Read more!

శ్రీసాయిసచ్చరిత్రము ముప్పైవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము

 

ముప్పైవ అధ్యాయము

 

 

 

 

షిరిడీకి లాగబడిన భక్తులు
1.పణి నివాసి కాకాజీ వైద్య 2. బొంబాయి నివాసి పంజాబి రామలాల్
ఈ అధ్యాయంలో బాబా షిరిడీకి ఈడ్చిన యిద్దరు భక్తుల వృత్తాంతం చెప్పుకుందాం. దయామయుడు, భక్తవత్సలుడు అయిన శ్రీసాయికి నమస్కారము. వారు దర్శనముతోనే భవసాగరాన్ని తరింపజేసి మన ఆపదలను తప్పిస్తారు. వారు నిర్గుణస్వరూపులైనా భక్తులు కోరటంతో సగుణ స్వరూపము వహించారు. భక్తులకు ఆత్మసాక్షాత్కారం కలిగించటమే మహాత్ముల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన సాయినాథుడికి ముఖ్యమైనది. తప్పనిసరైనది. వారి పాదాలను ఆశ్రయించినవారి పాపాలు అన్నీ నశిస్తాయి. అటువంటివారి ప్రగతి నిశ్చయం. వారి పాదాలను స్మరిస్తూ పుణ్యక్షేత్రములనుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రాలు పారాయణ చేసి, గాయత్రీమంత్రాన్ని జపిస్తారు. దుర్బలులము, పుణ్యహీనులము అవటంతో భక్తి అంటే ఏమిటో మనకు తెలియదు. మనకింత మాత్రం తెలుసు. ఇతరులు మనల్ని విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రం మనల్ని విడువడు. వారి కృపకు పాత్రులైనవారు కావలసినంత శక్తి, జ్ఞానం, నిత్యానిత్య వివేకాలను పొందుతారు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాటిని నెరవేరుస్తారు. అందుచేత ఎవరికీ కావలసినవి వారు పొంది, కృతజ్ఞతతో ఉంటారు. కాని మేము వారికి సాష్టాంగనమస్కారం ఫ్హేసి వేడుకొంటాము. మా తప్పులన్నీ క్షమించి సాయి మా ఆరాటాలన్నీ బాపుగాక. కష్టాలపాలై సాయిని ఈ విధంగా ప్రార్థించేవారి మనస్సు శాంతించి, బాబా కటాక్షంతో వారు సంతృప్తి పొందుతారు.

 

 

 


దయాసముద్రుడైన సాయి కటాక్షించటంతో హేమాడ్ పంతు ఈ గ్రంథాన్ని వ్రాయగాలిగానని చెప్పుకున్నారు. లేకపోతే తనకు గల యోగ్యత ఎంత? ఎవరింట కఠినమైన పనికి పూనుకోగలరు అన్నారు. శ్రీసాయి ఈ భారమంతా వహించటంతో హేమాడ్ పంతుకి కష్టంగాని, శ్రమగాని కనపడలేదు. తన వాక్కును, కాలాన్ని కూడా ప్రేరేపించడానికి శక్తివంతమైన జ్ఞానం అనే వెలుతురూ ఉండగా అతడు సంశయంగాని, ఆరాటంగాని ఎందుకు పొందాలి? అతడు వ్రాసిన ఈ పుస్తకరూపంలో శ్రీసాయి అతని సేవను గైకొన్నారు. ఇది అతని గతజన్మల పుణ్యపరంపరతో ప్రాప్తించింది. కాబట్టి అతడు అదృష్టవంతుడని, పుణ్యాత్ముడని అనుకున్నాడు.
ఈ క్రింది కథ సాధారణ కథ కాదు; స్వచ్ఛమైన అమృతము. దీన్ని ఎవరు త్రాగుతారో వారు సాయి మహిమను సర్వాంతర్యామి తత్వాన్ని తెలుసుకుంటారు. వాదించేవారు, విమర్శించేవారు ఈ కథలను చదవక్కర్లేదు. దీనికి కావలసినది అంతులేని ప్రేమ, భక్తి' వివసదము కాదు. జ్ఞానులు భక్తివిశ్వాసాలు కలవారు లేదా యోగుల సేవకులం అనుకునేవారు, ఈ కథలని ఇష్టపడి మెచ్చుకుంటారు. తదితరులు కాకమ్మ కథలు అనుకుంటారు. అదృష్టవంతులు యిన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావిస్తారు. ఈ సాయి లీలామృతం త్రాగితే అజ్ఞానులకు జన్మరాహిత్యం కలుగుతుంది. గృహస్థులకు సంతృప్తి కలుగుతుంది. ముముక్షువులకు ఇది సాధనగా ఉపకరిస్తుంది. ఇక ఈ అధ్యాయంలోని కథను ప్రారంభిస్తాము.
కాకాజీ వైద్య :

