గాంధీలు జైలుకు వెడతారా?

అవును. ఇప్పుడు ఈ ప్రశ్న రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ ప్రముఖంగా వినిపిస్తోంది. నేషనల్‌ హెరాల్డ్‌  మనీలాండరింగ్‌ కేసులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జి షీట్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ,లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలను ఎ1,ఎ2గా పేర్కొన్న నేపధ్యంలో  గాంధీలు జైలుకు  వెళతారా? అనే ప్రశ్న దేశంలో ప్రముఖగా వినిపిస్తోంది. మరో వంక ఈ కేసును తెర పైకి తెచ్చిన రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణ్య స్వామి  ఆ ఇద్దరి అరెస్ట్ తప్పదని  పూటకో టీవీ చానల్ లో ప్రవచనం చెప్పినట్లు చెపుతున్నారు. సో..సహజంగానే సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ అరెస్ట్  చేస్తుందా? అనే ప్రశ్న కాంగ్రెస్  వర్గాల్లోనే కాదు, సామాన్యులలోనూ  వినిపిస్తోందని అంటున్నారు. అయితే కావచ్చును కాంగ్రెస్  నాయకులు ఆరోపిస్తున్నట్లుగా, కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఇటు బీజేపీకి అటు మోదీ నాయకత్వానికి సవాలుగా దూసుకొస్తున్న రాహుల్ గాంధీ దూకుడును అడ్డుకునేందుకే మోదీ ఈడీని ఉసిగొల్పుతున్నది నిజం కావచ్చును. కానీ  కేసు చరిత్రను  చూస్తే అసలు ఏమీ లేకుండానే  పదేళ్లకు పైగా విచారణలో ఉన్న కేసులో ఈడీ ఏ ఆధారాలు లేకుండానే ఛార్జిషీట్‌ దాఖలు చేస్తుందా? అందులోనూ  సోనియా, రాహుల్ గాంధీ పై ఛార్జిషీట్‌ దాఖలు చేసే సాహసం చేస్తుందా? అనే  సందేహాలు కూడా గట్టిగానే వ్యక్తం అవుతున్నాయి. అదలా ఉంటే.. పరిపాలనా దక్షత, అభివృద్ధి లెక్కల విషయంలో ఎలా ఉన్నా..  రాజకీయ లెక్కలు వేయడంలో తప్పుచేయని మోదీ షా జోడీ  కాంగ్రెస్ అగ్ర నేతలు ఇద్దరినీ ఒకే సారి టార్గెట్  చేస్తారా?  ఆ తప్పు మోదీ షా జోడీ చేస్తుందా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.  నిజానికి  రాజకీయ నాయకుల అవినీతి బాగోతాలకు సంబందించిన కేసుల్లో చాలా చిక్కు ముళ్ళు ఉంటాయి. ముఖ్యంగా ఈ  ‘స్థాయి’ కేసుల్లో  చాలా పకడ్బందీగా, ఎక్కడా ఏ దర్యాప్తు సంస్థకూ దొరక్కుండా, పక్కా పథకం ప్రకారం పని కానిచ్చేస్తారని  అంటారు. కానీ  నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి చిక్కు ముళ్ళు పెద్దగా లేవు. అంతా  ఓపెన్ సీక్రెట్ , ఖుల్లం ఖుల్లా ..అందరికీ అర్థమయ్యేలా ఉందని  అంటున్నారు.  క్లుప్తంగా కేసు వివరాలోకి వెళితే,మూడు నాలుగు తరాల రాజకీయాలతో ముడిపడిన ఈకేసులో  గొప్పగా చిక్కు ముళ్ళు ఏమీలేవు. నెహ్రూ గాంధీల తొలి తరం నేత, స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ  1935 లో  మరో 5000 మంది వాటాదారులతో కలసి స్వాతంత్ర పోరాటంలో అక్షర ఆయుధంగా పనిచేస్తుందని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)సంస్థను స్థాపించి, ‘నేషనల్ హెరాల్డ్’ అంగ్ల పత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పండిత జవహరలాల్ నెహ్రూ ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్  పత్రిక కోసం ఢిల్లీ, లక్నో సహా మరికొన్ని మహానగరాలలో విలువైన స్థలాలను చౌకగా ఇచ్చారు. ఇవి కాక ఏజేఎల్ కంపెనీకి 90 లక్షల దాకా 10 రూ.విలువ గల షేర్స్ ఉన్నాయి. అంటే 9 కోట్ల మూలధనం ఉంది. అంతే కాకుండా నెహ్రూజీ మానస పుత్రికగా ముద్ర వేసుకున్న పత్రికకు  కాంగ్రెస్ ప్రభుత్వాలు విరాళాల రూపంలో,  ప్రకటనల రూపంలో ఆర్థిక సహకారం అందిస్తూ వచ్చాయి. (పత్రిక మూత పడిన తర్వాత కూడా హిమాచల ప్రదేశ్  ప్రభుత్వం, ఈ మధ్యనే రూ. 2.50 కోట్ల  ప్రకటనలు ఇచ్చినట్లు  ఈడీ చార్జి సీట్లో ఉందిట.) అయినా, కంపెనీ 2008 నాటికి, రూ.90 కోట్ల మేర అప్పుల ఊబిలో కూరుకు పోయింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక మూత పడింది. ఈ అప్పులు తీర్చడం కోసం  కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ కి రూ.90 కోట్లు అప్పు ఇచ్చింది.  నేషనల్ హెరాల్డ్  స్టొరీలో ఇదే టర్నింగ్ పాయింట్.  ఎందుకంటే.. ఒక రాజకీయ పార్టీ అప్పులు, ఇచ్చి పుచ్చుకోవదాలను చట్టం అనుమతించదు. అదొకటి అయితే.. పత్రిక మూత పడినా, దేశంలో అనేక నగరాల్లో ఉన్న ఏజేఎల్’ ఆస్తుల విలువ పడిపోలేదు.పెరింగింది.ఇప్పడు ఆస్తుల విలువ రూ. 2000 వేల కోట్ల పైమాటే అంటున్నారు.ఇంకొదరైతే రూ.5000కోట్లు అంటున్నారు. వాస్తవానికి ఈ  ఆస్తులు 2010 వరకు నెహ్రూ కుటుంబ ఆస్తులు కాదు. స్వచ్చంద సంస్థకు చెందిన ఆస్తులు.  కానీ 2010లో  సోనియా గాంధీ, రాహుల్ గాంధీచెరో 38 శాతం వాటాతో, (మిగతా 22 శాతంకు  ఆ స్కార్ ఫెర్నాండేజ్, మోతీలాల్ వోరా  వాటాదారులు) యంగ్ ఇండియా కంపెనీ తెర మీదకు వచ్చింది. అక్కడితో, సీన్ మారిపోయింది. కొత్త కంపెనీ మూలధనం కేవలం రూ.5 లక్షలు మాత్రమే అయినా.. రూ.2000 వేల కోట్ల పైబడిన  ఏజేఎల్ ఆస్తులతో పాటుగా, కంపెనీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లు చెపుతున్న రూ.90 కోట్ల అప్పు ఆ నలుగురి మధ్య కుదిరిన ఒప్పందంతో, యంగ్ ఇండియాకు బదిలీ అయిపోయింది.  అక్కడితోనూ  కథ ముగియ లేదు. ఏజేఎల్  ఆస్తులు యంగ్ ఇండియాకు బదిలీ అయిపోయిన వెంటనే  కాంగ్రెస్ ఇచ్చిన రూ.90 కోట్ల అప్పు ను  కాంగ్రెస్ పార్టీ ఉదారంగా..  యంగ్ ఇండియా నుంచి జస్ట్ ఓ రూ.50 లక్షలు తీసుకుని మాఫీ చేసేసింది. మళ్ళీ  యంగ్ ఇండియా కు ఆ రూ. 50 లక్షలు ఎక్కడివంటే..  అది మళ్ళీ మరో భేతాళ కథ.  సో .. మొత్తంగా చూస్తే సామాన్యులకు కూడా అర్థమయ్యే విషయం ఏమంటే..  సోనియా,రాహుల్ గాంధీలలు ప్రధాన షేర్ హోల్డర్లుగా ఉన్న యంగ్ ఇండియా  జస్ట్ ఓ రూ.5 లక్షల పెట్టుబడితో  రూ.2000 కోట్ల పైబడిన ఏజేఎల్ ఆస్తులకు హక్కు దారు అయింది.  సో.. ఇప్పుడు ఇలా నాలుగు గోడల మధ్యా జరిగినట్లు చెపుతున్న  ఒప్పందాలలకు సంభందించి సాగుతున్న విచారణలో భాగంగానే ఈడీ, సోనియా, రాహుల్ గాంధీలను ఎ 1,  ఎ 2 గా పేర్కొంటూ  చార్జిషీట్ దాఖలు చేసింది.   నిజానికి,   2012- 2013లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ కేసు వెలుగు చూసింది. సీబీఐ విచారణ చేపట్టింది. ఆ సమయంలోనే  సోనియా, రాహుల్ గాంధీలకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇప్పటివకు వరకూ కూడా గాంధీలు ఇద్దరూ బెయిల్ పైనే ఉన్నారు. అలాగే ఈడీ కూడా గతంలో ఆ ఇద్దరినీ విచారించింది. ఇప్పడు చార్జి షీట్ దాఖలు చేసింది. అయితే, ఈడీ చార్జి షీట్ దాఖలు చేసినంత మాత్రాన వెంటనే అరెస్ట్ చేస్తుందని కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  వెంటనే అరెస్ట్ కాలేదు. అసలు అరెస్ట్ అవసరమా..  కాదా అనేది ఈడీ కాదు.. కోర్టులు నిర్ణయిస్తాయి. సో.. ఇప్పటికి ప్పుడైతే  గాంధీలు అరెస్ట్ అయ్యే అవకాశాలు అంతగా లేవనే అంటున్నారు.  బట్.. చట్టం తన పనితాను చేసుకు పోతుంది .. చట్టానికి సహకరించడం పౌరుల ధర్మం. గాంధీలు అందుకు అతీతులు కాదు. వారికి మినహాయింపూ ఉండదు. 
Publish Date: Apr 19, 2025 6:02PM

జగన్ కోటరీ నుంచి సజ్జల ఔట్?

జగన్ హయాంలో ప్రభుత్వం అడుగు తీసి అడుగేయాలంటే ఆయన అనుమతి అవసరం. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలైనా సరే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ముందుకు సాగుతాయి. అంతెందుకు జగన్ ను కలవాటంటే ముందుగా ఆయనను కలవాలి. ఆయన ఓకే చేస్తేనే జగన్ దర్శనం లభిస్తుంది. ఇంతకీ ఎవరాయన అంటారా? అక్కడికే వస్తున్నా.. ఆయన పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన ప్రభుత్వ రాజకీయ ముఖ్య సలహాదారు.   ఇంత ప్రాముఖ్యత ఉందని సజ్జల అప్పటి ముఖ్యమంత్రి   జగన్ రెడ్డి సమీప బంధువో, క్లాస్మేట్, రూమ్మేట్టో, క్లాస్ మేటో.. ఇంకా చెప్పాలంటే  జైల్ మేటో కూడా కాదు. ఎంపీ కాదు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా కాదు. వాస్తవానికి ఆయనకు ప్రత్యక్ష రాజకీయాలతో ఇసుమంతైనా సంబంధం లేదు. అయినా ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలు ఆయన నోటి నుంచే మీడియాకు చేరతాయి. ప్రభుత్వ నిర్ణయాలే కాదు, జగన్ ఫ్యామిలీ పాలిటిక్స్ లో కూడా సజ్జల మాటే ఫైనల్ అన్నట్లుగా అప్పట్లో ఆయన హవా సాగింది. వైసీపీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలే కాదు, పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీ వ్యవహారాలన్నీ ఆయన చేతుల మీదుగానే నడిచేవి. ఇప్పటికీ పార్టీ వ్యవహారాలలో ఆయనే కీలకం అనడంలో సందేహం లేదు.    అయితే గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత.. సజ్జల రామకృష్ణారెడ్డి పై పార్టీ నేతలు, కేడర్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పార్టీ ఓటమికి ఆయన, ఆయన పుత్రరత్నం, వైసీపీ సోషల్ మీడియా మాజీ చీఫ్ సజ్జల భార్గవరెడ్డే కారణమంటూ బాహాటంగానే విమర్శలు గుప్పించారు. జగన్ కూడా పిల్ల సజ్జలను అదేనండీ సజ్జల భార్గవ్ రెడ్డిని వైసీపీ సోషల్ మీడియా నుంచి ఊస్ట్ చేసి పారేశారు. పరాజయం తరువాత తొలి నాళ్లలలో సజ్జలను కూడా దూరం పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత అదేమీ లేదు.. ఇప్పటికీ సజ్జలే పార్టీ వ్యవహారాలలో ఫైనల్ డెసిషన్ మేకర్ గా ఉన్నారు.  అయితే ఎప్పుడైతే సజ్జలకు ముందు పార్టీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగి, ఆ తరువాత మసకబారిపోయి, పార్టీ ఓటమి తరువాత వైసీపీకీ, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయిరెడ్డి.. మీడియా సమావేశంలో జగన్ కోటరీపై చేసిన వ్యాఖ్యల తరువాత పరిస్థితిలో ఒకింత మార్పు వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ జనరల్ సెక్రటరీ పోస్టు నుంచే కాకుండా తన కోటరీ నుంచి కూడా జగన్ సజ్జలను సాగనంపేందుకు నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సజ్జల స్థానంలో పులివెందులకు చెందిన సింగారెడ్డి సతీష్ రెడ్డిని తీసుకురానున్నారని పార్టీ వర్గాల సమాచారం.   అయితే ఈ వార్తలలో నిజమెంత అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో బలంగా వ్యక్తం అవు తున్నాయి. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు వరకూ ఈ సతీష్ రెడ్డి వైఎస్ కుటుంబానికి పులివెందులలో ప్రధాన ప్రత్యర్థి అనే చెప్పాలి. ఆయన మొదటి నుంచీ కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పని చేశారు. తెలుగుదేశంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అంతెందుకు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైస్ కు, జగన్ కు 1999 నుంచి 2014 వరకూప్రత్యర్థిగా నాలుగు సార్లు ఎన్నికలలో పోటీ చేశారు. ఆ నాలుగు సార్లూ ఓడిపోయారనుకోండి అది వేరే సంగతి.   తొలి నుంచీ రాజకీయంగా తెలుగుదేశం పార్టీతోనే ఉణ్న సతీష్ రెడ్డి 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ గా ఎన్నికయ్యారు.  2011, 2014లలో ఆయన తెలుగుదేశం తరఫున ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప జిల్లా వేంపల్లి ఆయన స్వస్థలం. తన రాజకీయ జీవితంలో అత్యధిక భాగం సతీష్ రెడ్డి వైస్ కుటుంబానికి వ్యతిరేకంగానే పని చేశారు. అయితే 2024 ఎన్నికలకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీకి దూరమై వైసీపీ పంచన చేరారు. ఇందుకు ప్రధాన కారణంగా పార్టీలో బీటెక్ రవికి పెరిగిన ప్రాధాన్యతే అని ఆయన సన్నిహితులు చెబుతారు.   సుదీర్ఘ కాలం తెలుగుదేశంలో కీలకంగా ఉన్న సతీష్ రెడ్డిని జగన్ విశ్వసించి వైసీపీలో అత్యంత ప్రాధాన్యమైన పోస్టు ఇస్తారా? అన్న అనుమానాలు రాజకీయవర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి.  
Publish Date: Apr 9, 2025 2:09PM

ఫిర్ ఏక్ బార్., కేసీఆర్ సర్ కార్?

తెలంగాణ రాజకీయాలు అత్యంత వేగంగా మారి పోతున్నాయి.  ప్రభుత్వ వ్యతిరేకత పరుగులు తీస్తోంది, ప్రభుత్వ ప్రతిష్ట అంతే వేగంగా దిగజారుతోంది. సర్కార్ గ్రాఫ్ పడిపోతోంది,  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటా బయట సమస్యలు ఎదుర్కుంటున్నారు, కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రెక్కలు కత్తిరించింది చేతులు కట్టేసింది. కాళ్ళకు సంకెళ్ళు, నోటికి తాళం  వేసింది. సెక్రటేరియట్ గాంధీ భవన్ కు మారింది, గాంధీ భవన్ నుంచి  రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జి నటరాజన్ సమాంతర సర్కార్ నడుపుతున్నారు. మీట నొక్కితే చాలు ఇలాంటి వార్తలు తెర మీద వాలిపోతున్నాయి.  నిజమే కాంగ్రస్ పార్టీని  ముఖ్యమత్రి రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే ఇలాంటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలకు ఆధారాలు ఏమిటీ అంటే సమాధానం చెప్పడం సాధ్యం కాదు. అయితే  రోజులు గడిచే కొద్దీ  వార్తల వేడి పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు పొలిటికల్, సోషల్ మీడియా సర్కిల్స్ కు పరిమితమయిన  విశేష వార్తలు,  ఇప్పడు సామాన్యుడి  సంభాషణలోకి వచ్చేసాయి. మార్నింగ్ వాక్ లో  టీ దుకాణాలు, టిఫిన్ బండ్లు, కాఫీ షాపుల్లో, బస్సుల్లో, బస్ స్టాపుల్లో, మార్కెట్ ప్లేసుల్లో, చివరకు గుళ్ళూ గోపురాలో కూడా ఇప్పడు ఇవే ముచ్చట్లు వినిపిస్తున్నాయి. అదేమంటే, రాజ్యాంగం, ఆర్టికల్ 19, వాక్ స్వాతంత్రం... అన్నీ వచ్చేస్తాయి.  సో .. ఇలాంటి ఈ వార్తల్లో నిజం ఎంత వుందో  చెప్పడం కుదరదు. కానీ, కొంతైతే నిజం ఉందని మాత్రం గంటాపథంగా చెప్పవచ్చని,అంటున్నారు. అవును అసలు నిప్పు లేనిదే పొగ  పొగ రాదు  కదా  అనుకోవచ్చును. అయితే, ఇదుగో తోక అంటే, అదిగో పులి అంటూ కథలు అల్లే నేర్పరులు కాంగ్రెస్ ప్రభుత్వం కథ ముగిసినట్లేనా? కథ ముగిసిందా? అంటూ కథలు వండేస్తున్నారు, వడ్డిస్తున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  మౌనం వదిలి బయటకు వస్తున్న నేపథ్యంలో.. ఈ నెల ( ఏప్రిల్) 27 న వరంగల్ లో జరప తలపెట్టిన, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) సిల్వర్ జూబ్లీ వేడుకల వేదిక నుంచి గులాబీ బాస్  పోరాట శంఖం పూరిస్తారనీ,ఇక అక్కడి నుంచి రాజకీయం మారిపోతుందనే వ్యూహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే  ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ మనుగడ కూడా కష్టమే అని కొందరు  పండితులు  జోస్యం చెపుతున్నారు.  అయితే  నిజంగానే పరిస్థితి అంత విషమంగా ఉందా  అంటే.. ముప్పు పొంచి  ఉన్నట్లు కనిపించినా, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పు లేదు. మహా  అయితే, పడిపోతున్న గ్రాఫ్ ను నిలబెట్టుకునేందుకు, కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారిస్తే మార్చవచ్చును. నిజానికి అ స్కోప్ కూడా పెద్దగా లేదనే అంటున్నారు. ముఖ్యంగా, కాంగ్రెస్ ఆదిస్థానం ఇప్పడు రిస్క్ తీసుకునే పరిస్థితి లేదు. హస్తం పార్టీ చేతిలో ఉన్నదే మూడు రాష్ట్రాలు, అందులో ఒకటి పోతే మిగిలేది, రెండు. నిజానికి  ఆ రెండు రాష్టాల్లోనూ పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. అక్కడా, ఇక్కడని కాదు,దేశంలో ఎక్కడా హస్త రేఖలు సంక్రమంగా లేవు. అష్ట/షష్ట గ్రహ కూటమి ఎఫెక్ట్  ప్రభావమో ఏమో కానీ.. కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలాన్ని ఎదుర్కుంటోంది.  సో.. రేవంత్ రెడ్డిని తొలిగించే సాహసం కాంగ్రెస్ అధిష్టానం  చేయక పోవచ్చును అంటున్నారు. మరో వంక బీజేపీ కూడా ఇప్పటి కిప్పుడు ఎన్నికలు కోరుకోవడం లేదు. కాబట్టి, రేవంత్ రెడ్డి సర్కార్  కు వచ్చిన ముప్పు లేదని అంటున్నారు. అయితే, ప్రభుత్వం ఉంటుందా? ఊడుతుందా? అనే చర్చను పక్కన పెడితే.. ఓ వంక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మరో వంక కాంగ్రెస్ అధిష్టానం వరసగా వేస్తున్న తప్పటడుగుల పుణ్యాన రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. అలాగే  ప్రధాన పార్టీల సర్వేలు కూడా అదే సూచిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. బీఆర్ఎస్ ఖాయంగా అధికారంలోకి వస్తుందని  కాంగ్రెస్ నాయకులే అంగీకరిస్తున్నారు. బహిరంగంగా చెప్పక పోవచ్చును కానీ, వ్యక్తిగత సంభాషణల్లో మాత్రం కాంగ్రెస్ నాయకులు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. ఫిర్ ఏక్ బార్. కేసీఆర్ సర్’కార్’ అంటున్నారు.  బీఆర్ఎస్ పడి లేచిన కెరటంలా మళ్ళీ మరో మారు అధికారంలోకి వస్తుందనే విశ్వాసం  కారు పార్టీలో  వ్యక్తమవుతోంది.
Publish Date: Apr 9, 2025 8:10AM

రాజ‌కీయాల్లో క‌విత మ‌ళ్లీ యాక్టివ్‌.. హ‌రీశ్‌కు చెక్ పెట్టేందుకేనా?

బీఆర్ఎస్  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మా? అంటే అవున‌నే స‌మాధానమే వినిపిస్తోంది. మ‌రికొద్ది రోజుల్లో కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తున్నారు. స్వ‌యాన సీఎం రేవంత్ రెడ్డిసైతం కేటీఆర్ ను జైలుకు పంపిస్తానంటూ బ‌హిరంగ స‌భ‌ల్లో పేర్కొన్నారు. కేటీఆర్ కూడా జైలుకెళ్లేందుకు,  సిద్ధ‌మ‌ని చెప్పడమే కాకుండా, జైల్లో యోగా చేసుకొని, మంచి ఫిట్ నెస్ తో బ‌య‌ట‌కు వ‌చ్చి పాద‌యాత్ర చేస్తానంటూ ప్రకటన కూడా చేశారు. త్వరలో కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా  ఓ క్లారిటీతో ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి‌. ప్ర‌స్తుతం బీఆర్ఎస్ పార్టీ బాధ్య‌త‌ల‌న్నీ కేటీఆర్ త‌న భుజ‌స్కంధాల‌పై వేసుకున్నారు. అధికార పార్టీకి కౌంట‌ర్ ఇస్తూ పార్టీలో అన్నీతానే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో కేటీఆర్ జైలుకెళ్తే పార్టీని ముందుకు న‌డిపించే వారు ఎవ‌ర‌న్న చ‌ర్చ బీఆర్ ఎస్ వ‌ర్గాల్లో మొదలైంది. పార్టీలోని ఓ వ‌ర్గం నేత‌లు   రాబోయే రోజుల్లో హ‌రీశ్‌రావు పార్టీలో కీల‌కంగా మార‌బోతున్నాడ‌ని, ఆయ‌నే పార్టీని ముందుకు న‌డిపించే వ్య‌క్తి అంటూ  ప్ర‌చారం చేస్తున్నారు. ఈ త‌రుణంలోనే క‌విత రాజ‌కీయాల్లో యాక్టీవ్ కావ‌డం చ‌ర్చ‌నీయాశంగా మారింది.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత మ‌ళ్లీ రాజ‌కీయాల్లో యాక్టివ్ అయ్యారు. అటు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఇటు ప్ర‌జా క్షేత్రంలోనూ అడుగుపెట్టారు. ఇటీవ‌ల అదానీ కేసు విష‌యంలో క‌విత కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత‌ గురుకులలో ఫుడ్ పాయిజ‌న్ కు గురై ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని ప‌రామ‌ర్శించి కాంగ్రెస్ స‌ర్కార్ పై విమ‌ర్శ‌లు చేశారు. దీనికితోడు చాలారోజుల త‌రువాత త‌న నివాసంలో తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ (యూపీఏ), బీసీ కుల సంఘాల సమావేశం నిర్వ‌హించారు. దీంతో క‌విత ఈజ్ బ్యాక్ అని ఆ పార్టీ నేతలు, జాగృతి కార్య‌క‌ర్త‌లు సంబురాలు చేసుకుంటున్నారు. వాస్త‌వానికి ఢిల్లీ లిక్క‌ర్ కేసులో అరెస్ట‌యి జైలుకు వెళ్ల‌క‌ముందు క‌విత అసెంబ్లీలో పూలే విగ్ర‌హం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చేశారు. బీసీ హ‌క్కుల సాధ‌న ఎజెండాతో యూనైటెడ్ పూలే ఫ్రంట్ (యూపీఏ), భార‌త జాగృతి సంస్థ‌ల త‌ర‌పున జిల్లాల్లో రౌండ్ టేబుల్ స‌మావేశాలు నిర్వ‌హించారు. మ‌న‌మెంతో మ‌న‌కంత నినాదంతో ముందుకెళ్లాలంటూ పిలుపునిస్తూ బీసీ ఉద్య‌మాన్ని తలకెత్తుకున్నారు.   కుల‌గ‌ణ‌న చ‌ట్ట‌బ‌ద్ధంగా చేయాలంటూ కవిత డిమాండ్ చేశారు. అయితే  అరెస్ట‌యి జైలుకెళ్లి,  బెయిల్ పై  విడుద‌లైన అనంత‌రం  సైలెంట్ అయిపోయారు.  పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. అటువంటి క‌విత మ‌ళ్లీ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు.  క‌విత ఉన్న‌ట్లుండి ఇప్పుడు రాజ‌కీయాల్లో యాక్టీవ్ కావ‌డం కేసీఆర్ వ్యూహంలో భాగ‌మేన‌ని బీఆర్ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అంద‌రూ ఊహించిన‌ట్లు కేటీఆర్ నిజంగా జైలుకెళితే పార్టీని న‌డిపించే బాధ్య‌త‌ను క‌విత తీసుకోబోతున్నార‌ని, అందుకే ఆమె ఉన్న‌ట్లుంటి రాజ‌కీయాల్లో యాక్టీవ్ అయ్యార‌ని బీఆర్ఎస్ నేత‌లు పేర్కొంటున్నారు. క‌విత పొలిటిక‌ల్ గా మైలేజ్ సంపాదించుకున్నా కేటీఆర్ కు వ‌చ్చే ఇబ్బంది ఏమీలేదు. ఎందుకంటే.. క‌విత జైల్లో ఉన్న స‌మ‌యంలో త‌న చెల్లికి బెయిల్ కోసం కేటీఆర్‌ ఢిల్లీలోనే మ‌కాం వేసి తీవ్రంగా శ్ర‌మించారు. జైలు నుంచి బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత క‌విత‌ సైతం   అన్న‌ను హ‌త్తుకొని క‌న్నీటి ప‌ర్యంతమ‌య్యారు. ఈ క్ర‌మంలో అన్నాచెల్లెలు మ‌ధ్య ఒక‌రిపైఒక‌రికి ఉన్న ప్రేమ బ‌హిర్గ‌తం చేశారు. దీంతో రాజ‌కీయాల్లో తాను ఎంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన‌ప్ప‌టికీ.. త‌న అన్న త‌రువాత‌నే ఉంటాన‌ని క‌విత చెప్ప‌క‌నే చెప్పారు. ఈ క్ర‌మంలో ఒక‌వేళ కేటీఆర్ ఏదైనా కేసులో జైలుకెళ్లిన‌ప్ప‌టికీ పార్టీ బాధ్య‌త‌లను క‌విత త‌న భుజ‌స్కంధాల‌పై వేసుకుంటార‌ని, కేటీఆర్ జైలు నుంచి తిరిగిరాగానే ఆయ‌న సార‌థ్యంలో రాజ‌కీయాల్లో కొన‌సాగుతార‌ని బీఆర్ఎస్ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. ఇలా అన్నాచెల్లెలు బీఆర్ఎస్ పార్టీని బ‌లోపేతం కృషి చేస్తూనే.. మ‌రో వ్య‌క్తి చేతికి పార్టీ ప‌గ్గాలు వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారని, త‌ద్వారా కేసీఆర్ వార‌సుడు కేటీఆర్ అనే విష‌యాన్ని క్యాడ‌ర్ లోకి క‌విత‌  బ‌లంగా తీసుకెళ్తున్నార‌ని బీఆర్ఎస్‌ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓట‌మి త‌రువాత కేసీఆర్ పెద్ద‌గా బ‌య‌ట‌కు రావ‌టం లేదు. అడ‌పాద‌డ‌పా పార్టీ నేత‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న‌ప్ప‌టికీ.. కేటీఆరే పార్టీ బాధ్య‌త‌లు చూస్తున్నారు. జిల్లాల్లో ప‌ర్య‌టిస్తూ పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూ దూకుడుగా ముందుకెళ్తున్నాడు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి దూకుడు ముందు కేటీఆర్ తేలిపోతున్నాడ‌ని బీఆర్ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. హ‌రీశ్ రావు లాంటి సీనియ‌ర్ నేత‌కు బీఆర్ఎస్ పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని పార్టీలోని ఓ వ‌ర్గం డిమాండ్ చేస్తుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేటీఆర్ జైలుకెళితే పార్టీ ప‌గ్గాలు హ‌రీశ్ రావు చేతికి అప్ప‌గించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని భావించిన కేసీఆర్‌.. త‌న కుమార్తె క‌విత‌ను రంగంలోకి దింపిన‌ట్లు బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.   జైలు నుంచి బెయిల్‌పై వ‌చ్చిన త‌రువాత రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న క‌విత త‌న తండ్రి సూచ‌న‌తోనే ఉన్న‌ట్లుండి ఒక్క‌సారిగా పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యార‌ని బీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు. మొత్తానికి ఎలాంటి ప‌రిస్థితి ఎదురైనా హ‌రీశ్ రావుకు చేతికి మాత్రం పార్టీ ప‌గ్గాలు వెళ్ల‌కుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లో భాగంగానే క‌విత మ‌ళ్లీ రాజ‌కీయాల్లో యాక్టివ్ అయ్యార‌ని తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌ను బ‌ట్టిచూస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది.
Publish Date: Nov 25, 2024 6:43AM

జగన్ బెయిలు రద్దు.. సీబీఐ స్టాండ్ మారిందా?

జగన్ బెయిలు రద్దు పిటిష్ విషయంలో సీబీఐ తన స్టాండ్ మార్చుకుంటుందా? అలా మార్చుకుంటే జగన్ జైలుకు వెళ్లక తప్పదా అంటే పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి జగన్ బెయిలు రద్దు చేయాలంటూ వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఆ రోజు విచారణ జరిగింది. రఘురామకృష్ణం రాజు సుప్రీంలో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి జగన్ బెయిలు రద్దు చేయాలన్నది కాగా, రెండోది జగన్ అక్రమాస్తుల కేసు విచారణను హైదరాబాద్ నుంచి మార్చాలని. ఈ కేసుల విచారణ నుంచి జస్టిస్ సంజీవ్ కుమార్ నాట్ బిఫోర్ మీ అంటూ వైదొలిగారు. దీంతో కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసు మరో బెంచ్ ముందు డిసెంబర్ 2న విచారణకు రానుంది.  అయితే ఆసక్తికర పరిణామమేంటంటే.. సీబీఐ తరఫున ఈ కేసులో వాదనలు వినిపించాల్సిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెయిలు రద్దు పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం అడిగారు. అలా అడగడమే సీబీఐ జగన్ బెయిలు రద్దు విషయంలో ఇంత వరకూ మెయిన్ టైన్ చేస్తూ వస్తున్న స్టాండ్ ను మార్చుకుంటుందా అన్న అనుమానాలకు తావిస్తోంది.  ఎందుకంటే జగన్ సీఎంగా ఉన్నంత కాలం ఆయన బెయిలు విషయంలో సీబీఐ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.   అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. జగన్ సీఎం కాదు. కేవలం పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే మాత్రమే. దీంతో ఇప్పటి వరకూ జగన్ బెయిలు విషయంలో అభ్యంతరాలు చెప్పని సీబీఐ ఇప్పుడు వైఖరి మార్చుకుని ఆయన బెయిలు రద్దు కోరే అవకాశం ఉంది. అలా కాకపోతే కనీసం కేసు రోజువారీ విచారణ కోరే అవకాశం ఉంది. ఈ రెండింటిలో ఏది జరిగినా జగన్ ఇబ్బందుల్లో పడక తప్పదు.   గతంలో జగన్ బెయిలు విషయంలో సీబీఐ ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన దేశం విడిచి పారిపోరన్న గ్యారంటీ , బెయిలు షరతులు ఉల్లంఘించరన్న నమ్మకం ఉండేది. అయితే జగన్ ఇప్పుడు అధికారంలో లేరు. అందుకే మారిన పరిస్థితుల్లో సీబీఐ కూడా తన స్టాన్స్ మార్చుకునే అవకాశం ఉంది. అందుకే జగన్ కు ఇబ్బందులు తప్పవన్న భావన న్యాయవర్గాలలో ఎదురౌతోంది. జగన్ బెయిలు రద్దైనా, కేసుల విచారణను రోజువారీ చేపట్టాలని నిర్ణయించినా జగన్ జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడినట్లేనని పరిశీలకులు అంటున్నారు.  
Publish Date: Nov 12, 2024 3:26PM

తాగిన మైకంలో కారులో డిజెతో కెటీఆర్ కొడుకు హిమాన్షు 

తెలంగాణలో పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం బెల్ట్ షాపులను ప్రోత్సహించింది.  మద్యానికి బానిసలైన  కుటుంబాలు దీనవస్థను ఎదుర్కొన్నాయి. గత డిసెంబర్ లో కెసీఆర్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత తెలంగాణ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు .  పదవీ చ్యుతుడైన కెసీఆర్ మద్యం మత్తులో బాత్రూంలో పడి తుంటి ఎముక విరగ్గొట్టుకున్నాడని ప్రచారంలో ఉంది. కెసీఆర్ తాగుబోతు రాత్రంతా మద్యం సేవించి మధ్యాహ్నం నిద్ర లేస్తాడనే అపవాదు ప్రచారంలో ఉంది. విత్తు ఒకటి అయితే చెట్టు   మరోటి మొలుస్తుందా అన్నట్టు కెసీఆర్ మనవడు హిమాన్షు తాగిన మైకంలో చెవులకు చిల్లులు పడే  డిజె పెట్టుకుని కారులో ప్రయాణిస్తున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో  చెక్కర్లు  కొడుతున్నాయి. తండ్రి కెటీఆర్ డ్రగ్స్ బానిస అని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్  ఫోన్ ట్యాప్ చేసినట్లు  మంత్రి కొండా సురేఖ బాహాటంగా కూడా ఆరోపించారు. రకుల్ ప్రీత్ సింగ్ కు డ్రగ్స్ అలవాటు చేశాడని ఆమె అన్నారు. తాత, తండ్రి లక్షణాలు హిమాన్షుకు వచ్చినట్లు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ప్రెండ్స్ తో హిమాన్షు జల్సాలు  కొడుతున్న విజువల్స్ చక్కర్లు కొడుతున్నాయి. బాప్ నెంబరీ బేటా దస్ నంబరీ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు
Publish Date: Oct 22, 2024 1:14PM

రోజా.. గురువింద సామెత

మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే  రోజా తీరు గురువింద గింజమాదిరగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెప్పేటందుకె నీతులు ఉన్నాయి అన్నట్లు.. తాను చేసిన తప్పులు మరిచిపోయి ఇప్పుడు ఎదుటివారిపై విమర్శలకు తహతహలాడుతున్న రోజా తీరు చూస్తుంటే గురువింద గింజ సామెతే గుర్తుకు వస్తోందంటున్నారు పరిశీలకులు. జగన్ అధికారంలో ఉన్నంత వరకూ ఆయనా, ఆయన కేబినెట్ మంత్రులు, పార్టీ నేతలూ మంచీ చెడు, మర్యాద, సభ్యత వంటి విషయాల గురించి ఆలోచించకుండా ప్రత్యర్థులపై అనుచిత విమర్శలతో దాడి చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా వారి కుటుంబ సభ్యులపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు.  ముఖ్యంగా రోజా పవన్ కల్యాణ్ లక్ష్యంగా వ్యక్తిగత విమర్శలకు తెగబడ్డారు. సరే ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. స్వయంగా రోజా తన నగరి నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచీ రోజా ఆంధ్రప్రదేశ్ కంటే చెన్నైలోనే ఎక్కువగా ఉంటున్నారు. ఒక దశలో ఆమె రాజకీయాలకు గుడ్ బై చెప్పి మళ్లీ జబర్దస్త్ గా కామెడీ షోలకు జడ్జిగా షిఫ్టైపోతారని కూడా వినిపించింది. అయితే ఓటమి పాలైన నాలుగు నెలల తరువాత ఆమె మళ్లీ  రాజకీయాలలో క్రియాశీలం కావాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా మీడియా ముందుకు వచ్చి... పవన్ కల్యాణ్, చంద్రబాబులపై విమర్శలు గుప్పించారు. ఇంతకూ ఏ విషయంపై ఆమె తన నోటికి పని చెప్పారంటే.. చంద్రబాబు అన్ స్టాపబుల్ టాక్ షో కోసం షూటింగ్ లో పాల్గొనడం, పవన్ కల్యాణ్ సినిమాలలో నటించడం తప్పని ఆమె విమర్శిస్తున్నారు. షూటింగ్ లలో పాల్గొనే వారికి రాజకీయాలెందుకని ప్రశ్నించారు. మరి గత ఐదేళ్లుగా రోజా చేసిందేమిటని ఆమెను ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు. అయినా రోజా వంటి వారికి అనడమే తప్ప వినడం తెలియదని పరిశీలకులు అంటున్నారు.  ఎమ్మెల్యేగా, మంత్రిగా  రోజా ప్రజా సమస్యల విషయంలో ఎప్పుడూ స్పందించిన దాఖలాలు లేవు గానీ, జబర్ దస్త్ కామెడీ షోకు జడ్జిగా ఆమె నిత్యం యమాబిజీగా ఉండేవారు. మంత్రి అయిన తరవాత జబర్ దస్త్ కు పేరుకే దూరం జరిగారు కానీ మళ్లీ పండగల సమయాలలో స్పెషల్ షోలకు మేకప్ తో సిద్ధమైపోయారు. తాను అధికారంలో ఉన్నసమయంలో ఏం చేశారో మరచిపోయి ఇప్పుడు  చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల షూట్ ల గురించి మాట్లాడటంతోనే రోజా తీరు గురివింద సామెతను గుర్తు చేస్తోందని సొంత పార్టీ వారే విమర్శిస్తున్నారు. అయినా తప్పులెన్నటమే తెలిసిన వారికి తమ తప్పులు కనిపించవని వేమన ఎప్పుడో చెప్పారు. 
Publish Date: Oct 22, 2024 12:43PM

రాజకీయాలలో చంద్రబాబు అన్ స్టాపబుల్!

నందమూరి బాలకృష్ణ, నటసింహం. సినిమాలలో ఆయన అన్ స్టాపబుల్.. అలాగే రాజకీయాలలో  అన్ స్టాపబుల్ ఎవరు? ఈ ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అలాంటిది తాను రాజకీయాలలో అన్ స్టాపబుల్ అని స్వయంగా చంద్రబాబే చెబితే.. ఔను తాను రాజకీయాలలో అన్ స్టాపబుల్ అని చంద్రబాబు స్వయంగా చెప్పారు.  హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ నాలుగుకు సర్వం సిద్ధమైంది. ఈ సీజన్ లో తొలి ఎపిసోడ్ కు అతిధిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 2 తొలి ఎపిసోడ్ కు కూడా చంద్రబాబు హాజరైన సంగతి తెలిసిందే. అప్పుడు చంద్రబాబు విపక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు సీజన్ 4కు ఆయన   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సీజన్ 4కు సంబందించి ప్రోమో విడుదలైంది. తొలి ఎపిసోడ్ ఈ నెల 25న ఆహా ఓటీటీలో స్ట్రీమ్ కానుంది.   కాగా తాజాగా విడుదలైన ప్రోమో ప్రకారం బాలయ్యతో అన్ స్టాపబుల్ టాక్ షోలో చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురించి ఆయన మాట్లాడారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో కక్ష రాజకీయాలు నడిచాయి. తన హయాంలో అటువంటి వాటికి తావు ఉండదని చంద్రబాబు విస్ఫష్టంగా చెప్పారు. అదే సమయంలో తప్పు చేసిన వారిని వదిలే ప్రశక్తేలేదని అన్నారు. సీజన్ 2లో చంద్రబాబు పాల్గొన్న ఎపిసోడ్ లో నారా లోకేష్ వచ్చారు. ఈ సారి ఎవరు వస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొందరైతే ఈ ఎపిసోడ్ లో  చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సర్ ప్రైజ్ అప్పియరెన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.  
Publish Date: Oct 22, 2024 12:05PM

బీజేపీ బిగ్ స్కెచ్‌.. దక్షిణాదిలో పాగాయే లక్ష్యం!

భార‌త‌దేశంలో జ‌మిలి ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోన్న వేళ‌ బీజేపీ అధినాయ‌క‌త్వం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది.  పార్టీ నాయ‌క‌త్వంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయ‌న్న చర్చ బీజేపీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా జేపీ న‌డ్డా ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో.. ఆయ‌న వార‌సుడిని ఎంపిక చేసే ప‌నిలో పార్టీ పెద్ద‌లు నిమ‌గ్న‌మ‌య్యారు. అదే క్ర‌మంలో ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ప‌ట్టు సాధించేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ప‌ట్టు సాధించ‌డం బీజేపీ బిగ్ ఛాలెంజ్ అనడంలో సందేహం లేదు. ఉత్త‌రాది రాష్ట్రాల్లో బీజేపీ హ‌వా సాగుతున్నా.. ద‌క్షిణాది రాష్ట్రాల‌లో మాత్రం బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగానే ఉంది.   ప్రాంతీయ పార్టీల‌తోపాటు.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ద‌క్షిణాది రాష్ట్రాల్లో కాస్త బ‌లంగానే ఉంది.  బీజేపీ మాత్రం ద‌క్షిణాది రాష్ట్రాలలో  కాలూనడానికే నానా ఆపసోపాలు పడుతోంది. ఇటీవ‌లి సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ రాష్ట్రాల్లో బీజేపీ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక పోయింది. ఆ రాష్ట్రాల్లో ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్, డిఎంకె, ఎఐఎడిఎంకె, తెలుగుదేశం, వైసీపీ, బీఆర్‌ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలు బ‌లంగా ఉన్నాయి. అయితే, 2027లో జ‌మిలి ఎన్నిక‌ల ఊహాగానాల నేప‌థ్యంలో ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ప‌ట్టు సాధించాల‌ని బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ పెద్ద‌లు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ట‌. ద‌క్షిణాది రాష్ట్రాలైన క‌ర్ణాట‌క‌లో బీజేపీ ఓ మోస్త‌రు విజ‌యాన్ని సాధించ‌గా.. కేర‌ళ‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. క‌ర్ణాట‌క‌లో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. తెలంగాణ‌లో ఇప్ప‌డిప్పుడే బ‌ల‌మైన పార్టీగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తెలంగాణలో ఎనిమిది పార్ల‌మెంట్ స్థానాల‌ను బీజేపీ గెలుచుకుంది. అయితే, ఎన్నిక‌ల త‌రువాత అదే ఊపును  కొన‌సాగించ‌డంలో  మాత్రం విఫలమైంది.  ఇక ఆంధ్ర్రప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే ప్రాంతీయ పార్టీలతో క‌లిసి అధికారంలో భాగస్వామ్య పార్టీగా ఉంది. వాస్త‌వానికి ఏపీలో బీజేపీకి పెద్ద‌గా బ‌లం లేదు. తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల అండ‌తో ఆ పార్టీ అభ్య‌ర్థులు కొంద‌రు గ‌త ఎన్నిక‌ల్లో  విజ‌యం సాధించారు. త‌మిళ‌నాడు రాష్ట్రంలో గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది. ఈ క్ర‌మంలో రాబోయే కాలంలో ద‌క్షిణాది రాష్ట్రాల‌పై బల‌మైన ముద్ర వేసేందుకు బీజేపీ అధిష్టానం, ఆర్ఎస్ఎస్ నేత‌లు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. బీజేపీ ప‌గ్గాల‌ను ద‌క్షిణాది నేత‌కు అప్ప‌గించే ఆలోచ‌న‌లో పార్టీ పెద్ద‌లు ఉన్నారని బీజేపీ నేతలే అంటున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీ అధ్యక్ష పదవికి పార్టీ అధిష్ఠానం వారణాసి రామ్ మాధవ్, వెల్లంవెల్లి మురళీధరన్ పేర్లను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అనుభవజ్ఞులైన వ్యూహకర్తలుగా వారిద్ద‌రికి పేరుంది.  బీజేపీకి జాతీయ స్థాయిలో నాయకత్వం వహించే స‌మ‌ర్ధ‌త క‌లిగిన వారిగా పార్టీ అధిష్టానం సైతం వారిని గుర్తించింది.  వారిలో ఒక‌రికి పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే ద‌క్షిణాది రాష్ట్రాల్లోనూ రాబోయే కాలంలో బీజేపీని బ‌లోపేతం చేయొచ్చున‌ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్ద‌ల వ్యూహంగా రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.   దేశ రాజ‌కీయాలు ప్ర‌స్తుతం జ‌మిలి ఎన్నిక‌ల చుట్టూ తిరుగుతున్నాయి. జాతీయ‌, రాష్ట్ర స్థాయిలో ఒకేసారి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌ని కేంద్రం భావిస్తోంది. దీనికి తోడు ఇందుకు అవ‌స‌ర‌మైన రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌లు చేసేందుకు కేంద్రం సిద్ధ‌మైంది. కేంద్రం దూకుడు చూస్తుంటే 2027లో జ‌మిలి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే జ‌రిగితే బీజేపీకి ఉత్త‌రాదిలోనే కాకుండా ద‌క్షిణాదిలోనూ అత్య‌ధిక పార్ల‌మెంట్ స్థానాల‌తో పాటు.. రాష్ట్రాల్లోనూ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం స‌వాలుగానే ఉంటుంది. ఈ ప‌రిస్థితుల్లో ద‌క్షిణాది రాష్ట్రాల నేత‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం ద్వారా మంచి ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌ొచ్చ‌ని బీజేపీ పెద్దలు యోచిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రామ్ మాధ‌వ్‌, వెల్లంప‌ల్లి ముర‌ళీర్ వంటి అనుభ‌వజ్ఞులైన వారిలో ఒక‌రికి జాతీయ స్థాయిలో పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించేందుకు బీజేపీ పెద్ద‌లు ఆలోచ‌న చేస్తున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతుంది.    ద‌క్షిణాది నేత‌కు జాతీయ స్థాయిలో పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే.. బీజేపీ కేవ‌లం ఉత్త‌ర భార‌త‌దేశం పార్టీ అనే అప‌వాదును తుడిపేసిన‌ట్ల‌వుతుంది. ద‌క్షిణాది ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, సంస్కృతి సాంప్ర‌దాయాల‌ను బీజేపీ గౌర‌విస్తుంద‌న్న నమ్మకాన్ని ఆ ప్రాంత ప్ర‌జ‌ల్లో   క‌లిగించిన‌ట్లు అవుతుంది. దీనికి తోడు ఇటీవ‌ల కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని న‌రేంద్ర మోడీ త‌రుచుగా ప‌ర్య‌టిస్తున్నారు. ద‌క్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి మోదీ పెద్ద‌పీట వేస్తున్నార‌న్న భావ‌న ఇప్పుడిప్పుడే ప్ర‌జ‌ల్లో క‌లుగుతోంది. ఇదే స‌మ‌యంలో ద‌క్షిణాది నేత‌కు బీజేపీ ప‌గ్గాలు అప్ప‌గిస్తే పార్టీ బ‌లోపేతానికి ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్ద‌లు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.  రామ్ మాధ‌వ్‌, ముర‌ళీధ‌ర‌న్ పేర్ల‌ను మాత్ర‌మే బీజేపీ పెద్ద‌లు ఎందుకు ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నార‌నే చ‌ర్చ‌కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో రామ్ మాధవ్ ప్రయాణం ఆయన టీనేజ్ నుంచే ఆరంభమైంది. 1981లో ఆర్ఎస్ఎస్‌లో పూర్తిస్థాయి కార్య‌క‌ర్త‌గా మారడానికి రామ్ మాధవ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. కొన్ని సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ పెద్ద‌లు తీసుకునే నిర్ణ‌యాల్లో కీల‌క భూమిక పోషిస్తున్నారు. మాధవ్ 2003 నుండి 2014 వరకు ఆర్ఎస్ఎస్‌ సంస్థ జాతీయ ప్రతినిధిగా కొన‌సాగారు.  2014లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ ప‌నిచేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో రామ్ మాధ‌వ్ నిర్ణ‌యాలు కీల‌క భూమిక పోషించాయి. అంతేకాక‌.. ఈశాన్య భారతదేశంలో పార్టీ అభివృద్ధికి  ప్రాంతీయ పార్టీలతో పొత్తులను బ‌లోపేతం చేయ‌డంలో కీలకంగా వ్యవహరించారు. మ‌రోవైపు  మురళీధరన్ కు జాతీయ స్థాయిలో పార్టీలో మంచిప‌ట్టు ఉంది. మురళీధరన్ 1998లో లోక్‌సభ ఎన్నికల సమయంలో వెంకయ్య నాయుడుకు సహాయం చేస్తూ బీజేపీలోకి ప్రవేశించారు. 1999లో నెహ్రూ యువకేంద్ర వైస్‌ చైర్మన్‌గా నియమితులైన ఆయన, ఆ తర్వాత బీజేపీ ఎన్‌జీవో, శిక్షణా విభాగాల జాతీయ కన్వీనర్‌గా కీలక పాత్రలు నిర్వహించారు. బీజేపీ కేరళ ఉపాధ్యక్షుడిగా (2006-2010) పనిచేసిన ఆయన..  సైద్ధాంతిక శిక్షణపై దృష్టి సారించారు. 2010, 2013లో కేరళ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన పార్టీ సభ్యత్వం, పార్టీ ఓట్ల శాతాన్ని పెంచారు. 2018లో రాజ్యసభ ఎంపీ అయ్యారు. కేంద్ర మంత్రిగా ప‌నిచేశారు. మాధ‌వ్‌, ముర‌ళీధ‌రన్ ఇద్ద‌రూ పార్టీ జాతీయ‌ అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించేందుకు స‌మ‌ర్ధ‌త క‌లిగిన వారు. అయితే, బీజేపీ పెద్ద‌లు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు, జ‌మిలి ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి ద‌క్షిణాదిలో బీజేపీ ప్ర‌భావాన్ని పెంచేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోబోతున్నార‌నే అంశాలు ఆసక్తికరంగా మారాయి. 
Publish Date: Oct 22, 2024 11:28AM

ముత్యాలమ్మ గుడిపై దాడి:  గవర్నర్ కు ఫిర్యాదు

సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ప్రాంగణంలో  రెండు రోజుల క్రితం జరిగిన లాఠీ చార్జిపై బిజెపి సీరియస్ గా ఉంది. బిజెపి నేత ఈటెల బృందం గవర్నర్ కు ఫిర్యాదు చేసింది . మజ్లిస్ చెప్పు చేతల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు  బిజెపి నేత ఈటెల.  అమ్మవారి విగ్రహం ధ్వంసం నేపథ్యంలో నాగసాధు ఇక్కడికి వచ్చారు. దీంతో  హిందూ సంఘాలుఇక్కడికి చేరుకుంటున్నాయి, వారి ఆందోళన జరుగుతుండగా లాఠీ  చార్జ్ జరిగింది. దోషులను అరెస్ట్ చేయాలని   బిజెపి డిమాండ్ చేసింది. బిజెపి ఫిర్యాదుతో ముత్యాలమ్మ గుడి వివాదం రాజకీయంగా హీటెక్కిం చింది.
Publish Date: Oct 21, 2024 6:06PM

బీఆర్ఎస్ లోగోలో కేసీఆర్ ఫొటో మాయం.. సంకేతమదేనా?

