శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్.. 

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్నారా? త్వరలో వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. ఇకపై శ్రీవారి దర్శనానికి వెళ్లాలంటే కొన్ని షరతులు విధించింది టీటీడీ. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకు వచ్చింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. కొండకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని స్పష్టం చేశారు ఇక పై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ ఉంటేనే అనుమతిస్తారు.  మూడు రోజుల ముందు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు. టీటీడీ పాలకమండలి ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు తీసుకుంటున్నప్పటి నుంచి దర్శనం టోకెన్లను క్రమంగా పెంచుతున్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు నియంత్రణలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. రెండు వారాల చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులకు మాత్రమే సర్వదర్శనం టోకెన్లు జారీ చేయగా.. ఇటీవలే ఇతర ప్రాంతాల వారిని కూడా ఉచిత దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ నెల 25న ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేయనున్నారు.  సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు ఎనిమిది వేల చొప్పున ఎస్డీ టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఈనెల 26 నుంచి తిరుపతిలో ఆఫ్లైన్లో జారీ చేసే ఎస్డీ టోకెన్లను నిలిపివేయబోతున్నారు. తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం గుంపులుగా నిలబడటం వల్ల కరోనా వేగంగా సంక్రమించే ప్రమాదం ఉందని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అక్టోబరు మాసం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఎల్లుండి ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో  విడుదల చేస్తామని చెప్పారు.

నెల్లూరు జిల్లాలో ఆనం ఒంటరేనా? కేబినెట్ బెర్త్ మళ్ళీ అందని ద్రాక్షేనా? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తు మొదలు పెట్టారు. అధికారంలోకి వచ్చి  రెండున్నర సంవత్సరాలు దగ్గరవుతున్న నేపధ్యంలో, ముందుగా అనుకున్న విధంగా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ గడువు సమీపిస్తోంది. ముఖ్యమంత్రి తోలి మంత్రివర్గం ఏర్పాటు సమయంలోనే , రెండున్నర ఎల్లా తర్వాత ఉద్వాసన ఉంటుందని, అప్పాయింట్ ఆర్డర్స్ తో పాటుగానే ఊస్టింగ్  ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశారు. సో.. ఆ గడవు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి  కసరత్తు ప్రారంభించారని  పార్టీలో చర్చ జరుగుతోంది.  కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లేందుకు  సిద్దంగా ఉండమని మంత్రులకు హింట్ ఇచ్చారని వార్తలొచ్చాయి. మరో వంక ఫస్ట్ కాబినెట్ లో బెర్త్ మిస్సయిన సీనియర్ నాయకులు ఈ సారైనా ఛాన్స్ దక్కుతుందా లేదా అని ఆశగా ఎదురుస్తున్నారు. అలాంటి వారిలో కొదరు తమ వంతు ప్రయత్నాలు  ప్రారంభించారని పార్టీ వర్గాల్లో వినవస్తోంది.  ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నెల్లూరు జిల్లా సీనియర్ నాయకుడు ఆనం రామ నారాయణ రెడ్డి, అవకాశం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. జగన్ రెడ్డి ఫస్ట్ కాబినెట్’లోనే మంత్రి పదవి వస్తుందని ఆనం ఆశించారని అంటారు. నిజానికి అయన రెండు సార్లు పార్టీ మారింది, మంత్రి పదవి కోసమే అని అయన సన్నిహితులు అంటారు. మంత్రి పదవిని ఆశించే అనం సోదరులు రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. అయినా  కారణాలు ఏవైనా చంద్రబాబు నాయుడు ఆనంకు అవకాశం ఇవ్వలేదు.  ఈ నేపధ్యంలోనే ముందుగానే  జగన్ దగ్గర మాట పుచ్చుకుని మరీ ఆనం సోదరులు 2019 ఎన్నికల సమయంలో టీడీపీకి రాజీనామా  చేసి వైసీపీలో చేరారు. అయితే అక్కడ కూడా మళ్ళీ అదే కథ.  అదృష్టం మళ్ళీ అడ్డం తిరిగింది. మంత్రి పదవి రాలేదు. అనం ఆశించిన సీనియర్ కోటాను జంగన్ రెడ్డి అసలు పట్టించుకోలేదు. కారణాలు ఏవైనా ఆయన సీనియర్లు వద్దనే అనుకున్నారు. ఒకటి రెండు మినహా మిగిలిన బెర్తులన్నీ జూనియర్లకే కేటాయించారు. నెల్లూరు జిల్లా నుంచి రెడ్డి కోటాలో మేకపాటికి, బీసీ కోటాలో అనిల్ కుమార్ కు  అవకాశం ఇచ్చారు. ఈనేపధ్యంలో ఇప్పుదైనా ఆనంకు మంత్రి పదవి దక్కుతుందా అనే చర్చ  జరుగుతోంది.  అయితే ఈసారీ.. ఆనంకు సారీనే అనటున్నారు. అనంతో పాటుగా జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న వారు కనీసం మరో ఐదుగురు వరకు ఉన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి, కోటం రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి, సంజీవయ్య ..మంత్రి పదవుల రేసులో ఉన్నారు. మరో వంక పార్టీలో చేరి, ఎమ్మెల్యేగా  గే;లిచింది మొదలు ఆనం రామ నారాయణ రెడ్డి,  జగన్ ఆశించింది ఇవ్వలేక పోయారు. విధేయత చూపడంలో విఫలమయ్యారు. అసమ్మతి గళం కూడా వినిపించారు. అంతే కాదు, కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు, జగన్ రెడ్డిని చాలా దుర్మార్గంగా దూషించారు. కాబట్టి ఆనంకు మంత్రివ పదవి ఈసారి కూడా అందని ద్రాక్షగానే మిగిలిపోతుందని అంటున్నారు.

డెకాయిట్ల అడ్డా  టీఆర్ఎస్! రేవంత్ రెడ్డికి అఖిలపక్షం సపోర్ట్.. 

తెలంగాణ ప్రదేశ్ కమిటి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించడంపై విపక్షాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిని టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. అధికార పార్టీ కార్యకర్తలే ఆందోళనలు చేయడంపై విపక్ష నేతలు మండిపడ్డారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలకు మద్దతుగా నిలిచారని ఆరోపించారు.  రేవంత్ రెడ్డి ఇంటిపై దాడిని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. అసలైన డెకాయిట్లు అందరూ టీఆర్ఎస్ లోనే ఉన్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాయకుల ఇళ్లపై దాడులు చేయడం నీచ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. రేవంత్ ఇంటిపై దాడిని అఖిలపక్షం ఖండిస్తోందని చెప్పారు. ఇంకోసారి ఇలాంటి దాడులకు తెగబడితే సంగతి చూస్తామని హెచ్చరించారు. దమ్ముంటే డైరెక్ట్ గా రావాలని సవాల్ విసిరారు. ఇలాంటి దాడులు చేసే వారిని రాజకీయ పార్టీలు ప్రోత్సహించకూడదని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని టీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించేందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరకు వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలను.. రేవంత్ అనుచరులు తరిమేశారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో ఫుటేజీ ఉన్నప్పటికీ వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని పోలీసు అధికారులను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.   

నీళ్లడిగిన గ్రామస్తుడి తల పగలగొట్టిన సర్పంచ్.. వీడియో వైరల్

ఆయన ఊరికి సర్పంచ్. గ్రామ ప్రజల సమస్యలు తీర్చే  పదవిలో ఉన్నారు. అలాంటి సర్పంచ్ విచక్షణ కోల్పోయాడు. దిగజారి ప్రవర్తించాడు. గ్రామ సమస్యపై ప్రశ్నించిన ఓ వ్యక్తిపై దాడి చేశాడు. కొట్టడమే కాదు ఎగిరెగిరి తన్నాడు. బండ రాయితో తల పగులగొట్టాడు. గ్రామస్తుడిపై సర్పంచ్ దాడి చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం దామస్తపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. నీళ్ల సమస్యను ఎప్పుడు తీరుస్తారంటూ ప్రశ్నించినందుకు ఓ గ్రామస్థుడిపై సర్పంచ్ దాడి చేశారు. ఆ వ్యక్తిని ఎగిరెగిరి తన్నారు. అంతటితో ఆగకుండా రాయితో అతడిని చితకబాదారు. దీంతో ఆ వ్యక్తి తలకు తీవ్రగాయమైంది. కన్ను వాచిపోయింది. తలకు నాలుగు కుట్లు పడ్డాయి. బాధితుడు శ్రీనివాస్ ను సర్పంచ్ జైపాల్ రెడ్డి తన్నుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  గ్రామంలో కొన్ని రోజులుగా నీళ్ల సమస్య ఉందని, కిరాణా షాపుకు వెళ్లగా అక్కడ సర్పంచ్ తో పాటు మరికొందరు నీళ్ల గురించి మాట్లాడుకుంటుండగా తానూ సమస్యపై ప్రశ్నించానని బాధితుడు శ్రీనివాస్ చెప్పారు. అయితే, నువ్వేందిరా అడిగేదంటూ సర్పంచ్ తన్నాడని, కిందపడేసి రాయితో బాదాడని తెలిపారు. ఇష్టమొచ్చినట్టు తనపై దాడి చేశారని ఆరోపించారు. ఆ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సర్పంచ్  జైపాల్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.  అయితే తనపై కొందరు కావాలనే కుట్ర చేశారని సర్పంచ్ జైపాల్ రెడ్డి  వివరణ ఇచ్చారు. తాను ఊరికే శ్రీనివాస్ ను కొట్టలేదని, తనను బూతులు తిట్టాడని, అమ్మను కలిపి తిట్టాడని ఓపిక నశించే కొట్టానని చెప్పారు. దానికి సంబంధించిన వీడియో కూడా తన వద్ద ఉందన్నారు జైపాల్ రెడ్డి. వేరే వాళ్లతో తన గల్లా కూడా పట్టించి దాడి చేయించబోయాడన్నారు.బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు కలిసి తనపై కుట్ర చేశారని ఆరోపించారు. శ్రీనివాస్ తో తనకెలాంటి గొడవలు లేవని, అతడు మంచివాడని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల చెప్పుడు మాటలు విని తనపై దాడికి ప్రయత్నించాడని, తాగి వచ్చి గొడవ పెట్టుకున్నాడని తెలిపారు. పోలీసుల చెకింగ్ లో కూడా ఆ విషయం తేలిందని చెప్పారు సర్పంచ్ జైపాల్ రెడ్డి. 

