నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్లు ఒకే నమూనాలో కాలనీలు

పేదలకు వచ్చే నాలుగేళ్లలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన 30 లక్షల ఇళ్ల డిజైన్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. బెడ్‌రూం, కిచెన్,పెద్ద హాలు, వరండా, టాయిలెట్‌ సదుపాయాలతో ఈ ఇళ్లను నిర్మించడానికి సమాయత్తమవుతోంది. గృహనిర్మాణంపై సమీక్ష సందర్భంగా పేదలకు కట్టించనున్న ఇంటి డిజైన్‌పై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. తాము రూపొందించిన డిజైన్లను ముఖ్యమంత్రి ముందు ఉంచారు. పేదలకు నిర్మించి ఇచ్చే ఇళ్లు అత్యంత నాణ్యంగా, ఆకర్షణీయంగా ఉండాలని స్పష్టంచేశారు. ఇంటి డిజైన్‌లో భాగంగా ఏం ఇవ్వబోతున్నామో అడిగి తెలుసుకున్నారు. బెడ్‌రూం, కిచెన్, హాలు, వరండా, టాయిలెట్‌లను డిజైన్‌లో పొందుపరిచామని అధికారులు తెలిపారు. గాలి, వెలుతురు ధారాళంగా ఉండేలా డిజైన్‌ రూపకల్పనలో జాగ్రత్తలు పాటించామన్నారు. వీటికి సీఎం కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు. నాణ్యత విషయంలో రాజీపడరాదని మరోమారు స్పష్టంచేశారు. సంవత్సరానికో 6.5 లక్షల ఇళ్ల చొప్పున నిర్మించడానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. ఈ ఇళ్ల నిర్మాణం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీల్లో పచ్చదనం, పరిశుభ్రత, కరెంటు సౌకర్యం లాంటి కనీస వసతుల ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టిసారించింది. కాలనీలన్నీ మార్గదర్శకంగా ఉండేలా చర్యలను తీసుకుంటున్నారు.

ఇప్పటి వరకూ ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసూ నమోదు కాలేదు

కరోన వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కొవిడ్ 19 నియంత్రణ కు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. ఇప్పటి వరకూ ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసూ నమోదు కాలేదు. అధిక ధరలకు మాస్క్ లు గానీ , మందులుగానీ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. లైసెన్స్ లు కూడా రద్దు చేస్తాం. మెడికల్ షాపులపై దాడుల్ని కొనసాగిస్తాం వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి హెచ్చ‌రించారు. డ్రగ్స్ డిజి ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్స్ పెక్టర్లు 382 మెడికల్ షాపులపై దాడులు చేశారని ఆయ‌న చెప్పారు. కొవిడ్ 19 ప్రభావిత దేశాల నుండి ఏపీకి వచ్చిన 378 మంది ప్రయాణికులు వైద్యుల పరిశీలనలో ఉన్నారు 153 మంది ఇళ్లల్లోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారు. 218 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురి ఆరోగ్యపరిస్థితి స్థిమితంగా ఉంది. 27 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 20 మందికి నెగటివ్ అని తేలింది. ఏడుగురి శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. కొవిడ్ 19 ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికొచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టాం. విమానాశ్రయాలు, ఓడ రేవుల్లో స్క్రీనింగ్ చేస్తున్నాం. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. కొవిడ్ 19 లక్షణాలేమైనా ఉంటే తక్షణం మాస్క్ ను ధరించాలని, కరోనా వైరస్(కొవిడ్19) విషయంలో ఆందోళన చెందొద్దు. వదంతులు, నిరాధార ప్రచారాన్ని విశ్వసించవద్దని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. కొవిడ్ 19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలి వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ నంబరు సంప్ర‌దించ‌వ‌చ్చు.

ఆర్టీసీ లో 5000 మంది అప్రెంటిస్ లకు అవకాశం

ఎ.పి.ఎస్‌.ఆర్‌ట‌.టి.సి. 4జోన్ల (విజయనగరం, విజయవాడ, కడప, నెల్లూరు జోన్ల) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ శ్రీ ఏ. కోటేశ్వర రావు ఈ మేరకు 03-03-2020న ఆదేశాలు జారీ చేశారు. వివిధ జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఈ మేరకు నోటిఫికేషన్లు జారీ చేసి తదుపరి సమాయత్తం కావలసిందిగా కూడా ఆదేశాలు జారీచేయబడినవి. మార్చి 7 వతేది లోపు నోటిఫికేషన్లు వెలువరిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఏప్రిల్ 15వ తేదీ లోగా పూర్తి చేయనున్నారు. అర్హత కలిగిన ఐ.టి.ఐ అభ్యర్థులు తమ తమ దరఖాస్తులను www.apprenticeship.gov.in వెబ్సైట్ నందు అప్ లోడ్ చేయవలసి ఉంటుంది. ఇందుకు గడువు తేదీ 21-03-2020. దరఖాస్తు చేస్తుకున్న అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన సంబంధిత జోన్ల శిక్షణా కళాశాలల కమిటీలు ఏప్రిల్ 9వ తేదీన జరుపుతారు. ఏప్రిల్ 13వ తేదీన ఎంపిక అయిన అభ్యర్థుల జాబితా ప్రకటించడం జరుగుతుంది. కాగా ఎంపికైన అభ్యర్థులను ఏప్రిల్ 15 న రీజియన్ /వర్కుషాపులకు కేటాయిస్తారు. సంస్థ 2017 నుండి ప్రతి ఏడాది 1390 మంది ఐ.టి.ఐ అర్హత కలిగిన అభ్యర్థులను అప్రెంటిస్ లుగా నియామకం జరుపుతోంది. కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న కాంట్రిబ్యూషన్ రూ.1500/- , సంస్థ కాంట్రిబ్యూషన్ రూ.5431/-కలిపి మొత్తంగా ఒక్కొక్కరికీ రూ.6931/- చొప్పున వీరందరికీ ఏడాదికి సుమారు 9.06 కోట్ల మొత్తం స్టైపండ్ రూపంలో చెల్లిస్తున్నది. అంటే మొత్తంగా 5000 మందిని అప్రెంటిస్ లుగా తీసుకోవడం వలన సంస్థ ఇంకా అదనంగా రూ.25 కోట్ల మొత్తం స్టైపెండ్ రూపంలో వెచ్చించనున్నది. సంస్థ వి.సి అండ్ ఎం.డి మాదిరెడ్డి ప్రతాప్, ఇటీవల డిపోల పర్యటనలు జరిపారు. డిపో గ్యారేజీలలో మరియు వర్క్ షాపులలో పనిచేస్తున్న అప్రెంటిస్ ల ప‌నితీరును మెచ్చుకున్నారు. కేవలం తమ విధులు మాత్రమే కాకుండా సంస్థకు పనికి వచ్చే పలు విధాలైన నైపుణ్యాలను చూపుతూ సంస్థ కోసం ఇతోధికంగా కృషి చేస్తున్నట్లు గమనించారు. ఈ నేప‌థ్యంలో అప్రెంటిస్ ల సేవలను మరింతగా ఉపయోగించుకోవడంలో భాగంగా ఎం.డి ఆదేశాల మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నందు మరో 5,000 అప్రెంటిస్ ల నియామకానికి చర్యలు ప్రారంభమయ్యాయి.

