tense at pakisthan high commissiom newdwlhi

పాక్ హైకమిషన్ లోకి కేక్.. సంబరాల కోసమే అంటూ జనాగ్రహం.. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత

ఢిల్లీలోని  పాకిస్తాన్  హైకమిషన్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేల సంఖ్యలో జనం ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయం లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. బారికేడ్స్ అడ్డుపెట్టి జనాలను నిలువరించారు. విషయమేంటంటే.. పెహల్గాం ఉగ్రదాడిలో 27 మంది మరణించిన ఘటనపై దేశం యావత్తూ శోకసంద్రంలో మునిగి ఉన్న సమయంలో పాక్ హైకమిషన్ కార్యాలయం కేక్ ఆర్డర్ చేసి సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమైందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ఓ వైపు ఉగ్రదాడి మృతుల అంత్యక్రియలు జరుగుతున్న వేళ.. ఓ వ్యక్తి కేక్ తీసుకుని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయంలోకి వెడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడి యోలో ఓ వ్యక్తి చేతిలో కేక్ తో పాక్ హైకమిషన్ కార్యాలయంలోకి వడివడిగా నడుచుకువెడుతున్నాడు. అక్కడ ఉన్న మీడియా అతనిని ప్రశ్నిస్తోంది. అయితే మీడియా ప్రతినిథులకు సమాధానం ఇవ్వకుండా ఆ కేక్ ను డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తి వెళ్లిపోవడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఈ వీడియోపై నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  పెహల్గాం ఉగ్రవాదిలో మరణించిన వారి కోసం యావత్ దేశం కన్నీరు పెడుతుంటే, శోక సంద్రంలో మునిగిపోయి ఉంటే.. పాకిస్థాన్ సంబరాలు చేసుకుంటోందంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అదీ భారత గడ్డ మీద పాక్ హైకమిషన్ కార్యాలయం ఈ సంబరాలకు వేదిక కావడం ఆ దేశం తెంపరి తనానికి, పైశాచికత్వానికి నిలువెత్తు నిదర్శనమంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాక్ హైకమిషన్ లో సంబరాలు అంటూ వార్త   వేగంగా వ్యాపించింది. భారత్ విషాద సాగరంలో మునిగి ఉన్న సమయంలో అదే గడ్డ మీద పాకిస్థాన్ సంబరాలా అంటూ జనం ఆగ్రహంతో ఊగిపోయారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా భారత్ హైకమిషన్ వద్దకు చేరుకున్నారు. కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు.  అదలా ఉంటే.. పెహల్గాం ఉగ్రదాడి తరువాత కూడా పాకిస్థాన్ తన కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది.   సింధు నదీ జలాల్లో ప్రతి నీటిబొట్టూ పాకిస్థాన్ కే చెందుతుందంటూ ఆ దేశ మంత్రి అవాయిస్ లెఘారీ పేర్కొన్నారు. ఇండస్ వాటర్ ట్రయిటీ నుంచి భారత్  ఏకపక్షంగా వైదలగడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమనడమే కాకుండా, భారత్ నిర్ణయాన్ని రాజకీయంగా, న్యాపరంగా ఎదుర్కొంటామనీ, భారత్ కు గట్టి గుణపాఠం చెబుతామని సవాల్ విసిరారు. అంతర్జాతీయ సంస్థలకు కుదిర్చిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదలగజాలదనీ, భారత్ కు ఆ హక్కు లేదనీ పేర్కొన్నారు.  ఇలా ఉంటే.. పాక్ ఆక్రమిత కాశ్మీర్  నుంచి భారత్ లో చొరబడి విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదులు భారీ ప్రణాళిక రచించినట్లు భద్రతా బలగాలు చెప్పాయి. పీకోకేలో ఇందు కోసం ఉగ్రవాదులు  42 లాంచ్ ప్యాడ్లను సిద్ధం చేశాయని గుర్తించినట్లు భద్రతాబలగాలు వెల్లడించాయి. దాదాపు 130 మంది టెర్రరిస్టులు భారత్ లో చొరబడేందుకు తమ బాస్ ల ఆదేశాల కోసం ఎదురు చేస్తున్నారని పేర్కొన్నాయి.   

encounter chattisgarh and telangana border

ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దులో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

కర్రెగుట్టల్లో యుద్ధ వాతావరణం భీకర కాల్పులు.. వేల సంఖ్యలో మావోయిస్టులు..  వాయుసేన సహకారంతో భద్రతా దళాల కూంబింగ్ ఛత్తీస్‌గఢ్‌లో  ఈ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు.  ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ధర్మ తాళ్లగూడెంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. నక్సల్స్ ముక్త ఆపరేషన్ లో భాగంగా ఛత్తీస్ గఢ్ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో గత కొంత కాలంగా భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు కూంబింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఎన్ కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. కాల్పులు విరమించి శాంతి చర్చలకు రావాలని మావోయిస్టులకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఇలా ఉండగా   చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ సరిహద్దులోని ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లోని కర్రె గుటల్లో రెండ్రోజులుగా పెద్ద సంఖ్యలో భద్రతా దళాలు మోహరించి మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి. అక్కడ దాదాపు 3000 మంది మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఈ గాలింపు జరుగుతోంది. దీంతో ఆ ప్రాంతంలో యుద్ధ మేఘాలు అలముకున్నాయి.  వేల సంఖ్యలో భద్రత దళాలు కర్రెగుట్టలను చుట్టు ముట్టాయి. వాయుసేన కూడా ఈ కూంబింగ్ లో భాగస్వామి అయ్యిందంటేనే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చునని చెబుతున్నారు. ఈ ఆపరేషన్ తో  నక్సల్స్ ముక్త భారత్ దిశగా పడుతున్న అడుగులు ముగింపు దశకు వచ్చినట్లే అవుతుందని కూడా అంటున్నారు.  కూబింగ్ నిలిపివేయాలి, శాంతి చర్చ లకు పిలవాలి అంటూ మావోయిస్టులు   రాసిన లేఖను  కేంద్రం పట్టించుకున్న దాఖలాలు కనిపిం చడం లేదు.   వచ్చే ఏడాది మార్చినాటికి నక్సల్స్ ముక్త భారత్ ను చూడాలన్న లక్ష్యంతో  కేంద్రం అడుగులు వేస్తున్నది. అందుకే కనీవినీ ఎరుగని రీతిలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో వేల సంఖ్యలో భద్రతా దళాలను రంగంలోకి దింపింది. స్థానిక పోలీసులు, గ్రేహౌండ్స్, సీఆర్ పీఎఫ్, సైన్యం సంయుక్త ఆపరేషన్ కింద ఆపరేషన్ కగార్ సాగుతోంది.  ఇప్పుడు మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్‌గా మారిన కర్రెగుట్టల్లో వేల సంఖ్యలో భద్రతా దళాలు మోహరించాయి.   తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో దట్టమైన అటవీ ప్రాంతంతోపాటు ఎత్తయిన గుట్టలతో సుమారు 53 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కర్రెగుట్టలను మావోయిస్టులు అత్యంత సేప్టీ జోన్ గా భావిస్తుంటారు. ఆ కారణంగానే అందుకే ఛత్తీస్ గఢ్ లో తమ ఆనుపానులన్నీ భద్రతా దళాలు తెలుసుకుని దాడులు చేస్తుండటంతో మావోయిస్టులు కర్రెగుట్టల్లో తలదాచుకున్నారు. ఇలా ఇక్కడ మకాం వేసిన వారిలో  పార్టీ అగ్రనేతలు కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.  దీంతో ఆ ప్రాంతంలో వేల సంఖ్యలో జవాన్లను మొహరింపజేసి కూంబిగ్ నిర్వహిస్తున్నారు. కర్రెగుట్టలకు దారితీసే అన్ని మార్గాలనూ దాదాపుగా చుట్టుముట్టేశారు.  మావోయిస్టుల ఆచూకీ కోసం కర్రెగుట్టలను వాయిసేన విమానాలు జల్లెడపడుతున్నాయి.  కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే కర్రెగుట్టల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయని అంటున్నారు. కర్రెగుట్టలను భద్రతా బలగాలు మోహరించిన నేపథ్యంలో హరగోపాల్ వంటి పౌరహక్కుల సంఘం నేతలు రంగంలోకి దిగి.. శాంతి చర్చల కోసం మావోలు లేఖ రాసిన తరువాత కూడా ఈ తీరులో ఏరివేత కార్యక్రమం కొనసాగించడాన్ని తప్పుపడుతున్నారు. వెంటనే కూంబింగ్ నిలిపివేసి శాంతి చర్చలకు మావోయిస్టులను పిలవాలని కోరుతున్నారు. 

