హరీష్‌రావు రాజీడ్రామాలు చూసి జనం నవ్వుతున్నారు!

తెలంగాణలో అధికారం కోల్పోయిన షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోని తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్ గత కొన్ని రోజులుగా జనంలోకి వచ్చి ఆడుతున్న డ్రామాలు చూస్తూ జనం ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ కొద్దిరోజులు తండ్రి, అన్నలతో కలసి డ్రామాలాడిన బాలనటి కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో రెస్టు తీసుకుంటోంది. ఇప్పుడు ఈ డ్రామా కంపెనీలోకి మరో ఛైల్డ్ ఆర్టిస్టు ఎంటరయ్యాడు. ఆ డ్రామా ఆర్టిస్టు మరెవరో కాదు... కేసీఆర్ ముద్దుల మేనల్లుడు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ఫ్యామిలీ ఎన్ని డ్రామాలు ఆడినా, ఉద్యమ స్ఫూర్తితో వున్న జనం నమ్మారు. ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణ కోసమే కదా అని క్షమించారు. పదేళ్ళు అధికారంలో అహంకారంతో వ్యహరించినప్పుడు సమయం కోసం వేచి చూశారు. ఆ సమయం రాగానే గద్దె దించారు. అహంకారం, డ్రామాలు ఎప్పుడూ పనికిరావన్న విషయాన్ని తెలుసుకోలేని ఈ కుటుంబం ఇంకా తమ పంథా మార్చుకోకుండా జనంలో పరువు పోగొట్టుకుంటోంది. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఆగస్టు 15వ తేదీ లోపల చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను పట్టుకుని హరీష్ రావు డ్రామా క్రియేట్ చేశాడు. రేవంత్ రెడ్డి తాను చెప్పినట్టు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరాడు. అయితే రాజీనామా లేఖ రెడీగా పెట్టుకో, ఆగస్టు 15 తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా వుండు అని రేవంత్ రెడ్డి చెప్పడంతో హరీష్ రావు ఆత్మరక్షణలో పడ్డాడు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తే తాను తట్టాబుట్టా సర్దుకోవాల్సి వస్తుందని అర్థం చేసుకుని వెంటనే ప్లేటు తిప్పేశాడు. అయితే, నేను నా రాజీనామా లేఖ అమరవీరుల స్థూపం దగ్గరకి తెస్తా.. నువ్వూ నీ రాజీనామా లేఖ తీసుకుని  శుక్రవారం నాడు అక్కడకి రా అని సవాల్ విసిరాడు. ముఖ్యమంత్రి హోదాలో వున్న వ్యక్తి రాజీనామా లేఖ తీసుకుని అమరవీరుల స్థూపం దగ్గరకి వస్తాడా? కేసీఆర్ గవర్నమెంట్ అధికారంలో వున్నప్పుడు అలా ఎప్పుడైనా వచ్చిన దాఖలాలు వున్నాయా? ముఖ్యమంత్రి పరామర్శించాల్సిన సందర్భాల్లో అయినా ఆయన వెళ్ళిన చరిత్ర వుందా? వాళ్ళు మాత్రం ముఖ్యమంత్రి రాజీనామా లేఖ పట్టుకుని వాళ్ళు చెప్పిన దగ్గరకి రావాలి. ముఖ్యమంత్రి ఎలాగూ రాడని తెలుసు, శుక్రవారం నాడు హరీష్ రావు అమరవీరుల స్థూపానికి ఏదో ముక్కుబడిగా నాలుగు పూలు చల్లేసి, ఒక నమస్కారం పారేసి సీఎం అక్కడకి రాలేదని ఫీలయ్యారు. స్పీకర్‌కి రాసిన రాజీనామా లేఖను అక్కడే వున్న మీడియా వాళ్ళకి ఇచ్చారు. రాజీనామా లేఖ అంటే స్పీకర్ ఫార్మాట్లో వుండాలి. తనకు చేతికి వచ్చినట్టు రాసి ఇదే రాజీనామా లేఖ అనుకో అంటే కుదరదు. హరీష్ రావు తన రాజీనామాలో ఏదేదో చేట భారతం అంతా రాశారు. ప్రస్తుతానికి ఇలా చేటభారతం రాజీనామా లేఖ రాశానని, రుణ మాఫీ చేశాక స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ ఇస్తానని, ఆ తర్వాత ఉప ఎన్నికలో పోటీ కూడా చేయనని ప్రకటించారు. ఈ తిరకాసు వ్యవహారమంతా ఎందుకు? ఆ ఇచ్చేదేదో స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా లేఖ ఇవ్వచ్చుగా..  మొన్నటి వరకు ‘ఆగస్టు 15 లోగా 2 లక్షల రైతు రుణ మాఫీ’ అనే పాయింట్ మీదే హడావిడి చేసిన హరీష్ రావు.. ఇప్పుడు అమరవీరుల స్థూపం దగ్గర ఇంకా ఏవేవో అంశాలను ప్రస్తావించి ఇవన్నీ నెరవేరిస్తేనే నా రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో ఇస్తా అని మెలిక పెట్టాడు. రాజీనామా చేసే దమ్ము లేనప్పుడు రాజీనామా సవాళ్ళు విసరసం ఎందుకు.. ఇప్పుడు రాజీనామా గండం నుంచి బయటపడటానికి పనికిరాని నాటకాలన్నీ ఆడటం ఎందుకు? రేపు ఆగస్టు 15 లోపు సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీని చేయడంతోపాటు ఇంకెన్ని హామీలను అమలు చేసినా హరీష్ రావు ఏదో మెలికో, తిరకాసో పెట్టి రాజీనామా చేయకుండా తప్పించుకుంటాడని అందరికీ తెలిసిన విషయమే. ఈ మనుషులు ఎప్పటికి మారతారో!
Publish Date: Apr 27, 2024 12:21PM

ప్రచారవ్యూహం లేక వైసీపీ మల్లగుల్లాలు.. జగన్ చేతులెత్తేశారా?