భవానీపూర్ మరో నందిగ్రామ్ అవుతుందా? 

గత మార్చి, ఏప్రిల్ మాసాలలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని  గద్దె దించేందుకు బీజీపీ చేయని ప్రయత్నం లేదు. సర్వ శక్తులు వడ్డింది. ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా, సారధ్యంలో కేంద్ర మంత్రులు బెంగాల్ ను కమల దళం ఖాతాలో కలుపుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోలేదు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్నా లెక్క చేయలేదు. ఆ లెక్క చేయక పోవడం వలన దేశం కరోనా కోరల్లో చిక్కి విలవిల లాడింది. విపక్షాలు మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండా గట్టాయి. కరోనా సెకండ్ వేవ్ వైఫల్యం కేంద్ర ప్రభుత్వం,మరీ ముఖ్యంగా మోడీ ఇమేజ్’ని బాగా డ్యామేజి చేసింది. మోడీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది.  అయినా ఇంత చేసినా మమతా బెనర్జీని గద్దె దిచాలనే మోడీ, షా జోడీ కల మాత్రం నెరవేర లేదు. మమతా బెనర్జీ  సారధ్యంలో తృణమూల్ కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టింది. అయితే, గుడ్డిలో మెల్ల అన్నట్లుగా, ఆ ఎన్నికల్లో తృణమూల్ ముందుకంటే, మంచి మెజారిటీతో విజయం సాధించినా, నందిగ్రామ్ లో మాజీ సహచరుడు, బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి చేతిలో స్వల్ప తేడాతో ఓడి పోయారు. అయినా  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపధ్యంలోనే, తిరిగి శాసన సభ సభ్యత్వం పోనేందుకు,తమ సొంత నియోజక వర్గం భవానీపూర్’లో గెలిచిన పార్టీ అభ్యర్హ్ది .... చేత రాజీనామా చేయించారు. ఆ స్థానానికి ఈ నెల (సెప్టెంబర్) 30 న ఉప ఎన్నిక జరుగుతోంది.  నిజానికి, ఇక్కడి నుంచి మమత గెలుపు గురించి అంతగా కష్ట పడవలసిన అవసరం లేదు. అయినా మమత కష్ట పడుతున్నారు. కష్ట పడడమే కాదు భయపడుతున్నారు. మమత భయానికి కారణమా ఉంది. ఆమెను వరసగా రెండు సార్లు ఇదే నియోజక వర్గం నుంచి గెలిచినా, మూడవసారి పార్టీ అభ్యర్ధి .... విజయం సాధించినా, విక్టరీ మార్జిన్ మొదరి సారికంటే రెండవ సారికి, 50 వేల నుంచి 25 వేలకు  సగానికి సగం పడిపోయింది. అయితే, మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో ఆమె పోటీలో లేక పోయినా పార్టీ అభ్యర్ధి శోబన్ దేవ్ ఉపాధ్యాయ 28 వేల పై చిలుకు ఆధిక్యతతో విజయం సాధించారు. ఈ రెండు ఎన్నికలకు మధ్యన 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భవానీపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో తృణమూల్ అధిక్యత ఏకంగా మూడు వేలకు పడిపోయింది. ఇలా, అటూ ఇట్తో అవుతున్న ఎన్నికలోలో  భవానీ పూర్ ఓటర్లు ఈసారి ఎటు మొగ్గుచూపుతారో ఎలాంటి తేర్పు ఇస్తారో అని తృణమూల్ నేతల్లో అంతో ఇంతో భయం అయితే ఉందని అంటున్నారు.  భవానీపుర్  నియోజక వర్గంలో 40  శాతం ఉన్న బెంగాలీ ఇతరులలో చాలా వరకు హిందువులు, సిక్కులు, మార్వాడీలు, గుజారాతీలు ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో  బెంగాలీ ఇతరులు తృణమూల్ వైపే మొగ్గుచూపారు. కానీ  అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసలో ఈ వర్గాలకు చెందిన వారే హింసకు గురయ్యారు. మరో వంక బీజేపీ  ఎన్నికల అనంతర హింసనే ప్రధాన అస్త్రంగా ప్రచారం సాగిస్తోంది. అంతేకాదు, ఎన్నికల అనంతర హింసకు సంబందించిన కేసుల్లో బాధితుల తరపున న్యాయ పోరాటం సాగిస్తున్న యువ న్యాయవడి ప్రియాంకా తబ్రీవాల్’ ను బీజేపీ అభ్యర్ధిగా నిలిపింది. అలాగే, బెంగాల్ బీజేపీ నూతన అధ్యక్షుడు సుకాంత మజుందార్, మమతా బెనర్జీని తాలిబన్లతో పోలుస్తూ, ఆమె పై యుద్దాన్ని ప్రకటించారు. ఎన్నికల అనంతర హింసకు ఆమె మూల్యం చెల్లించ తప్పదని ఆన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా  ఓడిపోయారు. ఉపఎన్నికల్లో ముఖ్యమంత్రిగ ఓడి పోతారు అని అంటున్నారు.  ఈ నేపధ్యంలో బెంగాలేతర ఓటర్లు ఎటు మొగుచూపుతారో అనే ఆందోళన కూడా తృణమూల్ శ్రేణుల్లో వ్యక్త మావుతోందని అంటున్నారు. ఇక మిగిలిన 60 శాతం ఓటర్లలో  20 శాతం ఉన్న ముస్లిం ఓటు, గంప గుత్తగా మమత పడుతుందని, మిగిలిన 40 శాతం బెంగాలీ ఓటు కూడా అటూ ఇటూ అయితే, మమత గెలుపు అనుకున్నంత ఈజీ కాకపోవచ్చని అంటున్నారు. అంతే  కాకుండా మమత, జాతీయ రాజకీయలపై మక్కువ చూపుతున్న నేపధ్యంలో ఈ ఎన్నికల్లో మాములుగా గెలిస్తే సరిపోదని, లక్ష పైచిలుకు భారీ మెజారిటీతో విజయం సాధిస్తేనే ఆమెకు  ఆబోరు దక్కుతుందని అంటున్నారు. మరో వంక మమతను గద్దెదించేందుకు చేసిన తొలి ప్రయత్నంలో ఓడి పోయిన  బీజేపీ మాత్రం, సెకండ్ ఎఫర్ట్ లో అయినా, ఆమె మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కకుండా చేయాలని  శత విధాలా ప్రయత్నిస్తోంది.  అయితే  చివరకు ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో ... ఎవరికి  జై కొడతారో అక్టోబర్ 4 న తేలిపోతుంది.

ఇప్ప‌టిదాకా ఓ లెక్క‌.. రేవంత్‌రెడ్డితో మ‌రో లెక్క‌.. ఇక కాస్కో కేసీఆర్.. 

