ఇండియాటుడే సర్వేలో జగన్ కు షాక్... మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఓటు...

మూడు రాజధానులను అటు అమరావతి రైతులు... ఇటు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే... జగన్ ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకెళ్లింది. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశపర్చి శాసనసభలో మూడు రాజధానుల బిల్లును ఆమోదించింది. అన్ని ప్రాంతాల సమానా అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని జగన్ ప్రభుత్వం చెబుతోంది. ఎవరేమనుకున్నా తమ నిర్ణయం ఇదేనని... ప్రజలు కూడా తమ వెనుకే ఉన్నారని అంటోంది. అయితే, జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించడం లేదని, ఇండియాటుడే సర్వేలో ఇదే తేలిందంటూ చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై ఇండియాటుడే నిర్వహించిన ఒపీనియన్ పోల్ లో 67శాతం మంది వ్యతిరేకంగా ఓటేశారని అన్నారు. మొత్తం 7840మంది తమ అభిప్రాయాన్ని చెప్పగా అందులో 67శాతం ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. మూడు రాజధానుల నిర్ణయం సరైనది కాదంటూ తేల్చిచెప్పారు. ఇండియాటుడే ఒపీనియన్ పోల్ లో కేవలం 29శాతం మంది మాత్రమే మూడు రాజధానులకు మద్దతు ఓటేయగా... 4శాతం తటస్థ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇండియాటుడే ఒపీనియన్ పోల్ లోనే కాదు... రాష్ట్రమంతటా ఇదే అభిప్రాయం ఉందని, మెజారిటీ ప్రజలు మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఇండియాటుడే సర్వేలో 67శాతం మంది వ్యతిరేకిస్తున్నట్లే... రాష్ట్రమంతటా ఇదే అభిప్రాయముందన్నారు.

విశాఖ నుంచి విజయవాడకు మార్పు... జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం...

మూడు రాజధానుల నిర్ణయంతో ఎగ్జిక్యూటివ్ కేపిటలైన విశాఖలో గణతంత్ర వేడుకలు నిర్వహించాలని మొదట జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభలో బిల్లు ఆమోదం పొందకముందు నుంచే వైజాగ్ లో రిపబ్లిక్ సెలబ్రేషన్స్ కు ఏర్పాటు జరుగుతున్నాయి. GNరావు కమిటీ రిపోర్ట్ సమర్పించిన నాటి నుంచే విశాఖలో గణతంత్ర వేడుకలు నిర్వహించేందుకు అనధికారికంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా అధికారులు ఆ మేరకు ఏర్పాట్లూ చేస్తూ వచ్చారు. అయితే, మూడు రాజధానుల బిల్లు శాసనసభలో ఆమోదం పొందిన తర్వాతే సడన్ గా వెన్యూను జగన్ ప్రభుత్వం మార్చేసింది. రాష్ట్రస్థాయి గణతంత్ర వేడుకలను విజయవాడలోనే నిర్వహించాలని నిర్ణయించింది. అంతేకాదు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కోసం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, మొదట విశాఖలో గణతంత్ర వేడుకలు చేయాలనుకున్న జగన్ ప్రభుత్వం.... ఇప్పుడు ఇంత సడన్ గా వేదికను ఎందుకు విజయవాడకు మార్చిందనేది చర్చనీయాంశంగా మారింది.

టీడీపీ వ్యూహానికి మండలిలో వైసీపీ విలవిల... రద్దు చేస్తామంటూ ప్రభుత్వం బెదిరింపులు..! 

