పాక్ లోయ‌ధేచ్చ‌గా తిరుగుతున్న ప‌హల్గాం ఉగ్రదాడి సూత్ర‌ధారి!

అది పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్. అక్క‌డ పీఎంఎంఎల్ అంటే పాకిస్తాన్ మ‌ర్క‌జీ ముస్లిం లీగ్ అనే ఒక రాజ‌కీయ పార్టీ ర్యాలీ నిర్వ‌హిస్తే అందులో ఒక‌డు క‌నిపించాడు. ఈ మ‌ధ్య అంటే, మే 28న అత‌డిని అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ముద్ర వేసింది ఐక్య  రాజ్య‌స‌మితి. అందుకు అత‌డ‌న్న మాట నేనిపుడు వ‌ర‌ల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాను అని. ఇంత‌కీ అత‌డు చేసిన ఘ‌న‌కార్యం ఏంట‌ని చూస్తే ప‌హెల్గాం దాడి ద్వారా 26 మంది భార‌తీయుల‌ ప్రాణాలు పోయేలా చేయ‌డం. (వీరిలో అత్య‌ధికులు హిందు పురుషులు) అతడి పేరు సైఫుల్లా కసూరి. ఇత‌డి వ్యూహ‌ర‌చ‌న కార‌ణంగా భార‌త్- పాక్ రెండు దేశాల మ‌ధ్య యుద్ధం వ‌చ్చి.. భారీ ఎత్తున ప్రాణ  న‌ష్టం ఆస్తి న‌ష్టం జ‌రిగింది. అకార‌ణంగా కొంద‌రు చ‌నిపోయారు. ఒక స‌మ‌యంలో కిరానా కొండ‌ల్లోని పాక్ అణు నిల్వ‌లు కానీ లీక్ అయి ఉంటే, ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. పాకిస్థానే ప్ర‌పంచ చిత్ర‌ప‌టంలో లేకుండా  పోయేది.. కానీ ఇత‌డికి కించ‌త్ కూడా జాలి- ద‌యా- క‌రుణ లేకుండా విచ్చ‌ల‌విడిగా పాకిస్తాన్ బాహ్య ప్ర‌దేశాల్లో  తిరుగుతూ.. కాల‌ర్ ఎగ‌రేస్తున్నాడు. ఇదే ర్యాలీలో ల‌ష్క‌రే తోయిబా చీఫ్ కొడుకు త‌ల్హా స‌యీద్, మ‌రో యూఎన్ ఉగ్ర‌వాది అమీర్ హంజా కూడా పాల్గొన్నారు.  త‌ల్హా స‌యీద్ అయితే పీఎంఎంఎల్ ద్వారా లాహోర్  నుంచి పార్ల‌మెంటుకు పోటీ చేసి.. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టాలని విఫ‌ల‌య‌త్నం చేశాడు. ఎందుక‌నో అది సాధ్యం కాలేదు. ఇత‌డు భార‌త్ కి కావ‌ల్సిన మోస్ట్  వాంటెడ్ టెర్ర‌రిస్టుల్లో 32వ వాడు. ఇత‌డు ఈ ర్యాలీ ద్వారా త‌న తండ్రి హ‌ఫీజ్ స‌యిద్ ని విడిపించాల‌ని డిమాండ్ చేశాడు, భార‌త్ సింధూ జ‌లాల ఒప్పందం ర‌ద్దును పునః స‌మీక్షించాల‌ని కూడా డిమాండ్ చేస్తున్నాడు.  ఇప్ప‌టికే ఈ ఉగ్ర సంస్థ‌కు చిన్న‌పాటి సైన్యం, విశ్వ  విద్యాల‌యం, రాజ‌కీయ పార్టీ ఉన్నాయి. వీటి ద్వారా వీరు భార‌త్ వ్య‌తిరేక‌త నూరి పోసి.. పాక్ ప్ర‌జ‌లను ఆక‌ర్షించి.. పాక్ పార్ల‌మెంటులో అడుగు పెట్టి త‌ద్వారా పాకిస్థాన్ని ఏలాల‌న్న‌ది వీరి ఆలోచ‌న‌గా తెలుస్తోంది. ఈ ఉగ్ర‌మూక‌ల కార‌ణంగా పాకిస్తాన్ నీటి క‌ట‌క‌ట‌ను ఎదుర్కుంటోంది.  మొన్న నీటి కొర‌త కార‌ణంగా సింధ్ ప్ర‌జ‌లు త‌మ‌ హోం మంత్రి ఇంటిని త‌గ‌ల‌బెట్టారు. తాజాగా పాక్ న‌టి హీనా బ‌య‌త్ క‌రాచీ వంటి ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టులో నీళ్లు రావ‌డం లేద‌ని ఇన్ స్టా పోస్టు పెట్టింది. దీనంత‌టికీ  కార‌ణం ఎవ‌రు? య‌ధేచ్చ‌గా తిరుగుతున్న ఈ ల‌ష్క‌రే, జైషే ఉగ్ర‌వాదులు కారా? అదేంటో మ‌న భార‌త‌దేశంలో సోష‌ల్ మీడియా గ్రూపులైన ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్స‌ప్, టెలిగ్రామ్ లో ఒక చిన్న షేర్ కొట్టినందుకే మ‌న‌కు వార్నింగులు ఇస్తాయి. అదే పాకిస్తాన్ లో ఈ ప్లాట్స్ ఫామ్స్ మీద నుంచి జైషే అనే ఉగ్ర సంస్థ ఏకంగా ఉగ్ర‌వాద ప్ర‌చారం నిర్వ‌హిస్తోంది. విరాళాలు కావాలంటూ అభ్య‌ర్ధ‌న‌లు చేస్తోంది. కొత్త ర‌క్తం ఎక్కించ‌డానికి పాక్ యువ‌త‌కు వ‌ల వేస్తోంది. డిజిట‌ల్ ప్లాట్ ఫామ్స్ వేదిక‌గా.. పెద్ద పెద్ద ఉగ్ర‌వాద‌ చానెళ్ల‌ను న‌డిపేస్తోంది. ఇక్క‌డ ఉగ్ర‌వాదం ఎంత బ‌హిర్గ‌త‌మో చెప్పేలా ఏకంగా బాహావ‌ల్పూర్ వీధుల్లో ఆగ‌స్ట్ 25న జిహాదీ క‌విత్వం విన‌డానికి ర‌మ్మంటూ ఆహ్వాన ప‌త్రిక‌ల‌తో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీల్లో మొన్న భార‌త్ దాడుల్లో చ‌నిపోయిన ఉగ్ర‌వాదుల చిత్ర‌ప‌టాలు వేసి మ‌రీ మ‌సూద్ అజ‌ర్ పేరిట పోస్ట‌ర్లు వేసి మ‌రీ పిలుస్తున్నారు. ఇదే మ‌సూద్ అజ‌ర్ కి 14 కోట్ల రూపాయ‌ల నిధులు మంజూరు చేసింది పాకిస్థాన్. ఇతడు ఎంత‌టి భార‌త వ్యతిరేక ఉగ్ర‌వాదో చెప్ప‌న‌ల‌వి కాదు. మ‌న భార‌త భూభాగానికి అనేక సార్లు ర‌క్త‌పు మ‌ర‌క‌లు అంటించిన ఉగ్రవాది. అలాంటి వాడికి నిధులిస్తూ ఆ దేశ ప్ర‌ధాని హెహ‌బాజ్ ష‌రీఫ్ భార‌త్ తో శాంతి చ‌ర్చ‌ల‌కు తాము సిద్ధ‌మేన‌ని పిలుపునిస్తాడు. ఇలాంటి పాకిస్థాన్ కి ఐఎంఎఫ్, వ‌ర‌ల్డ్ బ్యాంకులు సుమారు 25 బిలియ‌న్ డాల‌ర్లు ఇస్తోంది. మ‌రి ఇదే అంత‌ర్జాతీయ సంస్థ అయిన ఐక్య‌రాజ్య‌స‌మితి క‌సూరీ వంటి వారిని ఉగ్ర‌వాద ముద్ర వేయ‌డ‌మేంటి? ఇలాంటి వాళ్ల‌కు పాకిస్థాన్ త‌న‌కొచ్చే ఐఎంఎఫ్ ఇత‌ర నిధుల నుంచి కొంత మొత్తం కేటాయించి వారిని ఎంక‌రేజ్ చేయ‌డమేంటి?  ఉగ్ర‌వాదులు త‌మ దేశంలో ఇంత బాహ‌టంగా తిరుగుతుంటే.. భార‌త్ తో శాంతి చ‌ర్చ‌ల‌కు ఈ దేశం మ‌ళ్లి మ‌ళ్లీ పిల‌వ‌డ‌మేంటి???  ఈ యుద్ధం ఇక్క‌డితో ముగియ‌లేదు. దీనికి ఎక్క‌డో ఒక చోట భార‌త్ ఫుల్ స్టాప్ పెట్టి తీరాల్సిందే. ఈ దిశ‌గా అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై పాక్ పీచ‌మ‌ణ‌చాల్సిందే. తాజాగా ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ పీవోజేకే(పాక్ ఆక్ర‌మిత జ‌మ్మూ కాశ్మీర్) వారే  తిరిగి భార‌త్ లో క‌లుస్తామ‌ని అడ‌గ‌టానికి ఎన్నో రోజులు లేవ‌ని అంటున్నారు. ఈ దిశ‌గా భార‌త్ పాకిస్థాన్ నుంచి పీవోజేకేని లాగేసుకోవ‌డంతో పాటు బ‌లూచిస్తాన్ కి కూడా స‌పోర్టు చేయాలి. ఇలా పాక్ ఎకో సిస్ట‌మ్ ని దారుణంగా దెబ్బ తీసి ఆ దేశంలో ఉగ్ర‌వాదం  అన‌డానికే ఒణికి చావాలి. భార‌త్ పై ఈ సారి దాడి చేయ‌డానికే సాహ‌సించే య‌త్నం చేయ‌కుండా క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరుకుందాం. జైహింద్!

