కూటమి ఐక్యత విచ్ఛిన్నానికి వైసీపీ కుట్రలు.. ఒక్క పదంతో విచ్ఛిన్నం చేసిన లోకేష్!
కూటమి ఐక్యత విచ్ఛిన్నానికి వైసీపీ కుట్రలు.. ఒక్క పదంతో విచ్ఛిన్నం చేసిన లోకేష్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు అధికార తెలుగుదేశం కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య బంధం ఎంత పటిష్ఠంగా ఉందో చెప్పకనే చెబుతున్నాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మధ్య పెనవేసుకున్న అన్నా తమ్ముళ్ల బంధం కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేస్తున్నది. జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య విభేదాలు సృష్టించి, నాయకుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందన్న పొలిటికల్ ఎట్మాస్మఫియర్ క్రియేట్ చేయడానికి వైసీపీ చేస్తున్నప్రయత్నాలను పవన్, లోకేష్ సమర్ధంగా తిప్పికొట్టడానికి నారా లోకేష్ అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానం ఊతంగా నిలిచింది. వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా లోకేష్, పవన్ కళ్యాణ్ మధ్య పోటీ ఉందన్న ప్రచాన్ని విస్తృతంగా, నిరంతరాయంగా కొనసాగిస్తూ వస్తోంది. ముఖ్యంగా పాలనా విషయాల్లో పవన్ కళ్యాణ్‌ను తోసి రాజని.. లోకేష్ ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతున్నారంటూ ఊదరగొడుతోంది. ఆ మేరకు వైసీపీ సోషల్ మీడియా వింగ్, ఆ పార్టీ అనుకూల మీడియా కథనాలను వండి వారుస్తోంది. అసందర్భంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు తర్వాతి స్థానం ఎవరిదన్న చర్చను లేవనెత్తుతో.. జనసేన శ్రేణుల్లో అనుమానాలు రేకెత్తించేందుకు శతధా ప్రయత్నిస్తున్నది. అయితే.. వైసీపీ వ్యూహాన్ని మంత్రి నారా లోకేష్ సమర్ధంగా, వ్యూహాత్మకంగా తిప్పికొడుతున్నారు. మీడియా సమావేశాల్లో, బహిరంగ సభల్లో, సోషల్ మీడియా వేదకగా షేర్ చేసే పోస్టుల్లో.. లోకేష్ పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చిన ప్రతి సారీ పవనన్నా అంటూ ఆత్మీయ సంబోధన చేస్తున్నారు. ఇది కేవలం ఒక మాట వరసకు అన్న పదంగా కాకుండా, కూటమి ఐక్యతను దెబ్బతీయాలనుకున్న ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తున్న పొలిటికల్ స్ట్రోక్ గా, స్ట్రాటజీగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. తుత్తునియలు చేసిన ఒక పక్కా పొలిటికల్ మాస్టర్‌స్ట్రోక్. ప్రతివేదికపైనా లోకేష్ పవనన్నా అంటూ పదే పదే సంబోధించడం ద్వారా.. జనసేన శ్రేణులకు, అలాగే టీడీపీ వర్గాలకు తెలుగుదేశం, జనసేన నాయకుల మధ్య విభేదాలు లేవనీ, అన్నదమ్ముళ్లలా కలిసి మెలిసి ఉంటున్నామన్న బలమైన సందేశాన్ని ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు ఇచ్చే గౌరవంలో గానీ, హోదాలో గానీ తగ్గేదే లే అన్న విస్పష్ట సందేశం ద్వారా నారా లోకేష్ వైసీపీ కూటమి పార్టీల మధ్య విభేదాలంటూ చేస్తున్న ప్రచారాన్ని పూర్వపక్షం చేయగలుగుతున్నారు. లోకేష్ పవన్ కల్యాణ్ కు ఇస్తున్న గౌరవం, ఆయన పట్ల చూపుతున్న అభిమానం జనసేన శ్రేణుల్లో కూడా కూటమి ఐక్యతపై విశ్వాసాన్ని పెంపొందేలా చేస్తున్నది. పవన్ కళ్యాణ్, లోకేష్ కలివిడి తనం, పరస్పర అభిమానంతో కలిసి మెలిసి పని చేస్తుంటే.. రాష్ట్రాభివృద్ధి పరుగులు పెడుతుందన్న అభిప్రాయం జనబాహుల్యంలోనూ బలంగా వ్యక్తమౌతోంది. దీంతో వైసీపీ విభజించు, పాలించు సూత్రం ఇసుమంతైనా పని చేయడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నారా లోకేష్ చూపుతున్న రాజకీయ పరిణతి ఆయనలోని నాయకత్వ లక్షణాలను ప్రస్ఫుటం చేసిందంటున్నారు. ఒకవైపు ఐటీ, విద్యా శాఖల మంత్రిగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను, కీలక పరిశ్రమలనూ ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్న లోకేష్ అదే సమయంలో.. ప్రత్యర్థుల రాజకీయ కుట్రలు, వ్యూహాలను సమర్ధంగా తిప్పికొడుతున్నారు. పవన్ అన్నా అ సంబోధనతో.. కూటమిలో విభేదాలు, కూటమి విచ్ఛిన్నం అంటూ వైసీపీ కంటున్న కలలను కల్లలు చేయగలుగుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Nara Lokesh Strengthes kutami unity, Pawan Kalyan, Pawan Anna Strategy, AP Politics, TDP Janasena Alliance