మూడు రాజధానుల బిల్లును అడ్డుకునేందుకు శాసనమండలిలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవరిస్తోంది. అందులో భాగంగా రూల్ 71 కింద తెలుగుదేశం నోటీస్ ఇవ్వగా... మండలి ఛైర్మన్ కూడా టీడీపీ చర్యకు అనుకూలంగా చర్చకు అనుమతిస్తూ రూలింగ్ ఇచ్చారు. దాంతో, మండలిలో రగడ జరిగింది. బిల్లు ప్రవేశపెట్టకుండా టీడీపీ నోటీస్ పై ఎలా చర్చకు అనుమతిస్తారంటూ మంత్రులు అభ్యంతరం తెలిపారు. అయితే, తెలుగుదేశం నోటీస్ పై చర్చ తర్వాతే బిల్లును ప్రవేశపెట్టాలంటూ మండలి ఛైర్మన్ తేల్చిచెప్పడంతో మంత్రులు, అధికార పార్టీ సభ్యులు వ్యతిరేకించారు. మండలి ఛైర్మన్ రూలింగ్ పై మంత్రి బుగ్గన తీవ్ర అభ్యంతరం చెప్పారు. బిల్లును ప్రవేశపెట్టిన తర్వాతే... రూల్ 71 అనేది తెరపైకి వస్తుందని, కానీ ముందే రూల్ 71కి చర్చకు అనుమతి ఇవ్వడం మంచి సంప్రదాయం కాదన్నారు. అదే సమయంలో రూల్ 71పై చర్చకు ముందే ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించగా... టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. అలా, సభలో గందరగోళం నెలకొనడం మండలి పలుమార్లు వాయిదాపడింది. అయితే, మండలిలో బిల్లు ప్రవేశపెడితే చాలు ఏదోవిధంగా ఆమోదింపజేసుకోవచ్చని ప్రభుత్వం చూస్తోంది. ఎందుకంటే, బిల్లు పెట్టాక వీగిపోతే డీమ్డ్ టు బీ పాస్డ్ కింద ప్రభుత్వం బిల్లును ప్రభుత్వం ఆమోదింపజేసుకునే అవకాశం ఉంటుంది. అసలు బిల్లే ప్రవేశపెట్టకపోతే డీమ్డ్ టు బీ పాస్డ్ కష్టమని నిపుణులు చెబుతున్నారు. అయితే, టీడీపీ ఇదేవిధంగా బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటే... ఏకంగా శాసనమండలినే రద్దు చేస్తామంటూ ప్రభుత్వం లీకులు ఇచ్చింది. మంత్రి బొత్స ఆ మేరకు నేరుగా హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, అవసరమైతే అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించి కౌన్సిల్ రద్దుపై నిర్ణయం తీసుకోనున్నట్లు లీకులు వస్తున్నాయి. అయితే, మండలిని రద్దుతో ఎదురయ్యే లాభనష్టాలపై ప్రభుత్వ పెద్దలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, రాత్రికి రాత్రే శాసనమండలిని రద్దు చేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. కౌన్సిల్ రద్దుకు మంత్రివర్గం తీర్మానం చేసినా, దాన్ని అసెంబ్లీలో ఆమోదించి, పార్లమెంటుకు పంపాల్సి ఉంటుంది. అయితే, పార్లమెంట్ లో చర్చించి ఆమోదిస్తేనే మండలి రద్దు సాధ్యమవుతుంది. అందువల్ల కౌన్సిల్ రద్దు అంత ఈజీ కాదని అంటున్నారు.

మండలిలో టీడీపీకి ఊహించని షాక్.. ఇదేం ట్విస్ట్!!

టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేశారు. మండలిలో అధిక సంఖ్యా బలం ఉన్న టీడీపీ, మూడు రాజధానుల బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో సభ్యులంతా హాజరు కావాలని విప్ జారీ చేసింది. ఇలాంటి సమయంలో డొక్కా టీడీపీకి షాకిచ్చారు. తొలిరోజు మండలి సమావేశానికి హాజరైన డొక్కా రెండో రోజు గైర్హాజరయ్యారు. ఇదే సమయంలో తన పదవికి రాజీనామా చేస్తున్నానని, అనారోగ్య కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.  ఇదిలా ఉంటే.. మరో టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి కూడా సమావేశాలకు హాజరుకాలేదు. అయితే.. తాను అనారోగ్యం కారణంగానే హాజరుకాలేదని ఆమె తెలిపారు. కాగా, గత కొంతకాలంగా రాజకీయాలకు కాస్తంత దూరంగా ఉన్న డొక్కా, ఇటీవలి కాలంలో టీడీపీ కార్యకలాపాల్లోనూ పాల్గొనలేదు. అయితే ఆయన టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారా? అన్న విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు.. డొక్కా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న ప్రచారం మొదలైంది.

చంద్రబాబుకి 3 ఆప్షన్లు... జగన్‌కు ఒక్కటే మార్గం...

