చంద్రబాబుతో కష్టం సార్... ఒప్పుకోవట్లేదు..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కు మధ్య ఉన్న విబేధాల గురించి తెలిసిందే. అసలు మోడీ చంద్రబాబుపై అంత కోపంగా ఉండటానికి ఓ రకంగా గవర్నరే కారణమని ఇటీవల పలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి గవర్నర్ అన్నీ పక్కన పెట్టి చంద్రబాబును కలిశారు. ఊరకనే చంద్రబాబును కలవలేదులెండి. మోడీగారికి మధ్యవర్తిగా ఆయన రాయబారానికి వచ్చారు. అందుకే చంద్రబాబుతో ఉన్న వైరాన్ని పక్కన పెట్టి మరీ విజయవాడ వచ్చి, చంద్రబాబుని కలిసారు. ఇంతకీ గవర్నర్ ఏం చెప్పారంటే.. కర్ణాటక ఎన్నికలు అయ్యే వరకు, కేంద్రం పై దూకుడు తగ్గించమని, గవర్నర్ కోరినట్టు సమాచారం.   చంద్రబాబు విమర్శలు దాడి, కేంద్రంలోని పెద్దలు తట్టుకోలేకపోతున్నారు అని, చంద్రబాబు దీక్ష జాతీయ స్థాయులో చర్చ కావటం, 30వ తారీఖు చంద్రబాబు తిరుపతిలో పెట్టే సభ, ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం పై జాతీయ స్థాయిలో అన్ని పార్టీల నాయకులతో మోడీకి లెటర్ రాయాలి అనుకోవటం వంటివి ఇబ్బందికరంగా ఉన్నాయని, కేంద్రం పై దాడి తగ్గించమని, గవర్నర్ చంద్రబాబుని కోరినట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ టార్గెట్ గా చంద్రబాబు విమర్ళలు చేయడం సరికాదనే అభిప్రాయాన్ని గవర్నర్ చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.   ఇక దీనిపై స్పందించిన చంద్రబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా డ్రామాలాడుతోంది..విభజన హామీలు అమలు చేయకపోవడం, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తోందని, హోదాతోపాటు ఏపీకి ఇవ్వాల్సిన 18 అంశాలను కేంద్రం అమలు చేయలేదని, ఇక్కడ కొన్ని పార్టీలతో నాటకాలు ఆడిస్తుందని, ప్రజల అభిప్రాయం మేరకే నేను నడుచుకుంటున్నా అని, ఎక్కడా రాజకీయాలు చెయ్యటం లేదు అని, మాకు మా సమస్యల కంటే ఏది ముఖ్యం కాదని చంద్రబాబు తెగేసి చెప్పారట. ఇక ఎంత చెప్పినా చంద్రబాబు వినకపోవడంతో చేసేది లేక, గవర్నర్ అక్కడి నుండి వెళ్ళిపోయారట.   మరి ఇక ఈ విషయాన్ని కేంద్రానికి చేరవేయాలి కదా. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ బయలుదేరారట. చంద్రబాబు దూకుడు తగ్గేలా లేదని, గవర్నర్ కేంద్ర పెద్దలకు చెప్పనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇక్కడ ఉన్న రాజకీయాల గురించి కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరి చంద్రబాబు స్పీడ్ తగ్గించడానికి ఢిల్లీ పెద్దలు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారో చూద్దాం.. 

పవన్ పై మీడియా వార్.. సంచలన నిర్ణయం...

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాపై యుద్దం ప్రకటించిన సంగతి తెలిసిందే. తనపై వ్యక్తిగత దూషణలు చేసినందుకుగాను..ఆఖరికి ఏ సంబంధం లేని విషయంలో తన తల్లిని సైతం దూషించి... దానిపై పలు ఛానళ్లలో గంటల కొద్దీ డిబెట్లు పెట్టినందుకుగాను పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పలు ఛానళ్లపై మండి పడ్డారు. అంతేకాదు ఆ ఛానళ్లను బ్యాన్ చేయమని.. చూడొద్దని.. తమ అభిమానులకు సైతం పిలుపునిచ్చారు. ఆరు నెలలుగా నన్ను తిట్టీ..తిట్టీ ఇప్పుడు ఆఖరికి మా తల్లి దగ్గరకు వచ్చారా.. ఇప్పుడు నేను మీకు ఇస్తాను న్యూస్ అంటూ.... ఆరోజు ఈరోజు వరకూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా మీడియా వార్ చేస్తున్నారు. అంతేకాదు పలు ఛానళ్ల పేర్లు.. ఈ రాజకీయ కుట్ర వెనుక కొంత మంది ఉన్నారంటూ వారి పేర్లు కూడా బయట పెట్టారు. ఇంకా పలు సంచలన ట్వీట్లు పెడుతూనే ఉన్నారు.   అయితే ఇప్పుడు మీడియా పవన్ పై యుద్దం ప్రకటించిందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. తెలుగు టీవీచానళ్లన్నీ ఆయనపై అనధికార బహిష్కరణ వేటు వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మీడియాపై యుద్ధం ప్రకటించి.. ట్విట్టర్ లో అదే పనిగా ఆరోపణలు.. చేస్తూ.. ఏవేవో వీడియోలు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్న పవన్ కల్యాణ్ వ్యవహారాన్ని … లైట్ తీసుకోవాలని మీడియా సంస్థలు నిర్ణయించుకున్నాయట. ఇక నుంచి… పవన్ రాజకీయాన్ని, ఆయన మాటలను పట్టించుకోకూడదని డిసైడయ్యాయట. పవన్ కల్యాణ్ ను పట్టించుకోకపోతే.. సమస్య పరిష్కారమవుతుందని… టీవీ చానళ్ల యజమానులందరూ నిర్ణయించుకున్నారట. దీంతో పవన్ కల్యాణ్ ఇక ఏ ఛానల్ లో కనపించరు.. ఆయన మాట ఏ ఛానల్ లో వినిపించదు అని అంటున్నారు. మరి మీడియా తీసుకున్న ఈ నిర్ణయంతో ట్విట్టర్, తన యూట్యూబ్ చానల్ లో మాత్రమే .. తన గురించి ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. మరి చూద్దాం ఎన్ని రోజులు మీడియా పవన్ ను దూరం పెడుతుందో..

పవన్ కు జగన్ సపోర్ట్.. కానీ...!

