తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు.. ఏబీవీ వ్యూహమేంటి?
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు.. ఏబీవీ వ్యూహమేంటి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఒక సంచలనం. వైసీపీ హయాంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, రాజకీయ వేధింపులు అన్నీఇన్నీ కావు. డిప్యూటీ జనరల్ ర్యాంక్ అధికారి అయిన ఏబీవీని 2019 నుండి 2024 వరకు ఐదేళ్ల పాటు ఎలాంటి ప్రధాన పోస్టింగ్ ఇవ్వకుండా.. తీవ్రంగా ఇబ్బంది పెట్టింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. ఆయనను సర్వీస్ నుండి సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్‌పై ఏబీవీ సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ , హైకోర్టు, చివరకు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లారు. రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్ పొడిగించలేరని, 2022 ఏప్రిల్ 22న దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేస్తూ ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత కూడా హైకోర్టులో క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను 2024 మే 31న న్యాయస్థానం కొట్టివేసింది. ఇలా ఐదేళ్ల పాటు జగన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తిన ఏబీవీ, సహజంగానే అప్పట్లో ఎన్డీయే కూటమికి నైతిక మద్దతుగా నిలిచారు. అయితే, ఇటీవల రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏబీవీ.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాలను, కొన్ని పోలీస్ చర్యలను ఏబీవీ బాహాటంగా విమర్శిస్తున్నారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ఏబీవీ.. ఇప్పుడు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారా అన్న సందేహాలు కూడా వెల్లువెత్తాయి. అయితే తాను వైపీపీవైపు మొగ్గు చూపుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారానని ఏబీ వెంటటేశ్వరరావు నిర్ద్వంద్వంగా ఖండించారు. ఆ ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదని కుండబద్దలు కొట్టారు. తనకు వ్యక్తిగత నైతిక విలువలు, మర్యాదలు ఉన్నాయన్న ఆయన.. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన వేదికపై అంబటి రాంబాబు మాట్లాడిన ఒక్క మాటను కూడా తాను వినలేదన్న ఏబీవీ.. అంబటి రాంబాబు వేదికపైకి రాగానే తాను వేదికపై నుంచి వెళ్లిపోవడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోనే కూర్చున్నానని వివరించిన ఏబీవీ.. వైసీపీ ప్రభుత్వం అణచివేయాలని చూసిందని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం కూడా అదే తప్పులను పునరావృతం చేయకూడదనేదే తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. దీంతో ఏబీవీకి ప్రస్తుత కూటమి ప్రభుత్వంతో కొన్ని పాలనాపరమైన విబేధాలు ఉండొచ్చు కానీ, ఆయన ఆ కారణంతో వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఏ మాత్రం లేవనీ, ఏబీవీ కుండబద్దలు కొట్టినట్లుచెప్పినట్లైంది. ABV IPS, Ambati Rambabu, AP Politics, NDA Government Criticism, YCP Ecosystem

Publish Date: Jul 14, 2026 11:44AM
హరీష్ రావు.. కారు దిగి కాషాయ జెండా భుజానికెత్తుకుంటారా?
హరీష్ రావు.. కారు దిగి కాషాయ జెండా భుజానికెత్తుకుంటారా?

తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ కీలక నేత, ఆ పార్టీలో ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అడుగులు ఎటువైపు అన్న చర్చ జోరుగా సాగుతోంది. అసలు 2018 ఎన్నికలకు ముందు నుంచే హరీష్ రావు.. కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి సొంత వర్గంతో కాషాయగూటికి చేరుతారన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత ఆ ప్రచారం మరింత జోరందుకుంది. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఇప్పుడు హరీష్ రావు రాజకీయ గమనం రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ రేవంత్ రెడ్డి ఏమన్నారంటే.. హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు. వాస్తవానికి హరీష్ రావు కారు దిగడంపై చర్చోపచర్చలు జరిగాయి. కాళేశ్వరం విషయంలో హరీష్ అవినీతికి పాల్పడ్డారని భావించిన కేసీఆర్.. ఆయనను పార్టీకి, పార్టీ కార్యక్రమాలకూ దూరంపెట్టారన్న ప్రచారం జోరుగా సాగింది. అలాగే రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండో సారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రమారమి ఏడాది పాటు హరీష్ ను కేబినెట్ లోకి తీసుకోలేదు. ఈ విషయాలను గుర్తు చేసి మరీ రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ కార్యనిర్వాహఖ అధ్యక్షుడు కేటీఆర్ కన్నెపల్లి ప్రాజెక్ట్ వద్దకు హరీష్ ని ఎందుకు వెంటబెట్టుకుపోలేదని ప్రశ్నించారు. ఇక పోతే బిఆర్ఎస్ లో అంతర్గతంగా కేటీఆర్ వర్సెస్ హరీష్ కేంద్రంగా ఆధిపత్య పోరు సాగుతుందని సొంత పార్టీ క్యాడరే అంటున్న పరిస్థితి. కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టకపోవడానికి, ఇప్పటికీ బిఆర్ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేటీఆర్ పేరు కేసీఆర్ ప్రకటించకపోవడానికీ తెర వెనుక ఉన్న కారణం ఇదేనన్న ప్రచారం కూడా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. తాజాగారేవంత్ రెడ్డి హరీష్ బీజేపీ గూటికి అంటే చేసిన వ్యఖ్యలు ఆ ప్రాచారానికి మరింత బలం చేకూర్చాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాలి. Harish Rao to Join Bjp, Revanth Reddy vs Harish Rao, Telangana Politics, BRS BJP Secret Alliance, Revanth Reddy Challenges KCR, Telangana Political News Latest.

Publish Date: Jul 11, 2026 3:51PM
ప్రశ్న రావణ్ విషయంలో వైసీపీ మైండ్ గేమ్ బూమరాంగ్.!
ప్రశ్న రావణ్ విషయంలో వైసీపీ మైండ్ గేమ్ బూమరాంగ్.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్, ఆ తర్వాత అతనికి విధించిన జ్యుడీషియల్ రిమాండ్ అంశం పెను సంచలనంగా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలతో నిరంతరం వార్తల్లో ఉండే ప్రశ్న రావణ్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం వెనుక ఉన్న రాజకీయం ఇప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా అసభ్యకరమైన, మతపరమైన విద్వేషాలు రేకెత్తించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. అయితే, ఈ అరెస్ట్ ఉదంతాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం పూర్తిగా బెడసికొట్టడమే కాకుండా బూమరాంగ్ అయ్యింది. ఒక విధంగా ప్రశ్న రావణ్ విషయంలో వైసీపీ సెల్ఫ్ గోల్ చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా సాగే బూతుల సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు సాగుతూ ప్రజామోదం పొందితే.. అదే విషయంలో క్షణానికో మాట మార్చిన చందంగా వెసీపీ వేసిన అడుగులు ఆ పార్టీలో స్థిరత్వ లేమినీ, గందరగోళాన్నీ, అయోమయాన్ని వెల్లడి చేసి.. వైపీపీ ప్రతిష్ఠను మసకబార్చింది. ప్రశ్న రావణ్ వ్యవహారంలో వైసీపీ తొలి నుంచీ తొందరపాటుగా వ్యవహరించడమే కాకుండా, రోజుకో స్టాండ్ మారుస్తూ ప్రజల ముందు చులకన అయ్యింది. ప్రశ్న రావణ్ వ్యవహారాన్ని రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవాలన్న ఉద్దేశంతో వైసీపీ.. ప్రశ్న రావణ్ గతంలో వైసీపీ అధినేత జగన్ ను, వైసీపీ విధానాలనూ విమర్శించిన పాత వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ప్రశ్న రావణ్ ను తెలుగుదేశం మద్దతుదారుడంటూ ప్రచారం చేసింది. అయితే.. వైసిపి ఆడిన ఈ మైండ్ గేమ్ ఎక్కువ సేపు నిలవలేదు. టిడిపి శ్రేణులు అంతే వేగంగా కౌంటర్ ఇస్తూ, వైసిపి నేతల అసలు రంగును బయటపెట్టారు. ఇక అక్కడ నుంచీ వైసీపీ ఒకదాని వెంట ఒకటిగా వరుస తప్పిదాలు చేసింది. ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది. ఒకవైపు ప్రశ్న రావణ్‌ను తెలుగుదేశం సానుభూతి పరుడిగా చిత్రించే ప్రయత్నం చేస్తూనే.. అతడి కుటుంబ సభ్యులు వైసీపీ అధినేత జగన్ ను కలవడం, వారితో భేటీ తరువాత.. జగన్ సోషల్ మీడియా వేదికగా హే రామ్..సేవ్ ఆంధ్రా అంటూ కూటమిపై విమర్శలు గుప్పించి ప్రశ్న రావన్ కు మద్దతుగా నిలవడం జరిగింది. అక్కడితో ఆగకుండా.. ప్రశ్న రావణ్ కు వైసిపి తరఫున పూర్తి లీగల్ సపోర్ట్ అందిస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు ఆ పార్టీకి చెందిన సీనియన్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. వాస్తవానికి ప్రశ్న రావణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, మత విద్వేష పూరిత ప్రచారాల పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అతని అరెస్టును సాధారణ ప్రజలు, నెటిజన్లు పూర్తిగా సమర్థిస్తున్నారు. ఇలాంటి నెగిటివిటీ ఉన్న వ్యక్తి విషయంలో వైసిపి అనుసరించిన ద్వంద్వ వైఖరి ఆ పార్టీకే నష్టం చేకూర్చింది. ప్రశ్న రావణ్ విషయంలో రోజుకో మాట మారుస్తూ.. ఒకరోజు అతను టిడిపి మనిషి అని, మరుసటి రోజే అతనికి జగన్ పూర్తి లీగల్ సపోర్ట్ ఇస్తారని చెప్పడం వైసిపి సోషల్ మీడియా ఎకోసిస్టమ్‌లో ఉన్న గందరగోళం, అయోమయాన్ని బహిర్గతం చేసింది. సానుభూతి రాజకీయాల కోసం ఆరాటపడి, సమాజంలో వ్యతిరేకత ఉన్న వ్యక్తిని వెనకేసుకురావడం ద్వారా వైసిపి తన ప్రతిష్ఠను తానే మసకబార్చుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ నాయకులు ప్రశ్న రావణ్ కు మద్దతుగా మాట్లాడిన పాత వీడియోలు బయటకు రావడంతో వైసీపీ ఫౌల్ గేమ్ బహిర్గతమైందనీ, ఫలితంగా, ఈ సినారియోలో వైసీపీ తనకు ఉన్న అన్ని కార్డులను ప్రయోగించి కూడా అభాసుపాలైందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ycp self goal, ys jagan prashna ravan, ambati rambabu press meet, ap political news, Telugu One

Publish Date: Jul 10, 2026 12:28PM
తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ మనవడు దగ్గుబాటి హితేష్.!
తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ మనవడు దగ్గుబాటి హితేష్.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేవబోతోంది. నందమూరి, దగ్గుబాటి కుటుంబాల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న యువనేత దగ్గుబాటి హితేష్ త్వరలోనే పసుపు కండువా కప్పుకో వడానికి సిద్ధమవుతున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. దశాబ్దాలుగా నందమూరి, దగ్గుబాటి కుటుంబాల మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యాలు, అలాగే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ఉన్న విభేదాలన్నీ ఇప్పుడు పూర్తిగా సమసిపోయాయని, అందువల్లే హితేష్ రాజకీయ ఎంట్రీకి సర్వం సిద్ధమైందని అంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న అంతరాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ముఖ్యంగా కుటుంబంలో జరిగిన కొన్ని శుభకార్యాలు, ప్రత్యేక కలయికల తర్వాత విభేదాలన్నీ పక్కన పెట్టి.. అందరూ కలిసిపోయారు. ఈ క్రమంలోనే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే ఆలోచనలో ఉన్న చంద్రబాబు నాయుడు, హితేష్ చెంచురాంను పార్టీలోకి ఆహ్వానిం చడంపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హితేష్ తల్లి దగ్గుబాటి పురందేశ్వరి భారతీయ జనతా పార్టీ లో కీలక నేతగా, ఎంపీగా కొనసాగుతుండగా, తండ్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏ రాజకీయ పార్టీలోనూ యాక్టివ్‌గా లేరు. ఈ నేపథ్యంలో హితేష్‌ను నేరుగా తెలుగుదేశం పార్టీ ద్వారా యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తీసుకురావాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దగ్గుబాటి హితేష్ చెంచురాం రాజకీయ రంగ ప్రవేశం కోసం గతంలోనే ప్రయత్నాలు జరిగాయి. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆయన ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే.. ఆ సమయంలో సాంకేతిక కారణాల వల్ల, ముఖ్యంగా ఆయనకు సంబంధించిన సిటిజన్‌షిప్, కొన్ని డాక్యుమెంటేషన్ ప్రక్రియలు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం చేజారిపోయింది. ఆ తర్వాత జరిగిన 2024 ఎన్నికల్లో కూడా ఆయన పోటీకి దూరంగానే ఉన్నారు.ఇప్పుడు ఆ సాంకేతిక అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోవడంతో, హితేష్ చెంచరాం.. పర్చూరు లేదా బాపట్ల జిల్లా పరిధిలోని ఏదైనా కీలక నియోజకవర్గం నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దశాబ్దాల కాలంగా ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించిన దగ్గుబాటి కుటుంబం మళ్లీ టిడిపి గూటికి చేరితే, ఆ ప్రాంతంలో పార్టీ క్యాడర్‌కు కొత్త ఉత్సాహం రావడం ఖాయమంటున్నారు. చంద్రబాబు నాయుడు కూడా హితేష్‌కు ఒక స్పష్టమైన భవిష్యత్తు హామీని ఇచ్చి, పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుగుదేశం వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎన్టీఆర్ మనవడిగా, ఉన్నత విద్యావంతుడిగా, స్పష్టమైన విజన్ ఉన్న యువకుడిగా హితేష్ చెంచురాం తెలుగుదేశం పార్టీకి కొత్త మైలేజ్ తీసుకువస్తారని భావిస్తున్నారు. హితేష్ తెలుగుదశంలో చేరిక విషయంలో అధికారిక ప్రకటనే తరువాయి అంటున్నారు. daggubati hitesh tdp, ntr grandson hitesh, daggubati purandeswari son, chandrababu naidu, ap politics

Publish Date: Jul 9, 2026 3:17PM
జగన్ గెలుపు ధీమా పట్ల వైసీపీలోనే కనిపించని విశ్వాసం.!
