జగన్ సర్కార్ కి ఊహించని దెబ్బ.. మళ్లీ ఎన్నికల కమిషనర్‌గా రానున్న నిమ్మగడ్డ!

జగన్ సర్కార్ కి ఏపీ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తొలగింపు వ్యవహారంపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్‌‌ను కొనసాగించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ విషయంలో నిబంధనలు మారుస్తూ జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ ను హైకోర్టు కొట్టేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలన్నీ కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

ఐదు జిల్లాల స్వప్నం.. కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతఘట్టం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతఘట్టం ఆవిష్కృతమైంది. మర్కుక్‌ పంప్ ‌హౌస్‌ నుంచి కొండపోచమ్మసాగర్‌లోకి నీటిని ఎత్తి పోసే మోటర్లను చినజీయర్‌స్వామితో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. స్విచ్చాన్ చేసిన వెంటనే గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్‌లోకి చేరుకున్నాయి. అనంతరం కొండపోచమ్మ కట్టపై గోదావరి నీటికి సీఎం కేసీఆర్‌ జలహారతి ఇచ్చారు.  అంతకముందు కొండపోచమ్మ ఆలయంలో ఉదయం వైభవంగా చండీయాగం నిర్వహించారు. చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. కొండపోచమ్మ సాగర్‌ పంపుహౌస్‌ వద్ద సుదర్శన యాగం నిర్వహించారు. ఈ యాగం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులతో పాటు చినజీయర్ స్వామీ కూడా పాల్గొన్నారు. కొండపోచమ్మ సాగర్‌లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కడంతో.. ఐదు జిల్లాల స్వప్నం సాకారమైంది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని సాగు, తాగునీటి అవసరాలను ఈ రిజర్వాయర్‌ తీర్చనుంది. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో కొండపోచమ్మ రిజర్వాయర్‌ చేపట్టారు. 557 మీటర్ల ఎత్తులోని రంగనాయక్‌సాగర్‌ నుంచి తుక్కాపూర్‌ పంప్‌హౌజ్‌ ఆ తర్వాత అక్కారం, మర్కూక్‌ పంప్‌హౌజ్‌లలో ఎత్తిపోయడంతో గోదావరి జలాలు 618 మీటర్ల ఎత్తులోని కొండపోచమ్మకు చేరుకుంటాయి.  కొండపోచమ్మ రిజర్వాయర్‌ సామర్థ్యం 15 టీఎంసీలు. కొండపోచమ్మతో ఐదుజిల్లాలో మొత్తం 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.

భారత్‌లో ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి

భారత్ లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజుకి ఆరువేలకు పైగా నమోదవుతున్న కేసులు.. ఇప్పుడు ఏడు వేల మార్కుని దాటాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 7,466 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. భారత్‌లో ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అలాగే, కరోనా మరణాల సంఖ్య కూడా పెరిగింది. 24 గంటల్లో 175 మంది కరోనాతో మరణించారు. భారత్ లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,65,799కి చేరగా, మృతుల సంఖ్య 4706కు చేరింది. కరోనా సోకిన వారిలో ఇప్పటివరకూ 71,105 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 89,987 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

హైకోర్టులో జగన్ సర్కార్ కి కాస్త ఊరట

హైకోర్టులో వరుస ఎదురుదెబ్బల నుంచి జగన్ సర్కార్ కి కాస్త ఊరట లభించింది. విశాఖ, గుంటూరు జిల్లాల్లోని భూముల వేలానికి సంబంధించిన ప్రక్రియను కొనసాగించుకునేందుకు హైకోర్టు అంగీకరించింది. అయితే, టెండర్లను ఖరారు చేయరాదని స్పష్టం చేసింది. జగన్ సర్కార్ విక్రయించదలచిన భూముల్లో దాతలు ఇచ్చినవి ఉన్నాయని, నిబంధనల మేరకు వాటిని విక్రయించడానికి వీల్లేదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై గురువారం మరోమారు విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు లాయర్లు వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 28 నుంచే భూముల వేలం ప్రక్రియ జరగనుందని, చట్టనిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ  ప్రక్రియను అడ్డుకోవాలని కోరారు. 2012 లో తీసుకొచ్చిన భూకేటాయింపు విధానం మేరకు ఈ భూముల్ని విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని కోర్టుకు వివరించారు. గుంటూరులో విక్రయించతలపెట్టిన స్థలంలో మార్కెట్‌ కొనసాగుతోందని, ప్రజావసరాలకు అనుగుణంగా ఉన్న దీనిని విక్రయించరాదని వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్ సుధాకర్‌రెడ్డి ‌వాదనలు వినిపిస్తూ.. భూముల వేలం వాయిదా పడిందని, జూన్‌ 11 నుంచి 13 వరకు వేలం నిర్వహించనున్నామని తెలిపారు. ప్రభుత్వం విక్రయించతలచిన భూములన్నీ ఖాళీ స్థలాలని. వాటిని విక్రయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వివరించారు. ఇరువురి వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందంటూ విచారణను జూన్‌ 18 కి వాయిదా వేసింది.

