నకిలీ ఈచలాన్ లింకులతో సైబర్ మోసాలు!

నకిలీ ఈ-చలాన్  చెల్లింపు లింకుల ద్వారా జరుగు తున్న సైబర్ మోసాలపై హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. మీ వాహనానికి ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి అంటూ  సైబర్ నేరగాళ్లు ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ సందేశాల ద్వారా నకిలీ లింకులు పంపిస్తూ ప్రజలను మోసగిస్తున్నారని హెచ్చరించారు. ఈ నకిలీ లింకులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లను పోలి ఉండే విధంగా  ఉండటంతో.. చాలామంది అవి నిజమైనవని నమ్మి క్లిక్  చేసి మోసపోతున్నారని పేర్కొన్నారు. ఆ  నకిలీ లింక్ పై  క్లిక్ చేసిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయాలని, ఆ తరువాత  చెల్లించాల్సిన మొత్తం చూపించి వెంటనే చెల్లింపు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని వెల్లడించారు. చెల్లింపు చేసిన వెంటనే బాధితుల మొబైల్ ఫోన్లలో మాల్వేర్ ఇన్‌స్టాల్ కావడం, బ్యాంకింగ్ వివరాలు హ్యాక్ కావడం జరుగుతోందని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. తెలిపారు. దీని వల్ల బాధితుల ఖాతాల నుంచి అనధికార లావాదేవీలు జరిగి భారీగా డబ్బు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు.  ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే చేయాలని, ఎస్ఎమ్ఎస్ లు, వాట్సాప్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులపై ఎట్టి పరిస్థితు ల్లోనూ క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ప్రభుత్వ శాఖలు వ్యక్తిగత సందేశాల ద్వారా చెల్లింపు లింకులు పంపవని స్పష్టం చేశారు. ఇలాంటి సైబర్ మోసాలకు గురైన బాధితులు వెంటనే తమ మొబైల్ డేటా లేదా వై-ఫైని నిలిపివేయాలని, బ్యాంకును సంప్రదించి కార్డులు లేదా లావాదేవీలను బ్లాక్ చేయించుకోవాలని సూచించారు. అలాగే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయడంతో పాటు, www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.  
Publish Date: Dec 24, 2025 3:14PM

మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్న హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్

పేరు మోసిన హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. గతంలో పోలీస్ కస్టడీ నుండి తప్పిం చుకొని పరారైన ఈ నింది తుడు ప్రస్తుతం తమిళ నాడులో వరస నేరాలకు పాల్పడుతున్నట్లు గా తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడింది. గతంలో హైదరాబాదులోని ప్రిజం పబ్ లో కాల్పులు జరిపి హల్చల్ సృష్టించిన బత్తుల ప్రభాకర్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు పిటి వారెంట్ మీద అతన్ని ఆంధ్రప్రదేశ్ కు తరలించి కోర్టులో హాజరుపరిచారు. సెప్టెంబర్ నెలలో విజయ వాడ కోర్టులో హాజరు పరిచిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్న సమయంలో పోలీసులు మార్గమ ధ్యంలో ఉన్న ఒక హోటల్ వద్ద ఆగారు.అదే సమయంలో బత్తుల ప్రభాకర్ మూత్ర విసర్జనకు అంటూ  పోలీసుల కస్టడీ నుండి తప్పించుకొని పారిపోయాడు. అప్పటి నుండి అతడి కోసం గాలింపు సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో  ఇటీవల బయటకు వచ్చిన ఒక వీడియో పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. బత్తుల ప్రభాకర్ ప్రస్తుతం తమిళనాడులో ఉంటూ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ లను టార్గెట్గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ట్లుగా ఆ వీడియో ద్వారా వెల్లడైంది. ఈ క్రమంలోనే చెన్నైలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బత్తుల ప్రభాకర్ చోరీ కి పాల్పడినట్లు  పోలీసులు గుర్తించారు. ఆ కాలేజీ లాకర్ నుండి 60 లక్షల వరకు నగదు కొట్టేసినట్లుగా పోలీసులు గుర్తించారు.     ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చి హైదరాబాదులోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో దొంగతనానికి వచ్చిన ప్రభాకర్ అక్కడ పోలీసుల నుండి తప్పించుకొని ప్రిజం పబ్బులోకి వెళ్లి కాల్పులు జరిపాడు. అనంతరం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతన్ని తీసుకొని కోర్టులో హాజరు పరిచి రాజమండ్రి జైలుకు తరలిస్తున్న సమయంలో విజయ వాడ నుండి తప్పించుకొని పారిపోయాడు. అలా తప్పించుకొని పారిపోయిన బత్తుల ప్రభాకర్ చెన్నైలో సెటిల్ అయ్యి అక్కడ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలను టార్గెట్ గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు ఆ విధంగా చోరీల ద్వారా సంపా దించిన డబ్బుతో బత్తుల ప్రభాకర్ జల్సాలు చేస్తున్నట్లు సమాచారం. చెన్నై కాలేజీ చోరీకి సంబంధించిన కీలక సీసీటీవీ ఫుటేజ్ పోలీసుల చేతికి చిక్కడంతో బత్తుల ప్రభాకర్ జాడ కనుక్కున్నారు. ప్రస్తుతం అతడిపై మరిన్ని కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నారు. పరారీలో ఉన్న బత్తుల ప్రభాకర్ తమిళనాడులో ప్రత్యక్షమై చోరీలకు పాల్పడుతూ ఉండడంతో అతన్ని పట్టుకునేందుకు తమిళనాడు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ పరారీలో ఉన్న నేరస్తుల్ని అదుపులోకి తీసుకునేందుకు మూడు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. నేర చరిత్ర కలిగిన బత్తుల ప్రభాకర్ పట్టుకోవడం పోలీసులకు ఒక సవాలుగా మారింది.
Publish Date: Dec 24, 2025 3:01PM

