హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం హరీష్ రావు నివాసానికి వెళ్లిన కేటీఆర్.. ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు పరిపూర్ణ ఆరోగ్యంతో, సుదీర్ఘ కాలం ప్రజాసేవలో కొనసాగాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ భేటీలో దేశీపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరియు పలువురు పార్టీ ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు.

Publish Date: Jun 3, 2026 10:21PM
అమెరికాలో కారు ప్రమాదం...మాజీ ఎంపీ సతీమణికి తీవ్ర గాయాలు
అమెరికాలో కారు ప్రమాదం...మాజీ ఎంపీ సతీమణికి తీవ్ర గాయాలు

కుమార్తె ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళిన కుటుంబానికి అనుకొని ప్రమాదం ఎదురైంది. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి, ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ సుచి యాష్కీ అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగన యాష్కీని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రిలో ఎమ్‌డీ కోర్సులో చేర్పించి, అక్కడి నుంచి న్యూయార్క్‌కు తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. వర్షం కారణంగా డాక్టర్ సుజి ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో డాక్టర్ సుచి యాష్కీ కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదంలో ఆమెకు పక్కటెముకలు విరిగినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండగా, చికిత్స పొందుతూ కోలుకుంటు న్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కుమార్తెను ఎమ్‌డీ కోర్సులో చేర్పించేందుకు వెళ్లిన సందర్భంగా లగేజీ ఎక్కువగా ఉండటంతో మధుయాష్కీ గౌడ్, డాక్టర్ సుచి యాష్కీ వేర్వేరు కార్లలో ప్రయాణించినట్లు తెలిసింది. ఈ క్రమంలో డాక్టర్ సుచి ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.ప్రమాదం జరిగిన సమయంలో మధు యాష్కీ మరో వాహనంలో ఉన్నారు. ఇటీవల డాక్టర్ గగన యాష్కీ న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, కాన్వొకేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మధుయాష్కీ గౌడ్ అమెరికా వెళ్లారు. కాగా, ఆయన భారత్‌కు తిరిగి రావాల్సి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేసింది. అయితే డాక్టర్ సుచి యాష్కీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Publish Date: Jun 3, 2026 9:45PM
కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన సీఎం విజయ్!
కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన సీఎం విజయ్!

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. తాజాగా అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులో త్వరలో జరగబోయే రాజ్యసభ ఉప ఎన్నికకు సంబంధించి అధికార తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఒక కీలకమైన మరియు వ్యూహాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. పొత్తు ధర్మాన్ని నిలబెట్టుకుంటూ, కూటమిలోని ఐక్యతను చాటిచెప్పేలా ఈ రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి కేటాయిస్తున్నట్లు టీవీకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అధికారికంగా ప్రకటించారు. బుధవారం నాడు ఆయన విడుదల చేసిన ఈ ప్రకటనతో తమిళ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూటమిలోని మిగిలిన భాగస్వామ్య పక్షాలు కూడా ఏకగ్రీవంగా స్వాగతించాయి. ఈ ఉప ఎన్నిక రావడానికి వెనుక బలమైన రాజకీయ కారణం ఉంది. గతంలో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సీవీ షణ్ముగం ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మైలాం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. దాంతో ఆయన తన ఎంపీ పదవికి మే 7వ తేదీన రాజీనామా చేసి, ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన ఆ ఒక్క రాజ్యసభ స్థానానికే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికను నిర్వహిస్తోంది. జూన్ 18వ తేదీన ఈ కీలకమైన ఉప ఎన్నిక జరగనుంది. అధికారంలో ఉన్న టీవీకే కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో, ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిణామం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఎగువ సభలో కాంగ్రెస్ పార్టీ బలం మరో స్థానం పెరగడానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఈ రాజ్యసభ స్థానానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను రిటర్నింగ్ అధికారిగా పీ తెన్మోళి పర్యవేక్షిస్తున్నారు. జూన్ 8వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. అయితే ఇందులో భాగంగా ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు మాత్రమే నామినేషన్లను స్వీకరిస్తారని అధికారులు స్పష్టం చేశారు. ఆ తర్వాత జూన్ 9వ తేదీ నుండి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి జూన్ 11వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఆ గడువు ముగిసిన వెంటనే పోటీలో నిలిచే తుది అభ్యర్థుల అధికారిక జాబితాను ప్రకటిస్తారు. చివరగా జూన్ 18వ తేదీన అత్యంత ఉత్కంఠభరితంగా పోలింగ్ జరగనుంది. జూన్ 18న ఉదయం 9.00 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4.00 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ చూపిన ఈ పొత్తు ధర్మం కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నిర్ణయంతో తమిళనాడులో అధికార కూటమి మరింత బలోపేతం కావడమే కాకుండా, రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కూడా ఈ కూటమి మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Publish Date: Jun 3, 2026 9:33PM
 జూన్ 5 నుంచి భూములకు కొత్త ధరలు : మంత్రి పొంగులేటి
జూన్ 5 నుంచి భూములకు కొత్త ధరలు : మంత్రి పొంగులేటి