అనుకున్నట్లే మూడు రాజధానుల బిల్లు శాసనసభలో ఆమోదం పొందింది. ఇందులో పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే శాసనసభలో జగన్ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే, మండలిలో కూడా బిల్లు ఆమోదం పొందితేనే మూడు రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. కానీ, మండలిలో పరిస్థితి రివర్స్ లో ఉంది. అక్కడ ప్రధాన ప్రతిపక్షం టీడీపీదే ఫుల్ మెజారిటీ. దాంతో, మండలిలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందడం ప్రశ్నార్ధకంగా మారింది. దాంతో, మండలిలో బిల్లును ఎలా ఆమోదించుకోవాలనే దానిపై తర్జనభర్జనలు పడుతోంది. ఒకవేళ మండలి కనుగ బిల్లును ఆమోదించకపోతే మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ రెండు మూడు నెలలు ఆగిపోవడం ఖాయం. అయితే, మండలిలో బిల్లును అడ్డుకోవడానికి టీడీపీ ముందు పలు ఆప్షన్లు ఉండగా, జగన్ ప్రభుత్వానికి మాత్రం ఒక్కటే మార్గం కనిపిస్తోంది. సాధారణంగా ఏ బిల్లునైనా మొదట శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాక శాసనమండలికి పంపిస్తారు. అక్కడ ఎలాంటి సవరణలు ప్రతిపాదించకుండా ఆమోదిస్తే... ఆ బిల్లును నేరుగా గవర్నర్ కు పంపిస్తారు... ఆ తర్వాత గవర్నర్ ఆమోదం లభిస్తే... ఆ బిల్లు చట్టంగా మారుతుంది. ఒకవేళ మండలిలో బిల్లును తిరస్కరించినా లేక ప్రవేశపెట్టాక మూడు నెలల్లో ఆమోదం లభించకపోయినా... సవరణలతో బిల్లును ఆమోదించినా... అది మళ్లీ శాసనసభ ముందుకు వస్తుంది. ఇలా మండలి నుంచి శాసనసభకు తిరిగొచ్చిన బిల్లును సవరణ చేసైనా చేయకుండానైనా తిరిగి ఆమోదించి మళ్లీ శాసనమండలికి పంపుతారు. మండలి నుంచి నెలరోజుల్లోపు తిరిగిరాకపోతే... బిల్లు ఆమోదం పొందినట్లే పరిగణించి గవర్నర్ సమ్మతి కోసం పంపిస్తారు. అయితే, మూడు రాజధానుల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం... ఈ బిల్లును తిరస్కరించి పంపే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అలా కాకుండా సెలెక్ట్ కమిటీకి పంపిస్తే మాత్రం ఆ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నెలల సమయం పడుతుంది. అయితే, మండలిలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశానిదే పైచేయిగా ఉన్నప్పటికీ, ఎలాగైనాసరే మూడు రాజధానుల బిల్లును ఆమోదింపచేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ముఖ్యంగా మంత్రులంతా మండలికి వెళ్లి మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదింపజేసుకోవాలని యోచిస్తున్నారు. ఇవేమీ వర్కవుట్ కాకపోతే చివరి అస్త్రంగా ఆర్డినెన్స్ జారీ చేయాలన్న ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆర్డినెన్స్ తెచ్చినా దానికి ఆరు నెలలు మాత్రమే వాల్యూ ఉండటంతో... ఏం చేయాలన్నదానిపై తర్జనభర్జనలు పడుతోంది. మరి, మండలిలో ఏం జరుగుతుందో చూడాలి.

అర్ధరాత్రి అసెంబ్లీ లాబీ వద్ద నిరసన తెలిపిన చంద్రబాబు....

నవ్యాంధ్ర చరిత్రలో మొదటిసారిగా మాజీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ లాబీలో కింద కూర్చొ ని నిరసన తెలిపారు. ఆయనతో పాటు టిడిపి ఎమ్మెల్యేలు కూడా కూర్చున్నారు, మరోవైపు టిడిపి ఎమ్మెల్యే లను బయటకు తీసుకురావటం కోసం మార్షల్ బలప్రయోగం చేశారు. దీన్ని వారు ప్రతిఘటించటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ బలప్రయోగాన్ని సస్పెన్షన్ ను నిరసిస్తూ చంద్రబాబు అక్కడ ధర్నాకు దిగారు. మార్షల్స్ వారిని లేపేందుకు ప్రయత్నించగా బలవంతం చేయొద్దని చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు.అసెంబ్లీ నుంచి రైతులకు సంఘీభావం తెలిపేందుకు పాదయాత్రగా మందడం వెళ్తూ ఉండగా చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్తుందంటూ అనుమతి నిరాకరించగా పోలీసులకు టిడిపి నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ కారణంగా చంద్రబాబు టిడిపి ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే క్రమంలో చంద్రబాబు వాహనాన్ని దారిమళ్లించారు. కరకట్ట వైపు కాకుండా వెంకటాయపాలెం వైపు మళ్లించారు.మళ్లీ మందడం కృష్ణాయపాలెం నుంచి ఎర్రబాలెం మీదుగా మంగళగిరి వైపు తీసుకువెళ్లారు. డొంకరోడ్ల గతుకుల రోడ్లలో అతివేగంతో గంటన్నర సేపు తిప్పారు.11:30 నిమిషాల ప్రాంతంలో మంగళగిరి పోలీస్ స్టేషన్ వైపు తీసుకువెళ్లారు. చంద్రబాబును అరెస్టు చేసి తీసుకొస్తున్నారన్న సమాచారంతో టిడిపి కార్యకర్తలు పోలీసు వాహనాల వెంట పరుగులు తీశారు.స్థానిక మిద్దె సెంటరు వద్ద రోడ్డుపై అడ్డంగా పడుకొని చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు చంద్రబాబును, ఎమ్మెల్యేల్ని వాహనం నుంచి దించేసి వెళ్ళిపోయారు.చంద్రబాబు పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించడం పై ఎమ్మెల్యేలు కార్యకర్తలు తీవ్రం గా తప్పుబట్టారు. పాదయాత్రగా మంగళగిరి పోలీస్ స్టేషన్ కు వచ్చారు, తనను ఎందుకు అరెస్టు చేశారో వాహనాల్లో ఎందుకు గంట సేపు తిప్పారో చెప్పా లని చంద్రబాబు డిమాండ్ చేశారు. తాము ఇంటి వద్ద దింపే క్రమంలో దారి తప్పాము అంటూ పోలీసులు టిడిపి నేతలకు చెప్పగా చంద్రబాబు మరింత ఆగ్రహానికి లోనయ్యారు.తన నివాసం తెలియకపోవటం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తొందని చెపారు. ఈ విషయమై గుంటూరు ఐజీతో మాట్లాడారు జరిగిన ఘటన పట్ల పోలీసులు విచారం వ్యక్తం చేసి క్షమాపణ లు చెప్పడంతో చంద్రబాబు ఎమ్మెల్యే లు శాంతించారు. మొత్తం మీద అర్ధరాత్రి 12:30 నిమిషాలకు చంద్రబాబు తన నివాసానికి చేరుకున్నారు.

