కాళేశ్వరం విచారణపై కేసీఆర్ కీలక నిర్ణయం

    కాళేశ్వరం విచారణపై బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జూన్ 5న కేసీఆర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. కీలక పరిణామం చోటుచేసుకుంది. తాను జూన్ 5న విచారణకు హాజరు కాలేనని.. జూన్ 11న తప్పక హాజరవుతానంటూ తాజాగా గులాబీ బాస్, కమిషన్‌కు సమాచారం అందజేశారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని అంగీకరించిన కాళేశ్వరం కమిషన్ విచారణ తేదీని ఈ నెల 11కు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలో అవినీతిని బయట పెట్టేందుకు రేవంత్ సర్కార్ పీసీ చంద్రఘోష్ ఆధ్వర్యంలో కాళేశ్వరం కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నీటిపారుదల శాఖ మంత్రి  హరీష్ రావు , ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన ఈటల రాజేందర్‌లను విచారణకు హాజరు కావాలంటూ కమిషన్ ఇటీవలే వారికి నోటీసులు జారీ చేసింది.

కవితకు హరీష్ కౌంటర్.. పార్టీ పగ్గాలు కేటీఆర్ కు ఇప్పడప్పుడే కాదని క్లారిటీ

బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు ఇప్పట్లో పార్టీ పగ్గాలు అప్పగించే యోచన కేసీఆర్ కు లేదని పరోక్షంగా చెప్పారు. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలోనే బరిలోకి దిగుతుందన్న క్లారిటీ ఇచ్చేశారు. పనిలో పనిగా కవిత ఆరోపణలనూ నిర్ద్వంద్వంగా కొట్టి పారేశారు. సోమవారం (జూన్ 2) మీడియాతో మాట్లాడిన ఆయన బీజీపీలో బీఆర్ఎస్ విలీనం ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల పేరు ఎత్తకుండానే.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర జరుగుతోందన్న ఆమె వ్యాఖ్యలను కొట్టి పారేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నీటిని తరలించు కుపోతుంటే బీజేపీ చోద్యం చూస్తోందంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందనీ, కేసీఆర్ నాయకత్వంలోనే ఎన్నికల సమరాన్ని ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. హరీష్ రావు తన వ్యాఖ్యల ద్వారా  ఇచ్చేశారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఒకటి కవిత ఆరోపణలన్నీ అవాస్తవాలని తేల్చేయడంతో పాటు,  కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అంటూ వస్తున్న వార్తలు కూడా అవాస్తవాలేనని క్లారిటీ ఇచ్చేశారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.   

ఐతానగర్ రౌడీ బ్యాచ్ కు జగన్ పరామర్శ.. సంకేతమేంటి?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెనాలి పర్యటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ప్రకటించిన షెడ్యూల్ మేరకు జగన్ మోహన్ రెడ్డి మంగళవారం (జూన్ 3) తెనాలిలో పర్యటించనున్నారు.   అయితే ఈ పర్యటన ఎందుకు అంటే..  ఇటీవల పోలీసులు బహిరంగంగా ముగ్గురు యువకులపై  జులుం చెలాయించిన ఘటనలో బాధితులను పరామర్శించడానికట. ఔను పోలీసులు ఇటీవల తెనాలి ఐతానగర్ లో ముగ్గురు యువకులకు బహిరంగంగా లాఠీ ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఆ ఘటనలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడంటూ వైసీపీ నానా హంగామా చేస్తున్నది. ఆ గాయపడిన యువకుడు జాన్ విక్టర్ ను పరామర్శించమే జగన్ తెనాలి పర్యటన ముఖ్య ఉద్దేశమట. ఇందు కోసం ఆయన సోమవారం సాయంత్రానికే బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకోనున్నారు.  సరే ఇంతకీ పోలీసులు ఓపెన్ లాఠీ ట్రీట్ మెంట్ కు గురైన ముగ్గురు యువకులూ ఎవరంటే..  పలు కేసులలో నిందితులు. అన్నిటికీ మించి ఒక కానిస్టేబుల్ పై దాడి చేసి, బెదరించిన వారు. వారికి పోలీసులు ఇచ్చిన ట్రీట్ మెంట్ పట్ల ఐతానగర్ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. వారి ఆగడాలు భరించలేక పోతున్నామనీ, ఇప్పుడు పోలీసుల ట్రీట్ మెంట్ తోనైనా వారిలో భయం పుట్టి అరాచకాలకు స్వస్తి చెబుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలా ప్రజల దృష్టిలో దుర్మార్గులుగానూ, చట్టం దృష్టిలో నేరస్తులుగానూ ముద్రపడిన వ్యక్తులకు పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్ కు నిరసనగా, ఆ ట్రీట్ మెంట్ లో తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్న జాన్ విక్టర్ ను పరామర్శించడానికి జగన్ బయలుదేరారు. అయితే పోలీస్ ట్రీట్మెంట్ జరిగి వారం దాటిపోయింది. ఇప్పుడు హఠాత్తుగా జగన్ వారిని పరామర్శించడానికి రావడానికి కారణమేంటి? అంటే... దళితులపై పోలీసుల దౌర్జన్యం అంటూ కలర్ ఇచ్చి రాజకీయ లబ్ధి పొందానికే.  జగన్ తెనాలి పర్యటన ప్రకటన వచ్చీ రావడంతోనే అన్నివర్గాల నుంచీ వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ  అధినేత.. రౌడీ షీటర్లను పరామర్శించడం ఎలాంటి సంకేతాలను ఇస్తుందన్న చర్చా మొదలైంది. వైసీపీలోనే పలువురు జగన్ పరామర్శ పర్యటనను వ్యతిరేకిస్తున్నారు.  క్రిమినల్స్ ను పరామర్శించడమంటే.. అలా పరామర్శిస్తున్న వారిది  కచ్చితంగా క్రిమినల్ మనస్తత్వమే అయి ఉంటుందని చెబుతున్నారు.  వాస్తవానికి ఇప్పుడు జగన్ పరామర్శించనున్న వారు సజ్జనులు కాదు. కరుడుగట్టిన నేరస్తులు. గంజాయి బ్యాచ్ కు చెందిన వారు. గంజాయి స్మగ్లింగ్, అమాయకులపై దౌర్జన్యాలు, దాడులకు పాల్పడిన వారు. అది కూడదంటూ హెచ్చరించిన పోలీసుపైనే దాడికి పాల్పడిన వారు. అటువంటి వారిని పరామర్శించడానికి జగన్ తగుదునమ్మా అంటూ బయలు దేరడాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తప్పుపట్టారు. వారిని పరామర్శించడం ద్వారా జగన్ పార్టీ శ్రేణులకు ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నారని నిలదీశారు.   

కవిత కొత్త పార్టీ.. కేసీఆర్ వ్యూహమేనా.. ఆయన మౌనం అందుకేనా?

తెలంగాణలో ఇప్పుడు రాజకీయాలన్నీ కల్వకుంట్ల కవిత చుట్టూనే తిరుగుతున్నాయి. తండ్రికి రాసిన లేఖ లీక్ తరువాత జరిగిన పరిణామాలు ఆమె బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకోవడం ఖాయమన్న సంకేతాలనే ఇస్తున్నాయి. ఇప్పటికే ఆమె తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వాటిలో ఎక్కడా బీఆర్ఎస్ ప్రస్తావన, ప్రమేయం లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే ఆమె ఆమె తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా వెలసిన ఫ్లెక్సీలు, పోస్టర్లలో ఎక్కడా బీఆర్ఎస్ పేరు కానీ, బీఆర్ఎస్ జెండా కానీ లేదు. అయితే కేసీఆర్, జయశంకర్ ఫొటోలు మాత్రం ప్రముఖంగా ఉన్నాయి. ఇప్పుడు ఆమె తాజాగా ప్రారంభించిన జాగృతి కార్యాలయమే ఒక వేళ ఆమె రాజకీయ పార్టీ ప్రారంభిస్తే.. ఆ పార్టీ కార్యాలయంగా  మారినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో నేడో, రేపో కవిత కొత్త పార్టీ ప్రకటన ఉంటుందన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతోంది.  అయితే ఇక్కడే ఒక సందేహాన్ని కూడా పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.  కవిత బీఆర్ఎస్ కు దూరంగా వేస్తున్న రాజకీయ అడుగుల వెనుక ఆమె తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహం ఉందా అన్నదే అ సందేహం.  మామూలుగా అయితే కవిత తీరు తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ కు స్పష్టమైన హెచ్చరికగానే భావించాల్సి ఉంటుంది. ఆమె బాహాటంగానే తన సోదరుడు కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని వ్యతిరేకించారు.   అదే సమయంలో కేసీఆర్ ను దేవుడిగా అభివర్ణించారు.   ఇప్పుడు కవిత తన సొంత పార్టీని ప్రకటిస్తే ఏం జరుగుతుంది?  తమిళనాడులో డీఎంకే, ఏఐఏడిఎంకేలా బీఆర్ఎస్ రెండుగా నిట్టనిలువుగా చీలిపోతుందా? బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలను కవిత తన వైపునకు తిప్పుకోగలరా? అంటే ఆమెకు అంత సీన్ లేదన్న సమాధానమే అన్ని వర్గాల నుంచీ వస్తోంది. అయితే తమిళనాడులో డీఎంకే అన్నాడీఎంకేలు ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీలకు అవకాశం, చోటు లేకుండా చేశాయి. ఇప్పుడు కవిత వేరుకుంపటి కూడా అలాంటి వాతావరణం సృష్టించడానికేనా అని పరిశీలకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ అదే కారణమై ఉంటే మాత్రం కవిత అడుగుల వెనుక ఉన్నది కేసీఆర్ వ్యూహమేనని అంటున్నారు. ఎందుకంటే రాజకీయంగా   సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి దానిని నిర్వహించేంత స్థాయి కవితకు లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కవిత సొంత పార్టీ యోచన, ప్రయత్నాల వెనుక ఉన్నది కేసీఆర్ వ్యూహమేనని అంటున్నారు.  

స్వరాష్ట్రం వచ్చి పదేళ్లు అయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు : సీఎం రేవంత్‌రెడ్డి

  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చి పదేళ్లు అయిన ప్రజలు ఆకాంక్షలు నెరవేరలేదని  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్ల అధిపత్యాన్ని తిరస్కరించి ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని వేడుకల్లో జాతీయ పతాకన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ఆ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులకు తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి అన్నారు.  ఆర్థిక వ్యవస్థకు మహిళలు మూలస్తంభాలు. కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తెలిపారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిలోపే రూ.2లక్షలలోపు రుణాలను మాఫీ చేశాం. ఆ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.26వేల కోట్లు జమ చేశాం. సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మిస్తున్నాం. రూ.200 కోట్లతో ఆయా చోట్ల భవన నిర్మాణాలు చేపట్టాం. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య, వైద్య రంగాన్ని ప్రక్షాళన చేశామని సీఎం పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తొమ్మిది మందికి రూ.కోటి నగదును ముఖ్యమంత్రి అందజేశారు. ఉద్యమ సమయంలో ప్రజల గుండెల్లో నిలిచిన కవులు, కళాకారులు సాహితీవేత్తలకు నగదు పురస్కారం అందిస్తామని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సమయంలో సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎక్కా యాదగిరిరావు, అందెశ్రీ, సుద్దాల అశోక్‌తేజ, జయరాజు, పాశం యాదగిరికి నగదు పురస్కారాన్ని అందించారు. దివంగత గూడ అంజయ్య, గద్దర్‌, బండి యాదగిరి తరఫున వారి కుటుంబసభ్యులు అందుకున్నారు

భయమన్నదే లేని యోధుడి కుమార్తె!.. టాక్ ఆఫ్ ది స్టేట్ గా కవిత నివాసం ముందు ఫ్లెక్సీలు

ఎవరు ఔనన్నా కాదన్నా.. ఎవరు ఒప్పకున్నా.. ఒప్పుకోకున్నా.. ప్రస్తుతం తెలంగాణ రాజకీయం మొత్తం కల్వకుంట్ల కవిత చుట్టూ తిరుగుతోంది. బీఆర్ఎస్ అధినేత కుమార్తెగా కాకుండా.. ఆమె పార్టీకి భిన్నంగా సొంత శైలిలో ముందుకు కదులుతున్న తీరు చుట్టూనే ఇప్పుడు తెలంగాణ రాజకీయం పరిభ్రమిస్తోంది. తలలు పండిన రాజకీయ విశ్లేషకులు సైతం.. కవితకు ఇంతటి ప్రాధాన్యత ఎలా వచ్చిందని విస్మయం చెందుతున్నారంటే అతిశయోక్తి లేదు. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ లీకైన క్షణం నుంచీ  మీడియా మొత్తం కవిత చుట్టూనే తిరుగుతోందనడంలో  ఆశ్చర్యంలేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సమయంలో కూడా కవితకు అత్యంత ప్రాధాన్యత లభిస్తున్నది. తాజాగా బంజారాహిల్స్ లోని ఆమె నివాసం ఎదుట వెలిసిన ఫ్లెక్సీలు ఇప్పడుు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయాయి. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. యోధుడి కుమార్తెకు భయమన్నదే లేదు అన్న క్యాప్షన్ తో  ఉన్న ఫ్లెక్సీ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫ్లెక్సీ చుట్టూ గులాబి జెండాలు ఉన్నప్పటికీ వాటిలో ఎక్కడా బీఆర్ఎస్ ప్రస్తావనే లేదు.  ఇక ఆ ఫ్లెక్సీలలో కవిత  తెలంగాణ  బొగ్గుగని కార్మికుల కమిటీ కండువా ధరించి ఉన్న ఫొటో ఉంది. ఇప్పుడీ ఫ్లెక్సీల చుట్టూనే చర్చ నడుస్తోంది. కవిత రాజకీయ అడుగులు ఎటు అన్న చర్చ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరు వంటి అంశాలను కూడా మరుగున పరిచేసిందని పరిశీలకులు అంటున్నారు.  

అప్పుడు ఓడి గెలిచింది.. ఇప్పుడు గెలిచి ఓడింది

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు పూర్తయ్యాయి. పుష్కర సంవత్సరంలోకి అడుగు పెట్టింది. తెలంగాణ రాష్ట్రం స్వతస్సిద్దంగా ఏర్పడిన రాష్ట్రం  కాదు.. పోరాడి సాధించుకున్న రాష్ట్రం. అందుకే తెలంగాణ గడ్డ  పోరాటాల పురిటి గడ్డ అంటారు. నిజానికి, తెలంగాణ రాష్ట్ర సాధన..  తెలంగాణ రాష్ట్ర సమితి సారధ్యంలో 2001 నుంచి 2014 వరకు సాగిన మలి దశ ఉద్యమం ద్వారానే సాధ్యమైనా..  తెలంగాణ ఉద్యమం  ఆరు పదులకు పైగా సాగిన ఒక దీర్ఘకాలిక, రాజకీయ ప్రజా ఉద్యమం.  నిజానికి..  1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భావంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష పురుడు పోసుకుంది. ఇక అక్కడినుంచి 60 ఏళ్ల పాటు  ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఏదో ఒక రూపంలో వ్యక్తమవుతూనే వుంది.  ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఎందరో నాయకుల సారధ్యంలో పార్టీలు పుట్టుకొచ్చాయి. కారణాలు ఏవైనా..  మధ్యలోనే లక్ష్యం పక్కదారి పట్టి పోయింది. అయితే నాయకుల స్వార్ధంతో ఉద్యమం పక్కదారి పట్టినా..  ఉద్యమ స్పూర్తి మాత్రం సజీంగానే నిలిచింది.  అందుకే.. జాతీయ, రాష్ట్ర నాయకులు మోసాలు చేసినా..  పడిలేచిన కెరటంలా  తెలంగాణ ఉద్యమం అంతిమ గమ్యాన్ని చేరుకుంది. 1969లో విద్యార్ధుల సారథ్యంలో మహోదృతంగా ఎగసి పడిన జై తెలంగాణ ఉద్యమం రాజకీయ రంగ ప్రవేశంతో పది నెలలకే చల్లబడింది. సర్కార్ తూటాలకు వందల మంది విద్యార్ధుల నేలకొరిగారు. అయినా..  విద్యార్ధుల బలిదాన స్పూర్తి నిలిచింది. 2001లో మలిదశ ఉద్యమం పురుడు పోసుకునే వరకు  ప్రత్యేక తెలంగాణ స్పూర్తి సజీవంగా నిలిచింది. ప్రత్యేక రాష్ట్రం కోసం  సబ్బండ వర్గాల ప్రజలే నడుం బిగించారు.  ప్రజా ఉద్యమంగా తెలంగాణ ఉద్య స్పూర్తిని  కొనసాగించారు.  ఇక ఆ తర్వాత ఏమి జరిగిందీ అన్నది మన ముందున్న నడుస్తున్న చరిత్ర.  ఇప్పడు 2001లో కల్వకుట్ల చంద్రశేఖర రావు  సారథ్యంలో గులాబీ జెండా నీడలో..  2001లో మలిదశ ఉద్యమం మొదలైంది. తొలితరం ఉద్యమ నేత  కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశీస్సులతో 2001 ఏప్రిల్, 27న జలదృశ్యంలో మలిదశ ఉద్యమం తొలి అడుగు వేసింది. అయితే..  గమ్యం చేరుతుందని.. తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యంవుతుందన్న  ఆశ అప్పటికి అంతగా లేక పోయినా.. 2014  జూన్ 2 న ఆరు పదుల కల నెరవేరింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.  అయితే..  అంతవరకు ఏమి జరిగింది, ఆ తర్వాత ఏమి జరిగింది, ఇప్పడు ఏమి జరుగుతోంది..  అనే విషయంలోకి వస్తే, ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సకల జనుల సమ్మె(2008) వంటి మహోన్నత ఆందోళనలు,1200 మందికి పైగా తెలంగాణ బిడ్డల బలిదానంతో సాధ్యమైన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ఆకాంక్ష అయితే నెరవేరింది  కానీ.. కొండాలక్ష్మణ్ బాపూజీ ,  కాళోజీ నారాయణ రావు,  ప్రొఫెసర్ జయశంకర్ సార్,  కేశవ రావు జాదవ్ వంటి  తెలంగాణ సిద్దాంత కర్తలు, స్పూర్తి ప్రదాతలు, ప్రాతః స్మరణీయుల కన్న కలలు ఫలించాయా..  ఆరు దశాబ్దాలకు పైగా తెలంగాణ ఆకాంక్షను ఉపిరిగా జీవించిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా.. అందుకోసమే ఉపిరి వదిలిన వందల మంది అమర వీరుల ఆకాంక్షలు నేరవేరాయా? అంటే మాత్రం తెలంగాణ ప్రజనీకం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్రం ఏర్పడింది  కానీ, ఆకాంక్షలు మాత్రం అలాగే ఉన్నాయి. అన్నదే  తెలంగాణ ప్రజలు ఇచ్చే సమాధానం అవుతుందని  అంటున్నారు.  నిజానికి..  ఈరోజున్న వాస్తవ పరిస్థితులను, రాష్ట్రంలో రగులుతున్న రాజకీయ వికృత విన్యాసాలను  గమనిస్తే..  ముఖ్యంగా.. తెలంగాణ పేగు బంధాన్ని తెంచుకుని   బీఆర్ఎస్ గా  పేరు మార్చుకున్న టీఆర్ఎస్ లో, మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర తొలి, మలి ముఖ్యమంత్రి, ప్రస్తు మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుటుంబంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే..  1969 నాటి, తెలంగాణ తొలిదశ ఉద్యమం ఓడి గెలిస్తే.. 2001 మొదలైన మలి దశ ఉద్యమం గెలిచి ఓడిందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. మరోవంక  రాష్ట్ర గీతం.. రాష్ట్ర మాత(తెలంగాణ తల్లి) విగ్రహం కూడా రాజకీయ రంగులు పులుముకున్న పరిస్థితిలో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందనే మూగ బాధ జనంలో వ్యక్తమవుతోంది. చివరకు, మరో ఉద్యమం వైపు అడుగులు వేస్తున్నతెలంగాణ నడుస్తున్న చరిత్రను గమనిస్తే.. ‘తన చరిత్రను తనే పఠించి ఫక్కున  నవ్వింది ధరిత్రి’  అన్న కవి వాక్కును  తెలంగాణ రాజకీయ నాయకత్వం నిజం చేస్తోందని, అంటున్నారు.   తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ప్రత్యేక వ్యాసం 