తెలంగాణలో ఇళ్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములు కొనాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించింది. రాష్ట్రవ్యాప్తంగా సవరించిన భూముల ప్రభుత్వ మార్కెట్ విలువలు, కొత్త రిజిస్ట్రేషన్ రేట్లు ఈ నెల 5వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారిక ప్రకటన చేశారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం ఉన్న వాస్తవ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న విలువలకూ మధ్య ఉన్న భారీ వ్యత్యాసాలను పూర్తిగా తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అత్యంత శాస్త్రీయంగా, హేతుబద్ధమైన విధానంలో ఈ కొత్త ధరలను నిర్ణయించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త ధరల సవరణ వెనుక పెద్ద కసరత్తే జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆలోచనల మేరకు, ప్రముఖ ఆర్థిక నిపుణుడు అరవింద్ సుబ్రమణ్యం నేతృత్వంలో అందిన నివేదికను ప్రభుత్వం పరిశీలించింది. అలాగే ఉన్నతాధికారుల నుంచి వచ్చిన కీలక సలహాలను పరిగణనలోకి తీసుకుని ఈ రేట్లను ఖరారు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021-2022 కాలంలో ఎలాంటి క్షేత్రస్థాయి అధ్యయనాలు లేకుండా కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రెండుసార్లు అశాస్త్రీయంగా ధరలను పెంచిందని మంత్రి పొంగులేటి విమర్శించారు. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో అసలు మార్కెట్ రేటు కంటే ప్రభుత్వ విలువే భారీగా పెరిగిపోయి ప్రజలపై భారం పడిందని, ఈ అసమానతలను సరిదిద్దేందుకే రాష్ట్రంలోని మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఇప్పుడు మార్కెట్ విలువల సవరణను సమూలంగా చేపట్టామని తెలిపారు. ఈసారి కొత్త విలువల నిర్ణయంలో పారిశ్రామికాభివృద్ధి, కొత్త రహదారుల నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్ (ORR), ప్రతిష్టాత్మక రీజినల్ రింగ్ రోడ్ (RRR), మరియు మౌలిక వసతుల విస్తరణ వంటి కీలకమైన అభివృద్ధి అంశాలను ప్రాధాన్యతగా తీసుకున్నారు. ఇప్పటికే మార్కెట్ రేట్లు విపరీతంగా ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపుదల చేయకుండా యథాతథంగా ఉంచడం గమనార్హం. అలాగే అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ల విషయంలో ఇప్పటివరకు ఉన్న అంతస్తుల వారీ అసమానతలను పూర్తిగా తొలగించారు. ఇకపై ఏ అంతస్తులో ఫ్లాట్ కొన్నా అన్నింటికీ ఒకే విధమైన రేటు వర్తించేలా నిబంధనలను సరళీకరించారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) పరిధిలోని వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లకు కనీస ప్రాథమిక రేట్లను కూడా ప్రభుత్వం కొత్తగా ఖరారు చేసింది. మరోవైపు ఇళ్లు నిర్మించుకునే వారికి కూడా ఈ సవరణ ప్రభావం చూపనుంది. గత ఐదేళ్ల కాలంలో సిమెంట్, ఇనుము వంటి నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల రోజువారీ వేతనాలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, 2021 సంవత్సరం తర్వాత మొదటిసారిగా నిర్మాణ వ్యయాల రేట్లను (Construction Costs) కూడా ప్రభుత్వం అధికారికంగా సవరించింది. గత ఐదేళ్లలో అనేక గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందిన నేపథ్యంలో ఆర్‌సీసీ (RCC), నాన్-ఆర్‌సీసీ నిర్మాణాల రేట్లను ఆయా గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి అనుగుణంగా మార్చారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, భూ లావాదేవీలలో పారదర్శకతను పెంచుతూ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. జూన్ 5 నుంచి భూముల కొనుగోళ్లు చేసేవారు ఈ కొత్త రేట్లకు అనుగుణంగానే రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