టెన్త్ విద్యార్ధులకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టెంత్ విద్యార్ధినీ, విద్యార్ధులకు షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోసం పదో తరగతి పరీక్షలు వాయిదా వేసి ఈసీ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌ను బట్టి పరీక్షల తేదీలను ఖరారు చేశారు. ఏపీలో పదవతరగతి పరీక్షల కొత్త టైంటేబుల్  ఎస్ఎస్సీ బోర్డు  విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. యధావిధిగా అయితే ఇంటర్ పరీక్షలు తర్వాత టెన్త్ పరీక్షలు మొదలుకావాల్సి ఉంది. కానీ ఇంటర్ తరువాత ఎన్నికల వ్యవహారాన్ని చక్కబెట్టి ఏప్రిల్ నెలలో టెన్త్ పరీక్షలకు వెళ్లాలని ప్రభుత్వం భావించింది. ఏపీలో టెన్త్‌ పరీక్షల కొత్త షెడ్యూల్‌ ఈ విధంగా ఉంటుంది. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 17 వరకు టెన్త్‌ పరీక్షలు జరుగుతాయి. ఉ.9:30 నుంచి మ.12:15 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 31న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, ఏప్రిల్‌ 1న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2, ఏప్రిల్‌ 3న సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌, ఏప్రిల్‌ 4న ఇంగ్లీష్‌ పేపర్‌-1, 6న ఇంగ్లీష్‌ పేపర్‌-2, ఏప్రిల్‌ 7న మ్యాథమేటిక్స్‌ పేపర్‌-1, 8న పేపర్‌ -2, ఏప్రిల్‌ 9న జనరల్‌ సైన్స్‌ పేపర్‌-1, 11న పేపర్‌-2 పరీక్ష వుంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం స్థానిక ఎన్నికలను ఎలాగయినా నిర్వహించాలని పట్టుదలగా ఉంది. దీనికి కారణం.. స్థానిక సంస్థల గడువు ముగిసి ఏడాది గడచిపోయింది. మార్చి 31 లోపు ఎన్నికలు నిర్వహించకపోతే రాష్ట్రానికి రావాల్సిన ఆర్థికసంఘం నిధులు వెనక్కి వెళ్లిపోతాయి. ఒకవేళ ఆలస్యంగా ఎన్నికలు జరిగి నిధులు రావాలంటే కేంద్రాన్ని కాళ్ళు, గడ్డాలు పట్టుకోవాల్సి వస్తుంది. అసలే జగన్ నిర్ణయాలతో కేంద్రంలో మంత్రులు ఆగ్రహంతో ఉండగా రాష్ట్రంలో చేతిలో ఉండగా వదిలేసి గడువు తర్వాత కేంద్రాన్ని బ్రతిమిలాడుకోవడం ఎందుకనుకుంటే ఈ నెలలో ఎన్నికలు జరిపి తీరాల్సిందే. ఇప్పుడు ఆర్ధిక సంఘం నిధులు రాష్ట్రానికి చాలా కీలకం అవసరం కూడా. అయితే పరీక్షల సమయానికి ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని స్పష్టంగా తెలుస్తోంది. స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోలేకపోయింది. పరీక్షలు.. ఎన్నికలను అంచనా వేయలేకపోయిది. ఫలితంగా రాష్ట్రంలోని ఏడు లక్షల మంది టెన్త్ విద్యార్థులకు నెల రోజుల పాటు టెన్షన్ మిగిలింది. ప్రతి విద్యార్థి టెన్త్ పరీక్షలు, ఫలితాలు జీవితంలో అత్యంత కీలకం. అలాంటి వారికి ప్రభుత్వం పెట్టిన పరీక్షగా ఈ పరిణామాన్ని చెప్పుకోవాలి. ప్రభుత్వం వ్యవహార శైలి చూస్తే ఇంటర్ పరీక్షలను కూడా వాయిదా వేసేది. కానీ ప్రభుత్వనికి ఆ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఇంటర్ పరీక్షలకు అనేక జాతీయ ప్రవేశ పరీక్షలకు లింకు ఉంటుంది. జాతీయ స్థాయి పరీక్షలకు, వాటి షెడ్యూల్ కు ముందే ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేయాల్సి ఉంటుంది. దీంతో ఇంటర్ పరీక్షలు జరిపించక తప్పలేదు. ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలకు వైసీపీ గ్రామకార్యకర్తలు అనబడే ఒక్క అర్హత కలిగిన గ్రామ వాలంటీర్లను ఇన్విజిలేషన్ కు నియమిస్తామని విద్యార్థుల వీపున జగన్ సర్కార్ బండ వేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పడు టెన్త్ పరీక్షలను ఒక నెల రోజులు పొడగించి విద్యార్థుల కీలకమైన జీవితంలో నెల రోజుల కాలాన్ని రాజకీయాల కోసం, ఎన్నికల కోసం పణంగా పెట్టిన ఘనత కూడా ఈ ప్రభుత్వమే దక్కించుకుంది.

రాజకీయనేతల ప్రవర్తనా నియ‌మావ‌ళిని విడుద‌ల చేసిన ఎన్నిక‌ల క‌మీష‌న్‌

స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో పోటీ చేసే అభ్య‌ర్థులు, పార్టీలు పాటించాల్సిన నియ‌మ నిబంధ‌న‌ల‌ను ఎన్నిక‌ల‌ కమిషన్ జారీ చేసింది. 1.ఎన్నిక‌ల్లో పోటీ చేసే పార్టీలు, నేతలు అభ్యర్థులు జాతి, కుల, మత, ప్రాంతీయపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్య‌వ‌హ‌రించ‌రాదు. ఇతర రాజకీయ పార్టీలను విమర్శించేటప్పుడు వాటి గత చరిత్రను, ఇంతకు ముందు పనితీరును మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలి. ప్రజా జీవితంతో సంబంధంలేని, వ్యక్తిగత దూషణలు చేయరాదు. 2.రాజకీయ ప్రకటనల ద్వారా కుల, మతపరమైన అభ్యర్థనలు చేయకూడదు. మసీదులు, చర్చిలు, దేవాలయాలు, ఇతర ప్రార్థన, పవిత్ర స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయ‌డం నిషేదం. 3.ఓటర్లకు లంచాలు ఇచ్చి ప్రలోభపెట్టడం, బెదిరించడం, ఒకరి స్థానంలో మరొకరిని ఓటరుగా వినియోగిస్తే శిక్ష త‌ప్ప‌దు. 4.పోలింగ్‌స్టేషన్‌కు 100 మీటర్ల పరిధిలో ప్రచారం చేయరాదు. 5.గడువు దాటాక కూడా ప్రచారం చేయడం, పోలింగ్ స్టేషన్‌కు ఓటర్లను తీసుకురావడం, తిరిగి తీసుకువెళ్లడం... వంటివి నిషిద్ధం. ప్రశాంత గృహ జీవితాన్ని గడిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. దానికి భంగం కలిగేలా ప్రవర్తించకూడదు. ప్రజల ఇళ్ల ముందు నిరసన ప్రదర్శనలు చేయడం, పికెటింగ్‌లు చేయడం వంటివి నిబంధనలకు విరుద్ధం. 6.అనుమతి లేకుండా ఇళ్లపై జెండాలు ఎగరవేయడం, బ్యానర్లు కట్టడం, గోడలపై నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించడం నిషిద్ధం. 7.పార్టీలు సభలు నిర్వహించాలనుకున్నప్పుడు ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. సభ నిర్వహణ ప్రదేశం, సమయం గురించి తప్పకుండా చెప్పాలి. దాన్ని బట్టి పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు. 8.సభలు, సమావేశాలు ఏర్పాటు చేయాలనుకునే చోట ఏమైనా నిషేధాజ్ఞలు ఉన్నాయా అని అభ్యర్థులు ముందుగానే తెలుసుకోవాలి. నిషేధా జ్ఞలు అమలయ్యే ప్రదేశాల్లోకి ప్రవేశించినప్పుడు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి 9.లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగానే అనుమతి తీసుకోవాలి. 10.సభలకు ఎవరైనా భంగం కలిగించేలా ప్రవర్తిస్తే... నిర్వాహకులు వారిపై నేరుగా దాడులకు పాల్పడకూడదు. పోలీసులకు సమాచారం అందించాలి. 11. పార్టీలు.. ఊరేగింపులకు అధికారుల నుంచి ముందుగా అనుమతి పొందాలి. ఎప్పుడు మొదలవుతుంది? ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఏ మార్గం గుండా వెళుతుంది? తదితర వివరాలన్నీ ముందే సమర్పించాలి. ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకూ అందించాలి. దాన్నిబట్టి వారు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు. 12.ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఊరేగింపు పొడవుగా ఉంటే, దాన్ని మధ్యలో విడగొట్టి కూడళ్ల వద్ద ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూడాలి. 13.సమావేశాలు, ఊరేగింపులకు ఇతర పార్టీల నాయకులు, వారి అనుచరులు వాటికి భంగం కలిగించకూడదు. నిలదీయకూడదు. కరపత్రాలు పంచరాదు. 14.ఒకపార్టీ వేసిన పోస్టర్లను వేరే పార్టీ వారు తొలగించకూడదు. 15.రెండు అంత కంటే ఎక్కువ పార్టీలు ఒకేదారిలో ఒకే సమయంలో ఊరేగింపు నిర్వహించాలనుకుంటే... ముందుగానే పోలీసులను సంప్రదించాలి. ఊరేగింపులు ఎదురెదురుగా రాకుండా, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారు. 16.ఊరేంగింపులో మూడు కంటే ఎక్కువ వాహనాలు వాడితే ఎన్నికల వ్యయంలో చూపించాలి. 17. పోలింగ్ రోజున ఓటర్లు ప్రశాంతంగా, ప్రజాస్వామికంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలు కల్పించాలి. అన్ని పార్టీల నేతలు ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు సహకరించాలి. 18.పోలింగ్ బూత్‌లలో కూర్చునే పార్టీల ప్రతినిధులకు అధికార గుర్తింపు కార్డులు విధిగా అందజేయాలి. వీటిపై పార్టీల గుర్తులు, పేర్లు ఉండకూడదు. 19.ఎన్నికలకు 48 గంటలకు ముందుగా ప్రచారం చేయకూడదు. ప్రచార రూపంలో ఎస్ఎంఎస్‌లు కూడా నిషేధం. 20.పోలింగ్‌రోజు, అంతకు 24 గంటల ముందు మద్యం పంపిణీ చేయకూడదు. 21.అభ్యర్థులు, వారి అనుచరులు పోలింగ్‌బూత్‌ల సమీపంలో ఏర్పాటుచేసే శిబిరాల్లో పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉండకూడదు. 22.శిబిరాల్లో పోస్టర్లు, జెండాలు, గుర్తులు, ఇంకా ఇతర ఎన్నికల సామాగ్రి ఏమీ ఉండకూడదు. తినుబండారాలను కూడా పంపిణీ చేయకూడదు. అలాగే అధికార పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. పార్టీ పనులకు పాలన యంత్రాగాన్ని వినియోగించుకోకూడదు. అధికార పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండూ కలిపి ఉండకూడదు. సి.ఎం.తో సహా ఎవరైనా సరే హెలికాప్టర్‌తోపాటు ఇతర ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు. ఇంటి నుంచి కార్యాలయానికి, కార్యాలయం నుంచి ఇంటికి తప్ప మరే ఇతర పనులకు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు. సెక్యూరిటీ వాహనాల్లోనూ మూడు కంటే ఎక్కువ వాడితే దాన్ని ఎన్నికల వ్యయం కింద సంబంధిత పార్టీ చూపించాలి. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ వసతి గృహాలు, సభాస్థలిలు, హెలిప్యాడ్‌లు... తదితర సౌకర్యాలను కేవలం అధికారపార్టీ వారి వినియోగానికే కాకుండా ఇతర పార్టీలకూ అవకాశం కల్పించాలి. పత్రికల్లో, టీవీల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ప్రకటనలు ఇవ్వకూడదు. టీవీల్లో ప్రకటనలు ఇచ్చే ముందు దానికి సంబంధించిన సీడీని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీకి చూపించి, అనుమతి పొందాలి. ఎన్నికల నియమావళి వెలువడ్డాక ఎలాంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయకూడదు.కొత్త పథకాలు ప్రకటించకూడదు. శంకుస్థాపనలు చేయకూడదు.రహదారుల నిర్మాణం, తాగునీటి వసతులపై హామీలు ఇవ్వకూడదు.

మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు పై ఛార్జ్ షీట్ దాఖలుకు కేంద్రం ఆదేశం

చీఫ్ సెక్రెటరీ కి లేఖ రాసిన కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏ బీ వెంకటేశ్వర రావు వ్యవహారం శనివారం మరో మలుపు తిరిగింది. అనూహ్యం గా , కేంద్ర హోమ్ శాఖ...రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తూ, ఏ బీ వీ పై ఏప్రిల్ 7 లోగా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా, ఏ బీ వెంకటేశ్వర రావు ను సస్పెండ్ చేస్తూ ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోమ్ శాఖ ఖరారు చేసింది. ఏ బీ వీ తప్పిదాలకు పాల్పడినట్టుగా ప్రాధమిక ఆధారాలు లభ్యమైనట్టు, ఏరోసాట్, యు వీ ఏ ల కొనుగోలు కోసం వెచ్చించిన 25. 5 కోట్ల రూపాయల వ్యవహారం లో భారీ అక్రమాలు జరిగినట్టు కేంద్ర హోమ్ శాఖ గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారం తో, ఆంద్ర ప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే, ఏ బీ వీ వ్యవహారం ఈ స్థాయి వరకూ వెళ్తుందని ఎవరూ ఊహించకపోవటం ఒక కారణమైతే, రాష్ట్ర ప్రభుత్వం ఏ బీ ఎపిసోడ్ లో తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేయటం  ద్వారా -చంద్రబాబు నాయుడు తో స్నేహానికి తాము సిద్ధంగా లేమనే సంకేతాన్ని కేంద్రం పంపించినట్టయిందని విశ్లేషకులు అంటున్నారు. నిరుడు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో అక్రమాలకూ పాల్పడుతున్నారంటూ --ఏబి వెంక‌టేశ్వ‌ర రావు పై వైసిపి నేత‌లు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు చేసిన విషయం అందరికీ తెలిసిందే . ఫ‌లితంగా ఆయ‌న్ను ఎన్నిక‌ల విధుల నుండి త‌ప్పిస్తూ ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. టిడిపి ప్ర‌భుత్వం లో ఇంట‌లిజెన్స్ చీఫ్ గా ప‌ని చేసిన ఏబి వెంక‌టేశ్వ‌ర రావు పై చాలా కాలంగా వైసిపి దృష్టి సారించింది. అందునా వైసిపి రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య సాయిరెడ్డి అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తీ సంద‌ర్భంలోనూ ఏబి వెంక‌టేశ్వ‌ర రావు పై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. నంద్యాల ఎన్నిక‌ల స‌మమం నుండి నిరుడు సాధారణ  ఎన్నిక‌ల వ‌ర‌కూ ఏబి వెంక‌టేశ్వ‌ర‌రావు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కు మ‌ద్ద‌తుగా పార్టీ నేత‌గా ప‌ని చేస్తున్నార‌నేది వైసిపి నేత‌ల ఆరోప‌ణ‌. ఇక‌, నిరుటి  ఎన్నిక‌ల స‌మ‌యంలో టిడిపి కోసం ఇంట‌లిజెన్స్ చీఫ్ అనైతికంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ వైసిపి నేత‌లు నేరుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసారు. దీంతో..ఇంట‌లిజెన్స్ చీఫ్ ను ఎన్నిక‌ల విధుల నుండి త‌ప్పిస్తూ ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. దీనిని నిర‌సిస్తూ ఏపి ప్ర‌భుత్వం హైకోర్టును ఆశ్ర‌యించింది. కోర్టు సైతం ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌ను అమ‌లు చేయాల‌ని స్ప‌ష్టం చేయ‌టంతో అప్పటి రాష్ట్ర ప్ర‌భుత్వం ఆయ‌న్ను రిలీవ్ చేసింది. ఆధార్ సంస్థ చేసిన ఫిర్యాదు పై స్పంద‌న‌గా మాట్లాడిన విజ‌య సాయిరెడ్డి ఏపిలో ఇప్ర‌గ‌తి ప్రాజెక్టు పేరుతో ఆధార్ స‌మాచారం మొత్తం సేక‌రించార‌ని.. ఆ ప్రాజెక్టు కాంట్రాక్టు డిజిపి ఠాకూర్ తో పాటుగా ఇంట‌లిజెన్స్ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించిన ఏబి వెంక‌టేశ్వ‌ర‌రావు సంబంధీకులు ద‌క్కించుకున్నార‌ని చెప్పుకొచ్చిన విజ‌య సాయిరెడ్డి స‌రైన స‌మ‌యంలో వివ‌రాల‌ను బ‌య‌ట పెడ‌తాన‌ని చెప్పారు. దీని పై స్పందించిన ఏబి వెంక‌టేశ్వ‌ర రావు త‌మ‌కు ప్ర‌భుత్వం లో ఎటువంటి కాంట్రాక్టులు..ఒప్పందాలు లేవ‌ని స్ప‌ష్టం చేసారు. త‌న పై హేయ‌మైన వ్యాఖ్య‌లు చేసిన విజ‌య సాయిరెడ్డి పై ప‌రువు న‌ష్టం దావా వేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసారు. ఇటీవల జరిగిన పరిణామాల్లో... రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, అక్రమాల ఆరోపణల మీద ఏ బీ వీ ని సస్పెండ్ చేయటం, దాని మీద ఆయన క్యాట్ ను ఆశ్రయించటం, తర్వాత క్యాట్ ఆయన సస్పెన్షన్ ను సమర్ధించటం అందరికీ తెలిసిన విషయాలే. ఇప్పుడు తాజాగా..నేరుగాకేంద్ర హోమ్ శాఖ రంగం లోకి దిగటం బట్టి చూస్తుంటే, వై సి పీ , బీ జె పీ ల మధ్య ఒక అవగాహన దాదాపుగానే కుదిరిందని, ఇక తెలుగు దేశం మద్దతుదార్లయిన ఆఫీసర్లకు గడ్డు కాలం తప్పదనీ సంకేతాలు వస్తున్నాయి.

700 మిలియన్ డాలర్ల కంపెనీ 10 వేల కోట్లు పెట్టుబడి పెడుతుందట!

