కేంద్ర హోంశాఖలో చిచ్చు

  కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్ కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల స్వచ్చంధ పదవీ విరమణ చేసిన సంగతి తెలసిందే. దానికి కేంద్ర కూడా ఆమోదం తెలిపింది.  అయితే ఇది ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసిందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గోయల్ స్వచ్చంధ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ప్రధాన నరేంద్ర మోడీ రాజీవ్ మెహ్రిషీని నియమించారు.. అది కూడా రాజ్‌నాథ్ సింగ్‌కు తెలియకుండానే చేశారు. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసింది.   మరోవైపు హోంశాఖ అదనపు కార్యదర్శి అనంత్‌ కుమార్‌ సింగ్‌ను పెట్రోలియం శాఖ అదనపు కార్యదర్శిగా, ఆర్థిక సలహాదారుగా నియమించారు. హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో చనువుగా ఉండటమే అనంత్‌కుమార్‌ బదిలీకి కారణమని తెలుస్తోంది. ఎందుకంటే గోయల్ కు అనంత్ కుమార్ కు మధ్య సఖ్యత లేకపోవడం.. కూడా ఓ కారణం.. అంతేకాదు గోయల్ తీరుపై హోంమంత్రి కూడా అసంతృప్తిగా ఉండేవారిని ఆ శాఖ వర్గాలు అంటున్నాయి. ప్రధాని మోడీ దృష్టికి ఇద్దరినీ ఆ శాఖ నుంచి తప్పించి, ఇతర అధికారులకు పరోక్ష హెచ్చరికలు చేశారని పేర్కొంటున్నాయి.   కాగా.. ఈ బదిలీలతో ఇతర కేంద్ర ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వానికి అనుగుణంగా పని చేయకపోతే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని మోడీ ఈ బదిలీల ద్వారా తెలిపారని అధికారులు భావిస్తున్నారు.

ఈరోజు కూడా అదే వైఖరి

నాల్గవరోజు  ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గత మూడు రోజులుగా ఏపీ శాసనసభా సమావేశాల్లో ఏం జరుగుతుందో ఈరోజు కూడా అదే వైఖరి కనబడుతోంది. సభ ప్రారంభంకాగానే వైసీపీ నేతలు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు కి వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. అయితే స్పీకర్ వారిచ్చిన తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో వైసీపీ నేతలు వెంటనే తీర్మానంపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ  ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళనలు చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శించొద్దని.. ప్లకార్డులు సభలోకి తీసుకురావద్దని స్పీకర్ వారిని కోరినా ఉపయోగంలేకుండాపోయింది. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. కాగా ఈరోజు సమావేశంలో మరిన్నికీలక బిల్లులు చర్చకు రానున్నాయి. దీంతో సమావేశాలు మరింత వాడివేడిగా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

జగన్ తగలబెట్టుకున్నా రాదు

  టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ప్రత్యేక హోదా గురించి.. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేయబోయే దీక్ష గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడతామని.. దానికోసం గుంటూరులో దీక్ష చేస్తానని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేసీ మాట్లాడుతూ ఏపీ ప్రత్యేక హోదా కోసం జగన్ గుంటూరులో దీక్ష చేస్తానని చెప్పున్నారు కానీ అదంతా జిమ్మిక్కు మాత్రమే అని విమర్సించారు. దీక్షలు కాదు కదా జగన్ పెట్రోలు పోసుకొని తగలబెట్టుకున్నా ఏపీకి ప్రత్యేక హోదా రాదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. దీక్షలు చేసే కాలం పోయింది.. అవన్నీ గాంధీ కాలంలోనే చెల్లుబాటయ్యేవి అని ఎద్దేవ చేశారు. అంతేకాదు మా అంటే రెండు మూడు రోజులు దీక్ష చేస్తారేమో తరువాత పోలీసులు అరెస్ట్ చేస్తారు.. ఇదంతా తన ప్రచారం కోసం.. అంతేతప్ప ఆయన దీక్ష వల్ల ఏపీకి ఒరిగేది ఏం లేదని అన్నారు.