  ఉరుము ఉరిమి మంగలం మీద పడింది అన్న సామెత లాగ... అటు పోయి ఇటు పోయి క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పవన్ కళ్యాణ్ కుటుంబంపై వ్యక్తిగత దూషణకు దిగేవిధంగా మారింది.దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. పవన్ కళ్యాణ్ ని, అతని కుటుంబాన్ని టార్గెట్ చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగుందని.. పవన్ అభిమానులతో పాటు పలువురు అనుమానాలు వ్యక్తపరిచారు. ఇక దీనిపై పవన్ కూడా స్పందించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ఆరునెలలుగా తన గురించి టీవీ ఛానళ్లలో డిబెట్లు పెట్టి తిట్టిపోశారని.. ఇప్పుడు ఏకంగా తన తల్లినే తిట్టించే స్ధాయికి దిగజారారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న పవన్... ఈ విషయం వెనుక ఎవరెవరు ఉన్నారో నాకు తెలుసని.. తనపై జరుగుతున్న కుట్రను, అవమానాలకు కొందరు వ్యక్తులు కారణమని.. కొంత మంది పేర్లను కూడా బహిరంగంగానే ట్విట్టర్లో వారి ఫొటోలు పోస్ట్ చేశారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకూ ట్విట్లర్లో పోస్ట్ లు చేస్తూ..  టీవీ9, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. ఇక ఈ విషయంలో పవన్ కు చాలా మంది సపోర్ట్ గా కూడా వస్తున్నారు. ఏదైనా ఉంటే విమర్శలు చేయవచ్చు కానీ.. వ్యక్తిగత దూషణలు చేయడం ఏంటీ.. అందులో తల్లిని తీసుకురావడం ఇంకా దిగుజారుడుతనానికి నిదర్శనం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.   ఇక ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కు మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది. నిజానికి పవన్ అంటే జగన్ కాస్త కోపం. ఎందుకంటే.. 2014లో పవన్ లేకపోతే తానే ముఖ్యమంత్రి అయ్యేవాడిని అని ఆయన భావన. అందుకే అప్పుడప్పుడు పవన్ పై విమర్సలు గుప్పించేవాళ్లు. అయితే ఎప్పుడైతే టీడీపీకి వ్యతిరేకంగా కామెంట్లు విసిరారో... అప్పటి నుండి కాస్త విమర్సలు తగ్గించారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ వివాదంపై కూడా జగన్ స్పందించి పవన్ కు మద్దతు పలికినట్టు తెలుస్తోంది. అయితే డైరెక్ట్ గా కాదు కానీ.. ఇన్ డైరెక్ట్ గా. పాదయాత్ర డైరీ అనే పేరుతో జగన్ రాస్తున్నట్టుగా సాక్షిలో ప్రచురితం అవుతున్న కాలమ్ లో దీనిపై జగన్ స్పందించారు. “ఢిల్లీకి రాజు అయినా అమ్మకు కొడుకే.. అన్నారు మన పెద్దలు. సృష్టిలో జీవులన్నిటికీ అమ్మే తొలి గురువు.. దైవం. అందుకే మాతృదేవోభవ అంటారు. అమ్మ స్థానం అంతటి ఉన్నతమైనది.. పవిత్రమైనది. కొద్ది రోజులుగా అమ్మ స్థానాన్ని దిగజార్చేలా.. అవమానపరిచేలా రాజకీయాలు సాగడం అత్యంత దారుణం.. మహాపాపం. అలాంటి దిగజారుడు రాజకీయాలు ఏమాత్రం సమర్థనీయం కాదు. గత 141 రోజులుగా చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో ఎందరో అమ్మలు నన్ను సొంత బిడ్డలా చూసుకున్నారు. వారి ఆప్యాయత, అనురాగాలు అనిర్వచనీయం. అందుకే మాది ఎప్పుడూ ఒకటే సిద్ధాంతం.. ‘అమ్మ ఎవరికైనా అమ్మే.. అమ్మకు నా వందనం” అని అన్నారు. మరి ఇప్పటికే రోజా పవన్ కు తన సపోర్ట్ ఉంటదని చెప్పారు. ఇప్పుడు జగన్ కూడా పవన్ కు మద్దతు పలికారు. మొత్తానికి చంద్రబాబు కోపంతో.. ఇదే ఛాన్స్ అని భావించి పవన్ కు మద్దతు పలికినట్టున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ కలిసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..

ఆ పేపర్లు ఎందుకు చదవాలి?.. ఆ టీవీలు ఎందుకు చూడాలి?

  గత మూడు నాలుగు రోజుల నుండి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా మీడియా ఛానెళ్లపై వార్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ దగ్గర మొదలైన ఈ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి పవన్ కళ్యాణ్ కుటుంబంపై వ్యక్తిగత దూషణకు దిగేవిధంగా మారింది. దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా రాజకీయం దిశగా మారింది. పవన్ కళ్యాణ్ ని, అతని కుటుంబాన్ని టార్గెట్ చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగుందని.. పవన్ అభిమానులతో పాటు పలువురు అనుమానాలు వ్యక్తపరిచారు. ఇక దీనిపై పవన్ కూడా స్పందించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ఆరునెలలుగా తన గురించి టీవీ ఛానళ్లలో డిబెట్లు పెట్టి తిట్టిపోశారని.. ఇప్పుడు ఏకంగా తన తల్లినే తిట్టించే స్ధాయికి దిగజారారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న పవన్... ఈ విషయం వెనుక ఎవరెవరు ఉన్నారో నాకు తెలుసని.. తనపై జరుగుతున్న కుట్రను, అవమానాలకు కొందరు వ్యక్తులు కారణమని.. కొంత మంది పేర్లను కూడా బహిరంగంగానే ట్విట్టర్లో వారి ఫొటోలు పోస్ట్ చేశారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకూ ట్విట్లర్లో పోస్ట్ లు చేస్తూ..  టీవీ9, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. ఇక ఈరోజు తాజగా పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమలో మహిళలకు అండగా నిలిచేందుకు సంచలన ప్రకటన చేశారు. "మనలని, మన తల్లులని, ఆడపడుచులని తిట్టే పేపర్లు ఎందుకు చదవాలి?.. వాళ్ళ టీవీలు ఎందుకు చూడాలి?.. జర్నలిజం విలువలతో ఉన్న చానెల్స్, పత్రికలు, సమదృష్టికోణంతో ఉండాలని అన్నారు. ఇంకా కాస్టింగ్ కౌచ్ పై కూడా స్పందించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరుపున త్వరలోనే ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి ఏర్పడుతోందని దీనికి జనసేన పార్టీ "వీర మహిళా" విభాగం అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. మరి ముందు ముందు ఇంకెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటూరో.. చూద్దాం..