వంద మంది సిబ్బంది దాటని కంపెనీ, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఒప్పందం చేసుకోవడం విడ్డూరం కాదా .... రాష్ట్రానికి భారీ పెట్టుబడి పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేసిన హడావుడి వెనుక డొల్లతనం ఒక్కసారిగా బయటపడింది. వైయస్సార్‌ కడప జిల్లాలో మరో స్టీల్‌ ప్లాంట్‌పై ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ ఐఎంఆర్‌ ప్రతిపాదన చేసిందనీ, ఏడాదికి 10 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యం గా ఈ ప్లాంట్ పని చేస్తుందనీ, రూ. 12వేల కోట్లకుపైగా పెట్టుబడి రాష్ట్రానికి వస్తుందనీ రాష్ట్ర ప్రభుత్వం పటాటోప ప్రదర్శన చేసింది. ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌తో చర్చలు జరిపిన ఈ స్విస్ కంపెనీ -ఐ ఎం ఆర్ ఏ జీ ప్రతినిధులు ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ ఎదుట వైయస్సార్‌జిల్లాలో ప్లాంట్‌ ఏర్పాటుపై తమ ఆసక్తిని వ్యక్తంచేశారు. 10 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యం ఈ ప్లాంట్‌ ఏర్పాటు ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. క్యాంపు కార్యాలయంలో ఐఎంఆర్‌కంపెనీ ప్రతినిధులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐఎంఆర్‌ కంపెనీ కార్యకలాపాలను సీఎం అడిగితెలుసుకున్నారు. ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్, భారత్‌ సహా పలు దేశాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం లాంటి గనుల తవ్వకాలను చేపట్టడంతోపాటు విద్యుత్, ఉక్కు కర్మారాగాలను నడుతున్నామంటూ వారు వివరించారు. ఇది వారి వివరణ అయితే, వాస్తవానికి ఆకంపెనీ ప్రొఫైల్ వేరే విధం గా ఉంది. 2001 లో స్విట్జర్లాండ్ లో ఏర్పాటైన ఈ కంపెనీ కార్యకలాపాలు- డెవెలప్మెంట్ కన్సల్టింగ్, సర్వీస్ ప్రొవైడర్లుగా మాత్రమే పరిమితం కాగా, ఇనుప ఖనిజం, బంగారం తవ్వకాల్లో తాము నిష్ణాతులమని ప్రకటించుకోవటమే ఇక్కడ పలు అనుమానాలకు తావిస్తోంది. వైయస్సార్‌ జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు చెప్పుకొచ్చిన ఆ కంపనీ ప్రతినిధులు - ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్‌ఎండీసీతో ఒప్పందం చేసుకున్నామంటూ వారికి వివరించారు. ఐఎంఆర్‌ కూడా మరొక స్టీల్‌ప్లాంట్‌ పెడితే చక్కటి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందని సీఎం అన్నారు. నీరు, కరెంటు, మౌలిక సదుపాయాలు.. ఇలా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు. కృష్ణపట్నం పోర్టు, అక్కడ నుంచి రైల్వే మార్గం, జాతీయ రహదారులతో మంచి రవాణా సదుపాయం ఉందని సీఎం వారికి వివరించారు. పరిశ్రమల రాకవల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందంన్నారు. రానున్నరోజుల్లో వైయస్సార్‌ జిల్లా ప్రాంతం స్టీల్‌సిటీగా రూపాంతరం చెందడానికి పూర్తి అవకాశాలున్నాయని ఐఎంఆర్‌ కంపెనీ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. ఇదంతా కూడా ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షం లో జరిగిన చర్చల సారాంశం అయితే, వాస్తవమేమిటంటే ఆ కంపెనీ సిబ్బంది సామర్ధ్యం కూడా వంద మందికి మించి లేదు. 700 మిలియన్  డాలర్ల టర్నోవర్ ఉన్న ఈ కంపెనీ, ఇప్పుడు రాష్ట్రం లో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి సామర్ధ్యం తో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయటం ఏ మేరకు లాజిక్ కు అందుతుందనేది ఇపుడు పారిశ్రామిక వర్గాల ప్రశ్న. వినే వాడు అమాయకుడు అయితే , చెప్పేవాడు విజయసాయి రెడ్డి అన్నట్టు--హఠాత్తుగా తెర మీదకు వచ్చిన ఈ స్విస్ కంపెనీ తెర వెనుక డొల్ల తనం బయటపడటం తో ...సర్కారీ పెద్దలు ప్రస్తుతం తలలు పట్టుక్కూర్చున్నారు.

21న జెడ్పీటీసీ, ఎంపీటీసీ... 23న మున్సిపోల్స్... 27, 29న పంచాయతీ ఎన్నికలు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒక విడతలో... పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. అలాగే, మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో పూర్తి చేయనున్నారు. ఈనెల 21న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించి... 24న ఫలితాలను ప్రకటించనున్నారు. అలాగే, 23న మున్సిపోల్స్ నిర్వహించి... 27న ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక, మార్చి 27న తొలి విడత పంచాయతీ ఎన్నికలు... 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. # జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మార్చి 9 నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ మార్చి 12న నామినేషన్ల పరిశీలన మార్చి 14వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు మార్చి 21న పోలింగ్‌ మార్చి 24న ఓట్ల లెక్కింపు # మున్సిపల్‌ ఎన్నికలు మార్చి 11 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణ మార్చి 14న నామినేషన్ల పరిశీలన మార్చి 16వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు మార్చి 23న పోలింగ్‌ మార్చి 27న ఓట్ల లెక్కింపు # తొలి విడత పంచాయతీ ఎన్నికలు మార్చి 17నుంచి 19వరకు నామినేషన్ల స్వీకరణ మార్చి 20న నామినేషన్ల పరిశీలన మార్చి 22వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు మార్చి 27న పోలింగ్‌, అదే రోజు ఓట్ల లెక్కింపు # రెండో విడత పంచాయతీ ఎన్నికలు మార్చి 19 నుంచి 21 వరకు నామినేషన్ల స్వీకరణ మార్చి 22న నామినేషన్ల పరిశీలన మార్చి 24వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు మార్చి 29న పోలింగ్‌, అదే రోజు ఓట్ల లెక్కింపు

తమ్ముడు దాడి.. అన్నయ్య సర్దుబాటు...

ఒక్కో ఘటన చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన గోదావరి జిల్లాల్లో ప్రముఖ జర్నలిస్టు.. ఆషామాషీ జర్నలిస్టు మాత్రమే కాదు.. జగమెరిగిన జర్నలిస్టు నేత.. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రికి అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తూ జర్నలిజాన్ని సామాజిక వర్గ ప్రయోజనాల పరిరక్షణకు విచ్చలవిడిగా వాడేసిన ప్రముఖుడు ఆయన. నిన్న మొన్నటి వరకు ఎక్కడ జర్నలిస్టుపై దాడి జరిగినా నేనున్నానంటూ తీవ్రంగా ఖండించే నేత ఆయన. కానీ ఆయన పైనే రాజకీయ ప్రముఖులు, అందునా తన సామాజిక వర్గం నుండే వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్న నేతలు దాడి చేస్తే కిక్కురుమనకుండా అన్నీ మూసుకుని కూర్చోవలసి వస్తోంది. శ్రీరామచంద్రా ఏమిటో ఈ దుస్థితి.   ఇంతకూ విషయం ఏమిటంటే రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ప్రజా చైతన్యయాత్రలో పాల్గొనేందుకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ బయలుదేరి వెళ్ళారు. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు శత విధాల ప్రయత్నం చేసి విఫలమయ్యారు. లోకేష్ కాన్వాయ్ అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆందోళన జర్నలిస్టులపైకి మళ్ళింది. లోకేష్ పర్యటన కవరేజి నిమిత్తం వెళ్లిన ప్రముఖ జర్నలిస్టులపై రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ దౌర్జన్యం చేశారు. తెలుగుదేశం పార్టీకీ చెందిన మద్దతుదారులు ఈ విషయం గమనించి తీవ్రంగా ప్రతిఘటించారు. కాతేరు వద్ద జరిగిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటనను కవర్ చేసేందుకు వెళ్లిన హెచ్ఎంటీవీ శ్రీరామ్ మూర్తి, టీవీ9 సత్య, మహా న్యూస్ సతీష్ పై వైకాపా కార్యకర్తల దాడి చేశారు. ఇంత దాడి జరిగితే మరుసటి రోజు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వచ్చి సర్దుబాటు చేసేశారు. తమ్ముడు దాడి చేస్తే అన్న సర్దుబాటు చేస్తారు. దాడికి గురయిన వారిలో ఒక్కరు కూడా ఇదేమీటో తెలియజేయలేని పరిస్థితి.  

తెలంగాణ అసెంబ్లీలో హైఓల్టేజ్ వార్... కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రా? ఒక ప్రాంతానికా?

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో అధికార, ప్రతిపక్షం మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఇద్దరూ మాటకు మాట అనుకున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావంటే... నువ్వేం మాట్లాడుతున్నావంటూ తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. పరస్పర ఆరోపణలతో శాసనసభలో కొద్దిసేపు హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ మాట్లాడుతుండగా ఈ వాగ్వాదం చోటు చేసుకుంది. గవర్నర్ స్పీచ్ లో అన్నీ అబద్ధాలే చెప్పించారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అంటూ ప్రశ్నించారు. అధికారంలో చేతిలో ఉంది కదా అని గవర్నర్ చేత అసత్యాలు చెప్పిస్తారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. 100మంది ఎమ్మెల్యేలు ఉన్నారని విర్రవీగొద్దన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... డబ్బుతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉందని, గవర్నమెంట్ స్కూళ్లలో మౌలిక సదుపాయల్లేవని విమర్శించారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల అభివృద్ధి చెందితే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందినట్లేనా అంటూ ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతేంటి? నిరుద్యోగ భృతి ఏమైంది? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇంటింటికీ నీళ్లు ఎప్పుడిస్తారు? అంటూ నిలదీశారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకుందామంటే... ముఖ్యమంత్రి, మంత్రులు సెక్రటేరియట్ లోనే ఉండరని మండిపడ్డారు. కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ... పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎందుకు పెట్టడం లేదని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రా? లేక ఒక ప్రాంతానికా? అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేల్చారు. అయితే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి అసలు ప్రజల్లో తిరుగుతున్నాడా? లేక రోడ్లపై తిరుగుతున్నాడో అర్ధం కావడం లేదన్నారు. ఏదైనా మాట్లాడితే అర్ధంపర్థం ఉండాలన్నారు. రాజగోపాల్ రెడ్డి ఏ జిల్లాకు రమ్మంటే ఆ జిల్లాకు వస్తానన్న ఎర్రబెల్లి... ప్రజలు సంతోషంగా ఉన్నారో లేదో స్వయంగా మాట్లాడి తెలుసుకుందా పదా అంటూ సవాలు విసిరారు. తెలంగాణలో అభివృద్ధి జరగలేదంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పరుగెత్తిచ్చి కొడతారంటూ ఎర్రబెల్లి హెచ్చరించారు.  ఎర్రబెల్లి వ్యాఖ్యలపై అంతే సీరియస్ గా రియాక్టయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... ఘాటు కామెంట్స్ చేశారు. ఇది ఎర్రబెల్లి తప్పు కాదు... తెలంగాణ ద్రోహులను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్న కేసీఆర్ ది అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎర్రబెల్లిలాంటి తెలంగాణ ద్రోహులను నెత్తిన పెట్టుకుంటే ఇలాగే ఉంటుందంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడంతో అధికార టీఆర్ఎస్... ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. అయితే, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కల్పించుకోవడంతో ఇరువర్గాలు శాంతించాయి.

