TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

సుప్రీంను ఆశ్రయించను.. హైకోర్టు అనర్హత వేటుపై దానం నాగేందర్.!

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున విజయం సాధించిన దానం నాగేందర్, ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే , కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు, ఆయనపై అనర్హత వేటు వేస్తూ శుక్రవారం (సెప్టెంబర్ 18) సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 23, 2024 నుంచే ఆయనపై అనర్హత వేటు వేసింది. అంటే ఆ రోజు నుంచే దానం నాగేందర్ తన శాసనసభ్య సభ్యత్వాన్ని కోల్పోయినట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గతంలో మార్చి 11, 2026న దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై వచ్చిన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ వారికి క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు అల్లె మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. ఈ తీర్పుపై స్పందించిన దానం నాగేందర్ తాను సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో లేనని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానని, ఎన్నికల్లో పోరాడటం తనకు కొత్తేమీ కాదనీ దానం పేర్కొన్నారు. ప్రజల మధ్యలోకి వెళ్లేందుకు, ఎన్నికల షెడ్యూల్ వెలువడితే ఏ క్షణమైనా మళ్లీ పోటీ చేసి ఘనవిజయం సాధిస్తానన్నారు. అదలా ఉండగా, దానంపై అనర్హత వేటుతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. [Danam Nagender, Telangana High Court, MLA Disqualification, Khairatabad Bypoll, Anti Defection Law, BRS Congress News, Telugu One]

Published on: Sat Sep 19, 2026 9:43AM

political-news-img

మద్యం స్కాం అంతిమ లబ్ధిదారు జగనే.. కోర్టులో బేవరేజెస్ మాజీ ఓఎస్డీ వాంగ్మూలం.!

జగన్ హయాంలో ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు ముమ్మరమైన తరుణంలో అత్యంత కీలకమైన పరిణామం వెలుగు చూసింది. అప్పటి జగన్ ప్రభుత్వంలో వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో అసలు సిసలైన అంతిమ లబ్ధిదారు అప్పటి సీఎం జగనేనని రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ మాజీ ఓఎస్డీ సత్యప్రసాద్‌ న్యాయస్థానం ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోనే ఈ మొత్తం స్కాప్ కు రూపకల్పన జరిగిందని, అక్కడే మద్యం విధివిధానాలు, పాలసీలు ఖరారయ్యాయని ఆయన తన వాంగ్మూలంలో విస్పష్టంగా చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే సిట్‌ అధికారులు అనేక ఆధారాలు సేకరించినప్పటికీ, మాజీ అధికారి ఏకంగా కోర్టులో ఈ స్కాం కు స్కెచ్ ఎక్కడ వేశారు. అంతిమ లబ్ధిదారు ఎవరు అన్న వివరాలను పూసగుచ్చినట్లు వెల్లడించడం సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం(సెప్టెంబర్ 18) దాదాపు ఐదుగంటల పాటు సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు. డిస్టిలరీల నుంచి పెద్ద ఎత్తున కమీషన్లు వసూలు చేయడం, నచ్చిన బ్రాండ్లకు మాత్రమే ఆర్డర్లు ఇవ్వడం, మిగిలిన బ్రాండ్లను పక్కన పెట్టడం వంటి అంశాలన్నింటినీ ఆయనీ సందర్భంగా కళ్లకుకట్టినట్లు చెప్పారు. ఆటోమేటిక్‌ విధానాన్ని పక్కన పెట్టి పూర్తిగా మాన్యువల్‌ విధానాన్ని ఎలా అమల్లోకి తెచ్చారనే విషయాలను ఆయన కోర్టు ముందు వివరించారు. విజయవాడ ఏసీబీ కోర్టులో నమోదు చేసిన ఈ వాంగ్మూలం ప్రకారం.. మద్యం విక్రయాల డేటా పరిశీలన, కమీషన్ల వసూళ్ల బాధ్యతలను తొలుత తనకు, నాటి ఎండీ వాసుదేవరెడ్డికి అప్పగించారని సత్యప్రసాద్ వెల్లడించారు. నాన్‌ కేడర్‌ ఐఏఎస్‌ లేదా తూడా కార్యదర్శిగా పోస్టింగ్ ఇస్తామని నమ్మబలికి తనను ఈ వ్యవహారంలోకి లాగారని సత్యప్రసాద్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. తాడేపల్లిలోని జగన్‌ నివాసంలో జరిగిన సమావేశంలో కీలక వ్యక్తుల సమక్షంలో లిక్కర్ పాలసీని ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ భేటీలో కొద్దిమంది ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారన్న సత్యప్రసాద్.. డిస్టిలరీల నుంచి నెలకు 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల వరకు ముడుపులు వసూలు చేసేవారనీ, ఈ సొమ్మును వివిధ మార్గాల ద్వారా సమీకరించి నాటి ముఖ్యమంత్రి జగన్‌కు చేరవేశారని ఆయన వెల్లడించారు. ఈ కుంభకోణంలో భాగంగా ఆటోమేటిక్‌ విధానానికి స్వస్తి పలికి పూర్తిగా మాన్యువల్‌ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగిందని సత్యప్రసాద్‌ తెలిపారు. డిస్టిలరీల యజమానులతో ప్రత్యేక యాప్‌ల ద్వారా సంప్రదింపులు జరిపి, విక్రయాలు, డిపోల సమాచారాన్ని సేకరించేవారని చెప్పారు. కమీషన్లు చెల్లించడానికి అంగీకరించిన కంపెనీలకే ఆర్డర్లు కేటాయించడమే కాకుండా.. ధరలు కూడా పెంచారని వెల్లడించారు. ముడుపులు ఇవ్వడానికి నిరాకరించిన కంపెనీల ఆర్డర్లను నిలిపివేశారని తెలిపారు. ఒక్కో మద్యం కేసుపై నిర్దిష్ట మొత్తంలో వసూళ్లు చేసి, వాటిని సంబంధిత వ్యక్తుల ద్వారా పంపిణీ చేసి అంతిమంగా అప్పటి ముఖ్యమంత్రికి చేరవేసేవారని సత్యకుమార్ తన వాంగ్మూలంలో విస్పష్టంగా పేరుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎక్సైజ్ శాఖలోనూ, బేవరేజెస్‌ కార్పొరేషన్‌లోనూ వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉన్న సత్యప్రసాద్, ఈ కుంభకోణానికి సంబంధించిన గుట్టును బయటపెట్టడం విశేషం. కేవలం బ్రాండ్ల ఎంపిక మాత్రమే కాకుండా, ఫీల్డ్‌ మానిటర్ల నియామకం, రవాణా బాధ్యతల అప్పగింత, సాఫ్ట్‌వేర్ మార్పుల వంటి ప్రతి దశలోనూ భారీస్థాయిలో అక్రమాలు జరిగాయని సత్యప్రసాద్ వాంగ్మూలమిచ్చారు. కొన్ని కంపెనీలకు రాష్ట్రంలో డిస్టిలరీలు లేకపోయినా నాసిరకం బ్రాండ్లను విరివిగా అమ్ముకునేందుకు అనుమతులు ఇచ్చారని, జీవోల ద్వారా ధరలను అమాంతం పెంచేశారని వివరించారు. ఈ అక్రమాల ద్వారా సమీకరించిన మొత్తం సుమారు 3 వేల 2 వందల కోట్ల రూపాయలు ఉంటుందనీ, ఈ నిధులన్నీ వివిధ స్థాయిలలో చేరాల్సిన వారికి చేరాయని పేర్కొన్నారు. ఈ కేసులో మాజీ అధికారి అప్రూవర్‌గా మారడానికి ముందుకు రావడం, నేరుగా న్యాయస్థానం ఎదుట వాంగ్మూలం ఇవ్వడం రానున్న రోజుల్లో మరికొన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే జగన్ ను కూడా ఈ కేసులో విచారణకు పిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ పరిశీలకులు అంటున్నారు. [AP Liquor Scam, YS Jagan Mohan Reddy, Satya Prasad Statement, Vijayawada ACB Court, Final Benificiary, Telugu One]

Published on: Sat Sep 19, 2026 9:09AM

political-news-img

దానం నాగేందర్ పై అనర్హత వేటు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.!

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున గెలుపొందిన దానం నాగేందర్.. ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన వైనంపై దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు శుక్రవారం (సెప్టెంబర్ 17) తీర్పు వెలువరించింది. బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించి, ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరిన దానం నాగేందర్ పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం చర్య తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లపై విచారణ జరిపిన హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, వివేక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు.. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. [Danam Nagender, High Court verdict, MLA disqualification, Khairatabad MLA, defection case, Telangana news, Telugu One]

Published on: Fri Sep 18, 2026 4:38PM

political-news-img

సేవా ప్రస్థానం మోడీ రాజకీయ ప్రయాణం.. వారణాసి వేదికగా చంద్రబాబు పొగడ్తల వర్షం.!

ప్రధాని నరేంద్రమోడీ జన్మదినం సందర్భంగా గురువారం (సెప్టెంబర్ 16)న వారణాసిలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రసంగించారు. గుజరాత్‌ నుంచి కాశీ వరకు మోదీ సాగిన ప్రయాణం సేవ' కు నిర్వచనం, పర్యాయపదం అన్న చంద్రబాబు.. చిన్ననాటి నుంచి అనేక కష్టాలను ఎదుర్కొంటూ, ఏ మాత్రం చలించకుండా దేశం కోసం ఆయన చేసిన కృషి అనన్యసామాన్యమని చంద్రబాబు ప్రస్తుతించారు. ఫైళ్ల నుంచి కాకుండా నేరుగా సమాజం నుంచి పాలనా పాఠాలు నేర్చుకున్న ఏకైక నేత మోదీ అన్న ఆయన.. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. కోట్లాది మందికి ఉచిత ఆహార ధాన్యాలు, పక్కా గృహాలు, మౌలిక వసతుల కల్పనతో పాటు సాంకేతిక రంగానికి మోదీ ఇస్తున్న ప్రాధాన్యతను ప్రస్తావించారు. స్పేస్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన రంగాలపై ప్రధానికి ఉన్న అవగాహన దేశాన్ని గొప్ప భవిష్యత్ వైపు నడిపిస్తోందని అన్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత కీలకమని చంద్రబాబు అన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. [Chandrababu Naidu, PM Narendra Modi, Varanasi News, Modi Leadership, TOne News Telugu, Telugu One]

Published on: Fri Sep 18, 2026 3:19PM

political-news-img

తృణమూల్ గుర్తు మమత, రితబ్రత వర్గాల్లో ఎవరికి దక్కుతుంది?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరు ఎన్నికల గుర్తు వివాదం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వర్గం, తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీ వర్గాల మధ్య ఏర్పడిన విభేదాలు.. పార్టీ గుర్తు ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు ఢిల్లీలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత ఆసక్తిని రేకెత్తించింది. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని వర్గం గురువారం (సెప్టెంబర్ 16) మధ్యాహ్నం మొదటగా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ సమావేశం అనంతరం రితబ్రత మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సంఘం అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాము సమాధానాలు ఇచ్చామని స్పష్టం చేశారు. పార్టీ పేరు, అధికారిక గుర్తుపై తమ వద్ద ఉన్న బలమైన వాదనలను కమిషన్ ముందు ఉంచామని, ఈసీఐపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని, తీర్పు తమ వైపే మొగ్గు చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరఫున సీనియర్ న్యాయవాది, ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఈసీఐ ఎదుట తమ వాదనలను గట్టిగా వినిపించారు. విచారణ అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సంఘం కోరిన అన్ని కీలక పత్రాలను తాము సమర్పించామని తెలిపారు. తాము సమర్పించిన ఆధారాలు, వాదనల ఆధారంగా అంతిమ నిర్ణయం తమకే అనుకూలంగా వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు అంటే సెప్టెంబర్ 12వ తేదీన కూడా ఈసీఐ ఇరు వర్గాల వాదనలను విన్నది. ఆ సమయంలో ఎటువంటి తక్షణ నిర్ణయం తీసుకోకుండా, తదుపరి విచారణ నిమిత్తం కొన్ని అదనపు పత్రాలను సమర్పించాలని ఇరు వర్గాలను ఆదేశించింది. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఈ వివాదంపై ఈసీఐ ఒకవేళ తుది నిర్ణయం వెలువరించినప్పటికీ, ఈ పోరాటం ఇక్కడితో ముగిసే అవకాశం లేదు. తీర్పు వ్యతిరేకంగా వచ్చిన వర్గం న్యాయపోరాటం కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. [Trinamool Congress, West Bengal, Mamata Banerjee, Ritabrata Banerjee, ECI, TMC symbol dispute, Telugu One]

Published on: Fri Sep 18, 2026 11:06AM

political-news-img

రేవంత్ దూకుడు.. ట్రబుల్ లో ట్రబుల్ షూటర్.!

తెలంగాణ రాజకీయాలలో ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాల ముందు నిలవలేక సతమతమవుతున్నారన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే రేవంత్ రెడ్డి ఈ స్థాయి దూకుడు ప్రదర్శిస్తున్నారనుకోవడం సరికాదంటున్నారు. గతంలో అధికారంలో లేని సమయంలో కూడా రేవంత్ రెడ్డి తగ్గేదేలే అన్నట్లుగానే వ్యవహరించారనీ, అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ ను ఎన్నో ఇబ్బందులు పెట్టింది. జైలకు కూడా పంపింది. అయినా అప్పట్లో ఏ సందర్భంలోనూ రేవంత్ వెనకడుగు వేయలేదు. తన పంథా మార్చుకోలేదు. అలాంటి పోరాట పటిమ ఉన్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు అధికార బలం, ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉండటంతో అసెంబ్లీ వేదికగానైనా, బయట బహిరంగ వేదికలైనా ఆయన సంధిస్తున్న విమర్శలు, ఆరోపణలు బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. రేవంత్ దూకుడును అడ్డుకునేందుకు ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాను ఆశ్రయించడానికే పరిమితమౌతున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ దూకుడును అడ్డుకుంటారని హరీష్ రావు వైపు ఆశగా చూస్తున్నారు. అయితే హరీష్ రావు కూడా సీఎం రేవంత్ వ్యూహాత్మక ఎత్తుగడలను తిప్పికొట్టడంలో విఫలమౌతున్నారన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తమౌతోంది. హరీష్ రావుపై వ్యక్తిగతంగా ఎటువంటి అవినీతి ఆరోపణలు పెద్దగా లేవు. అయితే.. ఇటీవల తెరపైకి వచ్చిన మిల్చీ మిల్క్ డెయిరీ వ్యవహారం, ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా బయటకు వచ్చిన వేల ఎకరాల భూముల చిట్టాలో ఆయన పేరు కూడా ప్రస్తావనకు రావడంతో ఆయన పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పక్కా అధికారిక రికార్డులు, సర్వే నంబర్లు, కచ్చితమైన కాలపరిమితులతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులను నేరుగా బయటపెడుతూ బీఆర్ఎస్ అగ్రనేతల సమగ్రతను సూటిగా ప్రశ్నిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ను కష్టకాలంలో ఆదుకుంటూ వచ్చిన సెంటిమెంట్ రేవంత్ దూకుడు ముందు పని చేయడం లేదు. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో వస్తున్న మార్పులను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కేవలం వాగ్ధాటికి పరిమితం కాకుండా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్‌లతో ప్రభుత్వం ముందుకు వెళ్తుండటంతో బీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. [Harish Rao vs Revanth Reddy, Telangana politics, BRS strategy, Revanth Reddy moves, Touble Shooter, Telugu One]

Published on: Fri Sep 18, 2026 10:41AM

political-news-img

ఏపీలో డీఎస్సీ వినా సమస్యలే లేవా.. వైసీపీ తీరు పట్ల పార్టీ శ్రేణుల్లోనే పెదవి విరుపు.!

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను అస్త్రంగా మలచుకుని అధికార కూటమిపై విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ తీరుపై పొలిటికల్ సర్కిల్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టే ప్రయత్నంలో భాగంగా వరుసపెట్టి ఆరోపణలు చేస్తున్నప్పటికీ, ఈ తరహా రాజకీయ వ్యూహం ఏ మేరకు సఫలమవుతుంద అనుమానాలు బలంగా వ్యక్తమౌతున్నాయి. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే . ప్రజా సమస్యలను పక్కనపెట్టి కేవలం ఒకే అంశంపై పదే పదే దృష్టి పెట్టడం వల్ల రాజకీయంగా ఆశించిన ప్రయోజనం దక్కుతుందా? అన్న సందేహాలు వైసీపీయులలోనే వ్యక్తం అవుతున్నాయి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా, మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది. ఈ అంశాన్ని విడతలవారీగా ప్రజల ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ, ప్రభుత్వ తీరును నిలదీసేలా వ్యూహాలు రచిస్తున్నది.. అయితే.. ఈ తరహా నిరంతర ఆరోపణలు క్షేత్రస్థాయిలో ఏ రకమైన ఫలితాలను ఇస్తున్నాయన్న ప్రశ్నకు మాత్రం సంతృప్తికరమైన సమాధానం రావడం లేదు. వైసీపీ విమర్శలు, ఆందోళనల పట్ల జనబాహుల్యంలో ఎటువంటి ఆసక్తీ కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం కూటమి పార్టీల నేతలు వైసీపీ ఆరోపణలు, విమర్శలకు దీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. వైసీపీ హయాంలో ఉపాధ్యాయ నియామకాలను పట్టించుకోని తీరును ఎత్తి చూపుతున్నారు, ఇప్పుడు ఆ పార్టీ చేస్తున్న విమర్శలు, ఆందోళన పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే అని ఎదురుదాడికి దిగుతున్నారు. రాజకీయంగా చూస్తే, వైసీపీ తీరు.. సొంత పార్టీ నేతలు, శ్రేణుల్లోనే గందరగోళం సృష్టిస్తోంది. ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా కేవలం ఒకే ఒక్క పరీక్షా విధానంపై మాత్రమే గళమెత్తడం వల్ల రాజకీయ ప్రయోజనం అటుంచి.. నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. అన్నిటికీ మించి డీఎస్సీ నియామక ప్రక్రియపై వైసీపీ ఆరోపణలు, విమర్శలను అధికార యంత్రాంగం కొట్టి పారేస్తున్నది. వైసీపీ విమర్శించిన ప్రతి అంశంపైనా స్పష్టమైన వివరణ అధికారికంగా ఇస్తూ.. నియామక ప్రక్రియపారదర్శకంగా జరిగిందని ఆధారాలతో సహా వివరణ ఇచ్చున్నది. దీనివల్ల కూడా వైసీపీ డీఎస్సీపై చేస్తున్న విమర్శలు నీరుగారిపోతున్నాయి. ఇంకా డీఎస్సీ నియామకాలలో అవకతవకలు అంటూ వైసీపీ దానినే పట్టుకు వేళాడితే.. ప్రజాక్షేత్రంలో ఆ పార్టీ మరింత పలుచన అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. [YS Jagan, Mega DSC controversy, YCP political strategy, AP teacher recruitment, ruling and opposition politics, Telugu One]

Published on: Fri Sep 18, 2026 9:35AM

political-news-img

అసెంబ్లీ వేదికగా రేవంత్ సృష్టించిన ‘భూ’కంపం.. ఆత్మరక్షణలో కల్వకుంట్ల కుటుంబం.!

తెలంగాణ రాజకీయాల్లో భూ వివాదాలు మరోసారి తారస్థాయికి చేరాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితికి మధ్య మాటల యుద్ధం ముదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఎదురుదాడికి దిగింది. అయితే అసంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆన్ రికార్డ్ యటపెట్టిన భూముల వివరాలతో బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడినట్లే కనిపిస్తోంది. ఆ పార్టీ చేస్తున్న ఎదురుదాడి ఆత్మరక్షణ యత్నంగా కనిపిస్తోందే తప్ప ప్రజలను నమ్మించడంలో విఫలమైంది. మామూలుగా సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం వేరు.. సాక్షాత్తూ అసెంబ్లీ వేదికగా సర్వే నంబర్లు, విస్తీర్ణాల ఆధారంగా లెక్కలు బయటపెట్టడం వేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే పని చేశారు. ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని పేద రైతుల భూములను లాక్కున్నారని, దీని వెనుక పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని సీఎం అన్నారు. ప్రాథమిక సమాచారం ఆధారంగానే ఈ వివరాలు బయటపెడుతున్నామని, పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్, లోతైన విచారణ జరిగితే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా రేవంత్ వెల్లడించిన వివరాలను ఖండిస్తూనే.. కేసీఆర్ కుటుంబం ఆ భూములన్నీ నిజమే, వాటిని మేం దాచిపెట్టిందేమీ లేదు, ఎన్నికల అఫిడవిట్లలో స్వయంగా పొందుపరిచినవే అని చెప్పుకుంటోంది. అవన్నీ తమకు తరతరాలుగా వస్తున్న వేల ఎకరాల వారసత్వ భూములున్నాయనీ, తమది జమీందారీ నేపథ్యమని చెప్పుకుంటోంది. అయితే.. ఇక్కడ కేసీఆర్ కుటుంబం మరీ ముఖ్యంగా కేసీఆర్ చిన్న లాజిక్ మరిచిపోయారు. 1973 నాటి భూమి పరిమితి చట్టం ప్రకారం ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు మించి ఉండటానికి లేదన్న విషయాన్ని ఆయన ఉద్దేశపూర్వకంగానో లేదా నిజంగానే అయినా మరచిపోయారు. దీంతో కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ రేవంత్ ఆరోపణలను తిప్పి కొట్టే ప్రయత్నం పెద్దగా ఫలిచడం లేదని పరిశీలకులు అంటున్నారు. ఇక పోతే ఆ ఆరోపణల తీవ్రతను తగ్గిండానికి, ప్రస్తుతానికి తప్పించుకోవడానికి కేటీఆర్ పొలిటికల్ అస్త్రంగా సిట్టింగ్ జడ్డి విచారణ అంటూ సవాల్ చేస్తున్నారు. అయితే.. సిట్టింగ్ జడ్జి విచారణ డిమాండ్ అనేది సమస్యను పక్కదారి పట్టించే, పాతచింతకాయపచ్చడి వ్యూహంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. కేటీఆర్ డిమాండ్ కేవలం కాలయాపనకే తప్ప.. రేవంత్ రెడ్డి ఆరోపణలకు సమాధానం కాదని అంటున్నారు. అన్నిటికంటే ప్రధానంగా... ఆ భూములు తమవేననీ, వాటిని చట్టబద్ధంగా కొన్నామనీ చెప్పుకుంటున్న కేటీఆర్ భూములు ఎవరి హయాంలో, ఎంత ధరకు కొన్నారు అన్న వివరాలను వెల్లడించాల్సి ఉంది. వాటిని కొనుగోలు చేయడానికి వెచ్చించిన నిధులు, అవి వచ్చిన మార్గం, దాని మూలాలు అన్నీ వివరించాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి.. వ్యక్తిగత దూషణలు, ప్రత్యారోపణలు చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ప్రత్యారోపణలు, వ్యక్తిగత దూషణలు ప్రజలలో కల్వకుంట్ల కుటుంబ వాదనను బలహీన పరుస్తాయో తప్ప మరో ప్రయోజనం ఉండదని పరిశీలకులు అంటున్నారు. అన్నిటికీ మించి అవి వారసత్వ భూములు అన్న ఒక్క మాటతో ఈ వివాదాన్ని ముగించేయడం కల్వకుంట్ల కుటుంబానికి అంత తేలిక కాదు. ఏది ఏమైనా అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి సృష్టించిన ‘భూ’ కంపం కేసీఆర్ కుటుంబాన్ని, అలాగే బీఆర్ఎస్ పార్టీనీ ఆత్మరక్షణలో పడేసిందన్నది మాత్రం ఎవరూ కాదనలేని వాస్తవమని చెప్పాలి. [Revanth Reddy, KCR Family Lands, BRS Counter Attack, Telangana Politics, Dharani Portal Row]

Published on: Thu Sep 17, 2026 5:41PM

political-news-img

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం.. !

పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. ! తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ అలాగే వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన జారీ చేసింది. వచ్చే ఏడాది 2027 మార్చి నెలలో సిట్టింగ్ ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, ఈ రెండు స్థానాలకు కొత్తగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జూరీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్‌ను అధికారులు తాజాగా విడుదల చేయడంతో పట్టభద్రుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే అర్హులైన అభ్యర్థుల కోసం అధికారిక యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. ఈ ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించి సెప్టెంబర్ 28వ తేదీన అధికారికంగా ప్రజా నోటీసు లేదా ప్రకటన వెలువడనుంది. నవంబర్ 1, 2026 నాటికి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత సాధించిన పట్టభద్రులందరూ ఈ ఓటర్ల నమోదుకు పూర్తిగా అర్హులుగా ఉంటారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అర్హులైన నిరుద్యోగులు, ఉద్యోగులు మరియు పట్టభద్రులు తమ ఓటు హక్కు కోసం నవంబర్ 6వ తేదీ వరకు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అక్టోబర్ 15న పత్రికల్లో తొలి పునఃప్రచురణ, అక్టోబర్ 25న రెండో పునఃప్రచురణ చేపట్టనున్నారు. గడువు ముగిసిన తర్వాత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నవంబర్ 25వ తేదీన ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ఒకవేళ ముసాయిదా జాబితాలో పేర్లు లేకపోతే లేదా తప్పులు ఉంటే, వాటి సవరణలు మరియు అభ్యంతరాల స్వీకరణ కోసం నవంబర్ 25 నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు ప్రత్యేక సమయం కేటాయించడం జరిగింది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిశితంగా పరిశీలించి అన్ని రకాల మార్పు చేర్పులు పూర్తి చేసిన అనంతరం, డిసెంబర్ 30వ తేదీన తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. అయితే, ఇక్కడ పట్టభద్రులు అత్యంత గమనించాల్సిన కీలక విషయం ఏమిటంటే.. గతంలో పాత ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారు సైతం ఈసారి కొత్తగా మార్పు చేసిన ఫారం-18 ద్వారా విధిగా దరఖాస్తు చేసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది. దరఖాస్తుతో పాటు అర్హతకు సంబంధించిన ధ్రువీకరించిన సర్టిఫికెట్ల కాపీలను జతచేయాల్సి ఉంటుంది. పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. [ graduate mlc elections, telangana voters list, form 18 registration, mlc election schedule, telangana news, graduate voters, Mlc Tinmar Malanna, Telugu one, Telugu News ]

