Read more!

శ్రీసాయిసచ్చరిత్రము ముప్పైనాలుగవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము

 

ముప్పైనాలుగవ అధ్యాయము

 

ఊదీ మహిమ : 1. డాక్టరు మేనల్లుడు 2. డాక్టరు పిళ్లే 3. శ్యామా మరదలు 4. ఇరానీ బాలిక 5. హార్దా పెద్దమనిషి 6. బొంబాయి మహిళ
ఈ అధ్యాయమోలో కూడా ఊదీ మహిమ వర్ణన. ఊదీ ధరించినంత మాత్రమున ఎలాంటి ఫలములు కలుగుతాయో చూద్దాము.


డాక్టరుగారి మేనల్లుడు :

 

 

 

 


నాసిక్ జిల్లాలోని మాలెగాంలో ఒక డాక్టరు ఉండేవారు. ఆయన వైద్యంలో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయం కానటువంటి రాచకురుపుతో బాధపడుతూ ఉండేవాడు. డాక్టరుగారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆపరేషన్ చేశారు. కాని ఏమాత్రం మేలు జరుగలేదు. కుఱ్ఱవాడు అమితంగా బాధపడుతూ ఉన్నాడు. బంధువులు స్నేహితులు తల్లిదండ్రులను దైవసహాయం కోరుకోమన్నారు. షిరిడీ సాయిబాబాను చూడమన్నారు. వారి దృష్టితో అనేక కఠిన రోగాలు నయమయ్యాయని బోధించారు. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చారు. బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. కుర్రవాణ్ణి బాబా ముందు వుంచారు. తమబిడ్డను కాపాడమని అధిక వినయంతో గౌరవాలతో వేడుకున్నారు. దయార్థ్ర హృదయుడైన బాబా వారిని ఓదార్చి ఇలా అన్నారు. "ఎవరయితే ఈ మసీదుకు వస్తారో వారు ఎప్పుడూ ఈ జన్మలో ఏ వ్యాధిచేత బాధపడరు. కనుక హాయిగా ఉండండి. కురుపుపై ఊదీని పూయండి. ఒక వారంరోజుల్లో నయమవుతుంది. దేవునియందు నమ్మకం ఉంచండి.  ఇది మసీదుకాదు ఇది ద్వారవతి. ఎవరయితే ఇందులో కాలు మోపుతారో వారు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుతారు. వారి కస్టాలు గట్టెక్కుతాయి'' వారు కుర్రవాణ్ణి బాబా ముందు కూర్చుండబెట్టారు. బాబా ఆ కురుపుమీద తమ చేతిని త్రిప్పారు. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింప చేశారు. రోగి సంతృప్తి చెందాడు. ఊదీ రాయగా కురుపు నెమ్మదించింది. కొద్ది రోజుల తరువాత పూర్తిగా మానిపోయింది. తల్లిదండ్రులు కుర్రవాడితో బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడిచిపెట్టారు. బాబా ఊదీ ప్రసాదంవల్ల వారి దయాదృష్టివల్ల రాచకురుపు మానిపోయినందుకు వారు అధికంగా సంతోషించారు.

 

 

 


ఈ సంగతి విని కుర్రవాడి మామగారైన డాక్టరు ఆశ్చర్యపడి బొంబాయి వెళ్తూ మార్గం మధ్యలో బాబాను చూడాలని కోరుకున్నారు. కానీ మాలెగాంలోను మన్ మాడ్ లోను ఎవరో బాబాకు వ్యతిరేకంగా చెప్పి అతని మనస్సును విరిచారు. కాబట్టి అతడు షిరిడీకి వెళ్లటం మానుకుని తిన్నగా బొంబాయి చేరుకున్నారు. తనకు మిగిలి వున్నా సెలవులు ఆలిబాగులో గడపాలి అనుకున్నారు. బొంబాయిలో మూడురాత్రులు వరుసగా ఒక కంఠధ్వని "ఇంకా నన్ను నమ్మవా'' అని విపించింది. వెంటనే డాక్టరు తమ మనస్సును మార్చుకుని షిరిడీకి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. అతడు బొంబాయిలో ఒక రోగికి అంటుజ్వరానికి చికిత్స చేస్తున్నారు. రోగికి నయం కాకపోయింది. కాబట్టి షిరిడీ ప్రయాణం వాయిదా పడుతుందని అనుకున్నారు. కాని, తన మనస్సులో బాబాను పరీక్షించదలచి, "రోగి యొక్క వ్యాధి ఈనాడు కురిరితే, రేపే షిరిడీకి వెళ్తాను'' అని అనుకున్నారు. జరిగిన చిత్రం ఏమిటంటే సరిగ్గా మనోనిశ్చయం చేసినప్పటి నుండి, జ్వరం తగ్గటం ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగింది. డాక్టరు తన మనోనిశ్చయం ప్రకారం షిరిడీకి వెళ్ళారు. బాబా దర్శనం చేసి వారి పాదాలకు సాష్టాంగనమస్కారం చేశారు. బాబా ఆతనికి గొప్ప అనుభవం కలగాచేయటంతో అతడు బాబా భక్తుడయ్యాడు. అక్కడ 4 రోజులు వుండి, బాబా ఊదీతోనూ, ఆశీర్వచనాలతో ఇంటికి వచ్చారు. ఒక పక్షం రోజులలో అతనిని బీజాపూర్ కు ఎక్కువ జీతంపై బదిలీ చేసారు. అతని మేనల్లుడి రోగం ఆ డాక్టరుకు బాబా దర్శనానికి తోడ్పడింది. అప్పటినుండి అతనికి బాబాయందు భక్తి కుదిరింది.