మాటకు కట్టుబడి.. పవన్ ఇప్పటం పర్యటన

మాట తప్పను, మడమ తిప్పను అని పదే పదే చెప్పుకున్న జగన్ అధికారం దక్కి మాట నిలుపుకునే అవకాశం వచ్చినప్పుడు ముఖం చాటేశారు. ప్రజల కష్టాల సంగతి సరే, వారి ముఖం చూడటం కూడా ఇష్టం లేదన్నట్లుగా రోడ్లకు ఇరువైపులా పరదాలు కట్టుకుని మరీ పర్యటలను సాగించారు. అందుకు భిన్నంగా జనసేనాని పవన్ కల్యాణ్ మాటకు కట్టుబడి నడుచుకుంటున్నారు. తాను అధికారంలో లేనప్పుడు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేర్చారు.  విషయమేంటంటే.. 2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు. ఆ మాటను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో నిలబెట్టుకున్నారు.  బుధవారం (డిసెంబర్ 24) ఆయన ఇప్పటం గ్రామంలో పర్యటించారు.  ఈ పర్యటనలో భాగంగా ఆయన బండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లారు. ఆమె తన కష్టాలను పవన్ కు కన్నీటితో తెలియజేశారు. గతంలో ఇప్పటంలో పర్యటించిన సమయంలో పవన్  క ల్యాణ్ ఆమెకు ధైర్యం చెప్పారు. తాను తిరిగి వస్తాననీ, ఖచ్చితంగా ఆదుకుంటాననీ ఆమెకు మాట ఇచ్చారు. ఈ పర్యటనలో తాను నాడు ఆమెకు ఇచ్చిన హామీని నెరవేర్చారు.  నాగేశ్వరమ్మకు ఆమె ఇంటి పెద్దకొడుకుగా తాను అండగా నిలుస్తానని మాట ఇచ్చారు. అన్నట్లుగానే తన జీతం నుంచి ఆమెకు నెలనెలా ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. అలాగే మూగవాడైన నాగేశ్వరమ్మ మనవడి చదువుకు అవసరమైన ఆర్థిక సాయం అందించడమే కాకుండా, చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం కూడా ఇప్పిస్తానని చెప్పారు. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న నాగేశ్వరమ్మ కుమారుడి వైద్యం కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటం గ్రామానికి వచ్చి పవన్ ఆత్మీయత చాటారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక జనసేన శ్రేణులైతే పవన్ కల్యాణ్ ది రాజకీయ పర్యటగా కాక బాధ్యత కలిగిన నేతగా పవన్ కల్యాణ్ మానవత్వాన్ని చాటుకున్న తీరుగా అభివర్ణిస్తున్నారు. 
Publish Date: Dec 24, 2025 2:50PM

