అసలయిన విభజనవాది ఎవరు?

  జగన్మోహన్ రెడ్డి తనను తాను సమైక్య ఛాంపియన్ గా ఆవిష్కరించుకొనే ప్రయత్నంలో రాష్ట్ర విభజనపై చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ, తనతో ఎవరూ కూడా కలిసి రావడం లేదంటూ ఆవేదన పడిపోతుంటారు. తనొక్కడే మిగిలిన వారందరి కంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చాలా ఎక్కువగా కష్టపడుతున్నట్లు పదేపదే గట్టిగా చెప్పుకొంటారు. పనిలోపనిగా తనకు ప్రధాన పోటీదారులయిన చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలను ప్రజల ముందు దోషులని సర్టిఫై చేయడం కూడా మరిచిపోరు.   కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను ఎంత తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నపటికీ, ఆయన ఆ ప్రక్రియకు ఎక్కడా అడ్డుతగలకుండా పరోక్షంగా సహకరిస్తున్నందున ఆయనను అనుమానించక తప్పదు.   అయితే చంద్రబాబు నోట ఇంతవరకు సమైక్యాంధ్ర రాలేదనే జగన్ ఆరోపణ కేవలం ఆయనను సీమాంధ్ర ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకే. రాష్ట్ర విభజనకు తెదేపా అంగీకరించిన మాట వాస్తవం. అయితే చంద్రబాబు వ్యక్తిగతంగా, మానసికంగా కూడా రాష్ట్ర విభజనకు వ్యతిరేఖమనే సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ రెండు ప్రాంతాలలో పార్టీని బ్రతికించుకోవాలనే తపనతోనే ఆయన ఇంతవరకు జై తెలంగాణా! అనిగానీ, జై సమైక్యాంధ్ర! అనిగానీ అనలేకపోతున్నారని ప్రజలందరికీ తెలుసు. ఆ కారణంగానే తెదేపా తెలంగాణాలో తీవ్రంగా నష్టపోతున్నదని చంద్రబాబుకి తెలిసి ఉన్నపటికీ, ఎటూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు.   కానీ, తెలంగాణాలో రాత్రికి రాత్రి దుకాణం బంద్ చేసుకోచ్చేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ సమస్య లేదు గనుక ఒట్టొట్టి సమైక్యరాగామాలపిస్తూ చంద్రబాబుని కూడా తనతో కోరస్ పాడమని బలవంతం చేస్తూ, ఆయన పాడట్లేదు గనుక ఆయన సీమాంధ్ర ద్రోహి అని ప్రచారం చేసుకొని, తనొక్కడే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డిని తెలంగాణా ప్రజలు ఇంతకంటే ఎక్కువగానే అసహ్యించుకొంటున్న సంగతి ఆయనకి కూడా తెలిసే ఉంటుంది.   రాష్ట్ర విభజనకు మానసికంగా వ్యతిరేఖిస్తున్నపటికీ, దానివల్ల తన పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తెలిసి ఉన్నపటికీ తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు విభజనకు అంగీకరిస్తే, రాష్ట్ర విభజన జరిగితేనే తనకు రాజకీయ లబ్ది కలుగుతుందని మనసులో తీయని కలలు కంటూ, పైకి మాత్రం జగన్ సమైక్యరాగం ఆలపిస్తున్నారు. నిజానికి నేతి బీరకాయలో నెయ్యి వంటిది జగన్ సమైక్యవాదం. అందువల్ల అసలయిన విభజనవాది ఎవరో ప్రజలే తేల్చి చెప్పాలి.          మడమ తిప్పని వంశమని, విస్వసనీయత తమ ఇంటి పేరని, నీతి నిజాయితీలు తన లోటస్ పాండ్లో విరబూసే కలువలని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఆ మాటలు పలికేందుకు కూడా ఇబ్బందిపడుతున్నారు. తనను నమ్ముకొన్న తెలంగాణా నేతలకి హ్యాండిచ్చేసి ఇప్పుడు సమైక్య ముసుగులో రాష్ట్ర విభజన కోరుకొంటున్న జగన్మోహన్ రెడ్డి కంటే రాష్ట్ర విభజనను అయిష్టంగా అంగీకరిస్తున్న చంద్రబాబే మేలు కదా!    

ఎన్నికల వరకు ఈ జగన్నాటకం కొనసాగవలసిందే

  జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం విడిపోతున్నందుకు చాలా ఆందోళన చెందుతున్నట్లు, దానిని అడ్డుకొనేందుకు తనొక్కడే చాలా కృషి చేస్తున్నట్లు, తనతో ఎవరూ కలిసి రావడం లేదని ఆవేదన చెందుతున్నట్లు చాలా చక్కగా నటిస్తున్నపటికీ, నిజానికి వైకాపా రాత్రికి రాత్రి తెలంగాణా నుండి సీమాంధ్రకు దూకేయడంతోనే రాష్ట్ర విభజనకు ఆ పార్టీ సిద్దమని స్పష్టమయిన సంకేతం ఇచ్చింది. జగన్ చేస్తున్నవాదనలు, ప్రయత్నాలను కాసేపు పక్కన బెట్టి ఆలోచిస్తే, తెలంగాణాను పూర్తిగా వదులుకొన్న వైకాపాకు ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరిగితేనే సీమాంధ్రలో ఎంతో కొంత లబ్ది పొందగలదనేది ఎవరూ కాదనలేని సత్యం.   ఇంతవరకు జగన్ చేస్తున్న ప్రతీ ప్రయత్నమూ కూడా సీమాంధ్రలో తన పార్టీని బలపరచుకోవాలనే ఉద్దేశ్యంతో చేస్తున్నదే తప్ప, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కాదు. రాబోయే ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరిగితేనే, వైకాపా ప్రజలలో పేరుకుపోయున్న ప్రభుత్వ వ్యతిరేఖతను, వారిలో జ్వలించే సమైఖ్య సెంటిమెంటును ఉపయోగించుకొని రాజకీయ లబ్ది పొందగలదు. అప్పుడే అది చేస్తున్న సమైక్య పోరాటాలకు ఫలితం ఆశించలదు. అందుకే, జగన్మోహన్ రెడ్డి మనసులో రాష్ట్ర విభజనను కోరుకొంటున్నపటికీ, పైకి మాత్రం అవసరమయిన దానికంటే చాలా బిగ్గరగా సమైక్యాంధ్ర అంటూ నినదిస్తున్నారు. ఎన్నికలవరకు సీమాంధ్ర ప్రజలలో ఈ సమైక్య సెంటిమెంటును బలంగా ఉండేట్లు జాగ్రత్తగా కాపాడుకోగలిగితేనే వైకాపా లబ్ది పొందగలదు.   తెరాస తెలంగాణా సెంటిమెంటును ఏవిధంగా ఉపయోగించుకొని రాజకీయంగా ప్రయోజనం, పైచేయి సాధించిందో అదేవిధంగా వైకాపా కూడా సమైక్య సెంటిమెంటుతో 2014ఎన్నికలలో లబ్ది పొందాలని భావిస్తోంది. అందుకే జగన్ కేవలం 30యంపీ సీట్లు సాధించడం గురించి, ఎన్నికల తరువాత కేంద్రంలో ప్రభుత్వానికి మద్దతు గురించి తరచూ మాట్లాడుతుంటారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన గత కొంతకాలంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే మిషతో దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వాధినేతలను, పార్టీ నేతలను కలుస్తున్నారు. తద్వారా జాతీయ స్థాయిలో తనకు, తన పార్టీకి ఒక గుర్తింపు ఏర్పరచుకొని, వారితో సంబంధాలు పెంచుకోవడానికి, తాను కాంగ్రెస్ వ్యతిరేఖిననే భావన రాష్ట్ర ప్రజలకు కలుగజేయడానికి తిప్పలు పడుతున్నారు. అయితే అతను కలిసిన రాజకీయ నేతలలో ఎంతమంది అయన మాటలను, ప్రయత్నాలను నిజంగా నమ్ముతున్నారో చెప్పడం కష్టం. ఎందుకంటే కాంగ్రెస్ తో ఆయనకున్నరహస్య అనుబందం గురించి వారికి తెలియదని అనుకోలేము.   ఏమయినప్పటికీ, జగన్ స్వయంగా చెప్పినట్లు కడదాకా అంటే 2014ఎన్నికల వరకు ఈ సమైక్యపోరాటం చేస్తూనే ఉంటారు.

