ట్యాపింగ్ కేసులో పట్టు బిగుస్తోంది

ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో ఎలా వ్యవహరించబోతోందా అనే విషయం అస్పష్టంగా వుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ట్యాపింగ్ వ్యవహారంలో పట్టు బిగిస్తోంది. హైదరాబాద్‌లో, అది కూడా టీఆర్ఎస్ కార్యాలయం ఆవరణలో వున్న టీ న్యూస్ కార్యాలయంలోకి అర్ధరాత్రి సమయంలో ఏపీ పోలీసులు వెళ్ళి నోటీసులు ఇచ్చి వచ్చారంటే, ఈ కేసు విషయంలో ఏపీ ఎంత పట్టుదలగా వుందో, పట్టును పెంచుకుంటోందో అర్థమవుతోంది. టీ న్యూస్‌తో ఆగకుండా సాక్షి ఛానల్‌కి కూడా నోటీసులు ఇవ్వడం ఈ కేసు విషయంలో ఏపీ పోలీసులకు వున్న ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలిస్తోంది. అక్కడితో ఏపీ పోలీసులు ఆగలేదు. మరో పెద్ద ముందడుగు వేశారు. 12 మంది సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేశారు. సోమవారం లోగా తమకు ట్యాపింగ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని నోటీసులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం తమ మీద ఇంత త్వరగా దాడి చేస్తుందని సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఊహించలేదు. వీళ్ళకు ఇచ్చిన నోటీసులలో భాగంగా ఇచ్చిన ప్రశ్నావళి సర్వీస్ ప్రొవైడర్ల కళ్ళు తిరిగేలా చేసింది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇస్తే ఇక ఈ కేసులో ప్రత్యేకంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రశ్నావళి అంత పకడ్బందీగా వుంది. ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఈ ఘనకార్యంలో పాలు పంచుకున్నారని, ఈ వ్యవహారం మొత్తాన్ని ఇల్లీగల్‌గా చక్కబెట్టారని, టార్గెట్ చేసిన వ్యక్తులతోపాటు వారికి సంబంధించిన వ్యక్తుల ఫోన్లను కూడా గుట్టు చప్పుడు కాకుండా ట్యాప్ చేశారని, ఈ విషయంలో సర్వీస్ ప్రొవైడర్లను కూడా బెదిరించారని ఏపీ పోలీసులు కనుగొన్నారని తెలుస్తోంది. అందుకే ఇంత దూకుడు ప్రదర్శిస్తున్నారని సమాచారం.

ఈ ఐక్యత అప్పుడేమయింది?

తెలంగాణ జర్నలిస్టుల్లో వెల్లువెత్తి ఉరకలు వేస్తున్న ఐకమత్యాన్ని చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోయి, కళ్ళలోంచి ఆనందబాష్పాలు జలజలా రాలుతున్నాయి. తెలంగాణ పోరాటం సందర్భంగా టీ జర్నలిస్టులందరూ ఒక్కతాటి మీద నిలిచి ఉద్యమించిన తీరు చూశాం. తెలంగాణ సిద్ధించిన తర్వాత మరోసారి వారి ఐకమత్యాన్ని చూసి తరించే భాగ్యం కలిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి చెందిన టీ-న్యూస్ ఛానల్‌ చంద్రబాబు మాట్లాడిన మాటలంటూ టేపులు ప్రసారం చేసిన కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ ఛానల్‌కి నోటీసులు ఇచ్చారు. ఈ విషయం టి న్యూస్ ఛానల్లో పనిచేసే ఉద్యోగులకు, యాజమాన్యానికి ఆగ్రహం తెప్పించడం సహజం. అయితే ఆ సంస్థలోని ఉద్యోగులు, జర్నలిస్టులతోపాటు ఇతర మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు, జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌కి కూడా ఆగ్రహం పొంగుకొచ్చేసింది. టీ న్యూస్ ఛానల్‌కి నోటీసులు ఇవ్వడం అన్యాయం, అక్రమం, దారుణమంటూ తెలంగాణ జర్నలిస్టులు ఐకమత్యంగా నినదిస్తున్నారు. ఈ ఐకమత్యం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. అయితే ఇదే ఐకమత్యాన్ని, ఇదే ఆగ్రహాన్ని కొంతకాలం పాటు టీవీ9 ఛానల్ మీద, ఇప్పటి వరకూ ఏబీఎన్ ఛానల్ మీద అమలు చేస్తున్న అనధికార నిషేధం విషయంలో ఎందుకు ప్రదర్శించలేదో అర్థం కాని విషయం. ఇప్పుడు టీ న్యూస్ ఛానల్ విషయంలో ఒక్కటై నినదిస్తున్న జర్నలిస్టులు గత సంవత్సరకాలంగా నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఏబీఎన్ ఛానల్ విషయంలో ఎందుకు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారో! మీడియా స్వేచ్ఛ అంటూ ఇప్పుడు నినదిస్తున్న గళాలు ఏబీఎన్ విషయంలో ఎందుకు మూగబోయాయో!

యోగా చేయండి.. హ్యాపీగా వుండండి

  యోగా చేయండి.. మానసికంగా, శారీరకంగా సంతోషంగా వుండండి. బస్... అంతే... ఇంతకంటే యోగా గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. యోగా చేస్తే మానసికంగా, శారీరకంగా సంతోషంగా వుంటాం. ఇది తిరుగులేని సత్యం. ఈ సత్యాన్ని ప్రపంచానికి అందించిన గొప్పతనం మన భారతదేశానిది. మన దేశంలోనే పుట్టిన యోగా కొంతకాలం పాటు మనదేశంలోనే నిర్లక్ష్యానికి గురైంది. ప్రపంచమంతా యోగాను అనుసరిస్తుంటే కళ్ళు తెరిచి మళ్ళీ యోగా చేసే యోగాన్ని భారతదేశం పొందింది. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత చేసిన ఒక గొప్ప పని జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించడం. జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా యోగా చేయడానికి కోట్లాదిమంది ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. మనమూ 21న తప్పకుండా యోగా చేద్దాం. ఆ ఒక్కరోజే కాదు.. రోజూ యోగా చేద్దాం. మన శరీరం కోసం, మన మనసు కోసం... మనకోసం మనం చేసుకునే ఒక మంచి పని యోగా. భారతీయ యోగాని ప్రపంచమంతా 21న ఒక ఉత్సవంలా ఆచరిస్తుంటే, మనదేశంలోని రాజకీయ పార్టీలు మాత్రం ఈ విషయాన్ని కూడా రాజకీయం చేసి ఏమైనా బావుకుందామనం తాపత్రయపడుతున్నాయి. అది ఆయా పార్టీల కుత్సిత బుద్ధికి నిదర్శనం. యోగాకి, సూర్య నమస్కారాలకు కూడా మతం రంగు పులుముతున్నారు. సూర్య నమస్కారాలు ఇతర మతాలవారు చేయకూడదట. అలా చేయాలని ప్రభుత్వం నిర్బంధపెడుతోందట.. ఇలాంటి దుష్ప్రచారం చేయడానికి ఆ పార్టీలకు... ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మనసెలా వస్తోందో అర్థం కావడం లేదు. సూర్యుడు హిందువులకు మాత్రమే దైవమా? ప్రపంచంలోని అందరికీ దైవం.. ఆసక్తికులకు మాత్రమే కాదు.. నాస్తికులకు ఆయనే ప్రత్యక్ష దైవం. అలాంటి సూర్యుడి హిందువులకు ఇచ్చేసినందుకు హిందువులు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు చెప్పాలా? వద్దండి... ఈ రాజకీయాల జోలికి మనం వెళ్ళొద్దు.. ఆ పార్టీలను వాళ్లు సృష్టించిన మురికి కూపాల్లోనే జీవచ్ఛవాల్లా వుండనిద్దాం. మనం మాత్రం  చక్కగా 21న ప్రపంచంలోని కోట్లాదిమందితోపాటు మనం కూడా యోగా చేద్దాం.. ఆ తర్వాత కూడా ప్రతి రోజూ యోగా చేద్దాం... శారీరకంగా, మానసికంగా సంతోషంగా వుందాం.

అబ్బో.. రోషం పొడుచుకొచ్చిందే...

  ఓ బిచ్చగాడికి ఒకరోజున ఎవరూ బిచ్చం వేయలేదట.. కడుపు మండిపోయిన ఆ బిచ్చగాడు ‘‘ఎప్పుడూ బిచ్చం వేయని తల్లి ఎలాగూ బిచ్చం వేయలేదు.. రోజూ బిచ్చం వేసే (ఇక్కడ బూతు) కూడా ఈరోజు బిచ్చం వేయలేదు’’  అని తిట్టుకున్నాడట. ప్రస్తుతం ఒక పెద్దమనిషి వ్యవహారం కూడా అలాగే వుంది. గతంలో ఆయన్ని ఒక వర్గం వారు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. వివిధ సందర్భాల్లో వాళ్ళు  ఆయనగార్ని తిట్టిన తిట్లన్నీ రికార్డు చేసి ఒకేసారి విన్నామంటే కర్ణభేరి పగిలిపోవడం ఖాయం. ఆ రోజుల్లో ఆయన అంతలా తిట్లు తిన్నా ఏనాడూ కిక్కురుమనలేదు. అసలు వాళ్ళు తిడుతోంది తనను కాదన్నట్టుగానే కూల్‌గా వుండేవారు. అయితే ఆ పెద్దమనిషిని ఏనాడూ తిట్టి ఎరగని వాళ్ళు ఇప్పుడు కడుపు మండి, ఏదో నోరు జారి ఒక్క మాట అన్నారు. అంతే ఆయనకి రోషం పొడుచుకొచ్చేసింది. అలా తిట్టినవారు బుద్ధి తక్కువైపోయి తిట్టాం క్షమించండి మహప్రభో అని లెంపలు వేసుకునేలా చేసే వరకు ఆయన శాంతించలేదు. తిట్టించుకునే విషయంలో కూడా ఈ పక్షపాతం ఏంటి మహప్రభో!?

దిక్కుమాలిన సలహాలు ఇవ్వొద్దు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య, ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మధ్య తరచుగా వివాదాలు జరుగుతున్నాయి. తలమాసిన వాళ్ళు రూపొందించిన విభజన చట్టం కారణంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులలో ఎవరు సమస్యలు క్రియేట్ చేస్తున్నారో, ఎవరు వాటిని ఎదుర్కొంటున్నారో ప్రత్యేకంగా పేర్లు చెప్పకపోయినా, జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న ఎవరికైనా ఇద్దరు ముఖ్యమంత్రులలో ఎవరు ఎలాంటివారో అర్థమవుతూనే  వుంటుంది. అయితే, వివాదాలు జరిగిన ప్రతిసారీ, కొంతమంది రాజకీయ నాయకులు చక్కగా గట్టుమీద కూర్చుని ఉచిత సలహాలు ఇస్తూ వుంటారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ సంయమనంతో వ్యవహరించాలని దిక్కుమాలిన సలహా ఒకటి పారేసి వినోదం చూస్తూ వుంటారు. చివరికి ఇంత దారుణమైన పరిస్థితులు తలెత్తడానికి మూల కారకులైన కాంగ్రెస్ నాయకులు కూడా చాలా హుందాగా ముఖాలు పెట్టి, ఇద్దరు ముఖ్యమంత్రులూ సంయమనం పాటిస్తే బావుంటుందని గంభీరంగా మాట్లాడుతూ వుంటారు. అసలు వివాదాల్లో మునిగి తేలుతున్న ఇద్దరు ముఖ్యమంత్రుల కంటే, ఇలాంటి దిక్కుమాలిన సలహాలు ఇస్తూ వినోదం చూస్తున్న వారే  రెండు రాష్ట్రాలకు నిజమైన ప్రమాదకారులు. ఆంధ్రప్రదేశ్‌లో వున్న రాజకీయ నాయకులుగానీ, తెలంగాణలో వున్న రాజకీయ నాయకులుగానీ డిప్లొమాటిక్‌గా సలహాలు ఇవ్వడమేగానీ, రెండు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందే సూచనలు చేసినవారు ఎవరైనా వున్నారా? ప్రతి రాజకీయ నాయకుడూ రెండు  రాష్ట్రాల్లో అధికారంలో వున్న పార్టీలను, ముఖ్యమంత్రులను తిట్టడం ద్వారా తమ పార్టీకి లాభం చేకూర్చాలని చూస్తున్నాడే తప్ప నిస్వార్థంగా, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నవారే లేరు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ గొడవలు పడుతూ వుంటే, ఆ గొడవల ద్వారా తామెంత లాభం పొందవచ్చన్న ఆలోచనే పార్టీల్లో వుంది. ఈ గొడవలు తగ్గడం కాకుండా ఇంకా పెరిగితే బావుంటుందనేది ఆ పార్టీల మనసులలో వున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా చేయాల్సింది ఎందుకూ పనికిరాని దిక్కుమాలిన సలహాలు ఇవ్వడం కాదు... రెండు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందడానికి చిత్తశుద్ధితో కృషి చేయడం. అయితే ఇది అత్యాశే.

మెంటలెక్కిస్తున్న రాంగోపాల్ వర్మ

  ఈ రాంగోపాల్ వర్మ తనకు మెంటల్ ఎక్కిందని ప్రూవ్ చేసుకోవడమే కాకుండా తెలుగు జనాలకి కూడా మెంటల్ ఎక్కించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తు్న్నాడు. ఒకప్పుడు సినిమా దర్శకుడిగా జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగినా ఆ తర్వాత నీచ నికృష్ట సినిమాలు తీస్తూ వుండే సరికి బాలీవుడ్ ఆయన్ని తిరిగి టాలీవుడ్‌కి తరిమింది.  ఒకప్పుడు తెలుగులో సినిమాలే తీయనంటూ పోజులు కొట్టిన వర్మ చివరికి తెలుగులోనే దిక్కుమాలిన, నీచ నికృష్టమైన సినిమాలు తీశాడు. మొదట్లో రెండు మూడు సినిమాలకు జనాలు వెళ్ళి థియేటర్లలోనే  డోక్కుని, ఆ తర్వాత వర్మ సినిమాలు ప్రదర్శితమయ్యే థియేటర్ల వైపు కూడా వెళ్ళడం మానుకున్నారు. జనాలు చూడ్డం లేదని తెలిసి కూడా ఎవరో ఒకరి నెత్తిన చెయ్యి పెట్టి సినిమాలు తీస్తే నిర్మాత నెత్తిన గుడ్డ వచ్చేలా చేస్తున్న వర్మ, తన ప్రతాపాన్ని సినిమాలతో ఆపకుండా జనాల మీద కూడా, రాజకీయ రంగం మీద కూడా ప్రదర్శిస్తూ తన శాడిజాన్ని సంతృప్తి పరుచుకుంటున్నాడు. కోతికి కొబ్బరిచిప్ప దొరికిందన్నట్టుగా ఆయనకు ఆ ట్విట్టర్ ఒకటి దొరికింది. దాంట్లో ఆయన తన మురికి బుర్రకి తోచిన కామెంట్లు చేసేస్తున్నాడు. ఈ మీడియా కూడా ఆయన ఏం కూసినా దానికి బోలెడంత పబ్లిసిటీ ఇచ్చి తరిస్తోంది. దేవతల మీద, కేసీఆర్ మీద... ఇలా దేనిమీద పడితే దాని మీద ఎవరి మీద పడితే వాళ్ళ మీద తన దిక్కుమాలిన కామెంట్లు విసురుతున్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పడ్డాడు. ఆయన ఎప్పుడో అన్యాయం జరిగే పోరాటం చేస్తానని అన్నాడట, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అన్యాయాలు జరిగిపోతున్నా లోక కళ్యాణం కోసం పోరాటం చేయడం లేదట... ఈయన చేసే ట్విట్లకి అవతలి వ్యక్తులు స్పందించడం లేదుగానీ, జనాలకే  చిరాకు పుట్టుకొస్తోంది.  ఈయనగారి నస భరించలేక చాలామంది కేసులు వేసినా అవన్నీ ఏ మూలకు వెళ్ళిపోయాయో అర్థం కాని పరిస్థితి. బురదలో దొర్లి బయటకి వచ్చిన వరాహాన్ని అయినా కంట్రోల్ చేయొచ్చేమోగానీ  చాలా రాంగ్‌ పర్సన్‌గా మారిపోయిన రామ్ గోపాల్ వర్మను కంట్రోల్ చేయడం మాత్రం కష్టం అని జనం అనుకునే పరిస్థితి వచ్చింది.

బొత్సది ఐరన్ లెగ్గా?

ఒక్కో రంగంలో ఒక్కో సీజన్లో ఒక్కొక్కరు జనం చేత ‘ఐరన్ లెగ్’ అని ముద్ర వేయించుకుంటారు.  తెలుగు రాజకీయ రంగంలో మొన్నామధ్య కాలంలో ఐరన్‌లెగ్‌గా ముద్ర వేయించుకున్న వ్యక్తి అప్పటి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ. ఆయన లెగ్గు పుణ్యమా అని అటు ఏపీలో, ఇటు తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ మటాషైపోయింది. స్వయంగా ఆయన కూడా తన నియోజకవర్గం చీపురుపల్లిలో జనం చేత చీపురు తిరగేయించుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుని శేష జీవితాన్ని తాను పెట్టుబడి పెట్టిన సినిమాలను చూసుకుంటూ గడిపేస్తే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఏపీ రాజకీయాల్లో చిల్లు కాణీలాగా అయిపోయిన ఆయన్ని జగన్ ఏరి కోరి మరీ తన పార్టీలో చేర్చుకున్నారు. బొత్స రాకను అప్పటి వరకూ పార్టీకి సేవ చేసిన నాయకులు వ్యతిరేకించినా జగన్ వెనుకడుగువేయకుండా బొత్స చేత తన పార్టీలో అడుగు వేయించారు. ఇప్పుడు ఆ అడుగే జగన్ పార్టీకి ‘ఐరన్ లెగ్’ అయిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బొత్స గారు ఏ నిమిషంలో వైసీపీలోకి అడుగుపెట్టారోగానీ, అప్పటికే ఏపీ జనం దృష్టిలో ఎక్కడో అడుగున వున్న ఆ పార్టీ ఇమేజ్ మరింత అట్టడుగుకు వెళ్ళిపోయింది. బొత్స గారి ఆగమనం తర్వాత జగన్ అనేక విచిత్రమైన నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్‌కి మద్దతు ఇవ్వడం అలాంటి ఘోరమైన తప్పిదం ఎవరైనా చేస్తారా? అలా చేసిన వారు ఏపీలో రాజకీయంగా బతికి బట్టకట్టే అవకాశం వుంటుందా? కానీ జగన్ మాత్రం ఆ నిర్ణయం తీసుకున్నారు. దీనికి వెనుక బొత్సగారి సలహా వుందని కూడా తెలుస్తోంది.  చివరికి ఏమైంది. ఏపీలో కొడిగడుతూ వున్న వైసీపీ దీపం టప్పుమని ఆరిపోయింది. ఏపీలో కొన్ని వర్గాల్లో వున్న జగన్ ఓటు  బ్యాంకు పూర్తిగా ఖాళీ అయిపోయింది. మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి  బొత్స గారి ‘లెగ్గు’ కూడా ఒక కారణమా అనే అనుమానాలు ఏపీలో వ్యక్తమవుతున్నాయి.

నరసింహన్ దైవాంశ సంభూతుడు

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్‌గా వున్న మాజీ పోలీసు అధికారి నరసింహన్ గారిని ఎవరూ విమర్శించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన చాలా మంచి మనిషి. ఆయనకు పక్షపాతం అంటే ఎంతమాత్రం తెలియదు. నరసింహన్ చూడ్డానికి మానవుడిలా అనిపిస్తారు గానీ, ఆయన దైవాంశ సంభూతుడు. ఇంకా మాట్లాడితే సాక్షాత్తూ దేవుడే ఈ భూమ్మీదకు నరసింహన్ గారి రూపంలో వచ్చాడు. అలాంటి వ్యక్తి అసలు ఒక రాష్ట్రానికి అనుకూలంగా, మరో రాష్ట్రానికి వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తారు? నరసింహన్ గారిని విమర్శించొద్దని అన్నాం కదా అని పొగడాలని ప్రయత్నించేరు... ఆయనకు పొగడ్తలంటే అస్సలు ఇష్టం వుండదు. పొగడకుండా ఆయన కాళ్ళమీద పడిపోయి కాకాపట్టాలని అనుకుంటున్నారా? ఆ పప్పుడూ ఉడకవు. ఆయన తన కాళ్ళమీద ఎవరు పడినా వారిని అస్సలు పట్టించుకోరు. అలా కాళ్ళ మీద పడిన వారికి అనుకూలంగా అస్సలు వ్యవహరించరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా వున్నప్పుడుగానీ, ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు గానీ ఆయన వ్యహరిస్తున్న తీరు సూపర్. ముఖ్యంగా ఏపీ, తెలంగాణల మధ్య ఏర్పడుతున్న వివాదాలను ఆయన తనదైన శైలిలో చిటికెలో పరిష్కరిస్తున్నారు. అందుకే రెండు రాష్ట్రాల ప్రజలు ఆయనని ఎంతో గౌరవిస్తున్నారు. ఆయన తమకు గవర్నర్‌గా ఇంకా చాలాకాలం కొనసాగాలని కోరుకుంటున్నారు. మరి అంత మంచి మనిషిని, సమర్థుడైన గవర్నర్ని ఎవరూ అస్సలు ఎంతమాత్రం విమర్శించకూడదు.

కేసీఆర్ పాదాభివందన ప్రహసనం

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాదాభివందనాల ప్రహసనం ఇప్పుడు వివాదాస్పదమైంది. నిజాం ప్రభుత్వ కాలంలో, ఆ తర్వాత తెలంగాణ ప్రజల చేత ‘బాంచన్ నీ కాల్మొక్తా దొరా’ అనిపించుకున్న దొరల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న  ఆయన ఇప్పుడు పాదాభివందనాలు చేస్తూ బిజీగా వున్నారు. పాదాభివందనాలు చేయించుకోవడమే తప్ప చేయడం ఎరుగని దొరల బిడ్డ కేసీఆర్ ఇప్పుడు నడుం వంచి పాదాభివందనాలు చేస్తూ జనాలు షాకయ్యేలా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు వరకూ ఆయన ఎవరికీ పాదాభివందనాలు చేసిన దాఖలాలు లేవు. అయితే మాటల్లో మాత్రం చాలామందికి పాదాభివందనాలు చేశారు. ఉద్యమకారులకు పాదాభివందనాలనో, అమరవీరులకు పాదాభివందనాలనో అనడం మామూలే. అయితే ఫిజికల్‌గా పాదాభివందనాలు చేయడం అనేది తెలంగాణ రాష్ట్రం సిద్ధించాకే జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం బిల్లుకు ఆమోదం పొందగానే కేసీఆర్ ఢిల్లీ వెళ్ళిపోయి సోనియాగాంధీ కాళ్ళమీద దఢేల్మని పడిపోయారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన సమయంలో కూడా కేసీఆర్ ఆయన కాళ్ళమీద బొక్కబోర్లా పడిపోయారు. మొన్నామధ్య ఆయనకు చిన్నప్పుడు చదువు చెప్పిన గురువు కనిపించగానే ఆయన కాళ్ళకు దణ్ణం పెట్టేశారు. అఫ్‌కోర్స్ అది మంచి పనే అనుకోండీ...! అయితే ఆయన లేటెస్ట్‌గా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కి కూడా పాదాభివందనం చేసేశారు. ఇలా ఒక గవర్నర్‌కి పాదాభివందనం చేసిన మొదటి ముఖ్యమంత్రిగా కూడా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోనున్నారు. కేసీఆర్ చేసిన పాదాభివందనంతో ఖుషీ అయిపోవడం వల్లే గవర్నర్ పూర్తిగా తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు భారీ స్థాయిలో వినిపిస్తున్నాయి. అలాగే కేసీఆర్ లాంటి దొర ఇలా కాళ్ళమీద పడిపోవడం తెలంగాణలోని దొరలకు తలవంపులుగా అనిపిస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ మన దొరల పరువు తీస్తున్నాడని వాళ్ళు తలలు బాదుకుంటున్నారట. కేసీఆర్ గారు ఇప్పటికైనా తన పాదాభివందనాల పరంపరను ఆపాలని వాళ్ళు కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.

చంద్రబాబు ఇంటి నిర్మాణానికీ అనుమతులు ఇవ్వకపోతే...

  ఆంద్ర,తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధం నానాటికి మరింత తీవ్రతరం అవుతోందే తప్ప చల్లబడే సూచనలు కనబడటం లేదు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణానికి జి.హెచ్.యం.సి.అనుమతులు ఇవ్వలేదు. హైదరాబాద్ లో సచివాలయ భవనాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను చెల్లించనందునే చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణానికి అనుమతులు ఈయలేదని జి.హెచ్.యం.సి.కమీషనర్ నిరాకరించినట్లు తెలుస్తోంది. దానిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెం నాయుడు తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి రాజధానిలో ముఖ్యమంత్రి ఇంటి నిర్మాణానికి అడ్డుపడుతూ తెలంగాణా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. అయితే ఇక్కడ అచ్చెం నాయుడు కొన్ని విషయాల గురించి ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.   హైదరాబాద్ లో ఉన్న స్తిరాస్తులన్నీ తెలంగాణా ప్రభుత్వానికి చెందుతాయని వాదిస్తున్నప్పుడు, సచివాలయానికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తిపన్ను ఎందుకు చెల్లించాలి? పదేళ్ళ పాటు హైదరాబాద్ నుండి పరిపాలన చేసుకొనేందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతి ఉంది కనుకనే దానికి అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంతో సహా వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల కోసం హైదరాబాద్ లోనే అనేక భవనసముదాయాలు కేటాయించబడ్డాయనే సంగతి అందరికీ తెలుసు. పదేళ్ళపాటు వాటన్నిటినీ ఉపయోగించుకోదలిస్తే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వాటికి ఆస్తి పన్నులు అద్దెలు చెల్లించాలని విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనలేదు.   నీళ్ళు, విద్యుత్, డ్రైనేజి, రోడ్లు వంటి ఇతర మౌలిక సదుపాయాలకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సొమ్ము చెల్లించాల్సి ఉంటుందా లేదా అనేది విభజన చట్టంలో పేర్కొనబడిందో లేదో తెలియదు ఇంకా లోతుగా ఆలోచిస్తే ఇటువంటివి అనేక సమస్యలు కనబడతాయి. యూపీఏ ప్రభుత్వం దిగిపోయే ముందు హడావుడిగా అనేక లొసుగులతో కూడిన ఒక విభజన చట్టం తయారుచేసి చేతులు దులుపుకొని వెళ్లిపోయింది. అది చేసిన పొరపాట్లకి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టుకోవలసివస్తోంది.   ఏది ఏమయినప్పటికీ ఒక పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లు కట్టుకోనీయకుండా ప్రభుత్వం ఈవిధంగా కక్షపూరితంగా వ్యవహరించడాన్ని ఎవరూ హర్షించరు. సాక్షాత్ ముఖ్యమంత్రికే ఇటువంటి పరిస్థితి ఉంటే, ఇక హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రా ప్రజలు ఎన్ని ఇక్కట్లు ఎదుర్కొంటున్నారో అనే అనుమానం తలెత్తడం సహజం.

గవర్నర్‌కి అధికారాలా? సో వాట్?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ చేతికి అందించాలన్న పోరాటం ఊపు అందుకుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 8 మీద ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సుదీర్ఘ చర్చ జరుగుతోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఉమ్మడి రాజధానిలో పోలీసు అధికారాలు ఒక్క రాష్ట్రం చేతిలోనే వుండటం వల్ల మరో రాష్ట్రానికి ఎన్నో సమస్యలు ఎదురయ్యే అవకాశం వుంది. ఈ విషయంలో హైదరాబాద్‌లో నివసించే సీమాంధ్ర ప్రాంతం వారికి ఎన్నో భయాలు, సందేహాలు వున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సెక్షన్ 8ని తక్షణం అమలు చేయాల్సిన అవసరాన్ని ఏపీ ప్రభుత్వం కేంద్ర  ప్రభుత్వానికి గుర్తు చేస్తోంది. అయితే ఈ డిమాండ్‌ని తెలంగాణ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తోంది. గవర్నర్ చేతికి శాంతి భద్రతలను అప్పగించబోం అని స్పష్టంగా చెబుతోంది. అయితే నిజానికి శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్‌కి అప్పగించినందువల్ల ఏపీకి ఏమైనా ఉపయోగం వుందా అనే ఆలోచన పలువురిలో కలుగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌గా వున్న నరసింహన్ కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వున్నాయి. ఆయన వ్యవహరిస్తున్న తీరు కూడా ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా వుంది. నరసింహన్ ‘అబ్బే.. అలాంటిదేమీ లేదు’ అని అంటునప్పటికీ ఆయన ఏకపక్ష వైఖరి స్పష్టంగానే కనిపిస్తోందని పలువురు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సెక్షన్ 8 కింద గవర్నర్‌కి అధికారాలు ఇచ్చినా ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా వున్న గవర్నర్ అధికారంలో వున్నప్పుడు ఏ సెక్షన్ అయినా హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజలు, ప్రభుత్వానికి రక్షణ కల్పించలేదని అంటున్నారు. అందువల్ల సెక్షన్ 8ని అమలు చేయడంతోపాటు నరసింహన్‌ని గవర్నర్ పదవి నుంచి తొలగించడమే సరైన పరిష్కార మార్గం అని పలువురు భావిస్తున్నారు.

హైకోర్టు కామెంట్లు అదరహో

  హైకోర్టు ఒక్కోసారి చాలా ముచ్చట కలిగించే విధంగా కామెంట్లు చేస్తూ  వుంటుంది. ఆ కామెంట్లు చాలామందికి కనువిప్పు కలిగిస్తూ వుంటాయి. తాజాగా హైకోర్టు చేసిన కొన్ని కామెంట్లు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్న వారి కళ్ళు తెరిపించ గలిగితే అంతకంటే కావలసింది ఏమీ లేదు. అయితే అభివృద్ధిని అడ్డుకోవడమే పరమావధిగా పనిచేస్తున్నవారిని ఇప్పుడు హైకోర్టు చేసిన కామెంట్లు కదిలిస్తాయా లేదా అనేదే సందేహాస్పదం. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో సమయం గడువు ఇచ్చింది. భూ సమీకరణకు వందలాది మంది రైతులు స్పందించి తమ భూములను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారు. అయితే దుష్ప్రచారంలో దిట్ట అయిన వైసీపీ ప్రభావానికి గురైన కొంతమంది రైతులు మాత్రం తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చే ప్రస్తకే లేదని అంటూ వచ్చారు. భూ సమీకరణ గడువు ముగిసి ఇప్పుడు కథ భూ సేకరణలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కేవలం ఆరుగురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తమ భూములను ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపించడమే కాకుండా. కృష్ణానది ఒడ్డున రాజధాని కట్టడం తప్పు అన్నట్టుగా తమ పిటిషన్లలో పేర్కొన్నారు. అయితే కోర్టు వీరి పిటిషన్‌పై విచారిస్తూ ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. వందలాది మంది రైతులు భూములు ఇచ్చినప్పుడు ఆరుగురు రైతులు అభ్యంతరం వ్యక్తం చేసినంత మాత్రాన అభివృద్ధి పనులను అడ్డుకోవడం కుదరదని స్పష్టం చేసింది. నది ఒడ్డున రాజధానులు వుంటే ఏమీ నష్టం లేదంటూ, ప్రపంచ వ్యాప్తంగా నదుల  ఒడ్డున ఉన్న కొన్ని రాజధానుల పేర్లను ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో పిటిషనర్లు తమ పిటిషన్లను వెనక్కి తీసుకోవడానికి కోర్టు అనుమతి తీసుకున్నారు. అంటే, ఈ వివాదం కూడా ముగిసే అవకాశం వుంది. మంచి కామెంట్లు చేసి అభివృద్ధికి సహకరిస్తున్న హైకోర్టుకు హేట్సాఫ్.