tearful story of new kashmir

కొత్త క‌శ్మీరం.. క‌న్నీటి గాథ‌!

క‌శ్మీర్ లోయ విధ్వంసంలో ఒక్కొక్క‌రిదీ ఒక్కో విషాద గాథ‌ హార్స్ రైడ‌ర్ సాహ‌స‌గాథ‌.. క‌లిమాతో త‌ప్పించుకున్న ఓ ప్రొఫెస‌ర్ తెలివైన క‌థ‌ హానీ మూన్ కి వ‌చ్చి శ‌వ‌పేటిక‌లో వెళ్లిన న‌వ వ‌రుడు బోరున విల‌పించిన న‌వ వ‌ధువు దీన ప్రేమ గాథ‌.. తొలిసారి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసిన క‌శ్మీరీలు సీఎం నుంచి కామ‌న్ మేన్ వ‌ర‌కూ అంద‌రిదీ ఒక‌టే వెత‌.. క‌త‌! గ‌త కొన్నేళ్ల నుంచి కొత్త క‌శ్మీరం ఆవిష్క‌రిస్తున్న వేళ‌.. ఎన్న‌డూ లేని విధంగా ప‌ర్యాట‌కులు సంద‌డి చేస్తున్న స‌మ‌యాన‌.. కాశ్మీరం నిజంగానే ఒక భూత‌ల స్వ‌ర్గ‌మా అనిపించింది. క‌శ్మీర్ భార‌త్ లో భాగం అయితే మ‌న‌కు ఇంత‌టి భాగ్యం ల‌భిస్తుందా? అన్న కోణంలో స్థానిక క‌శ్మీరీలు కూడా ఎంతో ఆనందంగా ఉన్న  సంద‌ర్భం కూడా ఇదే.  అయితే గ‌త మూడున్నర దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా 26 మంది ప‌ర్యాట‌కుల‌ను హ‌త‌మార్చి.. పాక్ ఉగ్ర‌వాదులు ఇక్క‌డి వారికి మ‌న‌శ్శాంతి లేకుండా చేశారు. సామాన్యుల నుంచి సీఎం వ‌ర‌కూ అంద‌రిదీ ఒక‌టే మాట‌. ఇది అమానుషం. ప్ర‌పంచ మాన‌వాళిపై జ‌రిపిన న‌మ్మ‌క ద్రోహం. ఇదొక అస‌హ్య‌క‌ర‌మైన చర్య‌. ఈ దాడికి తెగ‌బ‌డింది జంతువులు. వార‌ు అస‌లు మ‌నుషులు కాదు. త‌మ రాష్ట్రానికి ఆహ్లాదం వెతుక్కుని వ‌చ్చిన వారు తిరిగి వెళ్లేట‌పుడు ఆనందంగా వెళ్ల‌కుండా విషాద‌ంగా వెళ్ల‌డం.. త‌మ‌ను తీవ్రంగా  బాధిస్తోంద‌ని బాధ ప‌డ్డారు సీఎం ఒమ‌ర్ అబ్ధుల్లా. మ‌రి కొంద‌రు ప‌ర్యాట‌కులు శ‌వ‌పేటిక‌ల్లో వెళ్ల‌డాన్ని తామైతే అస‌లు జీర్ణించుకోలేక పోతున్నామ‌నీ ఆ దృశ్యాలు త‌మ‌ను క‌ల‌చి వేస్తున్నాయ‌ని అన్నారు సీఎం అబ్దుల్లా. ఇక క‌శ్మీరీలైతే.. తాము స్వ‌చ్ఛందంగా హోట‌ళ్లు, షాపులు మూసి వేసి.. నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇది త‌మ ప్రాంతానికే మాయ‌ని మ‌చ్చ‌లాంటి ఘ‌ట‌న‌గా వీరు భావిస్తున్నారు. త‌మ గుండెల‌పై ఈ దాడి గున‌పం దించింద‌నీ,  ఒక్క‌సారిగా పాత కాశ్మీర్ త‌మ క‌ళ్ల‌కు క‌ట్టింద‌నీ. ఇన్నాళ్ల పాటు తాము చూసింది క‌ల‌. ఇదే క‌ఠిక వాస్త‌వం. మా పాత క‌శ్మీర్ ని మ‌ళ్లీ మాకు వ‌ద్ద‌న్నా మా ఉగ్ర మూక‌లు  బ‌హుక‌రించ‌డం మాకుసుతరామూ ఇష్టం లేద‌ని వారు ఘోషిస్తున్నారు. 15రోజుల పాటు ప‌ర్యాట‌కుల‌కు వ‌స‌తి సౌక‌ర్యాల‌తో స‌హా అన్ని ఉచితంగా ఇస్తామ‌నీ.. సైనికుల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయ స‌హ‌కారాల‌ను కూడా అందిస్తామ‌ని క‌శ్మీరీలు అంటున్నారు. ఇది ప‌ర్యాట‌కం డ‌బ్బు ద‌స్కానికి సంబంధించిన వ్య‌వ‌హారం కాదు. మాన‌వ‌త్వానికి చెందిన అంశం కాబ‌ట్టి.. బాధిత కుటుంబాల‌కు త‌మ ప్ర‌గాఢ సాను భూతిని వ్య‌క్తం చేశారు. త‌మ‌లో ఒక‌డైన హార్స్ రైడ‌ర్ అదిల్ షా త‌మ క‌శ్మీరీల త‌ర‌ఫున ఉగ్ర‌వాదులతో పోరాడి వీర మ‌ర‌ణం పొంద‌డం త‌మ‌ను క‌ల‌చి వేసింద‌నీ, ప‌ర్యాట‌కుల ప‌ట్ల మా ప్రేమ ఎలాంటిదో అదిల్ షా మ‌ర‌ణం రూపంలో  తెలియ చేసిన‌ట్టుగా స్థానిక క‌శ్మీరీలు చెబుతున్నారు. మేం మీకోసం ప్రాణం పెడ‌తామ‌న‌డానికి ఇంత‌క‌న్నా నిద‌ర్శ‌నం మ‌రేదీ లేద‌ని అంటున్నారు వారు. ఇక న‌వ జంట విన‌య్- హిమాన్షుది..  అత్యంత విషాదక‌ర‌మైన‌ ఘ‌ట‌న‌.  