3 రాజధానులు... 25 జిల్లాలు... వికేంద్రీకరణే లక్ష్యం...

అమరావతి రైతులు, మహిళలు వద్దంటున్నా... విపక్షాలు  వ్యతిరేకిస్తున్నా... తాననుకున్న మూడు రాజధానుల ఏర్పాటుకు ముందడుగు వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... కొత్త జిల్లాల ఏర్పాటుపైనా క్లారిటీ ఇచ్చారు. మంత్రివర్గ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించిన సీఎం జగన్... మంత్రుల అభిప్రాయాలను తీసుకున్నారు. లోక్ సభ నియోజకవర్గాల వారీగా 25 జిల్లాల ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. అయితే, ముందుగా ప్రాంతీయ ప్రణాళికా మండళ్లను ఏర్పాటు చేద్దామని, ఆ తర్వాతే కొత్త జిల్లాల అంశాన్ని పరిశీలిద్దామని మంత్రివర్గ సహచరులకు సీఎం జగన్ సూచించారు. అంతేకాదు, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వచ్చే ఏడాది చేపడదామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. అయితే, పోలీస్ శాఖలో రేంజ్ లు ఉన్నట్లుగా, కలెక్టర్లకూ ప్రాంతీయ స్థాయిలో ఒక విధానం ఉండాలన్న ఆలోచనతోనే ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ముందుగా నాలుగు కమిషననరేట్లు ఏర్పాటుచేసి పాలనను వికేంద్రీకరిద్దామని, ఆ తర్వాత వచ్చే ఏడాది కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిద్దామని మంత్రివర్గ సహచరులకు సీఎం జగన్ వివరించారు.

అట్టుడుకుతున్న అమరావతి... స్తంభించిన జనజీవనం... 

మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. 35రోజులుగా నిరసనలు తెలుపుతున్న అమరావతి ప్రజలు ఇవాళ బంద్ నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా రైతులు, మహిళలపై పోలీసుల లాఠీఛార్జికి నిరసనగా బంద్ కి పిలుపునిచ్చారు. దాంతో అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రైతులు, మహిళలకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. అలాగే, పోలీసులకు పూర్తిగా సహాయ నిరాకరణకు అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. మంచినీళ్లలోపాటు ఎలాంటి ఆహార్ధాలను విక్రయించకూడదని, ఇవ్వకూడదని అమరావతి గ్రామాల వ్యాపారులు, ప్రజలు నిర్ణయించారు. ఇక, మూడు రాజధానుల ఏర్పాటును నిరసిస్తూ కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. శాసనసభలో బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన తమ పోరాటం ఆగదని అమరావతి పరిరక్షణ సమితి, అలాగే రైతులు, మహిళలు తేల్చిచెప్పారు. అమరావతి రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. అమరావతి రైతులు తమ అభిప్రాయాలు చెప్పే అవకాశాన్ని హైకోర్టు ఇచ్చినా పట్టించుకోకుండా మూడు రాజధానుల బిల్లును ఎలా ఆమోదిస్తారని రైతులు ప్రశ్నించారు. వీటన్నింటికీ జగన్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుందని రైతులు హెచ్చరించారు. అయితే, అమరావతి పరిధిలోని అన్ని గ్రామాల్లో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. ఎక్కడికక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరోసారి రైతులు... అసెంబ్లీని ముట్టడించే అవకాశముందని భావిస్తున్న పోలీసులు.... నలువైపులా మోహరించారు. సచివాలయానికి వెళ్లే మల్కాపురం జంక్షన్ దగ్గర పెద్దఎత్తున బలగాలను పెట్టారు. అలాగే, సచివాలయం వెనుక వైపు కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

పోలీసుల దౌర్జన్యకాండ... అమరావతి పొలాల్లో ఘోరం...