జనలోక్ పాల్ బిల్లు కోసం రాహుల్ వఖల్తా ఎందుకో

  నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి, స్వంత యంపీలే యూపీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం, కనీసం తాము అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా బిల్లుని ఆమోదింపజేసుకోలేని దుస్థితి. మిగిలిన మూడు రాష్ట్రాలలో పరాజయం కంటే గట్టిగా ఏడాది వయసు కూడా లేని ఆమాద్మీ పార్టీ చీపురు దెబ్బకి డిల్లీలో పరువుపోవడం కాంగ్రెస్ ను చాలా కలవరపరుస్తోంది. ఇది సరిపోనట్లు జనలోక్ పాల్ బిల్లుకోసం అన్నాహజారే నిరాహార దీక్ష మొదలుపెట్టడం మూలిగే ముసలి నక్క మీద తాటిపండు పడ్డట్లయింది కాంగ్రెస్ పార్టీకి. ఒకేసారి చుట్టుముట్టిన ఇన్నిసమస్యలతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నా, తన సహజసిద్దమయిన మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం మాత్రం మానుకోలేదు.   ఈరోజు యువరాజు రాహుల్ గాంధీ తన భజన బృందాన్ని వెంటేసుకొని డిల్లీలో మీడియా సమావేశం పెట్టి మరీ జనలోక్ పాల్ బిల్లు ఆవశ్యకత గురించి ప్రజలకు వివరించడం విశేషం. అవినీతికి వ్యతిరేఖంగా పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ జన లోక్ పాల్ బిల్లుపట్ల మొదటి నుండి చిత్తశుద్దితో వ్యవహరిస్తోందని, అందుకే ఈసారి పార్లమెంటులో ఈబిల్లును ఆమోదింపజేయాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉందని అన్నారు.   ఆమాద్మీ చేతిలో తమ పార్టీ ఓడిపోయినందునో లేకపోతే అన్నాహజారే రాలెగావ్ లో నిరాహార దీక్ష చేస్తున్నారనో తామీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టలేదని, ఈ బిల్లు వల్ల దేశంలో అవినీతిని సమర్ధంగా నియత్రించవచ్చని భావించినందునే పార్లమెంటులో ప్రవేశపెట్టామని, ఈ బిల్లు ఆమోదానికి బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకాలని ఆయన కోరారు. ఈ బిల్లుతో దేశంలో అన్ని సమస్యలను పరిష్కారమయిపోతాయని తాము భావించడం లేదని, కానీ ఆదిశలో ఇదొక మంచి ప్రయత్నంగా భావిస్తున్నామని అన్నారు.   అన్నాహజారే జనలోక్ పాల్ బిల్లు కోసం డిల్లీలో నిరాహార దీక్ష చేసినప్పుడు ఎన్నడూ ఒక్కసారి కూడా మాట్లాడని రాహుల్ గాంధీ ఇప్పుడు హటాత్తుగా జ్ఞానోదయం అయినట్లు జనలోక్ పాల్ బిల్లు గురించి వఖల్తా పుచ్చుకొని మాట్లాడటానికి కారణాలు ఆయనే స్వయంగా చెప్పకనే చెప్పుకొన్నారు. అయితే అవినీతిలో మునిగి తేలుతున్నతమ కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేఖంగా పోరాటం చేస్తోందని చెప్పడం ఈ సం.లో అతిపెద్ద జోక్ అని అందరూ అంగీకరించక తప్పదు.

తెదేపాతో పొత్తులు మేలని భావిస్తున్న బీజేపీ

  వాపును చూసి బలుపని భావిస్తున్నబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తాము చేసిన పోరాటాల వల్ల యావత్ తెలంగాణాలో పార్టీ చాలా బలపడిందని, అందువల్ల వచ్చేఎన్నికలలో ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి గెలిచేయవచ్చని భ్రమలో ఉన్నారు. అందుకే తెదేపాతో పొత్తులని ఆయన తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం అటువంటి వెర్రి భ్రమలలోలేదు. అందుకే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఎన్నికలలో పొత్తులు తదితర అంశాలపై పార్టీలోని కొందరు తటస్థ వ్యక్తుల ద్వారా ఒక రహస్య నివేదిక రప్పించుకొంది. పార్టీలోని విశ్వసనీయ వర్గాల ద్వారా ఆ నివేదికలోని కొన్ని ఆసక్తికరమయిన అంశాలు బయట పడ్డాయి.   ఎవరితో పొత్తులు లేకుండా పోటీ చేస్తే ఈసారి కాకపోయినా వచ్చేసారి ఎన్నికలకయినా పార్టీ బలోపేతం అవుతుందనే కిషన్ రెడ్డి వంటి కొందరు నేతల ఆలోచనలు కేవలం కాకి లెక్కలు కట్టుకోవడం వంటిదేనని ఆ నివేదికలో పేర్కొనబడింది. ఎందుకంటే బీజేపీ తెలంగాణా కోసం ఎంత పోరాటం చేసినప్పటికీ, ప్రజలు కాంగ్రెస్, తెరాస, తెదేపాలకే తొలి ప్రాధాన్యం ఇస్తారని, ఇక హైదరాబాద్ జంటనగరాలు, రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్, మరియు నల్గొండ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నసీమాంధ్ర ప్రజల తొలి ప్రాధాన్యత తెదేపాకే ఇస్తారనేసంగతి గత ఎన్నికలలోనే రుజువయిందని, అందువల్ల తెలంగాణాలో సైతం బీజేపీ ఒంటరిగా పోటీచేయడం శ్రేయస్కరం కాదని నివేదికలో పేర్కొనబడింది.   జంట నగరాలు, ఆ పరిసర ప్రాంతాలలో దాదాపు 34 నియోజక వర్గాలలో విస్తరించి ఉన్నారు. ఈజిల్లాలు, నియోఅజక వర్గాలలో నివసిస్తున్న సీమాంధ్ర ప్రజలు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ ఎక్కువ ప్రయోజనం పొందుతుంది. అయితే నేరుగా వారి ఓట్లను బీజేపీ పొందడం అసంభవం గనుక, వారి మద్దతు కలిగి ఉన్నతెదేపాతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా బీజేపీ కూడా లాభపడుతుందని, నివేదికలో పేర్కొనబడింది.   ఇక తెలంగాణా సెంటిమెంటు బలంగా ఉన్నవరంగల్, కరీంనగర్, మరియు మెదక్, నిజామాబాద్, నల్గొండ కొన్ని ప్రాంతాలలో తెరాసకు మంచి బలం ఉన్నకారణంగా అక్కడ బీజేపీ తనంతట తాను పోటీ చేసి గెలిచే అవకాశాలు అంతగా లేవని పేర్కొంది. గత ఉప ఎన్నికలలో బీజేపీ 11 స్థానాలకు పోటీ చేస్తే కేవలం మెహబూబ్ నగర్ సీటు మాత్రమే గెలుపొందడం బీజేపీ వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోందని పేర్కొంది.   అప్పుడు పరకాల్ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్ధికి కేవలం 9,000 ఓట్లు మాత్రమే రాగా, తెదేపా బలపరచిన అభ్యర్ధి తెరాస అభ్యర్ధికి గట్టి పోటీ ఇచ్చి 31,000 సాధించగా, తెరాస కేవలం 2,000 ఓట్ల మెజారిటీతో గెలిచారని, అందువల్ల బీజేపీ చాలా బలంగా ఉందని భావిస్తున్న చోట కూడా తమకంటే తెదేపా బలపరచిన అభ్యర్ధికే ఎక్కువ ఓట్లు రావడం గమనిస్తే వచ్చేఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసే కంటే తెదేపాతో పొత్తుల వలెనే ఇరువురికీ ప్రయోజనం ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది.   ప్రస్తుతం తెలంగాణా ప్రాంతాలలో నివసిస్తున్న సీమాంధ్ర ప్రజల ఓట్లన్నీతెదేపాకే పడే అవకాశాలు బాగా ఉన్నాయని, అందువల్ల కాంగ్రెస్, తెరాసలకు బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణాలోఎదగాలంటే తెదేపాతో పొత్తులు మేలని, తద్వారా తరువాత ఎన్నికలకి పార్టీ మరింత బలపడవచ్చని నివేదిక స్పష్టం చేసింది.   తమ పార్టీ చెప్పటిన తెలంగాణా ఉద్యమాల వలన సీమాంధ్రలో తన ఉనికిని కోల్పోయిన బీజేపీని కాపాడుకోవాలంటే, అక్కడ బలంగా ఉన్న తెదేపాతో పొత్తులు పెట్టుకోక తప్పదని, తద్వారా అటు తెదేపా, ఇటు బీజేపీ ఇరువురు ప్రయోజనం పొందవచ్చని నివేదికలో పేర్కొనబడింది. ఇక, కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో తెరాసతో, సీమాంధ్రలో వైకాపాతో అవగాహనకు వచ్చినట్లయితే, బీజేపీ ఒంటరిగా పోటీచేయాలనుకోవడం పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొంది.   తెలంగాణా కోసం బీజేపీ చేసిన పోరాటాలు, ఎన్నికలలో నరేంద్ర మోడీ ప్రభావం కారణంగా బీజేపీకి చాలా లబ్ది చేకూరే అవకాశం ఉంది. గనుక, ఇటువంటి సదవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని పూర్తి ప్రయోజనం పొందాలంటే బీజేపీ తప్పనిసరిగా తెదేపాతో పొత్తులు పెట్టుకోవడం మేలని నివేదికలో పేర్కొనబడింది.