సెప్టెంబర్ 23నుండి తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు

  బుదవారం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆ వివరాలను తెలియజేసారు.ఈనెల 23నుండి ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న తెలియజేసారు. ఆయన ఈనెల 7వ తేదీ నుండి చైనా, దక్షిణ కొరియా తదితర దేశాల పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు. తిరిగి రాగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకొందామని తెలిపారు. ప్రజాభీష్టాన్ని మన్నిస్తూ ఛీప్ లిక్కర్ ప్రవేశపెట్టే ఆలోచనని విరమించుకొంటున్నట్లు తెలిపారు.   రాష్ట్రంలో పేదలకోసం ఇదివరకే మొదలుపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయడంతో బాటు రూ.3,900 కోట్ల వ్యయంతో ఈ ఏడాది కొత్తగా మరో 60,000 ఇళ్ళను నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలను విభజించి కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. దానికోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ నివేదిక ఈయగానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.   ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి జిల్లా కలెక్టర్ల వద్ద తగినన్ని నిధులు ఉంచామని తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న ఎక్స్ గ్రేషియాని రూ. 5లక్షలకు పెంచేందుకు ఆలోచిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ నష్టాలను ఇకపై జి.హెచ్.యం.సి. భరించాలని నిర్ణయం తీసుకొన్నాము. కనుక జి.హెచ్.యం.సి. కమీషనర్ కూడా ఇకపై ఆర్టీసీ బోర్డులో సభ్యుడుగా ఉంటారు. తెలంగాణాలో రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా తెలంగాణా రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు.

ఓటుకి నోటు కేసు కోసం తెలంగాణా ప్రభుత్వం రూ.52 లక్షలు ఖర్చు

  ప్రభుత్వాలు ప్రజాధనానికి, ప్రభుత్వ ఆస్తులకి ధర్మకర్తలుగా మాత్రమే వ్యవహరించాలి తప్ప చేతిలో అధికారం ఉంది కదా అని ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దురుపయోగపరచకూడదు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలేవీ ఈ నియమాన్ని అంతగా పట్టించుకోవడం లేదని చెప్పడానికి ఓటుకి నోటు కేసుని చూస్తే అర్ధమవుతుంది. ఓటుకి నోటు కేసులో తెలంగాణా ప్రభుత్వం తరపున వాదించడానికి ప్రముఖ న్యాయవాది రామ్ జెట్మలానీ ఫీజు కోసం ప్రభుత్వం రూ. 52 లక్షలు విడుదల చేసింది. ఇదిగాక ఈ కేసులో విచారణ కోసం ఎసిబి అధికారుల విచారణ ఇతర ఖర్చులు ఎంత ఉంటాయో తెలియదు కానీ అవన్నీ లాయర్ ఫీజుకి అధనం.   ఆర్ధిక సమస్యల కారణంగా తెలంగాణాలో నిన్న ఒక్కరోజునే ఏకంగా 8మంది రైతులు ప్రాణాలు తీసుకొన్నారు. కరీంనగర్ జిల్లలో ముగ్గురు, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున ఆత్మహత్యలు చేసుకొన్నారు. అందరూ అప్పుల బాధ భరించలేకనే ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఒకవైపు రైతులు ఆర్ధిక సమస్యలతో ప్రాణాలు తీసుకొంటుంటే వారి కోసం ఖర్చు పెట్టవలసిన సొమ్మును ఓటుకి నోటు కేసు కోసం ఖర్చు చేస్తుండటం చాలా విచారకరం.

