బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ
బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ

పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ సుజన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. తాను నిర్దోషినని, తనపై నమోదైన కేసు రాజకీయ ప్రేరేపితమైందని, దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరించానని భగీరథ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. గత నెల 16న మైనర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల బీబీఎం బ్యాక్‌లాగ్స్ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు ఈ నెల 20న మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన భగీరథ్, పరీక్షలు పూర్తయిన అనంతరం జూన్ 25న తిరిగి జైలుకు వెళ్లారు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, పోక్సో కేసుల్లో అరెస్టైన వ్యక్తులు సాధారణంగా 45 రోజుల తర్వాత బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మే 16 నుంచి జూన్ 30 నాటికి 45 రోజుల వ్యవధి పూర్తికావడంతో భగీరథ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Publish Date: Jun 30, 2026 10:47PM
త్రిష పొలిటికల్ ఎంట్రీపై  ఊహించని ట్విస్ట్!
త్రిష పొలిటికల్ ఎంట్రీపై ఊహించని ట్విస్ట్!

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే సాగుతుంటాయి. సినిమా రంగానికి, రాజకీయాలకు అక్కడ విడదీయరాని బంధం ఉంది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్, అందాల నటి త్రిష క్రిష్ణన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెను సంచలనంగా మారింది. తమిళ సూపర్ స్టార్, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ రాజకీయ ప్రస్థానంలో త్రిష కీలక పాత్ర పోషించబోతున్నారనే ఊహాగానాలు గత కొంతకాలంగా గట్టిగా వినిపిస్తున్న తరుణంలో, తాజాగా దీనిపై ఒక కీలకమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు సోషల్ మీడియాను సైతం ఊపేస్తోంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం విజయ్ రెండు స్థానాల నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే, నిబంధనల ప్రకారం ఏదో ఒక స్థానాన్ని మాత్రమే ఉంచుకోవాల్సి ఉండటంతో, ఆయన తాను గెలిచిన 'తిరుచ్చి ఈస్ట్' నియోజకవర్గ శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. విజయ్ తప్పుకోవడంతో ఖాళీ అయిన ఈ స్థానం నుంచి ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే మొదట త్రిష పేరు తెరపైకి వచ్చింది. సీఎం విజయ్ ఖాళీ చేసిన ప్రతిష్టాత్మక స్థానం నుంచే ఆమె ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతారని అందరూ భావించారు. అయితే మధ్యలో ఈ కథలోకి ఊహించని మరో ట్విస్ట్ వచ్చింది. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఈ 'తిరుచ్చి ఈస్ట్' స్థానం నుండి టీవీకే పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. దీంతో రాజకీయ విశ్లేషకులు, అభిమానుల దృష్టి ఒక్కసారిగా లారెన్స్ వైపు మళ్లింది. కానీ, తాజాగా ఈ వివాదంపై రాఘవ లారెన్స్ స్వయంగా స్పందించి సున్నితంగా క్లారిటీ ఇచ్చారు. సీఎం విజయ్ పార్టీ (TVK) కోసం మొదటి నుంచి ఎంతో కష్టపడి, పార్టీ జెండా మోసిన నిజమైన కార్యకర్తలకు ఆ సీటు దక్కడం న్యాయమని, కానీ తాను మధ్యలో వచ్చి ఆ స్థానంలో పోటీ చేయడం రాజకీయ ధర్మం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తాను ఈ ఉపఎన్నిక బరి నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రాఘవ లారెన్స్ ఈ రేసు నుండి తప్పుకోవడంతో, ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ చూపు మళ్లీ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ త్రిషపై పడింది. విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన 'తిరుచ్చి ఈస్ట్' ఉపఎన్నిక బరిలో టీవీకే పార్టీ అభ్యర్థిగా త్రిషనే రంగంలోకి దింపే అవకాశాలు నూటికి నూరు శాతం ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు బలంగా అభిప్రాయపడుతున్నారు. విజయ్, త్రిషల కాంబినేషన్‌కు వెండితెరపై ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అదే క్రేజ్‌ను రాజకీయ వేదికపై కూడా ఉపయోగించి, పార్టీని మరింత బలోపేతం చేయాలని విజయ్ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఈ క్రేజీ పొలిటికల్ ఎంట్రీపై త్రిష లేదా తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Publish Date: Jun 30, 2026 10:28PM
ఆంధ్ర తీరంలో ఇంత సీక్రేట్ ఉందా.. అపార ఖనిజ సంపదపై ప్రత్యేక విశ్లేషణ!