ఎస్ బ్యాంకు లో ఇరుక్కుపోయిన  పూరీ జగన్నాధుడి సొమ్ము

547 కోట్ల  రూపాయల ఫండ్స్ వెనక్కు రావటం కష్టమే పూరీ జగన్నాధ స్వామి కి కష్టమొచ్చి పడింది. దాదాపు 547 కోట్ల రూపాయల సొమ్ము ప్రస్తుతం ఎస్ బ్యాంక్ లో ఇరుక్కుపోయింది. పూరీ దేవస్థానం ఆ సొమ్మును ఎస్ బ్యాంక్ లో డిపాజిట్ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుతం ఎస్ బ్యాంక్ నుంచి ఉపసంహరణ  పరిమితి 50  వేల రూపాయలకే కుదించటం తో, ఇపుడు పూరీ ఆలయం డిపాజిట్ల పరిస్థితి అగమ్యగోచరం గా తయారైంది. వాస్తవానికి పూరీ ఆలయం డిపాజిట్లు ఈ నెలలో మెట్యూరిటీ అవుతాయి కాబట్టి, ఆ భారీ మొత్తాన్ని ఉపసంహరించాలని  కిందటి నెలలో జరిగిన ఆలయ బోర్డు సమావేశం లో తీర్మానం చేశారు. ఆ తర్వాత ఆ ఫండ్స్ ని జాతీయ బ్యాంక్ లలో డిపాజిట్ చేయాలని కూడా ఆలయ బోర్డు నిర్ణయించింది. ఎస్ బ్యాంక్ ఇప్పటికే ఈ విషయమై ఆలయ బోర్డుకు ఒక లేఖ రాస్తూ, మార్చ్ 19, 23, 29 తేదీలలో ఫండ్స్ ఆలయ బోర్డుకు వెనక్కు పంపిస్తామని స్పష్టం చేసింది. కానీ, తాజాగా ఆర్ బీ ఐ తీసుకున్న నిర్ణయం తో, ప్రస్తుతం ఎస్ బ్యాంక్ ఈ  547 కోట్ల రూపాయల నిధులను ఆలయ బోర్డుకు వెనక్కు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారంతో అసలు అంత పెద్ద మొత్తం నిధులను ఒక ప్రయివేట్ బ్యాంక్ లో ఎలా డిపాజిట్ చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఏ పరిస్థితుల్లో ఎస్ బ్యాంక్ లో ఆ ఫండ్స్ ని డిపాజిట్ చేయాల్సి వచ్చిందనే కోణం లో ఒక విచారణ చేపట్టాలని కూడా పూరీ ఆలయ కమిటీ సభ్యులు రామచంద్ర దాస్ మహాపాత్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎన్ పి ఆర్ అమలుపై విచిత్ర నిర్ణయంతో నష్టపోనున్న ఏపీ...

పిచ్చి ముదిరింది రోకలి తలకు కట్టండి అన్నట్టుంది ఏపీ ప్రభుత్వ ప్రవర్తన. అనుభవ రాహిత్యమో, అవగాహనా లోపమో తెలియదు కానీ నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్ పి ఆర్) ను ప్రస్తుత పద్ధతిలో అమలు చేయరాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానించింది. ఎన్ పి ఆర్ అనేది జనాభా లెక్కలు మాత్రమే అనే విషయాన్ని మర్చిపోయి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పలువురు విస్మయం చెందుతున్నారు. ఎన్ పి ఆర్ లో సాధారణ విషయాలు తప్ప మతానికి సంబంధించిన అంశాలు ఉండవు. పైగా ఎలాంటి ధృవపత్రాలు అడగరు. ఎన్ పి ఆర్ తో ఒక వ్యక్తి మతాన్ని నిర్ధారించే అవకాశం లేదు. ఇది స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి దశాబ్దాలుగా జరుగుతున్న జనాభా లెక్కల ప్రక్రియ మాత్రమే. అలాంటి ఎన్ పి ఆర్ ను 2010 ప్రశ్నావళి ప్రకారం మాత్రమే చేపట్టాలని లేకపోతే తాము తిరస్కరిస్తామని మంత్రివర్గం తీర్మానించడం రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. అసలు ఎన్ పి ఆర్ ప్రశ్నావళిని మార్చే వరకూ రాష్ట్రంలో ఆ ప్రక్రియను నిలిపివేయాలని తీసుకున్న మంత్రి వర్గ నిర్ణయం వల్ల ఒరిగేదేమీ ఉండదు. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనేది 1955 భారత పౌరసత్వ చట్టం ప్రకారం నిర్వహిస్తారు. 2003 పౌరసత్వ నిబంధనల ప్రకారం ఎన్ పి ఆర్ లో నమోదు చేసుకోవడం పౌరుల బాధ్యత, తప్పని సరి కూడా. దీన్ని ఏ పౌరుడు తిరస్కరించే వీలే లేదు. అలాంటిది రాష్ట్ర మంత్రి వర్గం తిస్కరించడం అవగాహనా రాహిత్యమేనని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. దేశంలో ఎన్ పి ఆర్ అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.3941 కోట్లు కేటాయించింది. రాష్ట్రాలలో ఎన్నికల సంఘం తన అధికారులను నియమించుకున్నట్లు ఎన్ పి ఆర్ అమలు కోసం ఆయా రాష్ట్రాల క్యాడర్ కు చెందిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ఎంపిక చేసుకుంటుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వాలు ముగ్గురు అధికారుల ప్యానెల్ పంపడం వరకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎన్ పి ఆర్ అసోం లో తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తారు. ఎన్ పి ఆర్ ను ప్రతి పది సంవత్సరాలకు ఒక సారి అమలు చేస్తారు. ఈ సర్వే ద్వారా దేశంలో పేదరికాన్ని అంచనా వేస్తారు. చదువుకున్న వారి సంఖ్య తదితర వివరాలు తెలుస్తాయి. అక్షరాశ్యత తక్కువ ఉన్న రాష్ట్రాలు పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు గుర్తిస్తారు. అందుకు అనుగుణంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. ఎన్ పి ఆర్ ను తిరస్కరించడం ద్వారా రాష్ట్రంలోని పేదల డేటా కేంద్రానికి అందకుండా పోతుంది. దీనివల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో ప్రజల బయోమెట్రిక్ వివరాలను సేకరించరు.  అందువల్ల ఏ మతం వారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2010 లో జరిగిన జనాభా లెక్కలలో 15 ప్రశ్నలు అడగగా ఈ సారి వాటి సంఖ్య 21కి చేరింది. ఎలాంటి ధృవపత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేని ఈ జనాభా లెక్కలను రాజకీయాలకు వాడుకోవడం ఎంత వరకూ సబబో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించుకోవాలని కేంద్ర పెద్దలు అంటున్నారు.

రాహుల్ గాంధీకి కరోనా పరీక్షలు.. సంచలన విషయం బయటపెట్టిన కాంగ్రెస్...