ఎప్పుడైనా ఎన్నికల వేళకి అధికార పార్టీలో  ఒక స్పష్టత ఉంటుంది. అధికారంలో ఉన్న కాలంలో చేసిన అభివృద్ధీ, ప్రజలకు అందించిన సంక్షేమం వివరించి ఓట్లు అడగడానికి వెసులుబాటు ఉంటుంది. అయితే వాస్తవంగా అధికారంలో ఉన్న కాలంలో అభివృద్ధి సంక్షేమాలపై ప్రభుత్వం ప్రజలమెప్పు పొందిందా లేదా అన్నది ఓటర్లు తమ ఓటు ద్వారా తీర్పు ఇస్తారు. అది వేరే సంగతి. కానీ అధికారంలో ఉన్న పార్టీకి మాత్రం ప్రచారం చేసుకునే విషయంలోనూ, పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ విపక్షం కంటే ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. అలాగే అసమ్మతి బెడదా తక్కువ ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి పూర్తి రివర్స్ లో ఉంది. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీలో గాభరా కనిపిస్తోంది. ఓటమి తప్పదన్న బెదురు కానవస్తోంది. అదే సమయంలో విపక్షంలో ధీమా కనిపిస్తోంది. జనం మావైపే ఉన్నారన్న భరోసా కానవస్తోంది. ఇందుకు కారణాల గురించి చెప్పుకునే ముందు విపక్షంగా తెలుగుదేశం ఓంటరిగా పోరు చేయడం లేదు. జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగింది. అలాంటి సమయంలో భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటు, ఆ సర్దుబాటు కారణంగా అనివార్యంగా కొన్ని త్యాగాలకు సిద్ధపడటం, అందు వల్ల ఆశించిన సీటు దక్కక నేతల్లో పెచ్చరిల్లే అసంతృప్తి ఇన్నిటిని సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీ ఆ ఇబ్బందులు, ఇరకాటాలన్నిటినీ అలవోకగా దాటేసింది. అదే సమయంలో అధికారంలో ఉండటం చేత ఉన్న సానుకూలాలన్నిటినీ వైసీపీ చేజేతులా ప్రతికూలంగా మార్చేసుకుంది.  అందుకే  ఏపీలో  జనసేన, బీజేపీలతో పొత్తు కుదుర్చుకుని, సీట్ల సర్దుబాటు చేసుకుని, ఆ కారణంగా పార్టీలో తలెత్తిన అసమ్మతిని బుజ్జగించి పార్టీలో అసంతృప్తి అనవాలే లేకుండా చేసుకుని ధీమాగా కనిపిస్తుంటే.. అధికార వైసీపీలో  మాత్రం ఆందోళన, గందర గోళం కనిపిస్తోంది.  పార్టీ టికెట్ లభించిన అభ్యర్థులు ధైర్యంగా ప్రజలలోకి వెళ్లి ప్రచారం చేసుకోలేని పరిస్థితి కానవస్తోంది. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ బస్సు యాత్రకు సైతం జనం స్పందన కానరాక పార్టీలో  ఓటమి భయం కనిపిస్తోంది.  ఏపీలో పోలింగ్ తేదీ మే 13. అంటే మరో 17 రోజులలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికీ వైసీపీ ప్రచారం జోరందుకోలేదు. విరామాలతో సాగిన జగన్ బస్సు యాత్ర తప్ప అధికార పార్టీ ప్రచారం జోరు పెంచింది లేదు. మరో వైపు తెలుగుదేశం కూటమి మాత్రం ప్రచారం జోరు పెంచింది. తెలుగుదేశం, జనసేన అధినేతలు ఉమ్మడి ప్రచారంతో పాటుగా ఎవరికి వారుగా కూడా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. వారి ఎన్నికల ప్రచార సభలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు.  అధికార వైసీపీ మాత్రం ప్రచార వ్యూహం లేక మల్లగుల్లాలు పడుతోంది. పరిస్థితి చూస్తుంటే అధికార పార్టీ అధినేతలో గెలుపు ధీమా కాగడాపెట్టి వెతికినా కూడా కనిపించడం లేదని పరిశీలకలుు విశ్లేషిస్తున్నారు. ఫలితం  తెలిసిపోయిన తరువాత ఇంక చేసేదేముంది అని చేతులెత్తేసినట్లుగా జగన్ తీరు ఉందంటున్నారు. 
Publish Date: Apr 27, 2024 12:08PM

న్యూట్రల్ ఓటును కూడా కూటమికి దఖలు పరిచేసిన జగన్

నిజానిజాల సంగతి పక్కన పెడితే ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల ప్రచారాలు కోటలు దాటేస్తాయి. పార్టీలు, నేతలు చెప్పేది ఏది నిజం, ఏది అబద్ధం అన్నది వేరే విషయం. ఎవరి మాటలను జనం విశ్వసిస్తున్నారు. ఎవరి మాటలను నమ్మడం లేదు అన్నది జనం ఓటుతో చెప్పే వరకూ అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ ఎవరికీ తెలియదు.   అయితే  సర్వేలు మాత్రం ప్రజానాడిని పట్టి చూపుతాయి. అందుకే సర్వేల పట్ల అందరిలోనూ సహజంగా ఆసక్తి ఉంటుంది.  అయితే సర్వేలు కూడా నూరు శాతం నిజం అయ్యే అవకాశాలు లేవని ఎన్నికల వ్యూహకర్త, సర్వేలకు పెట్టింది పేరు అయిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే పలు సందర్భాలలో చెప్పారు.    ఎన్నికల వేళ ప్రజల నాడి మారిపోవడానికి ఒక  బలమైన సంఘటన చాలు అని ఆయన గతంలో చెప్పారు.  ఔను నిజమే  రాజకీయాలు ఎప్పుడు చలన రహితంగా, నిశ్చలంగా ఉండవు. అన్నిటికీ మించి రాజకీయ పార్టీల మద్దతు దారులు, కార్యకర్తలు పార్టీల సభ్యులు వారు వారు ప్రాతినిథ్యం వహించే పార్టీలవైపే ఉంటారు అదులో సందేహం లేదు. అయితే ఎన్నికలలో జయాపజయాలను నిర్ణయించేది మాత్రం తటస్థ ఓటర్లు. ఔను న్యూట్రల్ ఓటర్లు ఎటుమొగ్గితే విజయం అటువైపు ఉంటుందన్నది రాజకీయపండితులు చెప్పే మాట.  అయితే ఇప్పుడు వారే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితి ఉందంటున్నారు. ఏపీలో కాగడా పెట్టి వెతికినా తటస్థులు కనిపించడం లేదని విశ్లేషిస్తున్నారు. ఐదేళ్ల జగన్ అస్తవ్యస్త, అరాచక పాలన కారణంగా తటస్థ ఓటరనే వాళ్లు లేకుండా అందరూ జగన్ వ్యతిరేక శిబిరానికి అంటే తెలుగుదేశం కూటమికి జై కొట్టేశారని చెబుతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో వెలువడిన ప్రతి సర్వే కూటమి ఘనవిజయాన్నే సూచిస్తోందంటున్నారు.  ఇక  కొద్దో గొప్పో తటస్థ ఓటర్లు ఉన్నా జగన్ వారిని కూడా తెలుగుదేశం కూటమికి చేరువ చేసేశారని తాజాగా ఆయన తన సొంత చెల్లి చీరపై చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ చెబుతున్నారు. పోలింగ్ కు రోజుల ముందు ఆయన కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల కట్టుకున్న చీర రంగుపై చేసిన వ్యాఖ్యలు తటస్థులను జగన్ కు వ్యతిరేకంగా మార్చేశాయని అంటున్నారు.   అంటే జగన్ తన అనుచిత వ్యాఖ్యలతో, అస్తవ్యస్త పాలనతో తటస్థ ఓటర్లను కూడా కూటమికే జై కొట్టేలా మార్చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Apr 27, 2024 11:34AM

కొడాలి నాని, బుగ్గన నామినేషన్లకు ఆమోదం.. నిబంధనలకు విరుద్ధమంటున్న విపక్షం

వైసీపీకి ఇప్పుడు అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి. ఏదీ కలిసిరావడం లేదు. గత ఎన్నికలలో అన్నీ కలిసివచ్చి అందలం దక్కింది. ఈ సారి అన్నీ ఎదురుతిరిగి అధికారం దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. స్వయంగా పార్టీ అధినేత, సీఎం జగన్ రంగంలోకి దిగి బస్సు యాత్ర చేపట్టినా జనంలో స్పందన కనిపించలేదు. చివరాఖరికి సొంత గడ్డ కడపలో కూడా జగన్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కడప జిల్లాలో ఓటర్ మూడ్ ను జగన్ సొంత చెల్లెలు షర్మిల మార్చేశారని అంటున్నారు. అన్న టార్గెట్ గా షర్మిల సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలకు వైసీపీ వద్ద జవాబే లేకుండా పోయిందంటున్నారు.  అదలా ఉంచితే.. వైసీపీ కీలక నేతల నామినేషన్లే తిరస్కరణకు గురయ్యే పరిస్థితి వచ్చింది. విపక్ష నేతలపై అనుచిత భాషా ప్రయోగంతో రెచ్చిపోవడంలో చూపే శ్రద్ధ వైసీపీ నేతలు తమ ఎన్నికల నామినేషన్ల దాఖలుపై చూపలేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రి బుగ్గన,  మాజీ మంత్రి కొడాలి నాని, పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్ రాజ్ దాఖలు చేసిన నామినేషన్ లలో పూర్తి వివరాలు పొందుపరచలేదన్న ఆరోపణలపై వారి నామినేషన్ల ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి బుగ్గన   ఎన్నికల అఫిడవిట్ లో లోపాలు ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన డోన్ ఆర్డీవో ఆయన నామినేషన్ ను పెండింగ్ లో పెట్టారు. బుగ్గన తన అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు పొందుపరచలేదంటూ డోన్  తెలుగుదేశం అభ్యర్థి కోట్ల అభ్యంతరం తెలిపారు. దీంతో బుగ్గన నామినేషన్ ను ఆర్వో పెండింగ్ లో పెట్టి పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా సూచించారు. ఇక గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే.. బూతుల ఎక్స్పర్ట్ గా పేరొందిన కొడాలి నాని అయితే తన ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆధారాలతో సహా విపక్ష నేతలు ఫిర్యాదు చేశారు. కొడాలి తన ఎన్నికల అఫిడవిట్ లో తాను ఎటువంటి ప్రభుత్వ భవనాన్ని వినియోగించలేదని వెల్లడించారు.   అయితే కొడాలి నాని ఎమ్మెల్యే గా  ప్రభుత్వ భవనమైన మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంప్ కార్యాలయంగా వినియోగించారంటూ అందుకు తగ్గ సాక్ష్యాధారాలతో గుడివాడ తెలుగుదేశం నేతలు  రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసారు. భవనాన్ని అద్దెకు ఇచ్చినట్లుగా మున్సిపల్ అధికారులు ఇచ్చిన పత్రాలను ఆధారంగా చూపించారు. దీంతో కొడాలి నాని నామినేషన్ వివాదంలో పడింది.   అయితే కొడాలి, బుగ్గన నామినేషన్లను ఆయా ఆర్వోలు చివరి నిముషంలో ఆమోదించారు. నిబంధనలకు విరుద్ధంగా వారి నామినేషన్లను ఆమోదించడంపై తెలుగుదేశం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టపరంగా ముందుకు వెడతామని చెబుతున్నారు. 
Publish Date: Apr 27, 2024 10:37AM

జగన్ ప్రచారంలో బాబాయ్ నామస్మరణ

కోడలికి బుద్ధి చెప్పి అత్త మూకుడు నాకిందనే సామెత తెలుగువారందరికీ తెలిసే వుంటుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీరు ప్రస్తుతం ఈ సామెత చెప్పినట్టే వుంది. బాబాయి వివేకా హత్యను ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష తెలుగుదేశంతోపాటు, తన సొంత చెల్లెళ్ళు షర్మిల, సునీత  ప్రస్తావించే అవకాశం వుంది కాబట్టి, అలా ప్రస్తావిస్తే అది తనకు నెగటివ్ అయ్య ప్రమాదం వుంది కాబట్టి వైసీపీ వర్గాలు కోర్టును ఆశ్రయించాయి. ప్రతిపక్ష పార్టీలతోపాటు వివేకా కుటుంబ సభ్యులు కూడా వివేకా హత్య గురించి మాట్లాడకూడదని కోర్టు  ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఎవరూ వివేకా హత్య గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడ్డం లేదు. కానీ, ఇప్పుడు వివేకా హత్య గురించి ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడే బాధ్యతను స్వయంగా జగనే తీసుకున్నారు. ఏ సభలో మాట్లాడినా వివేకా ప్రస్తావన తప్పకుండా తెస్తున్నారు. చిన్నాన్నకి రెండో భార్య వున్నట్టు అందరికీ తెలుసు కదా అని జనంతో అంటున్నారు. అవినాష్ రెడ్డి చాలా అమాయకుడు అన్నట్టు సర్టిఫికెట్ ఇస్తున్నారు. కోర్టు వివేకా హత్య గురించి ప్రతిపక్షాలు, షర్మిల, సునీత మాట్లాడవద్దని అన్నదే తప్ప నన్ను కాదు కదా అని జగన్ భావిస్తున్నారో ఏమో. ఏది ఏమైనా వివేకా హత్య గురించి ప్రస్తావించి రాజకీయంగా లాభం పొందాలని జగన్ అనుకుంటే అది బూమ్‌రాంగ్ అవడం ఖాయం.
Publish Date: Apr 26, 2024 7:05PM

ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీకి 3 సీట్లు వ‌స్తే, ముద్ర‌గ‌డ ఇంట్లో అంట్లు తోముతా

ప్రస్తుతం ఏపీ రాజ‌కీయాల్లో స‌వాళ్ల ప‌ర్వం స్టార్ట్ అయింది.  ప్ర‌చారంలో ప్రధాన పార్టీల నేత‌లు మాట‌ల‌ ప‌దును పెంచుతున్నారు. రాజ‌కీయ స‌వాళ్ళు, ప్ర‌తిస‌వాళ్ళ‌తో నేత‌లు, ఓట‌ర్ల‌ను వినోదాన్ని పంచుతున్నారు. “హాష్ ట్యాగ్ బ్యాండైడ్ ఛాలెంజ్” పేరుతో ట్విట్టర్ లో ఛాలెంజ్ విసురుకుంటున్నారు. టీడీపీ నేటిజన్లు జగన్ బ్యాండేజ్ సైజు పెరిగిందంటూ పోస్టులు పెడుతున్నారు. జగన్ ఇకపై ఆ బ్యాండేజ్ తీసేస్తేనే బెటర్, లేకపోతే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉందని  వైఎస్ వివేకా కుమార్తె సునీత ట్వీట్ చేశారు. ఇదే విషయం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ట్విట్టర్ లో స్పందించారు. "2014, 2019 ఎన్నికల్లో శవరాజకీయాలతో నెట్టుకొచ్చిన జగన్... ఈసారి ఒక డ్రామాతో వచ్చాడు. కనపడని ఒక గులకరాయి తగిలిందంట. బ్యాండ్ వేసాడు. రోజురోజుకు ఆ బ్యాండ్ పెద్దదవుతోంది. మే 13 ఎన్నికల రోజు వరకు డ్రామా ఆడిస్తానే ఉంటాడు ఈ నాటకాల రాయుడు" అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు!  మరోపక్క టీడీపీ శ్రేణులు పోస్టులు పెడుతున్నారు. ఈ నెల 13న బ్యాండేజ్ సైజు చిన్నగా ఉంది.. ప్రస్తుతం అది పెద్దగా అయ్యింది అంటూ... “హాష్ ట్యాగ్ బ్యాండైడ్ ఛాలెంజ్” పేరుతో ట్విట్టర్ లో ఛాలెంజ్ విసురుకుంటున్నారు. అయితే నేను వున్నాను. న‌న్ను గుర్తించండి అంటూ థర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ, టాలీవుడ్ న‌టుడు పృథ్వీ రాజ్ ఓ ఛాలెంజ్ విసిరారు. జ‌న‌సేన త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తూ ముద్ర‌గ‌డ‌ను ల‌క్ష్యంగా  చేసుకొని ఆయ‌న విమ‌ర్శ‌లు చేసారు.  ముద్రగడ కాపు ఉద్య‌మ నాయ‌కుడిగా ప్ర‌స్థానం ప్రారంభించి, ఇప్పుడు రెడ్డి ఉద్య‌మ నాయ‌కుడిగా, రెడ్డి సేవ‌కుడిగా మారార‌ని ఆరోపించారు.  కిర్లంపూడి లో కూర్చుని క‌బుర్లు చెబుతున్న ముద్ర‌గ‌డ‌ త‌న ప‌రిశ్ర‌మ‌ల‌కు, రైస్ మిల్లుల‌కు ఉన్న విద్యుత్ బ‌కాయిలు ఎంతో చెప్పాల‌ని ఆయన డిమాండ్ చేశారు. ఉత్త‌రాంధ్ర లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ కనీసం మూడు సీట్లు కూడా గెలిచే ప‌రిస్థితి లేద‌న్నారు. ఒక‌వేళ మూడు సీట్లు వైసీపీ గెలిస్తే మాత్రం నేను ఆయన ఇంట్లో అంట్లు తోముతాన‌ని అన్నారు.  ప్రస్తుతం ముద్ర‌గ‌డను ప‌ట్టించుకునేవారు, న‌మ్మేవారు ఎవ‌రూ లేర‌ని పృథ్వీ గట్టిగా చెబుతున్నారు. మెగా కుటుంబంలో చిరంజీవి, రామ్‌చరణ్ స‌హా ప‌లువురు కూటమికి మద్దతుగా ప్ర‌చారం చేసేందుకు త్వ‌ర‌లోనే రాబోతున్నాట‌. అలాగే సీఎం జ‌గ‌న్‌పై కూడా పృథ్వీ విమ‌ర్శ‌లు చేసారు. అయితే దీనిపై వైసీపీ నాయ‌కులు స్పందించారు.  ఉత్తరాంద్ర లో వైసీపీ గెలవడం పక్కా అని,  తాను చెప్పినట్లు అంట్లు తోమాడానికి గిన్నెలు కూడా రెడీగా ఉన్నాయని వైసీపీ నాయకులు అంటున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: Apr 26, 2024 7:03PM