2014 ఎన్నికల లోపు తెలంగాణ సాధ్యమా?

      ఇప్పటి పరిస్థితులు చూస్తోంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 2014 ఎన్నికల లోపు సాకారం అయ్యేలా కనిపించడం లేదు. విభజన ముసాయిదా బిల్లును కేంద్ర హోంశాఖ గురువారం ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి పంపించింది. బిల్లుపై శాసనసభలో అభిప్రాయ సేకరణకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గరిష్ఠంగా ఆరు వారాలు సమయమిచ్చారు. 'జనవరి 23వ తేదీలోపు' అసెంబ్లీలో అభిప్రాయ సేకరణ పూర్తి చేయాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. వాటిని క్రోడీకరించి ఢిల్లీకి పంపించేందుకు మరో మూడు రోజులు అదనంగా గడువు ఇచ్చినట్లు సమాచారం. అంటే... జనవరి 26వ తేదీ వరకు సమయం ఉన్నట్లే. రాష్ట్రపతి ఇచ్చిన గడువు ముగిసేంత వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి కేంద్రానికి అధికారం లేదు.  దీనిని బట్టి చూస్తే శీతాకాల సమావేశాలు ముగిసే లోపు తెలంగాణ బిల్లు పార్లమెంట్ చేరడం కష్టంగా కన్పిస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 ముగియనున్నాయి. అయితే కేంద్రం కనుక పార్లమెంటు సమావేశాలు పొడిగించడమో,లేక మళ్లీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడమో చేస్తే తప్ప తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం కష్టం కావచ్చు. కేంద్రం , కాంగ్రెస్ హై కమాండ్ తెలంగాణ పై మరీ పట్టుదలతో ఉంటే తప్ప ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడమో, లేక సమావేశాలలను పొడిగించడమో చేయకపోవచ్చు. అసెంబ్లీ లో బిల్లుపై అభిప్రాయాలు తెలుసుకున్న తరువాత తెలంగాణ ముసాయిదా బిల్లు హోంమినిస్ట్రీరికి.. తిరిగి రాష్ట్రపతికి వెళ్లి , అక్కడ నుంచి పార్లమెంటుకు ఆమోదానికి వెళ్ళుతుంది.

'ఆమ్ ఆద్మీ' ఏం చేస్తాడు..?

      ఢిల్లీలో రాజకీయ పరిణామాలు ఆసక్తిని కల్గిస్తున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ విముఖత వ్యక్తం చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నవాజ్ జంగ్ పిలుపు మేరకు హర్షవర్దన్ గురువారం సాయంత్రం ఆయనతో భేటీ అయ్యారు.తగిన బలం లేనందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదన్న పార్టీ వైఖరిని హర్షవర్ధన్ గవర్నర్‌కు స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు రెండో అతిపెద్ద పార్టీ అయిన ఆమ్ ఆద్మీకి గవర్నర్ ఆహ్వానం అందింది. లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి తమకు ఆహ్వానం వచ్చిందని ఏఏపీ అధికార ప్రతినిధి మనీష్ సిసోడియా స్పష్టం చేశారు. అయితే ఏఏపీ మాత్రం అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఎవ్వరి మద్దతూ తీసుకోకూడదన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. కాని ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే ఆ పార్టీకి మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు గవర్నర్ ని కలవనున్న ఆమ్ ఆద్మీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడొనన్న ఆసక్తి ఢిల్లీ ప్రజల్లో నెలకొంది.   

రాజ్‌భవన్ కు తెలంగాణ బిల్లు?

      రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుట్టిన రోజునే తెలంగాణ బిల్లుకు 'లైన్ క్లియర్' చేసినట్లు ఢిల్లీలోని విశ్వనీయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై అభిప్రాయం చెప్పేందుకు శాసనసభకు ఆరు వారాలు గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రే బిల్లు గవర్నర్ కార్యాలయానికి చేరినట్లు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమవుతుండగా... అందుకు సరిగ్గా ఒక్కరోజు ముందు ముసాయిదా బిల్లు రాజ్‌భవన్ చేరినట్లు తెలియడం గమనార్హం. విభజన ముసాయిదా బిల్లును కేంద్రమంత్రివర్గం ఈనెల 5న ఆమోదించింది. ఆ మరుసటి రోజే దానిని రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా సంతాప సభలో పాల్గొనేందుకు మంగళవారం దక్షిణాఫ్రికా వెళ్లిన రాష్ట్రపతి... బుధవారం తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. ఆ వెంటనే బిల్లు ముసాయిదాను 'క్లియర్' చేసినట్లు తెలిసింది. అయితే, తమకు రాష్ట్రపతి నుంచి ముసాయిదా బిల్లు అందలేదని హైదరాబాద్‌లోని అధికార వర్గాలు చెబుతున్నాయి. బుధవారం రాత్రి పొద్దుపోయేదాకా దీనిపై ఎలాంటి సమాచారం రాలేదని స్పష్టం చేశాయి. గురువారం ఈ అంశంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. అంతకుముందు... రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లులోని వివిధ అంశాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యాయ నిపుణులతో నిశితంగా చర్చించినట్లు తెలిసింది. తన కార్యాలయం నుంచి అసెంబ్లీకి వెళ్లే బిల్లు పూర్తిస్థాయిలో పక్కాగా ఉండాలని, అందులో ఎలాంటి న్యాయపరమైన లొసుగులు, ఇబ్బందులు ఉండరాదనే భావనతో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు.

