భద్రాచలంలో కుప్పకూలిన భవనం.. ఏడుగురు కూలీలు మృతి

ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో బుధవారం ఘోర విషాదం సంభవించింది. పట్టణంలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. భద్రాచలం పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్ లో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవన నిర్మాణ పనులలో ఉన్న కూలీలు శిథిలాలలో చిక్కుకున్నారు. కొందరిని స్థానికులు రక్షించారు. ఇప్పటి వరకూ అధికారికంగా అందిన సమాచారం ప్రకారం ఏడుగురు కూలీలు మరణించారు. ఇంకా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు చెబుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. మృతుల వివరాలు కూడా తెలియరాలేదు.  
Publish Date: Mar 26, 2025 6:18PM

బెట్టింగ్ యాప్ లపై రేవంత్ రెడ్డి సీరియస్ 

బెట్టింగ్ యాప్ లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఐపిఎస్ అధికారి , ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఈ యాప్స్ పై ఉక్కుపాదం మోపారు. యాంకర్ , ఇన్ ప్లూయెర్స్ పై కేసులు నమోదు చేస్తున్న పోలీసులకు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నిండు అసెంబ్లీలో   బాసటగా నిలిచారు.   బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను నిషేధం విధించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్లే బెట్టింగ్ యాప్స్ ప్రోత్సహిస్తున్నవారు  రెచ్చిపోతున్నారన్నారు.  తమ ప్రభుత్వం బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తున్న వారు ఏ స్థాయిలో ఉన్నా సరే ఉపేక్షించబోదన్నారు.  పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వేసిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు.  ప్రస్తుతం బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తున్న వారిని కట్టడి చేయలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయనుంది. 
Publish Date: Mar 26, 2025 6:01PM

ఠారెత్తిస్తున్న ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి 3వ వారంలోనే తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదౌతున్నాయి. ఎండకు తోడు వడగాల్పులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడి ప్రతాపానికి ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేద్ లో ఎండ తీవ్రత దడపుట్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరిక ప్రజలను మరింత భయపెడుతోంది. రాష్ట్రంలోని  పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అత్యవసరమైతే తప్ప ఎండ వేళల్లో బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. అనివార్యంగా బయటకు రావలసి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.  
Publish Date: Mar 26, 2025 5:56PM

వంశీకి ఇప్పట్లో బెయిలు కష్టమే!?

గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్థం కేసులో వల్లభనేని వంశీ పూర్తిగా ఇరుక్కున్నట్లే. ఇప్పటికే గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు.  గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో ఏ1 గా ఉన్న ఓలుపల్లి మోహన్ రంగాను పోలీసులు అరెస్టు చేశారు. రంగాను మంగళవారం (మార్చి 25) రాత్రి పోలీసులు అరెస్టు చేశారు.  ఈ ఓలుపల్లి మోహన్ రంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ప్రధాన అనుచరుడు. దీంతో గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో వల్లభనేని వంశీ పూర్తిగా ఇరుక్కున్నట్లే అంటున్నారు. ఎందుకంటే తొలుత గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో వంశీ పేరు లేదు. అయితే తరువాత వరుసగా నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారించిన సందర్భంలో వంశీ ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో  ఆయన పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చారు. అలా చేర్చిన తరువాతే అరెస్టు భయంతో ఈ కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించి కేసు ఉపసంహరించుకునేలా చేసిన వంశీ ఆ క్రమంలో నిండా మునిగారు. కిడ్నాప్ కేసులో అరెస్టై జైలుపాలయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో వంశీకి కుడి భుజంగా చెప్పుకునే మోహన్ రంగా పోలీసులకు చిక్కడంతో  వంశీకి  గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో తప్పించుకోవడానికి దారులన్నీ మూసుకుపోయినట్లేనని అంటున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిలు కోసం వంశీ దాఖలు చేసుకున్న పిటిషన్ పెండింగులో ఉంది. ఇక కిడ్నాప్ కేసులో వంశీ బెయిలు పిటిషన్ విచారణ దశలో ఉంది. ఇప్పుడు వంశీ కుడిభుజం మోహన్ రంగా అరెస్టుతో.. వంశీకి బెయిలుపై బయటకు వచ్చే అవకాశాలు మృగ్యమైనట్లేనని అంటున్నారు. కిడ్నాప్ కేసులో ఒక వేళ బెయిలు దొరికినా.. తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో మాత్రం ఇప్పట్లో బెయిలు లభించే అవకాశాలు దాదాపు లేనట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద ఎలా చూసినా మోహన్ రంగా అరెస్టుతో వంశీకి మరిన్ని చిక్కులు తప్పవని అంటున్నారు. 
Publish Date: Mar 26, 2025 5:11PM

నకిరేకల్ లో కేటీఆర్ పై రెండు కేసులు

బిఆర్‌ఎస్‌  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై నల్లొండ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. స్థానిక కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు నల్గొండ జిల్లా కకిరేకల్ పోలీసు స్టేషన్ లో కేటీఆర్ పై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ సోషల్‌మీడియా యాక్టివిస్టులు మన్నె క్రిశాంక్‌, కొణతం దిలీప్‌పై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.  నకిరేకల్‌లో టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో   సోషల్ మీడియా వేదికగా  తమపై తప్పుడు ప్రచారం చేశారంటూ  నకిరేకల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చౌగోని రజిత, మరో వ్యక్తి ఉగ్గిడి శ్రీనివాస్‌ వేర్వేరుగా నకిరేకల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పేపర్‌ లీకేజీ కేసులోని నిందితులతో తమకు సంబంధం ఉందంటూ తెలుగు స్క్రైబ్‌లో వచ్చిన కథనాన్ని కేటీఆర్‌  ఎక్స్‌  లో షేర్‌ చేసినట్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. చౌగోని రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు   ఏ 1గా మన్నె క్రిశాంక్‌, ఏ 2 గా కేటీఆర్‌, ఏ 3గా కొణతం దిలీప్‌ కుమార్‌లతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఉగ్గిడి శ్రీనివాస్‌  ఫిర్యాదు మేరకు  ఏ1 గా కొణతం దిలీప్‌ కుమార్‌ , ఏ2గా మన్నే క్రిశాంక్‌, ఏ 3గా కేటీఆర్‌, మరికొందరిపైనా కేసు నమోదు చేశారు.   పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో మొత్తం 11 మంది నిందితులతోపాటు ఇద్దరు మైనర్లపై కేసు నమోదు చేశారు. వీరిలో ఒక మైనర్‌ బాలునితో పాట ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.  
Publish Date: Mar 26, 2025 4:49PM