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆడిస్తున్నారు. గులాబీ నేత‌లంతా ఆడుతున్నారు. రేవంత్‌రెడ్డి ఉచ్చు ప‌న్నుతున్నారు. అందులోకి వ‌చ్చి టీఆర్ఎస్ నేతలు చిక్కుతున్నారు. రేవంత్‌రెడ్డి క‌వ్విస్తున్నారు.. ఏకంగా మంత్రి కేటీఆరే కంగారు ప‌డుతున్నారు. రేవంత్‌రెడ్డి టాపిక్ డిసైడ్ చేస్తున్నారు.. మంత్రులు, ఎమ్మెల్యేలంతా దానిపై స్పందిస్తున్నారు. అందుకే, కొన్ని వారాలుగా రేవంత్‌రెడ్డి పేరు తెలంగాణ‌లో మారిమోగిపోతోంది. రేవంత్‌రెడ్డి చుట్టూనే రాజ‌కీయం న‌డుస్తోంది. అధికార పార్టీని తోలుబొమ్మ‌లాట‌లా ఆటాడుకుంటున్నారు పీసీసీ చీఫ్‌. ఈ పొలిటిక‌ల్ స్ట్రాట‌జీలో పువ్వు గుర్తు పార్టీ సోదిలో కూడా లేకుండా పోతోంది. ఈ మ‌ధ్య ఈట‌ల రాజేంద‌ర్ న్యూసేమీ ఉండ‌టం లేదు. బండి సంజ‌య్ త‌న మానానా తాను జేబులో చెయ్యి పెట్టుకొని న‌డుచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయ సంగ్రామంలో రేవంత్‌రెడ్డిదే వ‌న్ మ్యాన్ షో న‌డుస్తోంది. ఆ.. ఏముంది రేవంత్‌రెడ్డే క‌దా.. చూసుకుందాం అనుకున్నారు మొద‌ట్లో. కేసులు, జైలుతో గ‌తంలోనే తొక్కేశాం.. ఇప్పుడు మాకో లెక్కా అనుకుంది అధికార పార్టీ. అయితే, ఆ లెక్క‌ల‌న్నీ స‌రి చేయ‌డానికే గోడ‌కు కొట్టిన బంతిలా వ‌చ్చాడ‌ని అస్స‌లు ఊహించ‌లేక‌పోయింది. పీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్‌రెడ్డి.. థౌజండ్ వాట్స్ ప‌వ‌ర్ ఉన్న పొలిటిక‌ల్ ట్రాన్స్‌ఫార్మ‌ర్‌లా మారిపోయారు. ట‌చ్ చేస్తే మాడి మ‌సైపోతున్నారు. ద‌ళిత గిరిజ‌న దండోరా స‌భ‌ల‌తో కాంగ్రెస్ స‌త్తా, త‌న నాయ‌కత్వ ప‌టిమ‌ను ఘ‌నంగా చాటారు. ల‌క్ష‌లాది మంది జ‌నంతో వ‌రుస స‌భ‌లు నిర్వ‌హించి త‌న‌ను తాను నిరూపించుకున్నారు. నిర్మ‌ల్‌లో బీజేపీ స‌భ పెట్టి, కేంద్ర‌హోంమంత్రి అమిత్‌షా వ‌స్తే.. స‌భా ప్రాంగ‌ణం చాలా వ‌ర‌కు ఖాళీ. అదే రోజు దాదాపు అదే స‌మ‌యంలో కేటీఆర్ ఇలాఖా గ‌జ్వేల్‌లో రేవంత్‌రెడ్డి స‌భ పెడితే 2 ల‌క్ష‌ల మంది జ‌నంతో మాంచి ఊపు. వ‌రుస స‌భ‌ల‌తో రేవంత్ ఎంత‌టి మొన‌గాడే తేలిపోయింది. ఆయ‌న వెన‌కే కాంగ్రెస్ అంతా క‌దిలొచ్చింది. ఆయ‌న వెనుకున్న అభిమాన గ‌ణం లెక్క తేలిపోయింది. ఇలా బ‌ల నిరూప‌ణ త‌ర్వాత‌.. త‌న రాజ‌కీయ చ‌తుర‌తను అధికార పార్టీకి రుచి చూపించారు రేవంత్‌రెడ్డి. అది.. మ‌రింత దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ చేసింది. వైట్ ఛాలెంజ్‌తో కారు పార్టీ యువ‌రాజు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. లాక్కోలేక పీక్కోలేక విల‌విల్లాడు. అంత‌కుముందు శ‌శిథ‌రూర్ విష‌యంలో రేవంత్‌రెడ్డిని ఇరికిద్దామ‌నుకున్నారు కేటీఆర్‌. కానీ, కేటీఆర్ ఉచ్చు నుంచి గంట‌ల వ్వ‌వ‌థిలోనే తుర్రున జారుకున్నారు. నేరుగా శ‌శిథ‌రూర్‌కే ఫోన్ చేసి.. సారీ చెప్పి.. తాను ఎక్క‌డ త‌గ్గాలో తెలిసిన నిజ‌మైన నాయ‌కుడిన‌ని నిరూపించుకున్నారు రేవంత్‌రెడ్డి. పాపం.. కేటీఆర్ ఆ ఎపిసోడ్‌లో బాగా డిస‌ప్పాయింట్ అయిన‌ట్టున్నారు. ఇక వైట్ ఛాలెంజ్‌తో అన్నీ మూసుకొని కోర్టు ర‌క్ష‌ణ‌లో దాక్కున్నారు.  ఇక‌, ఓవ‌రాక్ష‌న్ చేయ‌బోయిన టీఆర్ఎస్ కిందిస్థాయి కార్య‌క‌ర్త‌ల‌ను త‌రిమి త‌రిమి కొట్టారు రేవంత్‌రెడ్డి అనుచ‌రులు. ఆ ఘ‌ట‌న‌తో ఆయ‌న‌ మామూలు లీడ‌ర్‌ని కాద‌ని.. రేవంత్‌ వెనుక క‌రుడు క‌ట్టిన ప్ర‌జాభిమానం ఉంద‌ని స్ప‌ష్ట‌మైంది. ప‌ది మంది గులాబీ కార్య‌క‌ర్త‌లు పోగై.. ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్ట‌డించాల‌ని బ‌రితెగించారు. అదేమైనా గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీసా.. ఇలా వెళ్లి.. అలా ముట్ట‌డించి.. ఫోటోలు దిగి సోష‌ల్ మీడియాలో పెట్టుకోడానికి. రేవంత్‌రెడ్డి ఇల్లు. తాము చేసింది ఎంత‌టి త‌ప్పుడు సాహ‌స‌మో వారికి అక్క‌డికి వెళ్ల‌గానే తెలిసొచ్చింది. ఇంకా రేవంత్ ఇంటి దాకా కూడా వెళ్ల‌లేదు.. ఆ ఇల్లు ఉండే గ‌ల్లిలోకి ఇలా ఎంట‌ర్ అయ్యారో లేదో.. అలా రేవంత్ అనుచ‌రులు క‌ర్ర‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ఎవ‌డ్రా మీరు.. మా రేవంత‌న్న ఇంటి మీద‌కే వ‌స్తార్రా.. అంటూ క‌ర్ర‌లు, రాళ్ల‌తో దాడి చేశారు. రేవంత్‌రెడ్డిపై ఉన్న అభిమానం.. టీఆర్ఎస్ గుంపుపై ఆవేశంగా మార‌డంతో.. వారిని పోలీసులు సైతం కంట్రోల్ చేయ‌లేక పోయారు. గులాబీ మూక‌ను క‌ర్ర‌ల‌తో త‌రిమి త‌రిమి కొట్టారు. రేవంత్‌రెడ్డి ఇంటి గ‌ల్లీలో కూడా ప్ర‌త్య‌ర్థుల‌ను కాలు పెట్ట‌నీయ‌కుండా.. కంటికి రెప్ప‌లా.. సుశిక్షితులైన సైనికుల్లా.. కాపు కాశారు రేవంత్‌రెడ్డి అనుచ‌రులు, అభిమానులు. అదీ రేవంత్‌రెడ్డి బ‌లం..బ‌ల‌గం.  ఇలా.. దండోరా స‌భ‌ల‌తో కేసీఆర్‌కు, వైట్ ఛాలెంజ్‌తో కేటీఆర్‌కు, క‌ర్ర‌ల స‌మ‌రంతో టీఆర్ఎస్ కేడ‌ర్‌కు.. వారం రోజుల వ్య‌వ‌ధిలోనే మొత్తం గులాబీ సైన్యానికి త‌న స‌త్తా ఏంటో ఓ రౌండ్ రుచి చూపించారు పీసీసీ చీఫ్  రేవంత్‌రెడ్డి. ఈ దెబ్బ‌తో గులాబీ ద‌ళానికి ఇప్ప‌టికే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది. మ‌రి, కొన్నాళ్ల పాటు రేవంత్‌రెడ్డి పేరెత్త‌డానికి కూడా అధికార పార్టీ సాహ‌సించ‌లేక పోవ‌చ్చు. రేవంత్‌రెడ్డా.. మ‌జాకా.

గుర్తు పెట్టుకుంటా.. పోలీసుల‌కు రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్‌ వార్నింగ్‌..

రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లారు. పోలీస్ అధికారుల‌కు ఖ‌త‌ర్నాక్ వార్నింగ్ ఇచ్చారు. టీఆర్ఎస్‌కు వత్తాసు పలికే అధికారులను గుర్తుపెట్టుకుంటామని హెచ్చ‌రించారు. తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవని గ‌ట్టిగా చెప్పారు రేవంత్‌రెడ్డి.   తనకు అదనపు భద్రత కల్పించాలని కోర్టు చెప్పిందని పోలీసుల‌కు గుర్తు చేశారు రేవంత్‌రెడ్డి. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు పీసీసీ చీఫ్‌. తన ఇంటిపై టీఆర్ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారంటూ జూబ్లీహిల్స్‌ పోలీసులకు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే, దాడి చేసిన టీఆర్ఎస్‌ కార్యకర్తలపై కేసులు పెట్టకుండా.. కాంగ్రెస్‌ కార్యకర్తలపైనే అక్రమ కేసులు బనాయించారని మండిప‌డ్డారు.  టాస్క్‌ఫోర్స్‌ పోలీసులతో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను భయపెడుతున్నారని రేవంత్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తమ కార్యకర్తలపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తే ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రాన్ని బిహార్‌గా మార్చాలని సీఎం కేసీఆర్‌ చూస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ శ్రేణుల‌పై ప్ర‌తీకార చ‌ర్య‌లు త‌గ‌వంటూ మండిప‌డ్డారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.    

జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ కు రేవంత్ రెడ్డి..

తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. తన అనుచరులపై కేసులు పెట్టడంపై ఆయన పోలీసులను ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పీఎస్ కు రావడంతో అక్కడికి కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అనుచరులు భారీగా చేరుకున్నారు. దీంతో జూబ్లీహిల్స్ పీఎస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది.  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు మంగళవారం టీఆర్ఎస్ కార్యకర్తలు ప్ర‌య‌త్నించారు. టీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా  ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. పోలీసులు తక్కువగా ఉండటంతో కొంత సేపు రణరంగం నెలకొంది. చివరకు టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి తరలించడంతో టెన్షన్ తగ్గింది.  అయితే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో ఈ విషయంపైనే పీఎస్ కు వచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. త‌న ఇంటిపై టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు దాడి చేశార‌ని, వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు దాడుల‌కు పాల్ప‌డితే పోలీసులు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేయ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని  కోరారు. 

టీటీడీ జంబో బోర్డుపై జ‌గ‌న్ స‌ర్కారుకు బిగ్ షాక్.. హైకోర్టు స్టే...