పవన్ కు లీగల్ నోటీసులు...ఆల్ ద బెస్ట్

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్ట్ గానే మీడియాపై యుద్దం ప్రకటించేశారు. అంతేకాదు కొంత మంది పేర్లు కూడా బయటపెట్టారు. ఆ పేర్లలో ఓ మీడియా సంస్థ యజమాని శ్రీని రాజు పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పవన్‌కల్యాణ్‌కు శ్రీని రాజు నోటీసులు పంపారు.  తనను ఉద్దేశించి ట్విటర్‌లో అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ..  పవన్‌ చేసిన వ్యాఖ్యలు నిరాధారం, అసత్యాలని ఆరోపించారు. ఈ నేపథ్యంలో శ్రీనిరాజు తన తరఫు న్యాయవాది నుంచి పవన్‌కు నోటీసులు పంపారు. ఈ సందర్భంగా శ్రీని రాజు తరపు న్యాయవాది మాట్లాడుతూ.... పవన్‌ తనపై ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యలు తెలిసి శ్రీనిరాజు షాక్‌ అయ్యారని.. నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తే.. మిగిలిన రాజకీయ నాయకులకూ పవన్‌కు తేడా ఏంటని ప్రశ్నించారు. అంతేకాదు... శ్రీనిరాజుకు ప్రత్యక్షంగానూ, పరోక్ష్యంగానూ చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో ఎటువంటి బంధం లేదని.. వర్మ, రవి ప్రకాశ్‌తో కలిసి శ్రీనిరాజు టీడీపీ నేతలకు సాయం చేస్తూ.. తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి సహకరించారని చెప్పడం కేవలం ఊహాజనితమేనని తన క్లయింట్‌ అన్నట్లు నోటీసులో పేర్కొన్నారు. ప్రజలు తనపై ఆరోపణలు చేసినప్పుడు పవన్ ఎంత బాధపడ్డారో.. ఇప్పుడు పవన్ చేసిన ఈ నిరాధార వ్యాఖ్యలకు తన క్లయింట్‌ కూడా అంతే బాధపడ్డారని చెప్పారు.   ఇక దీనిపై పవన్ కూడా స్పందించి రాజుగారికి కౌంటర్ ఇచ్చారు. చేసిందంతా చేసి ఇప్పుడు తనకు లీగల్ నోటీసులు పంపించినా ఉపయోగం ఏం లేదని అన్నారు. అంతేకాదు.. సంబంధం లేని విషయాల్లోకి తనను లాగి, తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనుక ఉన్న నిజమైన ‘అజ్ఞాతవాసి’ ఎవరో తెలుసా? అంటూ  ట్వీట్ చేసిన పవన్ దానికి సమాధానం కూడా ఇచ్చారు. నిజమైన ‘అజ్ఞాతవాసి’ టీవీ 9 చానెల్ సీఈఓ రవిప్రకాష్ అని టీవీ 9 చానెల్ తమ రాజకీయ బాసులతో కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని నడిపిందని, రవిప్రకాష్ మార్గదర్శకత్వంలో తన తల్లిని చెప్పరాని మాటలతో పదే పదే తిట్టించారని అన్నారు.  శ్రీ సిటీలో వాటాల కోసం రాజకీయ బాసులతో కుమ్మక్కైన రవి ప్రకాశ్ ఈ చర్యకు ఒడిగట్టాడని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిందంతా చేసి ఇప్పుడు తనకు లీగల్ నోటీసులు పంపించడమేంటని శ్రీనిరాజుని ప్రశ్నించారు. మరి ప్రస్తుతం దుమారం రేపుతున్న ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూద్దాం..  

పవన్ కొత్త ఛానల్.. జేటీవీ..!

  పవన్ కళ్యాణ్ ఓ ఛానల్ ను పెట్టనున్నారా..? అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి ఇప్పుడు. తన తల్లిపై చేసిన వ్యాఖ్యలకు గాను పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహంలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే తన ట్విట్టర్ ద్వారా వరుస ట్వీట్లు పెట్టి ఇదంతా ఎవరు చేయిస్తున్నారు అని వారి పేర్లు బయట పెట్టి.. ఏకిపారేశారు. అంతేకాదు మీడియా ఛానల్స్ కూడా ఓ రేంజ్ లో తిట్టిపారేశారు. ఈ క్రమంలోనే ఆయన ఈరోజు ఫిలిం ఛాంబర్ కు వెళ్లి తన తల్లిని అంత దారుణంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని... వారికి ఒక రోజు డెడ్ లైన్ కూడా విధించినట్టు తెలుస్తోంది.   ఇక దీనిలో భాగంగానే మరో వార్త కూడా బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో ఓ టీవీ ఛానల్ రాబోతుందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ లో జే టీవీ అనే ఓ బ్యానర్ చక్కర్లు కొడుతోంది. 'జనం కోసం' ఇది ఛానల్ పేరు కాగా.. 'మీ కోసం.. మీ తోడుగా..' ఈ క్యాప్షన్ తో జే టీవీ అనే ఛానల్ రాబోతోందని ఈ పోస్టర్ సారాంశం. జనసేనకు అండగా నిలబడే ఉద్దేశ్యమే ఈ ఛానల్ అని... పవన్ కు సన్నిహితుడు.. గతంలో ఛానల్ నిర్వహించిన అనుభవం ఉన్న వ్యక్తితో సుదీర్ఘంగా మంతనాలు జరిపిన తర్వాత.. పవన్ కళ్యాణ్ సపోర్ట్ తోనే జే టీవీ రాబోతోందనే టాక్ అయితే గట్టిగానే ఉంది. మరి ఈ జేటీవీ లో వాస్తవం ఎంతో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.   అయితే ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ... అసలు పవన్ అభిమానులు ఎప్పటినుండో కోరుకునేది కూడా ఇదే. తమకు ఓ ఛానల్ లేకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుందని.. ఛానల్ లేకపోవడం వల్ల తమమీద చాలా ఈజీగా బురద చల్లుతున్నారని... మనకంటూ ఓ ఛానల్ ఉండాలని పవన్ అభిమానలు ఎప్పటినుండో కోరుకుంటున్నారు. ఉన్న ఛానల్స్ లో ఏ ఒక్కటీ పవన్ అండగా ఉన్న దాఖలాలు లేవు. ఆ లోటు విషయం పవన్ కు కూడా ముందే తెలుసు కానీ.. ఓ మీడియా ఛానల్ ప్రారంభించాలనే పాయింట్ ను మాత్రం ఇన్నాళ్లు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఆలోచన ఓ కొలిక్కి వచ్చేసిందనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ టీవీ విషయంలో కూడా క్లారిటీ వచ్చేంత వరకూ ఆగాల్సిందే..

ఒక్క రోజు గడువిస్తున్నా...మీ ఇష్టం..

  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ దగ్గర మొదలైన రచ్చ.. అటు పోయి ఇటు పోయి అఖరికి జనసేన అధినేత పవన్ దగ్గరకి వచ్చి ఆగింది. శ్రీరెడ్డి పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. దాని సూత్రధారి రాం గోపాల్ వర్మ అని బయటకు రావడం.. వర్మ కూడా పవన్ ని అలా తిట్టమని శ్రీరెడ్డికి చెప్పింది నేనే అని చెప్పడం.. మరోవైపు వైసీపీ పేరు కూడా వినిపించడం అబ్బో ఒక ట్విస్టా.. రెండు ట్విస్ట్ లా.. ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉన్నాయి.   ఇక పవన్ ను అంత మాట అన్నందుకు పవన్ అభిమానులు అయితే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇక పవన్ కూడా దీనిపై స్పందించి రాష్ట్ర ప్రభుత్వంపై, మీడియా ఛానల్స్ పై విరుచుకుపడ్డారు. తనపై కుట్ర జరుగుతోందని.. తన తల్లిని దారుణంగా అవమానిస్తారా? అంటూ తీవ్ర ఆగ్రహంతో ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. అంతేకాదు తన తల్లి గురించి అంత మాట అన్నందుకు చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఈ రోజు ఉదయం నుంచి ఫిలిం ఛాంబర్ వద్దకు వచ్చారు. పవన్ కు తోడుగా మెగా ఫ్యామిలీ తో పాటు అల్లు ఫ్యామిలీ.. ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా ఫిలిం ఛాంబర్ కు వెళ్లారు. ఇక పవన్ ఫిలిం ఛాంబర్ కు వచ్చారని తెలియడంతో మెగా అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. పవన్ కు మద్దతుగా నిలిచారు. ఉదయం నుంచి నినాదాలు ఇస్తున్న పవన్ అభిమానులు.. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో తమ నినాదాల హోరును పెంచారు. ఫిలిం ఛాంబర్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని  పోలీసులు అతి కష్టమ్మీద నిలువరించారు. మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఫిలిం ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన పవన్.. తన క్యారవాన్ లో ఉండిపోయారు. అనంతరం వెళ్లిపోయారు.   అయితే దాదాపు ఐదు గంటలు ఫిలింఛాంబర్ లో ఉన్న పవన్... తన తల్లిని అవమానించేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. దానికి తమకు ఒకరోజు గడువు ఇవ్వాలని ఫిలింఛాంబర్ సభ్యలు కోరగా... దానికి పవన్ ఏకీభించినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ.. ఒక్కరోజు వ్యవధిలో నిర్ణయం తీసుకోకుంటే తన కార్యాచరణను ప్రకటిస్తానని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. మరి  చూద్దాం ఏం జరుగుతుందో..