రికార్డుల మోత.. క్రికెట్ చరిత్ర తిరగరాస్తున్న వైభవ్ సూర్యవంశీ

చిచ్చరపిడుగు, యువ సంచలనం వైభవ్ సూర్యవంశి రికార్డుల మోత మోగిస్తున్నాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సులో ప్రొఫెషనల్ క్రికెట్ లో సెంచరీ చేసి రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ..డొమెస్టిక్ క్రికెట్ లో కూడా అదే దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా, బ్యాటుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ.  క్రీజులోకి దిగాడంటే సెంచరీ బాదాల్సిందే అన్నట్లు విరుచుకుపడుతున్నాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో బిహార్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్ సూర్యవంశీ కేవలం  84 బంతుల్లో190 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఈ క్రమంలో రెండు ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్‌ చరిత్ర సృష్టించాడు. కేవలం 36 బంతుల్లోనే తొలి లిస్ట్-ఏ సెంచరీ పూర్తి చేశాడు. ప్రొఫెషనల్ వన్డే టోర్నీలోనూ 14 ఏళ్ల వయసులో శతకం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. భారతీయులలో వేగవంతమైన లిస్ట్-ఏ శతకాల జాబితాలో వైభవ్ సూర్యవంశీ  రెండో స్థానంలో నిలిచాడు. గత ఏడాది అన్మోల్‌ప్రీత్ సింగ్ 35 బంతుల్లో సెంచరీ చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. శతకం తర్వాత మరింత ఉగ్రరూపం దాల్చిన వైభవ్‌ కేవలం 54 బంతుల్లోనే 150 పరుగుల మార్క్‌ను దాటాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఏబీ డివిలియర్స్‌ (64 బంతులు) పేరిట ఉండేది. డబుల్ సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టే దిశగా సాగిన వైభవ్‌.. 190 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అయినా అతడి ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. 16 ఫోర్లు, 15 భారీ సిక్సర్లతో  226.19 స్ట్రైక్‌రేట్‌తో ఆడి అరుణాచల్ బౌలర్లను వణికించాడు. వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరు ఇప్పటికే క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా, రాజస్థాన్ రాయల్స్ తరఫున సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డులు నెలకొల్పాడు. అలాగే ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్  ఏ  జట్టు తరఫున 32 బంతుల్లోనే శతకం బాదాడు. విజయ్ హజారే ట్రోఫీ కొనసాగుతున్న కొద్దీ, ఇప్పుడు అందరి చూపు  వైభవ్ సూర్యవంశీ పైనే ఉంది. 14 ఏళ్ల వయసులోనే రికార్డులు బద్దలు కొడుతూ, యువ క్రికెటర్  నిర్వచనాన్నే మార్చేస్తున్నాడు. అతడి ప్రయాణం ఇప్పుడే మొదలైంది… మున్నందు ఆ యువకెరటం దాటాల్సిన  మైలురాళ్లు ఇంకా ఎన్ని ఎదురుచూస్తున్నాయో?
Publish Date: Dec 24, 2025 2:24PM

మాజీ మావోల కొత్త పొలిటికల్ పార్టీ?

ఆయుధాలను విసర్జించి లొంగిపోయిన మావోయిస్టులు ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. నక్సల్ రహిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆయుధాలు విడిచి లొంగిపోయిన మావోయిస్టుల సంఖ్య ఆరు వేలకు పైగానా ఉంటుంది. ఇలా లొంగిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారు. వారు ఆయుధాలు విడిచి లొంగిపోవడమే కాకుండా, ఇంకా ఉద్యమంలో కొనసాగుతున్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలంటూ పిలుపు కూడా ఇచ్చారు. సాయుధ పోరాటానికి కాలం చెల్లిందని ప్రకటించడమే కాకుండా జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి శాంతియుత మార్గాన్ని అనుసరించాలని చెప్పారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయంగా ముందుకు వెడతామని ఆయన అన్న మాటలు మాజీ మావోయిస్టులు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న చర్చకు దారి తీసింది.  లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్ల పల్లి వాసుదేవరావు తదితరుల నేతృత్వంలో ఒక కొత్త రాజకీయపార్టీ ఆవిర్భవించే అవకాశం ఉందని పరిశీలకులు సైతం వారి ప్రకటనలు ఉటంకిస్తూ విశ్లేషిస్తున్నారు. భారత రాజ్యాంగానికి లోబడే వీరు ఏర్పాటు చేసే కొత్త రాజకీయ పార్టీ పని చేసే అవకాశాలున్నాయంటున్నారు.  ఇటీవల మల్లోజుల వేణుగోపాల్ ఒక జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ మావోల కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.   మరో సారి ఆయుధాలు చేపట్టే ప్రశ్నే లేదన్న ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటామని విస్పష్టంగా చెప్పారు.  ఆపరేషన్ కగార్ తరువాత మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు, కీలక అగ్రనేతలు సహా దాదాపు ఆరువేల మంది లొంగిపోయిన సంగతి తెలిసిందే. లొంగుబాటు తరువాత కూడా వీరంతా ఒకరితో ఒకరు టచ్ లోనే ఉణ్నారంటున్నారు. పైగా లొంగిపోయిన వారంతా ప్రస్తుతం వేర్వేరు రాష్ట్రాలలో పోలీసు కేంద్రాలలోనే ఉన్నారు. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన గడువు ముగిసిన తరువాత వీరంతా జనజీనవ స్రవంతిలోకి వస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లోజుల మాటలు మాజీ నక్సల్స్ కోత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారన్న అభిప్రాయం కలిగేలా చేశారు.  మావోయిస్టులు కొత్త రాజకీయ పార్టీ అంటూ ప్రారంభిస్తే.. వారి మేనిఫెస్టో ఎలా ఉంటుంది? గతంలో తిరస్కరించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానానికి అనుగుణంగా వీరు తమ సిద్ధాంతాలకు ప్రజలలో ఎలా ప్రాచుర్యం కల్పిస్తారు అన్నది వేచి చూడాల్సిందే. 
Publish Date: Dec 24, 2025 2:09PM

