అమరావతిలో లా వర్సిటీ

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రతిష్ఠాత్మక సంస్థలు తరలి వస్తున్నాయి. తాజాగా మరో ప్రతిష్ఠాత్మ విద్య సంస్థ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది.  అమరావతిలో న్యాయ విశ్వవిద్యాలయం లా యూనివర్శిటీ ఏర్పాటు కానుంది.  బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో  ఇండియా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ను ఇక్కడ ఏర్పాటు కానుంది.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. న్యాయశాఖ కార్యదర్శి  ప్రతిభాదేవి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ యూనివర్సిటీ న్యాయ విద్యకు, పరిశోధనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ లా యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు బీసీఐ ట్రస్ట్‌ ముందుకొచ్చింది. బీసీఐ అధ్యక్షుడితో పాటు ఇతర కీలక సభ్యులు గవర్నర్‌ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడితో ఇప్పటికే వేరువేరుగా సమావేశమయ్యారు. అమరావతిలో బీసీఐ ఏర్పాటు చేయనున్న ఈ న్యాయ వర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆర్బిట్రేషన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతే కాకుండా ఈ వర్సీటీ ఏర్పాటు  న్యాయ, అనుబంధ రంగాల్లో ఉన్నత విద్యావకాశాల కల్పనకు, స్కిల్స్‌ పెంచుకునేందుకు ఎంతగానో దోహదపడనుంది. బీసీఐ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బెంగళూరులో 1986లో నేషనల్ లా స్కూల్‌ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ,  గోవాలో ఇండియా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఉన్నాయి. ఇప్పుడు అదే బీసీఐ అమరావతిలో  మూడో లా  యూనివర్సిటీని ఏర్పాటు చేయనుంది.   

మాజీ మంత్రి కాకాణికి బిగ్ షాక్

  వైసీపీ నేత కాకాణి గోవ‌ర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. క్వార్ట్జ్‌ అక్రమ మైనింగ్ గిరిజనులను బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన ఆయన నెల్లూరు ఐదో ఎస్సీ, ఎస్టీ అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఈ నెల 3న విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణను ఇవాళ్టి వాయిదా వేసింది. ఇవాళ కూడా మరోసారి కేసులో వాదోపవాదాలు విన్న మెజిస్ట్రేట్ విచారణను ఈ నెల 9కి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా ఇదే కేసులో కాకాణిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సాయంత్రానికి తీర్పు వెలువడే అవకాశం ఉంది.  ఏ4గా ఉన్న కాకాణిని బెంగుళూరులో ఓ రిసార్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించేందుకు మొదట నాయుడుపేట ఏపీపీ కేథార్ నాథ్‌ను స్పెషల్ పీపీగా బాధ్యతలు ఇచ్చి నెల్లూరుకు పంపింది ప్రభుత్వం. నేడు కేథార్ నాథ్ స్థానంలో గుంటూరు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రొసీక్యూషన్ రాజేంద్ర ప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో నెల్లూరు ఎస్సీ ఎస్టీ 5వ అదనపు ప్రత్యేక న్యాయస్థానానికి రాజేంద్రప్రసాద్ చేరుకుని కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.

లాసెట్ పరీక్ష రాసిన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీ

ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారిగా పనిచేసి,  పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు న్యాయశాస్త్ర ప్రవేశ పరీక్ష (లాసెట్)కు హాజరయ్యారు. ఒంగోలులోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ఆయన లాసెట్ పరీక్ష రాశారు.    వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆయనపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిండి, అనేక తప్పుడు అభియోగాలతో పాటు అక్రమంగా సస్పెన్షన్లు విధించిన సంగతి తెలిసిందే.  రెండు విడతలుగా ఆయన సస్పెన్షన్‌లో కొనసాగాల్సి వచ్చింది. మొదటిసారి 2020 ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 2022 ఫిబ్రవరి 7వ తేదీ వరకు, రెండోసారి 2022 జూన్ 28వ తేదీ నుంచి 2024 మే 30వ తేదీ వరకు ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. మొత్తంగా దాదాపు నాలుగేళ్ల పాటు ఆయన విధులకు దూరంగా ఉన్నారు. అయితే మొక్కవోని పట్టుదలతో న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. తన పదవీ విరమణ చేసే చివరి రోజున చివరిగా ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌ గా బాధ్యతలు చేపట్టి అదే హోదాలో రిటైర్ అయ్యారు. కాగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏబీ వెంకటేశ్వరరావుపై గత ప్రభుత్వ హయాంలోని నాలుగేళ్ల సస్పెన్షన్‌ కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పెట్టిన ఏసీబీ కేసును హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఆయన తాజాగా జగన్ బాధితుల తరఫున పోరాటం చేస్తానంటూ పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన లాసెట్ పరీక్ష రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ హయాంలో బాధితులైన వారి తరఫున న్యాయపోరాటం చేయడానికే ఆయన లా చదవాలని నిర్ణయించుకున్నారా అన్న చర్చ మొదలైంది. 

తుడా లో కోట్ల రూపాయల అవినీతి.. చెవిరెడ్డికి విజిలెన్స్ నోటీసులు!