కాంగ్రెస్ తప్పిదాలకు రాహుల్ రాజకీయ భవిష్యత్ బలి

    కాంగ్రెస్ పార్టీ మిజోరంలో గెలిచినందుకు సంతోషపడాలో లేక నాలుగు రాష్ట్రాలలో ఓడిపోయినందుకు ఏడవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉందిప్పుడు. అలాగని మిజోరాంలోనయినా  సంతోషించదగ్గ గొప్ప విజయమేమీ కాదు. క్రిందటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 32 సీట్లు వస్తే, ఈ సారి కేవలం 22మాత్రమే వచ్చాయి. అక్కడ ఎటువంటి బలమయిన ప్రతిపక్షమూ, పోటీ గానీ లేకపోయినా చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలవడం చూస్తే, కాంగ్రెస్ పార్టీకి అక్కడ కూడా నూకలు చెల్లిపోతున్నట్లు అర్ధం అవుతోంది. బహుశః రానున్న సాధారణ ఎన్నికలలో ఆ సంగతి స్పష్టమయిపోవచ్చును.   ఈసారి మిజోరం ఎన్నికలలో కాంగ్రెస్ చిహ్నంతోనో లేకపోతే సోనియా, రాహుల్ పేరు చెప్పుకోనో గెలవలేదు. వరుసగా తొమ్మిది సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికవుతున్న ముఖ్యమంత్రి లాల్ తన్హావాలా వ్యక్తిగత ప్రభావము, పేరు ప్రతిష్టలతోనే ఈసారి కాంగ్రెస్ పార్టీ మిజోరంలో గెలవగలిగింది, లేకుంటే అక్కడ కూడా తుడిచిపెట్టుకుపోయేదే.   ఇక ఈ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పరిస్థితి చూస్తే దేశంలో దాదాపు అన్ని ముఖ్యమయిన రాష్ట్రాలలో ఓడిపోతూ ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి కాంగ్రెస్ కుచించుకు పోయినట్లు అర్ధం అవుతోంది. దక్షిణాదిన రెండు దశాబ్దాల తరువాత బీజేపీ తప్పిదం వలన కర్ణాటకలో మళ్ళీ అధికారం దక్కించుకొన్నపటికీ, అంతకంటే విలువయిన, కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్ర విభజన కారణంగా పోగొట్టుకోబోతోందని ఇప్పటికే దాదాపు స్పష్టమవుతోంది. ఏవిధంగా చూసినా కాంగ్రెస్ పార్టీకి ఇక గడ్డు కాలం మొదలయినట్లే కనిపిస్తోంది.   అయితే సరిగ్గా రాహుల్ గాంధీ ని ప్రధాని పదవిలో కూర్చోబెట్టాలనుకొనే సమయంలో దేశమంతటా ఈవిధంగా ఎదురుగాలులు వీయడం కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా సోనియాగాంధీకి చాలా ఆందోళన కలిగించే విషయమే. అయితే అందుకు ఎవరినో నినదించనవసరం లేదు. అంతా స్వయంకృతాపరాధమే. కాంగ్రెస్ తప్పిదాలు రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్ధకంగా మార్చివేయడమే దురదృష్టకరం.

కాంగీయుల కొత్త డ్రామా!

      రాష్ట్ర విభజనను ఆపేస్తాం అని స్టేట్‌మెంట్లు ఇచ్చి సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టిన సీమాంధ్ర ఎంపీలు పరిస్థితిని విజయవంతంగా రాష్ట్ర విభజన ముంగిలి వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు తాజాగా మరో కొత్త డ్రామాకి తెరతీశారు. ఆ కొత్త డ్రామా పేరు ‘అవిశ్వాస తీర్మానం’. తమ సొంత పార్టీ మీదే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్రం విడిపోకుండా చూస్తామన్నది సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల వాదన. అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడానికి వీలుగా సీమాంధ్ర ఎంపీలు గతంలో స్పీకర్‌కి అందజేసిన తమ రాజీనామా లేఖల్ని ఎంచక్కా వెనక్కి తీసుకున్నారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రావడం, నెగ్గడం సంగతి దేవుడెరుగు గానీ, తాము గతంలో చేసిన రాజీనామాలను వెనక్కి తీసుకునే అవకాశం సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలకు దక్కిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రం ఎలాగూ విడిపోబోతోంది. అలాంటప్పుడు స్పీకర్ దగ్గర తమ రాజీనామాలు ఎందుకనుకున్నారో ఏమోగానీ, కొత్త పథకం వేసి రాజీనామా లేఖలు వెనక్కి తీసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల సొంత తెలివి కాదని, దీని వెనుక కాంగ్రెస్ అధిష్ఠానం బుర్ర కూడా వుండే వుంటుందని అభిప్రాయపడుతున్నారు. సొంత పార్టీ మీదే అవిశ్వాసం పెట్టి సీమాంధ్రుల దృష్టిలో త్యాగధనుల ఇమేజ్ సంపాదించుకునే వ్యూహం కూడా ఇందులో వుండొచ్చంటున్నారు. యుపిఎ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన ఆరుగురు ఎంపీలను కాంగ్రెస్ పార్టీ డిస్మిస్ చేసినట్టయితే వారికి సీమాంధ్రలో హీరో ఇమేజ్ వచ్చే అవకాశం వుంది.  రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద ఎలాగూ గెలిచే అవకాశం లేదు. అధిష్ఠానాన్నే ఎదిరించి పదవులను త్యాగం చేసిన ఇమేజ్‌తో ఇండిపెండెంట్లుగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్ సన్నిధానానికి చేరే వ్యూహం కావచ్చని కూడా విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని త్యాగాల బిల్డప్పులు ఇచ్చినా సీమాంధ్రలో ఇప్పుడున్న కాంగ్రెస్ ఎంపీలు ఏరకంగానూ గెలిచే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఉపప్రధానిగా చంద్రబాబు నాయుడు?

      లోక్ సభకు సెమీఫైనల్ గా భావించే నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలొచ్చాయి. నాలుగు రాష్ట్రాలనూ కమలనాథులు దక్కించుకున్నారు. ఆ పార్టీకి కురిసిన ఓట్ల వెల్లువలో కాంగ్రెస్ అభ్యర్ధులు కొట్టుకుపోయారు. ఉత్తరాది నుంచి మధ్య భారతదేశం వరకు కాంగ్రెస్ సోదిలో లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు బిజెపి అధిష్టానం కన్ను దక్షణాది పై పడింది. ఇక్కడ తమ పార్టీ వేళ్ళూనగొనడానికి వ్యూహాలను రచిస్తుంది.     దక్షిణాదిలో వెంకయ్య నాయుడు ప్రభావం ఆశించిన ఫలిత౦ మేరకు లేకపోవడం, యాడ్యురప్ప పార్టీ పై అవినీతి మచ్చలు ఉండడం, ఎన్డీఏ భాగస్వామైన జయలలిత తమిళనాడు కే పరిమితం కావడంతో బిజెపి అధిష్టాన౦ కన్ను చంద్రబాబు నాయుడు పై పడింది. జనాల్లో మోడీ, బాబు ఫ్యాక్టర్ బలంగా పనిచేస్తుందని నరేంద్ర మోడీ వర్గం ఆలోచిస్తుంది. ఒక్కసారి విభజన జరిగాక సీమాంద్రలో కూడా రాజకీయాలు మారతాయి. అప్పుడు ఎవరు బాగా అబివృద్ది చేస్తారన్న అంశం ముందుకు వచ్చి, మోడీ, చంద్రబాబుల కాంబినేషన్ జనంలో బాగా పనిచేస్తే ప్రయోజనం ఉంటుందని వారు చెబుతున్నారు. ఒకవేళ రాష్ట్రం సమైక్యంగానే ఉన్న పక్షంలో చంద్రబాబు, మోడీల సమర్ధత పై ప్రచారం చేసి రాజకీయంగా లబ్ది పొందాలన్నది వారి ఉద్దేశంగా ఉంది.   గతంలో తన గుజరాత్ అభివృద్దికి చంద్రబాబు నాయుడు ఆదర్శమని నరేంద్ర మోడీ ప్రకటించారు. అంతేకాక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బిజెపి ప్రధాని అభ్యర్ది మోడీతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఉప ప్రధాని అభ్యర్ధిగా చంద్రబాబు నాయుడును ప్రకటిస్తే దక్షణాదిలో బిజెపికి వున్న లోటును పుడ్చుకోవచ్చునని మోడీ వర్గం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఎన్డీఏ కన్వీనర్ అవుదామనుకున్న తమిళ నాయుడు ముఖ్యమంత్రి జయలలిత ను కూడా ఒప్పించి చంద్రబాబు నాయుడు ను ఎన్డీఏ కన్వీనర్ గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పులు చోటు చేసుకోవడం ఖాయం. చంద్రబాబు జాతకరీత్య కూడా 2014 లో జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తాడని జోతిష్యులు కూడా చెబుతున్నారు. మోడీ, బాబులు కలిస్తే అది టీడీపీ, బీజేపీలకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేశానికి కూడా మేలు చేసే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పుతుంటే...రాష్ట్రంలో టిడిపిని నడిపించే సారధ్య బాధ్యతలు ఎవరూ తీసుకుంటారు. నారా లోకేషా, నందమూరి బాలకృష్ణా లేక ఎన్టీఆర్ మనవరాలా? అనే దానిపై కూడా రాజకీయవర్గాలలో కూడా జోరుగా విశ్లేషణలు జరుగుతున్నాయి. సాధారణ ఎన్నికల వరకు ఈ వ్యవహారం ఓ కొల్లిక్కి రావచ్చు.                             

