అందరూ టచ్చులోనే ఉన్నారుట!

  రాష్ట్ర విభజన జరిగే వరకు కూడా ఆంద్ర కాంగ్రెస్ నేతలందరూ కూడా చాలా చురుకుగా రాజకీయాలలో పాల్గొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, చిరంజీవి వంటి మరికొందరు ఎన్నికలు పూర్తయ్యేవరకు కనిపించారు. కానీ ఆ తరువాత వారందరూ కూడా ఏదో మంత్రం వేసినట్లు మాయమయిపోయారు. ఇంతకుముందు ఏ పత్రిక తిరగేసినా, ఏ ఛానల్ పెట్టినా ముందుగా కనబడే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బొత్తిగా కనబడకుండాపోయారు. అయితే అందుకు మాజీ కాంగ్రెస్ యంపీ సాయి ప్రతాప్ చాలా మంచి కారణమే చెప్పారు.   మళ్ళీ చాలా రోజుల తరువాత అజ్ఞాతం నుండి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన ఆయన “వానలు పడుతాయనే ఉద్దేశ్యంతో విత్తనాలు వేస్తే వానలు పడవు. వానలు పడవనే ఆలోచనతో విత్తనాలు వేయనప్పుడు వానలు పడుతుంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల పరిస్థితి కూడా అలాగే ఉంది. కనుక మళ్ళీ పరిస్థితులు అనుకూలించే వరకు మౌనం వహించడమే అన్ని విధాల ఉత్తమం,” అని అన్నారు. ఆయన చెప్పింది నిజమేనేమో! అందుకే హేమాహేమీలనదగ్గ కాంగ్రెస్ నేతలందరూ మౌనంగా ఉండిపోతున్నారేమో?   సాయి ప్రతాప్ చాలా రోజుల తరువాత నోరు విప్పినప్పటికీ కొన్ని ఆసక్తికరమయిన విషయాలు కూడా చెప్పారు. వాటిలో అన్నటికంటే ముఖ్యమయినది మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరకపోవచ్చుననేది ప్రదానమయినది. ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికే చేరుకొంటారని ఆయన జోస్యం చెప్పారు. ఆయనే కాదు మిగిలిన కాంగ్రెస్ నేతలందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరుకొంటారని వారిలో చాలా మంది పార్టీతో పూర్తి ‘టచ్చు’ లోనే ఉన్నారనే మరో విషయం కూడా ఆయన బయటపెట్టారు. బహుశః అందుకేనేమో మొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి వచ్చినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డితో సహా అనేకమంది కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతారని మీడియాలో ఎంతగా ప్రచారం అయినప్పటికీ ఒక్క నేత కూడా జేరలేదు. కానీ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఈ ఒకటి రెండు నెలలలో కొంతమంది సీనియర్ కాంగ్రెస్, వైకాపా నేతలు బీజేపీలో చేరుతారని చెపుతున్నారు.   ఒకవేళ కాంగ్రెస్ నేతలు బీజేపీ వైపు మళ్ళినట్లయితే, కాంగ్రెస్ పార్టీ మరిక కోలుకోలేకపోవచ్చును. ఒకవేళ వారందరూ మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరుకొన్నట్లయితే, రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ మరింతగా శ్రమించవలసివస్తుంది. త్వరలోనే ఎవరు ఏ పార్టీలో చేరుతారో తేలిపోతే దానిని బట్టి పార్టీల బలాబలాలు ఎలా ఉండబోతున్నాయో ఊహించవచ్చును.

కృష్ణపట్నం కిరికిరి

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు-2014లో చట్టాలకి ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలు తమకు అనుకూలంగా బాష్యం చెప్పుకొంటున్నాయి. ఉన్నత విద్యా సంస్థల ప్రవేశ పరీక్షల నిర్వహణ, నియామకాలలో ప్రస్తుత విధానాన్నే మరో పదేళ్ళు కొనసాగించాలని చెప్పినప్పటికీ, తెలంగాణా ప్రభుత్వం ‘మా సెట్ మాదే మీ సెట్ మీదే’ అని చట్టంలోనే రాసి ఉందంటూ విడిగా పరీక్షలు నిర్వహించుకొనేందుకు సిద్దం అవుతోంది. కనుక తెలంగాణా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉంది. రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ లో తమ వాటాగా 53.89 శాతం ఇవ్వాలని తెలంగాణా ప్రభుత్వం వాదిస్తోంది. కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు న్యాయంగా దక్కవలసిన విద్యుత్ కూడా దక్కనీయకుండా మోసం చేస్తోందని తెలంగాణా ప్రభుత్వం వాదిస్తోంది. కానీ విభజనకు ముందు తెలంగాణాకు విద్యుత్ సరఫరా చేసేందుకు చేసుకొన్న విద్యుత్ ఒప్పందాలు ఏవీ చెల్లవని, ఒకవేళ విద్యుత్ కావాలనుకొంటే మళ్ళీ కొత్తగా ఒప్పందాలు చేసుకోవలసిందేనని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. కనుక ఈ విషయంలో తెలంగాణా ప్రభుత్వం కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉంది.   ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెలలో గానీ కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఉత్పత్తి ప్రారంభించే అవకాశాలున్నాయి. అందులో 1,600 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కనుక అందులో చట్ట ప్రకారం తమకు రావలసిన 862 మెగావాట్స్ విద్యుత్తును ఇవ్వకపోతే తక్షణమే కోర్టుకి వెళ్లాలని తెలంగాణా ప్రభుత్వం సిద్దంగా ఉంది. “కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటు యొక్క ‘కమర్షియల్ డేట్ ఆఫ్ ఆపరేషన్’ ప్రకటన కోసం మేము ఎదురుచూస్తున్నాము. ఆ నాటి నుండి ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి మొదలవుతుందని అధికారికంగా దృవీకరణ అవుతుంది కనుక అప్పటి నుండి మావాట విడుదల చేయమని ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతాము. ఒకవేళ అందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తిరస్కరిస్తే, మేము కోర్టుకు వెళ్లేందుకు కూడా వెనుకాడబోము” అని తెలంగాణా జెన్-కో మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్మన్ డి.ప్రభాకర్ రావు చెప్పారు. కానీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ వాదన మరోలా ఉంది. కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలో తెలంగాణా వాటా క్రింద రూ. 1,050 కోట్లు పెట్టుబడి ఉంది కనుక ఆ మొత్తానికి సరిపడే విధంగా ఒప్పందం చేసుకొని విద్యుత్ పొందవచ్చును. కానీ అందులో తెలంగాణాకి 53.89 శాతం విద్యుత్ సరఫరా చేయడం మాత్రం కుదరదని తేల్చి చెప్పారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ సరఫరాకు నిరాకరించినట్లయితే తెలంగాణా ప్రభుత్వం కోర్టుకు వెళ్లేందుకు సిద్దంగా ఉంది. అంటే ఇరు రాష్ట్రాల మధ్య యుద్ధానికి మరో అంశం సిద్దంగా ఉందన్నమాట.

పరకాలకు త్వరలో మంత్రి పదవి?

  ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి మీడియా సలహాదారుగా ఉన్న డా. పరకాల ప్రభాకర్ ని త్వరలో తన మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తాజా సమాచారం. అందుకోసం మార్చి నెలలో జరుగనున్న యం.యల్.సి. ఎన్నికలలో ఆయనకి గవర్నర్ కోటాలో సీటు ఇచ్చి విధానసభ సభ్యునిగా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఎన్నికలలోగానే ఆయనను చంద్రబాబు తన మంత్రివర్గంలో మంత్రిగా తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.   ఈ సమాచారం నిజమనుకొంటే చంద్రబాబు నాయుడు ఇంత అకస్మాత్తుగా ఆయనను మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకొంటున్నారు? ఆయనకి ఏ శాఖ బాధ్యతలు అప్పగించబోతున్నారు? వేరెవకయినా ఉద్వాసన పలకబోతున్నారా? వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతాయి.   డా. పరకాలను మీడియా సలహాదారుగా నియమించుకొన్న తరువాత చంద్రబాబు నాయుడు ఆయనను దేశ విదేశాలలో చేసే యాత్రలకి, మీడియా సమావేశాలలో తన వెన్నంటే ఉంచుకొంటూ ఆయనకి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి ఇచ్చినట్లయితే ఆయనకి మరింత ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా చేస్తున్న ఆయన సతీమణి నిర్మలా సీతారామన్ ద్వారా కేంద్రం నుండి రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది గనుక రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే బహుశః ఆయన ఈ నిర్ణయం తీసుకొంటున్నారేమో? అయినా ఈ వార్తలు అధికారికంగా దృవీకరించవలసి ఉంది.

మరీ ఇంత వాస్తు నమ్మకాలా?

  ఈ మధ్య తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తుకి మరీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లుంది. అందుకే ఏకంగా ఒక ఆస్థాన వాస్తు సిద్ధాంతి సుద్దాల సుధాకర్ తేజని ‘ప్రభుత్వ ఆర్కిటెక్ట్ సలహాదారు’ పేరుతో నియమించుకోవాలని నిర్ణయించుకొన్నారు. అంతే కాదు, వాస్తు ప్రకారం తన క్రింద పనిచేసే అధికారుల కంటే తన అధికార నివాసం ఉన్నత స్థానంలో ఉండాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ల్యాండ్స్ లో ఐ.ఏ.యస్. అధికారుల సంఘం కార్యాలయాన్ని ఖాళీ చేయించి అందులోకి తను మారాలని నిర్ణయించుకొన్నారు. ఆవిధంగా వారి కంటే తను ఉన్నత స్థానంలో ఉండటం వలన వారందరు తన ప్రభుత్వంపై పెత్తనం చేసే బదులు, తానే వారిపై పెత్తనం చేస్తారని వాస్తు సూచిస్తోందిట.   అయితే ఆ విషయం బయటకు చెప్పుకొంది కాదు కనుక అందుకోసం వేరే ఏవో కుంటి సాకులు చెప్పుకోవచ్చును. వాస్తు కోసం కేసీఆర్ ఆభావనంలోకి మారాలని కేసీఆర్ చాలా పట్టుదలగా ఉన్నప్పటికీ, దానికి అనేక అవరోధాలున్నాయి. గత ప్రభుత్వం 2000సం.లో ఆ భవనాన్ని ఐ.ఏ.యస్. అధికారుల సంఘానికి 33 సం.లు లీజు క్రింద ఇచ్చింది. అంటే వారికి మరో 18స.లు పైనే దానిపై హక్కులు ఉంటాయి. కనుక వారు అభ్యంతరం చెప్పవచ్చును. అది ఆంద్ర, తెలంగాణా ఐ.ఏ.యస్. అధికారుల సంఘానికి చెందిన ఉమ్మడి భవనం కనుక ఆంధ్రాకు చెందిన అధికారులు గవర్నర్ నరసింహన్ న్ని కలిసి ఆయనకి దీని గురించి మొరపెట్టుకొన్నారు. హైదరాబాద్ నగరం మరో తొమ్మిదిన్నరేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది కనుక, రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ 8(1) ప్రకారం హైదరాబాద్ పరిధిలో ఉన్న భవనాల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకొనే హక్కు ఒక్క గవర్నరుకు మాత్రమే ఉంటుంది. కానీ వారి అభ్యర్ధనకు ఆయన స్పందించారో లేదో తెలియదు గానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం వారి కార్యాలయాన్ని అక్కడి నుండి వేరే చోటికి తరలించి, అందులోకి తను మారాలని భావిస్తున్నారు. అందుకోసమే రోడ్లు మరియు భవనాల శాఖ ఆ భవనం వెనుక ఉన్న 4ఎకరాల ఖాళీ స్థలాన్ని చదునుచేసి శుభ్రం చేయడం మొదలుపెట్టింది కూడా.   ఇది కాక మరో సమస్య కూడా ఉంది. దాదాపు 125సం.ల చరిత్ర కలిగిన ఆ భవనాన్ని 2006సం.లో సాంస్కృతిక సంపదగా ప్రకటించబడింది. అందువలన సంబంధిత శాఖ నుండి అనుమతి పొందవలసి ఉంటుంది. వాస్తు చూసుకొని కేసీఆర్ ఆ భవనంలోకి మారాలని ప్రయత్నిస్తే, ఇన్ని సమస్యలు స్వాగతం పలకడానికి సిద్దంగా ఉన్నాయి. కనుక ఒకవేళ ఏ కారణం చేతయినా ఆయన అందులోకి మారలేకపోయినా, ఆ భవనాన్ని ఉపయోగించుకొంటున్న అధికారులను అక్కడి నుండి ఖాళీ చేయించి, వారికి తన అధికార నివాసానికి వాయవ్యంలో కొంచెం దిగువగా ఉండే మరో భవనాన్ని కేటాయించాలని తద్వారా వాస్తు బ్యాలన్సింగ్ సరిచూసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. వినడానికి ఇదంతా చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ త్వరలోనే ఈ తంతు అంతా పూర్తి అయ్యే అవకాశాలున్నాయి.