Publish Date: Aug 6, 2026 3:45PM
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ పొలిటీషియన్ గా నిలదొక్కుకునేనా?
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ పొలిటీషియన్ గా నిలదొక్కుకునేనా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. దేశ రాజకీయాలలో గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్ సొంత రాష్ట్రంలో సొంత పార్టీ పెట్టి బొక్కబోర్లా పడ్డారు. జన సురాజ్ పార్టీని స్థాపించి.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాలలోనూ అభ్యర్థులను నిలబెట్టారు. కానీ ఒక్క స్థానంలో కూడా జనసురాజ్ అభ్యర్థి విజయం సాధింలేదు సరికదా, కనీసం డిపాజిట్ కూడా దక్కనంత ఘోరంగా ఆ పార్టీ అభ్యర్థులంతా పరాజయం పాలయ్యారు. దీంతో తొలి అడుగులోనే ప్రశాంత్ కిశోర్ జనసూరజ్ పార్టీకి నూకలు చెల్లిపోయాయన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. ప్రశాంత్ కిశోర్ మళ్లీ ఎన్నికల వ్యూహకర్తగా కెరీర్ ను కొనసాగించక తప్పదన్న విశ్లేషణలు జోరందుకున్నాయి. అయితే ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ సారి ఇంట గెలవాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగారు. ఎందరో నేతలను అధికార పీఠంపై కూర్చోబెట్టగలిగిన తాను బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా సత్తా చాటి.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో... బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలోకి దిగి దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయం నిస్సందేహంగా ప్రత్యేకమైనది ఎందుకంటే.. ప్రశాంత్ కిశోర్ పోటీ చేసి గెలిచిన బంకీపూర్ నియోజకవర్గం బీజేపీకి పెట్టని కోట లాంటిది. అదీకాక.. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నితిన్ నబిన్ రాజీనామా చేయడంతో.. ఖాళీ అయిన ఈ స్థానం నుంచి ప్రశాంత్ కిషోర్ విజయాన్ని పరిశీలకులు బీహార్ రాజకీయాల్లో ఒక నూతన శకానికి నాందిగా అభివర్ణిస్తూ విశ్లేషణలు చేస్తున్నారు. ఎందుకంటే.. సాధారణంగా ఉప ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి విజయం నల్లేరు మీద బండి నడక. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంటే.. ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థికి జనం ఓటు వేస్తారు. అయితే బంకీపూర్ ఉప ఎన్నికలో అందుకు భిన్నంగా.. బీజేపీ, ఆర్జేడీలను జనం ఏకకాలంలో తిరస్కరించి.. ప్రశాంత్ కిశోర్ కు జై కొట్టారు. ఈ తీర్పు కేవలం ప్రధాన పార్టీలను తిరస్కరించడంగానే కాకుండా.. తమ సమస్యల కోసం నిలబడతారన్న నమ్మకాన్ని ప్రశాంత్ కిశోర్ పై జనం ఉంచారనడానికి తార్కానంగా చూడాలంటున్నారు పరిశీలకులు. ఈ కారణంగానే బంకీపూర్ లో ప్రశాంత్ కిశోర్ సాధించిన విజయం ప్రత్యేకమైనది. శాసనసభలో తన జన సురాజ్ పార్టీ తరఫున ఏకైక ప్రతినిధిగా అడుగుపెడుతున్న ప్రశాంత్ కిశోర్ సభలో తన గళం ఎలా వినిపిస్తారు? అన్న దానిపైనే రాష్ట్రంలో జనసురాజ్ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది. రానున్న నాలుగేళ్లూ.. పీకేకీ, జనసురాజ్ పార్టీకి అత్యంత కీలకమైనవనడంలో సందేహం లేదు. అసెంబ్లీలో ప్రజల గొంతుక వినిపించడమే కాకుండా.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ పైనే ఆయన రాజకీయ భవిష్యత్, జనసురాజ్ భవిష్యత్ ఆధారపడి ఉంది. rashant Kishor victory, Jan Suraaj party Bihar, Bankipur assembly by-election, Prashant Kishor MLA win, Bihar political updates, Prashant Kishor strategy

Publish Date: Aug 5, 2026 12:39PM
కాషాయ పార్టీకి వార్నింగ్ బెల్స్.!
కాషాయ పార్టీకి వార్నింగ్ బెల్స్.!