విచిత్రం. ఆశ్చ‌ర్యం. మునుపెన్న‌డూ లేన‌ట్టు ఏకంగా 80 మందికి పైగా టీటీడీ జంబో బోర్డు నియామ‌కం. అందులో ప్ర‌త్యేక ఆహ్వానితులు 50 మందికి పైనే. ఇదేమి చోద్యం అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. ఏకంగా సెంచ‌రీ కొడితే స‌రిపోయేదిగా అంటూ సెటైర్లు. కొవిడ్ కాలంలో స‌ర్వ ద‌ర్శ‌నమే గ‌గ‌న‌మ‌వుతుంటే.. ఏకంగా ఇంత మంది ప్ర‌త్యేక ఆహ్వానితులను నియ‌మించి ఏం చేస్తార‌ని ప్ర‌శ్న‌ల వ‌ర్షం. పారిశ్రామికవేత్త‌ల‌ను, రాజ‌కీయ నేత‌ల‌ను అడ్డ‌దారిలో బోర్డులో జొప్పించార‌నే ఆరోప‌ణ‌లు వినిపించాయి. ఏకంగా కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి పేరును వాడేసుకొని, ఆయ‌న రిక‌మెండ్ చేశారంటూ ఓ స‌భ్యుడిని టీటీడీ బోర్డులో చేర్చ‌డం.. ఆ విష‌యంపై కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డే నేరుగా సీఎం జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇలా తీవ్ర వివాదాస్ప‌ద‌మైన టీటీడీ జంబో బోర్డు నియామ‌కంపై తాజాగా హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. టీటీడీలో ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.   ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యులతో పాటు భారీగా ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జీవో జారీ చేసింది. పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులను నియమించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా బోర్డు సభ్యులను నియమించారని.. దీని వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందని పిటిషనర్లు అందులో పేర్కొన్నారు. టీటీడీ స్వతంత్రతను దెబ్బతీసేలా జీవోలు ఉన్నాయని పిటిషనర్‌ తరఫున న్యాయవాదులు వాదించారు. నిబంధనలనకు అనుగుణంగానే నియమకాలను చేపట్టినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్ర‌భుత్వం, టీటీడీకి నోటీసులు ఇచ్చింది. 

జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. టీటీడీ పాలకమండలి జీవో సస్పెండ్ 

ఆంధ్రప్రదేశ్ లోని జగన్ రెడ్డి ప్రభుత్వానికి మరో బిగ్ షాక్ తగలింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి బోర్డు నియామకంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టిటిడికి ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జారీ చేసిన జీవో 569 ను ధర్మాసనం సస్పెండ్ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇటీవలే  కొత్త పాలకమండలిని నియమించింది వైసీపీ ప్రభుత్వం. గతానికి భిన్నంగా 81 మందితో జంబో బోర్డును ఏర్పాటు చేసింది.ఇందులో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చింది. గతంలో టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులు లేరు.  టీటీడీ జంబో బోర్డుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులను నియమించడంపై  హైకోర్టులో పిల్‌ దాఖలైంది. టీడీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు తరపున న్యాయవాది యలమంజుల బాలాజీ పిల్‌ వేశారు. పాలకమండలిలో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం చట్ట విరుద్ధమని, దీని వల్ల సామాన్య భక్తుల దర్శనానికి ఇబ్బందని చెప్పారు.  హిందూ ధర్మాదాయ, దేవాదాయ చట్టానికి ఈ నియామకాలు విరుద్ధమని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. పాలకమండలిపై ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను కొట్టివేయాలన్నారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. టిటిడికి ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జారీ చేసిన జీవో 569 ను ధర్మాసనం సస్పెండ్ చేసింది.  గతంలో టీటీడీ బోర్డు కేవలం 18 మంది సభ్యులకే పరిమితం చేశారు. వైసీపీ వచ్చీ రాగానే దీనిని విస్తరించే కార్యక్రమం చేపట్టింది. 2019లో ఏర్పాటైన పాలకమండలిలో సభ్యుల సంఖ్యను 18 నుంచీ 37కు పెంచేశారు. ఇప్పుడు  ఏకంగా 81కి చేశారు. ఇందులో సభ్యులు, ఎక్స్‌ అఫిషియో సభ్యులను పక్కనపెడితే... 50 మంది  ప్రత్యేక ఆహ్వానితుల కథ మరీ ‘ప్రత్యేకం’. వీరికి ఎలాంటి నిర్ణయాధికారం ఉండదు. ఓటింగ్‌ హక్కు లేదు. కనీసం పాలకమండలి సమావేశంలో కూడా వీళ్లు పాల్గొనలేరు. మరి వీరేం చేస్తారంటే... ఏమీ చేయరు. కొండపై ప్రత్యేక మర్యాదలను మాత్రం అనుభవిస్తారు. పాలక మండలి సభ్యులకు వర్తించే ‘ప్రొటోకాల్‌’ మొత్తం ప్రత్యేక ఆహ్వానితులకూ వర్తిస్తుంది. అంటే... వారితో సమానంగా తగిన మర్యాదలతో శ్రీవారిని దర్శించుకోవచ్చు. దర్శనాలకు సిఫారసులూ చేయవచ్చు.

ప‌న్ను ఎగ‌వేత‌పై సోనూసూద్ క్లారిటీ.. ఆయ‌న ఏమ‌న్నారంటే...

20 కోట్ల పన్ను ఎగ‌వేత‌. 18 కోట్ల విరాళాలు సేక‌ర‌ణ‌. ఖ‌ర్చు చేసింది మాత్రం కేవ‌లం 1.9 కోట్లు మాత్ర‌మే. మిగ‌తా సొమ్మంతా అకౌంట్‌లో అలానే ఉంది. ఇదీ సోనూసూద్‌పై 4 రోజుల త‌నిఖీల త‌ర్వాత ఐటీ శాఖ వెల్ల‌డించిన వివ‌రాలు. ఈ ప్ర‌క‌ట‌న‌తో రెండేళ్లుగా సోనూసూద్ సంపాదించుకున్న క్రెడిట్ అంతా పోయింది. ఆయ‌న ఇమేజ్ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది. క‌రోనా కాల‌పు దేవుడిగా భావించిన వాళ్లే.. ఇప్పుడు గుచ్చిగుచ్చి అనుమానించాల్సి వ‌స్తోంది. సోనూసూద్ ఫ్రాడ్ అట‌. పన్ను ఎగ‌వేశాడ‌ట‌. డొనేష‌న్స్ ఖ‌ర్చు చేయ‌లేద‌ట‌. ఇలా దేశ‌వ్యాప్తంగా గుస‌గుస‌లు. ఢిల్లీ స‌ర్కారుతో చేతులు క‌లిపినందుకు బీజేపీ చేప‌ట్టిన ప్ర‌తీకార చ‌ర్య‌ల‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఇలా త‌న‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లపై సోనూసూద్ తొలిసారి స్పందించారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వివ‌ర‌ణ ఇచ్చారు. ఇరవై కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడ్డానన్న ఆరోపణలతో తన ఇంట్లో ఐటీశాఖ సోదాలు నిర్వహించడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునని బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తన ఫౌండేషన్‌కు విరాళాల రూపంలో వచ్చిన డబ్బులోంచి పైసా కూడా వృధా చేయలేదని స్పష్టం చేశారు. తాను వెచ్చించిన మొత్తంలో విరాళాల కన్నా, తన రెమ్యూనరేషనే ఎక్కువని చెప్పారు.   రూ.18.94 కోట్ల విరాళాలల్లో రూ.1.9 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయనే దానికీ సోనూసూద్ బదులిచ్చారు. ఆ డబ్బు ఖర్చు పెట్టేందుకు 18 నిమిషాలు చాలన్నారు. అయితే ప్రతి సమస్య వాస్తవమైనదేనా? అన్న కోణంలో తమ బృందం పరిశీలిస్తుందని, క్షేత్రస్థాయి వర్గాలను ఆరా తీస్తుందని,  సాయానికి ఖ‌ర్చు చేసిన ప్రతి పైసా వృధా కాలేదన్నారు.  ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై స్పందిస్తూ తన ఫోండేషన్‌ ఎఫ్‌సీఆర్‌ఏ కిందకు రాదని చెప్పారు. అయినా తాను విదేశాల నుంచి పైసా కూడా విరాళంగా తీసుకోలేదన్నారు. విరాళాలన్నీ క్రౌడ్‌ ఫండిగ్‌ ప్లాట్‌ఫాంలోనే ఉన్నాయని, ఆ నిధులు భారత్‌కు వచ్చినప్పుడే కాదా ఉల్లంఘన జరిగిందా అనే ప్రశ్న ఉత్పన్నమయ్యేది అని సోనూసూద్‌ ప్రశ్నించారు. సమస్యలను బట్టి ఆ సొమ్ము నేరుగా ఆస్పత్రులకు, విద్యా సంస్థలకే వెళుతుందని, అలాంటప్పుడు ఉల్లంఘన అనే ప్రశ్న ఎలా తలెత్తుతుంద‌ని ప్రశ్నించారు. మున్ముందు సోనూ సోద్‌ లేకపోయినా సహాయ కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.  ‘దేశ్‌ కీ మెంటార్‌’ అనే కార్యక్రమానికి ప్రచారకర్తగా వ్యవహరించాలని కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఆహ్వానించిందని చెప్పారు.  ప్రజల ముఖాల్లో ఆనందాలను నింపేందుకు తనను ఎవరైనా పిలిస్తే అది ఏ రాజకీయ పార్టీ, ఢిల్లీ ప్రభుత్వమా, గుజరాత్‌ ప్రభుత్వమా, బిహార్‌ ప్రభుత్వమా అని చూడకుండా వెళ్తానని సోనూసూద్ స్పష్టంచేశారు. 