త్వరలో తెలంగాణా ప్రభుత్వం ఆస్థాన వాస్తు సిద్ధాంతి నియామకం

  సమాజంలో వ్యక్తులు ఇళ్లు, భవనాలు నిర్మించుకొనేటప్పుడు వాస్తుదోషాలు లేకుండా జాగ్రత్తపడుతుంటారు. అది వారి వ్యక్తిగతం కనుక దానిని ఎవరూ తప్పు పట్టలేరు. కానీ దీనికి అతీతంగా వ్యవహరించవలసిన ప్రభుత్వాలు కూడా రోడ్లు, భవనాలు, ఫ్లై ఓవర్ల నిర్మాణాలకు, ప్రస్తుతం ఉన్న భవనాలలో వాస్తు దోషాలను సవరించేందుకు ఆస్థాన వాస్తు పండిట్లను నియమించుకొంటే, ఇక సివిల్ ఇంజనీర్లు ఎందుకు? వారు గీసే డ్రాయింగులు ఎందుకు? అని ఎవరికయినా అనుమానం కలుగకమానదు.   తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రముఖ వాస్తు సిద్దాంతి సుద్దాల సుధాకర్ తేజను ఆస్థాన సిద్ధాంతిగా నియమించుకొనేందుకు నిశ్చయించుకొన్నట్లు సమాచారం. కానీ అందుకు చట్టం అనుమతించదు. కనుక, ‘రాష్ట్ర ప్రభుత్వ ఆర్కిటెక్ట్ సలహాదారు’ అనే పేరుతో ఆయనను నియమించు కొనేందుకు ఫైలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఫైలు ఆర్ధిక శాఖ అనుమతి కోసం వేచి ఉందని సమాచారం. రాజుగారు తలచుకొంటే కొరడా దెబ్బలకు కరువా? అన్నట్లు సాక్షాత్ ముఖ్యమంత్రే దానిని ఆమోదించగా లేనిది, ఆర్ధిక శాఖ అంగీకరించదని ఎవరూ భావించలేరు. కనుక ఆయన నియామకం కేవలం లాంచన ప్రాయమేనని భావించవచ్చును. బహుశః మరొక వారం రోజుల్లో అధికారికంగా ప్రకటన వెలువడవచ్చునని సిద్ధాంతి గారు ఆశిస్తున్నారు.   కానీ ఆయన నియామకానికి రోడ్లు భవనాలు శాఖకు మంత్రిగా నియమితులయిన తుమ్మల నాగేశ్వర రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.25,000 కోట్ల వ్యయంతో హైదరాబాద్ మరియు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చిన్నా, పెద్ద నిర్మాణాలు జరుగనున్నాయి. ఈ పరిస్థితిలో వాస్తు సిద్ధాంతిని ముందుకు తీసుకురావడం అంటే మంత్రిగారి చేతులు కట్టేసినట్లేనని చెప్పక తప్పదు. ఎందుకంటే రోడ్లు భవనల శాఖ ఇంజనీర్లు ఎన్ని డ్రాయింగులు గీసుకొన్నా వాటికి సిద్ధాంతి గారి ఆమోదముద్ర పడందే ఏ ఫైలు ముందుకు కదిలే అవకాశం లేదు. కనుక అది పరోక్షంగా మంత్రిగారి అధికారాలకు కత్తెర వేసేందుకు చేసిన ఏర్పాటేనని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.   ఇప్పటికే ఉపముఖ్యమంత్రి రాజయ్యకు ఉద్వాసన పలికిన తీరుకి కేసీఆర్ అనేక విమర్శలు మూటగట్టుకొంటున్నారు. ఇప్పడు వాస్తు సిద్దాంతి నియామకం, ఆయన ద్వారా మంత్రిగారి అధికారాలకు కత్తెర వేసినట్లయితే, మంత్రిగారికి అసంతృప్తి, మరిన్ని విమర్శలు, కోర్టు చివాట్లు కూడా తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య సయోధ్య సాధ్యమేనా?

  గవర్నర్ నరసింహన్ మధ్యవర్తిత్వంలో మళ్ళీ చేతులు కలుపుకొన్న ఆంధ్ర, తెలంగాణా తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇకపై చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలనే సూచనకు అంగీకరించారు. ముందుగా వివిధ శాఖల ముఖ్యకార్యదర్శుల స్థాయిలో చర్చలు జరిపి, అవసరమయితే ముఖ్యమంత్రుల స్థాయిలో కూడా చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకొనేందుకు అంగీకరించారు. ఇది రెండు రాష్ట్రాలకు కూడా చాలా శుభ పరిణామమే.   కానీ వచ్చే నెలలో చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లాలో పర్యటిస్తారని ప్రకటించిన నాటి నుండి ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలయింది. చంద్రబాబు తెలంగాణాలో పర్యటిస్తే ఆయనను తప్పకుండా అడ్డుకొని తీరుతామని మంత్రి మహేంద్ర రెడ్డి కుండ బ్రద్దలు కొట్టారు. దైర్యం ఉంటే అడ్డుకోమని తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రతి సవాలు విసిరారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా తెదేపా కార్యకర్తలు తెలంగాణా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ తెలంగాణా వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేప్పట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో తమ పార్టీని బలోపేతం చేసుకోవాలని తెదేపా నేతలు భావిస్తుంటే, ఆలోగా ఆ పార్టీని పూర్తిగా తుడిచి పెట్టేయాలని తెరాస ప్రయత్నిస్తోంది.   ఇక నారా లోకేష్ అప్పుడప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై ట్వీట్ బాణాలు సంధిస్తూనే ఉన్నారు. ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో పార్టీ సభ్యత్వనమోదు ప్రక్రియను విజయవంతంగా పూర్తయ్యేందుకు ప్రధాన సూత్రధారి అయిన నారా లోకేష్ ఇప్పుడు తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకొనేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే ఆయన కూడా తన తండ్రి వెంట వరంగల్ పర్యటనకు బయలుదేరాలని భావిస్తున్నారు. కానీ వారిరువురినీ తెలంగాణాలో అడుగుపెట్టడానికి అనుమతించమని తెరాస నేతలు శపధాలు చేస్తున్నారు.   ఈ నేపద్యంలో ముఖ్యమంత్రులు ఇరువురూ చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకోవడం సాధ్యమేనా? అని ఆలోచిస్తే కాదనే సమాధానం వస్తుంది. అంటే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరింపబడాలంటే ముందుగా ఆ రెండు పార్టీల మధ్య సయోధ్య అవసరమని స్పష్టం అవుతోంది. మరి సయోధ్య కుదురుతుందా? అంటే దానికీ కుదరదనే సమాధానం వస్తుంది. కనుక రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం కూడా శాస్వితమేనని భావించవలసి ఉంటుంది.   అందుకు కనిపిస్తున్న ఒకే ఒక్క పరిష్కారం ఏమిటంటే మళ్ళీ తెదేపా, తెరాస పార్టీలు పొత్తులు పెట్టుకోవడమే. దాని వలన ఇరువురిలో ఒకరిపట్ల మరొకరికున్న అభద్రతా భావం కొంత తగ్గే అవకాశం ఉంటుంది కనుక రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు కూడా పరిష్కరింపబ అవకాశం ఉంటుంది.

ఎర్రచందనం వేలంవెర్రి ఎందుకో...

  ఎర్రచందనం... చాలా ఖరీదైన కలప. అందమైన వస్తువుల తయారీకి, వైద్యానికి ఉపయోగపడే ఈ కలప శ్రీ చందనం తర్వాత ఆ స్థాయి విలువ కలిగిన కలప. ఎగుమతులకు ఎంతో అవకాశం వున్న దీనికోసం ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో స్మగ్లర్లు ఎంతకైనా తెగిస్తారు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లర్లను ఉక్కుపాదంతో అణిచేస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కల్పతరువులా మారాయి.   ఎర్రచందనం విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇలా వుంటే, తెలంగాణలో మరోరకంగా వుంది. ఈమధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ హరిత హారం’ పేరుతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రమంతటా మొక్కలు నాటి, వాటిని వృక్షాలుగా పెంచి తెలంగాణ మొత్తాన్ని ఆకుపచ్చగా చేయాలన్నది ఈ పథక ఉద్దేశం. దీనితోపాటు భవిష్యత్తులో ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చేలా చేసుకోవాలని ప్రభుత్వాధినేతలు ఆలోచించారు. దాంతో ఆ మొక్కలూ ఈ మొక్కలూ ఎందుకు... ఏకంగా ఎర్రచందనం మొక్కలు నాటేయండి.. భవిష్యత్తులో అవి చెట్లయిన తర్వాత వేలం వేస్తే బోలెడంత ఆదాయం అని ఆదేశాలు ఇచ్చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 75 లక్షల ఎర్రచందనం మొక్కల్ని నర్సరీలలో పెంచారు. ఇక వీటిని రాష్ట్రమంతటా నాటడమే ఆలస్యం. ప్రభుత్వ పెద్దల ఆలోచనలు ఇలా వుంటే, ఇలాంటి విషయాలలో అనుభవం వున్న అధికారులు మాత్రం తెలంగాణలో ఎర్రచందనం మొక్కల్ని నాటడం వృధా అని అంటున్నారు. ఎర్రచందనం చెట్లు చక్కగా పెరిగి, నాణ్యమైన ఎర్రచందనం కలప ఇవ్వడానికి రాయలసీమ వాతావరణం మాత్రమే అన్నివిధాలా అనుకూలంగా వుంటుందని చెబుతున్నారు. తెలంగాణ వాతావరణం, భౌగోళిక పరిస్థితులను బట్టి ఎర్రచందనం మొక్కలు ఇక్కడ పెరగవని, ఒకవేళ వాటిని తంటాలు పడి పెంచినా చాలా నాసిరకం కలప వస్తుందని అంటున్నారు. అంచేత, ప్రభుత్వం తెలంగాణ అంతటా ఎర్రచందనం మొక్కలు కాకుండా టేకుగానీ, యూకలిప్టస్ మొక్కలు గానీ నాటుకుంటే మంచిదని అంటున్నారు.