ఈ తమిళ ఓవర్ యాక్షన్ మండిపోనూ

  ఈ తమిళ సాంబర్ తంబీల ఓవర్ యాక్షన్ సినిమా తెరమీదే చూడలేక అల్లాడతాం. రియల్ లైఫ్‌లో వాళ్ళ ఓవర్ యాక్షన్ చూడాలంటే రెండు కళ్ళు చాలవు... ఉదాహరణ కావాలంటే మొన్నామధ్య ఏపీలో జరిగిన ఎర్రచందనం దొంగల ఎన్‌కౌంటర్ని గుర్తు చేసుకోవచ్చు. ఎర్రచందనం దుంగలతోపాటు అడ్డు వచ్చిన అధికారులను కూడా అడ్డంగా నరికేసే హంతక ముఠా అది. ఆ ముఠాని ఎన్‌కౌంటర్ చేసేస్తే దానిమీద తమిళనాడులో ఈ సాంబారు తంబీలు చేసిన గొడవ అంతా ఇంతా కాదు. ఆంధ్రుల ఆస్తులను ఎంత ధ్వంసం చేసింది, అక్కడి రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ మీద ఎంత దుమ్మెత్తి పోసిందీ చూశాం. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఎర్రచందనం దొంగలకు రెండేసి లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి అక్కడి ప్రభుత్వం తరిస్తే, ఎన్‌కౌంటర్ చేసిన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక్కొక్కరికి ఐదులక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఓవర్ యాక్షన్ డిమాండ్ చేసిన గొప్పోళ్ళు వాళ్ళు. ఇంత ఓ.యా. ఉంది కాబట్టే శ్రీలంకలో వీళ్ళు ఉండటానికి వీల్లేదని తన్ని తరిమేశారు. వీళ్ళని రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్న ప్రభాకరన్‌ని ఫ్యామిలీతో సహా లేపేశారు. పాపం తోటి భారతీయులను అలా అనడం తప్పు కదూ అనిపించవచ్చు. అయితే వారు చేసే ఓవర్ యాక్షన్ చూస్తుంటే వాళ్ళని ఏమి అన్నా తప్పు లేదని అనిపిస్తూ వుంటుంది. నరహంతకులు, ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల పరువు తీసిన ప్రభాకరన్‌ విగ్రహాన్ని తమిళనాడులో ఎక్కడో ఏర్పాటు చేస్తే తమిళ పోలీసులు దాన్ని తీసి అవతల పారేశారు. దాంతో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఓ తమిళ సంస్థకి కోపం వచ్చేసింది. తమిళనాడులో ప్రభాకరన్ విగ్రహం వుండటం తప్పయితే, ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారి విగ్రహాలేవీ వుండకూడదని తీర్మానించేసింది. అలాంటప్పుడు వేరే రాష్ట్రం నుంచి వచ్చి తమిళ సినిమా రంగాన్ని ఏలి, తమిళనాడు ముఖ్యమంత్రిగా హవా నడిపించిన ఎంజీఆర్ విగ్రహాలు ఎక్కడైనావుంటే వాటిని ధ్వంసం చేసి వాళ్ళ ముచ్చట తీర్చుకోవచ్చు. కానీ వాళ్ళ చూపు చెన్నైలో వున్న శోభన్ బాబు విగ్రహం మీద పడింది. దాన్ని ధ్వంసం చేస్తామని బెదిరింపు హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. శోభన్ బాబు విగ్రహం జనాల డబ్బుతో, ఏ రోడ్డు మధ్యలోనో ఏర్పాటు చేసింది కాదు. ఆయన సొంత స్థలంలో, ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ విగ్రహం. ఆ విగ్రహం మీదకన్ను పడిన తమిళ సాంబారోళ్ళని ఏమనాలి? లక్షలాది మంది మరణించడానికి కారణమైన ప్రభాకరన్‌కి, కళాకారుడిగా జీవించిన శోభన్‌బాబుకు లింకుపెట్టిన వీళ్ళని ఎలా తిడితే ఆవేశం తగ్గుతుందంటారు?

ఉస్మానియా ముచ్చట తీరిపోవాలి

ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి, తద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి, రాష్ట్రం సిద్ధించిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ఉస్మానియా విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో వుంది. ప్రస్తుతం ఆ ఉస్మానియా విద్యార్థులే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. అలాంటి ఉస్మానియా విద్యార్థులను మంచి చేసుకోవడం ద్వారా తెలంగాణలో అధికారంలోకి రావచ్చని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కలలు కంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకుని వెళ్ళి, ఆయన్ని అక్కడి విద్యార్థులతో మమేకం అయిపోయేలా చేసి వారి మనసులలో స్థానం పొందాలని ఆశిస్తున్నారు. దానికోసం మొన్నామధ్య రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించిన సమయంలో రాహుల్ ఉస్మానియా సందర్శన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ ఉద్దేశం నెరవేరలేదు. అసలే ఆగ్రహంగా వున్న ఉస్మానియా విద్యార్థుల దగ్గరకి వెళ్ళడం ఎందుకున్నారో, మరోటోగానీ రాహుల్ గాంధీ అప్పుడు ఉస్మానియా ఛాయలకు రాలేదు.. హైదరాబాద్‌కి కూడా రాలేదు. అప్పుడు ఎందుకు మిస్సయినా, రాహుల్ - ఉస్మానియా విద్యార్థుల భేటీని త్వరలో ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉవ్విళ్ళూరుతున్నారు. త్వరలో రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణలో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రాహుల్‌ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకుని వెళ్ళాలని టీ కాంగ్రెస్ నాయకులు ప్రణాళిక రచించారు. రాహుల్ గాంధీ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి, అక్కడ విద్యార్థి నాయకులను కలిసే ఉత్సాహాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడానికి తెలంగాణ ఉద్యమంలో కిందామీదా పడి పోరాటం చేసి వాళ్ళే జడుస్తూ వుంటారు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో వున్న టీఆర్ఎస్ నాయకులు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉస్మానియాకి వెళ్ళే సాహసం చేయబోరు. అలాంటి రాహుల్ గాంధీని ఉస్మానియాకి తీసుకెళ్ళాలన్న ఉత్సాహం టీ కాంగ్రెస్ నాయకులకు రోజు రోజుకూ పెరిగిపోతుంటే, రాహుల్ గాంధీ కూడా వారికి అనుగుణంగానే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. వీరి ఉత్సాహం ఒక కొలిక్కి రావాలంటే రాహుల్ గాంధీ ఉస్మానియాకి వస్తేనే బెటర్. అప్పుడుగానీ వారందరి ముచ్చట తీరదు.

నోరు కాస్త అదుపు గురూ...