జేడీ లక్ష్మీనారాయణని ఎవరు హత్య చేయాలనుకుంటున్నారు?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన రాజకీయ ఉత్కంఠ, టెన్షన్ భరిత వాతావరణం చాలదన్నట్టుగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అగ్నిలో ఆజ్యం పోశారు. జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించి, విశాఖ ఉత్తర స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయన పార్టీకి ఎన్నికల కమిషన్ టార్చ్ లైట్ గుర్తును కేటాయించింది. లక్ష్మీనారాయణ గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వణుకుపుట్టేలా వున్నాయి. విశాఖపట్టణంలో పోటీ చేస్తున్న తనను చంపడానికి కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. తనకు ప్రాణహాని వుంది కాబట్టి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. జేడీ లక్ష్మీనారాయణ తనకు ప్రాణహాని వుందని అన్నారు తప్ప, తనకు ఎవరి ద్వారా ప్రాణహాని వుందో చెప్పడం లేదు. ఆయన ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆరోపణలు చేశారో కూడా అర్థం కాకుండా వుంది.  గతంలో జగన్‌ని జైలుకు పంపిన సీబీఐ మాజీ అధికారి లక్స్మీనారాయణ. అప్పటి నుంచి ఆయనకు ఒక హీరో వర్షిప్ వచ్చింది. తమ నాయకుడి చేత చిప్పకూడా తినిపించారు కాబట్టి వైసీపీ మూకలకు ఆయన మీద కోసం వుంటుంది కాబట్టి వారు హత్యాయత్నం చేసే అవకాశం వుందా అనే అనుమాలు కలగడం సహజం. అయితే జేడీ ఆ పరిస్థితి నుంచి ఏనాడో బయటపడిపోయారు. ఆమధ్య జగన్ ప్రభుత్వాన్ని, జగన్ బుర్రలోంచి ఊడిపడ్డ పరమ శుద్ధ దండగ వాలంటీర్ వ్యవస్థని ఆకాశానికి ఎత్తేయడం ద్వారా ఆయన వైసీపీ వర్గాలకు అస్మదీయుడిగా మారారు. మరి ఇప్పుడు  ఆయన్ని చంపాల్సిన అవసరం ఎవరికి వుంది? నన్ను హత్య చేయాలని చూస్తున్నారు. రక్షణ కల్పించడం అని కాకుండా, మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆయన తనను ఎవరు చంపాలని అనుకుంటున్నారో క్లియర్‌గా బయట పెట్టాలి. అంతే తప్ప అర్ధోక్తిలో స్టేట్‌మెంట్లు ఇచ్చి జనాల్లో లేనిపోని అనుమానాలు కలిగేలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు.
Publish Date: Apr 26, 2024 6:43PM

వంశీకి దింపుడు కళ్లెం ఆశకూడా మిగల్లేదుగా?

 వల్లభనేని వంశీ  నామినేషన్ దాఖలు చేసిన రోజునే ఓటమిని అంగీకరించేశారా? అంటే పరిశీలకలు ఔననే అంటున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించడం ద్వారా తనకు గెలుపు ఆశలు ఆవిరి అయిపోయాయని చెప్పకనే చెప్పేశారు.  అలా చెప్పేస్తూనే ఏదో ఓ మేరకు సానుభూతి ఓట్లను రాబట్టుకోవడానికి చివరి ప్రయత్నం కూడా చేశారు. గన్నవరం నుంచి ఇక తాను పోటీ చేయనని చెప్పిన వల్లభనేని వంశీ.. వచ్చే ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి దుట్టారామచంద్రరావు కుమార్తె పోటీ చేస్తారనీ, తాను ఆమెకు మద్దతు ఇస్తానని చెప్పారు. ఇదంతా ఆయన ఎన్నికల నిమినేషన్ ర్యాలీ వెలవెలబోయిన తరువాత మీడియాతో మాట్లాడుతూ వంశీ పలికిన పలుకులు.  దుట్టారామచంద్రరావు కుమార్తెకు వచ్చే ఎన్నికలలో మద్దతు ఇస్తానంటూ వంశీ చెప్పడం వెనుక ఈ ఎన్నికలో దుట్టా వర్గం కనీసం ఇప్పటికైనా తనకు మద్దతుగా చురుగ్గా పని చేస్తుందన్న చివరి ఆశ ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే వైసీపీలో వంశీకి మద్దతు కరవైంది. తెలుగుదేశం పార్టీలో ఉండగా వంశీ అనుచరులుగా ఉన్నవారిలో 90 శాతం మందికి పైగా ఆయన తెలుగుదేశం వీడగానే ఆయనకు దూరం అయ్యారు. ఇక వైసీపీ నుంచి తెలుగుదేశం గూటికి చేరి గన్నవరం తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు వెంట ఆయన అనుచరవర్గమంతా టీడీపీ పంచన చేరిపోయింది. ఇక నియోజకవర్గంలో బలమైన దుట్టా రామచంద్రరావు వంశీకి మద్దతుగా పని చేయడానికి ససేమిరా అంటున్నారు.  ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి వంశీ చేసినదేమీలేదన్న ఆగ్రహం నియోజకవర్గ ప్రజలలో బలంగా కనిపిస్తోంది.   అది వంశీ నామినేషన్ ర్యాలీలో ప్రస్ఫుటంగా కనిపించింది. తీసుకువచ్చిన కూలి జనం కూడా మధ్యలోనే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయారు. అదే తెలుగుదేశం అభ్యర్థిగా యార్లగడ్డ నామినేషన్ ర్యాలీ కళకళలాడింది. భారీ జనసందోహంతో  జైజై ధ్వానాలతో ఆ ర్యాలీ సాగింది. జనం స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో  వంశీకి పరిస్థితి అర్ధమైంది.  దుట్టాను శరణుజొచ్చారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేయను.. మీ కుమార్తెకే మద్దతు ఇస్తానంటూ బతిమలాడుతున్నారు. అయితే ఇప్పటికే పరిస్థితి చేయిజారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  దుట్టా మెత్తబడినా ఆయన వర్గం మాత్రం వంశీకోసం పని చేసే పరిస్థితి లేదని సోదాహరణంగా వివరిస్తున్నారు.  మొత్తం మీద వంశీకి గెలుపుపై దింపుడు కళ్లెం ఆశకూడా మిగలలేదని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. 
Publish Date: Apr 26, 2024 5:36PM

జగన్ మీద హైపర్ ఆది వేసిన పంచ్‌ల లిస్టు!

జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కమెడియన్ హైపర్ ఆది ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా హైపర్ ఆది వేస్తున్న పంచ్‌లు అదరిపోతున్నాయి. ఆది స్పీచ్‌లకు ప్రజల నుంచి విశేష ప్రతిస్పందన లభిస్తోంది. ఇదిగో హైపర్ ఆది జగన్ బ్యాచ్ మీద వేస్తున్న పంచ్‌ల లిస్టు.. 1. కూటమిని చూసి వైసీపీ వాళ్ళు భయపడిపోతున్నారు. కానీ, పైకి మాత్రం సింహం సింగిల్‌గా వస్తుంది అంటున్నారు. మరి 2014లో కూడా సింహం సింగిల్‌గా వచ్చింది కదా.. మరి ఎందుకు ఓడిపోయింది? ఈసారి కూడా అదే కూటమి ఏర్పడింది.. ఈసారి కూడా కూటమికి అదే విజయం.. వైసీపీ అదే ఓటమి దక్కుతుంది. 2. షూటింగ్‌లన్నీ ఆపుకుని ప్రచారానికి వచ్చాను.. అక్కడ షూటింగ్‌లు లేకపోయినా.. ఇక్కడ కూటమికి వ్యతిరేకంగా వుండే వాళ్ళని మాటలతో షూట్ చేయడం కంటిన్యూ అవుతుంది. 3. కమెడియన్ ప్రచారానికి వచ్చాడని వైసీపీ వాళ్ళు అంటున్నారు.. నేను ప్రొఫెషనల్‌గానే కమెడియన్‌ని.. వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్‌ని కాదు. 4. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు అంటూ వైసీపీ వాళ్ళు ఊదరగొడుతున్నారు. రెండు చోట్ల ఓడిపోయినా ఎంతోమంది కష్టాన్ని తీర్చాడు.. అదే ఆయన గెలిస్తే, ప్రజల కష్టం కాంపౌండ్ దాటకుండా చూసుకుంటాడు. 5. రికార్డులు కొల్లగొట్టడానికో, ఆస్తులు కూడబెట్టుకోవడానికో సినిమాలను ఒప్పుకునే హీరోలను చూసి వుంటాడు.. కానీ, కౌలు రైతుల కష్టాలు తీర్చడానికి సినిమా ఒప్పుకున్న హీరో పవన్ కళ్యాణ్. 6. ఆయన ప్రెజెంట్ ఆస్తి ఎంత వుంటుందో తెలుసా? నాకు తెలిసి ఈ స్టేజీ మీద వున్న నాయకుల ఆస్తికంటే తక్కువే వుంటుంది. ఎందుకంటే, వచ్చింది వచ్చినట్టు పంచుకుంటూ వెళ్ళడమే తప్ప, డబ్బులు పెంచుకుంటూ వెళ్ళే మనస్తత్వం ఆయనకి లేదు. 7. వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్‌ని తిట్టడానికి రెడీగా వుంటారు. వాళ్ళకి పవన్ కళ్యాణ్‌ని తిట్టే శాఖ అని పేరు పెట్టుకుంటే సరిపోతుంది. 8. వారాహి బండి యాత్ర ఆపేస్తారా? ఆయనకి తిక్కరేగితే పాదయాత్ర చేస్తాడు.. అప్పుడు మీ పని కాశీ యాత్రే. 9. పవన్ కళ్యాణ్ జనాల పక్షాన వున్నాడు కాబట్టే జనసేనానిగా వున్నాడు. మీరు ఇలాగే విసిగిస్తే ‘వీరమల్లు’ బయటకి వస్తాడు.. జాగ్రత్త. 10. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ కాదురా.. ప్రేమకు లొంగే స్టార్.. 11. దత్తపుత్రుడు.. దత్తపుత్రుడు అన్న నోళ్ళతోనే అంజనీ పుత్రుడు అనిపించుకునే రోజు వస్తుంది. 12. మీ పాపులారిటీ కోసం ఆయన పర్సనాలిటీని దెబ్బతీసేలా మాట్లాడారా? ఈసారి జనసేన కొట్టే దెబ్బకి మీ అబ్బ గుర్తొస్తాడు. 13. 151 మంది ఒక్కడికి భయపడిపోతున్నారు. 14. పవన్ కళ్యాణ్‌ది నిలకడలేని రాజకీయం కాదు.. నిఖార్సైన రాజకీయం.
Publish Date: Apr 26, 2024 4:55PM

హిందూపురం తెలుగుదేశం అభ్యర్థిగా బాలయ్య భార్య నామినేషన్!

అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇప్పటికే తన నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ ముంగిట నిలిచిన బాలకృష్ణకు పోటీగా, అదే పార్టీ నుంచి నందమూరి వసుంధర నామినేషన్ దాఖలు చేయడం ఏమిటి అనుకుంటున్నారా?  ఉండండి అక్కడికే వస్తున్నాం. ఆమె తెలుగుదేశం డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇలా డమ్మి అభ్యర్థుల చేత నామినేషన్ దాఖలు చేయించడం సహజమే. సాధారణంగా ఆ డమ్మి అభ్యర్థులు ఆయా అభ్యర్థుల కుటుంబీకులే అయి ఉంటారు. ఏదైనా సాంకేతిక కారణాల చేత నిమినేషన్ తిరస్కరణకు గురైతే బ్యాక్ అప్ గా ఉండేందుకు ఇలా డమ్మి క్యాండిడేట్లు నామినేషన్లు దాఖలు చేస్తారు. అయితే బాలకృష్ణ ఇలా బ్యాక్ అప్ కోసం నామినేషన్ దాఖలు చేయించడం ఇదే తొలి సారి. ఈ సారి ఏపీలో నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఏ విధంగానూ రిస్క్ తీసుకోరాదన్న ఉద్దేశంతోనే బాలకృష్ణ డమ్మి అభ్యర్థిగా తన భార్య వసుంధర చేత నామినేషన్ వేయించారని అంటున్నారు. హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి హిందూపురం నియోజకవర్గంలో ఎన్నిక జరిగిన ప్రతిసారీ తెలుగుదేశం పార్టీయే గెలుస్తూ వస్తోంది. జగన్ వేవ్ కొనసాగిన 2019 ఎన్నికలలో కూడా తెలుగుదేశం అభ్యర్థిగా బాలకృష్ణ విజయం సాధించారు. విశేషం ఏమిటంటే 2019 ఎన్నికలలో ఆయనకు 2014 ఎన్నికలలో కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది.  
Publish Date: Apr 26, 2024 4:47PM

ఇక సర్వేలతో పనిలేదు.. వైసీపీ వాళ్ళ ముఖాలు చాలు!