వీరి పెళ్ల‌య్యింది ఏప్రిల్ 16, ఆమె భ‌ర్త విగ‌త జీవిగా మారింది ఏప్రిల్ 22న‌. ప‌ట్టుమ‌ని వారం కూడా నిల‌వ‌ని వివాహ బంధం వీరిది. ఆమె అత‌డి శ‌వ‌పేటిక ద‌గ్గ‌ర ఏడ్చిన ఏడుపు.. ఎంత హృద‌య విదార‌కంగా నిలిచిందంటే.. ప్ర‌పంచ‌మంతా ఆమెతో క‌ల‌సి ఏడ్చేంత‌. అంత‌గా ఆమె త‌న భ‌ర్త శ‌వ‌పేటిక‌ను వ‌ద‌ల్లేక వ‌దులుతూ.. చివ‌రిగా జై హింద్ అంటూ ఆమె చూపిన దేశ భ‌క్తి న‌భూతో.. ఆ స‌మ‌యంలో వారికి తెలీదు త‌మ‌పై ఒక ఉగ్ర‌దాడి జ‌రుగుతుంద‌ని. విన‌య్ అయితే హిమాన్షుతో క‌ల‌సి ఎంతో ఉల్లాసంగా  గ‌డుపుతున్నాడు. ఇద్ద‌రూ క‌ల‌సి ఆడి  పాడారు. అత‌డైతే తాను చ‌నిపోయే స‌మ‌యానికి భేల్ పూరీ తింటున్నాడు. ఇంత‌లో ఆమె మొహంపై ర‌క్తం చిందింది. చూస్తే ఒక ఉగ్ర‌వాది త‌న భ‌ర్త‌ను కాల్చి చంపిన దృశ్యం చూసి విల‌విల‌లాడిపోయిందా న‌వ వ‌ధువు.  ఇక క‌లిమా చ‌ద‌వ‌డం వ‌ల్ల బ‌తికిపోయిన దంపతుల‌ది మ‌రో ర‌క‌మైన గ్రేట్ ఎస్కేప్ స్టోరీ. ఒక చెట్టు కింద బెంగాలీ ప్రొఫెస‌ర్ భ‌ట్టాచార్య ప‌డుకుని ఉన్నారు. ఆయ‌న కుటుంబం కూడా అక్క‌డే ఉంది. తాను నిద్రిస్తుండ‌గా.. క‌లిమా చ‌దువుతున్న చ‌ప్పుడు. లేచి చూశాడు. ఏం చేస్తున్నావ్ అంటూ ఒక ఉగ్ర‌వాది అత‌డ్ని హిందీలో అడిగాడు. అంతే అత‌డు త‌న‌కు తెలిసిన క‌లీమా బిగ్గ‌ర‌గా చ‌ద‌వ‌డం మొద‌లు పెట్టాడు. ప‌క్క‌నే ఉన్నత‌న్ని కాల్చి   అక్క‌డి నుంచి వెళ్లిపోయాడా ఉగ్ర‌వాది. దీంతో బ‌తుకు జీవుడా అంటూ అక్క‌డ నుంచి పారిపోయింది భ‌ట్టాచార్య కుటుంబం. ప‌హెల్గాంకి 5 కిలోమీట‌ర్ల దూరంలో స‌ముద్ర మ‌ట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో ఉండే బైస‌ర‌న్ ప‌చ్చిక‌బ‌య‌ళ్లు.. ఎంతో ఆహ్లార‌క‌రంగా ఉంటాయి.. ఇక్క‌డికి న‌డ‌క లేదా గుర్ర‌పు స్వారీ ద్వారా మాత్ర‌మే వెళ్లగలం. అందులో భాగంగా ఇక్క‌డ హార్స్ రైడ‌ర్లు చాలా మంది త‌మ జీవ‌నోపాధిని వెతుక్కుంటూ ఉంటారు. అలా ప‌ర్యాట‌కుల‌ను బైస‌ర‌న్ కు త‌న గుర్రం మీద ఎక్కించుకుని నాలుగు డ‌బ్బులు సంపాదిస్తుంటాడు అదిల్ షా. అత‌డ‌లా వ‌స్తుండ‌గానే ఈ దాడి జ‌రిగింది. అత‌డైతే ఎంతో వీరోచితంగా ఉగ్ర‌వాది నుంచి తుపాకీ లాక్కో బోతూ.. వారి కాల్పుల్లో చ‌నిపోయాడు. ఇప్పుడ‌త‌డి భార్యా పిల్ల‌లు, త‌ల్లిదండ్రులు అనాథ‌ల‌య్యారు. వీరు త‌మ కుమారుడి మ‌ర‌ణ వార్త విని భోరున విల‌పిస్తున్నారు. ఇక ఈ ప్రాంతాన్నే ఉగ్ర‌వాదులు ఎంపిక చేసుకోడానికి గ‌ల కార‌ణం ఇక్క‌డ ప‌ర్యాట‌కులు అధికంగా వస్తుండటమే.. వీలైనంత ఎక్కువ  మందిని మట్టుపెట్టవచ్చన్న అంచనాలతోనే  ఉగ్ర ముఠా ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. ఈ దాడికి తామే కార‌కుల‌మంటూ ల‌ష్క‌రే తోయిబా రెసిస్టెన్స్ గ్రూప్ బాధ్య‌త తీస్కుంది.  ప్ర‌ధాని మోడీ అయితే రెండు రోజుల సౌదీ ప‌ర్య‌ట‌నను అర్ధంతరంగా ముగించుకుని హుటాహుటిన  భార‌త్ చేశారు. హోం మంత్రి అమిత్ షా సీఎం, లెఫ్టెనెంట్ గ‌వ‌ర్న‌ర్ తో భేటీ అయ్యి ప‌రిస్థితి స‌మీక్షించారు. బాధితుల‌తో మాట్లాడారు. ఇక ఢిల్లీలో అత్య‌వ‌స‌ర భ‌ద్ర‌తా సమావేశం ఏర్పాటు చేశారు. ఇక‌పై పాక్ తో మ‌రోలా ఉంటుంద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఊహించ‌లేనంత గ‌ట్టి దెబ్బ తీస్తామ‌న్నారు రాజ్ నాథ్ సింగ్. ఇక‌పై ఏ ర‌క‌మైన దౌత్య సంబంధాలు కూడా పాక్ తో ఉండ‌వ‌ని తెగేసి చెప్పారు. ఆ ముగ్గురు ముష్క‌రులు పాకిస్తానీలే కాబ‌ట్టి.. 1960 నాటి సింధు జ‌లాల ఒప్పందం అమ‌లు  నిలిపి వేశారు. ఇక్క‌డి పాక్ దౌత్య వేత్త‌ల‌ను మీ దేశం దయచేయండని హుకుం జారీ చేశారు.  భార‌త్ లో ఉంటున్న  పాకిస్తానీలు గానీ, ప‌ర్యాట‌కులు గానీ వారం లోగా భార‌త్ వీడాల‌ని సూచించారు. పాక్ లోని భార‌త దౌత్య అధికారుల హోదాల‌న్నిటినీ ర‌ద్దు చేసి.. వారిని తిరిగి వ‌చ్చేయాల‌న్న ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడంద‌రి చూపల్లా ఒక్క‌టే.. ఉగ్ర‌దాడికి భార‌త స‌మాధానం ఏ స్థాయిలో ఉంటుందా? అని మాత్ర‌మే!

