Elections Results Karnataka 2013

ఆంధ్ర బడిలో 'కన్నడ' పాఠాలు

        దేశం బాగుపడాలంటే జాతీయ పార్టీలను భూస్థాపితం చేయాలి. ప్రాంతీయపార్టీలు మరింతగా బలం పున్జుకుంటే తప్ప, సూట్కేస్ లో ఢిల్లీ నుండి ముఖ్యమంత్రుల కేటాయిమ్పులనేవి ఆగవు. ఒక్కోసారి ఒక్కోపార్టీ కారణంగా ఆయ రాష్ట్రాల ప్రగతి ఎన్నో ఏళ్ళు వెనక్కు వెళ్ళిపోతుంది. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ చావుతప్పి కన్నులొట్ట పోయిన విధంగా భాజాపా ఓట్ల చీలిక పుణ్యమా అని గద్దెనెక్కబోతోంది. కాని ఇహ రోజుకో ముఖ్యమంత్రి మారినా ఆశ్చర్యపోనవసరంలేని స్థితిని ఆ రాష్ట్ర ప్రజలు తద్వారా దేశ ప్రజలు చూడబోతున్నారు. వరుస కుంభ కోణాలతో మారుమోగుతున్న కాంగ్రెస్ అధిష్టానం ఎంతవరకు మెరుగైన పరిపాలన అందిస్తదో అందరికి సందేహమే. ఐనా గాలి జనార్థనరెడ్డి మాత్రమే భాజపాని నడిపించటం లేదు. మఠాలు, పీఠాలు, పీఠాధిపతులు ప్రజల తలరాతలని మార్చటానికి సిద్ధమవుతుంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తామేమి తక్కువ తినడం లేదని ముందుకు ఉరికి వస్తుంటే ప్రజల సంక్షేమం గురించి ఆలోచించవలసిన అవసరం కాని, ఆలోచించకపోతే పార్టీ మనుగడను గూర్చిన భయం కానీ ఆనేతలకు ఉండాల్సిన పని లేదు. ఏది ఏమైన రానున్న రోజులలో యువత ముందడుగు వేయాలి. మధ్యతరగతి, ఆపైవర్గం ప్రజలు,అంటే నోట్లకు అమ్ముడుపోని వర్గం ప్రజలు ముందుకు వస్తేనే కాని దేశ రాజకీయాలు బాగుపడవు. చిన్నపాటి కుదుపులు ఈనాటి రాజికీయ పరిస్థితులను ఎమీచేయలేవని కాంగ్రెస్ ధీమా. అన్ని ప్రాంతాలలోను ఒక నరేంద్రమోడి లాంటి నాయకుడు కావాలి అంటున్నారు అంటే 120కోట్లమందిలో నీతి, నిజాయతీ, సామర్ధ్యం, సత్తా, ధైర్యం, దమ్ము ఉన్న నాయకుడు ఒకేఒక్కడా ? ఆ ఒక్కడు నరేంద్రమోడీనా? ఆ ఒక్కడినైనా భాజపా అధిష్టానం ఎంతకాలం నిలవనిస్తుంది?              కర్ణాటక రాజకీయాలనుండి మన ఆంధ్ర ఓటర్లు చాలా నేర్చుకోవాలి. కేవలం కులం మీద అభిమానంతో నడిచే రాజకీయాలు, గెలిచే పార్టీలు ప్రజాలకు ఏమి అభివృద్ధిని చూపిస్తాయనేది. కులాన్ని నమ్ముకుని,మతంతో మాయ చేయగలను అనే ధైర్యంతో ఉన్నవే  వైకాపా, కాంగ్రెస్, తెదేపా, భజాపాలు కూడా. వాళ్ళందరికీ సరైన సమాధానం ప్రజలేచెప్పాలి. కొంతవరకు తెదేపా ద్వారా రాష్ట్రానికి అభివృద్దే జరిగింది. కాని కేవలం రెడ్డి సామాజికవర్గ అభిమానంతో,మతమార్పిడి చర్యలతో రాష్ట్రాభివృద్ధికి గండిపడింది. 