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, అలాగే కుటుంబ సభ్యులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలంటూ బీజేపీ మిత్రపక్ష ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ లోక్ సభలో డిమాండ్ చేయడంతో పార్లమెంట్ లో కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. ఇండియాలో కరోనా వైరస్ పాజిటివ్ గా తేలినవారిలో ఎక్కువగా సోనియా పుట్టినిల్లు ఇటలీ నుంచి వచ్చినవాళ్లే ఉన్నారని, అందువల్ల సోనియా కుటుంబ సభ్యులందరికీ కరోనా టెస్టులు చేయాల్సిన అవసరముందన్నారు. అయితే, సోనియా కుటుంబ సభ్యులు ఇటీవల ఇటలీ వెళ్లిరావడంతోనే ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ ఈ వ్యాఖ్యలు చేశారని బీజేపీ సమర్ధించింది. అయితే, ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ వ్యాఖ్యలపై పార్లమెంట్ లో తీవ్ర నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ... ఇవాళ మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఇటీవల ఇటలీ వెళ్లివచ్చిన రాహుల్ గాంధీకి, ఢిల్లీ విమానాశ్రయంలో కరోనా స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించారని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్నప్పటికీ, రాహుల్ గాంధీ.... ఢిల్లీ ఎయిర్ పోర్టులో కరోనా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారని తెలిపింది. ఫిబ్రవరి 29న విదేశీ పర్యటన తిరుగు ప్రయాణంలో భాగంగా రాహుల్ కూడా కరోనా స్క్రీనింగ్ టెస్ట్ లో పాల్గొన్నారని ఏఐసీసీ వెల్లడించింది. తన భద్రతను సైతం పక్కనబెట్టి, సాధారణ ప్రయాణికులతోపాటే అరగంటపాటు క్యూలో నిలబడి కరోనా స్క్రీనింగ్ లో పాల్గొన్నారని తెలిపింది. అయితే, ఇటలీలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 80మంది మరణించగా, వేలాది పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంతేకాదు, భారత్ లో నమోదైన కరోనా పాటిజివ్ కేసుల్లో కూడా ఇటలీ నుంచి వచ్చినవాళ్లే ఉండటంతో, రాహుల్ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. పైగా రాహుల్ విదేశీ పర్యటనలో కరోనా సోకుండా తగు జాగ్రత్తలు తీసుకోలేదని, అందుకే పరీక్షలు చేయించుకోవాలని కోరామని బీజేపీ వ్యాఖ్యానించింది. బీజేపీ డిమాండ్ నేపథ్యంలోనే, రాహుల్ గాంధీ కరోనా స్క్రీనింగ్ పరీక్షలపై కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది.

స్థానిక ఎన్నికల్లో జగన్ కు బుద్ధి చెప్పండి... ప్రజలకు చంద్రబాబు పిలుపు...

జగన్మోహన్ రెడ్డి పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలంటూ అధికారంలోకి వచ్చిన జగన్... రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఒక్క అవకాశం ఇస్తేనే ఉన్నవి ఊడగొట్టారని, ఇక మరోసారి గెలిపిస్తే ఏమీ మిగల్చరని బాబు అన్నారు. వైసీపీ ఉన్మాద చర్యలకు స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో 10శాతం రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశారని బాబు మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే, కొత్తకొత్త జీవోలు ఇవ్వడమేకాకుండా, మంత్రుల ఉద్యోగాలు పీకేస్తానంటూ జగన్ బెదిరింపులకు దిగారని చంద్రబాబు విమర్శించారు. ఇక, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలు డబ్బు, మద్యం పంపిణీ చేస్తే అడ్డుకోవాలని, అలాగే, ఫొటోలు, వీడియోలు తీసి పంపాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. ఎన్టీఆర్ భవన్ లో కమాండ్ కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు చేశామన్న బాబు.... ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంపుతూ, అధికారులకు ఫిర్యాదు చేయాలని దిశానిర్దేశం చేశారు. సీఏఏ అండ్ ఎన్పీఆర్ పై జగన్నాటకాలు ఆడుతున్నారని బాబు విమర్శించారు. ఇక, అశోక్ గజపతిరాజు ఆస్తులపైనా, సింహాచల ఆలయ భూములపై కన్నేసి రాత్రికి రాత్రే రహస్య జీవోలు ఇచ్చారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ అరాచకాలపై పోరాడుతున్న టీడీపీ నేతల ఆర్ధిక మూలాలు దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అయితే, వైసీపీ ప్రభుత్వ బెదిరింపులకు భయపడకుండా పోరాడుతున్న టీడీపీ నేతలను చంద్రబాబు అభినందించారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై తాడోపేడో తేల్చుకుంటామో తప్ప, భయపడే ప్రసక్తే లేదన్నారు.

మాన్సాస్‌ భూములపై భూబ‌కాసురుల క‌న్నుప‌డింది!

మాన్సాస్ ట్ర‌స్ట్ రాజ‌కీయాల‌పై తెలుగువ‌న్ గ్రౌండ్ రిపోర్ట్‌ బిజెపి- వైసీపి ఆడుతున్న‌ చ‌ద‌రంగంలో తెలుగుదేశంపార్టీ గిల‌గిల కొట్టుకుంటోంది. రాజ‌ధాని త‌ర‌లింపు పై బిజెపి స్టాండ్ అర్థంకాక త‌ల గోక్కుంటున్న చంద్ర‌బాబునాయుడికి తాజాగా మాన్సాస్ ట్ర‌స్ట్ వ్య‌వ‌హారం షాక్‌కు గురిచేంది. జీవో రావ‌డం అశోక్‌ గజపతిరాజును చైర్మన్‌ పదవి నుంచి తప్పించ‌డం, సంచైత గజపతి రాజును నియ‌మించ‌డాన్ని మాజీ ముఖ్య‌మంత్రి జీర్ణించుకోలేక‌పోతున్నారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం రాజవంశానికి పెద్దదిక్కు లేదా వారసుడ్ని ధర్మకర్తగా ప్రభుత్వం నియమించేది. ఇప్పటివరకు వస్తున్న ఆచారం అదే. అయితే దానిని తుంగలో తొక్కి అశోక్‌ గజపతిరాజు బతికుండగానే తొలగించి సంచైతను నియమించ‌డం వెనుక పెద్ద మాఫియానే వుంద‌ట‌. మాన్సాస్ ట్రస్టు అధికార మార్పిడి వెనుక రాజకీయ కోణ‌మే కాదు. మత కోణం, భూమాఫియా ప్రమేయం వుందట‌. అయితే ఈవిషయం ధైర్యంగా చెప్పడానికి తెలుగుదేశం నేతలు, అటు రాజకుటుంబీకులు జంకుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని విశాఖ‌కు త‌ర‌లివెళుతున్న నేప‌థ్యంలో అక్క‌డ భూమికి బాగా డిమాండ్ ఏర్ప‌డిందట‌. మాన్సాస్ ట్రస్టు ఆధీనంలో సింహాచలంతో సహా 108 గుడులు, పధ్నాలుగు వేల ఎకరాల భూములు ఉన్నాయి. విశాఖపట్నం రాజధాని అని ప్రకటించిన నేపథ్యంలో దీని వెనుక ఉన్న కారణాలు మనం తేలిగ్గా ఊహించవచ్చు. మాన్సాస్‌ట్రస్ట్‌ భూములను కాజేయడానికే అశోక్‌ గజపతిరాజును చైర్మన్‌ పదవి నుంచి తప్పించారనే ప్ర‌చారం జిల్లాలో జోరుగా జ‌రుగుతోంది. దొడ్డిదారిన నొక్కేందుకే ర‌హ‌స్య జీవో ఇచ్చారా? అస‌లు మాన్సాస్ భూముల‌పై ముఖ్య‌మంత్రి ఆస‌క్తి ఏమిటి? ఎందుకు సంచిత గజపతిరాజును రంగంలోకి దింపారు? సంచైత గజపతిరాజు సన అనే ఎన్జీవో నిర్వహిస్తూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా కేజ్రీవాల్, మేధాపాట్కర్ లాంటి వివిధ నేతలతో కలిసి బాలికలకు మరుగుదొడ్లు, తాగునీరు అనే అంశాల్లో పనిచేసి బాగా పేరుపొందారు. సన ఎన్జీవో సంస్థ కూడా ఆనంద్ శర్మ, ఉమాగజపతిరాజు, సంచైతా గజపతిరాజు అనే ముగ్గురి ఆధ్వర్యంలో మాత్రమే నడుస్తోంది. ఢిల్లీలో వుండే సంచిత హుటాహుటిన విశాఖ‌ప‌ట్నంలో ఎన్జీవోను న‌డ‌ప‌డానికి కార‌ణం ఏమిటి? ఇలాంటి ప్ర‌శ్న‌లే అక్క‌డి స్థానికులు మాట్లాడుకుంటున్నారు. మాన్సాస్‌ ట్రస్ట్ ను 1958లో పి.వి.జి రాజు తన తండ్రి రాజా సాహెబ్‌ పేరుతో ఏర్పాటు చేశారు. ఉన్నతమైన లక్ష్యం కోసం 14వేల ఎకరాల భూమిని ఇందు కోసం కేటాయించారు. లక్షల మందికి విద్యాదానం చేశారు. విజయనగరాన్ని విద్యా న‌గరంగా తీర్చిదిద్దారు. సాలూరు వద్ద ఎస్టీ చిన్నారుల చదువుకోసం 2వేల ఎకరాలు కేటాయించారు. ఈ ఆలయం పరిధిలో నాలుగు జిల్లాల్లో 12716 ఎకరాలు ఉండటం ఒక ఎత్తు అయితే.. వీటి విలువ దగ్గర్లో దగ్గర లక్షన్నర కోట్ల మేర ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. ఈ భూముల విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకునేందుకు వీలుగా జగన్ సర్కారు వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అనువంశికంగా వస్తున్న మాన్సాస్‌ ట్రస్ట్ ఛైర్మ‌న్‌గా గతంలో ఈ పదవిని అశోక్ గజపతిరాజు తండ్రి పీవీజీ రాజు చేపట్టారు. ఆయన మరణానంతరం పెద్ద కొడుకు అనంద గజపతి రాజు ఆ తర్వాత అశోక్ గజపతి రాజు చేపట్టారు. 2016నుంచి ఇదే పదవిలో అశోక్ గజపతి రాజు ఛైర్మ‌న్‌గా ఉన్నారు. సంచైత గజపతి రాజును సింహాచల దేవస్థానం ఛైర్మన్ గా ఏపీ ప్ర‌భుత్వం జీవో విడుద‌ల చేసింది. ఈ ప‌ద‌విలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కొన‌సాగుతున్నారు. ఆయన్ను త‌ప్పించి సంచైతను ఎంపిక చేయటం, ఆమె ఆగమేఘాల మీద ఢిల్లీ నుంచి వచ్చి పదవీబాధ్యతల్ని చేపట్టటం చ‌క చ‌క జ‌రిగిపోయాయి. అశోక్‌గ‌జ‌ప‌తిరాజును త‌ప్పించ‌డం, సంచైత ను నియ‌మించ‌డం స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఢిల్లీ డైరెక్ష‌న్‌లోనే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఛైర్ పర్సన్ గా సంచైతను నియ‌మించార‌నే టాక్ న‌డుస్తున్న నేప‌థ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ సంచైత కుటుంబం, వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశ‌మైయ్యాయి. పేజ్ 3లో రిచ్, పోష్ గా వుండే ఆమెకు ఈ ప‌ద‌వి ఇవ్వ‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మంటున్నారు. అసలు విషయం ఏంటంటే ఆనందగజపతిరాజు గారు బతికి ఉన్నప్పుడే ఆయన తన భార్య ఉమాగజపతిరాజుకు విడాకులు ఇచ్చారు. ఆనందగజపతిరాజు గారి నుంచి విడాకులు తీసుకున్న కేరళ రాజకుమారి ఉమాగజపతిరాజు తరువాత రమేష్ శర్మ అనే దర్శకుడిని ద్వితీయ వివాహం చేసుకున్నారు. తన ఇద్దరు ఆడ పిల్లలతో సహా ఆయనతో ఉంటున్నారు. ఆయన క్రైస్తవుడు. వీరిది పేజ్ 3కుటుంబం చాలా రిచ్, పోష్. రమేష్ శర్మ తను గాంధీ మీద, ఆయన అహింసా సిద్ధాంతం మీద సందేశాత్మక చిత్రానికి ఐక్యరాజ్యసమితి శాంతి బహుమతి పొందారు. తరచుగా విదేశాల్లో చర్చిలను, పాస్టర్లను దర్శించుకుంటారు. అలాంటి వ్యక్తి పెంపకంలో పెరిగిన సంచైత ఇప్పుడు సింహాచలం ధర్మకర్త! వీరి కుటుంబం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటుంది. సింహాచలం దేవస్థానం పాలకమండలి ఛైర్ పర్సన్ గా సంచైతను ఎంపిక చేయటం నిబంధనలకు విరుద్ధమని బీజేపీ ఎమ్మెల్సీ అంటున్నారు. సంచైతా తమ పార్టీకి చెందిన వ్యక్తే అయినా.. నిజం చెప్పాల్సిన బాధ్యత తన మీద ఉందంటూ మాధవ్ చేసిన వ్యాఖ్యల వెన‌క కార‌ణం ఏమిటి? అస‌లు విష‌యాన్ని ప‌క్క దారి ప‌ట్టించ‌డానికే ఎమ్మెల్సీ ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని జ‌నం అంట‌న్నారు. టోట‌ల్‌గా టిడిపిని జిల్లా నుంచి తుడిచివేయ‌డానికే బిజెపి వైసిపి ప‌క్కా ప్లాన్‌తో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