అమరావతి రణరంగాన్ని తలపిస్తోంది. పోలీసుల దౌర్జన్యాలతో 29 గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ నెలరోజులకు పైగా ఆందోళనలు చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు విచక్షణారహితంగా విరుచుకుపడుతున్నారు. అమరావతి కోసం తరలివస్తోన్న రైతులు, మహిళలు, పిల్లలపై పోలీసులు దాష్టీకానికి పాల్పడుతున్నారు. లాఠీలతో గొడ్డును బాదినట్లు బాదేస్తున్నారు. దాంతో, పలువురు రైతులు, వృద్ధులు, మహిళలకి రక్తం కారేలా గాయపడుతున్నారు. ఇక, ఛలో అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అమరావతి పొలాలు యుద్ధ రంగాన్ని తలపించాయి. ఆంక్షలను సైతం లెక్కచేయకుండా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన అమరావతి ప్రజలపై పోలీసులు విరుచుకుపడ్డారు. దొరికినవాళ్లను దొరికినట్లు చితక్కొట్టారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పొలాల్లోనే తరిమితరిమి కొట్టారు. మహిళలు, వృద్ధులని చూడకుండా విచక్షణారహితంగా దాడి చేశారు. లాఠీలు విరిగేలా కసితీరా కొట్టారు. పిడిగుద్దులు గుద్దారు. అంతేకాదు పలువురు బట్టలు చింపేశారు. మహిళలనైతే ఈడ్చిపడేశారు. దాంతో, వందలాది మంది రైతులు, వృద్ధులు, మహిళలు, యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల దౌర్జన్యంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక అమరావతి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తుళ్లూరు, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, దొండపాడు, ఉద్దండరాయునిపాలెం, మందడం తదితర గ్రామాల్లో అయితే పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. వేల సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఎవరైనా అసెంబ్లీ వైపు వస్తున్నట్లు కనిపిస్తే చాలు తరిమితరిమి కొడుతున్నారు. అయితే, రక్తమోడినా, తీవ్ర గాయాలైనా, అమరావతి రైతులు, మహిళలు, వృద్ధులు, యువకుల పట్టుదల ముందు పోలీసుల ఆంక్షలు ఓడిపోతున్నాయి. అమరావతిని రక్షించుకునేందుకు ప్రాణాలను సైతం ఫణంగా పెడుతూ ముందుకు కదులుతోన్న రైతులు, మహిళలను చూసి పోలీసులు సైతం బిక్కమొహం చేస్తున్నారు.

గల్లా జయదేవ్ పై పోలీసుల దౌర్జన్యం... అర్ధరాత్రి వరకు నరకం చూపిస్తూ... చివరికి సబ్ జైలుకు...

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అమరావతి పరిరక్షణ సమితి పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న గల్లా జయదేవ్ పై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. నిషేధాజ్ఞలను దాటుకుని అసెంబ్లీ వైపు వచ్చిన గల్లా జయదేవ్ పై పోలీసులు విరుచుకుపడ్డారు. దాంతో, పోలీసులు-గల్లా జయదేవ్ మధ్య పెనుగులాట జరిగింది. ఈ పెనుగులాటలో గల్లా జయదేవ్ చొక్కా సైతం చిరిగిపోయింది. అయితే, గల్లా జయదేవ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు... దుగ్గిరాల, పెదకాకాని, గుంటూరు మీదుగా నర్సరావుపేట, రొంపిచర్ల పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఇబ్బంది పెట్టారు. అంతేకాదు చిరిగిపోయిన చొక్కా మార్చుకునేందుకు కూడా ఇబ్బందులు పెట్టారు. దాంతో, పోలీస్ స్టేషన్లో చిరిగిన చొక్కా విప్పి జయదేవ్ నిరసన తెలిపారు. ఆ తర్వాత రొంపిచర్ల పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు తీసుకొచ్చిన పోలీసులు.... అర్ధరాత్రి వరకూ పోలీస్ వాహనంలోనే కూర్చోబెట్టి నరకం చూపించారు.  అయితే, నిషేధాజ్ఞలను దాటుకుని అసెంబ్లీ వైపు వచ్చిన గల్లా జయదేవ్ పై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. దాంతో, జయదేవ్ ను అర్ధరాత్రి మంగళగిరి మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి తెల్లవారుజామున గుంటూరు సబ్ జైలుకు తరలించారు. అయితే, గల్లా జయదేవ్ పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడమే కాకుండా, సబ్ జైలుకు తరలించారన్న విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు, ఆయన అనుచరులు పెద్దఎత్తున జైలు దగ్గరకు చేరుకుని ఆందోళన చేస్తున్నారు. నిరసన తెలిపే కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే, గల్లా జయదేవ్‌తోపాటు పలువురు రైతులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ విజయరావు తెలిపారు. జయదేవ్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో... పోలీసులపై రాళ్లు రువ్వారని... దాంతో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని ఎస్పీ వివరించారు.