దానం నాగేందర్ రాజీనామాకు రెడీ అయిపోయారా?

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్  అనర్హత వేటుకు సిద్ధమైపోయారా అన్నఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానం నాగేందర్.. ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరి.. సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా సికిందరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికలో ఆయన పరాజయం పాలయ్యారు. అయితే తన అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై  అనర్హత వేటు వేలాడుతోంది. మామూలుగా  పార్టీ ఫిరాయింపుల విషయంలో ఆధారాల సేకరణకు సమయం పడుతుంది. అయితే దానం విషయంలో  మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే   కోర్టులో , అలాగే  స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకూ ఆయన స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ లో లేననీ, తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ దానం నాగేందర్ కుండ బద్దలు కొట్టేశారు. అంతే కాంకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలవబోతోందన్నారు. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ జీహెచ్ఎంసీలో 300 స్థానాలలో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ అనర్హత వేటుకు సిద్ధమైపోయారా, లేక నేడో రేపో తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారా? అన్న చర్చ ప్రారంభమైంది.   ఇలా ఉండగా పరిశీలకులు మాత్రం దానం నాగేందర్ స్పీకర్ అనర్హత వేటు వేసే వరకూ ఆగకుండా అంతకు ముందే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు. ఆయన రాజీనామా చేస్తే ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం తథ్యం.  అప్పుడు కాంగ్రెస్ తరఫున మళ్ళీ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఎన్నికవ్వాలన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందంటున్నారు.  
Publish Date: Dec 24, 2025 1:50PM

