రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్

  రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఈరోజు మరో కీలక పరిణామం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐ.ఏ.యస్. అధికారుల కమిటీ ఈ కేసుపై విచారణ జరిపి ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించేలోగానే నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రాజశేఖర్ ఈరోజు ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రిన్సిపాల్ బాబురావుపై పిర్యాదు చేసారు. అతను విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ అరికట్టడంలో విఫలమయ్యాడని అందువలననే రిషితేశ్వరి ర్యాగింగ్ కి గురయి ఆత్మహత్య చేసుకోవలసి వచ్చిందని ఆయన ఆరోపించారు. అంటే ఆమె మరణానికి ప్రిన్సిపాల్ బాబురావే కారకుడని ఆయన పరోక్షంగా ఆరోపిస్తున్నట్లు భావించవచ్చును.   కానీ ఐ.ఏ.యస్. అధికారుల కమిటీ ఈ కేసుపై విచారణ జరుపుతున్నప్పుడు ఏమీ మాట్లాడని రాజశేఖర్ అకస్మాత్తుగా ప్రిన్సిపాల్ బాబురావుపై పోలీసులకి పిర్యాదు చేయడం, అతనే రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకుడని పరోక్షంగా చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ ఇదే విషయాన్ని ఆయన ఐ.ఏ.యస్. అధికారుల కమిటీ ముందు చెప్పి ఉండి ఉంటే ఇప్పుడు ఆయన పోలీసులకి పిర్యాదు చేసినా ఎవరికీ ఆశ్చర్యం అనుమానం కలిగి ఉండేవి కావు. కానీ విచారణ కమిటీ ముందు నోరు మెదపకుండా ఊరుకొని ఇప్పుడు పోలీసులకి పిర్యాదు చేయడం సహజంగానే అనుమానాలు కలిగిస్తోంది. రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపాల్ బాబురావుని అరెస్ట్ చేయాలని వైకాపా వాదిస్తోంది. బహుశః ఆ పార్టీ ప్రభావం లేదా ఒత్తిడి కారణంగా రాజశేఖర్ బాబురావుపై పిరుయాదు చేసారేమోననే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

మెహబూబ్ నగర్ జిల్లాలో వజ్రాల గనులు

  మెహబూబ్ నగర్ పేరు చెప్పగానే ఎవరికయినా ముందు గుర్తుకు వచ్చేది ఆ జిల్లా నుండి ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, గల్ఫ్ దేశాలకు వలసలు పోతున్న అక్కడి జనం గురించే! కారణం ఆ జిల్లాలో వ్యవసాయానికి నీటి వసతి లేకపోవడంతో పంటలు పండక ఎప్పుడూ కరువు కాటకాలు తాండవిస్తూ ఉండటమే! కనీసం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి జరిగినా ఈ దుస్థితి నెలకొని ఉండేది కాదు. అందుకే తెలంగాణాలో మెహబూబ్ నగర్ జిల్లా నుండి వలసలు చాలా ఎక్కువగా కనబడుతుంటాయి. కానీ ఆ జిల్లా ఇప్పుడు యావత్ తెలంగాణకే అక్షయపాత్ర వంటి వజ్రాల గని అని గత కొంత కాలంగా జరుగుతున్నా పరిశోధనలలో తేలింది.   ఉస్మానియా విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ ఎక్స్ ప్లోరేషన్ విభాగానికి చెందిన కొందరు పరిశోధకులు చేసిన పరిశోధనలో జిల్లాలో కనీసం 21 ప్రాంతాలలో అపారమయిన వజ్రాల గనులున్నాయని కనుగొన్నారు. ముఖ్యంగా కర్నాటకకు చెందిన గుల్బర్గా పట్టణానికి ఆనుకొని జిల్లాకు చెందిన ప్రాంతాలలో ఈ వజ్రాల గనుల నిక్షేపాలు అధికంగా ఉన్నాయని కనుగొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మరో ఆరు సంస్థలకు చెందిన పరిశోధకులు కూడా ప్రస్తుతం జిల్లాలో వజ్రాల ఆన్వేషణలో ఉన్నారు.   మెహబూబ్ నగర్ జిల్లాలో నారయణపేట్, గుర్మత్కల్, అమ్మిరెడ్డిపల్లి, దామరగిడ్డ మరియు నాయుడుగుర్తి, కోయిల్ కొండ, మద్దూర్, కోటకొండ, పదిరీ పహాడ్, దేవరకొండ ప్రాంతాలలో ఈ వజ్రాల గనులు నిక్షిప్తం అయ్యి ఉన్నట్లు తాము కనుగొన్నామని ఆయన తెలిపారు. ఆంధ్రాలో కూడా అనంతపురం, కడప, గుంటూరు, ప్రకాశం, కృష్ణ, మరియుకర్నూల్ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో ఈ వజ్రాల గానులున్నట్లు కనుగొన్నామని తెలిపారు. ఇవి కొన్నిచోట్ల భూమికి సుమారు 1.2 కిమీ. లోతులోను మరికొన్ని చోట్ల కేవలం 400 మీటర్ల లోతులోను ఈ వజ్రాల గనులు నిక్షిప్తం అయ్యి ఉన్నాయని ప్రొఫెసర్ రామదాస్ తెలియజేశారు. ప్రభుత్వం కూడా పరిశోధకులు కనిపెట్టిన ఈ వజ్రాల గనులను వెలికి తీసేందుకు నడుం బిగిస్తే మెహబూబ్ నగర్ జిల్లాయే తెలంగాణకు తలమానికంగా ఎదిగే అవకాశం ఉంది.

పాక్ క్రికెటర్ వసీం అక్రంపై కాల్పులు

  ప్రముఖ పాక్ క్రికెట్ ఆటగాడు వసీం అక్రంపై ఈరోజు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులుబైక్ వచ్చి ఆయన ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిపారు. ఆయన వెంటనే తన కారులో నుండి బయటకు దూకి తప్పించుకొనే ప్రయత్నం చేయగా, దుండగులలో రెండవ వ్యక్తి ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపాడు. కానీ ఆయన తన కారు వెనుక దాగి వారి దాడి నుండి సురక్షితంగా తప్పించుకోగలిగారు. తమ ప్రయత్నం విఫలం అవడంతో ఆ దుండగులు ఇద్దరూ తమ బైక్ పై పరారయ్యారు. ఈరోజు వసీం అక్రం కరాచీలో ఉన్న జాతీయ క్రీడా మైదాహానం వద్దకు చేరుకొన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆయన వారి బండి నెంబర్ నోట్ చేసుకొని దానిని పోలీసులకు ఇచ్చి పిర్యాదు చేసారు. ఇంతకు ముందు ఎన్నడూ తనకు ఎవరి నుండి బెదిరింపు ఉత్తరాలు, కాల్స్ లేదా మెసేజ్ లు రాలేదని తెలిపారు. కనుక తనపై ఎవరు ఎందుకు దాడి చేసారో తనకు తెలియదని ఆయన మీడియాకు తెలిపారు.