జగన్ గెలుపు ధీమా పట్ల వైసీపీలోనే కనిపించని విశ్వాసం.!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికలలో విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కాదు.. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత జగన్.. ఐదేళ్లు కళ్లు మూసుకుంటే గడిచిపోయాయి, మళ్లీ ఎన్నికలు వస్తాయి, మనమే గెలుస్తాం అంటూ పార్టీ నేతలకు, శ్రేణులకు భరోసా ఇచ్చారు. అన్నట్లుగానే ఆయన ఈ రెండేళ్లూ దాదాపుగా కళ్లు మూసుకునే ఉన్నారు. మరో మూడేళ్లు ఇలా గడిపేస్తే.. ఎన్నికలు వస్తాయి విజయం సాధించేస్తామని పార్టీ నేతలకు, కార్యకర్తలకు చెబుతున్నారు. మధ్యమధ్యలో మావిగన్ వంటి ప్రతిపాదనలు చేస్తున్నారు. బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి... తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ మనపని మనం చేసేస్తున్నాం అని తన జబ్బలు తానే చరిచేసుకుని.. గెలుపు కలలు కంటున్నారు. అంతా బానే ఉంది కానీ తమ పార్టీ అధినేత గెలుపు ధీమా పై వైపీపీ నేతలలో కానీ, క్యాడర్ లో కానీ ఇసుమంతైనా విశ్వాసం కలగడం లేదు. పార్టీ అధినేత తీరు ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికలలో విజయంపై ఆశలు వదిలేసుకోవలసిందేనన్న చర్య వైసీపీ నేతలలో జోరుగా జరుగుతోంది. మావిగన్ వంటి ప్రతిపాదనల వల్ల మరింతగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడం తప్ప మరో ప్రయోజనం ఉండదని శ్రేణులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వీటిని వేటినీ ఖాతరు చేయకుండా వచ్చే ఎన్నికలలో విజయం మనదే అని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయ పరిశీలకులు కూడా.. వచ్చే ఎన్నికలలో జగన్ విజయం అంత వీజీ కాదని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం కూటమి రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా.. వచ్చే ఎన్నికలలో విజయం కోసం కూడావ్యూహం ప్రకారం ముందుకు సాగుతోందంటున్నారు.ఆ వ్యూహమే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కూటమికి మరోసారి అధికార పగ్గాలు అప్పగిస్తాయని అంటున్నారు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్.. ఐదేళ్లలో ప్రభుత్వంపై వచ్చే అసంతృప్తే తనను గెలిపిస్తుందని నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల సమగ్ర సర్వే (సర్) జరుగుతోంది. తద్వారా దొంగ ఓట్లు తొలగిపోనున్నాయి ఈ విషయంలో వైసీపీ ఆందోళన ఆ పార్టీ గతంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్పించిందన్న అభిప్రాయాన్ని జనబాహుల్యంలో కలిగిస్తోంది. అలాగే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి అజెండా ప్రభుత్వంపై సానుకూలతకు దోహదం చేస్తున్నదనీ, రాష్ట్రానికి పరిశ్రమలు తరలివస్తుండటంతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతుండటం.. కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది. అంతే కాకుండా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. రాయలసీమలో తయారీ రంగ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. ఇవన్నీ ప్రజలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలతకు దోహదపడుతున్నాయి. వీటన్నిటికీ తోడు తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య సమన్వయం కూటమిని మరింత బలోపేతం చేస్తున్నది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య విభేదాలు ఉన్నా.. తలెత్తినా వాటిని ఎక్కడికక్కడే సద్దుమణిగించేలా మూడు పార్టీల నాయకులు సమన్వయంతో వ్యవహరిస్తుండటం కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కలిసివస్తోంది. ఈ నేపథ్యంలో వారాంతపు ప్రెస్ మీట్లకే పరిమితమౌతున్న జగన్ తీరు వల్ల వైసీపీకి రాజకీయంగా కోలుకోలేనంతగా నష్టం వాటిల్లుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధినేతే రాష్ట్రాలనికి వారంలో ఓసారి చుట్టపు చూపుగా వస్తూ, పార్ట్ టైమ్ పాలిటిక్స్ కు పరిమితమౌతుండటంతో వైసీపీ నేతలూ, కార్యకర్తలూ కూడా సైలెంటైపోయారని పరిశీలకులు అంటున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో వైసీపీ కనిపించడం లేదని చెబుతున్నారు. AP Politics, NDA Alliance AP, Voter Survey AP, YSRCP Fear, Andhra Pradesh Elections

Publish Date: Jul 7, 2026 12:49PM
వైసీపీలో బొత్స సినిమా అయిపోయిందా?
వైసీపీలో బొత్స సినిమా అయిపోయిందా?

వైసీపీలో బొత్సకు ప్రాధాన్యత తగ్గిపోయిందా? ఆ పార్టీ అధినేత జగన్.. బొత్సను పక్కన పెట్టేశారా? త్వరలో ఆయనకు శాసనమండలిలో ప్రతిపక్ష నేతా హోదా నుంచి ఉద్వాసన చెప్పేస్తారా? అన్న ప్రశ్నలకు వైసీపీ వర్గాల నుంచే ఔనన్న సమాధానం వస్తోంది. ఇందుకు వారు పార్టీ పరంగా ఆయనకు పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదన్న విషయాన్ని రుజువుగా చూపుతున్నారు. ఇటీవల తరచుగా బొత్స అనారోగ్యానికి గురి కావడం వల్లనే జగన్ ఆయనకు విశ్రాంతి ఇవ్వాలనీ, పెద్దగా ఒత్తడి ఉండకూడదన్న ఉద్దేశంతోనే మండలిలో ప్రతిపక్ష నేత హోదానుంచి తప్పించాలని భావిస్తున్నారనీ అంటున్నారు. అయితే పరిశీలకులు మాత్రం.. ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే..బొత్సను జగన్ పక్కన పెట్టడానికి ప్రధాన కారణం, ఆయన గతంలోలా యాక్టివ్ గా లేకపోవడం అంటున్నారు. అలాగే ఇటీవలి కాలంలో ఆయన జగన్ తో పెద్దగా భేటీ అయినట్లు కనిపించకపోవడాన్ని చెబుతున్నారు. అన్నిటికీ మించి బొత్సకు రాజకీయంగా గతంలో ఉన్న పట్టు సడలిందని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వీటన్నిటికీ మించి విజయనగరం జిల్లా వైసీపీ కార్యాలయం స్థలం విషయంలో ఇటీవల తలెత్తిన వివాదం బొత్సకు ఉద్వాసన పలకాలన్న నిర్ణయానికి జగన్ రావడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. పూసపాటి రాజవంశీయుల భూమిని ప్రభుత్వ భూమిగా మార్చి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 33 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వడం జరిగింది. దీనిపై గోవాగవర్నర్ అశోక్ గజపతిరాజు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అది ప్రైవేటు భూమి అని తేలితే.. కార్యాలయ భవనాన్ని వైసీపీ వదులుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే.. వైసీపీ ఇమేజి భారీగా డ్యామేజ్ అవుతుంది. ఈ విషయంలోనే జగన్ బొత్సపై తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారనీ, అప్పట్లో మంత్రి స్థానంలో ఉన్న బొత్స నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడీ వివాదం తలెత్తిందని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. Botsa, sidelined, YCP, Ysjagan, Vijayanagaram, YCP Office, Land Dispute, Inactive

Publish Date: Jul 6, 2026 12:15PM
జగన్ వద్దు.. కాంగ్రెస్ ముద్దు.. కాంగ్రెస్ వైపు వైసీపీ సీనియర్ల చూపు?
జగన్ వద్దు.. కాంగ్రెస్ ముద్దు.. కాంగ్రెస్ వైపు వైసీపీ సీనియర్ల చూపు?

జగన్ ఏకపక్ష నిర్ణయాలు. ఒంటెత్తు పోకడల పట్ల వైసీపీలో తీవ్ర అసంతప్తి వ్యక్తం అవుతోంది. దీంతో ఆ పార్టీ కీలక నేతలు రహస్య భేటీలు నిర్వహించుకుని తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీలో అంతర్గత సంక్షోభం అంతర్గత సంక్షోభం ముదురుతోంది. గత ఎన్నికల ఘోర పరాజయం తర్వాత కూడా జగన్ తన తీరు మార్చుకోకుండా పాత పద్ధతులనే అవలంబిస్తుండటంపై వైసీపీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. 2014 నుండి 2019 మధ్య కాలంలో జగన్ రాజకీయ వ్యూహాలు అప్పట్లో సత్ఫలితాలను ఇచ్చాయి. కానీ 2019లో అధికారం చేపట్టిన తరువాత జగన్ తీసుకున్న నిర్ణయాలు, అవలంబించిన విధానాల కారణంగా ప్రజలలో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వచ్చింది. ఫలితంగా 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని కేవలం 11 స్థానాలలోనే విజయాన్ని కట్టబెట్టిన ప్రజా తీర్పు విస్పష్టంగా తేల్చి చెప్పింది. ఇప్పడు కూడా జగన్ తన పాత పద్ధతిని మార్చుకోకుండా తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రకటనలు తమ రాజకీయ భవిష్యత్ ను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయన్న ఆందోళన, అసంతృప్తీ పార్టీ నేతలలో గూడుకట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. . పార్టీని బలోపేతం చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోకపోగా.. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను కూడా జగన్ పట్టించుకోవడం లేదని సొంత పార్టీ నేతల నుంచే కాకుండా శ్రేణుల నుంచి కూడా ఆరోపణలు వెల్లువెత్తుతన్నాయి. జగన్ ఏకపక్ష నిర్ణయాల వల్ల తాము రాజకీయంగా నష్టపోతున్నామని పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నేతలు అంతర్గత సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలలో పార్టీ అజెండా మావిగన్ అని జగన్ ప్రకటన చేసిన తరువాత.. వైసీపీ సీనియర్లలో నిరాశా, నిస్ఫృహలు నెలకొన్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇంకా జగన్ తోనే ఉంటే.. రాజకీయ భవిష్యత్ శూన్యం అన్న భావన వారిలో ప్రస్ఫుటంగా వ్యక్తమౌతోంది. ఈ కారణంగానే వైసీపీకి చెందిన కొందరు సీనియర్, కీలక నేతలు ఇటీవలి కాలంలో రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుని మరీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుంటున్నట్లు ఏపీ రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. పార్టీ భవిష్యత్తు, తమరాజకీయ భవిష్యత్ పై కేవలం చర్చలకే పరిమితం కావడమే కాకుండా.. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. జగన్ సోదరి, వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు కావడంతో వైసీపీలోని వైఎస్ రాజశేరరెడ్డి అనుయాయులు, అభిమానులు ఆమెతో ఇటీవలి కాలంలో నిరంతరం టచ్ లో ఉంటున్నట్లు చెబుతున్నారు. జగన్ తీరు ఇలాగే ఉంటే.. సమీప భవిష్యత్ లోనే పలువురు కీలక వైసీపీ నేతలు హస్తం గూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. YSRCP Crisis, YS Jagan, Secret Meetings, AP Congress, YS Sharmila, AP Politics, Teluguone

Publish Date: Jul 4, 2026 11:32AM
కెన్యా మాయాద్వీపం మిస్టరీ.. అడుగుపెడితే శవాలు కూడా దొరకవు..?
కెన్యా మాయాద్వీపం మిస్టరీ.. అడుగుపెడితే శవాలు కూడా దొరకవు..?

ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి. అలాంటి ఒక భయంకరమైన, అంతుచిక్కని మాయాద్వీపమే కెన్యాలో ఉంది. హాలీవుడ్ సినిమాల్లో చూపించే అడ్వెంచర్ ఐలాండ్స్ లాగా, అక్కడికి వెళ్లిన వాళ్లు వెళ్లినట్లే మాయమైపోతారు. కనీసం వారి శవాలు కూడా దొరకవు. ఉత్తర కెన్యాలోని రుడాల్ఫ్ సరస్సు మధ్యలో ఉన్న ఈ వింత ద్వీపం పేరు 'ఎన్వైటెనెట్'. స్థానిక గిరిజన తెగ అయిన 'ఎల్ మోలో' భాషలో ఈ పేరుకు అర్థం "నో రిటర్న్" అంటే తిరిగి రావడం లేదని అర్థం. చుట్టూ అందమైన సరస్సు, దట్టమైన అడవి ఉన్నప్పటికీ ఈ ద్వీపంలో ప్రస్తుతం ఒక్క మనిషి కూడా నివసించడం లేదు. ఈ దీవికి ఏదో శాపం ఉందని, అందుకే అక్కడికి వెళ్లిన వారంతా మరణిస్తున్నారని స్థానికులు గట్టిగా నమ్ముతారు. చాలా ఏళ్ల క్రితం ఈ ద్వీపంలో కొంతమంది గిరిజనులు నివసించేవారని చరిత్ర చెబుతోంది. వారు వేటాడుతూ, చేపలు పడుతూ హ్యాపీగా బతికేవారు. బాగా నాగరికత తెలిసిన ఆ ద్వీపవాసులు తరచూ బయటి ప్రపంచంలోకి వచ్చి వ్యాపారాలు కూడా చేసేవారు. అయితే చాలా సంవత్సరాల పాటు ప్రశాంతంగా సాగిన వారి జీవితాల్లో ఒక రాత్రి ఊహించని విపత్తు సంభవించింది. ఒక రోజు వారు మెయిన్ ల్యాండ్‌కు రావడం హఠాత్తుగా ఆపేశారు. దాంతో అనుమానం వచ్చిన పక్క ఊరి ఎల్ మోలో తెగవారు గుంపుగా కలిసి ఆ ద్వీపానికి వెళ్లి చూశారు. అక్కడ వారికి కనిపించిన దృశ్యం చూసి ఒళ్లు గగుర్పొడిచింది. ఆ ద్వీపమంతా ఘోరమైన నిశ్శబ్దంతో, పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయింది. అక్కడ ఎంత వెతికినా ఒక్క మనిషి కూడా కనిపించలేదు. కానీ ఆశ్చర్యకరంగా వారి గుడిసెలు, బాణాలు, నిల్వ చేసుకున్న ఉల్లిగడ్డలు మరియు వస్తువులన్నీ అలాగే చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆరిపోయిన పొయ్యిల దగ్గర కుళ్ళిపోతున్న చేపలు కనిపించాయి. అంటే వారు ముందే ప్లాన్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఒకవేళ ఎవరైనా దాడి చేసి చంపేస్తే కనీసం శవాలు లేదా రక్తపు గుర్తులు ఉండాలి, కానీ అలాంటి ఆధారాలేవీ అక్కడ లేవు. ఆ దీవిలో ఉన్న భయానక వాతావరణాన్ని తట్టుకోలేక వచ్చిన వారు హుటాహుటిన వెనక్కి తిరిగొచ్చారు. ఆ తర్వాత ఆ ద్వీపానికి వెళ్లిన వారిలో చాలామంది గాయపడ్డారు, కొందరు వికలాంగులయ్యారు, మరికొందరు చనిపోయారు. గజఈతగాళ్లు సైతం ఆ సరస్సులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ అంతుచిక్కని మిస్టరీని ఛేదించడానికి 1935 లో వివినా ఫష్ అనే బ్రిటిష్ రీసెర్చర్ ఒక సాహసోపేతమైన ప్రయత్నం చేశాడు. తన ఇద్దరు నమ్మకస్థులైన రీసెర్చర్లు ఎం.షెప్లిస్, బి. దేసన్లను ఆ ద్వీపంలో పరిశోధనల కోసం పంపాడు. వారు ప్రతిరోజూ సాయంత్రం తాము సురక్షితంగా ఉన్నామని చెప్పడానికి ద్వీపంలోని ఎత్తైన ప్రదేశంలో దీపం వెలిగించి సిగ్నల్స్ ఇచ్చేవారు. అంతా సజావుగానే సాగుతోంది అనుకుంటున్న తరుణంలో, రెండు వారాల తర్వాత హఠాత్తుగా ఆ దీపాలు వెలగడం ఆగిపోయాయి, సిగ్నల్స్ నిలిచిపోయాయి. ఆందోళనతో రీసెర్చ్ బృందం ద్వీపానికి వెళ్లి వెతకగా వారి గుడారం అలాగే ఉంది కానీ ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు మాయమైపోయారు. కనీసం వారి మృతదేహాలు కూడా లభించలేదు. విమానాలతో గాలించినా, చెట్టు చెట్టు వెతికినా వారి ఆచూకీ దొరకలేదు. అక్కడ క్రూర జంతువులు కూడా లేవు, మరి వారు ఏమయ్యారనేది నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. స్థానిక ఇతిహాసాల ప్రకారం ఆ ద్వీపంలో భూమి లోపలికి చొచ్చుకుపోయిన కొన్ని వింత పైపులు ఉన్నాయి. వాటి నుండి అప్పుడప్పుడు మంటలు వస్తుంటాయని నమ్ముతారు. అలాగే ఆ దీవి ఎప్పుడూ దట్టమైన పొగమంచుతో నిండి ఉంటుందని, అక్కడ ఎవరికీ కనిపించని ఒక మాయా నగరం దాగి ఉందని గిరిజనులు చెబుతుంటారు. ఆ నగరం నుండి వచ్చే కాంతి ఇంద్రధనుస్సులా, బంగారు ఆభరణాలు మెరిసినట్లు తళతళా మెరుస్తుందని, అక్కడి అద్భుతమైన టవర్ల నుండి వింత శబ్దాలు వస్తాయని అంటారు. ఆ శబ్దాలు విన్నవారు కొన్నాళ్లపాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడతారని స్థానికుల నమ్మకం. సైన్స్‌కు సైతం అంతుచిక్కని ఈ 'నో రిటర్న్' ఐలాండ్ రహస్యం ఇప్పటికీ ఎవరికీ తెలియని ఒక పెద్ద మిస్టరీ.