కమలంలో కారు విలీనం?.. తెర పైకి కొత్త చర్చ!

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత మరో సంచలనానికి తెర తీశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగున్నాయని  మీడియా చిట్ చాట్ లో చెప్పారు. నిజానికి మై డియర్ డాడీ  అంటూ కేసేఅర్ కు రాసిన, లేఖలోనూ కవిత, బీజేపీ, బీఆర్ఎస్ సంబంధాలని ప్రస్తావించారు. వరంగల్ రజతోత్సవ సభలో  కేసీఆర్ బీజేపీ పట్ల కొంత మెతక వైఖరి అవలంబించారనే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.  బీజేపీని గట్టిగా తిట్టకపోతే.. బీజేపీ, బీఆర్ఎస్ కలుస్తాయనే తప్పుడుసంకేతాలు ప్రజల్లోకి వెళతాయని అంటూ..  కేసీఆర్ తమ ప్రసంగంలో కేవలం రెండు నిముషాలు మాత్రమే బీజేపీని టార్గెట్ చేయడాన్ని నెగటివ్ పాయింట్స్ లో  చేర్చారు.  ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న  కొత్త చర్చను తెర పైకి తెచ్చారు. అయితే..  కవిత లేఖలో పేర్కొన్న అంశాలలో కొంత నిజం ఉన్నా..  బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది ఎలా చూసిన అయ్యే పని కాదని పరిశీలకులు అంటున్నారు. నిజానికి  కేసీఆర్ బీఆర్ఎస్ ను బీజేపీలోనే కాదు, కాంగ్రెస్ సహా మరే పార్టీలోనూ విలీనం చేయరని..  ఒక్క ఏన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ అస్తిత్వాన్ని చంపుకునే తప్పు కేసీఆర్ చేయరని ఆయన సన్నిహితులు అంటున్నారు.  నిజానికి.. గతంలో ఉద్యమ సమయంలోనూ కేసీఆర్  తెలంగాణ సాధించుకునే వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్  ముందు విలీనం ప్రతిపాదనను ఉంచారని..  ఒక పావుగా మాత్రమే విలీనం ప్రతిపాదన  చేశారని  కేసీఆర్ మాజీ మిత్రులు అంటున్నారు.  అయితే..  బీఆర్ఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలను మాత్రం కొట్టి వేయలేమని మాజీ మిత్రులతోపాటుగా,  ప్రస్తుత పరిణామాలను దగ్గరగా చూస్తున్న రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. నిజానికి..  ప్రస్తుత పరిస్థితిలో బీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల పొత్తు ఉభయ తారకంగా రెండు పార్టీలకూ లాభ దాయకంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులతో పాటుగా  ఉభయ పార్టీలలో ఒక వర్గం గట్టిగా భావిస్తోంది. అయితే..  అదే సమయంలో రెండు పార్టీలలోనూ కూడా పొత్తు వద్దనే వాదన కూడ అంతే బలంగా వినిపిస్తోందని అంటున్నారు.    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలను, ఉభయ పార్టీల ఓటు షేర్ లో వస్తున్న మార్పును గమనిస్తే..  బీఆర్ఎస్, బీజేపీ ఓటు పరస్పరం బదిలీ అవుతున్న వైనం కనిపిస్తుందని  విశ్లేషకులు అంటున్నారు.  ఉదాహరణకు 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే.. బీజేపీకి వచ్చిన ఓటు షేర్  జస్ట్ 7 శాతం. అసెంబ్లీలో కమలానికి దక్కింది ఒక్కటే సీటు..  కానీ, ఆతర్వాత కొద్ది నెలలకే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు షేర్  ఏకంగా 20 శాతానికి పెరిగింది. ఆ మేరకు బీఆర్ఎస్ ఓటు షేర్ తగ్గింది.  అలాగే..  2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14 శాతం ఓట్లు 8 సీట్లు వచ్చాయి.  కానీ.. 2024లోక్ సభ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి బీజేపీ ఓటు షేర్ ఏకంగా 35 శాతానికి చేరింది.  అసెంబ్లీ స్థానాలతో సమానంగా  8 లోక్ సభ స్థానాలు బీజేపీ గెలుచుకుంది. మరోవంక అసెంబ్లీ ఎన్నికల్లో 37 శాతం ఓటు షేర్ సొంతం చేసుకున్న బీఆర్ఎస్ ఓటు షేర్ లోక్ సభ ఎన్నికల్లో  17 శాతానికి పడిపోయింది. అంటే, అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసిన ఓటర్లలో 20 శాతం మంది లోక్ సభ ఎన్నికల్లో కమలానికి ఓటు వేశారు. ఇక్కడ గమనించవలసిన మరో ముఖ్య విషయం ఏమిటంటే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు షేర్ లో మార్పు అంతగా లేదు.  అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం ఓటుతో 65 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, అదే 40 శాతం ఓటుతో లోక్ సభ ఎన్నికలలో 8 సీట్లు తెచ్చుకుంది. సో.. కళ్ళ ముందున్న ఓటు షేర్ లెక్కలు.  ఓటు ట్రాన్స్ఫర్  ప్యాట్రన్  ను గమనిస్తే..  బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉభయతారకంగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అంతే కాకుండా, జాతీయ పార్టీగా బీజేపీకి లోక్ సభ ఎన్నికల్లో గెలుపు, కేంద్రంలో అధికారం కీలకం. అదే విధంగా ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్  కు అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు, రాష్టంలో అధికారం కీలకం అవుతుంది. సో.. పొత్తుకు ఉభయ పార్టీలు ఒకే చెప్పే అవకాశం ఉందని అంటున్నారు.  అయితే.. నడుస్తున్న చరిత్రను గమనిస్తే, గడచిన పాతికేళ్ళ ప్రస్థానంలో బీఆర్ఎస్  కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు సహా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది. కానీ, బీజేపీతో మాత్రం ఏనాడూ పొత్తు పెట్టుకోలేదు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాల లేదు. మరో వంక   కాంగ్రెస్ తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. కేంద్రంలో, రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాలలో కలిసి పనిచేసింది. ఉభయ పార్టీలూ చెట్టపట్టాల వేసుకుని పనిచేయడమే కాదు, ఎమ్మెల్యేలను ఇచ్చిపుచ్చుకోవడాల విషయంలో కూడా రెండు పార్టీల మధ్య అవగాహన ఉందని, బీఆర్ఎస్ తో పొత్తు వద్దకునే బీజేపీ నాయకులు చరిత్రను తిరగేస్తున్నారు. అలాగే, కమలంతో పొత్తు వద్దనుకునే  బీఆర్ఎస్ నాయకులు, డీఎన్ఎలు కలవని బీజేపీతో పొత్తు వలన దీర్ఘ కాలంలో ప్రమాదమే  పేస్ చేయవలసి ఉంటుందని అంటున్నారు.  సో .. కవిత చెప్పిన విలీనం ఉండక పోవచ్చిని, అయితే గియితే కారు కమలం మధ్య తొలి  ‘పొత్తు’ పొడిచే అవకాశం లేక పోలేదని అంటున్నారు.

డ్యూటీ ఎక్కిన దువ్వాడ వాణీ!.. టెక్కలి వైసీపీలో మళ్లీ మొదలైన మూడుముక్కలాట!