తాడేపల్లిలోనే 72 వేల కోట్ల హెరాయిన్ బిగ్ బాస్! 

ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి విజయవాడకు అక్రమంగా రవాణా అవుతూ గుజరాత్‌ లో పట్టుబడిన హెరాయిన్ వ్యవహారం ఏపీలో రాజకీయ రచ్చగా మారింది. పెద్దఎత్తున పట్టుబడిన హెరాయిన్ కు విజయవాడ లింకులు బయటపడటంతో డ్రగ్స్ దందాకు.. ఏపీ అడ్డాగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో క్రైమ్ రేట్ పెరిగిపోయిది. మహిళలపై దాడులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ లింకులు వెలుగులోనికి రావడంతో అధికార పార్టీలో అలజడి రేగుతోంది. దీంతో మంత్రులు, వైసీపీ నేతలు సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి పేర్నినాని డ్రగ్స్ అంశంపై మాట్లాడకుండా... టీడీపీపై ఆరోపణలు చేశారు. బెజవాడలో భూకబ్జాలు చేసే వాళ్లు గుజరాత్ లో పట్టుబడిన హెరాయిన్ గురించి మాట్లాడుతున్నారు. హెరిటేజ్ వ్యాన్లలో ఎర్రచందనం దుంగలు జపాన్ తరలించింది నిజం కాదా అంటూ పేర్ని నాని కామెంట్ చేశారు. మంత్రి పేర్నినాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. వైసీపీ రెండున్నర సంవత్సరాల్లో రాష్ట్రాన్ని నేరస్థుల అడ్డాగా మార్చిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. పట్టుబడిన రూ.72 వేల కోట్ల హెరాయిన్ స్మగ్లింగ్ బిగ్ బాస్ ఎవరంటే వైసీపీ భుజాలు తడుముకుంటోందన్నారు. డ్రగ్స్ కేసులో వైసీపీ ఎందుకు ఉలిక్కి పడుతోందని ప్రశ్నించారు. ఏపీ పోలీసులు ఈ డ్రగ్స్‌పై ఎందుకు విచారణ చేయటంలేదని నిలదీశారు. రాష్ట్రంలో మైనింగ్ మాఫియాలా డ్రగ్స్ సిండికేట్ అయిందన్నారు. డైరెక్టర్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు వైసీపీ తాట తీస్తారని తెలిపారు. తాడేపల్లి నుంచి ఢిల్లీలో డీఆర్ఐ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. ట్రాన్స్ ఫర్స్, ప్రమోషన్స్ కోసం పోలీసులు తాడేపల్లి ఆదేశాలను పాటిస్తూ వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. పట్టుబడిన 72 వేల కోట్ల హెరాయిన్ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారని దుయ్యబట్టారు. నిర్వాహక బిగ్‌బాస్ తాడేపల్లిలో ఎక్కడున్నాడో త్వరలో తేలుతుందన్నారు.  ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఏపీ డ్రగ్స్ వ్యవహారమంతా తెలుసని చెప్పారు. టీడీపీ తరపున ఢిల్లీ వెళ్లి ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి సంబంధిత అధికారులకు తెలుపుతామని బోండా ఉమా చెప్పారు. 

తాలిబాన్ అగ్ర నేత చనిపోయాడా? బారాదరి పాక్ బందీగా ఉన్నాడా? 21 వేల హెరాయిన్ కథేంటీ? 

అఫ్ఘనిస్థాన్‌ నుంచి విజయవాడకు అక్రమంగా రవాణా అవుతూ గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో  21 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడటం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. అధికారుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి. దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని తెలుస్తోంది. ఆప్ఘనీస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వాన్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్న పాకిస్తాన్.. అక్కడ భారీగా ఉన్న హెరాయిన్ ఇతర దేశాలకు రవాణా చేస్తోందని తెలుస్తోంది.  ఆప్ఘనీస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే తాలిబన్ పాలనంతా పాకిస్తాన్ కనుసన్నలోనే సాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. తాలిబాన్ అగ్ర నాయకుడు హైబతుల్లా అఖున్జాద చనిపోయారని,కాందహార్ లోని ఒక ఇంట్లో బారాదరీని బందీగా ఉంచి పాకిస్థాన్ అతి పెద్ద డ్రామా ఆడుతున్నదని తెలుస్తోంది.   హైబతుల్లా తాలిబన్లలో అగ్ర నేత కాగా.. ముల్లా బరాదరీమ్ నంబర్ 2 గా పరిగణిస్తారు. అధికారం కోసం రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో  అగ్రనేత హైబతుల్లా చనిపోగా.. ముల్లా బారాదరీని కాందహార్ లో బందీగా ఉంచినట్లు తెలుస్తోంది.  లండన్ నుండి వెలువడే వెబ్ న్యూస్ పోర్టల్ 'ది స్పెక్టేటర్' కధనం ప్రకారం గత ఆగస్ట్ లో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్ష భవనం లో తాలిబన్ లు, హక్కానీ నెట్ వర్క్ నాయకులు సమావేశం అయ్యారు. బరాదరీ తో పాటు అతని అనుచరులు, హక్కాని నెట్వర్క్ నాయకుడు ఖలీల్ –ఉర్ –రహమాన్ హక్కాని తో పాటు అతని అనుచరులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మొదట బారాదరీ ఎవరెవరికి ఏ ఏ పదవులు ఇవ్వదల్చుకున్నారో పేర్లు చదవడం మొదలుపెట్టిన కొద్ది క్షణాలలోనే హక్కానీ ఆగ్రహంగా తన కుర్చీ లోనుండి లేచి మొదట అక్కడ ఉన్న వేడి గ్రీన్ టీ ఉన్న పెద్ద థెర్మోస్ ఫ్లాస్క్ ని బారాదరీ మీద విసిరి కొట్టాడు అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న కుర్చీ తో బారాదరీ ని కొట్టాడు. అదే సమయంలో బారాదరీ అనుచరులు హక్కానీ అనుచరులతో బాహా బాహీ తలపడ్డారు. పరస్పరం తుపాకీలతో కాల్పులు జరుపుకున్నారు. సంఖ్య తెలియరాలేదు కానీ ఇరు వైపులా చాలామంది కాల్పులలో చనిపోయారు. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.  తీవ్రంగా గాయపడ్డ బారాదరీ ని అక్కడ నుండి నేరుగా హాస్పిటల్ కి తీసుకెళ్ళి ప్రాధమిక చికిత్స చేసి అక్కడ నుండి కాందహార్ లోని గుర్తు తెలియని ప్రదేశం లో బందీగా ఉంచారు హక్కాని అనుచరులు. ఇదంతా పాకిస్థాన్ ISI చీఫ్ అక్కడ ఉండగానే జరిగింది. తజక్ మైనారిటీ షియాలకి, అలాగే హజారా షియాల కి తన మంత్రి వర్గంలో స్థానం ఇవ్వడాన్ని హక్కానీ జీర్ణించుకోలేక పోయారు.  పాకిస్థాన్ కి షియాలకి మంత్రి పదవులు ఇవ్వడం అసలు ఇష్టం లేదు. కానీ దోహా లో చేసుకున్న ఒప్పందం ప్రకారం బారాదరీ తజక్ షియా మైనారిటీలకి మంత్రి పదవులు ఇవ్వాలనే పట్టుదలగా ఉన్నాడు. తాలిబన్ల జెండా తో పాటు ఆఫ్ఘన్ జాతీయ జెండాలని రెండిటినీ అధ్యక్ష భవనం మీద, ఇతర ప్రభుత్వ కార్యాలయాల మీద ఎగుర వేయాలని బరాదరీ కోరిక. కానీ తాలిబాన్లు బలపడడం అస్సలు ఇష్టం లేని పాకిస్థాన్ తన పెంపుడు కుక్క హక్కానీ చేత దాడి చేయించింది.  ఇక గత మూడు వారాలుగా బరాదరీ  కానీ తాలిబాన్ అగ్ర నాయకుడు హైబతుల్లా అఖున్జాద కానీ మీడియా ముందుకి రావడం కానీ ఇతర సమావేశాలకి కానీ హాజరవ్వలేదు. ఖతార్ విదేశాంగ మంత్రి కాబూల్ వచ్చినప్పుడు కూడా తాలిబాన్ అగ్ర నాయకులు సమావేశానికి రాలేదు. కానీ  వారం రోజుల క్రిందట బరాదరీ చనిపోయాడు అని కాబూల్ లోకల్ న్యూస్ ఛానెల్స్ లో ప్రసారం అయిన తరువాత బారాదరీ మాట్లాడుతున్నట్లు ఒక వీడియొ మెసేజ్ ఆఫ్ఘన్ టెలివిజన్ ప్రసారం చేసింది. ఆ వీడియొ లో బరాదరీ నేను క్షేమంగానే ఉన్నాను అని సందేశం ఇచ్చాడు కానీ చుట్టూ ట్రైబల్ నాయకులు కూర్చొని ఉన్నారు.  బరాదరీ ఏదో తప్పనిసరి అన్నట్లుగా కెమెరా ముందు మాట్లాడినట్లు ఉందని అది చూసిన వారికి అర్ధమైంది. బారాదరీ బందీగా ఉండి మాట్లాడుతున్నట్లుగా కనిపించింది.  ఇక గత మూడు వారాలుగా 'హైబతుల్లా అఖున్జాద' మాత్రం ఎక్కడా కనపడలేదు. నిజంగా హైబతుల్లా అఖున్జాద బ్రతికే ఉంటే బారాదరీ చేత వీడియొ తీసి చెప్పించినట్లు 'హైబతుల్లా అఖున్జాద' తో కూడా ఒక వీడియొ మెసేజ్ ప్రసారం చేసేవారు కదా ?..  కానీ చనిపోయిన వాడి చేత ఎలా మాట్లాడిస్తారు ?. దీంతో అధ్యక్ష భవనంలో జరిగిన కాల్పులలో 'హైబతుల్లా అఖున్జాద' మరణించాడని భావిస్తున్నారు. ఇప్పుడు తాలిబన్ల కి నాయకుడు అంటూ ఎవరూ లేరు. అంతా హక్కానీ నెట్వర్క్ అధికారం నడుస్తున్నది.  గత వారం అంటే సెప్టెంబర్ 13 న కాందహార్ నుండి రెండు కంటైనర్లు ఇరాన్ లోని బందర్ అబ్బాస్ పోర్ట్ ద్వారా గుజరాత్ ముంద్రా పోర్ట్ కి వచ్చినవి కేవలం హక్కానీ నెట్వర్క్ వాళ్ళవే అయినా తాలిబాన్ అని ప్రచారం జరుగుతున్నది.  21 వేల కోట్ల రూపాయల విలువచేసే కంసైన్మెంట్ బహుశా వెయ్యి కోట్లకి బేరం చేసి సరఫరా చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే 21 వేల కోట్లు ఖరీదు అనేది అంతర్జాతీయ మార్కెట్ రేట్ కానీ భారత్ లో ఉగ్రవాదులకి డబ్బు ఇచ్చే నెపం తో ఉచితంగానే పాకిస్తాన్ పంపించి ఉంటుందని అంటున్నారు.  ఆదేమన్నా పాకిస్థాన్ డబ్బా ? గత 2015 నుండి టన్నుల కొద్దీ శుద్ధి చేసిన హై క్వాలిటీ హెరాయిన్ ఆఫ్ఘనిస్తాన్ లో గుట్టలు గుట్టలుగా పేరుకొని పోయి ఉన్నాయి. అధికారం హక్కానీ చేతిలో ఉంది కాబట్టి డబ్బు గురుంచి ఆలోచన ఉండదు. కేవలం భారత్ లోని తమ స్లీపర్ సెల్స్ కి హెరాయిన్ చేరితే చాలు డబ్బు అదంతట అదే వస్తుంది. ఇంతకీ కంసైన్మెంట్ కి ముందుగానే డబ్బులు ఎవరు చెల్లించారు ? ఎవరూ ఇచ్చి ఉండరు.  పాకిస్తాన్ కంటైనర్ రవాణా ఖర్చులు పెట్టుకొని ఉంటుంది. ఇక్కడ దానిని విడిపించుకోవడానికి పెద్దగా డబ్బు అవసరం ఉండదు ఎందుకంటే టాల్కమ్ పౌడర్ అదీ సెమీ ఫినిష్ చేసింది టన్నుకి 8 డాలర్లు చెల్లిస్తే చాలు. గుజరాత్ నుండి కంటైనర్లు రవాణా చేయడానికి ఒక లక్ష రూపాయలు చాలు అది ఇక్కడి ఉగ్ర గ్రూపులు ఇచ్చేస్తాయి.  ఇక నుండి ఏది జరిగినా అది హక్కానీ నెట్వర్క్ కె చెందుతుంది తప్పితే తాలిబన్ల కి కాదు.  మీడియా ప్రచారం చేస్తున్నట్లు తాలిబాన్లు 1995 లో ఉన్నంత బలవంతులు కాదు ఇప్పుడు కేవలం రోజుకూలి తీసుకొని పని చేసే పనివాళ్ళు మాత్రమే. అసలు వాళ్ళకి నాయకుడు అనే వాడు లేడు ఉన్న ఒక్క బరాదరీ పాకిస్థాన్ చేతిలో బందీగా ఉన్నాడు.తాలిబాన్ పేరు ఉంటుంది కానీ హక్కాని చేస్తుంది లేదా చేయిస్తుంది. హక్కానీ అంటే పాకిస్థాన్. పట్టుబడ్డ 21 వేల కోట్ల రూపాయల హెరాయిన్ ని చాలా మీడియా సంస్థలు 2 వేల కోట్ల రూపాయలు అంటూ దుష్ప్రచారం చేస్తున్నాయి. దొరికింది హై క్వాలిటీ హెరాయిన్ అని ఫోరెన్సిక్ లాబ్ టెస్ట్ లో తెలిసింది. కిలో 7 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. ధనవంతులు 1 గ్రాము హై క్వాలిటీ హెరాయిన్ ని 7 లక్షలకి కొంటారు. చెడ్డ పేరు తాలిబన్లకి ఇచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నది పాకిస్థాన్.  