టీడీపీ మాజీలకు స్వర్ణయుగం

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ టీడీపీ నాయకులకు స్వర్ణయుగం నడుస్తోంది. టీఆర్ఎస్ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయానా టీడీపీ మాజీ నాయకుడు. ఒకప్పుడు టీడీపీలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చక్రం తిప్పిన వాళ్ళ హవా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వలో నడుస్తోంది. తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస యాదవ్, పోచారం శ్రీనివాసరెడ్డి, జోగు రామన్న, మహేందర్ రెడ్డి, అజ్మీరా చందూలాల్... లేటెస్ట్‌గా కడియం శ్రీహరి... ఇలా ఒక్కరూ ఇద్దరూ ఏమిటీ... బోలెడంత మంది టీడీపీ మాజీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులు పొంది హ్యాపీగా వున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో ఉన్న ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ వైపు ఆశగా చూస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీని విడిచిపెట్టి టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోతే తమకు కూడా పైన చెప్పిన నాయకుల తరహాలోనే రాజకీయ స్వర్ణయుగం వస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే బహిరంగంగానే తమ కోర్కెల చిట్టా విప్పి, ఈ కోర్కెలు తీరిస్తే టీఆర్ఎస్‌లోకి వచ్చేస్తామని బేరాలు పెట్టేశారు. ఈ పరిస్థితిని చూసి దేశం నాశనమైపోతోందని బాధపడకండి.. రాజకీయాలే ఇంత!

రాజయ్య ఎమ్మెల్యే సీటుకీ టెండర్?

  ఇటీవలే పదవీచ్యుతుడైన టీఆర్ఎస్ మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు కేసీఆర్ మరో షాక్ ఇవ్వబోతున్నారా? ఈ షాక్‌కి సంబంధించిన గుసగుసలు టీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున రాజయ్య అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో ఈ స్థానం నుంచి రాజయ్య, కడియం శ్రీహరి పోటీపడేవారు. ఒకసారి రాజయ్య చేతిలో కడియం శ్రీహరి ఓడిపోయారు కూడా. ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో ఉండటంతో రాజయ్య స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీకి, కడియం శ్రీహరి వరంగల్ పార్లమెంట్‌కి పోటీ చేసి గెలిచారు. తాజా రాజకీయ పరిణామాలలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి పీకేసి, ఆ పదవిని కడియం శ్రీహరికి ఇచ్చారు. మరి కడియం శ్రీహరి వరంగల్ పార్లమెంట్ సభ్యుడు. ఆయన ఆరు నెలల లోగా అసెంబ్లీకి ఎన్నికవ్వాలి. తెలంగాణలో ఇప్పుడు ఏ అసెంబ్లీ స్థానమూ ఖాళీగా లేదు. మరి ఇప్పుడేం చేయాలి? ఎవరో ఒక ఎమ్మెల్యే తన పదవిని త్యాగం చేస్తే ఆ స్థానంలో కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఓ పనైపోతుంది. మరి ఆ త్యాగం కూడా వేరే ఎవరో ఎందుకు... రాజయ్య చేతే త్యాగం చేయించాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రాజయ్యను రాజీనామా చేయించి, ఆ స్థానం నుంచి కడియం శ్రీహరిని పోటీకి దింపనున్నట్టు సమాచారం అందుతోంది. ఇదే జరిగితే పాపం రాజయ్య ఎమ్మెల్యే స్థానానికి కూడా టెండర్ పెట్టేసినట్టే అవుతుంది.

ఏపీ క్యాబినెట్‌లోనూ త్వరలో మార్పులు?

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికి రెండుసార్లు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేశారు. తీసుకోవడం, తీసేయడం, శాఖల్లో మార్పులు చేయడం లాంటి పరిణామాలను చకచకా చేసేశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి ఎనిమిది నెలలు అవుతున్నా ఇప్పటి వరకూ మంత్రివర్గ విస్తరణ గానీ, మార్పు చేర్పులు గానీ జరగలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు మంత్రివర్గాన్ని విస్తరిస్తారా అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలో ఏపీ మంత్రివర్గంలో కూడా మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ మంత్రుల్లో ఆశించిన స్థాయిలో పనితీరును కనబరచని వారు కొందరు ఉన్నారని, వారిని బాధ్యతల నుంచి తప్పించి కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారన్న అభిప్రాయాలు తెలుగుదేశం వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అదే జరిగితే ఏయే మంత్రులకు విశ్రాంతి ఇస్తారు.. ఎవరెవరికి అవకాశాలు ఇస్తారనేదానిమీద భారీ స్థాయిలో అంచనాలు టీడీపీ వర్గాల్లో వున్నాయి.

ఎర్రగడ్డలో సచివాలయం.. చాలా కరెక్ట్...

తెలంగాణ ప్రజలు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారోగానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. పైగా కేసీఆర్ లాంటి అద్భుతమైన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా చాలా గొప్ప ముహూర్తంలో ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. అప్పటి నుంచీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. అందరూ కలలు కంటున్న బంగారు తెలంగాణ సిద్ధించడానికి ఇంకా ఎంతో సమయం పట్టదన్న నమ్మకం తెలంగాణ ప్రజానీకంలో ఏర్పడింది. సీఎం కేసీఆర్ గతంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు తెలంగాణ సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలని చేస్తున్న ప్రయత్నం ఒక ఎత్తు. సచివాలయాన్ని ఎర్రగడ్డలో నిర్మించిన వంద అంతస్తుల భవంతిలోకి తరలించడంతోపాటు ఇప్పుడున్న సచివాలయాన్ని కూలగొట్టేసి అక్కడ ఆకాశ హర్మ్యాలు నిర్మించాలన్న ఆలోచనే నిజంగా ఒక వండర్. దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కేసీఆర్ని చూసి కుళ్ళుకోవడానికి ఈ ఒక్క ఐడియా చాలు. అసలు సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలన్న ఐడియా కేసీఆర్ మంత్రివర్గంలో వారికో, అధికారులకో వచ్చి వుండదు. అది స్వయానా కేసీఆర్‌కే వచ్చి వుంటుంది. ఎందుకంటే అంత గొప్ప ఆలోచనలు చేయగల సత్తా ఆయనకే వుంది. మొత్తానికి సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలని నిర్ణయించడం చాలా కరెక్ట్.. ఎర్రగడ్డలో సచివాలయం, మంత్రుల క్వార్టర్స్, అధికారుల క్వార్టర్స్, దాంతోపాటు పెరేడ్ గ్రౌండ్ నిర్మించడం వల్ల అందరూ ఎర్రగడ్డలోనే సెటిలవుతారు. దానివల్ల తెలంగాణ సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎలాగంటే, ప్రస్తుతం ప్రజా ప్రతినిధులు, అధికారుల సమయంలో ఎక్కువ శాతం ట్రావెలింగ్‌కే ఖర్చయిపోతుంది. అందరూ ఎర్రగడ్డలోనే వుండటం వల్ల సమయం కలిసొస్తుంది. ఇంటి నుంచి సచివాలయానికి క్షణాల్లో వెళ్ళిపోవచ్చు. అలా మిగిలిన సమయాన్ని తెలంగాణ అభివృద్ధి కోసం ఉపయోగించవచ్చు.  ప్రజా ప్రతినిధులుగానీ, అధికారులు గానీ ప్రజా సేవ చేసీ చేసీ విసిగిపోతే వెంటనే పక్కనే వున్న పరేడ్ గ్రౌండ్‌కి వెళ్ళి వాకింగ్ చేస్తే రిలాక్స్ అవ్వొచ్చు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పరేడ్ గ్రౌండ్‌లో వాకింగ్, జాగింగ్ లాంటివి చేయడం వల్ల అందరూ ఆరోగ్యాలను కాపాడుకుని, అలా కాపాడుకున్న ఆరోగ్యాన్ని తెలంగాణ ప్రజల సేవకు వినియోగించవచ్చు. త్వరలోనే బంగారు తెలంగాణ సాధించవచ్చు.