రెండు తెలుగు రాష్ట్రాలలో దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణీ, దివ్వెల మధురిల వ్యవహారం ఎంత అలజడి రేపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హై ఎనర్జిటిక్ ఫ్యామిలి డ్రామా అప్డేట్స్ అప్పట్లో మీడియాలో, సోషల్ మీడియాలో సైతం సేన్షేషన్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ టోటల్ ఎపిసోడ్ లో దువ్వాడ శ్రీను ఇంటికి దివ్వెల మాధురి ప్రవేశించడం.. అక్కడితో దువ్వాడ వాణి అకస్మాత్తుగా తన నిరసనకు మంగళం పాడి మాయం అవ్వడం.. క్లైమాక్స్ లేని కధగా మారింది. ఇప్పటికీ ఈ వ్యవహారంలో అనేక ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది. దువ్వాడ వాణి తన నిరసనను మాని.. మాయం అవ్వడంతో.. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి స్పీడ్ పెంచారు. వరుసగా ఇంతర్వ్యులు ఇస్తూ.. విడాకులు వచ్చిన వెంటనే తమ వివాహం అంటూ... శ్రీనుకు వారసుడిని కూడా ఇస్తాను అంటూ తమ పెయిర్ ను వైరల్ చేసుకున్నారు. ఓ వైపు శ్రీను, మాధురి స్పీడ్ పెంచడంతో పూర్తిగా మ్యుట్ అయిపోయారు దువ్వాడ వాణి.. అయితే జగన్ కు వీర భక్తుడిగా ముద్ర పడ్డ దువ్వాడ శ్రీను.. టెక్కలి వైసిపి ఇంచార్జ్ విషయంలో విభేదాలు రావడం, జగన్ మాటకు అడ్డు చెప్పడం స్టోరీలో పెద్ద ట్విస్ట్ గా చెప్పుకోవచ్చు. డామిట్.. కధ అడ్డం తిరిగింది అన్నట్టుగా.. వైసిపి నుండి దువ్వాడ శ్రీను సస్పెండ్ అవ్వడం తో.. మిగిలిన కధను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు మళ్ళీ తెరపై ప్రత్యక్షం అయ్యారు దువ్వాడ వాణి.   మొదట్లో టెక్కలి వైసిపి ఇంచార్జ్ పెరాడ తిలక్ వెనుక ఉంటూ వచ్చిన వాణి.. ఇప్పుడు ఇండివిడ్యుయల్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. టెక్కలి నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో కార్యకర్తల ఫంక్షన్లు, పరామర్శలలో గడచిన కొద్ది రోజులుగా చురుకుగా పాల్గొంటున్న దువ్వాడ వాణి.. మళ్ళీ తన క్యాడర్ కు వేకప్ కాల్ ఇచ్చేసారు. దువ్వాడ వాణి ఇచ్చిన వేకప్ కాల్ తో ఆమె అభిమానులు ఆనందంలో ఉన్నా.. ఎక్కడ మళ్ళీ తమ ఇంచార్జ్ సీటుకు ఎసరు పెడతారో అన్న ఆందోళన మాత్రం పెరాడ తిలక్ వర్గీయులలో కనిపిస్తోంది. గతంలో దువ్వాడ శ్రీనుకు, పెరాడ తిలక్ వర్గాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి.. దువ్వాడ శ్రీను సస్పెన్షన్  తో ఏపుగా పెరిగిన పచ్చగడ్డి..  దువ్వాడ వాణీ రాకతో కోతకు గురవుతుందా అన్న ఆందోళన కూడా స్థానిక వైసిపి  శ్రేణుల్లో లేకపోలేదు. ఇకోవైపు.. జగన్ కోపం తాత్కాలికమే అనీ.. మళ్ళీ తాను బౌన్స్ బ్యాక్ అవుతానని దువ్వాడ శ్రీను కుడా స్టేట్మెంట్ లు ఇస్తుండటం కూడా తిలక్ సేనను ఇరుకున పెడుతోంది. దీంతో చాలాకాలం తరువాత మళ్ళీ టెక్కలి వైసిపిలో మూడు ముక్కలాట మళ్ళీ మొదలైందనే చెప్పుకోవచ్చు. 

చరిత్ర సృష్టించాం.. కడప మహానాడుపై తెలుగుదేశం నేతలు

కడపలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు తో చరిత్ర సృష్టించామని  ఆ పార్టీ సీనియర్ నేతలు అన్నారు. మూడు రోజుల పాటు కడప వేదికగా జరిగిన మహానాడు విజయవంతమైన నేపథ్యంలో శుక్రవారం (మే 30) తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు సవిత, రాంప్రసాద్ రెడ్డి,  ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాసులు, పుత్తా చేతన్య రెడ్డి, మాధవి రెడ్డి , ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి,  తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి,   జగన్మోహన్ రాజు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తదితరులు కడపలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబుపై విశ్వాసం, నమ్మకంతోనూ రాష్ట్రం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో తరలివచ్చారని వారు చెప్పారు.  కడప వైఎస్ జగన్ అడ్డా అన్న అపోహ ఈ మహానాడుతో తొలగిపోయిందనని వారు అన్నారు.  కడపలో తెలుగుదేశం మహానాడు ఇంత పెద్ద ఎత్తున విజయవంతం కావడం వైఎస్ కుటుంబానికి చెంప పెట్టు లాంటిదని  పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు కడపలో నిర్వహించేందుకు అవకాశం కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మహానాడు వేదికపై నుంచి ముఖ్యమంత్రి ప్రకటించిన కడప ఉక్కు పరిశ్రమ , సాగునీటి ప్రాజెక్టులు ఇంకా  ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ,వచ్చే ఎన్నికల నాటికి ఇవన్నీ  పూర్తి చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు, మంత్రులు,నేతలందరికీ  కృతజ్ఞతలు తెలిపారు.  

రామనారాయణంలో వినూత్నంగా యోగాంధ్ర

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో విజయనగరం జిల్లాలో జరిగిన కార్యక్రమం వినూత్నంగా నిలిచింది. పర్యాటక ప్రదేశం అయిన రామనారాయణం లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో  రామధనస్సు ఆకృతిలో పదిహేను వందలమంది యోగాసనాలు వేయడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. అక్కడివారితో కలసి యోగా చేశారు.   ప‌ర్యాట‌క ప్ర‌దేశాల్లో యోగాంధ్ర కార్య‌క్రమాన్ని నిర్వ‌హించాల‌న్న రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంలో భాగంగా జిల్లాలోని ఆధ్యాత్మిక ప‌ర్యాట‌క కేంద్రం రామ‌నారాయ‌ణంలో శుక్ర‌వారం (మే 30) జిల్లా యంత్రాంగం ఆధ్వ‌ర్యంలో యోగాంధ్ర కార్య‌క్ర‌మాన్ని  నిర్వ‌హించారు. ఈ క్షేత్రంలో కొలువుదీరిన‌ రామ‌నారాయ‌ణుని పాదాల చెంత రామ‌ధ‌నుస్సు ఆకృతిలో రాష్ట్ర మంత్రి  కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌, జిల్లా క‌లెక్ట‌ర్ డా.బి.ఆర్‌.అంబేద్క‌ర్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేతుమాధ‌వ‌న్ స‌హా సుమారు 1500 మంది ప్ర‌భుత్వ అధికారులు, సిబ్బంది,  ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, ప‌రిస‌ర గ్రామాల ప్ర‌జ‌లు యోగాస‌నాలు వేశారు. ఉద‌యం ఏడుగంటలకే   పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు, యోగ ప‌ట్ల ఆస‌క్తి గ‌ల వారంతా తెల్ల‌ని దుస్తులు ధ‌రించి యోగాంధ్ర కార్య‌క్ర‌మంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయుష్ విభాగం ఆధ్వ‌ర్యంలో యోగ గురువులు డాక్టర్ ఆరిశెట్టి ఇందుమ‌తి,  సుంద‌ర‌శివ‌రావులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ అంద‌రితో సుమారు 45 నిముషాల పాటు ప‌లు యోగ‌సనాలు వేయించారు.   ఈ సంద‌ర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం యోగా ప్రాధాన్య‌త‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసే ఉద్దేశ్యంతో ఈ నెల‌ను యోగా మాసంగా ప్ర‌క‌టించి అన్ని ప్రాంతాల్లో యోగ శిక్ష‌ణ కేంద్రాలు ఏర్పాటు చేసి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ట్టు చెప్పారు. యోగా మ‌న పూర్వీకులు మ‌నకు అందించిన గొప్ప ఆస్తి అన్నారు. దీనిని సాధ‌న చేయ‌డం ద్వారా   ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించుకోవ‌చ్చనీ, ఈ దిశగా  ప్ర‌తి ఒక్క‌రినీ ప్రోత్స‌హించ‌డం యోగాంధ్ర ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. జూన్ 21న అంత‌ర్జాతీయ దినోత్స‌వంలో పాల్గొనేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడి విశాఖ వ‌స్తున్నార‌ని ఆరోజున రాష్ట్రమంత‌టా ప్ర‌తి గ్రామంలో యీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం ద్వారా ప్ర‌పంచానికి యోగా విశిష్ట‌త‌ను తెలియ‌జేసే ఉద్దేశ్యంతో  ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు నెల‌రోజుల యోగాంధ్ర కార్య‌క్ర‌మంలో భాగంగా జిల్లాలోని నాలుగు ప‌ర్యాట‌క ప్ర‌దేశాల్లో కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నామ‌ని మొద‌ట‌గా రామ‌నారాయ‌ణంలో   ఏర్పాటు చేశామ‌న్నారు. జూన్ నెల‌లో చింత‌ప‌ల్లి బీచ్, రామ‌తీర్ధం, తాటిపూడి రిజ‌ర్వాయ‌రు త‌దిత‌ర ప్ర‌దేశాల్లోనూ యోగాంధ్ర‌లో భాగంగా కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేశామ‌న్నారు. జూన్ 10వ తేదీన జిల్లాకు చెందిన 5 వేల మంది ఉపాధి ప‌థ‌కం వేత‌న‌దారుల‌తో యోగాస‌నాలు ప్ర‌ద‌ర్శించే కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశామ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ కోసం జీవితంలో యోగ‌ను భాగంగా చేసుకోవాల‌న్నారు. యోగాస‌నాల ప్ర‌ద‌ర్శ‌న అనంత‌రం కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వారంద‌రికీ రామ‌నారాయ‌ణ ద‌ర్శ‌నాన్ని క‌ల్పించ‌డంతోపాటు తీర్ధ ప్ర‌సాదాల‌ను ఎన్‌.సి.ఎస్‌.ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో అంద‌జేశారు.