కూతురి హంగామాపై నోరు మెదపని కేసీఆర్ .. బీఆర్ఎస్‌లో గుబులు

కవిత ఎపిసోడ్‌పై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంత రియాక్ట్ కాకపోవడం పార్టీ నాయకులు, కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. తన కుమార్తె కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం కలిగించినా, ఆ వ్యాఖ్యలు చేసి రోజులు గడుస్తున్నా కేసీఆర్ మౌనం వీడటం లేదు. దాంతో కూతురు  విషయంలో  డాడీ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు కవిత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. కొత్తగా ప్రకటించిన సింగరేణి జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించిన ఆమె, సొంత యాక్షన్ ప్లాన్‌తో నిర్ణయాలు ప్రకటిస్తూ గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నారంట.  బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు చేస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నా..  ప్రత్యర్థి పార్టీలు విమర్శల దాడులు చేస్తున్నా కేసీఆర్ సైలెంట్‌గానే ఉంటున్నారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం కలిగించే పరిస్థితులు ఏర్పడినా కేసీఆర్ ఎప్పటిలాగే ఫాంహౌస్‌లో గడిపేస్తున్నారు. దాంతో ఆయన వైఖరిపై గులాబీ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కవిత కామెంట్లు చేసినప్పుడే ఆమెను ఫామ్‌హౌస్‌కు పిలిపించుకుని కేసీఆర్ మాట్లాడతారని బీఆర్ఎస్ నాయకులు భావించారు. కానీ..  కేసీఆర్ ఆమెను పిలవలేదు సరికదా.. హరీష్‌రావుని పిలిపించుకొని తాజా పరిణామాలపై చర్చించారు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతున్నదో తెలియక కేడర్‌‌లో ఆందోళన నెలకొంది. మరోవైపు కవిత కూడా ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మంచిర్యాల పర్యటనకు వెళ్లిన ఆమె, పాత ఆరోపణలే రిపీట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్​ మౌనం.. పార్టీకి నష్టం చేకూరుస్తుందని పలువురు సీనియర్ నేతలు బెంబేలెత్తుతున్నారు. పార్టీలో ఇంత జరుగుతున్నా తన తండ్రి నుంచి కనీసం పిలుపు రాకపోవడం కవితకు ఏమాత్రం మింగుడుపడడం లేదని ఆమె అనుచరులు అంటున్నారు. తాను రాసిన లేఖకు స్పందించకపోగా, దూతలతో రాయబారం నడుపుతుండటంపై ఆమె అసహనంతో ఉన్నారంట. పార్టీలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవడానికి కూడా తన తండ్రి ఇష్టపడటం లేదా?.. అని కవిత తన సన్నిహితుల వద్ద అంటున్నారంట. నేరుగా పిలిచి మాట్లాడితే పార్టీలో జరుగుతున్న పరిణామాలను వివరించేందుకు కవిత సిద్ధంగా ఉన్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు. కానీ కేసీఆర్​ నుంచి స్పందన లేకపోవడంతో కవిత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఆ  క్రమంలోనే బీజేపీలో బీఆర్ఎస్​ విలీనానికి కుట్ర జరుగుతున్నదని కవిత మరోసారి ఆరోపించారు. మంచిర్యాల పర్యటనకు వెళ్లిన ఆమె.. మార్గమధ్యలో పెద్దపల్లి వద్ద ఆగారు. అక్కడికి స్వాగతం పలికేందుకు వచ్చిన బీఆర్ఎస్ క్యాడర్‌ను కవిత కనీసం పట్టించుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కవిత కొన్నాళ్లు సొంతంగానే కార్యాచరణ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. జాగృతి ఆధ్వర్యంలోనే పోరాటాలు చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్టు టాక్ నడుస్తున్నది. అందులో భాగంగానే పార్టీ క్యాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో సింగరేణి జాగృతి ఏర్పాటు సందర్భంగా టీబీజీకేఎస్ నాయకులను కాకుండా యూనియన్‌‌‌‌‌‌‌‌లో యాక్టివ్‌‌‌‌‌‌‌‌గా ఉన్న యువ కార్మికులను పిలిపించుకోవడం ఇందుకు ఊతమిస్తున్నది. అదే సమయంలో కలిసి వచ్చే బీసీ సంఘాలు, నేతలతో ముందుకు వెళ్లాలన్న యోచనలో కవిత ఉన్నట్టు ఆమె అనుచరులు చెబుతున్నారు. ఈ పరిణామాలతో గులాబీ పార్టీ సీనియర్ లీడర్లకు అసలేం జరుగుతోందో అంతుపట్టడం లేదంట. కవిత ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌పై మాట్లాడాల్సి వస్తే కేసీఆర్ లేదంటే కేటీఆర్ మాత్రమే మాట్లాడాల్సి ఉంటుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. వాళ్లను కాదని ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉందని వాళ్లు అంటున్నారు. ఒకవేళ ఏదైనా మాట్లాడితే, అది మళ్లీ నెగెటివ్​ అయ్యి తమకే తగులుతుందని ఆందోళన చెందుతున్నారంట. తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్ పెట్టిన పార్టీ సీనియర్​ లీడర్ సబితా ఇంద్రారెడ్డిని కవిత ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌పై మీడియా ప్రశ్నించగా.. ఆ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని ఆమె బదులిచ్చారు. ఇలాగే చాలామంది సీనియర్ లీడర్లు అధిష్టానం స్పందన కోసం ఎదురుచూస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై మాట్లాడేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ కూడా అందుబాటులో లేరు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం లండన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కేటీఆర్.. తర్వాత అమెరికాకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు అయితే కవిత ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌పై కేటీఆర్ కూడా అక్కడి నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. విదేశాలకు వెళ్లే ముందు కవిత లేఖపై స్పందించిన ఆయన అది అసలు పెద్ద విషయమే కాదని కొట్టిపారేశారు. దాంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది.  ఒకే కుటుంబానికి చెందిన తమ నేతల మధ్య ఇన్ని వైరుధ్యాలు ఉన్నాయా? అని చర్చించుకుంటున్నారు.  ఇక కేసీఆర్‌‌తో హరీష్‌రావు ఫామ్‌హౌస్‌లో భేటీ అయి సుదీర్ఘ మంతనాలు జరిపారు. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీళ్లిద్దరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్ ​విచారణ దగ్గరపడుతున్న నేపథ్యంలో కేసీఆర్, హరీశ్ ప్రధానంగా దానిపైనే చర్చించారని బయటకు చెబుతున్నప్పటికీ, కవిత ఎపిసోడ్‌పైనా చర్చించి ఉంటారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కవిత అసలు  ఆమె సొంతంగానే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారా? లేదంటే వెనకుండి ఎవరైనా నడిపిస్తున్నారా? అన్న అంశంపైనా చర్చ జరిగినట్టు సమాచారం. అదలా ఉంటే కవిత చేస్తున్న కార్యక్రమాలు, పర్యటనల్లో తెలంగాణ జాగృతి బ్యానర్‌లు కనిపించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్‌తో సంబంధం లేకుండానే జాగృతి ఆధ్వర్యంలోనే కవిత సమావేశాలు, పర్యటనలు కానిచ్చేస్తున్నారు . కవిత లేఖ వివాదంపై బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగా స్పందించవద్దని కేటీఆర్ సూచించినట్లు పార్టీ నేతలు అంటున్నారు. మొత్తానికి కవిత పర్యటనల్లో బీఆర్ఎస్ నాయకులు, జెండాలు లేకపోవడం, ఆమె లేఖ లీక్, నాయకుల నిశ్శబ్దంతో పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గత మయ్యాయంటున్నారు. అయితే కవిత మాత్రం తన పని తాను చేసుకుని పోతున్నారు. హైదరాబాద్‌లో సింగరేణి జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించిన ఆమె, కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు జారీ చేయడాన్ని వ్యతిరేకంగా జూన్ 4 ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేస్తానంటున్నారు. కమిషన్ నోటీసులపై పార్టీ నేతలెవరూ స్పందించని పరిస్థితుల్లో కవిత రియాక్ట్ అవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపధ్యంలో జాగృతి అధ్యక్షురాలి ఆంతర్యం అంటుపట్టక గులాబీ శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నాయి.