Publish Date: Jun 3, 2026 9:22PM
ఏపీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం
ఏపీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో రోజు రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే మద్యం కొనుగోళ్లు, అమ్మకాల వ్యవహారాలపై అనేక ఆరోపణలు వెలుగు చూస్తుండగా.. తాజాగా లిక్కర్ రవాణా టెండర్ల లోనూ భారీ అక్రమాలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. లిక్కర్ డిపోల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేసే బాధ్యత కోసం నిర్వహించిన టెండర్లలో నిబంధనలను పక్కనపెట్టి ఒక ప్రైవేట్ సంస్థకు భారీ ప్రయోజనం కల్పించినట్లు ఈడీ దర్యాప్తులో బయట పడినట్లు తెలుస్తోంది. ఢిల్లీకి చెందిన సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఈ కాంట్రాక్టులు అప్పగించడం పై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈడీ దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం.. ఇతర పోటీ సంస్థల కంటే దాదాపు 20 శాతం అధిక ధరలను కోట్ చేసినప్పటికీ అదే సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టి నట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. సాధారణంగా తక్కువ ధరను కోట్ చేసిన సంస్థకు టెండర్ దక్కాల్సి ఉండగా.. అధిక రేట్లు పేర్కొన్న సంస్థకు కాంట్రాక్టు ఎలా లభించిందనే అంశంపై అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. అంతేకాదు.. అక్టోబర్ 2021 నుంచి మార్చి 2024 వరకు లిక్కర్ రవాణా సేవల పేరుతో ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.349.7 కోట్లు చెల్లించినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ చెల్లింపులు, టెండర్ ప్రక్రియ, కాంట్రాక్టు కేటాయింపు వెనుక ఉన్న నిర్ణయాలపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. లిక్కర్ స్కాంలో ఇప్పటికే పలు ఆర్థిక లావాదేవీలపై విచారణ కొనసాగుతుండగా.. ఇప్పుడు ట్రాన్స్‌పోర్టేషన్ కాంట్రాక్టులు కూడా ఈడీ దర్యాప్తు పరిధిలోకి రావడం రాజకీయంగా, పరిపాలనా పరంగా కీలక పరిణామంగా మారింది. ఈ వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Publish Date: Jun 3, 2026 8:28PM
తెలంగాణలో జనసేన పోటీపై పవన్ కల్యాణ్ క్లారిటీ
తెలంగాణలో జనసేన పోటీపై పవన్ కల్యాణ్ క్లారిటీ

తెలంగాణలో జనసేన పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతుందనే ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో జనసేన పోటీ చేసే అంశంపై ఎలాంటి ప్రణాళికలు లేవని ఆయన తెలిపారు. ఇటీవలి కాలంలో తెలంగాణ రాజకీయాల్లో జనసేన పాత్ర, భవిష్యత్ ఎన్నికల్లో పార్టీ పోటీ చేసే అవకాశాలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్పందించారు. తాను తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అక్కడి ప్రజలదేనని, ఆ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాను గౌరవిస్తానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నాయకులను తీసుకువెళ్లి తెలంగాణలో పోటీ చేయించే ఆలోచన జనసేనకు లేదని పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణలో పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వారు అక్కడి భూమిపుత్రులేనని, స్థానిక నాయకత్వానికే ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. దీంతో తెలంగాణలో పార్టీ విస్తరణకు సంబంధించి స్థానిక నాయకులకే అవకాశాలు కల్పించే దిశగా జనసేన ఆలోచిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ గురించి కూడా పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. కేటీఆర్ తనకు సోదర సమానులని పేర్కొంటూ, వ్యక్తిగత సంబంధాలు మరియు రాజకీయ అంశాలను వేర్వేరుగా చూడాలని అన్నారు. ప్రాంతీయవాదం ఒక రాజకీయ భావజాలమైతే, ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేయడం మరో అంశమని వివరించారు. దేశంలో ఎక్కడైనా నివసించడం, ఉపాధి పొందడం, రాజకీయంగా పాల్గొనడం ప్రతి భారతీయుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆ హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాల మధ్య విభేదాల కంటే పరస్పర గౌరవం, సహకారం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణలో జనసేన భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై నెలకొన్న ఊహాగానాలకు కొంత మేర తెరదించినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. భవిష్యత్‌లో పరిస్థితులను బట్టి తెలంగాణలో పార్టీ విస్తరణపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం ఎలాంటి ఎన్నికల ప్రణాళికలు లేవని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది.