Publish Date: Jul 3, 2026 5:03PM
మావిగన్.. పేరు ప్రచారానికే జగన్ పరిమితం.. వ్యూహమేంటో గందరగోళం.!
మావిగన్.. పేరు ప్రచారానికే జగన్ పరిమితం.. వ్యూహమేంటో గందరగోళం.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మావిగన్ హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వచ్చే ఎన్నికలలో తమ నినాదం మావిగన్ రాజధాని అని ప్రకటించడం రాజకీయాలలో సంచలనంగా మారింది. పొలిటికల్ హీట్ క్రియేట్ చేసింది. అయితే ఎవరూ మెచ్చని, ఎవరికీ నచ్చని మావిగన్ నినాదం ప్రతిపాదన వెనుక జగన్ వ్యూహం ఏమిటన్నదానిపై ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మచిలీపట్నంలోని తొలి రెండు అక్షరాలు ఎమ్ఏ, విజయవాడ లోని తొలి రెండు అక్షరాలు విఐ, గుంటూరులోని తొలి మూడు అక్షరాలు జియుఎన్ లను తీసుకుని ఈ మూడు నగరాల కలయికే మావిగన్ అంటున్నారు జగన్. జగన్ గతంలో జపించిన మూడు రాజధానుల జపానికి, అప్పటి ఆయన సిద్ధాంతానికి ఇప్పుడు ఆయన చెబుతున్న మావిగన్ కు పొంతన లేదని పరిశీలకులు అంటున్నారు. గతంలో జగన్ మూడు రాజధానులు అన్నప్పుడు ఆయన చెప్పిన ఆ మూడు ప్రాంతాలూ వేర్వేరుగా దూరంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయన మూడు నగరాల కలయిక రాజధాని అంటున్నారు. అయితే ఇప్పుడు జగన్ గతంలో తాను చెప్పిన వికేంద్రీకరణకు తిలోదకాలిచ్చేసి.. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి కొత్త ప్లాన్ ను తెరపైకి తెచ్చారు. అయితే జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదన.. మూడు రాజధానులని గతంలో ఆయన చెప్పిన దాని కంటే గందరగోళంగా, ఏ మాత్రం క్లారిటీ లేకుండా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ ప్రతిపాదిత మావిగన్ లో సచివాలయం ఎక్కడ ఉంటుంది? హైకోర్టు ఎక్కడ నిర్మిస్తారు? అసెంబ్లీ ఎక్కడ? అన్నదానిపై జగన్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అసలా వివరాల జోలికి ఏ మాత్రం పోలేదు. ఈ మూడు ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాలు కనుక రాజధానిని చేసేస్తే అమరావతి అభివృద్ధి చేయనవసరంలేదు కదా అన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమరావతిలో ప్రతిష్టాత్మక భవనాల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తోంది. మరి జగన్ అధికారంలోకి వస్తే అమరావతిలో ఉన్న ఆ భవనాలనే వినియోగిస్తారా? లేక గతంలోలాగే అమరావతిని నిర్వీర్యం చేస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు పరిశీలకులు భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు. ఇందుకు గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను పాడుపెట్టిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అందుకే జగన్.. మావిగన్ విషయంలో తన వ్యూహాన్ని మూడేళ్ల తరువాత వచ్చే ఎన్నికల నాటి వరకూ వెల్లడించే అవకాశం ఇసుమంతైనా లేదని అంటున్నారు. ఎందుకంటే.. తాను అధికారంలోకి వస్తే ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువస్తామని చెబితే.. అమరావతికి ప్రత్యామ్నాయం మావిగన్ అంటూ జగన్ చెప్పిన మాటలు అబద్ధాలు అవుతాయి. అలా కాకుండా, వాటిని వినియోగించం, పాడు పెడతాం, పక్కన పెడతాం అని జగన్ ప్రకటిస్తే.. ప్రజలు ఇప్పటి నుంచే జగన్ ను పక్కన పెట్టేయడం మొదలెడతారు. విఫలమైన మూడు రాజధానుల సిద్ధాంతాన్నే జగన్ పట్టుకు వెళాడుతున్నారన్న అభిప్రాయం ప్రజలలోకి బలంగా వెడుతుంది. అందుకే.. జగన్ మావిగన్ ఏమిటో, ఆయన వ్యూహం ఏమిటో మరో మూడేళ్ల వరకూ వెళ్లడించకుండా.. మావిగన్ అన్న పేరును ప్రచారంలో ఉంచడానికే పరిమితమౌతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Teluguone, AP Capital Issue, Amaravati vs MAVIGUN, YS Jagan Mohan Reddy

Publish Date: Jul 3, 2026 11:23AM
 జగన్  మావిగన్ జపం..  బాబు అభివృద్ధి వ్యూహం!