బీఆర్ఎస్ ది దుష్ప్రచారం.. బనకచర్ల ఆగదు!

బనకచర్లపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్ల ప్రాజెక్టు ఆగదని విస్పష్టంగా చెప్పారు. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కేవలం రాజకీయ లబ్ధి కోసం విషప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కడప వేదికగా జరిగిన మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత ఆయన మాట్లాడారు.   క‌ర్నూలు జిల్లా బ‌న‌క‌చ‌ర్ల‌లో నిర్మించే భారీప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ రెడీ అయ్యిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే కేంద్రంతో పలుమార్ల చర్చించినట్లు తెలిపారు. గోదావరి జలాలను పోలవరం ద్వారా మళ్లించి బనకచర్లలో నిల్వ చేసి కర్నూలు జిల్లా సహా సీమ ప్రాంత ప్రజలకు అందించడమే తన లక్ష్యం, సంకల్పం అని ప్రకటించారు.  అంశాన్ని ప్ర‌స్తావించారు. గోదావరి జ‌లాల‌ను పోల‌వ‌రం ద్వారా.. మ‌ళ్లించి.. బ‌న‌క‌చ‌ర్లలో నిల్వ చేసి.. క‌ర్నూలు స‌హా రాయ‌లసీమ ప్రాంత ప్ర‌జ‌ల‌కు అందించాల‌న్న‌ది త‌మ సంక‌ల్పంగా చెప్పుకొచ్చారు. బనకచర్లపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్నదంతా దుష్ప్రాచారమేనని చెప్పిన ఆయన వృధాగా ఉప్పు సముద్రం పాలౌతున్న గోదావరి జిలాలను సద్వినియోగం చేసుకునేందుకుకే ఈ ప్రాజెక్టు కుట్టుకుంటున్నామన్నారు.  దీనిని కూడా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ చేస్తున్న కుట్రలు సాగవని హెచ్చరించారు.   స‌ముద్రంలో పోయే నీటిని వాడుకుంటే త‌ప్పా? ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తే ఓర్చుకోలేరా? అని బీఆర్ఎస్ ను సభా ముఖంగా నిలదీశారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపాలని సూచించారు. బనకచర్ల ద్వారా తెలంగాణకు ఎటువంటి నష్టం వాటిల్లదని ఆయన క్లారిటీ ఇచ్చారు.  ఏ ప్రాజెక్టు క‌ట్టినా.. దాని ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు బాగుండాల‌నేదే త‌మ ఉద్దేశ‌మ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు.  

వెల్దీ, హెల్దీ, హ్యాపీ.. చంద్రబాబు నినాదం

ఆరు శాసనాలతో నూతనత్వాన్నీ, కొత్త నాయకత్వాన్నీ తీసుకు వచ్చామని చంద్రబాబు అన్నారు. మహానాడు ముగింపు సందర్భంగా కడపలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన మహానాడులో తీర్మానించుకున్న ఆరు శాసనాలనూ తు.చ. తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. వీటి ద్వారా అద్భుత ఫలితాలను సాధిద్దామని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర2047 లక్ష్యాన్ని సాధించే క్రమంలో ప్రతి ఏడాదీ ప్రోగ్రస్ రిపోర్టు ఇస్తామని, ఎంత సాధించాం.. ఇంకా సాధించాల్సిందేమిటి?  అంశాలను సమీక్షించుకుని 2029 నాటికి పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు.  పార్టీకి కార్యర్తే అధినేత అని పునరుద్ఘాటించారు.   ప్రస్తుతం రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ. 2 లక్షల 67 వేలు. వచ్చే 22 ఏళ్లలో దానిని రూ.55 లక్షలే చేసే బాధ్యత తీసుకుంటున్నానని చెప్పిన ఆయన. వెల్దీ, హెల్దీ, హ్యాపీ అన్నదే మన నినాదం అన్నారు. కోడూరు నుంచి సైకిల్‌పై   మహానాడుకు హాజరైన కార్యకర్తను ఈ వేదికపై సీఎం సన్మానించారు. ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి విజ్ఞప్తి మేరకు కడపకు తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు, బుగ్గవంక చెరువు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి సభా ముఖంగా హామీ ఇచ్చారు. 

రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ నంబర్ వన్ గా నిలబెట్టడమే తన లక్ష్యమని తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. కడప వేదికగా జరిగిన మహానాడు ముగింపు సందర్భంగా గురువారం  (మే29) సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి సుమాలను పూయిస్తానన్నారు. రాయలసీమ అంటే రాళ్ల సీమ కాదన్న చంద్రబాబు.. రాయలసీమను రాష్ట్రానికి మణిహారంగా మారుస్తామని చెప్పారు. మహానాడు వేదికగా రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు. సీమ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి ఫ్యాక్షనిజమే అన్న ఆయన ఈ విషయాన్ని ఆనాడే గుర్తించామని చెప్పారు. సీమ గడ్డపై ఫ్యాక్షన్ ఉండొద్దనే తాను కఠినంగా వ్యవహరించానని గుర్తు చేశారు.   సీమ అభివృద్ధికి తన వద్ద  ప్రత్యేక బ్లూప్రింట్ ఉందని చెప్పిన ఆయన విద్యా సంస్థలు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు  పారిశ్రామిక కారిడార్లతో  సీమలో ఏ జిల్లాకు ఏం చెయ్యాలన్నదానిపై పక్కా ప్రణాళిక ఉందన్నారు. తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఇఈర్, ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, అనంతపురంలో సెంట్రల్ యూని వర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ వంటి సంస్థలు తీసుకువచ్చామన్నారు. కడపలో హజ్ హౌస్ మొదలుపెట్టి 90 శాతం నిర్మిస్తే... గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేదన్నారు. ఇప్పుడు ఆ హజ్ హౌస్ ను 6 నెలల్లో హజ్ హౌస్ పూర్తి చేస్తామని చెప్పారు.  లేపాక్షి - ఓర్వకల్ కారిడార్‌లో డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ సిటీ, ఆటోమొబైల్ పరిశ్రమలు, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌కు కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు.  కడప స్టీల్ ప్లాంట్‌కు గతంలో తాను శంకుస్థాపన చేశాననీ, దానికే మళ్లీ భూమిపూజ చేసి జగన్ నాటకాలాడారనీ చెప్పిన చంద్రబాబు  వచ్చే నెల 12 లోగా  కడపలో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఫేజ్ 1లో రూ.4,500 కోట్లతో, ఫేజ్ 2లో మరో రూ.4,500 కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామనీ, దీనిని పూర్తి చేసి 6 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామనీ హామీ ఇచ్చారు. 