డాక్టరు పిళ్లే :

 

 

 

 


డాక్టరు పిళ్లే అనే అతడు బాబాకు ప్రియభక్తుడు. అతనిలో బాబాకు అమితమైన ప్రేమ. బాబా అతనిని "భాపూ'' (అన్నా) అని పిలిచేవారు. బాబా అతనితో ప్రతివిషయం సంప్రదించేవారు. అతన్ని ఎల్లప్పుడూ చెంత ఉంచుకునేవారు. ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులతో (నారిపుండు) బాధపడ్డాడు. అతడు కాకాసాహెబు దీక్షిత్ తో "బాధ చాలా ఎక్కువగా ఉన్నది. నేను భరించలేకపోతున్నాను. దీనికంటే ఛావు మేలు అని అనిపిస్తున్నది. గతజన్మలో చేసిన పాపం పోగొట్టుకోడానికే నేనీ బాధ అనుభవిస్తున్నాను. కాబట్టి బాబా దగ్గరికి వెళ్ళి ఈ బాధను ఆపుచేసి, దీన్ని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసిందని వేడుకో'' అన్నాడు. దీక్షితు బాబా దగ్గరికి వెళ్ళి ఆ సంగతి చెప్పారు. బాబా మనస్సు కరిగింది. బాబా దీక్షితుతో ఇలా అన్నారు "నిర్భయుడుగా ఉండమను. అతడు ఎలా పది జన్మల వరకు బాధపడాలి? పది రోజులలో గతజన్మ పాపాన్ని హరింపచేయగలను. నేనిక్కడ వుండి ఇహపర సౌఖ్యాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా అతడు ఎలా చావును కోరుకోఆలి? అతన్ని ఎవరి వీపుపైన అయినా తీసుకొని రండి. అతని బాధను శాశ్వతంగా నిర్మూలిస్తాను''

 

 

 

 


ఆ స్థితిలో డాక్టరును తెచ్చి బాబా కుడివైపున, ఫకీరు బాబా ఎప్పుడు కూర్చునేచోట కూర్చోబెట్టారు. బాబా అతనికి బాలీసులు ఇచ్చి ఇలా అన్నారు. "ఇక్కడ నెమ్మదిగా పడుకొని విశ్రాంతి తీసుకో. అసలయిన విరుగుడు ఏమిటంటే గతజన్మ పాపాలను అనుభవించి, వినోచనం పొందాలి. మన కష్టసుఖాలకు మన కర్మమే కారణం. వచ్చినదాన్ని ఓర్చుకో. అల్లాయే ఆర్చి తీర్చేవాడు. అతన్ని ఎప్పుడూ ధ్యానించు. అతడే నీ క్షేమాన్ని చూస్తాడు. వారి పాదాలకు శరీరాన్ని, మనస్సు, ధనం, వాక్కు, సమస్తం అర్పించు. అంటే సర్వశరణాగతి వేడుకో. అటుపై వారు ఏమి చేస్తారో చూద్దాము.'' నానా సాహెబు కట్టుకడతానని కాని, గుణం ఇవ్వలేదనీ డాక్టరు పిళ్లే చెప్పరు. బాబా ఇలా అన్నారు "నానా తెలివితక్కువవాడు. కట్టు విప్పు లేకపోతే చస్తావు. ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుస్తుంది. అప్పుడు నీ కురుపు నయమవుతుంది.
ఈ సంభాషణ జరుగుతుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపాలు బాగుచేస్తుండగా, అతని కాలు సరిగ్గా పిళ్లే కురుపు మీద హఠాత్తుగా పడింది. కాలు వాచివుంది. దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులోనుండి ఏడు పురుగులు నొక్కబడి బయటపడ్డాయి. బాధ భరింపరానిడిగా ఉండింది. డాక్టరు పిళ్లే బిగ్గరగా ఏడ్వసాగారు. కొంతసేపటికి నెమ్మదించింది. అతనికి ఏడ్పు, నవ్వు ఒకటి తరువాత ఇంకొకటి వచ్చుచుండెను. బాబా ఇలా అన్నారు "చూడూ! మన అన్న జబ్బు కుదిరి నవ్వుతున్నాడు.'' పిళ్లే "కాకి ఎప్పుడు వస్తుం''దని అన్నారు. బాబా ఇలా జవాబు చెప్పారు. "నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే ఆ కాకి. ఇప్పుడు నీవు వెళ్ళి వాడాలో విశ్రాంతి తీసుకో. నీవు త్వరలో బాగుపదతావు'' ఊదీ పూయటంవలన, దాన్ని తినటం వలన, ఏ చికిత్స పొందకుండానే, ఔషధం పుచ్చుకోకుండానే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారం మానిపోయింది.

