ఫారిన్ పాలసీ చెప్పింది నిజమేనా..? ఇండియాలో అణు పరీక్షలు..?

మన దేశంలో ఏం జరుగుతుందో మనకే తెలియని ఓ సంచలనమై విషయాన్ని ఓ అంతర్జాతీయ పత్రిక ఒకటి భయటపెట్టింది. అదేంటంటే.. ఇండియా రహస్యంగా అణుపరిశోధనలు చేయడం. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది మాత్రం నిజం అంటుంది అంతర్జాతీయ పత్రిక. పాకిస్థాన్ అస్థిరపరచేందుకు కోసం భారత్ అత్యంత రహస్యంగా అణుకార్యక్రమం సాగిస్తోందని.. కర్ణాటక దక్షిణ ప్రాంతంలోని ఛెల్లకెరిలోని గిరిజన ప్రాంతంలో ఈ అణు పరిశోధనలు సాగుతున్నాయి 'ఫారిన్ పాలసీ'' అనే అంతర్జాతీయ పత్రిక బయటపెట్టింది. దీంతో ఇప్పుడు ఇది సంచలనమైంది. ఇప్పుడు ఈ విషయం పై ప్రత్యర్ధి దేశమైన పాకిస్థాన్ ఎలా రియాక్ట్ అవుతుందా అని అందరూ అసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందునా.. పాకిస్థాన్ కంటే ముందు అణు పరిశోధనల గురించి ఏ చిన్న విషయమైన చిటికెలో పసిగట్టే అమెరికా కూడా ఈ విషయం తెలియకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే. మరి ఈ విషయంపై మన దేశం ఏం చెపుతుందో చూడాలి.

రేపు కోర్టుకు హాజరుకానున్న సోనియా,రాహుల్..

  నేషనల్ హెరాల్డ్ కేసులో రేపు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కానున్నారు. ఇప్పటికే రేపు కోర్టుకు హాజరు కాబోయే వీరిద్దరు ఏం చేస్తారో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టుకు హాజరయ్యే వీరు ఆతరువాత బెయిల్ కి దరఖాస్తు చేసుకుంటారా లేక రాహుల్ ముందుగానే తాను శబధం చేసినట్టు బెయిల్ కి దరఖాస్తు చేసుకోకుండా జైయిల్ కి వెళతారా అనేది చూడాలి. అయితే ఇప్పుడు అసలు ఈ కేసుపై సోనియా, రాహుల్ పై కోర్టులో పిటిషన్ వేసిన సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ.. ఈ కేసులో రాజకీయాలకు తావు లేదని.. సోనియా, రాహుల్ బెయిల్ కు దరఖాస్తు చేసుకోవాలి.. లేదా జైలుకు వెళ్లాలి.. అలా కాకుండా కోర్టుకు హాజరుకాకపోతే కోర్టు వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.

ఏపీ బీజేపీ, టీడీపీ నేతలకు మావోయిస్టుల వార్నింగ్..

  ఉమ్మడి రాష్ట్రంలో ఏమో కానీ రాష్ట్రం విడిపోయిన తరువాత మాత్రం మావోయిస్టుల ఉనికి కాస్త పెరిగిందనే చెప్పొచ్చు. అందులోనూ తెలంగాణ రాష్ట్రంలో కాస్త ఎక్కువే. ఇప్పటికే మావోయిస్టులు తెలంగాణలోని అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేయించడం..ఆ పార్టీకి సంబంధించిన నేతలను కిడ్నాప్ చేయడం వంటివి చేశారు. ఇప్పుడు ఏపీలోనూ అలాంటి పోస్టర్లు వెలిశాయి. విశాఖ జిల్లాల గూడెం కొత్త వీధి మండలంలోని సిరిబాల ప్రాంతంలో మావోయిస్టుల పోస్టర్లు కనిపించాయి. అధికారంలో ఉన్న టీడీపీ - బీజేపీలను తరిమితరిమి కొట్టాలంటూ ఆ పోస్టర్లలో పిలుపునిచ్చారు.ఆన్ రాక్ యాజమాన్యంతో టీడీపీ కుమ్మక్కయిందని..బాక్సైట్ కు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలని.. మన్యంలో బాక్సైట్ గనుల తవ్వకం జరిపితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

సీబీఐ రైడ్ పై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యాలు..