జగన్ కోటరీలో  అత్యంత కీలకమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్ రెడ్డికి విజిలెన్స్ నోటీసులు జారీ అయ్యాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గా పని చేశారు. వైసీపీ హయాం అనేమిటి.. అంతకు ముందు కాంగ్రెస్ హయాంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కరరెడ్డే తుడా చైర్మన్.  ఇక తుడా చైర్మన్ గా చెవిరెడ్డి అక్రమాలకు కొదవే లేదన్నఆరోపణలూ మెండుగానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా తుడా చైర్మన్ గా  ఆ సంస్థ ఆదాయాన్ని సొంత అవసరాలకు విచ్చలవిడిగా వాడుకున్నారన్నఆరోపణలపై ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. తన సొంత గ్రామంలో పనులు చేయించడానికి.. వ్యక్తిగత పనులు, ప్రయాణాలకు కూడా తుడా నిధుల్ని ఇష్టారీతిగా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.  మొత్తం తుడా నిధుల్లో 90 శాతం నిధులను చెవిరెడ్డి సొంత నియోజకవర్గం అయిన చంద్రగిరిలో పనులు చేయించడానికే వాడుకున్నారనీ,  తుడా నిధులతో చేసిన పనులకు కూడా ఏదో తన సొంత సొమ్ము ఖర్చు చేసి చేయించినట్లుగా తన పేరే వేయించుకున్నారనీ విమర్శలు ఉన్నాయి.  అంతే కాకుండా ఆ పనుల చేసే కాంట్రాక్టును తన సొంత కంపెనీకే కట్టబెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించారనీ ఆరోపణలు ఉన్నాయి.   ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ హయాంలో అంటే 2019-24 మధ్య కాలంలో తుడాలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందన్న ఫిర్యాదుల నేపథ్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జనవరిలో విచారణకు ఆదేశించింది. దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దగి దర్యాప్తు చేపట్టారు. తాజాగా చెవిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. మొత్తం 37 ప్రశ్నలు సంధిస్తూ నోటీసులు జారీ చేసిన విజిలెన్స్ అధికారులు ఈ నెల 9లోగా  సమాధానం చెప్పాలని ఆదేశించారు. చెవిరెడ్డితో పాటు మరో 15 మందికి కూడా నోటీసులు జారీ అయ్యాయి.   తుడా సంధించిన ప్రశ్నలకు చెవిరెడ్డి ఇచ్చే సమాధానాల ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. 

తొక్కిస‌లాట‌ల త‌ప్పెవ‌రిది?