బీజేపీకి వార్నింగ్ బెల్స్ మోగాయి. సోమవారం (ఆగస్టు 3) వెలువడిన మూడు ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోతోందన్న సంకేతాలు ఇచ్చాయి. ఈ మూడు ఉప ఎన్నికలలో రెండింటిలో బీజేపీ పరాజయం పాలైంది. మరీ ముఖ్యంగా బీజేపీకి దశాబ్దాలుగా కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలలో ఆ పార్టీ చతికిల పడటంతో మోడీ, షా మ్యాజిక్ పని చేయడం లేదా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన 8 నెలలకే, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఖాళీ చేసిన సీటును నిలబెట్టుకోవడంలో కమలం పార్టీ విఫలమైంది. ప్రధాని మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. అంటే దాదాపు పుష్కర కాలం తరువాత.. ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనకు తలొగ్గి మెట్టు దిగిన రోజుల వ్యవధిలో.. కమలం పార్టీ కంచుకోట లాంటి నియోజకవర్గాలు బద్దలు కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు ఈ ఫలితాలు నిదర్శనమని అంటున్నారు. నీట్ పేపర్ లీక్ కు జవాబుదారీతనం కోరుతూ జరిగిన విస్తృత నిరసనలు, రామ మందిర నిధుల దుర్వినియోగం, , ఈ20 ఇంధనంపై పెరుగుతున్న ఆగ్రహం వంటి సమస్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఈ సమస్యలకు తోడు, అవినీతి కారణంగా పార్టీలోని కొందరు నాయకులు చట్టపరమైన చిక్కులను ఎదుర్కొంటుండటంతో పార్టీలో గందరగోళం నెలకొంది. ఈ ఉప ఎన్నికలలో ఓటమికి పార్టీ దృక్కోణం నుండి వివిధ రాజకీయ కారణాలను చెప్పుకోవచ్చు కానీ.. పార్టీలకు అతీతంగా.. వివిధ వర్గాల ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న పలు సున్నితమైన సమస్యలను పట్టించుకోని ఫలితమే ఈ ఫలితాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కచ్చితంగా కమలం పార్టీకి డేంజర్ బెల్స్ గానే పరిగణించాల్సి ఉంటుంది. Warning bells to BJP, By Poll, Results, Defeat, Two Seats, Bihar, Madhya Pradesh

Publish Date: Aug 4, 2026 12:40PM
హద్దులు దాటిన పొగడ్తలు.. ఎబ్బెట్టుగా మారిన ప్రసంగాలు.!
హద్దులు దాటిన పొగడ్తలు.. ఎబ్బెట్టుగా మారిన ప్రసంగాలు.!