కాంగ్రెస్, బీజేపీలకు 'చీపురు' దెబ్బ

    రాజకీయ దిగ్గజాలయిన కాంగ్రెస్, బీజేపీలకు ఏడాది వయసు కూడా లేని ఆమాద్మీ పార్టీ డిల్లీలో చుక్కలు చూపించింది. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళనం చేసేందుకు ఉద్భవించిన ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల కమీషన్ చీపురు కట్టను ఎన్నికల చిహ్నంగా కేటాయించడం యాదృచ్చికమే అయినా, ఆమాద్మీకి అదే కలిసి వచ్చిన అంశంగా మారింది. ఆమాద్మీ(సామాన్య పౌరుడు) చేతిలో ఆ చీపురు కట్టే వజ్రాయుధంగా మారి, రాజకీయ దిగ్గజమయిన కాంగ్రెస్ పార్టీని డిల్లీ నుండి పూర్తిగా ఊడ్చిపెట్టేయగా, బీజేపీ అధికారం దక్కించుకోనీయకుండా  ఆ చీపురుకట్టనే ఆమాద్మీ ఇప్పుడు అడ్డువేస్తున్నాడు.   ఆమాద్మీ పార్టీ విజయం వెనుక ఆ పార్టీ కృషి ఎంత ఉందో, అంతకు మించి అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలోఉన్నవిముఖత కూడా దానికి ఆ పార్టీకి కలిసి వచ్చింది. రాహుల్ గాంధీ ఆమాద్మీ పార్టీ గురించి మాట్లాడుతూ, “ఆమాద్మీ ప్రజలతో మమేకమయ్యి వారి భావాలకు అనుగుణంగా వ్యవహరించినందునే విజయం సాధించిందని, అందువల్ల తమ పార్టీ కూడా నేటి వరకు అనుసరిస్తూ వచ్చిన రాజకీయ కోణం నుండి కాక ప్రజాకోణం నుండే పరిపాలన సాగించవలసి ఉంటుందని” అనడం గమనిస్తే ఆయన తమ పార్టీ చేస్తున్న తప్పులను, నడుస్తున్న దారి తప్పని గ్రహించినట్లే ఉన్నారు. ప్రజాసంక్షేమం కోసమే రాజకీయాలు చేయాలి కానీ, రాజకీయాలకు ప్రజా సంక్షేమం బలి చేయకూడదనే సత్యం ఆయన చాలా ఆలస్యంగా గ్రహించారు. అయితే ఆ సత్యం తెలుసుకోవడానికి కాంగ్రెస్ చాలా భారీ మూల్యమే చెల్లించవలసి వచ్చింది.   అయితే ఇకనయినా కాంగ్రెస్ పార్టీ తన తీరు మార్చుకొని నిజాయితీగా రాజకీయాలు చేస్తుందని నమ్మకం లేదని ఆయన తల్లి సోనియా గాంధీ మాటలే స్పష్టం చేసాయి. ఈ ఎన్నికలలో అధిక ధరలు మరి కొన్ని ఇతర చిన్న పెద్ద అంశాలు తమ ఓటమికి కారణమయ్యాయని, తమ వైఫల్యాలకు కారణాలను సమీక్షించుకొంటామని, అయితే ఈ ఫలితాలు రాబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఎటువంటి ప్రభావమూ చూపించాబోవని” ఆమె అన్నారు. ప్రస్తుతం జరిగిన శాసనసభ ఎన్నికలకి, 2014లో జరుగబోయే సాధారణ ఎన్నికలకి చాలా తేడా ఉంటుందని ఆమె అన్నారు. తగిన సమయంలో తమ పార్టీ ప్రధాని అభ్యర్ధి పేరు ప్రకటిస్తామని ఆమె అన్నారు.   ఎన్నికలలో ఓడిపోయినా ప్రతీసారి ఆత్మవిమర్శ చేసుకొంటామని, తమ వైఫల్యాలకు కారణాలు తెలుసుకొని పార్టీని చక్కదిద్దుకొంటామననే పడికట్టు పదాలను వల్లెవేసినట్లే, ఈసారి కూడా ఆమె మరోమారు వల్లె వేయడం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆలోచనా ధోరణిలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం అవుతోంది.   ప్రతీ ఎన్నికలలో పరాభవం చవి చూస్తున్నా కూడా తన పనితీరు మాత్రం ఎన్నడూ మెరుగు పరుచుకోదు. పాలనలో సమర్ధత కనబరచదు. అవినీతికి దూరంగా ఉండలేదు. అయినప్పటికీ స్వంత డబ్బాకొట్టుకోవడం కూడా మరచిపోదు. బహుశః మిజోరం ఎన్నికలలో సాధించబోతున్నవిజయం గురించి మాట్లాడుతూ తమను తాము కాపాడుకొనే ప్రయత్నం చేయవచ్చును. పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలతో గానీ పోవన్నట్లు, కాంగ్రెస్ అంత త్వరగా తన పాత అలవాట్లను, పద్దతులను, ఆలోచన శైలిని వదులుకోలేదు.   కాంగ్రెస్ పార్టీని తిరస్కరించిన ప్రజలే మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలలో సమర్ధ పాలన అందించినందుకు బీజేపీకి మళ్ళీ మూడోసారి పట్టం కట్టారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ ను గద్దె దింపి బీజేపీకి పగ్గాలు అప్పగించారు. డిల్లీలో చీపురు కట్టతో ఊడ్చి బయటకు సాగనంపారు. అందువల్ల యదావిధిగా పడికట్టు మాటలు వల్లే వేసే బదులు, నిజంగా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని తమ వైఫల్యాల కారణాలను గుర్తించగలిగితే కాంగ్రెస్ పార్టీకే మంచిది. లేకుంటే ఈసారి మోడీ ప్రభంజనంతో కాంగ్రెస్ పార్టీ దేశం నుండే ఊడ్చుకుపోయినా ఆశ్చర్యం లేదు.          

కేసీఆర్ని ట్విట్టిపోసిన వర్మ!

      ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సెంటిమెంట్స్ వుండవని అందరూ అనుకుంటారు. ఆయన కూడా తనకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవని చెబుతూ వుంటారు. అయితే అది పూర్తిగా నిజం కాదేమో, వర్మ మనసులో ఏదో మూల సెంటిమెంట్ వుందేమో అని ట్విట్టర్‌లో ఆయన పెట్టే కామెంట్లను చూస్తే అనిపిస్తూ వుంటుంది. వర్మ ప్రదర్శించే ఆ సెంటిమెంట్ కూడా తన వ్యక్తిగత విషయాల్లో లేదు... ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం విషయంలో వుంది. తెలుగువారందరూ ఒక్కటిగానే వుండాలన్న ఆలోచనలో వుంది.   రామ్ గోపాల్ వర్మ గతంలో అనేక పర్యాయాలు రాష్ట్రం విడిపోకూడదన్న అర్థం వచ్చేలా ట్విట్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో కేసీఆర్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు పోస్ట్ చేశారు. అమెరికాలో కేసీఆర్ లాంటి వ్యక్తి లేకపోవడం వల్లే అక్కడ విభజన రాజకీయాలు లేవని కామెంట్ చేశారు. కేసీఆర్ అమెరికాకు తన మకాం మార్చి అమెరికా పౌరులకు విభజన పాఠాలు చెప్పాలని సూచించారు. కేసీఆర్ లాంటి నాయకులు అమెరికాని విభజించాలని వాదించి గెలవగలరని పేర్కొన్నారు. అమెరికా లాంటి పెద్ద దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడూ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఉద్యమాలు జరగలేదని, ఎందుకంటే అక్కడ కేసీఆర్ లాంటి ‘సమర్థుడైన’ నాయకులు లేకపోవడమే కారణమని వర్మ ట్విట్ చేశారు. కేసీఆర్ అమెరికా పౌరుడిగా పుట్టి వుంటే ఆయన ఏం సాధించేవారో చూడాలని వుందని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో కామెంట్ పోస్ట్ చేశారు.  రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ మీద ట్విట్టర్‌లో చాలా పోస్టులు ట్విట్ చేశారంటే రాష్ట్ర విభజన అంశం ఆయన్ని ఎంతగా బాధిస్తోందో తెలుస్తోంది. ముంబైలో సెటిలైపోయిన వర్మకే ఇంత బాధగా వుంటే, అన్నిటిలోనూ హైదరాబాద్ మీదే ఆధారపడిన సీమాంధ్ర ప్రజలకు ఎంత బాధగా వుంటుంది? విద్యార్థులు, ఉద్యోగులు ఎంత బాధపడతారు? ప్రతి తెలుగు హృదయం ఎంత తల్లడిల్లుతుంది? అన్నట్టు.. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా అమెరికాలో పుట్టి వుంటే ఎలా వుండేదంటే.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు ప్రజలందరూ ఎప్పటికీ అన్నదమ్ముల్లా కలసి మెలసి వుండేవారు. మరి కేసీఆర్ అమెరికాలో పుడితే.... మన ఒక్క రూపాయికి వెయ్యి అమెరికా డాలర్లు వచ్చేలా పరిస్థితి తయారై వుండేది.  