pehalgaon terror attack aims hindus

మంచుకొండల్లో మారణహోమం.. హిందువులే ఎందుకు టార్గెట్ అయ్యారు?

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడితో.. భారత్ మొత్తం రగిలిపోతోంది. హిందూ టూరిస్టులే లక్ష్యంగా తీవ్రవాదులు జరిపిన కాల్పులతో..  దేశం ఏ క్షణమైనా పేలేందుకు సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా మారింది. టెర్రరిస్టులు కేవలం హిందువులనే ఎంపిక చేసుకొని మరీ దాడి చేయడానికి కారణమేంటి? హిందువులను చంపడం వల్ల.. వారు సాధించేదేమిటి? పహల్గాం ఉగ్రదాడి వెనకున్న అసలు కోణమేంటి? అన్నది పెద్ద డిబేట్‌గా మారింది. ఉగ్రవాదానికి మతం లేదంటారు.  మరి.. కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దాడి ఏమిటి?  హిందువులని లక్ష్యంగా చేసుకొని.. వందలాది మంది టూరిస్టుల్లో హిందువులను మాత్రమే సెలక్ట్ చేసుకొని మరీ కాల్పులు జరపడాన్ని ఎలా చూడాలి?  మతాన్ని నిర్ధారించి చంపేవాడి మనస్తత్వం ఏమిటో ఇప్పటికైనా అర్థమవుతోందా?  పహల్గాంలో టెర్రరిస్ట్ అటాక్ తర్వాత తలెత్తుతున్న ప్రశ్నలివే. ఉగ్రవాదానికి మతం లేదని వాదించే వాళ్లందరికీ.. మంచుకొండల్లో జరిగిన ఈ మారణహోమమే బిగ్ ఎగ్జాంపుల్. ఉగ్రవాదులకే కాదు.. ఉగ్రవాదానికి కూడా మతం ఉందని రుజువు చేసిన తీవ్రమైన దాడి ఇది. పహల్గాం ఉగ్రదాడిలో మతం మాత్రమే ఉంది. ఉగ్రవాద సంస్థలన్నీ.. హిందూ మతాన్ని ద్వేషిస్తాయని, ఉగ్రవాదులంతా హిందూ సమాజానికి వ్యతిరేకంగానే పనిచేస్తారనే విషయం.. పహల్గాం ఉగ్రదాడితో  తేలిపోయింది. హిందువులే లక్ష్యంగా చేసుకొని చేసిన ఈ దాడితో.. కశ్మీర్ సరిహద్దుల్లోకి చొరబడే ఉగ్రవాదుల లక్ష్యమేమిటో స్పష్టంగా తెలిసింది. మన దేశంలో మతం పేరిట మంటలు రేపడమే టెర్రరిస్టుల ఏకైక లక్ష్యమని అర్థమవుతోంది. అందుకోసమే.. పహల్గాంలో హిందూ టూరిస్టులను ఎంచుకొని మరీ చంపేశారనే వాదనలు బలపడుతున్నాయ్. అల్‌ఖైదా, ఐసిస్, లష్కరే తోయిబా, ఇప్పుడు టీఆర్ఎఫ్. ఇలా.. ఉగ్రవాద సంస్థలు, జిహాదీ గ్రూపులన్నీ.. తమ హింసాత్మక చర్యలను మతపరమైన భావజాలం, హిందూ మతంపై నిలువెల్లా ద్వేషంతోనే నడిపిస్తున్నాయ్. ఈ టెర్రరిస్ట్ సంస్థల ఉగ్రవాద కార్యకలాపాలకు మతమే కేంద్ర బిందువు. హిందువులని లక్ష్యంగా చేసుకొని చేసిన ఈ దాడి.. పూర్తిగా మతపరమైన ద్వేషంతో చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మత గుర్తింపుతోనే.. కశ్మీర్‌లో విభజన సృష్టించేందుకు ప్రయత్నించారు ఉగ్రవా దులు. ఎందుకంటే.. ఉగ్రవాదంలో మతం ఓ డ్రైవింగ్ ఫోర్స్‌లా పనిచేస్తుంది. ఆ మత భావజాలమే.. ఉగ్రవాదుల్ని తీవ్ర దాడులకు ప్రేరేపిస్తోంది. పహల్గాంలో జరిగిన దాడి కూడా ఆ కోవకు చెందినదే. ఉగ్రవాదులు.. టూరిస్టుల పేర్లు, కల్మా చదవమని ఆదేశించడం, సున్తీ గుర్తింపు ద్వారా హిందువులను ఎంపిక చేశారు. ఇది.. జిహాదీ భావజాలంతో హిందువులను.. కాఫిర్‌లుగా లక్ష్యంగా చేసినట్లు సూచిస్తోంది. ఉగ్రవాదులు.. ఉద్దేశపూర్వకంగా హిందువులను గుర్తించి మరీ దాడులు చేయడం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఇది.. మతపరమైన ద్వేషంతో కూడిన హిందూ జెనోసైడ్ దాడిగా చెబుతున్నారు. కేవలం కశ్మీర్‌లో మతపరమైన ఉద్రిక్తలను రెచ్చగొట్టేందుకే.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో హిందూ-ముస్లిం విభజనని పెంచి.. అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. ఈ మారణహోమంలో ఉగ్రవాదులు మహిళలను చంపలేదు. చిన్నారుల జోలికి వెళ్లలేదు. కేవలం.. హిందూ పురుషులను లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. కర్ణాటకకు చెందిన మంజునాథ్‌ని అతని భార్య పల్లవి కళ్ల ముందే కాల్చి చంపారు ఉగ్రవాదులు. తనను కూడా కాల్చేయమని పల్లవి కోరింది. అందుకు.. మేము.. నిన్ను చంపం. ఈ భయానక ఘటన గురించి మోడీకి అని.. టెర్రరిస్ట్ ఆమెను ఆదేశించడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ దాడి భారత ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెంచేందుకు చేసిన ఓ ప్రయత్నంగానూ కనిపిస్తోంది. ప్రధానంగా కశ్మీర్‌లో హిందువుల సంఖ్య పెరుగుతోందనే సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి.. రాజకీయంగా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించే స్థానికుల మద్దతు పొందేందుకే.. ఉగ్రవాదులు హిందూ టూరిస్టులను లక్ష్యంగా చేసుకొని దాడి చేసి ఉండొచ్చనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయ్. అమర్‌నాథ్ యాత్రకు కొద్ది రోజుల ముందు.. పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఈ ఉగ్రదాడి.. భారత్‌లోని లక్షలాది మంది హిందూ యాత్రికుల్లో ఆందోళన పెంచుతున్నది. హిందూ యాత్రికుల్లో భయం సృష్టించేందుకు.. ఉగ్రవాదులు ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడి ఉండొచ్చంటున్నారు. ఈ ఉగ్రదాడిని.. పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన ఉగ్రవాద చర్యగానూ ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుతోనే.. లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్.. ఈ ఉగ్రదాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