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆగస్టు 1, 2026 సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా చరిత్రలో నిలిచిపోతుంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజది. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఘనంగా ప్రారంభమైన దినమది. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్ర రూపురేకలు మారిపోతాయని, విమానయాన అనుసంధానత పెరగడంతో పాటు పెద్ద ఎత్తున పెట్టుబడులు, పర్యాటకం, వేలాది కొత్త ఉద్యోగ,ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన అతిపెద్ద మౌలిక వసతుల పురోగతిలో భోగాపురం విమానాశ్రయం ప్రధానమైనదనడంలో ఇసుమంతైనా సందేహానికి తావులేదు. అయితే.. ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేదికపై నుంచి సాగిన ప్రసంగాలు.. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోటీలు పడి మరీ కురిపించిన ప్రశంసలు వర్షం ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు.. జాతీయ స్థాయిలోనూ చర్చకు దారి తీశాయి. సాధారణంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశంసించడం రివాజే. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, సహకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఎంతో దోహదపడతాయి. అయితే భోగాపురం వేదికగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రశంసల హద్దులు దాటిపోయాయన్నది పరిశీలకుల విశ్లేషణ. ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి అందిస్తున్న సేవను కొనియాడుతూ, సభకు హాజరైన వేలాది మంది ప్రజలచేత మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కోరడం ఏ సందేశం ఇస్తోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అభివృద్ధి ప్రాజెక్టుల కంటే మోదీ వ్యక్తి పూజకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చంద్రబాబు తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన భావోద్వేగ ప్రసంగంలో మోడీ వ్యక్తి పూజ ఆకాశమే హద్దుగా సాగిందన్న విమర్శలూ వినవస్తున్నాయి. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత, రైతులు ఆందోళన బాట పట్టిన సమయంలో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికెత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపించడం ఒకింత ఎబ్బెట్టుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రశంసలైనా, విమర్శలైనా సమతుల్యత పాటించినప్పుడే రాణిస్తాయని అంటున్నారు. భోగాపురం విమానాశ్రయం వంటి చారిత్రాత్మక ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి లభించే ఆర్థిక ఉద్దీపన, ఉత్తరాంధ్ర ప్రగతి ప్రాధాన్యతను వివరించి, అందుకు సహకరించిన ప్రధానిని ప్రశంసించి, కృతజ్ణతలు తెలపడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ, రాజును మించి రాజభక్తి అన్నట్లుగా.. మోడీని ప్రశంసించడం కోసమే ఆ సభ అన్నట్లుగా పోటీలు పడి మరీ ప్రసంగించడం.. ప్రజలను సైతం విస్మయపరిచింది. ఆంధ్రప్రదేశ్ లో జనం కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించినా.. రాష్ట్రం వరకూ ప్రధాన పార్టీ తెలుగుదేశం, ఆ తరువాత జనసేనలు ఉంటే.. రాష్ట్రంలో బీజేపీ ఉనికిమాత్రంగానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే భోగాపురం సభ వేదికగా పవన్, చంద్రబాబు ప్రసంగాలు.. పొలిటికల్ గా వారి వారి పార్టీలకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజాబలంతో తాము గెలిచినా.. మోడీ ప్రాపకం లేకుంటే.. తాము చేయగలిగింది శూన్యం అని చెప్పుకున్నట్లుగా ఉందని అంటున్నారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ సభ మోడీకి పంచరత్నాలు చదవడానికే ఏర్పాటు చేశారా అన్న అనుమానం కలిగేలా సాగిందన్న అభిప్రాయం జనబాహుల్యంలో బలంగా వ్యక్తమౌతోంది. Bhogapuram Airport, Narendra Modi, Chandrababu Naidu, Pawan Kalyan, AP Politics, Uttarandhra Development

Publish Date: Aug 3, 2026 11:12AM
కుప్పం ప్రజలకు భువనేశ్వరి భరోసా.!
కుప్పం ప్రజలకు భువనేశ్వరి భరోసా.!

రాష్ట్రంలో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. గత నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పం. అయితే 2019 - 24 మధ్య కాలంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అప్పటి జగన్ ప్రభుత్వం.. కుప్పం నియోజకవర్గంలో పాగా వేసి 2024 ఎన్నికలలో విజయం కోసం వ్యూహాలు రచించింది. ఆ క్రమంలో స్థానిక ఎన్నికలలో తెలుగుదేం పార్టీ పరాజయం పాలయ్యేలా చేసింది. దీంతో అప్రమత్తమైన చంద్రబాబు అప్పట్లో కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించి.. పరిస్థితిని చక్కదిద్దారు. 2024 ఎన్నికలలో కుప్పం నుంచే విజయం సాధించి పట్టు నిలుపుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు. కుప్పం తన తాజా పర్యటనలో భాగంగా భువనేశ్వరి పలు సమావేశాల్లో మాట్లాడుతూ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పించారు. జగన్ హయాంలో జరిగిన ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపు, ప్రాజెక్టుల పురోగతిని దెబ్బతీసిన విధానాలను ఆమె కుప్పం ప్రజల కళ్లకుకట్టినట్లు వివరించారు. జగన్ పాలనలో జరిగిన అక్రమాలను, అన్యాయాలను గుర్తుచేస్తూనే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సాధిస్తున్న అభివృద్ధిని స్పష్టంగా గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న చర్యలను వివరించారు ముఖ్యమంత్రి సతీమణి స్వయంగా క్షేత్రస్థాయికి వచ్చి నియోజకవర్గ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించడం స్థానిక ప్రజలలో, నాయకులలో జోష్ ను నింపింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా యావత్ రాష్ట్ర ప్రగతి కోసం అలుపెరుగకుండా శ్రమిస్తూ.. నియోజకవర్గానికి క్రమం తప్పకుండా రాలేకపోయినప్పటికీ, కుప్పం ప్రజల పట్ల తన బాధ్యతను నెరవేరుస్తున్నారనే భావన భువనేశ్వరి పర్యటనలతో స్థానికుల్లో బలంగా వ్యక్తమవుతోంది. భువనేశ్వరి చొరవతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొనడమే కాకుండా, స్థానిక సమస్యలను నేరుగా సీఎం దృష్టికి నేరుగా తీసుకెడుతున్నారని జనం భావిస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ ఆమె ముందుకు సాగుతున్న తీరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలలో సానుకూలత ఏర్పడేందుకు దోహదపడుతోంది. మొత్తానికి, కుప్పం నియోజకవర్గానికి తన భర్త అందిస్తున్న సుదీర్ఘ సేవలకు మద్దతుగా నారా భువనేశ్వరి తీసుకుంటున్న శ్రద్ధ, చూపిస్తున్న చొరవ రాబోయే రోజుల్లో కుప్పం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనుందనడంలో సందేహం లేదు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేయడం ద్వారా కుప్పం ప్రజలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామనే స్పష్టమైన సంకేతాన్ని నారా కుటుంబం అందించింది. Bhuvaneswari assures the people of Kuppam, Chandrababu Naidu Kuppam Constituency, TDP Kuppam, Andhra Pradesh, TeluguOne News