2009 ఎన్నికలలో తెదేపా ఆ కారణంగానే ఓడిపోయిందని  చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ రాజశేఖరరెడ్డి మరణం కారణంగా తీవ్రంగా నష్టపోయింది తేదేపానే . రాజశేఖరరెడ్డి బ్రతికి ఉంటె  2014 ఎన్నికలలో చంద్రబాబునాయుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే వాడు. ఎందుకంటే మధ్యలో ఈ జగన్ రెడ్డి ఎపిసోడ్ వచ్చేదే కాదు.              కాని ఈనాడు ప్రజలు కూడా తినడానికి తిండి లేకపోయినా, కులాల కోసం, మతాల కోసం ప్రాకులాడి చచ్చిపోతున్నారు. అది ఈ రాజకీయ దళారులను గద్దెనెక్కించడానికి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ముఖ్యమంత్రి పదవిని వాడుకోవటానికి మంచి అవకాశంగా మారింది.             మాటకు ముందు రాజకీయనాయకులని అవినీతిపరులని అంటున్నారే కాని వారి కన్నా ముందు చెడిపోతుంది ప్రజలే. నోటుకి ఓటు అమ్ముకోవడం తోనే లంచగొండితనం మొదలై, అది పెరిగి పెద్ద వృక్షమై, మహా వృక్షమై కూర్చున్నది. మరి తప్పెవరిది? ప్రజలదే కదా! ప్రజలలో ఐకమత్యం ఉండదు.... ఎలా ఉంటుంది కులాల కోసం కుమ్ముకుచస్తుంటే? కులమన్నది ఒక జాడ్యం. అది ఎయిడ్స్ కన్నా భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధికి ఏ రాష్ట్రము మినహాయింపు కాదు.             చివరిగా చెప్పేది ఒక్కటే.... కర్ణాటక రాజకీయాల నుండి ప్రజలు తెలుసుకోవలసింది నాయకుడు ప్రజల మధ్యనుండి కులాలకతీతంగా, మతాలకతీతంగా, ప్రాంతాలకతీతంగా, వర్గాలకతీతంగా రావాలి. అలా రావాలంటే ప్రజల ఆలోచనా విధానం మారాలి. ఏ కులం పేరుతో పదవి దక్కించుకున్నవాడు, వాడి కుటుంబం, వాడి బంధువర్గం మాత్రమే బాగుపడతారు. కాని పేదవాడు పేదవాడిగానే ఉంటాడు. వీలైతే మధ్యతరగతివాడు కూడా పేద వాడిగా మారిపోతాడు. ప్రజాసంక్షేమం ఉండదు, రాష్ట్రాభివృద్ధి ఉండదు. ఎందుకంటే అవి ఈ నేతలకు అవసరం లేదు. పధకాలను చూపించి మన సొమ్ము మనకే ఖర్చుపెడుతూ ఏవో ప్రగర్బాలు పలుకుతారు.            చైతన్యవంతుడైన ఓటరుమహాశయా, మేలుకో! మేలుకొని నీ భవితను నువ్వే దిద్దుకో! ప్రతి పనికిమాలినవాడు (గుండాలు, వీధి రౌడీలు, వ్యాపారవేత్తలు) గద్దెనెక్కుతాడు. నిన్ను మరింత అథః పాతాళంలోకి తోక్కుతాడు. 