India gives befitting reply to Pakistans provocations

పాక్ కవ్వింపులు.. దీటుగా భారత్ బదులు!

కాశ్మీర్‌ పహల్గాంలో ఉగ్రవాదుల కిరాతక దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ పై కఠిన ఆంక్షలకు సిద్ధం అయ్యింది.  ప్రాథమికంగా కొన్ని చర్యలను తీసుకుంది. అందులో భాగంగా దేశ సరిహద్దులను మూసే సింది.  వివిధ పనుల నిమిత్తం ఇండియాకు వచ్చిన  పాక్ జాతీయులు మే ఒకటవ తేదీ లోగా భారత్ విడిచి వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పెహల్గాంలో పర్యాటకులు లక్ష్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి అనంతరం భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది.   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో భేటీ అయిన  భద్రతా వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాల మేరకు అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను  మూసివేసింది. చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లతో భారత్‌కు వచ్చిన, ఇక్కడ నివసిస్తోన్న పాకిస్తానీయులు కూడా తమ స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. వీసా గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించేది లేదని స్పష్టం చేసింది. మే 1 తేదీ లోపలే వాళ్లంతా కూడా భారత్‌ను వదిలి పాకిస్తాన్‌కు వెళ్లి పోవాల్సి ఉంటుంది. అయితే వారు దేశం విడిచి వెళ్లాలంటే అట్టారీ -  వాఘా చెక్ పోస్టు ఒక్కటే మార్గం.  దీని ద్వారా మాత్రమే అధికారికంగా సరిహద్దు దాటాల్సి ఉంటుంది. దానిని మూసివేయడంతో  ఇప్పుడు ఇక్కడ ఉన్న పాకిస్థానీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గడువు దాటిన తరువాత కూడా ఇక్కడే ఉండే పాకిస్తానీయులు జైలుకు వెళ్లక తప్పదు. ఇక ఇప్పుడు వారు  అనివార్యంగా తాము తిరిగి వెళ్లడానికి కేంద్రం నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. వీసా ఉంది కదా అన్న ధైర్యంతో అడ్రస్ లు మార్చి దేశంలో తిరిగే అవకాశం ఇసుమంతైనా లేదు. అదే విధంగా సింధు జలాల ఒప్పందాన్ని (ఇండస్ ట్రీటీ) రద్దు చేసింది. పాకిస్థాన్ తో అన్ని రకాల సంబంధాలనూ తెంచేసింది.  భారత్‌లో ఉన్న పాకిస్తాన్ హైకమిషనర్‌కు కూడా  మే 1వ తేదీ లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. సీసీఎస్‌లో తీసుకున్న నిర్ణయాలతో  ఒక అధికారిక పత్రాన్ని ఆయనకు అందజేసింది. ఇక పాకిస్తాన్‌లో కూడా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. పెహల్గాం ఉగ్ర దాడి జరిగినప్పటి నుంచి ఆ దేశంలో  భయానక వాతావరణం నెలకొంది. భారత్ నిర్ణయాలపై ఎలా స్పందించాలన్న విషయంపై అక్కడ ప్రభుత్వం కిందా మీదా పడుతోంది.  కవ్వింపు చర్యలకు దిగుతోంది. అందులో భాగంగానే  ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాలను ఛేదించే క్షిపణి పరీక్షలకు నడుంబిగించింది.  కరాచీ తీర ప్రాంతంలో  రెండు రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు భారత్ కు సమాచారాన్ని అందించింది. ఇందు కోసం తీరప్రాంతంలో నౌకాదళ సిబ్బందిని మోహరించింది. దీనిపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామనీ, పాక్ క్షిపణి పరీక్షలపైనా నిఘా ఉంచామనీ పేర్కొంది.  ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సర్వసిద్ధంగా ఉందని పేర్కొంది.  

no entry to pak citizens

పాక్ పౌరులకు అనుమతి నో.. సింధు జలాల ఒప్పందం రద్దు!

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన  ఉగ్రదాడి అనంతరం ఇండియా కఠిన చర్యలకు ఉపక్రమించింది.  ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని నిర్ధారణ కావడంతో ఇండియా కఠిన చర్యలకు రెడీ అయ్యింది. అందులో బాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ   సమావేశం అనంతరం కీలక నిర్ణయాలు తీసుకుంది.  అందులో భాగంగా  సింధు నది జలాల పంపిణీకి సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలాగే  భారతదేశంలోకి పాకిస్థాన్ పౌరులకు అనుమతి లేదని ప్రకటించడమే కాకుండా, ఆ దేశస్థులకు ఇప్పటికే జారీ చేసిన వీసాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. అలాగే ఢిల్లీలోని పాకిస్థాన్ దౌత్యకార్యాలయం సిబ్బందిని 55 నుంచి 33కు తగ్గించాలని ఆదేశించింది.   ఈ మేరకు పాక్  పాక్ కు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ఏ దేశంతోనూ చర్చల ప్రశక్తే లేదని ప్రకటించింది. ఇప్పటికీ పాకిస్థాన్ తన వైఖరి మార్చుకోకుంటే ముందుముందు మరిన్ని కఠిన చర్యలకు కూడా వెనుకాడబోమబని భారత్ హెచ్చరించింది.    

vidadala rajani stopped in vixag airport

విశాఖ విమానాశ్రయంలో మాజీ మంత్రి విడదల రజనీ నిర్బంధం?