ఆంధ్ర తీరంలో ఇంత సీక్రేట్ ఉందా.. అపార ఖనిజ సంపదపై ప్రత్యేక విశ్లేషణ!

ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీరప్రాంతం అపారమైన సహజ వనరులకు, అరుదైన ఖనిజాలకు నిలయంగా మారింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీరంలో దాగి ఉన్న బీచ్ శాండ్ (తీరప్రాంత ఇసుక) సంపద విలువ అక్షరాలా రెండు లక్షల కోట్ల రూపాయల పైమాటే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంతటి భారీ ఆర్థిక వనరులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నప్పటికీ, స్థానిక ప్రజలకు మాత్రం ఆశించిన స్థాయిలో ఉపాధి లభించడం లేదు సరికదా, ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు కొనసాగడం గమనార్హం. ఈ అపారమైన ఖనిజ సంపద, వాటి ప్రాముఖ్యత మరియు మైనింగ్ రంగంలో జరుగుతున్న పరిణామాలపై ఈ అంశాలపై తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ మైనింగ్ రంగ నిపుణులు డాక్టర్ వి.డి. రాజగోపాల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలక పాత్ర పోషించే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (అరుదైన ఖనిజాలు), ఇల్మినైట్, గార్నెట్ వంటి వనరులు ఆంధ్రప్రదేశ్ తీరంలో, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని డొంకూరు, బారువ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా లభ్యమవుతున్నాయని ఆయన తెలిపారు. దాదాపు 323 మిలియన్ టన్నుల మేర ఉన్న ఈ హెవీ మినరల్స్ భవిష్యత్తు సాంకేతికతకు గుండెకాయ వంటివని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనం రోజువారీ ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌ల నుండి మొదలుకొని ఎలక్ట్రిక్ కార్లు, శాటిలైట్లు, యుద్ధ విమానాలు, మరియు క్షిపణుల (మిసైల్స్) తయారీ వరకు ఈ అరుదైన లోహాల అవసరం ఎంతైనా ఉంది. ఇంతటి అంతర్జాతీయ డిమాండ్ ఉన్న సంపద మన సొంత గడ్డపైనే ఉన్నా, దానిని సక్రమంగా వినియోగించుకోవడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మైనింగ్ ప్రక్రియ మరియు లీజుల కేటాయింపులపై గతంలో అనేక వివాదాలు రేగాయి. కేవలం కాగితాలకే పరిమితమైన కంపెనీలకు, ఎలాంటి ముందస్తు అనుభవం లేని సంస్థలకు ఈ నిధులను కట్టబెట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. 2022లో ఏర్పాటైన ఒక సంస్థకు, కేవలం ఏడాది కాలంలోనే నిబంధనలను ఉల్లంఘించి మైనింగ్ అనుమతులు ఇవ్వడం వెనుక ఉన్న రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. సాధారణంగా ఇలాంటి విలువైన ఖనిజ బ్లాకులను ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ) వంటి ప్రభుత్వ రంగ సంస్థల ఆధీనంలోకి తీసుకుని, భూసేకరణ పూర్తి చేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తర్వాతే పారదర్శక పద్ధతిలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి వీటిని కేటాయించడం ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయంతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కానీ వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉండటం పట్ల ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ పరంగా కూడా తీరప్రాంత మైనింగ్ తీవ్ర సవాళ్లను విసురుతోంది. మైనింగ్ జరిగే ప్రాంతాలలో స్థానిక జీవ వైవిధ్యానికి నష్టం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఖనిజాలను వేరుచేసే క్రమంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి, ఈ అరుదైన భూగర్భ సంపద కేవలం ప్రైవేటు వ్యక్తుల లేదా కొన్ని రాజకీయ శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. పారదర్శకమైన విధానాల ద్వారా తీరప్రాంత ఖనిజ సంపదను వినియోగించుకుంటే, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం శాశ్వతంగా తొలగిపోయి ఏపీ ఆర్థిక రథచక్రం మరింత వేగంగా దూసుకుపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించవచ్చు.

Publish Date: Jun 30, 2026 10:13PM
అయోధ్య ట్రస్ట్‌లో అవినీతి?.. రాజకీయ ప్రయోజనాల కోసమే నిధుల మళ్లింపా!
అయోధ్య ట్రస్ట్‌లో అవినీతి?.. రాజకీయ ప్రయోజనాల కోసమే నిధుల మళ్లింపా!

అయోధ్య రామాలయం, విరాళాల వివాదం, రాముడి నిధుల దుర్వినియోగం, సిట్ విచారణ, యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని ప్రతిష్టాత్మక రామమందిర నిర్మాణ విరాళాల సేకరణలో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రామభక్తులు ఎంతో నమ్మకంతో సమర్పించిన కానుకలు, విరాళాలు దుర్వినియోగం అయ్యాయనే వార్తలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఈ వివాదంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పలు అంశాలపై జర్నలిస్ట్ గోపి మరో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న బంగారం, నగదు, ఇతర విలువైన కానుకలకు సరైన రికార్డులు కానీ, రశీదులు కానీ నిర్వహించడం లేదని ఆయన ఆరోపించారు. తిరుమల వంటి ప్రముఖ క్షేత్రాల్లో ప్రతిరోజూ పారదర్శకంగా ఆడిటింగ్ జరుగుతుందని, కానీ అయోధ్య ట్రస్ట్‌లో అటువంటి యంత్రాంగం లేకపోవడమే ఈ అవినీతికి కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు, అధికార పక్షానికి చెందిన ఒక ఎంపీ కూడా ఈ నిధుల దుర్వినియోగంపై సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా వేడిని పెంచింది. ట్రస్ట్‌లో లూజ్ మెకానిజం ఉండటం వల్లే నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉందని, ఇందులో చాలా పెద్ద తలకాయల ప్రమేయం కూడా ఉందంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్‌తో పాటు మరో ముఖ్య ప్రతినిధి శుక్లాను పదవుల నుంచి తప్పుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. దీనితో వారు తమ పదవులకు రాజీనామా చేయగా, ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సిట్ అధికారులు జరిపిన సోదాల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ట్రస్ట్‌లోని కొందరు ఉద్యోగుల ఇళ్లపై జరిగిన దాడుల్లో భారీగా నగదు లభ్యమైంది. గతంలో అద్దె ఇళ్లలో నివసించిన సాధారణ ఉద్యోగులు సైతం, ట్రస్ట్ కార్యక్రమాల్లో చేరిన అతి తక్కువ కాలంలోనే పది కోట్ల రూపాయల విలువైన బంగ్లాలు, భారీ ఆస్తులను ఎలా సంపాదించారనే కోణంలో అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.ఈ వ్యవహారంపై తెలంగాణకు చెందిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. ఇది కేవలం ఉత్తరప్రదేశ్‌కు సంబంధించిన అంశం కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిధులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మతాన్ని రాజకీయాల కోసం వాడుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. అయితే తాము ఎలాంటి విమర్శలకు వెనకాడబోమని, దర్యాప్తులో నిజా నిజాలు తేలేవరకు నిందితులు జైల్లోనే ఉంటారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. భక్తుల కష్టార్జితమైన ప్రతి రూపాయికి పూర్తి జవాబుదారీతనం ఉండాలని, ట్రస్ట్ ప్రారంభమైన తొలి రోజు నుంచి ఇప్పటివరకు వచ్చిన నిధులపై సమగ్ర పబ్లిక్ ఆడిటింగ్ నిర్వహించాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. భవిష్యత్తులో నూతన బోర్డు ఏర్పాటుతోనైనా పారదర్శకత వస్తుందా లేదా అనేది సిట్ నివేదిక తర్వాతే తేలనుంది. అంశాలపై పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించవచ్చు.