హైకోర్టు ను ఆశ్రయించిన డాక్టర్ సుధాకర్

డాక్టర్ సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా తనను ఈ నెల 16 నుంచి విశాఖలోని మానసిక వైద్యశాలలో నిర్బంధించారని ఆరోపించారు. తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా మానసిక రోగులకు ఇచ్చే మందులు ఇస్తున్నారని, వాటి వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం కోసం తనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, హైకోర్టు పర్యవేక్షణలో వైద్యం అందించేలా ఆదేశాలివ్వాలని కోరారు. సుధాకర్ దాఖలు చేసిన పిటిషన్ ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణకు రానుంది. పిటిషన్ లో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య అరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విశాఖ సీపీ, విశాఖ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌లను ప్రతివాదులుగా చేర్చారు.

టీడీపీ నేతల తీరును తప్పుబట్టిన చినరాజప్ప

పలువురు టీడీపీ నేతల తీరును ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి చినరాజప్ప తప్పుబట్టారు. రెండో రోజు మ‌హానాడులో భాగంగా పార్టీ సంస్థాగత తీరు తెన్నులపై చినరాజప్ప తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు నేతల తీరును తప్పుబట్టారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారని, ప్రభుత్వంలో లేకుంటే పార్టీ గురించి పట్టించుకోరా? అని ప్రశ్నించారు. ఎవ‌రు ఏ విధంగా వ్వ‌వ‌హారిస్తున్నారో గ‌మ‌నించాలని, బాగా పని చేస్తున్న వాళ్లనే చంద్రబాబు ప్రమోట్ చేయాలని సూచించారు.  మనం చేసిన అభివృద్ధిని కూడా చెప్పుకోలేకపోయామని అన్నారు. కార్యకర్తలను చూసుకోవాలని అధినేత చంద్రబాబు చెప్పినా పట్టించుకోలేదని, దాంతో కార్యకర్తలు సైలెంట్ అయ్యారని అందువల్లే టీడీపీ ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధికారం కోల్పోగానే కొందరు నేతలు వెళ్లిపోయారని, వెళ్లిపోయిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. వెళ్లిపోయిన నేతలు ఇప్పుడు కనుమరుగయ్యారని అన్నారు. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు ముఖ్యం కాదని కార్యకర్తలే ముఖ్యమని చినరాజప్ప చెప్పారు.

టీటీడీ భూములు విక్రయించరాదని తీర్మానం

టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం జరిగింది. చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా టీటీడీ ఆస్తులు విక్రయించకూడదని నిర్ణయించింది. నిరుపయోగ ఆస్తులు అన్యాక్రాంతమవకుండా ఉండేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. పాలక మండలి సమావేశంలో టీటీడీ భూములు విక్రయించరాదని తీర్మానం చేసినట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయానికి అనుణంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. టీటీడీ భూములు, ఆస్తులు ఎట్టి పరిస్థితిల్లో అమ్మేదిలేదని స్పష్టం చేశారు. టీటీడీ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామని అన్నారు. వీలైనంత త్వరగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తాం.. దర్శనానికి సంబంధించి నియమ, నిబంధనలు రూపొందిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