సజీవంగా పట్టుబడ్డ పాక్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్

  బుదవారం ఉదయం జమ్మూలో ఉదంపూర్ జిల్లాలో భారత సరిహద్దు భద్రతా దళాల మీద దాడి చేసిన ఒక ఉగ్రవాది భద్రతా దళాల కాల్పులలో అక్కడికక్కడే మరణించాడు. ఉస్మాన్ ఖాన్ అనే మరో ఉగ్రవాది తప్పించుకొని పారిపోవాలని చూసినప్పటికీ భద్రతా దళాలకు సజీవంగా చిక్కాడు. అతనిని పట్టుకొన్నప్పుడు అక్కడే ఉన్న మీడియా అడిగిన ప్రశ్నలకు అతను చెప్పిన జవాబులు అందరినీ నివ్వెరపోయేలా చేశాయి.   “నేను పాకిస్తాన్ నుండి హిందువులను చంపేందుకే దట్టమయిన అడవుల గుండా ప్రయాణించి ఇక్కడికి వచ్చాము. 12రోజుల క్రితమే నేను ఇక్కడికి చేరుకొన్నాను. నేను తెచ్చుకొన్న ఆహారం మూడు రోజుల క్రితమే అయిపోయింది. నిన్నటి నుండి ఆహారం లేకుండా తిరుగుతున్నాను. మేమిద్దరం చేసిన దాడిలో నా పార్టనర్ భారత జవాన్ల చేతిలో మరణించాడు. ఒకవేళ నేను కూడా మరణించి ఉండి ఉంటే అది అల్లా నిర్ణయంగా భావించేవాడిని. కానీ ఇదంతా చాలా వినోదంగా ఉంది.” అని చెప్పాడు. మీడియా అతనిని ప్రశ్నించినప్పుడు తను లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తినని చెప్పుకొన్నాడు మొదట అతను తన వయసు 20 సం.లని చెప్పాడు. కానీ మరికొద్దిసేపటి తరువాత అతను తన వయసు 16సం.లని మాట మార్చాడు.   భారత్ లో ప్రవేశించే పాక్ ఉగ్రవాదులు ఒకవేళ భద్రతా దళాలకు పట్టుబడినట్లయితే తమ వయసు 16సం.లని చెప్పవలసిందిగా లష్కర్ సంస్థ ప్రత్యేకంగా చెప్పి పంపిస్తుందని అజ్మల్ కసాబ్ విషయంలో ఇదివరకే రుజువయింది. ఆవిధంగా చెపిత భారత చట్టాల ప్రకారం అతనిని బాల నేరస్తుడిగా పరిగణించి చిన్నపాటి శిక్షతో విడిచిపెట్టే అవకాశం ఉంటుందని ఉగ్రవాదుల విశ్వాసం. ముంబై దాడుల్లో సజీవంగా పట్టుబడ్డ ఉగ్రవాది అజ్మల్ కసాబ్ కూడా తన వయసును తక్కువ చేసి చెప్పడం వలన, అతని వయసును నిర్ధారించుకొనేందుకు భారత ప్రభుత్వం చాలా శ్రమ పడవలసి వచ్చింది. ఆ కారణంగానే అతను ఉరి శిక్ష పడకుండా చాలా ఏళ్ళు తప్పించుకోగలిగాడు. అందుకే ఇప్పుడు పట్టుబడ్డ ఉస్మాన్ ఖాన్ కూడా తన వయసు కేవలం 16సం.లే అని తక్కువ చేసి చెప్పుకొన్నాడు.   అతనిని సజీవంగా పట్టుకోవడం వలన అతని ద్వారా ఉగ్రవాదుల కుట్రల గురించి చాలా కీలకమయిన రహస్యాలు తెలుసుకొనే అవకాశం ఉంది. కానీ అతనిని దోషి అని నిరూపించి ఉరి కంభం ఎక్కించేందుకు చాలా ఏళ్ళ సమయం పడుతుంది. అంతే కాదు ఆ ప్రక్రియలో భారత ప్రభుత్వానికి అనేక కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది. అజ్మల్ కసాబ్ ని పట్టుకొన్నప్పతి నుండి అతనిని ఉరి తీసే వరకు అతని రక్షణ, ఆరోగ్యం, కోర్టు కేసు నడిపించడానికి, అతనికి వ్యతిరేకంగా శాఖ్యాలను సేకరించడానికి, అతని వయసు, ప్రాంతం వగైరా నిర్ధారణకి భారతప్రభుత్వం సుమారు రూ.100 కోట్లు పైనే ఖర్చు చేయవలసి వచ్చిందని వార్తలు వచ్చాయి. కనుక ఇప్పుడు ఈ ఉస్మాన్ ఖాన్ కోసం మరో రూ.100 కోట్లు సిద్దంగా ఉంచుకోవాలేమో?

గుంటూరు కాలేజీ విద్యార్ధిని ఆత్మహత్య

  ఒకవైపు నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్ విద్యార్ధి రిషితేశ్వరి ఆత్మహత్యపై విచారణ జరుగుతున్నా సమయంలోనే గుంటూరు పుల్లడిగుంటలో గల ఓ ఇంజనీరింగ్ కాలేజీలో మళ్ళీ అటువంటి సంఘటనే జరిగింది. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్ధిని సునీత కళాశాల భవనం పనుంచి దూకి ఆత్మహత్య చేసుకొంది. ఈ సంగతి తెలుసుకొన్న పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. సునీత ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియవలసి ఉంది.   ఆమె ఫైనల్ ఇయర్ విద్యార్ధిని అయినందున ర్యాగింగ్ జరిగే అవకాశం ఉండదు కనుక వేరే ఇతర కారణాలు ఏమయినా ఉండి ఉండవచ్చును. ర్యాగింగ్ తరువాత విద్యార్ధుల జీవితాలను ఎక్కువగా బలి తీసుకొంటున్నది ఒత్తిడి లేదా ప్రేమలు. చాలా కాలేజీలు తమ సంస్థకు ఇంకా మంచి పేరు వచ్చేందుకు తమ విద్యార్ధులు పరీక్షలలో చాలా ఎక్కువ మార్కులు సాధించాలనే ఆలోచనతో వారిని విపరీతమయిన ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ముఖ్యంగా చదువలలో బాగా రానిస్తున్నవారు, అస్సలు చదవలేకపోతున్న విద్యార్దులపై ఈ ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. సునిత్ ఫైనల్ ఇయర్ విద్యార్ధిని కనుక ఆమె కూడా అటువంటి ఒత్తిడికి గురయి ఉండే అవకాశం ఉంది. ఇక ప్రేమ విఫలం కారణంగా కూడా విద్యార్ధులు తమ జీవితాలను బలి చేసుకొంటున్నారు. సునీత ఆత్మహత్యకి కారణం ఏమిటో పోలీసుల దర్యాప్తులో తేలవలసి ఉంది.

న్యాయవ్యవస్థలను ప్రజా ప్రతినిధులే అనుమానించి, అవమానిస్తే...