తల్లి కాంగ్రెస్ పార్టీలాగే పిల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

  ఏపీ శీతాకల సమావేశాలు.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మించిపోయాయి. అప్పుడు సభను సజావుగా సాగనివ్వకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా ఆందోళనలు చేశారో ఇప్పుడు పిల్ల పార్టీ వైఎస్సార్ పార్టీ కూడా అలాగే చేస్తుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగినన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ లలిత్ మోదీ విషయంలో సుష్మా స్వరాజ్, వసుంధరా రాజేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. సభ అలా ప్రారంభమయ్యేదో లేదో ఇలా ప్లకార్డులు పట్టుకొని స్పీకర్ పోడియం దగ్గర ప్రత్యక్షమయ్యేవారు. ఆఖరికి వారి ఆందోళనలతో కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేసే పరిస్థితి వరకూ తెచ్చుకున్నారు. ఇంతకు ముందు ఏ పార్టీ ఎంపీలు సస్పెండ్ కానట్టు..తమ పార్టీ నేతలే మొట్టమొదటి సారిగా సస్పెండ్ కు గురైనట్టు సోనియా గాంధీ తెగ నిరసనలు ధర్నాలు చేసేశారు.. అంతేకాదు.. ప్రజాస్వామ్యం చనిపోయింది అంటూ పెద్ద పెద్ద మాటలే వాడేశారు సోనియాగాంధీ. అయితే  ఇలా చేయడం వల్ల ఆపార్టీకి ఒరిగింది ఏదైనా ఉందా అంటే అదీ లేదు... పైగా అందరూ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇతర పార్టీ ఎంపీలను.. సొంత పార్టీ ఎంపీలను కూడా  నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి.. మీడియా ప్రసారాలు ఆపుచేసి మరీ రాష్ట్రాన్ని విభజించారు.. అప్పుడు గుర్తుకురాలేదా ప్రజాస్వామ్యం అంటూ దెప్పి పొడిచారు. ఒక రకంగా ఈసారి వర్షాకాల సమావేశాలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయాయి అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీనే.. ఇదిలా ఉండగా ఇప్పుడు పిల్ల పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తల్లి పార్టీ కాంగ్రెస్ పార్టీ తరహాలోనే మాటి మాటికి అసెంబ్లీ సమావేశాలకు అడ్డుపడుతున్నాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా సభలో గందరగోళాలు సృషిస్తున్నాయి. ప్రత్యేక హోదాపై.. ప్రత్యేక ప్యాకేజీపై.. పట్టిసీమ ప్రాజెక్టుపై ఇలా ఎన్నో రకాల అంశాలపై అలా చర్చలు మొదలుపెట్టడం ఇలా వైసీపీ నేతలు ఆందోళనలు చేయడం. ఒకవైపు స్పీకర్ దయచేసి కూర్చోండి సభకు సహకరించాలని అంటూ ఎంత మొత్తుకున్నా ఏం లాభం వారి ధోరణి మాత్రం అంతే. మరోవైపు ఏపీ సీఎం కూడా వైసీపీ నేతల తీరుకు సహసం కోల్పోయి వారిమీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దౌర్భాగ్యమైన ప్రతిపక్షాన్ని తాను ఇంత వరకు చూడలేదని.. నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే సహించబోమని అన్నారు. సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని, హుందాతనం అవసరమా, లేదా అని ఆయన మండిపడ్డారు. మొత్తానికి తల్లి పార్టీ.. పిల్ల పార్టీ అని అందరూ అనుకుంటున్నట్టుగానే ఈరెండు పార్టీలు కూడా అలాగే వ్యవహరిస్తున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ.. ఇక్కడ వైఎస్సర్ కాంగ్రెస్ పార్టీ రెండూ ఒంటెద్దు పోకడని అనుసరిస్తున్నాయి.