విజయవాడ డ్రగ్స్ కేసులో సంచలనాలు! పట్టుబడిన హెరాయిన్ విలువ 21 వేల కోట్లు.. 

దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విజయవాడ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. డ్రగ్స్ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది డీఆర్‌ఐ. గతంలో ఇటువంటి కన్సైన్మెంట్‌లు వచ్చాయా అనే కోణంలో ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు.  సెంట్రల్ విజిలెన్స్, నార్కోటిక్ బ్యూరో, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, నేవీ ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. డ్రగ్స్ విలువ రూ. 21 వేల కోట్లుగా అంచనా వేశారు. సుధాకర్ దంపతులను చెన్నైలో అదుపులోకి తీసుకున్న అధికారులు గుజరాత్‌కు తరలించి.. కోర్టులో హాజరు పర్చగా సుధాకర్‌ దంపతులను పదిరోజుల డీఆర్‌ఐ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. మనీలాండరింగ్ కోణంపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక పాత ఇంటికి తెల్లపేపర్‌పై ఏజెన్సీ పేరు ప్రింట్‌ తీసి గుమ్మానికి బోర్డులా అతికించిన ఒక ఏజెన్సీ పేరు అంతర్జాతీయ డ్రగ్‌ రాకెట్‌లో బయటపడటంపై కేంద్ర సంస్థలు లోతుగా ఆరా తీస్తున్నాయి. అఫ్ఘన్‌లో తయారైన హెరాయిన్‌తోపాటు ఐదు రకాల డ్రగ్స్‌ అక్రమంగా ఇరాన్‌ మీదుగా మన దేశంలోకి వస్తున్న విషయం ఇటీవలే బయట పడింది. విజయవాడ సత్యనారాయణపురంలో ఒక సాధారణ గృహిణి పేరుతో రిజిస్టరైన ఆశి ట్రేడింగ్‌ కంపెనీ రూ.వేల కోట్ల హెరాయిన్‌ దిగుమతి కోసం కన్‌సైన్‌మెంట్‌ ఇవ్వడం వెనకున్న రహస్యాన్ని కేంద్రసంస్థలు వెలికితీస్తున్నాయి. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి కోసం అనుమతి తీసుకున్న ఆశి ట్రేడింగ్‌ కంపెనీ దిగుమతిలో మాత్రం టాల్కమ్‌ పౌడర్‌ పేరుతో హెరాయిన్‌ తెప్పించడంపై నిఘా సంస్థలు సీరియ్‌సగా దృష్టి పెట్టాయి.  విజయవాడ అడ్ర్‌సతో ఉన్న ఆశి ట్రేడింగ్‌ కంపెనీ ఎటువంటి ఎగుమతులు చేయక పోయినా, అన్ని అనుమతులూ తీసుకుంది. ఏడాది తిరక్కుండానే అంతర్జాతీయ డ్రగ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారంలో వెలుగులోకి వచ్చింది. అయుతే ఈ ఏజెన్సీ నిర్వాహకులు తెలిసే నిషేధిత మత్తు పదార్థాలను దిగుమతి చేసుకోవడానికి కన్‌సైన్‌మెంట్లు ఇచ్చినట్టు సమాచారం. ప్రతి కన్‌సైన్‌మెంట్‌కు డ్రగ్స్‌ ముఠా లక్షల రూపాయల్లో డబ్బులు ఇచ్చినట్లు కేంద్ర సంస్థలు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. ఈసొమ్ముతోనే సుధాకర్‌ చెన్నైలో ఇతర వ్యాపారాలు చేస్తున్నట్లు సమాచారం.  ఎన్‌ఐఏ సమాచారం మేరకు రంగంలోకి దిగిన సెంట్రల్‌ విజిలెన్స్‌, నార్కోటిక్‌ బ్యూరో, కస్టమ్స్‌ అండ్‌ ఎక్సైజ్‌, నేవీ ఇంటెలిజెన్స్‌ తమ తమ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. ఐదు లక్షల జనాభా ఉండే కాకినాడలో ఉండే సుధాకర్‌ ఎనిమిదేళ్లుగా చెన్నైలో ఏమి చేశాడనే దానిపై ఆరా తీస్తున్నాయి. చెన్నై ఎందుకు వెళ్లాడు? పోర్టులో ఎన్నాళ్లు పని చేశాడు? అతనికి ఏ వ్యాపారాలున్నాయి? విజయవాడ యువతిని పెళ్లాడి ఆమె పుట్టింటి అడ్ర్‌సతో ఏజెన్సీ ఏర్పాటు చేయడం వెనకున్న కారణాలు ఏంటి? తదితర కోణాలు కేంద్రదర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి. హెరాయిన్‌ వెనుక ఉన్న వ్యక్తులు, సిండికేట్ల గురించి దర్యాప్తు చేస్తామని, అవసరమైతే నిందితుడి ఆస్తులను అచాచ్‌ చేస్తామని ఈడీ వర్గాలు తెలిపాయి. ఎగుమతి, దిగుమతులకు లైసెన్సు పొందడానికి విజయవాడలోని ఇంటి అడ్ర్‌సను వాడుకోవడం తప్ప.. నగరంలో ఆశి ట్రేడింగ్‌ కంపెనీకి సంబంధించిన కార్యకలాపాలేవీ ఇప్పటి వరకూ వెలుగులోకి రాలేదని విజయవాడ పోలీసు కమిషనర్‌ బి.శ్రీనివాసులు పీటీఐకి చెప్పారు. ఈ అంశంపై తమ సిబ్బంది కూలంకషంగా దర్యాప్తు చేశారని తెలిపారు.   