Publish Date: Jun 30, 2026 9:26PM
ఊరూరా బెల్ట్ షాపులు తెచ్చి కేసీఆర్ తాగుడు కల్చర్ పెంచారు :  సీఎం రేవంత్
ఊరూరా బెల్ట్ షాపులు తెచ్చి కేసీఆర్ తాగుడు కల్చర్ పెంచారు : సీఎం రేవంత్

శిల్పాకళా వేదికగా రైతు భరోసా నిధులు విడుదల... తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శిల్పాకళా వేదిక వేదికగా రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ అనుసరించిన విధానాలపై రేవంత్ రెడ్డి తీవ్రమైన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, ఊరూరా బెల్ట్ షాపులు తెరిపించి కేవలం తాగుడు సంస్కృతిని మాత్రమే ప్రోత్సహించారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజున దాదాపు 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,482.02 కోట్ల ఆర్థిక సహాయాన్ని నేరుగా జమ చేశారు. ఒక ఎకరం లోపు ఉన్న 14.65 లక్షల మంది రైతులకు, అలాగే రెండు ఎకరాల లోపు భూమి కలిగిన 26.72 లక్షల మంది రైతులకు వర్షాకాలం సాగు పనులు ప్రారంభమయ్యే సమయానికే ఈ పెట్టుబడి సాయాన్ని అందించినట్లు సీఎం వివరించారు. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాన్ని ప్రస్తావిస్తూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన 19 మంది ముఖ్యమంత్రులు చేసిన మొత్తం అప్పు కేవలం రూ.60 వేల కోట్లు మాత్రమేనని, కానీ కేసీఆర్ ఒంటరిగానే తెలంగాణను రూ.8.11 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేశారని సీఎం ఆరోపించారు. తాము అధికారంలోకి రాకముందు ఆరు లక్షల కోట్ల అప్పులు ఉంటాయని భావించామని, కానీ తీరా బాధ్యతలు చేపట్టాక లెక్కలు చూస్తే కొండలంత అప్పులు బయటపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి పాఠశాల విద్యార్థుల భోజన బిల్లులు, సర్పంచుల నిధులు కూడా చెల్లించకుండా బకాయిలు పెట్టారని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని బీఆర్ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయల కమీషన్ల కోసమే హడావుడిగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని, ఆ ప్రాజెక్టు కేవలం మూడేళ్లకే 'కూలేశ్వరం'గా మారిందని విమర్శించారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా, బోర్ల కింద రైతులు పండించిన పంటను కూడా తమ ఖాతాలో వేసుకుని గత పాలకులు మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రస్తుత కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ వరి సాగులో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు. గత పదేళ్లలో దళితులకు మూడెకరాల భూమి, నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వడంలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని సీఎం ఎద్దేవా చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 25 లక్షల మంది రైతులకు రూ.22,600 కోట్ల మేర రుణమాఫీని విజయవంతంగా పూర్తి చేసిందని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పేటెంట్ హక్కని, సాగుకు నిరంతర విద్యుత్ కోసం ఇప్పటికే రూ.36 వేల కోట్లు చెల్లించామని ఆయన వెల్లడించారు. తాము తప్పులు చేసి ఫామ్‌హౌస్‌లో దాక్కోవడం లేదని, కేసీఆర్ చేసిన పాపాలను, అప్పులను తీరుస్తూ ప్రజల మధ్యే ధైర్యంగా తిరుగుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రైతు సంక్షేమమే ధ్యేయంగా మరిన్ని పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా అర్హులకు అందుతుండటంతో లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Publish Date: Jun 30, 2026 8:59PM
వికసిత భారత్ సాధనలో యువశక్తే కీలకం :  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
వికసిత భారత్ సాధనలో యువశక్తే కీలకం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

దేశాన్ని వికసిత భారత్‌గా మార్చే అద్భుత లక్ష్య సాధనలో నవతరానికి చెందిన యువతదే అత్యంత కీలకమైన పాత్ర అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. విద్య, స్వీయ సాధికారతలే యువతకు శ్రీరామరక్ష అని ఆమె పేర్కొన్నారు. విశాఖపట్నంలో మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) ప్రథమ స్నాతకోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ చారిత్రాత్మక వేడుకలో పట్టాలు అందుకున్న విద్యార్థి లోకాన్ని ఉద్దేశించి ప్రథమ పౌరురాలు స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. సాంకేతిక రంగంలో వస్తున్న సమూల మార్పులను అందిపుచ్చుకుంటూనే, మన మూలాలు మరిచిపోకుండా గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను, గొప్ప వారసత్వాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. తొలి స్నాతకోత్సవంలో భాగంగా విద్యార్థులకు, శ్రమించిన అధ్యాపక బృందానికి, చేదోడుగా నిలిచిన తల్లిదండ్రులకు ఆమె హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విద్యా సంస్థ సాధించిన ప్రగతిపై రాష్ట్రపతి ముర్ము హర్షం వ్యక్తం చేస్తూ.. ఇక్కడ డిగ్రీలు పొందిన వారిలో సుమారు 40 శాతం మంది, బంగారు పతకాలు కైవసం చేసుకున్న వారిలో ఏకంగా 70 శాతం మంది విద్యార్థినులే ఉండటం ఒక అద్భుత పరిణామమన్నారు. ఈ ఫలితాలు దేశంలో మహిళా సాధికారతకు, విద్యా రంగంలో లింగ సమానత్వానికి అద్దం పడుతున్నాయని కొనియాడారు. గిరిజన విశ్వవిద్యాలయాల ప్రాధాన్యతను వివరిస్తూ.. ఇవి కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే సాధారణ విద్యా కేంద్రాలుగా మాత్రమే మిగిలిపోకూడదని హితవు పలికారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు ఆత్మవిశ్వాసం కల్పించి, వారిలో సరికొత్త నాయకత్వ లక్షణాలను పెంపొందించే అద్భుత కేంద్రాలుగా రూపాంతరం చెందాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఆరోగ్యం, ఉపాధి, అటవీ హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై ఇటువంటి సంస్థలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. విద్యార్థి జీవితంలో స్నాతకోత్సవం అనేది ఒక కీలకమైన మైలురాయి అని, ఇది కేవలం సంబరాల రోజు మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఒక దృఢ సంకల్పం తీసుకునే రోజు కావాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. మారుతున్న ప్రపంచంలో నెగ్గాలంటే పుస్తకాల్లోని జ్ఞానంతో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎంతో అవసరమని హితవు పలికారు. గిరిజన ప్రాంతాల్లో ఉండే నైపుణ్యాలు, అటవీ ఉత్పత్తులు, సిరిధాన్యాలు, ఆయుర్వేద మూలికలను ప్రోత్సహించేలా పరిశోధనలు జరగాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర గిరిజన గూడాల అభ్యున్నతి కొరకు వర్సిటీ ఏర్పాటు చేసిన 'సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్' పనితీరును ఆమె ప్రశంసించారు. పర్యావరణ మార్పులు, ఆహార భద్రత వంటి సమకాలీన అంశాలపై విశ్వవిద్యాలయం దృష్టి సారించడం ముదావహమన్నారు. ప్రథమ పౌరురాలి పర్యటన మరియు ఆమె అందించిన సందేశంతో గిరిజన వర్సిటీ విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహం వెల్లివిరిసింది. రాబోయే కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతితో పాటు సమసమాజ స్థాపనకు, దేశాభివృద్ధికి ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఒక దిక్సూచిలా మారుతుందని ఇటు విద్యావేత్తలు, అటు స్థానిక ప్రజలు గట్టిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Publish Date: Jun 30, 2026 8:41PM
జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక భేటీ
జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రిమండలి అత్యవసరంగా సమావేశం కానుంది. జూలై 2వ తేదీన మధ్యాహ్నం 3:00 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని 6వ అంతస్తులో ఉన్న కేబినెట్ హాల్‌లో ఈ ప్రతిష్టాత్మక 34వ కేబినెట్ భేటీ జరగబోతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పలు కీలక సామాజిక, ఆర్థిక విద్యాపరమైన సవాళ్లపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించి, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జూన్ 30న ఈ సమావేశానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో సచివాలయంలో ఒక్కసారిగా పరిపాలనా పరమైన హడావుడి ఊపందుకుంది. ఈ కీలక సమావేశానికి సంబంధించి ప్రభుత్వం అన్ని శాఖల స్పెషల్ చీఫ్ సెక్రెటరీలు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు, మరియు సెక్రెటరీలకు గట్టి ఆదేశాలు జారీ చేసింది. జూలై 1వ తేదీ మధ్యాహ్నం 1:00 గంటల లోపు తమ తమ శాఖలకు సంబంధించిన అజెండా అంశాలను తెలుగు అనువాదంతో సహా సాధారణ పరిపాలన కేబినెట్ విభాగానికి ఖచ్చితంగా పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఏ శాఖలోనైనా ఎలాంటి అజెండా అంశాలు లేకపోయినా.. 'నిల్' (NIL) రిపోర్టునైనా నిర్ణీత సమయానికి సబ్మిట్ చేయాల్సి ఉంటుందని సిఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా, కేబినెట్ భేటీ ముగిసే వరకు ప్రభుత్వ ఉన్నతాధికారులు, కార్యదర్శులందరూ కచ్చితంగా తమ హెడ్‌క్వార్టర్స్‌ (కార్యాలయాల) లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రొటోకాల్ డైరెక్టర్, హార్టికల్చర్ డైరెక్టర్, ట్రాన్స్‌లేషన్స్ డైరెక్టర్, మరియు టీజీటీఎస్ (TGTS) యూనిట్ మేనేజర్లు సమావేశానికి అవసరమైన ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఈ కేబినెట్ సమావేశంలో చర్చకు రానున్న అంశాలు రాష్ట్ర ప్రజల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా జూన్ 6న జారీ చేసిన వివాదాస్పద జీవో నెంబర్ 9 (GO 9) పై కేబినెట్ సమీక్ష జరపనుంది. విద్యార్థుల ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) మోడల్‌లోకి మారుస్తూ ఈ జీవోను తెచ్చారు. అయితే 2021 నుండి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన రూ. 10,000 కోట్లకు పైగా బకాయిలను చెల్లించకుండా, కొత్త విధానాన్ని అమలు చేయడంపై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై హైకోర్టు మధ్యంతర స్టే విధించడంతో, రాబోయే విద్యా సంవత్సరానికి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆగస్టు 15 నాటికి నిధులు విడుదల చేసేలా కొత్త పాలసీపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుండి ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న కొత్త గ్రామీణ ఉపాధి హామీ చట్టం 'వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (VB-G RAM G)' పై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పాత ఎంజీఎన్ఆర్ఈజీఏ (MGNREGA) స్థానంలో రాబోతున్న ఈ కొత్త చట్టం వల్ల గ్రామీణ పేదల హక్కులు దెబ్బతింటాయని, రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇరిగేషన్ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్-కమిటీ ఇప్పటికే కర్ణాటక, కేరళ వంటి బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై చర్చలు జరిపింది. దీనిపై కూడా జూలై 2న రేవంత్ కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. అలాగే, మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు మొదటి దశ కింద హిమాయత్ సాగర్ నుండి బాపు ఘాట్ వరకు 9 కిలోమీటర్లు, గండిపేట నుండి బాపు ఘాట్ వరకు 11 కిలోమీటర్లు.. మొత్తంగా 20 కిలోమీటర్ల మేర నదిని శుద్ధి చేసి అభివృద్ధి చేసేందుకు సిద్ధం చేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) కు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

Publish Date: Jun 30, 2026 7:53PM
వైభవంగా విశాఖ కేంద్రీయ గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవం
వైభవంగా విశాఖ కేంద్రీయ గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవం

విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. విశాఖపట్నం నగరంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ) మొదటి స్నాతకోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఉన్నత విద్యను విజయవంతంగా పూర్తి చేసిన గిరిజన విద్యార్థులను ఆమె అభినందిస్తూ, వారి ఉజ్వల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేశారు. ఈ ఘనమైన వేడుకలో రాష్ట్రపతి చేతుల మీదుగా మొత్తం 373 మంది డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) విద్యార్థులకు పట్టాలను అందజేశారు. వివిధ కోర్సుల్లో అద్భుతమైన విద్యా ప్రతిభ కనబరిచిన 13 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆమె బంగారు పతకాలను (స్వర్ణ పతకాలు) బహూకరించి ప్రత్యేకంగా అభినందించారు. స్నాతకోత్సవ సభలో రాష్ట్రపతి ముర్ముతో పాటు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి వంగలపూడి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ వేడుకలో భాగస్వామ్యులయ్యారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి (వైస్ ఛాన్స్ లర్) కట్టమణి, రిజిస్ట్రార్ జితేంద్ర మోహన్ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతకుముందు, ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. గవర్నర్ అబ్దుల్ నజీర్, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రులు నారా లోకేశ్, అనిత తదితరులు విమానాశ్రయంలో ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రపతి రాకపై మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. "గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి విశాఖపట్నంలో స్వాగతం పలకడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పుణ్యభూమికి విచ్చేసిన మీకు హృదయపూర్వక సుస్వాగతం" అంటూ లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ట్వీట్ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం గిరిజన ప్రాంతాల అభివృద్ధి, విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఈ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తొలి స్నాతకోత్సవానికి దేశ ప్రథమ పౌరురాలు హాజరుకావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ విశ్వవిద్యాలయం రాబోయే రోజుల్లో గిరిజన సంస్కృతిని కాపాడుతూ, వినూత్న పరిశోధనలకు పెద్దపీట వేయాలని విద్యావేత్తలు ఆకాంక్షిస్తున్నారు. విశాఖ వేదికగా జరిగిన ఈ స్నాతకోత్సవం ఉత్తరాంధ్ర ప్రాంత విద్యా వికాసంలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో ఈ వర్సిటీ రాబోయే కాలంలో మరిన్ని మౌలిక వసతులతో విస్తరించి, మారుమూల గిరిజన యువతకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందిస్తుందని స్థానికులు, మేధావులు గట్టిగా విశ్వసిస్తున్నారు.

Publish Date: Jun 30, 2026 7:44PM
ముంబైలో ఘోర ప్రమాదం..స్కూల్ బస్సుపై కూలిన భారీ చెట్టు!
ముంబైలో ఘోర ప్రమాదం..స్కూల్ బస్సుపై కూలిన భారీ చెట్టు!

ముంబై మహానగరంలో పెను విషాదం చోటుచేసుకుంది. అప్పటివరకు తోటి విద్యార్థులతో కలిసి నవ్వుతూ, ఆడుతూ ఇళ్లకు బయలుదేరిన చిన్నారుల ప్రయాణంలో ఊహించని ఘోర ప్రమాదం సంభవించింది. ముంబైలోని సబర్బన్ ప్రాంతమైన చెంబూర్ రోడ్ నంబర్ 11 పై మంగళవారం మధ్యాహ్నం సుమారు 2:50 గంటల సమయంలో ఒక స్కూల్ బస్సుపై రోడ్డు పక్కన ఉన్న భారీ రావి చెట్టు (Peepal Tree) ఒక్కసారిగా పెకలిపోయి కుప్పకూలింది. ఈ భయంకరమైన ప్రమాదంలో యూనివర్సల్ హైస్కూల్‌కు చెందిన 11 ఏళ్ల విద్యార్థి విహాన్ శ్రీవాస్తవ తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. బస్సులో మొత్తం 13 మంది చిన్నారులు ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు కండక్టర్, చుట్టుపక్కల ఉన్న స్థానిక పౌరులు ఎంతో సాహసంతో స్పందించి బస్సు అద్దాలు పగలగొట్టి చిన్నారులను సురక్షితంగా బయటకు తీసేందుకు శ్రమించారు. ముంబై అంతటా మంగళవారం భారీ వర్షాలు మరియు ఉరుములతో కూడిన గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. వర్షం కురుస్తున్న సమయంలోనే, హెరిటేజ్ ప్రైడ్ భవనం సమీపంలో మేక్ ఫోర్స్ సంస్థ నడుపుతున్న బస్సు (రిజిస్ట్రేషన్ నంబర్ MH03/CV-7439) వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వృద్ధాప్యానికి చేరిన ఆ భారీ చెట్టు బస్సు ముందు, మధ్య భాగాలపై పడటంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న వెంటనే ముంబై ఫైర్ బ్రಿಗేడ్, స్థానిక