కేసీఆర్... ఈ మాట వినగానే నిన్నమొన్నటి వరకూ అందరి నోటా  మాటల మాంత్రికుడు, రాజకీయ చాక్యుడు.. ప్రత్యర్థుల కంటే రెండడుగుల ముందే  ఉంటారు. వారు వ్యూహ రచన చేయడానికి ముందే వాటికి విరుగుడు వ్యాహాలను అమలు చేసి వారిని నిరుత్తరులను చేస్తారు. అన్న మాటలే వినిపించేవి. అయితే ఇదంతా బీఆర్ఎస్ ఎన్నికలలో ఓడిపోయి ప్రతిపక్షానికే పరిమితం కావడానికి ముందు వరకూ మాత్రమే. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి  కూడా  కేసీఆర్ రాజకీయాలను తట్టుకోవడం కష్టమని  ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరించేసిన పరిస్థితి. అయితే ఒక్క ఓటమి.. ఔను ఒకే ఒక్క ఓటమి కేసీఆర్ ను నిర్వీర్యుడిగా మార్చేసింది. ఆయనలో వ్యూహ శూన్యత నెలకొని ఉందా అన్నట్లుగా ఆయన క్రియా శూన్యుడిగా మారిపోయారు. ఆయన ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాల సంగతి పెడితే అసలాయనకు రాజకీయాలలో ఓనమాలు తెలుసునా అన్న అనుమానాలు బీఆర్ఎస్ లోనే వ్యక్తం అవుతున్నారు.   తెలంగాణలో రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి పది నెలలు కావస్తున్నది. ఈ పది నెలల కాలంలోనూ కేసీఆర్ ప్రజలలోకి వచ్చి వారికి కనిపించిన సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.  అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే సాహసం కూడా చేయలేదు. ఏదో మొక్కుబడికి అన్నట్లు ఒక్క రోజు మాత్రం అదీ రేవంత్ సర్కార్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు హాజరయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన రాజకీయ సన్యాసం చేసేశారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాలే ఆయన తీరు ఉంది. గత పది నెలలుగా ఆయన ఒక విధంగా వానప్రస్థంలో ఉన్నట్లుగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఆయన పథకాలైన రుణమాఫీ, రైతు భరోసా వంటి వాటిలో రేవంత్ సర్కార్ వైఫల్యాలపై ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. పార్టీ వ్యవహారాలన్నీ ఆయన కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులే చక్కబెడుతున్నారు. మళ్లీ వీళ్లద్దరి మధ్యా ఆధిపత్య పోరు సాగుతోంది. అది వేరే సంగతి. ఇప్పటి వరకూ ఇప్పుడు కాకపోతే మరోసారి. ఇవ్వాళ కాకపోతే రేపు కేసీఆర్ మళ్లీ ప్రజలలోకి వస్తారు. బీఆర్ఎస్ కు పూర్వ వైభవం తీసుకువస్తారు అని బీఆర్ఎస్ శ్రేణులూ, కేసీఆర్ అభిమానులూ నమ్మకంగా ఉన్నారు.  కానీ హైడ్రా వివాదం సమయంలో కూడా కేసీఆర్ ప్రజలకు ముఖం చూపకపోవడంతో  వారిలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక పరిశీలకులు అయితే  ఆయన రాజకీయంగా అస్త్రసన్యాసం చేసినట్లేని  విశ్లేషిస్తున్నారు.    ఇందుకు ఉదాహరణగా కేటీఆర్ మూసీపై మీడియా సమావేశంలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను చూపుతున్నారు. ఆ సందర్భంగా బీఆర్ఎస్ లోగోలో కేసీఆర్ ఫొటోకు బదులుగా కేటీఆర్ ఫొటో ఉండటాన్ని చూపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ పూర్తిగా టేకోవర్ చేసేకుకున్నారనీ, కేసీఆర్ ఇక రాజకీయాలలో మళ్లీ చురుగ్గా పాల్గొనే పరిస్థితి కనిపించడం లేదనీ అంటున్నారు. అలాగే తెలంగాణ భవన్ లో కూడా పార్టీ లోగోలో కేసీఆర్ ఫొటో స్థానంలో కేటీఆర్ ఫొటో కనిపిస్తోంది.  మొత్తానికి కేసీఆర్ మౌనం, కేటీఆర్ దూకుడు చూస్తుంటే నేడో, రేపో అధికారికంగా పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ అన్న ప్రకటన వెలువడినా ఆశ్చర్యపోవలసిన పని లేదంటున్నారు. అదే సమయంలో హరీష్, ఆయన వర్గం ఏం చేస్తారన్నదానిపై కూడా పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ కేటీఆర్ అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టకపోవడానికి హరీష్ వర్గం అభ్యంతరాలే కారణమని అంటున్నారు. పార్టీ శాసనసభా పక్ష నేత ఎన్నిక విషయంలో కూడా కేటీఆర్ కు సంపూర్ణ మద్దతు లేకపోవడం వల్లే ఇప్పటికీ కేసీఆర్ శాసనసభాపక్ష నేతగా కొనసాగుతున్నారని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే బీఆర్ఎస్ లో చీలిక అనివార్యం అనే అనిపిస్తోందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. 
Publish Date: Oct 21, 2024 3:44PM

సల్మాన్ ను ఖతం చేస్తామంటున్న బిష్ణోయ్.. అసలు కథేంటి?

పరిచయం అక్కర్లేని పేరు సల్మాన్ ఖాన్.. కండల వీరుడిగా అశేషమైన ప్రేక్షకాభిమానం కలగిన స్టార్ హీరో. దేశంలోనే కాదు ప్రపంచం నలుమూలలో ఆయనకు అభిమానులు ఉన్నారు. హీరోగా ఆయన స్థాయే వేరు. తెరపై విలన్లను భయభ్రాంతులకు గురి చేసి, వారిని చీల్చి చెండాని గెలిచే పాత్రలలో సల్మాన్ స్టైలే వేరు. ఎదురులేని హీరోగా ప్రేక్షకుల నీరాజనాలందుకునే సల్మాన్ ఖాన్ ఇప్పుడు భయంతో వణికి పోతున్నాడు. అడుగుతీసి అడుగు వేయాలంటే.. కట్టుదిట్టమైన భద్రత, సొంత బౌన్సర్లే కాకుండా ప్రభుత్వం తరఫున కూడా పదుల సంఖ్యలో సెక్యూరిటీ గార్డ్స్ , బయటకు వెడితే బుల్లెట్ ప్రూఫ్ కార్. వీటిలో ఏది లేకపోయానా సల్మాన్ బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఇంత భారీ సెక్యూరిటీ ఉన్నా కూడా సల్మాన్ లో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అసలు సల్మాన్ ఖాన్ ఇంతగా భయపడటానికి కారణమేంటి? పదే పదే సల్మాన్ ను ఖతం చేస్తామంటూ బెదరింపులు ఎందుకు వస్తున్నాయి? ఎవరు చేస్తున్నారు? అంటే మనం ముందుగా  గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ గురించి చెప్పుకోవాలి. అంత కంటే ముందు సల్మాన్ ఖాన్ నిర్దోషిగా బయటపడిన కృష్ణ జింకల వధ కేసు గురించి తెలుసుకోవాలి.  అలాగే తిరుగులేని స్టార్ గా ఎదిగిన సల్మాన్ ఖాన్ ప్రస్తానాన్నీ సింహావలోకనం చేసుకోవాలి.  బాలీవుడ్‌లో  ఒకప్పటి స్టార్‌ రైటర్స్‌ సలీమ్‌ జావేద్‌లలో ఒకడైన సలీమ్‌ఖాన్‌ కుమారుడే సల్మాన్‌ఖాన్‌.  1988లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్ అదే ఏడాది  ‘బీవీ హోతో ఐసీ’ చిత్రంలో ఒక క్యారెక్టర్‌ పోషించడం ద్వారా నటుడిగా మారాడు. ఆ మరుసటి సంవత్సరమే ‘మైనే ప్యార్‌ కియా’ సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమాతో సల్మాన్ ఖాన్ స్టార్ హీరో అయిపోయారు. ఆ తరువాత  ‘హమ్‌ ఆప్‌కె హై కౌన్‌’ చిత్రంతో ఇక వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది.   వరుస చిత్రాలతో స్టార్ డమ్ పొందాడు. కండల వీరుడిగా గుర్తింపు పొంది. అశేష ప్రేక్షకాభిమానాన్ని చూరగొన్నాడు.  ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై సినిమా షూటింగ్ లో భాగంగా రాజస్థాన్ లో ఉన్న సమయంలో ఆయన అక్కడి అటవీ ప్రాంతంలో సరదాగా షూటింగ్ కు వెళ్లి  కృష్ణజింకను వేటాడారన్న అభియోగాలతో సల్మాన్ ఖాన్ పై 1998 అక్టోబర్‌ 2న  కేసు నమోదైంది.   అరెస్టై  20 రోజులు జైల్లో ఉన్నాడు. సల్మాన్‌ ఖాన్‌ కృష్ణజింకను వేటాడినట్టు ఆధారాలు లేని కారణంగా రాజస్థాన్‌ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. అక్కడితో ఆగని రాజస్థాన్‌ ప్రభుత్వం కేసును సుప్రీమ్‌ కోర్టుకు తీసుకెళ్లింది. 26 ఏళ్ళుగా సుప్రీమ్‌ కోర్టులో ఈ కేసు నడుస్తోంది. అయితే ఇక్కడే బిష్ణోయ్ రంగ ప్రవేశం చేశాడు. తమకు అత్యంత పవిత్రమైన కృష్ణ జింకను వేటాడి వధించిన కేసులో ఇన్నాళ్లైనా ఫలితం వెలువడకపోవడంతో  లారెన్స్‌ బిష్ణోయ్‌ రగిలిపోయాడు. సల్మాన్ ను ఖతం చేస్తామని ప్రతినపూనాడు. నిజానికి సల్మాన్‌ఖాన్‌పై కృష్ణ జింక వధ కేసు నమోదయ్యే సమయానికి లారెన్స్ బిష్ణోయ్ ఐదేళ్ల బాలుడు. అయితే ఇప్పుడు అతడో పెద్ద గ్యాంగ్ స్టర్  700 మంది సభ్యులతో తన నేర సామ్రాజ్యాన్ని దేశ వ్యాప్తంగా విస్తరించాడు. ప్రధానంగా ఐదారు రాష్ట్రాలలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చాలా చాలా పవర్ ఫుల్.  సల్మాన్‌ఖాన్‌ని చంపడమే తన ధ్యేయమని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సల్మాన్‌కి అత్యంత సన్నిహితుడైన మంత్రి బాబా సిద్ధిఖీని చంపడం ద్వారా తను ఏమిటో నిరూపించుకోవాలనుకున్నాడు లారెన్స్ బిష్ణోయ్‌. నిరూపించుకున్నాడు కూడా.   ప్రస్తుతం సబర్మతి జైలులో ఉన్న బిష్ణోయ్‌.. అక్కడి నుంచే తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ ను హత్య చేస్తామంటూ హెచ్చరికలు పంపుతున్నాడు. అందుకోసం రెక్కీలు కూడా జరుగుతున్నాయి. గత ఏప్రిల్ లో సల్మాన్ ఖాన్ నివాసం సమీపంలో ఇద్దరు వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. సల్మాన్ ఖాన్ హత్యకు ఈ కాల్పుల ఘటన ఒక రెక్కీ అని పోలీసులు భావిస్తున్నారు. సల్మాన్ నివాసం వద్ద కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు పలువురిని అరెస్టు చేశారు కూడా.  సల్మాన్ కు సన్నిహితుడైన  మంత్రి సిద్దిఖీ హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్, అతడి సోదరుడు అన్ మోల్ సహా మరో  ముగ్గురు కీలక నిందితులు. సల్మాన్ ను తాము క్షమించి వదిలేయాలంటే బిష్ణోయ్ ఆలయానికి వచ్చి సల్మాన్ క్షమాపణ చెప్పాలన్నది వారి డిమాండ్. లేదా.. సల్మాన్ ఐదు కోట్లు చెల్లస్తే చంపకుండా వదిలేస్తామన్నది బిష్ణోయ్ చేసిన ప్రపోజల్. మరి సల్మాన్ ఏం చేస్తాడన్నది చూడాల్సి ఉంది.  
Publish Date: Oct 21, 2024 1:13PM