Corporate Farming

"కార్పోరేట్" వ్యవసాయం

        భారత దేశం వ్యవసాయాధారిత దేశం. దేశానికి రైతే వెన్నెముక. కానీ ఈనాడు ఆ రైతుకే వెన్నెముక విరిగిపోతున్న పరిస్థితి. నానాటికీ క్షీణించిపోతున్న వ్యవసాయరంగాన్ని కార్పోరేట్ రంగంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం తో ఈ వ్యవసాయ కార్యక్రమాన్ని 17 రాష్ట్రాలలో అమలు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా అందులో మన ఆంధ్ర ప్రదేశ్ కూడా ఒకటిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి రూ. 7,000 కోట్లు ఖర్చుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం ప్రకారం రైతులు ఏ పంటలు వేయాలి, ఏ విత్తనాలు వాడాలి దగ్గరనుంచి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం వరకు ఈ కార్పోరేట్ కంపనీల ద్వారానే జరుగుతుంది.    ఆహార భద్రత అంటూ వల్లె వేసే ప్రభుత్వాలు... ఆ ఆహార భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారో తెలియజెప్పే ప్రయత్నం చెయ్యరు. క్షీణిస్తున్న భూసారాన్ని అరికట్టాలి. విచక్షణారహితంగా ఎరువులు వాడటం తో పాటు, సేంద్రీయ ఎరువుల ఉపయోగం, సాంద్రీకరణ వ్యవసాయం తక్కువ స్థాయిలో ఉండటం వలన భూములు నిస్సారమైపోతున్నాయి. ఆ నేలల్లో ఉత్పాదకత పూర్తిగా పడిపోతోంది. చివరకు అవి పంటల సాగుకే పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది.             సరియైన మౌలిక వసతులు లేకపోవడం,పండిన పంటలు నిల్వచేసుకోవడానికి సరియైన సీతలగిడ్డంగులు లేకపోవడం, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో తరలించేందుకు సరియైన రవాణా సదుపాయాలు లేకపోవడం, నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించడానికి తీవ్రమైన నిధుల కొరత ఉండటం, సకాలం లో సేంద్రీయ ఎరువులు లభించకపోవడం, పాత పద్ధతులను అనుసరించడం వలన భూసారం తగ్గిపోవటం, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడడానికి సరియైన భీమా సౌకర్యం లేకపోవడం వంటి మొదలైన కారణాల వల్ల వ్యవసాయ రంగం నానాటికి కుంటుపడుతోంది.            ఇన్ని దశాబ్దాలుగా ప్రభుత్వనిర్లక్ష్యం మరియు వారు చేసిన తప్పులకు ఈనాడు రైతు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ సమస్యలపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టటం ఆహ్వానించదగిన పరిణామం. పైన చెప్పిన సమస్యలకు ఈ కార్పోరేట్ వ్యవసాయం వలన చాలా వరకు పరిష్కారం దొరకవచ్చు. కాని ఈ కార్పోరేట్ రంగం వలన కొన్ని కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అవి ఏమిటంటే: 1. ఏ పంటలు వేయాలో ఈ కంపనీలు నిర్ణయించడం వలన లాభదాయకమైన వాణిజ్య పంటలను వేయడం ద్వారా మిగిలిన వ్యవసాయ ఉత్పత్తులు కనుమరుగయ్యే అవకాశాలు ఎక్కువ. 2. పెట్టుబడి ప్రభుత్వానిదే అయినా పెత్తనం కార్పోరేట్ సంస్థల చేతిలోకి వెళ్ళిపోతుంది. 3. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు బ్రతుకు భారంగా మారుతుంది. 4. యంత్రాల వినియోగం పెరిగి నిరుద్యోగం పెరుగుతుంది. 5. ధరల నియంత్రణ ప్రభుత్వం నుంచి కార్పోరేట్ రంగం చేతిలోకి వెళ్ళిపోతుంది.          ఈ కార్యక్రమాన్ని అమలు చేసే ముందు ప్రస్తుత రైతుసమస్యలను ఒక్కొక్కటిగా ఈ కార్యక్రమం ఎలా పరిష్కరిస్తుందో ప్రభుత్వం విపులంగా రైతులకు తెలియజేయవలసిన అవసరం ఉంది. అంతే కాకుండా కొత్త సమస్యలు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వివరించవలసి ఉంది. వీటన్నిటి కంటే ముఖ్యంగా క్షీణిస్తున్న భూసారాన్ని రక్షించే విధంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ సేంద్రీయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలి. దీన్ని దీర్ఘకాలిక వ్యవహారంగా ముందుకి తీసుకు వెళ్ళాలి. సేంద్రీయ, జీవ ఎరువులను సైతం రసాయన ఎరువులతో కలిపి శాస్త్రీయంగా వాడేలా చూడాలి. దాని వల్ల నెల ఆరోగ్యం మెరుగు పడి అన్ని రకాల పోషకాల వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది. ఇది వ్యవసాయ రంగం పట్ల ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం.