political-news-img

నీట్ పేపర్ లీకేజీ కేసులో సూత్రధారి అరెస్ట్

దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తూ, పెను సంచలనం సృష్టించిన నీట్-యుజి పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎట్టకేలకు ఒక భారీ ముఠా గుట్టురట్టయింది. ఈ ఘోర కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న కింగ్‌పిన్ పీవీ కుల్కర్ణిని కేంద్రీయ దర్యాప్తు సంస్థ (CBI) మహారాష్ట్రలోని పుణెలో విజయవంతంగా అరెస్టు చేసింది. లాతూర్ ప్రాంతానికి చెందిన పీవీ కుల్కర్ణి వృత్తిరీత్యా కెమిస్ట్రీ లెక్చరర్ కావడం ఇక్కడ గమనార్హం. జాతీయ పరీక్షల సంస్థ (NTA) తరపున నీట్ పరీక్షల నిర్వహణ ప్రక్రియలో అతనికి ప్రత్యక్ష భాగస్వామ్యం ఉంది. ఈ అధికారిక హోదాను అడ్డం పెట్టుకుని, అత్యంత రహస్యంగా ఉంచాల్సిన నీట్ ప్రశ్నపత్రాన్ని అతను ముందే యాక్సెస్ చేశాడని సీబీఐ అధికారులు గుర్తించారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం, పరీక్ష జరగడానికి కొన్ని రోజుల ముందే ఈ భారీ నెట్‌వర్క్ తెరవెనుక కథను నడిపించింది. ఏప్రిల్ చివరి వారంలోనే నిందితుడు పీవీ కుల్కర్ణి తనతో చేతులు కలిపిన మనీషా వాఘ్మారే అనే మరో నిందితురాలి సహాయంతో కొంతమంది విద్యార్థులను గుట్టుచప్పడు కాకుండా సమీకరించాడు. పుణెలోని తన సొంత నివాసంలోనే వీరందరికీ ప్రత్యేక కోచింగ్ క్లాసులు పేరిట ఒక రహస్య శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. ఆ క్లాసులలో కూర్చోబెట్టిన విద్యార్థులకు మే 3వ తేదీన జరగబోయే అసలు నీట్ పరీక్షలోని ప్రశ్నలను, వాటి కింద ఇచ్చే ఆప్షన్లను, అంతేకాకుండా వాటి సరైన సమాధానాలను సైతం స్వయంగా డిక్టేట్ చేశాడు. విద్యార్థులు తమ నోట్‌బుక్స్‌లో రాసుకున్న ఆ వివరాలు, ఆ తర్వాత మే 3న జరిగిన అసలు పరీక్ష పేపర్‌తో వంద శాతం సరిపోలడం దర్యాప్తు అధికారులనే విస్మయానికి గురిచేసింది. లీకైన సమాచారాన్ని చేతిరాతతో నోట్‌బుక్‌లలో రాయించడం ద్వారా ఎలాంటి డిజిటల్ ఆధారాలు దొరకవని భావించినప్పటికీ, సీబీఐ సాంకేతిక నిపుణులు నిందితుల గుట్టును రట్టు చేశారు. ఈ పరీక్ష పేపర్ లీకేజీ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో మే 12న కేంద్ర విద్యాశాఖ ఫిర్యాదు మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. దేశంలోని జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పుణె వంటి పలు ప్రధాన నగరాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి ఇప్పటివరకు ఎనిమిది మందికి పైగా కీలక నిందితులను కటకటాల వెనక్కి నెట్టింది. ఈ క్రమంలో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మరియు నోట్‌బుక్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి లోతైన విశ్లేషణ జరుపుతున్నారు. పేపర్ లీకేజీ కారణంగా మొదటిసారి నీట్ చరిత్రలోనే పరీక్షను పూర్తిగా రద్దు చేయాల్సి వచ్చింది. దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఈ విద్యా మాఫియా వెనుక ఇంకెంతమంది పెద్ద తలకాయలు ఉన్నాయనే కోణంలో సీబీఐ విచారణ ముమ్మరం చేసింది. జూన్ 21న నీట్ పునఃపరీక్షను నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Publish Date: May 15, 2026 9:36PM

political-news-img

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. ప్లాట్‌ఫామ్ నం.4పై నిలిపి ఉంచిన రైలులోని ఒక ఏసీ కోచ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్టేషన్‌లో పొగ కమ్ముకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి మూడు ఫైర్ ఇంజన్లతో చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, నిలిపి ఉన్న ట్రైన్‌లోని ఏసీ కోచ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. ఘటనపై రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Publish Date: May 15, 2026 9:22PM

political-news-img

మే 20న మెడికల్ షాపులు బంద్...ఎందుకంటే?

ఈ నెల 20వ తేదీన దేశంలోని అన్ని మెడికల్ షాపులు పూర్తి స్థాయిలో మూతపడనున్నాయి. అఖిల భారత కెమిస్టులు, డ్రగ్గిస్టుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 12.40 లక్షల ఔషధ విక్రయ శాలలు, ఫార్మసీలు మరియు కెమిస్ట్ దుకాణాలు ఒక రోజు పాటు సమ్మెలో పాల్గొంటున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాలు మరియు గ్రామీణ ప్రాంతాలలో మే 19వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుండి మే 20వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది. ఆన్‌లైన్ ఫార్మసీల విచ్చలవిడి విక్రయాలు, ఈ-కామర్స్ యాప్‌ల నిబంధనల ఉల్లంఘనలు మరియు కార్పొరేట్ కంపెనీల భారీ డిస్కౌంట్లకు నిరసనగా ఈ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజల అవసరార్థం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనలను ఆసరాగా చేసుకుని ఆన్‌లైన్ ఫార్మసీలు నిబంధనలకు విరుద్ధంగా మందులను డోర్ డెలివరీ చేస్తున్నాయని సాంప్రదాయ మెడికల్ షాపుల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఆన్‌లైన్ యాప్‌లలో యాంటీబయాటిక్స్, తీవ్రమైన మానసిక వ్యాధులకు వాడే మందులు విక్రయించడం వల్ల ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఒకే ప్రిస్క్రిప్షన్‌ను పదే పదే ఉపయోగించి మందులు ఆర్డర్ చేయడం వల్ల డ్రగ్స్ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని సంఘం నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపిన వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలు అందిస్తున్న భారీ డిస్కౌంట్ల వల్ల స్థానికంగా ఉండే చిన్న వ్యాపారాలు మూతపడుతున్నాయని, తద్వారా ఈ రంగంపై ఆధారపడిన ఐదు కోట్ల మంది జీవనోపాధి దెబ్బతింటుందని వారు వాపోతున్నారు. ఈ 24 గంటల సమ్మె కారణంగా సాధారణ రోగులు, ముఖ్యంగా నిత్యం బిపి, షుగర్, గుండె జబ్బుల మందులు వాడే వారు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అందువల్ల వైద్య నిపుణులు మరియు అసోసియేషన్ ప్రతినిధులు ప్రజలకు ఒక ముఖ్యమైన సూచన చేస్తున్నారు. మీ ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే, వారికి అవసరమైన అత్యవసర మందులను మే 20వ తేదీ కంటే ముందే కొనుగోలు చేసి పెట్టుకోవడం ఎంతో ఉత్తమం. శస్త్రచికిత్సలు షెడ్యూల్ అయిన రోగుల బంధువులు కూడా అవసరమైన ఔషధాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అయితే, అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ఆసుపత్రులకు అనుబంధంగా ఉండే మెడికల్ షాపులు మరియు 24 గంటలు పనిచేసే ఎమర్జెన్సీ ఫార్మసీలు ఈ బంద్ సమయంలో తెరిచే ఉంటాయని సమాచారం. అయినప్పటికీ సాధారణ మెడికల్ స్టోర్లు మూతపడనున్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

Publish Date: May 15, 2026 9:17PM

political-news-img

అమృత్ భారత్ పథకంతో ఏపీలో 70 స్టేషన్లకు కొత్త రూపు

కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద ఏపీలోని పలు రైల్వే స్టేషన్లకు మహర్దశ పట్టింది. ఎంట్రన్స్ దగ్గర నుంచి ప్లాట్ ఫామ్, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్స్, లిఫ్టులు ఇలా ఒక్కటేమిటి ఎయిర్ పోర్టు రేంజులో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. ఆ క్రమంలో ఏలూరు రైల్వే స్టేషన్ అధ్యాత్మిక శోభ, ఆధునిక హంగులతో ముస్తాబైంది. ఏలూరు రైల్వే స్టేషన్ ఫోటోలను.. రైల్వే శాఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద ఏలూరు రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు చేపట్టారు. రైల్వేస్టేషన్ ఆర్చ్ నుంచి ఎంట్రన్స్ వరకూ రైల్వే అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఏలూరు జిల్లాలో ప్రముఖ ఆలయమైన ద్వారకా తిరుమల ఆలయం గాలిగోపురాన్ని పోలిన విధంగా రైల్వేస్టేషన్ ఎంట్రన్స్ తీర్చిదిద్దారు. అలాగే ఆలయంలోకి వెళ్తున్నామనే భావన కలిగించేలా ఆర్చి నిర్మాణం జరిగింది. మొత్తంగా ఇది రైల్వేస్టేషనా లేక.. ఆలయమా అని అనిపించేలా స్టేషన్ రూపురేఖలు మారిపోయాయి. ఆధునిక సౌకర్యాలు, సంప్రదాయాన్ని కలగలిపి ఏలూరు రైల్వే స్టేషన్‌కు కొత్త అందాలు అద్దారు. మన రాష్ట్రంలోని ప్రాంతీయ కళలను వివరించేలా రైల్వే స్టేషన్ ఇంటీరియర్ డిజైన్ చేశారు. అలాగే మెరుగైన వాతావరణం, స్పష్టత కోసం ఆధునిక లైటింగ్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు వేచి ఉండే వెయిటింగ్ హాల్స్ సైతం అత్యాధునికంగా తీర్చిదిద్దారు. మరోవైపు చిన్న తిరుపతిగా పేరొందిన ద్వారకా తిరుమల ఆలయానికి వెళ్లాలంటే ఏలూరు రైల్వే్ స్టేషన్‌లో దిగాల్సి ఉంటుంది. ఆలయానికి వెళ్లే ఎంతో మంది భక్తులు ఈ రైల్వేస్టేషన్ మీదగానే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్ ఎంట్రన్స్.. ఆలయాన్ని పోలిన విధంగా తీర్చిదిద్దారు. దీనిపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద రాష్ట్రంలో 70కి పైగా రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పథకం కింద రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తారు. అందులో భాగంగా టాయిలెట్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంతో పాటుగా ఉచిత వైఫై వంటి సేవలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రైల్వే స్టేషన్ల రూపకల్పనలో స్థానిక సంస్కృతీ, సంప్రదాయాలు, కళలకు ప్రాధాన్యం ఇస్తూ.. ప్రయాణీకులను అమితంగా ఆకట్టుకుంటున్నారు.

Publish Date: May 15, 2026 9:07PM

political-news-img

ఆన్‌లైన్‌లో తెలుగుదేశం పార్టీ మహానాడు

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి రెండు రోజుల పాటు వర్చువల్ విధానంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. పొదుపు చర్యల్లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర కమిటీ సభ్యులంతా టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. మహానాడును పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సూచించిన చంద్రబాబు, ఎన్టీఆర్ భవన్‌లో ప్రత్యేక స్టేజీ ఏర్పాటు చేసి అక్కడి నుంచే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులు మహానాడు కార్యక్రమాన్ని వీక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ భవన్ నుంచి పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో పార్టీ పండుగగా భావించే మహానాడు కార్యక్రమం జరగనుంది.

Publish Date: May 15, 2026 8:26PM

political-news-img

పోక్సో కేసులో పోలీస్ కానిస్టేబుల్‌కు 30 ఏళ్ల జైలు శిక్ష

చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో పోలీస్ విభాగానికే చెందిన కానిస్టేబుల్‌కు భారీ శిక్ష పడింది. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు వరదరాజ్ సుదేశ్‌పై నేరం నిరూపితమై, పోక్సో ప్రత్యేక కోర్టు కఠిన తీర్పు వెలువరిం చింది.పోలీసు వృత్తిలో ఉండి సమాజానికి రక్షణగా నిలవాల్సిన వ్యక్తే చిన్నారిపై లైంగికదాడికి పాల్పడినట్టు కోర్టు తేల్చింది.ఈ కేసు విచారణలో సమర్పించిన సాక్ష్యాలు, బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా నిందితుడు దోషిగా నిర్ధారణ కావడంతో కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో కోర్టు నిందితుడికి 30 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ, అదనంగా రూ.12 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనపు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది.ఇక బాధిత బాలిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. చిన్నారులపై లైంగిక నేరాలు చేసే వారికి కఠిన శిక్షలు తప్పవని ఈ తీర్పు మరోసారి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. చిన్నారుల రక్షణ కోసం రూపొందించిన పోక్సో చట్టం కింద కోర్టులు వేగంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటు న్నాయి. ఈ తీర్పు సమాజం లో బాలల భద్రతపై మరింత అవగాహన పెంచేలా నిలుస్తోంది.

Publish Date: May 15, 2026 7:46PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img