బిగుసుకుంటున్న ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు.. సిట్ ముందుకు ప్రభాకరరావు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు.. కీలక దశకు చేరుకుంది.  ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు... ఈనెల 5న సిట్ విచారణకు హాజరుకాబోతుండటంతో  ఈ కేసు దర్యాప్తు ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. గత 14 నెలలుగా అమెరికాలో ఉంటున్న ప్రభాకరరావు,  సుప్రీం కోర్టు ఆదేశాలతో ఇండియాకు తిరిగి వస్తున్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఆయన అత్యున్నత న్యాయస్థానానికి హామీ పత్రం కూడా ఇచ్చారు.  వన్ టైమ్ ఎంట్రీ పాస్‌పోర్ట్‌ జారీ అయిన వెంటనే ఆయన ఇండియా బయల్దేరుతారు. పాస్‌పోర్ట్‌ అందిన మూడు రోజుల్లో దేశానికి తిరిగి రావాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈనెల 5న సిట్ విచారణకు హాజరవుతున్నట్టు దర్యాప్తు బృందానికి సమాచారం ప్రభాకర్‌రావు ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో  ఎస్ఐబీ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పంజాగుట్ట పోలీసులు గత ఏడాది మార్చి 10న కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావే.  ఈ కేసు విచారణకు ముదే అమెరికా వెళ్లిపోయిన ప్రభాకరరావు. అక్కడే ఉండిపోవడానికి చేయగలిగినన్ని ప్రయత్నాలు చేశారు. అవేమీ కుదరకపోవడంతో యాంటిసిపేటరీ బెయిలు ఇస్తేనా భారత్ కు తిరిగి వస్తానంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.  దీంతో ఆయన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం ను ఆశ్రయించారు.  సుప్రీం కోర్టు ఆయనకు స్వల్ప ఊరటనిస్తూ విచారణకు సూర్తిగా సహకరించాలన్న షరతుతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుప్రీం ఆదేశాల మేరకు ఆయన భారత్ కు వచ్చి సీటి్ విచారణకు హాజరు కానున్నారు. ఇక ఆయనను విచారించడానికి సిట్ అధికారులు రెడీగా ఉన్నారు.   ఏ ప్రశ్నలు అడగాలి..  ఎలాంటి సమాచారం సేకరించాలనే అంశంపై దృష్టి పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులు, ప్రైవేట్ వ్యక్తి శ్రవణ్‌రావు మధ్య లింక్ ఎలా కుదిరింది?  ఎవరి ఆదేశాలతో ఫోన్లను ట్యాప్ చేశారు? ఆ సమాచారాన్ని ఎవరెవరికి చేరవేశారు? అన్న ప్రశ్నలను సిట్ ప్రభాకరణావుకు సంధించే అవకాశా లున్నాయంటున్నారు.  ఫోన్ ట్యాపింగ్ నిబంధనలను పాటించారా..? హార్డ్‌డిస్క్‌లను ఎందుకు ధ్వంసం చేశారు? ఎవరి ఆదేశాలతో వాటిని నాశనం చేశారు?  వంటి ప్రశ్నలతో ప్రభాకరరావును సిట్ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉందంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్టైన వారి నుంచి తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు ప్రభాకరరావును విచారించనున్నారు. మొత్తం మీద ఈ కేసులో విశ్రాంత ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావుకు ఉచ్చు గట్టిగానే బిగిసినట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గతంలో పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రేవంత్ సీఎం కావడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి దర్యాప్తునకు ఆటంకాలు కలిగించే విధంగా హార్డ్ డిస్క్ లు మాయం కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారాన్ని  సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించింది. ఇక ఇప్పుడు సిట్ విచారణలో ప్రభాకరరావు నోరు విప్పితే.. బీఆర్ఎస్ పెద్దలు చాలా మంది పేర్లు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  సిట్‌ విచారణలో ప్రభాకర్‌రావు నోరు విప్పుతారా...? ప్రీప్లాన్‌గా వ్యవహరిస్తారా..? అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఆయన నిజాలు చెప్తే... గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన చాలా మంది పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడు వారంరిలోనూ ఆందోళన మొదలైంది. మరోవైపు ప్రభుత్వం ప్రభాకర్‌రావుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మొత్తానికి తెలంగాణలో ఈనెల 5 బిగ్‌ డేగా మారనుంది. ఆ రోజు ప్రభాకర్‌రావు సిట్‌ విచారణకు హాజరవుతున్నారు. అదే రోజు మాజీ సీఎం కేసీఆర్‌ కూడా కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఒకే రోజు రెండు బిగ్ ఇష్యూస్... దీంతో... ఏం జరగబోతుంది అన్నది రాజకీయంగా ఉత్కంఠగా రేపుతోంది.