టీ జాక్ అవసరం ఇంకా ఉందా?

  తెలంగాణా ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన తెలంగాణా రాజకీయ జే.యే.సి. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి, తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత నుండి క్రమంగా తన ఉనికిని కోల్పోతూ వస్తోంది. నిజానికి తెలంగాణా రాష్ట్ర సాధన కోసమే ఏర్పడిన టీ-జే.యే.సి. తెలంగాణా రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా కొనసాగాలనుకోవడం వలననే దాని ఉనికి, గౌరవం పోగొట్టుకొంటోందని చెప్పక తప్పదు. రాష్ట్ర విభజన తరువాత తనను రాజకీయ పార్టీలు దగ్గరకు రానీయవని తను ముందే ఊహించానని టీ-జే.యే.సి. చైర్మన్ ప్రొఫెసర్ కోదండ రామ్ చెప్పడమే అందుకు నిదర్శనం.   ఇంతకు ముందు ఆంధ్రా పాలకుల చేతిలో తెలంగాణా రాష్ట్రం దోపిడీకి గురవుతోందని, కనుక మన రాష్ట్రాన్ని మనమే పాలించుకోవాలని తెరాస నేతలు, టీ-జే.యే.సి. నేతలు వాదించే వారు. ఇప్పుడు తెలంగాణా రాష్ట్రాన్ని వారే పరిపాలించుకొంటున్నారు. తెలంగాణా ప్రభుత్వం తన ప్రజల కోసం అనేక భారీ అభివృద్ధి, సంక్షేమ పధకాలు రూపొందించి వాటిలో కొన్నిటిని అమలు చేస్తోంది కూడా. అయినా కూడా టీ-జే.యే.సి. నేతలు మాత్రం దానిని నేటికీ రద్దు చేయాలనుకోవాలనుకోవడం లేదు. అయితే దానిని ఇంకా కొనసాగించేందుకు వారికి సరయిన కారణాలు మాత్రం లేవు. కానీ ఒక్కటే కారణం కనిపిస్తోంది. ఇంతకాలం టీ-జే.యే.సి. వలననే వారికి తెలంగాణాలో ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం దక్కాయి. అందుకే దానిని ఇంకా కొనసాగిస్తున్నారని భావించవలసి ఉంటుంది.   వారు అధికార తెరాసను, దాని అధినేత కేసీఆర్ ను ప్రశ్నించే సాహసం చేయలేకపోవడం వలన ప్రజల దృష్టిలో చులకనయిపోయారు. ఇటీవల రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజ్రుంభించి అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు కూడా టీ-జే.యే.సి. నేతలెవరూ నోరు విప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం చేయలేకపోయారు. అలాగని తెలంగాణ ప్రభుత్వాన్ని వెనకేసుకొని రాలేకపోవడం చేత వారిని తెరాస పార్టీ కూడా దగ్గరకు రానీయ లేదు. దానితో వారు ప్రజలకీ, ప్రభుత్వానికి కూడా కాని వారయిపోయారు. క్రమంగా వారి ఉనికి కూడా ప్రశ్నార్ధకంగా మారిపోయింది.   అయినప్పటికీ టీ-జే.యే.సి. ద్వారా తమకు సమాజంలో వచ్చిన ప్రత్యేక గుర్తింపును వదులుకోలేని వారి బలహీనత కారణంగానే వారు నేటికీ దానిని సజీవంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దాని వలన వారు నానాటికీ ప్రజల, ప్రభుత్వం దృష్టిలో మరింత చులకన అవుతున్నారనే సంగతిని మాత్రం గ్రహించలేకపొతున్నారు. హైదరాబాదులో నిన్న సమావేశమయిన టీ-జే.యే.సి. నేతలు ఇకపై ప్రభుత్వానికీ, ప్రజలకీ మధ్య వారధిగా పనిచేయాలని నిశ్చయించుకొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాలు, ప్రాజెక్టుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, అదేవిధంగా వాటి గురించి ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని వారు నిర్ణయించుకొన్నారు.   ప్రభుత్వం తరపున వారు ప్రచారం చేసి దాని మెప్పు పొందదలచుకొంటే ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చును. కానీ ప్రజాభిప్రాయం పేరిట తన ప్రభుత్వానికి ఉచిత సలహాలు, సూచనలు చేసేందుకు ప్రయత్నిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని దూరంగా అట్టేబెట్టడం తధ్యం.

జగన్ రూటు మార్చాడా?