పోలీసులు, బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) వార్డ్ సిబ్బందితో పాటు 108 అంబులెన్స్ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన ఐదుగురు విద్యార్థులను సమీపంలోని జెన్ ఆసుపత్రికి (Zen Hospital) తరలించారు. దురదృష్టవశాత్తూ తీవ్ర తల, పొత్తికడుపు గాయాలతో పాటు ఎముకలు విరిగిన స్థితిలో ఆసుపత్రికి చేరిన విహాన్ శ్రీవాస్తవను బ్రతికించడానికి వైద్యులు దాదాపు 30 నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సాయంత్రం 4:23 గంటలకు విహాన్ మరణించినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మిగిలిన నలుగురు విద్యార్థుల వయస్సు 5 నుండి 10 సంవత్సరాల మధ్య ఉంటుందని, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని జెన్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వారిలో ఇద్దరు పిల్లలకు అంతర్గత గాయాల తీవ్రతను పరిశీలించడానికి అబ్డామిన్ మరియు స్పైన్ సిటి స్కాన్ (CT scans) పరీక్షలు నిర్వహించారు. మరొక విద్యార్థికి చేతికి చిన్నపాటి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదంపై స్థానిక నివాసితులు బీఎంసీ (BMC) అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని ప్రమాదకరమైన చెట్లను కత్తిరించాలని లేదా తొలగించాలని తాము గతంలోనే మునిసిపల్ అధికారులకు పలుమార్లు లేఖలు రాశామని, అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే నేడు ఒక అమాయక చిన్నారి ప్రాణం పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత రోడ్డుపై పడిన చెట్టు కొమ్మలను తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించడానికి మునిసిపల్ సిబ్బందికి చాలా సమయం పట్టింది. ఈ హృదయవిదారక ఘటన ముంబై నగరంలో వర్షాకాలంలో రోడ్ల పక్కన ఉండే పాత చెట్ల భద్రతపై మరియు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై మళ్లీ అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

Publish Date: Jun 30, 2026 7:22PM
పుష్ప స్టైల్‌లో గంజాయి స్మగ్లింగ్... 525 కిలోలు స్వాధీనం
పుష్ప స్టైల్‌లో గంజాయి స్మగ్లింగ్... 525 కిలోలు స్వాధీనం

పుష్ప సినిమాను తలపించే రీతిలో కంటైనర్ లారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ ఛాంబర్‌లో గంజాయిని దాచిపెట్టి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్న అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల రవాణా ముఠాను తెలంగాణ ఈగిల్ ఫోర్స్ (EAGLE), ఖమ్మం ప్రాంతీయ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ (RNCC), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. సారపాకలోని ఐటీసీ పేపర్స్ బోర్డ్ పశ్చిమ గేట్ సమీపంలో కంటైనర్‌ను అడ్డగట్టి తనిఖీలు నిర్వహించగా, ప్రత్యేకంగా రూపొందించిన రహస్య అరలో దాచిన రూ.2.62 కోట్ల విలువైన 525 కిలోల గంజాయి బయటపడింది. కంటైనర్‌కు ఎస్కార్ట్‌గా వెళ్తున్న బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో 525 కిలోల గంజాయితో పాటు కంటైనర్ లారీ, బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్, ఐదు మొబైల్ ఫోన్లు, రూ.10,570 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా సిందూర్‌పల్లికి చెందిన గంజాయి సరఫరాదారు సహదేవ్ హంటల్ (20), ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లికి చెందిన దోగ్రి త్రినాథ్ (38), ఉత్తరప్రదేశ్‌కు చెందిన కంటైనర్ డ్రైవర్ కుల్దీప్ శర్మ (27)లను పోలీసులు అరెస్టు చేశారు. మరో బాలుడిని (CCL) జువెనైల్ చట్టాల ప్రకారం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ట్రక్ యజమాని మహ్మద్ సైఫ్‌తో పాటు ఫిరోజ్ భాయ్, రాజా మిశ్రా, మహ్మద్ ఇమ్రాన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరంతా ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారేనని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Publish Date: Jun 30, 2026 6:24PM
TeluguOne Picks For You
rss-imgRss Feeds