రేవంత్ రెడ్డి కుమార్తె వివాహం.. టీఆర్ఎస్ నేతలు ఎక్కడ?

టీడీపీ నేత రేవంత్ రెడ్డి కుమార్తె నైమిష రెడ్డి వివాహం నిన్న అంగరంగవైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహానికి ఎంతోమంది రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఇంత మంది ప్రముఖులు హాజరైన టీఆర్ఎస్ కు చెందిన నేతలు ఒక్కరు కూడా ఈ పెళ్లి వేడుకలో కనిపించలేదు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివాహ పత్రిక అందిచాలని.. తన కూతురు వివాహానికి కేసీఆర్ కుటుంబాన్ని ఆహ్వానించాలని అనుకుంటున్నట్టు వార్తలు కూడా జోరుగానే వచ్చాయి. కానీ రేవంత్ రెడ్డి ఎటువంటి ఆహ్వానం అందించలేదు. అంతేకాదు దీనికి ఓటు నోటు కేసు కూడా ఒక కారణం కావచ్చు అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే ప్రతిపక్ష నేత అయిన జగన్ ను కూడా ఆహ్వానించిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ను ఆహ్వానించకపోవడంతో ఇదే కారణమై ఉండచ్చు అని అనుకుంటున్నారు. మొత్తానికి రేవంత్ పెళ్లి పిలుపుల్లో విభజన స్పష్టంగా కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

రోజా సస్పెన్షన్ పై జగన్ పట్టు.. సస్పెన్షన్ ఎత్తేసేది లేదు.. యనమల

అసెంబ్లీలో రోజా సస్పెన్షన్ ఇరు పార్టీ నేతల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఒకవైపు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలని పట్టుబట్టి.. రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయకుంటే సభలో ఉండమని.. ఈ సమావేశాలకు బాయ్ కట్ చెబుతామని అంటుంటే.. మరోవైపు తెలుగు దేశం పార్టీ నేత యనమల మాత్రం రోజాపై సస్పెన్షన్ ఎత్తేసే ప్రసక్తే లేదని.. సస్పెన్షన్ పై కోర్టుకు వెళ్లినా మాకు అభ్యంతరం లేదని.. రోజా సస్పెన్షన్ పై ఏడాది నుండి తగ్గించేది లేదని తేల్చిచెబుతున్నారు. ఇదిలా ఉండగా వైఎస్ఆర్సీ ఎల్పీలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేపు స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మళ్ళీ అర్ధరాత్రి తెరుచుకొన్న సుప్రీం కోర్టు తలుపులు

  సుమారు ఐదు నెలల క్రితం, ముంబై వరుస బాంబు ప్రేలుళ్ళ కేసులో నిందితుడు యాకూబ్ మీమన్ ఉరి శిక్షని నిలిపివేయాలని కోరుతూ దాఖలయిన పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు జూలై 30వ తేదీన అర్ధరాత్రి సమావేశమయింది. నిర్భయ కేసులో బాల నేరస్థుడి విడుదలపై స్టే కోరుతూ డిల్లీ మహిళా కమీషన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకుర్‌ నేతృత్వంలో జస్టిస్‌ ఏకే గోయెల్‌, జస్టిస్‌ యు.యు.లలిత్‌ల సుప్రీం ధర్మాసనం మళ్ళీ నిన్న అర్ధరాత్రి 1.30 గంటలకు జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకుర్‌ నివాసంలో సమావేశమయింది.   న్యాయవాదులు గురు కృష్ణ కుమార్‌, దేవ్‌దత్‌ కామత్‌ తదితరులు ఈ విచారణలో వాదించారు. వారి వాదోపవాదాలు విన్న తరువాత సుప్రీం త్రిసభ్య ధర్మాసనం బాలనేరస్తుడి విడుదలపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కానీ ఇదే కేసుపై దాఖలయిన మరొక పిటిషన్ పై సోమవారం విచారణ చేపడుతున్నందున అప్పుడు తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.   బాల నేరస్థుడిని విడుదల చేసిన తరువాత పోలీసులు అతనిని డిల్లీలోనే ఒక స్వచ్చంద సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ అతని భద్రత ద్రష్ట్యా అతని పేరుతో సహా పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని మార్చివేయబోతున్నట్లు సమాచారం. కొన్ని రోజులపాటు అతని చేత సమాజసేవ కార్యక్రమాలలో చేయించిన తరువాత అతనిని విడిచిపెడతారని సమాచారం. కానీ ఒకవేళ సుప్రీం కోర్టు అతని నిర్బంధం పొడిగించాలని నిర్ణయించినట్లయితే, అతను మళ్ళీ జైలుకి వెళ్ళక తప్పదు. కానీ ఈరోజు తెల్లవారు జామున సుప్రీం ధర్మాసనం అభిప్రాయాన్ని బట్టి చూసినట్లయితే అతని విడుదలపై స్టే మంజూరు చేయకపోవచ్చునని భావించవచ్చును.