పాపం జగన్.. గత ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేస్తానని కలలు కన్నాడు. దేవుడికి దణ్ణాల మీద దణ్ణాలు పెట్టాడు. తాను నమ్మే దేవుణ్ణి కూడా తన రాజకీయాల కోసం ఉపయోగించుకున్నాడు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వున్న చర్చ్‌లను వైకాపా ప్రచార కేంద్రాలుగా తీర్చిదిద్దాడు. తనను కూడా రాజకీయాల్లోకి లాగినందుకు ఆ ప్రభువు ఆగ్రహించాడో ఏమోగానీ జగన్ పరిస్థితి తెలంగాణ ఖాళీ అయితే, ఆంధ్రప్రదేశ్‌లో అంత సీన్ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆయన తాను నమ్మిన దేవుడికి దూరంగా జరుగుతూ, హిందూ సంప్రదాయాలకు దగ్గరవుతున్నారా అనే సందేహాలు ఆయన వ్యవహార శైలిని చూస్తే కలుగుతున్నాయి. జగన్ కుటుంబం ఆయన తాత రాజారెడ్డి హయాంలోనే క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. అప్పటి నుంచి ఆ కుటుంబం క్రైస్తవాన్నే అనుసరిస్తోంది. జగన్ బావగారు అనిల్ అయితే స్వయానా క్రైస్తవ మత ప్రచారకుడు. సాధారణంగా క్రైస్తవులు తమ మతాన్ని తాము గౌరవించుకుంటూ ఇతర మతాలను కూడా గౌరవిస్తారు. అయితే, జగన్‌కి హిందూ మతం మీదగానీ, హిందూ ఆచార వ్యవహారాల మీద గానీ అంత గౌరవం లేదన్న విమర్శలు వినిపిస్తూ వుంటాయి. దీనికి ఉదాహరణగా గతంలో జరిగిన కొన్ని ఘటనలను కూడా చెబుతూ వుంటారు. ఈ సారు గతంలో తిరుమల దేవాలయానికి వెళ్ళిన సమయంలో చెప్పులు వేసుకునే వెళ్ళారని, అన్య మతస్తులు తిరుమల దేవాలయానికి వెళ్ళాలంటే డిక్లరేషన్ మీద సంతకం చేయాలి. అలాంటి సంప్రదాయాన్ని పాటించకుండానే ఆయన దేవాలయంలోకి వెళ్ళారని విమర్శలు వున్నాయి. అలాగే తిరుమలలో స్వామివారి కీర్తనం తప్ప మరొకరి కీర్తన జరగడానికి వీల్లేదు. అలాంటి తిరుమలలో తనకు జేజేలు కొట్టించుకున్న ఘనత కూడా జగన్ సార్‌కి వుంది. ఇలా హిందూ మతం మీద ఇంతటి చిన్న చూపు వున్న జగన్ ఇప్పుడు సడెన్‌గా రూటు మార్చినట్టు అనిపిస్తోంది. హిందూ సంప్రదాయాల మీద గౌరవం పెరిగిపోయినట్టు కనిపిస్తోంది. మంగళవారం నాడు విశాఖ పర్యటనకు వెళ్ళిన జగన్ సింహాచలం దేవాలయానికి వెళ్తున్నారని, ఆ తర్వాత విశాఖ శ్రీ శారదా పీఠానికి వెళ్ళి అక్కడ జరిగే యజ్ఞంలో కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఇది నిజంగా వింతే. జగనేంటి.. ఇలా హిందూ సంప్రదాయాలను ఆచరించడమేంటని పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు. జగన్ ఇలా సింహాచలం దేవాలయానికి వెళ్ళడం, శారదా పీఠం యజ్ఞంలో పాల్గొనడం వెనుక రెండే కారణాలు ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మొదటిది... జగన్ మీద ఇప్పటికే హిందూ వ్యతిరేకి ముద్ర బాగా బలంగా పడిపోయింది. ఆ ముద్రని తొలగించుకోవడం కోసమే ఇలా చేస్తూ వుండొచ్చు. రెండోది... వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి రావాలంటే తన శక్తి సరిపోదని జగన్‌కి క్లియర్‌గా అర్థమైపోవడంతో ఇక హిందూ దేవుళ్ళని, యజ్ఞాలని నమ్ముకుంటున్నాడు. మొదటిదైనా, రెండోదైనా మొత్తానికి అధికారం కోసమే జగన్ రూటు మార్చినట్టు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఉపరాష్ట్రపతి ఎందుకు సెల్యూట్ చేయలేదు?

  సోమవారం నాడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి జాతీయ జండాను ఎగురవేసిన అనంతరం అందరూ జాతీయ గీతాన్ని పాడే సమయంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ సెల్యూట్ చేయకపోవడం వివాదాస్పదమైంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తుండగా, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మాత్రం మామూలుగా నిలబడి వున్నారు. ఈ ఫొటో సోమవారం నాడు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. విమర్శలూ వెల్లువెత్తాయి. దీనిమీద ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రొటోకాల్ ప్రకారం జాతీయ గీతాలాపన సమయంలో ఉప రాష్ట్రపతి సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. కార్యక్రమంలో ప్రధాన హోదాలో ఉన్నవారు, యూనీఫామ్‌లో ఉన్నవారు ఈ సమయంలో సెల్యూట్ చేయాలి. సాధారణ దుస్తుల్లో వున్నవారు సావధానంలో నిలబడితే చాలు. సర్వ సైన్యాధ్యక్షుడి హోదాలో ఉన్న రాష్ట్రపతి సెల్యూట్ చేశారు. ఉపరాష్ట్రపతి సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. హమీద్ అన్సారీకి దేశం ఇంత ఇచ్చింది. జాతీయ పతాకానికి సెల్యూట్ చేయొచ్చు కదా. ఈ విషయంలో కూడా ప్రొటోకాల్ అని వివరణలు ఇచ్చుకోవడం ఎందుకనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇది తెరాస ప్రభుత్వమా? లేక తెదేపా ప్రభుత్వమా?

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంద్ర ప్రభుత్వాన్ని, తెదేపా దాని మంత్రులను, నేతలను ఎంతగా విమర్శిస్తున్నప్పటికీ ఒకప్పుడు తనకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించిన తెదేపా పట్ల ఆయనకు చాలా మమకారం ఉన్నట్లే కనబడుతోంది ప్రస్తుత మంత్రివర్గం చూస్తుంటే. ఆయన స్వయంగా తెదేపా నుండి వచ్చిన మనిషి. స్వైన్ ఫ్లూ దెబ్బకి టి.రాజయ్య ఉపముఖ్యమంత్రి పదవి కోల్పోతే, ఆయన స్థానంలోకి ఇప్పుడు తెదేపా నుండి వచ్చిన కడియం శ్రీహరికి అవకాశం దక్కింది.   ఇక ఇంతకుముందే కేసీఆర్ మంత్రివర్గంలో తెదేపా నుండి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావు, అజ్మీరా చందూలాల్ మరియు పి. మహేంద్ర రెడ్డి చేరారు. వారు కాక జోగు రామన్న, తీగల కృష్ణారెడ్డి, గంగుల కమలాకర్, రమణాచారి, ఇంద్ర కరణ్ రెడ్డి వంటి అనేకమంది తెదేపాకు చెందిన నేతలు అందరూ తెరాస గొడుగు క్రిందకి వచ్చి జేరడంతో ఇప్పుడు తెరాస నేతలకి చోటు మిగలడం లేదు. వారి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ మళ్ళీ తెదేపా నేతలందరూ ఈవిధంగా ఒకచోట చేరడంతో తెలంగాణాలో కూడా తమ పార్టీయే అధికారంలోకి వచ్చినట్లుందని తెదేపా తమ్ముళ్ళు తెగ సంబరపడిపోతుంటే తెరాస నేతలకు ఏమనాలో అర్ధం కావడం లేదు.

తిరుపతి ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పోటీకి సిద్దం

  తిరుపతి తెదేపా యం.యల్యే వెంకట రమణ మృతి కారణంగా జరుగనున్న ఉప ఎన్నికలలో తెదేపా ఆయన భార్య సుగుణమ్మను పార్టీ అభ్యర్ధిగా ప్రకటించి, ఆమె ఏకగ్రీవ ఎన్నిక కొరకు సహకరించవలసిందిగా కాంగ్రెస్, వైకాపా మరియు ఇతర పార్టీలని కోరింది. అందుకు వైకాపా సానుకూలంగా స్పందించింది. కానీ కాంగ్రెస్ పార్టీకి గత రెండు ఉప ఎన్నికలలో తల బొప్పి కట్టినప్పటికీ, మళ్ళీ ఇప్పుడు కూడా పోటీకి సిద్దమయింది.   ఒక రాజకీయ పార్టీ ఎన్నికలలో పాల్గొనడాన్ని ఎవరూ తప్పుపట్టకపోయినప్పటికీ, ఏదయినా ఒక పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి చనిపోతే ఆ స్థానాన్ని ఆ పార్టీ అభ్యర్ధికే విడిచిపెట్టే సత్సంప్రదాయాన్ని రాష్ట్రంలో అన్ని పార్టీలు పాటిస్తున్నప్పుడు, దానిని కాదని పోటీ చేస్తున్నందునే ఆ పార్టీ విమర్శలు ఎదుర్కొంటోంది. చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు కె. వేణుగోపాల్ రెడ్డి తమ పార్టీ అభ్యర్ధిగా రుద్రమరాజు శ్రీదేవి పేరును ప్రకటించారు.   ఇంతకు ముందు తెదేపా కార్యకర్తగా పనిచేసిన ఆమె రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలిసి ఉన్నప్పటికీ ఆమె కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసారు. అప్పటి నుండి పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. గాలికిపోయే పేలాలు కృష్ణార్పణం అన్నట్లుగా, ఈ ఉప ఎన్నికలలో గెలిచే అవకాశం ఎలాగూ ఉండదని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ డ్వాక్రా సంఘాల అధ్యక్షురాలయిన ఆమెకు ఉదారంగా టికెట్ కేటాయించింది. తిరుపతి నియోజక వర్గంలో ఉన్న డ్వాక్రా సంఘాలతో ఆమెకున్న పరిచయాల కారణంగా ఆమెకు విజయావకాశాలు ఉంటాయనే ఆలోచనతోనే ఆమెను బరిలోకి దించినట్లు కనబడుతోంది.   ఒకవేళ ఈ ఎన్నికలలో ఆమె ఓడిపోతే, దానిని ఆమె పద్దులోనే వ్రాసేయవచ్చును. దాని వలన కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టమూ కూడా ఉండబోదు. కానీ ఆమె గెలిస్తే మాత్రం దానిని ‘అధికార తెదేపా ప్రభుత్వంపై ప్రజలలో మొదలయిన వ్యతిరేకత’ అని కాంగ్రెస్ పార్టీ టాంటాం చేసుకొనే సౌలభ్యం ఉంటుంది. బహుశః అందుకే పార్టీలో సీనియర్లను కాదని ఆమెకు అవకాశం కల్పించారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు ఏవయినప్పటికీ, ఇది ఆమెకు అందివచ్చిన అపూర్వ అవకాశమేనని చెప్పవచ్చును. ఒకవేళ ఆమె ఈ ఎన్నికలలో గెలవగలిగినట్లయితే ఆమెకు మళ్ళీ తెదేపా నుండో లేకపోతే బీజేపీ నుండో పార్టీలో చేరమని ఆహ్వానం అందినా ఆశ్చర్యం లేదు.   అయితే ఈ ఉపఎన్నికలలో తెదేపాకు గట్టి పోటీనివ్వగల వైకాపా పోటీలో లేదు. లోక్ సత్తాతో బాటు మరి కొందరు స్వతంత్ర అభ్యర్ధులు బరిలో ఉన్నప్పటికీ వారు ఓట్లు చీల్చగలరేమో గానీ తెదేపాకు గట్టి పోటీ ఇవ్వలేరు. కనుక తెదేపా అభ్యర్ధి సుగుణమ్మకే విజయావకాశాలున్నాయని భావించవచ్చును. కానీ కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీదేవి నుండి ఆమె గట్టిపోటీయే ఎదుర్కోవలసి రావచ్చును.

అమెరికా అధ్యక్షుడి ఆగ్రా పర్యటన రద్దు సాధారణ విషయమా?

  అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా భద్రతా కారణాల దృష్ట్యా తన ఆగ్రా పర్యటనను రద్దు చేసుకొన్నారని ఆయన యొక్క భద్రతా సిబ్బంది ఒక ప్రకటన విడుదల చేసింది. కనుక ఆయన పర్యటన మూడు రోజులకు బదులు ఇప్పుడు రెండు రోజులతోనే ముగుస్తుంది. ఇది చాలా సాధారణమయిన వార్తలా పైకి కనిపిస్తున్నప్పటికీ, చాలా తీవ్రమయిన విషయంగా పరిగణించవలసి ఉంటుంది.   ప్రపంచంలో కెల్లా అత్యంత శక్తిమంతుడు, అత్యాధునిక భద్రతా సౌకర్యాలు గల అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా కూడా భద్రతా కారణాల దృష్ట్యా ఆగ్రాలో తాజ్ మహల్ ని సందర్శించేందుకు వెనకాడవలసి వచ్చిందంటే పరిస్థితి తీవ్రత అర్ధమవుతుంది. ఒబామా భారత్ పర్యటన సందర్భంగా పాక్ ఉగ్రవాదులు భారత్ లో ప్రధాన నగరాలలో ఎక్కడయినా ఎప్పుడయినా దాడులకు పాల్పడే ప్రమాదం పొంచి ఉందని భారత, అమెరికా నిఘా వర్గాలు పదే పదే హెచ్చరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ చాల కట్టుదిట్టమయిన భద్రత గల అమెరికా అధ్యక్షుడు కూడా ఉగ్రవాదుల దాడులకు భయపడి తన పర్యటనను రద్దు చేసుకోవడం ఆయనకు, ఆయనకు రక్షణ కల్పించలేని భారత ప్రభుత్వానికీ, ఆయనను కంటికి రెప్పలా కాపాడుకొంటున్న అమెరికా భద్రతా దళాలకు కూడా ఇది సిగ్గు చేటే.   అంతేకాదు భారత్ పై ఉగ్రవాదుల నీడలు ఎంతగా కమ్ముకొన్నాయనే విషయం ఇప్పుడు ఆయనకు కూడా బాగానే అర్ధమయ్యే ఉండాలి. ఆయన నేల మీద కాలు మోపక ముందే నేల మీదే కాకుండా నింగిలో కూడా అత్యాధునిక విమానాలు వేసుకొని డేగ కళ్ళతో పహారా కాసే అత్యాధునిక రక్షణ కవచం కలిగి ఉన్న అమెరికా అధ్యక్షుడే ఆగ్రాలో అడుగుపెట్టే సాహసం చేయలేకపోయారంటే ఇక దేశంలో ఎటువంటి రక్షణ లేనీ సాధారణ పౌరుల మాటేమిటి?   అమెరికా అధ్యక్షుడికి అపారమయిన భద్రతా వ్యవస్థ ఉంది కనుక ఉగ్రవాదులు ఆ పరిసర ప్రాంతాలను కన్నెత్తి చూడలేకపోవచ్చును. కానీ కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు పరుచుకొని ఉన్న విశాలమయిన భారత దేశంలో ఉగ్రవాదులు దాడి చేయకుండా అడ్డుకోగల శ్రద్ధ, నేర్పు, నైపుణ్యం, అత్యాధునిక పరిజ్ఞానం భారత భద్రతా దళాలకు ఉందా? ఉంటే అమెరికా అధ్యక్షుడు ఆగ్రా ఎందుకు సందర్శించేందుకు వెనుకాడుతున్నారు?   ఉగ్రవాదంపై పోరు కోసం అంటూ అమెరికా ప్రతీ ఏటా కొన్ని లక్షల డాలర్లు పాకిస్తాన్ కి అందజేస్తోంది. అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ బయలుదేరే ముందు పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించకూడదని ఒక హుకూం కూడా జారీ చేసారు. కానీ ఈ పరిస్థితి చూసకయినా పాకిస్తాన్ తన దుశ్చర్యలు మానుకోదని, దాని ఆగడాలకు గత ముప్పై ఏళ్లుగా భారత్ ఎన్ని బాధలు పడుతోందనే విషయం ఆయనకి అర్ధం అయితే చాలు.

జంప్ జిలానీల పరిస్థితి రెంటికీ చెడిన రేవడి కాబోతోందా?