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కార్యలయంపై సీబీఐ దాడులు చేసిన సంగతి తెలిసిందే. తన కార్యాలయంపై సీబీఐ దాడులు చేయడంపై కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మరోపక్క అధికార ప్రభుత్వ.. సీబీఐ అనేది స్వచ్ఛంధ సంస్థ దానికి ఆదేశించే అధికారం ఎవరికి ఉండదు అని.. సీబీఐ దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. ఈనేపథ్యంలో అటు కేజ్రీవాల్ కి ఇటు కేంద్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి మళ్లీ ఇప్పుడు కేజ్రీవాల్ ట్విట్టర్లో సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దారికి రాని వారిని అంతం చేసే పనిలో సీబీఐ ఉందని.. ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తమ దారికి రాని ప్రతిపక్షాలపై ఎంతవరకైనా వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం తమను ఆదేశించిందని.. ఈవిషయాన్ని ఓ అధికారే స్వయంగా తమకు చెప్పాడని కేజ్రీవాల్ ట్వీట్టర్లో తెలిపారు. దీంతో ఇప్పుడు కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయమయ్యాయి. మరి కేజ్రీవాల్ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

చంద్రబాబు ప్లాన్ ముందు జగన్ ప్లాన్ తుస్సే..!

రాజకీయాల్లో చంద్రబాబుకు ఉన్న రాజకీయానుభవం ముందు జగన్ రాజకీయానుభవం దిగదుడుపే. ఈ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. అసలే రాజకీయ చాణుక్యుడిగా చంద్రబాబుకి పేరుంది. జగన్ జ‌గ‌న్‌కు అనుభ‌వం కంటే దూకుడు ఎక్కువ‌గా ఉండ‌డంతో చాలాసార్లు ఆయ‌న ఫెయిల్ అవుతూ వ‌స్తున్నారు. ఈసారి కూడా జగన్ కు అదే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఏపీ శీతాకాల సమావేశాల్లో భాగంగా వైసీపీ పార్టీ నేతలు రాజ్యాంగంపై అంబేద్కర్ గురించి మాట్లాడనివ్వకుండా.. కాల్ మనీపై మాట్లాడాలని పట్టుబట్టారు. కానీ అధికార పార్టీ మాత్రం అంబేద్కర్ గురించి మాట్లాడాలని పట్టుబట్టింది. అయితే చంద్రబాబు ఎక్కడ కాల్ మనీ వ్యవహారం మ‌రుగున‌ప‌డేలా చేస్తారో అని ఆవేశపడిపోయి అంబేద్కర్ గురించి మాట్లాడకుండా మొదట కాల్ మనీ గురించే మాట్లాడాలని పట్టుబట్టారు. దీంతో ప్రతిపక్షం దళితులకు వ్యతిరేకం అన్న భావన కలిగించాలన్న వ్యూహాన్ని ప్రభుత్వం అమలు చేసింది. అంతేకాదు వైసీపీ నేతలు దళిత ఎమ్మెల్యేలతోనే ప్రతిపక్షంపై అధికార పక్షం పదేపదే దాడి చేయించింది. దీంతో వైసీపీ దళితులకు వ్యతిరేకం అనే సంకేతాలు బయటకు పంపేలా చేసింది. మొత్తానికి చంద్రబాబు వేసిన చిన్న ప్లాన్ ముందు.. జగన్ పెద్ద ప్లాన్ బెడిసికొట్టింది.

చాలా దురదృష్టకరం.. చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శీతాకాల సమావేశాల నేపథ్యంలో అంబేద్కర్ 125 జయంతి వేడుకల గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ చర్చపై వైసీపీ నేతలు అడ్డుకోవడం చాలా దురదృష్టకరమని.. అంబేద్కర్ చర్చపై బీఏసీలో ఒప్పుకొని ఇప్పుడు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇంక అంబేద్కర్ గురించి చెబుతూ.. అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకమని.. అంబేడ్కర్‌కు ప్రపంచం మొత్తం హేట్సప్ చెప్పిందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంపై, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పైన చర్చ చారిత్రాత్మకం అన్నారు. రాజ్యాంగ సౌధానికి ప్రాణప్రతిష్ట చేసిన అంబేడ్కర్‌ను స్మరించుకోవడం చారిత్రాత్మకం అన్నారు.

విజయవాడలో ఉద్రిక్తం.. అంగన్ వాడీ కార్యకర్తల నిరసన..