Publish Date: Jul 30, 2026 2:35PM
నిజమైన పసుపు సైనికుడు పిఠాపురం వర్మ.!
నిజమైన పసుపు సైనికుడు పిఠాపురం వర్మ.!

తెలుగుదేశం పార్టీలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి విదితమే. . బోండా ఉమ వైసీపీ నేత అంబటి రాంబాబుతో వేదికను పంచుకోవడమే కాకుండా, పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఇచ్చిన ఘాటైన సమాధానం పార్టీ అధిష్టానానికి సవాలు విసురుతున్నట్లుగా మారింది. అధికారంలోకి వచ్చి ఇంకా సగం పదవీకాలం కూడా పూర్తి కాకముందే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, అధినాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేయడం సంచలనంగా మారింది. బోండా ఉమ త్వరలోనే వైసీపీ గూటికి చేరతారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అదలా ఉంటే.. బోండా ఉమ వైఖరి వల్ల పార్టీకి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి జరుగుతున్న నష్టాన్ని అడ్డుకుని బోండా ఉమా తీరును గట్టిగా ఖండిచి, విమర్శించాల్సిన తెలుగుదేశం కీలక నేతలు మౌనం వహించారు. పార్టీలో పదవులు అనుభవిస్తున్న వారు, భవిష్యత్తులో మంత్రి పదవులు లేదా ఉన్నత స్థానాలు ఆశిస్తున్న అగ్రనేతలు బొండా ఉమా వ్యాఖ్యలపై స్పందించడం లేదు. అయితే.. పిఠాపురం వర్మ మాత్రం నిజమైన పసుపు సైనికుడిగా బోండా ఉమ తీరును గర్హించారు. ఇటీవల పార్టీ అధిష్టానం తనను పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి నుంచి తొలగించింది. ఆ సమయంలో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ.. బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో కాపు ఉద్యమం వల్లే టీడీడీపీ ఓడిపోయిందన్న ఉమా వ్యాఖ్యలు సరికాదని స్పష్టం చేశారు. జగన్ ఒక్క ఛాన్స్ పిలుపుతోనే ప్రజలకు ఆ పార్టీకి ఓటేశారని.. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి అంటగట్టడం సరికాదని ఉమాకు హితవు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు పెద్ద పీట వేశారని.. రిజర్వేషన్ల అంశం, కాపు కార్పొరేషన్‌కు నిధులు కేటాయింపు, కాపు భవనాల నిర్మాణం, విదేశీ విద్య పథకం, స్వయం ఉపాధి వంటి కార్యక్రమాలను అమలు చేసినది చంద్రబాబునని పిఠాపురం వర్మ పేర్కొన్నారు. 2014 ఎన్నికల సమయంలో కాపుల్ని బీసీల్లో చేరుస్తామని ఇచ్చిన హామీ మేరకు కమిటీని ఏర్పాటు చేసిన సంగతిని వర్మ గుర్తు చేశారు. 2019 నుంచి 2024 వరకూ అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కాపులకు చేసిందేమీ లేదని విమర్శించారు. కూటమి స్థిరత్వం కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం నాయకత్వం కొన్నిసార్లు క్షేత్రస్థాయి లాయలిస్టులను పక్కన పెట్టాల్సి రావచ్చు, కానీ నిజమైన శ్రేయోభిలాషి ఎవరు అనేది బయటపడేది సంక్షోభ సమయంలోనేననీ, ఆ విషయం వర్మ బోండా ఉమాకు ఇచ్చిన కౌంటర్ తో మరోసారి రుజువైందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. SVSN Varma, Pithapuram Varma, Chandrababu Naidu, Bonda Uma, TDP Political News

Publish Date: Jul 28, 2026 11:23AM
బీజేపీ విషయంలో జగన్ ది రాజును మించిన రాజభక్తి.!
బీజేపీ విషయంలో జగన్ ది రాజును మించిన రాజభక్తి.!