లోయాది సహజ మరణమే.. అనుమానం అవసరం లేదు..

సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్‌ లోయా మృతిపై స్వతంత్ర విచారణ జరపాలంటూ పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. సొహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసుకు విచారణ న్యాయమూర్తిగా ఉన్న సమయంలో లోయా 2014, డిసెంబర్‌ 1న గుండెపోటుతో మృతిచెందారు. అయితే ఆయనది సహజ మరణం కాదని, లోయా మృతి వెనుక కుట్ర ఉన్నట్లు ఆయన సోదరి ఆరోపించారు. ఇక ఈ కేసుపై విచారించిన సుప్రీంకోర్టు..  బీహెచ్‌ లోయాది సహజ మరణమేనని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో ఎలాంటి స్వతంత్ర విచారణ అవసరం లేదని పేర్కొంటూ పిటిషన్లను కొట్టివేసింది. ‘ఈ పిటిషన్లకు ఎలాంటి అర్హత లేదు. లోయాతో పనిచేసిన నలుగురు జడ్డీల వ్యాఖ్యలను అనుమానించడం అవసరంలేదు. పిటిషన్లలో విచారించదగ్గ అంశాలేవీ లేవు. న్యాయవ్యవస్థను నిందించడానికే ఈ పిటిషన్లు వేశారు. లోయా మృతి కేసులో సిట్‌ దర్యాప్తు అనవసరం’ అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పిటిషనర్లపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లు న్యాయవ్యవస్థ స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని.. వ్యాపార లేదా రాజకీయ విభేదాలను పరిష్కరించుకునేందుకు కోర్టులు వేదిక కాకూడదని హెచ్చరించింది.

మోడీ నాకు సలహా ఇవ్వడం కాదు... మీరు కూడా పాటించండి..

  మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కూడా సెటైర్లు వేసేస్తున్నారుగా. అది కూడా ఎవరికో కాదు.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారికి. ఎందుకంటే.. మన్మోహన్ సింగ్ గురించి తెలిసిందే. ఆయన పెద్దగా మాట్లాడే వ్యక్తి కాదు. చాలా సైలెంట్ గా ఉండే వ్యక్తి. అందుకే ఆయనపై బీజేపీ నేతలు కామెంట్లు చేస్తుండేవారు. మన్మోహన్ సింగ్ మౌనముని అని... ఆయన సోనియ గాంధీ చేతిలో కీలుబొమ్మ అని.. రబ్బరు స్టాంప్ అని ఇలా చాలా విమర్శలే చేసేవారు. అలా అనీ మన్మోహన్ సింగ్ ఎప్పుడూ వారిపై తిరిగి కామెంట్ చేసిందీ లేదు. తన పనేదో తాను చేసుకుంటూ పోయేవారు. కానీ టైం ఎంప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు మన్మోహన్ సింగ్ కు టైం వచ్చింది. ఇప్పుడు తనకు ఇచ్చిన సలహానే తిరిగి ఆయన మోడీకి ఇచ్చారు. ఇంతకీ మోడీ మన్మోహన్ సింగ్ కు ఇచ్చిన సలహా ఏంటంటే... తనను మోడీ తరచూ మాట్లాడమంటూ సలహా ఇచ్చేవారిని... ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు కనుక తరచూ మాట్లాడాలని మన్మోహన్ సింగ్ అన్నారు.   ఎందుకంటే కథువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై దేశ నలుమూలల నుండి పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు తలెత్తాయి. అయితే ఆశ్చర్యం ఏంటంటే... ఈ కేసులపై ప్రధాని నరేంద్ర మోడీ చాలాకాలం స్పందించలేదు. ఎట్టకేలకు గత శుక్రవారం ఆయన స్పందించారు. ఇక దీనిపై ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్య్వూలో పాల్గొన్న మన్మోహన్ సింగ్ స్పందించి... యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తనను మౌన్.. మోహన్ సింగ్ అనేవారని.. కానీ ఇప్పుడు ఆయన ఆ సలహాను తానే స్వయంగా పాటించాలన్నారు. అంతేకాదు... అంతకు ముందు కూడా మోడీపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సభల్లో కూడా ఆయన పెద్ద నోట్ల రద్దు గురించి మాట్లాడుతూ మోడీపై విరుచుకుపడ్డారు. పెద్ద నోట్ల రద్దు చరిత్రలో నిలిచిపోయే నిర్వహణ వైఫల్యమని.. ఏదోశంలోనైనా ప్రజలు తాము డిపాజిట్ చేసిన నగదును విత్ డ్రా చేసుకునేందుకు ఆంక్షలు ఉన్నాయా..? అలాంటి దేశం పేరు ఒక్కటి చెప్పండి అంటూ సూటిగా మోడీని ప్రశ్నించారు. ఇప్పుడు మరోసారి మోడీపై కామెంట్ విసిరారు. దీంతో ఇప్పుడు మన్మోహాన్ సింగ్ కూడా బాగానే సెటైర్లు వేస్తున్నారుగా అని అంటున్నారు. అంతేకాదు.. మన్మోహన్ సింగ్ అన్నదాంట్లో కూడా నిజముంది.. అప్పడు ఆయన్ని మౌనముని అనేవారు.. ఇప్పుడు ఆయన కూడా మౌన మునిలా తయారయ్యారని అంటున్నారు. మరి మాజీ ప్రధాని సలహాను.. ఇప్పటి ప్రధాని పాటిస్తారో లేదో..? చూద్దాం..

పాపం రాజుగారి పరువు తీసేశారుగా...