విజయవాడ, బందర్ రోడ్డు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంగన్ వాడీ కార్యకర్తలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆఫీసును చుట్టుముట్టడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో పోలీసులు, అంగన్ వాడీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. సీఐటీయూ, అంగన్ వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా అంగన్ వాడీ కార్యకర్తలు మాత్రం తమ జీతాల జీవో విడుదల చేసేవరకు ఈ పోరాటం ఆపేది లేదని.. ఎంతమందిని అరెస్ట్ చేసినా తాము మాత్రం వెనక్కి తగ్గేది లేదని మండిపడుతున్నారు. సీఎం చంద్రబాబు తమ సమస్యలు పరిష్కారించేవరకూ పోరాడతామని రోడ్డు మీదే బైఠాయించి ఆందోళనలు చేపడుతున్నారు.

జీఎస్టీ బిల్లుపై బీజేపీ వెనక్కి తగ్గిందా..?

ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మోడీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన జీఎస్టీ బిల్లును ఆమోదింపచేయాలని చూసింది. కానీ ఊహించని విధంగా నేషనల్ హెరాల్డ్ కేసు బయటకు రావడంతో  ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ బిల్లుకు సంబంధించి మోడీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ లకు తేనీటి విందు ఇచ్చి బిల్లును గురించి కూడా మాట్లాడారు. సోనియా, రాహుల్ కూడా తమ డిమాండ్ లు ఒప్పుకుంటే బిల్లును ఆమోదింపజేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. కానీ ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ తో సోనియా.. రాహుల్ మోడీ సర్కార్ పై మండిపడుతున్నారు.. ఈనేపథ్యంలో బిల్లు ఆమోదం అతి కష్టమని తేలిపోయింది. మరో వైపు బీజేపీ నేతలు కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గి.. బిల్లును ప్రవేశ పెట్టి భంగపడే కన్నా.. ప్రస్తుతానికి వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నారట. 2016 ఏప్రిల్ తర్వాత అంటే బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రవేశ పెట్టి ఆమోదం పొందేలా చూస్తున్నారట. మరి అప్పుడైనా ఈ బిల్లు ఆమోదం పొందుతుందో లేదో చూడాలి.

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హోర్డింగులు.. మెట్రో ఎక్కడా..?

  హైదరాబాద్లో గ్రేటర్ ఎన్నికల జోరు బాగానే సాగుతుంది. ఏ పార్టీ వ్యూహాలు వారికి ఉన్నాయి. ఇక అధికార పార్టీ అయితే ఇప్పటికే హైదరాబాద్ లో సగం హోర్డింగులతో నింపేసింది. తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలు.. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వివరాలు హోర్డింగులలో వేసి ప్రకటనలతో పాటు.. హోర్డింగులతో నగరమంతా గులాబీ మయం చేసేసింది. అయితే అన్నీ తమ ఖాతాలో వేసుకున్న అధికార పార్టీ మాత్రం మెట్రో రైలును మాత్రం తమ ఖాతాలో వేసుకోలేదు.. సరికదా దీనికి సంబంధించిన ఒక్క యాడ్ ను తమ హోర్డింగుల్లో ఎక్కడా వేసుకోలేదు. ఎందుకంటే.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మెట్రో రైలు విషయంపై టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోయినా..రాష్ట్ర విభజన తరువాత మాత్రం అలైన్ మైంట్ మార్పు విషయంలో కొన్ని అభ్యంతరాలు చెప్పింది. అంతేకాదు కేసీఆర్ కూడా అలైన్ మైంట్లో మార్పు పక్కా అని చెప్పారు. కానీ పాత అలైన్ మెంట్ ను కొనసాగించాలని నిర్ణయించటంపై సుల్తాన్ బజార్ వ్యాపారులు.. పాతబస్తీకి చెందిన వారు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. దీంతో అధికార పార్టీ లేనిపోని తలనొప్పులు ఎందుకని మెట్రో రైలును తమ ఖాతాలో వేసుకోకుండా జాగ్రత్త పడుతోంది.

రెండోరోజూ గందరగోళం

  కాల్‌మనీ వ్యవహారం మీద రెండోరోజు కూడా ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన వెంటనే కాల్‌మనీపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. కాల్‌మనీ వ్యవహారం మీద ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని, ఆ తర్వాత ఎంతసేపైనా చర్చించవచ్చని స్పీకర్ సూచించారు. చర్చ తర్వాత సీఎం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విలువైన సభా సమయాన్ని వృధా చేయడం మంచిది కాదని స్పీకర్ పలు పర్యాయాలు విజ్ఞప్తి చేసినా వైసీపీ సభ్యులు పట్టు వదల్లేదు. అయితే వైసీపీ నాయకులు సభను అడ్డుకోవడం న్యాయం కాదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రమం వ్యక్తం చేశారు. బీఏసీలో నిర్ణయించిన ఎజెండా ప్రకారమే సభ నడుస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ నాయకుడు సభా నిబంధనలు తెలియకుండా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. సభ జరగకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం సహించదని ఆయన స్పష్టం చేశారు.