  హైకోర్టు విభజనపై తెరాస ఎంపీ వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మన న్యాయవ్యవస్థలనే ప్రశ్నిస్తున్నట్లుంది. హైకోర్టు విభజనపై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పునే అయన తప్పు పట్టారు. హైకోర్టు తన పరిధిని అతిక్రమించి తీర్పు ఇచ్చిందని ఆయన అన్నారు. విభజన చట్టంలో సెక్షన్:31 ప్రకారం రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఉండాలని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, హైకోర్టు మాత్రం అందుకు విరుద్దంగా తీర్పు చెప్పిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఉన్న ఉమ్మడి హైకోర్టును విభజించి హైదరాబాద్ లో తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేరేగా హైకోర్టు ఏర్పాటు చేయదలచుకొంటే హైకోర్టుకి ఎందుకు అభ్యంతరం? అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ, సచివాలయం, ముఖ్యమంత్రుల కార్యాలయాలు వగైరా అన్నిటినీ విభజించుకొన్నప్పుడు హైకోర్టుని విభజించడానికి ఎందుకు అభ్యంతరం చెప్పాలి? అని ఆయన ప్రశ్నించారు.   సుప్రీం కోర్టులో కొందరు న్యాయమూర్తులకు తీర్పులు వ్రాయడం కూడా చేతకాదని నేషనల్ జ్యూడిషియల్ కమీషన్ విచారణ సందర్భంగా కొందరు న్యాయవాదులు వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చని వినోద్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయపాలనపై తన పట్టుకోల్పోకూడదనే ఆలోచనతో ఉద్దేశ్యపూర్వకంగానే హైకోర్టు విభజన జరగకుండా జాప్యం చేస్తున్నారని వినోద్ ఆరోపించారు.   కానీ వినోద్ చేసిన ఈ ఆరోపణలన్నీ మన న్యాయవ్యవస్థను అనుమానిస్తున్నట్లుగా, అవమానిస్తున్నట్లుగా ఉన్నాయని చెప్పకతప్పదు. జ్యూడిషియల్ కమీషన్ పేరు చెప్పి న్యాయమూర్తులకు తీర్పు ప్రతిని వ్రాయడం కూడా రాదని చెప్పడం మన న్యాయవ్యవస్థలను, న్యాయమూర్తులను అవమానించడమే. హైకోర్టు విభజనపై ఉమ్మడి హైకోర్టు తీర్పుని ప్రశ్నించడం కూడా అటువంటి చర్యేనని చెప్పక తప్పదు.   హైకోర్టులు, సుప్రీంకోర్టు మన చట్టాలలో రాజ్యాంగంలో ఉన్న నియమ నిబంధనలకి అనుగుణంగా మాత్రమే తీర్పులు చెపుతాయి తప్ప కులం, మతం, జాతి, ప్రాంతీయవాదం, భావోద్వేగాలు వంటి అంశాలకు లోబడి పనిచేయవు. అవి చట్టాలకు, రాజ్యాంగానికి భాష్యం చెప్పే హక్కు కలిగి ఉన్నాయి. అదేవిధంగా వాటిని పరిరక్షించే బాధ్యత కూడా కలిగి ఉన్నాయి.   విభజన చట్టంలో సెక్షన్: 31లో రెండు రాష్ట్రాలకు హైకోర్టులు ఉండాలని వ్రాసున్న మాట నిజమే. ఒకవేళ వ్రాయకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన హైకోర్టుని ఏర్పాటు చేసుకోక తప్పదు. కానీ ఆ చట్టం ప్రకారం ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉంది కానీ ప్రస్తుతం ఉన్న ఉమ్మడి హైకోర్టుని విభజించి తెలంగాణా రాష్ట్రంలో రెండు హైకోర్టులను ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొనబడలేదు. అటువంటప్పుడు హైకోర్టు ఏర్పాటుకి తెలంగాణా ప్రభుత్వం హైదరాబాద్ లో బిల్డింగ్స్ కేటాయించినంత మాత్రాన్న హైకోర్టు విభజించి మరొకటి ఏర్పాటు చేస్తే అది చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. అందుకే హైకోర్టు విభజన చేసి హైదరాబాద్ లో మరో హైకోర్టు ఏర్పాటు సాధ్యం కాదని తీర్పు చెప్పింది. అది నూటికి నూరు శాతం చాలా ఖచ్చితమయిన తీర్పు. అందుకే సుప్రీంకోర్టు ఆ తీర్పుని కొట్టివేయలేకపోయింది. ఈ సాంకేతిక అవరోధం కారణంగానే కేంద్రప్రభుత్వం కూడా అడుగు ముందుకు వేయలేకపోయింది.   ఇవన్నీ తెరాస ఎంపీ వినోద్ కుమార్ కి తెలియవని భావించలేము. అయినప్పటికీ ఆయన సెక్షన్: 31కి స్వంత భాష్యాలు చెపుతూ హైకోర్టు తీర్పునే ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు విభజనపై ఉమ్మడి హైకోర్టు తన తీర్పు చెపుతున్న సమయంలో ఒక మంచి సూచన కూడా చేసింది. కానీ దానిని ఆయన పట్టించుకోలేదు. విభజన చట్టంలోని సెక్షన్: 31కి పార్లమెంటులో చట్ట సవరణలు చేసినట్లయితే, ఉమ్మడి హైకోర్టుని విభజించి హైదరాబాద్ లో తెలంగాణాకు లేదా ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేసుకోవచ్చని ఆనాడే చెప్పింది. కానీ చట్ట సవరణ చేయడం కష్టమని భావించడం వలననో లేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఈ కారణంతో విమర్శించవచ్చనే ఆలోచనతోనో తెరాస ప్రభుత్వం చట్ట సవరణకు ఒత్తిడి చేయడం లేదు. పైగా న్యాయవ్యవస్థలపై చంద్రబాబు నాయుడు తన పట్టు కోల్పోకూడదనే ఉద్దేశ్యంతోనే విభజన జరగకుండా అడ్డుపడుతున్నారనే మరొక భయంకరమయిన ఆరోపణ చేసి, న్యాయవ్యవస్థలు రాజకీయ నేతల, ప్రభుత్వాల కనుసైగలలోనే పనిచేస్తుంటాయనే అపవాదు కూడా మోపారు.   న్యాయవ్యవస్థల మీద ప్రజా ప్రతినిధులే ఇంత నీచమయిన అభిప్రాయం కలిగి ఉంటే ఇక సామాన్య ప్రజలకి వాటిపై విశ్వాసం కలిగిఉంటారా? ప్రభుత్వ వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు అన్నీ తమకు అనుకూలంగా వ్యవహరిస్తేనే వాటిని మన్నిస్తాము లేకుంటే ప్రశ్నిస్తాము? అనే ఇటువంటి ధోరణి మంచి పద్ధతి కాదు.

ఆ ఇద్దరు హైదరాబాద్ వాసులు క్షేమంగా ఉన్నారు

  చేతికి చిక్కిన మనుషులను కోళ్ళు, మేకలను కోసినట్లు కోసి చంపే ఐ.యస్.ఐ.యస్. (ఐసిస్) ఉగ్రవాదుల చేతిలో నుండి క్షేమంగా బయటపడిన కర్నాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్ కుమార్ ఇద్దరూ కూడా మృత్యుంజయులేనని చెప్పక తప్పదు. వారిరువురూ ఈ రోజు హైదరాబాద్ విమానాశ్రయం చేరుకొన్నారు. ఇంకా ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న ఇద్దరు హైదరాబాద్ వాసులు గోపీ కృష్ణ, బలరామ్ కూడా క్షేమంగా ఉన్నారని, వారు ఉపాద్యాయులని తెలియడంతో ఐసిస్ ఉగ్రవాదులు తమని చాలా మర్యాదగా చూసుకొన్నారని, తాము హైదరబాద్ చేరుకోగానే ఆ విషయం ఫోన్ ద్వారా వారికి తెలియజేయగానే మిగిలిన ఇద్దరినీ కూడా క్షేమంగా విడుదల చేస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలిపారు. వారిరువురూ చెప్పిన ఈ చల్లటి వార్త విని బలరాం, గోపీకృష్ణ కుటుంబ సభ్యులు కొంత ఉపశమనం పొందారు.   తమని పొరపాటున కిడ్నాప్ చేసినట్లు ఐసిస్ ఉగ్రవాదుల నాయకుడే తమకు చెప్పాడని, కనుక వారికి ఎటువంటి హానీ తలపెట్టబోమని హామీ ఇచ్చినట్లు వారిరువురూ తెలిపారు. బహుశః మరికొన్ని గంటలలోనే ఐసిస్ ఉగ్రవాదులు మిగిలిన ఇద్దరు బందీలని విడిచిపెట్టే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. తమను కిడ్నాప్ చేసిన ఐసిస్ ఉగ్రవాదులు అందరూ 16-18ఏళ్ల లోపు వయసున్నవారేనని వారు తెలిపారు. ఐసిస్ ఉగ్రవాదులకు ఉపాద్యాయుల పట్ల గౌరవం ఉండటం వారి చేతిలో బందీలుగా చిక్కి బయటపడిన వారి అదృష్టమేనని చెప్పక తప్పదు. ఈ రోజు రాత్రికయినా మిగిలిన ఇద్దరు ఉపాద్యాయులను కూడా వారు విడిచిపెడితే చాలని అందరూ భగవంతుడిని ప్రార్ధిస్తున్నారు.