టీడీపీకి స్థానిక ఎన్నికలు ఇప్పుడే వద్దట..!

ఏ పార్టీ అయినా.. ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తే.. మానసికంగా ఓటమికి సిద్దమయిందనే విమర్శలు వస్తాయి. ప్రజల్లో కూడా అలాంటి ఫీలింగ్ వస్తుంది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల వాయిదాను.. కోరుకుంటోంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికే అనుకూలంగా వస్తాయి. ప్రభుత్వ పథకాలు, అధికార యంత్రాంగం సహకారం ఇలా అన్నీ కలిసి వస్తాయి. అయితే.. ఓట్లు వేయాల్సింది ప్రజలే. వారి ఆగ్రహం తీవ్ర స్థాయిలో ఉంటే.. ఇవన్నీ ఏమీ చేయలేవు. కానీ..ఎన్నికల సంఘం కూడా చేతుల్లో ఉంటుంది.. పైగా కొత్త ఆర్డినెన్స్ కూడా తీసుకు వచ్చారు. దీంతో టీడీపీ నేతలు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకపోతేనే బాగుంటుందని కోరుకుంటున్నారు. కరోనా వైరస్ ముప్పు ఉన్నందున ఇప్పుడున్న పరిస్థితిలో ప్రచారానికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందంటోంది తెలుగుదేశం పార్టీ. కాబ‌ట్టి స్థానిక ఎన్నికలు నిలిపివేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. దీనికి బీసీ రిజర్వేషన్లతో పాటు … కరోనాను కూడా కారణంగా చూపిస్తోంది. ఈ మేరకు.. టీడీపీ నేతలు.. ముఖ్య‌మంత్రి జగన్‌కు బహిరంగలేఖ రాశారు. సుప్రీంకోర్టులో టీడీపీ వేసిన బీసీల రిజర్వేషన్ల పిటిషన్‌లో.. రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్‌ కావాలలని.. లేఖలో ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. రిజర్వేషన్లలో 10శాతం కోత విధించి బీసీ హక్కులకు భంగం కలిగించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లకుండా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడం బీసీల రాజకీయ అవకాశాల్ని అణిచివేయడమేనని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆరోపించారు. మరో టీడీపీ బీసీ నేత నిమ్మల కిష్టప్ప మాత్రం ఎన్నికల వాయిదాకు.. కరోనాను కారణంగా చూపిస్తున్నారు. కరోనా వైరస్‌ కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని.. క్యూలైన్ల ద్వారా కరోనా ప్రమాదం పొంచి ఉందంటున్నారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని తెలుగుదేశం పార్టీ అంటోంది. చివ‌ర‌కు ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ ఏర్పాటు చేసిన అఖిల‌ప‌క్ష స‌మావేశంలోనూ స్థానిక ఎన్నిక‌లు జ‌ర‌ప‌వ‌ద్ద‌ని టిడిపి విజ్ఞ‌ప్తి చేసింది.

‘స్థానిక’ పోరు పై ర‌చ్చ‌!

ప్రచారం రోజుల తగ్గింపుపై తర్జనభర్జన డబ్బు,మద్యం పంపిణీపై భిన్నవాదనలు త్వరలో జరగబోయే మునిసిపల్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. జిల్లాలో మున్సిపాలిటీలతోపాటు పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్సీపీటీసీల ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. పంచాయితీ ఎన్నికల ప్రచారంపై ప్ర‌భుత్వం తీసుకున్న కీలక నిర్ణయం రాజకీయ నాయకుల్లో చర్చ జ‌రుగుతుంది. ప్రధానంగా స్థానికులే పోటీకి అర్హులు, ప్రచార సమయం కుందింపు, డబ్బులు, మద్యం పంపిణీకి పాల్పడితే అనర్హత వేటు వంటి నిర్ణయాలపై రాజకీయ పక్షాల నుంచి భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన పంచాయితీ సర్పంచ్‌ ఎన్నికల్లో నోటిఫికేషన్‌ విడుదలైనప్పటినుంచి పోలింగ్‌ జరిగే వరకు మధ్యలో 18 నుంచి 20 రోజులు వరకు గడువు ఉండేది. ఈ మధ్యలోనే నామినేషన్ల దాఖలు, పరిశీలన, అభ్యంతరాలు, ఉపసంహరణ వంటి వాటికి ఒక్కొక్కరోజు అవకాశం ఉంది. అప్పట్లో మూడు దశల్లో జిల్లాలోని అన్ని పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎన్నికలకు సంబందించి ఇదే తీరు అమలయ్యింది. ఎన్నికల ప్రచార సమయం తగ్గడం వల్ల ఓటర్లందరనీ కలుసుకొనే అవకాశం చాలా తక్కువగా ఉందని తేదేపా వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. మరోవైపు నామినేషన్‌దాఖలు, అభ్యంతరాలు వ్యక్తం చేయటం, ఉపసంహరణ వంటి వాటికి ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల పదవులకు స్థానికేతరను పోటీ చేయరాదనే నిబంధన తేదేపా విజయానికి అడ్డుకట్ట వేయటమేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మొన్నటి వరకు జడ్పీటీసీ పదవికి సంబందించి జిల్లాలో ఏ మండలం నుంచైనా పోటీచేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో అది ఉండదు. ఉదాహ‌ర‌ణ‌కు జిల్లాపరిషత్‌ చైర్మన్‌ పదవిని ఆశించే ఒక నాయకుడు తాను నివాసం ఉంటున్న మండలంలో రిజర్వేషన్‌ బట్టి పోటీచేసే అవకాశం లేకపోవటంతో తన సామాజిక వర్గానికి రిజర్వయినా ఇతర స్థానం నుంచి పోటీచేసే అవకాశాన్నికోల్పోతారు. ఇది ఇలా ఉండగా రాజకీయ నాయకుల్లో కొంత మంది నిజాయితీపరులు ఖర్చులు తలుచుకొని మనకెందుకులే అంటూ వెనక్కి తగ్గేవారు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితులకు అడ్డుకట్ట పడేలా అధికారయంత్రాంగం సన్నర్థం కాబోతుంది. మద్యం, డబ్బువంటి పంపిణీ చేస్తే పోటీలో అనర్హులుగా ప్రకటిస్తారు. ఈ ఆంక్షలు అధికార పార్టీకి కలిసివచ్చే అంశమేనని తేదేపా వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు మధ్యం,డబ్బు వంటివి పంపిణీ చేసినా చూసిచూడనట్లుగా ఒదిలేసే అధికార యంత్రాంగం ప్రతిపక్షాల చర్యలకు మాత్రం అడ్డుకట్ట వేసేందుకు ఇటువంటి ఆలోచనలు చేసినట్లు కొంతమంది విమర్శిస్తున్నారు.