టీఎస్ ఆర్టీసీపై సజ్జనార్ మార్క్.. ఆదాయం కోసం చార్జీల పెంపు? 

ఐపీఎస్ అధికారిగా తనదైన ముద్ర వేసుకున్నారు వీసీ సజ్జనార్. వరంగల్ ఎస్పీగా, సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నప్పుడు జరిగిన ఎన్ కౌంటర్లు సంచననంగా మారాయి. అమ్మాయిలపై దాడికి పాల్పడిన నిందితులు ఎన్ కౌంటర్లలో చనిపోవడంతో సజ్జనార్ ను జనాలు నీరాజనం పట్టారు. ఇటీవలే ఆయనను  ఆర్టీసీ ఎండీగా పంపించింది తెలంగాణ సర్కార్. డైనమిక్ ఆఫీసర్ ను ఆర్టీసీ ఎండీగా బదిలీ చేయడంపై విమర్శలు వచ్చాయి. అందులోనూ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీలో సజ్జనార్ కు పోస్టింగ్ ఇస్తే ఎలా అన్న చర్చ కూడా వచ్చింది. అయితే ఆర్టీసీ ఎండీ తన మార్క్ చూపిస్తున్నారు సజ్జనార్. సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు చర్యలు ప్రారంభించారు. అదే సమయంలో సిబ్బంది సంక్షేమంపైనా ఫోకస్ చేశారు ఐపీఎస్ ఆఫీసర్. బస్సుల్లో ప్రయాణించి సమస్యలు తెలుసుకున్నారు. తాజాగా ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు నడుం బిగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆర్టీసీ బలోపేతానికి ప్రతిపాదనలు చేశారు వీసీ సజ్జనార్.  ప్రగతి భవన్‌లో  జరిగిన సమావేశంలో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సీఎస్ సోమేశ్‌కుమార్, రవాణా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్ శర్మ, రామకృష్ణారావు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్  పాల్గొన్నారు. కరోనా కాటుతో  ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయాయని, కాబట్టి ఇప్పుడు చార్జీలు పెంచక  తప్పదని  సజ్జనార్..  కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. గత ఏడాదిన్నర కాలంలో డీజిల్ ధర లీటరుకు భారీగా పెరగడం వల్ల రూ.550 కోట్లు, టైర్లు, ట్యూబులు వంటి విడిభాగాల ధరలు పెరగడం వల్ల రూ. 50 కోట్లు కలిసి ఏడాదికి దాదాపు రూ. 600 కోట్ల మేర భారం పడుతోందని, కాబట్టి ఆర్టీసీ చార్జీలు పెంచాల్సిందేనని  కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.  లాక్‌డౌన్ కారణంగానే ఆర్టీసీ దాదాపు రూ. 3 వేల కోట్ల వరకు నష్టపోయిందని, ఒక్క హైదరాబాద్ పరిధిలోనే నెలకు రూ. 90 కోట్ల మేర నష్టం వస్తోందని సజ్జనార్ నివేదించారు. ఇప్పుడు చార్జీలు పెంచకుంటే మరింత భారం మోయాల్సి వస్తుందన్నారు. చార్జీలు పెంచుతామని గతేడాది మార్చిలోనే ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చార్జీలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తే తప్ప ఆర్టీసీ మనుగడ సాధ్యం కాదని మంత్రి అజయ్ కుమార్, సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ అధికారుల ప్రతిపాదనపై సమీక్షించిన సీఎం.. చార్జీలను పెంచేందుకు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.  వచ్చే మంత్రిమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనను రూపొందించాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. కరోనా దెబ్బకుతోడు, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని ఆ సమావేశంలో  సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.  తెలంగాణలో చివరిసారిగా డిసెంబరు 2019 లో ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. ఈసారి కూడా 10 నుంచి 20 శాతం మేర చార్జీలు పెంచేందుకు ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. 20 శాతం పెంచితే కనుక రోజుకు 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

చైన్ స్నాచర్ బ్యాచ్.. రౌడీ షీటర్ల లీడర్! వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య రచ్చ రంబోలా

ఆ ఇద్దరు ఒకే పార్టీ నాయకులు.. ఒకరు ఎంపీ ఇంకొకరు ఎమ్మెల్యే. ఇద్దరు రాజకీయ  కుటుంబాల నుంచి వచ్చిన యువ నాయకులు. అయితే ఆ ఇద్దరి మధ్య పచ్చ గడ్డి  అవసరం అయినా లేకుండానే మాటల మంటలు ఎగసెగసి పడతున్నాయి. ఆ ఇద్దరు ఇంకెవరో కాదు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్.  ఈ ఇద్దరు వైసీపీ పార్టీకి చెందిన కీలక నేతలు.. పైగా ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి  చాలా సన్నిహితులు. జక్కంపూడి రాజ తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ మంత్రి వర్గంలో పనిచేసారు. జక్కంపూడి అనారోగ్యంతో  మంచం పట్టినా, కదల లేక పోయినా వైఎస్ ఆయన్ని మంత్రివర్గం నుంచి తప్పించలేదు. బాద్యత (శాఖ) లేని మంత్రిగా కొనసాగించారు.  ఇప్పుడు జక్కంపూడి జూనియర్, యంగ్ ఎంపీ భరత్ మధ్య మాటల యుద్ధం మహా జోరుగా సాగుతోంది. జక్కంపూడి సోమవారం భరత్ మీద భగ్గుమన్నారు. తెలుగు దేశం పార్టీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో చేతులు కలిపి వైసేపీని దెబ్బ తీసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, జగన్ రెడ్డిని జైలు పాలు చేసిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మినారాయణతో అదే విధంగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజుతో సంబంధాలున్నాయి, అటు నుంచి జరుగుతున్న కుట్రలలోనూ భరత్ ఇన్వాల్వ్ అయ్యారని జక్కం పూడి ఆరోపించారు.  జక్కంపూడికి జవాబుగా  కౌంటర్ ఇచ్చారు భరత్. కుమ్ముక్కు రాజకీయాలు ఎవరు చేస్తున్నారో, ఎవరు పార్టీకి. పార్టీ నాయకుడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. అలాగే జక్కంపూడి, పిల్లోడు అన్నట్లుగా..ఆయనలా తానూ పిల్లల రాజకీయలు చేయనని అన్నారు. పార్టీ గీసిన లక్ష్మణ గీత దాటననీ అదనీ ఇదనీ చాలా చెప్పుకొచ్చారు. అయితే, ఇన్ని సుద్దులు చెప్పి చివరకు, సొంత పార్టీ ఎమ్మెల్యేను, ఆయన అనుచరులను  పట్టుకుని రౌడీ షీటర్, చైన్ స్నాచర్ బ్యాచ్’ అంటూ ఎద్దేవా చేశారు. అఫ్ కోర్స్ జక్కంపూడి కూడా సొంత పార్టీ ఎంపీ మీద ఇదే విధమైన ..అయితే .. ఈ వివాదం చూసిన జనాలు దొందూ దొందే ... ఇద్దరు ఆ తాను ముక్కలే అంటున్నారు. 

ఎరక్కపోయి ఇరుకున్నారా? యువనేత బుక్కయ్యారా?