తిరుమలలో లక్షమంది భక్తులు

  శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకోవడం కోసం లక్ష మందికి పైగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్.లోని కంపార్టుమెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. అంతే కాకుండా నారాయణగిరి ఉద్యానవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కంపార్ట్.మెంట్లు కూడా భక్తులతో నిండిపోయాయి. అన్ని కంపార్టుమెంట్లూ నిండి రోడ్డు మీద రెండు కిలోమీటర్ల మేరకు భక్తులు క్యూ కట్టారు. అలాగే కాలి నడక మార్గం ద్వారా భారీ సంఖ్యలో గోవిందమాల భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అనేక ఏర్పాట్లు చేసింది.

అజహర్... ముచ్చటగా మూడో పెళ్ళి

  మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు అజహరుద్దీన్ ముచ్చటగా మూడో పెళ్ళి చేసుకున్నాడు. అజహర్ వయసు ఇప్పుడు 52 సంవత్సరాలు. ఆయన అమెరికాకు చెందిన షానన్ మేరీని వివాహం చేసుకున్నట్టు సమాచారం. 2013 నుంచీ వీరిద్దరూ స్నేహితులట. వీరిద్దరూ పెళ్ళి చేసుకుని ఉత్తర ప్రదేశ్‌లోని షామ్లీలో హనీమూన్ కోసం వచ్చారని మహారాష్ట్రకు చెందిన ఒక పత్రిక కథనాన్ని ఇచ్చింది. అజహర్ గతంలో మొదట నౌరీన్‌ అనే యువతిని పెళ్ళాడాడు. ఆమెకు తలాక్ చెప్పేసి సంగీతా బిజిలానీని పెళ్ళాడాడు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేసి ఇప్పుడు షానన్ మేరీని వివాహం చేసుకున్నాడు. ముస్లిం, హిందూ, క్రైస్తవ... ఈ మూడు మతాలకూ చెందిన వారిని పెళ్ళి చేసుకుని తనకు ‘మత అసహనం’ లేదని నిరూపించిన అజహర్‌కి మూడోపెళ్ళి శుభాకాంక్షలు.