 అప్సర హత్య కేసులో పూజారి సాయి కృష్ణకి జీవిత ఖైదు 

హైద్రాబాద్ సరూర్ నగర్ కు చెందిన  అప్సర అనే యువతిని 2023 జూన్ 3న హత్య చేసిన పూజారీ సాయికృష్ణకు రంగా రెడ్డి  కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. ప్రతీ రోజు అప్సర అనే యువతి ఆలయానికి వచ్చేది. ఈ  నేపథ్యంలో పూజారీతో పరిచయం ప్రేమకు దారితీసింది. పూజారి సాయి కృష్ణకు అప్పటికే పెళ్లయి పిల్లలు  ఉన్నారు. అప్సరకు  కూడా అ ప్పటికే పెళ్లయి భర్తతో విడిపోయింది. సినిమాల్లో నటించాలన్న కోరికతో   అప్సర తమిళనాడు నుంచి హైద్రాబాద్ చేరుకుంది. అప్సరతో  అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఓకే చెప్పిన  పూజారి పెళ్లి చేసుకోవడానికి  మాత్రం నిరాకరించాడు.  ప్రతీరోజు అప్స‌ర  పూజారి సాయికృష్ణ ను  పెళ్లి చేసుకోవాలని వేధించేది.  ఎలాగో అలా  అప్సరను వదిలించుకోవాలనుకున్న  పూజారీ పథకం ప్రకారం తమిళనాడు కోయంబత్తూరు తీసుకెళతానని మాయమాటలు చెప్పాడు. తన కారులోనే  శంషాబాద్ మండలంలోని సుల్తాన్ పల్లిలోని ఓ గో శాలకు తీసుకెళ్లాడు. సిసి కెమెరాలు లేవని నిర్ధారించుకుని అప్సరను హత్య చేశాడు. ముఖంపై ప్లాస్టిక్ కవర్ తో కప్పి అత్యంత పాశవికంగా పూజారి అప్సరను హత్య చేశాడు. తాను చేసిన నేరాన్ని పూజారి పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. బలమైన సాక్ష్యాలతో పోలీసులు చార్జిషీట్ ఫైల్ చేశారు.  రంగా రెడ్డి కోర్టులో ట్రయల్ ముగియడంతో  బుధవారం తీర్పు వెలువడింది. పూజారికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. 
Publish Date: Mar 26, 2025 4:20PM

మోడీ రంజాన్ తోఫా.. చంద్రబాబును తు.చ. తప్పకుండా అనుకరించిన ప్రధాని

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి భవిష్యత్ ను దర్శించడంలో దిట్ట. ఆయన ఏం చేసినా తరతరాలు నిలబడిపోయేలా ఉంటుంది. సంక్షేమ పథకాలైనా, అభివృద్ధి కార్యక్రమాలైనా అంతే. ఆయన ఒక ట్రెండ్ సృష్టిస్తారు. ముందు విమర్శలు చేసిన వారు కూడా తరువాత ప్రశంసలు గుప్పించేలా ఆయన కార్యక్రమాలు ఉంటాయి. కార్యాచరణ ఉంటుంది. అందుకే ఆయనపై ప్రత్యర్థి పార్టీల నేతలు ఎన్ని విమర్శలు గుప్పించినా, ఆరోపణలు చేసినా జనం వాటిని విశ్వసించరు.  గతంలో చంద్రబాబు ఆరంభించి, ప్రారంభించిన పలు పథకాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు అవ్వడమే చంద్రబాము ముందు చూపుకూ, వాస్తవిక దృక్ఫథానికీ నిదర్శనంగా పరిశీలకులు చెబుతుంటారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు గతంలో ప్రారంభించి అమలు చేసిన ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారు. అంతే కాదు.. ఆ పథకానికి అప్పట్లో చంద్రబాబు పెట్టిన పేరునే కంటిన్యూ చేస్తూ దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఇంతకీ ఆ పథకం ఏమిటనుకుంటున్నారా.. రంజాన్ తోఫా. ఔను రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ ను పురస్కరించుకుని వారి ఇళ్లల్లో రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు దోహదం చేసేలా రంజాన్ తోఫా అనే పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకం కింద ముస్లింలకు అవసరమైన పండుగ సరుకులను అందజేశారు. అంతేనా హిందువులకు సంక్రాంతి కానుక, క్రైస్తవులకు క్రిస్మస్ కానుక అందజేశారు. ఈ పథకాలకు బ్రహ్మాండమైన ప్రజాదరణ లభించింది.   ఇప్పుడు  మోడీ కూడా ముచ్చటగా మూడో సారి ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత రంజాన్ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న 32 లక్షల పేద కుటుంబాలకు రంజాన్ తోఫా అందించాలని నిర్ణయించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసిన రంజాన్ తోఫాను యాజ్ ఇట్ ఈజ్ గా అదే పేరుతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం పేద ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు.  
Publish Date: Mar 26, 2025 3:35PM

రాజమండ్రిలో పాస్టర్ అనుమానాస్పద మృతి

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పాస్టర్ పగడాల  ప్రవీణ్ కుమార్(46)  అనుమానాస్పదస్థితిలో మరణించాడు. డెడ్ బాడీపై రక్తపు మరకలు ఉండటంతో అనుమానాలు రేకెత్తాయి. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ పక్కనే ప్రవీణ్ మృతదేహం పడి ఉంది. స్పాట్ లోనే రక్తపు మరకలతో ఉన్న కర్ర ముక్కలు ముక్కలుగా ఉండటంతో డెత్ మిస్టరీ వీడలేదు. పాస్టర్ మృతితో ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనమైంది. డెడ్ బాడీ రాజమండ్రి  రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టు మార్టం చేస్తున్నారు.  రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని  గామన్ బ్రిడ్జి రహదారిపై మృతదేహం కనిపించింది.  క్రైస్తవ సంఘాలు డెత్ మిస్టరీ చేధించాలని నిరసనకు దిగాయి. పోస్టర్లు అంటించాయి.  హైద్రాబాద్ నుంచి ప్రవీణ్ కుమార్ లగేజి కట్టుకుని రాజమహేంద్రవరం బయలు దేరారు.  గామన్ బ్రిడ్జి టోల్  గేట్ దాటగానే పాస్టర్ మృతదేహం కనిపించింది. కొంతమూరు సమీపంలోని నయారా పెట్రోల్ బంక్ వద్ద ప్రవీణ్ కుమార్ బుల్లెట్ పల్లపు ప్రాంతంలో పడిపోయింది.  ప్రమాదవశాత్తు ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న బుల్లెట్  లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు.  పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై ఐటీ మంత్రి లోకేశ్  దిగ్బాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో దర్యాప్తు చేయిస్తామని లోకేశ్ ట్విట్టర్ వేదికగా చెప్పారు. 
Publish Date: Mar 26, 2025 2:50PM

రాజమహేంద్రవరంలో ఫార్మాసిస్ట్ ఆత్మహత్యా యత్నం.. లైంగిక వేధింపులే కారణం!

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఫార్మ్ డి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్ విభాగంలో పని చేస్తున్న అంజలి అనే ఫార్మసీ విద్యార్థిని  బలవన్మరణానికి ప్రయత్నించడం సంచలనం రేపింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది.  హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ దీపక్ లైంగిక వేధింపులకు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నానంటూ అంజలి రాసిన సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ దీపక్ తనను మానసికంగా, శారీరకంగా వేధించినట్లు అంజలి పేర్కొంది.   ఏలూరు జిల్లా జీలుగుమిల్లికి చెందిన అంజలి   అంజలి ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరుతూ అంజలి బంధువులు, విద్యార్థులు ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. దీపక్ ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు వచ్చి పరిస్థితి అదుపు చేశారు. అంజలి తండ్రి దుర్గారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజమహేంద్రవరం, రాజానగరం ఎమ్మెల్యేలు ఆస్పత్రి వద్దకు వచ్చి అంజలి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా కోరారు.   
Publish Date: Mar 26, 2025 2:07PM