మానవ హక్కులను ఆశ్రయించిన ఉదయ్ సింహా

  తెలంగాణాలో తెదేపాను, ఆ పార్టీకి బలమయిన నేతగా ఎదుగుతున్న రేవంత్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతోనే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రపన్ని రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టి స్టింగ్ ఆపరేషన్ ద్వారా అతనిని ఓటుకి నోటు కేసులో ఇరికించారని తెదేపా నేతలు ఆరోపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ కేసు ఆధారంగా రేవంత్ రెడ్డితో సహా అనేకమంది తెదేపా నేతలను విచారించారు. ఈ కేసు విషయంలో వారు విచారణ దర్యాప్తు ఎప్పటికి పూర్తి చేస్తారో...అసలు పూర్తి చేస్తారో లేదో...కూడా ఎవరికీ తెలియదు.   రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహా, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలను జైలులో ఉంచి ఏసిబి అధికారులు అడగవలసినవన్నీ అడిగారు. కానీ విచారణ పేరిట ఏసిబి అధికారులు తనను వేదిస్తున్నారని ఆ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ సింహా ఈ రోజు మానవ హక్కుల సంఘానికి పిర్యాదు చేసారు. దీనిపై స్పందించిన మానవ హక్కుల సంఘం ఈనెల 13లోగా తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏసిబి అధికారులను ఆదేశించింది.   తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలలో ఇటువంటి వికృత క్రీడలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జయలలిత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి దానికే చాలాసార్లు బలయ్యారు. తెలంగాణాలో తెరాస ఇప్పుడు అధికారంలో ఉంది కనుక తన వంతు ఆట ఆడుతోంది. కానీ రేపు ప్రభుత్వం మారితే అప్పుడు ఆ పార్టీ కూడా తన వంతు ఆట ఆడకుండా ఉండబోదు. అప్పుడు తెరాస నేతలు దానికి మూల్యం చెల్లించవలసి వస్తే ఆశ్చర్యం ఉండదు. రాజకీయాలు ఒక ఔషదం లాగే వాడుకోవాలి తప్ప దానిని ఆయుధంగా వాడుకొంటే చివరికి దానికి ఇరు పక్షాలు తప్పక మూల్యం చెల్లించవలసి వస్తుందనే సత్యం గ్రహిస్తే ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి వికృత క్రీడలు ఆడేందుకు సాహసించబోదు.

ఎప్పుడు వచ్చామన్నది కాదు ప్రశ్న...

  “ఎప్పుడొచ్చామన్నది కాదు ప్రశ్న...ప్రత్యేకహోదా గురించి మాట్లాడేమా...లేదా? అన్నదే ప్రశ్న” ఇది ఆంధ్ర ప్రదేశ్ రాజకీయలలో లేటెస్ట్ హిట్ డైలాగ్. ఇప్పుడు ప్రత్యేకహోదా గురించి రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ మాట్లాడేస్తున్నాయి. పోట్లాడేస్తున్నాయి. కానీ ఎవరి ఫైటు వాళ్ళదే ఎవరి క్రెడిట్ వాళ్ళదే. ప్రత్యేకహోదా కోసం శివాజీ దీక్ష చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ పరిగెత్తుకురాడు. వైకాపా రాదూ. కాంగ్రెస్ చేస్తున్న దీక్షలకి ధర్నాలకి వైకాపా హాజరు కాదు అండ్ వైస్ వెర్సా. “ఏదో పవన్ కళ్యాణ్ మాట కొట్టేయలేక అతని తుత్తి కోసమే పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశామే తప్ప ప్రత్యేకహోదా వచ్చేస్తుందని కాదని” జేసీ కుండబ్రద్దలు కొట్టారు. ఆ తరువాత ఆయన, రాయపాటి సాంభశివరావు ఇద్దరూ కలిసి ఈ సమస్య పరిష్కారం కావడం లేదనే బాధతో చాలా కుండలు బ్రద్దలు గొట్టారు.   ఇప్పుడు వైకాపా వంతు వచ్చింది. ఈనెల 10న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద జగన్మోహన్ రెడ్డి ధర్నాకు కూర్చోబోతున్నాడు. డిల్లీలో జగన్మోహన్ రెడ్డి చేయబోయే ధర్నా కోసం కనీసం 3,000 మందిని ఇక్కడి నుండి తరలించాలని వైకాపా భావిస్తోంది. అందుకోసం రాష్ట్రంలో అనకాపల్లి, తిరుపతి నుండి రెండు ప్రత్యేకరైళ్ళు ఏర్పాటు చేశామని ఆ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. “కానీ ఏడాదిగా మనమందరం కేంద్రం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నా సాధ్యం కానిది జగన్మోహన్ రెడ్డి రెండు రైళ్ళ నిండా జనాలను వేసుకొని వచ్చి ఒక్క రోజు దీక్ష చేసినంత మాత్రాన్న కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేస్తుందా?” అని తెదేపా ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ దానికి “ఎప్పుడొచ్చామన్నది కాదు ప్రశ్న...ప్రత్యేకహోదా గురించి మాట్లాడేమా...లేదా? అన్నదే ప్రశ్న” అని వైకాపా జవాబు చెపుతుందేమో?

మాజీ ప్రధానిని రోడ్డు మీద నిలబెట్టడం సమంజసమేనా?

  లోక్ సభ నుండి 25 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్, మాజీ కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ తో సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు పార్లమెంటు ఆవరణలో గల గాంధీజీ విగ్రంగా వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేస్తున్నారు. వారికి వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ, జేడీ-యు తదితర పార్టీల సభ్యులు మద్దతు తెలుపుతున్నారు.   పదేళ్ళు ప్రధానిగా దేశాన్ని పాలించిన డా.మన్మోహన్ సింగ్ వంటి వ్యక్తి కూడా ఒక సాధారణ రాజకీయ నాయకుడి స్థాయికి దిగజారిపోయి ఈవిధంగా తన పార్టీ నేతలతో కలిసి నిరసనలు చేప్పట్టడం ఆయన తన స్థాయిని దిగజార్చుకోవడమే అవుతుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాజీ ప్రధాని అంతటి వాడిని ఈవిధంగా రోడ్డు మీద నిలబెట్టడం చాలా శోచనీయం. తమను సభ నుండి సస్పెండ్ చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేయడాన్ని ఎవరూ అభ్యంతరం పెట్టబోరు. కానీ మాజీ ప్రధాని గౌరవానికి భంగం కలిగిస్తూ ఆయనని కూడా తమతో బాటు రోడ్డు మీద నిలబెట్టి తద్వారా ప్రజల సానుభూతి పొందాలని చూడటం కాంగ్రెస్ నీచ ఆలోచనలకు పరాకాష్టగా చెప్పుకోవచ్చును. కానీ అంతటి నిజాయితీపరుడికి కూడా బొగ్గు కుంభకోణం తాలూకు మసి అంటించగలిగినప్పుడు, ఆయనని రోడ్డు మీద నిలబెట్టి సానుభూతి సంపాదించుకొంటే మాత్రం తప్పేమిటి? అని కాంగ్రెస్ అనుకొంటే అసహజమేమీ కాదు.