శ్యామా మరదలు :

 

 

 

 


శ్యామా తమ్ముడు బాపాజీ సాపూల్ విహిర్ దగ్గర ఉండేవాడు. ఒకరోజు అతని భార్యకు ప్లేగు అంటుకుంది. ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది. చంకలో రెండు బొబ్బలు లేచాయి. బాపాజీ శ్యామా దగ్గరికి పరుగెత్తి వచ్చి సహాయపడమన్నాడు. శ్యామా భయపడ్డాడు. కాని యథాప్రకారం బాబా దగ్గరికి వెళ్ళాడు. సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయం కోరాడు. వుఆధిని బాగుచేయమని ప్రార్థించారు. తన అమ్ముని ఇంటికి వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వమన్నారు. బాబా ఇలా అన్నారు "ఈ రాత్రి సమయంలో వెళ్ళవద్దు. ఊదీ పంపు. జ్వరంగాని, బొబ్బలుగాని లక్ష్యపెట్ట ఆసరం లేదు. మన తండ్రీ, యజమాని ఆ దైవమె. ఆమె వ్యాధి సులభంగా నయమవుతుంది. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపటి ఉదయం వెళ్ళు. వెంటనే తిరిగిరా''

 

 

 

 


శ్యామాకు బాబా ఊదీయందు సంపూర్ణ విశ్వాసం ఉంది. బాపాజీ ద్వారా దీన్ని పంపారు. బొబ్బలపై దాన్ని పూసి కొంత నీళ్ళలో కలిపి త్రాగించారు. దాన్ని తీసుకున్న వెంటనే, బాగా చెమట పట్టింది; జ్వరం తగ్గింది. రోగికి మంచి నిద్ర పట్టింది. మరుసటి ఉదయం తన భార్యకు నయమవటం చూసి బాపాజీ ఆశ్చర్యపడ్డారు. జ్వరం పూయింది. బొబ్బలు మానాయి. మరుసటి ఉదయం శ్యామా బాబా ఆజ్ఞ ప్రకారం వెళ్లగా, ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేస్తూ ఉండటం చూసి ఆశ్చర్యపడ్డారు. తమ్మున్ని అడగ్గా బాబా ఊదీ ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసాయని అన్నారు. అప్పుడు "ఉదయం వెళ్ళు, త్వరగారా'' అనే బాబా మాటల భావం శ్యామా తెలుసుకోగలిగారు.

 

 

 

 


టీ తీసుకొని శ్యామా తిరిగి వచ్చారు. బాబాకు నమస్కరించి ఇలా అన్నారు "దేవా! ఏమి నీ ఆట! మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలగజేస్తావు. తిరిగి దాన్ని శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదిస్తావు'' బాబా ఇలా జవాబిచ్చారు. "కర్మ యొక్క మార్గం చిత్రమైనది. నేనేమీ చేయకున్నా, నన్నే సర్వానికి కారణభూతుడిగా ఎంచుకుంటారు. అది అదృష్టాన్ని బట్టి వస్తుంది. నేను సాక్షిభూతుడిని మాత్రమే. చేసేవారు ప్రేరేపించేవాడు దేవుడే. వారు అత్యంత దయార్థ్రహృదయులు, నేను భగవంతుడిని కాదు. ప్రభువును కాదు. నేను వారి నమ్మినబంటును. వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాను. ఎవరైతే తమ అహంకారాన్ని ప్రకక్కు తోసి భగవంతునికి నమస్కరిస్తారో, ఎవరు వారిని పూర్తిగా నమ్ముతారో, వారి బంధనాలు వూడి మోక్షాన్ని పొందుతారు.