రాక రాక భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. వాజ్‌పేయి ప్రధానిగా వున్న కాలంలో పాలనా పరంగా కాస్తంత మంచి పేరు సంపాదించుకున్న బీజేపీ ఆ తర్వాత పూర్తిస్థాయి మెజారిటీని పొందలేక చాలాకాలం అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇన్నేళ్ళ తర్వాత నరేంద్ర మోడీ పుణ్యమా అధికారంలోకి వచ్చింది. అయితే అధికారం  వినయాన్ని ఇవ్వాలి. అధికారంలో లేనప్పుడు ఎలా మాట్లాడినా చెల్లుతుంది. అధికారంలోకి వచ్చాక ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం వుంది. ఈ విషయాన్ని కొంతమంది బీజేపీ నాయకులు, బీజేపీ అనుబంధ సంస్థల నాయకులు విస్మరించి తమ నోటిపై తమ అదుపును కోల్పోవడం వల్ల ప్రభుత్వ బాధ్యతలు మోస్తున్న నరేంద్రమోడీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఆర్ఎఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ బ్యాక్ గ్రౌండ్ వున్న నాయకులు అయితే ముందూ వెనుక ఆలోచించకుండా మాట్లాడేస్తున్నారు. ఒకరు ఎక్కువమంది పిల్లల్ని కనండంటారు. మరొకరు హిందూ మహిళలు ఎంతమంది పిల్లల్ని కనాలో ఆయనే చెప్పేస్తారు. ఇంకొకరు ముస్లిములు కూడా హిందువులే అంటారు. మరొకాయన మరోరకం స్టేట్‌మెంట్ ఇస్తారు. వీరందరి అంతరార్ధం ముస్లింలకు వ్యతిరేకంగా వుండటం ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఇలాంటి నోటిదూకుడు వ్యవహారాల కారణంగా మోడీ ఇబ్బందిపడాల్సి వస్తోంది. కాశ్మీర్‌లో కొంతమంది పాకిస్థాన్ అనుకూల వర్గాల వారు వుంటారు. వారు అడపా దడపా పాకిస్థాన్ జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ వుంటారు. ఇది చట్ట వ్యతిరేకమే అయినప్పటికీ, ఇలాంటి విషయాల మీద మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అయితే ఆచితూచి వ్యవహరించడం అనే మాటే తెలియని ప్రవీణ్ తొగాడియా అనే పెద్దమనిషి  కాశ్మీర్‌లో పాకిస్థాన్ జెండాలు పట్టుకున్నవారిని కాల్చిపారేయాలని సెలవిచ్చి మరో వివాదానికి తెర తీశారు. అలా ఎవర్నీ కాల్చిపారేయడం సాధ్యం కాని విషయమే అని ఆయనకు కూడా తెలిసినప్పటికీ అలా స్టేట్‌మెంట్ ఇవ్వడం ఆయన ప్రత్యేకత. ఇలాంటి ఇరుక్కుపోయే ప్రకటనలు తమ పార్టీ సభ్యులు, తమ పార్టీ అనుబంధ సభ్యులు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మోడీదేనని విమర్శకులు అంటున్నారు.

గవర్నర్‌ గారు ఏం సమాధానం చెప్తారు?

గవర్నర్ పదవి రాజ్యాంగానికి లోబడి వుంటుందని మనం పుస్తకాల్లో చదువుకుని సంతోషిస్తాం. అయితే రాజకీయ నాయకుల ఆశీస్సులతో దక్కే గవర్నర్ పదవులు కూడా ఇప్పుడు రాజకీయాల పరిధిలోకి వచ్చేశాయి. పైగా గవర్నర్లే రాజకీయాలు నడిపే పరిస్థితి బాగా పెరిగిపోయిన తర్వాత రాజకీయ నాయకులకు, గవర్నర్లకు పెద్ద తేడా కనిపించడం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా వున్న నరసింహన్ గురించి, ఆయన రాజకీయ చతురత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయ నాయకుల మీద ఉండే గౌరవాలు ఎలా తగ్గుతూ పెరుగుతూ వుంటాయో, గవర్నర్ల ప్రతిష్ట కూడా అలా తగ్గుతూ పెరుగుతూ వుంటుంది. నరసింహన్ గవర్నర్ అయిన కొత్తలో అందరూ మాజీ పోలీస్ ఆఫీసర్ కదా... వెన్నెముక నిటారుగా వుంచి పనిచేస్తారని అందరూ భ్రమించారు. అయితే ఆ భ్రమలు కొద్దికాలానికే పూర్తిగా తొలగిపోయాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొత్తం అడుగంటిపోయాయి. ఇప్పుడు ఆయన అధికారాంతంలో వున్న ఫీలింగ్ అందరికీ కలుగుతోంది. ఈ నేపథ్యంలో జెంటిల్మన్‌గా పేరున్న కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి గవర్నర్‌ గారికి ఒక ప్రశ్న సంధించారు. ఆ ప్రశ్నకు గవర్నర్ సమాధానం చెప్తారన్న ఆశలు లేవు. అయితే ఆ ప్రశ్న మాత్రి ఆయన పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయినా వెంటాడుతూనే వుంటుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు ఏ పార్టీలో వున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి తలసాని మీద పోటీ చేసి ఓడిపోయిన శశిధర్ రెడ్డికి కూడా ఈ విషయం అర్థం కావడం లేదు. అందుకే ఆయన తెలంగాణ స్పీకర్‌కి ఓ లేఖ రాశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టా లేదా అనే విషయాన్ని తెలియజేయాల్సిందిగా ఆ లేఖలో ఆయన కోరారు. అలాగే పనిలో పనిగా గవర్నర్ నరసింహన్‌ని ఒక ప్రశ్న అడిగారు. అధికారికంగా తెలుగుదేశం పార్టీ శాననసభ్యుడిగా వున్న తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని గవర్నర్ టీఆర్ఎస్ మినిస్టర్‌గా ఏ చట్ట ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించారో చెప్పాలని కోరారు. టీడీపీకి రాజీనామా చేసిన వ్యక్తిగా ప్రమాణస్వీకారం చేయించారా లేక టీడీపీ ఎమ్మెల్యే హోదాలోనే ప్రమాణ స్వీకారం చేయించారా అనేది తేల్చి చెప్పాలని ఆయన కోరారు.  మరి ఈ ప్రశ్నకు గౌరవనీయులైన గవర్నర్ గారు సమాధానం చెబుతారంటారా?

ఈ రాజకీయ ‘యోగా’ ఏంటో!