వలస కార్మికుల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

వలస కార్మికుల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బస్సు, రైలు ప్రయాణాల్లో వలస కార్మికుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛార్జీలు వసూలు చేయరాదని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వారి వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయవద్దని స్పష్టం చేసింది. అంతేకాదు వలస కార్మికులకు బస్సులు, రైళ్లలో ఆహారం అందించాలని ఆదేశించింది. వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు బయలు దేరే ముందే ఆయా రాష్ట్రాలు మంచినీళ్లు, ఆహారం అందించాలని తెలిపింది. రైళ్లలో ఆహారం, నీరు ఇతర ఏర్పాట్లను ఏ రాష్ట్రానికి వెళ్తున్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. రైల్వే కూడా వారికి ఆహారం, నీరు ఇతర ఏర్పాట్లు చేయాలి. బస్సుల్లో కూడా ఇదే విధానం అమలు కావాలని ఆదేశించింది.  వలస కూలీలు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వీలైనంత త్వరగా వారు తమ గమ్యస్థానాలకు వెళ్లే ఏర్పాట్లు చేయాలని చెప్పింది. ముఖ్యంగా కాలి నడకన వెళ్తున్న వలస కార్మికులకు తక్షణమే సాయం అందించాలని సూచించింది. వలస కార్మికులు పడుతున్న కష్టం చూసి గుండె తరుక్కుపోతోందని తెలిపింది. వలస కార్మికుల విషయంలో అనేక లోటుపాట్లను తాము గుర్తించామని.. రిజిస్ట్రేషన్, ట్రాన్స్‌పోర్టేషన్‌తో పాటు ఆహారం మంచినీళ్లు అందించే ఏర్పాట్లలో లోపాలు గుర్తించామని తెలిపింది. వారిని వారి స్వస్థలాలకు తరలించే విషయంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సమన్వయం ఉండాలని, ప్రతి కార్మికుడూ క్షేమంగా తన ఇల్లు చేరేలా చూడాలని సుప్రీంకోర్టు కోరింది.

జగన్ సమక్షంలో కియా కీలక ప్రకటన.. ఏపీలో భారీ పెట్టుబడులు

దక్షిణ కొరియాకు చెందిన కార్ల కంపెనీ కియా మోటార్స్ కీలక ప్రకటన చేసింది. ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు కియా మోటార్స్ ప్రకటించింది. 'మన పాలన - మీ సూచన' కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ పారిశ్రామిక రంగంపై ఈరోజు సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కియా సంస్థ అధికార ప్రతినిధి కూకున్ షిమ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ సమక్షంలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అదనంగా మరో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టబోతున్నామని తెలిపారు. కియా ఎస్‌యూవీ వెహికల్స్‌ తయారీకి కొత్తగా పెట్టుబడులు పెడతామని స్పష్టం చేశారు.  ఏపీతో కియా మోటార్స్ కు బలమైన బంధం ఉందని కూకున్ చెప్పారు.

టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ మహానాడులో రెండో రోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. టీడీపీ ఎవరికీ భయపడదని, సవాళ్లు ఎదుర్కోవడం టీడీపీకి కొత్త కాదని అన్నారు. టీడీపీని ఎవరూ కదిలించలేరని చెప్పారు. గతంలో టీడీపీపై బురదజల్లిన వారు అదే బురదలో కూరుకుపోయారని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడుతున్నారని.. వారే తమ పార్టీకి శక్తి అని చెప్పారు. వైసీపీ బెదిరింపులకు ఎవరూ భయపడరని తెలిపారు. టీడీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎన్టీఆర్‌కు ఎవరూ సాటిలేరని, ఆయన పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారని అన్నారు. పేద ప్రజల కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని, మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించారని అన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టడమే తన సిద్ధాంతమని ఎన్టీఆర్ చెప్పేవారని తెలిపారు. సామాజిక న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగుదనానికి నిలువెత్తు రూపం ఎన్టీఆర్. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఎన్టీఆర్ జయంతి కావడంతో చంద్రబాబుతో పాటు పలువురు ముఖ్యనేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. అలాగే, ఎన్టీఆర్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలంటూ మహానాడులో టీడీపీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

ప్రత్యేక హోదాపై జగన్ కొత్త మాట.. ఇప్పట్లో కష్టమేనట!!

