస్తున్న వారిపైనా నోరు పారేసుకుంటున్నారు.  తాజాగా కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై హద్దు దాటి వ్యాఖ్యలు చేశారు. రాయడానికి వీలులేని బూతులు మాట్లాడారు. "చంద్రబాబూ నిన్ను ఒరేయ్ ల** **కా అని తిట్టాలనుంది వెదవకాన" అని నోరు పారేసుకున్నారు. "పవన్ పెద్ద పెద్ద మాటలు చెప్తాడు చేసేవి ల** పనులు.. దొంగ నా కొడుకు" అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయనపై నెటిజనులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రజాప్రతినిధి అయ్యుండి ఇవేం మాటలు అని మండిపడుతున్నారు. మాజీ సీఎంని ఇలాంటి మాటలు అనడం ఏంటి? ఇదేం సంస్కారం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సమావేశం మధ్యలో సడన్ గా ఢిల్లీ వెళ్లిన పవన్.. ఏపీలో కీలక పరిణామాలు!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సడెన్ గా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే లేచి పవన్ ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర ప్రభుత్వ ప్రముఖుల అపాయింట్‌మెంట్‌ పవన్‌ కు ఖరారయిందని, అందుకే ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా తో ఆయన అప్పాయింట్ మెంట్ ఖరారు అయినట్లు సమాచారం. పవన్ సడన్ గా ఢిల్లీ వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన రెండు రోజులుగా కేంద్ర ప్రముఖుల అప్పాయింట్ మెంట్ కోరుతున్నారు. ఏపీ మూడు రాజధానుల వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఇటీవల కోరారు. అదే సమయంలో తాను కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్రంతో చర్చిస్తానని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ కోరారు. ఈరోజు పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఉన్న సమయంలో అప్పాయింట్ మెంట్ ఖరారైనట్లుగా ఫోన్ వచ్చింది. దీంతో వెంటనే పవన్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలో ఆయన పలువురు కీలక వ్యక్తులను కలవనున్నారని సమాచారం. రాజధాని అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశముందని తెలుస్తోంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తు గురించి చర్చించే అవకాశముందని సమాచారం. పవన్ ఢిల్లీ పర్యటన తరువాత ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, ఢిల్లీలో పవన్ ఎవరెవరిని కలుస్తారు..ఏం చర్చిస్తారనే దాని పైన మొత్తం సమీకరణాలు ఆధారపడి ఉన్నాయి.

చంటి పిల్లల్ని అరెస్ట్ చేసే స్థాయికి దిగజారిపోయారు జగన్ గారు!!

ఏపీ రాజధాని కోసం పోరాడుతున్న రైతులు, మహిళల విషయంలో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. మహిళల పట్ల పోలీసులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చిన్నపిల్లల పట్ల కూడా జాలి చూపించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లితో పాటు నిరసనలో పాల్గొన్న ఒక చిన్న పిల్లాడిని అరెస్టు చేసిన ఫోటోని లోకేష్ ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు. అంతేకాకుండా ఓ యువతితో భత్రతా బలగాలు అనుచితంగా ప్రవర్తించినట్లుగా ఉన్న మరో ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. 'చంటి పిల్లల్ని అరెస్ట్ చేసే స్థాయికి దిగజారిపోయారు వైఎస్ జగన్ గారు. వైసీపీ రాక్షస పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు హేయనీయం.’ అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అరెస్ట్ చేసిన మహిళల్ని మీది ఏ కులమో చెప్తే కానీ విడుదల చెయ్యం అని నిలదీస్తారా? ఈ ఘటనలతో మహిళల పై జగన్ గారికి ఉన్న గౌరవం ఏంటో సమాజానికి అర్ధం అయ్యింది. అరెస్టులు కాదు దమ్ముంటే మా అక్కా, చెల్లెళ్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి’ అని లోకేష్ నిలదీశారు.

టీఆర్ఎస్ లో పోటీ.. కాంగ్రెస్ కి కలిసొచ్చింది!!

ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ ఏది ఏమైనా పోటీ చేయడమే ముఖ్యం. ఇది మునిసిపల్ ఎన్నికల్లో పోటీకి సంబంధించి వివిధ పార్టీల నేతల్లో నెలకొన్న అభిప్రాయం. దీంతో అభ్యర్థిత్వం పై పార్టీ నాయకత్వం నుంచి హామీ లేకపోయినా నామినేషన్ వేశారు. సొంత పార్టీ నుంచి టిక్కెట్ దక్కదని తెలియడంతో కండువా మార్చేశారు. మరో పార్టీ నుంచి కూడా నామషన్ దాఖలు చేశారు. చివరికి ఏ పార్టీ టిక్కెట్ దక్కితే ఆ పార్టీ బి ఫారాన్ని సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఇలా ఒక్కొక్కరు రెండు మూడు నామినేషన్లు కూడా వేయడమే కాక రాత్రి కి రాత్రి పార్టీ కూడా మారుతున్నారు. పరిషత్ ఎన్నికలను స్వీప్ చేసిన అధికార టీఆర్ఎస్ఐ ఈ తలనొప్పులను ఎక్కువగా ఎదుర్కొంటోంది. పలుచోట్ల కాంగ్రెస్ కు సైతం ఈ సమస్య ఎదురవుతుంది. టీఆర్ఎస్ నుంచి గోడదూకే వారు ఎక్కువగా కాంగ్రెస్ బీజేపీలనే ఎంచుకుంటున్నారు. అది కుదరకపోతే స్వతంత్ర అభ్యర్థు లుగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దపడుతున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ కు చెందిన ఎల్లంకి శ్రీనివాస్ కు ఆ పార్టీ టిక్కెట్ దక్కక పోవడంతో కాంగ్రెస్ లో చేరారు. గురువారం టీఆర్ ఎస్ తరుపున వార్డుకు నామినేషన్ వేసిన శ్రీనివాస్ టిక్కెట్ రావడం లేదని తెలిసి శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న వెంటనే కాంగ్రెస్ తరఫున టికెట్ పొంది మళ్లీ నామినేషన్ వేశారు. ఎల్లారెడ్డి మునిసిపాలిటీలో టీఆర్ఎస్ టికెట్లు దక్కని ఆ పార్టీ మండల అధ్యక్షుడు మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఎంపీటీసీ సభ్యులు కూడా కాంగ్రెస్ లో చేరారు. వీరంతా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు కావడంతో వీరికి టికెట్ ఇచ్చేందుకు ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ నిరాకరించినట్లు దీంతో వీరు పార్టీ మారినట్టు చెబుతున్నారు.మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ టీఆర్ఎస్ నేత ఉప్పలయ్య కాంగ్రెస్ లో చేరగా ఆయనను మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది.ఇలా నేతలు పార్టీలు మారడం పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల బుజ్జగింపుల పదునుపెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం దక్కకపోయినా నామినేటెడ్ పదవులు ఇతర అవకాశాల్ని ఎరగా చూపున్నారు నేతలు.