మాజీ మంత్రి విడదల రజనీని విశాఖ విమానాశ్రయంలో నిర్బంధించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. వైసీపీ  హయాంలో  యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ స్టోన్‌ క్రషర్స్ నిర్వాహకులను బెదిరించి రూ.2. 20 కోట్లు  వసూలు చేశారనే ఆరోపణలపై  మాజీ మంత్రి విడుదల రజని,  ఆమె మరిది గోపి, అలాగే వీరికి సహకరించిన  అధికారి  జాషూవా,  మాజీ మంత్రి  విడదల రజని పీఏ రామకృష్ణపైనా కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.  ఇదే కేసులో విడదల రజని మరిది విడదల గోపీనాథ్ ను ఏసీబీ అధికారులు గురువారం (ఏప్రిల్ 24) ఉదయం హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడ తరలించిన సంగతి తెలిసిందే.   ఈ కేసులో యాంటిసిపేటరీ బెయిలు కోసం మాజీ మంత్రి విడదల రజనీ, విడదల గోపీనాథ్ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే  విజిలెన్స్ అధికారి జాఘువా సైతం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆ పిటిషన్లన్నీ విచారణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. విడదల రజనీ యాంటి సిపేటరీ బెయిలు పిటిషన్ పై తీర్పు వాయిదా వేసిన కోర్టు, ఆమెకు అరెస్టు నుంచి మాత్రం ఎటు వంటి మినహాయింపూ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే విదేశాలకు పరారీ అయ్యే అవకాశం ఉందన్న విశ్వసనీయ సమాచారంతో ఏసీబీ అధికారులు విడదల గోపీనాథ్ ను హైదరాబాద్ లో అదుపులోనికి తీసుకున్నారు. కాగా విడదల రజనీ దేశం విడిచి వెళ్లకుండా ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విశాఖ విమానాశ్రం నుంచి రజనీ విదేశాలకు వెళ్లకుండా  రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే విశాఖ విమానాశ్రయంలో విడదల రజనీని నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమెను అరెస్టు చేశారా? లేక అడ్డుకున్నారా అన్న విషయంలో క్లారిటీ లేదు.  

vidadala gopinath arrested in hyderabad

గోపీనాథ్ అరెస్టు.. ఇక మాజీ మంత్రి విడదల రజనీ వంతేనా?

వైసీపీ నాయ‌కురాలు, చిలకలూరి పేట మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీకి భారీ షాక్ త‌గిలింది. ఆమె మ‌రిది.. విడ‌ద‌ల గోపీనాథ్ ను ఏసీబీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. విడదల గోపీనాథ్ విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నారన్న కచ్చితమైన సమాచారంలో ఏసీబీ పోలీసులు ఆయనను హైదరాబాద్ లో ఈ తెల్లవారు జామున అదుపులోనికి తీసుకున్నారు.  అరెస్టు అనంత‌రం.. ఆయనను హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు తరలించారు.   ఈ అరెస్టుతో ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజనీ చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుసుకుందని అంటున్నారు.  యడ్లపాడులో  క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారన్న ఫిర్యాదులపై  మాజీమంత్రి విడదల రజపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో నే విడదల రజిని మరిది గోపినాథ్ ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌ లో అరెస్టు చేశారు. అక్కడ నుంచి విజయవాడకు తరలించారు.   2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారన్న ఫిర్యాదుల మేరకు  ఈ ఏడాది మార్చిలో ఏసీబీ నమోదు చేసిన కేసులో విడదల రజని  ఏ1గా, ఆమె మరిది విడదల గోపీనాథ్ ఏ3గా, రజని పీఏ దొడ్డ రామకృష్ణను ఏ4గా చేర్చారు.  ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ విడదల రజని, గోపీనాథ్ లు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.  అదలా ఉండగానే తాజాగా విడదల రజనీ మరిది గోపీనాథ్ ను పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది.   కాగా సైబరాబాద్ మెక్క, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజిని  ముందస్తు బెయిలు పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు.. ఆమెకు అరెస్టు నుంచి మినహాయింపు ఏదీ ఇవ్వలేదు.  ఇప్పుడు ఇదే కేసులో ఆమె మరిది విడదల గోపీనాథ్ ను అరెస్టు చేయడంతో  విడదల రజనిని కూడా అరెస్టు చేస్తారా? అన్న చర్చ మొదలైంది. 

ktr brs boss and kcr confine to advices

కారు స్టీరింగ్ చేతులు మారుతుందా?