చేతులెత్తి వేడుకుంటున్నా... అమరావతిని మార్చొద్దు....

మూడు రాజధానుల బిల్లును టీడీపీ అధినేత, అపోజిషన్ లీడర్ చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ సీఎం జగన్ కు చేతులెత్తి వేడుకున్నారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానిని మార్చుకుంటూ వెళితే రాష్ట్రానికి మంచిది కాదని సూచించారు. అయితే, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై సీఎం జగన్ మాట్లాడుతుండగా ప్రసంగానికి ఆటంకం కలిగించిన టీడీపీ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటేశారు. దాంతో, చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక చీకటి రోజంటూ మండిపడ్డారు. అయితే, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో గాయపడ్డ అమరావతి రైతులను పరామర్శించేందుకు ప్రయత్నించిన టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతులకు సంఘీభావంగా పాదయాత్రగా వెళ్తున్న చంద్రబాబును అదుపులోకి తీసుకుని పీఎస్ కి తరలించారు. దాంతో, అర్ధరాత్రి కూడా అమరావతి గ్రామాల్లో అలజడి కొనసాగింది. అమరావతి పోరాటం ఇంతటితో ఆగదని చంద్రబాబు అన్నారు. ఏపీని కాపాడుకోవడం కోసం సేవ్ ఆంధ్రప్రదేశ్-సేవ్ అమరావతి ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. టీడీపీ నేతలు, అమరావతి రైతులపై పోలీసుల దౌర్జన్యంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ చంద్రబాబు... అక్రమ కేసులతో హింసిస్తున్నారని ఆరోపించారు.

మాట నెగ్గించుకున్న జగన్... 3 రాజధానుల బిల్లు ఆమోదం...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాననుకున్న మాటే నెగ్గించుకున్నారు. నెల రోజులకు పైగా అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్నా, విపక్షాలు వద్దంటున్నా వినిపించుకోకుండా... మూడు రాజధానుల బిల్లును ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించుకున్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్... అమరావతిలో శాసన రాజధాని... కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్... ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి-పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. మూడు రాజధానుల ఏర్పాటుపై అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశపర్చిన జగన్ ప్రభుత్వం... శాసనసభలో సుదీర్ఘంగా చర్చించింది. రాత్రి 11గంటల వరవకు శాసనసభను నిర్వహించిన ప్రభుత్వం.... సుదీర్ఘ చర్చల తర్వాత ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ, అలాగే సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సహా అధికార పార్టీ సభ్యుల హర్షధ్వానాల మధ్య ఈ బిల్లులు ఆమోదం పొందాయి. స్పీకర్‌ తమ్మినేని సీతారాం కూడా చారిత్రాత్మక బిల్లులంటూ కొనియాడారు. రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకమైన బిల్లును ప్రవేశపెట్టి సభకు పరిచయం చేసే అవకాశం దక్కడం తన అదృష్టమన్నారు.  

పవన్ ని లెక్కచేయని రాపాక.. జగన్ కి జై కొట్టి, పక్కన కూర్చొని కబుర్లు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ షాకిచ్చారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు వ్యతిరేకంగా అసెంబ్లీ ఓటు వేయాలని పార్టీ అధ్యక్షుడిగా పవన్ చెప్పినా.. రాపాక ఆయన మాటలను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇప్పటికే మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాని ప్రకటించిన రాపాక.. అసెంబ్లీలో కూడా అదే విషయం చెప్పారు.  అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉంటూ అధికార పార్టీ చేసే ప్రతిదానిని వ్యతిరేకించడం కరెక్టు కాదని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి అంతా ఒకే చోట ఉంటే ఎలా ఉంటుందో రాష్ట్ర పునర్విభజన తర్వాత తెలిసిందని, అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు. మూడు రాజధానులకు ఎవరూ వ్యతిరేకంగా లేరని, అందరూ అనుకూలంగానే ఉన్నారని అభిప్రాయపడ్డారు. సీఆర్డీఏ బిల్లు రద్దుకు జనసేన పార్టీ తరఫున మద్దతు తెలుపుతున్నానని, సీఎం జగన్ ని అభినందిస్తున్నానని అన్నారు. అంతేకాదు, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. అసెంబ్లీలో రాపాక నేరుగా వెళ్లి సీఎం జగన్ పక్కనే కూర్చున్నారు. ఆయనతో కాసేపు ఏదో విషయమై చర్చించారు. తరువాత తన స్థానానికి వెళ్లి కూర్చొన్నారు. మొత్తానికి తన పార్టీ తరఫున ఉన్న ఒక్క ఎమ్మెల్యే పవన్ ని తెగ ఇబ్బంది పెడుతున్నాడనే చెప్పాలి.