దానిని కోదండ రామ్ కూడా వ్యతిరేకిస్తున్నారు

  చారిత్రాత్మకమయిన ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేసి దాని స్థానంలో అత్యాధునిక ఆసుపత్రిని నిర్మించాలనే తెలంగణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనలని ప్రతిపక్షాలే కాదు ఉద్యమ సమయంలో ఆయనకి తోడుగా నిలిచి పోరాడిన తెలంగాణా రాజకీయ జేఎసీ నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీ-జేఎసీ చైర్మన్ ప్రొఫెస్సర్ కోదండరాం తదితరులు నిన్న ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు.   తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఉస్మానియా ఆసుపత్రిని ఎప్పటికప్పుడు మరమత్తులు చేయకపోవడం వలననే భవనాలు కొంతమేర పాడయ్యాయి తప్ప పూర్తిగా శిధిలమయిపోలేదు. ఈ భవనాలకు మరమత్తులు చేయించాలనే శ్రద్ధ ప్రభుత్వానికి కోరవడినందునే ఈ దుస్థితికి చేరుకొన్నాయి. ఇప్పటికయినా ప్రభుత్వం ఉస్మానియా భవనాలను మరమత్తులు చేయించి వాటిని కాపాడుకోవాలి,” అని అన్నారు.   ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేయవద్దని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కి నేరుగా చెప్పకపోయినా, ఆయన మాటలకు అర్ధం అదే. కేసీఆర్ తీసుకొన్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ఒక పిటిషను కూడా పడింది. ప్రతిపక్షాలు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు వెళితే దాని వలన సమస్యలను కోరుండి కొని తెచ్చుకొన్నట్లే అవుతుంది. ఇదివరకు సచివాలయం కొత్త భవనం నిర్మాణం కోసం ఎర్రగడ్డ ఆసుపత్రిని, దానిపక్కనే ఉన్న ఒక చారిత్రక కట్టడాన్ని కూల్చివేయాలనుకొన్నప్పుడు కూడా ప్రజలు, ప్రతిపక్షాల నుండి ఇటువంటి నిరసనలే ఎదురయ్యాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన భూములలో పేదవారికి ఇళ్ళను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించినప్పుడు కూడా ఇదే విధంగా నిరసనలు ఎదుర్కొని చివరికి వెనక్కి తగ్గవలసి వచ్చింది. కనుక ఇటువంటి నిర్ణయాలు తీసుకొనే ముందు ప్రతిపక్షాలను, తెలంగాణా పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలనుకొంటున్న టీ-జెఎసి నేతలను కూడా సంప్రదిస్తే ఇటువంటి అవమానకర పరిస్థితులు పునరావృతం కాకుండా నివారించవచ్చునని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

కాంగ్రెస్ మంకు పట్టుకి పార్లమెంటు సమావేశాలు బలి

  పార్లమెంటు సమావేశాలు జరుగకుండా అడ్డుకోవడమే తమ పార్టీ ఈసారి అనుసరించబోయే వ్యూహమని ఆ పార్టీ ఎంపీ శశీ ధరూర్ సమావేశాలు మొదలయిన రోజే మీడియాకి లీక్ చేసి సోనియాగాంధీ చేత చివాట్లు తిన్నారు. ఆ రహస్యం బయటపడిన తరువాతయినా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహం మార్చుకొనే ప్రయత్నం చేయకుండా వ్యాపం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, లలిత్ మోడీ కేసులో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలు రాజీనామా చేసే వరకు ఉభయ సభలను జరగనీయకుండా అడ్డుపడుతోంది. ఈనెల 13తో ఈ పార్లమెంటు సమావేశాలు ముగుస్తాయి. గత రెండు వారాలుగా కాంగ్రెస్ మిత్ర పక్షాలు ఉభయ సభలను నడవనీయకుండా అడ్డుపడుతుండటంతో ఈసారి పార్లమెంటులో ఒక్క బిల్లుపై కూడా చర్చ జరగలేదు. ఆమోదం పొందలేదు. వారు ముగ్గురు రాజీనామా చేస్తేనే సభను సజావుగా నడవనిస్తామని కాంగ్రెస్ వాదిస్తుంటే, సభను నడవనిస్తే వారి ముగ్గురిపై లేవనేతిన అభియోగాలపై చర్చిద్దామని మోడీ ప్రభుత్వం వాదిస్తోంది.   ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి యం. వెంకయ్య నాయుడు ఈరోజు పార్లమెంటు సెంట్రల్ హాల్లో అఖిలపక్ష ఎంపీల సమావేశం నిర్వహించారు. కానీ కాంగ్రెస్ మంకుపట్టు పట్టడంతో ఈ సమావేశంలో ఎటువంటి పరిష్కారం లభించలేదు. కనుక మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల నుండి మొదలయిన పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్ మిత్రపక్షాలు మళ్ళీ ఆందోళనకి ఉపక్రమించాయి. భూసేకరణ బిల్లుకి సవరణలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ మిత్రపక్షాలు ఇదివరకు దానిపై పార్లమెంటులో లోతుగా చర్చించాలని వాదించాయి. కానీ ఇప్పుడు ఏ ఒక్క బిల్లు కూడా ఎటువంటి చర్చా లేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదింపబడే పరిస్థితి ఏర్పడింది.   ఒకవేళ సుష్మ స్వరాజ్, వసుందర రాజే ఇరువురూ కూడా లలిత్ మోడీకి వీసా వచ్చేందుకు సహకరించి ఉండి ఉంటే, అది తప్పే. అదే విధంగా అనేకమంది మృతికి కారణమయిన వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాత్ర ఉంటే ఆయన శిక్షార్హుడే. కానీ వారు రాజినామాల కోసం పట్టుబడుతూ పార్లమెంటును స్తంభిప జేయడం ఇంకా పెద్దతప్పు. బాధ్యతారాహిత్యమే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా తన రాజకీయ ప్రయోజనాల గురించే ఆలోచిస్తుంది తప్ప ప్రజల గురించి, పార్లమెంటులో తన బాధ్యతల గురించి ఆలోచించకపోవడం చాలా శోచనీయం. పైగా తమ డిమాండ్లు నేరవేరుస్తే తప్ప పార్లమెంటుని సజావుగా సాగానీయమని కేంద్రప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడం మరో తప్పు. ప్రజా సమస్యల గురించి చర్చించవలసిన పార్లమెంటులో కూడా కాంగ్రెస్ పార్టీ ఈవిధంగా రాజకీయాలు చేయడాన్ని యావత్ దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తమని ప్రజలు ఎందుకు తిరస్కరించారో ఆత్మవిమర్శ చేసుకొని తమ తప్పులను సరిదిద్దుకొంటామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అసలు అటువంటి ప్రయత్నమేదీ చేయనే లేదని నిరూపిస్తోంది.