రాష్ట్ర విభజన తరువాత ఏపీ ప్రజలు బలంగా కోరుకున్నది ఒక్కటే.. ప్రత్యేక హోదా. కానీ, రాను రాను ఆ కోరిక నెరవేరుతుందన్న నమ్మకం దూరమవుతుంది. 2014 ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేకహోదా ఇస్తామని మాట ఇచ్చారు. కానీ, తరువాత ప్రత్యేక ప్యాకేజీ అంటూ మాట మార్చారు. ఇక హోదా రావడం కష్టమే అనుకుంటున్న సమయంలో.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ హోదా తీసుకొస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వానికి హోదా తీసుకురావడం చేతకావడంలేదని, వైసీపీకి అత్యధిక ఎంపీ సీట్లు కట్టబెడితే, కేంద్రం మెడలు వంచైనా తాను హోదా తీసుకొస్తానని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలుచుకుంది. కానీ, ఏపీ ప్రజల కోరికైన ప్రత్యేక హోదాని మాత్రం తీసుకురాలేకపోతోంది. ఈ సంవత్సరం సంవత్సరన్నర కాలంలో జగన్ స్వరం కూడా కాస్త మారింది. ఎన్నికలకు ముందు కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని చెప్పిన ఆయన.. తీరా ఎన్నికల్లో గెలిచాక.. ఢిల్లీ సాక్షిగా హోదా రావడం కష్టమే అన్నట్టు మాట్లాడారు. హోదా ఇచ్చేవరకు కేంద్రాన్ని బ్రతిమాలాడమే అన్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో హోదాపై చాలామంది ఆశలు వదులుకున్నారు. ఇక తాజాగా, జగన్ వ్యాఖ్యలు చూస్తే.. అసలు ఈ నాలుగేళ్లు హోదా మాటని మర్చిపోతే మంచిది అన్నట్టుంది. వైసీపీ మేధోమదనం సదస్సులో భాగంగా ‘మన పాలన-మీ సూచన’ పేరుతో సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో.. ప్రత్యేక హోదా ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కేంద్రం ఇవ్వలేదని.. హోదా వస్తే ఏపీకి ఎన్నో కంపెనీలు వచ్చేవన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయిందని విమర్శించారు. పూర్తి మెజార్టీతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, లేదంటే ఆ పార్టీకి మద్దతిచ్చే క్రమంలో ప్రత్యేక హోదా డిమాండ్‌ చేసేవాళ్లమని చెప్పారు. ప్రస్తుతం ప్రత్యేక హోదాకు దూరంగా ఉండే పరిస్థితి నెలకొందన్నారు. అయితే, భవిష్యత్‌లో మాత్రం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇతర పార్టీలపై ఆధారపడే పరిస్థితి వస్తుందని.. అప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్‌ నెరవేర్చాలని డిమాండ్ చేస్తామని జగన్ తెలిపారు. జగన్ మాటలను బట్టి చూస్తుంటే ఈ నాలుగేళ్లు హోదా మాటని మర్చిపోండి అన్నట్టే ఉంది. ఒకవేళ, వచ్చే ఎన్నికల్లో కూడా కేంద్రంలో మళ్లీ బీజేపీనే పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి?. మళ్లీ ఆ ఐదేళ్లు కూడా హోదాని మర్చిపోవాలా?. అంటే ప్రత్యేక హోదా కావాలని గట్టిగా డిమాండ్ చేయాలంటే కేంద్రంలో ఖచ్చితంగా హంగ్ రావాలి. ఆ హంగ్ ఎప్పుడొస్తుంది?.. ఒకవేళ హంగ్ వచ్చినా.. హోదా డిమాండ్ చేసే అన్ని ఎక్కువ ఎంపీ సీట్లు, వైసీపీ అప్పుడు కూడా గెలుచుకుంటుందా?. ఏంటో.. ఇప్పటికే చాలామంది హోదాపై ఆశలు వదులుకున్నారు. ఇక కొన్నేళ్లు పొతే అసలు హోదానే మర్చిపోతారేమో. అసలు హోదా వస్తుందో రాదో?.. ఒకవేళ వచ్చినా ఎప్పుడొస్తుందో? అంతా ఆ వెంకన్నకే తెలియాలి.