తొక్కిస‌లాట‌తో త‌ప్పెవ‌రిది? జ‌నం ఇంత‌గా ఎగ‌బ‌డుతున్నారేంటి? పుష్ప  2 రిలీజ్ సంద‌ర్బంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిస‌లాట జ‌రిగి ఒక మ‌హిళ మృతి చెంద‌గా... ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఇప్ప‌టికీ కోలుకోలేదు. ఇక వైకుంఠ ఏకాద‌శి రోజున తిరుపతిలో తొక్కిసలాట జరిగి టీటీడీ చ‌రిత్ర‌లోనే అతి భారీ ప్రాణ న‌ష్టం సంభవించింది. ఆరుగురు ఏకంగా వైకుంఠం చేరుకున్నారు. ఇక మ‌హా కుంభ‌మేళాలో కూడా స‌రిగ్గా ఇలాంటి తొక్కిసలాటల్లోనే ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు పోయాయి. ఇప్పుడు చూస్తే ఆర్సీబీ గెలిచింద‌న్న సంతోషంలో బెంగ‌ళూరు చిన్న‌సామి  స్టేడియంలో  విజయోత్సవాలకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో తొక్కిస‌లాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 33 మంది వ‌ర‌కూ గాయ ప‌డ్డారు. ఈ ఏడాది ఐపీఎల్ విన్న‌ర్ల‌కు ప్ర‌భుత్వం స‌న్మాన కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసింది. ఇది కేవ‌లం 30 న‌ల‌భై వేల మంది మాత్ర‌మే ప‌ట్టేంత చిన్న స్టేడియం. ల‌క్ష‌లాది మంది రావ‌డంతో అంతా ర‌సాబాస  అయిపోయింది. చిన్న‌బిడ్డ న‌లిగిపోవ‌డంతో పాటు ఒక‌రికి క‌త్తిపోట్లంటే ప‌రిస్థితేంటో ఊహించుకోవ‌చ్చు.  ఇప్పుడున్న రోజుల్లో ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌ర‌చూ జరుగుతూ  ప్రాణాలు కోల్పోవడం ఆందోళ‌న‌క‌రం. ఎందుకంటే ఇప్పుడు అంత‌గా ఎగ‌బ‌డాల్సిన అవ‌స‌ర‌మే లేదు.  నిజానికి ఐపీఎల్ అన్న‌ది చాలా చాలా  చిన్న విష‌యం. ఎందుకంటే అది ఏం పెద్ద ట్రోఫీ కాదు. కాకుంటే ఇక్క‌డ క‌న్న‌డ జ‌నం ఎన్నో ఎదురు చూపుల త‌ర్వాత వ‌చ్చిన క‌ప్పు కావ‌డం.. కోహ్లీ ఫ్యాన్స్ కి ఇదొక పండ‌గ రోజే కాద‌న‌డం లేదు.  కానీ ఇలాంటి ప్రాతాల‌కు వెళ్ల‌డంలో ప్ర‌జ‌ల‌దే త‌ప్ప‌నుకోవాలి. గ‌తంలో త‌మ అభిమాన నాయ‌కుడ్ని కావ‌చ్చు, క్రికెట‌ర్ని కావ‌చ్చు ద‌గ్గ‌ర్నుంచి చూసే ఛాన్స్ ఉండ‌క పోయేది. అదే ఇప్పుడు ఎల్ఈడీ స్క్రీన్లు వ‌చ్చేశాయ్. ఇంట్లో కూడా పెద్ద ఎత్తున బుల్లి తెర‌లు పెట్టుకుని. డైరెక్ట్ లైవ్ ఎక్స్ పీరియ‌న్స్ ట్రై చేయొచ్చు. పుష్ప 2 విష‌య‌మే తీసుకుంటే ఇప్పుడున్న పైర‌సీ ఓటీటీ మానియాలో అంత‌గా సినిమా చూడ్డానికి ఎగ‌బ‌డ్డ‌మేంటి? అది కూడా ప్రీమియ‌ర్ షో చూడ్డానికి పోటీప‌డ్డం ముమ్మాటికీ త‌ప్పే. ఇందులో ఆ కుటుంబం త‌ప్పే ఎక్కువ‌ అని భావించాల్సి ఉంటుంది.  ఇక తిరుమ‌ల‌లో ఇదే వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నానికి ప‌ది  రోజుల పాటు అవ‌కాశ‌ముంటుంది. ఎప్పుడైనా వెళ్లొచ్చు. కానీ జ‌నం ఎగ‌బ‌డ్డంతో  అక్కడా పరిస్థితి అదుపుతప్పింది. ఇప్పుడు టీటీడీ ఎన్నేసి ల‌క్ష‌ల రూపాయ‌ల ఎక్స్ గ్రేషియా ఇచ్చినా.. పోయిన వారి ప్రాణాలు తిరిగొస్తాయా? అయిన వారిని పోగొట్టుకున్న కుటుంబాల వెత తీరుతుందా?  ఇక కుంభ‌మేళా ప‌రిస్థితి కూడా అంతే.. అదే ప‌నిగా ప‌ర్వ‌దినాల‌పుడు వెళ్ల‌డం స‌రి  కాదు. కానీ జ‌నం ఎగ‌బ‌డి భారీ ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు. గ‌తంలో క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో.. ఢిల్లీ రైల్వే స్టేష‌న్లో కూడా తోపులాట జ‌రిగి జ‌నం మృతి చెందారంటే ప‌రిస్థితి   ఊహించుకోవ‌చ్చు. అంత పిచ్చి చాద‌స్త‌మేంటి? మ‌హా కుంభ‌మేళాకు వెళ్ల‌ని వాళ్లు బ‌తికి ఉంటే వెళ్లిన వాళ్లు చ‌నిపోవ‌డాన్ని ఏమ‌ని అర్ధం చేసుకోవాలి??? ఇప్పుడు చూస్తే చిన్న‌స్వామి స్టేడియం విష‌యం. అంత‌గా ఎగ‌బ‌డ్డంలో ప‌బ్లిక్ దే త‌ప్పుగా భావించాలి. ఇప్ప‌టి  రోజుల్లో ప‌ది మంది గుమిగూడే చోట‌కు వెళ్ల‌డంలో వారి వారిదే త‌ప్పు అవుతుంది. అంత‌గా ఎగ‌బ‌డాల్సిన అవ‌స‌రం ఏముంది? ఇప్పుడా 11 మంది మృతుల్లో ఎంద‌రు త‌ల్లిదండ్రుల ఆశాజ్యోతులైన కుర్రాళ్లుంటారు? వారిని కోల్పోయిన ఆ పేరెంట్స్ క‌డుపుకోత ఎంతిచ్చి రుణం తీర్చుకోగ‌లం. ఇలాంటి మాన‌సిక స్థితి పూర్తిగా  త‌ప్పు. ఇదే కోహ్లీ త‌న‌ను చూడ్డానికి జ‌నం  రావాల‌నుకుంటాడు, కానీ ఇలా ఎవ‌ర్నో చూడ్డానికి ఎగ‌బ‌డడు. కోహ్లీని  చూస్తే ఏమొస్తుంది? త‌న కోసం జ‌నం చ‌చ్చేంత‌గా ఎగ‌బ‌డ్డాడ‌ని అత‌డ‌నుకోవ‌డం మిన‌హా మ‌రేదైనా లాభం ఉంటుందా? అత‌డి సంగ‌తి అలా ఉంచితే ఇపుడా త‌ల్లిదండ్రులు కుటుంబ స‌భ్యుల క‌డుపుకోత తీర్చేవారెవ‌రు? ఈ దిశ‌గా వీరంతా ఎందుకు ఆలోచించ‌డం లేదు!!! ఒక్కోసారి క్రౌడ్ ఎగ‌బ‌డితే అక్క‌డున్న పోలీస్ స‌పోర్ట్ కూడా స‌రిపోదు. ఇక్క‌డే కాదు ఎక్క‌డైనా స‌రే పోలీసు సిబ్బంది ఎంత మంది జనం ఉన్నారో అంత మందికి స‌రిప‌డా ఉండ‌రు. ఇలా ఎగ‌బ‌డితే వాళ్లు కూడా చేతులెత్తేయ‌డం ఖాయం. నిజానికి బెంగ‌ళూరు పోలీసులు చాలా చాలా స్ట్రిక్ట్. స్పీడ్ లిమిట్ పెరిగితే వేగంగా దూసుకెళ్తున్న బండ్ల మీద లాఠీలు విసురుతారు. అలాంటి పోలీసుల వ‌ల్ల కూడా ఈ తొక్కిస‌లాట కంట్రోల్ కాలేదంటే పరిస్థితి ఊహించుకోవ‌చ్చు. ఇప్పుడు కోహ్లీని చూడ్డానికి ఎగ‌బ‌డ్డారు స‌రే. మ‌రి ఆయ‌న్ను చూడ్డానికే వీరు లేరు. అలాంటి ప‌రిస్థితి తెచ్చుకోవ‌డం  త‌ప్పు.. కోహ్లీ కావ‌చ్చు అత‌డి టీమ్ మేనేజ్మెంట్ కావ‌చ్చు టీమ్ మెంబ‌ర్స్ కావ‌చ్చు.. పోలీసుల త‌ప్పు కూడా ఉండ‌క పోవ‌చ్చు. అంత‌గా ఎగ‌బ‌డ్డ జ‌నానిదే అవుతుంద‌ని అంటారు సామాజిక‌వేత్త‌లు.