షర్మిలతో కాళ్ల బేరానికి జగన్?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దారులన్నీ మూసుకుపోయాయి. రాజకీయంగా మనుగడ సాగించాలంటే.. తన తీరు మార్చుకోక తప్పదని అర్ధమైంది. వైసీపీకి ఎటూ పొలిటికల్ ఫ్యూచర్ జీరో అని అవగతమైంది. ఇప్పుడు రాజకీయంగా ఉనికి కాపాడుకోవాలంటే కాంగ్రెస్ వినా మరో  దిక్కు లేదని అవగతమైంది. కాంగ్రెస్ కు అనుకూలంగా ఎన్ని ప్రకటనలు చేసినా.. అడగకుండానే ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నా.. అటు నుంచి ఎటువంటి స్పందనా కనిపించడం లేదు. ఇందుకు కారణం ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షరాలిగా ఉన్న తన సొంత చెల్లి షర్మిల అనే విషయం బోధపడింది. ఇప్పుడు ఆమెతో సఖ్యత ఉంటే తప్ప కాంగ్రెస్ తనను దరి చేయనీయదన్న నిర్ధారణకు వచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే ఆమెతో రాయబేరాలకు, రాజీ ప్రయత్నాలకు తెరతీశారు జగన్. అవసరమైతే కాళ్ల బేరానికి దిగైనా సరే షర్మిలతో సఖ్యత పెంచుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు.   నిజానికి  జగన్ నైజం తెలిసిన వారెవరూ జగన్ చెల్లెలితో కాళ్లబేరానికి దిగడం పట్ల ఆశ్చర్యపోరు. ఎందుకంటే జగన్ తీరు అందితే జుట్టు, అందకుంటే కాళ్లు అన్నట్లుగానే ఉంటుంది.  ఐదేళ్లు అధికారంలో ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆద్యంతం అహంకార పూరితంగా వ్య‌వ‌హ‌రించారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన    చంద్ర‌బాబు నాయుడుతో దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంతో పాటు, సొంత చెల్లి, త‌ల్లి ప‌ట్ల‌ కూడా అదే ప‌ద్ద‌తిని అవ‌లంబించారు. అధికార అహంతో త‌న‌కు వ్య‌తిరేకంగా మాట్లాడిన వాళ్ల‌పై కేసులు పెట్టి, పోలీసుల‌తో కొట్టించి పైశాచికానందం పొందారు.   ఇప్పుడా అధికారం పోయింది. జనం ఛీకొట్టారు. ఎంతగా అంటే ఆయనకు విపక్ష నేత హోదా ఇవ్వలేదు. ఆయన పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే ఇచ్చేశారు. ఇంత కాలం తనకు పెట్టని కోటగా ఉన్న కడప జిల్లాలో కూడా ఆయనకు అత్తెసరు మార్కులే వేశారు. అధికారంలో ఉన్నంత కాలం తనకు అన్ని విధాలుగా సహకారం అందించిన కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా ఇప్పుడు ఆయనకు వీసమెత్తు విలువ కూడా ఇవ్వడం లేదు. పైపెచ్చు ఇప్పుడు బీజేపీ తెలుగుదేశంతో పొత్తులో ఉంది. కేంద్రంలో మోడీ సర్కార్ మనుగడ సాగించాలంటే.. చంద్రబాబు మద్దతు తప్పని సరి. అందుకే  జగన్ కు దూరం పెడుతోంది. దీంతో ఇక ఇప్పుడు ఆయన మెడకు ఇంత కాలం విచారణకు కూడా రాకుండా పెండింగ్ లో ఉన్న కేసుల విచారణ వేగం పుంజుకోనుంది. కోడికత్తి కేసు, గులకరాయి దాడి కేసులలో కూడా ఆయన ఇక ముందు కోర్టుకు హాజరు కాకతప్పని పరిస్థితి. సో ఇక బీజేపీతో లాంభం లేదు. సార్వత్రిక ఎన్నికలలో సత్తా చాటి బలమైన విపక్షంగా అవతరించిన కాంగ్రెస్ పంచన చేరితేనైనా ఏదో మేరకు రక్షణ ఉంటుందని జగన్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.  అందుకే ఆ పార్టీ హర్యానా ఎన్నికలలో పరాజయం వెనుక ఈవీఎంల ట్యాంపరింగ్ ఉందంటూ తనంత తానుగానే ప్రకటించేసి ఆ పార్టీ దృష్టిలో పడేందుకు విఫలయత్నం చేశారు. అయితే జగన్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కాంగ్రెస్ నుంచి మాత్రం స్పందన కనిపించడం లేదు సరికదా.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్  అధ్యక్షురాలు, సొంత చెల్లెలు వైఎస్ షర్మిల.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై కంటే.. కనీసం విపక్ష హోదా కూడా లేకుండా, ఉనికి కోసం వెంపర్లాడుతున్న వైసీపీపైనా, జగన్ పైనే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. జగన్ అరాచకపాలనలోని అన్యాయాలు, అక్రమాలను ఎలుగెత్తి చాటి.. జగన్ పై చర్యలకు చంద్రబాబు సర్కార్ ను డిమాండ్ చేస్తున్నారు. పనిలో పనిగా షర్మిలను మంచి చేసుకోవడం కోసం కాంగ్రెస్ ను వీడి వైసీపీలోకి వస్తే సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తానని కూడా రాయబారం నడిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. అయితే జగన్ రాయబారాన్ని నిర్ద్వంద్వంగా తిప్పికొట్టారనీ ప్రచారం జరుగుతోంది. జగన్ ఫార్ములా అందితే జుట్టు అందకుంటే కాళ్లు ఫార్ములా షర్మిల వద్ద ఇసుమంతైనా పని చేసినట్లు కనిపించదు.    ఆస్తి విషయంలో అన్న జగన్ తమకు అన్యాయం చేశారని షర్మిల పదేపదే చెబుతున్నారు. ఇప్పుడు షర్మిలను మంచి చేసుకోవడానికి ఆమెకు జగన్ ఆస్తులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని పరిశీలకులు చెబుతున్నారు. జగన్ బెంగళూరులో మకాం వేసి మరీ మధ్యవర్తులద్వారా షర్మిలతో రాయబేరాలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. పది అడుగులు కిందకు దిగైనా సరే షర్మిలతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంటే రాజకీయంగా ఏదో మేరకు నిలదొక్కుకోవచ్చని, కాంగ్రెస్ కు దగ్గర కావచ్చనీ జగన్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి జగన్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో?!
Publish Date: Oct 21, 2024 12:59PM