Published on: Thu Sep 17, 2026 4:57PM

political-news-img

తెలంగాణ భూములు: ఓ విధ్వంసం.!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో తెలంగాణ భూములపై చేసిన ప్రసంగం ప్రకంపనలు సృష్టించింది. రాజకీయ నాయకులకు భూమి, భారీ ప్రాజెక్టుల్లో కమిషన్లు అనేవి ప్రధాన ఆదాయ వనరులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ భూమికి సంబంధించిన అక్రమాలు, కబ్జాలు లెక్కకు మించి జరిగాయనే విమర్శలు ఉన్నాయి. దీనికి సంబంధించి అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. బడా రాజకీయ నాయకుల నుంచి గ్రామ స్థాయి రాజకీయ నాయకుల వరకు భూకబ్జాలకు, అక్రమ భూఆక్రమణలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. పోరంబోకు, అటవీ, అసైన్డ్ భూములు ఆక్రమణకు గురయ్యాయి. వాటిని ధరణి ద్వారా న్యాయబద్దత లేదా చట్టబద్ధత కల్పించుకోవడానికి ప్రయత్నించారనే ఆరోపణలు కూడా వున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లో నిజం వుంది. అయితే, ఇది బిఆర్ఎస్ నాయకులకు మాత్రమే వర్తిస్తుందా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు వర్తించదా అనేది ప్రశ్న. అదికారంలో వున్న పార్టీకి భూములను భుక్తం చేసుకునే వెసులుబాటు ఎక్కువగా వుంటుంది. చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది. ఈ చట్టానికి లోబడి భూమిని కలిగి వుండేలా చాలా మంది జాగ్రత్త పడి వుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అది అతిక్రమణకు గురైంది. భూ పరిమితి చట్టం అమలులో వుందనే విషయం తెలియని ఓ నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను సమర్పించిన అఫిడవిట్‌లో 110 ఎకరాలు ఉన్నట్లు చెప్పుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టిఆర్ఎస్, ఆ తర్వాతి బిఆర్ఎస్ ప్రభుత్వాలు భూ హక్కుల పాబందిని ధ్వంసం చేశాయి. ఆ విధ్వంసం బహుశా 2018 నుంచి ఎక్కువగా జరుగుతూ వచ్చింది. ఆ ఏడాది నుంచి పహణీ రాయడం ఆపేశారు. పహాణీ అనేది భూ యాజమాన్యాన్ని పక్కా చేస్తుంది. అంటే ఏ భూమి ఎవరి పేరు మీద వుందనే విషయాన్ని అది తేటతెల్లం చేస్తుంది. ఇది వేర్వేరు సర్వే నెంబర్లలో ఒక వ్యక్తి కలిగి వున్న భూమిని తెలియజేస్తుంది. ఆసామీవారి ఖాతాలు మాయమయ్యాయి. పట్వారీ వ్యవస్థను ఎన్‌టీ రామారావు ప్రభుత్వం రద్దు చేస్తే, వీఆర్వో వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది మస్కూర్ వ్యవస్థను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఒక గ్రామంలో ఏ భూమి ఎవరి పేరు మీద ఉందనే విషయం తెలియకుండా పోయింది, ఆర్డీవోలకు ఉన్న హక్కులను రద్దు చేసి కలెక్టర్ చేతిలో పెట్టారు. దీంతో భూముల యాజమాన్య హక్కులు తెలుసుకోవడం సమస్యగా తయారైంది. రాత్రికి రాత్రి బలవంతులు భూములను ధరణిలో ఎక్కించుకుని కబ్జాలు చేసిన వైనాలున్నాయనే విషయం ఏ గ్రామానికి వెళ్లినా తెలుస్తుంది. దీంతో గ్రామాల్లో భూ తగాదాలు పెరిగాయి. కేసీఆర్ ప్రభుత్వం భూములకు సంబంధించి కొత్త పద్ధతి ప్రవేశపెట్టడం వల్ల కూడా భూ యాజమాన్యానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఎవరైనా తమ భూమి వివరాలను దాచి పెట్టుకునే అవకాశం అది. అంటే ఒక వ్యక్తి తన భూమి వివరాలను రెండో కంటికి కనిపించకుండా దాచి పెట్టుకోవచ్చు రేవంత్ రెడ్డి భూ వివరాలను బయటపెడతానని చెబుతున్నారు. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ మీద చాలా గట్టి ప్రకటనే చేశారు. దాన్ని అమలు చేస్తారా, లేదా అనేది తర్వాతి విషయం. బీఆర్ఎస్ బడా నేతల భూముల లెక్కలు కూడా చెప్పారు. కాంగ్రెస్ నాయకులు, ఇతర పార్టీల నాయకుల భూముల వివరాలను కూడా బయటపెడతారా, చూడాలి. మరో విషయం.. చోటా మోటా నాయకులు గ్రామాల్లో వందల ఎకరాలు సంపాదించుకున్న వైనం కూడా వుంది. వాటిని బయటకు తీస్తారా? రేవంత్ రెడ్డి మీద కూడా భూములకు సంబంధించి ఆరోపణలు వున్నాయి. తన విషయాన్ని ఆయన స్పష్టం చేస్తారా? తెలంగాణలో భూమి అనేదే ఇప్పుడు ప్రధానమైన చర్చ. దాని అంతు తేలిస్తే చాలా సమస్యలకు పరిష్కారం లభించవచ్చు. అందుకు రాజకీయ నాయకులు సిద్ధపడుతారా అనేది సందేహం. Telangana Lands, Telangana Politcs, Revanth reddy, KCR, BRS, Dharni, Telugu One

Published on: Thu Sep 17, 2026 4:06PM