 

 



నాసిక్ జిల్లా వణిలో కాకాజీ వైద్య అనేవాడు ఉండేవాడు. అతడు అక్కడి సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్టాల పాలై మనఃశాంతిని పోగొట్టుకొని చంచల మనస్కుడు అయ్యాడు. అలాంటి పరిస్థితిలో ఒకనాటి సాయంకాలం దేవతాలయానికి వెళ్ళి తనను ఆందోళననుండి కాపాడమని హృదయ పూర్వకంగా వేడుకున్నాడు. అతని భక్తికి దేవత సంతోషించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నంలో కనిపించి "బాబా వద్దకు వెళ్ళు! నీ మనస్సు శాంతి వహిస్తుంది'' అని చెప్పింది. ఈ బాబా ఎవరో దేవిని అడిగి తెలుసుకోవడానికి కాకాజీ ఉత్సాహం చూపించాడు. కాని ఇంతలోనే మెలకువ వచ్చింది. ఈ బాబా ఎవరై ఉండవచ్చు అని అతడు ఆలోచించాడు. కొంతసేపు ఆలోచించిన తరువాత ఈ బాబా త్ర్యంబకేశ్వరుడు (శివుడు) కావచ్చునని అతడు పుణ్యస్థలమైన త్ర్యంబకము (నాసిక్ జిల్లా) వెళ్ళాడు. అక్కడ పదిరోజులు ఉన్నాడు. అక్కడ ఉన్నంత కాలం వేకువఝామున స్నానం చేసి, రుద్రాన్ని జపిస్తూ, అభిషేకాన్ని తదితర పూజలను చేశాడు. అయినప్పటికీ మునపటిలాగానే అశాంత మనస్కుడుగా ఉన్నాడు. తరువాత స్వగ్రామానికి తిరిగివచ్చి దేవతను తిరిగి వేడుకున్నాడు. ఆ రాత్రి ఆమె స్వప్నంలో కనిపించి యిలా చెప్పింది. "అనవసరంగా త్ర్యంబకేశ్వరం ఎందుకు వెళ్ళావు? బాబా అంటే షిరిడీ సాయిబాబా అని నా అభిప్రాయము''

 

 

 


షిరిడీకి ఎలా వెళ్ళాలి? ఎప్పుడు వెళ్ళాలి? బాబాను చూడటం ఎలా? అని కాకాజీ మనోవ్యాకులత పొందుతూ ఉన్నాడు. ఎవరయినా యోగీశ్వరుని చూడాలి అనుకున్నప్పుడు, ఆ యోగియేకాక దైవం కూడా అతని కోరికను నెరవేర్చడానికి సహాయపడుతుంది. యదార్థంగా యోగి, భగవంతుడు ఒకరే. వారిలో ఎలాంటి భేదం లేదు. ఎవరైనా తానై వెళ్ళి యోగిని దర్శించటం అన్నది ఉత్త బూటకం. యోగి సంకల్పించనిదే వారిని చూడగలిగేవారు ఎవరు? అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనం కోసం భక్తుడు ఎంత వేదన పడతాడో, ఎంత భక్తివిశ్వాసాలు చూపిస్తాడో, ఎంత త్వరగాను, బలంగానూ అతని కోరిక నెరవేరుతుంది. దర్శనం కోసం ఆహ్వానించేవాడే వచ్చేవాడికి స్వాగత సన్నాహాలు అమర్చుతాడు. కాకజీ విషయంలో అలాగే జరిగింది.
శ్యామా మ్రొక్కు :

 

 

 


కాకాజీ షిరిడీకి వెళ్ళడానికి ఆలోచిస్తుండగా, ఒక అతిథి అతనిని షిరిడీకి తీసుకుని వెళ్ళడానికి అతని ఇంటికి వచ్చాడు. అతడు ఇంకవరో కాదు, బాబాకు ముఖ్యభక్తుడు శ్యామాయే. శ్యామా ఆ సమయంలో వణికి ఎలా వచ్చాడో చూద్దాము. శ్యామా బాల్యంలో జబ్బు పాడినప్పుడు అతని తల్లి తమ గృహదేవత అయిన వణిలోని సప్తశృంగికి, 'జబ్బు నయం కాగానే నీ దర్శనం కోసం వచ్చి బిడ్డను నీ పాదాలపై పెడతాన'ని మ్రొక్కుకుంది. కొన్ని సంవత్సరాల తరువాత ఆ తల్లి కుచములపై తామర లేచి ఆమె అమితంగా బాధపడింది. తనకు నయమైతే రెండు వెండి కుచములు సమర్పిస్తానని అప్పుడు ఇంకొక మ్రొక్కు మ్రోక్కింది. కాని ఈ రెండు మ్రొక్కులు కూడా ఆమె చల్లించలేదు. ఆమె చనిపోయేటప్పుడు ఈ సంగతి శ్యామాకి చెప్పి రెండు మ్రొక్కులు చెల్లించే భారాన్ని అతనిపై వేసి ఆమె మృతిచెందింది. శ్యామా కొన్నాళ్ళకు ఆ మ్రోక్కులను పూర్తిగా మరిచిపోయాడు. ఇలా 30 సంవత్సరాలు గడిచాయి. అప్పట్లో షిరిడీకి ఒక పేరుపొందిన జ్యోతిష్కుడు వచ్చి నెలరోజులు అక్కడ మకాం వేశాడు. అతడు శ్రీమాన్ బూటీ మొదలైన వారికీ చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరంగా ఉంది. శ్యామా తమ్ముడు బాపాజి జ్యోతిష్య పండితుడిని సంప్రదించగా అతడు తల్లి మ్రొక్కులు చెల్లించక పోవటంతో వారికి కస్టాలు సప్తశృంగి దేవత కలగాజేస్తుందని చెప్పాడు. బాపాజి ఈ సంగతి శ్యామాకి తెలియపరిచాడు. అప్పుడు శ్యామాకి సర్వం జ్ఞాపకానికి వచ్చింది. ఇంకా ఆలస్యం చేసినట్లయితే హానికరం అని తలంచి శ్యామా ఒక కంసాలిని పిలిచి, రెండు వెండి కుచములను చేయించాడు. మసీదుకి వెళ్ళి బాబా పాదాలపై పడి, రెండు కుచములను అక్కడ పెట్టి, తన మ్రోక్కులను చెల్లాజేయుమని, బాబాయే తన సప్తశృంగి దేవత అవటంతో వాటిని ఆమోదించమని వేడుకున్నాడు. "నీవు స్వయంగా వెళ్ళి సప్తశృంగి దేవతకు మ్రొక్కును చెల్లించు'' అని బాబా ఊదీని ఆశీర్వాదం పొంది, శ్యామా వణి పట్టణానికి బయలుదేరాడు. పూజారి ఇల్లు వెతుక్కుంటూ చివరికి కాకాజీ ఇల్లు చేరుకున్నాడు. అప్పుడు కాకాజీ షిరిడీకి వెళ్ళాలని గొప్ప కుతూహలంతో ఉన్నాడు. అలాంటి సమయంలో శ్యామా వారి ఇంటికి వెళ్ళాడు. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికో చూడండి!

 

 

 


"మీరెవరు? ఎక్కడినుండి వచ్చారని'' కాకాజీ అడిగారు. "మాది షిరిడీ, నేను సప్తశృంగికి మ్రొక్కు చెల్లించడానికి ఇక్కడకి వచ్చా''నని శ్యామా అన్నారు. షిరిడీనుండి వచ్చారని తెలియగానే శ్యామాను కాకాజీ కౌగిలించుకుని, ప్రేమతో మైమరిచారు. వారు సాయిలీలల గురించి ముచ్చటించుకున్నారు. శ్యామా మ్రొక్కులన్నీ చెల్లించిన తరువాత వారిద్దరూ షిరిడీకి బయలుదేరారు. షిరిడీ చేరగానే కాకాజీ మసీదుకు వెళ్ళి బాబాను చూసి, వారి పాదాలపై పడ్డారు. అతని కళ్ళు కన్నీటితో నిండుకున్నాయి. అతని మనస్సు శాంతించింది. సప్తశృంగీదేవత స్వప్నంలో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనస్సులోని చంచలత్వం అంతా పోయి విశ్రాంతి వహించింది. కాకాజీ తన మనస్సులో ఇలా అనుకున్నారు "ఏమి ఈ అద్భుతశక్తి! బాబా ఏమీ పలకలేదు. ఉత్తరప్రత్యుత్తరాలు కూడా జరగలేదు. ఆశీర్వచనాలైనా పలకలేదు. కేవలం వారి దర్శనమే సంతోషానికి కారణమయ్యింది. వారి దర్శన మాత్రం చేతనే నా మనస్సు చంచలమై పోయింది. అంతరంగంలో ఆనందం ఉద్భవించింది. ఇదే దర్శనభాగ్యం'' అతడు తన దృష్టి సాయినాథుని పాదాలపై నిలిపారు. అతని నోట మాట రాలేకపోయింది. బాబా లీలలు విని అతని సంతోషానికి అంతులేకపోయింది. బాబాను సర్వస్యశరణాగతి వేడుకున్నారు. తన వేదనను, బాధలను మరచిపోయారు. స్వచ్చమైన ఆనందాన్ని పొందారు. అక్కడ 12 రోజులు సుఖంగా ఉండి చివరికి బాబా వద్ద శలవు తీసుకుని వారి ఊదీ ప్రసాదాన్ని, ఆశీర్వాదాన్ని పొంది ఇల్లు చేరుకున్నారు.
రహతా కుశాల్ చంద్ :