ఫోన్ టాపింగ్ కేసులో పెన్ డ్రైవ్ ప్రకంపనలు

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును కొత్త సిట్ చేపట్టిన తరువాత కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా సిట్ చేతికి చిక్కిన ఒక పెన్ డ్రైవ్ ప్రకంపనలు సృష్టిస్తున్నది.  ఆ పెన్ డ్రైవ్ ఆధారంగా ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని దర్యాప్తు అధికారులు బావిస్తున్నాయి.  మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు.   ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్   ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ కేసులో ప్రభాకర్ రావు తన వాంగ్మూలంలో పదేపదే మాజీ డిజిపి మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రస్తావిం చడంతో అప్పటికే సిట్ అధికారులు మాజీ డిజిపి ని విచారణ చేసి వాంగ్మూలం నమోదు చేశారు. అలాగే  ఫోన్ టాపింగ్ రివ్యూ కమిటీ లో సభ్యులైన మాజీ  సిఎస్ లు సోమేష్ కుమార్, శాంత కుమారి ఇతర అధికారులు తిరుపతి, శేషాద్రి లను కూడా  విచారించారు. ఇక  మంగళవారం  ఈ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారించాలని సిట్ నిర్ణయించింది. కెసిఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా నోటీసులు ఇవ్వడానికి సిట్ అధికారులు సిద్ధమవుతున్నట్లు  తెలుస్తున్నది.   ఇక బుధవారం(డిసెంబర్ 24) సిట్ విచారణలో వెలుగులోకి వచ్చిన  పెన్ డ్రైవ్ తీవ్ర కలకలం సృష్టిస్తున్నది.  ఈ కేసుకు సంబంధించిన ఈ పెన్ డ్రైవ్  కీలక ఆధారంగా మారను న్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు తన పదవీకాలంలో ఫోన్ టాపింగ్ కు సంబంధించిన కీలక వివరాలను ఈ పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసి ఉంచినట్లుగా సిట్ గుర్తించింది. ఈ పెన్ డ్రైవ్ లో వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ప్రధానంగా  రాజకీయ నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన ఫోన్ నెంబర్లతో పాటు ప్రొఫైల్స్ కూడా ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ పెన్ డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందు ఉంచి సిట్ అధికారులు విచారిస్తున్నట్లు  తెలుస్తోంది.  సిట్ అధికారులు ఈ పెన్ డ్రైవ్ ద్వారానే ఫోన్ టాపింగ్ గురైన ఫోన్ నెంబర్ల ను ఇప్పటికే  గుర్తించారు. ఫోన్ టాపింగ్ వ్యవహారం కొనసా గుతున్న సమయంలో పోలీసుల చేతికి చిక్కకుండా ప్రభాకర్ రావు టీమ్ అన్ని ఆధారాలు ధ్వంసం చేసినా కూడా ఈ పెన్ డ్రైవ్ ప్రత్యేక దర్యాప్తు బృందం చేతికి చిక్కడం దర్యాప్తులో కీలక మైలురాయిగా మారింది. ఈ కేసు ఛేదించడానికి  పెన్ డ్రైవ్ సాలిడ్ ఎవిడెన్స్ అని సిట్ అధికా రులు చెబుతున్నారు.  ప్రభాకర్ రావు నుండి ఇంకా పూర్తి వివరాలు సేకరించేందుకు ఎల్లుండి వరకూ  విచారించడానికి సమయం ఉందని అధికారులు తెలిపారు.  
Publish Date: Dec 24, 2025 12:48PM

ప్రధాని పదవికి రాహుల్ అనర్హుడా?.. రాబర్ట్ వధేరా మాటల ఆంతర్యమేంటి?

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సొంత కుటుంబం నుంచే వ్యతిరేక సెగ తగులుతోందా? ఇటీవలి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత ఇండీ కూటమి నేతలు రాహుల్ నాయకత్వంపై ఒకింత ఆసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా పలువురు నేతలు రాహుల్ నాయకత్వ సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాహుల్ సొదరి ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వధేరా కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. నేరుగా రాహుల్ పేరు ఎత్తకుండానే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  పార్టీలో ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వికి త‌న భార్య, వ‌య‌నాడ్‌  ఎంపీ ప్రియాంక గాంధీ అర్హురాల‌ంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక పెను చీలికకు దారి తీసే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.    రాబర్ట్ వధేరా.. ప్రియాంక వధేరా లోక్ సభలో బలమైన గళం వినిపించారనీ,  ఆమెకు ప్రధాన మంత్రి పదవి చేపట్టడానికి అవసరమైన అన్ని అర్హతలూ ఉన్నాయనీ అన్నారు. అక్కడితో ఆగకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటిస్తేనే దేశంలో కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతుందని, అప్పుడే దేశంలో కాంగ్రెస్ విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకోగలుగుతుందనీ రాబర్ట్ వధేరా అన్నారు.  లోక్ సభ శీతాకాల సమావేశాల ముగింపు సందర్భంగా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే  కొందరు  ఎంపీల నంచి కూడా వచ్చిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రాబర్ట్ వధేరా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయమనీ, వాటితో పార్టీకి సంబంధం లేదంటూ కొందరు సీనియర్లు వివాదం పెరగకుండా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇక ప్రియాంక వధేరా గాంధీ అయితే, తన భర్త వ్యాఖ్యలపై స్పందించకుండా మౌనం వహించారు.  దీనిపై రాహుల్ ఏ విధంగా స్పందిస్తారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. 
Publish Date: Dec 24, 2025 12:21PM