తెలంగాణ రాజకీయాలలో రోజుకో వివాదం రివాజుగా మారి పోయింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో లేదని తేలడంతో రాజకీయ పార్టీలు కొత్త  మత్తు వేటలో పడ్డాయి. అనుకోకుండా  అన్ని మత్తుల్లోకి మహా మత్తు డ్రగ్స్ వివాదం కాలికి తగిలింది. ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే చాలు అదే వార్త... డ్రగ్స్ చుట్టూనే రాష్ట్ర రాజకీయం తూలుతోంది... ఊగుతోంది..ఊగుతూ తూలుతోంది.కీలక నేతలకు కంటికి  కునుకు లేకుండా చేస్తోంది. ఎరక్క పోయి  పోయి ఇరుక్కున్నను అని .. సోలో గా పాటలు కూడా పాదేసు కుంటున్నారు.  నిజానికి అటు ఉగ్రవాదం నుంచి ఇటు డ్రగ్ మాఫియా వరకు అన్ని రకాల అంతర్జాతీయ, జాతీయ స్థాయి  నేరాలు  ఘోరాలకు హైదరాబాద్ అడ్డాగా మారిందనేది అందరికీ తెలిసిన నిజం. అయితే, ఈ డ్రగ్ మాఫియాను వెనక నుంచి నడిపిస్తోంది మాత్రం, అన్ని నేరాలకు అమ్మ తల్లి. మదర్ ఆఫ్ ఆల్ క్రైమ్స్, ‘రాజకీయం’  దటీజ్ పాలిటిక్స్’ అనేది మాత్రం కొదరికి మాత్రమే తెలిసిన నిజం. అందులోనూ, ఇంతలోనే ఇంతై .. ఇంతింతై .. ఇంకెంతో అవ్వాలని, ఆ ఒక్క మెట్టు ఎక్కేయాలని.. ఆ కుర్చీ  ఎక్కేయాలని  ఆశ పడుతున్న కీలక నేత పాత్ర మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  నిజం... తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ డ్రగ్ మాఫియాది, మాములు సామ్రాజ్యం కాదు, మహా సామ్రాజ్యం. ఈ మహా సామ్రాజ్యంలో ఎవరున్నారు, ఎవరు లేరు అనే విషయాన్ని అలా ఉంచితే, యంగ్, ఎనర్జిటిక్, స్మార్ట్ బాస్  పాత్ర ఉందనేది మాత్రం కాదనలేని నిజం అంటున్నారు.  నిజానికి టీపీసీసీ అధ్యక్షుడు రెడ్డి వైట్ లెంజ్ లక్ష్యం కూడా ఈ నాయకుడే అంటారు. అంతే కాదుట .. రేవంత్ రెడ్డి, ‘ ఛాలెంజ్’ కి అవసరమైన సరకును అందించింది కూడా మరో పాపులర్ ‘ఛాలెంజరే .. అని  కూడా అంటారు.  అదలా ఉంటే తెర మీద వినిపిస్తున్న ఛాలెంజ్ ల విషయంలోకి వెళితే, తీగ లాగితే డొంకంతా కదినట్లు కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ డ్రగ్ కథ వెంక ఉన్న కథలో ... ఆయన పాత్ర చాలా కీలకం. నిజంగా ఆయనకు డ్రగ్స్ తీసుకునే అలవటు ఉందా.. లేదా అనేది ఈరోజు కాకపోతే రేపైనా తేలుతుంది. అయితే, ఆయనకు ఇటు  సినిమా రంగంలో, అటు వ్యాపార కుటుంబాల యువ రాజులతో మంచి సంబంధాలున్నాయి. అందులో కొందరికి డ్రగ్స్ అలవాటు కూడా ఉంది. అందాల తార విషయం అనగానే అయన స్పెషల్ ఇంటరెస్ట్ తీసుకున్నారు. విషయం ఏమంటే... మిత్ర ధర్మంగా వారిని రక్షించేందుకు అయన ..ఢిల్లీ వరకు వెళ్లారు ..న్యాయవ్యవస్థలో కీలక బాధ్యతలలో ఉన్నవారిని కలిశారు ... ఈడీ ఉచ్చు నుంచి ఆ ఇద్దరిని సేవ్ చేసేందుకు  అయన అందాక వెళ్లారు. అయితే, ఇప్పుడు అసలు కథ పక్కుకు పోయి అయన మెడకే డ్రగ్స్ ఉచ్చు చుట్టుకుంటోంది. చివరకు ఏమవుతుందో .. చూడవలసిందే..అంటున్నారు. 

వాణిజ్య ఉత్స‌వంతో జ‌గ‌న‌న్న ఆడంబ‌రాలు.. ఉద్యోగాలెక్కడ అంటున్న జనాలు? 

విజ‌య‌వాడ‌లో వాణిజ్య ఉత్స‌వం పేరుతో ఆడంబ‌రం. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందంటూ సీఎం జ‌గ‌న్ హామీలు. ఏపీ ఎగుమతులు రెండేళ్లలో 19.43 శాతం వృద్ధి చెందాయ‌ట‌. 2020-2021లో 1.23 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయట‌. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందట‌. 2020-2021లో ఎగుమతుల్లో ఏపీది నాలుగో స్థానమ‌ట‌. రెండేళ్లలో 20,390 కోట్లతో 10 మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేశార‌ట‌. 55వేల మందికి ఉపాధి కల్పించార‌ట‌. అబ్బో.. ఇలా వాణిజ్య ఉత్స‌వం వేదిక‌గా సీఎం జ‌గ‌న్ నోటి నుంచి అంతా అవాక్క‌య్యే ప్ర‌సంగం వినిపించింది.  టీవీల్లో ఆయ‌న ప్ర‌సంగం విన్న ఆంధ్రులంతా.. అవునా, మ‌న రాష్ట్రం ఇంత‌గా దూసుకుపోతోందా? ఏపీ నుంచి ఇంత భారీ ఎగుమ‌తులు జ‌రిగాయా? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక జ‌గ‌న్ చెప్పిన 10 మెగా ప్రాజెక్టులు, 55వేల మందికి ఉపాధి గురించి తెలిసి.. మ‌రింత అవాక్క‌వుతున్నారు. మేమంతా ఉపాధి లేక‌, ఉద్యోగాలు లేక‌, ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డులు లేక నిరుద్యోగులుగా అవ‌స్థ‌లు ప‌డుతుంటే.. మాకు తెలీకుండా మా రాష్ట్రంలో ఇన్ని ప‌రిశ్ర‌మ‌లు, ఇన్ని వేల ఉద్యోగాలు ఎప్పుడొచ్చాయి? ఎవ‌రికి వ‌చ్చాయి? అంటూ నోరెళ్ల బెడుతున్నారు.  ఏపీ ప్ర‌భుత్వ బెదిరింపులు తట్టుకోలేక ద‌శాబ్దాలుగా కంపెనీ న‌డుపుతున్న‌ అమ‌ర‌రాజానే త‌ర‌లి వెళ్లిపోయేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతోంది. వైసీపీ ఎంపీ బెదిరింపుల‌తో కియా కంపెనీ ఎందుకొచ్చామా అని త‌ల‌ప‌ట్టుకుంటోంది. రిల‌య‌న్స్ సంస్థ చిత్తూరులో ఇచ్చిన భూములు తిరిగిచ్చేసి వెళ్లిపోయింది. ల‌ల్లూ గ్రూపు మొద‌ట్లోనే మేం రాం అని చెప్పేసింది. మ‌రి, సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్టు పారిశ్రామిక వేత్త‌ల‌కు ప్ర‌భుత్వం నుంచి పూర్తి స‌హ‌కారం ఎక్క‌డ ల‌భిస్తున్న‌ట్టు? ప్ర‌భుత్వ‌మే స‌హ‌క‌రించి ఉంటే అమ‌ర‌రాజా కంపెనీకి ఇప్పుడీ క‌ష్టాలు వ‌చ్చేవా? అని ప్ర‌శ్నిస్తున్నారు.  ఇక ఏపీ ఎగుమ‌తులు రెండేళ్ల‌లో 19.43 శాతం వృద్ధి చెందాయ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారంటే ఆ మేర‌కు అధికారిక లెక్క‌లు ఉండే ఉంటాయి. అయితే, ఆ ఎగుమ‌తులు జ‌రిగిన‌వి అంత‌కుముందే ఉన్న కంపెనీల నుంచే గానీ, జ‌గ‌న్ త‌ర్వాత ఏపీకి కొత్త‌గా ఎగుమ‌తులు చేసే కంపెనీలు వ‌చ్చింది లేద‌ని గుర్తు చేస్తున్నారు. అందులో ఈయ‌న గారి గొప్ప‌త‌నం ఏమీ లేద‌ని.. అయినా త‌మ ప్ర‌భుత్వం వ‌ల్లే ఎగుమ‌తులు పెరిగాయ‌నే విధంగా గొప్ప‌లు చెప్పుకున్నార‌ని అంటున్నారు. ఇక కొత్తం కంపెనీలు, పెట్టుబ‌డులే లేన‌ప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మొద‌టి స్థానంలో ఎలా ఉందో జ‌గ‌నే వివ‌రించాల‌ని వేడుకుంటున్నారు. వాణిజ్య ఉత్స‌వం పేరుతో వేడుక‌లు జ‌రుపుకోవాల్సినంత ఘ‌న‌కార్యం జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ హ‌యాంలో ఏమీ జ‌ర‌గ‌లేద‌ని.. మ‌రెందుకు ఇంత‌టి ఆడంబ‌రమ‌ని జ‌నం నిల‌దీస్తున్నారు.

డబ్బులు ఇవ్వలేదని కూలీల ధర్నా... వైఎస్ షర్మిల అరెస్ట్..

హైదరాబాద్ శివారు బోడుప్పల్ లో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్ష తీవ్ర ఉద్రిక్తత స్పష్టించింది. ప్రతి మంగళవారం దీక్ష చేస్తున్నారు వైఎస్ షర్మిల. ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాలను పరామర్శిస్తూ అక్కడే దీక్ష చేస్తున్నారు. అందులో భాగంగా బోడుప్పల్ వచ్చారు షర్మిల. అయితే దీక్షకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తల మధ్య దీక్ష చేసేందుకు వైఎస్ షర్మిల యత్నించగా ఆమెను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు షర్మిలను రెస్ట్ చేసి మేడిపల్లి స్టేషన్ కు తరలించారు. పోలీసులు తనను అరెస్ట్ చేయడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. వందల మంది నిరుద్యోగులను హత్య చేసిన హంతకుడు కేసీఆర్ అని మండిపడ్డారు. ఏళ్లుగా నిద్రపోయి ఇప్పుడు గర్జనలు అటూ ప్రతిపక్షాల ముందుకు వస్తున్నారని షర్మిల నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ లో ఒక నిరుద్యోగి చనిపోతే కనీసం పరామర్శించరా? అని నిలదీశారు. ప్రజా సమస్యలు పట్టని  రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్మాలని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. మరోవైపు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రికత కొనసాగుతుండగానే.. అడ్డా కూలీల ఆందోళనకు దిగారు. షర్మిల చేపట్టనున్న దీక్షకు తమను తీసుకొచ్చి డబ్బులు ఇవ్వలేదని అడ్డాకూలీలు మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో ఆందోళనకు దిగారు. తమను తీసుకొచ్చిన వారు డబ్బు ఇవ్వలేదని వారు దీక్ష స్థలి వద్దే నిరసన తెలిపారు. దీక్షలో కూర్చుంటే రూ.400 ఇస్తామని చెప్పి తీసుకొచ్చారని కూలీలు చెబుతున్నారు. తీరా వచ్చాక డబ్బులు ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు.