కన్నాకు క్లాస్ పడాల్సిందేనా..?

టీడీపీ, బీజేపీలు మిత్రపక్షమని అందరికీ తెలిసిన విషయమే. కానీ మిత్రపక్షమైనప్పటికీ బీజేపీ నేతలు మాత్రం అప్పుడప్పుడు టీడీపీ నేతలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే బీజేపీ నేతలు చేసిన విమర్శలను టీడీపీ నేతలు మొదట పట్టించుకోకపోయినా.. ఆతరువాత మాత్రం వారి విమర్సలకు ధీటుగానే సమాధానం చెపుతూ వచ్చారు. మొన్న‌టి వ‌ర‌కూ రాజ‌మండ్రికి చెందిన సోము వీర్రాజు వంటి నేతలు టీడీపీ నేతలపై విరుచుకుపడేవారు.. అయితే ఆయన దూకుడుకు కళ్లెం వేయాలని నిర్ణయించుకున్న బీజేపీ ఆయనకు ఫుల్లు క్లాస్ తీసుకొని వదిలిపెట్టింది. ఇక అప్పటినుండి సోము వీర్రాజు ఆయన నోటికి పని చెప్పడం తగ్గించారు. ఇప్పుడు సోము వీర్రాజు లాగానే.. బీజేపీకి చెందిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కూడా టీడీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేయడం మొదలుపెట్టారు. రాష్ట్రాన్ని కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటున్నా ఏపీ అభివృద్ధికి నిధులు ఇవ్వ‌డం లేద‌ని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడటం సరికాదని.. రాజకీయ పబ్బంగడుపుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై లేనిపోని అబాండాలు మోపాలని చూస్తే ఊరుకునేదిలేదని కాస్త ఘాటుగానే విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఎప్పటికప్పుడు సహాయపడుతూనే ఉందని.. అన్నీ ఆలోచించుకోవాలని అన్నారు. ఇక ఇప్పుడు కన్నా చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నా నోరు అదుపులో పెట్టుకోవాలని.. అతనికి కూడా క్లాస్ పడితే కాని సైలెంట్ గా ఉండడని అంటున్నారు. మరి కన్నా వ్యాఖ్యలకు బీజేపీ అతనికి క్లాస్ పీకుతుందో.. లేదో చూడాలి.

నేనెక్కడికీ వెళ్లలేదు.. పుణ్యక్షేత్రాలకి వెళ్లా.. మల్లాది

కల్తీ మద్యం కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అజ్ఞాతం వీడి విజయవాడలో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు. కల్తీ మందు వ్యవహారంలో కేసు నమోదైన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన మల్లాది దాదాపు నెల రోజులు అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేనెక్కడికీ వెళ్లలేదు..పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లా అని తెలిపారు. విచారణ బృందం ఎదుట రేపు హాజరవుతా, విచారణకు సహకరిస్తా.. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటా అని మల్లాది అన్నారు. కృష్ణలంకలోని స్వర్ణబార్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదని.. ఎన్నికల అఫిడవిట్‌లో కూడా బార్ ప్రస్తావనే లేదని వెల్లడించారు. కాగా మల్లాది విష్ణు ముందస్తు బెయిన్ ను కోర్టు నిన్న డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు రేపు సిట్ అధికారుల ముందు తప్పనిసరిగా హాజరుకావాలని.. విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన నోటీసులను మల్దాది విష్ణు తరపు న్యాయవాదులకు అందించింది.

అజ్ఞాతం వీడిన మల్లాది విష్ణు..!

కల్తీ మద్యం కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గత నెల రోజుల నుండి అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన అజ్ఞాతం వీడినట్టు తెలుస్తోంది. అజ్ఞాతం వీడిన ఆయన కాంగ్రెస్ కార్యకర్తలతో భేటీ అయినట్టు సమాచారం. కాగా మల్లాది విష్ణు రేపు కృష్ణలంక పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదిలా ఉండగా మల్లాది విష్ణు ముందస్తు బెయిన్ ను కోర్టు నిన్న డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు రేపు సిట్ అధికారుల ముందు తప్పనిసరిగా హాజరుకావాలని.. విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన నోటీసులను మల్దాది విష్ణు తరపు న్యాయవాదులకు అందించింది.

టీడీపీకి కేటీఆర్ మద్దతు.. టీడీపీతో ఉండండి

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గెలుపు పంథాలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఎలాగైనా గెలుపొందాలని పావులు కదుపుతుంది. ఇక్కడ ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే.. అటు టీఆర్ఎస్ కు ఓటు వేయమని చెబుతూనే.. టీడీపీకి కూడా మద్దతు పలుకుతున్నారంట కేసీఆర్ తనయుడు కేటీఆర్.. కేటీఆర్ ఏంటీ.. టీడీపీకి మద్దతు పలకడమేంటీ అనుకుంటున్నారా.. అదేంటంటే.. గ్రేటర్ లో సెటిలర్లు ఎక్కువ కాబట్టి.. వారిని తమ వైపు ఆకర్షించేందుకు టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో సెటిలయిన రాజులను తమ వైపు తిప్పుకునే భాగంలో.. విభజన తరువాత సీమాంధ్రులు ఇక్కడ ఉంటే మా ప్రభుత్వానికి మద్దతివ్వండి.. ఏపీలో ఉంటే అక్కడ టీడీపీకి మద్దతు ఇవ్వండి అని ఓ కొత్త ప్ర‌తిపాద‌న ముందుకు తీసుకొచ్చారంట. అంతేకాదు కేటీఆర్ ప్రతిపాదనకు కొంతమంది  పెద్దలు సరే అన్నట్లు కూడా సమాచారం. ఇదిలా ఉండగా అన్ని స్థాయిల్లో ఉన్న `రాజు`లను కేటీఆర్ వద్దకు తీసుకెళ్లే బాధ్యత కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీసుకున్నారు. ఇక గ్రేట‌ర్లో ఉన్న క‌మ్మ సామాజిక‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఆధ్వ‌ర్యంలో వారిని గులాబి గూటికి చేర్చేందుకు కేసీఆర్ పెద్ద స్కెచ్ వేశారు. మొత్తానికి కేసీఆర్.. చంద్రబాబు సన్నిహితంగా ఉంటున్న వేళ కేటీఆర్ కూడా టీడీపీకి మద్దతు ఇవ్వడం శుభపరిణామమే.

తెలుగు విద్యార్ధులు తమిళంలో రాయాల్సిందే..

తమిళనాడు ప్రభుత్వం నిర్భంధ తమిళ చట్టంలో భాగంగా తెలుగు విద్యార్ధులు తప్పనిసరిగా తమిళంలోనే పరీక్షలు రాయాలని పట్టుబట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తమిళరాష్ట్రంలో ఉన్న తెలుగు సంఘాలు కోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కూడా తెలుగు విద్యార్థులకు తెలుగులోనే పరీక్షలు రాయించాలని ఆదేశించింది కూడా. అయితే తమిళనాడు మాత్రం ఇప్పుడు అవన్నీ తోసి పుచ్చి.. పలు పాఠశాలల విద్యార్థులకు తమిళంలోనే పరీక్షలు రాయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి.సబిత పేరుతో రాష్ట్రంలోని పలు పాఠశాలలకు లేఖలు కూడా పంపిచారు. ఆ లేఖల్లో సదరు విద్యార్థులు ఖచ్చితంగా తమిళంలోనే పరీక్షలు రాయాల్సిందేనని సబిత స్పష్టం చేశారు. మరి ఈ లేఖలకు తెలుగుసంఘాలు ఎలా స్పందిస్తాయో..

దాడి చేసింది మేమే..

పంజాబ్ లోని పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరిపిన సంగతి తెలిసిందే. గత నాలుగు రోజుల నుండి ఉగ్రవాదులు.. భద్రతా దళాల మధ్య కాల్పులు జరగుతూనే ఉన్నాయి. ఈ ఉగ్రదాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందగా, భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఇప్పుడు పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రదాడి చేసింది తామేనంటూ.. పాకిస్థాన్ ప్రేరేపిత యూనైటెడ్ జిహాద్ కౌన్సిల్(యూజేసీ) ప్రకటించుకుంది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాద సంస్థ హైవే స్కాడ్‌తో అనుబంధం ఉన్న ఐక్య జిహాది మండలి పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి దిగినట్లు పేర్కొంది. మరి దీనికి భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.  

పాక్ కు భారత్ హెచ్చరికలు..

  పంజాబ్ లోని పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఇండియా పాక్ పై ఇక కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేరథ్యంలోనే పాక్ హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. మూడు రోజుల్లో లష్కరే తోయిబా.. జోషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేకపోతే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని.. తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని హెచ్చరించారట. ఈ మేరకు పాకిస్థాన్ రాయబార కార్యాలయానికి సమాచారం అందించారట. అంతేకాదు అవసరమైత్ భారతదేశ వాయుసేన సహకారాన్ని తీసుకొని ఉగ్రవాదులపై దాడులు చేయాలని సూచించారట. ఈ ఆదేశాలను పాక్ కనుక పట్టించుకోకపోతే భారత్-పాక్ మధ్య చర్చలు నిలిచిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. మరి భారత్ ఆదేశాలకు పాక్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

కట్టుబట్టలతో బయటకు వచ్చాం.. పన్నులే ఆదాయం.. చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలో ఏర్పాటుచేసిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాను కరువు రహిత ప్రాంతంగా చేస్తామని వ్యాఖ్యానించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నాదేనని..భవిష్యత్తులో కరెంటు కోతలుండవని, వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు రూ. 24 వేల కోట్లతో రైతుల రుణమాఫీ చేశాం.. డ్వాక్రా మహిళలకు రూ 10 వేల చొప్పున రుణాలిచ్చామని తెలిపారు. విభజన తరువాత కట్టుబట్టలతో బయటకు వచ్చాం.. రాజధాని లేదు.. హైదరాబాద్  10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అయినా కానీ..అనేక సమస్యలు ఉన్నాయి.. అందుకే విజయవాడ నుండి పాలన చేస్తున్నామన్నారు. సరైన ఆదాయ వనరులు, నిధులులేని ఏపీకి ప్రజలు కట్టే పన్నులే ఆదాయమని, అటువంటిది పన్నులు చెల్లించడంలో అలక్ష్యం వహిస్తే ఎలాగని.. రాష్ట్రానికి ఆదాయం రావాలంటే ప్రజలు పన్ను కట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

తుమ్మలపై కేసీఆర్ అదనపు బాధ్యత..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుపై ఓ భరువైన బాధ్యతను పెట్టినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తెలంగాణలో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ 10 ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అస్సలు పట్టులేని ఖమ్మం జిల్లాలో.. ఆ జిల్లా అభ్యర్ధిని గెలిపించడంలో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ప్రముఖ పాత్ర వహించినందుకు గాను కేసీఆర్ తుమ్మలను ప్రశంసించినట్టు తెలుస్తోంది. అంతేకాదు త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికలో భాగంగా సీమాంధ్ర ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉండే స్థానాల్లో గెలుపు బాధ్య‌త‌ల‌ను కేసీఆర్ తుమ్మ‌ల‌కు అప్ప‌గించార‌ట‌. ముఖ్యంగా నగరంలోని కూకట్ పల్లి నియోజకవర్గంలో సెటిలర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ నియోజక వర్గ బాధ్యతలను అప్పగించారట. ఇంక టీడీపీ నుంచి తెరాస‌లో చేరిన మాధ‌వ‌రం కృష్ణారావుతో కూడా తుమ్మ‌ల‌కు స‌న్నిహిత సంబంధాలు ఉండటంతో  కూక‌ట్‌ప‌ల్లి నియోక‌వ‌ర్గంలో ఎక్కువ డివిజ‌న్ల‌ను తెరాస ఖాతాలో వేసే బాధ్య‌త‌ను తుమ్మ‌ల తీసుకున్నార‌ట‌. మరి కేసీఆర్ పెట్టిన బాధ్యతను తుమ్మల కనుక నెరవేర్చితే.. తుమ్మలకు మంచి ప్రాధాన్య లభించడంతో పాటు కేబినెట్లో మంచి స్థానం దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

చంద్రబాబు నిర్ణయం.. వైసీపీ షాక్.. తెలుగు తమ్ముళ్లు హ్యాపీ..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయానికి ప్రతిపక్ష పార్టీ నేతల సంగతి ఏమో కానీ టీడీపీ నేతలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారంట. అంతలా పార్టీ నేతలు సంతోషపడే పని చంద్రబాబు ఏం చేశారనుకుంటున్నారా.. నిధులు పేరిట వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజక వర్గంలో కూడా టీడీపీ ఇన్ ఛార్జ్ లకు  నియోజకవర్గ అభివృద్ధి నిధులను కేటాయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అంతేకాదు ఇందులో ఏదైనా ఇబ్బంది తలెత్తితే… వారికి నియోజకవర్గం పరిధిలో ఏదైనా బాధ్యతలు అప్పగించి చట్టపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే నిర్ణయానికి కూడా చంద్రబాబు వచ్చారంట. దీంతో ఒకవైపు వైసీపీ నేతలు ముఖ్యమంత్రి నిర్ణయానికి ఖంగుతింటే.. మరోవైపు తెలుగు తమ్ముళ్లు మాత్రం చంద్రబాబు సూపర్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీని నమ్ముకున్న తమ నాయకులను ఎందుకు దూరం చేసుకోవాలనే ఆలోచనతోనే చంద్రబాబు ఇలాంటి సరికొత్త నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మొత్తానికి చంద్రబాబు మాత్రం తమ పార్టీ నేతలను దూరం చేసుకోకూడదని భావిస్తున్నట్టు అర్ధమవుతోంది.

గ్రేటర్ ఎన్నికలకు వ్యూహాత్మకంగా టీఆర్ఎస్.. ఇన్‌చార్జ్ లకు ప్రచార కిట్

తెలంగాణలో త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల సంగతేమో కాని టీఆర్ఎస్ మాత్రం చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు నగరంలో పెద్ద పెద్ద హోర్డింగులు పెడుతున్నారు. ఇప్పుడు ఓటర్లను ఆకర్షించేందుకు సరికొత్త వ్యుహాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఒక్కో డివిజన్ ఇన్‌చార్జీకి ప్రచార సామగ్రితో కూడిన కిట్‌ను అందజేస్తోందట అధికార పార్టీ. ఇంతకీ ఈ కిట్ లో ఏముందనుకుంటున్నారా.. ఈ కిట్‌లో డివిజన్ స్వరూపం, ఓట్లు, ఆ డివిజన్‌లో నెలకొన్న సమస్యలు, ఇప్పటి వరకు ప్రభుత్వం పరిష్కరించిన సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తామేం చేయబోతున్నారు..  ప్రభుత్వం ద్వారా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, లబ్ధిదారుల వివరాలు ఉంటాయి. ఇక ఈ వివరాల ఆధారంగా నేతలు ప్రచారం రంగంలోకి దిగుతారన్నమాట. అంతేకాదు దీనివల్ల క్యాడర్‌లో నెలకొనే గందరగోళాన్ని కూడా సులభంగా ఎదుర్కొనే అవకాశాలుంటాయని పార్టీ వర్గాలు అంచనావేస్తున్నాయి. మరి టీఆర్ఎస్ ఈ కిట్ ప్లాన్ ఎంతవరకూ వర్కవుట్ అవుద్దో చూడాలి.