హరీశ్ టార్గెట్ మిస్సయిందే..!

  తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మాటలకు ఎవరైనా ఫిదా అయిపోతారు. హరీశ్ రావు స్పెషల్ గా ఫోకస్ చేసి ఇతర పార్టీ  నేతలను తమ పార్టీలోకి తీసుకురావాలని ఫిక్స్ అయితే అది అయ్యేంతవరకూ వదిలిపెట్టరు. ఆయన మాటలకు ఎంత పెద్ద నేత అయినా కన్విన్స్ అవ్వాల్సిందే. మరి అలాంటి హరీశ్ రావుకు ఒక నేత ఝలక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇప్పటికే ఎంతో మందిని కారెక్కించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హరీశ్ రావు కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే.. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన వివేక్ పైనా ఫోకస్ చేశారు. ఆయన్ను కారెక్కించడానికి చాలా కన్విన్స్ చేశారంట హరీశ్ రావు. కానీ వివేక్ మాత్రం చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడుతూ తాను కారు ఎక్కలేనని చెప్పారంట. దీంతో హరీశ్ రావుకు మొదటిసారి భిన్నమైన అనుభవం ఎదురైంది. అయితే హరీశ్ రావు మాత్రం తాను సిట్టింగ్ వేసిన తర్వాత టార్గెట్ పూర్తి కాకపోవటం అన్నది ఉండదని వివేక్ ను ఉద్దేశించి హరీశ్ వ్యాఖ్యానిస్తే.. దానికి బదులుగా వివేక్ తనకు వ్యక్తిగతంగా హరీశ్ అంటే ఎంతో అభిమానమని.. కాకుంటే పార్టీ మారే విషయంలో తాను ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేనని తేల్చినట్లు చెబుతున్నారు. మొత్తానికి హరీశ్ రావు ఆకర్ష్ మంత్రం వికర్ష్ అయింది. మరి వివేక్ ను కారు ఎక్కిండానికి ఇంకా ట్రై చేస్తారో లేక.. టార్గెట్ వదిలిపెడతారో చూడాలి.

చాట్ల శ్రీరాములు కన్నుమూత

  నాటకరంగ ప్రముఖుడు చాట్ల శ్రీరాములు (85) కన్నుమూశారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చాట్ల శ్రీరాములు 1931లో విజయవాడలో జన్మించారు. ఆయన నాటక రంగంలో విశేష కృషి చేశారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ నుంచి పురస్కారాన్ని అందుకున్నారు. ఎన్టీఆర్ పురస్కారంతోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు. చాట్ల శ్రీరాములు రైల్వే ఉద్యోగిగానే పనిచేస్తూ 1976 నుంచి నాటకరంగంలో కృషి చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో మొట్టమొదటి అనౌన్సర్‌గా చాట్ల శ్రీరాములు పనిచేశారు. చాట్ల శ్రీరాములు కొన్ని సినిమాలలో కూడా నటించారు.

చంద్రబాబు నాయుడుకి అరుదయిన పురస్కారం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి చాలా అరుదయిన పురస్కారం దక్కింది. అమెరికాలో ఇల్లినాయిస్‌ రాష్ట్రంలో గల షికాగో విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అరుదయిన పురస్కారానికి తన పేరును ఎంపిక చేయడంపై స్పందిస్తూ “నేను రాష్ట్రాభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల మనసులలో శాస్విత స్థానం దక్కించుకోగలిగితే నా జన్మ ధన్యమయినట్లు భావిస్తాను. అంతకంటే గొప్ప డాక్టరేట్ మరొకటి ఉండదు. ఇదివరకు కూడా నాకు కొన్ని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ ఇవ్వాలనుకొన్నాయి. కానీ వాటిని సున్నితంగా తిరస్కరించాను. షికాగో విశ్వవిద్యాలయం అందిస్తున్న ఈ డాక్టరేట్ స్వీకరించడం చాలా గౌరవంగానే భావిస్తున్నాను కనుకనే స్వీకరించేందుకు అంగీకరించాను,” అని తెలిపారు. ఈ విషయం తెలియగానే తెదేపా నేతలు, మంత్రులు, అనేక మంది ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. యాదృచ్చికంగానే సరిగ్గా ఇవ్వాళ్ళే ప్రముఖ రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించబడింది. ఒకే రోజున తెలుగు రాష్ట్రానికి రెండు అపురూపమయిన పురస్కారాలు లభించడం విశేషమే.

ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

  ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గా 2015సం.కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆమె వ్రాసిన ‘విముక్త’ కధా సంపుటికి గాను ఈ అత్యున్నత సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆమె అసలు పేరు పోపూరి లలిత కుమారి. ఆమె కలం పేరు ఓల్గా. కానీ ప్రజలకు ఆమె ఓల్గా గానే తెలుసు. ఆమె 1950సం.లో గుంటూరులో జన్మించారు. తెలుగు సాహిత్యం మీద అభిరుచితో ఆమె ఆంధ్రవిశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. చేశారు. 1973 నుంచి 86 వరకు తెనాలి వీఎస్‌ఆర్‌-ఎన్‌వీఆర్‌ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేశారు.   ఆమె స్త్రీవాద రచయితగా అందరికీ సుపరిచితులు. అదే విధంగా స్త్రీల సమస్యలపై పోరాడిన వ్యక్తిగా సుపరిచితురాలు. ఆమె రచించిన ఆకాశంలో సగం, కుటుంబ వ్యవస్థ, విముక్త వంటి కధలు, స్వేచ్ఛ, ఓల్గా వంటి కవితలు అనేక నాటికల ద్వారా తెలుగు సాహితీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యక స్థానం, గుర్తింపు సంపాదించుకొన్నారు. ఆమె 1986 నుంచి 95 వరకు సుమారు 15 సినిమాలకు పనిచేశారు. ఇప్పుడు సాహితీ రంగంలో ఈ అత్యున్నత పురస్కారానికి ఆమె కధా సంపుటి ఎంపిక కావడం తెలుగు సాహిత్యానికి జరిగిన పట్టాభిషేకమేనని చెప్పవచ్చును.

వెంకయ్యకు కేసీఆర్ లేఖ.. సాయం చేయండి..

హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కోసం కేంద్రం సాయం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రమంత్రి వెంకయ్యకు లేఖ రాసినట్టు తెలుస్తోంది. కేవలం రూ.100 కోట్లతో హైదరాబాద్ లో అభివృద్ధి అసాధ్యమని.. ఇప్పుడు హైదరాబాద్ ను మళ్లీ స్మార్ట్ సిటీ పథకంలో చేర్చారు.. ఈ నేపథ్యంలో కేవలం 100 కోట్లతో ఏం చేయలేం అని స్పష్టం చేశారు. రూ.5,500 కోట్లు వార్షిక బడ్జెట్ కలిగిన జీహెచ్‌ఎంసీ..  625 కిలో మీటర్ల పరిధిలో విస్తరించి హైదరాబాద్ ఏ-1 కేటగిరి నగరంగా ఉన్న హైదరాబాద్ కు రూ.100 కోట్లు మాత్రమే ఇస్తే ఎటువంటి పనులు చేపట్టలేమన్నారు. హైదరాబాద్ స్థానంలో స్మార్ట్ సిటీగా కరీంనగర్‌ను ఎంపిక చేయాలని.. దీంతో కరీంనగర్‌లో ప్రణాళికాబద్దంగా అభివృద్ధి సాధ్యమవుతోందని అందులో పేర్కొన్నారు.

ఆశా వర్కర్ల ఆశ నెరవేరెనా..?