మెగా ఫ్యామిలీలో హీరో.. అది శాపమే

  దర్శకమౌళి రాజమౌళి మెగా ఫ్యామిలీ హీరోలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా, క్రిష్ దర్శకత్వంలో కంచె సినిమా రూపుదిద్దుకుంటుంది. అయితే ఈ చిత్రం ట్రైలర్ విడుదల సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన రాజమౌళి మెగా ఫ్యామిలి గురించి మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలి నుండి హీరోగా సినీ పరిశ్రమకు రావడం ఒక రకంగా అదృష్టమైనా అది ఒక రకంగా శాపం కూడా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే సాధారణంగా ఒక సినిమా తీసి అది ప్రేక్షకులకు నచ్చాలంచే ఈ రోజుల్లో చాలా కష్టంగా మారిపోయింది.. అలాంటిది అసలే మెగా ఫ్యామిలీపై ప్రక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి.. అలాంటి వారి అంచనాలను రీచ్ అవ్వాలంటే వరుణ్ తేజ్ ఇంకా చాలా కష్టపడాలని.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరుచుకోవాలని అప్పుడే ఈ తీవ్రమైన పోటీలో వరుణ్ తేజ్ నిలబడగలుగుతాడంటూ వివరణ ఇచ్చారు. అయితే రాజమౌళి పాజిటివ్ గానే అన్నా ఈ వ్యాఖ్యలను కొంతమంది పాజిటివ్ గా.. కొంతమంది నెగెటివ్ గా తీసుకుంటున్నారు.

మేం రాజీనామా చేస్తాం.. మీరు తీసుకొస్తారా?

  టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. ఇప్పుడు కూడా అలాగే ఏపీకి ప్రత్యేకహోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో ఏపీ ప్రత్యేక హోదాపై వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగానే ఇరు పార్టీల వాదనల జరుగుతుండగా వచ్చిన జేసీ తనదైన శైలీలో స్పందించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని జగన్‌ అన్నారు.. ‘‘అందుకు నేను సిద్ధంగానే ఉన్నా. నేనే కాదూ... మరో పది మంది ఎంపీలు 24 గంటల్లో రాజీనామా చేస్తాం అన్నారు. కానీ మేము రాజీనామా చేస్తే జగన్‌, కాంగ్రెస్‌, జనసేన, సీపీఐ, సీపీఎంలు ప్రత్యేక హోదాను తీసుకువస్తాయా? ఒకవేళ తీసుకురాలేకపోతే మేము రాజీనామా చేసిన స్థానాల్లో ఆయా పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టకూడదు. దీనికి ఆ పార్టీలు సిద్ధమేనా?’’ అని ఆయన సవాలు చేశారు.   అంతేకాక రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆహర్నిశలు కష్టపడి.. రోడ్ల మీద ధర్నాలు చేస్తే ఏమోచ్చింది.. రాష్ట్రం విడిపోకుండా ఆగిందా.. ఇప్పుడూ అంతే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకం లేకపోయినా.. బిహార్‌ కంటే మంచి ప్యాకేజీ మాత్రం ఏపీకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా గురించి గొంతు చించుకుంటున్నవారికి దానివల్ల వచ్చే ప్రయోజనం తెలుసో? లేదో?అని ఎద్దేవా చేశారు.

జగన్ కు చంద్రబాబు సూటిప్రశ్న..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు కూడా అధికారపార్టీకి.. ప్రతిపక్ష పార్టీకి మధ్య వాగ్వాదాలు తలెత్తాయి. పట్టిసీమ ప్రాజెక్టు పైన ఇరు పార్టీలు వాదోపవాదాలు చేసుకున్నాయి. పట్టిసీమ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు జగన్ ను ఇరుకునపెట్టారు. పట్టిసీమ ప్రాజెక్టుకు వ్యతిరేకమా? లేదా అనుకూలమా అని నేరుగా సవాల్ విసిరారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి వాసులకు నీటిని అందించవచ్చని.. గోదావరి జిల్లాల్లో రెండో పంటకు కూడా నీరివ్వచ్చని స్పష్టం చేశారు. గోదావరి జిల్లాలో రెండో పంట బాధ్యత తమదే అన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం పూర్తయితే మూడో పంటకు కూడా నీరిస్తామని అన్నారు. గోదావరికి మొదటి ప్రాధాన్యం ఇస్తానన్నారు..అసలు మీరు పట్టిసీమకు వ్యతిరేకమా? అనుకూలమా?, పట్టిసీమపై మీ స్టాండ్ ఏమిటో చెప్పాలని జగన్‌ను చంద్రబాబు నిలదీశారు. ఒకవేళ ఈ రోజు చెప్పలేకపోతే ఈరోజు రాత్రి ఆలోచించి రేపు చెప్పండని.. ఏదో ఒక స్టాండ్ చెప్పే వరకూ మీకు మాట్లాడే అర్హత  లేదని మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ బర్త్ డే యాడ్.. అందరిలో ఆసక్తి

  ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఎంతోమంది మంది అభిమానులు.. టాలీవుడ్ ప్రముఖులు కూడా ఆయనకు అభినందనులు తెలిపారు. అయితే అన్ని బానే ఉన్న ఇప్పుడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా తీసిన యాడ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అదేంటంటే తెలుగుదేశం పార్టీకి చెందిన కృష్ణాజిల్లా ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ టీవీ న్యూస్ ఛానల్ లో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సంబంధాలు సుహృద్భావ వాతావరణంలో కొనసాగాలని ఆ యాడ్‌ ద్వారా కోరారు. దీంతో ఈ యాడ్ ఇప్పుడు చర్చాంశనీయమైంది.

నేడు దేశ వ్యాప్త రవాణా బంద్

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రహదారి రవాణా భద్రత బిల్లును ఉపసంహరించుకోవాలని నేడు దేశ వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మెలో పలు కార్మిక సంఘాలు టీఎంయూ, ఎన్‌ఎంయూ, ఈయూలు పాల్గొన్నాయి. ఆర్టీసీ బస్సులతోపాటు ఆటోలు, క్యాబ్‌లు, ప్రైవేటు బస్సులు, లారీలు నిలిచిపోయాయి. ఈ దేశవ్యాప్త సమ్మెలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల్లో రవాణ బంద్‌ సాగుతుంది.  ఆటో డ్రైవర్ల ర్యాలీ మరోవైపు ఆటో డ్రైవర్లు సమ్మెలో పాల్గొనాలని యూనియన్‌ నాయకులు వెంకటేష్‌, నరేందర్‌, ఎ. సత్తిరెడ్డి సూచించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీ నిర్వహించేందుకు ఆటో డ్రైవర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. బంద్‌లో పాల్గొనాలని అన్ని ఆటో సంఘాల మద్దతు కూడగట్టామని వారు తెలిపారు.

వైఎస్సార్ ఫోటో తొలగింపు.. అసెంబ్లీలో ఆందోళన

  ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ అలా మొదలైందో లేదో ఇలా వైసీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఆసెంబ్లీ ఆవరణలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటం తొలగించినందుకు వైసీపీ నేతలు రాజశేఖర్ రెడ్డి ప్లకార్డులు పట్టుకొని వైయస్‌ జోహార్‌ అంటూ నినాదాలు చేస్తూ పోడియంను చుట్టుముట్టి నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆందోళనలు ఆపాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ ఆందోళనల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా కరవు, రైతు ఆత్మహత్యలు, తాగునీటి సమస్యపై వైకాపా ఇచ్చిన వాయిదాతీర్మానాన్ని స్పీకర్ కోడెల తిరస్కరించారు. దీంతో వైకాపా నేతలు మరోసారి ఆందోళనలు చేయగా కరవు పరిస్థితులపై రేపు చర్చిస్తామని ప్రభుత్వం చెప్పిందని స్పీకర్‌ కోడెల తెలిపారు.