సోమశిల చేప విల విల

  సోమశిల చేప విలవిలలాడుతోంది. చేపల వేట నిషేధ సమయంలోనూ అక్రమంగా చేపల వేట యథేచ్ఛగా కొనసాగుతుండటంతో నిజమైన మత్స్యకారుల ఉపాధికి గండి పడుతోంది. సైజు రాకుండానే చేపలను అక్రమ వేటగాళ్లు ఊడ్చేస్తుండటంతో మత్య సంపద ఖాళీ అవుతోంది.  అలివి  గాని చేపలవేటతో ఎదుగుదల లేకుండానే చేప పిల్ల బయటపడి ఎండిపోతోంది. నిషేధిత వలతో సోమశిల లో సైజుకు రాని చిన్న పిల్ల చేపలను సైతం ఊడ్చి వేస్తున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల నుండి ఒంటిమిట్ట, గోపవరం, అట్లూరు మండలాల పరిధిలోని సోమశిల బ్యాక్ వాటర్ లో యథేచ్ఛగా చేపల వేట సాగుతున్నా.. వాహనాల్లో చేపలను తరలిస్తున్నా అటు మత్స్యశాఖ అధికారులు కానీ ఇటు అటవీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  చేపల మాఫియాకు అడ్డు అదుపు లేకుండా  సాగుతోంది.  చేపల వ్యాపారులు కొందరు మాఫియాను తలపిస్తూ రోజుకు లక్షలాది రూపాయల మత్స్య సంపదను తోడేస్తున్నారు. 30 నుంచి 40 మందికి లైసెన్సులు ఉన్నట్టు తెలుస్తున్నా సోమశిల వెనక జలాల్లో వందల సంఖ్యలో వేటగాళ్లు జాతరను తలపించేలా చేపలవేట సాగిస్తున్నారు. రిజర్వు ఫారెస్ట్ లో కి వెళ్లేందుకు అనుమతులు లేకున్నా  వాహనాలు వెళుతూనే ఉన్నాయి.  కోస్తా ప్రాంతం నుంచి వచ్చిన వేటగాళ్లు చేపలు వేటాడితే ఆ చేపలను  వ్యాపారుల వాహనాల్లో బయటకు తరలిస్తున్నారు. సోమశిల బ్యాక్ వాటర్స్ లో  చేపల  మాఫియా పిల్ల,పెద్ద చేపలన్న తేడా లేకుండా  వూడ్చేస్తోంది  చేపల వేటలో ఆరితేరి, అనుభవం కలిగిన కోస్తా జిల్లాలోని కాకినాడ,తుని తదితర ప్రాంతాల వేటగాళ్ళను  తీసుకొచ్చి మరీ మాఫియా చేపలవేట సాగిస్తోంది.  అలివి వల వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ,  వీటితోనే  వేటాడుతుండడంతో   సైజుకు రాని చిన్న చేపలు, ఎదుగుదల లో ఉండే చేపలు సైతం బయట పడుతున్నాయయి. ఈ కారణంగా చేపలు పెద్దవి కాకుండా మత్స్య సంపదకు గండి కొడుతున్నారు . నలుసు లాంటి చేపలు అయితే  కుప్పలు కుప్పలుగా  పడేయడం, చిన్న చేపలను ఎండవేసి టన్నుల కొద్దీ  అమ్ముకోవడం జరుగుతుంది.   చేపలు పట్టే వారికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇచ్చే లైసెన్స్ లు జిల్లాలో 30 నుంచి 40 మందికి మాత్రమే ఉండగా వాటిని అడ్డుగా పెట్టుకుని వందల మందితో చేపల వేట కొనసాగిస్తున్నారు.  మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం 20 వేల రూపాయలు కోస్తా ప్రాంతంలో మత్స్య కారులు తీసుకుంటూ  ఇక్కడికి వచ్చి చేపలు పట్టడం జరుగుతుంది.  జిల్లాలో ఉండే   లైసెన్స్ లు  కూడా చాలా మటుకు ఫోటోలు ఒకరివి  ఉంటే మరొకరి పేరు తో లైసెన్స్ ఉంటుందని సమాచారం.ఈ రకంగానూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఒక అధికారి వీటిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవడంతో తో కొందరు మళ్ళీ లైసెన్స్ లు  కోర్టు ద్వారా తీసుకున్నట్లు సమాచారం చేపల మాఫియా దాటికి అసలైన మత్స్యకారులు  నానా కష్టాలు పడుతున్నారు. సోమశిల లో చేపలు ఎదిగితే  అవి వర్షాకాలంలో సగిలేరు. పెన్నా నదులు ప్రవహించేటప్పుడు నీటికి ఎదురెక్కి వస్తాయి. దీంతో వీటి  ప్రాంతాల పరివాహ ప్రాంత అడుగుల్లో మత్స్యకారులు వేటకు వెళ్ళి జీవనం సాగిస్తుంటారు.ప్రస్తుతం ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో చివరకు కూలీ పనులకు వెళుతున్నారు.  సోమశిల బ్యాక్ వాటర్ లోని గోపవరం ,అట్లూరు , ఒంటిమిట్ట ,నందలూరు మండలాల్లో పెద్ద ఎత్తున చేపల వేట సాగుతోంది, గోపవరం మండలం లోని గట్టుపల్లి ,బ్రాహ్మణ ,ప్రాంతాలు అట్లూరు మండలంలోని బ్యాక్ వాటర్ ప్రాంతంలో చేపల మాఫియా కూలీలను తిష్ట వేయించి వేటాడిస్తోంది. ఒంటిమిట్ట మండలంలోని వెనుక జలాల్లో కూడా ఈ వేట ఎదేచ్ఛగా జరుగుతున్నా సంబంధిత అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రెండు వారాల క్రితం గోపవరం మండలంలో  చేపలతో వెళుతున్న ఒక  వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు పట్టుకుని   ఫిషరీస్ శాఖకు అప్పజెప్పారు. అంతేకాదు నెల్లూరు రోడ్డు లో రెండు చోట్ల చెక్ పోస్టులు ఉన్నా కూడా ఈ చేపల వాహనాలు తిరుగుతూ ఉండడం గమనార్హం.  చేపల మాఫియా రోజూ  టన్ను పెద్ద సైజు చేపలు వేటాడితే చిన్న చేపలు మరో టన్ను వరకు వేటాడుతున్నారు. ఇవి రెండు లక్షల రూపాయలు మేరకు విలువ చేస్తాయని చెప్పుకొస్తున్నారు .పెద్ద చేపలను కడప, కేరళకు, కలకత్తా లకు తరలిస్తుండగా ఎండు చేపలను అక్కడే ఎండబెట్టి విజయవాడకు తరలిస్తున్నారు. ఒక కేజీ ఎండు చేపలు రూ.130 ప్రకారం పచ్చి చేపలు అయితే 70 నుంచి 80 రూపాయలు వరకు వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు   తెలుస్తోంది. ఇలా అడ్డూఅదుపు లేకుండా వేట సాగిస్తుండడంతో   సోమశిల మత్స్య సంపద మటుమాయం అయ్యే పరిస్థితి నెలకొంది.  రిజర్వ్ ఫారెస్ట్ లోకి అనుమతి కుండా ఎవరూ ప్రవేశించకూడదు .అంతే కాదు రెవెన్యూ ఫారెస్ట్ లోకి కూడా అనుమతి లేకుండా  వాహనాలకు ప్రవేసించ కూడదు. అయితే రిజర్వుపారెస్ట్ నుంచే చేపల వాహనాలు తిరుగుతున్నా వాటిని అదుపు చేయడంలో ఫారెస్ట్ అధికారులు  విఫలమౌతున్నారు. గతంలో చేపల వేట మాటున  ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి.  చేపల రవాణా పేరుతో ఇప్పుడు కూడా వాహనాలు, వేటగాళ్లు తిరుగుతూ ఉండడంతో ఎర్రచందనం రక్షణ కూడా ప్రశ్నార్థకంగా మారింది.  

తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానం.. భక్తుల ఆందోళన, ఆగ్రహం

ఎన్ని సార్లు అభ్యంతరం తెలిపినా విమానయాన శాఖ ఖాతరు చేయడం లేదు. ఆగమశాస్త్ర విరుద్ధంగా తిరుమల గిరులపై నుంచి, అందులోనూ శ్రీవారి ఆలయంపై నుంచి అతి తక్కువ ఎత్తులో విమానాలు వెడుతూనే ఉన్నాయి. తాజాగా ఆదివారం (జూన్ 1) ఉదయం ఒక విమానం శ్రీవారి ఆలయం మీదుగా తక్కువ ఎత్తులో ప్రయాణించింది.  ఇందుకు సంబంధించి తిరుమలలో భక్తులు తీసిన వీడియోలు వైరల్ అయ్యాయి. తిరుమల భద్రతపై భక్తులలో ఆందోళన వ్యక్తమౌతోంది. పదేపదే విజ్ణప్తి చేసినా ఆగమశాస్త్ర నిబంధనలకు వ్యతిరేకంగా విమానాలు తిరుమలేశుని ఆలయం మీదుగా వెళ్లడాన్ని విమానయాన సంస్థ నిషేధించడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎన్నిమార్లు విజ్ణప్తులు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.   గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే.  తిరుమల పుణ్యక్షేత్రంలో మరోసారి ఆగమశాస్త్ర విరుద్ధంగా శ్రీవారి ఆలయం మీదుగా విమానం వెళ్లడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.    ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వెంటనే ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయం మీదుగా ప్రయాణించిన విమానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళుతోంది అనే వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం, తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు గానీ, హెలికాప్టర్లు గానీ ప్రయాణించడం పూర్తిగా నిషిద్ధం. ఇలాంటి ప్రయాణాలను అపచారంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలోనే తిరుమలను 'నో ఫ్లై జోన్'గా ప్రకటించాలని టీటీడీ చాలాకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. అయితే  కేంద్రం మాత్రం ఇది  ఆచరణ సాధ్యం కాదని తెలుపుతూ వస్తోంది. దీంతో ఈ విషయంలో టీటీడీ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది.  ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని  తిరుమలను ' నో ఫ్లై జోన్ గా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు. 

తిరుమల శ్రీవారి సేవలో సోనూసూద్

ప్రముఖ నటుడు సోనూసూద్ సోమవారం (జూన్ 2) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపీ బ్రేక్ దర్శనం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకులు మంటపంటో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో  మాట్లాడిన సోనూ సూద్..  సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పాతికేళ్లు అయ్యిందని తెలిపారు. కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.  అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.  

స్కాట్లాండ్ తెలుగుదేశం ఎన్నారై విభాగం ప్రారంభం

తెలుగుదేశం పార్టీ స్కాట్లాండ్ ఎన్నారై విభాగం ప్రారంభమైంది. మినీ మహానాడు 2025 తో ఘనంగా ఈ విభాగాన్ని ప్రారంభించారు.  ఎడిన్ బర్గ్ నగరంలోని అప్ హాల్ కమ్యూనిటీ సెంటర్ లో జరిగిన మినీ మహానాడు కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.    తెలుగుదేశం పార్టీ విధానాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు.  కార్యక్రమం ప్రారంభం లో తెలుగుదేశం ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ జూమ్ ద్వారా ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు.   ఎన్టీఆర్ పాటించిన క్రమశిక్షణను అందరూ  పాటిస్తే అత్యున్నత విజయాలను అందుకోవచ్చన్నారు.  ఎన్టీఆర్ విలువలను ఎన్నారైలు వారి భావి తరాలకు తెలియచేయాలని సూచించారు. కార్యక్రమం లో పాల్గొన్న ఎన్నారైలు  తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత, పార్టీ విధానాల వల్ల తాము ఏవిధం గా లబ్ది పొంది మంచి జీవితాలను గడుపుతున్నామో వివరించారు. అందుకు కృతజ్ఞతగా సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ కి తమవంతు సహకారాన్ని అందించి, తద్వారా పార్టీ ని బలోపేతం చేసి భావితరాలకు పార్టీ విధానాల ద్వారా లబ్ది చేకూర్చాలని సంకల్పించారు. అ నంతరం కుర్రా అనిల్ కుమార్ , కార్తీక్ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.  కార్యక్రమం లో పొట్లూరి కృష్ణప్రసాద్, డాక్టర్ లావు శ్రీకాంత్ , డాక్టర్ దాసరి శ్రీనివాసరావు, షేక్ ఫర్జానా, మండవ మంజూష మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

తిరుపతిలో అత్యాధునిక బస్టాండ్

హెలిప్యాడ్, హోటళ్లు, డార్మెటరీలు సహా అన్ని వసతులు  తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు అన్నీ సౌకర్యాలు ఒకేచోట లభించేలా తిరుపతిలో  అత్యాధునిక బస్టాండ్ నిర్మాణం జరగనుంది.  ప్రస్తుత బస్టాండ్ స్థానంలోనే అత్యాధునిక అల్ట్రా మోడరన్ బస్ టెర్మినల్ నిర్మించనున్నారు. భక్తులకు అన్ని వసతులు ఒకే చోట అందేలా ఇది ఉంటుంది.   రూ.500 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ బస్టాండ్ లో  హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ  ఈ కొత్త బస్టాండ్ నిర్మాణానికి స్థలం ఇవ్వనుంది.  కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన  నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌,  ప్రైవేటు సంస్థ లు సంయుక్తంగా ఈ బస్టాండ్ నిర్మించనున్నాయి. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ప్రతిబింబించేలా ఈ బస్టాండ్ డిజైన్ ఉండబోతున్నది.  .ప్రస్తుతం ఉన్న తిరుపతి బస్టాండ్ 13.18 ఎకరాల్లో ఉంది. కొత్త టెర్మినల్‌ను 12.19 ఎకరాల్లో నిర్మిస్తారు. ప్రస్తుత బస్టాండ్‌కు మూడు వైపులా రోడ్లు ఉన్నాయి. కొత్త టెర్మినల్‌కు మాత్రం నాలుగు వైపులా రోడ్లు ఉండేలా డిజైన్ చేశారు. ఈ కొత్త బస్టాండ్‌లో రెండు అంతస్తుల సెల్లార్ ఉంటుంది. ఈ సెల్లార్‌ను బైక్‌లు, కార్ల  పార్కింగ్ కు ఉపయోగిస్తారు.   గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం బస్టాండ్‌కు కేటాయిస్తారు. ఆ బస్టాండ్ లో 98 ప్లాట్ ఫారంలు,   50 బస్సులు పార్కింగ్ చేయడానికి, ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ కోసం కూడా ఏర్పాట్లు ఉంటాయి.మొదటి, రెండో అంతస్తుల్లో కొంత భాగాన్ని ఆర్టీసీ కార్యాలయాలకు ఇస్తారు.   మిగిలిన స్థలాన్ని  ఫుడ్‌కోర్టులు, దుకాణాలకు కేటాయిస్తారు.  మూడో అంతస్తును సర్వీసుల కోసం వదిలేస్తారు. అంటే భవనానికి సంబంధించిన విద్యుత్ పనులు, సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ వంటివి ఇక్కడ ఉంటాయి. నాలుగు నుంచి ఏడో అంతస్తులను హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు, ఇతర వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తారు. ఎనిమిది, తొమ్మిది, పదో అంతస్తుల్లో బ్యాంకులు, ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల కార్యాలయాలకు కేటాయిస్తారు. ఇక పదో అంతస్తు పైన  హెలిప్యాడ్   నిర్మిస్తారు. మొత్తం మీద 1.54 లక్షల చదరపు అడుగుల మేర బిల్డింగ్ ఉంటుంది.ఈ ప్రాజెక్టులో ఆర్టీసీ విలువైన స్థలాన్ని ఇస్తున్నందన పెట్టుబడి పెట్టడం లేదు. నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ కొంత, కాంట్రాక్ట్ సంస్థ కొంత పెట్టుబడి పెడతాయి. ప్రాజెక్టు పూర్తయ్యాక హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు, బ్యాంకులు, కార్యాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆర్టీసీ, నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌కాంట్రాక్టర్ సంస్థలు పంచుకుంటాయి. ఎ 

కన్నుల పండువగా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం (జూన్ 1) సాయంత్రం   శాస్త్రోక్తంగా అంకురార్పణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, సహస్రనామార్చన నిర్వహించారు.  ముందుగా ఆలయ ప్రాంగణంలోనే సేనాధిపతి ఉత్సవం, ముఖ మండపంలో వేంచేపు, సమర్పణ, ఆస్థానం నిర్వహించారు. యాగశాలలో కార్యక్రమాల అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది.  ఇక శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన   సోమవారం (జూన్ 2) ఉదయం  మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు.  బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. అలాగే  బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులూ టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

మహానాడు సక్సెస్‌‌ను వైసీపీ జీర్ణించుకోలేకపోతుంది : సోమిరెడ్డి

  మంత్రి  లోకేష్ ఆరు సూత్రాలంటే..వైసీసీ క్రిమినల్ ఐడియాలజీని ఆవిష్కరిస్తోందని మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రజలు సైకిల్‌తో కొట్టినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని ఆయన అన్నారు. కడప వేదికగా జరిగిన మహానాడు సూపర్ సక్సెస్‌ను వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్షంలో రాజీలేని పోరాటం, అధికారం చేపట్టాక రాష్ట్ర అభివృద్ధి కోసం మా యువ నాయకుడు పడుతున్న తపన చూసి జగన్ రెడ్డి ఆయన మాజీ మంత్రులు కడుపుమంటతో రగలిపోతున్నారు.  మహానాడులో రాష్ట్ర భవిష్యత్ కోసం లోకేశ్ బాబు ఆరు సూత్రాలను ప్రతిపాదిస్తే.. వైసీపీ మాత్రం తమ డీఎన్ఏలోని క్రిమినల్ ఐడియాలజీని ఆవిష్కరించిందన్నారు. వైసీపీ ఆవిష్కరించిన ఆ నాలుగు అంశాలేంటో ఏపీ ప్రజలను తెలియాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ వ్యవస్థా బాగుండకూడదని జగన్ ఆశపడుతున్నారు. ప్రజలు అన్యాయానికి గురైపోవాలని, ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలవ్వాలని, వైసీపీ అధికారంలోకి రావాలనే లక్ష్యాలతో బ్లూ మీడియా పత్రికలో వార్తలుంటున్నాయి. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఒక రాజకీయ పార్టీకి, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి వస్తుండటం చాలా దురదృష్టకరమని సోమరెడ్డి అన్నారు.  

శ్రీవారి ప్రతిష్టను దిగజార్చే విధంగా వైసీపీ వ్యవహరిస్తోంది : భాను ప్రకాష్

  పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ప్రతిష్టను దిగజార్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని టీటీడీ పాలక మండలి సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి దర్శన క్యూలైన్లలో అది కూడా ఆలయం లోపల కొందరు వైసీపీ నేతలు కావాలనే భక్తులను రెచ్చగొడుతూతురని ఆయన అన్నారు. గోవులు చనిపోతున్నాయని ఓ అసత్య ప్రచారం చేశారుని ఆయన పేర్కొన్నారు. టీటీడీ ఆవరణంలో ముస్లిం వ్యక్తి వద్ద నమాజ్ చేయించి వారే వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయించారని ఆయన అన్నారు. వైసీపీ చేస్తున్న కుట్రలు బహిర్గతం చేసేలా విచారణ చేపట్టాలని ఏపీ డీజీపీకి లేఖ రాశామని భానుప్రకాశ్ తెలిపారు.రాజకీయంగా కూటమి ప్రభుత్వాన్ని ఎదిర్కోలేకే…. శ్రీవారి భక్తుల మనోభావాలతో రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత.. రాజకీయ పునరావాస కేంద్రంగా వైసీపీ నేతలకు తిరుమల మారిందని అన్నారు. ఆలయ పవిత్రతో పాటు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా వారు వ్యవహిస్తున్నారని మండిపడ్డారు.  మొన్న గోశాల నుంచి మొదలుకొని.. నిన్న గోవిందుడి వరకు వారు వరుసగా అరాచకాలకు పాల్పడతున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి మళ్లీ పునరావృతం అయితే.. గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి మళ్లీ ఘటనలు పునరావృతం అయితే.. గట్టిగా బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చా శనివారం జరిగిన ఘటనపై రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తో పాటు ఇంటెలిజెన్స్ డీజీకి లేఖ రాశానని తెలిపారు. తాజాగా శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్‌లో ఉన్న కాకినాడకు చెందిన ఓ భక్తుడు.. టీటీడీ చైర్మన్, ఈవోలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై టీటీడీ విచారణ జరిపింది. అందులోభాగంగా సదరు భక్తుడుని విచారించింది. ఈ సందర్భంగా టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. అంతేకాకుండా..టీటీడీని సదరు భక్తుడు క్షమాపణలు కోరాడు.