క‌మ‌ల్ హాస‌న్ కన్నడ కాంట్రవర్సీ

నిజంగానే క‌న్న‌డ త‌మిళంలోంచి  వ‌చ్చిందా?  ద‌క్షిణాది ప్రాచీన భాష‌లేవి!  నిజానికైతే క‌న్న‌డ‌కు త‌మిళానికీ ఉన్న లింకు మాట  ఎలాగున్నా... తెలుగు క‌న్న‌డ‌కు మాత్రం చాలానే సంబంధ బాంధ‌వ్యాలున్న‌ట్టు క‌నిపిస్తాయ్. తెలుగులో ఒక‌టి- క‌న్న‌డ‌లో ఒందు అంటూ మొద‌లు పెడితే.. దాదాపు క‌న్న‌డ భాషకు తెలుగుకు విశేష సంబంధాలున్నట్టు క‌నిపిస్తుంది. తేట తేట తెలుగు, క‌న్న‌డ క‌స్తూరి, సెంత‌మిళ్, మ‌ల‌యాళ మ‌నోర‌మ‌... ఇవీ ద‌క్షిణ ద్ర‌విడ భాష‌లు. ఇంత‌కీ ఈ ద్ర‌విడం ఎక్క‌డి నుంచి వ‌చ్చింది. ద్ర‌విడ భాష‌ల్లోకి త‌మిళ్ ముందా లేక క‌న్న‌డ‌, తెలుగు, మ‌ల‌యాళ భాష‌లా అని చూస్తే.. అస‌లు త‌మిళ్ అన్న‌ది ఎలా పుట్టిందో తెలుసుకోవ‌ల్సి ఉంటుంది.. ద్రవిడ‌మునకు పూర్వరూపము ద్రమిళమని అంటారు. ఇదే ద్రవిడముగ సంస్కృతమున నిలచిన‌ట్టు చెబుతారు. ప్రాకృత భాషల్లో తిరమడ, తిరమిళ, తమిళ అంటూ ఈ భాష అనేక‌ రూపాంత‌రాలు చెందిన‌ట్టుగా చెబుతుంది భాషా చ‌రిత్ర‌. ద్రమిళమే త‌మిళానికి మొద‌టి ప‌దం.  ద్రమిళ, ద్రవిడ, తిరమడ, తిరమిళ, తమిళ  శబ్దములు ధ‌ర్మ శ‌బ్దాల నుంచి వ‌చ్చాయ‌ని అంటారు. దీంతో పాటు ద్ర‌విడ భాష‌ల్లో కూడా ర‌క‌ర‌కాలుంటాయి. ద్రావిడ భాషా కుటుంబంలో ప్రాధాన్య‌ తాంశాలేంట‌ని చూస్తే.. తొలుత త‌మిళ భాష‌- త‌ర్వాత‌ క‌న్న‌డ భాష‌ క‌నిపిస్తాయి. త‌ర్వాత‌ మధ్య ద్రావిడ భాషా కుటుంబం క‌నిపిస్తుంది. ఇందులో తెలుగు ప్ర‌ధాన  భాష‌. ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం కురుఖ్ వంటి భాష‌లున్న‌ట్టు చెబుతంది మ‌న ద్ర‌విడ భాషా చ‌రిత్ర‌. అంటే ద్ర‌విడంలోనే అనేక భాష‌లు వాటికి గ్రెడేషన్ ఉన్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ అంత న‌మ్మ‌కంగా ఎలా చెప్ప‌గ‌లిగారంటే.. ద్ర‌విడ భాష‌ల పెద్ద‌న్న త‌మిళం. త‌ర్వాతే క‌న్న‌డ‌. ఆ త‌ర్వాత మ‌ల‌యాళం, ఆపై ఇత‌ర భాష‌లు. అందుకే ఆయ‌న అంత గ‌ట్టిగా త‌న‌కు చ‌రిత్ర కారులు చెప్పార‌ని గట్టిగా అంటున్నారు. నిజానికైతే తెలుగు క‌న్న‌డ ద‌గ్గ‌ర ద‌గ్గ‌రగా ఉన్న‌ట్టు క‌నిపిస్తాయి. ఆ భాష రాత‌లోగానీ పిలుపులోగానీ ఆ సొబ‌గు ఈ రెండింటి మ‌ధ్యే ఎక్కువ‌గా ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. మీరు కావాలంటే  చూడండీ.. క‌న్న‌డ వాళ్ల‌తో తెలుగు మాట్లాడి  నెగ్గుకు రాగ‌లం. త‌మిళ‌వాళ్ల ముందు మ‌ల‌యాళం మాట్లాడి నెగ్గుకు రాగ‌లం. ఈ రెండింటి మ‌ధ్య ఉన్న అనుబంధం అలాంటిది. అలాంటిది త‌మిళానికీ క‌న్న‌డానికీ సంబంధ‌మేంట‌న్న‌ది అర్ధంకాని చిక్కు ప్ర‌శ్న‌. అస‌లు ద్ర‌విడం అంటేనే బౌద్ధ ధ‌ర్మంలోంచి పుట్టింద‌నీ.. ఆ ధ‌ర్మ‌మే ద్ర‌విడంగా త‌ర్వాత త‌మిళంగా పుట్టుకొచ్చింద‌ని మ‌న‌కు చెబుతోంది భాషా చ‌రిత్ర‌.  ద్ర‌విడ భాష‌లు దాని వంశ వృక్షం విష‌యానికి వ‌స్తే.. మూల ద్రావిడ భాష దాన్లోంచి ఉత్త‌ర ద‌క్షిణ భాష‌లు పుట్టుకొచ్చాయి. వాటిలో ద‌క్షిణ భాషల్లోంచి త‌మిళం పెద్ద‌న్న‌గా ఉండ‌గా క‌న్న‌డ అందులోంచి పుట్టుకొచ్చిన మ‌రో కొమ్మ‌లా క‌నిపిస్తుంది. ఈ కోవ‌లోనే మ‌ల‌యాళం కూడా పుట్టుకొచ్చిన‌ట్టు తెలుస్తుంది.  అంటే త‌మిళ‌మే ఈ భాష‌ల‌న్నిటికీ  హెడ్ క్వార్ట‌ర్. మ‌రి క‌న్న‌డిగుల‌కు ఈ విష‌యం తెలీదా? ఎందుక‌ని క‌మ‌ల్ హాస‌న్ లేటెస్ట్ మూవీ థ‌గ్స్ అండ్ లైఫ్.. సినిమాతో పాటు ఇత‌ర చిత్రాలేవీ ఆడ‌నివ్వ‌మంటున్నారు.. ఇందుకు రీజ‌న్లు ఏమై ఉంటాయ్? అని చూస్తే ఆత్మ‌గౌర‌వ ప్ర‌శ్న‌. ఎవ‌రికి వారు మేమంటే మేమే గొప్ప అనుకుంటారు. అలాంటిది వాళ్ల‌కు వాళ్లు గొప్ప‌. క‌న్న‌డిగుల‌కు అస‌లే ఆత్మాభిమానం ఎక్కువ‌.  ఇప్ప‌టికే కావేరీ స‌మ‌స్య ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఎప్ప‌ట్నుంచో ఉంది. కావేరీ న‌ది పుట్టింది క‌ర్నాట‌క‌లోని త‌ల‌కావేరీ ప్రాంతంలో. అక్క‌డి నుంచి అది త‌మిళ‌నాడు దిశ‌గా ప్ర‌వ‌హించి బంగాళా ఖాతంలో క‌లిసేది తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల మ‌ధ్య గ‌ల ఈ గొడ‌వ ఇప్ప‌టిది కాదు. ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి రాక పోవ‌డానికి గ‌ల ప్ర‌ధాన‌ కార‌ణం కూడా ఇదే.  ర‌జ‌నీ(మ‌రాఠీ అయిన‌ప్ప‌టికీ) పుట్టింది క‌ర్ణాట‌క‌లో.... ఎంతైనా పుట్టిన ప్రాంత అభిమానం అంటూ ఒక‌టి ఉంటుంది కాబ‌ట్టి.. ఆయ‌న్ను త‌మిళులు రాజ‌కీయ పార్టీ పెట్ట‌నివ్వ‌లేదని అంటారు. ఆయ‌న కూడా ఎందుకొచ్చిన గొడ‌వ అంటూ ప‌క్క‌కు త‌ప్పుకున్నారు. అదే క‌మ‌ల్ హాస‌న్ త‌న మ‌క్క‌ల్ నీతి మ‌య్యం అనే పార్టీ స్థాపించి.. డీఎంకేతో పొత్తు పెట్టుకుని.. ఇప్పుడు రాజ్య‌స‌భ‌కు కూడా వెళ్తున్నారు. అది వేరే విష‌యం అనుకోండి. త‌మిళ క‌న్న‌డ ప్ర‌జ‌ల‌కున్న గొడ‌వ‌లు ఈనాటివి కావు.. కావేరీ జ‌లాల విష‌యంలో ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఇప్ప‌టికే కొన్ని ప‌దుల సంఖ్య‌లో గొడ‌లు జ‌రిగాయ్. ఎప్ప‌టి నుంచో క‌న్న‌డిగుల‌కు మ‌రో  స‌మ‌స్య కూడా ఉంది. త‌మ సినిమాలు ఇత‌ర భాష‌ల డ‌బ్బింగ్ సినిమాల ముందు తేలిపోతున్నాయ‌ని భావించిన వీరు డ‌బ్బింగ్ చిత్రాల‌పై బ్యాన్ విధించారు. ఈ బ్యాన్ ని ఎప్పుడెప్పుడు అమ‌లు చేద్దామా? అని చూస్తున్న వారికి క‌మ‌ల్- క‌న్న‌డ కామెంట్స్ మ‌రింత కాక పుట్టించాయ్. దీంతో అందివ‌చ్చిన అవ‌కాశాన్ని ఎలాగైనా వాడుకోవాల‌న్న‌ది ఇంకో ఎత్తుగ‌డ‌గా తెలుస్తోంది.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు చివరి దశకు వస్తుండటం, వారంతం సమీపిస్తుండటంతో భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు. శుక్రవారం (మే 30) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ  సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక గురువారం (మే 29) శ్రీవారిని మొత్తం 69 వేల 19 మంది దర్శించుకున్నారు. వారిలో 37 వేల 774 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 42 లక్షల రూపాయలు వచ్చింది. 

ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్!

పాక్ ఉగ్రవాదులను ఏరిపారేసిన ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ కు నాంది పలుకుదామని తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపు నిచ్చారు. మహానాడు ముగింపు సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన టెర్రరిస్టులు దేశానికి ఎంత ప్రమాదమో....రాజకీయ ముసుగులో ఉన్న ఆర్ధిక ఉగ్రవాదులు అంత కంటే ప్రమాదమన్నారు. వారిని రాష్ట్రం నుంచి తరిమికొడదామన్నారు. అందుకే  ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ తో వారిని రాజకీయాల్లో లేకుండా చేద్దామన్నారు.  రాజకీయాలు అడ్డం జగన్ హయంలో ల్యాండ్, సాండ్, వైన్, మైన్ కుంభకోణాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్న చంద్రబాబు.. ఒక్క చాన్స్ అంటే నమ్మి నాడు ఓటేసి గెలిపిస్తే..   జగన్ హయాంలో జె బ్రాండ్స్‌తో, గంజాయి, డ్రగ్స్‌తో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేశారనీ,  అడవులను ఆక్రమించి ఎస్టేట్ లు నిర్మించుకున్నారని... కొండలు, చెరువులు కూడా మింగేశారని,     ప్యాలెస్‌ల నుంచి ఎస్టేట్‌ల వరకు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని విమర్శించారు. అదికార అహంతో విర్రవీగిన వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్న చంద్రబాబు  పార్టీ ఎలా ఉండాలో, పాలన ఎలా ఉండాలో చెప్పడంలో టీడీపీ ప్రస్థానం ఒక ఒక కేస్ స్టడీ అయితే.. పాలకులు ఎలా ఉండకూడదో, పార్టీ ఎలా నడపకూడదో చెప్పడానికి వైసీపీ ఒక కేస్ స్టడీ అన్నారు. 

కడప జగన్ అడ్డా కాదు.. చంద్రబాబు ఖిల్లా.. బీటెక్ రవి

తెలుగుదేశం ఆవిర్భావం తరువాత తొలి సారిగా కడపలో మహానాడు నిర్వహించి ఇక కడప ఎంత మాత్రం జగన్ అడ్డా కాదని నిరూపించామని పులివెందుల తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి అన్నారు. మమానాడు చివరి రోజున గురువారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కడపలో ఇంత విజయవంతంగా మహానాడు నిర్వహించిన పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు ఆయన ఈ సందర్భంగా కృతజ్ణతలు తెలిపారు.  జగన్ ఇలాకాలో మహానాడు అంటూ మీడియాలో వచ్చిందనీ, అయితే 2024 ఎన్నికలకు ముందు వరకూ కడన జగన్ అడ్డా అయితే అయి ఉండొచ్చు కానీ.. ఇప్పుడు కడప చంద్రబాబు ఖిల్లా అని బీటెక్ రవి అన్నాడు. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏడింటిలో కూటమి విజయం సాధించిందనీ, ఇంకా కడన జగన్ ఇలాకా ఎలా అవుతుందని ప్రశ్నించారు. వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చినందుకు ఆయన ప్రభుత్వానికి కృతజ్ణతలు తెలిపారు. చంద్రబాబు గారి కృషితోనే నేడు పులివెందుల హార్టికల్చర్ హబ్‌గా మారింది. ఇక్కడ పండిస్తున్న అరటి, బత్తాయి పంటలు ఢిల్లీ, ముంబై వంటి నగరాలకే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి అన్న బీటెక్ రవి.. పులివెందులకు చెందిన ఇద్దరు సీఎంలు వైఎస్, జగన్  పులివెందులకు  కనీసం తాగునీరు కూడా అందించలేకపోయారని విమర్శించారు. చంద్రబాబు జల్ జీవన్, అమృత్ పథకాల ద్వారా పులివెందుల మున్సి పాలిటీకి తాగునీరు అందిస్తే..  జగన్ రెడ్డి   నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకున్నారని ఆరోపించారు.  వైసీపీ నాయకులు ఎప్పుడు బయట ఉంటారో, ఎప్పుడు జైలుకు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొందని  ఎద్దేవా చేసిన బీటెక్ రవి   వైఎస్ఆర్ హయాంలో పని చేసిన పలువురు ఉన్నతాధికారులు జైలుకెళ్లారనీ, ఆ తరువాత జగన్ హయాంలో ఆయన చెప్పినట్లల్లా ఆడిన  ధనుంజయ రెడ్డి, పీఎస్ఆర్ ఆంజనేయులు వంటి అధికారులు కూడా జైలుకెళ్లారనీ అన్నారు.   పరిటాల రవి హత్య కేసు, మద్దెలచెరువు సూరి హత్య కేసు, గాలి జనార్దన్ రెడ్డి కేసుల్లో నిందితులంతా జైలుకు వెళ్లారని గుర్తుచేస్తూ, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి, లిక్కర్ కేసులో జగన్ రెడ్డి కూడా వచ్చే మహానాడు నాటికి జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు బీటెక్ రవి. 

జూన్ 6లోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా : మంత్రి పొంగులేటి

  ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో నిర్లక్ష్యం సహించేది లేదని హెచ్చరించారు. గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు,సేకరణ, వ్యవసాయం, వర్షాకాలం ముందస్తు ప్రణాళికా, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, వరంగల్ ఎయిర్ పోర్టు అంశాలపై  మంత్రులు, ఎమ్మేల్యేలు, కలెక్టర్లు అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు  జిల్లాలో కనీసం 50 శాతం కూడా లబ్ధిదారుల జాబితా ప్రకటించకపోవడం ఏంటి ప్రశ్నించారు. లబ్ధిదారుల జాబితా ఫ్రేమ్ కట్టుకోవడానికి కాదని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 6వ తేదీ లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలి ఆదేశించారు.  నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వీటి నియంత్రణకు పోలీస్‌, వ్యవసాయ శాఖ సమన్వయంతో పని చేయాలన్నారు. జూన్ 6 కటాఫ్ డేట్‌గా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్లికేషన్లను క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారుల ఎంపికలో వయో పరిమితి లేదని స్పష్టం చేశారు. పేదల సొంతింటి కల నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం చేపట్టిన విషయం తెలిసిందే

వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు

  వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ  హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తక్షణమే ఆయనకు వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. తన హెల్త్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేయాలని వంశీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వంశీకి తక్షణమే వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. కాగా అక్రమ మైనింగ్ కేసులో కూడా వంశీకి నేడు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్ట్. అదే విధంగా వంశీ తనకు మెరుగైన చికిత్స కోసం ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రి లో సరైన సౌకర్యాలు లేవని కోర్టుకు నివేదించారు. దీంతో, వంశీకి మెరుగైన చికిత్స అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  