ఎమ్మెల్యేగా బాలయ్యకి నూటికి నూరు మార్కులు

  నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లాలో హిందూపురం నుండి అసెంబ్లీకి పోటీ చేస్తున్నప్పుడు తను సినిమాలలో నటిస్తున్నప్పటికీ తన నియోజక వర్గం, జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటానని, తన నియోజకవర్గం, జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేసి జిల్లాలో చిరకాలంగా పేరుకుపోయిన సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే ఆయన తరచూ తన నియోజక వర్గం, జిల్లాలో పర్యటిస్తూ సమస్యలను ఒకటొకటిగా పరిష్కరించుకొంటూ వస్తున్నారు. అంతే కాదు తన నియోజక వర్గంలో తరచూ ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ మూడు నెలలకొకమారు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో తన మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు గురించి తెలుసుకొనేందుకు నివేదికలు తెప్పించుకొని వారి పని తీరుని సమీక్షించి, అవసరమయిన సూచనలు, సలహాలు, పనిచేయని వారికి హెచ్చరికలు, మందలింపులు చేస్తుంటారు. తాజాగా తెప్పించుకొన్న నివేదికలో అనంతపురం జిల్లాలో అందరికంటే బాగా నందమూరి బాలకృష్ణ తన నియోజక వర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొనబడింది. సినిమాలలో క్షణం తీరిక ఉండనప్పటికీ ఆయన తన నియోజకవర్గ ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉంటారని, ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తున్నారని నివేదికలో పేర్కొనబడింది. కనుక జిల్లాలో ఉన్న 12మంది కంటే బాలయ్య బాబే నెంబర్:1స్థానంలో ఉన్నారని తెలిసింది. అటు సినిమాలలో, ఇటు రాజకీయాలలో కూడా ఆయన ఈవిధంగా మంచిపేరు తెచ్చుకోవడం చాలా అభినందనీయం.

హైదరాబాద్ కి ప్రత్యేక గుర్తింపు నిచ్చేవి చారిత్రిక కట్టడాలే!

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొంటున్న నిర్ణయాలు తరచూ వివాదాస్పదం అవుతున్నాయి. ఆ లిస్టు గురించి చెప్పుకొంటే అదొక పెద్ద గ్రంధమే అవుతుందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఆయన తాజా నిర్ణయం ఉస్మానియా ఆసుపత్రినిసి అక్కడి నుండి తరలించి దాని స్థానంలో అత్యాధునిక భవనం నిర్మించడం. చారిత్రాత్మకమయినఉస్మానియా ఆసుపత్రిని కూలద్రోయదాన్ని ప్రతిపక్షాలే కాదు ప్రజలు, పర్యావరణ ప్రేమికులు, చారిత్రిక సంపదలను ప్రేమించేవారు అందరూ కూడా తప్పు పడుతున్నారు.   నిజమే! హైదరాబాద్ కి ఐ.టి. రంగం ఒక సరికొత్త హోదాను, హంగు ఆర్భాటాలను ఇచ్చింది. కానీ అంతకంటే ముందు హైదారాబాద్ అనగానే ఎవరి మదిలోనయినా తప్పకుండా మేదిలేవి చార్మినార్, హైకోర్టు, సాలార్ జంగ్ మ్యూజియం, గోల్కొండ వంటి చారిత్రిక కట్టడాలే!అవి లేని హైదరాబాద్ ని ఊహించుకోవడమే కష్టం. అటువంటి గొప్పగొప్ప చారిత్రిక కట్టడాలు ఏ యూరోపియన్ దేశాలలోనయినా ఉన్నట్లయితే వారు వాటికి మరింత భద్రంగా చూసుకొంటూ వాటికి మరిన్ని హంగులు సమకూర్చి పర్యాటక ఆకర్షణలుగా మలుచుకొనేవారు. కానీ మనకున్న ఇటువంటి గొప్పగొప్ప చారిత్రిక కట్టడాలను మనం కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలు చేప్పట్టకపోగా వాటి స్థానంలో కొత్త భవనాలు కట్టుకోనేందుకు ఉన్నవాటిని కూల్చుకోవడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.   అవి చిరకాలం నిలిచి ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ నగర శివార్లలో ఖాళీ ప్రాంతాలలో అత్యాధునిక మౌలిక సదుపాయాలూ, భవానాలు వగైరా ఏర్పాటు చేసుకొంటూ నగరాన్ని విస్తరించుకొంటే ఎవరూ తప్పు పట్టరు. పైగా దానివలన హైదరాబాద్ నగరం మరింత విస్తరించి సాంప్రదాయ, అత్యాధునిక మేలు కలయికగా మారి యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. కానీ ఈవిధంగా మెట్రో రైల్ నిర్మాణానికి, కొత్తగా అసెంబ్లీ భవనం కోసం, రోడ్లను వెడల్పు చేయడం కోసం చారిత్రాత్మక కట్టడాలను కూల్చుకొంటూ పోతే మన చరిత్రను, మన వారసత్వ సంపదను మనమే ద్వంసం చేసుకొన్నట్లవుతుంది. ఒక చాత్రిక కట్టడాన్ని కూల్చడానికి పెద్ద సమయమేమీ పట్టదు. కానీ మళ్ళీ ఎన్నడూ కూడా అటువంటి గొప్ప కట్టడాలను పునర్నిర్మించుకోలేము. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా యావత్ ప్రపంచం నివ్వేరపోయెంత గొప్ప కట్టడం ఒక్కటీ కూడా మనం నిర్మించుకోలేకపోయామనే వాస్తవం గ్రహించకుండా ఉన్నవాటిని కూడా కూల్చుకోవడం ఎంత అవివేకమో ఆలోచిస్తే అర్ధమవుతుంది. ఉస్మానియా వంటి భవనాలలో ఆసుపత్రిని నిర్వహించడం ఇబ్బందికరం అనుకొంటే వేరే చోట అత్యాధునిక ఆసుపత్రిని నిర్మించి అక్కడికి ఆసుపత్రిని తరలించి, ఉస్మానియా భవనాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవచ్చును. ఇప్పటికయినా ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేయాలనే తన నిర్ణయాన్ని మార్చుకొనకపోతే తను ఆసుపత్రి ప్రాంగణంలోనే దీక్షకు కూర్చొంటానని ఎంపీ హనుమంత రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ప్రత్యేక క్రెడిట్ కోసమే డిల్లీలో దీక్షా?

