Read more!

రాక్షస స్త్రీల గురించి సీతమ్మ చెప్పిన మాటలు!

 

రాక్షస స్త్రీల గురించి సీతమ్మ చెప్పిన మాటలు!

సీతమ్మను కలిసిన హనుమంతుడు సీతమ్మతో  "అమ్మ! నువ్వు నా గురించి ఇన్ని మాటలు చెప్పి, నాకు ఇవ్వడానికి నీ దగ్గర గొప్ప వస్తువు లేదన్నావు కదా. నేనొక వరం అడుగుతాను ఇస్తావ తల్లి అని, "ఇంతకముందు వచ్చినప్పుడు శింశుపా వృక్షం మీద కూర్చుని చూశానమ్మా, ఈ రాక్షస స్త్రీలందరూ నీ గురించి ఎన్ని మాటలు మాట్లాడారు. నువ్వు బ్రతికుండగా నిన్ను వాటాలు వేసుకున్నారు. 'నిన్ను అనుమతించాను హనుమ' అని ఒక్కమాట అను, నేను వాళ్ళని గోళ్ళతో గిల్లేస్తాను, మోకాళ్ళతో గుద్దేస్తాను, కొంతమందికి పళ్ళు పీకేస్తాను, కొంతమంది జుట్టు పీకేస్తాను, కొంతమందిని గుద్దేస్తాను" అన్నాడు.

అప్పుడు సీతమ్మ "హనుమ! వారు దాసీజనం, ప్రభువు ఎలా చెయ్యమంటే వారు అలా చేస్తారు. దోషం వాళ్ళది కాదు, దోషం ప్రభువుది. ఏ దోషం వాళ్ళయందు ఉందని వాళ్ళని చంపేస్తావు. నీ ప్రభువు చెబితే నువ్వు చేసినట్టు, వాళ్ళ ప్రభువు చెప్పినట్టు వారు చేశారు. ప్రభుభక్తి విషయంలో నువ్వు ఎటువంటివాడివో వారు కూడా అటువంటివాళ్ళే. గతంలో నేను చేసిన పాపం ఏదో ఉంది, ఆ పాపానికి ఫలితంగా ఇన్ని కష్టాలు పడ్డాను.

పూర్వకాలంలో ఒక వేటగాడు అడవిలో వెళ్ళిపోతుంటే ఒక పెద్ద పులి అతనిని తరుముకొచ్చింది. అప్పుడా వేటగాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు ఎక్కాడు. తీరా చెట్టు మీదకి ఎక్కి చూస్తే అక్కడ ఒక భల్లూకం పడుకొని ఉంది. ఆ వేటగాడు పైకి వెళితే భల్లూకం తినేస్తుంది. కిందకి వెళితే పులి తినేస్తుంది.

ఈ స్థితిలో పులి భల్లూకంతో "వాడు మనిషి. మనిద్దరమూ క్రూర జంతువులము, మనిద్దరిది ఒక జాతి, వాడిది ఒక జాతి, కాబట్టి వాడిని కిందకి తోసేయ్యి" అనింది..

అప్పుడా భల్లూకం వాడు తెలిసో తెలియకో ఆర్తితో పరుగు పరుగున నేనున్న చెట్టు ఎక్కాడు. అందుకని వాడు నన్ను శరణాగతి చేసినట్టు. వాడు నాకు అతిథి. కాబట్టి నేను వాడిని తొయ్యను, నేను వాడికి ఆతిధ్యం ఇస్తున్నాను' అనింది.

ఆ పెద్ద పులి అలా చెట్టు కిందనే ఉంది. కొంతసేపయ్యాక భల్లూకం వేటగాడితో నాకూ పెద్ద పులి చేత ప్రమాదమే. నాకు నిద్రిస్తోంది, నిద్రిస్తే జారి కిందపడిపోతాను, అందుకని నేను నీ ఒడిలో తల పెట్టుకుని పడుకుంటాను, కొంచెం పడిపోకుండా చూడు" అని చెప్పింది. వేటగాడు "తప్పకుండా పడుకో" అన్నాడు.

ఆ భల్లూకం పడుకున్నాక పెద్ద పులి వేటగాడితో "దానికి నిద్రలేచాక ఆకలి వేస్తుంది. అది సహజంగా క్రూర జంతువు కాబట్టి నిన్ను చంపేసి తింటుంది. అందుకని ఇదే అదును, నువ్వు ఆ భల్లూకాన్ని కిందకి తోసేయ్యి. అప్పుడు నేను ఆ భల్లూకాన్ని తిని వెళ్ళిపోతాను. తరువాత నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు" అనింది.

ఈ మాట వినగానే ఆ వేటగాడు నిద్రపోతున్న భల్లూకాన్ని కిందకి తోసేశాడు. ఆ భల్లూకం కిందకి పడిపోతూ పడిపోతూ ఒక చెట్టుకొమ్మని పట్టుకొని పైకి ఎక్కింది. అప్పుడా పులి "చూశావ, నిద్రపోతున్న నిన్ను వాడు కిందకి తోసేశాడు, ఎప్పటికైనా మనిషి మనిషే, మనం మనమే. అందుకని వాడిని కిందకి తోసేయ్యి' అని చెప్పింది.

భల్లూకం పులితో "అపకారం చేసినవాడే అయినా, వాడు నా ఇంటికి వచ్చాడు కాబట్టి, అపకారికి కూడా ప్రయత్నపూర్వకంగా అపకారము చెయ్యకూడదు కాబట్టి నేను ఆ వేటగాడిని తొయ్యను" అని  చెప్పింది. 

కాబట్టి హనుమా నేను మనుష్య స్త్రీగా పుట్టి, క్షత్రియ కాంతనై, రాముడికి ఇల్లాలినై ఆ రాక్షస స్త్రీలని చంపిస్తే నేను ఉత్తమ కులాంగనను అవుతాన. చెడ్డగా ఎవడున్నాడో, ఎవడు పాడయిపోయాడో వాడి మీద దయ ఉండాలి. ఈ రాక్షస స్త్రీలు చెయ్యకూడని పనులు చేశారు, వీళ్ళ మీద కదా నేను దయతో ఉండాలి. వీళ్ళందరికి నా రక్ష ఉంటుంది" అని చెప్పింది.

                                       ◆నిశ్శబ్ద.