ఇకనుంచైనా బాధ్యతగా ఉందాం.. చిన్నారుల ప్రాణాలను కాపాడుకుందాం

బోరుబావిలో పడి చిన్నారి మృతి. ఈ వార్త ఒకటి రెండు సార్లు కాదు.. కొన్ని వందల సార్లు వింటున్నాం. విన్న ప్రతిసారి అయ్యో పాపం అంటూ బాధపడుతున్నాం. కాసేపటికి అంతా మర్చిపోయి మళ్లీ మన పనిలో మనం పడిపోతున్నాం. 'నేటి బాలలే రేపటి పౌరులు', 'పిల్లల భవిష్యత్ కు బంగారు బాటలు'.. వంటి వాటిని మాటలకే పరిమితం చేస్తున్నాయి బోరు బావులు. బుజ్జి బుజ్జి మాటలు, బుడి బుడి అడుగులతో అప్పుడే ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటున్న చిన్నారులను బోరుబావులు మింగేస్తున్నాయి. జీవితంలో ఇంకా ఏమి చూడని ఎందరో చిన్నారుల జీవితాలకు అప్పుడే ముగింపు పడటానికి కారణం ఎవరు?. చిన్నారి బోరు బావిలో పడితే నిముషాలు, గంటల్లో ప్రాణాలతో బయటకు తీసే టెక్నాలజీని అందుబాటులో ఉంచని ప్రభుత్వమా?.. నీరుపడని బోరుబావులను నిర్లక్ష్యంగా వదిలేస్తున్న ప్రజలా?.. ఎవరు? ఆ చిన్నారుల చావుకి కారణం ఎవరు?.. ఇద్దరిది తప్పుంది. కానీ, అసలు ప్రమాదానికి కారణమవుతున్న ప్రజలది.. అంటే మనదే ఎక్కువ తప్పుంది. కష్టం మన వరకు వస్తేనే కానీ బాధ విలువ తెలియదు అంటారు. కానీ, ఎందరో తల్లిదండ్రుల కన్నీళ్లు చూసైనా.. ఆ కష్టం మనదే అనుకొని బాధ విలువ తెలుసుకోవాలి. ఎందరో తల్లిదండ్రుల శోకానికి కారణమవుతున్న బోరు బావుల పని పట్టాలి. నీరుపడని ఖాళీ బోరుబావులను అలా నిర్లక్ష్యంగా వదిలేయకండి. మూతలు పెట్టండి లేదా పూడ్చేయండి. ఆ బోరుబావి మాది కాదు, మాకు సంబంధం లేదు అనుకోకండి. మీ కాలనీలోనో, మీ ఊరిలోనో లేదా మరెక్కడైనా సరే.. ఖాళీగా వదిలేసిన బోరుబావులు కనిపిస్తే.. కనీస బాధ్యతగా దగ్గరలోని అధికారులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఇప్పటివరకు మనం నిర్లక్ష్యంగా ఉన్నది చాలు.. చిన్నారుల ప్రాణాలు పోగొట్టింది చాలు. ఇకనుంచైనా బాధ్యతగా ఉందాం. ఖాళీ బోరు బావులను పూడ్చేసి.. చిన్నారుల ప్రాణాలను కాపాడుకుందాం.

కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ముందు హాజరైన ఏపీ సీఎస్

ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి పార్టీ రంగులు వేసిన విషయంలో ఈ రోజు హైకోర్టు ముందు ఏపీ చీఫ్ సెక్రటరీ నీలం సహానీ హాజరయ్యారు. ఆమెతో పాటు ఏపీ పంచాయత్ రాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజ శంకర్ హాజరయ్యారు. ప్రభత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులు తొలగించాలని గతంలో ఏపీ హైకోర్టు తీర్పివ్వగా, దానికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లగా, అక్కడ కూడా చుక్కెదురయ్యింది. దానితో ఏపీ హైకోర్టు ప్రభుత్వ కార్యాలయాల రంగులు తొలగించేందుకు గడువు విధించింది. ఐతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొత్తగా మరో జీవో తెచ్చి ఉన్న రంగులకు అదనంగా టెర్రకోట రంగు (మట్టి రంగు) వేయాలని 623 నంబరు జీవో ఇచ్చింది. ఐతే దీని పై స్పందించిన హైకోర్టు ఆ జీవో ను రద్దు చేసి ఎటువంటి పరిస్థితులలోను ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులు తొలగించాలని, అలాగే ఏపీ సీఎస్, పంచాయత్ రాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజ శంకర్ ల పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని అలాగే ఈ విషయంపై వివరణ ఇవ్వడానికి ఆ అధికారులు స్వయం గా హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో సిఎస్ నీలం సహానీ తో కలిసి మిగిలిన ఇద్దరు అధికారులు హాజరయ్యారు. మరో నెలలో రిటైర్ కాబోతున్న సీఎస్ నీలం సహానీ ఇలా కోర్టు ముందుకు రావలసి రావడం కొంత ఇబ్బందికరమే.

కొనసాగుతున్న కరోనా ఉధృతి.. ఏపీలో 54.. భారత్ లో 6,566

ఏపీ‌లో కరోనా ఉధృతి తగ్గట్లేదు. ప్రతిరోజూ 50 కి పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 9,858 శాంపిల్స్ ను పరీక్షించగా 54 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 45 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,841కు చేరుకుంది. కాగా, గత 24 గంటల్లో కర్నూల్ లో ఒకరు కరొనతో చనిపోయారు. దీంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 59కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,958 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఆసుపత్రుల్లో 824 మంది చికిత్స  పొందుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా రోజుకి ఆరు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 6,566 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,58,333కి చేరింది.  గత 24 గంటల్లో 194 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 4,531 చేరుకుంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 67692 మంది కోలుకోగా, ప్రస్తుతం 86,110 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.