ఏపీ మద్యం కుంభకోణం.. రంగంలోకి ఈడీ?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తునకు కేంద్రం పచ్చ జెండా ఊపేసిందా?  ఏపీ మద్యం కుంభకోణంపై లోక్ సభలో ప్రస్తావించిన నరసరావు పేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు ఇదే విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంగళవారం (మార్చి 25) ప్రత్యేకంగా భేటీ అయ్యి తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను అంద చేశారు.  అయితే విశ్వసనీయ సమాచారం మేరకు లావు అమిత్ షా అప్పాయింట్ మెంట్ తీసుకుని ఆయనతో భేటీ కాలేదనీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాయే స్వయంగా లావును పిలిపించుకుని మద్యం కుంభకోణంపై ఆరా తీశారు. ఆ సందర్భంగా ఎంపీ ఇచ్చిన పత్రాలను నిశితంగా పరిశీలించారు. ఇది జరిగిన తరువాత ఎంపీ లావు బుధవారం (మార్చి 26) అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. వరుసగా జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ మద్యం కుంభకోణంపై తెలుగుదేశం ఎంపీ డిమాండ్ కు కేంద్ర హోంమంత్రి  సానుకూలంగా స్పందించారనీ, ఈడీని రంగంలోకి దించేందుకు అంగీకరించారనీ పరిశీలకులు భావిస్తున్నారు.   వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ హయాంలో  అమలు చేసిన మద్యం విధానంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. జగన్ మద్యం పాలసీ దేశంలోనే అత్యంత పెద్ద కుంభకోణంగా తెలుగుదేశం మొదటి నుంచీ చెబుతూ వస్తున్నది. ఏపీ మద్యం కుంభకోణంతో పోలిస్తే.. ఢిల్లీ మద్యం కుంభకోణం చాలా చిన్నదని తెలుగుదేశం వాదిస్తోంది. ఏపీ మధ్యం కుంభకోణం వేల కోట్లేనని అంటోంది. ఏపీలో మూడు మద్యం విషయంలో మూడు స్థాయిలలో అవినీతి జరిగిందని లోక్ సభ వేదికగా లావు శ్రీకృష్ణ దేవరాయులు ఆరోపించారు.   ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్.. మూడింటినీ వైసీపీ నేతలు తమ అధీనంలో ఉంచుకుని అక్రమాలకు పాల్పడ్డారని లావు లోక్ సభలో సోదాహరణంగా చెప్పారు. అంతే కాకుండా ఈ మద్యం కుంభకోణం సొమ్ము దాదాపు 4 వేల కోట్ల రూపాయలను విదేశాలకు తరలించేశారని లావు ఆరోపించారు.  మొత్తం మీద లావు పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావించిన తరువాత కేంద్రం కూడా ఏపీ మద్యం కుంభకోణం నిగ్గు తేల్చాలన్న నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. దీనిపై   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారనీ, ప్రస్తుతం ఏపీ మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణలో విదేశాలకు మద్యం సొమ్ము తరలినట్లు నిర్ధారణ కావడంతో ఇక ఈడీని కూడా రంగంలోకి దింపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. ఆ కారణంగానే కేంద్ర హోంమంత్రితో భేటీ అనంతరం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారని చెబుతున్నారు.  
Publish Date: Mar 26, 2025 1:18PM

సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని నోట చంద్రబాబు మాట 

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు టూరిజంను బాగా ప్రమోట్ చేశారని  తెలంగాణలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ‘‘ గతంలో  ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు ఇక టూరిజం ప్రధానం  అనేవారు. ఏ ఇజం లేదన్నప్పుడు మాకు కోపం వచ్చేది. నిజంగా ఖర్చులేనిది ఏదైనా ఉందంటే అది టూరిజం’ అని  కూనంనేని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ మీద ప్రసంగిస్తున్న సమయంలో కూనంనేని చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగించాయి. వామ పక్ష పార్టీలకు బిజెపి బద్ద శత్రువు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి టిడిపి మిత్రపక్ష పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి  సిపిఐ మిత్ర పక్షంగా ఉంది. కాంగ్రస్కు బద్ద శత్రువు బిజెపి.  గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో సిపిఐ పోటీ చేసింది. ఉమ్మడి పది జిల్లాల్లో 30 సీట్లలో సిపిఐకి 10 వేల ఓట్ బ్యాంక్ ఉందని కూనం నేని పలు సందర్బాల్లో చెబుతుంటారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు  బిఆర్ఎస్ కు మిత్ర పక్షంగా ఉన్న సిపిఐకి  మిత్ర ధర్మంగా ఒక్క స్థానం ఇస్తామని కెసీఆర్ ఖరాఖండిగా  చెప్పడంతో బిఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో ఆ పార్టీ అధికారంలో రావడానికి సిపిఐ ముఖ్య భూమిక వహించింది. పార్టీలకు, పొత్తులకతీతంగా కూనంనేని కుండబద్దలు కొట్టి మాట్లాడటం చర్చనీయాంశమైంది
Publish Date: Mar 26, 2025 1:14PM

అమిత్ షాతో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు భేటీ.. కారణమేంటో తెలుసా?

తెలుగుదేశం ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణ దేవరాయులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంగళవారం (మార్చి 25) భేటీ అయ్యారు. సాధారణంగా అయితే ఇటువంటి భేటీలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ లావు శ్రీకృష్ణ దేవరాయులు అమిత్ షాతో భేటీ అయిన సమయం, అంతకు ముందు రోజు అంటే సోమవారం (ఫిబ్రవరి 24) లోక్ సభలో లావు ప్రసంగం తరువాత అమిత్ షాతో ఆయన భేటీ కావడం రాజకీయంగా ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ సందర్భంగా ఆయన పలు పత్రాలను అమిత్ షాకు అందజేయడమే కాకుండా వాటికి సంబంధించిన విషయాలను వివరించారు. లావు ఇచ్చిన పత్రాలను అమిత్ షా కూడా ఆసక్తిగా చూశారనీ, ఆయన వివరణలను శ్రద్ధగా విన్నారనీ తెలుస్తోంది. అయితే ఈ పత్రాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి అందించాల్సిన సహాయ సహకారాలకు సంబంధించినవి కావని పరిశీలకులు అంటున్నారు.   సోమవారం (మార్చి 24) లోక్ సభలో లావు శ్రీకృష్ణ దేవరాయులు ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణానికి సంబంధించి తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే ఏపీ మద్యం కుంభకోణం ఎన్నో రెట్టు పెద్దదని పేర్కొన్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించి వేలాది కోట్ల రూపాయలను అక్రమంగా ఢిల్లీకి తరలించారనీ, దీని వెనుక వైసీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఉన్నారనీ లావు ఆరోపించారు. అంతే కాకుండా ఏపీ మద్యం కుంభకోణంపై ఈడీ విచారణకు ఆయన డిమాండ్ చేశారు. ఇది జరిగిన మరుసటి రోజే అంటే మంగళవారం (మార్చి 25)న లావు శ్రీకృష్ణ దేవరాయులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడమే ఈ ప్రాధాన్యతకు కారణం. ఈ భేటీలో లావు శ్రీకృష్ణ దేవరాయులు.. లోక్ సభలో తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను అమిత్ షాకు అందజేయడమే కాకుండా మరో సారి ఈడీ దర్యాప్తు డిమాండ్ ను గట్టిగా చేశారనీ ఏపీ రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  
Publish Date: Mar 26, 2025 1:03PM

ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం నివాసంలో సీబీఐ సోదాలు

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఛత్తీస్ గఢ్  మాజీ ముఖ్యమంత్రి  భూపేశ్ బఘేల్  నివాసంలో సీబీఐ అధికారలు సోదాలు నిర్వహిస్తున్నారు,  భూపేశ్ బఘేల్ నివాసంతో పాటు  రాయ్‌పూర్, భిలాయ్‌లోని ఆయన నివాసాలు,   సీనియర్ పోలీసు అధికారి, మాజీ ముఖ్యమంత్రి సన్నిహితుడి ఇంట్లో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  అదే విధంగా బఘేల్  సన్నిహితులు వినోద్ వర్మ, దేవేంద్ర యాదవ్ నివాసాలలో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  వాస్తవానికి భూపేశ్ ప్రభుత్వ హయాంలో మద్యం, బొగ్గు, మహాదేవ్ సత్తా యాప్ వంటి అనేక కుంభకోణాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఛత్తీస్ గఢ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు ఇటీవల  బాఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించారు.  ఈ సోదాలు ఈ నెల  10న జరిగాయి. ఛత్తీస్ గఢ్ లిక్కర్ కుంభకోణంలో భూపేశ్ బాఘేల్ కుమారుడిపై మనీలాండరింగ్  కేసు నమోదైంది. ఆ కేసు దర్యాప్తులో భాగంగానే  భిలాయ్ లోని ఆయన నివాసంపై ఈడీ దాడులు నిర్వహించింది. ఇప్పుడు తాజాగా బహేల్ నివాసాలపై సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నది. 
Publish Date: Mar 26, 2025 12:29PM

మొగల్తూరు, పెనుగొండలలో పవన్ పర్యటన 28న

శ్రీమంతుడు సినిమాలో ఊరు చాలా ఇచ్చింది.. తిరిగిచ్చేయాలి లేకపోతే లావైపోతాను అనే డైలాగ్ ఒకటి ఉంది.   పుట్టి పెరిగిన ఊరు అభివృద్ధి కోసం ఏదో ఒకటి చేయాలన్న సందేశం ఆ డైలాగ్ లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను పుట్టి పెరిగిన గ్రామాల కోసం ఏదైనా చేయాలని తపన పడుతున్నారు. వాటి రుణం తీర్చుకోవాలని ఆరాట పడుతున్నారు.  అందుకే తాను పుట్టి పెరిగిన మొగల్తూరు అభివృద్ధిపై దృష్టి సారించారు.  ఈ నేపథ్యంలోనే  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 28న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు, పెనుగొండలలో పర్యటించనున్నారు. మొగల్తూరుతో పాటు పెనుగొండతో కూడా పవన్ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే ప్రత్యేకంగా ఆ రెండు గ్రామాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఆయా గ్రామాలలో ప్రజల సమస్యలన తెలుసుకోవడమే కాకుండా వాటి పరిష్కారం కూడా చేయనున్నారు.   ఈ నెల 28 ఉదయం మొగల్తూరు. సాయంత్రం పెనుగొండ గ్రామాలలో పర్యటించనున్న పవన్ కల్యాణ్ రెండు గ్రామాలలోనే గ్రామ సభలు నిర్వహించనున్నారు.  ఈ సందర్భంగా ప్రజల నుంచి గ్రామాభివృద్ధి కి సంబంధించిన ప్రతిపాదనలు స్వీకరిస్తారు. రెండు గ్రామాలలో  మౌలిక వసతుల కల్పన, రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ తదితర సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 
Publish Date: Mar 26, 2025 12:01PM

ఏఐ టెక్నాలజీతో న్యూస్ పేపర్ ప్రింట్ ఎడిషన్!

రిపోర్టర్లు లేరు… సబ్ ఎడిటర్లు లేరు… ప్రూఫ్ రీడర్లు లేరు… పేజీ మేకప్ ఆర్టిస్టుల్లేరు… ఫోటోగ్రాఫర్లు లేరు… ఐనా సరే, డెయిలీ పేపర్ పబ్లిషైంది… ప్రింట్ ఎడిషన్, డిజిటల్ ఎడిషన్ మార్కెట్‌లోకి వచ్చేశాయి. నిజం..  ఇల్ ఫోగ్లియోఅనే ఇటాలియన్ పత్రిక తొలిసారిగా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్   సాయంతో ఒక ఎడిషన్‌ను ప్రచురించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఈ ప్రయోగం 2025 మార్చి 18 నుంచి ప్రారంభమైంది, ఒక నెలపాటు కొనసాగుతుంది. జర్నలిజంలో ఏఐ ప్రభావాన్ని పరీక్షించడానికి,  దాని ఉపయోగాన్ని ఆచరణాత్మకంగా అర్థం చేసుకోవడాని ఈ పత్రికను తీసుకువచ్చినట్లు ఇల్ ఫోగ్లియో సంపాదకుడు క్లాడియో సెరాసా  తెలిపారు. జర్నలిజాన్ని పునరుజ్జీవింపజేయడానికి ఇదొక సదవ కాశంగా అభివర్ణించారు.  
Publish Date: Mar 26, 2025 10:36AM

రంజాన్ వేళ పొలిటీషియన్లకు ఈసీ షాక్

రంజాన్ పండగ వేళ తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.  హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో  ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు రంజాన్ వేడుకల్లో పాల్గొనడానికి అనుమతి లేదని ఈసీ పేర్కొంది.   ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడంతో ఈసీ ఈ ఆంక్షలు విధించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో కోడ్ కారణంగా రంజాన్ వేడుకలలో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిథులు పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ఏటా రంజాన్ మాసంలో ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీ. అలాగే  రాజకీయ పార్టీలు,   నేతలూ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తుంటారు. ఎన్నికల కోడ్ పుణ్యమా అని ఈ సారి ఇక నుంచి అందుకు అవకాశం లేకుండా పోయింది. 
Publish Date: Mar 26, 2025 10:25AM

రూ. 59.70 కోట్లతో పిఠాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం

పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి మార్గం సుగమమైంది. కేందర రోడ్డు, మౌలిక సదుపాయాల నిధి (ఆఆర్ఐఎఫ్) పథకం కింద సామర్లకోట- ఉప్పాడ రోడ్డులో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం లభించింది. ఇందు కోసం 59 కోట్ల 70 లక్షల రూపాయలు కేటాయించారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ ఓ ప్రకటనలో వెల్లడించారు.  గత ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చనున్నారు. ఇందు కోసం మంగళవారం (మార్చి 25) పరిపాలనా అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ బ్రిడ్జి నిర్మాణ వ్యయాన్ని తొలుత రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆ తరువాత ఈ వ్యయాన్ని సీఆర్ఐఎఫ్ కింద కేంద్ర ప్రభుత్వం రియింబర్స్ చేస్తుంది.   రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు కావడం పట్ల పిఠాపురం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన వాగ్దానాన్ని పవన్ కల్యాణ్ నెరవేర్చుకుంటున్నారని ప్రశంసలు గుప్పిస్తున్నారు. 
Publish Date: Mar 26, 2025 9:40AM

మంగళగిరి అమ్మాయితో ఉడాయించిన లేడీ అఘోరీ

అఘోరినంటూ గత కొంత కాలంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో హల్చల్ చేస్తున్న వ్యక్తి ఓ అమ్మాయితో పరారవ్వడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.  మాయమాటలు చెప్పి  తమ కుమార్తెను అఘోరి వశపరుచుకుందని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో అఘోరీ మంగళగిరి వచ్చిన సమయంలో పరిచయమైన బిటెక్ విద్యార్థినిని అఘోరీ వశపరుచుకుంది.  తనకు పరిచయం అయిన విద్యార్థిని కోసం అఘోరీ పలుమార్లు మంగళగిరికి వచ్చిందని చెబుతున్నారు.   ఈ మేరకు ఆ విద్యార్థిని తండ్రి తురిమెల కోటయ్య సోమవారం మంగళగిరి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కోటయ్య నెలల కిందట రోడ్డు మీద నగ్నంగా హల్ చల్ చేస్తున్న అఘోరీకి పోలీసుల విజ్ణప్తి మేరకు బట్టలు కప్పిందన్నాడు. అప్పటి నుంచీ అఘోరీ తన కుమార్తె ఫోన్ నంబర్ తీసుకుని మాట్లాడేదనీ, ఒకటి రెండు సార్లు తమ ఇంటికి కూడా వచ్చిందనీ వివరించారు. అఘోరీ తన కుమార్తెను  కూతుర్ని మాయ మాటలతో మోసం చేసి ఆకుపసరు తో  లేపనాలు పూసి, వశీకరణ చేసుకొని అఘోరీల ఆశ్రమానికి యువరాణి ని చేస్తారని చెప్పి  తనవైపు తిప్పుకుందని భోరుమన్నాడు. కాగా ఇంజనీరింగ్ విద్యార్థిని సోదరుడు కూడా ఆఘోరీ తీరుపై ఆరోపణలు చేశాడు. అఘోరీ తనను లైంగికంగా వేధించిందన్నాడు. దీంతో అఘోరీ వ్యవహారం మరో సారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Publish Date: Mar 26, 2025 7:07AM

మార్కాపురం ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్

ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి .ఈయన వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది, మార్కాపురం నియోజకవర్గంలోని సమస్యలపై   ఈ నెల 22న ప్రజా దర్బార్ నిర్వహించారు.  ఆ ప్రజా దర్బార్‌ నిర్వహించిన నారాయణరెడ్డి ప్రజల ముందు సెలైన్ పెట్టించుకుని ఓవర్ యాక్షన్ చేయడం నవ్వులపాలవుతోంది.  మహిళా దినోత్సవం పురస్కరించుకుని  సిఎం చంద్రబాబు ఇటీవల మార్కాపురం వచ్చారు.  తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కార్యకర్తల మీటింగ్ లో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఎమ్మెల్యే పనితీరు ఆశించిన రీతిలో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చురకలు అంటించారు. తీరు మార్చుకోకపోతే పోతే చర్యలు ఉంటాయని తీవ్రంగానే హెచ్చరించారు.  సిఎం చంద్రబాబు ఎమ్మెల్యే కందులపై అలా కార్యకర్తల ముందు మండిపడటంతో  ఆయన  పరువు పొయినట్లైంది. సొంత క్యాడర్ ముందు డ్యామేజ్ అయ్యానని ఆయన తెగ ఫీల్ అవుతున్నారంట. ఆ క్రమంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ప్రజలలో సానుభూతి పొందటానికి  ఓవర్ యాక్షన్ చేస్తున్నారని  నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. తాజాగా ప్రజా దర్భర్ లో సెలైన్ పెట్టించుకోవడం అందులో భాగమే అంటున్నారు.
Publish Date: Mar 26, 2025 6:39AM

కాకాణికి జైలు గండం?

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీలో అంతో ఇంతో యాక్టివ్‌గా ఉన్న కాకాణి చుట్టూ ఉచ్చు బిగుస్తుండటం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. తాజాగా క్వార్ట్జ్‌ ఖనిజం కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారు. మరో వైపు ఒంగోలు పార్లమెంట్‌ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో ప్రభుత్వం సిట్‌ను నియమించింది. ఎంపీ సంతకాల ఫోర్జరీ కేసులో సైతం కాకాణిని నిందితుడిగా చేర్చే సూచనలు కనిపిస్తున్నాయి. సర్వేపల్లి రిజర్వాయర్‌లో గ్రావెల్‌ కుంభకోణం వెనుక కూడా కాకాణి హస్తం ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ పరిణామాలతో కాకాణికి కష్ట కాలం తప్పదంటున్నారు.  తాజా కేసుతో మాజీ మంత్రి అరెస్టుకు రంగం సిద్దమైనట్లు జరుగుతున్న ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది . ఓ మైన్ ని కొల్లగొట్టి అక్రమంగా 250 కోట్ల రూపాయలకు పైగా దోచేసినట్లు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు మేరకు మైనింగ్, పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈ అభియోగంపై కేసులు కూడా నమోదు చేశారు. మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఈ కేసులో నాలుగో నిందితుడిగా చేర్చారు.  కాకాణి అక్రమాలపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్ర మైనింగ్ శాఖతో పాటు కేంద్ర మైనింగ్ శాఖలకు కూడా ఫిర్యాదు చేశారు. 250 కోట్ల విలువైన ఖనిజ సంపాదన దోచుకున్నారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. అప్పట్లో  వైసీపీ ప్రభుత్వం ఉండడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వైసిపి ప్రభుత్వంలో అదే మైన్స్‌ వద్ద సోమిరెడ్డి మూడు రోజుల పాటు సత్యాగ్రహ దీక్ష కూడా చేశారు. మైనింగ్‌ లోడ్లతో రవాణాకు సిద్ధంగా ఉన్న 40 లారీలను తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. అప్పట్లో అది పెద్ద కలకలమే రేపింది.  వైసీపీ ప్రభుత్వంలో న్యాయం జరగదని భావించిన సోమిరెడ్డి కేంద్ర మైనింగ్‌ శాఖకు ఫిర్యాదు చేశారు. కేంద్రం ఆదేశాలకు తోడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ కేసుకు ప్రాణం వచ్చింది. ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని కాకాణి స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే  గత ప్రభుత్వంలో మంత్రిగా నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పిన కాకాణికి జైలు గండం పొంచి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది
Publish Date: Mar 26, 2025 6:27AM

మందలో వచ్చి.. ముందు నిలబడిన ‘ఇప్పాల’

చెప్పకుండా వచ్చినందుకు షాక్ ఇచ్చిన లోకేష్ అత్యంత హేయంగా, నీచంగా, ద్వేష భావంతో గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ నేతలపైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇప్పాల రవీంద్రరెడ్డి నేడు నారా లోకేష్ ముందు ప్రత్యక్షమై ఒక బిజినెస్ మీటింగ్ చేశారు.  అయితే రవీంద్రారెడ్డి అని లోకేష్ కి తెలియకపోవచ్చు. కానీ ఆలస్యంగా విషయం తెలుసుకున్న లోకేష్ మందలో వచ్చి తనకు ఝలక్ ఇచ్చిన రవీంద్రకు అంతే వేగంగా షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చారు.  వ్యాపార సమావేశం నిమిత్తం మంగళవారం (మార్చి 25) సిస్కో కంపెనీ ప్రతినిథులు కొందరు మంత్రి నారా లోకేష్ ని కలిశారు. అదే కంపెనీలో సౌత్ ఇండియా టెరిటరీ ఎక్కౌంట్స్ మేనేజర్ గా ఉన్న ఇప్పాల కూడా ఆ బృందంలో ఒక సభ్యుడిగా హాజరయ్యారు. ఈ విషయం గమనించని లోకేష్ అతడిని కంపెనీ సభ్యుడిగానే భావించారు. మాట్లాడి పంపించారు. ఇది గమనించి సోషల్ మీడియా హైలైట్ చేయడంతో షాక్ అయిన లోకేష్ వెంటనే  ‘సిస్కో’ కపెనీకి ఆప్పాలను ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ విధమైన ప్రాజెక్టులోనూ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీభాగస్వామిని చేయవద్దని లేఖ రాశారు. ఆ విధంగా లోకేష్ ప్రతి స్పందించారు. లోకేష్ సిబ్బందికి, అధికారులకు అతను ఎవరో తెలియక పోవచ్చు కానీ, మంత్రి లోకేష్ వద్దకు ఏదైనా క ంపెనీ ప్రతినిథుల బృందాన్ని పంపేటప్పుడు వారెవరో తెలుసోవడంలో సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విఫలమైందని తెలుగుదేశం అభిమానులు విమర్శిస్తున్నారు. 
Publish Date: Mar 25, 2025 6:16PM

ఏ దేశమేగినా దీదీ .. దీదీనే !

ఏ దేశ  మేగినా, ఎందు కాలిడినా .. మమతా బెనర్జీ.. మమతా బెనర్జీనే. ఆమె మారరు.ఆమె వేషం అసలే మారదు. అదే ముతక చీర, అవే స్లిప్పర్స్. అదే నడక, అదే పరుగు. సహజంగా రాజకీయ నాయకులనే కాదు, మాములు మనమే అయినా విదేశాలకు వెళ్ళినప్పుడు, వేషం మార్చేస్తాం. సూటూబూటులోకి మారిపోతాం.నిజానికి విదేశాలకే వెళ్ళ నక్కర లేదు,  పెళ్ళికో పేరంటానికో వెళ్ళినా అంతే. సందర్భాన్ని బట్టి డ్రెస్ కోడ్ మారి పోతుంది. ఇక ఆడ వారి విషయం అయితే చెప్పనే అక్కర లేదు. కానీ, మమతా దీదీ  అలాక్కాదు. ఇక్కడ ఉన్నా, ఎక్కడికైనా వెళ్ళినా అంతే. ఆమె వేషం మారదు.   అవును. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు,  మమతా దీదీ ప్రస్తుతం లండన్‌  పర్యటనలో ఉన్నారు. పెట్టుబడుల కోసమే వెళ్ళారో, ఇంకెందు కోసం వెళ్ళారో ఏమో కానీ, పొద్దున్నే లేచి, ఆమె బస చేసిన హోటల్  కు దగ్గరలో ఉన్న హైడ్ పార్క్ లో వాకింగ్ కు వెళ్ళారు. అయినా.. ఆమె వేషం మారలేదు. అదే చీర, అవే చెప్పులు. ఆమె వెంట సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు కూడా ఉన్నారు. అయితే  ఆ  బృందంలోని  ఆడ, మగ సెక్యూరిటీ అధికారులు అందరూ అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా.. కోట్లు .. బూట్లు వేసుకుని నడిస్తే.. మమతా దీదీ మాత్రం మాములుగా చీరకట్టులో, స్వెటర్ మాత్రం వేసుకుని, కాళ్ళకు ఎప్పటిలానే స్లిప్పర్స్  మాత్రమే వేసుకుని కోల్ కతా వీధుల్లో నడిచిననట్లే చక చకా నడుస్తూ వాకింగ్ తో పాటు జాగింగ్ చేశారు. ఆమె వెంట ఇంగ్లాండ్ వెళ్ళిన  తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కూనాల్ ఘోష్ మమతా దీదీ నడక వీడియోను తన అధికారిక ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఇప్పుడే కాదుట, గతంలోనూ ఆమె విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా  వేషం ఎప్పుడు మార్చ లేదుట.  అయితే  ఇలా ఏ దేశం వెళ్ళినా, మన దేశానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు సహా ఏ దేశాధినేత వచ్చినా, ఎక్కడ ఎవరితో ఉన్నా మున్నూట అరవై రోజులు వేషం మార్చని మరో ముఖ్యమంత్రి ఉన్నారు, ఎవరో తెలుసు కదా, ఎస్, మన ఆంధ్ర ప్రదేశ్ సిఎం  నారా చంద్రబాబు నాయుడు. ఆయన కూడా  అంతే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో అనేక దేశాల్లో పర్యటించారు.  బిల్ క్లింటన్ వంటి అనేక మంది దేశాధి నేతలతో దెశ విదేశాల్లో వేదికలు పంచుకున్నారు. అయినా, ఎప్పుడూ ఆయన వేషం మార లేదు. నిజానికి, చంద్ర బాబును మరో రూపంలో మరో వేషంలో ఉహించుకుందామన్నా నో ఛాన్స్. అవును, చంద్రబాబు మాములుగా అందరిలానే  ప్యాంటు,షర్టు ధరిస్తారు. షూస్ వేసుకుంటారు. కానీ, ప్యాంటు, షర్టు కలర్ మారదు. చిత్రం ఏమంటే కొలతలు కూడా  మారవు. అవును, 70 ప్లస్ లోనూ ఆయన శరీర కొలతల్లో పెద్దగా మార్పు కనిపించదు. బహుశా ఆయన పాటించే ఆహార నియమాలు, వ్యాయామం, జీవన శైలి, ఇందుకు కారణం కావచ్చును. ఇదే కోవకు చెందిన మరో ముఖ్యమంత్రి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్. అయితే ఈయన కట్టేది కాషాయం. అవును, ఒకప్పుడు రాజకీయ నాయకులు, ముఖ్యంగా కాంగ్రస్ నాయకులు ఖద్దరు ఒక్కటే కట్టే వారు. ఇప్పడు టీ షర్టులు, జీన్స్ పాంట్స్ తో పార్లమెంట్’కు వస్తున్నారు. సరే అది వేరే విషయం అనుకోండి.  చివరగా, మనకు స్వాతంత్ర్యం తెచ్చిన  జాతి పిత మహాత్మా గాంధీ చివరి వరకు  కొల్లాయి మాత్రమే కట్టారు. అవును కొల్లాయి కడితేనేమి మా గాంధీ’ అనిపించుకున్నారు. ప్రాతః స్మరణీయులయ్యారు.
Publish Date: Mar 25, 2025 5:28PM

బోరుగడ్డ సమాజానికి ప్రమాదం!

బోరుగడ్డ అనీల్ కుమార్ సమాజానికి ప్రమాదకరం అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆయన సామాజిక మాధ్యమం వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి గతంలో చేసిన వ్యాఖ్యలు, బూతులు తెలిసిందే. వారిరువురినే కాకుండా వారి ఇళ్లలోని మహిళలను కూడా కించపరిచేలా బోరుగడ్డ అనీల్ కుమార్ వ్యఖ్యలు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం జైలుకు రిమాండ్ ఖైదీగా వెళ్లారు. అక్కడ తన తల్లి ఆరోగ్యం బాలేదనీ డాక్టర్ సర్టిఫికేట్ చూపుతూ బెయిలు కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఇక్కడ వరకూ అంతా ఓకే కానీ, తల్లికి ఆరోగ్యం బాలేదంటూ అందుకు రుజువుగా బోరుగడ్డ అనిల్ కుమార్ కోర్టుకు సమర్పించిన డాక్టర్ సర్టిఫికేట్ నకిలీదని తేలడంతో వారు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్ విచార‌ణ‌లో ఉండ‌గానే.. బెయిల్ గ‌డువు ముగిసిపోయింది. అదే సమయంలో తనకు  త‌న‌కు బెయిల్ పొడిగించాల‌ని మ‌రోసారి బోరుగ‌డ్డ కోర్టును ఆశ్ర‌యించారు. ఈ రెండు పిటిషన్లనూ విచారించిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం.. బెయిలు పొడగింపును నిరాకరించడమే కాకుండా, ఎక్కడున్నా సరే వెంటనే వచ్చి జైలు అధికారులకు లొగిపోవాలని ఆదేశించింది. ఆయన కోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయారు కూడా. అయితే బోరుగడ్డపై  పోలీసులు న‌మోదు చేసిన న‌కిలీ డాక్ట‌ర్ స‌ర్టిఫెకెట్ కేసు, హైకోర్టును త‌ప్పుదోవ ప‌ట్టించార‌న్న కేసులు   విచార‌ణ‌లో ఉన్నాయి. తాజాగా వీటిపై విచార‌ణ జ‌రిపిన కోర్టు.. బోరుగ‌డ్డ వంటి వ్య‌క్తులు స‌మాజానికి ప్ర‌మాద‌క‌ర‌మ‌ని.. ఇటువంటి వారిని ప్రత్యేకంగా చూడాలని వ్యాఖ్యానించింది. 
Publish Date: Mar 25, 2025 5:01PM

రాములమ్మకు బెర్త్ లేనట్లేనా ?

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. నలుగురు కొత్త  మంత్రుల ప్రమాణ స్వీకారానికి, కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నలుగురు కొత్త మంత్రులతో నాలుగు బెర్తుల భర్తీకి నిర్ణయం జరిగింది. అయితే  ఈ నలుగురిలో రాములమ్మ పేరు లేదు. అనూహ్యంగా ఢిల్లీ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్న రాములమ్మకు మంత్రి బెర్త్ కూడా కన్ఫర్మ్ అయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ తాజా ప్రోబబుల్స్ లో ఆమె పేరు లేదు. బహుశా  ఆర్ఏసీలో ఆమెకు బెర్త్ ఇస్తారో, లేక మిగిలిన రెండు ఖాళీల భర్తీ సమయంలో అవకాశం కల్పిస్తారో తెలియదు కానీ  ఇప్పటికైతే రాములమ్మకు క్యాబినెట్ బెర్త్ లేనట్లే అంటున్నారు.   తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారీ మంత్రి వర్గ విస్తరణ అంశం చర్చకు వచ్చినా, ఎందుకనో అధిష్టానం అనుమతి ఇవ్వలేదు. కానీ  ఇప్పడు అధిష్టానమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి,  పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ లను ఢిల్లీకి పిలిపించి మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి  కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నాయకులతో మంత్రివర్గ విస్త్రరణతో పాటుగా  రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఆరు గ్యారెంటీల అమలు ఇతరత్రా విషయాలను సుదీర్గంగా చర్చించిన మీదట మంత్రి వర్గ విస్తరణకు అధిష్టానం అనుమతి ఇచ్చిందని  తెలుస్తోంది.  అయితే  మొత్తం ఖళీలు ఒకేసారి కాకుండా.. ప్రస్తుతానికి ఓ నలుగురు కొత్త మంత్రులతో  ఉగాది ముహూర్తానికి ప్రమాణ స్వీకారం కానిచ్చి, మిగిలిన రెండు మంత్రి పదవులు,  మరికొన్ని నామినేటెడ్ పదవుల భర్తీని మరో ముహూర్తానికి వాయిదా  వేసినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణతో పాటుగా,  డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్  ఖాళీలను కూడా భర్తీచేసేందుకు ఢిల్లీ పెద్దలు ఓకే చెప్పినట్లు సమాచారం.  మంత్రివర్గ విస్తరణకు ఓకే చెప్పడంతో పాటుగా, ప్రమాణ స్వీకారం చేసే నలుగురు కొత్త మంత్రుల పేర్లు కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వివేక్ వెంకట స్వామి, కోమటిరెడ్డి రాజ గోపాల రెడ్డితో పాటుగా మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేని నిజామబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ కు మంత్రివర్గంలో స్థానం కల్పిచాలనే నిర్ణయం జరిగింది. ఇక నిర్ణయం కావలసింది,ముహూర్తం మాత్రమే అంటున్నారు. అది కూడా ఉగాదికి  ముందుగానే ఉంటుందని అంటున్నారు.  అయితే  ఇక్కడితో అయిపోయినట్లు కాదని, ఇప్పటి జాబితాలో చివరి నిముషం వరకు ఎవరు ఉంటారో, కొత్తగా ఎవరు చేరతారో చెప్పలేమని,అందుకే ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో గప్ చిప్ గా వచ్చి చేరిన రాములమ్మ విజయశాంతిలాగా, మంత్రివర్గం జాబితాలో ఇంకెవరైనా ఫైర్ బ్రాండ్ దూసుకు వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అవును మళ్ళీ రాములమ్మే, బ్యాక్ డోర్ ఎంట్రీ ఇచ్చినా ఇవ్వచ్చని అంటున్నారు. అప్పట్లో ఎమ్మెల్సీతో పాటుగా హోం మంత్రి బెర్త్ కూడా రిజర్వు అయినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.   అదలా ఉంటే, అడిగిన ప్రతి సారీ నో ..అంటూ మంత్రివర్గ విస్తరణను ఎప్పటికప్పడు  వాయిదా వేస్తూ వచ్చిన అధిష్టానం ఇప్పుడు పిలిచి మరీ మంత్రి వర్గ విస్తరణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కొందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే  గోనె ప్రకాష్ రావు వంటి కొందరు రాజకీయ విశ్లేషకులు ఇది కాంగ్రెస్ కల్చర్ లో భాగమని అంటున్నారు. గతంలో చెన్నా రెడ్డి హాయాంలోనూ ఇలాగే అధిష్టానం అనుమతి కోసం నెలలకు నెలలు నిరీక్షించిన మీదట, హఠాత్తుగా రాత్రి పిలుపు రావడమే కాకుండా మర్నాడే కొత్త మంత్రు ప్రమాణ స్వీకారం జరిగిందని గుర్తు చేస్తున్నారు. అంతే కదా  రాజు తలచు కోవాలే కానీ, విస్తరణ ఎంత పని.
Publish Date: Mar 25, 2025 2:01PM

భద్రాద్రి రామయ్య కు చీరాల భక్తుల నీరాజనం

పది టన్నుల వడ్లు గోటితో వలిచారు  భద్రాద్రి రాముడి కల్యాణంలో అతి పవిత్రంగా భావించేవి వాటిలో తలంబ్రాలు ముందు వరుసలో ఉంటాయి. పసుపు, ముత్యాలు, ధాన్యం మేళవింపుతో వివాహ వేడుకలకు తలంబ్రాలను వినియెగిస్తారు. మరి ఇలాంటి విశిష్ట కలిగిన తలంబ్రాలు, అందులో జగత్ కల్యాణంగా భావించే భద్రాచలం సీతారాముల వారి కల్యాణ మహోత్సవంలో దేవతమూర్తుల శిరస్సు నుంచి జాలువారే తలంబ్రాలకు ఎంతో పవిత్రత ఉంటుంది. భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారాముల వారి కల్యాణానికి గడచిన 11 సంవత్సరాలుగా చీరాల ప్రాంతానికి చెందిన శ్రీ రఘురామా భక్త సేవ సమితి ఆధ్వర్యంలో కోటి గోటి తలంబ్రాలు ఒలిచి కల్యాణ వేడుకులకు తరలిస్తూ స్వామివారి సేవలో భక్తులు పునీతులవుతున్నారు. శ్రీరామనామ జపం చేస్తూ 10 టన్నుల తలంబ్రాలను గోటితో ఒలిచి రాములోరి కల్యాణ వేడుకులకు తరలించడం ఆనవాయితీగా వస్తోంది. కల్యాణం మహోత్సవానికి అన్నీ తామై స్వయంగా వివాహ వేడుకలను నిర్వహిస్తున్న భావన తమలో కలుగుతుందంటున్నారు నిర్వాహకుడు పొత్తూరి బాలకేశవులు.
Publish Date: Mar 25, 2025 12:26PM

ఎంపీల వేతనాలు సరే.. రైతుల మాటేమిటి?