  పాపం టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి 'అశోక్‌గజపతిరాజు' పరువు అడ్డంగా తీసేశారు టీడీపీ కార్యకర్తలు. వాళ్లు చేసిన పనికి ఆయన పరువు మొత్తం పోయినట్టైంది. ఇంతకీ అంతలా టీడీపీ కార్యకర్తలు ఏం చేశారనుకుంటున్నారా...? అసలు మ్యాటరేంటంటే... ఏపీ ప్రత్యేక హోదా పోరాటం నేపథ్యంలో మిత్ర పక్షాలుగా ఉన్న టీడీపీ-బీజేపీ పార్టీలు తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు పార్లమెంట్లో సైతం మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇక ఈ పోరాటంలో భాగంగానే కేంద్రమంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారు.   అయితే మంత్రి పదవి వదిలేసిన తరువాత తొలిసారి 'అశోక్‌గజపతిరాజు' విజయనగరం జిల్లాకు వచ్చారు. ఇక ఆయన రాకను స్వాగతిస్తూ కార్యకర్తలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక్కడే కార్యకర్తలు ఓ ఘనకార్యం చేశారు. రాజు గారిని పొగిడే క్రమంలో అసలు ఏం రాస్తున్నామో.. ఏంటో అని కూడా చూడకుండా ఫెక్సీలు పెట్టారు. ఇంతకీ ఫెక్సీల్లో ఏం రాశారనుకుంటున్నారా..? చూడండి మీరు కూడా ఆ ఘనకార్యం... 'రాజు కళంకితుడు'...రతిరాజు,శరీర విహీనుడు, దిగంబరుడు, గుహంతరవాసి.. ఇవి రాజుగారిని పొడుగుతున్నామనుకుంటూ టీడీపీ కార్యకర్తలు చూపించిన వెర్రితనం. ఇక ఈ ఫ్లెక్సీలు చూసినా.. వాళ్లందరూ అసలు వీరికి తెలుగు వచ్చా...? రాదా..? అసలు తామేం రాస్తున్నారో...ఏమి రాయించారో కూడా చూడలేదా..? 'వీళ్ల'కు పై పదాల అర్థాలు తెలుసా..? తెలిసే..రాశారా..? లేక...తెలియక రాశారా..? వీళ్ల తెలివితక్కువ తనానికి రాజుగారి పరువును గంగలో కలిపేశారని సెటైర్లు విసురుతున్నారు.  

నాకు వద్దు మీ సెక్యూరిటీ...

  ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెక్క్యూరిటీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన భద్రతా సిబ్బంది తనకు వద్దంటూ వెనక్కి పంపించేశారు. మార్చి 14వ తేదిన గుంటూరులో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  తనపై దాడి చేసే అవకాశం ఉందని.... తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పవన్ ఏపీ డీజీపికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దాంతో పవన్ కు రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్‌కు 2+2 గన్‌మెన్లను కేటాయించింది. ప్రతి షిప్టులో ఇద్దరు గన్‌మెన్లు పవన్ కళ్యాణ్‌తోనే ఉంటారు. మిగిలిన ఇద్దరూ గన్‌మెన్లు రెస్ట్‌ తీసుకొంటారు. అయితే ఇప్పుడు ఈ సెక్యూరిటీ నాకు వద్ద అని పవన్ వారిని వెనక్కి పంపించేశారు.   దీనికి కారణం ఏంటంటే... తనకు నియమించిన సెక్యూరిటీని ప్రభుత్వం తనపై నిఘా కోసం ఉపయోగించుకొంటుందని పవన్ కళ్యాణ్ అనుమానిస్తున్నారు. పార్టీ అంతర్గత విషయాలు లీకయ్యాయని... జనసేన రానున్న రోజుల్లో చేపట్టే కార్యక్రమాలతో పాటు ఇతర విషయాలపై పార్టీ చేసిన చర్చలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి చేరిపోయిందని భావిస్తున్నారు. నెల రోజుల కాలంలో పార్టీకి సంబందించిన కీలక చర్చలకు సంబంధించిన సమాచారం బయటకు వెల్లడైందని జనసేన చీఫ్ భావిస్తున్నారు. ఈ తరుణంలో సెక్యూరిటీ కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని ఆయన భావిస్తున్నారు. ఈ కారణంగానే సెక్యూరిటీని వెనక్కు పంపించారన్న టాక్స్ వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ సెక్యూరిటీ వెనక్కు వెళ్ళడంతో ప్రైవెట్ సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ రక్షణ బాధ్యతను చూసుకొనే అవకాశం ఉంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం...

అమిత్ జీ.. ఏంటి ఈ మార్పు..

  టీడీపీ-బీజేపీకి మధ్య నడుస్తున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పచ్చగడ్డి వేస్తేనే బగ్గుమనే పరిస్థితి వచ్చింది రెండు పార్టీల మధ్య. ప్రత్యేక హోదా విషయంలో ఒకపక్క బీజేపీ ఏపీ ఏంతో చేశాం అని అంటుంటే.. మీరు చేసింది ఏం లేదు అని మరోపక్క టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. దానికి తోడు కేంద్ర ప్రభుత్వంపై మోడీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టి పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో ఈ వివాదం ఇంకా ముదిరింది. ఇక ఈపని చేసినందుకుగాను.... మోడీ, అమిత్ షా గుర్రుగానే ఉన్నారు. చంద్రబాబునాయుడి సంగతైతే చెప్పక్కర్లేదు.. ఎప్పుడైతే బీజేపీ నుండి విడిపోయారో ఆరోజు నుండి మోడీ, అమిత్ షా పై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ఇక ఇది ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఒకటి చోటుచేసుకుంది.   టీడీపీ.. బీజేపీతో విడిపోయిన తరువాత దీనిపై స్పందించిన అమిత్ షా మీ ఇష్టం.. మీరు విడిపోతానంటే మాకేం ప్రాబ్లమ్ లేదు అని చాలా ఈజీగా చెప్పి చేతులు దులుపుకున్నారు. ఇక విడిపోయిన తరువాతే అసలు రచ్చ మొదలైంది. దాంతో ఇప్పుడు అమిత్ షాకు తెలుసొచ్చినట్టుంది. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ...ఏపీలో తెదేపాతో తెగదెంపుల తర్వాతే పార్టీ అధ్యక్షుడి మార్పు అనివార్యమైందన్నారు. త్వరలోనే ఏపీ భాజపా అధ్యక్షుడిని ప్రకటిస్తామన్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసమే ఏపీ భాజపా అధ్యక్షుడు హరిబాబు రాజీనామా చేశారని... త్వరలోనే కొత్త అధ్యక్షుడు ఎవరనేది ప్రకటిస్తామని తెలిపాయి. అంతేకాదు టీడీపీతో బ్రేకప్ గురించి మాట్లాడుతూ... కూల్ గా స్పందిస్తూ..కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసారు. చంద్రబాబుతో తమకు ఎలాంటి గొడవ లేదని.. పెట్టుకోవాలని కూడా అనుకోలేదని.. మా నుండే చంద్రబాబే వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. దీంతో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే, అమిత్ షా, విపక్షాల మీద ఇంత సాఫ్ట్ గా మాట్లాడరు. మోడీ-షా పాలన గురించి తెలిసిందే. విపక్షాలను ఎదుర్కోవడానికి ఎంత దూరమైన వెళతారు. అలాంటిది.. అమిత్ షా ఇలా మాట్లాడేసరికి... అమిత్ షా చంద్రబాబుకి ఇన్ డైరెక్ట్గ్ గా సిగ్నల్ పంపిస్తున్నారా అని అనుకుంటున్నారు. మరోపక్క దీనిపై స్పందించిన టీడీపీ నేతలు.... ఇవన్నీ మీడియా ముందు ఎదో హడావిడి అని, కర్ణాటకలో తెలుగువారి ఓట్లు పోకుండా, అమిత్ షా ఎదో కవర్ చేస్తున్నారని మండిపడుతున్నారు. మరి అమిత్ షా ఏ ఉద్దేశంతో ఇలా వ్యాఖ్యానించారో ఆయనకే తెలియాలి మరి..!