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మరో మూడు రోజుల్లో ( ఏప్రిల్ 27) ఇరవై నాలుగేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుని రజతోత్సవ  సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను ఘనంగా జరుపుకునేందుకు సిద్దమవుతోంది. ఒక విధంగా ఇదొక అపూర్వ సందర్భం.  అవును పాతికేళ్ళ క్రితం, 2001 ఏప్రిల్‌ 2న జలదృశ్యం (కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం) లో పురుడు పోసుకున్నటీఆర్ఎస్ ఇంత కాలం బతికి బట్టకడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ముఖ్యంగా అప్పటికే  ప్రత్యేక  తెలంగాణ నినాదంతో పుట్టి గిట్టిన పార్టీలు అనేకం ఉన్న నేపధ్యంలో టీఆర్ఎస్ కూడా అంతే  అనుకున్నవారు, అన్నవారు కూడా ఉన్నారు. అయితే, తెలంగాణ సెంటిమెంట్ తో పుట్టిన టీఆర్ఎస్  విజయవంతంగా, రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా.. పాతికేళ్ళ ప్రస్థానం పూర్తి చేసుకుంది. రాష్ట్రాన్ని పదేళ్ళు పాలించింది.  ప్రతిపక్ష అనుభవాన్నీ రుచి చూసింది.    నిజానికి, తెలుగు నాట  అనేక పార్టీలు మఖలో పుట్టి పుబ్బలో పోయాయి. అప్పుడే కాదు.. ఇప్పటికి కూడా, పాతికేళ్ళు బతికి బట్ట కట్టిన పార్టీలు రెండే రెండున్నాయి. 1982 లో  నందమూరి తారక రామ రావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ తర్వాత రజతోత్సవం జరుపుకుంటున్న పార్టీ, టీఆర్ఎస్ మాత్రమే బతికి బట్ట కట్టిన పార్టీగా చరిత్ర  పుటల్లో నిలిచింది.  ఈ పాతికేళ్ళలో పార్టీలో చాలా మార్పులు జరిగాయి. 2001లో ఉద్యమ పార్టీగా పుట్టిన టీఆర్ఎస్, 2014లో ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత 2022లో  భారత రాష్ట్ర సమితిగా(బీఆర్ఎస్) గా  పేరు మార్చుకుని జాతీయ రాజకీయాల్లో కాలు పెట్టింది. అయితే  ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా, ప్రాతీయ పార్టీ, జాతీయ పార్టీగా  రూపాంతరం చెందినా, అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్నా  పార్టీ పగ్గాలు మాత్రం చేతులు మారలేదు. వ్యవస్థాపక అధ్యక్షుడు, కల్వకుట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) సారథ్యకలోనే ఇప్పటికీ పార్టీ నడుస్తోంది. ఆయనే పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. రెండు పదవుల్లో కొనసాగుతున్నారు. నిజానికి,ముందు ముందు కూడా ఆయనే కొనసాగుతారు.  అందులో అనుమానం లేదు.  అయితే పదవి ఆయనదే అయినా..  పెత్తనం అయన చేతుల్లో ఎంతవరకూ ఉంటుంది అనేది అనుమానమే అంటున్నారు. ఇప్పటికే చాలావరకు ఫార్మ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్ తిరిగి క్రియాశీల నేతగా జనంలోకి వస్తారా? ముందుండి పార్టీని నడిపిస్తారా? తెర వెనక నుంచి మార్గ ‘దర్శకత్వం’ మాత్రమే చేస్తారా? అంటే.. కేసీఆర్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే అన్న సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా  పార్టీ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వివిధ టీవీ చానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలను జాగ్రత్తగా గమినిస్తే..  ఏదో ఇలాంటి, ఉత్సవాల్లో దర్శనం ఇవ్వడం వరకే కేసీఆర్ పాత్ర పరిమితం కాబోతోందననే సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. నిజానికి.. కారాణాలు ఏమైనా ఇప్పటికే పార్టీలో కేసీఆర్ పాత్ర చాలా వరకూ కుదించుకు పోయింది. ఇందులో దాపరికం లేదని పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు. మరోవంక కేటీఆర్  అప్రకటిత ఉత్తరాధికారిగా సర్వం తానై చక్రం తిప్పుతున్నారనేది  కళ్ళ ముందున్న సత్యం. అదలా ఉంటే గడచిన రెండుమూడు రోజుల్లో కేటీఆర్  వేర్వేరు టీవీ చాన్నాళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో  కేసీఆర్ ఫ్యూచర్ రోల్ పై మరింత క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు. కానీ, పార్టీ రోజువారీ రాజకీయ కార్యకలాపాల్లో కనిపించరు. వినిపించరు. పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనరు. తెర వెనక నుంచి మార్గ దర్శకత్వం  మాత్రమే చేస్తారు. తెరపై కనిపించే రోజువారీ రాజకీయ  కార్యకలాపాలన్నీ కేటీఆర్ చూసుకుంటారు.  అలాగే, ప్రతిపక్ష నేతగానూ కేసీఆర్  కొనసాగుతారు, కానీ, అసెంబ్లీకి మాత్రం రారని, కేటీఆర్  ఒకటి రెండు ఇంటర్వ్యూలలో స్పష్టంగానే చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రస్ మంత్రులు చేసే అవమానాలను భరించవసిన అవసరం కేసీఆర్ కు లేదని, అందుకే ఆయన, అసెంబ్లీకి రారని స్పష్టం చేశారు. అంతేకాదు.. గతంలో తమిళనాడులో జయలలిత, ఏపీలో చంద్రబాబు నాయుడు, అధికార పక్షం అవమానాలను భరించలేక సంవత్సరాల తరబడి అసెంబ్లీకి  రాలేదని, అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు కేసీఆర్  కూడా అసెంబ్లీ ముఖం చూడరని కేటీఆర్ స్పష్టం చేశారు.  సో.. ఇక గులాబే బాస్  ఎవరంటే.. తెర వెంక కేసీఆర్,  తెరపై కేటీఆర్ ఆర్  అంటున్నారు.

cbn announce 10lac rupees wxgratioa to families of terror

ఉగ్రదాడి.. ఏపీ బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా

జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిని చంద్రబాబు ఖండించారు. దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, దేశ సమగ్రత, భద్రత విషయంలో  అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.   అభివృద్ధిలో దూసుకెళ్తున్న భారతదేశాన్ని చూసి ఓర్వలేకే ఇలాంటి దాడులు చేస్తున్నారన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ వాసి జె.ఎస్. చంద్రమౌళి భౌతికకాయాన్నిచంద్రబాబు నివాళులర్పించారు. చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విశాఖ వెళ్లిన ఆయన చంద్రమౌళి భౌతికకాయంపైపై జాతీయ జెండా కప్పారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.  జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే విహారయాత్రకు వెళ్లిన వారిపై విచక్షణారహితంగా దాడులు జరిపారన్నారు. మన రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఎస్ బి ఐ ఉద్యోగి చంద్రమౌళి, ఐటీ ఉద్యోగి మధుసూధన్ టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఉగ్రదాడిలో మరణించిన ఇద్దరు తెలుగువారి   కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.  ఉగ్రవాదులు భారత్ ను ఏం చేయలేరు.. మన దేశంలో  సమర్థనాయకత్వం, సుస్థిర ప్రభుత్వం ఉందన్నారు.  అమెరికా వైస్ ప్రెసిడెంట్ భారత పర్యటనలో ఉండటం, దేశ ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో జరిగిన ఈ దాడి వెనుక కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.   దేశ సమగ్రత, భద్రతను దెబ్బతీయాలని చూసే వారి ఆటలు సాగవు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.  జమ్మూ ఉగ్రదాడి నేపథ్యంలో విశాలమైన తీరప్రాంతం ఉన్న మన రాష్ట్ర భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. పోలీస్ వ్యవస్థను సమర్ధవంతంగా నడిపిస్తాం. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్తామని చెప్పారు. 

 Jammu and Kashmir

ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సంచలన నిర్ణయం..ఇక వారికి నో ఎంట్రీ

  జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్వంలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై పాక్ పౌరులను భారత్ లోకి అడుగుపెట్టనివ్వబోమని ప్రకటించింది. ఇప్పటికే ఇక్కడ ఉన్న పాక్ పౌరులు, పర్యటకులు తక్షణమే తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ జారీ చేసిన ప్రత్యేక వీసాలను రద్దు చేసింది.  పాక్ తో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. వెంటనే పాక్ హైకమీషనర్ దేశాన్ని వీడాలని సూచించింది. అటారి చెక్ పోస్టును వెంటనే మూసి వేస్తున్నట్టు తెలిపింది. ఇండస్ వాటర్ ఒప్పందాన్ని కూడా నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు కేబినెట్‌ భద్రతా కమిటీ భేటీలో చర్చించిన అంశాల్ని భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మీడియాకు వెల్లడించారు.  సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించిందన్నారు. ప్రత్యేక వీసాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు  

CM Revanth Reddy

జపాన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్

  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. కాగా మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ సంగారెడ్డికి వెళ్లనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూతురు ఎంగేజ్మెంట్‌కు హారయ్యేందుకు ఆయన సంగారెడ్డి వెళ్తున్నట్టు సమాచారం. వారం రోజులు జపాన్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం.. అక్కడ పలు పారిశ్రామిక సంస్థలతో రూ.12,062 కోట్ల పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక ఈనెల 25, 26న హైదరాబాద్ వేదికగా జరగనున్న 'భారత్ సమ్మిట్ ఏర్పాట్లపై రేపు మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