నరేంద్ర మోదీ కాక్రోచ్ జనతా పార్టీఆందోళనలతో దిగి వచ్చి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేత రాజీనామా చేయించింది. అయితే ఈ విషయాన్ని వైసీపీ మెడీ సర్కార్ లోని జవాబుదారీ తనానికి నిదర్శనంగా అభివర్ణిస్తున్నది. మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడానికి సాహసించడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వంలో జవాబుదారీతనానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక నిలువెత్తు నిదర్శనంగా జగన్ అభివర్ణించారు. బీజేపీ హార్డ్ కోర్ మద్దతుదారులు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను మోడీ సర్కార్ అక్కౌంటబులిటీకీ, రాజకీయ విలువలకు నిదర్శనంగా చెప్పే సాహసం చేయడం లేదు. కానీ జగన్ మాత్రం మోడీ ప్రసన్నం కోసం.. హద్దులు మించి పొగడ్తలు కురిపిస్తున్నారు. ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామాను ఉదహరిస్తూ.. డీఎస్సీ పరీక్షకు సంబంధించిన అవకతవకలకు నైతిక బాధ్యత వహించి, నారా లోకేష్ రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేయడం విస్మయపరుస్తోంది. నీట్ పేపర్ లీక్ అయింది. డీఎస్పీ విషయంలో లీకేజీ లేదు.. అవకతవకలు జరిగాయని వైసీపీ చేస్తున్న ఆరోపణలు కూడా పూర్తిగా రాజకీయపరమైనవి. . ఆ ఆరోపణలపై వైసీపీకి హైకోర్టులో కూడా చుక్కెదురైంది. డీఎస్సీ ఫలితాలు వెలువడిన తరువాత.. మెరిట్ జాబితాలను ఆన్‌లైన్‌లో ప్రచురించారు. ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని సంబంధిత శాఖ ప్రజలకు వివరించింది. అవకతవకలు, అక్రమాలూ లేవని విస్పష్టంగా నిరూపించింది కూడా. వాస్తవానికి ఏపీ డీఎస్పసీలో అక్రమాలు అంటూ వైసీపీ చేసిన ఆరోపణలలో వీసమెత్తు నిజమున్నా.. హైకోర్టు జోక్యం చేసుకుని ఉండేది. నిజానికి వైసీపీ హయాంలో జరిగిన గ్రామ సచివాలయ పేపర్ లీక్‌లపై నోరెత్తని జగన్.. ఏపీపీఎస్‌సీ కాంట్రాక్టింగ్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పరీక్షలో టాపర్లుగా ఎలా నిలిచారు? ఆన్‌లైన్‌లో మెరిట్ జాబితాను ప్రచురించకుండా మెజారిటీ పోస్టులను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎలా అప్పగించారన్న దానిపై సమాధానం చెప్పాలన్న డిమాండ్ యువత నుంచి వెల్లువెత్తుతోంది. జగన్ తీరు ఆయన విశ్వసనీయతను మరింత ప్రశ్నార్థకం చేస్తోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. YS Jagan Mohan Reddy, Dharmendra Pradhan Resignation, Nara Lokesh, AP DSC Irregularities, TDP vs YSRCP, NEET Paper Leak Controversy

Publish Date: Jul 27, 2026 9:59AM
బొద్దింకల ఆందోళనకు ఆర్ఎస్ఎస్ మద్దతు?
బొద్దింకల ఆందోళనకు ఆర్ఎస్ఎస్ మద్దతు?