ఫ్రం 24 టు నంబర్ వన్.. ఏపీ పంచాయతీరాజ్ పై పవన్ ముద్ర

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ శాఖపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనదైన ముద్ర వేయడంతో అనతి కాలంలోనే ఏపీ పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా  తనదైన ముద్ర వేయడం వల్లనే ఇది సాధ్యమైందని పరిశీలకులు అంటున్నారు.   ఆంధ్రప్రదేశ్  ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్ పాలనలో తనదైన ముద్ర వేస్తు న్నారు. ముఖ్యంగా  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన కృషి ఫలితంగా ఆ శాఖలు జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి చేరుకుని అందరి దృష్టిని ఆకర్షించాయి. గతంలో ఉద్యోగుల శిక్షణ, సామర్థ్యాభివృద్ధి విషయంలో దేశంలో  24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, పవన్ కల్యాణ్ ఆ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే దేశంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. జాతీయ పంచాయతీ అవార్డులలో ఏపీకి నాలుగు అవార్డులు లభించాయి. మొత్తంగా పంచాయతీరాజ్ శాఖ పనితీరు విషయంలో దేశంలోనే ఏపీ నంబర్ వన్ గా నిలిచింది.  
Publish Date: Dec 24, 2025 11:55AM

వైఎస్ కుటుంబం మినీ క్రిస్మస్ వేడుకలు.. షర్మిల ఎక్కడ?

వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం క్రిస్మస్ వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంది. ఆ కుటుంబం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవడమన్నది చాలా కాలంగా వస్తున్న సంప్రదాయం.  పులివెందులలోని తమ పూర్వీకుల ఇంట్లో కుటుంబ సభ్యులంతా కలిసి ఈ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఈ సారి కూడా ఆ సంప్రదాయం కొనసాగింది. పులివెందులలోని వైఎస్ నివాసంలో   వైఎస్ కుటుంబం మినీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.  షర్మిల  వినా ఈ వేడకకు  వైఎస్ కుటుంబంలోని దాదాపు అందరూ హాజరయ్యారు. జగన్, ఆమె తల్లి విజయమ్మా చాలా కాలం తరువాత ఒకే కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తి కలిగించింది. అయితే వారిరు వురూ దూరందూరంగా కూర్చోవడంపై కూడా చర్చ జరుగుతోంది.  ఇందుకు సంబంధించిన గ్రూప్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే ఈ వేడుక ఎప్పుడు జరిగింది? అన్న విషయంపై స్పష్టత లేదు.  ఆ ఫొటో ఈ ఏడాది జరిగిన క్రిస్మస్ వేడుకలకు సంబంధించినదా, పాతదా అన్న అనుమానాన్ని నెటిజనులు వ్యక్తం చేస్తున్నారు.   మొత్తం మీద సామాజిక మాధ్యమంలో ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ షర్మిల ఎక్కడ అంటూ నెటిజనులు పోస్టు చేస్తున్నారు.  ప్రస్తుతం జగన్ పులివెందుల పర్యటనలో ఉండటం ఈ ఫొటో తాజాదే అయి ఉంటుందని భావించవ చ్చునని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద వైఎస్ జగన్, షర్మిల మధ్య దూరం తరగలే దనడానికి ఈ ఫొటో నిదర్శనంగా ఉందని చెబుతున్నారు. ఎందుకంటే జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల షర్మిల ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం, అందుకు ధాంక్యూ షర్మిలమ్మా అంటూ జగన్ రిప్లై ఇవ్వడంతో ఇరువురి మధ్యా సయోధ్య ఏర్పడిందన్న చర్చ ఇటీవల జోరుగా సాగింది. ఇప్పుడు తాజాగా పులవెందులలో వైఎస్ కుటుంబ సభ్యులు జరుపుకున్న మినీ క్రిస్మస్ వేడుకల్లో షర్మిల కనిపించకపోవడం వీరి మధ్య విభేదాలపై మరో సారి చర్చకు తెరలేపింది. 
Publish Date: Dec 24, 2025 11:31AM