లోకసభ, రాజ్యసభ సభ్యుల జీతాల భృత్యాలు పెరిగాయి.  వాస్తవానికి వీరి జీతాలు రెండేళ్ల కిందటే పెరగాల్సి ఉంది.  అయితే జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఇప్పుడు పెంరిగింది. పెరగడమే కాదు.. ఈ పెంపు  2023 నుంచి అమలులోకి వస్తుంది.  రెండేళ్ల  అరియర్స్ కూడా ఎంపీలు అందుకుంటారు. గతంలో  ఎంపీలకు లక్ష రూపాయల వేతనం అందుకునే వారు. ఇప్పుడు అదనంగా 24 వేల రూపాయలు అందుతుంది. అంతే కాకుండా వారికి డిఏ కూడా 500 రూపాయలు పెరిగాయి. ఆఫీసు నిర్వహణకు,ఇంటి అద్దెకు నెలకు గరిష్టంగా రెండు లక్షల60 వేలు వస్తుంది. విమాన ప్రయాణాలు అయితే  ఏడాదికి 34 సార్లు ఉచిత ప్రయాణం. ఉచిత విద్యుత్, నీరు తదితర అలవెన్సులు ఇస్తారు. ప్రజా ప్రతినిధులకు జీతాలు పెంచడంలో తప్పులేదు. గతంలో అన్నీ త్యాగం చేసి ఎంపీలుగా పనిచేసిన వారు పదవి పూర్తయిన తరువాత  బతకడం కష్టంగా ఉండేది.  ప్రజా ప్రతినిధులకు  జీతాల పెంపు పట్ల ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరు కానీ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారు, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసిన వారి పింఛన్ల విషయాన్ని కూడా కేంద్రం పట్టించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం సామాజిక  పింఛన్లే  4000 రూపాయలు ఉన్నాయి. కానీ ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారికి వచ్చే పెన్షన్ వేయి రూపాయలు మాత్రమే కావడంతో , ఇటువంటి వారి పెన్షన్ ను కూడా పెంచాల్సిన అవసరం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది.   అదే విధంగా రైతుల పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా ఉంది.  సరైన మద్దతు ధర లభించడంలేదు. రైతు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసే ధరకు, అది వినియోగదారుడు కొనుగోలు చేసే సమయంలో ఉన్న ధరకూ వ్యత్యాసం భారీగా ఉంటోంది. అంటే రైతు కష్టం దళారుల పాలౌతోంది. ఈ దళారి వ్యవస్థను తొలగించి రైతుకే నేరుగా లాభసాటిగా ఉండేలా ధ్యాన్యం విక్రయాలు నెరపుకునే అవకాశం కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.   దేశంలోని అన్ని వర్గాలకు కనీస అవసరాలకు సరిపడా  వేతనం లేదా పింఛన్లు వచ్చేలా  చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే వృద్ధులకు 70 ఏళ్ల తరువాత ఉచిత ఆరోగ్యం కల్పిస్తామని ప్రధాని పేరుమీద పథకం ప్రకటించారు. కాని దాన్ని 60 ఏళ్ల నుంచి అమలు చేయాల్సిఉంది. దేశాన్ని ఇన్ని  సమస్యలు  పట్టి పీడిస్తుండగా అత్యంత జరూరుపనిలోలాగా ఎంపీల జీతాల పెంపు కార్యక్రమం చేపట్టడం పట్ల ఒకింత అసంతృప్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎంపీల జీతాల పెంపుతో6పాటే.. రైతులజీవితాలు,వృద్ధుల జీవితాలు బాగుపడే నిర్ణయం కూడా తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 
Publish Date: Mar 25, 2025 12:04PM

బదిలీతో సరి.. అంతేనా?

చట్టం ముందు అంతా సమానమే, కానీ కొందరు కొంచెం ఎక్కువ సమానం.  ఇది ఎప్పటినుంచో  జనం అంటున్న మాట. అనుకుంటున్న మాట. అవును  రాజ్యాంగం, రాజ్యాంగ నిర్మాతల  దృష్టిలో చట్టం ముందు అంతా సమానం,.కానీ, రాజ్యాంగ పరిరక్షణ సంస్థలు, వ్యవస్థల దృష్టిలో కాదు. ఇప్పడు, ఆ వ్యవస్థల జాబితాలో, న్యాయ వ్యవస్థ కూడా చేరిందా అంటే, ఢిల్లీ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌వర్మ,అధికారిక నివాసంలో భారీఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్లు వచ్చిన వార్తల, ఉదంతం కాదన లేని సాక్ష్యంగా నిలిచిందని అంటున్నారు. అలాగే, న్యాయవ్యవస్థ పట్ల సామాన్యుల విశ్వాసం సన్నగిల్లుతోందనే అభిప్రాయానికి, జస్టిస్ యశ్వంత్‌వర్మ ఉదంతం మరింత బలాన్ని చేకూరుస్తోందని అంటున్నారు. అయితే, ఈ ఉదంతంతో సంబంధం లేకుండానే,అనేకమంది ప్రముఖులు న్యాయవ్యవస్థ విశ్వసనీయత విషయంలో చట్ట పరిధిలోనే సందేహాలు వ్యక్త పరిచారు.  అందుకే న్యాయవ్యవస్థ పట్ల సామాన్యుల విశ్వాసం సన్నగిల్లుతోందనే ఆవేదన, న్యాయవ్యవస్థ లోపలి నుంచే వ్యక్తమవుతోంది. అవును  ఎవరో కాదు  భారత మాజీ ప్రధాన మూర్తి  జస్టిస్ ఎన్వీ రమణ, ఇటీవల (మార్చి 23) చెన్నైలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసం సన్న గిల్లుతోందని  అన్నారు. ప్రజల మనసుల్లో నాటుకు పోయిన ఈ భావనను గుర్తించి, పరిష్కారం చూప వలసిన అవసరం ఉందని అన్నారు.  జస్టిస్ ఎన్వీ రమణ ఈ వాఖ్యలు ప్రత్యేకించి ఎవరినీ ఉద్దేశించి చేసి ఉండకపోవచ్చును, కానీ ఢిల్లీ హై కోర్టు జడ్జి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికార నివాసంలో, ప్రమాద వశాత్తు బయటపడిన  నోట్ల కట్టల ఉదంతంతో కలిపి చూస్తే  జస్టిస్ రమణ చేసిన వ్యాఖ్య  మరింతగా అలోచింప చేస్తోంది. నిజానికి ఇప్పుడే కాదు  గతంలోనూ ఇలాంటి ఉదంతాలు వెలుగు చూసిన సందర్భాలు లేక పోలేదు. అందుకే  రోజురోజుకూ  న్యాయవ్యవస్థ పట్ల సామాన్యుల విశ్వాసం సన్నగిల్లుతూ సమూలంగా తుడిచి పెట్టుకు పోయే ప్రమాద దిశగా సాగుతోందనే   ఆవేదన, ఆందోళన వ్యక్తమవుతున్నాయి.   నిజానికి  ఢిల్లీ హై కోర్టు న్యాయమూర్తి నివాసంలో దొరికినట్లు చెపుతున్న నోట్ల కట్టల ఉదంతం కంటే, ఇందుకు సంబంధించి, సర్వోన్నత న్యాయస్థానం సహా, ఇతరత్రా వినవస్తున్న వ్యాఖ్యలు, న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం మరింత సన్నగిల్లేలా చేస్తున్నాయని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.  ముఖ్యంగా  అసలు ఏమి జరిగింది  అనే విషయంలో స్పష్టత లేక పోవడం మొదలు, ఒక న్యాయమూర్తి నివాసంలో అనుమానస్పద నగదు బయట పడిన తర్వాత ఆరేడు రోజుల పాటు ఎటు నుంచి ఎలాంటి  స్పందన లేక పోవడం సహజంగానే పలు అనుమానాలకు ఆస్కారం కల్పించేలా ఉందని అంటున్నారు. అలాగే  న్యాయమూర్తి బదిలీతో’ కేసును క్లోజ్ చేస్తారా? అన్న సందేహాలు వ్యక్త మయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంలో  న్యాయం జరగడమే కాదు  జరిగినట్లు కనిపించాలి  అనే సహజ సహజ న్యాయ సూత్రం మరుగున పడిపోయిందని, అంటున్నారు. అందుకే  జస్టిస్ వర్మ ఉదంతం చివరకు ఎలా ముగుస్తుంది  అనేది ఆసక్తికరంగా మారింది.  అయితే సుప్రీం కోర్టు కొలీజియం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన్ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. దీనిపై కేంద్రం ఆమోదం లభించిన  తర్వాత  తుది ప్రకటన వెలువడనుందని ప్రకటించింది. అంటే కొలీజియం బంతిని,  ప్రభుత్వ కోర్టులోకి నెట్టింది. ఇక ఏమి జరుగుతుంది? ప్రభుత్వం ఏమి చేస్తుంది? బదిలీతో సరి అంటుందా? చూడాలి. 
Publish Date: Mar 25, 2025 11:13AM