సినీ నటుడు రంగనాథ్ ఆత్మహత్య

  ప్రముఖ సినీనటుడు రంగనాథ్ (66) శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. రంగనాథ్ 1949లో చెన్నైలో జన్మించారు. రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీ రంగనాథ్‌. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. రైల్వే టీసీగా పనిచేస్తూ, ఉద్యోగాన్ని విడిచిపెట్టి సినిమారంగంలోకి ప్రవేశించారు. బుధ్దిమంతుడు సినిమాతో సినిమా రంగానికి వచ్చిన ఆయన 1973లో 'చందన' అనే సినిమాలో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. 'పంతులమ్మ' సినిమా ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించారు. రంగనాథ్ సుమారు 300 చిత్రాలకు పైగా చిత్రాల్లో నటించారు. పలు టీవీసీరియల్లోనూ నటించారు. మొగుడ్స్‌-పెళ్లామ్స్‌ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు ఆయన. 50 చిత్రాల్లో హీరోగా, 50 చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలు పోషించిన రంగనాథ్ ప్రేక్షకుల నుంచి మంచి నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. రంగనాథ్ ఆత్మహత్య పట్ల తెలుగు సినిమా రంగం, తెలుగు ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. రంగనాథ్ సున్నితమైన హృదయం కలిగిన వ్యక్తి. దశాబ్దాల క్రితం ఆయన భార్య మేడ మీద నుంచి కింద పడిపోవడం వల్ల కాళ్ళు పడిపోయాయి. మంచానికే పరిమితమైన ఆమెకు రంగనాథ్ ఎంతో సేవ చేశారు. ఒక మంచి భర్తగా రంగనాథ్ పేరు పొందారు. అయితే ఆమె కొద్దికాలం క్రితం మరణించారు. తనతో ఎంతో అనుబంధం పెనవేసుకున్న భార్య మరణాన్ని రంగనాథ్ జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి మనిషిలో ఎంతో మార్పు వచ్చింది. ఇటీవల ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ, తనకు జీవితంలో ఇంకేమీ కోరికలు లేవని... మరణం కోసం ఎదురుచూస్తున్నానని వ్యాఖ్యాన్నించారు.

సోనియా, రాహుల్ గాంధీ లకు బెయిలు మంజూరు

  నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధిలతో సహా మిగిలిన అందరికీ డిల్లీ పాటియాలా హౌస్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసు గురించి గత రెండు మూడు వారాలుగా చర్చ జరుగుతోంది. దీని కోసమే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుని కూడా స్తంభింపజేస్తోంది. కానీ కేవలం ఇదు నిమిషాలలోనే ఈ కేసు విచారణ ముగిసిపోయింది. సోనియా, రాహుల్ తరపున కాంగ్రెస్ పార్టీకే చెందిన మాజీ కేంద్రమంత్రులు మరియు ప్రముఖ లాయర్లు అయిన కపిల్ సిబాల్ మరియు అభిషేక్ సింఘ్వీ వాదించారు. ఈ పిటిషన్ వేసిన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వారికి బెయిల్ మంజూరు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వారికి బెయిలు ఇచ్చినట్లయితే దేశం విడిచి పారిపోవచ్చని వాదించారు. కానీ కోర్టు ఆయన వాదనలను తిరస్కరించి ఈ కేసులో నిందితులుగా ఉన్న సోనియా, రాహుల్, మోతీలాల్ ఓరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబేలు ఒక్కొకరికీ రూ. 50,000 విలువ గల వ్యక్తిగత పూచికత్తుపై బెయిలు మంజూరు చేసి ఈ కేసును వచ్చే ఏడాది ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.   సోనియా గాంధీకి మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ పూచీకత్తు ఇవ్వగా, రాహుల్ గాంధీకి ఆయన సోదరి ప్రియాంకా వద్రా, ఆస్కార్ ఫెర్నాండెజ్ కి గులాం నబీ ఆజాద్ పూచీకత్తు సమర్పించారు. మొదట ఈ కేసులో బెయిలు తీసుకోకుండా జైలుకి వెళ్లాలని రాహుల్ గాంధి భావించారు. కానీ పార్టీలో సీనియర్ నేతలు మరియు తమ తరపునవాదిస్తున్న కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వీల సలహాల మేరకు ఆ ఆలోచన విరమించుకొన్నారు.

నాంపల్లి పోలీసులకు జగన్ వార్నింగ్!