రాజధాని తరలింపుకు ముహూర్తం ఖరారు.. ఇది ఫిక్స్!!

ఏపీ రాజధాని తరలింపుకు విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామి దివ్యమైన ముహూర్తం పెట్టినట్టు తెలుస్తోంది. మొన్నటివరకు ఈ లాక్ డౌన్ సమయంలోనే రాజధాని తరలింపు ఉంటుందని వార్తలొచ్చాయి. వాస్తవానికి నేడు(మే 28) కొద్దిమంది స్టాఫ్ తో అమరావతి నుంచి విశాఖకు తరలిపోవాలని భావించారు. అయితే చివరి నిమిషంలో ఆ ఆలోచనను విరమించుకున్నారు. కాగా, ఇప్పుడు అక్టోబర్ 25 న రాజధాని తరలింపుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ నెలాఖరువరకు దివ్యమైన ముహుర్తాలు లేవని, అక్టోబర్ 25 విజయదశమి రోజున రాజధాని తరలింపుకు శ్రీకారం చుడితే.. అంతా విజయం చేకూరుతుందని స్వరూపానందేంద్ర స్వామి చెప్పడంతో.. అదేరోజున రాజధాని తరలించాలని జగన్ సర్కార్ నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు స్వరూపానందేంద్ర స్వామిపై ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. సీఎం అవ్వకముందు, సీఎం అయిన తరువాత అనేకసార్లు స్వరూపానందేంద్రను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడానికి కూడా ఆయననే ముహూర్తం పెట్టారు. పలు విషయాల్లో జగన్ కి సలహాలు, సూచనలు కూడా ఇస్తుంటారు. రాజధాని తరలింపుకు కూడా ఆయన చేతనే ముహూర్తం పెట్టించిన జగన్.. విజయదశమి రోజు నుంచి విశాఖ వేదికగా పాలన సాగించనున్నారని సమాచారం. 

తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) జయంతి సందర్భంగా పలువురు సినీరాజకీయ ప్రముఖులు ఆయనను స్మరించుకుంటూ ట్వీట్స్ చేశారు. "ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి, కోట్లాది సామాన్యులకు అండగా, నిలిచిన మేరునగ ధీరుడు నందమూరి తారకరామారావుగారు. ఎన్టీఆర్ అంటేనే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం. ఆయన కృషి, క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ది, దీక్షాదక్షత ప్రతి ఒక్కరికీ  మార్గదర్శకం. ఎన్టీఆర్ మానవతా దృక్పథం, సేవానిరతి, సామాజిక సంస్కరణాభిలాష, నమ్ముకున్న ప్రజలకు మంచి చేయడం కోసం ఎంతటికైనా తెగించగల సాహసం... తరతరాలకు ఆదర్శమే. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకు పునరంకితమవుదాం. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లని చాటుదాం." అని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. "తెలుగు జాతి  పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం  తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం  నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం.  వారితో కలిసి నటించడం నా అదృష్టం.  పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ..." అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. "మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది,  మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది,  పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా..  సదా మీ ప్రేమకు బానిసను" అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.  "సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు అన్నది ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చాక పార్టీ కోసం అందించిన నినాదం కావచ్చు. కానీ అంతకుముందే తన జీవితమంతా ఈ మాటలను అక్షరాలా ఆచరించిన మానవతావాది ఎన్టీఆర్ గారు. ప్రజలకు అవసరమైనప్పుడల్లా తన వంతు సేవను, సహకారాన్ని అందించిన ప్రజాబంధువు ఎన్టీఆర్. బడుగులకు రాజకీయ అవకాశాలను పంచిన సమసమాజవాది... పేదలకు మెరుగైన జీవనాన్ని అందించిన సంక్షేమవాది. మహిళలకు సమాన హక్కులను కల్పించిన అభ్యుదయవాది.... నందమూరి తారకరామారావుగారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుని కళాసేవను, ప్రజాసేవను స్మరించుకుని స్ఫూర్తిని పొందుదాం" అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