22 ఏళ్ళ తర్వాత చరిత్ర సృష్టించిన యంగ్ ఇండియా

టెస్ట్ క్రికెట్ లో ఉండే మజా ఏమిటో క్రికెట్ అభిమానులకు తెలియజెప్పింది భారత్ శ్రీలంక సిరీస్. మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ గెలిచే స్థితిలోంచి ఓటమి చెందడం అప్పుడు భారత్ క్రికెట్ అభిమానులకు బాధకలిగించింది. దీంతో పట్టుదలతో ఆడిన టీం ఇండియా రెండో టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించింది.ఇక, సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే అనే లక్ష్యంతో మూడో టెస్ట్ బరిలోకి దిగిన రెండు జట్లు నేటితో చారిత్రాత్మక ఫలితాన్ని ఇచ్చాయి. ఐదు రోజుల క్రితం ప్రారంభమయిన మూడో టెస్ట్ తొలిరోజు వర్షం కారణంగా సరిగ్గా జరగపోయిన మిగిలిన నాలుగు రోజుల ఆటలో తొలి ఇన్నింగ్స్ లో టీం ఇండియా 312 పరుగులు చేయగా, శ్రీలంక 201 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ లో టీం ఇండియా 274 పరుగులు చేయగా, 386 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నేడు 268 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఈ విజయంతో భారత్ 2-1తో సిరీస్ గెలుచుకోవడంతో పాటు 22 ఏళ్ళ తర్వాత తొలిసారిగా యువ భారత్ శ్రీలంక గడ్డపై సిరీస్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని సీనియర్ల రిటైర్మెంట్ ల తర్వాత ఇప్పుడు విరాట్ కోహ్లీ సారధ్యంలోని ఈ యువ టీం ఇండియా సాధించడం విశేషం.

బాబు రాజీనామా చేసిన ప్రత్యేక హోదా రాదు..!!

ఎమ్.పి జెసి దివాకరరెడ్డి ఎప్పుడూ, ఎలా మాట్లాడుతాడో ఆయనకే తెలియాలి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం టిడిపి ఎంపిలను రాజీనామా చేయమంటున్న జగన్, ఎమ్.పిలంతా రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వెంటనే తీసుకురాగలడా అని ఎమ్.పిలే కాదు, ముఖ్యమంత్రి రాజీనామా చేసినా ప్రత్యేక హోదా రాదని ఆయన స్పష్టం చేశారు. ఎపికి మెరుగైన ప్యాకేజీ వస్తుందని, అది బీహారు కంటే బాగుంటుందని ఆయన అబిప్రాయపడ్డారు. జగన్ సి.ఎమ్. అవుతానని ఎగిరెగిరి పడుతున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా అంటే ఏమిటో తెలియకుండా చాలామంది మాట్లాడుతున్నారని జెసి వ్యాఖ్యానించారు. జగన్ కూడా మావాడేనని ఆయన ముక్తాయించడం విశేషం.

అసెంబ్లీ లో బూతులు..!!

    పవిత్ర దేవాలయమైన అసెంబ్లీలో వైకాపా సభ్యులు బూతులు మాట్లాడుతున్నారని...స్పీకర్ను సీఎంను తిడితే ఏదో గొప్ప అనుకుంటున్నారని...హుందాతనం కాపాడుకోవలని వైకాపా సభ్యులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. జగన్ టీడీపీపై బురద జల్లేందుకు తెరాస కేసీఆర్ తో లాలూచీ పడ్డారని..జగన్ హరీష్ రావు ఎక్కడ సీక్రెట్ గా కలుసుకున్నారో..వారి రహస్య ఎజెండా డాక్యుమెంట్ కూడా తన వద్ద ఉందని చంద్రబాబు అన్నారు.   జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ నీ తండ్రి 25 ఎంక్వైరీలు వేసినా నన్నేమి చేయలేకపోయాడు...నువ్వు ఎవ్వరితో లాలూచీ పడినా నన్నేం చేయలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిప్పు లాంటోడినని..అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతానని అన్నారు. ఏ అవినీతి పరుడిని తాను వదిలిపెట్టనని..ఇందుకు సంబంధించిన చట్టం కూడా రెఢీ అవుతోందంటూ చంద్రబాబు జగన్ పై ఆగ్రహంతో ఊగిపోయారు.