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యే రోజాని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసు అధికారులతో ఘర్షణ పడ్డారు. తమ మహిళా ఎమ్మెల్యే రోజా పట్ల సరిగ్గా వ్యవహరించకాపోతే కోర్టుకి వెళ్లి అందరి ఉద్యోగాలు ఊడగొట్టిస్తా కబడ్ధార్! అని డ్యూటీలో ఉన్న పోలీసులని బెదిరించారు. ఈ విషయం ఆయనకి చెందిన సాక్షి మీడియాలో కూడా ప్రచురించబడింది. స్పృహ తప్పి ఉన్న రోజాను పోలీసులు తమ వ్యాన్ లోనే నీమ్స్ ఆసుపత్రికి తరలించబోతుంటే జగన్ మళ్ళీ అడ్డుపడ్డారు. ఆమెను అంబులెన్స్ లోనే తరలించాలని పట్టుబట్టారు. ఆయన మాటకు ఎదురు చెప్పే సాహసం లేక పోలీసులు అంబులెన్స్ ని రప్పించి అందులో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అధికారంలో లేనప్పుడే జగన్ తీరు ఇలాగ ఉంటే, నిజంగా ముఖ్యమంత్రి అయితే ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చును.   ఆయన ఒక ప్రజా ప్రతినిధి కనుక ఆయన ప్రవర్తన నలుగురికీ ఆదర్శంగా ఉండాలి. నలుగురికి కాకపోయినా కనీసం తన పార్టీలో నేతలకయినా ఆదర్శంగా ఉండాలి. కానీ ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా ఆయనే ఈవిధంగా వ్యవహరిస్తుంటే, ఇక గిడ్డి ఈశ్వరి, రోజా వంటివారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు? అందుకే ఒకరు ముఖ్యమంత్రిపైకి దూసుకువెళితే, మరొకరు ముఖ్యమంత్రినే తలనరుకుతా అని బెదిరించగలిగారనుకోవాలి. నాంపల్లి పోలీసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రింద పనిచేయడం లేదు. వారు తెలంగాణా ప్రభుత్వం క్రింద పనిచేస్తుంటారు. కనుక జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఆదేశాలను పాటించనవసరం లేదు. పైగా డ్యూటీలో ఉన్న తమను ఉద్యోగాలు ఊడగోడతానని బెదిరించినందుకు తిరిగి కేసు కూడాపెట్టవచ్చుననే సంగతి ఆయన గ్రహించినట్లు లేదు. ఒకవేళ తెలంగాణా ప్రభుత్వం దీనిని సీరియస్ గా తీసుకొంటే అది అంతర్ రాష్ట్ర సమస్య అవుతుంది కూడా. జగన్మోహన్ రెడ్డికి స్పీకర్ పట్ల గౌరవం లేదు. ముఖ్యమంత్రి పట్ల గౌరవం లేదు. ఇప్పుడు పోలీసులన్నా తనకు చాలా చులకనే అని నిరూపించుకొన్నారు.

ప్రతిపక్షనేతను సస్పెండ్ చేయోచ్చా..?

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి మధ్య వాగ్వాదం రోజు రోజుకూ పెరుగుతుందో తప్ప ఏమాత్రం తగ్గే పరిస్థితి కనిపించడంలేదు. ఇప్పటికే వీరి వాదనలతో అసెంబ్లీ దద్దరిల్లుతోంది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల గురించి మాత్రం ఒక అంశం ఇప్పుడు చర్చాంశనీయమైంది. అదేంటంటే అంబేద్కర్ జయంతి సందర్బంగా ఆయనపై చర్చకు ప్రతిపక్షనేతలు అడ్డుతగులుతుండటంతో స్పీకర్ జగన్ సహా వేసీపీ నేతలందరిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అసలు ప్రతిపక్ష నేతను సస్పెండ్ చేయోచ్చా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అయితే కొంత మంది రాజకీయ నిపుణులు మాత్రం ఇప్పటివరకూ అయితే ఇలాంటి సంఘటన చోటుచేసుకోలేదని అంటున్నారు. మరోవైపు సభలో జరిగిన పరిస్థితి చూస్తే విపక్ష నేతపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం లేదని అంటున్నారు. అంతేకాదు స్పీకర్ కోడెల శివప్రసాద్ విపక్ష నేత వైఎస్ జగన్ పేరును మినహాయించి మిగిలిన వారి చదవటమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలోనూ విపక్ష నేతను సస్పెండ్ చేసిన దాఖలాలు లేవని అంటున్నారు. మరి ఈ విషయంపై అధికార పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

నేడు కోర్టుకు సోనియా, రాహుల్..!

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ..ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు కోర్టుకు హాజరుకానున్నారు. దీంతో పటియాలా కోర్టు దగ్గర కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కోర్టు ఆవణలో సుమారు 16కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న షాపులను కూడా పోలీసులు మూయించారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా తమ ఎంపీలను ఢిల్లీలోనే ఉండాలని ఆదేశించిందట. మరోవైపు ఇక్కడ తెలంగాణలో సోనియా, రాహుల్ కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ సోనియా, రాహుల్ ను అరెస్ట్ చేస్తే జైలుభరో నిర్వహించాలని కూడా నిర్ణయించుకున్నారంట. ఇదిలా ఉండగా ఈ విషయంపై వెంకయ్య నాయుడు మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ హయాంలోదే అని.. దీనివల్ల పార్లమెంట్ సమావేశాలకు అడ్డుపడటం సమంజసం కాదని.. పార్లమెంట్ సమావేశాలకు ప్రతిపక్షాలు సహకరించాలని అన్నారు.

అసెంబ్లీ.. రోజా సస్పెన్షన్ పై గందరగోళం

ఈ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా ప్రారంభమయ్యాయి. రోజా సస్పెన్షన్ పై సభలో గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదాలు తలెత్తాయి.  నిన్న స్పీకర్ వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సంవత్సరంపాటు సస్పెన్షన్ వేటు వేసిన నేపథ్యంలో ఈ రోజు వైసీపీ నేతలు రోజా సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆందోళన చేపట్టారు. వైకాపా అధినేత జగన్ మాట్లాడుతూ రోజాను ఏ నిబంధనల ప్రకారం అరెస్ట్ చేశారు.. సభలో ప్రశ్నించే హక్కు లేదా అని ప్రశ్నించారు. లేని అధికారాన్ని దుర్వినియోగపరిచారు.. ఏడాది పాటు సస్పెండ్ చేయడం చట్ట విరుద్దం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైకాపా ఎమ్మెల్యేగిడ్డి ఈశ్వరి అరెస్ట్ కు హైకోర్టు నో!

  ఈనెల 10వ తేదీన విశాఖ ఏజన్సీ ప్రాంతంలోని చింతపల్లి వద్ద వైకాపా అధ్యక్షుడు జగన్ బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన బహిరంగ సభలో, పాడేరు వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల అసభ్యంగా మాట్లాడి, ఆయన తల నరుకుతానని హెచ్చరించారు. అందుకు ఆమెపై పాడేరు, చింతపల్లి, అరుకు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ఆమె శ్రీరామ్ అనే న్యాయవాది ద్వారా హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ కక్షతో తనపై అన్యాయంగా మోపబడిన కేసులను రద్దు చేయాలని ఆమె తన పిటిషన్ ద్వారా హైకోర్టుని కోరారు. కానీ కోర్టు ఆమె అభ్యర్ధనను తిరస్కరించింది. అయితే ఆమెను పోలీసులు అరెస్ట్ చేయకుండా స్టే మంజూరు చేయడంతో ఆమెకు ఊరట లభించింది. ఈ కేసులో పోలీసులు తమ దర్యాప్తుని కొనసాగించదానికి హైకోర్టు అనుమతించింది.

ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ కి నేడు శంఖుస్థాపన

  గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో నిర్మించబోతున్న ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్ (ఎయిమ్స్)కి నేడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా ఉదయం 11 గంటలకు శంఖుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజన చౌదరి, అశోక్ గజపతి రాజు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్, రాష్ట్ర మంత్రులు, తెదేపా, బీజేపీల నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. శంఖుస్థాపన కార్యక్రమం ముగిసిన తరువాత అక్కడే ఒక బారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు.

హెయిర్‌ స్టైల్ నచ్చలేదని...

  తన కొడుకు హెయిర్ స్టైల్ నచ్చలేదని ఓ తండ్రి కుటుంబం మొత్తాన్నీ నరికి చంపిన ఘోరమైన ఘటన రష్యాలో జరిగింది. ఓలెక్ బెలోవ్ అనే వ్యక్తి భార్య, ఆరుగురు పిల్లలతో నివసిస్తున్నాడు. ఓలెక్ భార్య తన ఆరేళ్ళ కొడుక్కి వెరైటీ స్టైల్లో హెయిర్ కట్ చేయించింది. ఆ స్టైల్ ఓలెక్‌కి నచ్చలేదు. దాంతో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ ముదిరి ఆమె విడాకులు ఇస్తానని అనేవరకూ వెళ్ళింది. దాంతో అతని ఆగ్రహం కట్టలు తెచ్చుకుని తన భార్యని, ఆరుగురు పిల్లల్ని దారుణంగా నరికి చంపాడు. చనిపోయే సమయంలో అతని భార్య ఆరు నెలల గర్భవతి. భార్యను, పిల్లలను నరికి చంపిన తర్వాత ఓలెక్ కత్తి చేత పుచ్చుకునే తన తల్లిదగ్గరకి వెళ్ళి ఆమెను కూడా నరికి చంపాడు. శవాలన్నిటినీ ప్లాస్టిక్ సంచుల్లో కుక్కేశాడు. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి లొంగిపోయాడు.  

నిర్భయ కేసు.. బాల నేరస్తుడు విడుదల?

ఢిల్లీలో నిర్భయ ఉదంతం గురించి అందరికి తెలిసిందే. ఈ దారుణమైన ఘటన జరిగి ఇప్పటికే మూడు సంవత్సరాలు అయింది. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న బాల నేరస్థుడి కూడా రేపటితో శిక్ష గడువు ముగియనుంది. మరోవైపు నిర్భయ తల్లి దండ్రులు ఆ నిందితుడిని విడిచిపెట్టొద్దని ఆరోపిస్తున్నారు. అంతేకాదు కేంద్రం, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, బీజేపీ నేత సుబ్రహ్మణ్యం కూడా నిందితుడిని వదిలిపెట్టొద్దని పిటిషన్ దాఖలు చేశాడు. కానీ హైకోర్టు మాత్రం వాటిని తిరస్కరించి అతని విడుదల నిలుపుదలకు నో చెప్పింది. దీంతో రేపు ఆ నిందితుడు విడుదలయ్యే అవకాశం ఉంది.

రోజా పై చంద్రబాబు ఫైర్.. రోజాపై సంవత్సరం పాటు సస్పెన్షన్ వేటు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజా దూకుడిపై మండిపడ్డారు. చంద్రబాబు కాల్ మనీ గురించి ప్రకటన చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు ఆయన వద్దకే వచ్చి ఆందోళనలు చేపట్టారు. దీనికి రోజా ప్రాతినిద్యం వహించడంతో చంద్రబాబు ఆమెపై ఫైర్ అయ్యారు. ఆమె మహిళా? ఒక ఎమ్మెల్యేగా ఆమె మాట్లాడాల్సిన మాటలేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారం లేకుండా ఆమె చేస్తున్న నినాదాలు ఏంటి అని నిప్పులు చెరిగారు. దీంతో రెచ్చిపోయిన రోజా చంద్రబాబుకు వ్యతిరేకంగా మళ్లీ ఆందోళనలు చేపట్టారు. దీంతో సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయాలని మంత్రి యనమల స్పీకర్ ను ప్రతిపాదించగా.. స్పీకర్ కోడెల కూడా ఆయన ప్రతిపాదనను ఆమోదించారు. దీంతో రోజాను సంవత్సరంపాటు సస్పెండ్ చేశారు.