విభజనతో విద్యార్ధులకు కొత్త ఇక్కట్లు

  సంక్లిష్టమయిన రాష్ట్ర విభజన వ్యవహారాన్ని కేంద్రం చాలా ఆషామాషీగా తూతూ మంత్రంగా పూర్తి చేసేసి చేతులు దులుపుకొంది. అనేక క్లిష్టమయిన అంశాలకు, సమస్యలకు తాత్కాలిక ఉపాయాలు చూపించి దానితో ఎలాగో సరిబెట్టుకోమని ఉచిత సలహా ఇస్తోంది. నీళ్ళు, విద్యుత్, ప్రాజెక్టులు వంటి క్లిష్టమయిన సమస్యలకు అది ఎటూ సరయిన పరిష్కారం చూపలేకపోయింది. కనీసం హైదరాబాద్ విషయంలో నయినా సరయిన పరిష్కారం చూపుతుందేమోనన్న ప్రజల ఆశ అడియాసగానే మిగిలిపోయింది.   దశాబ్దాల సమిష్టి కృషి కారణంగా రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దబడ్డ హైదరాబాద్ నగరంతో యావత్ రాష్త్ర ప్రజలు ఏదో రూపంగా బలమయిన సంబంధాలు కలిగిఉన్నారు, అధారపడి ఉన్నారు. కొన్ని లక్షల మందికి ఆ నగరం ఉపాధి కల్పిస్తే, అనేక వేలమంది విద్యారులకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అది గమ్యస్థానంగా నిలిచింది. అందువలన  ఈ రాష్ట్ర విభజన వలన అటువంటి విద్యార్ధులు భవిష్యత్ కూడా ప్రశ్నార్ధకంగా మారబోతోంది.     మొన్న కేంద్రం ఆమోదించిన రాష్ట్ర విభజన బిల్లులో, “రెండు రాష్ట్రాలలో విద్యార్ధులందరికీ ఉన్నత విద్య అభ్యసించేందుకు సమానావకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలలో ప్రస్తుతం అమలులో ఉన్నస్థానిక కోటా పద్దతినినే యదాతధంగా ఐదేళ్ళకు మించకుండా అమలుచేసేందుకు ఆమోదించబడినది,” అని పేర్కొంది.   అయితే హైదరబాద్ ని పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచుతున్నపుడు కేవలం ఐదేళ్ళు మాత్రమే ఈవిధానం ఎందుకు అమలుచేస్తున్నట్లు? పదేళ్లు అమలు చేయడానికి అభ్యంతరమేమిటి? ఐదేళ్ళ కోర్సులయిన యంబీబీయస్ వంటి వైద్య విద్యలో వచ్చే సంవత్సరం నుండి ఇతరులకు ప్రవేశం ఇస్తారా, లేదా? ఒకవేళ ఈగడువు ముగిసే సమయానికి కోర్సు మధ్యలో ఉన్నవారి పరిస్థితి ఏమిటి? ఈ ఐదేళ్ళ గడువు ముగిసే ముందు సంవత్సరంలో ఇటువంటి దీర్ఘకాలిక కోర్సులలో చేరదలచిన వారి పరిస్థితి ఏమిటి? అని ఆలోచిస్తే కేంద్రం ఎంత అనాలోచితంగా నిర్ణయాలు తీసుకొందో అర్ధం అవుతుంది.   ఇక స్థానిక కోటాలను పరిశీలిస్తే, హైదరబాద్ ఉస్మానియా పరిధిలో జంట నగరాలు, రంగారెడ్డి, మెదక్, కరీం నగర్, ఖమ్మం, మెహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ మరియు వరంగల్ జిల్లాలు ఉన్నాయి.   అదేవిధంగా రాయలసీమలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థానిక కోటా పరిధిలో అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప మరియు నెల్లూరు జిల్లాలున్నాయి.   ఇక విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయం స్థానిక కోటా పరిధిలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలున్నాయి.   ఒక విద్యార్ది ఆయా ప్రాంతాలలో కనీసం నాలుగు సం.లకు తక్కువ కాకుండా విద్యాభ్యాసం చేసి ఉంటే, అతడు లేదా ఆమె స్థానిక విద్యార్ధిగా పరిగణింపబడుతారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవారి విషయంలో రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనయినా వరుసగా ఏడు సం.లు విద్యాభ్యాసం చేసినట్లయితే ఆ ప్రాంతంలో స్థానికుడిగా పరిగణింపబడతారు. కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత అప్పుడు కూడా ఇదే స్థానిక విధానం ఐదేళ్ళవరకు అమలు చేస్తారా? రెండు రాష్ట్రాలు తమ తమ ప్రాంత విద్యార్థులకే ప్రాధాన్యం ఇవ్వదలచుకొంటే అప్పుడు ఈ స్థానిక విధానం ఏవిధంగా అమలు చేస్తారు? అనే విషయంపై బిల్లులో ఎటువంటి వివరణ లేదు.   ఇటువంటి లోపభూయిష్టమయిన విధానాల వలన రెండు రాష్ట్రాలలో విద్యార్ధులకు అవస్థలు, సమస్యలు తప్పకపోవచ్చును. ఇటువంటి లోపాలు మిగిలిన వ్యవస్థలలోను లెక్కకు మించి ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాటివల్ల రెండు రాష్ట్రాలలో ప్రజలు నిత్యం సమస్యలు ఎదుర్కొనక తప్పదు. కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు తప్పదు.

తిట్లు.. శాపనార్థాలు!