మొన్నటి వరకు నేషనల్ ఛానల్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ పరిస్థితి ఏమిటో తమతమ సర్వేల ద్వారా తెలిపాయి. ఏ ఛానెల్ లేదా సర్వే సంస్థ విడుదల చేసిన సర్వే అయినా ఒకే రిపోర్టు ఇచ్చింది.. ఈసారి ఎన్నికలలో ఏపీలో వైసీపీ ఓడిపోతుంది.. టీడీపీ కూటమి విజయం సాధిస్తుంది. ఇప్పటి వరకు చాలా సర్వేలు విడుదలయ్యాయి. అన్ని సర్వేల ఫలితం ఒకటే.. వైసీపీ ఖేల్ ఖతమ్ అనే. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతోపాటు పార్లమెంట్ స్థానాలను కూడా ఆ పార్టీ భారీగా కోల్పోబోతోందని సర్వేలు తేల్చాయి. ఈ సర్వేలన్నీ దాదాపుగా కోడికత్తి-2 సంఘటనకు ముందు చేసినవే.. ఈ సంఘలనకు ముందు వైసీపీకి 30 వరకు సీట్లు వచ్చే అవకాశం వుందని ఓవరాల్‌‌గా చెప్పాయి. అయితే ఈ సంఘటన తర్వాత జనం ఆలోచనలో ఇంకా బాగా మార్పు వచ్చిందని, ఈ నాటకాన్ని వారు అసహ్యించుకుంటున్న నేపథ్యంలో ముందుగా అనుకున్న సీట్ల కంటే తక్కువ సీట్లు వచ్చే అవకాశం వుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికి సర్వేలకు కామా పడింది. పోలింగ్ పూర్తయిన తర్వాత సర్వేల పరంపర ఎలాగూ కొనసాగుతుంది. మరి ఈ మధ్యకాలంలో సర్వేలు లేకపోతే ఎలా? ఏం పర్లేదు.. సర్వేలు లేకపోయినా వైసీపీ నాయకుల ముఖాలు చూస్తే చాలు.. ఎన్నికల ఫలితాలు ఎలా వుండబోతున్నాయో అర్థమైపోతుంది. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అనే మాటని పెద్దలు ఊరకే అనలేదు. ముందుగా త్వరలో మాజీ కాబోతున్న ముఖ్యమంత్రి జగన్ ముఖం చూడండి.. ఆయన ముఖంలో భూతద్దం పెట్టి వెతికినా ఏ మూలనా కళ అనేది కనిపించడంలేదు. కూటమి ధాటికి ‘ఓటమి’ అనేది ఆయన ముఖంలో క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తోంది. ఇక ఇతర వైసీపీ నాయకుల ముఖాలు చూస్తే, అందరి ముఖాల్లో ఓటమి కళ సెవెన్టీ ఎంఎంలో కనిపిస్తూ వుంటుంది. పాపం అదేంటో, వైసీపీ నాయకులు నోటితో గెలుస్తాం అని చెబుతూ వుంటే, ముఖాలు మాత్రం ఓడిపోతాం అని చెప్పకనే చెబుతున్నాయి. 
Publish Date: Apr 26, 2024 4:05PM

కడప జిల్లాలో వైసీపీ ఓటమికి బాటలు వేసిన జగన్ వ్యాఖ్యలు!

ఓ వైపు ప్రజా వ్యతిరేకత, మరో వైపు చెల్లెళ్ల విమర్శలు, ఇంకో వైపు పార్టీ నుంచి పెరిగిపోతున్న వలసలు, వెరసి ఓటమి భయంతో జగన్ వణికి పోతున్నారా? ఆఫ్రస్ట్రేషన్ లో సొంత చెల్లెలిపైనే అనుచిత వ్యాఖ్యలు చేసి తనకు తానే నష్టం చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ముఖ్యంగా గురువారం (ఏప్రిల్ 25)న పులివెందులలో జగన్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి, స్వయంగా ఆయన ప్రతిష్టకు తీరని నష్టం చేకూర్చాయని విశ్లేషిస్తున్నారు. అడబిడ్డపై జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల సామాన్య జనంలో కూడా ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. సరిగ్గా ఎన్నికల ముందు జగన్ చేసిన ఈ అనుచిత వ్యాఖ్యల ప్రభావం ఒక్క పులివెందుల నియోజకవర్గానికే పరిమితం కాదనీ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతుందని అంటున్నారు. సరిగ్గా ఎన్నికల ముంగిట చెల్లెలి చీర రంగుపై జగన్ చేసిన వ్యాఖ్య జగన్ చేసిన పెద్ద బ్లండర్ గా అభివర్ణిస్తున్నారు.  ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు వైసీపీకి పెట్టని కోట లాంటి ఉమ్మడి కడప జిల్లాలో కూడా వైసీపీ ఓటమికి బాటలు పరిచాయంటున్నారు.  నిజానికి వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో సొంత చెల్లెలు షర్మిల, వివేకా కుమార్తె సునీత గత కొన్నినెలలుగా తనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నా జగన్ ఇప్పటి వరకూ వారికి కౌంటర్ ఇవ్వలేదు. అసలు పట్టించుకోనట్లుగానే ఉన్నారు. వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా షర్మిల, సునీతలపై విమర్శలు చేశారు. వారి వ్యక్తిగత విషయాలపై కూడా కామెంట్లు పెట్టారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ జగన్ మాత్రం ఓ మేరకు సంయమనం పాటించారు. ఇక వైసీపీ, ఆ పార్టీ సోషల్ మీడియా కూడా షర్మిల, సునీతల వ్యాఖ్యలు, విమర్శలపై స్పందించడం మానేసిన తరుణంలో జగన్ తన చెల్లెలి చీర రంగుపై చేసిన వ్యాఖ్యతో  ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. సామాన్య జనం కూడా జగన్ దిగజారి మాట్లాడారని అంటున్నారు. బాహాటంగానే జగన్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. షర్మిలపై జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా స్వయంగా జగన్ కే కాదు పార్టీకి కూడా తీరని నష్టం చేకూర్చే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్న వ్యాఖ్యలకు షర్మిల ఇచ్చిన సమాధానం జగన్ ఇప్పటి వరకూ ఓన్ చేసుకుంటూ వస్తున్న వైఎస్ వారసత్వాన్నే ఆయనకు దూరం చేసేలా ఉందని  అంటున్నారు. ఇంతకీ జగన్ సంయమనం కోల్పోయి సొంత చెల్లెలని కూడా చూడకుండా ఆమె వ్యక్తిత్వాన్నే కించపరిచేలా మాట్లాడడానికి కారణం ఫస్ట్రేషనే అంటున్నారు పరిశీలకులు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా వైఎస్ వివేకా హత్య కేసులో అందరి అనుమానాలూ అవినాష్ రెడ్డిపైనే ఉన్నాయి. సీబీఐ దర్యాప్తు, కోర్టుల్లో విచారణ కూడా ఆ అనుమానాలు కేవలం అనుమానాలు కావనే విధంగానే సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ అవినాష్ ను వెనకేసుకు రావడం,  చెల్లెళ్లపై ఎదురుదాడికి దిగడం, వారిని ప్రత్యర్థులు రాసిచ్చిన స్క్రిప్టు చదువుతున్నారంటూ విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం లేకపోగా ప్రతికూలతే ఎక్కవగా కనిపిస్తోంది.   ఇప్పుడు తాజాగా జగన్ షర్మిల చీర రంగుపై చేసిన వ్యాఖ్యలతో ఇటీవలి కాలంలో పెద్దగా వినిపించని ప్రశ్నలు కూడా సామాన్య జనం నుంచి వినవస్తున్నాయి.  వివేకా హత్య కేసులో విపక్ష నేతగా సిబీఐ విచారణ కోరుతూ వేసిన పిటిషన్ ను జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు ఉపసంహరించుకున్నారు? ఒక వేళ అవినాష్ ఆరోపిస్తున్నట్లు వివేకా హత్యలో సునీత, ఆమె భర్త ప్రమేయం ఉంటే సునీత స్వయంగా సీబీఐ విచారణ కోరుతూ కోర్టు ను ఆశ్రయించి మరీ ఎందుకు సాధించారు. అంటూ జనం చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా పులివెందులలో గురువారం (ఏప్రిల్ 25) నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ చెల్లెలి చీర రంగుపై చేసిన వ్యాఖ్యలు ఆయనకే బూమరాంగ్ అయ్యాయి. ఆ వ్యాఖ్యలు ఎన్నిలకపై తప్పక ప్రభావం చూపుతాయని పరిశీలకులు అంటున్నారు.  
Publish Date: Apr 26, 2024 3:28PM