జగన్ మావిగన్ జపం.. బాబు అభివృద్ధి వ్యూహం!

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి దశాబ్ద కాలం దాటినా, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ ఇంకా రాజధాని చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. నిలకడైన విధానాలు, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాల్సిన రాజధాని అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి రూటు మార్చారు. నిన్నటి వరకు మూడు రాజధానుల నినాదంతో విశాఖపట్నం చుట్టూ రాజకీయాన్ని తిప్పిన జగన్, ఇప్పుడు మావిగన్ మంత్రం పఠిస్తున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు. తాజాగా 2029 ఎన్నికలలో వైసీపీ ప్రధాన నినాదం మావిగన్ అని ప్రకటించారు. అమరావతి కావాలనుకునే వారు తెలుగుదేశం కూటమికి, మవిగన్ కోరుకునే వారు వైసీపీకి ఓటు వేయాలంటూ సవాల్ విసిరారు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న సమయంలో రుషికొండ ప్యాలెస్ నిర్మాణం సహా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను గట్టిగా ప్రొజెక్ట్ చేసిన వైసీపీ, ఇప్పుడు హఠాత్తుగా ఆ నినాదాన్ని పక్కన పెట్టి మావిగన్ జపం చేయడంపై రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తం అవుతోంది. వైసీపీని, ఆ పార్టీ అధినేతను నెటిజనులైతే ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. రాజథాని విషయంలో జగన్ తరచుగా మాట మారుస్తుండటం, ఆయన పార్టీ వైసీపీకే నష్టం చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కేవలం మూడు రాజధానుల వల్లే సాధ్యమంటూ ప్రజల్లోకి వెళ్లిన వైసీపీ కేడర్.. ఇప్పుడు.. తూచ్ మూడు రాజధానులు కాదు.. మావిగన్ అంటూ ప్రజలలోకి ఎలా వెళ్లాలో తెలియక అయోమయానికి గురౌతోంది. రాజథాని విషయంలో ఒక స్థిరమైన విధానం లేకపోతే రాష్ట్రానికి పెట్టుబడిదారులు, పరిశ్రమలు ఎలా వస్తాయంటూ జగన్ విధానంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక మరో వైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, ఆ ప్రభుత్వాధినేత చంద్రబాబు.. అమరావతిని ఏకైక రాజధానిగా విస్పష్టంగా పేర్కొంటూనే.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు భారీగా పెట్టుబడులను, ఐటీ, పారిశ్రామిక ప్రాజెక్టులను వేగంగా తరలిస్తూ జగన్ మావిగన్ మంత్రాన్ని ప్రజలు ఇసుమంతైనా పట్టించుకోనవసరం లేదని చాటుతోంది. విశాఖపట్నం కేంద్రంగా మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాల సృష్టిపై బాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. రాజధానిని మార్చకుండానే ఉత్తరాంధ్ర), రాయలసీమ ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయవచ్చని చంద్రబాబు చేతల్లో చూపిస్తున్నారు. వచ్చే మూడేళ్లలో ఈ ప్రాజెక్టులు పూర్తై, యువతకు ఉపాధి కల్పిస్తే, వైసీపీ వాదన పూర్తిగా బలహీనపడుతుంది. తెలుగుదేశం మొదటి నుంచి అమరావతి విషయంలో ఒకే స్టాండ్‌తో ప్లస్ పాయింట్‌గా మారింది. 2029 ఎన్నికల కురుక్షేత్రంలో జగన్ తెచ్చిన మావిగన్ నినాదాన్ని ప్రజలు పట్టించుకునే అవకాశమే ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Publish Date: Jul 2, 2026 11:14AM
rss-imgRss Feeds