      సీమాంధ్రులై వుండీ, రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న సీమాంధ్రకు చెందిన రాజకీయ నాయకులను అక్కడి ప్రజలు ఇలా తిడుతూ శాపనార్థాలు పెట్టినా ఎంతమాత్రం తప్పులేదు....   1. మీ పదవులు ఊడిపోవాలి. 2. మీ స్కాములన్నీ బయటపడిపోవాలి. 3. మీరు ఏసీబీ వాళ్ళకి అడ్డంగా దొరికిపోవాలి. 4. మీరు సీబీఐ వాళ్ళ కేసులలో ఇరుక్కుపోవాలి. 5. మీరు డబ్బులు డిపాజిట్ చేసిన స్విస్ బ్యాంకులు ఐ.పీ. పెట్టేయాలి. 6. మీ నామినేషన్లు తిరస్కరణకు గురవ్వాలి. 7. తప్పుడు ధ్రువీకరణ ప్రతాలు ఇచ్చారని మీమీద అనర్హత వేటుపడాలి. 8. వచ్చే ఎన్నికలలో మీరు డిపాజిట్ కూడా దక్కకుండా ఘోరంగా ఓడిపోవాలి. 9. మీకేకాదు... మీ ఫ్యామిలీ మొత్తానికీ రాజకీయ భవిష్యత్తు లేకుండా పోవాలి. 10. మీ వ్యాపారాలన్నీ నాశనమైపోవాలి.  11. హైదరాబాద్‌లో మీ ఆస్తులన్నీ పాడుబడిపోవాలి. 12. మీరు కాంట్రాక్టులు చేయకుండా జీవితాంతం బహిష్కరించాలి. 13. విదేశాల్లో మీ కంపెనీలని బ్లాక్‌లిస్ట్ లో పెట్టాలి. 14. రాజకీయాలని అడ్డు పెట్టుకుని మీరు సంపాదించిన డబ్బంతా ఎలుకలు కొట్టేయాలి. 15. మీరు ఏ పార్టీలో వుంటే ఆ పార్టీ దుంపనాశనమైపోవాలి. 16. మీరు లంచాలు తీసుకుంటూ స్ట్రింగ్ ఆపరేషన్‌లో దొరికిపోవాలి. 17. మీ నియోజకవర్గం రిజర్వేషన్‌లో మీకు దక్కకుండా పోవాలి. 18. నియోజకవర్గాల పునర్విభజనలో మీ నియోజకవర్గం గల్లంతైపోవాలి. 19. మీ పార్టీ సోదిలో కూడా లేకుండా పోవాలి. 20. మీమీద వున్న కేసులన్నిటికీ శిక్షలు పడాలి. 21. మీ అనుచరులు చేసిన నేరాలన్నీ మీ మెడలకి చుట్టుకోవాలి......

సర్వే’జ(గ)నా సుఖినోభవన్తు!

      రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిన దారుణమైన సంఘటనని ఎవరో ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడో ఒకప్పుడు గుర్తు చేస్తూనే వుంటాడు. ఈసారి ఆ బాధ్యత వైఎస్సార్సీపీ నాయకుడు జగన్ తీసుకున్నట్టుగా వుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర విభజనకు జరుగుతున్న ప్రయత్నాలు తెలుగువారి గుండెను మండేలా చేస్తుంటే మరోవైపు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులన్నీ జగన్ ముఖ్యమంత్రి కావడానికి అనుకూలంగా వున్నాయంటూ ‘కొన్ని’ మీడియాలలో సర్వేలు రావడం రాజకీయ వర్గాలను దిగ్ర్భాంతికి గురిచేసింది.   రాష్ట్రం విడిపోయే పరిస్థితులొచ్చాయి. తెలుగుజాతి దారుణంగా చులకనకు గురైన విపత్కర పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గండం నుంచి ఎలా బయటపడాలన్నది ఆలోచించడం తెలుగువారి ప్రస్తుత కర్తవ్యం. అయితే ఆ విషయాన్ని వదిలేసి జనం ఎవరికి ఓట్లేస్తారన్న విషయం మీద సర్వేలు మీడియాలో ప్రసారం కావడాన్ని ఏమనాలో అర్థం కావడం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమవుతున్న సర్వేల వెనుక జగన్ హస్తం వుందన్న విషయాన్ని కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నాయి. దండిగా డబ్బులు ఇస్తే సర్వేలు చేసే సంస్థలు మనకు అనుకూలంగా వుండేలా సర్వే రిపోర్టులు అందజేస్తాయన్న విమర్శలు వినిపిస్తూ వుంటాయి. అలాంటి విమర్శలను ఇంతవరకూ నమ్మనివారు ఇప్పుడు జగన్‌కి అనుకూలంగా వస్తున్న సర్వేల ఫలితాలను చూస్తే తప్పకుండా నమ్ముతారని విశ్లేషకులు అంటున్నారు. సర్వే జగనా సుఖినోభవన్తు అని ఆశీర్వదిస్తున్న సర్వేల ప్రకారం ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అంటూ తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ జగన్ హవా నడుస్తోంది. ఇటు అసెంబ్లీలోనూ, అటు పార్టమెంటులోనూ జగన్ పార్టీ బోలెడన్ని సీట్లు గెలుచుకుంటుంది. జగన్‌కి ఓట్లు వేయడానికి జనం ఎంతో ఉత్సాహంగా వున్నారు. అయితే, ఏం చూసి జగన్‌ని జనం నమ్ముతారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో అడుగంటపోయిన తన ఇమేజ్‌కి బూస్టప్ ఇచ్చుకోవడం కోసమే జగన్ ఇలాంటి సర్వేలను ప్లాన్ చేశాడన్న అభిప్రాయం ఎవరికైనా కలిగితే దాన్ని ఖండించలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి ట్రిక్కులు జనం దగ్గర పనిచేయవని చెబుతున్నారు.

విలీనం ఫిక్సయిందా?

      కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం ఫిక్సయిన సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దాని పరిణామమే కేంద్రం ఏకపక్షంగా, పూర్తిగా తెలంగాణ ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరించడమని విశ్లేషిస్తున్నారు. మూడు నెలల క్రితం తెలంగాణ ఇవ్వడానికి అంగీకారం తెలిపిన కాంగ్రెస్ పార్టీ తాను ఇలా తెలంగాణకు అంగీకారం తెలుపగానే టీఆర్ఎస్ అలా తనలో విలీనం అయిపోతుందని ఆశించింది. అయితే కాంగ్రెస్ అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి! అప్పటి తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని తాయిలం ఆశ చూపిస్తూ వచ్చిన కేసీఆర్ తీరా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించిన తర్వాత ప్లేటు ఫిరాయించేశాడు.   విలీనం లేదు తోటకూర కట్టా లేదంటూ షాకిచ్చాడు. తెలంగాణ ఏర్పడితే తన పార్టీకే అధికారం వస్తుందని కలలు కనడం ప్రారంభించాడు. కాంగ్రెస్ దగ్గర తల ఎగరేయడం షురూ చేశాడు. కేసీఆర్ని దారిలోకి తేవడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ మొండిఘటం లొంగకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తనమార్కు రాజకీయం ప్లే చేసిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర విభజన బిల్లు కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందే ముందు రోజున ‘ఇచ్చేది రాయల తెలంగాణ’ అనే మాటను లీక్ చేయడం ద్వారా కేసీఆర్‌ని దారిలోకి తెచ్చిందని, కేంద్రం ‘రాయల తెలంగాణ’ ఇవ్వబోతోందన్న వార్త బయటకు రాగానే కేసీఆర్‌లో టెన్షన్ పెరిగి కాంగ్రెస్‌కి దాసోహం అన్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాత్రికి రాత్రే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనానికి సంబంధించిన ఒప్పందాలు చాలా పకడ్బందీగా కుదిరి వుండవచ్చన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ విలీనం విషయంలో తల ఎగరేసిన కేసీఆర్‌కి కీలక సందర్భంలో విలీనానికి ఒప్పుకోక తప్పని పరిస్థితిని కాంగ్రెస్ అధిష్ఠానం సృష్టించిందని, కేసీఆర్‌ని దారిలోకి తేవడానికి ‘రాయల తెలంగాణ’ అస్త్రాన్ని విజయవంతంగా వాడుకుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఈ రాజకీయ వికృత క్రీడలో తెలుగు ప్రజలు ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో!

ఇదేనా మీరు సాధించింది?