నిర్దేశిత గడువులోగా ధాన్యం కొనుగోళ్లు.. చంద్రబాబు

రైతులకు ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా, నిర్దేశిత గడువులోగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ, పంట ఉత్పత్తుల మార్కెటింగ్ పై సీఎం చంద్రబాబు సచివాలయంలో   సమీక్ష నిర్వహించారు.  రైతులకు లబ్ధి చేకూరేలా  రబీ, ఖరీఫ్ పంటలకు సంబంధించిన క్యాలెండర్‌ను రూపొందించాలన్నారు. పంటల హార్వెస్టింగ్, మార్కెటింగ్ ప్రక్రియలు సక్రమంగా జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.   రబీ- ఖరీఫ్- రబీ సీజన్లలో ఏయే పంటలు వేయాలి, రైతులకు ఏది ప్రయోజనం అన్న విషయాలపై వారిలో అవగాహన కల్పించాలన్నారు. పంట ఉత్పత్తుల నాణ్యతనుపెంపుతో పాటు, కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఈ సంద ర్భంగా అధికారయంత్రాంగాన్ని ఆదేశించారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు వ్యవసాయ ఉత్ప త్తులను తరలించేందుకు వాటి ప్రాసెసింగ్‌పై దృష్టి సారించడంతో పాటు,  దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లకు పంట ఉత్పత్తులను తరలించేందుకు వీలుగా రైల్ కార్గో వంటి లాజిస్టిక్స్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎదురవుతున్న బ్యాంకు గ్యారెంటీ సమస్యలను పరిష్కరించి, రైతులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహాలో బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వాలని అక్కడికక్కడే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కన్వీనర్‌తో  మాట్లాడి ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు.   స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానం మేరకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు.  
Publish Date: Dec 24, 2025 11:05AM

సాగు భూములకు మాత్రమే రైతు భరోసా!

రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా పథకం అమలు, మార్గదర్శకాలపై మంగళవారం (డిసెంబర్ 23) నిర్వహించిన సమీక్షా సమావేశంలో  మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇక నుంచి ఈ పథకం నిధులు కేవలం సాగు రైతులకు మాత్రమే అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.  గత ప్రభుత్వం విచ్చల విడిగా ఈ పథకం నిధులను సాగుకు అనుకూలంగా లేని భూములకు కూడా ఇచ్చి దుర్వినియోగం చేసినట్లు ఆయన తెలిపారు. ఇకపై అలా ఇచ్చే ప్రశక్తే లేదని పేర్కొన్నారు.  గత బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు బంధు పేరుతో ఉన్న ఈ పథకాన్ని రేవంత్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రైతు భరోసాగా మార్చారు. గతంలో అంటే బీఆర్ఎస్ హయాంలో రైతన్నలకు ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా ఎకరాకు నాలుగు వేల రూపాయల చొప్పున రెండు సీజన్లకు కలిపి మొత్తం ఎనిమిది వేలు చెల్లించింది. ఆ తరువాత ఈ పెట్టుబడి సాయాన్ని ఐదు వేల రూపాయలకు పెంచింది.   అయితే, ఈ పథకంలో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఆరోపణలు వచ్చాయి. వ్యవసాయం చేయని వారు, బీడు భూములు, కొండలు, గుట్టలు ఉన్న భూములకు కూడా నిధులు పొందినట్లు గుర్తించారు.  ఈ నేపథ్యంలోనే రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత  రైతు భరోసాగా ఈ పథకం పేరు మార్చి పెట్టుబడి సాయాన్ని ఎకరాకు ఆరు వేల రూపాయలకు పెంచింది.  అయితే ఈ పథకం ద్వారా  అనర్హులు  కూడా లబ్ధి పొందుతున్నారని గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు సాగు చేసే భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. 
Publish Date: Dec 24, 2025 9:56AM

అమెరికాలో 30 మంది ఇండియన్స్ అరెస్ట్.. ఎందుకంటే?

అగ్రరాజ్యం అమెరికాలో 30 మంది ఇండియన్స్ ను అమెరికా బోర్డర్ పెట్రోల్ అధికారులు అరెస్టు చేశారు. వీరంతా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారంటూ ఈ అరెస్టులు జరిగాయి.  కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులతో భారీ సెమీ ట్రక్ వాహనాలను నడుపుతున్నట్లు గుర్తించినందున వీరిని అరెస్టు చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు.   గత నెల 23 నుంచి ఈ నెల 12 వరకూ ఇంటర్ స్టేట్ హైవేలు,  ఇమిగ్రేషన్ చెక్‌పోస్టుల వద్ద జరిగిన తనిఖీల్లో మొత్తం 42 మంది అక్రమ వలసదారులను అదుపులోనికి తీసుకోగా, వీరిలో 30 మంది ఇండియన్స్ ఉన్నారు.  ఇండియన్  డ్రైవ‌ర్ల‌ కార‌ణంగా అమెరికాలో జ‌రిగిన‌ కొన్ని ప్రమాదాల్లో పలువురు మరణించగా, మరింత మంది తీవ్రంగా గాపడ్డారని అధికారులు తెలిపారు. సాధారణ కమర్షియల్ డ్రైవర్ లైసెన్సులతో భారీ సెమీ ట్రక్ వాహనాలను నడపడం నేరమన్న వారు,  ప్రజల భద్రతే మా ప్రథమ లక్ష్యమన్నారు. అందుకే స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి అక్రమ వలసదారులను అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. 
Publish Date: Dec 24, 2025 9:40AM