 

 

 


తెల్లవారు ఝామున వచ్చిన స్వప్నం నిజమవుతుందని అంటారు. ఇది సత్యమే కావచ్చు. కాని బాబా స్వప్నాలకు కాల నియమం లేదు. ఒక ఉదాహరణ " ఒకరోజు సాయంకాలం బాబా కాకాసాహెబు దీక్షితును రహతాకు వెళ్ళి చాలా రోజులనుండి చూడకపోవడంతో, కుశాల్ చంద్ ని తీసుకుని రమ్మన్నారు. ఒక టాంగాని తీసుకుని కాకా రహతా వెళ్ళారు. కుశాల్ చంద్ ని కలుసుకుని బాబా చెప్పిన వార్తను అందజేశారు. దీన్ని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడ్డారు. మధ్యాహ్న భోజనం అనంతరం నిద్రపోతుండగా తనకు స్వప్నంలో బాబా కనపడి వెంటనే షిరిడీకి రమ్మని చెప్పినందుకు అతడు షిరిడీకి వెళ్ళడానికి ఆతృతతో ఉన్నానని చెప్పారు. తన గుఱ్ఱం అక్కడ లేకపోవడంతో తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలపడానికి పంపారు. కుమారుడు ఊరు బయటకు వెళ్ళే సరికి దీక్షిత్ టాంగాని తీసుకుని వచ్చారు. కుశాల్ చంద్ ని తీసుకుని రావలసిందని బాబా దీక్షిత్ కి చెప్పడంతో, ఇద్దరూ టాంగాలో కూర్చుని షిరిడీకి చేరుకున్నారు. కుశాల్ చంద్ బాబాను దర్శించుకున్నారు. అందరూ సంతోషించారు. బాబా ప్రదర్శించిన ఈ లీలను చూసి కుశాల్ చంద్ మనస్సు కరిగింది.
పంజాబి రామలాల్ (బొంబాయి) :
ఒకరోజు బొంబాయిలో ఉన్న పంజాబి బ్రాహ్మణుడు రామలాల్ అనేవాడు ఒక స్వప్నం కన్నాడు. ఆ స్వప్నంలో బాబా కనపడి షిరిడీకి రామన్నారు. బాబాఅతనికి మహంతులా కనపడ్డారు. కాని అతనికి వారు ఎక్కడ ఉన్నారో తెలియకపోయింది. వెళ్ళి వారిని చూడాలని మనస్సులో నిశ్చయించుకున్నారు. కాని చిరునామా తెలియకపోవడంతో చేయడానికి ఏమీ తోచలేదు. ఎవరినైనా మనం పిలిస్తే వచ్చేవారి కోసం కావలసినవన్నీ మనం సమకూరుస్తాము. ఈ విషయంలో కూడా అలాగే జరిగింది అతడు ఆరోజు సాయంకాలం వీథిలో వెళ్తుండగా ఒక దుకాణంలో బాబా ఫోటోని చూశాడు. స్వప్నంలో చూసిన మహంతు ముఖలక్షణాలే ఈ పటంలో ఉన్న వారితో సరిపోయింది. కనుక్కుంటే ఆ పటం సాయిబాబాది అని తెలిసింది. అతడు వెంటనే షిరిడీకి వెళ్ళి అక్కడే తన అంత్యకాలం వరకూ ఉన్నారు.
ఈ విధంగా బాబా తన భక్తులకు దర్శనం ఇవ్వడానికి షిరిడీకి తీసుకుని వచ్చేవారు. వారి యిహపరముల కోరికలు నెరవేరుస్తూ ఉండేవారు.

ముప్పైయవ అధ్యాయం సమాప్తం

నాల్గవరోజు పారాయణ సమాప్తం