Publish Date: Jun 3, 2026 8:18PM
త్రిషకు మెగా ఫ్యామిలీ నుంచి సమ్మర్ స్పెషల్ గిఫ్ట్
త్రిషకు మెగా ఫ్యామిలీ నుంచి సమ్మర్ స్పెషల్ గిఫ్ట్

దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్‌కు మెగా ఫ్యామిలీ నుంచి ప్రత్యేక మైన సమ్మర్ సర్‌ప్రైజ్ అందింది. మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసనా కామినేని కొణిదెల నిర్వహిస్తున్న ‘అత్తమ్మాస్ కిచెన్’ నుంచి త్రిషకు ప్రత్యేక గిఫ్ట్ హ్యాంపర్ పంపించారు. ఈ హ్యాంపర్‌ లో సంప్రదాయ ఆంధ్ర రుచులను గుర్తు చేసే ఆవకాయ పచ్చళ్లతో పాటు వివిధ రకాల పొడులు, ఇంటి వంటలకు ఉపయోగపడే ప్రత్యేక పదార్థాలు ఉన్నాయి. ఈ బహుమతిని అందుకున్న త్రిష తన ఆనం దాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ, “నిజంగా వేసవి వచ్చినట్లు అనిపిస్తోంది” అని పేర్కొంది. అంతేకాకుండా, ఈ ప్రత్యేక గిఫ్ట్‌ను పంపిన ఉపాసనకు ధన్యవాదాలు తెలియజేస్తూ తన అభిమానాన్ని వ్యక్తం చేసింది. సంప్రదాయ తెలుగు రుచులను సెలబ్రిటీలకు చేరవేస్తూ ‘అత్తమ్మాస్ కిచెన్’ మరో సారి అందరి దృష్టిని ఆకర్షించింది.

Publish Date: Jun 3, 2026 8:01PM
అక్రమాస్తుల కేసులో అదనపు ఎస్పీ భుజంగరావుపై ఏసీబీ కేసు
అక్రమాస్తుల కేసులో అదనపు ఎస్పీ భుజంగరావుపై ఏసీబీ కేసు

తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సస్పెన్షన్‌లో ఉన్న అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) నాయిని భుజంగరావుపై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల నేప థ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. అవినీతి నిరోధక చట్టం–1988 (2018 సవరణలతో)లోని సెక్షన్ 13(1)(బి), 13(2) కింద కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు మంగళవారం భుజంగరావు నివాసంతో పాటు ఆయన బంధువులు, బినామీలు మరియు ఇతర అనుబంధ వ్యక్తులకు చెందిన మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 27.29 ఎకరాల వ్యవసాయ భూములు, ఐదు ఖాళీ ప్లాట్లు, రెండు నివాస గృహాలు, హైదరాబాద్‌లో ఒక వాణిజ్య భవనానికి సంబంధించిన పత్రాలు గుర్తించినట్లు వెల్లడించారు. అదనంగా రూ.3.83 లక్షల నగదు, రూ.8 లక్షల బ్యాంకు నిల్వలు, సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, ఒక మారుతి స్విఫ్ట్ కారు, ఒక కియా సెల్టోస్ వాహనం కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ రూ.5.92 కోట్లకు పైగా (రూ.5,92,54,500)గా అంచనా వేసినట్లు ఏసీబీ పేర్కొంది. అయితే స్థిరాస్తుల మార్కెట్ విలువ పత్రాల్లో నమోదైన విలువ కంటే మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.సోదాల సమయంలో భుజంగరావు నివాసంలో 29 మద్యం సీసాలు కూడా లభ్యమైనట్లు వెల్లడించారు. ఈ విషయంపై తదుపరి చర్యల కోసం ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. మరిన్ని ఆస్తుల వివరాలపై విచారణ కొనసాగుతోందని, కేసు దర్యాప్తు దశలో ఉందని ఏసీబీ పేర్కొంది. నిందిత అధికారిని నాంపల్లిలోని ఎస్‌పీఈ అండ్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరచి న్యాయపరమైన రిమాండ్ కోరనున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేసిన సందర్భాల్లో ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేసింది

Publish Date: Jun 3, 2026 7:48PM
2027 ఐపీఎల్ వరకు టీమిండియా బిజీ షెడ్యూల్
2027 ఐపీఎల్ వరకు టీమిండియా బిజీ షెడ్యూల్