రాజకీయ నాయకులకు రాజకీయం చేయడానికి ఏ అంశం దొరికినా చాలు అల్లుకుపోతారు. అధికారంలో ఉన్నవాళ్ళకంటే, ఎప్పటి నుంచో ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళకంటే నిన్నగాక మొన్నటి వరకూ అధికార భోగాల్లో తేలిపోయి,  ఇప్పుడు ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నవాళ్ళయితే చీమ తలకాయ లాంటి అంశం దొరికినా వదిలిపెట్టకుండా రాజకీయం చేసేస్తారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలాగే వుంది. అందుకే ఏ అంశమూ లేనట్టుగా కేంద్ర ప్రభుత్వం జూన్ 21న నిర్వహించ తలపెట్టిన ప్రపంచ యోగా దినోత్సవాన్ని  రాజకీయాల్లోకి లాగింది. కేంద్ర ప్రభుత్వం యోగా అంటే ఇష్టం లేనివాళ్ళ చేత, హిందూయేతరుల చేత కూడా  ఆ రోజున యోగా చేయించాలని ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకోవడం ప్రారంభించారు. యోగాలో భాగమైన ‘ఓం’  అనే పదాన్ని హిందూయేతరులు ఎలా ఉచ్ఛరిస్తారని ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న ఈ ధోరణిని చూస్తుంటే ఇంతకాలం ఈ పార్టీ దేశంలో మత విద్వేషాలను ఎలా రెచ్చగొట్టిందో అర్థమవుతోంది. భారతీయ సంస్కృతిలో భాగమైన యోగాని హిందూ మతంతో ముడిపెట్టడమే కాకుండా, యోగా ఇతర మతాలకు వ్యతిరేకం అన్నట్టుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అల్లుడు గారు రాబర్ట్ వధేరా కూడా ఈ అంశంలో తన వంతు పెట్రోల్ పోసి అగ్గిపుల్ల వెలిగించే ప్రయత్నంలో బిజీగా వున్నారు.

కాంగ్రెస్‌కి మరో లడ్డూ దొరికింది

బీజేపీ మీద విమర్శలు గుప్పించడానికి ఏ అవకాశం దొరికినా కాంగ్రెస్ పార్టీ వదులుకోవడం లేదు. ఆ మాటకొస్తే ఎక్కడ అవకాశం దొరుకుతుందా... లడ్డూలాగా దాన్ని అందుకుందామని ఎదురుచూస్తోంది. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మరో లడ్డూ దొరికింది. అది కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తీసుకున్న ఒక నిర్ణయం రూపంలో. అయితే ఆ నిర్ణయంలో మానవతా కోణం కనిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ వుండటం విచారకరం. అయితే సుష్మా స్వరాజ్ నిర్ణయం మీద కాంగ్రెస్ చేస్తున్న వాదనలో పస లేదని అర్థమవుతూ వున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న న్యూసెన్సే చిరాకును తెప్పిస్తోంది. ఐపీఎల్ వివాదంలో ఇరుక్కున్న లలిత్ మోడీ అనే పెద్దమనిషి విదేశాలకు వెళ్ళడానికి ఇప్పటి వరకు అనుమతి లేదు. అయితే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో వున్న సుష్మా స్వరాజ్ ఆయనకు అనుమతి మంజూరు చేశారు. అదికూడా ఏ విహార యాత్రకో వెళ్ళిరావడానికో కాదు.. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన భార్యకు పోర్చుగల్‌లో చికిత్స జరిపించుకోవడానికి వీలుగా అనుమతి ఇచ్చారు. లలిత్ మోడీ ఆర్థిక నేరగాడే తప్ప ఏ తీవ్రవాదో కాదు.. ఆయన దేశాన్ని విడిచిపెట్టి పారిపోయే అవకాశాలు కూడా ఎంతమాత్రం లేవు. అలాంటి వ్యక్తికి మానవతా దృక్పథంతో బెయిల్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ నానా కచరా చేస్తోంది. మీడియాకి ఎక్కి మోడీ మీద విరుచుకుపడుతోంది. సుష్మా స్వరాజ్ వీలైతే మోడీ కూడా రాజీనామా చేసేయాలని పట్టుబడుతోంది. ఈ వివాదంలో సుష్మా స్వరాజ్‌కి బీజేపీ అండగా నిలిచి కాంగ్రెస్ మీద ఎదురుదాడికి దిగడం ఆమెకు కొంత ఊరట కలిగించే అంశం. అయితే కాంగ్రస్ లాంటి మానవత్వం లేని పార్టీ ఏ వివాదం రేపడానికైనా రెడీగా వుంటుందన్న విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తుంచుకుని వ్యవహరిస్తే ముందు ముందు ఇలాంటి తలనొప్పులు వుండవు.

రేవంత్‌ని వేధిస్తున్నారా?

ఓటుకు నోటు ఇష్యూలో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ఏసీబీ అరెస్ట్ చేసి పదిహేను రోజులు అయింది. పదిహేను రోజులుగా రిమాండ్‌లో వున్న ఆయనకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ని పొడిగించింది. ఆయనకు మరో పదిహేను రోజుల రిమాండ్‌ని ఏసీబీ కోర్టు విధించింది. ఈ తాజా ఆదేశాల ప్రకారం ఈనెల 29వ వరకు రేవంత్ రెడ్డి రిమాండ్‌లోనే ఉండాల్సి వుంటుంది. రేవంత్‌తోపాటు సెబాస్టియన్, ఉదయ్ సింహాకు కూడా రిమాండ్ పొడిగించారు. అయితే ఈ ముగ్గురూ మాత్రం తమకు రిమాండ్ పొడిగించడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో రేవత్‌కి రిమాండ్ పొడిగించడం రాజకీయ వర్గాలకు ఆశ్చర్యం కలిగించింది. రేవంత్ రిమాండ్ పూర్తి కాగానే ఏసీబీ కోర్టు బెయిల్ ఇస్తుందని భావించారు. అయితే అందుకు విరుద్ధంగా జరిగింది. ఇప్పటికే ఏసీబీ ఆయనను అదుపులోకి తీసుకుని నాలుగు రోజులపాటు ప్రశ్నించింది. ఏసీబీ విచారణ పూర్తయిన నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇవ్వడమే న్యాయం అవుతుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా రేవంత్ తదితరులకు రిమాండ్ పొడిగించడం విచిత్రంగా వుందన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేసును ప్రభావితం చేస్తారని, సాక్షులను బెదిరిస్తారని, విచారణకు సహకరించరని... ఇలా రకరకాల కారణాలు చెప్పి రిమాండ్ పొడిగించడం రేవంత్‌ని వేధించడమే అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ హైకోర్టు మీదే ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో వున్న ఏసీబీ తనకు న్యాయం చేయదని ఆయన భావిస్తున్నట్టున్నారు. అందుకే ఆయన హైకోర్టు తలుపులు తట్టారు. ఏసీబీ రేవంత్‌ని విచారించ దలచుకుంటే గడచిన15 రోజుల్లో పూర్తిగా విచారించవచ్చు. నాలుగు రోజులు మాత్రమే విచారణ జరిపి, ఇప్పుడు మళ్ళీ రిమాండ్ పూర్తయిన తర్వాత ఇంకా విచారణ జరపాలనే ఉద్దేశంతో ఉన్నానని, అందువల్ల రిమాండ్ పొడిగించాలని కోరడం భావ్యం కాదన్న విమర్శలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి బెయిల్ దొరకకుండా చేయడం ఆయనను వేధించడంగానే భావించాల్సి వస్తుందని పలువురు అంటున్నారు.