ఆర్డనరీ బస్సులలోనూ ఏసీ.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు దూసుకువెడుతోంది. సమతుల్య అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన వనరుల నంగంలో భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టారు.  గ్రీన్ ఎనర్జీ కంపెనీలు ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న సంగతి తెలిసిందే.  తాజాగా చంద్రబాబునాయుడు  రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ఆసక్తికర విషయాన్ని తెలిపారు. రాష్ట్రంలో త్వరలో పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ బస్సులను తీసుకురానున్నట్లు తెలిపారు.   పల్లె వెలుగు  బస్సులతో సహా ప్రతి ఎలక్ట్రిక్ బస్సులో ఇప్పటి నుండి తప్పనిసరిగా ఏసీ సౌకర్యం ఉండాలన్నారు.  వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 1,450 ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయనుందని తెలిపారు.   పల్లె వెలుగు సహా రాష్ట్రంలోని అన్ని బస్సులలోనూ   ఇన్‌బిల్ట్ ఎయిర్ కండిషనింగ్ ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పల్లె వెలుగు బస్సులు సహా ఆర్డనరీ బస్సుల ను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా అప్‌గ్రేడ్ చేయడానికి, వాటిలో కూడా ఎయిర్ కండీషన్ అమర్చడానికి ఒక ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.   
Publish Date: Dec 24, 2025 9:24AM

తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా!

తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా విసిరింది. ఈ నెల తొలి వార నుంచీ ప్రారంభమైన చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. డిసెంబర్ రెండో వారంలోనే చలిపులి తెలుగు రాష్ట్రాలను వణికించడం మొదలైంది.  ఉదయం, రాత్రి వేళల్లో చలి గాలులకు తోడు దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది.  గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఆందోళనకర స్థాయిలో పడిపోయాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు గజగజలాడుతున్నాయి.  కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదౌతున్నాయి.  తెలంగాణ సంగారెడ్డి జిల్లాలోని కోహిర్‌లో అత్యల్పంగా 5 డిగ్రీల   ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆదిలాబాద్‌, ఆసీఫాబాద్, వికారాబాద్, మెదక్, కామారెడ్డిలో సైతం ఉష్ణాగ్రతలు భారీగా పడిపోయాయి. ఇక హైదరాబాద్‌లో సాధారణంగా 10 నుంచి 12 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండగా.. నగర శివారు ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు  సింగిల్ డిజిట్ కు పడిపోయాయి.  అలాగే ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో   చలి తీవ్రత అధికంగా ఉంది.   ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అరకు, పాడేరు, చింతపల్లి తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఉదయం, రాత్రి వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి విపరీతంగా ఉన్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులతోపాటు శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ కోల్డ్ వేవ్ ఈ నెలాఖరువరకూ కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.  
Publish Date: Dec 24, 2025 9:13AM

బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్

ఇస్రో మరో ఘన విజయం సాధించింది. అంతరిక్ష రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది.  శ్రీహరి కోటలోని షార్ నుంచి బాహుబలి రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది.  ఎల్‌వీఎం3-ఎం6 బాహుబలి రాకెట్  అమెరికాకు చెంది భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్-2ని నింగిలోకి తీసుకువెళ్లింది. ఈ ఉపగ్రహం బరువు దాదాపు ఆరువేల ఒక వంద కిలోలు.  అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పెస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. బుధవారం (డిసెంబర్ 24) ఉదయం 8:54 గంటలకు ఎల్వీఎం-3 ఎం-6 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. అమెరికాకు చెందిన కొత్త తరం కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్-2ను కక్ష్యలోకి పంపారు. ఈ  ప్రయోగంతో  ఇస్రో సరికొత్త రికార్డు నెలకొల్పింది. నిర్దేశిత కక్ష్యలో15.07 నిమిషాల్లో రాకెట్ మూడు దశలు పూర్తవగానే లో ఎర్త్ ఆర్బిట్ (లియో)లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థతో సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇంత పెద్ద ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించడం ఇస్రోకి ఇదే మొదటి సారి కావడం విశేషం.
Publish Date: Dec 24, 2025 9:00AM