ఇరానీ బాలిక :

 

 

 

 


ఇక ఇరానీ అతని అనుభవాన్ని చదవండి. అతని కుమార్తెకు ప్రతిగంటకు మూర్ఛ వస్తుండేది. మూర్ఛ రాగానే ఆమె మాటలాడలేక పోయేది. కాళ్ళు, చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోతుండేది. ఏ మందులు ఆమెకు నయం చేయలేడు. ఒక స్నేహితుడు బాబా ఊదీ ఉపయోగించమని చెప్పారు. విలేపార్లేలో ఉన్న కాకాసాహెబు దీక్షిత్ దగ్గర ఊదీ తీసుకొని రమ్మని అన్నారు. ఇరానీవాడు ఊదీని తెచ్చి ప్రతిరోజూ నీటిలో కలిపి త్రాగిస్తూ ఉన్నాడు. మొదట ప్రతిగంటకు వచ్చే మూర్ఛ 7 గంటలకు ఒకసారి రాసాగింది. కొద్ది రోజుల తరువాత పూర్తిగా నెమ్మదించింది.

హార్దా పెద్దమనిషి :

 

 

 

 


హార్దాపుర (మధ్యపరగణాలు) నివాసియైన వృద్దుడొకరు మూత్రకోశంలో రాయితో బాధపడుతూ ఉండేవాడు. అలాంటి రాళ్ళు ఆపరేషను చేసి తీస్తారు. కాబట్టి ఆపరేషను చేయించుకోమని సలహా ఇచ్చారు. అతడు ముసలివాడు, మనోబలం లేనివాడు. ఆపరేషనుకు ఒప్పుకోకుండా ఉన్నాడు. అతని బాధ యింకొక రీతిగా బాగు కావలసి వుంది. ఆ గ్రామపు ఇనాముదారు అక్కడికి రావటం తటస్థించింది. అతడు బాబా భక్తుడు. అతని దగ్గర బాబా ఊదీ వుంది. స్నేహితులు కొందరు చెప్పగా, వృద్ధుని కుమారుడు ఊదీ తీసుకొని దాన్ని నీళ్ళలో కలిపి తండ్రికి ఇచ్చాడు. 5 నిముషాలలో ఊదీ గుణాన్ని ఇచ్చింది. రాయి కరిగి మూత్రం వెంబడి బయటపడింది. వృద్ధుడు శీఘ్రంగా బాగయ్యారు.

బొంబాయి మహిళ :

 

 

 

 


కాయస్థప్రభు కులానికి చెందిన బొంబాయి స్త్రీ ఒకామె ప్రసవించే సమయంలో ఎక్కువగా బాధపడుతూ ఉంది. ఆమె గర్భవతియైన ప్రతిసారి అమితంగా భయపడుతూ ఉంది. ఆమెకి ఏమీ తోచకుండా ఉంది. బాబా భక్తుడు కళ్యాణ్ వాస్తవ్యుడైన శ్రీరామమారుతి ఆమెను ప్రసవించే నాటికి షిరిడీకి తీసుకొని వెళ్ళమని సలహా ఇచ్చాడు. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చారు. కొన్ని మాసాలు అక్కడ ఉన్నారు. బాబాను పూజించారు. వారి సాంగత్యం వలన సంపూర్ణఫలాన్ని పొందారు. కొన్నాళ్ళకు ప్రసవవేళ వచ్చింది. మామూలుగానే యోనిలో అడ్డు కనిపించింది. ఆమె అమితంగా బాధపడింది. ఏమి చేయడానికీ తోచకుండా ఉంది. బాబాను ధ్యానించారు. ఇరుగుపొరుగువారు వచ్చి బాబా ఊదీని నీళ్ళలో కలిపి యిచ్చారు. 5 నిముషాలలో ఆ స్త్రీ సురక్షితంగా, ఎలాంటి కష్టం లేక ప్రసవించింది. దురదృష్టం కొద్దీ చనిపోయిన బిడ్డ పుట్టింది. కాని తల్లి ఆందోళన, బాధ తప్పిపోయాయి. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలం జ్ఞాపకం ఉంచుకున్నారు.

ముప్పైనాలుగవ అధ్యాయము సంపూర్ణం