తెలుగువాళ్ళ చిరకాల స్వప్నం సాకారం చేయాలి

ఎన్‌. టి. ఆర్.. ఈ మూడు అక్షరాల పేరుని కోట్లమంది ఆరాధిస్తారు. ఆ కోట్ల మందిలో సినీరాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. వారిలో ప్రముఖ దర్శకులు వై.వి.ఎస్ చౌదరి ఒకరు. ఎన్టీఆర్ పై తన అభిమానాన్ని ఎప్పటికప్పుడు చాటుకునే వైవిఎస్.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా.. అక్షర రూపంలో తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్ట్ లోని ప్రతి లైన్ ఎన్టీఆర్ పై ఆయనకున్న అభిమానాన్ని తెలియజేస్తుంది. ఆ అభిమానాన్ని ఆయన మాటల్లోనే చదవండి. "విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్‌, స్వర్గీయ 'నందమూరి తారక రామారావు (ఎన్‌. టి. ఆర్‌.)' గారు ఎన్నో పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘీక చిత్రాలలో నటించటమే కాక, ఆయా పాత్రలలో జీవించి, తన దివ్య మోహన రూపంతో ఎందరికో స్పూర్తి నిచ్చారు. 1983 వరకూ CM, PM, MLA, MP, గవర్నర్‌ మరియూ రాష్ట్రపతి లాంటి రాజకీయ పదవుల్లోని తేడాపై ధ్యాసే పెట్టని 'తెలుగు' ప్రజానీకానికి, తనకున్న తిరుగులేని జనాకర్షణ శక్తితో ఆత్మీయ 'అన్న'గా దగ్గరై, వాళ్ళల్లో 'రాజకీయ చైతన్యం' తీసుకురావటమే కాక, 'ఆత్మగౌరవం' నినాదంతో, అప్పటివరకూ 'మదరాసీ'లుగా పిలువబడుతున్న 'తెలుగు జాతి'కీ, 'తెలుగు భాష'కీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపునీ తెచ్చారు. ఆయన తన పరిపాలనలో తీసుకున్న సంచలనాత్మక, విప్లవాత్మక నిర్ణయాలు మరియూ సంక్షేమ పధకాలు ఇప్పటికీ ఎందరో రాజకీయవేత్తలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.  అంతే కాకుండా హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలచిన 'మహాభారతం', 'భాగవతం', 'రామాయణం'లోని పాత్రలకు తన సినిమాల ద్వారా సజీవ రూపకల్పన చేసి, మన కళ్ళముందు కదలాడారు. తన 60 ఏళ్ళ వయస్సులో, ఆ రోజుల్లో మన 'తెలుగు'నాట ఉన్న గతుకుల రోడ్లల్లో, 'చైతన్యరధం' పైభాగాన కూర్చొని తిరుగుతూ, ప్రతీ కిలోమీటరుకూ వేలాదిగా, లక్షలాదిగా ప్రజల్ని ఆకర్షిస్తూ, 'చైతన్యరధం' పైనే నిలబడి తన ప్రసంగాల ద్వారా వాళ్ళల్లో ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని నింపారు. భావితరాల వాళ్ళు 'మానవమాత్రులకు ఇంతటి జనాకర్షణశక్తి సాధ్యమా' అని కలలో కూడా ఊహించుకోలేనటువంటి అసాధ్యాలను సుసాధ్యాలుగా మలుస్తూ ఒక 'కా'రణ'జన్ముడి'లా, 'యుగపురుషుడి'లా, ఓ 'దైవం'లా అవతరించారు.  ‘తెలుగు జాతి’కి గర్వకారణం మరియూ ‘తెలుగు పలుకు’లను తన కంఠంతో కొత్తపుంతలు తొక్కించిన ఆ 'మహాపురుషుని’ జ్ఞాపకార్ధం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏవైనా రెండు జిల్లాలకి ‘ఎన్‌. టి. ఆర్‌. జిల్లా’ పేరుతో నామకరణం జరపాలనీ.. ఆయన్ని ‘భారతరత్న’ బిరుదాంకితుడిగా చూడాలన్న తెలుగువాళ్ళ చిరకాల స్వప్నం సాకారం చేయాలనీ.. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న అసంఖ్యాక తెలుగు వారందరి తరపున.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, భారతదేశ ప్రభుత్వాలను వినమ్రంగా కోరుతున్నాను.  