ఏం మాట్లాడుతున్నారు జైట్లీ జీ....

  ప్రస్తుతం ఏ ఏటీఎంకు వెళ్లినా అక్కడ నో సర్వీస్ బోర్ట్ తప్పా ఏం కనిపించడం లేదు. ఇక ఏటీఎంలలో డబ్బు కొరత వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కూడా తెలుసు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఏటీఎంలలో నగదు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక దీనపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం మూడురోజులు ఆగాల్సిందే అని తెల్చిచేప్పేశారు. నగదు కొరతపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి ఎస్పీ శుక్లా స్పందిస్తూ, తమ వద్ద రూ. 1.25 లక్షల కోట్ల కరెన్సీ ఉందని, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ కరెన్సీ, మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ కరెన్సీ ఉన్న కారణంగా ఇబ్బందులు వచ్చాయని, తాను ఏర్పాటు చేసిన రాష్ట్రాల కమిటీలు, ఆర్బీఐ ఈ నగదును సమానంగా అన్ని రాష్ట్రాలకూ చేరుస్తుందని తెలిపారు. ఇది జరిగేందుకు కనీసం మూడు రోజులు పడుతుందని,ప్రజలు ఓపికతో ఉండాలని సూచించారు.   అయితే ఒకపక్క కేంద్రం అలా చెబుతుంటే.... మరోపక్క కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాత్రం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏర్పడిన నగదు సమస్య తాత్కాలికమేనని, దాన్ని వెంటనే పరిష్కరిస్తామని స్పందించారు. ఇక జైట్లీ చేసిన వ్యాఖ్యలపై పలు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా జైట్లీ వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాల ఐటీ మంత్రులైన కేటీఆర్, నారా లోకేశ్ లు స్పందించి జైట్లీపై సెటైర్లు వేశారు. ‘సర్‌.. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత అకస్మాత్తుగా జరిగిందో లేదా తాత్కాలికంగా ఏర్పడిందో కాదు. హైదరాబాద్‌లో గత మూడు నెలలుగా నగదు సమస్యపై తరచూ ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. దయచేసి ఆర్‌బీఐ, ఆర్థికశాఖ అధికారులు దీనిపై లోతుగా చర్చించండి. బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని పోగొట్టొద్దు’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.   మరోవైపు ఈ విషయంపై స్పందించిన నారా లోకేశ్‌.. వాస్తవ పరిస్థితులను అంచనా వేయకుండా అంతా బాగుందని అంటున్నారని, అరుణ్ జైట్లీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం బాధాకరమని అన్నారు. ఏపీలో నగదు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అలాగే పింఛన్లు, ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లోకేశ్‌ పేర్కొన్నారు.   అంతేకాదు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా దీనిపై స్పందించి... ప్రభుత్వం బ్యాంకింగ్‌ వ్యవస్థను నాశనం చేస్తోందంటూ ఆరోపించారు. బ్యాంకింగ్‌ వ్యవస్థను బలహీనం చేయడం వల్లే నగదు కొరత ఏర్పడిందని..పెద్ద నోట్ల రద్దు సమయంలోనూ మనల్ని క్యూలలో నిలబెట్టి మన జేబుల్లో నుంచి రూ.500, రూ.1000నోట్లను తీసుకుని.. ఆ డబ్బును వ్యాపారవేత్త నీరవ్‌ మోదీ జేబులో పెట్టారని రాహుల్‌ విమర్శలు చేశారు. ప్రధాని మోదీకి దేశమంతా తిరిగే సమయం ఉంది కానీ లోక్‌సభలో 15నిమిషాలు ప్రసంగించడానికి సమయం లేదా అని మండిపడ్డారు.

లాలూ ఒక్కడే దొరికినట్టున్నాడు...

  పాపం లాలూకి ఒకదాని తరువాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే దాణా కుంభకోణంలో లాలూ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. పశు దాణా స్కాం కేసులో రాంచిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు లాలు ప్రసాద్‌ యాదవ్‌తో సహా మరో ఏడుగురికి మూడున్నరేళ్ల జైలుశిక్షతో పాటు 5 లక్షల జరిమానా విధించింది. అంతేకాదు నాలుగో కేసులో కూడా లాలూని దోషిగా తేల్చి విధించింది కోర్టు. 1990ల్లో దుమ్‌కా ఖజానా నుంచి అక్రమంగా రూ.3.13 కోట్లు తీసుకున్న కేసులో రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటుగా రూ.60 లక్షల జరిమానా విధించింది. ఇక ఇప్పుడు మరో తలనొప్పి ఎదురైంది. రైల్వే హోటళ్ల టెండర్ల కేసులో కూడా ఇప్పుడు లాలూపై సీబీఐ అభియోగపత్రాలను దాఖలు చేసింది. కేంద్ర రైల్వేమంత్రిగా లాలు ఉన్నప్పుడు రాంచీ, పురీలో ఉన్న రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్లను సుజాత హోటల్స్‌ అనే ప్రైవేటు కంపెనీకి అక్రమంగా కట్టబెట్టినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. లాలుప్రసాద్‌ యాదవ్‌ సహా మొత్తం 14 మందిపై చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో లాలు భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి కూడా ఉన్నారు. ఈ హోటల్ ప్రమోటర్లు లాలు కుటుంబానికి చాలా సన్నిహితులని.. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నట్టు పేర్కొన్న సీబీఐ లాలూ కుటుంబ సభ్యులతోపాటు రైల్వే అధికారులపైనా చార్జిషీటు దాఖలు చేసింది.   మొత్తానికి ఆర్జేడీ చీఫ్‌ లాలు ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబానికి కష్టాలు తప్పడం లేదు. చూడబోతే సీబీఐకి లాలూ కుటుంబం మాత్రమే కనిపిస్తోందేమో అని అనుకుంటున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో వేలకు వేల కోట్లు కాజేసి.. ఎంచక్కా విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న వాళ్లపై చర్యలు తీసుకోవడం చేత కాదు కానీ...ఏదో కక్ష కట్టినట్టు లాలూపైనే కేసులు దాఖలు చేయడం.. ఈ విషయంలో మాత్రం సీబీఐ కూడా చాలా యాక్టివ్ గా పనిచేయడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది అంటున్నారు. ముందు వేలకు వేల కోట్లు మింగేసిన వారిని దేశానికి రప్పించండి... నల్లధనాన్ని పోగేసుకున్న వాళ్లపై చర్యలు తీసుకోండి...అంతేకానీ.. ఇంక దేశంలో ఎవరూ లేనట్టూ.. లాలూ పైనే కేసులు వేస్తున్నారని మండిపడుతున్నారు. మరి చూడబోతే నిజంగానే లాలూ కుంటంబం ఒక్కటే సీబీఐకి దొరికినట్టుంది..అదే పనిగా కేసులు పెట్టుకుంటూ పోతోంది. మరి బిగ్ షాట్స్ విషయంలో కూడా ఇలానే స్పీడ్ గా ఉంటే బావుంటుంది..