తమ కనీస వేతనాలు రూ. 15 వేలు చెల్లించాలని ఆశా వర్కర్లు గత మూడు నెలలుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ వారి సమస్యకు మాత్రం ఇంతవరకూ పరిష్కారం దొరకలేదు. పోనీ వాళ్లు కోరేది ఎమన్నా ప్రభుత్వాలు ఇవ్వడానికి కష్టతరమైనదా అంటే కాదు..  విద్యార్హతలు కలిగి అర్హులు అయిన వారిని రెండో ఏఎన్ ఎంగా తీసుకోవాలని - పింఛను - గ్రాట్యుటీ - ప్రసూతి సెలవులను కేటాయించాలని..ఇక గర్భిణులను ఆస్పత్రికి తీసుకెళ్లడం తీసుకు రావడం చేస్తుంటారు. ఇందుకు టీఏ - డీఏ ఇవ్వాలని కోరుతున్నారు. ప్రమాద బీమా కల్పించాలని ప్రసూతి సేవల పారితోషికం పెంచాలని కోరుతున్నారు. నిజానికి ఇవన్నీ పెద్ద ప్రతిపాదనలు కాదనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులుకు నెలకు వేలకు వేలు చెల్లించే వారికి ఇది పెద్ద విషయమే కాదు. కానీ వీరి సమస్యను పరిష్కరించేవారు లేరు. ఇక ఈవిషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత అప్పట్లో తమ సమస్యలను పార్లమెంట్లో వినిపిస్తామని చెప్పింది కానీ అప్పటినుండి ఇప్పటి వరకూ దాని గురించి మాట్లాడింది లేదు. పోనీ ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకుంటుందా అంటే లేదు.. కేంద్రం కూడా పట్టించుకోవడంలేదు. ఎవరో ఒకరు పరిష్కరిస్తారులే అని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేతులు కట్టుకొని చూడటం వల్ల ఈ సమస్యకు అలాగే కొనసాగుతుంది. వారు ఇంకా ఆందోళనలు చేస్తున్నారు. మరి వారి సమస్యకు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందో కాలమే సమాధానం చెప్పాలి.

నేషనల్ హెరాల్డ్.. సోనియా, రాహుల్ ఏం చేస్తారో..?

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ  అధినేత్రి సోనియాగాంధీ.. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 19వ తేది అంటే శనివారం కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసులో కోర్టుకు హాజరైన తరువాత సోనియాగాంధీ.. రాహుల్ గాంధీ ఇంటికి వెళతారా? లేక జైలుకు వెళతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి సోనియా గాంధీ ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు బెయిల్ కు దరఖాస్తు చేసుకుంటారు.. కానీ రాహుల్ గాంధీ మాత్రం జైలుకు వెళ్లడానికి రెడీ కానీ బెయిల్ కు దరఖాస్తు చేసేది లేదని గతంలోనే డిసైడ్ అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏన్డీఏ ప్రభుత్వం విధి విధానాలను ఎండగట్టే దిశగా జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని సోనియా, రాహుల్ పార్టీ వర్గాలతో అన్నట్టు సమాచారం. అంతేకాదు అలా జైలుకి వెళ్లి ప్రజల సానుభూతిని మరింతగా కొట్టేయాలనే భావనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ రాహుల్, సోనియాల కేసు వాదించనున్నారు. ఈ నేపథ్యంలో లాయర్లు ఏం చెబితే సోనియా, రాహుల్ అది చేస్తారని పార్టీ నేతలు తెలుపుతున్నారు. మరి ఏం జరుగుతుందో శనివారం వరకూ ఆగాల్సిందే.

జగన్ గాలి తీసిన చంద్రబాబు..!

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు చాలా వేడిగా మొదలయ్యాయి. ప్రారంభమైన తొలి రోజే అసెంబ్లీలో రచ్చ రచ్చ చేసేశారు విపక్ష నేతలు. కాల్ మనీ పై రేపు మాట్లాడదాం అంటూ అధికార పక్ష నేతలు ఒకటికి రెండు సార్లు చెప్పిన వినకుండా.. ఈరోజే మాట్లాడదాం అంటూ వైసీపీ నేతలు పట్టుబట్టారు. దీంతో సజావుగా సాగాల్సిన సభ కాస్త రసాభాసగా తయారైంది. ఇక లాభం లేక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ సందర్బంగా చంద్రబాబు వైసీపీ నేతల గాలి తీసేసినట్టు తెలస్తోంది. ఎందుకంటే వైసీపీ పార్టీలో చాలామంది నేతలు కొత్తవారే కావడం.. అందునా సభకు అడ్డుపడింది కూడా తొలిసారి ఎన్నికైనా వారే కావడంతో..చంద్రబాబు వైకాపాలో జగన్ తో సహా అందరూ సభకు కొత్తవారే కావడం వల్ల ఇబ్బంది తలెత్తుతోందని అన్నారు. అంటే జగన్ తో పాటు జగన్ బ్యాచ్ కు రాజకీయాల్లో అనుభవం లేదని.. అందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఎటకారం చేస్తున్నట్టు చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు స్పష్టంగా అర్ధమవుతోంది.