'కా'రణ'జన్ములు', 'యుగపురుషులు' ఎప్పుడూ సందేశాలు ఇవ్వరు. కానీ, తమ తమ జీవనవిధానాల ద్వారా మనకి స్పూర్తినిచ్చే ఆశయాలని, మన మధ్య వదిలి 'భువి' నుండీ 'దివి'కి పయనమవుతారు. అలా ఆయన వదిలిన వెళ్ళిన ఎన్నో ఆశయాలలో ముచ్చటకి మూడు.. 1. ఏ పనినైనా 'అంకితభావం'తో చేయడం.. 2. ఆ పని ఎంత 'కష్టమైనా ఇష్టపడి' చేయటం.. 3. ఆ పనిని సాధించటంలో 'మడమ తిప్పకుండా పోరాటం' చెయ్యటం.. ‘ఆయన’ నాకు ‘దేవుడు’. నాలాగా ఎంతోమందికి ‘దైవసమానం’. ‘ఆయన’ దివ్యమోహనరూపమే నన్ను సినిమాలవైపు తద్వారా సినీపరిశ్రమకు తీసుకువచ్చింది. ఆయన ఆశయాల స్పూర్తితోనే నేను ఇక్కడ నిలబడ్డాను. అంతేకాదు, నేనిక్కడ పొందిన కీర్తీ, సంపాదిస్తున్న ప్రతీ పైసా ఆయన Account లో నుండీ Draw చేసుకుంటున్నట్లే Feel అవుతాను. అందుకే నా సొంత చలనచిత్ర నిర్మాణ సంస్థ అయిన  ‘బొమ్మరిల్లు వారి’ బేనర్‌పై నేను నిర్మించే ప్రతీ సినిమా ప్రారంభం ‘ఆయన’ ఫొటోపై.. “నా పరిపూర్ణ, పరిశుద్ధ హృదయంతో, నిను కొల్చు భాగ్యం ఇంకెప్పుడూ, ప్రభూ.. ఈ జన్మకూ..” అంటూ సంగీత సవ్యసాచి ‘యం యం కీరవాణి’గారు స్వయంగా రచించి, స్వరపరచి, ఆలపించిన ‘ప్రార్ధనాగీతం’తో మొదలై, మళ్ళీ సినిమా చివరిలో ‘ఆయన’ అదే ఫొటోపై ‘కృతజ్ఞతాభావం’తో పూర్తి అవుతుంది.  అలా నాకే కాదు, ఇక్కడ 'అమలాపురం'లోని 'రిక్షాపుల్లర్' నుండి, ఎక్కడో 'అమెరికా'లో ఉంటున్న 'సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్' వరకూ, ప్రపంచవ్యాప్తంగా.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, వివిధ రంగాలలో ఉన్న, నాలా ఎంతో మంది 'తెలుగు' వాళ్ళకు, ఆయన తన ఆశయాల ద్వారా స్పూర్తినిచ్చారు. ‘మరణంలేని జననం ఆయనిది, అలుపెరగని గమనం ఆయనిది, అంతేలేని పయనం ఆయనిది..’ ‘ఆయన’ ఎక్కడున్నా నన్నూ, నాలాంటి అభిమానుల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ ఉంటారనే నా నమ్మకం. అటువంటి ‘అవిశ్రాంత యోధుని’ 9️⃣8️⃣వ 'జయంతి' సందర్భంగా..  జై ‘నటరత్నం’.. జై జై ‘తెలుగుతేజం’.. జై జై జై ‘విశ్వవిఖ్యాతం’.. జోహార్ 'ఎన్. టి. ఆర్‌.’.. అంటూ ఆ ‘మహనీయుని’ తలచుకుని, స్మరించుకోవటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ 'తెలుగు'వాడు తనని తాను గౌరవించుకోవటంతో సమానంగా భావిస్తూ.. ‘ఆయన’ వీరాభిమాని, వై వి ఎస్ చౌదరి."

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ షాక్‌!

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మళ్లీ షాక్‌ ఇచ్చింది. వరుసగా మూడో నెల కూడా ఉద్యోగుల జీతాల్లో కోతను విధించింది. లాక్‌డౌన్‌తో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇళ్లకే పరిమితం కావడంతో.. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగుల జీతాలు కోతపెట్టారు. అయితే, ఇప్పుడు లాక్‌డౌన్‌ సడలింపులతో మళ్లీ సాధారణ పరిస్థితులు రావడంతో.. మే నెలలోనైనా పూర్తి జీతం వస్తుందని ఉద్యోగులు భావించారు. కానీ, ఈ నెల కూడా ఉద్యోగులకు సగం జీతం మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే నెల కూడా ఉద్యోగులకు సగం జీతం ఇవ్వాలని.. ఆర్థిక శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.