భూకంప అనుభవాన్ని ప్రత్యక్షంగా చూశా.. కేంద్రమంత్రి

ఈశాన్య భారతదేశంలో భూకంప చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భూకంప అనుభవాన్ని తాను స్వయంగా చూసినట్టు చెబుతున్నారు కేంద్రమంత్రి నిర్మలారామన్. నిర్మలారామన్ ఈశాన్య రాష్ట్రాల్లోని కాఫీ తోటల్ని పరిశీలించేందుకు గాను పశ్చిమ బెంగాల్ వెళ్లారు. అక్కడ ఆమె అనేక ప్రాంతాలు పర్యటించి పశ్చిమబెంగాల్ లోని సిలిగురిలో ఉన్న ప్రభుత్వ గెస్ట్ హౌస్ కి వెళ్లారు. అయితే అక్కడ ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో గది మొత్తం ఊగిపోయిన పరిస్థితులతో  ఆమె ఆందోళనతో బయటకు వచ్చారంట. అయితే ఎటువంటి ప్రమాదం జరగకపోయినా తాను మాత్రం భూప్రకంపనల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యక్షంగా చూశానని.. తాను బస చేసిన హోటల్ గది కంపించి పోయిందని.. అయితే.. తామంతా క్షేమంగా ఉన్నట్లుగా ఆమె ట్విట్టర్ లో తెలిపారు.

డైలమాలో పాక్-భారత్ ల ద్వైపాక్షిక చర్చలు..

ఈనెల 15 వ తేదీన పాక్-భారత్ ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగున్నాయన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చర్చలు జరుగుతాయో.. లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి విదితమే. అయితే ఈ ఉగ్రవాదుల మూలాలు పాక్లోనే ఉన్నాయని.. ఇప్పటికే భారత నిఘావర్గాలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాయి. దీంతో పాక్-భారత్ మధ్య చర్చలు జరిగుతాయో లేదో అన్న డైలమా ఏర్పడింది. అంతేకాదు ఒకవైపు చర్చలు అంటూ స్నేహహస్తం అందిస్తూనే.. మరోవైపు ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏంటని.. పాక్తో చర్చలు సజావుగా సాగడం సందేహమే అని భారత అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా శనివారం సాయంత్రానికి ఉగ్రవాదుల్ని హతమార్చారని.. ఆపరేషన్ ముగిసినట్లుగా కేంద్రం ప్రకటించినా.. ఇంకా కొంత మంది ఉగ్రవాదులు ఎయిర్ బేస్ లో దాక్కున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎయిర్ బేస్ దగ్గర భద్రతా దళాలు భారీగా మోహరించాయి. ఆర్మీ దళాలు కూంబింగ్ నిర్వహించాయి. మొత్తానికి భారీ వ్యూహంతోనే ఉగ్రవాదులు దాడులు జరిపినట్టుగా తెలుస్తోంది. కాగా ఎయిర్ బేస్ లో ఇంకా ఎంతమంది ముష్కరులు ఉన్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

టీఆర్ఎల్ లో చేరిన విజయరామారావు..

టీడీపీ నేత.. మాజీ మంత్రి విజయ రామారావు కొద్ది రోజుల క్రితం టీడీపీ నుండి టీఆర్ఎస్ లోకి మారబోతున్నట్టు వార్తలు వచ్చాయి.  అయితే అప్పుడు విజయరామారావు తన చేరిక గురించి ఆలోచించి నిర్ణయం చెబుతానన్నారు.. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా విజయరామారావుకి ఫోన్ చేసి.. పార్టీ మార్పుపై ఆలోచించుకోవాలని.. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని చెప్పారని.. దాంతో విజయరావు కూడా సందిగ్దంలో పడ్డారని అన్నారు. కానీ ఇప్పుడు విజయరామారావు చేరికపై అనుమానాలు తీరిపోయినట్టే. ఎందుకంటే విజయరామారావు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో విజయరామారావు టీఆర్ఎస్ లోకి చేరారు. కేసీఆర్ గులాబీ కండువాకప్పి విజయరామారావుని పార్టీలోకి ఆహ్వానించారు. కాగా విజయరామారావు తెలుగుదేశం పార్టీ హయాంలో ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి గెలుపొంది మంత్రిగా పనిచేశారు.