విద్యా రంగ ప్రక్షాళన, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఎగసిన యువత, విద్యార్థుల ఉద్యమానికి ఆర్ఎస్ఎస్ మద్దతుగా నిలుస్తున్నదా? కేంద్రంలో మోడీ సర్కార్ విధానాల పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ అసంతృప్తి వ్యక్తమౌతోందా? ఆ కారణంగానే రాత్రికి రాత్రి మోడీ ఓ వీడియో సందేశం ద్వారా నీట్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాల్సి వచ్చిందా అంటే.. జరుగుతున్న పరిణామాలను ఉటంకిస్తూ పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సంఘ్ పరివార్ పెద్దలలో అసహనం, అసంతృప్తి గూడుకట్టుకున్నాయంటున్నారు. ఇందుకు ఉదాహరణగా ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి ఎదిగి, ఇప్పటికీ ఆ సంస్థతో సన్నిహిత సంబంధాలు కలిగిన సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి కాక్రోచ్ ఆందోళనలకు మద్దతుగా బాహాటంగా చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. విద్యార్థుల ఉద్యమం సమజసమేననీ, ఆ ఉద్యమంలో పస ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, వెంటనే వారితో చర్చలు జరపాలని ఆయన మోడీ సర్కార్ కు విస్పష్ట సూచన చేశారు. పార్టీలో సీనియర్ మోస్ట్ నేత, అది కూడా ఆరెస్సెస్ మద్దతు ఉన్న బలమైన నాయకుడు మురళీ మనోహర్ జోషీ బాహాటంగా విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా గళం ఎత్తడమే మోడీ తీరు పట్ల ఆరెస్సెస్ ఆగ్రహంగా ఉందనడానికి నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు సహా పలు కీలక బిల్లుల ఆమోదం పొందాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. కానీ మోడీ సర్కార్ తీరు వల్ల పార్లమెంట్ లో చర్చలు జరిగే అవకాశమే లేకుండా పోవడం పట్ల ఆరెస్సెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరోవైపు విద్యార్థుల ఆందోళనను మోడీ సర్కార్ పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోసం విద్యార్థుల డిమాండ్ ను పెడచెవిన పెట్టడం సాధ్యం కాదన్న భావన ఆరెస్సెస్ అగ్రనాయకత్వంలో వ్యక్తమౌతోందని అంటున్నారు. RSS support for the cockroaches protest, RSS serious on Modi, Dharmendra Pradhan resignation demand, Murli Manohar Joshi on student protest

Publish Date: Jul 25, 2026 10:57AM
ఢిల్లీ పోరాటాల హోరు..  నింపేనా కాంగ్రెస్ లో జోరు?
ఢిల్లీ పోరాటాల హోరు.. నింపేనా కాంగ్రెస్ లో జోరు?

హస్తిన వేదికగా రగులుతున్న ఆందోళనలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత కొంతకాలంగా సరైన రాజకీయ ప్రాధాన్యత కోసం శ్రమిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ నిరసన జ్వాలలు అందివచ్చిన అవకాశంగా మారాయి. నీట్ అక్రమాలపై విద్యార్థి లోకం చేపట్టిన పోరాటం ఉథృతమై కేంద్రానికి సవాల్ గా మారింది. మోడీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఈ మూడు దఫాలలోనూ ఈ స్థాయిలో నిరసనలు ఎన్నడూ ఎదుర్కొన్న పరిస్థితి లేదు. ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పోరాటంలో రాహుల్ గాంధీ దూకుడు, ప్రసంగం ఆయనలో గతంలో ఎన్నడూ చూడని కొత్త ఫైర్ కనిపించేలా చేశాయి. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విరుచుకుపడ్డారు. విద్యార్థి సమాజం చేపట్టిన ఈ ఆందోళనకు తోడుగా, పంజాబ్ రైతులు కూడా ఢిల్లీకి తరలి రావడం ఉద్యమానికి ఊపు తీసుకురావడమే కాకుండా, కేంద్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పంజాబ్ రైతాంగం, ఢిల్లీ మార్చ్ నిర్వహిస్తూ విద్యార్థుల నిరసనలకు పూర్తి మద్దతు ప్రకటించింది. ఒకే వేదికపైకి విద్యార్థుల సమస్యలు, రైతాంగ ఆవేదన వచ్చి చేరడంతో నిస్సందేహంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసింది. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన లోపాలు, పారదర్శకతా లోపంపై దేశవ్యాప్తంగా యువత ఆగ్రహంతో రగిలిపోతుంటే.. వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపేలా ఇండియా అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం రైతులు సైతం వీధుల్లోకి రాక తప్పని పరిస్థితిని తీసుకువచ్చింది. కర్షకులు, జెన్ జెడ్ కలయిక కేంద్రానికి పెద్ద తలనొప్పిగా పరిణమించింది. ఈ పరిణామాలను కాంగ్రెస్ రాజకీయ అవకాశంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తున్నది. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి తన నాయకత్వ పటిమను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, నిరసన ప్రదర్శనల్లో ప్రత్యక్షంగా భాగస్వామి కావడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. పరిశీలకులు కూడా జాప్యం అయినా రాహుల్ ప్రత్యక్షంగా ఉద్యమానికి మద్దతుగా నిలవడం ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందనడంలో సందేహం లేదు. నిరసనకారుల వేదికపై నిలబడి రాహుల్ చేసిన ఘాటు విమర్శలు, కేంద్ర విధానాలను ప్రశ్నించిన తీరు ప్రజాబాహుల్యాన్ని మొప్పించింది. ప్రస్తుత నీట్ వివాదం, రైతు నిరసనల కలయిక కాంగ్రెస్‌కు బలమైన వేదికగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్నికాంగ్రెస్ క్షేత్రస్థాయి నుంచి ఎంత ప్రభావమంతంగా వాడుకుంటుందన్నదానిపైనే ఆ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది. ప్రస్తుతానికి ఈ ఆందోళనలు, ధర్నాలు ఎక్కువగా దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతానికే పరిమితమై ఉన్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి, బీజేపీ బలీయమైన పరిపాలనా యంత్రాంగానికి ఢిల్లీ పరిధిలో ఇటువంటి ఆందోళనలను అదుపు చేయడం అంత సంక్లిష్టమైన విషయమేమీ కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముందున్న అసలైన సవాలు ఈ ఆందోళనలను హస్తినకే పరిమితం చేయకుండా, దేశం నలుమూలలకూ విస్తరింపజేయడమే. దేశవ్యాప్తంగా విద్యార్థులు, రైతులు, సాధారణ ప్రజలలో ఈ భావజాలాన్ని బలంగా తీసుకెళ్లగలిగితేనే కాంగ్రెస్ రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. రాబోయే ఎన్నికల నాటికి ఈ ప్రజాగ్రహాన్ని ఓట్లుగా మలచడం కాంగ్రెస్ నాయకత్వానికి నిజమైన సవాలు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, దానిని నిలకడైన వ్యూహంతో ముందుకు తీసుకెళ్లగలిగితేనే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం లభించే అవకాశం ఉంటుంది. Congress Protests, Rahul Gandhi Modi Residence, NEET Exam Controversy, Punjab Farmers Delhi March, India US Trade Agreement