ఎపి బిజెపి ప‌రిస్థితి ద‌య‌నీయం!

రాజ‌ధాని మార్పుపై భిన్నాభిప్రాయాలే ఆ పార్టీ కొంప ముంచ‌నున్నాయా? అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెల్చుకున్న ఓట్ల‌లో క‌నీసం స‌గ‌మ‌న్నా స్థానిక ఎన్నిక‌ల్లో బిజెపికి ల‌భిస్తాయా? ఆంధ్ర‌ప్ర‌దేశ్ బిజెపి రాజ‌కీయ భ‌విష్య‌త్ దేవునిబిడ్డ‌లా త‌యారైంద‌ని రాజ‌ధాని విష‌యంలో భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఆ పార్టీ కుంప ముంచుతుంద‌ని బిజెపి అభిమానులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అమ‌రావ‌తిపై ఇటీవ‌ల చేస్తున్న వ్యాఖ్య‌లు అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, టీడీపీకి వ్యతిరేకంగా వుండ‌టం రాష్ట్ర బిజెపి నేత‌ల‌కు మింగుడుప‌డ‌డం లేదు. అంతేకాదు, రాష్ట్రంలోని సొంత పార్టీ నేతలకు కూడా ఊహించని షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూ పోతున్నారు జీవీఎల్‌. తెలుగుదేశంపార్టీ నుంచి బిజెపిలో చేరిన సుజనా చౌదరి, వేరే రాష్ట్రం నుంచి ఎంపికైన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మ‌ధ్య ఎందుకు కోల్డ్ వార్ కొనసాగుతూ ఉంది. ప‌ర‌స్ప‌రం వీరిరువురు రెచ్చిపోతూ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఒకరి ప్రకటనలను మరొకరు పరోక్షంగా ఖండించుకుంటున్నారు. ఉన్నారు. వీరి గొడ‌వ మ‌ధ్య రాష్ట్ర పార్టీ బ‌లిఅయిపోతున్నా ఢిల్లీ పెద్ద‌లు ఎందుకు మౌనంగా వున్నార‌నేది అర్థం కాక బిజెపి కార్య‌క‌ర్త‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌. ఏపీకి రాజధానిగా అమరావతే ఉండాలంటూ సుజనా చౌదరి వాదిస్తున్నారు. అలాగే రాష్ట్ర బిజెపి నేత‌లు కూడా రాజ‌ధానిగా అమ‌రావ‌తే వుండాల‌ని ప్ర‌క‌ట‌న‌ల మీద ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు. అమ‌రావ‌తి రైతుల‌కు బిజెపిఅండ‌గా వుంటుంద‌ని అమరావతిని కాపాడుకుని తీరతామంటూ స్థానిక నేత‌ల‌ ప్రకటనలు చేస్తున్నారు. మ‌రో ప్ర‌క్క బిజెపి అధికార ప్రతినిధి కమ్ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ రాజధాని రాష్ట్రం పరిధిలోని అంశం అని తేల్చారు. ఈ అంశంలో కేంద్రం జోక్యం చేసుకోందంటూ పలు సార్లు ఆయన ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలు సుజనా చౌదరితో పాటు రాష్ట్ర బిజెపి ప‌రువు తీసేలా వున్నాయి. తను అధికార ప్రతినిధి హోదాలో మాట్లాడుతున్నట్టుగా పలు సార్లు జీవీఎల్ రెచ్చిపోతున్నారు. దీనిపై స్పందించిన‌ సుజనా చౌదరి ఏ ఎల్లయ్యో.. పుల్లయ్యో చెబితే కాదు.. అంటూ జీవీఎల్ పై పరోక్ష వ్యాఖ్యానం చేశారు. దీనిపై జీవీఎల్ కూడా స్పందించారు. రాజధాని విషయంలో తను చెప్పింది పార్టీ వెర్షన్ అని ఆయన తేల్చారు. నేత‌ల గొడ‌వ‌లు ఎలా వున్నా స్థానిక ఎన్నిక‌ల్లో బిజెపి ఏ మేర‌కు త‌న అస్థిత్వాన్ని కాపాడుకుంటుందో వేచి చూడాలి.  

ఎపిలో స్థానిక‌సంస్థ‌ల ఎన్నికల నగారా మోగింది

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన ఎన్నిక‌ల క‌మీష‌న్‌ మార్చి21- ఫేజ్ 1 మార్చి24 - ఫేజ్ 2 కౌంటింగ్-మార్చి 29 మున్సిపల్ఎలక్షన్స్ పోలింగ్ మార్చి 27 కౌంటింగ్-మార్చి 29 ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. రెండు విడుతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 21న తొలి విడత ఎన్నికలు, మార్చి 24న రెండో విడత ఎన్నికల జరుగున్నాయి. మార్చి 27న మున్సిపల్ ఎన్నికలు జ‌రుగుతాయి. మార్చి 29న ఎన్నికల కౌంటింగ్, ఫలితాలు విడుదల అవుతాయి. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం స‌మాయ‌త్త‌మ‌వుతోంది. శుక్రవారం నాడు ఎన్నికల కమిషనర్ కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల సమయం తక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని  హెచ్చరించారు. బ్యాలెట్ పేపర్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్  తెలిపారు. ప్రతి బ్యాలెట్ పేపర్ కరెన్సీతో సమానమని ఎన్నికల కమిషనర్ చెప్పారు. మద్యం, డబ్బులు, బహుమతుల పంపిణీకి అడ్డుకట్ట వేయడంపై స్పెషల్ ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలని సూచించారు. మార్చి 7న తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిషికేషన్ విడుదల కానుంది. ఈనెల 9 వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ జరుగనుంది. మార్చి 12వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. మార్చి 14న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. మార్చి 21న స్థానిక ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈనెల 29న కౌంటింగ్ జరుగనుంది. 10న రెండో విడత ఎన్నికల నోటిషికేషన్ మార్చి 10న రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిషికేషన్ విడుదల కానుంది. మార్చి 12 నుంచి 14 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మార్చి 15న నామినేషన్లను పరిశీలించనున్నారు. మార్చి 17న సాయంత్రం 3గంటలకు వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల తుది జాబితా విడుదల కానుంది. 13న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఈనెల 13న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 15 నుంచి 17 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 18న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. మార్చి 20న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చారు. మార్చి 27న పోలింగ్ జరుగనుంది. ఈ నెల 29న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు. మ‌రో ప‌క్క‌ జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లు కూడా ఖరారు అయ్యాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చైర్మన్ల రిజర్వేషన్లను ఖరారు చేసింది. అందులో మహిళలకు పెద్దపీట వేశారు. ఎనిమిది జిల్లాల్లో మహిళలే జెడ్పీ చైర్ పర్సన్‌లు కాబోతున్నారు. మార్చి 21, 24న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఈనెల 27న మున్సిపల్ ఎన్నికలు వేర్వేరు తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాల వారిగా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లు శ్రీకాకుళం- బీసీ (మహిళ), విజయనగరం- జనరల్, విశాఖ -ఎస్టీ (మహిళ), తూర్పుగోదావరి -ఎస్సీ (మహిళ), పశ్చిమగోదావరి -బీసీ జనరల్, కృష్ణా -జనరల్ (మహిళ), గుంటూరు -ఎస్సీ (మహిళ), ప్రకాశం -జనరల్ (మహిళ), నెల్లూరు -జనరల్ (మహిళ), చిత్తూరు -జనరల్, కడప -జనరల్, అనంతపురం -బీసీ (మహిళ), కర్నూలు-జనరల్. స్థానిక సంస్థల ఎన్నికల స‌మ‌రంలో త‌ల‌ప‌డి అమీ తుమీ తేల్చుకోవ‌డానికి అధికార ప్ర‌తిప‌క్ష స‌భ్యులు సిద్ధ‌మ‌వుతున్నారు.