అంబటి రాంబాబుపై కేసు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరులో కేసు నమోదైంది. ఇష్టారీతిగా నోరు పారేసుకోవడమే కాకుండా, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై పట్టభిపురం పోలీసులు స్టేషన్ లో కేసు నమోదైంది. వైసీపీ పిలుపు మేరకు బుధవారం (జూన్ 4) జరిగిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలలో భాగంగా గుంటూరు పట్టాభిపురంలో కార్యక్రమంలో అంబటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులపై అనుచిత భాషలో రెచ్చిపోయారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందంటూ బుధవారం (జూన్‌ 4) వెన్నుపోటు దినం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా  నిరసనలు, ర్యాలీలకు వైసీపీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారుజ అందులో భాగంగా  మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో గుంటూరులో ర్యాలీలు, నిరసనలు చేపట్టారు.   ర్యాలీలకు అనుమతుల్లేవని పోలీసులు వైసీపీ శ్రేణులను అడ్డుకున్నారు. ఆ సందర్భంగా  పోలీసులతో అంబటి వాగ్వాదానికి దిగారు. ఒక దశలో రెచ్చిపోయి పోలీసులపై అనుచిత భాష ప్రయోగించారు.  పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లుతో వాగ్వాదానికి దిగారు. దమ్ముంటే ర్యాలీ ఆపు అంటూ అంబటి రాంబాబు సీఐపై రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. 

మొక్కలు నాటే బృహత్కార్యక్రమానికి చంద్రబాబు పిలుపు

పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం అగ్ర ప్రాథాన్యత ఇస్తున్నదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం (జూన్ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా చంద్రబాబు చేసిన ట్వీట్ లో ప్రకృతి ఏ ఒక్కరి సొత్తూ కాదన్నారు.  పర్యావరణ పరిరక్షణ అన్నది ప్రతి ఒక్కరి గురుతర బాధ్య అని పేర్కొన్నారు.  పర్యావరణ పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం  పెద్ద ఎత్తున మొక్క‌లు నాటే కార్య‌క్రమం చేప‌ట్టిందని పేర్కొన్నారు. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా  గురువారం (జూన్ 5) ఒక్క‌ రోజే  కోటి మొక్క‌లు నాటే బృహత్కార్యక్రమాన్ని చేపట్టామనీ, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనీ చంద్రబాబు పిలుపునిచ్చారు.   మంచి ప‌రిస‌రాలు ఉంటేనే మంచి ఆరోగ్యం ఉంటుందన్న చంద్రబాబు ఆ కారణంతోనే  స్వ‌చ్ఛ భార‌త్‌లో భాగంగా  తమ ప్రభుత్వం స్వ‌ఛ్చాంధ్ర కార్య‌క్ర‌మం చేప‌ట్టిందన్నారు. ఈ ఏడాది ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వంలో ప్లాస్టిక్ కాలుష్యం నిర్మూల‌న అంశాన్ని థీమ్‌గా తీసుకున్నామనీ, ప్లాస్టిక్ కాలుష్యాన్ని త‌గ్గించ‌డానికి మ‌న వంతు బాధ్య‌త‌గా ప‌ని చేద్దామనీ పేర్కొన్నారు.  సీఎం చంద్ర‌బాబు, ఉపముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్  వ‌న‌మ‌హోత్స‌వం కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసులో సిట్ దర్యాప్తు వేగం.. నెక్ట్స్ నోటీసులు ఎవరికి?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం  పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ ప్రసాదం లో వినియోగించే నెయ్యి కలుషితం అంశంపై  సుప్రీంకోర్టు తీర్పు మేరకు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. ఈ సిట్ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.  అలిపిరి సమీపంలో  కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని మరీ సిట్  తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తు చేస్తున్నది.  ఈ విచారణలో  భాగంగా వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా దాదాపు 15 మందిని సిట్ అదుపులోనికి తీసుకుని పలు దఫాలు విచారించింది.  లడ్డూ కల్తీ విషయం లో గతంలో టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి కి పీఎస్ గా ఉన్న అప్పన్న ను తాజాగా అదుపులోనికి తీసుకుంది. అప్పన్న ద్వారా లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో పలు రకాల వ్యవహారాలు జరిగాయని సిట్ ప్రాథమికంగా గుర్తించింది. ఈ కల్తీ వ్యవహారంలో అప్పన్న పాత్ర ఏమిటి?  అప్పన్నతో పాటు ఈ వ్యవహరాంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది అన్న కోణంలో గత మూడు రోజులుగా సిట్ అధికారులు అప్పన్నను విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా అప్పన్న ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా త్వరలో టీటీడీ మాజీ చైర్మన్లు  వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అప్పటి ఈవో ధర్మారెడ్డి కి, అప్పటి టీటీడీ జేఈవోలు, ఇతర అధికారులకు సిట్ నోటీసులు ఇచ్చి వాచారించే అవకాశాలున్నాయని అంటున్నారు.  అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసుకు సంబంధించి త్వరలో మరి కొందరిని అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.  ఈ కేసుకు సంబంధించి సిట్ ఇప్పటికే ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సిట్ దర్యాప్తు వేగంతో రానున్న రోజులలో ఎవరెవరికి నోటీసులు అందుతాయి, ఇంకెతంత మంది అరెస్టౌతారు, అసలీ కల్తీ వ్యవహారంలో కీలక పాత్రధాలు, సూత్రధారులు ఎవరు అన్నది త్వరలో తేలిపోతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