  రాష్ట్రంలో ఒక్క వైకాపా తప్ప మిగిలిన అన్ని పార్టీలు కూడా ప్రత్యేకహోదా కోసం గట్టిగానే పోరాడుతున్నాయి. దాని గురించి వైకాపా ఎంపీలు పారమేన్తులో పోరాడుతున్నారు కనుక తాము పోరాడవలసిన అవసరం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే ఇదివరకు స్వయంగా చెప్పారు. అయినప్పటికీ వేరే స్థానిక సమస్యలపై దీక్షలు చేస్తున్నప్పుడు, ప్రత్యేకహోదా బ్యానర్ కూడా తగిలించేసి, దాని కోసం కూడా తమ పార్టీ గట్టిగానే పోరాడుతోందని జగన్ సమర్ధించుకొచ్చారు. సోనియా గాంధీ ప్రతీ అంశం మీద స్వయంగా స్పందిస్తారా?అలాగే నేనూ ప్రతీ అంశం మీద స్పందించనవసరం లేదని మంచి పాయింటు కూడా తీసి తనను తాను సమర్ధించుకొన్నారు.   కానీ ప్రత్యేకహోదాపై పోరాడేందుకు జగన్ ఎందుకో భయపడుతున్నట్లుంది అని రాహుల్ గాంధీ విమర్శించేసరికి జగన్మోహన్ రెడ్డికి పౌరుషం వచ్చేసింది. రాష్ట్రంలో కాదు ఏకంగా డిల్లీలోనే జంతర్ మంతర్ దగ్గరే ప్రత్యేకహోదా కోసం దీక్ష చేసేస్తాను అంటూ ఆగస్ట్ 10వ తేదీకి డేట్ కూడా ఫిక్స్ చేసేసారు. ఇంతలోనే ఎంత చేంజి? అని జనాలు కూడా ముక్కున వేలేసుకొంటున్నారు.   సుమారు మూడు నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకహోదా కోసమో లేక తన పార్టీ ఉనికిని చాటుకోవడానికో ఏదో హడావుడి చేస్తూనే ఉంది. వామపక్షాలు కూడా ప్రత్యేకహోదా కోసం బస్సు యాత్రలు చేసేందుకు ఎర్రబస్సులను సిద్దం చేసుకొంటున్నాయి. ఇక అధికార తెదేపా అయితే ప్రతిపక్ష పార్టీలలాగ రోడ్లేక్కి ధర్నాలు, నిరసనలు చేయలేదు కానీ కేంద్రంపై నిరంతర ఒత్తిడి చేస్తూనే ఉంది. మరొక నెలన్నర రోజుల్లో ప్రత్యేకహోదాపై కేంద్రం ప్రకటన చేయవచ్చని కేంద్రమంత్రి సుజనాచౌదరి రెండువారాల క్రితమే ప్రకటించారు. అంటే ఇక నేడో రేపో ప్రత్యేకహోదాపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని అర్ధమవుతోంది.   బహుశః అందుకే అన్ని రాజకీయపార్టీలు తెగ హడావుడి పడిపోతున్నట్లున్నాయి. బహుశః జగన్ మోహన్ రెడ్డి అందుకే ఏకంగా డిల్లీలో దీక్షకి రెడీ అయిపోతున్నారేమో? ఎలాగు కేంద్రం త్వరలో ప్రత్యేకహోదా ఇస్తుంది కనుక అంతకంటే ముందు తను డిల్లీలో, తన పార్టీ రాష్ట్రంలో ధర్నాలు వగైరా చేస్తే తమ పోరాటాలతో కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సాధించామని గొప్పగా చెప్పుకోవచ్చును. ఒకవేళ ఇవ్వకపోయినా దాని కోసం తమ పార్టీ డిల్లీలో కూడా పోరాడిందని చెప్పుకొనే సౌలభ్యం ఉంది. అందుకే ఇంతకాలం ప్రత్యేకహోదా గురించి మాట్లాడని వైకాపా నేతలందరూ అకస్మాత్తుగా నిద్రలో నుండి మేల్కొన్నట్లుగా మేల్కొని మీడియా ముందుకు వచ్చి ప్రత్యేకహోదా గురించి తెగ మాట్లాడేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ది లేనిదే దీక్షలు, యాత్రలు చేయరని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అందుకే అన్నారు. ఆయన మాటలని కొట్టిపారేయలేమనిపిస్తోంది వైకాప హడావుడి చూస్తుంటే!

పాపం... తెలంగాణ కాంగ్రెస్...

  పాపం.. తెలంగాణ కాంగ్రెస్ ఎలా వుండేది ఎలా అయిపోయిందో! ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూస్తుంటే జాలిపడటం మినహా ఏమీ చేయలేని పరిస్థితులున్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేస్తారని ఆశించిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ ప్రజలు పెద్ద షాక్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడి సంవత్సరం దాటినా టీ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ ఆ షాక్ నుంచి తేరుకోలేదు. అసలు ఎందుకు ఇలా జరిగిందో టీ కాంగ్రెస్  నాయకులకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీ ద్వారా బోలెడన్ని పదవులు, ప్రయోజనాలు పొందిన నాయకులు పార్టీ నుంచి మెల్లగా జారుకుంటున్న సమస్య ఒకవైపు వేధిస్తుంటే, పార్టీని సమర్థంగా నడిపే నాయకత్వం లేకపోవడం కూడా తెలంగాణ కాంగ్రెస్‌కి మరో పెద్ద సమస్యగా మారింది. అందువల్లే తెలంగాణ కాంగ్రెస్ ఎందుకూ పనికిరాని విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటూ మరింత పతనం అవుతోంది. షాక్‌ల మీద షాక్‌ల కారణంగా టీ కాంగ్రెస్ నాయకుల మెదళ్ళు మొద్దుబారిపోయాయన్న విషయం వారి ఆలోచనా విధానం చూస్తే అర్థమవుతోంది. వారి పసలేని ఆలోచనల నుంచి ఉద్భవించిన తాజా గొప్ప ఉపాయం... వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌ని పోటీకి నిలపాలని భావిస్తూ వుండటం. పార్లమెంటు తలుపులు మూసేసి, టీవీ ప్రత్యక్ష ప్రసారాలు ఆపేసి తెలంగాణ బిల్లు ఆమోదించిన తీరు తెలంగాణ ప్రజలకు ఎంతో నచ్చిందట, అందుకే ఆమె వరంగల్‌లో పోటీ చేసే కళ్ళు మూసుకుని ఓట్లు వేసేస్తారట. అంతేకాకుండా ప్రముఖ దళిత నాయకుడు జగ్జీవన్‌రామ్ కుమార్తె కావడం వల్ల వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని దళితులందరూ మీరాకుమార్‌కి ఓట్లు వేసేస్తారట. తెలంగాణ కాంగ్రెస్ మీద టన్నుల కొద్దీ జాలి పడటానికి ఈ ఆలోచనా ధోరణిని గమనిస్తే సరిపోతుంది కదా. తన సొంత రాష్ట్రంలో, తన సొంత నియోజకవర్గంలో గెలవలేని మీరాకుమార్‌ని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని అనుకోవడం ఒక పెద్ద తప్పు. ఇది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజల్ని దారుణంగా అవమానించడమే అవుతుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసలు అభ్యర్థులే లేనట్టు బయటి రాష్ట్రం నుంచి అభ్యర్థిని తీసుకుని వచ్చి నిలబెట్టటమేంటి? తెలంగాణ ఆత్మగౌరవం అంటూ మొన్నటి వరకూ రంకెలు వేసిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎక్కడి నుంచో మీరాకుమార్ని తీసుకొచ్చి వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలని అనుకోవడం ఏమిటి? ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు కాదా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని దళిత నాయకులను అవమానించినట్టు కాదా? ఇప్పటికైనా టీ కాంగ్రెస్ తన ఆలోచనా ధోరణిని మార్చుకుంటే మంచిది.. లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి పట్టిన గతే తెలంగాణలోనూ పట్టడం ఖాయం.

భారత్ పై దాడులకు ఐ.యస్.ఐ.యస్. కుట్రలు?