మళ్లీ ఝలక్ ఇచ్చాడుగా... నేను రాను...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వామపక్షాలకు షాకిచ్చారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో గతంలోనే పవన్ వల్ల వామపక్షాలకు షాక్ తగిలింది. బీజేపీతో చేయి కలిపే పవన్ టీడీపీ విషయంలో యూటర్న్ తీసున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత అని పార్టీలకు దూరంగా ఉంటూ ఆఖరికి వామపక్షాలతో కలిశారు. వారితో ఉంటూనే ప్రత్యేక పోరాటం చేస్తున్నారు. అయితే ఈ మధ్య ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న పవన్.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు.. దానికి తగిన విధంగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా చాలు అని అన్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలు విన్న వామపక్షాలు ఖంగుతిన్నాయి. పవన్ ఇలా మాట్లాడేశాండేంటి అని షాక్ తిన్నారు. అనవసరంగా పవన్ తో చేయి కలిపినట్టున్నాం అని కూడా చర్చించుకున్నట్టు సమాచారం. అయితే తాను అలా మాట్లాడలేదని.. తన వ్యాఖ్యాలను వక్రీకరించారని చెప్పుకొచ్చారనుకోండి.   ఇక ఇప్పుడు మరోసారి పవన్ వామపక్షాలకు షాకిచ్చారు. ప్రత్యేక హోదా కోసం పోరాటంలో భాగంగా పవన్, వామపక్షాలతో కలిసి మొన్నీమధ్యే విజయవాడలో పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే కదా. ఇందుకు మంచి రెస్పాన్స్ రావడంలో వామపక్షాల నాయకులు కూడా సంబరపడిపోయారు. అయితే ఇలాంటి ఆందోళనలు విజయవాడలో కాకుండా ఢిల్లీలో చేపడితే మంచి ఫలితం ఉంటుందని… పవన్ అందులో పాల్గొంటే జనసేన, వామపక్షాల కూటమికి పొలిటికల్ మైలేజీ వస్తుందని వామపక్షాలకు చెందిన నాయకులు భావించారట. అనుకున్నదే తడవుగా...ఢిల్లీలో ఆందోళనలు చేపట్టాలని వామపక్షాలు ప్లాన్ చేసి..ఢిల్లీ స్థాయిలోని తమ అధిష్టానంతో కూడా వామపక్షాల నాయకులు చర్చలు కూడా జరిపారట. అయితే దీనికి పవన్ నో చెప్పారట. దీంతో పవన్ నిర్ణయంపై వామపక్ష నేతలు షాకయ్యారట. ఈ విషయంలో పవన్ ఎందుకు వెనకాడుతున్నాడో అర్థం కావడం లేదని తలపట్టుకుంటున్నారట. పాపం మరి ఏదో పవన్ తో కలిసి జనంలోకి వెళితే వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఓ నాలుగు సీట్లు వస్తాయని వామపక్ష నేతలు ఆశపడుతున్నారు కానీ పవన్ మాత్రం వారికి షాకులిస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు వామపక్షాలు ఏం చేస్తారో చూద్దాం...

కేసీఆర్ కు మోడీ కండీషన్.. అందుకే పంపలేదా...!

  ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో టీఆర్ఎస్, అన్నాడీఎంకే పార్టీలు ఆడిన రాజకీయ డ్రామా అందరూ గమనించారు. ఒక పక్క ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ ఏపీ ఎంపీలందరూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి.. కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. కానీ అవిశ్వాస తీర్మానం మాత్రం చర్చకు రాలేదు. ఈ అవిశ్వాస తీర్మానం చర్చకు రాకపోవడంలో టీఆర్ఎస్, అన్నాడీఎంకే పార్టీలు కీలక పాత్ర పోషించాయనుకోండి. రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని ఓ పక్క టీఆర్ఎస్ ఎంపీలు... కావేరి బోర్డు యాజమన్యం ఏర్పాటుపై అన్నాడీఎం నేతలు నిరసన చేస్తూ డ్రామాలాడి ఆఖరికి ఏపీ ప్రత్యేక హోదా అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చేశాయి. అయితే ఆపార్టీల వెనుక బీజేపీ ఉందని... కేంద్ర ప్రభుత్వమే వారిచేత ఇలా చేయించిందన్న వార్తలు కూడా వచ్చాయి.   ఇక ఆతరువాత ఇటీవల దక్షిణ రాష్ట్రాలు ఏర్పాటు చేసిన సమావేశానికి ఈ రెండు పార్టీలు రానని చెప్పడంతో ఈ వార్తలు నిజమే అని అభిప్రాయపడ్డారు.  కేంద్రప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందని... కేరళలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశం ఏర్పాటు చేసింది. కానీ ఈ సమావేశానికి ఈ రెండు రాష్ట్రాల అర్ధిక మంత్రులు మాత్రం మేం రావట్లేదని చెప్పారు. అంతేకాదు.. ఇటువంటి సమావేశాలు దేశసమగ్రతకు విఘాతం కలిగిస్తాయని అందుకే తాము పాల్గొనమని కేసీఆర్ ప్రకటించారు. అయితే కేసీఆర్ బయటకు అలా చెప్పినా... అసలు నిజం మాత్రం వేరే ఉందన్న వార్తలు ఇప్పుడు తాజాగా బయటకు వచ్చాయి. అదేంటంటే... తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే రైతు పెట్టుబడి సాయం చెక్కులకు గాను నగదు అందుబాటులో ఉంచడానికి గాను కేంద్రం ఈ షరతు పెట్టిందట. దాంతో కేసీఆర్ ఆ సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారట. ఆ తర్వాత రిజర్వు బ్యాంక్ తెలంగాణ బ్యాంకులకు రెండువేల కోట్ల రూపాయల నగదును మంజూరు చేసిందట. మొత్తానికి టీఆర్ఎస్ వెనుక అసలు నిజం ఏంటో తెలిసిపోయింది. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెబుతారో చూడాలి. ఈసారి దక్షిణాది రాష్ట్రాల ఆర్థికమంత్రుల తరువాతి సమావేశం ఆంధ్రప్రదేశ్ లో జరగబోతుంది. ఈ సమావేశానికైనా వస్తారా.. లేక..? దీనికి డుమ్మా కొడతారా..? చూద్దాం ఏం జరుగుతుందో...

జగన్ కు జలీల్ సవాల్.. అలా చేస్తే కాళ్లు పట్టుకొని రాజీనామా చేస్తా..!