చదువుతో పాటు విజ్ణానం.. విద్యార్థుల కోసం ఆ గురువు ఏం చేశాడో తెలుసా?

సెలవు దినాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ కుటుంబం తో గడపాలని, లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని చూస్తారు. కానీ ఈ గవర్నమెంట్  టీచర్  రూటే సెపరేటు. గురువుగా తన విద్యార్థులకు విజ్ణాన బోధతో పాటు వినోదం, విహారలతో విషయపరిజ్ణానం అందించాలని భావిస్తారు. అందుకే సెలవులలో విద్యార్థులను తన సొంత ఖర్చులతో  విజ్ణాన యాత్ర కు తీసుకెళ్లారు. ఈ అనుభవం ఆ విద్యార్థుల కు జీవితం కాలం గుర్తుండిపోయేలా ఉంటుందని ఆయన చెప్పారు. ఒక అపురూప జ్ణాపకంగానే కాకుండా.. విజ్ణానాన్ని అందించి, వారిలో అవహాగన, ఆలోచనా పెంపొందడానికి కూడా దోహదపడేలా ఆ యాత్రను మలిచారు. వివరాల్లోకి వెడితే..  మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పాటిమీదిగూడెం ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులకు క్షేత్ర సందర్శన కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయుడు గోపినాథ్ నిర్వహించారు. వేసవి సెలవులు అయినప్పటికీ విద్యార్థులకు ప్రత్యేక వికాసాన్ని అందించే లక్ష్యంతో గూడూరు మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వారిని తీసుకువెళ్లి అక్కడ నిర్వహించే కార్యకలాపాల గురించి వివిరంచి అవగాహన కల్పించారు. విద్యార్థులను క్షేత్ర సందర్శనలో భాగస్వామ్యులను చేయడం వలన వారి ఆలోచనా విధానం మారడానికీ, తద్వారా వారిలో   విషయ పరిజ్ఞానం పెంపొందేకు  దోహపడుతుందనే ఆలోచనతో ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలీపారు.  క్షేత్ర సందర్శనలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి, బ్యాంకులు, మీసేవా కేంద్రాలు, పోలీస్‌స్టేషన్‌లు, పలు ప్రభుత్వ కార్యాలయాలకు విద్యార్థులను తన స్వంత ప్రయాణ ఖర్చులతో  తీసుకువెళ్లినట్లు గోపినాథ్ తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు అందే సేవల గురించి, 108 ఉపయోగం గురించి, మీ సేవ ద్వారా ప్రభుత్వ సేవల విదానం గురించి, ప్రజల రక్షణ కొరకు అమలులో ఉన్న చట్టల గురించీ ఈ క్షేత్ర సందర్శనలో వారికి అవగాహన కల్పించినట్లు తెలిపారు.

సీవీఎస్ వోగా బాధ్యతలు చేపట్టిన మురళీకృష్ణ

తిరుమల చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్  నియమితులైనగా మరళికృష్ణ  బుధవారం (జూన్ 4) బాధ్యతలు స్వీకరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు టీ వేదాశీర్వచనం  అందించారు.  కార్యక్రమంలో టీటీడీలోని విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అధికా రులు, పోలీసులు పాల్గొన్నారు. గతంలో తిరుపతి, తిరుమలలో పనిచేసిన అనుభవం ఉన్న మురళీకృష్ణకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా శ్రీవారి వైకుంఠద్వార దర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా తొక్కిసలాట సంఘటన జరిగిన నేపథ్యంలో మురళీకృష్ణకు తిరుమల చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాధ్యతలు చే పట్టిన సందర్భంగా ఆయన భక్తులు, టీటీడీ భద్రతకు చర్యలు తీసుకుంటానని మురళీకృష్ణ తెలిపారు.