      రాష్ట్ర విభజనకు నిజాయితీతో, చిత్తశుద్ధితో, నిస్వార్థంగా కృషి చేసినవాళ్ళు ఎవరని ప్రశ్నించుకుంటే సమాధానం ఏ టీఆర్ఎస్ నాయకులనో, వివిధ పార్టీల తెలంగాణ నాయకులనో సమాధానం రాదు.. సీమాంధ్ర కేంద్ర మంత్రులేనన్న సమాధానం ఎవర్నడిగినా వస్తుంది. రాష్ట్ర విభజనను అడ్డుకోవాల్సిన వాళ్ళు బర్త్ డే కేక్ కోసినంత ఈజీగా రాష్ట్ర విభజన జరగడానికి సహకరించడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? రాష్ట్ర విభజను ముక్తకంఠంతో వ్యతిరేకించాల్సింది పోయి పదవులే పరమార్థమని నోళ్ళు మూసుకుని కూర్చున్నారు.   సమైక్య గళాన్ని, నిరసనను కేంద్రానికి వినిపించాల్సింది పోయి మీ ఇష్టమొచ్చినట్టు విభజించి పారేయండి... మాకు మాత్రం వచ్చే ఎన్నికలలో సీట్లు, మంత్రి పదవులు మాత్రం రిజర్వ్ చేసేయండని తమ ప్రవర్తనతో చెప్పకనే చెప్పేశారు. దీనికితోడు రాష్ట్ర విభజన జరగదని, రాష్ట్ర విభజన జరిగినా సీమాంధ్రకు అన్యాయం జరగదని, అదని, ఇదనీ చెబుతూ సీమాంధ్రుల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టేశారు. ఉప్పెనలా లేచిన సమైక్య ఉద్యమాన్ని చల్లబరచడానికి తామవంతు కృషి చేశారు. సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న వాళ్ళని నానా మాటలూ అన్నారు. నిన్నగాక మొన్న ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు మీద చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేయడం దీనికొక ఉదాహరణ. అశోక్ బాబు మీద ఆగ్రహం వ్యక్తం చేసే సమయంలో కేంద్ర మంత్రి  చిరంజీవి గారి హావభావాలు చూస్తే నిజంగానే రాష్ట్ర విభజన జరగదేమో, ఈయనగారే కేంద్రం మనసు మార్చే ప్రయత్నంలో సీరియస్‌గా వున్నారేమో అన్న నమ్మకం కలిగింది. ఎంతైనా మెగాస్టార్ కదా! ఇక పనబాక లక్ష్మి, పురంధేశ్వరి, కావూరి.. ఇలా ఎవరికి వారు విభజన డ్రామాలో తమ తమ కేరెక్టర్లని విజయవంతంగా పోషించి రక్తి కట్టించారు. సీమాంధ్ర ప్రజల కళ్ళలోంచి రక్తం కారేలా చేశారు. అంతా చేసి ఇప్పుడు మళ్ళీ వీళ్ళ విభజన డ్రామాలో రాజీనామాల అంకానికి తెర లేపారు. అయితే సీమాంధ్ర ప్రజలు మాత్రం ఈసారి వీళ్ళ డ్రామాలను చూస్తూ ఊరుకోరు.

కొండని తవ్వి ఎలుకని పట్టారు!

      రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర మంత్రుల బృందం చేసిన నిర్వాకమంతా కొండని తవ్వి ఎలుకని పట్టినట్టుంది. రాష్ట్ర విభజన మీద మూడు నెలలపాటు రకరకాల కసరత్తులు చేసి సాధించిందేంటయ్యా అంటే గుండు సున్నా! రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న రోజున ఏదయితే ప్రకటించిందో అదే నిర్ణయం అమలు చేయనున్నట్టు కేంద్ర మంత్రుల బృందం తన నివేదిక ద్వారా చెప్పకనే చెప్పింది. శంఖంలో పోస్తేనే తీర్థమవుతుందన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ తాను అనుకున్నది, ఆలోచించినదంతా మంత్రుల బృందం ద్వారా అధికారికంగా తెలుగు ప్రజల మీద రుద్దుతోంది. కాంగ్రెస్ పార్టీకి అధికారిక కలరింగ్ ఇవ్వడానికే మంత్రుల బృందం రకరకాల సమావేశాలు, అభిప్రాయ సేకరణలు, ప్రశ్నపత్రాలు, లీకులు... ఇలా నానా హడావిడి చేసిందన్న విషయం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. తెలుగోళ్ళని ఏ రకంగా పిచ్చోళ్ళని చేయొచ్చో  ఆ రకంగా చేసిపారేసింది. చర్చలూ అవీ ఇవీ అని తెలుగు ప్రజల్ని తన చుట్టూ తిప్పుకుంది. భవిష్యత్తులో రాజనీతి శాస్త్రం సబ్జెక్టులో ‘జనాన్ని పిచ్చోళ్ళని చేసి ఆడించుట ఎలా?’ అనే లెసన్ కనుక ప్రవేశపెడితే కేంద్ర మంత్రుల బృందం వ్యవహారశైలిని అందులో తప్పకుండా పెట్టాలి. అపార అనుభవజ్ఞులు, రాజకీయరంగంలో ఉద్ధండ పిండాల్లాంటి వాళ్లు ఈ మంత్రుల బృందంలో వున్నారు కదా..  ఒకదాంట్లో కాకపోయినా ఒకదాంట్లో అయినా రెండు ప్రాంతాల ప్రజలకు ఆమోద యోగ్యంగావుండే అంశాలను పొందుపరుస్తారులే అనే నమ్మకం కొందరిలో వుండేది. ఇప్పుడు తెలంగాణ వైపు ఏకపక్షంగా రూపొందించిన నివేదిక ఆ నమ్మకాన్ని కూడా వమ్ము చేసేసింది. రాష్ట్ర విభజన విషయంలో నిరంకుశంగా, నిర్దయగా, పూర్తి స్వార్థపూరితంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ పార్టీ, పైపైకి సంప్రదింపులు, చర్చలనే చక్కర రాసిన విష గుళికని తెలుగు ప్రజల చేత మింగించే ప్రయత్నం చేసింది. తెలుగువారిని విజయవంతంగా మోసం చేసింది. ఏ ఒక్క విషయంలో కూడా సీమాంధ్రుల సమస్యలను పట్టించుకోని కేంద్ర మంత్రుల బృందాన్ని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రస్తుతం సీమాంధ్ర ప్రజలున్నారు.

కాంగ్రెస్ మటాష్!

      ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ వివరాలు బయటకి వచ్చాయి. పలు మీడియా సంస్థలు, ఎన్నికల సర్వేల సంస్థలు కలసి నిర్వహించిన సర్వేలన్నీ నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మటాషైపోవడం ఖాయమని, ఈశాన్య భారతంలోని మిజోరాం స్టేట్‌లో మాత్రం కాంగ్రెస్ చావుతప్పి కన్ను లొట్టపోయే అవకాశం వుందని తేల్చాయి. ఇండియాటుడే, టైమ్స్ నౌ, సీఎన్ఎన్-ఐబీఎన్ లాంటి మీడియా సంస్థలు విశ్వసనీయమైన సర్వే సంస్థలతో నిర్వహించిన ఎగ్జిట్‌పోల్ ఫలితాలు అందరూ ఊహించిన విధంగానే వచ్చాయి.   మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ఆల్రెడీ అధికారంలో వుంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని సర్వేలు తేల్చాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో వున్న రాజస్థాన్  రాష్ట్రాన్ని భారతీయ జనతాపార్టీ సొంతం చేసుకునే అవకాశం వుందని తేలింది. అలాగే ఢిల్లీలో కూడా బీజేపీ హవా నడుస్తుందని తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం వుండటం వల్ల ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ సహకారం తీసుకోవాల్సిన అవసరం వుండొచ్చని సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వదు కాబట్టి ఢిల్లీ పీఠం కూడా కాంగ్రెస్ చేజారినట్టే లెక్క! ఇక కాంగ్రెస్ అధికారంలో వున్న మిజోరాంలో బొటాబొటి మెజారిటీతో గట్టెక్కే అవకాశం వుందని సర్వేలు చెప్పాయి. మిజోరాం లాంటి చిన్న రాష్ట్రంలో గెలవటం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి పెద్దగా ఒరిగేదేమీ లేదు. ముఖ్యంగా ఢిల్లీ పీఠం కోల్పోయే పరిస్థితి రావడం కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బే. పదిహేను సంవత్సరాలుగా ఢిల్లీని శాసిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇది మింగుడుపడని వ్యవహారమే. మొదటి నుంచీ సర్వేలు తనకు వ్యతిరేకంగా వుండటంతో కాంగ్రెస్ పార్టీకి సర్వేల పేరు చెబితేనే మండిపడుతోంది. డబ్బులు ఎవరు ఇస్తే సర్వేలు వాళ్ళకి అనుకూలంగా వస్తాయని అడ్డంగా వాదిస్తోంది. అయితే ఇప్పుడు ప్రముఖ మీడియా సంస్థలు జరిపిన ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందనడానికి ఈ సర్వే ఫలితాలు నిదర్శనంగా నిలుస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.