  వైసీపీ అధినేత జగన్ కనుక ప్రధానమంత్రి నరేంద్రమోడీని విమర్సిస్తే నా పదవికి రాజీనామా చేస్తా..? ఇంత పెద్ద సవాల్ విసిరింది ఎవరనుకున్నారా..?ఎవరో కాదు వైకాపా లో గెలిచి టీడీపీలో జాయిన్ అయిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్. పాదయాత్రలో భాగంగా జగన్ నేడు విజయవాడలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అయితే జగన్ విజయవాడలో అడుగుపెట్టిన నేపథ్యంలో జలీల్ ఖాన్ ఓ సవాల్ విసిరారు. పాదయాత్రలో కనుక జగన్ నోటి వెంట మోదీ దొంగ, బీజేపీ మోసం చేసింది అని ఒక్క మాట అంటే జగన్ కాళ్ళు పట్టుకొని..నా పదవికి రాజీనామా చేస్తానని జలీల్‌ఖాన్ సవాలు విసిరారు. ప్రత్యేక హోదా వస్తే ఇన్ కంటాక్స్ కట్టనవసరం లేదు అని చెప్పే జ్ఞానం లేని జగన్ ముఖ్యమంత్రిగా పనికి వస్తాడా? అని ఆయన అన్నారు. అక్కడితే ఆగకుండా... ముఖ్యమంత్రినే నడిరోడ్డుపై కాల్చిపారేయాలి అని వ్యాఖ్యానించిన జగన్.. రేపు ఆయన ముఖ్యమంత్రి అయితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.   అంతేకాదు మోడీపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. “పరిపాలన చేతగాక దద్దమ్మలా మోదీ దీక్ష చేసారని, పార్లమెంటును సజావుగా నడిపించలేని నరేంద్రమోదీ రాజీనామా చెయ్యాలి. దళితులు, మైనార్టీల మీద దాడులు చేస్తున్నా కేంద్రం చోద్యం చూస్తుంది.” అని ఆయన అన్నారు. మరి జలీల్ ఖాన్ సవాల్ ను జగన్ స్వీకరిస్తాడో..? లేదో..? చూద్దాం.

పట్టిసీమపై క్షమాపణ చెప్పి అడుగుపెట్టు..

  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా విజయవాడలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కనకదుర్గ వారధి వద్ద వైసీపీ శ్రేణులు పోటెత్తారు. జగన్ కు బ్రహ్మరథం పట్టారు. అశేష జనసందోహం మధ్య ఆయన నగరంలోకి అడుగుపెట్టారు. అయితే పార్టీ నేతలు కాబట్టి ఎలాగూ జగన్ కు ఘనస్వాగతం పలకడంలో ఆశ్చర్యం లేదు. కానీ.. కృష్ణా రైతులు మాత్రం జగన్ పై మండిపడుతున్నారు. దీనికి కారణం పట్టిసీమే. పట్టిసీమకు, కృష్ణ కు సంబంధం ఏంటనుకుంటున్నారా..? ఏంటంటే... పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేయడానికి చంద్రబాబు చాలా కష్టపడ్డారు. కేవలం ఆరు నెలల్లో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. అయితే ఈ ప్రాజెక్టుకు జగన్ మాత్రం ఎప్పుడూ వ్యతిరేకమే. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఈ ప్రాజెక్టుపై  విషం చిమ్ముతూనే వస్తున్నారు. ఇప్పుడు ఈ పట్టిసీమ నుంచి వచ్చిన నీరు కృష్ణాలో కలుస్తోంది. దీంతో కృష్ణరైతులు జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు కట్టి.. గోదావరి వాసులకు అన్నాయం చేస్తున్నారని...  గోదావరి జిల్లాల వాళ్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు... అక్కడ ఆందోళనలు చేయించారు...  కృష్ణాడెల్టా రైతుల పొట్టకొట్టాలని చూశారు.. కృష్ణా డెల్టాకు నీరిస్తూంటే.. శ్రీశైలం నీళ్లిస్తున్నారంటూ.. రాయలసీమలో ప్రజల్ని రెచ్చగొట్టాలని చూశారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఇక్కడ పాదయాత్రకు చేయడానికి వచ్చారని అంటున్నారు. అంతేకాదు... ఇప్పుడు పులివెందులలో కృష్ణా నీరు పారుతున్నాయంటే..అది పట్టిసీమ మహిమే... ఇప్పటికైనా తప్పు తెలుసుకో.. పట్టిసీమను వ్యతిరేకించినందుకు.. క్షమాపణ చెప్పి… కృష్ణా నీళ్లు..అదే పట్టిసమ నీళ్లు తలపై చల్లుకుని.. జిల్లాలోకి అడుగుపెట్టు అంటూ రైతులు జగన్ పై మండిపడుతున్నారు. మరి ఆరంభంలోనే హంసపాదు అన్న సామెతలాగ...ఎంట్రీలోనే అడ్డంకులు ఎదురైన జగన్ కు ముందు ముందు ఇంకెన్ని సమస్యలు వస్తాయో.

మోడీకి పిల్లలు ఉంటే తెలిసేది...

  ఇప్పటికే మోడీ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగిపోతున్న సంగతి తెలిసిందే. దానికి కారణాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జీఎస్టీ విషయంలో.. నోట్ల రద్దు, దళితులపై దాడులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇప్పుడు దానికితోడు ఏపీ ప్రత్యేక హోదా విషయం కూడా దేశ వ్యాప్తంగా చర్చాంశనీయమైంది. ఏపీ మద్దతుగా ప్రతిపక్షపార్టీలన్నీ ఏకతాటిపైకి రావడంతో కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. ఇక ఇప్పుడు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకోవడాని ప్రయత్నాలు చేస్తున్నారనుకోండి.   అయితే ఇప్పుడు బీజేపీ, మోడీ పరువును ఓ మహిళ అడ్డంగా తీసేసింది. ఇటీవల ఓ బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. దీనిపై స్పందించిన ఓ మహిళ మోడీపై ఓ రేంజ్ లో విరుచుకుపడింది. బేటి బచావ్ బేటీ బచావో నినాదం కాదు... బేటీ బచావ్ అంటే, బీజేపీ ఎమ్మల్యేల నుంచి మీ ఆడబిడ్డలను కాపాడుకోండి అని... కూతుళ్ళ వయసు పిల్లల మీద బీజేపీ ఎమ్మల్యేలు చేసే బలాత్కారాల నుంచి కాపాపడుకోండి అంటూ విమర్శించింది. " బేటీ బచావ్ ! " -- అంటే ఆ బేటీ ని ఎవరినించి బచావ్ అని... బిడ్డలు లేని మోదీకి ఆడవారి బాధలు ఏం తెలుస్తాయంటూ సర్కార్ పాలనపై మాటల తూటాలు పేల్చింది. అంతేకాదు ‘‘యూపీ సీఎం యోగికి భార్య, పిల్లలు, కుటుంబం లేదు. కన్నబిడ్డ, ఆడవారి ఆవేదన వారికి ఎలా తెలుస్తుంది..? మోడీకి పెళ్లి అయ్యిందే కానీ పిల్లల భాగ్యం లేదు. ఒక కూతురు అత్యాచారానికి గురయితే తండ్రి పడే బాధ మోడీకి తెలుసా..?’’ అంటూ మహిళ తీవ్ర విమర్శలు చేశారు. బేటీ బచావో అనే బీజేపీ పాలనలో.. ఆ నేతల నుంచే బాలికలకు రక్షణ లేకపోవడం దారుణమని ఏకిపారేసింది. ఇక ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.   మరి రోజులు అన్నీ ఒకేలా ఉండవు కదా. ఒకప్పుడు అధికార అహంకారంతో తమకు ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని ప్రజల మీద రుద్దేశారు. ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తున్నారు. దానికి తోడు ఏదో ఒక తప్పు చేసి బుక్కవుతున్నారు. మళ్లీ ఏదైనా అంటే... నేను పేద తల్లి కొడుకుని, నేను తక్కువ కులం వాడిని అంటూ మోడీ సెంటిమెంట్ డైలాగులతో ముందుకొస్తారు.మరి పేద తల్లి కొడుకుని అని చెప్పుకునే మోడీకి పేదల బాధలు తెలియవా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.