టీమిండియాకు రానున్న ఐపీఎల్ 2027 వరకూ బీసీసీఐ భారీ షెడ్యూల్ ప్లాన్ చేసింది. ఈ ఏడాది కాలంలో పది టెస్టులు, 20 వన్డేలు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. విరాట్ కోహ్లి - రోహిత్ శర్మ టెస్టు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. కేవలం వన్డేలు మాత్రమే ఆడనున్నారు. ఐసీసీ 2027 వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో వీరి కోసం ఎక్కువ వన్డే షెడ్యూల్‌లు కూడా బీసీసీఐ ప్లాన్ చేసింది. ఇంగ్లండ్, ఐర్లాండ్, జింబాబ్వే టూర్లతో పాటు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా ఆడనుంది. ఐపీఎల్ 2026 తర్వాత టీమిండియా అప్ఘనిస్థాన్‌తో ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ టెస్టు మ్యాచ్‌తోనే టీమిండియా షెడ్యూల్ మొదలవుతోంది. జూన్ 6న మొహాలీ వేదికగా భారత్ - అప్ఘనిస్థాన్ టెస్టు, జూన్ 13 - 20 వరకు అప్ఘనిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు ఐర్లాండ్ వేదికగా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. జూలై‌లో ఇంగ్లండ్ - భారత్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఇంగ్లండ్ వేదికగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జూలై 1 - 11 వరకు ఐదు టీ20 మ్యాచ్‌లు, జూలై 14 - 19 వరకు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, కార్డిఫ్ వేదికగా మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఇంగ్లండ్ టూర్ ముగిసిన వెంటనే జూలై 23 - 26 వరకు జింబాబ్వే‌తో హరారే వేదికగా మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్‌ - అక్టోబర్‌లో భారత్ వేదికగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్, టీ20 సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 27 - అక్టోబర్ 3 వరకు తిరువనంతపురం, గువాహటి, మొహాలి వేదికగా మూడు వన్డే మ్యాచ్‌లు, అక్టోబర్ 6 - 14 వరకు లక్నో, రాంచీ, ఇండోర్, కోల్‌కతా వేదికగా ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. జనవరిలో జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత పర్యటనకు రానున్నాయి. జింబాబ్వేతో జనవరి 3 - 9 వరకు ఈడెన్ గార్డెన్స్, హైదరాబాద్, వాంఖడే వేదికగా మూడు వన్డేలు ఆడనుంది. జనవరి 21 - ఫిబ్రవరి 27 వరకు ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌లో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ఆడనుంది. నాగ్‌పూర్, చెన్నై, గువాహటి, రాంచీ, అహ్మదాబాద్ వేదికగా ఈ ఐదు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి.

Publish Date: Jun 3, 2026 7:34PM
శ్రీవారి లడ్డుల విక్రయాల్లో ఆల్‌టైమ్ రికార్డ్‌
శ్రీవారి లడ్డుల విక్రయాల్లో ఆల్‌టైమ్ రికార్డ్‌

పవిత్రమైన శ్రీవారి లడ్డూల అమ్మకాల్లో ఆల్‌టైమ్ రికార్డ్ నమోదైంది. సాధారణంగా వేసవి సెలవుల్లో తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. విశ్వ దైవమైన ఏడుకొండల స్వామి దర్శనం అనంతరం భక్తులు ప్రగాఢ విశ్వాసంతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదానికి తిరుమలలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. నిరంతరం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, టీటీడీ లడ్డూల ఉత్పత్తిని గణనీయంగా పెంచింది. నాణ్యతతో పాటు పారదర్శకతను మెరుగుపరచడానికి అత్యాధునిక పరికరాలను ఉపయోగించడం ద్వారా భక్తులకు టీటీడీ నిరంతరాయ సరఫరా చేస్తోంది. ఆ క్రమంలో ఈ ఏడాది మేలో 'లడ్డూ' ప్రసాదం రికార్డు స్థాయిలో విక్రయించినట్లు టీటీడీ సీపీఆర్ఓ వెల్లడించారు. ఈ మే నెలలో రికార్డు స్థాయిలో 1,21,35,528 లడ్డూలు అమ్ముడయ్యాయి. 2024లో ఇదే నెలలో 1.01 కోట్లు, 2025లో 1.10 కోట్ల అమ్మకాలు జరిగాయి. అంటే గతేడాదితో పోలిస్తే గణనీయమైన పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది.

Publish Date: Jun 3, 2026 7:08PM
TeluguOne Picks For You
rss-imgRss Feeds