Publish Date: Jul 23, 2026 3:50PM
లా అండ్ ఆర్డర్ పై వైసీపీ వాయిదా తీర్మానమా.. హవ్వ.!
లా అండ్ ఆర్డర్ పై వైసీపీ వాయిదా తీర్మానమా.. హవ్వ.!

ఏపీలో శాంతి భద్రతలపై వైసీపీ లోక్ సభలో వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టింది. సోమవారం వైసీపీ ఇచ్చిన ఈ వాయిదా తీర్మానాన్ని పట్టించుకున్న నాథుడే లేడనుకోండి అది వేరే సంగతి. దేశంలో సమస్యల మీద ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ వైసీపీ ఎంపీ గురుమూర్తి.. పార్లమెంటులో శాంతి భద్రతలపై వాయిదా తీర్మానం ఇచ్చారు. వైసీపీ వాయిదా తీర్మానంపై నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. సొంత రాష్ట్రంలో అసెంబ్లీకి ముఖం చాటేసిన పార్టీ.. వాయిదా తీర్మానం ఇవ్వడమేంటంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు. గత ఎన్నికలలో అంటే 2024 ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో విజయం సాధించింది. రాష్ట్రంలో ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ కోర్టుకు కూడా వెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన అసెంబ్లీకే ముఖం చాటేశారు. ఆయనతో పాటు వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లడం లేదు. అయితే నంబర్ ఉంది కనుక వైసీపీ ఎమ్మెల్సీలను మాత్రం మండలికి పంపిస్తున్నారు జగన్. సొంత రాష్ట్రంలో అసెంబ్లీని బాయ్ కాట్ చేసి తగుదునమ్మా అని పార్లమెంటులో లా అండ్ ఆర్డర్ పై వాయిదా తీర్మానం ఇవ్వడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమౌతోంది. ఎందుకంటే.. రాజ్యాంగం ప్రకారం శాంతిభద్రతల వ్యవహారం పూర్తిగా రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. ఒకవేళ శాంతి భద్రతల విషయంలో ఇబ్బందులు ఎదురవుతుంటే బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా వైసీపీ ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి. అయితే.. ఆ పని చేయకుండా.. వైసీపీ పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇవ్వడాన్ని ఉట్టికెగరలేనమ్మ సామెతలా ఉందని నెటిజనులు ఎగతాళి చేస్తున్నారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో ఏం చేయలేక.. జాతీయ స్థాయిలో యాక్టివ్ గా ఉన్నామని చాటుకోవడానికి వైసీపీ వాయిదా తీర్మానం డ్రామా ఆడిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. AP law and order, Parliament Monsoon Session, MP Gurumoorthy, Andhra Pradesh politics

Publish Date: Jul 21, 2026 9:39AM
rss-imgRss Feeds