  కొన్ని రోజుల క్రితం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జి.హెచ్.యం.సి.) కి ఎన్నికలు నిర్వహించాలనుకొంటున్నట్లు తెలిపి అందుకోసం తగిన వ్యూహాలు సిద్దం చేసుకోమని ఆదేశించారు. హైదరాబాద్ జంట నగరాల నుండి త్వరలో 20మంది కార్పొరేటర్లు తెరాసలో జేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. అయన అన్న మాటలను నిజం చేస్తూ ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ లో తెదేపా ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డితో బాటు మరో ఐదుగురు తెదేపా కార్పొరేటర్లు తెరాసలో జేరారు. కనుక నేడు కాకపోతే రేపయినా బహుశః మిగిలిన వారు కూడా జంప్ అయిపోయే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది. ఇప్పటికే తెదేపాకు చెందిన సీనియర్ నేతలు తీగల, శ్రీనివాస్ యాదవ్ తదితరులు తెరాస కండువాలు కప్పుకొన్నారు.   వారందరూ కలిసి జి.హెచ్.యం.సి. ఎన్నికలలో తెరాస పార్టీకి అఖండ విజయం సాధించిపెడతారనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ వారినందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్న సంగతి వారికీ తెలుసు. అందుకోసమే తలసాని శ్రీనివాస్ యాదవ్ కి మంత్రి పదవి కూడా దక్కిందని అందరికీ తెలుసు. వారందరికీ హైదరాబాద్ పై మంచి పట్టున్న మాట వాస్తవం. కానీ తెలంగాణా నేతలయిన వారందరికీ ఇంతకాలం జంట నగరాలలో స్థిరపడిన ఆంద్ర ప్రజలు ఎందుకు ఓట్లువేసి గెలిపిస్తున్నారు? అనే ప్రశ్న వేసుకొంటే వారందరూ తెలుగుదేశం పార్టీకి చెందినవారయినందునేనని స్పష్టం అవుతుంది. కానీ వారిప్పుడు తెలుగుదేశం పార్టీని వీడి ఆంధ్రప్రజలను, ప్రభుత్వాన్ని నిత్యం విమర్శిస్తూ, వ్యతిరేకించే తెరాస పార్టీలో చేరిన తరువాత కూడా జంటనగరాలలో ఆంద్రప్రజలు వారికే ఓటువేస్తారా? అని ప్రశ్నించుకొంటే బహుశః వేయకపోవచ్చనే సమాధానం వస్తుంది. వారందరూ తెరాసకు తమ సాంప్రదాయమయిన ఆంద్ర ఓటు బ్యాంకును ఖచ్చితంగా బదిలీ చేస్తారనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ వారినందరినీ నెత్తిన పెట్టుకొంటున్నారు. కానీ వారివల్ల అది సాధ్యం కాదని తేలితే, అప్పుడూ వారిని కేసీఆర్ గౌరవిస్తారా? ఇవ్వకపోతే వారి పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించుకొంటే ‘రెంటికీ చెడిన రేవడి’అని చెప్పుకోవలసి వస్తుందేమో? అటు ఎన్నికలలో గెలిచే అవకాశం కోల్పోయి, ఇటు తెరాసలో నిరాదరణకు గురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.   వారు తెరాసకు తమ ఆంధ్రా ఓటు బ్యాంకును బదలాయించలేరని గ్రహించిన మరుక్షణం కేసీఆర్ ప్రత్యామ్నాయంగా కనబడుతున్న వైకాపాను దగ్గిరకు తీసుకోవచ్చును. తెలంగాణాలో మళ్ళీ దుఖాణం తెరవాలని తహతహలాడుతున్న వైకాపా కూడా ఈ అవకాశాన్ని జారవిడుచుకోకపోవచ్చును.   ఇదే జరిగితే తీవ్రంగా నష్టపోయేది తెదేపా నుండి తెరాసలోకి జంప్ చేస్తున్న నేతలే. ఎందుకంటే వారు ఖాళీ చేసిన స్థానాలలోకి తెదేపా, బీజేపీలు తమ అభ్యర్ధులను నిలబెడతాయి కనుక ఇంతవరకు సాంప్రదాయంగా వారికి పడుతున్న ఆంధ్రా ఓట్లన్నీ కూడా తెదేపా, బీజేపీ లేదా వైకాపా అభ్యర్ధులకే పడవచ్చును. అందువలన మిగిలినవారయినా ఆచి తూచి అడుగువేయడం మంచిదేమో?

గ్రేటర్ ఎన్నికలకు టీఆర్ఎస్ రెడీ

  ఏప్రిల్ నెలలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జి.హెచ్.యం.సి.) ఎన్నికలు నిర్వహించాలను కొంటున్నట్లు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. తెదేపా నుండి తెరాసలో చేరి మంత్రి పదవి స్వీకరించిన శ్రీనివాస్ యాదవ్ రాజీనామాను స్పీకర్ ఆమోదించినట్లయితే, మళ్ళీ సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు అనివార్యమవుతాయి. కనుక పార్టీ నేతలను అందుకోసం సన్నాహాలు మొదలుపెట్టమని ఆయన ఆదేశించారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా హైదరాబాద్ జంట నగరాలు మరియు చుట్టుపక్కల నివసించే ప్రాంతాలలో స్థిరపడిన ఆంద్రప్రజల ఓట్లను పొందాలంటే అంత వీజీ కాదని ఆయనకీ తెలుసు. ఎందుకో అందరికీ తెలుసు. కనుక కారణాలు మళ్ళీ ఏకరువు పెట్టనవసరం లేదు.   అందుకే ఆయన ముందు జాగ్రత్తగా హైదరాబాద్ లో తెదేపాకు చెందిన కొందరు యం.యల్యేలను పార్టీలోకి రప్పించారు. అంతే కాకుండా ఖమ్మం జిల్లాకు చెందిన తెదేపా నేత తుమ్మల నాగేశ్వర రావును కూడా పార్టీలోకి రప్పించుకొన్నారు. మెట్రో రైల్ మార్గాన్ని అష్టవంకరలు తిప్పి మజ్లిస్ పార్టీని మచ్చిక చేసుకొనే ప్రయత్నాలు కూడా చాలానే చేసారు. ఈ మధ్యన ఆయన కొందరు మంత్రులను వెంటేసుకొని రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుతో ఆరు గంటలసేపు ముచ్చట్లు కొట్టి, ఆయనను పొగిడింది కూడా ఆంద్రప్రజలను, హైదరాబాద్ లో ఉన్న బలమయిన ఆయన సామాజిక వర్గానికి చెందిన ప్రజలను, పారిశ్రామికవేత్తలను పడేయడానికేనని మీడియా కోడై కూస్తోంది.   ఇక హైదరాబాదు జంట నగరాలలో నివసించే పేదలకి 125 గజాల భూమి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడం, అన్ని కులాలు, మతాల వారికీ ప్రార్ధన మందిరాలు, సామాజిక భవనాలకి శంఖు స్థాపనలు వంటి అనేక కార్యక్రమాలు కూడా పెట్టుకొన్నారు. కానీ ఇన్ని చేసినా ఈ ఆంద్ర జనాలు తెరాసకు ఓటేస్తారో లేదో? అనే అనుమానం మనసులో పీకుతూనే ఉంటుంది.   అందుకే వారితో బాగా టచ్చు ఉన్నమాజీ తెదేపా నేతలు హైదరాబాద్ లో ఉంటూ తెరాసకు ఓటేయడమే బెటర్ కదా..తెరాసకి ఓటేస్తే మిమ్మల్ని బాగా చూసుకొంటుంది. తెరాస ఆంధ్రా పాలకులనే తప్ప ఆంద్ర ప్రజలని కాదని కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆంధ్ర జనాలు కన్విన్స్ అవుతారో లేదో ఎన్నికలు పెడితేగానీ తెలియదు. కానీ కంటోన్మెంట్ ఎన్నికలలో ఓటేశారు గాబట్టి జి.హెచ్.యం.సి. ఎన్నికలలో కూడా డెఫినెట్ గా మనకే ఓటేస్తారని తెరాస ఆశ.