  ఇదివరకు ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో అల్-కాయిద ఉగ్రవాద సంస్థ యావత్ ప్రపంచాన్నిగడగడలాడించింది. ఆ తరువాత ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ దేశాలలో తాలిబన్లు వరుస బాంబు ప్రేల్లుళ్ళు జరుపుతూ చెలరేగిపోతున్నారు. అగ్నికి వాయువు తోడయినట్లు వారికిప్పుడు కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐ.యస్.ఐ.యస్. తోడయ్యే సూచనలు కనబడుతున్నాయి.   ఇటీవల అమెరికాలో ఒక పాకిస్తానీ వ్యక్తి వద్ద అక్కడి నిఘా వర్గాలు ఉర్దూలో వ్రాయబడిన 32 పేజీల చిన్న పుస్తకాన్ని స్వాధీనం చేసుకొన్నాయి. ఆ లేఖలో వివరాలనీ సేకరించిన ప్రముఖ అమెరికా పత్రిక యు.యస్.ఏ.టుడే నిన్నటి సంచికలో ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాద సంస్థ మున్ముందు భారత్ పై దాడులు చేసేందుకు ప్రణాలికలు రచిస్తున్నట్లు పేర్కొంది. ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు మున్ముందు చాలా భయంకరమయిన దాడులు చేయబోతున్నట్లు ఆ పుస్తకంలో వ్రాసినట్లు ఆ పత్రిక పేర్కొంది. ఈ ప్రపంచంలో ఉన్న ఒక బిలియన్ ముస్లిం ప్రజలందరికీ నాయకులుగా తమను ఉగ్రవాద సంస్థలన్నీ గుర్తించాలని ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు ఆ పుస్తకంలో కోరినట్లు పత్రిక తన కధనంలో పేర్కొంది. తమ పోరాటాన్ని మరింత ఉదృతంగా చేసేందుకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో ఉన్న తాలిబన్లు అందరూ ఏకమవ్వాలని ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు కోరినట్లు ఆ పత్రికలో పేర్కొంది.   అమెరికా నిఘా వర్ఘాలు స్వాధీనం చేసుకొన్న ఆ పుస్తకానికి “ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ధ ఇస్లామిక్ స్టేట్ ఖలీఫా, ద ఖలీఫా ఎకార్డింగ్ టు ప్రోఫెట్” అనే పేరున్నట్లు ఆ పత్రిక పేర్కొంది. ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడులతో సతమతమవుతున్న భారతదేశానికి ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు విసురుతున్న ఈ సవాళ్ళని ఎదుర్కోవడానికి చాలా గట్టి సన్నాహాలు, ప్రయత్నాలు చేయాల్సిఉంటుంది. జమ్మూ లో ఇటీవల కాలంలో తరచూ పాకిస్తాన్, ఐ.యస్.ఐ.యస్. జెండాలు రెపరెపలాడుతున్నాయి. అంటే ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు ఇంచుమించు మన గుమ్మం వద్దకు వచ్చేసినట్లే భావించవచ్చును. కనుక భారత ప్రభుత్వం అటువంటి ప్రయత్నాలను ఉక్కుపాదంతో అణచివేయాలి. లేకుంటే తరువాత చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లే అవుతుంది.

యాకుబ్ ఉరిశిక్షపై సుప్రీం భిన్నాభిప్రాయం!!!

  ముంబై బాంబు ప్రేలుళ్ళలో 250 మంది మరణానికి, 600 మంది గాయపడటానికి కారకుడయిన యాకుబ్ మీమన్ కి ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష వేయగా దానిని సుప్రీంకోర్టు స్వయంగా ఖరారు చేసింది. ఆ తరువాత యాకుబ్ మీమన్ పెట్టుకొన్న క్షమాభిక్ష పిటిషన్ని రాష్ట్రపతి కూడా తిరస్కరించిన తరువాతనే అతనికి ఈనెల 30న ఉరిశిక్ష అమలుచేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. కానీ తను ఖరారు చేసిన శిక్షపై ఇప్పుడు సుప్రీంకోర్టే స్వయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో, యాకుబ్ మీమన్ కి మరణశిక్ష విధించడం అన్యాయమనే వాదనలకు బలం చేకూర్చుతున్నట్లయింది.   యాకుబ్ మీమన్ భార్య పెట్టుకొన్న పిటిషన్ని విచారించిన జస్టీస్ దావే, జస్టిస్ కురియన్ లతో కూడిన ధర్మాసనం యాకుబ్ మీమన్ ఉరిశిక్ష అమలుపై ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఈ కేసును మరొక త్రిసభ్య బెంచీకి బదలాయించింది. కోర్టులు మానవతా దృక్పదంతో వ్యవహరించడం అవసరమే! కానీ వందలమంది ప్రాణాలను బలిగొన్న వారిపట్ల కూడా మానవతా దృక్పదం కనబరుస్తుంటే అది అటువంటి నేరస్తులకు, వారిని సమర్ధించేవారికి చాలా అలుసుగా కనబడుతోంది.   యాకుబ్ మీమన్ ప్రాణాల గురించి అంతగా ఆందోళన చెందుతున్న వారెవరూ కూడా నిన్న పంజాబ్ లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన తొమ్మిదిమంది పోలీసులు, ప్రజల గురించి ఒక్క ముక్క సానుభూతిగా మాట్లాడలేకపోయారు. కనీసం ఉగ్రవాదుల దాడిని కూడా ఖండించాలనుకోలేదు. భద్రతా దళాల చేతిలో నిన్న చనిపోయిన ఉగ్రవాదులు పఠాన్ కోట్-అమ్రిత్ సర్ రైల్వే ట్రాకుపై ఐదు బాంబులను అమర్చారు. ఒకవేళపోలీసులు సకాలంలో వాటిని కనుగొనలేక పోయుంటే ఏమయ్యేదో ఊహించుకొంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. అటువంటి ఉగ్రవాదుల పట్ల కూడా మన న్యాయస్థానాలు మానవతా దృక్పధంతో తీర్పులు పునః సమీక్షించుకోవలసి ఉందా? అనే అంశంపై లోతుగా చర్చ జరగవలసి ఉంది.

నిత్య విద్యార్ధి...గురువు అబ్దుల్ కలాం

  ఒక సామాన్యమయిన మధ్య తరగతి కుటుంబంలో పుట్టినప్పటికీ తన ప్రతిభాపాటవాలతో, అపూర్వమయిన మేధస్సుతో యావత్ ప్రపంచం చేత జేజేలు పలికించుకొన్న వ్యక్తి అబ్దుల్ కలాం. ఒక సైంటిస్ట్ రాష్ట్రపతి వంటి అత్యున్నతమయిన పదవిని చేప్పట్టడం, దానికీ తన అపూర్వమయిన వ్యక్తిత్వంతో కొత్త వన్నెలు అద్దడం బహుశః ఎక్కడా కనీవినీ ఉండము. భారతదేశాన్ని ఎందరో మహానుభావులు, హేమాహేమీలు పరిపాలించారు. ప్రజలకు మార్గదర్శనం చేసారు. వర్తమాన రాజకీయ పరిస్థితులలో మాత్రం అబ్దుల్ కలాం అంత ప్రభావం చూపిన వ్యక్తి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లల నుండి మేధావుల వరకు అందరూ కూడా ఆయనని ఆత్మీయుడు, మార్గదర్శిగానే భావిస్తారు. అయినప్పటికీ ఆయన తను నిత్య విద్యార్ధినేనని వినయంగా చెప్పుకొనేవారు. చెప్పుకోవడమే కాకుండా తనతో మాట్లాడే చిన్నారుల నుండి మేధావుల వరకు అందరి దగ్గర నుండి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకొనే ప్రయత్నం చేసేవారు. అందుకే ఆయనని అందరూ ఆత్మీయుడుగా భావిస్తారు.