జాతకాలు కలవగానే పెళ్లికి ఓకే చెప్తున్నారా? మొదట ఈ సందేహాలు తీర్చుకోండి.!
జాతకాలు కలవగానే పెళ్లికి ఓకే చెప్తున్నారా? మొదట ఈ సందేహాలు తీర్చుకోండి.!

భారతదేశంలో వివాహానికి ముందు జాతకాల పొంతనను చూస్తారు. మరీ ముఖ్యంగా పెద్దలు కుదుర్చే పెళ్లిలో జాతకాల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. జాతకాలు సరిపోతే.. గ్రహాలు , నక్షత్రాల అనుకూలంగా ఉంటే వైవాహిక బంధం ఎంతో బలంగా, భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉంటారని కూడా పేర్కొంటారు. అయితే కేవలం జాతకాల ఆధారంగా జీవిత భాగస్వామిని ఎంచుకోవడం సరిపోదని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. బలమైన , సంతోషకరమైన సంబంధం కావాలంటే.. ఆలోచనలు, విలువలు, ప్రవర్తన , భవిష్యత్తు గురించి సరైన ప్రణాళిక, అవగాహన అన్నీ కూడా పొంతన కుదరడం జాతకాల కంటే ముఖ్యమైన విషయం. ఇందకోసం వివాహానికి మందు జాతకాల పొంతన కుదిరిందా లేదా అనే విషయం కంటే ఇటీవల వివాహానికి ముందు కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా భాగస్వామిని ఎంచుకోవడం మంచిదని, ఇలా చేయడం వల్ల జీవితం ఎంతో బాగుటుందని అంటున్నారు. ఇంతకీ వైవాహిక బంధంలోకి వెళ్ళేముందు కాబోయే భాగస్వామిని అడగవలసిన ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. సంతోషకరమైన జీవితం అంటే.. పెళ్లికి ముందు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సంతోషకరమైన జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోవడం. కొందరు వృత్తికి, విజయానికి ప్రాధాన్యత ఇస్తే, మరికొందరు కుటుంబానికి, స్థిరమైన జీవితానికి విలువ ఇస్తారు. ఇద్దరికీ జీవితంపై వేర్వేరు అంచనాలు ఉంటే, అది భవిష్యత్తులో విభేదాలకు దారితీయవచ్చు. అందువల్ల, ఇద్దరి కలలు , ప్రాధాన్యతల గురించి ఓపెన్ గా చర్చించుకోవడం ముఖ్యం. ప్రేమ అంటే అర్థం.. ఒక సంబంధానికి పునాది ఇద్దరు భాగస్వాముల ప్రేమ ఎలా ఉంటుంది అనే విషయం పైన ఆధారపడి ఉంటుంది. బాల్యం, కుటుంబ నేపథ్యం , గత అనుభవాలు తరచుగా మనం ప్రేమను చూసే విధానాన్ని తీర్చిదిద్దుతాయి. భార్యాభర్తల మధ్య సంబంధంలో గౌరవం, నమ్మకం , ఒకరితో ఒకరు మాట్లాడే తీరు.. వీటన్నింటి గురించి భాగస్వామికి ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవడం ముఖ్యం. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది చాలా విషయాలలో ముడి పడి ఉంటుంది. అంచనాలు.. కుటుంబానికి సంబంధించిన అంచనాల గురించి కూడా స్పష్టంగా చర్చించుకోవాలి. వివాహం తర్వాత కుటుంబ పాత్ర, తల్లిదండ్రులతో కలిసి జీవించాలా లేక విడిగా జీవించాలా, పిల్లల గురించి అభిప్రాయాలు, నిర్ణయాలు ఏమిటి, ముఖ్యమైన విషయాలు, నిర్ణయాలలో కుటుంబ సభ్యుల ప్రమేయం ఎంతవరకు ఉండాలి వంటి విషయాలపై ముందుగానే స్పష్టత ఉండటం మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో తలెత్తే అనేక గొడవలను ఈ స్పష్టత నివారిస్తుంది. బంధం నిర్వహణ.. ప్రతి సంబంధంలోనూ అభిప్రాయ భేదాలు రావడం సహజం, కానీ వాటిని ఎలా పరిష్కరిస్తారనేదే అత్యంత ముఖ్యం. పెళ్లికి ముందు కోపం, ఒత్తిడి లేదా అభిప్రాయ భేదాల వంటివి ఎదురైనప్పుడు భాగస్వామి ఎలా స్పందిస్తారో అర్థం చేసుకోవడం ముఖ్యం. వారు మాట్లాడటం ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటారా లేదా వాటిని తప్పించుకుంటారా అనేది సంబంధం ఎంత బలంగా ఉంటుంది అనే విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలవాట్లు, ప్రవర్తన.. పైన చెప్పుకున్న విషయాలే కాకుండా రోజువారీ అలవాట్లు , ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్థిక నిర్వహణ, బాధ్యతలను నిర్వర్తించడం, ఒత్తిడి గా ఉన్నప్పుడు దాన్ని నియంత్రించుకోవడం, పరస్పర ప్రవర్తన వంటి చిన్న విషయాలు సంబంధాన్ని ఎన్నేళ్లు గడిచినా ఎంతో సంతోషంగా ఉంచగలవు. ఈ అలవాట్లు వివాహం తర్వాత అకస్మాత్తుగా మారవు, కానీ ఎక్కువగా బాగా స్పష్టంగా కనిపిస్తాయి. పైన చెప్పుకున్న విషయాలను పెళ్లికి ముందు భాగస్వాములు ఇద్దరూ మాట్లాడుకోవడం వల్ల పెళ్లి తర్వాత అబిప్రాయ బేధాలు లేదా మనస్పర్థలు రాకుండా ఉండేందుకు సహాయపడతాయి. జీవితంలో ఒక్కసారి ముడిపడే బంధాన్ని జీవితాంతం పదిలంగా ఉంచుకోవచ్చు. *రూపశ్రీ.

Publish Date: Jun 3, 2026 3:57PM
అమ్మాయిల కెరీర్  వారి వివాహ జీవీతం పై ప్రబావం చూపిస్తోందా?
అమ్మాయిల కెరీర్  వారి వివాహ జీవీతం పై ప్రబావం చూపిస్తోందా?

వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకం. వివాహ వయస్సు కాలక్రమేణా పెరుగుతోంది. చదువు పూర్తయిన తర్వాత అబ్బాయి అయినా అమ్మాయి అయినా కెరీర్‌లో స్థిరపడిన సెటిల్ అయిన తర్వాత మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటారు. అబ్బాయిలు ఆలస్యంగా వివాహం చేసుకోవడం పెద్దగా సమస్య కాదు, కానీ పెద్ద వయసులో అమ్మాయిలకు మంచి సంబందాలు రావడం లేదన్నది ఒప్పుకోవాల్సిన నిజం. అమ్మాయిలకు వివాహానికి సరైన వయస్సు ఏమిటి అనే విషయంపై సరైన స్పష్టత ఎక్కడా లేదు. అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలు కూడా మొదట తమ కెరీర్‌ను నిర్మించుకోవాలని, ఆ తర్వాత వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు. కానీ 30ఏళ్ల తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులకు పెద్ద సవాల్ ఎదురవుతోంది. దీనిగురించి రెలేషన్షపి నిపుణులు చెబుతున్న విషయాలు ఏంటో తెలుసుకుంటే.. కెరీర్ అడ్డంకి.. గతంలో ఆడపిల్లల చదువు, కెరీర్ కు ఇంత ప్రాముఖ్యత లేదు. టెంత్, ఇంటర్, డిగ్ర లాంటివి పూర్తవ్వగానే ఆడపిల్లలకు పెళ్ళి చేసేవారు. పెళ్లి తర్వాత మహిళలు కూడా ఇంటిని, భర్త, పిల్లలు, అత్తమామలను చూసుకుంటూ ఉండే వారు. కానీ నేటికాలంలో అలా లేదు.. తల్లిదండ్రులు ఆడపిల్లలను కూడా కొడుకులతో సమానంగా చదివిస్తున్నారు. ఆడపిల్లలు తమ కెరీర్ ను అద్బుతంగా మలుచుకోవడంలో సపోర్ట్ చేస్తున్నారు. దీని వల్ల ఆడపిల్లలు కూడా తమ కెరీర్ ను బిల్డ్ చేసుకుని సెటిల్ కావడానికి సమయం పడుతోంది. అది కాస్తా 30 ఏళ్ల వరకు వివాహానికి దూరం ఉండేలా చేస్తోంది. ఇదే తల్లిదండ్రులకు పెద్ద సవాల్ గా మారుతోంది. ఆర్థిక స్వాతంత్ర్యం సంపాదించిన కూతురికి పెళ్లి చేయడం చాలా కష్టతరంగా మారింది. అబ్బాయిలకు కాస్త బెటర్.. అమ్మాయిల మాదిరిగానే పెద్ద వయసు అబ్బాయిలకు కూడా వివాహం చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే అబ్బాయి బాగా సంపాదిస్తే చిన్న వయసు అమ్మాయిల నుండి సంబంధాలు వస్తుంటాయి. తల్లిదండ్రులు తమ కూతురికి ఆర్థిక భద్రత కల్పించే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటారు. అయితే అమ్మాయిల విషయంలో అలా కాదు. ఒక అమ్మాయి ఎంత సంపాదించినా, ఆమె పెద్దది అయితే మంచి జత దొరకడం కష్టంగా ఉంటుంది. అబ్బాయిలు ఆశించడమే పెద్ద సమస్య.. కాలం ఎంత మారినా అది మగవారి ఆలోచనలు మార్చలేకపోతోంది. మగవాళ్లకు తమ భార్యల పట్ల ఉన్న అవగాహన పెద్దగా మారలేదు. చాలా మంది మగవాళ్లు ఎక్కువగా ఆశిస్తున్నారనే మాట చాలా నిజం. భార్య అటు ఉద్యోగం చేసి సంపాదించాలి, అలాగే ఇటు ఇంటికి రాగానే ఇంటి పనులు అన్నీ ఆమె చేసి భర్తకు సేవలు చేస్తూ పిల్లలను కూడా చూసుకోవాలని కోరుకుంటారు. చాలా సార్లు తమ తల్లితో భార్యను పోలుస్తారు, వస్త్రధారణ నుండి అమ్మాయి పరిచయాల వరకు, స్నేహితులు, వ్యక్తిగత స్పేస్ వంటి విషయాలలో కూడా ఆబ్బాయిలు అమ్మాయిలను చికాకు పెడతారు. ఇలాంటివి అమ్మాయిలకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. ఇవి కాస్తా వైవాహిక జీవితంలో అడ్డంకులకు కారణం అవుతున్నాయి. అమ్మాయిల వయసు పెరిగితే ఇదే సమస్య.. 30ఏళ్ళ తర్వాత అమ్మాయిలకు వివాహం విషయంలో ఎదురయ్యే అతి పెద్ద సమస్య అమ్మాయి సంతానోత్పత్తి ఆమె వయస్సుతో ముడి పడి ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ అమ్మాయి సంతానోత్పత్తి తగ్గుతుంది. అమ్మాయి పెద్దదైతే ఆ జంట పిల్లల కోసం ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. ఇది వైవాహిక జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించకుండా చేస్తుంది. నేటి కాలంలో అమ్మాయిలు ఆర్థిక విషయం నుండి చాలా వరకు స్వతంత్రత కలిగి ఉన్నారు. తన సొంత ఆలోచన ఉంటుంది. ఆమె తన భర్త లేదా కుటుంబం చెప్పే ప్రతిదానితో ఏకీభవించలేదు. ఆమె తన సొంత ఆలోచనకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇదే భార్యభర్తల మధ్య సమస్యలు సృష్టిస్తోంది. సరైన వయసు.. మేజర్ అయితే చాలు అమ్మాయిలు, అబ్బాయిలు వివాహానికి అర్హత పొందుతారు. కానీ వివాహానికి సరైన వయసు అనేది వ్యక్తిగతంగా ఉంటుంది. అమ్మాయిలు కెరీర్ ను సీరియస్ గా తీసుకోవడం వివాహానికి ఇబ్బంది కలిగించే విషయమే అయినప్పటికీ చాలా మంది మహిళలు తమ కెరీర్ ను తొందరగా సెటిల్ చేసుకుని సరైన జోడి వెతుక్కుని హాయిగా సెటిల్ అవుతున్నారు. అంటే.. వివాహం విషయంలో అబ్బాయిల ఆలోచన కూడా ముఖ్యం. వారు కూడా మారితేనే భార్యాభర్తల వైవాహిక జీవితం బాగుంటుంది. *రూపశ్రీ.

Publish Date: Jun 2, 2026 4:47PM
ఎక్కువ మాట్లాడటం కూడా భార్యాభర్తల బంధాన్ని విచ్చిన్నం చేస్తుందా? చాలామందికి తెలియని నిజాలు!
ఎక్కువ మాట్లాడటం కూడా భార్యాభర్తల బంధాన్ని విచ్చిన్నం చేస్తుందా? చాలామందికి తెలియని నిజాలు!

భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది, ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం. ఇలాంటి పరిస్థితిలో అతిగా మాట్లాడం లేదా ఎక్కువ మాట్లాడటం కూడా భార్యాభర్తల బంధాన్ని విచ్చిన్నం చేస్తుందని అంటున్నారు రెలేషన్షిప్ నిపుణులు. జరిగే ప్రతి విషయాన్ని తమ భాగస్వామితో పంచుకోవడం, ప్రతి విషయాన్ని చర్చించడం, అన్ని విషయాలు తమకు తెలిసి జరగాలి అనుకోవడం, ప్రతి చిన్న విషయం గురించి మాట్లాడటం.. ఇలా ప్రతిదీ భాగస్వామితో మాట్లాడం వల్ల భార్యాభర్తల బంధం విచ్చిన్నం అవుతుంది అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ఇది తెలుసుకోవాలి.. ఒక సంబంధాన్ని బలపరచడంలో ముఖ్యమైనది ఎక్కువ మాట్లాడటం కాదు.. ఏదైనా మాట్లాడినప్పుడు ఆ మాటలలో నిజాయితీ, మాట్లాడే విషయం పట్ల అవగాహన, దాని ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనవి. ఏదో ఒకటి మాట్లాడాలి అని కబుర్లు చెప్పుకోవడంలో బంధం బలపడటం అనేది జరగదు. ఇద్దరి ఆలోచనలు, ప్రవర్తనలు, ఇద్దరూ ఏదైనా విషయం గురించి మాట్లాడటం.. ఇలాంటి సందర్బాలు చాలా కొన్నే ఉన్నా అది బంధాన్ని బలపరుస్తుంది. ఏదో ఒకటి మాట్లాడాలనే కారణంతో అవసరం లేని విషయాలు మాట్లాడుతూ ఉంటే.. భాగస్వామి విసుగు చెంది ఇలా కబుర్లు చెప్పడం అనే మంచి సమయానికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. సమయం ముఖ్యమే.. భార్యాభర్తలు రోజులో కొంత సమయం గడపడం చాలా కీలకమని నిపుణులే చెబుతున్నారు. ఇద్దరు కలిసి కొంత సమయం గడిపినప్పుడు, వారి మధ్య ఒకరి పట్ల ఒకరికి ఆసక్తి, సాన్నిహిత్యం పెరుగుతుంది. ఎప్పుడూ ఒకరితో మరొకరు అప్యాయత, అనురాగం, ఇద్దరి మధ్య బంధం బలపడే అవకాశం ఉంటుంది. చిన్న విషయాలు ఎందుకు మాట్లాడకూడదు.. కొందరు భాగస్వాములు చిన్న చిన్న విషయాలను కూడా చెబుతూ ఉంటారు. ఏ విషయాన్ని దాచుకోవడం లేదని, తాము బంధంలో ఎంతో నిజాయితీగా ఉంటున్నామని కూడా అంటుంటారు. కానీ ఇది చాలా పొరపాటు. ప్రాముఖ్యత లేని విషయాల గురించి మాట్లాడటం వల్ల ఇద్దరి మధ్య ఆసక్తి తగ్గి, అపార్థాలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇద్దరు కలిసి గడిపే సమయం నాణ్యంగా మార్చుకోవాలి. అంచనాలకు పోవద్దు.. టీవి, సినిమా, సీరియల్, చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు భార్యాభర్తల బందాలలో కొన్ని సంఘటనలు, సందర్భాలు చాలా సంతోషంగా, ఎంతో అపురూపంగా గడుపుతూ ఉంటారు. ఇలాంటి బంధాలను చూసి తాము అలా ఉండాలని అనుకుంటారు చాలామంది. కానీ ఇలాంటి అంచనాలు పెట్టుకోవడం వల్ల చాలా అసంతృప్తి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కాస్తా భాగస్వామి విషయంలో ఒకరంటే ఒకరి పట్ల ఇష్టం, ఆసక్తి తగ్గి, చిరాకు, కోపం పెరిగేలా చేస్తుంది. మనిషిని బట్టే.. కొందరు ఎక్కువ మాట్లాడేవారు ఉంటారు. మరికొందరు తక్కువ మాట్లాడేవారు ఉంటారు. కాబట్టి మనిషిని బట్టి ముందుకెళ్లాలి. బాగా మాట్లాడేవారితో ఏం మాట్లాడినా సరదాగా తీసుకుంటారు. కానీ ఎక్కువ మాట్లాడని వ్యక్తులు చిన్న చిన్న విషయాలకు చాలా చిరాగ్గా ఫీలవుతారు. కాబట్టి మనిషిని బట్టి సాగితేనే బంధాలు బాగుంటాయి. *రూపశ్రీ.

Publish Date: Jun 1, 2026 5:42PM
అపజయాల పట్ల మనోవైఖరి ఎలా ఉండాలి?
అపజయాల పట్ల మనోవైఖరి ఎలా ఉండాలి?

అపజయాలు ప్రతి మనిషి జీవితంలో వస్తూనే ఉంటాయి. అపజయాలు లేకపోతే అసలు విజయానికి విలువ, విజయాలు అనుభూతి చెందలేదు. కానీ ప్రతి ఒక్కరూ అపజయం అనేది తమకు ఎదురు కాకూడదు అని అనుకుంటారు. అయితే అపజయాల విషయంలో మనిషి వైఖరి ఎలా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. "ఒక వ్యక్తి వెయ్యిమార్లు విఫలుడైనా ఉన్నతమైన ఆదర్శానికి అంటిపెట్టుకుని ఉండాలి. అబద్ధాలు చెప్పడం రాని గోడలా ఉండడం కన్నా, తప్పు చేస్తూ ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ఉత్తమం" అని అనేవారు స్వామి వివేకానంద. అబ్రహమ్ లింకన్ తమ దేశ పార్లమెంటు సభ్యుడవ్వాలనుకున్నాడు. అయితే అతని మొదటి ప్రయత్నం విఫలమైంది. వ్యాపారంలో భాగస్వామి అతణ్ణి మోసం చేశాడు. వ్యాపారం కోసం చేసిన అప్పుల బారినుంచి బయటపడడానికి 17 సంవత్సరాల కాలం పట్టింది. అతను వివాహం చేసుకున్న కొద్దికాలానికే మొదటి భార్య మరణించింది. గయ్యాళి అయిన రెండవ భార్య అతనికి పెద్ద తలనొప్పిగా మారింది. అయినా అతడు తన లక్ష్యసాధనకై శక్తినంతా ఉపయోగిస్తూ, చేస్తున్న ప్రయత్నాలను మానలేదు. చివరకు అతను ఎన్నికల్లో నెగ్గడమే కాకుండా, అమెరికా అధ్యక్షుడై, చరిత్రపుటల్లోకి ఎక్కాడు. వ్యక్తిగత సమస్యలకు జడవకుండా, ఉన్నత ఆదర్శాన్ని విడవకుండా ప్రయత్నించిన వారే ఏ కార్యాన్నైనా సాధించగలరు. మనిషి వ్యక్తిగత, సామాజిక, మానసిక రంగాలలో తప్పకుండా అభివృద్ధి సాధించాలి. అలా సాధించినప్పుడు మనిషికి అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఆ విషయం లోతు ఎంత అనేది అర్థం అవుతుంది. లేకపోతే ఎప్పటికీ ఏమీ తెలియకుండా బెల్లం కొట్టిన రాయి చందాన మనిషి ప్రవర్తన కూడా ఏమీ పట్టనట్టు, ఏమీ తెలియని ముర్ఖుడిలా ఉండిపోతారు. ఇలా ఉంటే అపజయాలు ఎదురైనప్పుడు వాటి నుండి ఏమీ నేర్చుకోలేరు. అపజయాల గురించి అసలు ఆలోచించలేరు. కేవలం అపజయాల కారణంగా తాము ఎదగలేక పోయామనే అసంతృప్తి మాత్రమే వాళ్ళలో కనిపిస్తుంది. కాబట్టి అపజయాలను అనుభవాలుగా చూసినప్పుడే మనిషి సరైన ఆలోచనా మార్గంలో ఉండగలుగుతారు. *నిశ్శబ్ద.

Publish Date: May 30, 2026 10:53AM
విడిపోవాలని నిర్ణయించుకునే ముందు భార్యాభర్తలు ఈ ప్రశ్నలు వేసుకోవాలి!
విడిపోవాలని నిర్ణయించుకునే ముందు భార్యాభర్తలు ఈ ప్రశ్నలు వేసుకోవాలి!

పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు. కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే విడిపోతున్నారు, ఇదే విడ్డూరం అనుకుంటే.. పెళ్లై ఏళ్ల తరబడి కాపురాలు చేసిన వారు కూడా విడాకులు తీసుకుంటున్నారు. వివాహం అనేది ఎంత సంతోషకరమైన విషయమో.. విడిపోవాలని నిర్ణయించుకోవడం, విడాకులు తీసుకోవడం అంతకంటే బాధాకరమైన విషయం. ఒకరికి ఒకరు అనుకుని, జీవితాంతం కలిసి ఉండాలనుకుని భార్యాభర్తలుగా మారిన ఇద్దరు వ్యక్తులు విడిపోవాలని అనుకునే ముందు కొన్ని ప్రశ్నలు తమకు తాము వేసుకోవాలని అంటున్నారు అవేంటో తెలుసుకుంటే.. విడిపోవడం.. చాలామంది భార్యాభర్తలు విడిపోవడం అంటే కేవలం ఒక భావోద్వేగ ప్రతిచర్యగా కొట్టిపారేస్తుంటారు. కేవలం వారే కాదు.. చుట్టూ ఉన్న వ్యక్తులు, కుటుంబ సభ్యులు కూడా అలాగే అనుకుంటారు. కానీ విడిపోవడాన్ని కొద్దిపాటి అవగాహనతో, స్పష్టతతో ఆలోచించటం వల్ల విడిపోయిన తర్వాత పశ్చాత్తాపం పడకుండా చూసుకోవచ్చు. కొన్నిసార్లు కష్టంగా అనిపించినా, విడిపోవడం అనుకునే ఆలోచన ఆపుకోవడం అనేది సరైన నిర్ణయం అవుతుంది. అసలు సమస్య.. విడిపోవాలని అనుకునే నిర్ణయం కేవలం అలసట వల్ల లేక విసిగిపోవడం వల్ల లేక మరేదైనా తాత్కాలిక భావోద్వేగం వల్ల వచ్చిన ఆలోచనా లేదా నిజమైన సమస్యా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు లేదా గృహ సమస్యలు సంబంధంపై ఒత్తిడిని కలిగించవచ్చు. కానీ ఆలోచనలు, లక్ష్యాలు , పద్ధతులు భిన్నంగా ఉంటే, అది అంతకంటే లోతైన అగాధం అని అర్థం. ప్రేమ.. ప్రేమ అనేది కేవలం ఒక ఎమోషన్ మాత్రమే కాదు, అది మెదడులోని ఒక రసాయన అనుసంధానం కూడా. ఒక బంధం ముగిసినప్పుడు, ఏదో ఒక అలవాటును తెంచుకుంటున్నట్లుగా శరీరం ప్రతిస్పందిస్తుంది. దీనివల్ల, హఠాత్తుగా ఫోన్ చేయాలనే లేదా తిరిగి వెళ్లాలనే కోరిక కలగవచ్చు, కానీ వాస్తవానికి అది కేవలం ఒక శారీరక ప్రతిచర్య మాత్రమే. కాబట్టి లేని ప్రేమను ఉందని అనుకోవడం కూడా భ్రమే... ఉన్న ప్రేమను చంపేసుకోవడం కూడా తప్పే.. పరిస్థితి.. విడిపోవాలని ఆలోచన ఏదైనా గొడవ లేదా సంఘర్షణ వంటివి జరగడం వల్ల వస్తాయి. అలాంటివి జరిగినప్పుడు మిమ్మల్ని మీరు అప్పటికే విడిపోయామని ఊహించుకోండి అంతా ముగిసిపోయిందని, మీరు ఒంటరిగా కూర్చున్నారని ఊహించుకోండి. మీకు లోపల విచారం లేకుండా ఏదో బరువు దిగిపోయినట్టు, జీవితం ఇక సాఫీగా ఉంటుందని.. ఇలా తేలికైన భావన కలిగితే, ఆ బంధం అప్పటికే ముగిసిపోయిందనడానికి సంకేతం. అలా కాకుండా విడిపోయామని ఊహించుకున్నప్పుడు జీవితం అర్థం లేకుండా ఏదో కోల్పోయినట్టుగా, భాగస్వామి ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగా అనిపిస్తే అప్పుడు విడాకుల ఆలోచన తప్పని అర్థం. మనసే కాదు.. ఒక సంబంధాన్ని ముగించడం అనేది కేవలం మనసుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, దానిలో జీవితంలోని అనేక అంశాలను వదులుకోవడం కూడా ఉంటుంది. డబ్బు, స్నేహితులు, రోజువారీ అలవాట్లు అన్నీ మారిపోతాయి. తరచుగా, ఈ భయం ప్రజలను తిరిగి అదే సంబంధంలోకి వెళ్ళేలా చేస్తుంది. స్పష్టత.. అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, చెప్పాలనుకున్న విషయాన్న భాగస్వామికి సరిగ్గా తెలియజేశారా? తమ అవసరాలను, ఆందోళనలను భాగస్వామికి స్పష్టంగా తెలియజేయకపోతే, 'ఒకవేళ అలా జరిగి ఉంటే?' అనే సందేహాలు మిగిలిపోతాయి. అందువల్ల, ఒక నిర్ణయం తీసుకునే ముందు మీతో మీరు నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. *రూపశ్రీ.

Publish Date: May 29, 2026 1:30PM
ప్రతి తల్లి కూతురికి ఇవి నేర్పిస్తే.. ఎంత కష్టంలో అయినా బలంగా నిలబడతారు!
ప్రతి తల్లి కూతురికి ఇవి నేర్పిస్తే.. ఎంత కష్టంలో అయినా బలంగా నిలబడతారు!

ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా వివాహం తర్వాత అమ్మాయిల జీవితం తమ చేతుల్లో నుండి జారిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అమ్మాయిలు తరచుగా ఇతరులను సంతోషపెట్టడానికి తమ కోరికలను, భావోద్వేగాలను అణచివేసుకుంటారు. ఈ అలవాటు క్రమంగా వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అందుకే అమ్మాయిలకు విలువలు, మంచి విద్య మాత్రమే కాదు.. ఎంత కష్టంలో అయినా నిలబడాలంటే.. ప్రతి తల్లి తన కూతురికి కొన్ని నేర్పించాలి. వాటిలో ముఖ్యమైనది.. ఏదైనా కరెక్ట్ కాని విషయానికి " నో " చెప్పడం. ఇలా ఏదైనా సరికాని విషయానికి నో చెప్పడం అమ్మాయిలను ఎందుకు బలంగా ఉంచుతుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. "నో" అని చెబితే.. ఒక అమ్మాయి 'కాదు' అని చెప్పడం నేర్చుకున్నప్పుడు, ఆమె సంబంధాలలో, వృత్తిలో , సమాజంలో తనను తాను గౌరవించుకోవడం కూడా నేర్చుకుంటుంది. ఈ ఒక్క అలవాటే ఆమెను మానసికంగా దృఢంగా, స్వయం సమృద్ధిగా , ఆత్మవిశ్వాసంతో ఉండేలా చేస్తుంది. ఇది జీవితంలో ముందుకు సాగడానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆత్మగౌరవం పెరుగుతుంది.. ఆడపిల్ల తన ఇష్టాయిష్టాలను బయటకు వ్యక్తపరిచినప్పుడు, ఆమె తన ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటుంది. దీనివల్ల ఆమెకు ఆత్మగౌరవం పెరుగుతుంది. తప్పుడు వ్యక్తుల నుండి దూరం.. మొహమాటంతోనో లేక ఇతరులను సంతోషపెట్టాలనో ప్రతి దానికి సరే అని చెప్పే అలవాటు.. ఎదుటివారు అమ్మాయిలను స్వార్థం కోసం ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది. 'కాదు' అని చెప్పడం భద్రతను ఇస్తుంది. అమ్మాయిలకు ఏదైనా సరికాదు అనిపిస్తే మొహమాటం లేకుండా నో చెప్పడం వల్ల జీవితంలో ఎన్నో సమస్యలను నివారించవచ్చు. నిర్ణయాలలో ఆత్మవిశ్వాసం.. తన మనసులోని మాటను చెప్పడానికి భయపడని అమ్మాయి జీవితంలోని అతిపెద్ద నిర్ణయాలను కూడా ఆత్మవిశ్వాసంతో తీసుకోగలదు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.. అందరినీ సంతోషంగా ఉంచాలని ప్రయత్నించడం ఒత్తిడిని పెంచుతుంది. అందుకే ప్రతి అమ్మాయి తన స్వంత బౌండరీస్ ను నిర్దేశించుకోవడం మనశ్శాంతిని ఇస్తుంది. బలమైన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది.. స్పష్టమైన ఆలోచన , ముక్కుసూటితనం ఉన్న అమ్మాయిలు సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టిస్తారు. పొగరు, లెక్కలేనితనం.. ఇలాంటి మాటలు అనుకునేవారు కూడా ఉంటారు. కానీ వ్యక్తిత్వం, మంచితనం, నిర్ణయాలు సరిగా తీసుకోవడం వంటివి జరుగుతూ ఉంటే.. విమర్శించిన వారే మెచ్చుకునే రోజులు వస్తాయి. దీని వల్ల వ్యక్తిత్వం బలంగా మారుతుంది. ఎలా నేర్పాలి.. ఏదైనా విషయం సరికాదు అనిపిస్తే దానికి నో చెప్పడం ఎలా అనే విషయాన్ని తల్లులు తమ కూతురికి నేర్పాలి. కానీ ఎలా నేర్పాలో కొందరికి అర్థం కాదు. తల్లి కూతురి దగ్గర స్నేహితురాలిగా ఉండి మనసు విప్పి మాట్లాడాలి. దీనివల్ల కూతురి ఏ విషయాన్ని అయినా మనసు విప్పి పంచుకోగలుగుతుంది. అందరినీ సంతోషపెట్టడం కోసం అన్నీ అంగీకరించాల్సిన అవసరం లేదని అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఆడపిల్ల అభిప్రాయానికి, నిర్ణయాలకు విలువ ఇవ్వాలి. చిన్న చిన్న విషయాలలో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. తీసుకున్న నిర్ణయాలు సరిగా లేకపోయినా, వాటిలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనా.. వాటిని వివరించి చెప్పాలి. తప్పు చేసినప్పుడు లేదా తప్పు నిర్ణయాలు తీసుకున్నప్పుడు తిట్టడానికి బదులుగా వాటి పర్యావసానాలు వివరించి చెప్పాలి. ఎలా నిర్ణయం తీసుకుంటే బాగుండేదో.. ఎలా ఉండాలో చెప్పాలి. ఆడపిల్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం తప్పు విషయం కాదని, అది తన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని వివరించాలి. అప్పుడే అబిప్రాయాలు, నిర్ణయాలు ఎలా ఉండాలో.. ఎలా ఉండే తన వ్యక్తిత్వం మంచిగా ఉంటుందో వారికి అర్థమవుతుంది. *రూపశ్రీ.

Publish Date: May 28, 2026 1:46PM
వేసవిలో శరీరం దుర్వాసన వస్తోందా? ఈ చిట్కాలు పాటించండి!
వేసవిలో శరీరం దుర్వాసన వస్తోందా? ఈ చిట్కాలు పాటించండి!

వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది. ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా మందికి పెద్ద సమస్యగా మారుతుంది. ముఖ్యంగా ఎక్కువ సేపు బయట ఉండాల్సి వచ్చినప్పుడు లేదా తీవ్రమైన వేడిలో పని చేస్తున్నప్పుడు, శరీర దుర్వాసన చాలా ఇబ్బంది పెడుతుంది. చాలా మంది ఖరీదైన డియోడరెంట్లు , పెర్ఫ్యూమ్‌లను ఉపయోగిస్తారు, కానీ వాటి ప్రభావం కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. శరీరంలోని బ్యాక్టీరియా చెమటతో కలిసి దుర్వాసనను ఉత్పత్తి చేసినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఎక్కువ ఖర్చు పెట్టకుండా శరీర దుర్వాసనను వదిలించుకోవాలనుకుంటే, కొన్ని ఇంటి చిట్కాలు సహాయపడతాయి. ఆ సులభమైన ఇంటి చిట్కాలేంటో తెలుసుకుంటే.. వేసవిలో శరీర దుర్వాసన ఎందుకు పెరుగుతుంది? వేసవిలో శరీరానికి ఎక్కువగా చెమట పడుతుంది. ఈ చెమట చర్మంపై ఉండే బ్యాక్టీరియాతో సంపర్కంలోకి వచ్చినప్పుడు, దుర్వాసన వెలువడుతుంది. శరీరాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే లేదా చెమట ఎక్కువసేపు శరీరంపై ఉండిపోతే, శరీర దుర్వాసన సమస్య పెరుగుతుంది. శరీర దుర్వాసన రాకూడదంటే.. స్నానం నీటిలో వీటిని కలపాలి.. నిమ్మరసం.. బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది శరీరానికి తాజా అనుభూతిని కలిగిస్తుంది. చెమట వాసనను తగ్గించవచ్చు ఒక బకెట్ నీటిలో ఒకటి రెండు స్పూన్ల నిమ్మ రసం కలుపుకుని స్నానం చేయడం వల్ల రిఫ్రెషింగ్ అనుభూతి కలుగుతుంది. రోజ్ వాటర్.. గులాబీ నీరు చల్లదనాన్ని, తేలికపాటి సహజ సువాసనను అందిస్తుంది. స్నానపు నీటిలో 3-4 టీస్పూన్ల రోజ్ వాటర్ కలపాలి. ఇది చర్మానికి తాజా అనుభూతిని కూడా కలిగిస్తుంది. వేసవిలో శరీర జిగట తగ్గిస్తుంది. బేకింగ్ సోడా.. బేకింగ్ సోడా శరీర దుర్వాసనను తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇది దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే దీన్ని అధిక పరిమాణంలో ఉపయోగించకూడదు. సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. వారానికి రెండు మూడు సార్లు మాత్రమే వాడాలి. పటిక.. పటికలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది చెమట వాసనను తగ్గించడానికి సహాయపడుతుంది. వేప నీరు.. వేప నీరు చర్మ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. దురద , బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది. వేప ఆకులను ఉడకబెట్టి, ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకోవచ్చు. *రూపశ్రీ.

Publish Date: May 27, 2026 4:06PM
వేసవిలో కూడా పుదీనా మొక్క పచ్చగా పెరగాలంటే ఈ ఒక్కటి నీటిలో కలిపి వేయండి!
వేసవిలో కూడా పుదీనా మొక్క పచ్చగా పెరగాలంటే ఈ ఒక్కటి నీటిలో కలిపి వేయండి!

పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క. ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ వరకు పుదీనాను ఉపయోగిస్తారు. ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా.. చాలా పానీయాల తయారీలో కూడా పుదీనాను ఉపయోగిస్తారు. పుదీనా పానీయాల రుచిని పెంచుతుంది. శరీరాన్ని చల్లబరుచుతుంది. అయితే వేడి ఎక్కువగా ఉంటే పుదీనా మొక్క చాలా తొందరగా వాడిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో మొక్కకు పచ్చదనాన్ని పెంచడానికి , మొక్క పచ్చగా ఎదగడానికి కొన్నిచిట్కాలు ఉపయోగించవచ్చు. వాటిలో ఎంతో ప్రబావవంతంగా పనిచేసే చిట్కా తెలుసుకుంటే.. పటిక నీరు.. పుదీనా మొక్కకు పటిక నీటిని కలపడం వల్ల మట్టి ఆమ్లంగా మారుతుంది. కుండీలోని మట్టి క్షారంగా మారినప్పుడు, పుదీనా పెరుగుదల కుంటుపడి, ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఇటువంటి పరిస్థితిలో, పటిక నీటిని ఉపయోగించడం మొక్కకు మేలు చేస్తుంది. పటిక నీరు మట్టి pH స్థాయిని తగ్గిస్తుంది, దీనివల్ల అది పుదీనా మొక్కకు అనుకూలంగా మారి, పోషకాలను మరింత సులభంగా గ్రహించడానికి వీలు కలుగుతుంది. క్రిమినాశకం.. పుదీనా వాసన తరచుగా కీటకాలను దూరంగా ఉంచుతుంది, కానీ కొన్నిసార్లు చీమలు , బూజు దాని వేళ్ళను ఆశించి, మొక్క దెబ్బతినేలా చేస్తాయి. ఈ సమస్యలున్నప్పుడు మొక్కపై పటిక నీటిని చల్లవచ్చు. పటికలో యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి, ఇవి మొక్కను కీటకాలు, బూజు , చీమల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పెరుగుదల.. కొన్నిసార్లు, మొక్కలకు సరైన పోషకాలు అందకపోవడం వల్ల ఆకుల పెరుగుదల మందగిస్తుంది. పటిక నీటిని కలపడం వల్ల ఆకులు పెద్దవిగా, పచ్చగా, , మరింత నిగనిగలాడేలా పెరగడానికి సహాయపడుతుంది. మొక్క కొమ్మలను చిగురింపజేసి, మరింత దట్టంగా పెరగడం ప్రారంభిస్తుంది. ఎలా వాడాలి? ఒక లీటరు శుభ్రమైన నీటిని తీసుకుని, అందులో ఒక పటిక ముక్కను వేయాలి. అర టీస్పూన్ పటిక పొడి వచ్చేంత ముక్కను వాడాలి. దానిని 10 నుండి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. . నీరు మరీ చిక్కగా ఉండకూడదు. ఈ పటిక నీటిని పుదీనా వేర్లకు అందేలా పోయాలి. నీటిని కేవలం మట్టికి మాత్రమే అందించాలి. *రూపశ్రీ.

Publish Date: May 26, 2026 3:35PM
చాలామంది పేదవాళ్లుగానే ఉండిపోవడానికి అసలు కారణాలు ఇవే..!
చాలామంది పేదవాళ్లుగానే ఉండిపోవడానికి అసలు కారణాలు ఇవే..!

భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ. పేదవారిలో కూడా చాలా పేదవారు, ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే వారు ఎంతో మంది ఉన్నారు. సాధారణంగా కాలం గడిచేకొద్ది జీవితాలలో ఎంతో కొంత ఎదుగుదల అనేది ఉండాలి. అలా ఉండకపోవడానికి కారణాలు ఉన్నాయి. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు.. కానీ పేదవాడిగా మరణించడం తప్పు అని ఒక వాక్యం ఉంది. మనిషి జీవితంలో ఎదగాలని కాలంతో పాటు జీవితాన్ని మెరుగ్గా మార్చుకోవాలని ఈ వాక్యం చెబుతుంది, చాలామంది పేదవాళ్లుగానే మిగిలిపోవడానికి దారితీసే కారణాలు ఏంటో తెలుసుకుంటే.. టీవి, పోన్.. చాలామందికి రోజంతా టీవీ లేదా ఫోన్ చూస్తూ గడిపే అలవాటు ఉంటుంది. టీవి, ఫోన్ వంటివి మనిషిని వ్యసనపరుడిగా మారుస్తాయి. టీవిలో ఛానెల్స్ కానీ, స్మార్ట్ ఫోన్ లో ఎంటర్టైన్మెంట్ యాప్స్ కానీ ఎంత సేపు అయినా అలా మార్చి మార్చి చూస్తుంటారు. పోన్ లో అయితే స్క్రోల్ చేస్తూ ఉంటే అసలు సమయమే తెలియకుండా గడిచిపోతుంది. జీవితంలో ఏమీ సాధించకుండా పేదవారిగా ఉండిపోవడానికి టీవి, స్మార్ట్ ఫోన్ వంటివి ప్రధాన కారణాలు. అలవాట్లు, అభిరుచులు.. ప్రతి ఒక్కరికి అభిరుచులు, అలవాట్లు అంటూ కొన్ని ఉంటాయి. జీవితంలో ఎదుగుదల ఏమీ లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయినట్టు ఉన్నవారిని గమనిస్తే.. వారికి ఎలాంటి అలవాట్లు, అభిరుచులు ఉండవు. అందుకే వారికి జీవితంలో ఎదుగుదల లేకుండా కేవలం ఒకేచోట కూర్చుని కాలక్షేపం చేస్తూ అందులోనే సుఖం అనుభవిస్తూ ఉంటారు. లక్ష్యాలు.. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక లక్ష్యం అనేది ఉండాలి. లక్ష్యం లేని జీవితంలో ఎదుగుదల అనేది అసలు ఉండదు. లక్ష్యం ఉంటే కష్టపడటం, జ్ఞానాన్ని ఆర్జించడం, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండటం వంటివి జరుగుతాయి. కానీ లక్ష్యం లేకపోతే జీవితం ఒకేచోట పాతిన స్ధంభంలా ఉండిపోతుంది. కంఫర్ట్ జోన్.. చాలామందికి సుఖంగా బ్రతకడం ఇష్టం. ఛాలెంజ్ తీసుకోవాలన్నా, రిస్క్ చేయాలన్నా అస్సలు ఇష్టపడరు. ఉన్న సంతోషం, ఉన్న సౌకర్యాలు చాల్లే అనుకుంటారు. కొత్తగా అ ప్రయత్నం చేయాలన్నా అస్సలు సిద్దపడరు. అందుకే కాలం ఎంత గడిచినా అలాంటి వారు పేదవారిగానే ఉండిపోతారు తప్ప ధనవంతులు, గొప్ప వారు కాలేరు. అదృష్టం.. ప్రపంచంలో కష్టం కంటే అదృష్టాన్ని నమ్మేవారే ఎక్కువగా ఉన్నారు. ఏ అదృష్టమో వచ్చి తమను ధనవంతులను చేస్తుందని నమ్ముతూ.. కష్టపడకుండా, ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా అలాగే ఉండిపోతారు. జాతకాలలోనూ, రంగు రాళ్లలోనూ, గ్రహాల మార్పులోనూ తమ భవిష్యత్తు ఆధారపడి ఉందని నమ్ముతూ ఉంటారు. ఇతరులను నిందించడం.. నన్ను బాగా చదివించి ఉంటే నేను పెద్ద ఉద్యగం తెచ్చుకునేవాడిని, నాకు బాగా డబ్బు ఇచ్చి ఉంటే నేను మంచి వ్యాపారం చేసేవాడిని అని తల్లిదండ్రుల మీద నిందలు వేస్తూ జీవితంలో ఎదగకుండా ఆగిపోయిన వారు చాలామంది ఉంటారు. తాము ఎదగకపోవడానికి కారణం పక్కవారే అని చెప్పి పేదవారిగానే ఉండిపోతున్న వారే ఎక్కువగా ఉన్నారు. జీవితంలో ఎదగడానికి కష్టపడేవారు చాలా తక్కువ ఉన్నారు. పైన చెప్పుకున్న విషయాలే.. ఏ మనిషి అయినా పేదవాడిగానే ఉండిపోవడానికి అసలు కారణాలు. *రూపశ్రీ.

Publish Date: May 25, 2026 11:49AM
తల్లిదండ్రులు ఈ టిప్స్ ఫాలో అయితే.. పిల్లలలో లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి!
తల్లిదండ్రులు ఈ టిప్స్ ఫాలో అయితే.. పిల్లలలో లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి!

పిల్లలు జీవితంలోని ప్రతి దశలో ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా మంచి గ్రేడ్‌లు సాధించడం అని చాలామంది అనుకుంటారు. కానీ పిల్లలలో మానసిక బలాన్ని పెంపొందించడం, వారు భవిష్యత్తులో గొప్పగా ఎదగడం మరీ ముఖ్యంగా నాయకత్వ లక్షణాలతో ఉండటం చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసం అనేది ఏ బిడ్డ వ్యక్తిత్వానికైనా పునాది. అది వారికి తమ మనసులోని మాటను నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని, అలాగే వైఫల్యాల నుండి నేర్చుకుని ఓపికతో ముందుకు సాగే బలాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్న పిల్లలు కాలక్రమేణా బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు. అయితే, ఈ లక్షణాలు రాత్రికి రాత్రే పుట్టేవి కాదు.. వీటికి చిన్నతనం నుండే సరైన మార్గదర్శకత్వం అవసరం. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచి వారిలో నాయకత్వ లక్షణాలు మెరుగుపడి వారు లీడర్లుగా తయారవ్వాలంటే.. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను పెంచే సమయంలో కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో తెలుసుకుంటే.. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచి నాయకత్వ లక్షణాలు పెంచే టిప్స్.. వ్యక్తీకరణ.. పిల్లలకు వారి అభిప్రాయాలను, భావాలను వ్యక్తపరిచే అవకాశం ఇవ్వడం వల్ల వారు స్వేచ్ఛగా తమను తాము వ్యక్తపరచుకోవడానికి , వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. విజయాల గుర్తింపు.. పిల్లలు ఒక చిత్రాన్ని గీసినా లేదా ఒక పద్యాన్ని చదివినా, వారి కృషిని ప్రశంసించాలి. ఇలా మెచ్చుకోవడం వల్ల పిల్లలలో తాము గౌరవించబడుతున్నామనే భావన కలుగుతుంది, ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని, ప్రేరణను రెండింటినీ పెంచుతుంది. విలువలు,సంప్రదాయాలు.. పిల్లలను కుటుంబ సంప్రదాయాలు, పండుగలు , ఆచారాలతో అనుసంధానించడం వారిలో సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి , వారి గుర్తింపు పట్ల విశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. సహనం, ఓర్పు.. గెలవడం ఎల్లప్పుడూ అవసరం కాదని, వెంటనే ఫలితాలు ఆశించాల్సిన అవసరం లేదని పిల్లలకు నేర్పించడం ముఖ్యం. ఓర్పు, సహనం వారు పరిణతి చెందడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు.. సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమయానికి నిద్రలేవడం , రాత్రి సమయానికి నిద్రపోవడం, వంటివి పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని అంతర్గతంగా బలపరుస్తాయి. ఇది క్రమశిక్షణ , ఆత్మనియంత్రణను కూడా నేర్పిస్తుంది. వైఫల్యాల నుండి నేర్చుకోవడం.. పిల్లలు చేసే ఏదైనా పనిలో విఫలమైతే, వైఫల్యం అనేది నేర్చుకోవడంలో ఒక భాగమని వారికి వివరించాలి. ఇది వైఫల్యం తర్వాత తిరిగి లేచి ముందుకు సాగడాన్ని వారికి నేర్పుతుంది, ఇదే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కీలకం అవుతుంది. చెప్పేది వినాలి.. పిల్లలతో నిష్కపటంగా మాట్లాడాలి. వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. దీనివల్ల, వారు తమ సమస్యలను, ప్రశ్నలను పంచుకోగలరనే నమ్మకం వారిలో పెరుగుతుంది . వినయం.. ఇతరులకు సహాయం చేయడం, చిన్న విషయాలకే కృతజ్ఞత చూపడం, అందరితో మర్యాదగా ప్రవర్తించడం పిల్లలకు నేర్పాలి. ఇవి వారు ఇతరులతో మమేకమవ్వడానికి, సమాజంలో గౌరవం సంపాదించుకోవడానికి సహాయపడతాయి. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో పైవన్నీ నేర్పిస్తూ ఉంటే.. పిల్లలు తప్పకుండా తమ జీవితంలో ఆత్మవిశ్వాసంలో ఉంటారు. నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకుని వారి జీవితంలో ఎంతో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

Publish Date: May 23, 2026 1:40PM
TeluguOne Picks For You
rss-imgRss Feeds