చెల్లి వాటా చెల్లికి ఇచ్చేయొచ్చు కదా జగన్?!

ఏంటమ్మా జగనూ... మొన్న చెల్లి షర్మిలమ్మ ఎలక్షన్ కమిషన్ దగ్గర అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు చూశాంలే.. నువ్వు చెల్లికి అప్పు ఇచ్చినట్టు వుంది.. కానీ, అది అప్పు కాదని, తనకు ఆస్తిలో వాటాగా రావలసిన చాలా డబ్బులో కొంత డబ్బుని ‘అప్పు’ రూపంలో ఇచ్చావంటా? ఈ విషయం మాకెలా తెలిసిందని ఆశ్చర్యపోకు.. చెల్లెమ్మ చేతికి మైకు ఇస్తే చాలు ముందుగా తనకు రావలసిన తన ఆస్తి గురించే మాట్లాడుతోంది మరి. ఆమె అలా రోడ్డు మీదకి వచ్చి తన ఆస్తి గురించి లబోదిబో అంటోంది కాబట్టి, ఇష్యూ పబ్లిక్‌లోకి వచ్చేసింది కాబట్టి మీ కుటుంబ ఆస్తి వివరాల గురించి మాట్లాడే అవకాశం అందరికీ మీరే ఇచ్చినట్టు అయింది. ఆ మహానేత, నాన్నగారు పోయిన తర్వాత ఆయన ‘కష్టపడి’ సంపాదించిన మొత్తం అన్నాచెల్లెళ్ళు మీరిద్దరూ పంచుకోవాలి కదా.. ఆయన కీర్తిశేషుడై చాలా సంవత్సరాలైంది. ఇంతవరకు ఆస్తుల పెంపకం ప్రస్తావన తేకుండా మొత్తం నీ దగ్గరే వుంచేసుకుంటే ఎలా జగన్ బ్రో? పాపం ఆయన ఊహించని విధంగా అకస్మాత్తుగా చనిపోయారు. ఒకవేళ ఆయనే బతికుంటే, చక్కగా ఆస్తిమొత్తాన్నీ ఇద్దరికీ సమానంగా పంచి ఇచ్చి వుండేవారు కదా? తండ్రి తర్వాత తండ్రి లాంటి నువ్వు పాపం నీ చెల్లికి తండ్రి లేని లోటు తీర్చి ఆస్తి పంచి ఇస్తే ఇప్పుడు పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా. ఆస్తి వస్తుంది, పోతుంది.. ఆత్మీయతలు, అనురాగాలు పోతే తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. అందుకని ఒక్కగానొక్క చెల్లిని ఏడిపించకుండా ఆమెకి ఇవ్వాల్సిన ఆస్తి ఆమెకి ఇస్తే మీ అనురాగాలు కొనసాగుతాయి.. అంతేకాదు.. పైన వున్న మీ నాన్న వైఎస్సార్, తాత రాజారెడ్డి, బాబాయ్ వివేకా కూడా చాలా సంతోషిస్తారు. అయినా అంత డబ్బు ఏం చేసుకుంటావ్ జగన్? మీ తాత, మీ నాన్న అంత సంపాదించి ఏం చేసుకున్నారు? ఒక్క రూపాయి అయినా తీసుకెళ్ళారా? ఎవరైనా అంతే, మొన్న కంటికి పైన తగిలిన రాయి ఏ కణతకో తగిలి వుంటే పరిస్థితి ఏమయ్యేది? అందుకని, ఇప్పటి వరకు అయిన రచ్చ చాలు.. ఇక ఈ రచ్చకి ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన బాధ్యత నీదే.
Publish Date: Apr 26, 2024 2:52PM