అసెంబ్లీ లో మాటల యుద్ధం..అంతా గందరగోళం

అసెంబ్లీ రెండో రోజు జగన్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మధ్య ఆసక్తికర మాటల యుద్ధం జరిగింది. తమ సీఎం చంద్రబాబునాయుడు ఏపీని ఎలా అభివృద్ధి చేయాలా...నవ్యాంధ్రకు ఎలా నిధులు రాబట్టాలా అని ప్రతి రోజు హోం వర్క్ చేస్తుంటారని..అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి రోజు మనీ లాండరింగ్ కంపెనీలు..సూట్ కేసుల కంపెనీలు ఎలా పెట్టాలా అని హోం వర్క్ చేస్తుంటారని ఎద్దేవా చేశారు. జగన్ ఆయన తండ్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ విషయంలో బాగా ఆరితేరిపోయారని యనమల ఫైర్ అయ్యారు. అందుకే ప్రతి శుక్రవారం జగన్ జైలు దర్శనం చేసుకోవాల్సి వస్తోందని సెటైర్ వేశారు. ఇందుకు జగన్ స్పందిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ఓట్లకు కోట్ల మీద ఎక్కువగా హోం వర్క్ చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. అంతకు ముందుగా చంద్రబాబు ఓటుకు నోటు కేసు విషయంపై మాట్లాడుతూ ఒక రాష్ర్ట ప్రభుత్వంపై మరో రాష్ర్ట ప్రభుత్వం నిఘాపెట్టే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ధర్మం తనవైపు ఉందని..తాను ఎవ్వరికి భయపడాల్సిన పనిలేదని అన్నారు. తాను జీవింతో ఏ తప్పు చేయలేదని..తనతో పెట్టుకున్న వారంతా ఏమయ్యారో మీకు తెలుసని... రెండు కొంటే ఒకటి ఫ్రీ అన్న చందంగా జైలుకెళ్లిన ఘనత మీకే ఉందంటూ ప్రతిపక్షనేత జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు సెటైర్లు వేశారు.

ఎవరికి పడితే వారికి క్యాబినెట్ హోదా ఎలా ఇస్తారు?

ప్రభుత్వ సలహాదారులకు.. ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులకు.. వివిధ కార్పొరేషన్ ఛైర్మన్ లకు కేబినెట్ హోదా కల్పిస్తూ.. తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయంపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎవరికి పడితే వారికి కేబినెట్ హోదా ఇవ్వటానికి వీల్లేదని స్పష్టం చేసింది. జీతాలు.. వసతులు కల్పించే అధికారం ప్రభుత్వానికి ఉన్నా.. కేబినెట్ హోదాలు మాత్రం ఇవ్వకూడదని పేర్కొంది.   కేసు విచారణలో భాగంగా.. రూల్స్ కు అనుగుణంగానే కేబినెట్ హోదా కల్పించామని.. జీతాలు.. సౌకర్యాల కోసం కేబినెట్ ర్యాంకు ఇచ్చినట్లుగా తెలంగాణ సర్కారు తరఫు అడ్వొకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి చేసిన వాదనను హైకోర్టు తప్పు పట్టింది. హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. జీతాలు కావాలంటే ఇచ్చుకోవచ్చని.. సౌకర్యాలు కూడా కల్పించుకోవచ్చు తప్పించి.. ఎవరికి పడితే వారికి కేబినెట్ హోదా ఇవ్వకూడదని స్పష్టం  చేసింది.   సలహాదారులు.. ఇతర హోదాలలో తీసుకున్న వారు మంత్రులతో సమానంగా కాదని స్పష్టం చేసిన హైకోర్టు వాదన.. తెలంగాణ అధికారపక్షానికి చెందిన ఎంతోమంది మంత్రుల మనసులకు కాసింత ఊరట ఇవ్వటం ఖాయమన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.