రాజధాని నిర్ణయంతో నా భవిష్యత్ నాశనమైనా పర్లేదు.. పొలం పని చేస్కుంటా!!

ఏపీ అసెంబ్లీలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల నిర్ణయంతో తన రాజకీయ భవిష్యత్ నాశనం అయిపోయినా తాను వైఎస్ జగన్ వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. సీఆర్డీఏ రద్దు, అధికార-అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను స్వాగతిస్తున్నట్టు ఆర్కే తెలిపారు. ఈ మూడు రాజధానుల ప్రకటనతో తనకి రాజకీయ భవిష్యత్ ఉన్నా లేకపోయినా జగన్ వెంట నడుస్తానని అన్నారు. రాజకీయాల్లో ఉంటే జగన్ వెంటే ఉంటా. రాజకీయాల్లో లేకపోతే నా పొలంలో ఉంటానని ఆర్కే స్పష్టం చేశారు. అసెంబ్లీ అమరావతిలోనే ఉంటుందని సీఎం ప్రకటించడం తమ అదృష్టమని, అమరావతికి దక్కిన గౌరవమని ఆర్కే అన్నారు. సెక్రటేరియట్ తో సామాన్యులకు పని ఉండదని చెప్పుకొచ్చారు. రాజధాని అంటే అందరిదని, కొందరిది మాత్రమే కాకూడదని అన్నారు. రైతులు కోరుకుంటే భూములను తిరిగి ఇవ్వాలని, అమరావతిని అగ్రికల్చర్ జోన్ గా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు ఆర్కే తెలిపారు. చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు తాము ఎంతో సంతోషించామని అన్నారు. అయితే, దాని వెనుక ఎంతో స్కామ్ జరిగిందని తెలిసి తాను ఎంతో బాధపడ్డానని ఆర్కే చెప్పారు. ప్రజలకు చంద్రబాబు అవాస్తవాలు చెబుతున్నారని, రైతుల ఆశలను ఆయన నీరు గార్చారని మండిపడ్డారు. తన స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారని విమర్శించారు. రాజధాని కోసం చంద్రబాబు కష్టపడి ఉంటే తాడేపల్లి, మంగళగిరి నియోజకవర్గాల్లో ప్రజలు ఎందుకు టీడీపీని ఓడించారని ఆర్కే ప్రశ్నించారు.

విమర్శల వర్షం... మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో జోరు అందుకున్న నేతల మాటలు

  తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలని అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పటిలానే పోటీపడుతున్నాయి. ఈ సారి బీజేపీ కూడా పోటీలో ఉంది. మునిసిపాలిటీలో తమ పార్టీని అధికారంలోకి తెచ్చుకునేందుకు ఎవరికి వారు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ప్రచారానికి మరి కొన్ని గంటల్లో గడువు ముగుస్తుండడంతో ముఖ్య నాయకులు కూడా రంగం లోకి దిగుతున్నారు. అధికార పార్టీ మంత్రులు కూడా నియోజకవర్గాల్లోని మునిసిపాలిటీలకు పరిమితమయ్యారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ శివారు మునిసిపాల్టీల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకరి పై ఒకరు మాటల తూటాలు విసురుతున్నారు. మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీలు దారం తెగిన గాలిపటాలన్న ఆయన 57 ఏళ్లు నిండిన వారందరికీ త్వరలోనే పెన్షన్ ఇస్తామన్నారు. కాంగ్రెస్ డీల్లీలో లేదు.. గల్లీల్లో లేదు.. అలాంటి పార్టీకి ఓట్లేసి ప్రయోజనం లేదని విమర్శించారు.టీఆర్ఎస్ అధికారం లోకి వచ్చిన తర్వాత మునిసిపాలిటీలకు ఒరిగిందేమి లేదన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్టీ నాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు, నల్గొండ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. మునిసిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఫెయిలయ్యారని ఆరోపించారు. మరోవైపు రాష్ర్టానికి కేంద్రం నిధులేవి ఇవ్వలేదన్న ఆరోపణలను ఖండించారు కిషనరెడ్డి, కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయే తెలంగాణ సర్కార్ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరి కొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారానికి తెర పడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ తమ అస్త్ర శస్త్రాలకు పదునుపెట్టాయి. అందరూ ఎవరికి వారు తమదే గెలుపని అనుకుంటున్నారు.. ఇక ప్రజల తీర్పే మిగిలి ఉంది.

ఈ మనిషికి నిద్ర ఎలా పడుతోంది?.. జగన్ పై ఫైర్!!