అమరావతి సాకారం సత్వరం!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇక చకచకా సాగుతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టత ఇచ్చారు. నిర్దిష్ట కాల వ్యవధిలో అమరావతి నిర్మాణం పూర్తి కావాలన్న కృత నిశ్చయంతో ఉన్న చంద్రబాబు.. మూడేళ్లలో అమరావతి పూర్తి చేయాలన్న విస్పష్ట ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇక అమరావతి పనులు పరుగులు పెడతాయనడంలో సందేహం లేదు.  జగన్ ఐదేళ్ల అరాచక పాలనలో ఆయన అమరావతిపై కక్ష కట్టినట్లుగా వ్యవహరించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి నిర్మాణ పనులను ఆపేశారు. వైసీపీ నేతలు, మంత్రులు అయితే అమరావతిని శ్మశానంతో పోల్చారు. భ్రమరావతి అని ఎగతాళి చేశారు. గ్రాఫిక్స్ అంటూ ఎద్దేవా చేశారు. అదే రాజధాని అమరావతిలో చంద్రబాబు హయాంలో నిర్మాణమైన సచివాలయం, అసెంబ్లీలో కార్యకలాపాలను కొనసాగిస్తూనే అమరావతిపై దుష్ప్రచారం చేశారు.  2019లో ప్రభుత్వం మారడంతో పనులకు బ్రేక్ పడ్డాయి.ఆ ప్రదేశాలు పిచ్చిమొక్కలకు ఆలవాలమైంది.అమరావతి రాజధానికి పొలాలు ఇచ్చిన రైతులు ఇక్కడే నిర్మించాలని ఉద్యమం చేసారు.వైసీపీ ప్రభుత్వం అమరావతి కి వ్యతిరేకంగా మూడురాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చారు.విశాఖను చేస్తామన్నారు.చివరికి ఐదేళ్లు రాజధాని లేకుండా,రాకుండా గడిపేశారు.  2024లో  కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతి పేరు బయటకువచ్చింది. కేంద్రం కూడా పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు  ముందుకు వచ్చింది. అయితే గత ఐదేళ్ల జగన్ నిర్వాకం కారణంగా అమరావతి మొత్తం పిచ్చిచెట్లు, తుప్పలతో జంగిల్ గా మారింది. దీంతో చంద్రబాబు సర్కార్ తొలుత యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లయరెన్స్ పనులను చేపట్టింది. జంగిల్ క్లియరెన్స్ పూర్తి కావడంతో శనివారం అమరావతి పనులను పున: ప్రారంభించారు.  సచివాలయం,అసెంబ్లీ,కొన్ని కార్యాలయాలు బాబు హాయాంలో గతంలో పూర్తిఅయ్యాయి. అధికారుల,ఉద్యోగుల క్వార్టర్స్ సగంలో ఆగిపోయాయి. మరికొన్ని నిర్మాణాలు చివరిదశలో ఆగిపోయాయి. రాజధాని కోసం 54వేల ఎకరాలను సేకరించామని సీఎం చంద్రబాబు చెప్పారు.దీనిలో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూములు 30వేల ఎకరాలుపైగా ఉన్నాయి. గత ఐదేళ్లుగా రాజధాని రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను కూడా చంద్రబాబు క్లియర్ చేసారు. పోలవరం కొంచం ఆలస్యమవచ్చుగానీ అమరావతి విషయంలో ఎటువంటి జాప్యం ఉండదని చంద్రబాబు ఉద్ఘాటించారు. రహదారులు, ఇతర సంస్థల ఏర్పాటుతో పాటు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చేలా   ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సీఆర్డీఏ రాజధాని నిర్మాణ బాధ్యతలను చేపట్టనుంది. హైదరాబాద్ ను తలదన్నేలా, ప్రపంచ స్థాయి నగరంలో అమరావతిని నిర్మించాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు.  హైటెక్ సిటీ,సైబరాబాద్ నిర్మాణాలు చంద్రబాబు హయాంలోనే జరిగాయి.వాటికి దీటుగా అమరావతిని తీర్చిదిద్దే ఆలోచనలో ఆయన ఉన్నారు.  మామూలుగా బాబు ఐదేళ్లలో అమరావతి, పోలవరం పూర్తిచేయాలని సీఎంకాగానే తలచారు. విశాఖ  ఆర్ధిక రాజధానిగా, సినీపరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దాలని భావించారు. అలాగే కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేసి వారినీ అభివృద్ధిలో భాగస్వాములు చేసే ఆలోచనలో ఉన్నారు.అమరావతి రాష్ట్రానికి సెంటర్ పాయింట్. రాజధానికి ఇక్కడే నిర్మిస్తే ప్రజలకు సౌకర్యాలతో పాటు అందుబాటులో ఉంటుందని చంద్రబాబు భావన. అయితే బీజేపీ జమిలి ఎన్నికల బాటలో పయనిస్తుండటంతో ముందస్తు ఎన్నికలు తప్పవన్న నిర్దారణకు వచ్చిన చంద్రబాబు అందుకు అనుగుణంగా అమరావతి నిర్మాణ వ్యవధిని కుదించారు.  మూడేళ్లలో రాజధాని పూర్తికావాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా ముందుకు పోతున్నారు.అలాగే సూపర్ సిక్స్ హామీలను కూడా  జనవరి నుంచే అమలు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి అత్యాధునిక రాజధాని మూడేళ్లలో సాకారం కావడం తథ్యమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. 
Publish Date: Oct 21, 2024 11:11AM

గేట్ర‌ర్‌పై బీజేపీ గురి.. చంద్ర‌బాబు, అమిత్‌షా భేటీలో చ‌ర్చ‌!

తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆశించిన స్థాయిలో బీజేపీకి స్థానాలు ద‌క్క‌క‌పోయినా.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో మంచి ఫ‌లితాల‌నే రాబ‌ట్టింది. ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించ‌డంతో.. తెలంగాణ‌లో బ‌ల‌మైన పార్టీగా ఎదుగుతున్నట్లు బీజేపీ చాటింది. తాజాగా కాంగ్రెస్ పార్టీపై బీజేపీ దూకుడుగా ముందుకెళ్తున్నది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తర‌హాలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నిస్తూ అధికార పార్టీకి స‌వాళ్లు విసురుతోంది. ఈ క్ర‌మంలోనే గ్రేటర్ ఎన్నిక‌ల‌పై బీజేపీ గురి పెట్టింది. వ‌చ్చే ఏడాది జ‌రిగే గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధించాల‌ని ఆ పార్టీ నేత‌లు ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీలో ఎన్డీయే కూట‌మిలో తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు ఉన్నాయి. తెలంగాణ‌లోనూ తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల‌ను క‌లుపుకొని గ్రేట‌ర్ ఎన్నికల్లో పోటీ చేయాల‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం లాంటి బ‌ల‌మైన పార్టీ అండ‌దండ‌లు ఉంటే గ్రేట‌ర్‌లో విజ‌యం న‌ల్లేరుపై బండి న‌డకే అవుతుంద‌ని బీజేపీ అధిష్టానం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త ప‌దేళ్లుగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో బీఆర్ఎస్ హ‌వా కొనసాగుతూ వ‌చ్చింది. రాజకీయంగా బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏ గేమ్ ఆడితే అదే హైదరాబాద్ లో కీలకంగా మారేది. కానీ, ఇప్పుడు కథ మారింది. బీఆర్ఎస్ క్ర‌మంగా త‌న ప్రాబ‌ల్యాన్ని కోల్పోతుంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మితో గ్రేటర్ లోని ప‌లువురు నేతలు పార్టీని వీడారు. గ్రేటర్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మరోసారి నిలబెట్టుకోలేక పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రేటర్ పై ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో బీఆర్ఎస్ కి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్ సహా పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. దీంతో గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది. గ్రేటర్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ లోని కీలక నేతలు ఆ పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినపడుతోంది. మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ, హైడ్రా పేరుతో హడలెత్తిస్తోంది. ముఖ్యంగా నగరంలో చెరువులు, నాళాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. ఈ పరిణామం నగర వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. మ‌రో ఏడాదిలో గ్రేటర్ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు, మూసీ సుందరీకరణకు ఎందుకు ప్రాధాన్య‌త‌నిస్తున్నార‌న్న‌ది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. గ్రేటర్ పరిధిలోని పలువురు కాంగ్రెస్ నేతలు సైతం ప్ర‌భుత్వ తీరును  త‌ప్పుప‌డుతున్నారు. మ‌రో వైపు ప్రభుత్వ తీరుపై గ్రేటర్ వాసుల్లోనూ వ్యతిరేకత పెరుగుతోంది. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటున్నది.  గ్రేటర్ పరిధిలో ఎక్కువగా సెటిలర్స్ ఉన్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఎన్నోఏళ్లుగా హైదరాబాద్ నగరంలో స్థిరపడిపోయారు. వీరంతా ఎక్కువ శాతం తెలుగుదేశం మద్దతుదారులు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పెదగా క్రీయాశీలంగా లేకపోవటంతో గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం శ్రేణులు, సానుభూతిపరులు బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు.ఇప్పుడు  గ్రేటర్ పరిధిలోని తెలుగుదేశం సానుభూతిపరులను తమవైపుకు తిప్పుకొనేలా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. వచ్చే ఏడాది జరిగే గ్రేటర్ ఎన్నికల్లోనూ మూడు పార్టీలూ కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని బీజేపీ పెద్దలు టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా.. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తెలంగాణలో తెలుగుదేశం పోటీకి దూరంగా ఉంది.  బీజేపీతో పొత్తు ఉంటుంద‌ని, ఖ‌మ్మం, హైద‌రాబాద్‌, న‌ల్గొండ‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ తోపాటు ప‌లు జిల్లాల్లోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ అభ్య‌ర్థులు బ‌రిలోకి దిగుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, తెలంగాణ బీజేపీలోని కొంద‌రు నేత‌లు తెలుగుదేశంతో పొత్తుకు అభ్యంత‌రం చెప్ప‌డంతో బీజేపీ ఒంట‌రిగా ఎన్నిక‌ల‌కు వెళ్లింది. తెలుగుదేశం పోటీకి దూరంగా ఉంది. దీంతో తెలుగుదేశం సానుభూతిప‌రులు అధిక‌శాతం మంది రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వం వ‌హించిన కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచారు.  మ‌రో ఏడాది త‌రువాత జ‌ర‌గ‌బోయే గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లోనూ టీడీపీ పోటీలో లేకుంటే ఆ పార్టీ మ‌ద్ద‌తుదారులు కాంగ్రెస్ కే మ‌ద్ద‌తుగా నిలిచే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చేసిన త‌ప్పుచేయ‌కుండా,  తెలుగుదేశంతో క‌లిసి పోటీ చేస్తేనే బాగుంటుంద‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నారు. తెలుగుదేశంతోపాటు జ‌న‌సేనని కూడా క‌లుపుకొని గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు వెళితే మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకోవ‌టం సాధ్య‌మ‌వుతుంద‌ని బీజేపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. అయితే, ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉండ‌టంతో ఆ స‌మ‌యానికి రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితులు ఏ విధంగా మారుతోయో వేచి చూడాల్సిందే.
Publish Date: Oct 21, 2024 7:34AM