ఈ పెద్దాయన మహా అభిమాని.. 400 కిలోమీటర్లు సైకిల్‌పై మహానాడుకు

  ఈ పెద్దాయన తెలుగుదేశం పార్టీకి మహా అభిమాని 400 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం చేస్తూ కడపలో జరిగిన మహానాడుకు హాజరయ్యారు. మండే ఎండలు మధ్య మధ్యలో వానలు అయినా లెక్క చేయకుండా ఏడు పదులు దాటిన వయసులో 400 కిలోమీటర్లు సైకిల్ తొక్కాలంటే సాహసమే..అయినా అభిమానం ముందు ఆ సాహసం ఆయనకు పెద్ద లెక్కే కాకుండా పోయింది. ధూళిపూడి మునేశ్వరరావు అనే  ఈ పెద్దాయనది అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు.  తెలుగుదేశం పార్టీ అంటే వల్లమాలిన అభిమానం కడపలో జరుగుతున్న మహా పండుగ కు తమ తెలుగుదేశం పార్టీ గుర్తు,పేదోడి రధం అయిన సైకిల్ పై వచ్చారు. ఈయనకు టిడిపి అంటే వీరాభిమానం 400 కిలోమీటర్లు సైకిల్ పై వచ్చిన ఈ పెద్దాయన గురించి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో చంద్రబాబు ఆయన్ను వేదికపై కి పిలిచి అందరికీ చూపిస్తూ స్ఫూర్తి దాత అంటూ కితాబిచ్చి అభినందించారు. తెలుగుదేశం పార్టీకి ఇలాంటి కార్యకర్తలు ఉండం పూర్వజన్మ సుకృతం అని చంద్రబాబు కొనియాడారు. వేదికపై ఉన్న నారా లోకేష్ సైతం లేచి చప్పట్లు కొడుతూ అభినందించారు  

మహానాడు సభలో ఎమ్మెల్యే భర్త తీవ్ర భావోద్వేగం .. ఓదార్చిన సీఎం చంద్రబాబు

  కడపలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు మూడో రోజు భారీ బహిరంగ సభతో విజయవంతంగా ముగిసింది. ఈ సభ వేదికపై ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వేదికపైకి చేరుకున్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏర్పాట్లను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రెడ్డెప్పగారి శ్రీనివాస్‌ రెడ్డిని భుజం తట్టి సీఎం మెచ్చుకున్నారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి ఆనందభాష్పాలతో చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.  గత ఐదేళ్లలో కడప జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ఆయన పడి కష్టం.. ప్రత్యర్థుల కుట్ర, చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను గుర్తు తలచుకోని శ్రీనివాస్‌ రెడ్డిని ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. దీంతో ఆయనను చంద్రబాబు నాయుడు ఓదార్చారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నిలబడిన మాధవీ రెడ్డి దంపతులను అభినందించారు. ఈ సందర్బంగా కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి మాట్లాడుతు  తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు.కడప ఎమ్మెల్యే సీటు ఒక మహిళకు కేటాయించారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు.  

కడప గడ్డన ముగిసిన మహా సంబరం

  రాయలసీమ నడిబొడ్డు కడప గడ్డన నిర్వహించిన పసుపు పండగ పసుపు దండు ఆనందోత్సాహాల మధ్య ముగిసింది. ఉత్తంగ తరంగమై అన్ని దారులు కడప వైపు అన్నట్టు పెను ప్రవాహంలో తెలుగుదేశం శ్రేణులు మహానాడుకు తరలి వచ్చి జోష్ నింపారు .ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా నేతలు ,కార్యకర్తలు అభిమానులు రావడంతో కడప ఈ మూడు రోజులు మినీ సమైక్యాంధ్ర ను తలపించింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ,జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబుల ప్రసంగాలు ఆకట్టు కొనడమే కాదు పార్టీ కార్యకర్తలకు అత్యంత ప్రధాన్యం ఇస్తూ మాట్లాడం వారిలో  మరింత భరోసా నింపింది .అందరి నాయకులకు వేదికపై మాట్లాడే అవకాశం కల్పించడంతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తల కరతాళధ్వనులతో సభా ప్రాంగణం మారుమ్రోగింది. *కడప వేదికగా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక  ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తెలుగుదేశం పార్టీ జరుపుకునే మహానాడు ఈసారి కడపలో నిర్వహించడంతో మరోసారి చంద్రబాబు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక కావడానికి కడప వేదికైంది .ఆ హోదాలో చంద్రబాబు నాయుడు ప్రసంగించి తెలుగు తమ్ముళ్లు కార్యకర్తలకు సేవలకు జోష్ నింపారు .మీకు నేనున్నాను పార్టీ ఉంది మనం కష్టపడదాం ప్రజలకు మంచి చేద్దాం అంటూ పార్టీ శ్రేణులకు స్థైర్యాన్ని ఇచ్చారు. *కలివిడిగా లోకేష్  రాష్ట్ర సాంకేతిక ,విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహానాడులో కలివిడిగా తిరుగుతూ అందరితో మాట్లాడుతూ సీనియర్ నాయకులను గౌరవిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపించారు. ఎక్కడ తారతమ్య భేదాలు ప్రదర్శించకుండా అవకాశం దొరికిన మేరకు అందరితో  ముచ్చటిస్తూ వచ్చారు. మీడియా పాయింట్ లో సైతం అయన మాట్లాడేందుకు వేదికపై కూర్చుంటారని జర్నలిస్టు భావించారు. అయితే ఆయన నేరుగా వచ్చి వేదిక మీదే కుర్చీలో కాకుండా ఒక వారన క్రింద కూర్చొని అందరితో కలిసి మాట్లాడుతూ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చారు. ఎక్కడా విసిగించుకోకుండా ప్రశ్నించిన ప్రతి వారితో నవ్వుతూ మాట్లాడుతూ సమాధానం ఇవ్వడం ఆయన పరిణితికి నిదర్శనంగా చెప్పవచ్చు. *ప్రత్యేక ఆకర్షణగా యన్టీఆర్ గ్యాలరీ. మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఫోటో గ్యాలరీ మహానాడుకు వచ్చిన వారిని బాగా ఆకర్షించింది .మొదటి రెండు రోజుల్లో ప్రతిధుల మహాసభకు దక్షిణం వైపు ఏర్పాటుచేసిన ఈ గ్యాలరీలో ఒక భాగం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటివి పాత చిత్రాలు రంగుల్లోనూ బ్లాక్ అండ్ వైట్ లోను ప్రదర్శించడం చూసేవారికి ఆసక్తి కలిగించింది .ఎన్టీఆర్ గారి తో పాటు దాని పక్కన చంద్రబాబు ,లోకేష్ ఫోటో గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే మహానాడు చివరి రోజున గురువారం ఆ గ్యాలరీ లో ఫోటోలు తీసివేయడంతో లక్షల సంఖ్యలో వచ్చిన వారు వాటిని వీక్షించలేకపోయారు. *అనుకూలించిన వాతావరణం మహానాడు మరో నాలుగు రోజుల్లో మొదలవుతుందన్న ప్పట్నుంచి వర్ష వస్తుందేమో అన్న ఆందోళన కలిగిస్తూనే వస్తోంది .మహానాడు మొదలయ్యే ముందు రోజు కూడా వర్షం కురవడంతో నిర్వాహకుల్లో ఆందోళన తప్పలేదు. ముందు జాగ్రత్త చర్యగా ప్రాంగణంలో వేదికల టెంట్ ల చుట్టూ ముందు జాగ్రత్త చర్యగా కాలువలు తవ్వించారు . 27 నుంచి మూడు రోజులపాటు మహానాడు ముగిసే‌వరకు వర్షాలు రాకపోగా వాతావరణం కూడా చల్లబడడంతో మహానాడు మరింత విజయవంతం కావడానికి కారణం అయ్యింది . టిడిపి నాయకులు కూడా ఊపిరి పిల్చుకున్నారు. *సీమగడ్డన వరాల జల్లు  కడపలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు జరుగుతుందంటే కడప తో పాటు రాయలసీమ వాసులు ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం ఏవైనా హామీలు ఇస్తారని భావించడం సహజమే.. అయితే అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీమతో పాటు రాష్ట్రంలో చేపట బోయే అభివృద్ధి పనులను మహానాడు వేదికగా  ప్రకటించారు. రాయలసీమ విషయానికొస్తే రాయలసీమను సుభిక్షం చేసేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని సీమను కరువు సీమగా ,ఎడారి సీమ గా కానివ్వమని భరోసా ఇచ్చారు. తెలుగు గంగా, హంద్రీ నీవా-నీవా, గాలేరు -నగరి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని ఆ తర్వాత తాను బాధ్యతలు చేపట్టాక వాటిని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు .సీమ ప్రాజెక్టులకు 3500 కోట్లు కట్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది పోలవరం తర్వాత ఎక్కువ స్టైల్ నిధులు కట్ చేసిన ప్రాజెక్టు పందిరి అని అన్నారు 2027 నాటికి జాతికి అంకితం చేస్తామని పోలవరంపై స్పష్టత ఇవ్వడం జరిగింది. వంశధార నుంచి పెన్నా వరకు నదులు అనుసంధానం చేయాలన్నది తమ లక్ష్యం అని తన సంకల్పాన్ని వెల్లడించారు. రాయలసీమ అభివృద్ధిని అగ్రభాగంలోని బాధ్యత తమదే అని హామీ ఇవ్వడం జరిగింది. *ఉక్కుకు మోసులు కడుపుతో పాటు  రాయలసీవాసులు ఎప్పుడెఎప్పుడా  అని ఎదురుచూస్తున్న ఉక్కు పరిశ్రమపై చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వడం ఈ ప్రాంత వాసుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.దాదా20ఏళ్ళు గా 20 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న ఉక్కు సంకల్పానికి పునాదిరాళ్లు తప్ప పూర్తి  చేసిన పరిస్థితులు లేవు. అయితే ముఖ్యమంత్రి మహానాడులో 10 రోజుల్లో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేస్తామని రెండు దశల్లో రూ,9,000 కోట్లతో రాయలసీమ స్టీల్ మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తితో నిర్మాణం చేపడతామని ప్రకటించారు. జిందాల్ సంస్థ నిర్మించే ఈ స్టీల్ ప్లాంట్ లో  3,000 మందికి ఉద్యోగాలు వస్తాయని,ఈ ప్లాంట్ కు శంకుస్థాపనతో పాటు నేనే ప్రారంభోత్సవం చేస్తారని చెప్పడం పై ఇక్కడి వాసుల్లో నమ్మకం కుదురుతోంది. పర్యాటపరంగా గండికోటను అభివృద్ధి చేస్తామని, అక్కడ శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని భవిష్యత్తులో అంతా టూరిజమే‌అని చెబుతూ గండికోట అభివృద్ధి చేయడంతో పాటు శ్రీశైలం,తిరుపతి క్షేత్రాలను మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు .మహానాడు కడపలో పెట్టిన నేపథ్యంలో ఇలాంటి హామీలు ఇవ్వడం సీమవాసుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది

మహానాడు గ్రాండ్ సక్సెస్.. ఇక కడప జిల్లా టీడీపీకి అడ్డా : సీఎం చంద్రబాబు

  కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడప టీడీపీ మహానాడుగ ముగింపు సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఎన్నోసార్లు కడపకు వచ్చానని.. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు టీడీపీ మహానాడుకు రావడం చూసి కొండంత ధైర్యం వచ్చిందన్నారు. కడపలో మహానాడు పెడితే చాలామంది అనుమానించారని సీఎం అన్నారు. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అని నిరూపించేందుకే మహానాడు ఇక్కడ పెట్టామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని గడపలో జరిగిందని.. రెస్పాన్స్ అదిరిందన్నారు. మహానాడు సూపర్ హిట్ అయ్యిందని అన్నారు. కడప రాజకీయం మారబోతోందని.. కడప గడపలో మార్పు కనిపిస్తుందని గత ఎన్నికల ప్రచారంలో చెప్పానన్నారు. అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని  కొనియాడారు.  ఈ ఎన్నికల్లో కడపతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన విజయం సాధించామన్నారు. ఉమ్మడి కడపలో పదికి ఏడు స్థానాలు గెలిచామని చెప్పుకొచ్చారు. ఇప్పటి నుంచి కష్టపడితే 2029 ఎన్నికల్లో పదికి పదికి స్థానాలు గెలుచుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.  జూన్‌ 12 నాటికి 500 సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. వాట్సప్‌లో హాయ్‌ అని పెడితే పనులు జరుగుతాయి. 2027 డిసెంబరు నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. దేశానికి ఉగ్రవాదుల వల్ల చాలా నష్టం. రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా అంతే నష్టం. ఆర్థిక ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తాం. రాజకీయాల ముసుగులో ల్యాండ్‌, శాండ్‌, మైన్స్‌ దోచేశారు.  డ్రగ్స్‌, గంజాయి అమ్మితే అదే చివరి రోజని హెచ్చరిస్తున్నా. ఆడబిడ్డల జోలికి వస్తే అవే వారికి అంతిమ గడియలు. గత పాలనలో భూతానికి పరిశ్రమలు వెనకడుగు వేశామన్నారు. భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నామని హామీ ఇచ్చా. రాష్ట్రాన్ని గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత నాది. రాయల సీమను రాష్ట్రానికి మణిహారంగా మారుస్తాం. రాయలసీమ అభివృద్ధికి బ్లూప్రింట్‌ ఉంది. ఆరు నెలల్లో కడప హజ్‌హౌస్‌ పూర్తి చేస్తాం. కర్నూలుకు హైకోర్టు బెంచ్‌ తప్పకుండా వస్తుంది. జూన్‌ 12లోగా కడపలో రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ పనులు ప్రారంభిస్తాం’’ అని సీఎం ప్రకటించారు. ప్రజలకు డబ్బులతో పాటు ఆరోగ్యం ఉంటేనే నిజమైన అభివృద్ధిని తెలిపారు.

ఒక పుష్ప‌ నేష‌న‌ల్, స్టేట్ అవార్డులు రెండు..కార‌ణాలేంటి?

  పుష్ప పార్ట్ వ‌న్ ద్వారా నేష‌న‌ల్ బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు రాగా.. పార్ట్ టూ ద్వారా.. స్టేట్ బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు రావ‌డం మాములు విష‌యం కాదు. ఒక పాత్ర‌ను ద‌ర్శ‌క ర‌చ‌యిత‌లు మ‌ల‌చ‌డం ఒక ఎత్తు అయితే దాన్ని చేయ‌డం మ‌రొక ఎత్తుగా భావించాల్సి ఉంటుంది. ఈ క్రెడిట్ ద‌ర్శ‌క ర‌చ‌యిత‌ల‌దా? లేక ఆ కేరెక్ట‌ర్ కి ప్రాణం పెట్టిన ఆర్టిస్టుదా? ఎవ‌రి స‌మ‌ర్ధ‌త ఎంతెంత‌? ఎవ‌రికి ఈ ఘ‌న‌త‌ను ఇవ్వాల్సి ఉంటుంద‌ని చూస్తే.. ఒక ర‌కంగా చెబితే ఆర్టిస్టుకే ఈ క్రెడిబిలిటీ ఇవ్వాల్సి ఉంటుంది.కార‌ణం.. పాత్ర‌లు అన్నింటా ఉంటాయి. అంద‌ర‌కూ క్రియేట్ చేయ‌గ‌ల‌రు. కానీ దాన్ని పాన్ ఇండియాలో ప్రేక్షక ప్ర‌జ‌లను అల‌రించ‌డం.. ఒక ర‌క‌మైన మేన‌రిజమ్స్ తో ఆక‌ట్టుకోవ‌డం.. ఇవ‌న్నీ ఆర్టిస్టు చేతుల్లోనే ఉంటాయి. పుష్ప  2 పాత్ర అయితే, ఏకంగా డైలాగ్ డెలివ‌రీ కూడా స‌రిగా ఉండ‌దు. నోట్లు తంబాకు పెట్టుకుని న‌త్తి న‌త్తిగా డైలాగ్ చెప్ప‌డం అన్న‌ది ఇందులో క‌నిపిస్తుంది. దీంతో .. ఈ పాత్రను మ‌రింత క‌ష్ట‌త‌రం చేశారు ద‌ర్శ‌క ర‌చ‌యిత‌లు. దీంతో చెప్పేదేముందీ ఈ పాత్ర పోష‌ణ మ‌రింత క‌ఠువుగా మారినా.. దాన్నికూడా ఒక ఛాలెంజింగా తీసుకున్న న‌టుడు అల్లు అర్జున్ దీన్ని భేష్ అనిపించాడు. ఇక్క‌డ మ‌రో స‌బ్జెక్ట్ ఏంటంటే.. ఇలాంటి స్మ‌గ్ల‌ర్ కేరెక్ట‌ర్స్ కి, గ‌ద్ద‌ర్ లాంటి  ప్ర‌జా వాగ్గేయ‌కారుడు, విప్ల‌వ‌కారుడి పేరిట ఇవ్వ‌డ‌మేంటి? ఇక్క‌డ‌స‌బ్జెక్ట్ గ‌ద్ద‌ర్ కీ ఆ పాత్ర‌కీ  ఉన్న పోలిక కాదు. అంత‌టి క‌ష్ట‌త‌ర‌మైన పాత్ర‌ను ఒక న‌టుడిగా అత‌డెలా చేశాడు? అన్న‌దే కీల‌కం. దీంతో ఈ దృష్టికోణంలో మ‌నం అలా చూడాల్సి ఉంటుంద‌ని చెప్పాలి