సనాతన ధర్మం క్రూరమైనది. అరాచకమైనది

సీపీఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం క్రూరమైనదనీ, అరాచకమైనదనీ అన్నారు. సనాతన ధర్మాన్ని సమర్ధించే పవన్ కల్యాణ్ ని అయినా మరెవరినైనా సరే శిక్షించాల్సిందేనని నారాయణ అన్నారు. తాజాగా ఆయన విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి తానెప్పుడూ మాట్లాడలేదని చెప్పిన నారాయణ సనాతన ధర్మాన్ని నెత్తికెక్కించుకున్న తరువాతే తాను మాట్లాడానన్నారు. అసలు సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు పవన్ విడాకులు ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు.   సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై చర్యలు  తీసుకోవాలని పవన్ అంటున్నారు కానీ వాస్తవానికి సనాతన  ధర్మాన్ని  సమర్థించే వారినే  శిక్షించాలని  నారాయణ అన్నారు. సనాతన ధర్మము గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన  సనాతన ధర్మంలో ఒకసారి పెళ్లయిన తర్వాత భర్త ఎంత వేధించినా, అతనితోనే కాపురం చేయాలని, చివరికి భర్త చనిపోతే అదే చితిమంటలో భార్యను కూడా తగలబెడతారనేది సారాంశమని నారాయణ అన్నారు.  సెక్యులరిజాన్ని నాశనం చేసే ఈ సనాతన ధర్మాన్ని పాటించేవారిని శిక్షించాలని, విమర్శించే వారిని కాదని నారాయణ అన్నారు.

తొక్కిసలాట ఘటనపై సిద్ధరామయ్య విచారం.. రూ.10 లక్షల పరిహారం

  బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు.అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.చిన్నస్వామి స్టేడియం 30వేలు మాత్రమే కానీ 3 లక్షల మంది అభిమానులు వచ్చారని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని అన్నారు.తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని, గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని ఆయన ప్రకటించారు.మంగళవారం రాత్రి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆలస్యంగా ముగియడంతో, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఈ విజయోత్సవాలను ఏర్పాటు చేసిందని, ప్రభుత్వ భాగస్వామ్యంతో కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించ తలపెట్టామని ఆయన వివరించారు."ప్రజల స్పందన మా అంచనాలను మించిపోయింది.  విధానసౌధ ముందు లక్షకు పైగా జనం గుమిగూడినా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. కానీ  స్టేడియం వద్ద ఈ విషాదం సంభవించింది. క్రికెట్ అసోసియేషన్ గానీ, ప్రభుత్వం గానీ ఇంతటి పరిణామం ఊహించలేదాని ఆయన తెలిపారు. చిన్న‌స్వామి స్టేడియం తొక్కిస‌లాట‌పై ప్ర‌ధాని మోదీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలిపిన ఆయ‌న మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. అంతేకాదు ఆత్మీయుల‌ను కోల్పోయిన కుంటుంబలకు కేంద్ర త‌ర‌ఫున‌ రూ. 2 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డిన వాళ్ల‌కు రూ. 50 వేల ప‌రిహారం చెల్లిస్తామ‌ని మోడీ వెల్ల‌డించారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు

రోడ్డుపై వైసీపీ క్యాడర్.. బెంగళూరులో లీడర్

  జగన్ పార్టీ పరాజయం పాలై సరిగ్గా ఏడాది పూర్తైంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ సీఎం జగన్ వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి రావడం మానేశారు. పోనీ ప్రజాసమస్యలపై పోరాటాలకు ప్రజల్లోకి వస్తున్నారా అంటే అదీ లేదు. తాడేపల్లి ఓటమి తర్వాత పార్టీ నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న జగన్ జైళ్లలో పరామర్శలు, లేకపోతే ఎక్కడెక్కడో దాడులు జరిగాయంటూ ఓదార్పులతో ఏడాది కాలం వెల్లబుచ్చడం విమర్శల పాలవుతోంది. ఆఖరికి పార్టీపరంగా  పిలుపునిచ్చిన ఆందోళనల్లో కూడా ఆయన పాల్గొనకపోవడంపై సొంత పార్టీల్లోనే అసంతృప్తులు వక్తమవున్నాయి.జూన్ 4 సరిగ్గా ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తైంది . కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత రాష్ట్రానికి మహర్దశ పట్టిందని, రాష్ట్రానికి పట్టిన విరగడైందని మిత్రపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 4న వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నాం. ప్రతీ ఒక్కరూ ఈ నిరసనల్లో పాల్గొనాలి అని జగన్‌ పిలుపు ఇచ్చారు. అంతలావున  పిలుపు ఇచ్చిన మాజీ  ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో ఎక్కడా కనిపించలేదు. వైసీపీ శ్రేణులు అక్కడక్కడ ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. కానీ, ఈ కార్యక్రమంలో ముందుండాల్సిన పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఎక్కడ కనిపించలేదు. దీంతో జగన్ ఏమైపోయారు అని పార్టీ నేతలు, కార్యకర్తలు చర్చించుకున్నారు. మంగళవారం తెనాలిలో తమ వారిపై పోలీసులు దాడి చేశారంటూ రౌడీ షీటర్ల కుటుంబాలను పరామర్శించిన జగన్.. అటు నుంచి అటే బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌కు వెళ్లిపోయారు. ఇంకోరోజు రాష్ట్రంలో ఉండి పార్టీ కార్యక్రమంలో పాల్గొనకపోవడం వైసీపీ క్యాడర్ కు ఏమాత్రం రుచించడం లేదంట.వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది.  అయినా ఈ కార్యక్రమంలో జగనే పాల్గొనకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీని తిరిగి పవర్ లోకి తీసుకొచ్చేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడాలి.. జగన్ మాత్రం ప్యాలెస్ లో కూర్చొని హాయిగా రెస్ట్ తీసుకుంటారా అని రుసరుసలాడుతున్నారు. మరో మూడేళ్లు ఓపిక పట్టండి, తర్వాత మనదే అధికారం అంటూ జగన్ తెగ ధీమాగా చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఇంటింటికి వెళ్లి చెప్పాలని కార్యకర్తలకు చెప్తున్న జగన్..తమ కష్టంతో అధికారంలోకి వద్దామనుకుంటున్నారా?.. అదే అసలైన వెన్నుపోటని వైసీపీ శ్రేణులు గొణుక్కుంటున్నాయి. వెన్నుపోటు దినంలో పాల్గొనకుండా బెంగళూరు వెళ్లిపోయిన జగన్ నెక్ట్స్ షెడ్యూల్‌ని ఎంపీ మిథున్‌రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి వెళ్లి పరామర్శించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్  ఈ నెల11 లేదా 12న నెల్లూరు జైలుకు వస్తారని చెప్పుకొచ్చారు.  పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనని జగన్.. జైళ్లలో పరామర్శలు, ఓదార్పులకు మాత్రమే జనంలోకి వస్తుండటంపై సోషల్ మీడియాలో కూడా తెగ సెటైర్లు వినిపిస్తున్నాయి.

కూటమి ప్రభుత్వం ఏడాది అయిన సందర్భంగా..చంద్రబాబుకు మంత్రులు అభినందనలు

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన  సచివాలయంలో కేబినెట్ సమావేశమైంది.ఈ భేటీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కె. పార్థసారథి మీడియా సమావేశంలో సమావేశంలో వివరించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం, చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఎన్టీఆర్ సుజల కింద నీటి శుద్ది చేసే ప్లాంట్‌లకు వయబులిటీ ఫండ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ క్రమంలో ఉద్దానంకు రూ. 5.75 కోట్లు, కుప్పంకు రూ. 8.22 కోట్లు కేటాయించనున్నారు. ఉద్దానం, కుప్పంలో ప్రజలకు రూ. 2 కే 20 లీటర్లు తాగునీరు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. వన్ టైం సెటిల్‌మెంట్ కింద వయబిలిటీ ఫండ్ ఇవ్వాలని  కేబినెట్  నిర్ణయించింది .2025, ఫిబ్రవరి 1వ తేదీ నాటికి యావ జీవ శిక్ష పడిన 17మంది ఖైదీలకు క్షమాబిక్ష పెట్టి విడుదల చేయాలని నిర్ణయించింది.  సత్ప్రవర్తన కల్గినందున 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాబిక్ష ప్రసాదించాలని నిర్ణయం తీసుకుంది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన నిబంధనల ప్రకారం ఖైదీల విడుదలపై నిర్ణయం తీసుకుంది.ఏపీఎస్పీలో 248 మంది కానిస్టేబుళ్లకు, హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పిస్తూ నిర్ణయించింది.వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చుతూ మంత్రివర్గం ఆమోదించింది.ఫ్యాక్టరీల్లో మహిళా ఉద్యోగులకు ఇకపై రాత్రి పూట కూడా విధులు నిర్వహించేందుకు పూర్తి రక్షణతో చట్ట సవరణలు చేసింది.  ఫ్యాక్టరీల్లో పని చేసే మహిళలకు ప్రస్తుతం ఒవర్ టైం 50 లేదా 75 గంటలు మాత్రమే పని చేసే అవకాశం ఉండేది. ఇకపై మహిళలు క్వాటర్‌లో 144 గంటలు ఒవర్ టైం చేసేందుకు నిబంధనలు మార్చుతూ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా సీఎం చంద్రబాబ కు మంత్రులు అభినందలు తెలిపారు.  కూటమిలోని పక్షాల మధ్య సమన్వయం బాగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. పీ4కు సంబంధించి ప్రతి జిల్లాలో ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని మంత్రులతో సీఎం చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు నేరస్థుల్ని రాజకీయ నాయకులు కలవాలంటేనే భయపడేవారని .. ఇప్పుడు నేరస్థుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.ఈ సందర్భంగా వైసీపీ అధినేత‘జగన్ తప్పు చేశాడు కదా? మనం ఎందుకు చర్యలు తీసుకోకూడదు’ అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి  ప్రశ్నించగా.. ‘అతను తప్పులు చేసినట్లు రుజువులు ఉంటే చట్టానికి దొరికితే మనం చర్యలు తీసుకోవాలి. మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి’ ముఖ్యమంత్రి సూచించారు. 

తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దిగ్భ్రాంతి

  బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఈ దుర్ఘటనపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు డీకే క్షమాపణలు చెప్పారు. ఆర్సీబీ ఫ్యాన్స్ బారీగా తరలిరావడంతో అదుపు చేయలేకపోయామని ఆయన తెలిపారు.మరోవైపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య క్షతగాత్రులు చికిత్స పొందుతున్న బౌరింగ్‌ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధిలందరికీ సరైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. భద్రత కోసం 5,000 మందికి పైగా సిబ్బందిని ఏర్పాటు చేశాం. అయితే, అక్కడ ఉన్నది ఉత్సాహంతో ఉన్న యువత. వారిపై లాఠీఛార్జ్ చేయలేము కదా" అని డీకే శివకుమార్ అన్నారు.ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ తొక్కిసలాటలో 11 మంది వరకు మృతి చెందగా, యాభై మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు.సడన్‌గా 19వ గేటు ఓపెన్ చేయటంతో  తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు విక్టరీ పరేడ్ కోసం లక్షలాది మంది వచ్చారని అందుకని 10 నిమిషాల్లో సన్మాన కార్యక్రమం ముగించామని- డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.  

చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట..11 మంది మృతి

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర అపశ్రుతి చోటు చేసుకుంది. ఆర్సీబీ 18 ఏళ్ల  తర్వాత ఛాంపియన్స్ నిలవటంతో   ఫ్యాన్స్  భారీగా  స్టేడియం వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11  మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం సాయంత్రం నుంచే చిన్నస్వామి స్టేడియం వద్దకు పోటెత్తారు. జట్టు రాక కోసం ఎదురుచూస్తూ స్టేడియం గేట్ల వద్ద భారీగా జనం చేరారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది.  క్షతగాత్రులను శివాజీనగర్‌లోని బౌరింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఆర్సీబీ టీమ్‌కు చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో అక్కడకి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్-2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది.క్షతగాత్రులను స్థానిక బోరింగ్ ఆస్పత్రికి తరలించారు. వారిని పరామర్శించేందుకు ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య విధాన సౌధ నుంచి ఆస్పత్రికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్షమాపణలు చెప్పారు. ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేయలేకపోయామని వారు తెలిపారు.

ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా భాగం కావాలి

  ప్రతి ఒక్కరి దైనందిత జీవితoలో యోగ ఒక భాగం కావాలి అని, జిల్లా అంతటా యోగాంధ్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతొందని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్  తెలిపారు. చంద్రగిరి కోట నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న యోగాంధ్ర-2025 కార్యక్రమము లో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్,  తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి పాల్గోన్నారు. మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా ఈ నెల రోజులు పాటు అంత రాష్ట్రవ్యాప్తంగ, జిల్లా మండల, గ్రామ స్థాయి వరకు  యోగా ప్రాముఖ్యతను గురించి ప్రతి ఒక్కరికి శిక్షణ, అవగాహన కల్పించాలని తెలిపారు.  ప్రతి ఒక్కరి దినచర్యలో భాగంగా యోగ ఉండాలని ఉద్దేశంతో  ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా యోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అని తెలిపారు. సచివాలయం పరిధి,వార్డు పరిధి లో అందరికీ  యోగా గురించి శిక్షణ, అవగాహన  కల్పిపిస్తున్నామని అందులో భాగంగానే ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సుమారుగా 8 లక్షల మందిని రిజిస్ట్రేషన్ జరిగింది అని తెలిపారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం రానున్నారని, అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో మిగతా అధికారుల తో కలిసి ఈ యోగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.ప్రతి ఒక్క పౌరుడికి ఆరోగ్యం చాలా అవసరమని వివిధ రకాల మందులు వాడుతూ ఆరోగ్యం పాడవుతుందని యోగ చేయడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు.  

కోడెలు మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం : హరీశ్ రావు

  వేములవాడ దేవాలయంలో కోడెలు మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కోడెలను కాపాడడం ప్రభుత్వానికి చేతకాకపోతే బీఆర్ఎస్‌కి  కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి.మేం కాపాడుకుంటాం.. అంటూ హారీశ్‌రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రానికి అరిష్టం జరుగుతుందని మాజీ మంత్రి పేర్కొన్నారు.వారం రోజుల్లో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు.  రోజూ కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోగా కనీస స్పందన కూడా లేదంటూ ఫఐర్ అయ్యారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థాన పరిస్థితి ఇలా ఉంటే ఎలా? అంటూ ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరాకు 18 వేల రూపాయలు రైతులకు బకాయి పడిందని ఆయన పేర్కొన్నారు. ఏడాదిలో 40 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేస్తాని సీఎం రేవంత్ హామీ అయిందని హరీష్ రావు తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చేందుకు హడ్కో నుండి తెచ్చిన 3000 కోట్లను బడా కాంట్రాక్టర్లకు ఇచ్చారని తెలిపారు.ఆర్‌ఆర్‌ఆర్  భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందించడంలో కాంగ్రెస్  ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.