KTR

బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన కేటీఆర్

    ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించ తలపెట్టిన బీఆర్‌ఎస్ రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. పార్టీ నేతలతో కలిసి సభాస్థలిని సందర్శించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటివరకు సహకరించిందని, సభ ముగిసే వరకు ఇదే సహకారం అందించాలని జిల్లా యంత్రాంగాన్నికేటీఆర్ కోరారు. ఇది ప్రభుత్వ వ్యతిరేక పోరాట సభ కాదని, కేవలం పార్టీ వార్షికోత్సవాన్ని శాంతియుతంగా జరుపుకుంటున్నామని తెలిపారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ హిమాలయాల స్థాయికి తీసుకెళ్లారని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారు గులాబీ జెండా వైపే చూస్తున్నారని, బీఆర్ఎస్ ఒక జనతా గ్యారేజ్‌లా మారిందని కేటీఆర్ అన్నారు. వరంగల్ గడ్డపై బీఆర్ఎస్ గతంలో అనేక విజయవంతమైన సభలు నిర్వహించిందని, ఇప్పుడు పార్టీ వార్షికోత్సవ సభకు కూడా ఇదే వేదిక కావడం సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. సభకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నామని, సుమారు 40 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. వేసవి దృష్ట్యా 10 లక్షల మంచి నీటి బాటిళ్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతామని, వైద్య సేవలకు గాను 100 వైద్య బృందాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు

Hyderabad MLC polling

ప్రశాంతంగా ముగిసిన హైదరాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్

  హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల  పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా.. సాయంత్రం 4 గంటలకు ముగిసింది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 81 మంది కార్పొరేటర్లలో 66 మంది కార్పొరేటర్లు, 31 మంది అఫిషియో సభ్యులలో 21 మంది ఓటు వేశారు. ఓటింగ్ లో బీఆర్ఎస్  మినహా బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ ఓటర్లు తమ ఓటు బక్కు వినియోగించుకున్నారు.  ఎంఐఎం తరఫున మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలో నిలిచారు. ఈ నెల 25న ఓట్ల లెక్కింపు చేపడతారు. అయితే బీఆర్ఎస్ పోలింగ్ గు దూరంగా ఉండటం, కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటింగ్ లో పాల్గొనడంతో ఫలితంపై ఉత్కకంఠ నెలకొంది. ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ జరుగనుంది. గత 22 ఏళ్లుగా హైదరాబాద్‌ లోకల్ బాడీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతూ వస్తోంది. అయితే 22ఏళ్ల తర్వాత తొలిసారిగా హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగింది

హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్ ఎందుకంటే?

  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై  బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేశారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి ఆ సభలో అన్నారని వెంకటేశ్వర్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రజాప్రతినిధుల కోర్టు, కేసు విచారణ ప్రక్రియను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. రేవంత్ రెడ్డి ప్రసంగానికి సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగులను కూడా బీజేపీ నేత కాసం కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో, ప్రజాప్రతినిధుల కోర్టులో కొనసాగుతున్న విచారణను నిలిపివేయాలని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ  రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

వీరయ్య కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ..హంతకులను వదిలే ప్రసక్తే లేదు

  నిన్న ఒంగోలులో  హత్య గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి భౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒంగోలులో టీడీపీ కార్యకర్త  వీరయ్య చౌదరి మంగళవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలుకు చేరుకున్న ముఖ్యమంత్రి.. వీరయ్య చౌదరి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు అనిత, ఆనం, డోలా, ఎంపీ మాగుంట, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఇలాంటి ఘోరం జరగడం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. బాధ్యులను పట్టుకొని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేర రాజకీయాలు చేసేవారిని ఉపేక్షించమని స్పష్టం చేశారు.   హత్య జరిగిన నాటి నుంచే ప్రభుత్వం అన్ని కోణాల్లో దర్యాప్తును ప్రారంభించిందని ముఖ్యమంత్రి తెలిపారు. “ఈ కేసు దర్యాప్తుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. సీసీటీవీ ఫుటేజ్, క్లూస్ అన్నింటినీ పరిశీలిస్తున్నామన్నారు. 53 కత్తిపోట్లు ఉన్నట్టు నివేదికల్లో ఉంది. ఇది కరుడు కట్టిన నేరగాళ్ల పన్నుగట్టిన కుట్ర,” అని చెప్పారు. ప్రజల్లో ఎవరికైనా ఈ హత్యకు సంబంధించి సమాచారం ఉంటే, టోల్ ఫ్రీ నంబర్ 9121104784 కు ఫోన్ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. హత్య చేసిన నేరగాళ్లు భూమిపై ఎక్కడ దాక్కున్నా వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులు చివరకు కాలగర్భంలో కలిసిపోతారు. నేర రాజకీయాలను తుదముట్టించే వరకు పోరాటం చేస్తాం. రాష్ట్రం నేరస్థుల అడ్డాగా మారకూడదు అని చంద్రబాబు అన్నారు.

ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదల

  తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్‌ రిలీజ్ చేసింది. మే 22 నుంచి 29వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రథమ ఇంటర్‌, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ద్వితీయ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు సైతం ఇదే టైం టేబుల్‌ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అలాగే, జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు రెండు సెషన్లలో ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. జూన్‌ 9న ప్రథమ ఇంటర్‌, 10న ద్వితీయ ఇంటర్‌ విద్యార్థులకు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఉంటాయి. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు ఏప్రిల్‌ 30 తుది గడువు అని పేర్కొన్నారు. కాగా నిన్ననే ఇంటర్ రిజల్ట్స్  విడుదల అయిన సంగతి తెలిసిందే

అఘోరీకి లింగ నిర్థారణ పరీక్ష.. కోర్టు ఆదేశం!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీకి చేవెళ్ల కోర్టు బుధవారం (ఏప్రిల్ 23) 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఘోరీ తరఫు లాయర్ చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అఘోరీది చీటింగ్ కేసు కావడంతో.. కోర్టు ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చెప్పలేమన్నారు. బెయిల్ ఎప్పుడు వస్తుందో  కూడా చెప్పలే మన్నారు. చీటింగ్ కేసు రుజువైతే అఘోరీకి పదేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అఘోరీ తరఫున వాదించిన న్యాయవాదే అహోరికి శిక్షపడే అవకాశం ఉందనడం ఆసక్తిగా మారింది.    ఇలా ఉండగా కోర్టు ఆదేశాల మేరకు అఘోరీకి పోలీసులు బుధవారం (ఏప్రిల్ 23) లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.  అఘోరీకి పోలీసులు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు కంది సెంట్రల్ జైలుకు తరలించారు. కానీ జైలు అధికారులు లింగ నిర్ధారణ కాకుండా జైలులో ఉంచుకోలేమని తేల్చి చెప్పడంతో పోలీసులు అఘోరీని తిరిగి కోర్టుకు తీసుకువెళ్లారు. దీంతో కోర్టు అఘోరీకి లింగ నిర్ధారణ పరీక్షకు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు అఘోరీకి లింగ నిర్ధారణ పరీక్స చేయించారు.