అమరావతి మహిళలకు అండగా జాతీయ మహిళా కమిషన్!!

రాజధాని మార్పు అంశం మొదలైన దగ్గర నుంచి ఆంధ్రా అంతటా వాతావరణం వేడెక్కుతోంది.రాజధాని గ్రామాల్లో జాతీయ మహిళా కమిషన్ ప్రతి నిధుల బృందం ఇటీవల పర్యటించింది. తుళ్లూరులో రైతుల మహిళలపై దాడులను కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారి పై లాఠీ చార్జ్ చేయడం అరెస్టులు చేయడం లాంటి వాటి పై క్షేత్రస్థాయిలోనే పర్యటించి నిజనిర్దారణ చేయనుంది ఇవాళ కమిటీని పంపిస్తున్నట్టు NWC చైర్ పర్సన్ రేఖా శర్మ తెలియజేశారు.మహిళలపై పోలీసులు అంత్యంత దారుణంగా దాడి చేసిన ఫోటోలు ట్విట్టర్ ద్వారా ఆమె దృష్టికి వెళ్లడంతో.. ఆమె పోలీసులు, ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు, ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తోందో, పోలీసులు ఎలా దౌర్జన్యాలకు దిగుతున్నారన్న అంశం తమ వద్ద ఉన్న ఆధారాలతో సహా కమిటీ ముందు ఉంచనున్నట్లు మహిళలు తెలియజేశారు. కనకదుర్గమ్మకు పసుపు కుంకుమ నైవేధ్యం సమర్పించేందుకు వెళుతున్న తమతో పోలీసులు వ్యవహరించిన తీరును మహిళా కమిషన్ బృందానికి వివరించబోతున్నారు. పెయిడ్ ఆర్టిస్టులు అంటూ తమను పదేపదే కించపరుస్తున్నారని మహిళలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మందడం లో జరిగిన దాడితో పాటు నిన్న విజయవాడలో మహిళల ర్యాలీ సందర్భంగా సాగిన దమన కాండను కూడా కమిషన్ ముందుకు తీసుకురానున్నారు. రాజధానికి భూములిచ్చిన తాము న్యాయం కోసం పోరాడుతుంటే అత్యంత దారుణంగా కట్టడి చేయాలని చూస్తున్నారని మహిళలు వాపోతున్నారు. తమ హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.

బాబు తిరుపతి ర్యాలీకి అనుమతి నిరాకరించిన పోలీసులు... ఏం జరగనుంది?

ఏపీ రాజధాని అంశం రోజు రోజుకు వేడెక్కుతోంది.జగన్ నిర్ణయం పై ఒకొక్క నేత ఒక్కోలా స్పందిస్తున్నారు .ఏపీ రాజధానిని తరలించాలన్న యోచనలో ఉన్న ప్రభుత్వం పై రైతుల నిరసన లు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి దాకా క్యాండిల్ ర్యాలీలు, పాదయాత్రలు, ధర్నాలు, రోడ్డు పై బైఠాయింపులతో తమ నిరసన తెలిపిన రైతలు ఇవాళ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.ఇవాళ ఉదయం ఇరవై తొమ్మిది గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, రైతులు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. మందడం నుంచి విజయవాడ లోని గుణదల వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది.టిడిపి అధినేత చంద్రబాబు తిరుపతిలో పర్యటించనున్నారు. అమరావతి పరిరక్షణ సమితి నిర్వహిస్తున్న బస్సు యాత్రలో ఆయన పాల్గొంటున్నట్లు సమాచారం.ఉదయం పది గంటలకు జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు పూలే విగ్రహం నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు జరిగే ర్యాలీకి కూడా చంద్రబాబు హాజరవుతారు. అయితే తిరుపతి పోలీసులు మాత్రం శనివారం సాయంత్రం తిరుపతిలో నిర్వహించే అమరావతి పరిరక్షణ ర్యాలీకి అనుమతి లేదంటున్నారు. సంక్రాంత్రి హడావిడి ఉందని.. కాబట్టి ర్యాలీకి అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఎవరైనా ర్యాలీకి ప్రయత్నిస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు నగరంలో పోలీసుల్ని భారీగా మోహరించారు.. పరిస్థితి ఎస్పీలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దీంతో బాబు ఏం చేయబోతున్నారన్నది చర్చనీయంశంగా మారింది.