రాజధాని అంశంతో ఏపీ వాతావరణం వేడెక్కింది. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం బిల్లు ప్రవేశ పెట్టడంతో.. రాజధాని ఉద్యమం మరింత ఉధృతమైంది. రైతులు, మహిళలు.. అరెస్టులు, లాఠీ దెబ్బలు లెక్కచేయకుండా.. పోరాడుతున్నారు. ప్రస్తుతం అమరావతి ఆందోళనతో అట్టుడుకుతోంది. అయితే రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంటే.. సీఎం వైఎస్ జగన్ మాత్రం అసెంబ్లీలో ప్రశాంతంగా నిద్ర పోతున్నారంటూ.. టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. "ఓ పక్క రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు రోడ్డెక్కి అసెంబ్లీని ముట్టడిస్తుంటే... మరో పక్క రాష్ట్రం మొత్తం టీవీలు చూస్తుంటే... ఈ మనిషికి ఇలా ఎలా నిద్రపడుతోంది?" అని లోకేష్ మండిపడ్డారు.

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. ఎంపీ గల్లాని చొక్కా పట్టి లాగి అరెస్ట్!!

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. రైతులు అసెంబ్లీ కాంప్లెక్స్‌ను నలువైపులా చుట్టుముట్టారు. పోలీసుల ఆంక్షలు లెక్కచేయకుండా దూసుకెళ్లేందుకు రైతులు యత్నించారు. దీంతో పోలీసులు రైతులపై లాఠీఛార్జ్ కూడా చేశారు. ఈ క్రమంలో రైతులకు మద్దతుగా వచ్చిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై కూడా పోలీసులు దాడికి దిగారు. గల్లా చొక్కాను చించారు. గల్లాను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో పోలీసులు ఆయనను లాగడంతో ఆయన చొక్కా చిరిగిపోయింది. దీంతో పోలీసుల తీరుపై గల్లా జయదేవ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని అన్నారు. మహిళలను విచక్షణారహితంగా పోలీసులు కొడుతున్నారని మండిపడ్డారు. పోలీసులు తమ పోరాటాన్ని ఆపలేరని గల్లా స్పష్టం చేశారు.

లోకేష్ ఫైర్.. అమరావతిని పాకిస్థాన్ బోర్డర్ చేసిన వైసీపీ ప్రభుత్వం

అమరావతి రాజధాని తరలింపు పై ప్రభుత్వానికి ఇంత పట్టుదల ఎందుకని.. ఇంటికి పది మంది పోలీసులు కాపలాగా ఉండటం తగదని.. అధికార పార్టీ పై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు మాజీ మంత్రి నారా లోకేష్. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన వరుస ట్వీట్ లు చేశారు. ఈ రోజున పాకిస్థాన్ బోర్డర్ ను తలపించేటువంటి రీతిలో అమరావతిని మార్చారని ప్రధానంగా లోకేష్ విమర్శించారు.పెద్ద ఎత్తున రైతులు, రైతు కూలీలు, మహిళలు రోడ్ల పైకి వచ్చి పెద్ద ఎత్తున ఒక రాష్ట్రం ఒక రాజధాని జై అమరావతి అని చాలా రోజుల నుంచి నిరసనలు చేస్తున్నారని దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని లోకేష్ తెలియజేశారు. 2014 లో హైదరాబాద్ లో జరిగిన శాసన సభలో జగన్ మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిని రాజధానిగా అంగీకరించి ఇప్పుడు నిరాకరించడం మంచిది కాదని లోకేష్ వెల్లడించారు.  జగన్ గారు అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యాలంటే ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు ఎక్కువ నిధులు కేటాయించాలి.. కానీ గత ఎనిమిది నెలలుగా ఆ ప్రాంతానికి కేటాయించింది సున్నా అని కేవలం ఒక్క పులివెందుల నియోజకవర్గానికే మూడు వేల కోట్లు కేటాయించం పట్ల లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతపూర్ కి కియా మోటార్స్ ని, చిత్తూరు జిల్లాకి సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలని తీసుకురావటం.. ఉభయ గోదావరి జిల్లాల్లో ఫిషరీస్ ని పెద్దెత్తున ప్రోత్సహించటం.. విశాఖపట్నంకి ఐటీ పరిశ్రమలను తీసుకురావటం.. ఒక పెద్ద పేపర్ ఇండస్ట్రీ అయిన ఏషియన్ పేపర్ ను ప్రకాశం జిల్లాకు తీసుకురావటం ఇవన్నీ అభివృద్ధి వికేంద్రీకరణ చర్యలుగా ప్రభుత్వానికి కనిపించలేదా అని లోకేష్ నిలదీశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగిందంటే కేవలం తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. అవగాహన లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అభివృద్ధి కొరకై వచ్చిన పరిశ్రమలను పంపిస్తే అభివృద్ధి వికేంద్రీకరణ ఎక్కడ జరుగుతుందని లోకేష్ ఆరోపించారు.